మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

సంగీత సరోవరంలో విరిసిన పద్మం – ఎన్. రాజం

by Padmasri Chennojwala March 19, 2026
written by Padmasri Chennojwala

సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో. పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.

సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.
ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.

సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.
మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.
నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.
హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.

వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.
ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.
ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ.
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు. తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు. వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది. కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు. కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన అమృత సుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్త్రీ తత్త్వచింతన శిఖరం వాగాంభృణి

by Vijaya Ranganatham March 19, 2026
written by Vijaya Ranganatham

వాగాంభృణిఋగ్వేదానికి చెందిన స్త్రీ మంత్రదరష్ట. ఆమె పేరు మీద ఋగ్వేదం 10వ మండలం, 125 వ సూక్తం ఉంది. దీన్ని దేవి సూక్తం, వాక్సూక్తం అంటారు.ఇది వేదాల్లో పరబ్రహ్మ స్వరూపాన్ని మొదటి పురుషంలో ప్రకటించిన అరుదైన స్త్రీ సూక్తం.

వాగాంభృణి,ఋషి వంశంలో అంభృణి ఋషి కుమార్తెగా జన్మించినట్లువేద సాహిత్యం,గ్రంథాలు చెబుతున్నాయి.అందుకే పేరు వాగ్+అంభృణి = వాగాంభృణి అంటారు. కుటుంబ ఋషి సంప్రదాయం కాకుండా స్వతంత్ర దర్శనము కలిగిన ఋషిక. ఆమెది ఉత్తర ఋగ్వేద కాలం సుమారు క్రీ.పూ. 1200-1000 మధ్య అని పండితులఅంచన. తత్వవాదం స్పష్టంగా రూపుదిద్దుకుంటున్న దశ.

సంప్రదాయం ప్రకారం అంభృణి ఋషి వంశానికి చెందిన ఋషికగా భావిస్తారు.వేదకాలంలో స్త్రీలకు కూడా విధ్య, వేదాధ్యయనం అవకాశం ఉండేదని ఆమె జీవితం సూచిస్తుంది. వేదాలు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం వంటి విషయాలలో ప్రావీణ్యం సాధించింది. ఆమె రచించిన దేవి సూక్తంలో తాను “వాక్” (దివ్య వాణి) స్వరూపమని ప్రకటించటం ఆమె తాత్విక లోతును చూపిస్తుంది. సూక్తంలోని భావం ప్రకారం, సృష్టిలోని శక్తి జ్ఞానం, చైతన్యం అన్నీ తనలోనే ఉన్నాయని ఆమె ఆత్మసాక్షాత్కారాన్ని వ్యక్తం చేసింది. వాగాంభృణి వేదకాలంలో స్త్రీ విధ్య, స్త్రీ ఆధ్యాత్మిక స్థాయికి ప్రతీక.  ఆమె దేవీ సూక్తం శక్తి ఆరాధనకు మూలాధారంగా భావించబడుతుంది. భారతీయ తత్వంలో “శక్తి” భావనకు ప్రాథమిక రూపం ఈ సూక్తం ద్వారా కనిపిస్తుంది.ఋగ్వేదం 10.125 దేవీ సూక్తం సారాంశం. దీనిలోవాగ్దేవి స్వయంగా మాట్లాడుతుంది.

అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యైరుత వ్శ్వదేవైః
భావం: నేను దేవతలతో కూడి సంచరిస్తాను. నేను బ్రహ్మాన్ని నిలబెడతాను. రాజు,ఋషి, బ్రాహ్మణుడు అందరికి నేను శక్తినిస్తాను. నేనే సృష్టికి మూలం. నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు అమృతత్వం పొందుతారు.ఇది అహం బ్రహ్మస్మి తత్వానికి వేదరూపం.
వాగాంభృణి సూక్తం:అద్వైత భావనకు పూర్వగాథగా పండితులు ఈ సూక్తాన్ని చూడడం జరుగుతుంది. శబ్దం (వాక్) = బ్రహ్మం అనే భావన.స్త్రీ శక్తి = సృష్టి మూలం అనే స్పష్టమైన ప్రకటన. తర్వాతి శాక్త సంప్రదాయాలు ఈ సూక్తాన్ని తమ తాత్విక పూర్వగాథగా స్వీకరించాయి.భారతీయ స్త్రీ తత్వచింతనలో  ఆమె స్థానం గొప్పది. మొదటిస్త్రీ స్వరూప బ్రహ్మవాది,గార్గీ, మైత్రేయి లకు తాత్విక మార్గదర్శినని అంటారు.“స్త్రీలకు వేదాధికారం లేదు” అన్న వాదనకుస్పష్టమైన ఖండన. ఇది ఆధునిక వాదన.వేదకాలంలో పరిస్థితులు ప్రాంతానుసారం మారుతూ ఉండేవి.
వాగాంభృణి కోణం- వేద సాంప్రదాయం, తాత్విక దృష్టి, ప్రాశ్చాత్య వేద పండితుల అభిప్రాయాలు,భారతీయ తాత్విక దర్శనాలు (అద్వైత, శాక్త, వేదాంత దృష్టి). మానవ ఋషిక, వాక్ దేవి స్వరూపం ప్రతీకాత్మక ఆత్మ ఘోషణ బ్రహ్మజ్ఞాని స్త్రీ అని వివరిస్తూఆమెమనిషి, దేవత్వం కలిసిన వేదీయ భావస్వరూపం మని అభిప్రాయం పడతారు.

ఆమె గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే వాగాంభృణి — “నేనే వాక్, నేనే బ్రహ్మం” అని ప్రకటించిన తొలి స్త్రీ ఋషిక.వాగాంభృణి – వేదకాల స్త్రీ తత్త్వచింతన యొక్క శిఖరం. ఆమె నామవ్యుత్పత్తివాగాంభృణి =వాక్ (Vāk)  వాక్కు, శబ్దం, చైతన్య వ్యక్తీకరణ. అంభృణి- అంభృణి ఋషి కుమార్తె అని నిర్వచించారు. అంటే వాక్కు స్వరూపంగా దర్శించిన అంభృణి ఋషి కుమార్తె. ఇక్కడ “వాక్” సాధారణ మాట కాదు. బ్రహ్మ చైతన్యానికి వ్యక్త రూపం.ఆమె మానవ రూప ఋషికగా వాగాంభృణి.వేద సంప్రదాయం ప్రకారం:ఆమెఒక మానవ ఋషిక. తపస్సు, స్వానుభవం ద్వారా మంత్రాలను “రచించలేదు”,“దర్శించింది” (Mantra-draṣṭā). వేదాలలో ఇది చాలా కీలకం:మంత్రాలుమనుషుల కల్పన కాదు, సత్య దర్శనం.ఋగ్వేదం 10.125 – దేవీసూక్తం (Vāk Sūkta). ఇది వాగాంభృణి మహిమకు కేంద్రబిందువు.ప్రత్యేకతలు. మొత్తం సూక్తంమొదటి పురుష వాచ్యం (అహం = నేను)వేదాలలో ఇదిఅద్వితీయం. స్త్రీ స్వరూపంస్వయంగా తన పరబ్రహ్మత్వాన్ని ప్రకటించడం.

సూక్తంలోని ముఖ్య తత్త్వాంశాలు (Deep Philosophy)
(a) వాక్ = బ్రహ్మం. “అహం బ్రహ్మాస్మి” అని నేరుగా చెప్పకపోయినాఆ భావాన్ని పూర్తిగా వ్యక్తం చేస్తుంది. వాక్ అంటే:చైతన్యం, సృష్టి శక్తి, జ్ఞానం, ఋతం (Cosmic Order).
(b) దేవతలకూ ఆధారం నేనే. సూక్తంలో వాక్ చెబుతుంది:నేను రుద్రులతో నడుస్తాను. నేను ఆదిత్యులతో ఉన్నాను. నేను విశ్వదేవతలలో ప్రవేశించాను. అర్థం:వాక్ అనే చైతన్య శక్తి సమగ్రతను ఈ సూక్తం సూచిస్తుంది.
(c) రాజకీయ–సామాజిక తత్త్వం. “నేనే రాజుని రాజుగా చేస్తాను”. అంటే:అధికారానికి మూలం ఆయుధం కాదు. జ్ఞానం + వాక్ శక్తి. ఇది వేదకాలంలోనేనైతిక అధికార భావనకు తాత్విక సూచనగా పండితులు వ్యాఖ్యానించారు
.(d) స్త్రీ తత్త్వ ప్రకటన.వాక్ చెబుతుంది:నేనే సృష్టికి మూలం.నేనే పోషకురాలు.నేనే జ్ఞానప్రదాత. ఇది తర్వాతి కాలంలోని:దేవీ మహాత్మ్యం. శక్తి తంత్రం. కుండలినీ సిద్ధాంతం. అన్నిటికీ మూలబీజం.

వాగాంభృణి – ప్రతీకనా? వాస్తవ వ్యక్తినా?
పాశ్చాత్య వేద పండితులలో చాలామంది (ప్రత్యేకంగా 19వ శతాబ్దపు ఇండాలజిస్టులు)ఇది “Personification of Speech”. ఒక తత్త్వాన్ని కవిత్వంగా చూపించారు.భారతీయ సంప్రదాయం: తత్త్వాన్ని దర్శించిన మానవ ఋషిక. ఆమె ద్వారా వాక్ దేవిగా ఆవిర్భవించింది. భారతీయ దృష్టిలో:ప్రతీక + మానవ అనుభవం = వేద దర్శనం.
ఉపనిషత్తులతో సంబంధంవాగాంభృణి సూక్తంలో కనిపించే (“అహం బ్రహ్మాస్మి”, “సర్వం ఖల్విదం బ్రహ్మ”, “ప్రజ్ఞానం బ్రహ్మ”) ఆత్మ–బ్రహ్మ ఏకత్వ భావం, ఉపనిషత్తుల మహావాక్యాలతో తాత్విక సమాంతరతను చూపిస్తుంది. అందుకే ఆమెనుకొంతమంది ఆధునిక వ్యాఖ్యాతలు ఆమెను ఉపనిషత్తు తాత్విక భావాల పూర్వగాథగా గౌరవిస్తారు.స్త్రీలకు వేదాధికారం వాగాంభృణి సహా ఇతర ఋషికల సూక్తాలు వేదకాలంలో స్త్రీ మంత్రద్రష్టల ఉనికిని సూచిస్తున్నాయి. వాగాంభృణివేద మంత్రద్రష్ట, తత్త్వవాది, బ్రహ్మజ్ఞాని. కాబట్టి“స్త్రీలకు వేదాధికారం లేదు” అన్న వాదనశాస్త్రీయంగా నిలబడదు.భారతీయ సంస్కృతిలో వాగాంభృణి ప్రభావం తరువాత కాలపు ఋషికల పై ప్రత్యక్ష ప్రభావం” కంటే “భావ పరంపర, తాత్విక సమాంతరత” అని చెప్పొచ్చని పండితుల అభిప్రాయం.
గార్గీ – తత్త్వవాద ప్రశ్నలు.బ్రహ్మవిచారణలో లోతైన ప్రశ్నలు అడిగింది.వాగాంభృణి ప్రకటించిన “అహం బ్రహ్మస్వరూపిణి” భావానికి సమీపమైన ధైర్యమైన స్త్రీ స్వరం ఇక్కడ కనిపిస్తుంది.కానీగార్గీపై వాగాంభృణి ప్రత్యక్ష ప్రభావం ఉందని గ్రంథ ఆధారం లేదు — భావసామ్యం మాత్రమే.
మైత్రేయి – ఆత్మబ్రహ్మ చింతన. యాజ్ఞవల్క్యునితో ఆత్మతత్త్వంపై సంభాషించింది.వాగాంభృణి దేవీ సూక్తంలోని ఆత్మబ్రహ్మ ఏకత్వ భావనతో తాత్విక సమీపత ఉంది.ఇది కూడా ప్రత్యక్ష ప్రభావం కంటేఆలోచనా పరంపరలో భాగం.
లలిత సహస్రనామం – “వాగ్దేవతా స్వరూపిణి” ఇందులో దేవిని వాగ్దేవతా స్వరూపిణిగా స్తుతిస్తారు.వాగాంభృణి దేవీ సూక్తం (ఋగ్వేదం 10.125)లో వాక్స్వరూప దేవత భావం స్పష్టంగా ఉంది.ఇదిశాక్త పరంపరలో అభివృద్ధి చెందిన భావ వికాసంగా చూడవచ్చు.
కాశ్మీర శైవం – శబ్దబ్రహ్మం. శబ్దం, స్పంద, పరావాక్ భావాలు ఉన్నాయి.వాగాంభృణి “అహం రాష్ట్రీ సంగమనీ వసూనాం…” అంటూ శక్తి–వాక్ ఏకత్వాన్ని ప్రకటిస్తుంది.ఇదితాత్విక సమాంతరత— కానీ నేరుగా వాగాంభృణి ప్రభావం అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది.
భక్తి ఉద్యమం – వాక్కు శక్తి. భక్తి కీర్తనలు, నామస్మరణ ప్రధానమైనవి.ఇది వాక్ప్రాధాన్యతను చూపిస్తుంది.కానీ భక్తి ఉద్యమం నేరుగా వాగాంభృణి ప్రభావంతో పుట్టింది అని చెప్పలేం — ఇదిసాంస్కృతిక విస్తరణలో భాగంమాత్రమే.
ఒక వాక్యంలో ఆమె స్థానం,వాగాంభృణి – స్త్రీ స్వరూపంలో బ్రహ్మ తత్త్వం స్వయంగా ప్రకటించుకున్న అరుదైన వేద స్వరం.ఋగ్వేదం 10వ మండలం – 125వ సూక్తం. అంటేవాగాంభృణి దర్శించిన “దేవీ సూక్తం / వాక్ సూక్తం” పూర్తి పాఠంసంస్కృత (దేవనాగరి) మూలపాఠం. ఋషిః– వాగాంభృణి, దేవత– వాక్ (దేవి)ఛందస్సు– త్రిష్టుప్.
1.అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యైరుత విశ్వదేవైః ।అహం మిత్రావరుణోభా బిభర్మ్యహమింద్రాగ్నీ అహమశ్వినోభా ॥
భావార్థం:నేను రుద్రులతో, వసువులతో సంచరిస్తాను.ఆదిత్యులు, విశ్వదేవతలతో కూడి నేను ఉన్నాను.మిత్రుడు–వరుణుడు, ఇంద్రుడు–అగ్ని, అశ్వినీ దేవతలు —వీరందరినీ నేను ధరిస్తున్నాను, పోషిస్తున్నాను.
అర్థం:దేవతలన్నీ నా శక్తి రూపాలే;వాటికి ఆధారమైన చైతన్యం నేనే.
2.అహం సోమమాహనసం బిభర్మ్యహం త్వష్టారముత పూషణం భగమ్ ।అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే యజమానాయ సున్వతే ॥
భావార్థం:నేనే సోమరసాన్ని ధరిస్తాను,త్యాగఫలాలను ప్రసాదిస్తాను.త్వష్టా, పూషణుడు, భగుడు వంటి దేవతల శక్తి నాలోనే ఉంది.యజ్ఞం చేసే వారికి, హవిస్సు సమర్పించే వారికిసంపదను నేనే ప్రసాదిస్తాను.
అర్థం:ఫలప్రదానం దేవతల చేత కాదు —దైవచైతన్యమైన వాక్ ద్వారానే.
3.అహం రాష్ట్రం సంగమనీ వసూనాం చికిత్సు ప్రథమాయా యజ్ఞియానామ్ ।తాం మా దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యావేశయంతీమ్ ॥
భావార్థం:నేనే రాజ్యాన్ని నిలబెట్టే శక్తిని.సంపదలను ఏకత్రం చేసే బలం నేనే.యజ్ఞాలలో ముందుండే జ్ఞానస్వరూపిని నేనే.దేవతలు నన్ను అనేక చోట్ల వ్యాప్తిచేసిప్రపంచమంతా వ్యాపింపజేశారు.
అర్థం:సామాజిక క్రమం, రాజ్యవ్యవస్థ, ధర్మం —అన్నిటికి మూలం వాక్ శక్తి.
4.మయా సో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి య ఈం శృణోత్యుక్తమ్ ।అమంతవో మాం త ఉప క్షియంతి శ్రుధి శ్రుత శ్రద్దివం తే వదామి ॥
భావార్థం:నన్ను దర్శించినవాడు జీవిస్తాడు,నన్ను తెలుసుకున్నవాడు శ్వాసిస్తాడు,నా వాక్యాన్ని వినేవాడే నిజంగా జ్ఞానవంతుడు.నన్ను తెలియని వారు నాశనమవుతారు.విను — నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను.
అర్థం:చైతన్యాన్ని గ్రహించకుండా జీవితం అంధమే.
5.అహం స్వయం వదామి జుష్టం దేవైస్తమేవ యం కామయే తం తముగ్రమ్ ।తం బ్రాహ్మణం తం ఋషిం తం సుమేధామహం రుద్రాయ ధనురాతనోమి ॥
భావార్థం:దేవతలకు ప్రీతికరమైన సత్యాన్ని నేనే ప్రకటిస్తాను.ఎవరిని నేను కోరుకుంటానోవారినే శక్తివంతులుగా చేస్తాను.వారినే బ్రాహ్మణులుగా, ఋషులుగా, మేధావులుగా మారుస్తాను.రుద్రునికీ ధనుస్సును నేనే అందిస్తాను.
అర్థం:జ్ఞానం దేవుడిచ్చే వరం కాదు —చైతన్యమే జ్ఞానాన్ని ప్రకటిస్తుంది.

