మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

కొత్త ప్రపంచం

by Laxmi Madan May 29, 2026
written by Laxmi Madan

“అమ్మా! గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు చూసాను. చాలా బాగుంది.నువ్వు ,నాన్న చూస్తే అడ్వాన్స్ ఇస్తాను.దివికి కూడా నచ్చింది” అన్నాడు విజయ్ తల్లి శాంభవి తో..

“ఏంటి! గేటెడ్ కమ్యూనిటీ లోనా? అస్సలు వద్దు.నేనైతే ఉండలేను.అవి ఊరికి చివర ఎక్కడో ఉంటాయి.నాకు ఇక్కడే బాగుంది” అన్నది శాంభవి.

భర్త భాను ప్రసాద్ కూడా ఎంతో నచ్చ చెప్పాడు.అయినా కూడా ససేమిరా అన్నది శాంభవి.

సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉద్యోగాలన్నీ హైటెక్ సిటీ వైపు ఉన్నాయి.వీళ్ళు ఉండేది తార్నాక లో.

కొడుకు కోడలికి ఇంత దూరం ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. ప్రయాణంలో సగం సమయం పోతుంది.

అటు వైపు ఇల్లు తీసుకుని పోదాం అనుకుంటే తల్లి తండ్రులను వదిలి వెళ్ళ బుద్ధి కావడం లేదు.

అప్పటికి తండ్రి చెప్పాడు..

“మీరు అటు వైపు ఇల్లు తీసుకుని ఉండండి.కొన్ని రోజులైతే అమ్మ మారుతుంది” అని సలహా ఇచ్చాడు.అతనికి కూడా కొడుకు కోడలు ముఖ్యంగా మనవడిని వదిలి ఉండాలంటే కష్టంగా ఉంది.

కానీ కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. మనవడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి చుట్టుపక్కల పిల్లలే కనిపించడం లేదు. అందులో వాడి స్కూల్ కూడా దూరంగానే ఉంది. కొడుకు, కోడలు వచ్చేవరకు రాత్రి అవుతుంది.

ఎప్పటిలాగే విజయ్, దివి ఆఫీస్ కి వెళ్లి వస్తున్నారు. అనుకోకుండా విజయ్ ఫ్రెండ్ అమెరికాకు వెళ్లిపోవడం వల్ల అతని విల్లా అమ్మేస్తున్నానని చెప్పాడు. అంతకుముందే విజయ్ ఆ విల్లాను చూసాడు. చక్కని సౌకర్యాలతో ఎంతో బాగుంది.

ఎలాగైనా సరే అనుకుని తల్లి, తండ్రి కి చెప్పి ఆవిల్లా కొనేసాడు. ఇల్లంతా శుభ్రం చేయించుకొని రంగులు వేయించి గృహప్రవేశం తేదీ నిర్ణయించుకున్నారు. గృహప్రవేశం అయిన తర్వాత మనసు మార్చుకుని తల్లి వస్తుంది అనుకున్నాడు.

బంధువులను పిలుచుకొని చక్కగా గృహప్రవేశం చేసుకున్నారు.

“అమ్మా! మన విల్లాలోకి షిఫ్ట్ అయిపోదామా?”అన్నాడు విజయ్.

“విజయ్! నాకు ఆ కమ్యూనిటీలు నచ్చదని చెప్పాను కదరా! మీరు వెళ్లి రండి. శని ఆదివారాలు ఒకసారి మీరు రండి మరొకసారి మేమిద్దరం వస్తాము నాకు ఇక్కడే అలవాటైపోయింది రా”అంటూ కచ్చితంగా చెప్పింది భవాని.

చేసేదేమీ లేక విజయ్ అన్య మనస్కంగా భార్య, కొడుకుతో కొత్త ఇంటికి వెళ్లి పోయాడు.

వాళ్లు వెళ్లినప్పటి నుండి భవానికి ఏమి తోచడం లేదు. ఇల్లంతా ఖాళీగా అనిపించ సాగింది. చేయడానికి ఏమీ పని కనిపించడం లేదు.

ఇంతకు ముం దులాగా ఇరువు పొరుగు పలకరించడం అసలే లేదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు టీవీలు చూడటంతో సరిపోతుంది. భవానికి కూడా ఎక్కడికి వెళ్లడం అలవాటు లేదు. ఇన్నాళ్లు పిల్లలు, పనులు వీటితోనే సరిపోయింది. టీవీ సీరియల్లు చూసే అలవాటు అంతకన్నా లేదు. భర్తతో పోరు పెట్టి గుళ్ళకు వెళ్లడం చేస్తుంది. భాను ప్రసాద్కు రోజు ఇలా తిరగాలంటే కష్టంగానే ఉంది. హాయిగా పిల్లలతో ఉంటే మనవడినీ స్కూలుకు పంపించవచ్చు. సాయంత్రాలు వాడితో ఆడుకోవచ్చు అని అతని ఆశ.

వారం వారం పిల్లలు వచ్చి పోతూనే ఉన్నారు. ఒక వారం విజయ్ ఫోన్ చేసి..

“అమ్మా! బుజ్జిగాడికి జ్వరం వచ్చింది. ఈ వారం మేము రాలేము. అంత దూరం వస్తే వాడికి జ్వరం ఇంకా ఎక్కువవుతుంది. వీలైతే మీరు నాన్నగారు వచ్చేయండి” అని చెప్పాడు. కోడలు కూడా ఎంతో నెమ్మ దస్తురాలు. తాను కూడా ఫోన్ చేసి రమ్మని మరీ మరీ చెప్పింది.

మనవడికి జ్వరం అనగానే ఆమెకు మనసంతా కలచి వేసింది.

వెంటనే భర్తను అడిగింది..

“బుజ్జిగాడికి జ్వరం వచ్చిందట. ఈవారం మనమే వెళ్దాం అండి”అన్నది భవాని.

ఈ మాట కోసమే ఎదురుచూస్తున్న భాను ప్రసాద్ “తొందరగా బట్టలు సర్దుకో” అని చెప్పి తాను తన బట్టలు ఒక బ్యాగ్ లో పెట్టుకొని తయారయ్యాడు.

ఇద్దరూ కలిసి కొడుకు ఉండే విల్లా కు బయలుదేరారు.

గేటు లోపలికి వెళ్తుంటే వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించింది భవానికి. ఎప్పుడో ఒకసారి స్నేహితుల ఇళ్ళకు వెళ్ళింది. కానీ తాను అంతగా గమనించు కోలేదు. ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా కూడా విశాలంగా అందంగా కనిపించింది.

మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మను పట్టుకున్నాడు. వాడిని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది. రెండు రోజుల్లో మనవడు కోలుకున్నాడు.

అప్పటికే సెలవు మీద ఉన్న కొడుకు, కోడలు తెల్లవారి ఆఫీస్ కి వెళ్తామన్నారు.

