మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
Uncategorized

మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-

by mayuukha May 31, 2026
written by mayuukha

సంపాదకీయం-
” ఎన్నికలు- యువతరం”- డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్

కవితలు –

  1. మనసుతో మాట్లాడుతున్నాను – కందాళై రాఘవాచార్యులు
  2. పరమ ధర్మం
    -రమాదేవి నెల్లుట్ల
    3.మినీ కవితలు
  • లక్కరాజు నిర్మల
    4.మానవత్వమా నీ చిరునామా ఎక్కడ?
  • అరుణా పరంధాములు
    5.శాంతి విలువ. – డాక్టర్ కె. గీత
  1. మార్పు కోసం నా అక్షరాలు. – మంజుల పత్తిపాటి. 7. ఆణిముత్యాలు. – రాధికా సూరి.
    8.ఆడవారం. – – R.భాగ్య లక్ష్మి,టీచర్ డి. పి. యస్
    9.భాషా సుందరి. – పద్మశ్రీ చెన్నోజ్వల 10 మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ 11. తేట తెనుగు. – రాధికా సూరి 12. ఇల్లంతా ఇల్లాలు. – గడ్డం సులోచన 13. గుండె నిండిన స్వప్నాలు. – కేశిరాజు వేంకట ప్రభాకర్
    14కవి చివరి చరణం. – కె. ఎస్. అనంతాచార్య, కరీంనగర్
    15మనసుతో మాట్లాడుతున్నాను. – కందాళై రాఘవాచార్య

కథలు –
1 . సమాధి పూలు

  • హుమాయూన్ సంఘీర్
    2.నిష్కామ కర్మ
  • డాక్టర్ మజ్జి భారతి
    3.అనుబంధం
  • నామని సుజనా దేవి
    4 ప్రేమ ఖరీదు – తాటికోల పద్మావతి
  1. మౌన లోకం డా. వరిగొండ సత్య సురేఖ.
    6.కొత్త ప్రపంచం. – లక్ష్మీ మదన్. 7. స్నేహం. -వరలక్ష్మి యనమండ్ర , హైదరాబాద్. 8. ఆమె నా కావ్య నాయిక.
  • పద్మావతి నీలంరాజు. 9. బోనె పెట్టె. – తాతా కామేశ్వరి. 10. నాన్న డైరీ – కట్టెకోల విద్యుల్లత 11. మనకు మనమే. – మాధవపెద్ది ఉష , హైదరాబాద్
  1. సడి చేయని చప్పట్లు. – రోహిణి సత్య , బెంగళూరు 13. గిల్టు నగ – లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
    14నమ్మకం- మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల. 15. మనోరంజకం- శ్యామదాసి 16 గతమెంతో ఘనము. – భవానీ కృష్ణ మూర్తి

వ్యాసాలు –

  1. మన తెలుగు నాటకాలు
  • సమ్మెట విజయ
    2 శాంతి ఓటమి కాదు! మానవ విజయం. – రంగరాజు పద్మజ. 3.కాలభైరవాష్టమి ప్రాధాన్యత- విశ్వనియమాలు – లక్కరాజు నిర్మల
    4.సెలవంటూ నింగికెగిసిన గంభీర స్వరం- టేకులపల్లి గోపాల రెడ్డి. – రాధికా సూరి.
    5.తరిగొండ వెంగమాంబ. – విజయా రంగనాథమ్
    6చరిత్రకెక్కని శత్రుఘ్నులు. – పద్మశ్రీ చెన్నోజ్వల. 7. కవిత్వాస్వాదన- ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు – ” గుండు రమణయ్య- ‘ అమ్మ‘ కవితా విశ్లేషణ- సందినేని నరేందర్
    8బాల సాహిత్యం – వర్తమానం- భవిష్యత్తు. – బండి ఉష , ఖమ్మం 9. సురవరం ప్రతాపరెడ్డి. – గడ్డం సులోచ , హైదరాబాద్
    10 . రక్త చరిత్ర – విజయా రంగనాథమ్
    అనువాద సాహిత్యం –
    11ఉన్నత చదువుల శిఖరం. – డాక్టర్ బండ సరోజన 12 ఋగ్వేదపు స్త్రీ స్వరం- అపాల ఆత్రేయ – విజయ రంగనాథమ్ 13. పేరంటాలు. – విజయ కందాళ 14. ప్రాచీన సాహిత్యం లో మహిళా స్వరం – తోకల రాజేశం 15. జ్వలిత చేతనం : బాలలత మల్లవరపు. – రాధికా సూరి 16. అమెరికా లో ఒక అనుభవం. – చెందు పెండ్యాల 17. క్రైం చిత్రాల గీతాలలో- కావ్య విలువలు
  • డాక్టర్ వి. వి. రామారావు 18. కొత్త కోణాలు ఆవిష్కరించిన విమర్శకుడు. – అమ్మంగి వేణుగోపాల్. 19. అనుబంధాల లో మేనత్త. – ఎస్. స్వయం ప్రభ. 20. అనంతం- అద్భుత-అపూర్వం. – రామరాజు విశాలాక్షి 21. భ్రమలో – బంధం. – రంగరాజు పద్మజ 22. ఆధ్యాత్మిక భాస్కరుడు‘ ఆదిశంకరాచార్యులు‘. – కావ్య సుధ , హైదరాబాద్. 23 . ఆకాశానికి ఎగిసిన పాతకెరటం – చంద్రకళ దీకొండ, హైదరాబాద్

బాల సాహిత్యం. :-

  1. కష్టపడితే నే ఫలితం. – సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
  2. Animal Time – keyura kondapalli కేయూర కొండపల్లి. 3. బంగారు చేప – ఒద్దిరాజు మురళీధర్ రావు. 4. ఒక విందు. ,,. 5. నవ్వే రాణి. ,,. 6. ఒక పిల్ల పక్షి. ,,. 7. తెలివికల్ల చిన్న కోడి పుంజు – ఒద్దిరాజు మురళీధర్ రావు.
    అనువాద సాహిత్యం:-. 1. అన్వేషణ ( కాశ్మీరీ కథ – ధీబా నజీర్). – అనువాదం – చింతపట్ల సుదర్శన్ 2. వేటగాడు ( రష్యన్ మూలం అంతేనా చెహోవ్ ). ఆంగ్లం నుండి అనువాదం – ఎలనాగ

పుస్తక సమీక్షలు -. 1 . కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు- ” జన్య భారత ” సరికొత్త ప్రయాణం- నవల part 2 – మనోభిరామ్ నెల్లుట్ల

  • మయూఖ సంపాదకవర్గం
    2.కథా వచనానికి పద్య రూపం – గండవరం చంద్రశేఖర్ రావు మిత్ర లాభం పద్య కావ్యం. – కాంచనపల్లి గోవర్ధన్ రాజు. 3. కళింగ కథా జాడ పుస్తకం ఇది. – డాక్టర్ మజ్జి భారతి

మయూఖ ముఖాముఖి -.

  1. బహుముఖ ప్రజ్ఞాశాలి- నారుమంచి వేంకట అనంత కృష్ణ శర్మ గారి తో ముఖాముఖి.
    -అరుణా ధూళిపాళ 2. ఆమె కలం … ప్రార్థన కూడా…. ప్రబోధం కూడా – ప్రముఖ రచయిత్రి వీణారెడ్డి గారి తో ముఖాముఖి – రంగరాజు పద్మజ
  2. పాఠశాల గదిలో జీవిత పాఠాలు – తిరునగరి పద్మ తో ముఖాముఖి- రంగరాజు పద్మజ

ఇంద్ర ధనుస్సు:-

  1. ఆచంట హైమవతి గారు గానం చేసిన లలిత గీతాలు ( ఆడియో)
    2.Quiz Comptetion – by Indrani Nellutla
  2. ⁠అలాస్కా ప్రయాణం – ( ట్రావెలాగ్) – రంగరాజు శ్యామ్ సుందర్ రావు 4. మట్టిలో మాణిక్యం ఉడతా రామకృష్ణ – అచ్యుతుని రాజ్యశ్రీ
  3. ⁠⁠**_
May 31, 2026 9 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు

by Achanta Hymavthi May 31, 2026
written by Achanta Hymavthi
May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

ఎన్నికలు- యువతరం

by Kondapally Neeharini May 31, 2026
written by Kondapally Neeharini

రాజకీయాలు అత్యంత విలువైనవి. దేశ ఆర్థిక, స్వాతంత్ర్య, సామాజిక విలువలను పరిరక్షించుకోవడానికి, మనదైన పార్లమెంటరీ విధానం ఏర్పరచుకున్న దేశం మనది. ఒక ఇంటికి కుటుంబ పెద్ద రక్షణ ఎలాగో, ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఎలాగో, ఒక కళాశాలకు ఒక విశ్వవిద్యాలయానికి ప్రముఖులు ఎలాగో అట్లా దేశ పాలన విధానానికి ప్రధానమంత్రి అవసరం. ప్రధాని ఎవరు అని చర్చించుకోవడానికి ప్రజలు తప్పకుండా ముందుంటారు. అట్లాగే వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులను నిర్ణయించుకోవడానికి కూడా ప్రజలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు.

    ప్రజలు తెలియని తనంతో ఉంటారనుకోవడం ఒక భ్రమ. వాళ్ళ పరిశీలన అనుభవం చాలా గొప్పది. దీనికి ఉదాహరణగా ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలను కూడా తీసుకోవచ్చు. అప్పటినుంచి

తెలుసు వాళ్ళకి రాజకీయాలు ఎలా ఉంటాయని! ఇవన్నీ అనుభవాలు నేర్పిన పాఠాలు! ప్రజలను, ప్రత్యేకంగా యువతరాన్ని ఎప్పుడు విస్మరించవద్దు. యువతరం భావి భారత పౌరులు, కాబోయే నేతలు . ఎందరో తెలివైన వారే ఉంటారు కాబట్టి యువత గొప్ప పరిశీలనతో ఓట్లు వేస్తారు. ఇవాళ ఓటును వినియోగించుకునేప్పుడు వాళ్ళకన్నా ముందు తరం పెద్దలను ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి? రైతుల కోసం ఏ సహకారం అందిస్తోంది? బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఏ పథకాలను వేసి ఎట్ల నిర్వహణ చేస్తుంది? స్త్రీ ఉన్నతికి గవర్నమెంట్ ఎలాంటి  రూపకల్పన లు చేస్తున్నది అనేవి యువకులు చూడరు అనుకోవడం కూడా ఒక పెద్ద భ్రమనే. ఇవన్నీ ఈరోజు ఎన్నికల ద్వారా బహిర్గతమయ్యాయి. ఎంత ఆధునిక సాంకేతిక శాస్త్రీయ విధానాలు వచ్చి యాంత్రిక జీవనాన్ని తీసుకువస్తున్నా కూడా యువత ఇవి ఏవి  బయట విషయాలు పట్టించుకోవడం లేదు అని అనుకోకూడదు.