6.అహం జనాయ సమదం కృణోమ్యహం ద్యావాపృథివీ ఆవివేశ ।అహం సువే పితరమస్య మూధ్న్మమ యోనిరప్స్వంతః సముద్రే ॥
భావార్థం:ప్రజలకు ఉత్సాహం, శక్తి నేనే ఇస్తాను.ఆకాశం, భూమి రెండింటిలో నేను వ్యాపించాను.ఈ సృష్టికి మూలమైన తండ్రిని నేనే జన్మింపజేశాను.నీళ్ళలోను, సముద్రంలోను నా యోని ఉంది.
అర్థం:సృష్టి పురుషుడు కూడాస్త్రీ శక్తి ద్వారానే ఉద్భవిస్తాడు.
7.అహమేవ వాత ఇవ ప్రవామ్యారభమాణా భువనాని విశ్వా ।పరో దివా పరం ఏనా పృథివ్యైతావతీ మహినా సంబభూవ ॥
భావార్థం:గాలిలా నేను అన్ని లోకాలలో విస్తరిస్తాను.ఈ సమస్త విశ్వాన్ని నా శక్తితో ఆవరించాను.ఆకాశాన్ని దాటి, భూమిని దాటినా మహిమ విస్తరించింది. అర్థం:పరిమితులు లేని సర్వవ్యాప్త చైతన్యం నేనే.

8. ఇతి దేవీ సూక్తం సమాప్తమ్ఈ సూక్తం ద్వారావాక్ = బ్రహ్మంఅనే తత్త్వం సంపూర్ణంగా ప్రకటించబడింది.
మొత్తం సూక్తం యొక్క సారాంశం. “నేనే దేవతల శక్తి, నేనే జ్ఞానం, నేనే సృష్టి మూలం,రాజ్యానికీ ధర్మానికీ నేనే ఆధారం.నన్ను తెలిసినవాడు అమృతత్వాన్ని పొందుతాడు.”ఇది కేవలం కవిత కాదు —స్త్రీ స్వరూపంలో పరబ్రహ్మం తనను తాను ప్రకటించిన వేద దర్శనం.
వాగాంభృణి,గార్గీ,మైత్రేయిల వేద–ఉపనిషత్తు స్త్రీ తత్త్వచింతన త్రయం అని అంటారు. వారి కాలానుగుణ స్థానం వివరణలు, తత్త్వదృష్టి విధానం (Approach to Truth),స్త్రీ చైతన్య పాత్ర, సామాజిక దృష్టి.గమనిస్తే..
వాగాంభృణి: క్రీ.పూ.1200-1000 ఋగ్వేదం 10.125., వేద దర్శనం. స్వయంఘోషణ, కవితాత్మక దర్శనం, వాక్ = బ్రహ్మం, “నేనే బ్రహ్మం” — ప్రత్యక్ష ప్రకటన. బ్రహ్మం ఆమెకు ప్రశ్న కాదు; అనుభవసత్యం. దేవీ స్వరూపం, అధికారిక, సృష్టిమూలం. రాజ్యం, ధర్మం, యజ్ఞం — అన్నింటికీ మూలం వాక్ , సామాజిక శక్తి సిద్ధాంతం.శబ్దబ్రహ్మం, ఉపనిషత్తు తత్త్వాలకు ఇచ్చిన బీజాలు వాగాంభృణి తత్వం. బ్రహ్మం మాట్లాడింది.
గార్గీ వాచక్నవి: క్రీ.పూ.900-800 బృహదారణ్యక ఉపనిషత్తు,ఉపనిషత్తు తత్త్వవాదం, తర్కాత్మక ప్రశ్నలు,వాదప్రతివాదం, బ్రహ్మ స్వరూపం ఏమిటి? “అది దేనితో నేయబడింది?”బ్రహ్మాన్నిప్రశ్నల ద్వారా అన్వేషిస్తుంది.యాజ్ఞవల్క్యుడినే నిరుత్తరుణ్ని చేసే స్థాయి ప్రశ్నలు. తత్వవాది,ప్రశ్నాత్మక, జ్ఞానసవాల్. సభలో పురుష ఋషులతో సమానంగా వాదిస్తుంది. బౌద్ధిక సమానత్వంప్రతీక. తర్కాత్మక బ్రహ్మవిచారణ.బ్రహ్మాన్ని ప్రశ్నించింది.
మైత్రేయి: క్రీ.పూ.900-800 బృహదారణ్యక ఉపనిషత్తు, ఉపనిషత్తు తత్త్వవాదం, అనుభవాత్మక జ్ఞానం, శాంతమైన సంభాషణ, ఆత్మ జ్ఞానం ద్వారా అమృతత్వం. “అమృతత్వం ఎలా లభిస్తుంది?”బ్రహ్మాన్నిజీవిత ప్రయోజనంగాచూస్తుంది. గృహిణి, బ్రహ్మవాది, వినయపూర్వక కాని దృఢ మైన, మోక్షమార్గం. సంపదను త్యజించి జ్ఞానాన్ని కోరుతుంది. అంతర్ముఖ మోక్ష దృష్టి. నిత్యానిత్య వివేకం. బ్రహ్మాన్ని జీవించింది.
భారతీయ స్త్రీ తత్త్వచింతనలో వారి సంయుక్త స్థానం – దర్శనం (వాగాంభృణి) → విచారణ (గార్గీ) → అనుభవం (మైత్రేయి)ఇదిభారతీయ జ్ఞాన మార్గం యొక్క సంపూర్ణ చక్రం.
ఆధునిక ఫెమినిజం దృష్టిలో వాగాంభృణి “స్త్రీ మాట్లాడుతోంది” — ఇది ఫెమినిజమేనా?దేవీ సూక్తం మొత్తంమొదటి పురుషంలో (అహం = నేను)ఉంది.“నేనే సృష్టి మూలం”. “నేనే రాజ్యాన్ని నిలబెడతాను”ఆధునిక ఫెమినిజం భాషలో ఇది:Female Self-Assertion. Voice reclamation. Subjecthood (స్త్రీ వస్తువు కాదు — కర్త).ముఖ్యంగా:పురాతన సాహిత్యంలో స్త్రీనివర్ణించేపురుష స్వరం కాకుండాస్త్రీ తనను తాను నిర్వచించుకోవడం— ఇది రాడికల్ చర్య.“స్త్రీ = శక్తి” కాదు, “స్త్రీ = చైతన్యం”
ఆధునిక ఫెమినిజం ఒక ప్రశ్న వేస్తుంది:“స్త్రీలను దేవీకరణ చేయడం కూడా ఒక పితృస్వామ్య పద్ధతేనా?”
వాగాంభృణి: ఆమెదేవతగా పొగడబడడం లేదు. ఆమెచైతన్యంగా తనను ప్రకటిస్తుంది. వేద సత్యాన్ని ప్రకటిస్తుంది. పురుష ఋషి ద్వారా కాదు. సభలో అనుమతి తీసుకోకుండా. శరీరం గురించి ప్రస్తావన లేదు. వాక్ (స్వరం)గురించే కేంద్రం. “నేనే రాజ్యాన్ని నిలబెడతాను” — రాజకీయ ఫెమినిజం.దేవీ సూక్తం:“అహం రాష్ట్రం సంగమనీ వసూనాం”ఆధునిక రాజకీయ ఫెమినిజం దృష్టిలో:స్త్రీకేవలం గృహ పరిమితి కాదు. ఆమెరాజకీయ నిర్మాణాల మూలం. ఆమె ప్రకృతి, శబ్దం, చైతన్యం, సృష్టి.
వాగాంభృణి ఒకనార్మేటివ్ ఐడియల్. ఏమై ఉండవచ్చోచూపిస్తుంది.ఒక వాక్యంలో ఆధునిక ఫెమినిస్టు పఠనం. స్త్రీ తన స్వరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని,జ్ఞానం, శక్తి, రాజకీయాన్ని తన నుంచే ప్రారంభించిన తొలి ప్రకటన.ఆధునిక ఫెమినిజం వాగాంభృణిని…”పురాతన దేవి”గా కాకుండా,తనను తాను నిర్వచించుకున్న మొదటి స్త్రీ జ్ఞానసబ్జెక్ట్”గా చదువుతుంది.శక్తి తంత్రానికి వాగాంభృణి ఇచ్చిన మూలసూత్రాలువాగాంభృణితంత్ర గ్రంథకర్త కాదు.కానీతంత్రం నిలబడి ఉన్న మౌలిక తత్త్వాలు. ఆమె దేవీ సూక్తంలోమొదటిసారిగా స్పష్టంగా దర్శనమిచ్చాయి.శబ్దం = శక్తి = బ్రహ్మం.
దేవీ సూక్తం:“అహం… భువనాని విశ్వా”. తంత్ర మూలసూత్రం:శబ్దమే శక్తి. శక్తియే బ్రహ్మం. తంత్రంలో:బీజమంత్రాలు, మంత్రజపం, నాద, బిందు సిద్ధాంతం. ఇవన్నీవాగాంభృణి ప్రకటించిన “వాక్” తత్త్వం నుంచే.శక్తి స్వయంప్రకాశం
దేవీ సూక్తంలో:“అహం స్వయం వదామి…”. శక్తికిపురుష అనుమతి అవసరం లేదు.తంత్రంలో:శక్తి శివుని చేత సృష్టించబడలేదు. శివుడుశక్తి చేత సచేతనుడవుతాడు. ఇది వేదాల్లో తొలిసారి కనిపించే భావం. శక్తి = సృష్టికర్త. దేవీ సూక్తం:“అహం సువే పితరమస్య మూధ్నః”. అర్థం:నేనే సృష్టికర్త అయిన తండ్రిని కూడా జన్మింపజేశాను.తంత్రంలో:శక్తి = జగదాంబ, శివుడు = నిష్క్రియ చైతన్యం. శక్తి లేకుండా శివుడుశవమే. ఈ ప్రసిద్ధ తంత్ర వాక్యం వేదీయ బీజం ఇదే.
యోని తత్త్వం – పవిత్రత. దేవీ సూక్తం:“మమ యోనిరప్స్వంతః సముద్రే”.యోని = సృష్టి మూలం.అపవిత్రం కాదు —కోస్మిక్ గర్భం. తంత్రంలో:యోని పూజ. శ్రీచక్రం. సృష్టి గర్భ తత్త్వం ఇవన్నీ ఈ వాక్యానికి విస్తరణ. శక్తి సర్వవ్యాప్తి. దేవీ సూక్తం:“అహమేవ వాత ఇవ ప్రవామి…”తంత్రంలో:శక్తి ఆలయంలో మాత్రమే కాదు,శరీరంలో, ప్రకృతిలో, శ్వాసలో.అందుకే తంత్రం:కుండలినీ, చక్ర వ్యవస్థ, శరీర సాధన.అనుభవమే ప్రామాణికం
వాగాంభృణిగ్రంథం ఉటంకించదు. ఆజ్ఞాపించదు. తన అనుభవాన్ని ప్రకటిస్తుంది. తంత్రంలోగురు + సాధన. ప్రత్యక్ష అనుభవం. శాస్త్రం కంటేసిద్ధి. ఇదే తంత్రపు మూల స్వభావం. స్త్రీ శరీరం — సాధన స్థలం. వేదంలో ఇది సంకేతంగా ఉంది. తంత్రంలో స్పష్టమవుతుంది. ఆమెశరీరాన్ని తక్కువ చేయదు. దేహాన్ని దాటే చైతన్యాన్ని చూపుతుంది. తంత్రంలోభోగం → యోగం. దేహమే మోక్ష సాధనం అధికారానికి మూలం — శక్తి. దేవీ సూక్తం:“అహం రాష్ట్రం సంగమనీ…”తంత్రంలోరాజశక్తి ,క్షత్రియ దీక్షలు, దేవీ రాజ్యాధికారం, రాజకీయ శక్తి కూడా శక్తియే. శివ–శక్తి అద్వైతం. వాగాంభృణిద్వైతాన్ని ప్రకటించదు. ఏకత్వంమాత్రమే. తంత్రంలోశివం–శక్తి అభేదం. లలిత త్రిపురసుందరి సిద్ధాంతం.
వాగాంభృణి సూక్తం వాక్, యోని, శ్వాస, స్వయం ప్రకాశం, సర్వవ్యాప్తి అయితే మంత్రం, శ్రీ చక్రం, కుండలినీ, శక్తి స్వాతంత్రం, శరీర సాధనతంత్ర సిద్ధాంతంసంక్షిప్తంగా చెప్పవచ్చు.ఒక వాక్యంలో సారం.. వాగాంభృణి తంత్రం మొదలయ్యే ముందు,శక్తి తత్త్వం వేదాలలో మాట్లాడిన మొదటి స్వరం. ఆమె ఆధునిక భారతీయ సందర్భంలో మూడు తులనాత్మక కోణాలు.వాగాంభృణి vs ఆధునిక భారతీయ మహిళా కవులు.సామాన్య బిందువు – “స్త్రీ స్వరం”. వాగాంభృణి“అహం స్వయం వదామి…”(నేనే స్వయంగా మాట్లాడుతున్నాను). ఆధునిక మహిళా కవులు స్త్రీ అనుభవాన్నిమొదటి పురుషంలోచెప్పడం, పురుష మధ్యవర్తిత్వం లేకుండా స్వర ప్రకటన.
వాగాంభృణి = తొలి ‘Female poetic.చైతన్య స్వరూపం, విశ్వ స్థాయి, నేనే బ్రహ్మం  అని వాగాంభృణి ధోరణి అయితే అనుభవ స్వరూపం, వ్యక్తిగత, సామాజిక స్థాయి, నేను కూడా మనిషినే అని ఆధునిక కవులు అంటుంన్నారు. ఆధునిక కవిత్వంవాగాంభృణి దృష్టిని భూమికి దింపింది.తాత్విక వారసత్వం..ఆధునిక మహిళా కవిత్వందేహం గురించి మాట్లాడుతుంది. నొప్పి, అన్యాయం, ప్రేమ అన్నీ చెప్పుతుంది.వాగాంభృణి ఇచ్చిన“మాట్లాడే హక్కు”లేకపోతేఈ కవిత్వం ఊహించలేం.ఫెమినిజం విమర్శలకు వేద సమాధానం (వాగాంభృణి ఆధారంగా)
విమర్శ 1:“వేదాలు పితృస్వామ్యమే”వేద సమాధానం (వాగాంభృణి):వేదాల్లో స్త్రీవిషయం కాదు, వక్త, ఆమె బ్రహ్మతత్త్వాన్ని ప్రకటిస్తుంది. సమస్య వేదాల్లో కాదు,తర్వాతి కాలపుసామాజిక ఆచారాలలో.
విమర్శ 2:“స్త్రీలను దేవీకరించడం కూడా అణచివేతే”వాగాంభృణి ఏమంటుంది?ఆమెను ఎవరూ దేవిగా పిలవలేదు. ఆమెతనను తానే ప్రకటించుకుంది. ఇది దేవీకరణ కాదు — Self-definition.
విమర్శ 3:“ఆధ్యాత్మికత మహిళలను భౌతిక హక్కుల నుంచి దూరం చేస్తుంది”. వేదీయ సమాధానం:“అహం రాష్ట్రం సంగమనీ వసూనాం”వాగాంభృణిఆధ్యాత్మికమే కాదు. రాజకీయ, సామాజిక శక్తికి మూలంఅని చెబుతుంది.ఈ తత్త్వం నేటి సమాజానికి ఎలా వర్తిస్తుంది?ఇది అత్యంత ముఖ్యమైన భాగం.
 (a) స్త్రీ విద్య&స్వరం: వాగాంభృణి సందేశం:“జ్ఞానం స్త్రీకి ఇవ్వాల్సిన దానం కాదు — ఆమె హక్కు” నేటి సందర్భంలోస్త్రీ విద్య, స్త్రీ అభిప్రాయానికి విలువ, “మాట్లాడితే మౌనంగా ఉండు” అనే సంస్కృతి ఖండన.
(b) రాజకీయాలు&నాయకత్వంస “అహం రాష్ట్రం సంగమనీ…” మహిళా నాయకత్వం:కోటా కోసం కాదు. సామర్థ్యం వల్ల సహజమైనది. వాగాంభృణి దృష్టిలో:శక్తి లింగాధారితమైంది కాదు.
(c) శరీరం – అపవిత్రత నుంచి పవిత్రత. వాగాంభృణి:“మమ యోనిః…”నేటి సమస్యలు:పీరియడ్స్ టాబూ. శరీర లజ్జ. వేదీయ సమాధానం:శరీరం అపవిత్రం కాదు —సృష్టి సాధనం.
(d) మాటల హింస (Verbal Violence): వాగాంభృణి:వాక్ = శక్తి. నేటి సమాజంమాటలతో అణచివేత. ట్రోలింగ్, అవమానం. పరిష్కారం:మాట = బాధ్యత.
మూడు కాలాలను కలిపే ఒక వాక్యం. వాగాంభృణి —వేదకాలంలో చైతన్యంగా మాట్లాడింది,ఆధునిక కవిత్వంలో అనుభవంగా మారింది,నేటి సమాజంలో బాధ్యతగా నిలవాలి.వాగాంభృణి తత్త్వం, భారతీయ రాజ్యాంగం. సమానత్వ భావన యొక్క భారతీయ మేధో పరంపర.మౌలిక భావసామ్యం (Core Idea). వాగాంభృణి..“అహం రాష్ట్రం సంగమనీ వసూనాం” అంటే “నేనే రాజ్యాన్ని నిలబెట్టే శక్తిని”. భారతీయ రాజ్యాంగం..“We, the people of India..”రాజ్యానికి మూలం:రాజు,దేవుడు కాదు. చైతన్యమైన ప్రజలు.ఇది రెండింటిలోనూ ఒకే భావం. వ్యక్తి కేంద్రత (Individual as Source of Dignity). వాగాంభృణి : ప్రతి వ్యక్తిలో వాక్ ఉంది. జ్ఞానం అందరికీ సాధ్యం
రాజ్యాంగం – ఆర్టికల్ 21. జీవితం&వ్యక్తిగత గౌరవం. వాగాంభృణి తత్త్వం:గౌరవంలింగం ఆధారంగా కాదు. చైతన్యాధికారం ఆధారంగా. సమానత్వం – సమానత్వానికి మూలం. వాక్ సర్వవ్యాప్తం. అందరిలో ఒకటే చైతన్యం
రాజ్యాంగం – ఆర్టికల్ 14. Law before equality & equal protection of laws.ఎందుకు సమానత్వం?ఎందుకంటే మూల చైతన్యం అందరిలో సమానమే.వివక్ష నిషేధం (Non-discrimination). వాగాంభృణి: బ్రాహ్మణుడు, ఋషి, రాజు. అందరికీ శక్తినిచ్చేది ఒక్కటే వాక్
రాజ్యాంగం – ఆర్టికల్ 15: లింగం, మతం, జాతి ఆధారంగా వివక్ష నిషేధం.తాత్విక పునాది:జ్ఞానం విభజనను అంగీకరించదు. స్వేచ్ఛ&వ్యక్తీకరణ (Freedom of Expression). వాగాంభృణి: “అహం స్వయం వదామి…”మాట్లాడే హక్కు అంటే అస్తిత్వ హక్కు
రాజ్యాంగం – ఆర్టికల్ 19(1)(a): Freedom of Speech & Expression. భారత రాజ్యాంగం ఆధునిక ప్రజాస్వామ్య నమూనాల ప్రభావంతో రూపుదిద్దుకుంది. ఆధునిక రాజ్యాంగం హక్కుల భాషలో చెప్పిన సూత్రాలకు, వేదీయ తత్త్వంలో సాంస్కృతిక-ఆధ్యాత్మిక పూర్వగాథ ఉంది.రాజకీయ సమానత్వం (Political Equality). వాగాంభృణి: “అహం రాష్ట్రం…”రాజకీయ శక్తి స్త్రీకి సహజం
రాజ్యాంగం: ఓటు హక్కు (Article 326). మహిళలకు సమాన రాజకీయ హక్కులు.ఇది కేవలం చట్టం కాదు. భారతీయ తత్త్వానికి న్యాయరూపం. సామాజిక న్యాయం (Social Justice). వాగాంభృణి: శక్తి ఎవరికీ ప్రత్యేకం కాదు. సామాజిక స్థితి ఆధారంగా కాదు
రాజ్యాంగం – ప్రస్తావన (Preamble): Social, Economic, Political Justice.న్యాయం అంటేసమాన అవకాశాలకు చైతన్యాన్ని విడుదల చేయడం.వాగాంభృణి: స్త్రీ జ్ఞానకర్త. స్త్రీ శక్తికర్త
రాజ్యాంగం: Article 15(3) – మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు.ఇది “ప్రివిలేజ్” కాదు.చరిత్రాత్మక అణచివేతకు సరిదిద్దే చర్య. మౌలిక కర్తవ్యాలు (Fundamental Duties). వాగాంభృణి: వాక్ బాధ్యత
రాజ్యాంగం :Article 51Ato renounce practices derogatory to the dignity of women.మాటలతో అణచివేత కూడా రాజ్యాంగ విరుద్ధమే.వాగాంభృణి తత్త్వం —భారతీయ రాజ్యాంగానికి శాసన మూలం కాదు,కానీ దాని మేధో–సాంస్కృతిక మూలం.అంటేరాజ్యాంగం ఆధునిక భాషలో చెప్పినది,వాగాంభృణి వేదభాషలో అనుభవించినది.ఆధునిక మహిళా ఉద్యమాలకు వేదీయ తాత్విక మద్దతు.
లక్ష్యం…వేదాలు మహిళా ఉద్యమాలకువ్యతిరేకంకాదు;వాటికితాత్విక లోతు, సాంస్కృతిక బలాన్ని ఇచ్చే మూలం.“మాట్లాడే హక్కు” – ఉద్యమాల తొలి అడుగువేదీయ మూలం. వాగాంభృణి (దేవీ సూక్తం)“అహం స్వయం వదామి…” స్త్రీకి స్వరం హక్కు కాదు,అస్తిత్వం.ఆధునిక ఉద్యమంలో#MeToo, గృహహింసపై మాట్లాడటం, లైంగిక వేధింపులపై స్వరం.ఇదిమాట్లాడే స్వరానికి వేదీయ ఆధ్యాత్మిక పూర్వగాథగా వాగాంభృణి స్వరం చూడవచ్చు.జ్ఞానాధికారం నాయకత్వానికి మూలం. వేదీయ మూలం-వాగాంభృణి – మంత్రద్రష్ట, గార్గీ – తత్త్వవాదిని సవాల్ చేసినది, మైత్రేయి – ఆత్మజ్ఞానం కోరినది.జ్ఞానం పురుష ఏకాధిపత్యం కాదు.ఆధునిక ఉద్యమంలోమహిళా మేధావులు, అకాడమిక్ లీడర్షిప్, పాలసీ మేకింగ్‌లో మహిళలు.శరీరం అపవిత్రం కాదు – సాధన స్థలం. వేదీయ మూలం“మమ యోనిరప్స్వంతః సముద్రే”శరీరం అంటే సృష్టి సాధనం. ఆధునిక ఉద్యమంలో – పీరియడ్స్ టాబూ వ్యతిరేకం, శరీర స్వాతంత్ర్యం, Reproductive rights. శరీరాన్ని సృష్టి–శక్తి సాధనంగా చూసిన వేదీయ దృష్టి, ఆధునిక శరీర స్వాతంత్ర్య చర్చలకు సాంస్కృతిక పునర్వ్యాఖ్యానంగా ఉపయోగపడవచ్చు.ఇది “పాశ్చాత్య దిగుమతి” కాదు —వేదీయ శరీర తత్త్వం పునరుద్ధరణ.