“వాడికి ఇంకా నీరసంగా ఉంది. రెండు రోజులు ఇంట్లో ఉంటే కోలు కుంటాడు మీరు ఉండగలరా?”అని తల్లి,తండ్రిని అడిగాడు.

“అదేంట్రా! వీడికి జ్వరంగా ఉంటే మేము వెళ్ళి పోతామా?”అన్నది భవాని.

కొడుకు, కోడలు ఆఫీస్ కి వెళ్ళగానే తాను వంట పనిలో ఉంటే, మనవడితో భాను ప్రసాద్ ఆడుకున్నాడు. వాడికి నచ్చిన వంట చేసి తినిపించింది భవాని.

సాయంత్రం కింద పార్క్ కి తీసుకెళ్లారు. ఎంతోమంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఆ పిల్లలతో పాటు ఇలా అమ్మమ్మ, తాతలో నాయనమ్మ తాతలో వెంట ఉన్నారు. వాళ్లంతా ఒక జట్టుగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తనకు తన చిన్నప్పుడు చూసిన ఊరి వాతావరణంలా అనిపించింది.

సాయంత్రాలు అందరూ ఒక అరుగు మీద చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఇక్కడ అలాగే పెద్ద వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉంటే, పిల్లలు అంతా ఆడుకుంటున్నారు. ఇప్పుడు తాము ఉండే ఇంటిలో అసలు చుట్టుపక్కల మనుషులు ఉన్నారా! లేరా! అన్నట్లు అనిపించ సాగింది.

భవానిని చూడగానే అక్కడ ఉన్నవాళ్లు పలకరించారు.

“విజయ్ తల్లి ,తండ్రి నా మీరు?”అని అడిగారు.

అవునని చెప్పారు ఇద్దరు.

“మరి మీరు ఎక్కడుంటున్నారు”? అని అడిగారు వాళ్ళు.

విషయం అంతా తెలుసుకుని వాళ్ళందరూ అన్నారు..

“పిల్లలను వదిలి అక్కడ ఎక్కడో ఉండటం ఎందుకండీ? ఇక్కడైతే వాళ్లకు ఆఫీసుల దగ్గరగా ఉంటాయి. ఇదిగో ఇలా చూడండి అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయి. పండగలన్నీ కూడా మన ఊర్లలో జరుపుకున్నట్లు అందరూ కలిసి హాయిగా జరుపుకుంటాము. ఎన్నో రకాల పోటీలు జరుగుతుంటాయి. ఈ వయసులో కూడా మనం చిన్న పిల్లల లాగా పోటీలలో పాల్గొని మన టాలెంటును మనం చూపించుకోవచ్చు. ఇలా విల్లాలలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి”అని చెప్పారు.

ఇలా రోజు కిందికి వెళ్లి వస్తూ ఉంటే ఎంతోమంది స్నేహితులయ్యారు భవానీకి. భాను ప్రసాద్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయనకు ఒక సమూహమే ఏర్పడింది.

రెండు రోజులు అనుకున్న వాళ్ళు వారం రోజులు ఉండి పోయారు.

కొడుకుకు ఆశ్చర్యంగా అనిపించింది. ‘అదేంటి అమ్మ వెళ్తానంటుంది అనుకున్నాను. సంతోషంగా ఉంది ఇక్కడే!’ అని లోన సంతోష పడ్డాడు. ఇది కూడా చెప్పింది రోజు కిందికి వెళ్తున్నారు చాలామంది స్నేహితులయ్యారని. వాళ్లు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని ఎంతగానో అనుకున్నారు.

ఒకరోజు అందరూ భోజనాలు చేసి కూర్చున్న తర్వాత భవాని కొడుకు కోడల్ని పిలిచింది..

“ఇలా కూర్చోండి” అని పిలిచింది.

ఇంటికి వెళతాము అని చెప్తుందేమో అని ఇద్దరు భయపడుతూ వచ్చి కూర్చున్నారు.

కానీ వాళ్లు ఊహించనీ విధంగా భవాని చెప్పిన మాటలు విని ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

“ఇన్ని రోజులు నేను విల్లాలు అంటే అపోహ పడ్డాను. ఇక్కడికి వచ్చాక ఇలా అందరూ కలవటం, పిల్లలంతా ఆడుకోవడం నాకు ఎంతో బాగా అనిపించింది. ఇప్పుడు మనమున్న ఇంట్లో ఏ మనిషి కనిపించడం లేదు. ఇక్కడ ఉంటే మా చిన్నప్పుడు ఊళ్ళల్లో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

మీ నాన్నకు కూడా చాలా మంది స్నేహితులయ్యారు. అక్కడ ఉంటే బిక్కు బిక్కుమనుకుంటూ గడపాలి. ఎంతసేపటికి సమయం గడవదు. ఇక్కడ అసలు సమయమే తెలియడం లేదు. మేము ఇక్కడికి వచ్చేస్తాం రా”అని చెప్పింది.

విజయ్ ,దివిలకు ఎంతో సంతోషంగా అనిపించింది. బుజ్జిగాడు అయితే రోజు అడుగుతూనే ఉన్నాడు.
‘! వెళ్ళద్దు’ అని.. వీళ్ళు ఇక్కడే ఉంటారని తెలవగానే వాడు నానమ్మను గట్టిగా పట్టుకొని గంతులు వేశాడు.

ఎక్కడో మన ఇల్లు ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాము అని భావిస్తూ ఒంటరిగా ఉండే కంటే మన వాళ్ళతో ఉండి సమయానుకూలంగా మారితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది!

అలా ఒక నిర్ణయం తీసుకొని హాయిగా నిద్రపోయారు.

May 29, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

పాఠశాల గదిలో జీవిత పాఠాలు

by రంగరాజు పద్మజ May 29, 2026
written by రంగరాజు పద్మజ

పాఠశాల అనేది కేవలం పుస్తకాల జ్ఞానం అందించే స్థలం మాత్రమే కాదు; అది జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పే పుణ్యక్షేత్రం కూడా. ఈ భావాన్ని ఆచరణలో చూపిస్తూ విద్యార్థులకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలను బోధిస్తున్న గురువుల్లో తెలుగు భాషోపాధ్యాయురాలు తిరునగరి పద్మ గారు ఒకరు. తన బోధన విధానంలో క్రమశిక్షణ, బాధ్యత, స్వీయనిర్భరత వంటి విలువలను విద్యార్థులలో పెంపొందించే ప్రయత్నం చేస్తూ, చదువు మాత్రమే కాకుండా జీవన మార్గాన్ని చూపించే గురువుగా నిలుస్తున్నారు. ఆమె అనుభవాలు, ఆలోచనలు, బోధనలోని ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మయూఖ పత్రిక తరఫున ఆమెతో చేసిన ముఖాముఖి!