       ప్రజలు కూడా అంతే .. వస్తున్న సాంకేతిక సౌకర్యాలనుండి చాలానే లబ్ది పొందుతున్నారు

.ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ అనే ఒక మంత్రం… అరచేతిలో వైకుంఠం లాగా. ఈ సెల్ఫోన్ అనేది ఇక్కడ ఒక యంత్రం కాదు ఒక మంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలు చాలా తెలివిగా అయ్యారు. ఇవన్నీ మనకు సాక్షులు. జరుగుతున్న ఇదే చెప్తోంది ఇప్పుడు .

    జాతి మత కుల వివక్షలను ఎన్ని తీసుకువచ్చినా అసలు సిసలైన మానవీయ కోణం అనేది కూడా ఒకటి ఉంటుంది అని ఎవరూ మరవకూడదు. పరాజయాన్ని పొందిన రాజకీయ నాయకులు బాధతో రకరకాల అభిప్రాయాలను వ్యక్త పరుస్తారు. అవన్నీ సత్యాలు కావు. అలా అని మొత్తం అసత్యాలు కావు. అలాగే విజయపథంలో దూసుకుపోతున్న రథసారథులు కూడా అంతే వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఎటువంటి ధైర్యాన్ని ఉసిగొల్పాలో అటువంటి మాటలను మాట్లాడడానికి ఏమాత్రం వెనుకాడరు. ఎక్కడైనా నిజాలు అబద్ధాలు రెండు బహు  పాత్రలు  వహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా భారత దేశ రాజకీయ సామాజిక చరిత్రలో తప్పకుండా మార్పులను తీసుకువస్తాయి. ఈ మార్పుల ఫలితమే ఈరోజు ఎన్నికలు.

     ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవడానికి కారణం వాళ్ళ అసమర్థతనే!  ఎన్నికల ముందు ప్రచార హోరులో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే! ఇవన్నీ గమనించిన ప్రజలే కదా ఓట్లు వేసేది? అందుకే హామీలు ఇచ్చే ముందు శక్తి సామర్థ్యాలను ఒకటికి పది సార్లు చర్చించుకుని ఆలోచించుకుని గట్టి నిర్ణయం తీసుకొని బయటపెట్టాలి. అంతేకానీ గత పార్టీలు చేసిన దానికి మరికొంత జోడిస్తే మాకు గొప్పతనం వస్తుంది అని చెప్పి ఆ మాటలను తీర్చలేకపోతే మరోసారి వచ్చే ఎన్నికల్లో పర్యవసానం ఇలాగే ఉంటుంది. ఇది ఏ పార్టీ వాళ్ళకైనా… ఇప్పుడు గెలిచిన వాళ్లకైనా… భవిష్యత్తు అంతే! ఇదే సత్యం !! పారదర్శకత ఉండాలి పరిపాలనలో…. పట్టుదలతో సాధించాలి… ప్రజలకు చేరువగా ఉండాలి. ఇవి మూడు  ముఖ్యమైన విషయాలు. ప్రజలు కొత్త రాజకీయవేత్తలను కోరుకుంటున్నారు అని స్పష్టమైనది ఈసారి .

      ప్రసార మాధ్యమాలు ఎక్కువైన ఈ నేపథ్యంలో వెంట వెంట సమాచారాలను అందిస్తున్న ఈ పరిస్థితుల్లో పదేళ్ల పిల్లవాడికి కూడా రాజకీయాలు

అర్థమవుతున్నవి.

అయితే మంచి లేదా? రాజకీయ నాయకులందరూ చెడుబుద్ధి తోనే ఉన్నారా? లేదు లేదు..

కులమత రాజకీయాలను సృష్టించి బలపరిచి భయంకర రూపం దాల్చేలా చేసి ఈ రాజకీయాలు ఏ మార్గాలను అనుసరిస్తున్నాయో అర్థం కావడం లేదు

దేశం ఎటు పోతుందో అని వేద చెందుతున్నారు పాతతరం వాళ్ళు.

జెన్ జీ  తరం ఆవేశపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తూ ఆన్లైన్ లో అరాచకాలను సృష్టిస్తున్న ఈ వైనం నిజమైన  దేశభక్తులకు హృదయ వేదనం కలిగిస్తున్నది.

విచిత్రం ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయా దేశాల బాగు కోసం పాటుపడుతున్నారు. ఎక్కడో ఒకచోట వ్యతిరేకులు ఉంటారు. వాళ్ల ను అధిగమిస్తూ ముందుకు పోతున్నారు. కానీ,మనదేశంలో ఈ పరిస్థితులు లేవు .వీటికి భిన్నంగా ఉన్నాయి.  దేశం పురోభివృద్ధిని  సాధించటం మాట అటు ఉంచి ఉన్న తీరున ఉంటు సుభిక్షంగ ఉండడమే కావాలి. 

   యువతరం  రాజకీయాల లో  చురుకుగా

పాల్గొనాలంటే  ప్రపంచ  రాజకీయాల పై అవగాహన ఉండాలి.  చరిత్ర ను చదవాలి.  సర్వమత సౌభ్రాతృత్వ భావనలు అర్థం కావాలి  దీనికి  మనదేశ పు  పూర్వ  రాజకీయాల పట్ల అవగాహన అవసరం. ఆ రీతిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.  మన కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి ప్రపంచం కళ్ళతో మన దేశాన్ని చూడాలి అప్పుడే యువతరం దేశ రాజకీయాలపై బట్టలు ఇస్తుంది ఈ భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదిగే శక్తిగా తయారవుతారు.

    ఎలక్షన్ విధి విధానాలు తెలుసుకొని కళాశాల చదువుల నుండి విశ్వవిద్యాలయాల వరకూ,  పౌరుల హక్కుల పైనే కాదు బాధ్యత ఎంత అనేదీ తెలియాలి.  పార్లమెంట్,  లోక్ సభ సభ్యులకు ఉన్న  విధులేమిటో ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి.  పొలిటికల్ పార్టీల ఆవిర్భావాలు ఆచరణలు సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలలు కన్నా సాధించుకోగలరు సాధించుకోవాలన్న తపనతో కలలను కలగలరు , కలలను తీర్చుకొనగలరు.  ఎన్నికలు యవతను ఎన్నికలలో  కనమంటూ అంటుంటే వ్యక్తిత్వ వికాసానికి సమిష్టి 

వికాసాని కి వారధులుగా యంగర్ జనరేషన్  ఉండాలి. 

___***___

May 31, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మార్పు కోసం నా అక్షరాలు

by Manjula Pathipati May 31, 2026
written by Manjula Pathipati

నగరాల వెలుగుల్లో నీడలు పెరుగుతుంటే
గ్రామాల నిశ్శబ్దంలో బాధలు మోగుతుంటే
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

మనుషుల మధ్య గోడలు ఎత్తుగా పెరిగిన వేళ
మానవత్వం పుటల్లో మౌనం చేరిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

మద్యము మత్తుకి బానిసై కుటుంబ-
సభ్యులను రోడ్డుపైన పడేస్తున్న వేళ…
ఎండిన డొక్కలతో అన్నం కోసం ఎదురుచూసే నిరీక్షణ కళ్లలో కారం పొడి చల్లిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఉద్యోగ అవకాశం కోసం తలుపులు తట్టే ఆశల్లో
మన్ను కొట్టిన వేళ…
పేదల బాధలు రుధిర గీతాలై పాడిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ప్రకృతి కన్నీటి చుక్కలు నా సాహిత్య చేతి ద్వారా
సమాజ భవిష్యత్తును ప్రశ్నిస్తున్న వేళ…
నింకను పసిమొగ్గల నుండి ముసలి ముతక వరకు
అత్యాచారాలు చేస్తూ, దాడులు చేస్తున్న వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఒక్కసారి ఆలోచించండి…
ఒక్కసారి రేపటి ప్రపంచం కోసం ఆలోచించండి…

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

by mayuukha May 31, 2026
written by mayuukha

– మయూఖ ప్రత్యేక వ్యాసం

మహాభారతం అంటే కేవలం రాజుల కథ మాత్రమే కాదు, అది ఒక కాలం.. ఒక నాగరికత.. మరియు కొన్ని వేల సామాన్య జీవితాల సంఘర్షణ. ఈ సత్యాన్ని ఆధునిక పాఠకులకు పరిచయం చేస్తూ, మను (మనోభిరామ్) నెల్లుట్ల గారు రచించిన ‘జన్య భారత’ (Janya Bharata) సిరీస్ ఇప్పుడు చారిత్రక నవలా ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తోంది. మొదటి భాగం ‘The War’ తో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు రెండవ భాగం ‘The Deluge’ తో పతాక స్థాయికి చేరుకుంది. ఢిల్లీ వైర్ (Delhi Wire) ద్వారా ‘టాప్ 50 ఇన్ ఫ్లుయెన్షియల్ రైటర్స్’ లో ఒకరిగా గుర్తింపు పొందిన మను గారు, ఈ సిరీస్ ద్వారా ఇతిహాసాలను ఒక సరికొత్త దృక్కోణంలో ఆవిష్కరించారు

1. జన్య భారత: The War – సామాన్యుడి కళ్లలో కురుక్షేత్రం

మనం విన్న మహాభారతంలో అర్జునుడి గాండీవం, భీముడి గద గురించి వింటాం. కానీ, ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది సామాన్య సైనికుల మాటేమిటి?

ఈ సిరీస్‌లో మొదటి పుస్తకం ‘The War’, ‘ఉష్ట్రకర్ణిక’ (Ustrakarnika) అనే ఒక చిన్న తెగకు చెందిన మిత్రజిత్ (Mitrajit) అనే సామాన్యుడి చుట్టూ తిరుగుతుంది.