ఆధ్యాత్మికత vs హక్కులు – తప్పుడు విభజన
విమర్శ“ఆధ్యాత్మికత మహిళలను అణచుతుంది”. వేదీయ సమాధానం.వాగాంభృణి:ఆధ్యాత్మికమేరాజకీయ శక్తి మూలంఅని చెబుతుంది. “అహం రాష్ట్రం సంగమనీ…”హక్కుల పోరాటానికి ఇది అంతర్గత బలం.సమానత్వం – దయ కాదు, సత్యం. వేదీయ మూలం- వాక్ సర్వవ్యాప్తం. అందరిలో ఒకే చైతన్యం. ఆధునిక ఉద్యమంలో – Equal pay. Equal opportunity. Anti-discrimination laws. సమానత్వంఅభ్యర్థనకాదు —నైతిక సత్యం.వేదీయ సంప్రదాయంలో:ఋషికలు గృహిణులు, తపస్వులు, మేధావులు. ఒకే మోడల్ కాదు. ఆధునిక Intersectional Feminismకిభారతీయ సమాంతర భావం కనిపిస్తుంది. ఇదేహింస – మాటల నుంచే మొదలవుతుంది. వేదీయ దృష్టి-వాక్ = శక్తి. దుర్వాక్యం = హింస. ఆధునిక ఉద్యమంలో – Online abuse. Moral policing. Victim shaming. ఉద్యమాలకు వేదీయ మద్దతు:మాటల సంస్కరణ అంటే సామాజిక సంస్కరణ. ఉద్యమాలకు సాంస్కృతిక న్యాయబలం. భారతదేశంలో తరచూ వినే వాదన:“ఇది మన సంస్కృతికి విరుద్ధం”. వేదీయ సమాధానం. వాగాంభృణి, గార్గీ, మైత్రేయిమహిళా ఉద్యమాలుసంస్కృతికి వ్యతిరేకం కాదు. వేదాలను మహిళా ఉద్యమాలకు వ్యతిరేకంగా మాత్రమే చూడడం ఒక దృష్టికోణం అయితే, వాటిలోని శక్తి–వాక్ తత్త్వాలను సమకాలీన సమానత్వ చర్చలకు మద్దతుగా పునర్వ్యాఖ్యానించడం మరో దృష్టికోణం.సంస్కృతి యొక్క మూలానికి తిరిగివెళ్లడం.పరిమితి – నిజాయితీ. వేదీయ తత్త్వంసిద్ధాంత బలం ఇస్తుంది. కానీ చట్టాలు, విధానాలు అవసరం.
తత్త్వం + చట్టం + ఉద్యమం= సామాజిక మార్పు. వేదీయ తత్త్వంలో కనిపించే శక్తి, వాక్, ఋషికల స్వరాలు ఆధునిక మహిళా ఉద్యమాలకు సాంస్కృతిక-తాత్విక మద్దతుగా పునర్వ్యాఖ్యానించవచ్చు.వేదాల లోతైన మానవతా తత్త్వానికి సమకాలీన స్వరూపం.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాభవ ఉగాది

by Beeram Sunder Rao March 19, 2026
written by Beeram Sunder Rao

ప్రాభవమ్ము తప్ప “పరాభవ” మ్ము లేని

వెలుగు పండుగ కావలె తెలుగు వత్స

రాది; భారత ప్రజలెల్ల ప్రగతి మార్గ

మందు, సకల శుభమ్ములు నందవలెయ

ఆత్మీయులందరికీ ఉగాది పర్వదిన శుబాకంక్షలు

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఉగాది – వసంత విభావరి”

by Manjula Pathipati March 19, 2026
written by Manjula Pathipati

వసంత విభావరిలో విరిసిన వెలుగుల వేళ,
పచ్చని ప్రకృతి పులకించి నవ్విన వేళ,
గడపల గర్భగృహమున మంగళ స్వరమై
తెలుగు తల్లి పండుగగా ఉగాది అవతరించె.
మామిడి తొరణాల పచ్చని తంతువులలో
ఆశల అలలు అలరిస్తూ ఊగుచుండగా,
వేప పుష్పాల చేదు గర్భిత గంధములో
జీవన సత్యాల గూఢార్థం మౌనమై నిలిచె.
కోకిల కూయు కంఠమున కలకల రాగములు
ప్రకృతి మంగళ ధ్వనులై పరిమళించగా,
వసంత సమీర మృదుస్పర్శ సన్నిధిలో
నూతన సంవత్సర స్వప్నాలు సుస్వాగతించె.
మామిడి–వేపల మేళన రసమూర్తిగా
ఉగాది పచ్చడి రూపమై వెలిసిన వేళ,
చేడు–తీపి–పులుపు–కారం–ఉప్పుల రుచులలో
జీవిత చక్రం సత్యమై ప్రతిధ్వనించె.
సంస్కృతి సుమములు వికసించు వేళ,
సంప్రదాయ దీపములు ప్రకాశించు వేళ,
ప్రకృతి–మనుజ బంధమది పావనమై
భూమి ఒడిలో నిత్యమై నిలిచియుండె.
అందుకే ప్రతి ఉగాది ప్రబోధమై,
పచ్చని మామిడి పుటల పలుకులలో,
వేప పుష్ప సుగంధ విరిసిన వేళ,
కోకిల గానామృత తరంగములలో,
ప్రకృతి సాక్షిగా మన జీవన గాథకు
కొత్త ఆది – కొత్త ఆశ – కొత్త మార్గమై నిలిచె.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహితీ వనంలో విరబూసిన సుగంధ కుసుమాలు

by Padmasri Chennojwala March 19, 2026
written by Padmasri Chennojwala

“రవి గాంచని చోటు కవి గాంచున్”
“కత్తి కంటే కలం గొప్పది”
సాహితీ రంగానికి సంబంధించి తరుచుగా వినిపించే రెండు సూక్తులు.

వస్తువు ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కవులకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ (రవి……. గాంచన్)నానుడి పుట్టి ఉండవచ్చు.

“కత్తి కంటే కలం గొప్పది”
కత్తి శరీరాన్ని గాయపరిస్తే, కలం ఆలోచనను రేకెత్తిస్తుందన్న భావన ఈ సూక్తిలో మనకు కనిపిస్తుంది. [గాయపరచడం మాత్రమే కాదు, శస్త్రచికిత్సలోనూ తనదైన పాత్ర పోషించి, వ్యాధి పీడితులకు స్వస్థత చేకూర్చడంలో బలమైన పనిముట్టుగా ఉపయోగపడుతుందనేది (ప్రస్తుతానికి అనవసరమైనా) అందరూ ఆమోదించాల్సిన మరో కోణం].
కలం అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. ఆలోచనను రేకెత్తించి, మార్పు వైపు నడిపిస్తుంది. ఆ మార్పు మనిషిలోని మాలిన్యాన్ని కడిగేసేదైనా కావచ్చు, అభివృద్ధి బాట పట్టించేదైనా అయి ఉండవచ్చు.
మేము సైతం అంటూ కలాన్ని చేతబట్టి, తమకంటూ ఒక గుర్తింపును సంతరించుకున్న 19వ శతాబ్దపు ఈ సరస్వతీ పుత్రికలను కెమెరాలో బంధించిన ఆనాటి అపూర్వ ఘట్టం, తీయని జ్ఞాపకమై నేడు నెట్టింట వైరల్ గా మారుతోంది. వారు వెదజల్లిన పరిమళాలను ఆఘ్రాణిస్తూ, ఈ చిరు అక్షర నీరాజనం.

రంగనాయకమ్మగారు
సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రిగా, విమర్శకురాలిగా, మార్క్సిస్ట్(శ్రామిక వర్గ ప్రయోజనాలను సమర్ధించే వ్యక్తి) గా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజాస్వామిక విలువలు, కుల వ్యతిరేకత, సమానత్వం, భారతీయ పురాణాలు వంటి అంశాలపై రచనలు చేశారు. 1955లో రచనా వ్యాసంగం ప్రారంభించిన వీరు 15 నవలలు, 70 కథలు,వ్యాసాలు మాత్రమే కాకుండా భారత కమ్యూనిస్టు ఉద్యమం, మావోయిజంపై కలాన్ని సంధించారు.
కలం పట్టిన తొలినాళ్లలో దద్దనాల (తండ్రి ఇంటి పేరు) రంగనాయకమ్మగా, వివాహానంతరం ముప్పాళ్ళ రంగనాయకమ్మగా పాఠకులకు చిరపరిచితులు.
1965 లో ‘ బలిపీఠం’ నవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మార్క్సిస్ట్ దృక్పథంతో రాసిన ‘రామాయణ విషవృక్షం’ బ్రాహ్మణ వ్యతిరేకిగా, స్త్రీవాద రచనలు చేయడం వల్ల పురుష వ్యతిరేకంగా ముద్ర పడింది.
జానకి విముక్తి, కళ్ళు తెరిచిన సీత, కృష్ణవేణి, బలిపీఠం, రచయిత్రి, కళ ఎందుకు, ప్రేమకి ముగింపు ఎప్పుడు?, వాళ్ళిద్దరూ అంతేనా?, రామాయణ విషవృక్షం,ఇదండీ మహాభారతం వంటి రచనలు చేసి, సాహిత్య రంగంలో పలు సంచలనాలు సృష్టించారు.

పాకాల యశోదా రెడ్డి
తెలంగాణ భాష,యాసలతో కూడిన రచనలు చేసిన వీరు తమలోని ప్రతిభకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ప్రాచీన తెలుగు సాహిత్యంపై వీరు చేసిన ప్రసంగాలు పలువురి మన్నన లందుకున్నాయి. ఆకాశవాణిలో తెలంగాణ మండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయిత్రిగా వినుతి కె క్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, లలితకళా అకాడమీ,సంగీత అకాడమీ సభ్యురాలిగా కొనసాగారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో వీరికి విడదీయరాని అనుబంధం ఉంది. ధర్మశాల, ఎచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు, భారతీయ చిత్రకళ, ద్విపద వాంగ్మయం, ప్రబంధ వాంగ్మయం, భావిక వంటి రచనలు, పలు విమర్శనాత్మక గ్రంథాలు రచించారు.