పాఠ్యాంశం దాటి, విద్యార్థులలో క్రమశిక్షణ, స్వీయనిర్భరత పెంచే బోధనా విధానాన్ని అమలు చేస్తున్న మీతో సంభాషణ చాలా సంతోషానిస్తున్నది. మయూఖ పాఠకులకు మీ సమగ్ర కృషిని తెలుపుతారా?

తిరునగరి పద్మ :- తప్పకుండా మేడం. ఇది నా అదృష్టంగా భావిస్తాను

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ!

తిరునగరి:- నమస్కారం మేడం గారు.

పద్మజ* :- మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి వివరించగలరా?

తిరునగరి:- నేను హన్మకొండ జిల్లా, పరకాల దగ్గరున్న పోచారంలో పుట్టాను. అమ్మ పుష్పలత, నాన్న తిరునగరి శేషయ్య. ఆయన సీనియర్ అకౌంటెంట్ గా పనిచేసేవారు. ఉద్యోగ రీత్యా ఊరూరు మారడం వల్ల నా విద్యాభ్యాసం కూడా అనేక చోట్ల జరిగింది. 1 నుండి 9వ తరగతి వరకు స్టేషన్ ఘనాపూర్ లోనూ, 10వ తరగతి ములుగులోనూ గడిచింది. ఇంటర్ మరియు డిగ్రీ పినిగిల్లి ఉమెన్స్ PG కాలేజీలోనూ, MA తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ, Bed , Med ఏకశిలా కాలేజీ జనగామలో జరిగింది. మా వారు లంకా రఘు, టైపిస్ట్ గా పని చేస్తున్నారు.

పద్మజ – తెలుగు భాషోపాధ్యాయురాలిగా మారడానికి మీకు ప్రేరణ ఏమిటి?

తిరునగరి :-విద్యార్థులను నైతిక మార్గంలో నడిపించడానికి, వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించి, భావి భారత పౌరులుగా.. తీర్చిదిద్ది..
సమాజానికి ఉన్నత వ్యక్తిత్వ విలువలు ఉన్న పౌరులుగా.. మార్చడం కేవలం తెలుగు భాషో పాధ్యాయులకు మాత్రమే సాధ్యం. అందుకే ఈ తెలుగు భాషలో ,నేను ప్రావీణ్యాన్ని సంపాదించడం ,మరియు విద్యార్థులను ప్రావీణ్యులుగా.. ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం నా ఉద్దేశం.

పద్మజ :- గురువుగా మీ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు లేదా అనుభవాలు ఏమిటి?

తిరునగరి :-నేను పల్లెటూరి పిల్లగాడ పాఠం బోధిస్తుంటే… మిర్యాలగూడమోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మహాత్మా హెల్పింగ్ హాండ్స్ అధినేత శ్రీ గంట రవీందర్ గారు.. అకస్మాత్తుగా మా పాఠశాలకు వచ్చారు.. కృత్యాధార పద్ధతి లో ఇంత బాగా చెప్తారా? అని.. మా పాఠశాల పిల్లలకు సుమారుగా 30 వేల రూపాయలు విలువగల టీ షర్ట్స్ బహుమతిగా ఇచ్చారు. అప్పుడు నేను చాలా ప్రభావితురాలినై.. ఇంకా బాగా చెప్పడం మొదలుపెట్టాను. చాలా సంతోషం వేసింది..

పద్మజ :- కృత్యాధార బోధనలో ప్రత్యేకత ఎలా ఉంటుంది?

తిరునగరి :-ఉపాధ్యాయులు అంటే కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే అందించడం కాదు, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి..ఒక ఉపాధ్యాయుడు బహు రూపుల వేషాలు వేసుకుంటూ వారి స్థాయికి దిగి వారికి అర్థమయ్యేలాగా బోధించాలి అంటే కేవలం కృత్యా ధార బోధనతో మాత్రమే సాధ్యం అందుకే వీలైనంతగా విద్యార్థులకు కొన్ని పాత్రలు ఇచ్చి, వారు ఆ పాత్రలో లీనమై వారు ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకున్నట్లుగా..అనిపించకుండా.. కొన్ని
పాఠ్యాంశాలను బడి గోడలపై కుడ్య చిత్రాలుగా చిత్రీకరించుకుంటూ, వారిని భాగస్వాములుగా చేస్తూ ఆటపాటల ద్వారా విద్యను అందిస్తున్నాను..

పద్మజ :- విద్యతో పాటు జీవననైపుణ్యాలను బోధించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?

తిరునగరి :-నేను పదవ తరగతి ములుగు బాలికోన్నత పాఠశాలలో చదివేటప్పుడు మా డ్రాయింగ్ మాస్టర్ శ్రీ రామాచారి గారు మాకు
ఎంతో చక్కగా నైపుణ్యంతో చిత్రలేఖనాన్ని నేర్పించారు. అది నాకు ఒక అభిరుచిగా మారి, తరచుగా వేసి, ప్రావీణ్యాన్ని సంపాదించిన
తర్వాత చీరలపై ఫ్యాబ్రిక్ పెయింట్ వేస్తూ ఉద్యోగం రాకముందు, అది ఒక వృత్తిగా పెట్టుకున్నాను. ఆ విధంగా డబ్బులు సంపాదించుకున్నాను. నేను ఎవరిపై ఆధారపడకుండా, నా సంపాదన నాకు ఉంది అని గర్వంతో జీవించాను. అలాగే నేను కూడా నా విద్యార్థులకు చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నాను. చాలామంది విద్యార్థులు చక్కగా నేర్చుకొని వారు కూడా ఇప్పుడు ఒక వృత్తిగా పెట్టుకున్నారు. ఆ విద్యార్థులు నాకు ఫోన్ చేసి “టీచర్ ! మేము మీ వల్ల చీరలపై పెయింట్ వేస్తూ, మా డబ్బులు మేము సంపాదించుకుంటున్నాము.. మా కాళ్ళ పైన మేము నిలబడుతున్నాము” అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇది చాలు! నాకు ఎన్నో అవార్డులు వచ్చినంత సంతృప్తి కలిగింది.

పద్మజ :–మీరు విద్యార్థులకు నేర్పించే ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఏమిటి?

తిరునగరి :-జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలి. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు,
విజయం వచ్చిందని విర్రవీగిపోకూడదు. కలిమిలేములను సమానంగా చూడాలని, అహంకారం, గర్వం కూడదని, వినయ విధేయతలతో మెలగమని చెబుతాను.

పద్మజ- తరగతి గదిలో ఈ పద్ధతిని ఎలా అమలు చేస్తారు?