  • యుద్ధం వద్దు అనుకున్నవాడే యుద్ధంలోకి: మిత్రజిత్ తన భార్య, కూతురుతో ప్రశాంతంగా జీవించాలని కోరుకునే వ్యక్తి. కానీ, కృష్ణుడు రాయబారం విఫలమయ్యాక, పరిస్థితులు అతన్ని బలవంతంగా కురుక్షేత్రానికి లాగుతాయి.
  • భయం మరియు ధర్మం: ఒక సామాన్య తండ్రి, తన ధర్మాన్ని పాటించాలా లేక తన కుటుంబాన్ని రక్షించుకోవాలా? అనే మానసిక యుద్ధాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించింది.
  • కొత్త కోణం: రాజుల అహంకారం కోసం సామాన్యులు ఎలా బలైపోయారో ఈ పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

2. జన్య భారత: The Deluge – ద్వారక పతనం మరియు ఒక యుగాంతం

మొదటి భాగం యుద్ధాన్ని వర్ణిస్తే, రెండవ భాగం ‘The Deluge’ (ద డెల్యూజ్) ఆ యుద్ధం మిగిల్చిన శూన్యాన్ని, మరియు ఊహించని ప్రకృతి ప్రళయాన్ని వివరిస్తుంది.

ఈ పుస్తకంలోని ప్రధాన ఆకర్షణలు:

  • మునిగిపోయిన స్వర్ణం – ద్వారక: కృష్ణుడు నిర్మించిన అద్భుత నగరం ద్వారక, సముద్ర గర్భంలో ఎలా కలిసిపోయింది? ఆ ప్రళయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ ఘట్టాన్ని రచయిత అత్యంత నాటకీయంగా, ఉత్కంఠభరితంగా వర్ణించారు.
  • యాదవ కుల వినాశనం: కురుక్షేత్రం ముగిసిన 36 ఏళ్ల తర్వాత, శాపం వల్ల యాదవులు తమలో తామే కలహించుకుని ఎలా అంతమయ్యారో ఈ కథలో చూడవచ్చు.
  • కలియుగ ఆరంభం: ద్వారక మునిగిపోవడం అనేది కేవలం ఒక నగరం అంతం కావడం కాదు, అది ఒక శకానికి ముగింపు. సముద్రపు అలలు నగరాన్ని కమ్మేస్తున్న వేళ, మిగిలిన ప్రజలు ప్రాణాల కోసం చేసే పోరాటం పాఠకులను కదిలిస్తుంది.

పాఠకులను కట్టిపడేసే అంశాలు:

ఈ సిరీస్ మిగిలిన పుస్తకాల కంటే భిన్నంగా ఉండటానికి కారణం కేవలం కథ మాత్రమే కాదు, రచయిత అనుసరించిన శైలి.

  1. రచయిత మను నెల్లుట్ల గారు తన వృత్తిపరమైన అనుభవాన్ని ఉపయోగించి, సమాజంలోని వ్యవస్థలు ఎలా కూలిపోతాయో, ఒక చిన్న సంఘటన మొత్తం రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించారు.
  2. ఇందులో పాత్రలు అద్భుత శక్తులతో కాకుండా, రక్తమాంసాలున్న మనుషులుగా ప్రవర్తిస్తాయి. వారి బాధ, ఆనందం, మరియు భయం మనకు అత్యంత సహజంగా అనిపిస్తాయి.
  3. చదువుతుంటే మన కళ్ల ముందే కురుక్షేత్ర రణరంగం, ద్వారక సముద్ర తీరం కనిపిస్తున్నట్లు ఉండే సినిమాటిక్ ఫీల్ ఈ పుస్తకాల ప్రత్యేకత.

చరిత్రను ప్రేమించే వారికి, ఇతిహాసాలను కొత్త కోణంలో చూడాలనుకునే వారికి ‘జన్య భారత’ ఒక అద్భుతమైన బహుమతి. కురుక్షేత్ర రక్తం నుండి ద్వారక ప్రళయం వరకు సాగే ఈ ప్రయాణం, పాఠకులను ముగింపు పేజీ వరకు ఊపిరి బిగబట్టి చదివిస్తుంది.

మీరు ఇంకా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టకపోతే, వెంటనే ‘The War’ మరియు తాజాగా విడుదలైన ‘The Deluge’ పుస్తకాలను చదవండి. మారుతున్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ కథల్లో ఎన్నో ఉన్నాయి!

రచయిత మను: ఒక అంతర్జాతీయ ప్రతిభ

కెనడాలో నివసిస్తున్న తెలుగు మూలాలున్న రచయిత మను (మనోభిరామ్) గారు కేవలం రచయితగానే కాకుండా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు TEDx స్పీకర్‌గా కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. మూడు ఖండాల్లో నివసించి, ఐదుకు పైగా భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఆయన జీవితం మరియు సాహిత్యం గురించి మరింత తెలుసుకోవడానికి, ప్రసిద్ధ ‘గ్లోబల్ ఇండియన్’ (Global Indian) పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు: 👉 మను నెల్లుట్ల: ఒక మేధావి ప్రయాణం (Global Indian Article)

ఇప్పుడే మీ ప్రతిని కొనుగోలు చేయండి!

“జన్య భారత” సిరీస్‌లోని ఉత్కంఠభరితమైన కథలను మీరు కూడా ఆస్వాదించాలనుకుంటున్నారా? పుస్తకాలను కొనుగోలు చేయడానికి క్రింది లింక్‌లను క్లిక్ చేయండి:

  • 🛒 Amazon India నుండి కొనుగోలు చేయండి: Janya Bharata Series on Amazon

మరిన్ని వివరాల కోసం మరియు రచయితతో నేరుగా సంప్రదించడానికి ఆయన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: 🌐 ManuNellutla.com

ముగింపు: చరిత్రను ప్రేమించే వారికి, మన మూలాలను గౌరవించే వారికి ఈ సిరీస్ తప్పక చదవాల్సిన పుస్తకం. మారుతున్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన ధర్మాలు మరియు సత్యాలు ‘మను’ గారి కలం నుండి జాలువారిన ఈ ‘జన్య భారత’లో పుష్కలంగా ఉన్నాయి.

aw2

May 31, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

నవ్వే రాణి

by ఒద్దిరాజు మురళీధరంరావు May 31, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు


అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె గోడపైనున్న పటాలు, గదిలోని ప్లేట్లు కిందపడే వరకు బిగ్గరగా నవ్వేది. చాలా చిన్న విషయాలకు కూడా ఆమె నవ్వేది. ఆమె నవ్వు ఎంత బిగ్గరగా ఉండేదంటే న్యాయస్థానంలో ఉన్న వారందరు, నౌకర్లు, కింద అంతస్తులో ఉన్నవారు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది. వారు మొదటగా వారి చేతివేళ్ళను వాడేవారు, చివరికి చెవిలో దూది పెట్టుకొని పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఎవరికి కూడా రాణి పేరు తెలియదు. ఎందుకంటే ఆమెను అందరూ హర్‌ మెర్రీ మెజస్టీ అంటే దొరసానిగా పిలిచేవారు. చాన్సలర్‌ రాజ్యం అప్పులపాలు అవుతుందని ఆమెకు తెలియగానే గిలిగింతలు పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీది నుండి జారిపడి కాలు విరగ్గొట్టుకుంది. భూకంపం వచ్చినపుడు బంగ్లా మొత్తం ధ్వంసం అయ్యింది. అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేవరకు నవ్వింది. పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేతి సైగతో వాళ్ళను రానివ్వలేదు. నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్లల్లో నీళ్లు ముఖంపైకి కారే వరకు నవ్వింది. కానీ నవ్వు జీవితంలో మంచి అలవాటు. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఆమెకు ఇష్టం కానిది, ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవటంతో ఆమె చాన్సలర్‌ ను చంపేసింది. ఇది ఎంత హాస్యమో…. ఈ సారి ఆమె నవ్వు ఆపుకోలేక నవ్వీ నవ్వీ శ్వాస ఆడక చనిపోయింది. చివరికి దర్బారులోని వారు దేశీయులు కొంత శాంతి, నిశ్శబ్దము, సంతోషంగా అనుభవించగలిగారు. అతి సర్వత్రా వర్జయేత్‌.

May 31, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఫలితానికి మూలం ప్రయత్నం ఒక పిల్ల పక్షి

by ఒద్దిరాజు మురళీధరంరావు May 31, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక వెచ్చని గూటినుండి ఐదు పక్షి పిల్లలు పొదిగిన గుడ్ల నుండి బయటికి వచ్చాయి. వాటి తల్లిదండ్రులు అవి ఎదిగేందుకు వాటికి పగలు రాత్రి ఆహారం తెచ్చి తినిపించేవి. కొద్ది రోజుల్లోనే అవి ఎంత ఎదిగాయంటే, ఆ గూడు వాటికి ఇరుగ్గా అయ్యింది. వాటి రెక్కలు బలపడగానే ఎలా ఎగరాలో తల్లి చెప్పింది. మీ తండ్రి, నేను మీ ఐదుగురికి ఆహారం అందించేందుకు బాగా తొందరపడేవాళ్ళం. ఇక మీద మీరు మీ కొరకు ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోవాలి. అందువల్ల ఒకరోజు తల్లి ఆ ఐదు పిల్లలు ఎగిరేందుకు రెడీ స్టడీ గో అంది. కానీ కేవలం వాటిలోని నాలుగు పిల్లలే చెట్ల కింది కొమ్మలపైన వాలాయి. తర్వాత అవి మళ్లీ గూటికి చేరాయి. మళ్ళీ అవి కిందికి వాలాయి, పైకి ఎగిరాయి. ఆ రకంగా అవి కిందికి మీదికి ఎగురసాగాయి సంతోషంగా. కానీ అన్నిటికన్న చిన్నపక్షి తన కండ్లు మూసుకుని భయంకరంగా ఉన్న కిందికి చూడకుండా ఒదిగి గూటిలోనే కూర్చుంటూ ఉండేది.