కాసు రాఘవమ్మ గారు
గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితురాలై, జాతీయ ఖాదీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటలో కాసు రాఘవమ్మ – బ్రహ్మానందరెడ్డి పేరుమీద 1972 లో జూనియర్ కళాశాల,1974 లో డిగ్రీ కళాశాలలు(25 ఎకరాల విస్తీర్ణంలో) స్థాపించబడినవి.

ఈ రెండు కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో వెలువడే ‘ప్రతిభ’
అనే వార్షిక పత్రిక విద్యార్థుల్లో దాగిన సాహితీ విలువలకు అద్దం పడుతూ ఉండేది.

భానుమతీ రామకృష్ణ
అటు చలనచిత్ర రంగం, ఇటు సాహితీ రంగం. రెండింటిని సమన్వయ పరచుకున్న తీరు అద్భుతం. నటిగా, గాయనిగా, స్టూడియో అధినేత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా అన్ని పాత్రల్లో ఒ దిగిపోయి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. శ్రోతలను మురిపించి, మరిపించిన కంఠస్వరం ఆమె వరం. హాస్యంతో కూడిన రచనలు, చక్కని వాగ్దాటితో కట్టిపడేసే ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణలు. ఆత్మవిశ్వాసం పాలు ఒకింత ఎక్కువై గర్విష్టి(కొంతమంది దృష్టిలో)గా ముద్రపడినా, వారిలోని భక్తి తత్పరత, స్నేహశీలతల కారణంగా అందరి మనసుల్ని చూరగొనేవారు.
తమిళనాడులోని సంగీత కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా సేవలందించారు. వీణ వా ద్యంలోనూ ప్రావీణ్యం గడించారు. వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడాన్ని బాగా ఇష్టపడేవారు. తమిళం పై పట్టు సాధించినప్పటికీ,తెలుగు భాషపై ఉన్న అభిమానంతో అచ్చమైన తెలుగులో మాట్లాడేవారు. తప్పనిసరైతే తప్ప సంభాషణల్లో ఆంగ్ల పదాలను వాడేవారు కాదు.
ప్రతీ వాక్యంలో హాస్యాన్ని గుప్పిస్తూ, సులభ శైలిలో రచించిన ‘అత్తగారి కథలు’ అనే రచన పేరు ప్రఖ్యాతల్ని మాత్రమే కాకుండా, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. వ్యక్తిగత జీవితంలోని పార్శ్వాలను, చలనచిత్ర ప్రస్థానాన్ని ఉటంకిస్తూ వ్రాసిన ‘నాలో నేను ‘ అనే స్వీయ రచన 1994లో జాతీయ బహుమతిని అందించింది.
చలనచిత్రాలకు దర్శకత్వం వహించడం వారిలోని ఆత్మవిశ్వాసానికి, సాహసానికి ప్రతీకగా పరిగణించవచ్చు. ప్రతీ చిత్రంలోను ఒక త్యాగరాయ కీర్తన, ఒక జావళి ఉండటాన్ని ఇష్టపడేవారు. చలన చిత్రాల్లో స్త్రీకి సముచిత స్థానం కల్పించేవారు.
1953లో నిర్మించిన ‘చండీరాణి ‘తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన తొలి తెలుగు మహిళా దర్శకురాలి చలనచిత్రంగా రికార్డుల కెక్కింది.
తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ ఐన వీరిని1996లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్ వరించింది.

ఇల్లిందుల సరస్వతి
ప్రముఖ తెలుగు కథా రచయిత్రిగా వాసికెక్కిన వీరు స్వయంకృషితో హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు సాధించి, జర్నలిజంలో డిప్లమా పొందారు. 250 కథలు, 5 నవలలు,5 వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, రేడియో నాటకాలు రచించారు. వివిధ భాషల్లోంచి అనువాదాలు చేసి, కథాసంకలనాలు వెలువరించారు. బాల సాహిత్యంలో రచనలు చేసి, చక్కటి గుర్తింపును పొందారు.
ముత్యాల మనసు, కల్యాణ కల్పవల్లి, మనం – మన ఆహారం (అనువాదం), రాజహంసలు స్వర్ణకమలాలు, భారతనారి – నాడూ నేడూ వంటి విశిష్ట రచనలు చేశారు.
1934లో హైదరాబాద్ మహానగరంలో ఎల్లాప్రగడ సీతాకుమారి గారితో కలిసి ‘ఆంధ్ర యువతి మండలి’ని స్థాపించి, దానికి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకుగాను మూడు సంవత్సరాల పాటు జైలు విజిటర్ గా సేవలందించారు. కేంద్ర రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రిగా రికార్డుల కెక్కారు. ‘స్వర్ణకమలాలు’ కథా సంకలనానికిగాను 1982లో ఈ అవార్డు వీరిని వరించింది.
1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి నలంకరించారు.

తురగా జానకీరాణి
ప్రముఖ తెలుగు రచయిత్రి, సంఘ సేవకురాలైన వీరు 1975 లో ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినది మొదలు పలు సవాళ్లు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో అలుపెరుగని పోరు సలిపారు. వీరు ఉద్యోగంలో చేరే నాటికి దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నది. ఆ గడ్డుకాలంలో ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను ప్రజలకు చేరవేయడాన్ని, వారిని చైతన్య పరచడాన్ని సవాలుగా స్వీకరించారు. వారిలోని అంకితభావం, నిబద్దతలపై స్పష్టమైన అవగాహన ఉన్న పై అధికారులు, వారి నిర్ణయాలను ఆమోదించి, వాటిని అమలు పరిచే విధానంలో పూర్తి స్వేచ్చ నిచ్చేవారు. ప్రణాళిక, నిర్వహణ, ప్రదర్శన అనే ఈ మూడు అంశాలు దృఢంగా ఉంటే ఏ కార్యక్రమంలోనైనా చక్కగా రాణించవచ్చని చెబుతారు.
100 పైగా కథలు (3 సంపుటాలు),3 నవలలు, 5 బాల సాహిత్య గ్రంథాలు, 3 అనువాద రచనలు చేశారు. రేడియో పాటలు, నాటికలు, రూపకాలు రచించి, వాటిని పిల్లలతో ప్రదర్శింపజేసి, రేడియో అక్కయ్యగా అందరి ప్రేమను చూరగొన్నారు. సభా ప్రసంగాలు, సాధారణంగా మైక్ పట్ల ఉండే జంకును పోగొట్టి, చక్కని వక్తలుగా మలచడానికి ‘బాలానందం’కార్యక్రమాన్ని బలమైన వేదికగా ఎంచుకున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలోనే వీరిలోని సంఘసంస్కర్త మేల్కొన్నారు. బాలల హక్కులు, బాలల సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. UNICEF, NCRT, బాల జాగృతి (బాజా), ప్రభుత్వ శాఖల సమన్వయంతో 670 వీథి ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఇది నా సమస్య’ అనే స్త్రీల కార్యక్రమాన్ని, వృద్ధులకు సంబంధించి ‘స్రవంతి’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వాటి ద్వారా వారి సాదకబాధకాలను తెలుసుకుని, పరిష్కరించేవారు. పంచాయితీలలోని మహిళలను సంఘటిత పరిచి, ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ద్వారా వారికి విద్యనందించడమే గా కుండా, వారిలోనే రచనా శక్తిని జాగృత పరిచేవారు.’మా చేతి పంపు – మా బిందె నింపు’ అనే సామాజిక అవగాహనా కార్యక్రమానికి చక్కని స్పందన లభించింది.
వీరి వెలలేని సేవలకు గాను గృహలక్ష్మి స్వర్ణ కంకణం, బాల సాహిత్య రత్న, బాలబంధు, ఈనాడు, ఆంధ్ర సారస్వత పరిషత్ లో పరిణిత వాణి, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (2 సార్లు), రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వరించాయి. 1994లో IBPS సహాయ దర్శకురాలి (అసిస్టెంట్ డైరెక్టర్) గా పదవీ విరమణ చేశారు.

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు
రచయిత్రిగా, పండితురాలిగా, పరిశోధకురాలిగా, ఉపన్యాసకురాలిగా ప్రఖ్యాతి గాంచిన వీరు, కృష్ణకుమారి అనే పేరుతో ‘భారతి ‘ మాస పత్రికలో రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. వ్యాసం, గేయం, వచన కవిత, ఖండకావ్యం, చారిత్రక పరిశోధన వంటి పలు ప్రక్రియల్లో పాండిత్యం గడించారు. 10 సంవత్సరాల వయసులోనే వేదికలెక్కి ఉపన్యసిస్తూ, ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను ప్రేరేపించేవారు. 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి కవిత్వం, నృత్యం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటి కళల్లో నైపుణ్యం సంపాదించారు. విజయవాడ, మద్రాసు రేడియో కేంద్రాలలో వీరి రచనలు, ప్రసంగాలు తరచుగా ప్రసారమవుతూ ఉండేది. 18 వ. ఏట ‘ఉభయ భాషా ప్రవీణ ‘పట్టా పొందారు.
కోరల మధ్యన కోటి స్వర్గాలు, లజ్జ కిరీట ధారిణి, చీకటిరాజ్యం, దేవి స్తవతారావళి, మన సాహితి – మధుర భారతి, కనకమ్మ నివాళి, మహిళా విక్రమ సూక్తము, ఆంధ్ర కవయిత్రులు వంటి రచనలు అఖిల భారత కవయిత్రిగా గుర్తింపు నిచ్చాయి. చంద్రమతి కథ, యుగళ సిరి అనేవి వీరి అముద్రిత రచనలు. వాగ్గేయకారులు, పదాలు, జావళీలు,తత్వాలు, సంకీర్తనలపై సునిశిత పరిశీలనాశక్తితో ‘ఆంధ్ర కీర్తన వాంగ్మయ సేవ ‘ అనే గ్రంథాన్ని రచించారు. ఆకాశవాణిలో లలిత, భక్తి గీతాల ప్రసారంలో గణనీయమైన పాత్ర పోషించారు. 1968లో ‘కథామందారం ‘ అనే సంకలనాన్ని ప్రచురించారు. తెలుగు మొలక, విద్వత్కవయిత్రి, ఆంధ్ర విదుషీ కుమారి, ఆంధ్రసరస్వతి, కవయిత్రీతిలక, సాహితీరుద్రమ, కళాప్రపూర్ణ వంటి పలు బిరుదులను పొందారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణం అవార్డు పొందారు. కనకాభిషేకం, పౌర సన్మానం, గజారోహణం వంటి ఘన సన్మానాలు పొందిన ఆధునిక తెలుగు కవయిత్రిగా వాసికెక్కారు.

తెన్నేటి హేమలతగారు
రెండు పదులు కూడా నిండని వయసులోనే రచనకు శ్రీకారం చుట్టిన జానకి రమాకృష్ణవేణి వివాహానంతరం తెన్నేటి హేమలతగా పేరు మార్చుకుని పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.5 వ. తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చదివినప్పటికీ, జిజ్ఞాస కారణంగా తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషలపై పట్టు సాధించారు.70,80 దశకాల్లో వీరి రచనలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
1955లో విజయవాడ ఆకాశవాణి కేంద్ర అనౌన్సర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వీరు, పలు రేడియో నాటకాలు, సినిమాల్లో నటించి, మాటలు వ్రాయడం మొదలుపెట్టారు. ‘శిలా హృదయం’పేరుతో వీరు రచించిన మొదటి రేడియో నాటకం 1952లో డక్కన్ రేడియోలో ప్రసారమైంది. సంగీతాన్ని అమితంగా ఆరాధించే వీరు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిపై ఉన్న అభిమానంతో వారు స్వరపరచిన కొన్ని రాగాలకు చక్కని సాహిత్యాన్ని అందించారు.
100 కథలు,105 నవలలు, 700 రేడియో నాటకాలు, 10 రంగస్థల నాటకాలు,5 సాహిత్య వ్యాసంపుటాలు, 2 సాహిత్య విమర్శనా సంపుటాలు, ‘లత వ్యాసాలు’ పేరుతో సంపుటి, ‘చరిత్ర కందని ప్రేమ కథలు’ అనే కవితా సంపుటుల వెలువరించారు.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన ‘రామాయణ విషవృక్షం’ నవలను విమర్శిస్తూ ‘రామాయణ విషవృక్ష ఖండన’ రచించారు. హైదరాబాద్ 6 వ. నిజాం నవాబైన మీర్మఖ్బూల్ అలీఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ప్రియతముడు ‘ అనే నవలను రచించారు. పాంచాలి,ఎడారి పువ్వులు, మహానగరంలో స్త్రీ, రక్తపంకం, మోహనవంశీ, గాలి పడగలు – నీటి బుడగలు, అంతరంగ చిత్రం వంటి రచనలు చేశారు. ‘గాలి పడగలు – నీటి బుడగలు’ నవలలో వేశ్యల దుర్భర జీవితాలను చిత్రీకరించడంతో పలు విమర్శలు ఎదురైనప్పటికీ, ఏమాత్రం జడవకుండా ‘రక్తపంకం’ లో వారి దైన్యాన్ని మరింత లోతుగా అక్షరబద్ధం చేశారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించాననీ, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సందర్భాలు లేకపోలేదని చెబుతారు. మోహనవంశీ, అంతరంగ చిత్రం నవలల్లో వీరికి జీవితానికి సంబంధించిన పలు విషయాలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఘట్టి ఆంజనేయ శర్మగారు ‘సాహితీలత’ అనే పేరుతో వీరి జీవిత చరిత్రను వ్రాశారు.
1963 లో గృహలక్ష్మి స్వర్ణకంకణం, 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలక్షణ మహిళా పురస్కారం వీరిని వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 20 సంవత్సరాల పాటు వీరు తమ విశిష్ట సేవలను అందించారు.
సామాజిక చైతన్యానికి ఆయువుపట్టైన రచనా వ్యాసంగాన్ని కొనసాగించే కవులు, రచయితలు అప్పుడూ,ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటారు. వారు తమ రచనల ద్వారా గొప్ప కార్యక్రమాలకు పునాదులు వేయకపోయినా, దృఢమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టక పోయినా పరవాలేదు. ఎక్కడో, ఏ మారుమూలో ఒక నిస్సహాయుడి కంటి వెలుగై, ఒక నిరుపేద ఇంట చిరుదీపం వెలిగించ గలిగితే చాలు. ఆ రచన సార్థకం. ఆ రచయిత జన్మ ధన్యం.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కొత్త కొత్తగా ఉగాదిలోకి ….

by Shyama Dasi March 19, 2026
written by Shyama Dasi

ఉదయం లేవగానే మంచి మాట వింటే ఎలా ఉంటుంది? నచ్చిన వాళ్ళ పిలుపు , హృదయానికి హత్తుకునే సంగీతం లా ఉంటుంది కదా! అందుకే మనకిష్టమైన పండుగ శుభాకాంక్షలు అందరికీ చెబుతామూ, కోరుకుంటాము. పండుగల రోజు దేవుడిని , ప్రకృతి మాత నూ పలకరించి, పులకరిస్తాం!! ధన్యవాదాలు కూడా తెలుపుతాం . మరి ఇప్పుడు ఆ పండుగ ఏంటి దాని పరమార్థం ఏమిటో పునశ్చరణ చేసుకుందాం . అంటే రివైజ్ చేసుకుందాం.. రివ్యూ చేసుకుందాం….