తిరునగరి :-ఒకసారి ఫస్ట్ వచ్చిన పిల్లలు గర్వంతో సరిగ్గా చదవక ఇంకో పరీక్షల్లో తక్కువగా మార్కులు వస్తాయి. ముందుగా తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు, పోటీపడి చక్కగా చదివి, మంచిర్యాంకు పొందుతారు. అందుకే మంచి ర్యాంకు వచ్చిందని పొగరు వద్దు, ఫెయిల్ అయినామని కుంగిపోవద్దు.
ఎప్పుడు ఎవరి సమయం ఎలా ఉంటుందో తెలియదు! మన చేతిలో ఉన్నదల్లా కృషి ..కేవలం కృషి.. పట్టుదల.

పద్మజ :- ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో మీరు గమనించిన ముఖ్యమైన మార్పులు ఏమిటి? క్రమశిక్షణ, స్వీయనిర్భరత పెరిగిన ఒక సంఘటన గుర్తుంటే చెప్పగలరా?

తిరునగరి :-మా పాఠశాలలో ఒక విద్యార్థి బాగా చదువుతున్నానని గర్వంతో పదవ తరగతి పరీక్షల సమయంలో అసలే చదవలేదు. చదవమంటే..
“ప్రతి పరీక్షలో నేనే ఫస్ట్ వస్తాను కదా టీచర్! నాకు చదవడం అవసరం లేదు” అనేవాడు. వేరొక అమ్మాయి మామూలుగా చదివేది. ఆమె ఫస్ట్ రావాలని అనుకున్నది. గట్టిగా పట్టు పట్టి చదివింది.
ఏ ప్లస్ గ్రేడ్ సాధించింది. బాసర ఐఐటీలో సీటు సంపాదించుకుంది. బాగా చదివే కుర్రాడు నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ట్రాక్టర్ నడుపుతున్నాడు. అందుకే విజయం వరించిందని గర్వం తలకెక్కితే, అథః పాతాళానికి తోసేస్తుంది అని చెబుతాను.

పద్మజ :- ఈ విధమైన బోధనలో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి?

తిరునగరి :-ఎప్పుడైనా ఒకరు మంచి చేస్తుంటే , వెనకకు లాగి కింద పడేయాలని చాలామంది చూస్తారు. అలా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను.
నాకు నేనుగా ధైర్యం చెప్పుకొని భుజం తట్టుకొని, నా ఉద్యోగ ప్రస్థానంలో పట్టు వీడని విక్రమార్కిణిలా,
కృత్యాధార పద్ధతిలో బోధన కొనసాగిస్తున్నాను.

పద్మజ :- గురువుగా మీకు అత్యంత ఆనందం కలిగించిన క్షణం ఏది?

తిరునగరి :-ఒక అమ్మాయి సరిగ్గా పాఠశాలకు రాకపోయేది, ఒకసారి నేను ఆ అమ్మాయితో ఒక ఫోటో దిగాను. నా ఫోటో ముందు పెట్టుకుని, ఇంటి దగ్గర కూర్చొని చదువుకొని, అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి, పరీక్షలు రాసి, అందరికంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. కేవలం 5వ తరగతి అమ్మాయి. అప్పుడు నా కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు జలజలా రాలిపోయాయి.

పద్మజ :- నేటి విద్యావ్యవస్థలో జీవన నైపుణ్యాల విద్య ఎంతవరకు అవసరం?

తిరునగరి :-నేటి అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన విద్య ఎంతో అవసరం.
ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిలను ప్రేమించడం, అమ్మాయిలు కూడా విచిత్ర వస్త్రధారణతో అబ్బాయిలను ఆకట్టుకోవడం.. అబ్బాయిలు చింపిరి జుట్టు, పిట్టగూళ్ల కటింగ్ లతో.. చిత్రవిచిత్రమైన, హెయిర్ స్టైల్స్, కలర్స్ తో విద్యను పక్కనపెట్టి, అనవసరపు విషయాలపై మక్కువ చూపుతున్నారు. అలాంటివి పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు వాటిని ఖండించి, వారిని సరైన దారిలో పెడితే సమాజానికి నీతి, నిజాయితీ , నైపుణ్యం గల మంచి భావిభారత పౌరులను అందించగలము.

పద్మజ :- గురువుగా మీ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు లేదా అనుభవాలు ఏమిటి?

తిరునగరి :- నా మొట్టమొదటి ఉద్యోగ ప్రస్థానం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామరాజు పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో. మా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మంగు ప్రవీణ గారు. ఆమె విద్యార్థులకు చక్కగా గణితం బోధించేది. శ్రీసోమరాజు గారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చాలా సహనంతో వారి స్థాయికి దిగి, ఎలా చెప్పాలో… చక్కగా వివరించి చెప్పేవారు.
శ్రీ రాధాకృష్ణ గారు, ప్రవీణ్ గారు, ‌‌ ప్రసన్న గారు, ఇలా ఒక్కొక్కరి నుండి ఒకటి గ్రహించుకొని, నాదైన శైలిలో విద్యార్థులకు కృత్యాధార బోధన పద్ధతిలో ఇలా చెప్పాలని, నాలో బోధనా నైపుణ్యానికి నాంది పడింది. ఇంట్లో మావారు, మా బాబు, మా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు.

పద్మజ :- విద్యాబోధన అంటే మీ దృష్టిలో ఏమిటి? కేవలం పాఠ్యాంశం బోధించడమేనా లేక మరేదైనా విస్తృతమైన అర్థం ఉందా?

తిరునగరి :-విద్యా బోధన అందరూ చేస్తారు కానీ “హృద్యమైన విద్యా బోధన” అందరూ చేయరు.
విద్యార్థి స్థాయికి దిగి, వారి భాషలో సరళమైన శైలిలో మనం వారికి పాఠం చెప్పిన విషయం కూడా తెలియకుండా, వారితోనే ఆటపాటల ద్వారా నేర్చుకునేటట్టు కృత్యాధార పద్ధతిలో చేయించడం. ఇది ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో సాధ్యమయ్యే విద్యా బోధన. ఇక్కడ ఈ చిన్న తరగతులలోనే పునాది గట్టిగా ఉంటేనే ఎన్ని అంతస్తులైన వేయగలమనే నానుడితో క్షేత్రస్థాయిలోనే విద్యార్థులకు బేసిక్స్ బాగా నేర్పించి వదిలిపెడితే, వారు ఏదైనా చదవగలరనే ఉద్దేశం నాది..

పద్మజ :- మీరు తరగతిలో విద్యతో పాటు జీవన నైపుణ్యాలను కూడా నేర్పిస్తారని వింటున్నాం. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? విద్యార్థులకు నేర్పించే ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఏమిటేమిటి?