ఆ రకంగా రోజులు గడుస్తున్నాయి. ఆ చిన్న పక్షి యొక్క అన్నలు, అక్కలు వాటి ఆహారం అవే సంపాదించుకోగలిగాయి. కానీ ఆ చిన్నది మాత్రం కిందకి చూసేందుకే భయపడుతూ గూటిలోనే ముడుచుకొని కూర్చొని ఉండేది. అప్పుడు తండ్రి పక్షికి ఒక ఆలోచన వచ్చింది. పిల్ల పక్షికి కింద కొమ్మపై వాలే భయంకన్న ఇంకా ఎక్కువ భయం కలిగే దృశ్యం చూపించడం మంచిదనుకుంది. అప్పుడు క్రింద చెట్టు వెంబడి ఒక పిల్లి నడుచుకుంటూ వెళ్తుంది. చాలాకాలం వరకు పిల్ల పక్షికి ఆహారం బాగా తినిపించడం వల్ల లావుగా తయారయ్యింది. ఒకరోజు దాన్ని పిల్లి తినేయడం ఏమంత విచిత్రం కాదనుకుంది. తెలివి తక్కువ పిల్ల పక్షి తనను తినేందుకు తను గూటిలో పిల్లి కోసం ఎదురు చూస్తున్నట్లున్నది. కానీ ఆ కింద పోయే పిల్లి దీన్ని చూడలేదు. దాని పదునైన కోరలు, పొడవాటి కాలిగోర్లు, భయం గొలిపే పసుపు పచ్చని కంటిగుడ్లు చూసి భయపడి పిల్లపక్షి గూటి అంచునుండి కిందికి జారింది. కానీ దానికి ఏం జరిగిందో తెలియకముందే, అది దాని ప్రాణాలను కాపాడుకోవడమే కాక కింది చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ కొమ్మపై నుండి ఇంకో పై కొమ్మ మీద వాలింది. ఇలా మూడు నాల్గు సార్లు ఎగురుతూ సంబరపడింది. ఇది గూటిలోనే భయపడి కూర్చునేదానికన్న వెయ్యి రెట్లు మంచిదనుకుంది. ఇన్నాళ్ళు బుద్ధితక్కువగా గూటిలో కూర్చోవడమే, అన్నలు, అక్కల వలె తెలివిగా ఎగరకపోవడం చాలా తప్పు. ప్రయత్నమే ఫలితానికి మూలం.

May 31, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక బంగారు చేప

by ఒద్దిరాజు మురళీధరంరావు May 31, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక ముదుసలి వాసిల్ తను సముద్రములో ఒక మూలకు వేసిన వలలో ఏవైనా చేపలు పడ్డాయో చూద్దామని వెళ్లి చూసాడు. ఆ వలను బయటికి తీసి చూసేసరికి దాంట్లో ఒక బంగారు చేప కనిపించింది. దాన్ని బయటికి తీయబోయేవరకు ‘నన్ను నీళ్ళలోనే వదిలిపెట్టు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా’నంది. నాకు ఏమి కావాలో తెలియదు. నా భార్యను అడిగి చెప్పగలను అని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన సంగతి చెప్పాడు. భార్య నాల్గు చీవాట్లు బెట్టి వెంటనే వెళ్ళి తనకు మంచి దుస్తులు కావాలని అడుగు. నాకు కేవలం ఈ చిరిగి పోయిన పాత జాకెట్ ఒకటే వుంది.
అతను వెళ్ళి కొత్త బట్టలు తేగానే తనకు బంగారు బండి కావాలని చెప్పి వెంటనే చేప వద్దకు పంపించింది భర్తను. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అటువంటి దాంట్లో కూర్చోలేదు. ఆ ముదుసలి వాసిల్ వెంటనే వెళ్ళి బంగారు బండి తెచ్ౘ్ాడు. కానీ ఆ ముసలమ్మకు అది కూడా తృప్తి కాలేదు.
ఇప్పుడు ఆమె కోరిక సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా, చుట్టూ మంచి మంచి చెట్లు, తోటలు మరియు గుంపెడు నౌకర్లు కావాలని కోరింది. కానీ అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు. చివర్లో ఆమెకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆమె ఆ బంగారు చేప వచ్చి తనకు సేవలు చేయాలని తలచింది. ఈ విషయం తెలియగానే ఆ చేపకు కోపం వచ్చింది. వెంటనే ఇచ్చినవన్నీ గుంజుకున్నది. అప్పుడు ఆ ముసలమ్మ తన గుడిసె ముందు చిరిగిన బట్టలతోనే వల అల్లుకుంటూ నిలబడింది. తెలిసిందా ఇప్పుడు? ఒకవేళ నువ్వు అతి ఆశకు పోతే నీవు ఏమీ లేకుండా అయితావు.
అతి ఆశ కొంపకు చేటు.

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

Animal time

by Kondapally Keyura May 31, 2026
written by Kondapally Keyura

Long long ago cheetahs and lizards were friends. One day a cheetah was talking to his friend lizard about a magical rocket ship and do you know who heard this? Tiger Of course!The big creature. Who is very rude and mean. When cheetah saw Tiger she stopped talking. But lizard kept on talking. The next day, when the astronauts went to the rocket ship, tiger was going to launch it. So the astronauts put a plan they were going to capture the tiger and put him in the zoo. So they called the cheetah, lizard, Lion, and the zookeepers. First the lion scared the tiger out of their rocket ship, then the cheetah chased the tiger towards the lizard. Who distracted him, while the zookeepers got

him. Now all the animals can be safe.

 the end

May 31, 2026 1 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

సమాధి పూలు

by Humayun Sangheer May 31, 2026
written by Humayun Sangheer

“ప్రతిసారి పోనీకి నువ్వు ఆ ఇంటి కొడుకువు కాదు, ఒక ఇంటికిచ్చిన ఆడిబిడ్డెవు” అత్త షాజాదీ గొంతు కాస్త రుద్ధంగానే ఉంది. ఇంటికి పెద్ద కోడలు అయిన అర్షియా ప్రతేడాది తప్పనిసరిగా అక్కడికి వెళ్లడం ఆమెకు సుతారమూ ఇష్టంలేదు. ఎంతో సౌమ్యంగా ఉంటూ కోడళ్లను కూతుర్ల కన్నా ఎక్కువగా చూసుకునే ఆమె ఎందుకో ఇవాళ కాస్త అన్యమనస్కంగా ఉంది.   

అత్త మాటకు ఎదురు చెప్పే సాహసం చెయ్యని అర్షియా ఇవాళ తనను ఎవరూ ఆపవద్దని స్థిరంగా అనుకుంటోంది. కానీ అది అయ్యే పనేనా? అత్త మాటను జవదాటని తను ఇవాళ ఆ పని చేస్తుందా?

ఒక ప్రహసనంలా ఏడాదికోసారి సాగే తన పుట్టింటి ప్రయాణాన్ని గతేడాది నుంచి అత్తయ్య బ్రేక్ చేసింది. “ఆడవాళ్లు కబ్రస్తాన్‌కు వెళ్లరు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి రెండు ఖురాన్లు చదివి సమర్పిస్తే సరిపోతుంది కదా? ఇదే నీకు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది” అని షాజాది వాదన. కానీ ప్రత్యక్షంగా కబ్రస్తాన్ దరిదాపుల్లోకి వెళ్లి అమ్మానాన్నల సమాధులను దూరం నుంచి అయినా చూసి ‘నేను మీ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను’ అని రెండు మాటలు మాట్లాడినంత సంతృప్తి ఇంట్లో ఉండి ఖురాన్ చదివి సమర్పిస్తే రాదు కదా అనే పెదవి దాటని ప్రతి వాదన ఆమెది!

ప్రతిసారి వెళ్లే తను ఒక్క ఏడాది తప్పినందుకే చాలా బాధపడింది. రంజాన్, బక్రీద్ పండగలు వస్తున్నాయంటే అమ్మానాన్నల సమాధుల దగ్గరికి తానే స్వయంగా వెళ్లి పూలను సమర్పించి వస్తాననే తృప్తే ఆమెకు అమితానందాన్నిస్తుంది.

కానీ అత్తయ్య అడ్డుపడడంతో గతేడాది నుంచి మనసులో మొరం పరుచుకుంది. ఇంట్లో  మునుపటిలా ఉండలేకపోతోంది. బైకులో పెట్రోల్ పోస్తే ప్రయాణం సాఫీగా సాగినట్టు ఏడాదికి రెండుసార్లు అమ్మానాన్నలున్న కబ్రస్తాన్‌కు వెళ్లి తన చేత పూల సమర్పించి వస్తేనే అత్తవారింట్లో తన ప్రయాణం సాఫీగా సాగుతుంది. లేదంటే ఏదో కోల్పోయినట్టు స్తబ్దుగా, వైరక్తికంగా సాగుతుంటాయి రోజులు?

ఈసారి ఎలాగైనా వెళ్లాల్సిందేననే పట్టుదల మీద ఉంది అర్షియా. అత్తయ్యను ఎదురించి అయినా వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎంత ఆపుకుందామన్నా భావోద్వేగం కట్టలు తెంచుకుని అది ఆగ్రహంగా మారేలా ఉందని ఆమెకు తెలుస్తోంది. ఏదైనా పరవాలేదు, భర్త తనను తిట్టినా, కొట్టినా, ఎన్నడూ నోరెత్తని కోడలు నోరెత్తిందని పరిస్థితులు ఎంతవరకు వెళ్లినా కేర్ చెయ్యను అని స్థిరంగా అనుకుంది.

ఇన్నాళ్లూ అత్తింటివాళ్ల మాట జవ దాటకుండా ఉన్నట్టే తన మాటను ఈ ఒక్క విషయంలో గత పదేళ్లుగా నెగ్గించుకుంటూ వస్తోంది. లౌక్యం ప్రదర్శించి మాయ చేసినట్టే అత్తింటి పర్మిషన్ పొందేది. కానీ ప్రతిసారి వాతావరణం ఒకేలా ఉండదు అనేలా ఈసారి అత్తయ్య అడ్డుకాలు వేసింది?  

మడమ మీద పచ్చని నరాలు కనిపించేంత పాల కడలి తెల్లదనం ఆమెది. పెద్ద కళ్లు, పొడవాటి జుట్టుతో కుందన్‌తో నేసిన చమ్కీ చీరలా మెరిసిపోతుంటుంది అర్షియా. ఆమె అందాన్ని చూసే బషీర్ ఇష్టపడి, పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు.

ఇంటికి పెద్ద కోడలిగా అర్షియా అత్త అడుగుజాడలను తూచా తప్పుకుండా ఫాలో అయింది. దీంతో అత్త మెచ్చిన కోడలు అయింది. ఆమె తర్వాత వచ్చిన కోడలు మాత్రం అత్తను అర్థం చేసుకోవడానికే మూడేళ్లు పట్టింది.

పెళ్లయ్యాక మూడేళ్లకే అర్షియా అమ్మానాన్నలు పోయారు. అప్పటినుంచి ప్రతీ రంజాన్, బక్రీద్ పండగలకు పుట్టింటికి అని హఫీజ్ పేటలో ఉన్న కబ్రస్తాన్‌కు వెళ్తుంది. “కబ్రస్తాన్‌లో ఆడవాళ్లకు ఎలాగూ ఎంట్రీ లేదు కదా? వాడు వెళ్తాడులే” అని అత్త భర్తను పంపి తనను ఆపే ప్రయత్నం చేసినా కూడా భర్తతో వెళ్లి తన పంతం నెగ్గించుకుంది అర్షియా. కబ్రస్తాన్‌కు దూరంగా నిలబడి ఆకాశానికి అర్రులు జాచి అమ్మానాన్నల పేరు మీద దువా వేడుకుని దరూద్ సమర్పించుకునేది. గాల్లో సైగలు చేస్తూ వాళ్లతో లైవ్‌లో మాట్లాడినట్టు ఫీలయ్యేది. ఆమెనలా చూసినవాళ్లు పిచ్చిదేమో అనుకునేవారు.   