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. యుగాది అని కూడా అంటారు యుగ అనగా కాలమని ఆది అంటే ఆరంభం అని, ఉ -అంటే నక్షత్రం, గ- అంటే గమనం, నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాము అని కూడా చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యవతార రూపంలో వెళ్లి సోమకారుణ్ణి వధించి వేదాలను బ్రహ్మకు అప్పచెప్పాడట. బ్రహ్మదేవుడు ఈ రోజే సృష్టికార్యం ప్రారంభించినాడని పురాణ వాక్యం. తెలుగు వారు ఎక్కువగా చంద్రమానం అనుసరించి మొదటి నెల చైత్రమాసం కనుక ఈ మాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది జరుపుకుంటారు. ఇంగ్లీష్ నెలలు ప్రకారం మార్చి నెల అవుతుంది .
కొత్త సంవత్సరం అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మారుతుంది. అమెరికా న్యూ ఇయర్ జనవరి 1, అలాగే చైనా ఫిబ్రవరి న్యూ ఇయర్. నోవరేజ్ మార్చ్ లో, ఇథోపియా సెప్టెంబర్ లో న్యూ ఇయర్ జరుపుకుంటుంది ( వీరి క్యాలెండర్లో 13 నెలలు ఉండడం విశేషం ).
మనదేశంలో గుజరాత్ అక్టోబర్, నవంబర్లో, బెంగాలీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ ఇంచుమించు మార్చి ఏప్రిల్ నెలల్లోనే వివిధ రకాల పేర్లతో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు.
మన కొత్త సంవత్సరాదిలో మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో భాగంగా అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు సారే పెట్టి పంపుతారు మళ్ళీ అలాగే ఇంచుమించు అంతే ఘనంగా ఉగాది సారే పెట్టి అత్తవారింటి నుండి అమ్మాయిని అల్లుడిని సంవత్సరాది పండుగకు తీసుకువస్తారు.
సూర్యోదయానికి ముందే లేచి వాకిళ్లలో ముగ్గులు వేసి, గడపలకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతారు. మామిడి తోరణాలతో అలంకరిస్తారుఏ పండుగకైనా ఇది ఆరంభం, ఆనవాయితీ. పండుగ అంటేనే మలినాన్ని తొలగించే పవిత్రత,శుభ్రత. మన ఇల్లు వాకిళ్లలోకి భగవంతుని ఆహ్వానించడమే గాక మనందరి గుండె గుడిలో కొలువై ఉన్న దైవాన్ని మనం పలకరించుకోవడమే పండుగల పరమార్థమని మన పెద్దలు నేర్పుతూ వచ్చిన మన సంస్కృతి. పదిమందితో కలిసి పండుగ సంబరాన్ని పంచుకోవడమే పండుగల ఉద్దేశ్యం కూడా.
వసంత ఋతువు రాకతో ప్రకృతి అంతా పచ్చదనాన్ని నింపుకుంటుంది. మావిచిగుళ్ళు తింటూ మత్తెక్కిన కోయిల రాగాలు మనసును ఉల్లాస పరిస్తే, రుచులు కోరుకునే నాలుక షడ్రుచుల,నా స్వాదిస్తూ, శరీరానికి కావలసిన నూతన శక్తి నిస్తుంది.
వసంత ఋతువు వెంట రాబోయే కాలం గ్రీష్మ ఋతువు కాబట్టి, ఉష్ణం ఎక్కువయ్యి శరీర వ్యాధులు పెరుగుతాయి. వందలఏళ్ళ క్రితం మనుషులు తయారు చేసే కృత్రిమ మందులు లేవు. ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపదపైనే మనుషులు ఆధారపడ్డారు. అందుకే వృక్షాలను ఓషధులు అని కూడా అంటారు. వేపకు శరీరానికి వేడి తగ్గించే రోగ నిరోధక శక్తి ఉన్నట్లే, బెల్లo నుండి రక్తపుష్టి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. పెద్దమ్మ, ఆటలమ్మలకు వేపతోనే వైద్యం చేసే వాళ్ళు. ఏ సమయంలో ఏ ఉపద్రవం వస్తుందోనని మన అవసరాలకు ప్రకృతి ముందే అన్నీ ఏర్పాట్లు చేసి మనల్ని కాపాడుతుంది. అందుకే ప్రకృతిని మనం నిర్వీర్యం చేస్తే మన అమ్మను మనం చంపుకున్నట్టే, అంతకంటే నీచం లేదు.
లోకంలో ఉన్నవి ఆరు రుచులే, వేప -చేదు గుణాన్ని కలిగి శరీరానికి చలువనిస్తుంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుండి మంచిని గ్రహించమంటుంది. అలాగే ఉప్పు- రుచిని ఉత్సాహాన్నిస్తుంది., చింతపండు -నేర్పరి తనాన్ని, మామిడి- సవాళ్లను ఎదుర్కొనే శక్తిని, కారం -సహనాన్ని నేర్పుతాయి.
ఉగాది మనకు ప్రకృతి జ్ఞానం ఇస్తుంది,శారీరక జ్ఞానం, ఒక ప్రతీకాత్మక జ్ఞానం ఇస్తుంది, భావోద్వేగ జ్ఞానాన్ని ఇస్తుంది, ఇన్ని మర్మాలు ఒక్క ఉగాది పచ్చడి ద్వారా మనకు తెలుస్తున్నాయి. అందుకే ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో మెచ్చుకోలుకు పొంగిపోక, విమర్శలకు కృంగిపోక, అయోమయ స్థితిలో పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని, షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి సందేశాన్ని, సాధనంగా పెద్దలు పిల్లలకు అందించాలి. నిజమైన విద్య స్కూలు, కాలేజీల్లో కాదు మన ఇంటి సంప్రదాయంలో ఉన్నది, ఈ తత్వం తెలుసుకోవడంలో ఉన్నది.

కొత్త బెల్లం,కొత్త చింతపండు, వేప పువ్వు, మామిడికాయలు ఉప్పు, కారం ( మిరియాలు). ఇవన్నీ కొత్త పంటలుగా ఉగాది నాటికి వస్తాయి. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు, చిడిముడులకు ప్రతీ కగా సమభావంతో స్వీకరించాలన్న భావంతో ఉగాది పచ్చడి భగవంతునికి నివేదించి అందరూ తప్పక తింటారు. భగవంతునికి పూజ నైవేద్యాలు అనంతరం దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం చేస్తారు. వారి వారి జన్మ నక్షత్రాలను బట్టి రాసులు ఉంటాయి. ఏ ఏ రాశి వారికి ఆ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎంత ఉంటాయి, గ్రహదోషాలు, దేశ పరిస్థితులు ఇవన్నీ పంచాంగ శ్రవణంలో వివరిస్తారు. ఇంగ్లీష్ నెలలు అందరికీ అనుకూలంగా, ప్రభుత్వ కార్యాలయాలు, మిగిలిన వ్యవహారాలలో మన నిత్య విధులలో కూడా అలవాటైనప్పటికీ, మన పండుగలు, వివాహాది శుభకార్యాలు, ప్రయాణాలు, అవి ఇవి అని ఏమిటి ? సకల శుభకార్యాల ముహూర్తాలు తిధి వార నక్షత్రాలను అనుసరించే మనం జరుపుకుంటాము. ఆ సంవత్సరం ఏ పంటలకు అనుకూలము అనేది కూడా పల్లెల్లో చూస్తారు. ఆ పంటలే ప్రముఖంగా వేస్తారు కూడా, కొత్త పనులకు ఈరోజు శుభారంభంగా తలుస్తారు. ఊర్లలో సాయంత్రాలు తప్పనిసరిగా దేవుడి ఊరేగింపు ఉంటుంది. ఆరోజు స్వామి దేవాలయం నుండి బయటకు వచ్చి రాని వారిని,రాలేని వారిని కూడా అనుగ్రహించి దీవిస్తాడు. చల్లని చూపుల స్వామి పాడిపంటలతో పల్లె సుఖశాంతులతో ఉండాలని, పర్యవేక్షణకు వస్తాడని అందరి నమ్మకం.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ఎన్నుకున్న రంగంలోనే యువత కృషి చేయాలి, అలసత్వం ఉండకూడదు- తాటి కొండలరావు

by రంగరాజు పద్మజ March 19, 2026
written by రంగరాజు పద్మజ

తాటి కొండాల నరసింహారావు గారితో మయూఖ ప్రతినిధి రంగరాజు జరిపిన ముఖాముఖి

సమాజాన్ని రంగస్థలం మీద మలచిన వ్యక్తి…వ్యక్తి కాదు ప్రవాహం…. రంగస్థలం; పుస్తకాల రచన… పత్రికా సంపాదకత్వం… అన్నీ కలిసిన విశిష్ఠమైన బహుముఖీన ప్రజ్ఞాశాలులు…వారెవరో కాదు! గౌరవనీయ శ్రీ తాటికొండాల నరసింహారావు గారు… వారితో ముచ్చటించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుందాం! ఇంకా ఆలస్యం ఎందుకు? సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
నాపేరు రంగరాజు పద్మజ. నాకు కూడా నాటక రంగమంటే అంతులేని మక్కువ… బాల్యంలో పాఠశాల వార్షికోత్సవ సందర్భంగానూ, సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగాను నాటకం వేసి, ఆనందించిన నేను ఈరోజు గొప్ప రంగస్థల కళాకారులతో సంభాషించడం ఎంతో సంతోషంగా ఉంది…. పరిచయమే అక్కరలేని బహుముఖ ప్రజ్ఞాశాలులైన తాటికొండాల నర్సింహారావుగారిని మన మయూఖ పత్రిక పక్షాన వారిని పరిచయం చేసుకుందాము….

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ !

తాటికొండాల నర్సింహారావుగారు:– నమస్కారమమ్మా!

తాటికొండలరావుగారితో రంగరాజు పద్మజ

పద్మజ : వ్యక్తిత్వం… ప్రస్థానంగా మీ జీవిత ప్రయాణం నిర్వచిస్తారా?

నర్సింహారావు:– నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణాజిల్లాలో 1943లో జన్మించాను. కొద్ది కాలం అక్కడ ఉన్న తర్వాత, నా చదువు సజావుగా సాగలేదు! ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రం మా ఊర్లో నాలుగవ తరగతి వరకు చదివాను. తర్వాత మా మేనత్త గారి ఊరు నెమలి అనే గ్రామంలో తిరువూరు తాలూకాలో ఉంది, అక్కడకు వెళ్లి పంచ కావ్యాలు, అమర కోశం మా మేనత్త మరిదిగారు నాకు నేర్పించారు. సంస్కృతం చదువుకొని ఎంట్రన్స్ పాస్ అయ్యాను. వాళ్లే ఒక ఉత్తరం రాసిచ్చారు హైదరాబాదులోని ఆల్వాల్ లో వేదాంతవర్ధిని కళాశాల సంస్కృత కాలేజీ ఉన్నది. అక్కడికి వెళితే నన్ను కాలేజీలో చేర్చుకున్నారు. అప్పుడు నాకు శ్రీ రవ్వ శ్రీహరి గారు మొదలైన వారు నా సహాధ్యాయులు…
BOL చదివాను. తరువాత మా నాన్న గారు ఏం చేసారంటే సంస్కృతం వద్దురా ! అంటే మళ్ళీ సంస్కృతంలోనే చదువుతున్నావని… కేకలేసి తీసుకొని వెళ్లి SGBT (ఎస్జీబీటీ) లో చేర్పించారు. అక్కడ పరీక్షలు ఏమీ లేవు. విద్యార్థులకు స్టైఫండ్ ఇచ్చేవారు. నెలకు 35 రూపాయలు వాటితోనే నా ఖర్చులు చేసుకునే వాడిని. యాజమాన్యం నా చేత ఒక బాండ్ రాయించుకున్నారు. నేను నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేస్తాను అని, మధ్యలో ఎక్కడికి వెళ్ళను… అని అలా బాండ్ రాసిస్తేనే నాకు ట్రైనింగ్ ఇచ్చారు. దాని ప్రకారం హై స్కూల్ ప్రైమరీ టీచర్ గా ఉద్యోగంలో చేరాను. జగ్గయ్యపేట ముక్త్యాలరాజా గారి ఆస్థానం లో చేరాను. ఆయన కృష్ణాజిల్లా బోర్డు సెలక్షన్ కమిటీ మెంబర్… తన దగ్గర నన్ను వేయించుకున్నారు. రెండు సంవత్సరాల అక్కడ పని చేశాను.
ఆయనకు నాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ముక్కు సూటిగా వెళ్లే వ్యక్తిత్వం నాది! ఆయనతో తేడా వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాను. మా నాన్నగారు అదేమిటి అంత పెద్ద రాజా గారి దగ్గర ఉద్యోగం వదిలి రావడం ఏమిటని? కేకలేశారు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఎవరిస్తాడని మందలించారు. బాధపడ్డారు.
“నాకు భయపడాల్సిన అవసరం లేదు! నాన్నా! అన్నాను. అప్పుడు మా స్నేహితుడు ఖమ్మంలో జిల్లా పరిషత్తులో పనిచేసేవాడు. ఆయన ఇప్పిస్తానన్నాడు. ఖమ్మం వెళ్ళాను. అక్కడ జలగం కొండలరావు జిల్లా పరిషత్తు చైర్మన్ ఆయన దగ్గరకు పోయాను. నా స్నేహితుడు పరిచయం చేసి ఉద్యోగం కావాలి అన్నాడు… అంటే ఆయన ఏమన్నాడంటే సంస్కృతం చదివావు- ఎస్జి బి టి చదివావు… ఎస్జీబీటీ ఉద్యోగాలు ఇక్కడ లేవు! సంస్కృతం పాఠశాలలు లేవు… నీకు ఉద్యోగం ఎలా ఇవ్వాలి? అని అన్నాడు. మా స్నేహితుడు ఎలాగైనా ఇవ్వండి సార్! అని బతిమిలాడాడు. అక్కడ సూర్యనారాయణ గారని సెక్షన్ హెడ్ ఉండేవారు. ఆయన కాస్త చొరవ చేసుకొని” ఏదో ఒకటి ఇవ్వండి! తాత్కాలికంగా ఆ పని చేస్తాడు. ఎక్వైర్ చేసుకోమని చెప్పండి!” అని అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే సబ్జెక్టు కండిషన్ తెలుగు విశారద- తెలుగు డివోఎల్- ఏదేని చదవాలని కండిషన్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. నేను జాయిన్ కావడానికి వెళ్ళి రాజేశ్వరపురంలో జాయిన్ అయ్యాను. నాకు తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ నైజాం రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే ముల్కీ సర్టిఫికెట్ కావాలి! ముల్కీ అంటే ఈ ప్రాంతంలో పుట్టినట్టు సర్టిఫికెట్ ఉండాలి. మరి నా దగ్గర లేదు! నెలకాగానే అందరికీ జీతాలు ఇచ్చారు. నాకు ఇవ్వలేదు!
హెడ్మాస్టర్ గారితో అదేమిటి సార్ నేను పని చేశాను కదా? అన్నాను.
నీకు తెలిసే మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు తెలియదు. నువ్వు ముల్కీ సర్టిఫికెట్ దాఖలు చేస్తేనే నీకు జీతం వస్తుంది అన్నాడు లేకపోతే రాదు! అన్నాడు. ఎవరు ఇస్తారని అడిగాను.
“సర్పంచ్ ఇప్పిస్తాడు” అన్నాడు. ఇంతలో పరీక్షలు జరిగే సమయం వచ్చింది, తరువాత సెలవులు వచ్చాయి. నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. ఇంటికి వెళ్ళిపోయాను. సెలవులు అయిపోయి పాఠశాల తెరవగానే మళ్ళీ వచ్చాను. అప్పుడు ఆయనొక ఉద్యోగం ఇప్పించాడు. ఈ మధ్యన ఏమైందంటే సెలవుల్లో ఊరికే కూర్చోకుండా ఒక ఫిలిం రిప్రెసెంటేటివ్ గా పని చేశాను. అప్పుడు ఫిలిం రీల్స్ తీసుకొని సెంటర్ కి వెళ్ళాలి, ఎక్కడ రిలీజ్ అయితే అక్కడకి… అక్కడ కలెక్షన్ చూసుకొని తీసుకుని ఉదయమే వెళ్లి డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు పంపించాలి. అలా కొన్ని రోజులు పని చేశాను. కేవీ రెడ్డి గారితో పరిచయమైంది. కేవీ రెడ్డి గారు సినిమా కథా చర్చలు చేసేవారు. నా చేతిరాత బాగుంటుందని నువ్వు ఇక్కడే ఉండవయ్యా! అని నీకు రెప్రెజెంట్ వద్దు! ఏమీ వద్దు! మేము చెబుతున్నట్టు నువ్వు రాసేయమని ఆయన తన దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు జగదేక వీరుడు కథ చర్చ జరుగుతున్నది. కొన్ని రోజులు స్టోరీ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. అప్పటికే నాకు పెళ్లయింది, ఒక అబ్బాయి పుట్టాడు. నేను అక్కడ- నా భార్య ఇక్కడ! కుదరడం లేదు! ఈ డబ్బులు ఉంటాయో? ఉండవో? సంసారం గడవాలి కదా! ఇది స్థిరమైన ఉద్యోగం కాదని, మానేసి మళ్ళీ ఖమ్మం వచ్చాను.
ఇక వచ్చావు కదా రెగ్యులర్ జాబు నీకు ఇప్పిస్తా అన్నారు సత్యనారాయణ గారు. 1968 లో అంటే నాకు 25వ ఏట ఉద్యోగంలో గ్రేడ్ సెకండ్ తెలుగు పండిట్ గా చేరాను. జీతం 70-100 స్కేలు. తర్వాత దూరవిద్యలో తెలుగు ఎమ్ ఏ (Telugu MA) చేశాను. సంస్కృతంలో MA చేశాను. DOL ఉన్నా కూడా బీఈడీ ( Bed)చేశాను. Med చేయలేదు. అప్పుడు జీవితం అనేది ఒక గాడిన పడింది.

పద్మజ :- రంగస్థలం- సాహిత్యం -క్రీడలు- సంపాదకత్వం… ఈ విభిన్న రంగాలలోకి మిమ్మల్ని నడిపించిన మూల ప్రేరణ ఏమిటి?