తిరునగరి :- ఒకసారి నేను రామరాజు పల్లి పాఠశాలలో పనిచేసేటప్పుడు.. శ్రీకాంత్ అనే ఆరవ తరగతి విద్యార్థి బడికి సరిగ్గా రాక, చదవకపోయేవాడు. వాడు కోళ్ల ఫారంలో పనిచేసేవాడు. ఒక రోజు వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి, “టీచర్! మా బాబుని తీసుకొని ఊరికి పోతుంటే బస్టాండ్ కి వెళ్లి, బస్సు పేరు చదవమంటే వాడు వేరే వాళ్ళని అడిగాడు. మీరు ఏమి చదువుచెప్పుచున్నారు? వాడు బడికి రాకపోతే మీరు పట్టించుకోరా?” అని అడిగింది. అప్పుడు నేను ప్రతిరోజూ సరిగ్గా బడికి పంపాలి, లేకపోతే వారు విద్యలో వెనుకబడుతారని సమాధానం ఇచ్చాను. విద్యార్థులలో జీవన నైపుణ్యాలను పెంపొందించి, వారిని ముందుగా సక్రమంగా బడికి వచ్చేటట్టుగా ఆకట్టుకోవాలంటే కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే కాదు వారికి నచ్చిన విధంగా వారితోనే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన బోధనా సామాగ్రిని తయారు చేయిస్తూ, వారికి తగిన ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ, వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలనే ఆలోచన నాకు కలిగింది. నేను ముఖ్యంగా విద్యార్థులకు బోధించే జీవన నైపుణ్యాలు ఏమిటంటే? కేవలం విద్య ద్వారానే కాకుండా, సహ పాఠ్యాంశ కార్యక్రమాలైన ఆటలు, ఎన్సిసి, చిత్రలేఖనం.. ఇలా ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదిస్తే, కేవలం ఉద్యోగం పైన మాత్రమే ఆధారపడకుండా వారే సొంతంగా ఏమైనా.. వ్యాపారం మొదలుపెట్టి, నలుగురికి జీవనోపాధి కల్పిస్తారు. ఏది నేర్చుకున్నా పట్టుదలతో నేర్చుకొని,
విజయాన్ని సాధించే దిశలో పయనించి, వినయ విధేయతలతో మెలగాలని చెబుతాను.

విద్యార్థులను ప్రభావితం చేసేది ఎక్కువగా ఉపాధ్యాయులే!
ఉదాహరణకు ఒక పిల్లాడు చక్కగా చదివి, సంస్కారంతో మెలిగితే, అక్కడ ఊళ్లో వాళ్ళు కానీ వారి బంధువులు కానీ “అరె బాబు నువ్వు బాగా చదువుతున్నావు. ఏ స్కూల్లో చదువుతున్నావు.
మీ తెలుగు టీచర్ ఎవరు., వెరీ గుడ్ చక్కగా నేర్పిస్తున్నారు” అని మెచ్చుకుంటారు.. అదే చదువకుండా , పొగరుగా ఉంటే, “ఎవతిరా,
ఎవడ్రా నీకు చదువు చెప్పేది? ఏదీ పోదాం పారా మీ సార్/మీ టీచర్ దగ్గరికి, ఏం చెప్తాండ్రో అడుగుతా పదరా! నడువు రా!.. ” అని తిట్టుకుంటూ వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి విద్యార్థులను వినయ విధేయతలు గల విద్యాసంపదగా భావించి, వారికి ‌ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను వారికి వారే పరిష్కరించే విధంగా ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని పెంపొందించుతాను..

పద్మజ :-ఈ విధానం అమలు చేసే సమయంలో మీరు అనుసరించే పద్ధతులు ఏమిటి?
సాధారణ బోధన విధానంతో పోలిస్తే ఈ పద్ధతిలో విద్యార్థుల్లో మీరు గమనించిన మార్పులు ఏమిటి?

తిరునగరి :-సాధారణ బోధన విద్యార్థులకు విసుగుగా ఉంటుంది. ఈ కృత్యాధార బోధనతో..
విద్యార్థులు ఎంతో ఆసక్తితో వింటారు. స్వయంగా.. వారే ఆ బోధన సామాగ్రిని ఉపయోగిస్తూ నేర్చుకోవడం వల్ల వారు ప్రతి రోజూ పాఠశాలకు రావడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా సబ్జెక్టు పైన ఆ సబ్జెక్టు టీచర్ పైన ఇష్టాన్ని పెంపొందించుకొని విద్యను కష్టంగా కాకుండా ఇష్టంతో నేర్చుకుంటారు.

పద్మజ :- చదువు మాత్రమే కాకుండా జీవితానికి ఉపయోగపడే విలువలు పిల్లలకు నేర్పడం ఎందుకు ముఖ్యమని మీరు భావిస్తారు?

తిరునగరి :- విద్య అందరూ నేర్పిస్తారు. కానీ విలువలతో కూడిన విద్యను కొందరే నేర్పిస్తారు. ఆ విలువలను వారు నేర్చుకొని ఆచరిస్తే సమాజంలో
గౌరవింపబడతారు. ఉన్నత స్థాయిలో నిలుస్తారు.

పద్మజ :- తెలుగు భాష బోధనలో మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అంశం ఏమిటి? సాహిత్యం ద్వారా పిల్లల్లో విలువలను పెంపొందించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏమిటి?

తిరునగరి :-తెలుగు భాషా బోధనలో ముందు అక్షరాలను చక్కగా గుండ్రంగా దోష రహితంగా రాయించడం, ధారాళంగా చదియించడం ఇవి రెండు ముఖ్యమైనవి. ఇవి చక్కగా నేర్చుకుంటే, ఏదైనా రాయగలరు, చదవగలరు.
ఇంకా కొన్ని సందర్భాలలో ఒక అందమైన గులాబీ పుష్పాన్ని చూసినా ఒక చిట్టి చిలకమ్మను చెట్టు పైన చూసినా ఒక కమ్మని కోయిలమ్మ పాటను విన్నా మనసు పులకరిస్తుంది. ఆ విషయాలను చిన్నగా కవితల రూపంలో విద్యార్థులతో రాయిస్తూ,
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అని అక్షర శరాలను సంధిస్తూ సాహిత్యం ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. రవి కాంచని చోటును కవిగాంచగలడు అని విద్యార్థులకు బోధిస్తూ, భావి జీవితంలో మీరు కూడా గొప్ప కవులు కావాలని, సమాజ హిత రచనలు చేయాలని, విద్యార్థులకు హితబోధ చేస్తాను.

పద్మజ :- నేటి డిజిటల్ యుగంలో పిల్లల్లో తెలుగు పట్ల ఆసక్తి పెంచడానికి గురువులు ఏమి చేయాలి?

