కళ కలకాలం,జీవితం చిరు కాలమని లోకోక్తి.అవును బుద్బుదమయిన మనిషి జీవితం అద్భుతమే.నూరేళ్లకాలం దీర్ఘంగా ఆలోచిస్తే చాలా చిన్నదే.తెలిసీతెలియని బాల్యం,ఉడుకుదనంఉవ్వెగిసే చురుకుదనాలయవ్వనం,కటుంబబాధ్యతలమధ్యవయసు లిప్తగా,లీలగా దాటి చివరి మజిలీ మలివయసు అలవోకగా చేరుకోవటం పరిపాటి.భారతీయుల ఆయుర్ధాయం పెరగటంమూలంగా మలిసందెల కాలం దశదిశలా కొత్త వెలుగుల్ని విరజిమ్మటం ఒక అభివృద్ధికారకం,ఆనందదాయకమూ..శేషప్ప గారన్నట్టు
“అతివిద్యనేర్చుట అన్నవస్త్రములకే/పసులనార్జించుట పాలకొరకే/సతినిబెండ్లాడుట సంసారసుఖముకొరకే/
సుతులబోషించుట గతులకొరకె/సైన్యము నేర్చుటలెల్ల శత్రుజయమునకే/సాము నేర్చుట చావు కొరకే/దానమిచ్చుట ముందటి సంచితమునకే”.చదువు సందెల తర్వాత మనిషి లక్ష్యం ఉద్యోగపర్వమే.మానవఉద్యోగ ప్రస్థానంలోఉద్యోగంలోనియామకం ,సమర్థవంతమయిన, సంతృప్తికర పనితీరు,ప్రశంసలు పదోన్నుతుల,అవార్డుల గౌరవానందాల అనంతరం చివరికి మిగిలేది ఉద్యోగ విరమణ.ఇంతకాలం వివిధ స్థాయిల్లో సంతృప్తిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందటం ఒక యోగం.ఈ కంప్యూటర్ యుగపు అర్జంట్ ఋతువుల పనిఒత్తిళ్లను అధిగమించి ఉద్యోగాల్లో అన్నీ సవ్యంగా జరిగి ఏ మచ్చా లేకుండా , ఉన్నతాధికారులు,తోటి ఉద్యోగుల మనసుల్లో ముత్యమంత స్థానం సంపాదించుకుని ఉద్యోగ విరమణ పొందటం ఉద్యోగికి దక్కిన గొప్ప విజయమే.మా మాడిశ్శెట్టి శ్రీనివాస్ సార్ ఆ కోవకే చెందుతాడు.మాడిశ్శెట్టి శ్రీనివాస్ గారు ప్రజలందరినీ అవసరాలకు గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసి లో కడెంక్టర్ ఉద్యోగంతో మొదలై సూపరింటెండెంట్ స్థాయిలో హాయిగా,ఆనందంగా తన విధులను అంకితభావంతో సమర్థవంతంగా, సమన్వయకర్తగా పూర్తి చేసి ఆర్టీసిని ప్రగతి పథంలో నడిచేట్టు ముప్పై ఆరేళ్లుగాకృషిచేసిన కృషీవలుడు,ఖుషీవలుడు మా శ్రీనివాసుడు.కానేకావని గొతెంత్తిన సమస్యల చేతనే ఔనననిపించాడు. ‘ఔరా’ అనిపించాడు.ఎంతటి కఠిన సమస్యనైనా విచక్షణతో,విలక్షణంగా క్షణాల్లో పరిష్కరించి,ప్రగతిరథచక్రాలనుపరుగులుపెట్టించాడు.తన తోటి ఉద్యోగుల పట్ల కరుణ,ప్రేమ, ఆత్మీయతను కురిపించి ముందుకునడిపించాడు. సార్ కు దేవుడు,దేహం,దేశం,ఉద్యోగం మీద భక్తి ఉంది.అక్షరం,అందం,అనుబంధం,స్నేహం మీద అచంచల విశ్వాసం, అమితమయిన అనురక్తి ఉన్నాయి.