“మా అమ్మానాయినలకు కొడుకులు లేరు. కొడుకైనా, బిడ్డె అయినా నేనొక్కదాన్నే. వాళ్లు సచ్చిపోయిర్రు. పండగలప్పుడన్నా నేను వోయి వాళ్ల బొందల మీద ఇన్ని పూలు ఏసి వస్తే వాళ్ల ఆత్మ తుర్తివడ్తది గదా? దయుంచి నన్ను ఆపకుర్రి మీకు దండం వెడ్త. పోకపోతే నా పానమంతా గావర గావర అయితది” అత్తను చూస్తూ దండం పెట్టింది అర్షియా.

అత్తను ఎదురించి మాట్లాడ్డంలా అనిపిస్తోంది ఆమె మనసుకు. కానీ తప్పట్లేదు. ఉన్నత చదువులు చదువుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనని “ఆ ఉద్యోగం ఎందుకు? మనకు ఏం తక్కువని ఈ ఇంటి కోడలు బయటకు వెళ్లి ఉద్యోగం చెయ్యాలి? నీ సంపాదనతో ఇల్లు గడవాల్సినంత అగత్యం లేదు కదా? శుభ్రంగా ఇంటిపట్టునే ఉండి నమాజ్, దువాలో ఉండు” అని అత్తయ్య, భర్తలు హుకుం జారీచేసి తనకు నచ్చిన ఉద్యోగాన్ని మాన్పించేసి ఇంటికే పరిమితం చేశారు.

అలా ఇంట్లో కట్టేసినట్టు ఉండడం ఆమెకు ఎంతమాత్రమూ ఇష్టంలేదు. కానీ వాళ్ల మాటకు ఎదురుచెప్పి ఉద్యోగం చెయ్యలేని నిస్సహాయత? అలా అత్తింట్లో ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని చిన్న చిర్నవ్వుతో భరించింది కానీ పండగ పూట పుట్టింటికి వెళ్లకపోతే మాత్రం తట్టుకోలేనట్టుగా మారిపోతుంది ఆమె నిలువు దృశ్యం.

కబ్రస్తాన్ ముందుకు వెళ్తే ఆమెకు అమ్మానాన్నల్ని పలకరించి వచ్చినంత సంబరంగా అనిపిస్తుంది. ఆ సంబరం అత్తింట్లో ఏడాది పాటు ఉండడానికి కావాల్సినంత మనో స్థైర్యాన్నిస్తుంది. తోబుట్టువులు లేని ఒంటరిది అవడంతో అదొక సెంటుమెంటులా ఫీలవ్వసాగింది.

ఆడవాళ్లు తమకు నచ్చిన పని చేసే స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఈ ప్రపంచానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. మసీదులోకి ప్రవేశం లేకపోయినా కనీసం కబ్రస్తాన్‌లోకి ఆడవాళ్లకు ప్రవేశం ఉండుంటే ఎంత బాగుండేదో అని ఎన్నిసార్లు అనుకుందో. ఆ అల్లాహ్ అందులో తమకు మినహాయింపు కలిగించాలని చాలాసార్లు దువా చేసింది. కానీ అల్లాహ్ కూడా పురుషుడే కదా? తన మొర ఆలకిస్తాడా? లేకపోతే నా ఆజ్ఞను శిరసా వహించమని చెబుతాడా? అని ప్రశ్నించుకున్న సందర్భాలు కోకొల్లలు.

ఆత్మాభిమానం దండిగా ఉంది. అమ్మానాన్నలు తనను అలా పెంచారు. తన కాళ్ల మీద తను నిలబడేలా చేశారు. అదే అలవాటు అయింది. కానీ పెళ్లయ్యాక తన ఆత్మాభిమానం పూర్తిగా దెబ్బతిన్నట్టైంది. పెళ్లయ్యాక తనిష్ట ప్రకారం ఉద్యోగం చేస్తానంటే తనకేం అభ్యంతరం లేదని భర్త బషీర్ అన్న మాటను గట్టు మీద పెట్టేశాడు. ఎందుకంటే అమ్మ మాటను అతను జవదాటలేడు. మతంలోని సాంప్రదాయాలు, ఆచారాలు ఆడవాళ్లను కట్టడి చేస్తున్నాయనే ఎరుక లేకుండా ఆ ఆడవాళ్లే వాటిని అనుసరిస్తూ, సాటి ఆడవాళ్ల మీద కఠినంగా రద్దుతుంటారు. కొడుకులు అయిన పురుషుల మీద కూడా వాళ్లే గుర్తుచేసి మరీ రుద్దుతుంటారు.

అందుకే ఇవాళ ఆచార, సాంప్రదాయాలు బలంగా నాటుకున్నాయి. అంతకన్నా ఎక్కువ బలంగా స్త్రీలను పాతాళంలోకి అణిచివేశాయి? ఇవన్నీ అర్షియాకు తెలుసు. అభ్యుదయ భావాలు ఎక్కువ. కానీ ఏకాకి అయిందామె. గొర్రెలు బావిలో దూకిన చందంగా అందరు ఆడవాళ్లతో తను కూడా ఆ రొచ్చులో దూకుతూ తన ఆత్మాభిమానాన్ని నిండా ముంచేసుకుంది.  

కొన్నిసార్లు ఆమె స్థానంలో కొడుకును పంపించింది అత్త. “నువ్వు పోయి ఏం లాభం చెప్పు? ఆడోళ్లకు అన్లకు వోయే మోక లేదు గదా? నువ్వు ముట్టి ఇచ్చిన పూలను నీ మొగోడు తీస్కపోయి మీ అమ్మానాయిన బొందల మీద పోసి వస్తున్నడు గదా? సాలదా అది?” కనుగుడ్లు పెద్దవి చేస్తూ అంది షాజాది.

ఆడోళ్లు కబ్రస్తాన్‌లకు పోవద్దు అనే మాట అర్షియా గుండెను పిండేసినంత పనిచేసింది.  “హే ఖుదా.. మా ఆడోళ్ల మీద నీకు ఎందుకంత వివక్ష. మేము కబ్రస్తాన్‌లకు వస్తెనే పాపం అంటుకుంటదా?” అనుకుంది మనసులో. అలా అనుకున్నప్పుడు ఆమె కళ్లలోంచి కన్నీటి చుక్కలు నేలరాలాయి. కొంగుతో తుడుచుకుంది.

తోడి కోడలు నజ్మా అక్కడే నిల్చుని ఎవరు మాట్లాడితే వాళ్ల ముఖం చూస్తోంది. షాజాదీ ఆమెను చూస్తూ కళ్లతో సైగ చెయ్యగానే నజ్మా చటుక్కున లోపలికి వెళ్లిపోయింది.

మల్లేపల్లి దగ్గర ఉన్న జిర్రా ఏరియా అది. ఆ ఇంట్లో షాజాదీ చెప్పిందే వేదం. ఆమె గీత గీసిందంటే ఇద్దరు కొడుకులు అస్సలు ఆ గీత దాటే సాహసం అస్సలు చెయ్యరు. సాంప్రదాయాలను ఫాలో అవడంలో ఆమె చాలా స్ట్రిక్టుగా వ్యవహరిస్తుంది. వాటిని ఫాలో అవడంలోనే అసలైన జీవిత పరమార్థం దాగి ఉందని స్థిరంగా నమ్ముతుందామె. ఆ నమ్మకాన్ని అందరి మీదా ఓ నియంత మాదిరి ఆపాదిస్తుంటుంది. కూతురు సహా కొడుకుల పెళ్లిళ్లు అయిపోయాయి. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినా ఆ ఇంటికి స్ట్రిక్టు రూలర్ మాదిరి మసలుకుంటుంది.

ఇంతలో అక్కడికి అర్షియా భర్త బషీర్ వచ్చాడు. సోఫాలో కుబుసం విడిచిన పాముల బుసలు కొడుతున్నట్టు కూర్చున్న అమ్మని, ధీనంగా నిల్చున్న భార్య ముఖాన్ని చూసి విషయం అర్థం చేసుకున్నాడు. నిన్నే రంజాన్ అయిపోయింది కాబట్టి తన భార్య ఇవాళ హఫీజ్ పేట్‌కు వెళ్తుంది అనుకున్నాడు.

అటు అమ్మ సైడ్ తీసుకున్నా, ఇటు భార్య సైడ్ తీసుకున్నా సమస్యే. బషీర్ ఆడవాళ్ల మధ్యలోకి అస్సలు దూరడు. అలాంటిది ఏదైనా సమస్య ముదురుతుందంటే అక్కడినుంచి నెమ్మదిగా జారుకుంటాడు. ఆడవాళ్ల సమస్యను ఆడవాళ్లే సాల్వ్ చేసుకోవాలి. మధ్యలోకి మగాళ్లు దూరారంటే అది చినిగి చినిగి చాంతాండంత అయి తమ మెడకే చుట్టుకుంటుందని అతనికి తెలుసు. కాబట్టి చాలా సందర్భాలలో అత్తాకోడళ్ల మధ్య అస్సలు తలదూర్చలేదు. ఇంటికి వచ్చాడంటే చెవులున్నా చెవిటిలా, కళ్లున్నా గుడ్డివాడిగా నడుచుకుంటాడు.

తల నొప్పెడుతోంది అన్నట్టు బాగా అలిసిపోయినవాడిలా గొణిగాడు.

నిన్నే పండగ అయింది. చుట్టాలు, బంధువులతో అలాయి బలాయిలు, ఫోన్‌లో ఈద్ ముబారక్ పకలరింపులు, షీర్ కూర్మా తాగెయ్యడంతో అదో రకమైన పండగ మత్తెక్కేసింది. వాళ్ల దగ్గరికి, వీళ్ల దగ్గరికి తిరిగి పండగ శుభాకాంక్షలు చెప్పి తియ్యని సేమియా పాయసం ఎక్కువ తాగేసరికి ఒళ్లంతా కుదేసినట్టు అవుతోంది. ఉదయం ఆఫీస్ లీవ్ పెట్టాలనే మూడ్‌లోనే ఉన్నాడు కానీ అతనికి ఈసారి హఫీజ్ పేట్‌కు వెళ్లాలని లేదు. కొడుకును తీసుకుని అర్షియానే వెళ్తుంది అనుకున్నాడు. కాబట్టి వాళ్ల మధ్యలోకి దూరి అలిసిపోయిన తాను అక్కడికి వెళ్లి ఇంకా అలిసిపోవడం సుతారమూ ఇష్టంలేక అబద్ధం అల్లక తప్పింది కాదు.