తిరునగరి :-ఇప్పుడు ప్యానెల్ బోర్డులు వచ్చాయి కదా! వాటిని ఆపరేట్ చేస్తూ, విద్యార్థులతోనే చేయిస్తూ, పాఠ్యాంశం అందులోనే వినిపిస్తే వారికి కూడా రొటీన్ టీచింగ్ కు భిన్నంగా ఉంటుంది. చాలా ఆసక్తిగా చిత్రాలను చూస్తూ నేర్చుకుంటారు. ఇంకా నేను బోధించే పాఠ్యాంశాలను ఎక్కువగా టి ఎల్ ఎం ద్వారా మరియు పాఠశాల గోడల పైన కుడ్య చిత్రాలుగా నేను చిత్రీకరిస్తూ విద్యార్థులతో కూడా చిత్రీకరింప చేస్తూ, ఆ గోడ పైన ఆ బొమ్మ చూశారంటే, విద్యార్థికి పాట మొత్తం వచ్చేస్తుంది. ఆ విధంగా కూడా విద్యాబోధన చేస్తే, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని అనుకుంటాను.

పద్మజ :- ఈ విధమైన బోధనలో మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏమిటి? తల్లిదండ్రులు మరియు పాఠశాలల సహకారం ఈ విధానానికి ఎంతవరకు అవసరం?

తిరునగరి :- ఇంతవరకు ఏ మహిళా ఉపాధ్యాయురాలు కూడా పాఠశాలగోడల పైన బొమ్మలు వేసి చెప్పలేదు. చీరల పైన వేశారేమో కానీ
అయితే నేను ఇలా వేయడం వల్ల చాలామంది ఉపాధ్యాయులకు ఇంత శ్రమ అవసరమా? ఏదో బడికి వెళ్లి పాఠాలు చెప్పుకోక అని విమర్శలను ఎదుర్కొన్నాను. అంతేగాక పొగడ్తలను కూడా పొందాను.
మా సోలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు..( తరిగొప్పుల మండలం జనగామ జిల్లా)
పాలకుర్తి ఎంఈఓ గారు శ్రీ పోతుగంటి నర్సయ్య గారు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను నడిపిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (మిర్యాలగూడ) శ్రీ గంటా రవీందర్ గారు మరియు వందేమాతరం ఫౌండేషన్ సృష్టికర్త శ్రీ వందేమాతరం రవీందర్ గారు మా పాఠశాలకు వచ్చి, ఎన్నో ఉపకరణాలను దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువచేసే, వస్తువులను బహుకరించారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. శ్రీ యాదగిరి గారు.. రైలు భోగిగా తరగతి గది అనే ఒక చిత్రాన్ని నాకు చూపించారు. వెంటనే మా పాఠశాల గోడలపై మా అటెండర్ యాదలక్ష్మి మరియు విద్యార్థుల సహాయంతో నేను కూడా రైలు మోడిని వేశాను..
అప్పుడు కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారి గారు మాపాఠశాలను సందర్శించి మిగతా ఉపాధ్యాయులను కూడా మా పాఠశాలను సందర్శించమని చెప్పారు. “బొమ్మల టీచరమ్మ”
అనే శీర్షికతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సాక్షి పేపర్లో నా కథనం వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నన్ను ప్రోత్సహించిన వీరందరితో పాటుగా మా హిందీ మాస్టర్ నాకు సోదర సమానులు కస్తూరి సతీష్ కుమార్ మరియు సుధా మేడం, సారంగ పాణి, సంపత్ కుమార్, హెచ్ఎం శ్రీ యాదగిరి గారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ‌‌వీరందరికీ కృతజ్ఞతాభివందనములు

పద్మజ :– ఒక గురువుగా మీకు అత్యంత సంతృప్తి కలిగించిన క్షణం ఏమిటి?

తిరునగరి :- ప్రస్తుతం పని చేసే పాఠశాల భూపాల్ పల్లి జిల్లా నేరేడుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నేను 317 G.O లో ట్రాన్స్ఫర్ పై వెళ్ళినప్పుడు ఆ పాఠశాల గోడలు బూజులు పట్టి ఉన్నాయి. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. అదే ప్రైవేట్ పాఠశాలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో అందంగా ఉండడం వలన విద్యార్థులను ఆకర్షిస్తాయి. ప్రవేట్ పాఠశాలలకు దీటుగా మాబడిని కూడా తయారు చేయాలని, అంతకుముందు నేను పని చేసిన సోలిపూర్ పాఠశాలలో 65 కుడ్య చిత్రాలను ఒక్కదాన్నే వేసాను. ఇక్కడ వేద్దాము అనగానే మా ప్రధానోపాధ్యాయులు శ్రీ పూలాల సాంబయ్య గారు వెంటనే స్పందించి “సరే చెల్లెమ్మా!
ఏమేమి కావాలి చెప్పమ్మా” అని లిస్టు రాయించుకుని ఆ పెయింట్స్ ను బండి పైన పెట్టుకొని తెస్తున్నప్పుడు, నా హృదయం ఆనంద భాష్పాలతో నిండిపోయింది. మిగతా సహ ఉపాధ్యాయులు, శ్రీ ప్రణీత్ కుమార్, కుమారస్వామి, మల్లికార్జున్, మంజుల, సునీత, లావణ్య ,విజయలక్ష్మి వాళ్ళందరూ ఎంత బాగా సహాయ సహకారాలు అందించారంటే మాటల్లో చెప్పలేను. ఈ పాఠశాలలో కూడా” రైలు భోగిగా” తరగతి గది పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు నిచ్చెన పైకెక్కి, డ్రమ్ములు బోర్లించుకుని ఎక్కి, పెయింటింగ్ వేసినప్పుడు నా సంతోషాన్ని మాటలలో చెప్పలేను. అది అనుభవైకవేద్యం. ఈ చిత్రాన్ని చూసి, ఎంపీడీవో గారు భూపాల్ పల్లి కలెక్టర్ గారికి చెబితే మా పాఠశాలకు లక్ష రూపాయలు బహుమతిగా శాంక్షన్ చేశారు. అప్పుడు ఇంకా ఆనందం కలిగింది అది వర్ణనాతీతం.. గొర్లవీడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రషీద్ గారు, మేము వేసిన కుడ్యచిత్రాలను చూపెట్టడానికి రెండుసార్లు మా పాఠశాలలో ప్రత్యేకంగా కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. మిగతా టీచర్లకు మేము ఆదర్శమని చెప్పారు. ఆ ఉత్సాహాన్ని నా మానసికోల్లాసాన్ని ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను..

పద్మజ :- నేటి విద్యావ్యవస్థలో జీవన నైపుణ్యాల విద్య ఎంత అవసరమని మీరు భావిస్తున్నారు?
కొత్తగా గురువులుగా రావాలనుకునే వారికి మీరు చెప్పే సూచనలు ఏమిటి?