ఆజానుబాహుడు,ఆకసం సాహితీ పెద్దలు,కవిమిత్రుల,కవయిత్రుల ప్రేమాభిమానాలు పొందిన మహానుభావుడు.శ్రీనివాస్ సార్ కి చిరునవ్వే తరగని ఆభరణం.మాడిశెట్టి గారి మనసు మల్లెపూవు వంటిది.వారి పరిచయం పారిజాతపూలపరిమళం.ఒక అద్భుతం. ఒక అదృష్టం .వారి స్నేహంపొందటం ఎవరికైనా పూర్వజన్మ పుణ్యమే,అద్భత వరమే. సమకాలీన ప్రపంచంలోకవిత్వం విద్యాశాఖదే సింహభాగం.ఉపాధ్యాయులు,ఆచార్యులు ఎక్కువగా రాస్తుండటం చూడవచ్చు. కవిత్వాన్నిఅనేక రంగాల,వృత్తులవారు,అనేక వర్గాల వారు రాస్తున్నారు.రాయటం సమాజానికి జీవజలం లాంటింది.అత్యవసరం.ఆనందదాయకం.కవిత్వం సర్వాంతర్యామి .సమకాలీన ప్రపంచంలో కవిత్వానికి విద్యాశాఖ ఆధిపత్యం అధికమని ఘంటాపథంగా చెప్పవచ్చు .ఉపాధ్యాయులు,ఆచార్యులు,ఎక్కువగా గొప్పగాకవిగడ్తున్నారు.అందుకు భిన్నంగాతెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ లో పనిచేస్తూ కవిత్వం రాయడం అరుదైన విషయమే.అందులో అద్భుతంగా కవిత్వం వ్రాస్తున్న కవి శ్రీనివాస్ సార్.”లక్షాధికారైనా లవణమన్నమే…” వంటి అద్భతపద్యాల నరసింహశతక కర్త శేషప్పమహాకవి నడయాడిన ధర్మపురి లో పుట్టి కలమెత్తిన మా మాడిశెట్టి అక్షరాధికారైనా భావకవనమే మిన్నా అంటూ ఊటంకించే గొప్ప భావకవి. “గుండెల్లో గోదారి” “నువ్వు నేను గోదారి” రెండుసంపుటాలు వెలువరించాక నువ్వైనా నేనైనా మాడిశెట్టిని ‘గోదారి కవి’ అనటం సబబు.ఏ కవిత రాసినా తను అమితంగా ఆరాధించే ‘గోదారి’ ఉండాల్సిందే.తెల్లని ఠావుల్లో గుండెలోతు భావాలను పాళీపావుల్లో గోదారంత విశాల తత్వాన్ని,గోదారంతా లోతైన భావాన్ని చదువరుల గుండెల్లో లలితమైనఅలతి పదాల్లో నాటటంలో సిద్ధహస్తులు.వారి అంతర్మధనం వేరు,వారి భావజాలం వేరు.వారికి పదాల లాలింపు ,భావాల గుబాళింపు తెలిసి,జీవితం తాలూకు సత్యాలను కాగితాల్లో వాక్యాలు వాక్యాలుగాపేర్చేమహానేర్పరిమామాడిశ్శెట్టి.వారిది విరహవేదన ,సందేహనివేదన,ఆశాభావం,గుప్పెడుమనసు పై సాధికారత సాధించిన భావుకత.వారిది తేటతెనుగుపదాల భాషాభిషేకం.వారి కన్నుల్లోప్రేమే!,వారి పెన్నుల్లో ప్రేమే!! నిండివుందనుకుంటా.నిజానికి మనుషుల పట్ల మరీ ముఖ్యంగా పూలవంటిమగువల పట్ల వారు చేస్తున్నది నిరంతరఅక్షరాభిషేకం,ప్రేమాభిషేకమే.”ప్రాణం లేని దేహం” కవితలో నువ్వు లేని నేను/ వెన్నెల లేని ఆకాశమే/ప్రవహించని గోదారే/ ప్రాణం లేని దేహమే అనడటం మా మాశ్రీ ( మాడిశెట్టి శ్రీనివాస్ సార్) కే చెల్లింది..”