“నాకు రేపు ఆఫీస్ ఉంది. ఇయ్యాల్ల బగ్గ అలిసిపోయిన. నేను హఫీజ్ పేట్‌కు పోలేను అమ్మా” అంటూ మరో మాటకు ఆస్కారం లేనట్టు లోపలి గదిలోకి వెళ్లిపోయి నిండా దుప్పటి కప్పుకుని కాళ్లు వారజాపి పడుకుండిపోయాడు. భర్త నోటి నుంచి ఆ మాట వినగానే అర్షియా కళ్లు చముక్కున మెరిశాయి. అలా గదిలోకి వెళ్తున్న భర్తను ఆరాధనగా చూసింది.

ఆమె నిల్చున్న హాలుకి ఎదురుగానే ఉంది బెడ్రూం తలుపు. అలా చూస్తున్న ఆమెను దుప్పటి తొలగించి చూసి కన్ను కొట్టాడు చిలిపిగా. ఆ చర్యకు అర్షియా మరింత షాకైంది? భర్త చిలిపి చేష్టలు తనకు అలవాటు ఉన్నవే అవడంతో అసలు వాస్తవం తెలుసుకుని షుక్రియా అన్నట్టు కళ్లతోనే సైగ చేసింది.

కానీ షాజాదికి మాత్రం కొడుకు చెప్పిన మాట విని అరికాళ్ల మంట తలకెక్కినట్టు అయింది. కోడలు పంతమే నెగ్గేలా ఉందనుకుని ఏం చెయ్యాలో తోచక షాజాదీ బిక్కముఖం వేసింది. ఏమీ అనలేకపోతోంది.

“ఏమో పోర్రి.. అంతా మీ ఇష్టమున్నట్టు జేసుకోర్రి” అంటూ తన గదిలోకి రుసరుసా వెళ్లి ధడేల్న డోర్ వేసుకుంది.

కటువుగా అయినా అత్త నుంచి అందిన గ్రీన్ సిగ్నల్ అర్షియాకు ఎక్కడలేని ఆనందాన్నిచ్చింది. జీవితంలో ఏడాదికొకసారి వెళ్లే ఆ సందర్భాన్ని ఆమె అచీవ్మెంట్ సాధించినంతగా ఆనందిస్తుంది. గబుక్కున బెడ్రూంలోకి దూరిపోయింది. గబగబా బ్యాగు సర్దుకుంది.

బెడ్డు మీద పడుకున్న బషీర్ నిద్రలోకి జారిపోయాడు. పదేళ్ల కొడుకు అయాన్ గదిలోనే ఆడుకుంటున్నాడు. ఓ బ్యాగు అందుకుంది. ఫ్రిజ్‌లోంచి తమలపాకుల గంప తీసి బ్యాగులో పెట్టింది. ఆ పూలని డాబా మీద నిన్నే కోసి పెట్టుకుంది.

అర్షియాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మూడు అంతస్తుల ఆ భవనం టెర్రస్ మీద చిన్నగా తోట ఏర్పాటుచేసింది. జాబ్ మానేశాక ఏం తోచక యూట్యూబ్‌లో చూసి డాబా మీద గార్డెనింగ్ పనులు మొదలుపెట్టింది. విశాలమైన డాబాను అందమైన పచ్చని నందనవనంలా మార్చేసింది. ప్రతిరోజూ ఆ రకరకాల పూలమొక్కలు, పళ్లు, కూరగాయల మొక్కలకు నీళ్లు పొయ్యడం, కలుపు మొక్కలు ఏరి పారెయ్యడం వంటి పనులు చేస్తూ పొద్దు గడుపడం అలవాటైపోయింది.

అర్షియా ఎప్పుడైతే మిద్దె వ్యవసాయాన్ని మొదలుపెట్టిందో అప్పటినుంచి ఆ ఇంట్లో కూరగాయలు బయట కొనకుండా అయిపోయింది.

ఇంటి ముందు ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలంలో పెట్టిన మల్లె పందిరి తీగ ఆ భవనానికి పోటీ పడుతూ పాకేస్తూ దానంత ఎత్తుకు ఎదిగి టెర్రస్ మీదకు చేరింది. టెర్రస్ మీద పందిరి వేసింది. ప్రతిరోజూ మల్లెలు, గులాబీల గుభాళింపుతో పవళిస్తుంది ఆ డాబా. పండగ సందర్భంగా గులాబీ, చక్రం, గుర్మాశి, నేల గులాబీ, బంతి, చేమంతి, కనకాంబరాల పువ్వులు కూడా విరబూశాయి. ప్రతీ పండక్కి ఆ పూలను ఎంతో అపురూపంగా కోసి కవర్లో పెడుతుంది. వాటన్నింటిని తన చేత్తో తాకుతుంది, కళ్లకు అద్దుకుంటుంది. తన స్పర్శ ఆ పూల ద్వారా అమ్మానాన్నల సమాధిని చేరాలి. తన జ్ఞాపకాల్లో వారెప్పుడూ సజీవంగానే ఉన్నారన్న సంకేతాలు చేరాలని తపన పడుతుంటుంది.

గంపలో వేసి వరిగడ్డి తడిపి పూల మీద పెట్టి ఫ్రిజ్‌లో పెట్టింది. అందులో కొన్ని పూలు నిన్న అత్తింటివారి సమాధులను అలంకరించాయి. అత్తయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆ మిగిలిన పూలను తీసుకెళ్లి అమ్మానాన్నల సమాధి మీదకు చేర్చాలని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడసాగింది. భర్త కిటుకు వల్ల తన ప్రయాణానికి మార్గం సుగమం అయింది.

ఆనందం పట్టలేనట్టు ఆ పూలను ఫ్రిజ్‌లోంచి తీసి బ్యాగులో వేసుకుంది. బయటినుంచి కొని తెచ్చే పూలను సమర్పించడం ఆమెకు సుతారము ఇష్టంలేదు. తన పెంచి పోషించిన తోటలోంచి పూలను సమర్పిస్తే బాగుంటుందని బయటనుంచి పూలు అస్సలు తెప్పించదు. స్వయంగా తన చేత్తో కోసి సమాధి మీద వేయిస్తుంది.

తొమ్మిదేళ్ల అయాన్‌ బట్టలు మాసిపోవడంతో వేరే డ్రస్ మార్చింది. పౌడర్ పెట్టి, తల దువ్వింది. మధ్యలో బాబు ఆకలి అంటాడని కాసిన్ని స్నాక్స్ కూడా పెట్టుకుంది. వాటర్ బాటిల్, పల్పి ఆరెంజ్ జ్యూస్ బాటిల్ కూడా పెట్టుకుంది.

బయటకు నడిచింది. కారులో డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు. వెళ్లి కారులో కూర్చుండగానే కదిలింది.

తన మాటను కాదని పంతం నెగ్గించుకుందని అర్షియా మీద గుర్రుగా ఉంది షాజాది. వెళ్లి తన గదిలో కూర్చుని తస్బీ(జపమాల) పట్టుకుంది. కానీ చదవడానికి మనస్కరించట్లేదు. కోడలి ముందు అహం దెబ్బతిన్నట్టైంది. అలా ఆలోచిస్తూ కూర్చుంది.    

షాజాది భర్త రహమాన్ దుబాయ్‌లో దాదాపు ముప్ఫై ఏళ్ల వరకు ఉండి బాగానే సంపాదించాడు. పెళ్లైన కొత్తలో వెళ్లి తన యవ్వనం, రక్తం, చెమటంతా దుబాయ్ దేశాలకు ధారపోశాడు. అప్పుడప్పుడు అతిథిలా స్వదేశానికి వచ్చి వెళ్తూ ఆ చిన్న చిన్న ఆనందాలనే జీవితానికి ఆపాదించుకున్న అల్పజీవిగా ఉండిపోయాడు. అతని అన్నదమ్ములు, చిన్నాన్న, పెదనాన్నలు కూడా అరబ్ దేశాలకు వెళ్లి సంపాదించుకున్నవారే.

భర్త అక్కడుంటే ఇక్కడ షాజాది పరిస్థితి అంతుకు మించింది. క్షణక్షణం భర్త గురించిన యావే. ఆ యావలోనే తన ముద్దు ముచ్చట్లన్నీ మరిచిపోయి, పిల్లలే ప్రపంచంగా ఉండిపోయింది.   

భర్త సంపాదించిన ప్రతీ రూపాయిని పొదుపు చేస్తూ ఇక్కడ స్థలాలు, భూములు కొని పెట్టడమే కాకుండా పిల్లలను బాగా చదించింది షాజాది. అంతా అయ్యాక రిటైర్మెంట్ ఏజులో దుబాయికి స్వస్తి పలికి ఇండియా వచ్చాడు. అప్పటికే ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి.

మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా గడిపేద్దాం అనుకున్నాడు. పేదరికం సమసిపోయి మంచి స్థాయికి ఎదిగాం, ఇల్లు, భూములు ఉన్నాయి, పిల్లలు ప్రయోజకులు అయ్యారు. నిశ్చింతగా ఉండిపోదాం అనుకున్నాడు. కానీ ఓరోజు గుండెనొప్పి ఆయన్ను అనంత లోకాలకు తీసుకెళ్లింది. భర్త మరణం షాజాదిని చాలా కృంగదీసింది కానీ మనసు రాయి చేసుకుని కుటంబ భారాన్ని నెత్తిన పెట్టుకుంది.

ముప్ఫై ఏళ్లు భర్త దుబాయ్‌లో ఉండగా ఇంటి బాధ్యతలన్నీ తానే మోసింది. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతలు తనకేం కొత్తగా లేవు. అలవాటుగా సాగిపోతోంది. ఇద్దరు కొడుకులు, కూతురు తల్లి ఏది చెప్పినా వింటారు. చాలా క్రమశిక్షణగా పెంచడంతో కొడుకులను చూసి కోడళ్లు, అల్లుడు కూడా ఇంట్లో అత్తయ్యను రూలర్‌లా చూస్తారు.

తెలిసిన అమ్మాయే.. అందునా రంగు, రూపమే కాదు గుణం కూడా నచ్చి  అర్షియాను ఇంటికి పెద్ద కోడలిగా తెచ్చుకుంది. పెళ్లయ్యాక మూడేళ్లకు కొడుకు పుట్టాడు. ఎన్నో ఆసుపత్రులు, దర్గాలు తిరగ్గా తిరగ్గా కొడుకు పుట్టాడు.