తిరునగరి :-కేవలం పుస్తకాలలో ఉన్న విద్య మాత్రమే కాకుండా ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఎలా మెలగాలి? ఉన్నత వ్యక్తిత్వంతో జీవిస్తూ ఉద్యోగ భద్రతను ఎలా కాపాడుకోవాలి? సాటివారితో ఎలా మెలగాలి? ఇవి నేర్పిస్తే చాలు అనుకుంటున్నాను.
కొత్తగా గురువులుగా వచ్చే వారికి నేను ఇచ్చేసలహాలు ఏమిటంటే? ఎ టీచర్ ఇస్ ఏ రోల్ మోడల్ మనం ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ వారి భవితవ్యాన్ని చక్కగా తీర్చిదిద్దే దిశగా ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ వెలుగుతున్న దీపం ఇతర దీపాలను వెలిగిస్తుంది అన్న చందంగా మెళకువలను జీవన నైపుణ్యాలను బోధించాలి అని చెబుతాను..

పద్మజ :-విద్యార్థులకు మీరు చెప్పదలచిన ఒక ముఖ్యమైన జీవన సూత్రం ఏమిటి?

తిరునగరి :- “విద్య వల్ల ఎదగాలి వినయంతో మెలగాలి”

పద్మజ :-చివరిగా, తరుణి పత్రిక పాఠకులకు మీ సందేశం ఏమిటి?

తిరునగరి :-ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి..
మనం ఆదర్శంగా ఉంటూ ఇతరులకు ఆదర్శప్రాయంగా మెలగాలి.

విద్య అనేది మార్కులకే పరిమితమైపోయిన నేటి కాలంలో, పిల్లలకు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం మరియు నైపుణ్యాలను నేర్పే గురువులు సమాజానికి అవసరం. తెలుగు భాషను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని వెలిగించే తిరునగరి పద్మ గారి బోధన విధానం నిజంగా ఆదర్శప్రాయమైనది.
ఇలాంటి గురువుల ఆలోచనలు మరెంతో మందికి ప్రేరణనిస్తూ, విద్యను జీవితానికి దగ్గర చేసే దిశగా మార్గం చూపుతాయని ఆశిద్దాం. ఇంత చక్కని ఆదర్శవంతమైన విద్యాబోధకురాలాని పరిచయం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది
ఇలాంటి గురువుల ఆలోచనలు మరెంతో మందికి ప్రేరణనిస్తూ, విద్యను జీవితానికి దగ్గర చేసే దిశగా మార్గం చూపుతాయని ఆశిద్దాం.

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శాంతి విలువ

by Dr k Geetha May 29, 2026
written by Dr k Geetha

కడుపు నిండిన వాడికి
ఆకలి బాధ తెలియదు
యుద్ధం మొదలు పెట్టిన వాడికి
శాంతికి అర్థం తెలియదు
గుప్పెట్లో ప్రాణాలు
అంటే తెలియదు
నెత్తి మీద ఎప్పుడు
ఏ బాంబు పడుతుందో
ఎప్పుడు ఎవరికి మూడుతుందో
…ఏవీ తెలియవు
చోద్యం చూసే వాళ్లకూ
తెలియదు
సెల్ ఫోనుల్లో
రీల్స్ చూసుకుంటూ
కడుపు చల్ల కదలకుండా
బతికే వాళ్లకు
యుద్ధమంటే ఏవిటో
తెలియదు
యుద్ధమంటే
అమానుషత్వం
యుద్ధమంటే
అణచివేత
యుద్ధమంటే
ఊచకోత
యుద్ధమంటేనే
సర్వ నాశనం కావడం
యుద్ధమంటేనే
సర్వం కోల్పోవడం
పాపం అప్పటి వరకూ
బడి ఒడిలో
అమాయకంగా
పరుగులెడుతున్న
పసివాళ్ళకి
తెలియదు
గూగుల్ తమ లొకేషన్
యుద్ధ స్థావరంగా చూపిస్తుందని
తల్లి ఒడిలో ప్రశాంతంగా
నిద్రించే పసికూనకి తెలియదు
తాము కాలూనుకున్న
భూమి కింది
పొరల్లోని నూనె నిల్వలే
తమని పొట్టనబెట్టుకుంటాయని
అప్పటివరకూ
తమదనుకున్నదేదీ
తమది కాదని
సామాన్య జనానికీ
తెలియదు
యుద్ధతంత్రాలు
రాసే వాడికి తప్ప
ఎవరికీ ఏ నష్టం
కలుగుతుందో
ఎవరికీ తెలియదు
ఎవరికీ
అర్థం కాదు
యుద్ధమంటే ఏవిటో
అనుక్షణం
భయం భయంగా
గుండె దడగా
బతకడమంటే
ఏవిటో –
పోయిన వారి
ఆనవాళ్ల కోసం
బతికున్న వారి
జానెడు పొట్ట కోసం
దీనాతిదీనంగా
వెర్రిచూపులు
చూడడమంటే
ఏవిటో
యుద్ధం మొదలు పెట్టిన వాడికీ
యుద్ధం అవసరం అయిన వాడికీ
యుద్ధం వినోదం అయిన వాడికీ
తెలియదు
యుద్ధానికి ఎదురు నిలబడేవాడికి
మాత్రమే తెలుసు
ఆయుధపు మొన గుండెల్లో గుచ్చుకున్నవాడికి
శకలాలుగా చీలిపడ్డ మొండాల్ని
భుజాన మోసే వాడికి మాత్రమే తెలుసు
యుద్ధానికి ఎదురు నిలబడేవాడికి
మాత్రమే తెలుసు
శాంతి విలువ

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మౌనలోకం

by Dr. Varigonda Satya Surekha May 29, 2026
written by Dr. Varigonda Satya Surekha

సుహృత్ కన్నా సుచరిత ప్రవర్తన ఎక్కువ బాధని కలిగిస్తోంది. వాస్తవం అంగీకరించడానికి తన మనసు ఎందుకు సిద్దం కావట్లేదో అర్థంకాదు. ఇవాళ  మళ్ళీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడేం జరుగుతుందో తెలిసిందే. ఇంటికొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. రెండు రోజులవరకు మాములు మనిషి కాదు. నిద్రాహారాలు ఉండవు. తన వైఖరి సుహృత్ కి ఎంత చేటు చేస్తుందో గ్రహించదు.
ఊరికి వెళ్ళక రెండు  సoవత్సారాలు అయింది. అమ్మ నాన్న ముఖ్యంగా నాన్నమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుండి పనికైనా పరిష్కారానికైన తను చేరేది నాన్నమ్మ ఒడికే. అటువంటిది ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద తూఫాను చెలరేగింది. నాన్నమ్మ దగ్గర ఎపుడు ఏది దాచని తాను ఇవాళ సుచరిత వల్ల సుహృత్ విషయం దాచాల్సి వస్తోంది. “నాన్నమ్మ నాకు మార్గం చూపవు.” మనసులోనే అర్థించాను.