నరసింహారావు:– నాటక రంగంలో నా అడుగు హై స్కూల్ లోనే పడింది. అది ఎలా అంటే మా పాఠశాల వార్షికోత్సవం రోజున అప్పటికి నాకు ఇంకా 12 సంవత్సరాలే… మా సోషల్ మాస్టర్ గారు కన్నయ్యశాస్త్రి గారని ఉండేవారు. వారేమన్నారంటే “మన పాఠశాలకు DEO గారు వస్తున్నారు. మనం వార్షికోత్సవానికి ఏదైనా ఒక నాటకం వేయాలి! అని ఒక నాటకం ఎంపిక చేసుకున్నారు. అప్పుడు నాకు జులపాల జుట్టు ఉండేది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కథ కాబూలీవాల కథను నాటకీకరణ చేశారు. ఆ కాబూలి వాలాలో చిన్నవాడిని కనుక (మినీ యాక్సెంచర్) ఆడపిల్ల వేషం వేయించారు. ఆ నాటకానికి చాలా ప్రశంసలు వచ్చాయి. సార్ నాతో “అరేయ్ నువ్వు వృద్ధిలోకి వస్తావురా! నువ్వు నటన నేర్చుకో” అని అన్నారు మాస్టారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాను.
మా పెద్దన్నయ్య గారు రచయిత అప్పారావు గారు ఆయన కూడా ఉపాధ్యాయులే! ఆయన తాను స్వంతంగా ఒక నాటకం రాసి, అందులో సర్పంచ్ పాత్రను నన్ను వేయమని నాకు ఇచ్చారు. ఆ నాటక ఇతివృత్తం ఒక పాఠశాలను ఎలా నడిపించాలని…
ఆ రకంగా నాటక రంగంలో ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ సంస్కృత కళాశాలలో చేరిన తర్వాత అంతర్ కళాశాల పోటీలు జరిగాయి. ఆ రోజుల్లో ఆంధ్రాభ్యుదయ ఉత్తరాలు జరిగేవి. వేరే వేరే పాఠశాలల నుండి నాటకాలను ఆహ్వానించేవారు. ఉభయ రాష్ట్రాలలో ఉన్న కాలేజీలలోని విద్యార్థులు అందరికీ కూడా ఆయా నాటకాలకు ప్రథమ,ద్వితీయ, తృతీయ, బహుమతులు ఇచ్చేవారు. ఆ విధంగా నేను సంస్కృత కళాశాలలో చదువుతున్నాను కాబట్టి, ఆ కాలేజీ తరపున వచ్చాము. అయితే తెలుగు నాటకం వేయాలని స్వప్న సీమ అనే నాటకం తీసుకుని వేయాలనుకున్నాము. దాంట్లో ప్రత్యేకత ఏమిటంటే మైమ్ (myme ) యాక్షన్ చేయాలి! ఆ పాత్ర పాప్ సింగర్! ఒక హార్మోనియం పట్టుకొని పాట పాడుతుంటాడు కదా? ఆ నాటకం వేసే సమయానికి మాకు ఎక్కడా హార్మోనియం దొరకలేదు! స్టేజి మీదకి వచ్చాను ఏం చేయాలో ?అర్థం కాలేదు! బాగా ఆలోచించాను. ఎలాగో డైలాగులు చెబుతున్నట్టు…
మైమ్ యాక్షన్ చేశాను. అప్పుడు న్యాయనిర్ణేతలుగా వచ్చిన వారు ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్; అలాగే మల్లీశ్వరి చిత్రదర్శకులు బి.యన్ రెడ్డి గారు. 1957 లో వారిద్దరి చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నాను. దాంతో నాలో ఉత్సాహం పెరిగింది. తర్వాత మా కాలేజీలోనే సంస్కృత మాధ్యమంలో ( డైలాగ్లన్నీ సంస్కృతంలోనే ఉంటాయి.) అలా మృచ్ఛకటికము, ముద్రారాక్షసము,అనే వాటిల్లో మంచి పాత్రలు వేసాను.
మా గురువుగారు వేదాల తిరువేంగళాచార్యులు గారు. మాకు అలంకార శాస్త్రం బోధించేవారు. ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. రేడియోలో ప్రోగ్రాం ఇచ్చాను. అప్పుడు కథలు చదవాను. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారంచేసారు.
BOL అయిపోయాక మధుర దగ్గర మహాదేవపురం అక్కడ ఉద్యోగంలో గ్రేడ్ 2 తెలుగు పండిట్ గా ఉద్యోగంలో చేరాను. పాఠశాలలో ఏ కార్యక్రమాలైనా తెలుగు టీచరే ఆ పని చేయాలి! అంటే సాంస్కృతిక ఉత్సవాలైనా సరే లైబ్రరీ ఇన్చార్జి గాని వాటికి సంబంధించిన పనులన్నీ తెలుగు టీచర్ గా నేనే చేసే వాడిని .సోషల్ మాస్టర్ నాకే అప్ప చెప్పేవారు. అలా పిల్లలతో నాటకాలు వేయించడం, నేను వేయడం, అలా కొడాలి గోపాల్ రావు గారి నాటకాలను, గొల్లపూడి మారుతీ రావు గారి నాటకాలను, ఇలా అన్నిటిని వేసేవాడిని. ఏ పాఠశాలకు వెళ్లిన నేనే పిల్లల చేత నాటకాలు వేయించడం జరిగింది.
ఒక విషయం ఏమిటంటే పందిళ్ళపల్లిలో 1974 నుండి 84 వరకు అక్కడ పనిచేసాను. అక్కడ కూడా నాటకాలు వేయిస్తూ ఉండేవాడిని. ఆ స్కూల్ కు సరైన వస్తు సామాగ్రి లేదు! వాటిని సమకూర్చుకొనేందుకు నేనే ఒక నాటకం రాసి, భారతంలో సీత అని పేరు పెట్టి రాసుకొని, బాగా ప్రాక్టీస్ చేయించి, చుట్టుపక్కల ఊళ్ళల్లో ప్రదర్శింపజేసి, ఆ రోజుల్లోనే 15000/రూ.లు నాటకాల ద్వారా వసూలు చేసే స్కూల్ డొనేట్ చేశాను. అంటే బెనిఫిట్ షో అన్న మాట!
అలా ఊరికి నాకు విడదీయలేని సంబంధం ఏర్పడింది. నాకు వేరే ఊరికి బదిలీ అయినా కూడా ఆ ఊరి వాళ్ళు నన్ను వెళ్ళనీయకుండా ఆ గ్రామంలోనే ఉండమన్నారు. ఆ తర్వాతేమైందంటే? అక్కడి నుండి వెళ్ళక తప్పలేదు!
ఒకాయన నన్ను వాళ్ళ ఊరికి రమ్మన్నారు. ఆయనకు మా ఊళ్ళో బంధువులున్నారు. నాకోసం ఇల్లు వసతులు ఏర్పాటు చేసారు. మా శ్రీమతిని తీసుకొని వెళదామనుకున్నాను కానీ ఇంకొక ఆయన పెద్ద పైరవీ చేసి నన్ను రాఘవపురం అనే ఊరికి రమ్మని పిలిపించుకున్నారు. పాత ఆర్డర్ క్యాన్సిల్ చేసి రాఘవపురానికి ఆర్డర్ ఇచ్చారు. నేను సర్దుకుని పోదాం అనుకున్నంతలో ఇలా జరిగింది. ఇలా ఎందుకు చేసారు? అని అడిగితే నీవు వెళ్లి ఓ ఐదు నెలలు అక్కడ ఉండి చూడు! నువ్వు అక్కడ ఉండలేక పోతే నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయిస్తానన్నాడు. ఎందుకంటే? ఆరోజుల్లో సర్పంచ్ లకు బదిలీ చేయించే ఇన్ ఫ్లుయన్స్ ఉండేది. సర్పంచ్ అడిగితే తబాద్ లా చేసేవారు. అలా బురద రాఘవాపురం వెళ్లాను.
నేను ఎక్కడికిపోయినా ప్రయాణ సౌకర్యాలు ఉండకపోయేవి. ఎక్కడికి వెళితే ఆ ఊర్లోనే కాపురం పెట్టాల్సిందే. అలా ఆ ఊరి ప్రజలతో మమేకమైపోయేవాడిని. అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాడిని. అక్కడ ఒక సత్యేంద్ర కుమార్ అనే సినిమా నటుడుండేవాడు. ఆయన తెలంగాణ నుండి మొట్టమొదటి రాష్ట్రపతి అవార్డు అందుకున్న నటుడు. ఊరుమ్మడి బ్రతుకులు అనే సినిమాలో ఆయన నటించారు. ఆయనతో కలిసి నాటకాలు వేసే వాడిని. ఆయన మాతో పాటు ఉండేవారు. నాకు ప్రమోషన్ రాలేదు. అదే గ్రేడ్ 2 తెలుగు పండిట్ గానే చేసాను. నేను మొదలు చేరినప్పుడు నా జీతం- 50 జీతం వచ్చినప్పుడు ఎలా ఉన్నానో? పదివేల జీతం తీసుకున్నప్పుడు కూడా అలానే ఉన్నాను నేను పదవి విరమణ పొందినప్పుడు నా జీతం పదివేల, ఐదువందల రూపాయలు. నేను 26 సంవత్సరాలయింది పదవి విరమణ పొంది… తర్వాత పిల్లలందరూ చదువుతూ ఉంటే వారితో పాటు కలిసి నేను డిగ్రీ చేసాను.
మా అమ్మాయితో పాటు సంస్కృత పరీక్ష రాసాను. మా అబ్బాయితో మరో పరీక్ష రాసాను. నిరంతరం చదవడం పరీక్షలు రాయడమో, నాటకాలు రాయడమో? చేస్తుంటాను. రిటైర్ అయిన తర్వాత బి.ఎడ్ కాలేజీ వారు నన్ను పిలిపించుకున్నారు. తర్వాత డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసాను. అలా జీవితం ఒక గాడిలో పడిపోయింది.
2001లో పదవి విరమణ పొందాను. అప్పటినుండి రచన వ్యాసంగంలోకి వచ్చాను. ఈ మధ్య ఖమ్మంలో నాటక సమాజం ఏర్పాటు చేసి ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ 20 సంవత్సరాలుగా సంస్థ నడుపుతున్నాను. దానికి డైరెక్టర్,ఫౌండర్, నిర్మాతను అన్నీ నేనే. జిల్లాలోని నటీనటులంతా నా అసోసియేషన్లో ఉన్నారు. అలా నాటకాలు రాస్తూ…. వేస్తూ…. ఉన్నాను.
నా సహ ఉపాధ్యాయుడు ప్రసాద్ బాబు అని అతను కూడా ఉపాధ్యాయుడు. మేమిద్దరం కలిసి, నాటకాలు రాయడం మొదలుపెట్టాము. మేము ఇద్దరం కలిసి రాసిన నాటకం ఏదైనా సరే నంది బహుమతి పొందాల్సిందే! దానికి ప్రత్యామ్నాయము అన్నది లేదు. ఆ రకంగా నాలుగైదు నాటకాలు రాసాను. వాటికి నంది బహుమతులు వచ్చాయి. రచయితగా, దర్శకుడిగా, నటుడుగా బహుమతులు అందుకున్నాను. ఒక్క నంది బహుమతే కాకుండా… పెద్దపెద్ద సంస్థలు సన్మానాలు, అవార్డులు, గరుడ అవార్డు, ఆలా లెక్కకు మించి అవార్డులు వచ్చాయి. అలా ఈ రచన వ్యాసంగంలో కౌసల్య సుప్రజా రామా అనే నవల మామూలుగా రామాయణం అందరూ రాముడు పుట్టిన దగ్గర నుండి చదువుతారు. బాలకాండలో దశరధుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తే రాముడు పుడతాడు. అక్కడినుండి బాలకాండ ప్రారంభమవుతుంది.. కానీ రాముడు పుట్టకముందు నుండే నేను రాసాను. దశరధుడికి కౌసల్యతో వివాహం ఎలా అయింది ?అసలు కౌసల్య ఎవరు? కైకమ్మ ఎవరు ? సుమిత్ర ఎవరు? ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈ ముగ్గురిని? అనే విషయాన్ని తీసుకొని రాసాను. దాన్ని నాటకంగా ప్రదర్శించాము. తిరుపతిలో బుర్రా సుబ్రహ్మణ్యం గారి కుమారులు తెనాలి వీణ అవార్డ్స్ నెలకొల్పి, మా చేత నాటకం వేయించారు.
ఆ తర్వాత మా అబ్బాయి చక్కని కవితలు వంశీకృష్ణ అనే పేరుతో రాస్తాడు. మంచి రచయిత! తెలంగాణ నాటక రంగ చరిత్ర రాసినప్పుడు దీన్ని నేను Mphill కోసం రాద్దామనుకున్నాను. రాయడం కష్టమని అందరూ అన్నారు. అయినా కూడా రాసినాను! తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ఇచ్చారు.
నేను రాసిన పుస్తకాలకు అవార్డులు వచ్చాయి. ఖమ్మం కథా సుధ రాసినప్పుడు కూడా తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మొదటి పుస్తకం ఇది. తెలంగాణ గొప్పతనం నిండి ఉంది కాబట్టి, ఖమ్మం జిల్లా గురించి రాద్దామనుకున్నవాడిని ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిందో తెలంగాణ నాటక రంగ చరిత్ర రాసాను. ఖమ్మం జిల్లాలో ఉన్న కథా రచయితలందరి సమగ్ర జీవితం రాశాను. అలాగే ఖమ్మం కవులు ఎందరున్నారో దాశరధి గారు, హరి భట్టు గారి- దగ్గర నుండి (13వ శతాబ్దం నుండి ) ఖమ్మం లో ఉన్న కవులందరి చరిత్ర రాసాను. ఈ రకమైన రచనలు చేయడం, మిగతా జిల్లాల వారికి మార్గదర్శకుడిగా నన్ను తీసుకొని, తెలంగాణ ఫోరం నెలకొల్పారు. దాంతో నాకు సంబంధం లేదు. వాళ్లు జిల్లాల ప్రకారం రాయలేదు! తెలంగాణ మొత్తం తీసుకున్నారు. నేను జిల్లాను యూనిట్ గా తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన వారందరూ జిల్లాను యూనిట్ గా తీసుకొని, వాళ్ల జిల్లాలో కవులు, వారి రచనల గురించి కథలు, నాటకాలు, కవితలు, వారు రాయడం జరిగింది. అదే ఒరవడిలో అన్ని జిల్లాల చరిత్రను రాయించారు. అందులో ఖమ్మం జిల్లా చరిత్రను, భద్రాద్రి జిల్లా చరిత్రను కూడా నేనే రాశాను. కావూరి పాపయ్య శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన తాను రాస్తానని పేరు ఇచ్చారు. ఆయన కొంత కాలం రాసి చనిపోయారు. తరువాత నేనే దాన్ని పూర్తి చేశాను. ఇలా ఖమ్మం జిల్లా సంబంధించిన సాహిత్య సర్వస్వం నా దగ్గర ఉంది. ఏదైనా సరే నా దగ్గర అనధికారికంగా 20 మంది విద్యార్థులు ఎంపీహెచ్డీలు చేశారు.

పద్మజగారికి పుస్తకాల బహూకరణ

పద్మజ: మీరు పత్ర సమర్పణలు చేసే అవకాశం ఎలా వచ్చింది? ఏ అంశాలతో సమర్పించారు?

నరసింహారావు గారు:– యూనివర్సిటీ వారు సెమినార్ జరిపినప్పుడు నాటక రంగం మీద పత్ర సమర్పణ చేయమని అన్నారు. దాని మీదనే పత్ర సమర్పణ చేసాను. తెలుగు యూనివర్సిటీలోనూ నాటక రంగ అనే అంశం మీద సమర్పించాను.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఖమ్మం జిల్లా నాటకరంగం అనే అంశంతో పత్ర సమర్పణ చేసాను.
నాగార్జున యూనివర్సిటీ నల్లగొండలోనూ పత్ర సమర్పణ చేసాను. ఇలా అన్ని యూనివర్సిటీలలో చేసాను.
ఉమ్మడి జిల్లా పద సాహిత్యం మీద ఒక పత్ర సమర్పణ చేసాను. ఇలా వైవిధ్యమైన అంశాలతో పత్ర సమర్పణలు చేసాను.

పద్మజ:— ధార్మిక ఉపన్యాసాలు చేసారని విన్నాను. అది ఎలా జరిగింది?

నరసింహారావు:— మా దగ్గర రామకృష్ణ మిషన్, గాయత్రి సేవా సమితి ఉంది. వీటిల్లో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోను, పండగలప్పుడు, వసంత నవరాత్రులలో, దుర్గా నవరాత్రులలో, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ప్రసంగించే అవకాశం వచ్చింది. రామాయణ, భారత, భాగవతాల, మీద బ్రహ్మాండ పురాణాల మీద ఉపన్యాసాలు చేసాను. పరిషత్తుల ద్వారా కూడా ప్రసంగించాను.

పద్మజ:– ఒకేసారి మీరు… మీ అబ్బాయి నంది అవార్డులు తీసుకున్నారు కదా! ఆ సందర్భం ఎలా వచ్చింది?