అర్షియా వాళ్లది హఫీజ్ పేట్. ఆమె పెళ్లయ్యాక ఐదేళ్ల కాలంలో అమ్మానాన్నలు కాలంచేశారు. తనొక్కతే కూతురు ఒక ఇల్లు, రెండు వందల గజాల స్థలం ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి బషీర్ అస్సలు అంగీకరించలేదు.

“మాకు ఏం తక్క ఉందని మీవోళ్ల ఆస్తిని తీసుకోమంటవ్? ఓ పని జెయ్.. మీ బాబాయ్ వాళ్లు శానా గరీబోళ్లు గదా. వాళ్లకు ఆ ఆస్తులన్నీ ఇచ్చేస్తే బతుకులు బాగువడ్తయ్ గదా” అన్న భర్త మాట ప్రకారం వాళ్లకే ఇల్లు, జాగా ఇచ్చేసింది అర్షియా.

                                        ***

సాయంత్రం మూడు గంటల సమయంలో కారు మెహిదీపట్రం, బంజారహిల్స్ మీదుగా  జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దాటుకుని హైటెక్ సిటీ, కొండాపూర్‌లలోని ట్రాఫిక్‌ను ఈదుకుంటూ  హఫీజ్ పేట్ వైపు వెళ్తోంది. అర్షియాకు బుర్కా అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇంట్లోవాళ్లు కోప్పడతారని బుర్కా వేసుకుని వచ్చి కారులో కూర్చున్నాక తీసేసి పక్కన పెట్టేసింది.

ఎప్పుడు హఫీజ్ పేట్ వెళ్లినా స్వేచ్ఛా వాయువులు గుండెల నిండా పీల్చుకున్నంత సంబరంగా ఉంటుందామెకు. తన ఆత్మాభిమానాన్ని నిర్మించిన ఏరియా అది.

కారు ఎక్కగానే అయాన్‌కు నిద్ర ముంచెత్తుకొచ్చి ఆమె ఒళ్లో వాలిపోయాడు. అతని తల్లో చేత్తో నిమురుతూ దీర్ఘాలోచనలో పడిపోయింది అర్షియా. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో చిరాకు పడుతూ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్‌ను గమనిస్తోంది.

అవసరం లేకపోయినా హారన్లు మోగిస్తుండడంతో ఆ డిస్టర్బెన్సుకు నిద్ర ఎగిరిపోయింది అయాన్‌కు లేచి తల గోక్కుంటూ అమ్మను చూశాడు. “అమ్మీ ఇంకా హఫీజ్ పేట్ రాలేదా?” అన్నాడు. “లేదు బెటా” అంటూ పల్పీ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ అతని నోటికి అందించింది. ఎండ వేడిమికి తాళలేనట్టు గటగటా ఆ జ్యూసును తాగేశాడు అయాన్.

కిటికీలోంచి బయటకు చూస్తూ “అమ్మీ.. నానా, నానీ కథ చెప్పవా?” అన్నాడు గోముగా. ఆ కథ తనకు తెలుసు అయినా అమ్మతో పదేపదే చెప్పించుకుని రాత్రుళ్లు నిద్రపోవడం అయాన్‌కు అలవాటు. నిజజీవిత కథను ఓ కథలా చెప్పి రక్తి కట్టిస్తుంటుంది అర్షియా.

కొడుకు వైపు మురిపెంగా చూస్తూ చెప్పనారంభించింది. “నానా(అమ్మ తండ్రి) పేరు మహబూబ్. మహబూబ్ ఆ ఇంటికి పెద్దకొడుకు. ఆయన ఎన్క ఇద్దరు చెల్లెండ్లు, ఇద్దరు తమ్ముండ్లు ఉన్నరు. వాళ్ల నాయిన చిన్నగున్నప్పుడే సచ్చిపోవుడుతోని ఇంటికి పెద్ద కొడుకుగా భారం అంతా మహబూబ్ మీదనే పడ్డది. నాంపల్లిల ఉండే బజార్ ఘాట్‌ల ఉండేటోళ్లంట అప్పట్ల. అప్పటికే సర్కార్ బడిల ఎనిమిదో తరగతి సదువుతున్న మహబూబ్ ఇస్కుల్ బందువెట్టి లారీ మీద క్లీనర్‌గా వెళ్లేటోడు. వాళ్లమ్మ కుందన్ వర్క్ చేసేది. అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. చిన్న ఇంట్ల అంతమంది తలదాచుకునేటోళ్లు. దీంతో మహబూబ్ పొద్దస్తమానం లారీ మీద క్లీనర్ పనిజేసి రాత్రుళ్లు రిక్షా తోలి ఆ వచ్చే రెండు, మూడు రూపాయల చిల్లర నాణేలు తెచ్చి వాళ్లమ్మ చేతిల పోసేటోడు. అట్లా మహబూబ్ ఎక్కువ కష్టపడితే గానీ ఇంట్ల ఎవరూ ఉపాసం ఉండకపోయేటోళ్లు. పని జల్ది నేర్చుకుంటే డ్రవర్ అయి ఎక్కువ జీతం తీసుకోవచ్చని మహబూబ్ ఐదేండ్లల్లనే డ్రైవింగ్ నేర్సుకొని దినపత్రికలను ఊరూరా చేర్చే వ్యాన్ నడపుడు మొదలువెట్టిండు. అటెన్క ఎదిగొచ్చిన చెళ్లెండ్ల లగ్గాలు చెయ్యనీకి అప్పులు, తమ్ముండ్లు స్థిరపడనీకి, వాళ్ల లగ్గాలకు పైసలు సరబర జేసుడు, లేదా అప్పులు జేసుడు, ఇట్ల ఇవన్నీ అమ్మా కొడుకులే చూసుకున్నరు. అట్లా అమ్మ కాలంజేసింది. కుప్ప లెక్క ఉన్న అప్పు. తన రెక్కలను ముక్కలు జేసుకొని ఆ అప్పంతా తీర్చిండు మహబూబ్. అమీనాను లగ్గం జేసుకున్నంక ఆమె గూడా ఇంట్ల కుట్టు పనులు, కుందన్ పనులు జేసుకుంట సంపాదించేది. మహబూబ్ ఆ పత్రికల వ్యాన్ నడపనీకి రాత్రుళ్లు ఒంటిగంటకు బయలుదేరి నడ్మల ప్యాసింజర్ చెయ్యెత్తిన చోటల్లా ఆపుకుంట మీద మీద పైసలు సంపాదించుకునేటోడు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డిలకు ఎక్కువగా తోలేటోడు. అట్ల పోయిన ప్రతిసారి ప్యాసింజర్లను దేవుండ్ల లెక్క భావించి ఎక్కిచ్చుకునేటోడు. ఆ సంపాదనే తనకు వచ్చే జీతానికి రెండు మూడు రెట్లు ఎక్కువగా వచ్చేది. దీంతో మహబూబ్ అప్పులన్నీ తీరగా జమా చేసుకుని సొంత ప్లాటు, ఇల్లు కట్టుకున్నడు. తన రెక్కలు సలామత్ ఉన్నన్ని రోజులు సంపాదించిండు. వాళ్లకొక బంగారు పాప ఉండె. ఆమె పేరు అర్షియా” అని ఆగిపోయి కళ్లను చక్రాల్లా తిప్పింది.

అది అమ్మే అని అతనికి తెలిసు కాబట్టి కిసుక్కున నవ్వాడు. మళ్లీ తనే కంటిన్యూ చేస్తూ “బిడ్డెను ఎంతో అపురూపంగా పెంచుకున్నరు. ఆమె లగ్గం జేసిన మూడేండ్లలల్లనే ఇద్దరు ఒకరి ఎన్క ఒకరు సచ్చిపోయిర్రు” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

అమ్మ కళ్లలో కన్నీటిని చూసి అతని కళ్లు కూడా చిప్పిల్లాయి. “తాత, అమ్మమ్మ కుటుంబం కోసం శానా కష్టవడ్డరు కదమ్మీ?” అన్నాడు.

“అవున్రా. నీకింకో ముచ్చట జెప్పాల్నా.. వాళ్లకు పుట్టిన బిడ్డె వాళ్ల సొంత బిడ్డె కాదు” అని ఆగిపోయింది.

ఆ మాట విని అతను షాకయ్యాడు? కథలో ఎప్పుడూ ఆ ఊసు ఎత్తని అమ్మ నోటి నుంచి ఆ మాట కొత్తగా అనిపించి చెవులు రిక్కించాడు.

“అంటే అమ్మీ నువ్వు వాళ్ల కన్నబిడ్డెవు కాదా?”

“కాదురా. వాళ్లకు పిల్లలు కాలేరు. దీంతోని యాడనో అనాథగా దొరికిన నన్ను తెచ్చుకొని నడుపుకున్నరు. వాళ్లు గనుక నన్ను నడుపుకోకుంటే నేనియ్యాల్ల ఇంత పెద్ద సదువు సదివేదాన్ని కాదు, జాబ్ జేసేదాన్ని కాదు, ఏడనో పెంట కుప్పలల్ల చెత్త ఏరుకుంట బతికేదాన్ని. ముస్లిం కుటుంబమే అయినా నన్ను వాళ్లు ఆడపిల్ల లెక్క గాకుంట ఆడ పులి లెక్క పెంచిర్రు. నాకు ఏది ఇష్టమో అదే చెయ్యుమన్నరు. ఎక్కడా నామీద ఆచారాల ఆంక్షలు, సంప్రదాయాల సంకెళ్లు పెట్టలేదు. కనీ నా జన్మ మొగ జన్మ అయ్యుంటే ఇయ్యాల్ల కబ్రస్తాన్‌లకు పోయి సమాధుల మీద పూలు ఏసి వచ్చేదాన్ని గదా? కనీసం వాళ్లు నన్ను గాకుంట నీ అసుంటి మొగపోరన్ని సాదుకున్నా ఇయ్యాల్ల వాళ్ల సమాధులు పువ్వులతోని ఎలిగిపోయేటియి” అంటూ నిట్టూర్చింది.

అసలు వాస్తవం తెలిసిన అయాన్ అలా నోరెళ్లబెట్టాడు కాసేపటి వరకు!   

చుట్టూ పరిసరాలను అద్దాల్లోంచి చూస్తున్న అర్షియాకు హఫీజ్ పేట్ సమీపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భావోద్వేగం తన్నుకురాసాగింది. తన బాల్యం అంతా హఫీజ్ పేటలోనే గడిచింది. కాబట్టి అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. తన బాల్యంలో ఆ ఏరియా ఇంతగా డెవ్‌లప్ అయి లేదు. చెట్లు, చిన్న చిన్న గుట్టలు ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ ఇళ్లే.