నా గుండెల్లో/ పవిత్రంగా దాచుకున్న/పాదముద్రలే నీవైనప్పుడు/ నువ్వెంకడుంటే నాకేం” అనడంలో ఎంతబాగుంది యండమూరి గారన్నట్టు గోదారంత భావుకత కదా ఇది .ఏ ఏ కవితలోనైనా తన ప్రేయసి,ప్రేమ,విరహం,ఎడబాటు,గోదారి వాటి తాలూకు గాఢమైన అభివ్యక్తి ఉండాల్సిందే.”ఓయాసిస్సు” కవితలో…నాలో ప్రణవమై/నాలో నాదమై/నే రాసిన పదమై/…ఇలా ఏది రాసినా గుండెల్లో నాదమై మోగేది.”నువ్వు” మరో కవితలో ఇలా శీనయ్య శెలవిస్తాడు” ను వెళ్ళాక/కళ్ళలో గోదారి తడి/మనసంతా అలజడి/ఇదేనేమో నీ గారడి” నిజంగా శ్రీనివాస్ సార్ అక్షరాలతో భావ కవిత్వపు గారడి చేశారు.”నువ్వునేను గోదారి” కవితా సంపుటి చదివాక ప్రముఖ సినీదర్శకులు వంశీ గారు ‘నిన్నటి రాత్రి వెండి వెన్నెల జ్ఞాపకమైపోయింద’ని ముందుమాటగా తన ఎదలోని మాటల్నిమనతో పంచుకోవడం గొప్ప విషయం .మాడిశెట్టిప్రవేశించాక భావకవిత్వపు వెండివెలుగులు ఆకసమంతా నిండాయి.ఆకులో ఆకు,కొమ్మలో కొమ్మాగా మాతో మసలిండు .మేమంతా ఈ ‘గోదారికవి’ కవితల్లో తడిసి ముద్దవుతున్నమనుటలో ఆవగింజంతైనా అతిశయోక్తి కానరాదు.అజంతాభాషకు అజంతా శిల్పంలా మలిచేవారి భావకవిత్వానికి,వారి వ్యక్తిత్వానికి మా అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నారాయణమూర్తి
సార్ తో బాటు మా అందరిహృదయాలు ఫిదా అయ్యాయనుట నూటికి నూరుపాళ్లు సత్యవాక్కే. “అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడుమేతబెట్టె/వనచరాదులకు భోజనమెవ్వడిపించె/…
మా మాడిశెట్టికి ఈ మంచి గుణము,మంచికవనము ఎవ్వడిచ్చెనో??… ఆశ్చర్యమే.
అన్నమయ్య ఆ వేంకటేశ్వరుణ్ణి కీర్తించే పాట వీడలేదు. ఈ శ్రీనివాసుడు ప్రేమను,ప్రేయసిని “గోదారి” పాటను,ఎడ’బాట’ను ఎనాడూవీడలేదు.ఎన్ని కవితలు ఎన్నికవిసమాయాలు, ఎన్నిసాహిత్య సమయాలు ఎలుగెత్తి వినిపించి,ఆకసంలో తుఫాన్ సృష్టించి మా ఎదల్లో పొంగించి మా నయనాలలో గోదారిని ప్రవహింపచేసి స్ఫూర్తినింపాడో నా మాటలకందదు. సార్ ఎంత అద్భుతంగా కైతకడ్తాడో, నగలో స్వర్ణకారుడు రత్నాలను పొదిగినట్టు ఆ పదాలు,వాటితాలూకూభావాలురాతల్లోబుద్ధిగాబుజ్జాయిలాఒదిగిపోతాయి.ఉత్తరాయణంలా,దక్షిణాయణంలాఇదిశ్రీనివాసాయణం.అలా రాయటం అద్భుతం.అసాధ్యం.మామూలు మనిషిలా కనిపిస్తాడు కానీ….
మహాగట్టివాడు మా మాడిశెట్టి !