నరసింహారావు:– 2017 సంవత్సరంలో నేను చాణుక్య-చంద్రగుప్త అనే నాటకం ప్రదర్శించాము. నాకు తృతీయ బహుమతి వచ్చింది. అదే సమయంలో సినిమా గురించి రాసిన పుస్తకానికి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. మా అబ్బాయి మంచి రచయిత అని చెప్పాను కదా! ఆ సంవత్సరమే 25 th ఫ్రేమ్ అని ఒక పుస్తకం రాశాడు. సినిమాకు సంబంధించిన ఆ పుస్తకానికి అబ్బాయికి అవార్డు వచ్చింది. నాటకం ప్రదర్శించినందుకు నాకు నంది అవార్డు వచ్చింది. అలా ఇద్దరం ఒకేసారి అవార్డులు అందుకున్నాము. అది ఒక రికార్డు అని అందరూ ప్రశంసించారు. ఈ రకంగా కల్చరల్ అంటే నాటకాలు మొదట స్పురిస్తాయి. అందుకే నాటక రంగ చరిత్ర రాసిన… అందులోను నాకు దర్శకత్వ శాఖలోనూ నాదైన నైపుణ్యం సంపాదించుకున్నాను. దానికి రుజువే నూరు- నూటా యాభై మంది నటీనటులతో దర్శకత్వం నిర్వహించాను. వాళ్ళందరూ స్వంతంగా నాటక ప్రదర్శనలిస్తున్నారు.

పద్మజ:– బాల్యం-లేదా- యవ్వనంలో అత్యంత ప్రభావం చూపెట్టిన సంఘటన ఏదైనా ఉందా?

నరసింహారావు:— అత్యంత ప్రభావం చూపెట్టిన సంఘటన అయితే మటుకు కచ్చితంగా సంస్కృత కాలేజీలో చదివిన కాలమే! అదొక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. కారణమేమిటంటే సంస్కృతం అందరూ మృత భాష అని చెప్పుకున్నప్పటికీ, నాకు అన్నం పెట్టింది సంస్కృత భాషనే! నేను ఉద్యోగంలో చేరినప్పుడు కూడా నాకు నా సంస్కృతాన్ని చూసిన తర్వాతనే తెలుగు బోధన చేయగలరు అని ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి నా ఉద్యోగానికి మూలం అదే కదా! అంతేకాకుండా లోకజ్ఞానం నేర్పేటటువంటిది సంస్కృత భాష అని నా ఉద్దేశ్యం. మామూలు లౌకిక సంబంధమైన పాఠశాలల్లో సిలబస్ కు సంబంధించినవే చెప్తారు. కానీ సంస్కృత గ్రంథాలలో సమాజాన్ని మార్చే శక్తి ఉంది. వాటిల్లో ఇప్పుడున్న రచయితల వలె వర్ణ,వర్గ విచక్షణలు ఉండవు. అప్పుడు భాష అంటే ఎవరికైనా భాషే! అంటే భాషా పరమైన జాతి తప్ప ఇతర భేదభావాలుండకపోయేవి. క్రమశిక్షణ నేర్పడానికి మూలభాష సంస్కృతమే! కుటుంబ సంబంధాలను అంటే కుమారుడిని ఎలా చూడాలి? కూతురును ఎలా చూడాలి? ఇవన్నీ ప్రాచీన గ్రంథాలలో రాసిపెట్టారు. అవార్డుల కోసం మనం రాయకూడదు! నేను జ్ఞాన సముపార్జనకోసమే చదువుకున్నాను. దానితో పాటు కుటుంబాన్ని పోషించుకునే శక్తి కూడా సరస్వతి దేవి నాకు కల్పించింది. ఇది అత్యంత ప్రభావం చూపే సంఘటన. నాటకానికి సంబంధించినదైతే అదే సమయంలోనే బి.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహం అందడంలో నా నాటక జీవితానికి మలుపు తిరిగింది. అది మరో మరచిపోని సంఘటన.
తర్వాత ఇంకొకటి ఏమిటంటే మా శ్రీమతి భ్రమరాంబ! ఆమె నా జీవితంలో ప్రవేశించిన తరువాతనే నాకు ఒక స్థిరత్వం ఏర్పడింది. అంతకు ముందు అటు మద్రాసు ఇటు హైదరాబాదు తిరిగేవాడిని. పొద్దున ఒక ఊరు సాయంత్రానికి మరో ఊరు వెళ్లడం జరిగేది! అలా కాకుండా పిల్లలను ఎలా పెంచాలని ఆమె సలహా సంప్రదింపులతోనే పెంచగలిగాను. ఐదుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేసి, వారికి పురుళ్ళు, పుణ్యాలు చేసి, చదువులు ఇవన్నీ ఆమె సహకారంతోనే అని నేను చేయగలిగానని అనుకుంటాను. ఆమెకు అనుకోకుండా క్యాన్సర్ వచ్చి మరణించింది. ఆమె స్మారకంగా ఒక అవార్డు ఇస్తున్నాము. మూడు సంవత్సరాల నుండి మొదటగా ఆచార్య ఎన్ గోపి గారికి, ప్రసేన్ అనే రచయితకు, పోయిన సంవత్సరం శ్రీ ఏనుగు నర్సింహా రెడ్డిగారికి అందజేశాము.
ఇప్పుడు నా సర్కిల్ లో ఎందరో ఉన్నారు కాబట్టి ఆమె పేరు మీద అవార్డు ఇస్తున్నాము.

పద్మజ:– ఈ అవార్డు ఇస్తూ మహిళగా మీ శ్రీమతి గారికి ఒక ఉన్నత స్థానం కల్పించడం మీ హృదయ ఔన్నత్యాన్ని తెలుపుతున్నది. మీకు మరో మారు అబినందనలు. మరి బాలసాహిత్యంలో మీ కృషి ఎలా సాగింది?

నరసింహారావు:— బాలసాహిత్యంలో నేను కొంత వెనుక పడ్డాను అనే చెప్పాలి! ప్రత్యేకంగా రాయకపోయినా కొంత కృషి చేశాను. బాలసాహిత్యం ప్రచురణలు చేయలేదుకానీ, పిల్లలచేత కథలు, కవితలు రాయించాను, నాటకాలు వేయించాను ఇలా రాయాలని…రాసే పద్ధతి వారికి నేర్పించాను. పిల్లలు నాటకాలు రాసినప్పుడు బోధకుడిగా వెళ్లాను.

పద్మజ:– ప్రపంచ మహాసభల్లో మీ కృషి గురించి వివరించండి?

నరసింహారావు:– మహాసభలలో కవి సమ్మేళనానికి ఆహ్వానించారు… అంతేకానీ, నాకు పెద్దగా ప్రత్యేకతలు ఏమి ఇవ్వలేదు. తిరుపతిలో ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు నాకు ఒక సెక్షన్ అప్పచెప్పారు. దాన్ని చక్కగా నిర్వహించాను. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అకాడమీ వారు నన్ను అందులో చేర్చుకున్నారు. నేను ఖమ్మంలో ఉండేవాడిని కాబట్టి నాకు అంతగా ప్రాధాన్యత లేదు. ఖమ్మం నుండి ఇక్కడికి వచ్చి చేయలేం కదా?

పద్మజ:– మాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే? నాటకారంగం- అటు సాహిత్యం… జోడు గుర్రాల వలె నడుపుతున్నారు. మరి క్రీడారంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? దాని వెనుక ప్రేరణ ఏమిటి?

నరసింహారావు:–క్రీడారంగం నాకు చాలా ఇష్టమైనదే! హై స్కూల్లో చదివేటప్పుడు నాకు అంతగా క్రీడల్లో ప్రవేశం లేదు కానీ, నేను ఉద్యోగంలో చేరిన తర్వాత పందిళ్ళ పల్లెలో స్థిరపడినప్పుడు ఒక చదరంగా అసోసియేషన్ ఉంది. మా మిత్రుడు చదరంగం ఆడే వాడు. చదరంగం బోర్డు ముందర పెట్టుకొని చూస్తూ ఉండేవాడు. దీన్ని ఎలా ఆడతారు? అని అడిగాను. “మీరు ఆడతారా సార్” అనడిగాడు. ఆడతానని అన్నాను. ప్రాథమిక సూత్రాల చెప్పాడు. పావుల గురించి తెలిపాడు. వాటి నడకలు వాటిని ఎలా అరికట్టవచ్చు అని, అది విన్నాక నాకు ఈ ఆట నేర్చుకుంటే బాగుంటుంది కదా? అనే ఆలోచన వచ్చింది. అలా నేర్చుకున్నాను.
ఖమ్మం జిల్లా చదరంగ సంఘానికి మార్కండేయుడు అనే అతను అధ్యక్షుడుగా ఉన్నాడు.
కొంతకాలం తర్వాత నేను పోటీలో పాల్గొనే వాడిని. చిన్నచిన్న బహుమతులు వచ్చేవి. అలా ఒక సంవత్సరం జరిగిన తర్వాత ఆ సంఘంలో చీలిక ఏర్పడింది. చీలిక వచ్చినప్పుడు “నరసింహ రావు గారూ! మీరు అధ్యక్షులుగా ఉండండి” అని అన్నారు. నేనేదో చిన్నగా నాటకాలు రాసుకుంటాను. అలాంటిది ఒక సంస్థను నడపడం అంటే కష్టం అన్నాను. వారంతా పట్టు పట్టి అధ్యక్షుడిగా ఉండాల్సిందేనని బలవంత పెట్టారు.
చదరంగంలో ఉన్న ఆసక్తితో బాగానే కృషి చేశాను. అది నాకు రెండు విధాల ఉపయోగపడుతుందని పించింది. ఒకటి మేథస్సు అభివృద్ధి చెందుతుంది, మానసిక ఉల్లాసం ఇవ్వడమైతే మరొకటి జీవితాలకు చదరంగాన్ని అన్వయించుకోవచ్చు అని అర్థమైంది. ఎందుకంటే? ఆటగాడు ఎదుటివాడు ఎలాంటి వేస్తాడో తెలుసుకోవాలి! నేను ఊహించినట్టు ఎదుటివాడు ఎత్తు వేస్తాడా? లేక ఊహించనిది వేస్తాడా? నేను వేసిన ఎత్తు ఒకవేళ విఫలమవుతుందనుకున్న పక్షంలో ఏమైనా విరుగుడు ఉన్నాయా? ఏ రకంగా ఎదుటి వాడికి చెక్ పెట్టగలుగుతాను?
పద్యం:-
చదరంగంబున నేనతి చతురుండబంటు చేత కట్టించెద… అనే పద్యం ఉంది.
చతురంగంలో నేను అతి చతురడను… బంటు చేత రాజును కట్టించేద!
అంటే ఒక బంటుకు రాజును కదలకుండా చేసాడంటే ఇంత సైన్యమున్న రాజు బంటు చేత చిక్కడమంటే ఎలా బంధించగలుగుతాడు? ఈ పద్యం
నాకు నచ్చింది. ఒక బంటు చేత రాజును చెక్ పెట్టించే బంటున్నాడంటే మన జీవితంలో మనకు చెక్ పెట్టగలిగే వాడిని మనం చెక్ పెట్టగలగాలి! చదరంగం ఆటలో ఉన్న విశేషం ఏమిటంటే? ఈ ఆటను బాగా ఆడగలిగినవాడు జీవితంలో జయిస్తాడు. ఎందుకంటే నేను ఈ పని చేస్తే అవతలివాడు ఏమనుకుంటాడు? నేను అనుకుంటున్నాట్టు వాడు అనుకుంటున్నాడా? లేదా ఇంకో రకంగా అనుకుంటే నేనేం చేయాలి? నేను చేసే పని అందరికీ నచ్చాలని లేదుగా! కాబట్టి నేను చేసిన పని అవతల వాడికి నచ్చాలంటే నేనేం చేయాలి? లేదా వాడిని అధిగమించాలంటే.. వాడు వేసే ఎత్తలను నాలుగు రకాలుగా ఊహించాలి! అందుకు ఆసక్తితో నేర్చుకొని జిల్లా మొత్తం మీద 30 అసోసియేషన్ సంఘాలను ఏర్పాటు చేశాను. అలా చదరంగ క్రీడను ఎందరితో పరిచయం చేసి, అందులో నిష్ణాతులను చేసాను. కొంత కాలానికి ఇతర పనులు ఎక్కువై దానికి సమయం కేటాయించలేకపోయాను వదిలేసాను.

తాటి కొండలరావుగారి రచనలు

పద్మజ:— యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సమాజం కానీ ప్రభుత్వం కానీ ఏం చేయాలంటారు?

నరసింహారావుగారు :— యువతకు ఏ క్రీడల పట్ల ఆసక్తి ఉందో గమనించి, దాన్ని అటు తల్లి తండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు టోర్నమెంట్స్ మొదలైన ఖర్చుకు సంబంధించి, ప్రభుత్వం ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే యువతనే ఏదైనా సాధించాలి! యువత ముందుకు రానిది ఎవరు ఏమి చేయలేరు. ఉద్యోగం అవకాశం కల్పించాలి అలాగే వాళ్ళకి చదరంగం పట్ల అవగాహన కల్పించాలి! అందుకు చదరంగం ఆటలాగానే కాదు జీవితంలో ఎలా నడుచుకోవాలో ఆటను అలా మలుచుకోవాలని చెప్పాలి! జీవితమే ఒక చదరంగం అందులో మనం పావులమని ఒక కవి చెప్పారు కదా! అందుకని నాయకులు, తల్లిదండ్రులు అందరూ కలిసి చేయాల్సిందేమిటంటే ప్రోత్సహించాలి! ఏ ఆటలో నైనా ఆటగాడు ఎదుటి జట్టును ఓడించి, తాను గెలవాలి అనుకుంటాడు కదా! అలా వారి వారి అనుభవాన్ని బట్టి తమ పరిధిలో ఉన్న యువకులను జీవితాలు ఎలా తీర్చిదిద్దుతారో అలా క్రీడలలో అలా తీర్చిదిద్దాలి! అలా తోడ్పడుతుంది క్రీడారంగం విజయ పరంపరలో కొనసాగుతున్న క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో ఆటలలో ఎదిగారు! ఎదుగుతున్నారు.. ప్రతి ఆటలోను గెలిచి రికార్డు సృష్టించిన వారందరూ యువ క్రీడాకారులకు స్ఫూర్తి దాయకులే కాబట్టి, సమాజం యువకులను పరిశీలిస్తున్నది. యువత జాగ్రత్తగా ఉంటూ తనకిష్టమైన రంగంలో అది కవిగా కానీ, రాజకీయనాయకుడు కానీ, క్రీడాకారులు కానీ ఏదైనా సరే ఎదగడానికి ప్రయత్నించాలి !ఎందరో తనను పరిశీలిస్తున్నారు నేనెన్నుకున్న రంగంలో మాత్రం కృషి చేయడంలో అలసత్వం ఉండకూడదు! అని యువత అనుకోవాలి. అప్పుడే విజయం సాధించవచ్చు లేకపోతే రాదు! అందుకని నేను అనేది ఏమిటంటే అవగాహన కలిగి ఉండాలి.

పద్మజ:– కళాకారుడు సమాజానికి అద్దమా? లేక దారి దీపమా?

నరసింహారావు:–కళాకరుడు సమాజానికి దారి దీపం. అద్దమైతే కాదు! ఎందుకంటే అద్దం అంటే ఎవరో చేసినదే తాను చేసినట్టు, అద్దం చూస్తే ఎవరి ముఖం వారికే కనపడుతుంది. అలా కాదు! దారి చూపెట్టాలి! దారి దీపంగా ఉన్నప్పుడే కళాకారుడు తను ముందుకు నడుస్తూ తెలియని వారికి దారి చూపిస్తూ వారందరినీ గమ్యం చేర్చాలి.

పద్మజ:- మీరు సాధించాలనుకున్నవి ఇంకా కలలేమైనా ఉన్నాయా?

నరసింహారావు:– మనిషనే వాడికి ఆశ ఎప్పుడూ ఉంటుంది. ఆశా జీవులం కదా! ఉన్నాయి. ఆశాయా బద్దతే లోకః కుసుమ సదృశః అన్నాడు కాళిదాసు. ఒక పువ్వుకు తొడిమ ఎలా ఉంటుందో? మనిషికి ఆశ అలాంటిది. తొడిమె లేని పువ్వు ఉండదు కదా! మనిషి జీవితం కూడా అంతే! ఆశాబద్ధయే లోకా ఈ లోకమంతా కూడా ఆశాదీపాలతో నిండి ఉంది. ఆశతోనే మనుషులు జీవిస్తున్నారు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కావాలనుకుంటాడు…. వంద రూపాయలు ఉన్నవాడు వెయ్యి రూపాయలు కావాలనుకుంటాడు… అందుకే నీతి శాస్త్ర కారుడిలా అన్నాడు కోరికలకు అంతులేదు పువ్వును నిలిపి ఉంచడానికి తొలిమె ఎలా ఉంటుందో అలా ఆశ మనిషిని నిలబెడుతుంది. ఆశ అనేది లేకపోతే జీవితం ఉండదు ఎలా అయితే తొడిమ లేకపోతే పువ్వు రాలిపోయినట్టుగా….

పద్మజ:— భవిష్యత్తులో మీ లక్ష్యాలు ఏమిటి?