బాల్యం గడిచిన పరిసరాలను అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోనట్టే అర్షియా కూడా ఆ జ్ఞాపకాలను తన గుండెల్లో పదిలపరుచుకుంది. అమ్మానాన్నలకు తను ఒక్కత్తే కూతురు. పెళ్ళయ్యాక వాళ్లు అనారోగ్యాలతో ఒకరి తర్వాత ఒకరు పోవడంతో ఆ ఇల్లును బాబాయ్ వాళ్లకు ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత బాబాయ్, పెదనాన్నలు ఏమైనా ఫంక్షన్లు చేస్తే తప్పితే అటువైపు వెళ్లడం కుదరలేదు ఆమెకు.

అలా ఆలోచనల ప్రవాహంలో కొట్టుమిట్టాడుతుండగా హఫీజ్ పేట్ బ్రిడ్జి వచ్చింది. దాన్నలా చూస్తుండిపోయింది కాసేపటివరకు. బ్రిడ్జి ఎడమ పక్కనుండి లోపలికి వెళ్లాలి.

అక్కడినుంచి నేరుగా ఓ మూడు కిలోమీటర్ల మేర రోడ్డు ఉంటుంది. ఈ చివరి నుంచి మొదలుపెడితే రైట్, లెఫ్ట్ గల్లీలను నెంబర్లతో పిలుస్తారు. వాళ్లిల్లు ఉన్న గల్లీ తొమ్మిది. ఆ గల్లీ దగ్గరపడుతుంటే గుండెల్లో దడ మొదలైంది.

కారును స్లోగా వెళ్లమని డ్రైవర్‌కు చెప్పింది. ఆ గల్లీలో నాలుగో ఇల్లే తమది. కానీ అది ఇప్పుడు బాబాయ్ వాళ్ల ఇల్లు. తను ఆడుకుని పెగిరి పెద్దైన గల్లీ అది. అవన్నీ తన కళ్ల ముందు దృశ్యాలుగా కనిపిస్తుంటే చాలా ఎమోషనల్ అవసాగింది.

అలా కారు ఇరవైయో నెంబర్ గల్లీ దగ్గర ఆగింది. అక్కడే మసీదు, కబ్రస్తాన్ కలిసి ఉన్నాయి. కారు దిగింది. శాశ్వత నిద్రలో ఉన్న అమ్మానాన్నల దగ్గరికి వచ్చి తట్టి లేపుతునట్టు అనిపించింది.

పండగల సందర్భంగా తమవారు వచ్చి తమ సమాధుల మీద పూలు, దరూద్ సమర్పిస్తే ఆత్మ సంతృప్తి చెందుతుందని అనగా విని దాన్ని మనసులో పెట్టుకుని అర్షియా ప్రతీ రంజాన్, బక్రీద్‌లకు ఇలా వచ్చేస్తుంది.

కొన్నిసార్లు భర్తతో వచ్చింది, కొన్నిసార్లు ఒక్కతే వచ్చింది, ఈసారి కొడుకున తీసుకుని వచ్చింది. బుర్కాను అందుకోబోయి అక్కడే పెట్టేసి బ్యాగులో ఉన్న షాలువాను తీసుకుని తల మీదుగా కప్పుకుని కారు దిగి మసీదు ముందు నిలబడింది.

డ్రైవర్ వెళ్లి మౌల్వీని పిలుచుకువచ్చాడు. అతను రాగానే ఆమెకు సలాం చేశాడు. ఆమె వాలెకుమస్సాలాం అని సమాధానమిచ్చింది.

జానెడు గెడ్డం, కళ్లకు సుర్మా, నుదురు మీద నమాజు మచ్చ, లాల్చీ పైజామాలో ఉన్నాడు. “మా అబ్బా, అమ్మీల సమాధుల మీద ఈ పూల సమర్పించాలి. కాస్త చూడరా. మీతో మా బాబు వస్తాడు” అంది అర్థింపుగా.

“అదెంత పని ఇటివ్వండి” అన్నాడతడు.

ఆ పూల కవర్‌ను అతని చేతికి అందించింది. కూడా బాబును తీసుకుని మౌల్వీ లోనికి వెళ్తుంటే డ్రైవర్ కూడా అతణ్ని అనుసరించాడు. వాళ్ల వెనకాల నడుస్తూ అర్షియా కూడా కబ్రస్తాన్ గేటు వరకు వెళ్లి ఆగిపోయింది. అక్కడేదో లక్ష్మణ రేఖ గీసినట్టు అనిపించింది. గేటు పక్కన నక్కినట్టు నిల్చుని అటే ధీనంగా చూస్తోంది.

రాత్రిపూట అయ్యుంటే ధైర్యంగా ఒక్కదాన్నే కబ్రస్తాన్‌లోకి వెళ్లి అమ్మానాన్నల సమాధుల్ని చూసి వచ్చేదాన్ననిపిస్తోంది. “నాలెక్క ఆలోచించేటోళ్లు ఒక్కరిద్దరు ఉన్నా ధైర్యంగా లోపటికి పోయొచ్చేదాన్ని. మాతృమూర్తి గర్భం నుంచి శాశ్వతంగా పుడమితల్లి గర్భంలకే గదా వచ్చేది. ఇక్కడున్నది ఇద్దరూ స్త్రీమూర్తులే గదా? అయినా ఎందుకీ ఆంక్షలు?” అనుకుని గేటును గోళ్లతో రక్కసాగింది.

కబ్రస్తాన్ నిండా వేపచెట్లే ఉన్నాయి. ఆ వేపచెట్ల నడుమ అంతా సమాధులు కూడా కనిపించనంతగా పిచ్చి చెట్లు మనిషి లోతు వరకు పెరిగాయి. రంజాన్ సందర్భంగా కొంతవరకు పిచ్చి చెట్లను తీసివేయడంతో కొన్ని సమాధులు కనిపిస్తున్నాయి. ఆ సమాధుల మీద ఎర్రని గులాబీలు, మల్లెలు, గన్నేరు, ఇంకా రకరకాల పూలు ఇప్పుడిప్పుడే వాడిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

సమాధుల్లో చాలా ప్రశాంత వాతావరణం ఉన్నట్టనిపించింది. జీవితమంతా తీవ్ర గందరగోళంగా, అహంకారంగా, భీతిగా, గొప్పగా.., బతికిన మనిషి చివరికి ఈ కబ్రస్తాన్‌లో ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడో అనుకుంది.

అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనే స్ఫురణకు వచ్చి వెక్కసాగింది. దరూద్ చదువుకుంటూ రెండు చేతులెత్తి ఆ పైవాడితో దువా వేడుకుంటోంది.

“యా అల్లాహ్.. అమ్మానాన్న ఎంతో కష్టపడ్డరు అని నీకు తెలుసు. వాళ్లను నీ జన్నత్‌ల మంచి స్థానంల ఉంచు తండ్రీ. వాళ్ల పాపాలు ఏమైనా ఉంటే క్షమించు తండ్రీ” అని వేడుకుని దరూద్ చదువుతూ వాళ్ల పేర్లు తలుచుకోసాగింది.

కబ్రస్తాన్‌లోకి వెళ్లి వాళ్ల సమాధుల మీద పడి కాసేపు ఏడ్చి ఏడ్చి రావాలని ఉంది. కానీ తను ఆడది, ఆడవాళ్లకు కబ్రస్తాన్‌లోకి, మసీదులోకి ఎంట్రీ లేదు? కాబట్టి అలా నిస్సహాయంగా ఆ గేటు వద్దే కుప్పకూలిపోయింది.

“యా అల్లాహ్.. మేము సచ్చినంక కాదు బతికున్నప్పుడు గూడా మాకు కబ్రస్తాన్‌లకు అనుమతి ఇయ్యయ్యా. మావోళ్లు సచ్చినప్పుడు మా చేత్తోని వాళ్ల సమాధుల మీద ఇంత మన్ను వోసే భాగ్యాన్ని ఇయ్యయ్యా. మేమూ నువ్వు పుట్టిచ్చిన బిడ్డలమే గదా తండ్రీ. కానీ మాకు వేరు రూల్స్, మగవాళ్లకు వేరే రూల్స్ ఎందుకయ్యా? నువ్వు ఆడవాళ్లను కబ్రస్తాన్‌లకు అనుమతిస్తే ఈ కబ్రస్తానే జన్నత్‌కు తొలి నందనవనం అయితది” అంటున్న ఆమె కళ్లు ఏరుధారలయ్యాయి.

కబ్రస్తాన్‌లోకి వెళ్లినవాళ్లు దూరంగా కనిపిస్తున్నారు. ఆ సమాధి మీద పడే ఆ పూవుకు ఉన్న అదృష్టమైనా స్త్రీకి లేదు కదా అనుకుంది. అల్లాతో దువా వేడుకున్నా వింటాడు కానీ అది అయ్యే పనేనా? ఆయనకు కాకుండా నేరుగా పురుషులకే చెప్పాలి. కానీ వాళ్లు ఆడవాళ్ల మాటను లెక్కలోకి తీసుకుంటారా? తనలా ఆలోచించే స్త్రీల సంఖ్య పెగిరినప్పుడే ఆ మార్పు సాధ్యం అవుతుండొచ్చు అనుకుని దీర్ఘశ్వాస వదిలింది.

ఇంతలో వెళ్లినవాళ్లు కాస్తా రావడం చూసిన ఆమె తననితాను సర్దుకుంది. కళ్లను తుడుచుకుంది. దగ్గరికి వచ్చిన మౌల్వీ చేతిలో ఐదు వందల నోటు పెట్టింది. “తుమ్హారే అమ్మీ అబ్బాకో దువా, రెండు ఖురాన్‌ల సవాబ్‌ను బఖష్ దియా హుం” అన్నాడు. ఆ మాటతో ఆమె మనసు దూదిపింజెలా మారిపోయింది.  

“ఖుదాహఫీజ్” అంటూ మౌల్వీ వెళ్లిపోయాడు. కొడుకు వెళ్లేటప్పుడు నానా, నానీ సమాధులను తాకి మొక్కి రావాలని పదేపదే చెప్పింది గుర్తొచ్చింది. వెంటనే అతని అరచేతులకు అంటుకున్న సమాధి మీది మట్టి రేణువులను చూసి ఆ చేతులను తన ముఖానికి రాసుకుని ముద్దు పెట్టింది. అమ్మానాన్నలకు ముద్దు పెట్టినట్టు ఫీలయ్యింది క్షణం పాటు.

                                        ————————

May 31, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us