మా శ్రీనివాసుడు
గోదారి గొప్ప ప్రేమికుడు
మా స్త్రీనివాసుడు
ఆమె బాధకుడు
ఆమె ఆరాధకుడు
మా శ్రీనివాసుడు
నలుపు రంగంటే పడిచస్తాడు
స్నేహమంటే ప్రాణమిస్తాడు
మా శ్రీనివాసుడు
కరుణారుణజీరల కన్నులవాడు
తరుణీ తరుణభావాలు ఉన్నవాడు
మా శ్రీనివాసుడు
నిండైన విగ్రహంవాడు
నీటైన ‘టక్కు’గలవాడు
కదలనీదు ఆయన మమతలబంధం
వదలనీదు ఆతని కవితలభావం
మా శ్రీనివాసుడు
తోలుతున్నది స్కూటీ
అందరిని కలిపి చేస్తాడు ఒక్క’టీ’
మా శ్రీనివాసుడు
కాల్ చేస్తాడు
కాలాన్ని కాఫీతో కబుర్లుచేస్తాడు
మా శ్రీవాసుడు
అహంలో సున్నవాడు
మంచిమనసున్నవాడు
అతనిసుగుణాలు చెప్పలేం ఇన్నని
ధర్మపురి ధన్యురాలైంది ఆయణ్ణి కని.
మా శ్రీనివాసుడు
వచనకవితల తృష్ణశాస్త్రిలా చూస్తాడు
కృష్ణ శాస్త్రి లా రాస్తాడు
అందాల హాసుడు
భావకవితా దాసుడు
మాడిశెట్టిమనసువెట్టి రాశాడంటే
కవితల్లో పడిపోవాల్సిందే
గుండెల్లో గోదారి సుడిరేగాల్సిందే
మాకు రాదు రాదు ఆ రాసుడు
అలపదాల,ఎలభావాల అలవోక ఆ మోసుడు
గోదారి ప్రవాహమల్లే ఆగనిది ఆతని కలం
ఆయన కవితలకు మేమంతా
మంత్రముగ్దులం,మహా ప్రేమికులం
మా శ్రీవాసుడు
ఇపుడు ‘మా’ శ్రీ నివాసుడు
అందాల, ఆత్మీయబంధాల
ఆసిఫాబాదు నివాసుడు
మాతో మసలటం మా అదృష్టంగా భావిస్తున్నాను
మా ఆకసానికి ఆకాశమంత ఇష్టమని ఊహిస్తున్నాను
ఆయన అలుపెరుగని కవితయానం
శరత్కాలపు అడవిగుండెల ఆకుపచ్చనిఅందాల గుండా
ఆర్టీసి బస్సు ప్రయాణంలా ముందుకు సాగాలి.
విరహం,ఎడబాటు,దూరం
ఆమె,అమ్మ,ఆలి,కాళి
ఏదైతేనేం పదభావం అంశమూ,వస్తువూ
గురి తప్పక చేరుతుంది
గోదారితీరాన్ని….మా గుండెల్ని
భావాలు గోదారంత లోతైన
మరెన్నో కమ్మని భావకవితలల్లి
ఎల్లకాలం
గోదారి పొంగుల్లోమమ్ములను ముంచెత్తాలి.
ఎన్ని సాయంకాలాలు వారితో కలిసి చాయ్ తాగానో,ఎన్ని సాహితీసంగతులువారునాతోపంచుకున్నారు.కోపతాపాలు పొడసూపనిహృదయాలలోప్రేమా,ఆత్మీయతానురాగాలే పల్లవించాయి.ఎన్ని సార్లు సాయంత్రాలు మా నడకల్లో తేలికగా రాత్రులుగా వీడ్కోలు పలుకాయో.వారితో నేను,బాబాయ్ గుర్రాలవారు, మధుకరన్నా,సత్యం సార్ రాధాకృష్ణచారిబావతో సాయంత్రాలు మంచులా కరిగాయి.మంచినే చెరిగాయి.
నిజం చెప్పాలంటే వాసుగారితో మేము…..
మళ్లీ మనుషులమవుతున్నం!