నరసింహారావు:– నాకు సంబంధచినంత వరకు నా లక్ష్యం ఒకటే!నా పరిధిలో ఉన్నంతవరకు యువతను జాగృతి చేయడం, సమాజానికి ఒక మార్గదర్శకం నిలబెట్టడం అనేది నా లక్ష్యం….

పద్మజ :— మీ జీవితాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉందా? లేక ఇంకా ఏదో చేయలేదని వెలితి ఏమైనా మిగిలి ఉందా?

నరసింహారావు:– నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే? ఇప్పటి వరకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు లభించాయి. అనుకూలవతి ఐన భార్య, అనుకూలంగా ఉండే బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు. ప్రేమించే మనుమలు- మనుమరాండ్లు ఉన్నారు. ఇంత మంది సమాజంలోని స్నేహితులు నన్ను గౌరవంగా చూస్తారు. పరిచయస్తులేకాదు.. అపరిచితులు కూడా అపారమైన ప్రేమను పంచుతారు కాబట్టి నాకు ఆశించేది ఏదీ లేదు.

పద్మజ:— మయూఖ పత్రికకు ఈ ముఖాముఖి ద్వారా పాఠకులకు మీ అమూల్యమైన సందేశం ఇవ్వండి.

నరసింహారావు:– ఏ పత్రికైనా సమాజానికి ఉపయోగపడాలి! పడడమే! కావాలి!

పద్మజ:– అంటే ఏ కోణంలో అంటారు?

నరసింహారావు:– పత్రికలోని అంశాలతో మంచి పౌరులుగా తయారు చేయాలి. ప్రలోభాలకు లోను కాకూడద నే హెచ్చరికలుండాలి. సాహితీవేత్తలను పరిచయం చేస్తున్నది చాలా సంతోషం! సాహితీ సేకరణ పత్రిక చేస్తున్నది… అంతటితో సరిపోదు! స్వార్థం లేకుండా ఎవరు ఉండరు గానీ, అతిగా ఉండకూడదు ఒకరు మన దగ్గరకు వచ్చారంటే మనతోని వాడికి అవసరం ఉన్నట్టే… నేను మీతో మాట్లాడుతున్నానంటే అందుకు తగిన మేలు ఏదో నేను కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కదా? అలా కాకుండా ఏమి ఆశించకుండా సాగాలి.

సంతోషమండీ నమస్కారం మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇంతవరకు ఎన్నో విషయాలు సమగ్రంగా చెప్పారు అందుకు అనేక ధన్యవాదములు.

“తాటికొండాల నర్సింహా రావుగారూ… మీ మాటల్లో మేము కేవలం జ్ఞాపకాలను మాత్రమే వినలేదు; ఒక యుగపు స్పందనను అనుభవించాము. రంగస్థల వెలుగుల్లో మెరిసిన కళాకారుడిని, సాహిత్య పుటల్లో నిలిచిన రచయితను, క్రీడాస్ఫూర్తిని నాటిన మార్గదర్శిని, సంపాదకత్వంతో విలువలను కాపాడిన సంస్కృతి సేవకుడిని—ఈరోజు ఒకే వేదికపై దర్శించుకున్నాం. మీ ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు; అది కృషి, కట్టుబాటు, కళాప్రేమలకు ప్రతీక. మీరు నడిచిన దారిలో వెలిగిన దీపాలు ఇంకా ఎన్నో మనసులను వెలిగించాలి.
‘మయూఖ ముఖాముఖి’కి మీరు అందించిన ఈ ఆలోచనల కాంతి మా హృదయాల్లో నిలిచిపోతుంది. మీ సృజనయాత్ర నిరంతరం కొనసాగాలని, మీ ప్రేరణ తరతరాలకు ప్రసరించాలని మనసారా ఆకాంక్షిస్తూ… మీతో ముఖాముఖి చేయాలనుకుంటున్నామని అడిగితే సహృదయతతో మీ ఇంటికి ఆహ్వానించి,చక్కని సంభాషణలతో సమగ్రంగా మీరిచ్చిన సమాచారం మా మయూఖ పాఠకులకెంతో ఉపయోగమండీ! అందుకు గాను గాఢమైన కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాం.”

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అన్నిరంగాల్లో రాణించిన ప్రజ్ఞాపారీణుడు ప్రయాగ నరసింహశాస్త్రి

by Achyutuni Rajasri March 19, 2026
written by Achyutuni Rajasri

( ఆయనను గూర్చిన సమాచారం అందించిన వారు కుమార్తె వేదవతి గారికి కృతజ్ఞతలతో)

సినిమాలు టి.వి.ఛానల్స్ లేని కాలంలో ప్రజలహృదయాల్ని దోచుకున్న ఏకైక సాధనం రేడియో అదే ఆకాశవాణి.ఆరోజుల్లో అందులో పనిచేసిన హేమాహేమీలు కాలగర్భంలో కల్సిపోయినా వారి వాక్చాతుర్యం గళమాధుర్యం కొందరికి మాత్రమే గుర్తు.నేటి యువత కి అస్సలు తెలీదు.ఆనాటివారికి జీతభత్యాలు అంతగాలేవు. పని ఎక్కువ. కానీ ఆనాటి కళాకారులవల్లనే ఆకాశవాణి బ్రతికి బట్టకట్టింది. అలాంటి ఆల్ రౌండర్ సంగీత సాహిత్య వేత్త,నవరసాలు గళంలో పలికించిన అమరగాయకుడు, నటుడు,హాస్యంతో ఆకట్టుకున్న ప్రయాగవారిని గూర్చి విధంగా విహంగావలోకనం చేస్తాను.కొండను అద్దంలో చూపే ప్రయత్నం నాది.

20నవంబర్ 1909లో విశాఖపట్నం సమీపంలోని పెదగాడిలో పుట్టారు.6_7ఏళ్ల పిల్లాడిగా గొంతెత్తి పాడి అందర్నీ ముగ్ధుల్ని చేసిన ప్రయాగవారు 11సెప్టెంబర్ 1983లో హృద్రోగంతో పరమపదించారు.ఐదో ఏటనుంచి ఆటపాటలతో మొదలైన ఆయన జీవితం74 వ ఏటకూడా కష్టాల్ని పక్కకు నెట్టి స్వాతంత్య్రోద్యమం పాటలతో పెరిగి ఆంధ్ర బాలానందసంఘంలో మొద్దబ్బాయి గా ఎదిగారు.తన కంచుకంఠంతో బుర్రకథ హరికథ పిట్టకథ బావగారి కబుర్లతో ఆకాశవాణిలో వెలిగారు.మైకులేకున్నా సంగీతం నేర్వకున్నా ధన్యాసి, తోడి వంటి రాగాల్లో తనదైన ముద్ర వేశారు.పల్లెపదాలు జానపదాలు ఆయన గొంతులో ఊపిరిపోసుకున్నాయి.1969లో ఆకాశవాణిలో రిటైరైనాక పెన్షన్ లేని కాలం కాబట్టి సంపాదన కోసం మద్రాసు వెళ్లారు.సినీరంగంలో రాణించారు.1971_76దాకా ఫీల్డ్ పబ్లిసిటీ ప్రోగ్రాంలలో హరికథ బుర్రకథలద్వారా జనాల్లో చైతన్యం కల్గించారు.తిరుమల తిరుపతి కళాపీఠం నెలకొల్పినపుడు జానపదకళారూపాల ప్రయోక్త గా చెక్క భజనలు, సంప్రదాయ భక్తిగీతాలు నేర్పారు.1977లో మద్రాస్ ఆకాశవాణి ఈయనని సన్మానించింది పుంభావసరస్వతి అని కొనియాడింది.1975లో ప్రపంచ తెలుగుమహాసభ గౌరవించింది.చింతా దీక్షితులు గారు ప్రశంసిస్తూ లేఖరాశారు”నాయనా! నీనయగరాజలపాతం వాగ్ధాటికి జోహార్లు”.
విజయవాడలో ఇళ్లు కాలిబూడిదైతే ప్రభుత్వం డబ్బుసాయం చేసింది.కానీపంపిణీచేసేవారు అక్రమంగా డబ్బునొక్కేస్తుంటే వినోదాలవీరయ్యగా ఆగుట్టంతా బైట పెట్టారు ప్రయాగవారు.కలెక్టర్ ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకోవటం జరిగింది.
శ్రీప్రయాగవారు1939_56వరకు మద్రాస్ ఆకాశవాణిలో పనిచేశారు.1956లో విజయవాడ గ్రామస్థుల కార్యక్రమ ప్రయోక్త గా ఆయన చేసిన ప్రోగ్రాంలు జనాల గుండెల్ని తట్టిలేపాయి.
ఆయన సినిమారంగంలో కూడా రాణించారు.చిత్తూరు నాగయ్య సినిమా త్యాగయ్య లో ప్రథమశిష్యుడు గణపతివేషం వేశారు.1970_74మధ్య అందాల రాముడు,చీకటి చీకటివెలుగులు, డబ్బుకులోకం దాసోహం ,ఒకే కుటుంబం,కొత్త కాపురం,కొత్త దేవదాసు చిత్రాల్లో నటించారు.మద్రాస్ ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో ఆనాటి సినిమాలకు అనుగుణమైన జానపదగేయాలు ,సినిమా బ్యాక్ గ్రౌండ్ గా బుర్ర కథలు రాసి పాడారు.ముగ్గురు మరాఠీలు బాలరాజు,బాలనాగమ్మ, శ్రీలక్ష్మమ్మ, మనోహర మొదలైన సినిమాలకు పాటలు రాసి పాడి నటించిన ఆల్ రౌండర్ ప్రయాగవారు.70_80బుర్రకథలు రాశారు.హెచ్.ఎం.వి.గ్రాంఫోన్ కంపెనీవారు 36డిస్కులు రిలీజ్ చేశారు.శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారి స్ఫూర్తి ప్రోత్సాహంతో ఆయన సంగీత సాహిత్యాలలోకి అడుగుపెట్టారు. యక్షగానాల్లో సూత్ర ధారిగా ఆయన వాచికం నభూతో నభవిష్యతి. ఆయన పాడిన పాటలు” మేలుకొనుడీ భరతపుత్రుడా,మాకొద్దీ తెల్లదొర తనం,కల్లు మానండోయ్” మొదలైన పాటలు ఇంటింట పాడుకునేలాచేశారు.అంధభిక్షువుగా తెల్లగుడ్డు మాత్రమే కనిపించేలా ఆయన చేసిన నటన నభూతో నభవిష్యతి. 1939లో రేడియోలో ఆయన కి లభించింది కేవలం 5రూపాయలు మాత్రమే!బావగారి కబుర్లు రేడియోలో వస్తుంటే ఆనాడు ప్రతిపార్కులో వినపడి జనం చెవియొగ్గి వినేవారు. ఎస్.వరలక్ష్మి టంగుటూరి సూర్య కుమారి మొదలైన వారికి పాటలు నేర్పిన ఘనాపాటి!
1977లోమద్రాస్ ఆకాశవాణి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారిని,ప్రయాగ నరసింహశాస్త్రి గారిని,ఆనాటి స్టేషన్ డైరెక్టర్ని సన్మానించటం ఓవిశేషం ప్రత్యేకత గూడా!
శ్రీప్రయాగ నర్సింహ్మ శాస్త్రిగారి తల్లి దండ్రులు శ్రీమతి సత్యనారాయణమ్మ శ్రీ వెంకట రమణయ్య గార్లు .కలెక్టర్ ఆఫీసులో తండ్రి పనిచేశారు.దురదృష్టవశాత్తు 35వ ఏటనే రమణయ్య గారు చనిపోయేటప్పటికి ప్రయాగ వారికి 14 ఏళ్లు.ఏకైక కుమారునిగా ఆయన తల్లిశిక్షణలో పెరిగి బి.ఎ.పాసైనారు.రేడియో కళాకారునిగా ఆయన జీవితం ధన్యం !!

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక విందు

by ఒద్దిరాజు మురళీధరంరావు March 19, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక చెరువు దగ్గరలో ఒక కొంగ మరియు దానికి దగ్గరలోని అడవిలో ఒక నక్క ఉండేవి. అవి మనమిద్దరం దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కదా, కాబట్టి మనం ఒకరికొకరం పిలిచి విందు చేసుకుందాం అని అనుకున్నాయి. మొదటగా నక్క విందుకు పిలిచింది. ఎంతో మర్యాదగా నక్క కొంగను తన ఇంటికి పిలిచి ఒక ప్లేటులో రుచిగల పదార్థాలు పెట్టి ఇక తినుమని ప్రేమతో కోరింది. కొంగ తన పొడుగు మూతితో ఎక్కువగా తినలేకపోయింది. కానీ నక్క మాత్రం గబగబా తినేసింది.

తర్వాత రోజు కొంగ తగిన విధంగా మర్యాద చేయాలనుకుంది. ఎంతో మర్యాదగా నక్కను కొంగ తనింటికి విందుకు పిలిచింది. ఒక టేబుల్ మీద ఒక సన్నమూతి కూజాలో పాయసం పోసి నక్కను తినమని కోరింది. కొంగ తన సన్నని పొడవైన మెడతో కూజాలో మూతిపెట్టి పాయసం మొత్తం తినేసింది. కానీ నక్క ఆ కూజాలో మూతి పెట్టలేక టేబుల్ చుట్టూ తిరిగి తిరిగి కొంచెం కూడా పాయసం తినలేకపోయింది. ఈ విధంగా కొంగ, నక్కకు సరైన గుణపాఠం నేర్పింది.

ఇదే అవి ఒకరికొకరు విందుకు ఆహ్వానించడం చివరిసారి అయ్యింది.

నీవు ఇతరులకు ఎలా మర్యాద చేస్తావో, అదే తీరు మర్యాదను నీవు పొందుతావు.

(ఈ కథ 365 గుడ్ నైట్ స్టోరీస్ లోని 23 జనవరి ది)

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాటికి ఈనాటికి

by Gaddam sulochana March 19, 2026
written by Gaddam sulochana

ఏడాదికో కొత్త పేరు
సౌందర్యమంతా పచ్చదనంగా పరుచుకొని
మనకోసం ఎన్నెన్నో ఒడిలో నింపుకొని తెచ్చే
చైత్ర వరలక్ష్మికి స్వాగతం

కాలపరిణామాల్లో
క్రమానుగత రుతువుల మార్పులో
శిశిరానిది పెద్దబాధ్యత
కష్టకాలంలో కలత విలాపాలను రాలుస్తూ
ఉజ్వల భవితను కాంక్షిస్తూ
వసంతానికై సర్వం సిద్ధం చేసి
చిగురు నవ్వులు వినపడగానే
సెలవు తీసుకుంటుంది.

అనుభూతులేవైనా ఎప్పుడూ మారని జీవికలు
జీవితపు కుండలో షడ్రుచుల అనుభవాలు
మనసు కొమ్మల్లో రాగాలు
వసంత సంతస వేదికలపై
కవితాగానం చేసే కవికోకిలలు

అందం ఐక్యత స్వచ్ఛత సౌభాగ్యం
ఓ ఉగాది పర్వమా నీదే!
నీవు ఎప్పుడూ మారలేదు
ప్రకృతి జీవులేవి మారనేలేదు
ప్రకృతి జీవితత్వాన్ని అలవర్చుకోలేక
మనిషి మాత్రం అహంకారిగా మారిపోయాడు
నాలుగు తరాల ముచ్చట్లను
కలబోసుకుని ఆరబోసుకున్న వాకిళ్లు
నిశ్శబ్దపు నీడల్లోకి జారిపోయాయి
ఆధునికత పెరిగిన నాగరికతలో
వాడి పడేసే సంస్కృతిలో
ఆత్మీయ బంధాలు కూడా చేరిపోయాయి
పిల్లల లేత చేతుల్లో
చరవాణి ప్రపంచం
ఆన్లైన్ వేగంలో అన్ని పారేసుకుంటున్నాం
సాంస్కృతిక వైభవాలను వదిలేసుకుంటున్నాం
పంచుకుంటే అనుభూతులు
తుంచుకొనిపోతే జ్ఞాపకాలు
వాటికి కూడా కరువుతనం
అంతాఏకాకితనం పరాయితనం
విద్యుద్దీపాల కాంతులున్న
దారి కనిపిస్తలేదు గుండె గూళ్లను చేర
మనిషి పరిమళిస్తేనే లేడు
యుద్ధభయాలు దగ్ధ జీవితాలు
ఓ పరాభవ వత్సరమా!
ఎన్నని చెప్పను?
పెత్తనాల పరాభవాలు
పాపాలతో ధరాభారాలు
ధర్మం తప్పుతున్నదీ మేమే!

ఏది ఏమైనా, తెలుగుతనానికి నిండు వెలుగువై వచ్చిన
నీవే మాకు స్ఫూర్తివి
నీశుభ ఆగమనానికి స్వాగతం
పరాభవమా! నీకు మా స్వాగతాంజలి

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • సంగీత సరోవరంలో విరిసిన పద్మం – ఎన్. రాజం
  • స్త్రీ తత్త్వచింతన శిఖరం వాగాంభృణి
  • పరాభవ ఉగాది
  • ఉగాది – వసంత విభావరి”
  • సాహితీ వనంలో విరబూసిన సుగంధ కుసుమాలు

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us