బరువు బాధ్యతలు దించుకున్నాక
ఇంటిపనులు కొన్ని ముగించుకున్నాక
ఈ వానాకాలం
చల్లనిగాలుల దర్బారు ఆషాఢంలో
నల్లని మబ్బుల బారుల ఆకాశంలో
పొద్దువాలే వేళ ప్రేమల పొద్దొకటి పొడుస్తది
అలుపుసొలుపులు దూరభారాలు మరచి
మూడుబాటలు కల్సుకుంటయి
ముగ్గురు కలిశాక నవ్వులు
నందివర్ధనపువ్వులుగా విచ్చుకుంటయి
గుండెలోని బాధలకు శెలవిచ్చాక
గాయాల గాధలకు మరుపిచ్చాక
మాటలు అలలయి అందంగా పొంగుతాయి
మనసులు ఆనందం పొందుతాయి
కవితల మమతలు ఎలుగు అలుగుపారినంక
చల్లని వాతావరణ సాయంసమయాన
కమ్మని కాశ్మీరీ చాయ్ లా లేదా
మరిగిన మశాలా చాయ్ లా వేడిపొగలు విడుస్తది
ముగ్గురూ కలిసి ఏం చేస్తరు?
ముగ్గురూ కలిసి ఒక్కరవుతరు
ఒక్కరు ముగ్గురవుతరు
మోహం మోసం
దేహం దేశం
మొదలగు సంగతులు మా మతులు
లోకం శోకం అటూ ఇటూ
ఆ రెంటి నడిమధ్య కాలిబాట మీద
మానవత్వాన్ని కోరుకుంటూ
గతాన్ని తవ్వుకుంటు నవ్వుకుంటూ
మతాన్ని నములుకుంటు నడుచుకుంటూ
సాగుతున్న బాటసారులం
మౌనాన్ని తరుముతున్న మాటకారులం
ఇదేనేమో కవుల సంయోగం
బహుశా ఇదేనేమో స్నేహరాగం
మంచులా కరుగుతుంది కాలం
మంచినే చెరుగుతుంది హృదయం
ఈ గాలి ఈ నేల సాక్షిగా
కవితల మవుతున్నం
మమతల మవుతున్నం
మళ్లీ మేం మనుషులమవుతున్నం
ఇంతకంటే ఏమి కోరుకుంటది ఈ జీవితం!.
మనిషికి మరణం ఉద్యోగికి ఉద్యోగ విరమణంఈ భూమ్మీద రాసిపెట్టి ఉంటాయనేది మనకు తెలియందేంకాకపోవచ్చు.కానీ ( మాడిశెట్టి గారి లాంటి) కొన్ని ఎడబాటు మనసును వీసమంత విస్థాపనంగావిస్తాయి.అద్వైత ఎదలలో బాధలు అనునాదమై మోగుతాయి. ఇంత ఆరోగ్యంగా,ఇంత ఆనందంగా ఉన్నా శ్రీనివాస్ సార్ ని చూస్తే ఎవరికైనా ‘ఉద్యోగ విరమణ’ అంటే హాస్యమనుకుంటారు. నమ్మవశం కాదంటారు.ఇంతలోనే శ్రీనివాస్ సార్ ఉద్యోగ విరమణ పొందటం,మనల్ని ఆసిఫాబాద్ ని విడిచి ధర్మపురి కి వెళ్లడమూ మనకు ఏ మాత్రం సమ్మతం కాదు.కానీ ఇది అనివార్యం. కాల శాసనాన్ని మనం అంగీకరించాల్సిందే.నాకో సందేహం మంచితనంమంతా మన పూర్వికులు ధర్మపురి వద్దే దాచి ,దారి మరచి ఇటు దయచేసారా?. మనిషి మనిషికీ మంచితనాన్ని ధర్మపురి వాసులు(శ్రీ నివాస్ సార్ )మనసు నుండి పంచుతూవుంటేను.
బ్రహ్మంగారికి కాలజ్ఞానం తెలిసినట్లు, శ్రీనివాస్ సార్ కి కవిత్వం ఆకట్టుకునేలా’రాసే జ్ఞానం’ తెలుసనుకుంటా.కవిత్వం తీరని దాహంలాగే మా శ్రీనివాస్ సార్ నిర్మల స్నేహం కూడాను..అదిమాడిశెట్టి వంశం మంచితనపుమోహమేబహుశా..రాబోయేకాలంలో జైనూర్ జంగిల్ గుండానోఈ తిర్యణి అడవుల అందాలగుండానో ధర్మపురి కి ఒక దగ్గర దారి కనుగొనాలి,మగవాళ్లకే స్పెషల్ బస్సును ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆశిద్దాం.( ఆశించటం నేరం కాదు కదా)GST తగ్గినట్టుదూర భారాలు, స్నేహవిరహాలు తగ్గాలి.అదిగో ఆకసంలోసూరీడు ఎండలుకాచి కాచి పడమటి దిశకు విసిగిపోతున్నవేళ ఇది.మాడిశెట్టి గారి పదవీ విరమణకు వానకాలం, మేఘ విస్ఫోటనాల వానకాలమయి అవసానదశలోసెప్టెంబర్ చివరిరోజుఆకాశం నుంచి వర్షం కుండపోతలై కురుస్తూ గ్రామగ్రామాన గోదారై పొంగుతోంది .మా శ్రీనివాసుడు ఆర్టీసిలో సూపరింటెండెంట్ ఉద్యోగం దిగిపోతున్న శుభతరుణమిది.శేషప్పకవి శెలవిచ్చినట్టు”విద్యనేర్చినంతు విర్రవీగగ లేదు/భాగ్యవంతుడంచు బలకగలేదు…..మా శీనయ్య లాంటి ఇంతమంచి పుత్రరత్నాన్ని కన్నందుకు వారి తల్లిదండ్రులకు అనేక వందనాలు.శ్రీనివాస్ సార్ తో నా స్నేహ ప్రయాణానికి రెండు వసంతాలే అయినా చిరకాలం నిలిచి వుండేలా సాగింది.హృదయం ఆనంద పద్మమయి వికసించి అనురాగం వినిపించింది.మనసు అద్దం మీద మంచితనం పరావర్తనమైన మీ స్నేహాన్ని నేను మరిచిపోలేను జీవితాంతం.మా స్నేహం త్వమేవాహం.సార్ గోదారితో ధర్మపురి లో ఉన్నా ఆకసం కోసం ఆసిఫాబాద్ కు వస్తాడని( ఏ వాహనాల రాకపోకలులేనీ కేవలం ఆర్టీసీ బస్సు మాత్రమే ఆధారమయిన గ్రామాల) గ్రామస్తులు ఎర్రబస్సు కోసం ఎదురుచూస్తున్నట్టు సార్ రాక కోసం నేను ఎదురు చూస్తుంటాను.
శ్రీనివాస్ సార్,నాగమణి దంపతులు ఉద్యోగ విరమణ అనంతరంవారిపిల్లాపాపలు,మనవలు,మనవరాళ్లతో ,గోదారితో భావకవిత్వంతోఆయురారోగ్యాలతో ఆనందంగా భావిజీవితం మేలిమిబంగారంగా వెలగాలని అభిలషిస్తూ ,
మాడిశెట్టి శ్రీనివాస్ సార్ కి హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాభినందనలు.

15 comments
సరళమైన మాటలలో బాగా చెప్పారు. శ్రీనివాస్ సర్ మరియు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు 💐🙏
https://shorturl.fm/PwXmq
https://shorturl.fm/Qdqwn
https://shorturl.fm/j9dC2
https://shorturl.fm/yomJJ
https://shorturl.fm/ITXvC
https://shorturl.fm/t6saH
https://shorturl.fm/OXOel
https://shorturl.fm/lD696
https://shorturl.fm/hg95Y
https://shorturl.fm/UL1YT
https://shorturl.fm/eMu76
https://shorturl.fm/Cy9GJ
Claim 5% Rebate and Exclusive Bonuses on AsterDEX https://is.gd/CGTnqR
Monetize your audience with our high-converting offers—apply today!