                                      *
“నాన్నమ్మ నువ్వు నిజంగా వచ్చావా?” ఆనందo ఉక్కిరిబిక్కిరి చేయగా ఆటో దిగిన నాన్నమ్మని వాటేసుకున్నాను.
“బడుద్దాయి! వదలరా , ముందు ఆటో అబ్బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపు.” ప్రేమపూర్వకమైన నవ్వుతో ఇంట్లోకి దారితీసింది. సామానుతో ఆ వెనుకే ఆవిడని అనుసరించాను.
అవ్వడానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలుఅయినా పడుచు వారికి ధీటుగా ఇప్పటికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంది. ఒక్కసారి చూసిందో , ఇక అంతే , జన్మలో మర్చిపోదు. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చిమూడేళ్ళు పైన అయినా “ఎలా రాగలిగావు” అన్న ప్రశ్న వేయలేదు.
మంచి నీళ్ళు అందిస్తూ అడిగా “ కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా” .
“అదేంటి నువ్వు పెట్టడం .సుచరిత ఏది”
“సుహృత్ స్కూల్ కి వెళ్ళిందిలే” చెప్పి కాఫీ పెట్టడానికి వంటిట్లోకి వెళ్ళా.
                        “ఏరా ఇంత విషయం ఉంటే మాకెవరికి చెప్పావు కాదే” “సుచరిత ఇష్టపడలేదు నాన్నమ్మ. అందరు పిల్లాడిని గేలి చేస్తారేమోనని భయపడింది. అలాగే మీ నుండి ఏమ్మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కూడా కొంత భయపడింది. అందుకే రెండేళ్ళ బట్టి రావడానికి ఒప్పుకోలేదు..” సంజాయిషీ ఇచ్చాను. “అందులో తన తప్పేమీ లేదు లేరా. నూటికి నూరుపాళ్ళు ఏ తల్లి అయినా అలాంటి పరిస్థితుల్లో అలాగే చేస్తుంది.” మనుషులని మనసులని అర్థం చేసుకోవడం లో నాన్నమ్మ తర్వాతే ఎవరైనా అనిపించింది.                    
సుహృత్ కి Intellectual disability ( ఇంటెలెక్చువల్ డిసబిలిటి)ఉందన్న విషయం  వాడికి ఐదేళ్ళు వచ్చేవరకు మాకు అర్థం కాలేదు. వాడు పాకడం , నడక , మాటలు అన్నీ ఆలస్యమే. తరగతి గదిలో ఓ చోట కుదురుగా కూర్చోలేకపోవడo, టీచర్ చెప్తోంది అర్థం చేసుకోలేకపోవడo, మిగిలిన పిల్లల మాదిరిగా కాక విషయాలని మర్చిపోతూ ఉండడం, పుస్తకంలో అక్షరాలని కుదురుగా కాక విసిరేసినట్లుగా రాయడం , ఏదైనా చెప్పడంలో , మాట్లాడటంలో పదే పదే తడబడ్డం…… వేటేనీ కూడా Intellectual disability (ఇంటెలెక్చువల్ డిసబిలిటి ) లక్షణాలుగా గుర్తిచడంలో విఫలం అయ్యాం.
“మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వేరే పిల్లల లంచ్ బాక్స్ల్లో వారు తింటుండగా తీసుకుని తింటున్నాడు. కోప్పడ్డా ప్రయోజనం లేదు. కొడితే భయపడాలన్న విషయం కూడా తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ ని కలవండి…..” అని వాడి క్లాస్ టీచర్ చెప్పేవరకు , మా పిల్లాడి ప్రవర్తన మిగిలిన పిల్లలకి భిన్నంగా ఉంటోందన్న విషయం అర్థం కాలేదు.
అర్థమయినా సుచరిత అంగీకరించడానికి సిద్దపడలేదు. టీచర్ల సాకులంది. స్కూల్ మార్చాలంది. మార్చిన స్కూల్లోనూ అవే కంప్లైంట్స్ . ఇంక లాభం లేదనుకొని సుచరిత ని బలవంతం గా ఒప్పించి సుహృత్ ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళా.
ఏ విషయం అయితే సుచరిత మనసు స్వీకరిoచట్లేదో అదే సుహృత్ జీవితo యొక్క కఠ‌‍‌‍న వాస్తవమైంది. ఆ క్షణాన ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లైంది. తండ్రిగా నా పరిస్థితే దుర్భరం . ఇక తల్లిగా సుచరిత……. అర్థం చేసుకోగలిగాను. ఓపిక పట్టాను. మెల్లిగా తనకి తాను సర్దుకుంటుందని , వాస్తవాన్ని జీర్నిoచుకుంటుందని ఆశిoచాను. కాని అలా జరగట్లేదు.
లోకమంతటినీ తప్పు పడుతోంది కాని తన బిద్దలోని లోపాన్ని మాత్రం ఒప్పుకోదు. ఎవరైనా పిల్లాడి గురించి సలహానో సానుభూతో ప్రకటిస్తే వారితో ఎదురు దాడికి దిగుతుంది. రాను రాను వైద్యం వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరమో తనకి అర్థం కావట్లేదు. డాక్టర్ , ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిద్దరూ శిక్షణ పొందాలి అంటారు. ముఖ్యం గా తల్లి .
వాడితో ఓపిగ్గానే ఉంటుంది. వాడిని కొట్టడం కాదుకదా కనీసం విసుక్కోగా కూడా తనెప్పుడూ చూడలేదు.విరాం లేకుండా వాడి వెంటే తిరుగుతూ, వాడి ప్రతీ చర్యను సర్దుకుంటూ , సమర్థించుకుంటూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా బిడ్డకి బుద్దిమాoధ్యత ఉంది అని ఒప్పుకోదు. చర్చ కి తావులేదు. “మీ బిడ్డని మీరే వెర్రివాడని అనుకుంటున్నారా ….” అని ఆవేదన చెందుతుంది. తన దుఖాన్ని చూసి మౌనం వహించడం మినహా చేయగలిగింది లేదు.
                     
***
“ ఏంటి! నాన్నమ్మ సుహృత్ ని ఆడిస్తున్నావా…”  వెనక వైపు  వసారా లో నాన్నమ్మ సుహృత్ లని అలా చూస్తుంటే తనకి తన బాల్యం గుర్తోచ్చిoది.  
“సుహృత్ ! తాతమ్మ ని ఆట పట్టిస్తున్నావా …” అంటూ నా వెనుకే వచ్చిన సుచరిత వెళ్ళి వాళ్ళిద్దరి ప్రక్కగా కూర్చుంది. ఆ ముగ్ద చిత్రంలో నా స్థానానికై నేనూ వెళ్ళి కూర్చున్నాను.
నాన్నమ్మ మమ్మల్ని చూసి చిరునవ్వు తో “ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి “ అని “అక్కడెక్కడో బౌద్ధ గురువట, యేవో పరీక్షలు జరిపి ప్రపంచంలోనే అందరికన్నా సంతోషవంతుడు అని తేల్చారట. వారి పరిశీలనలు ఏమోగాని , నాకు తెలిసి ఆయన సంతోషం గా ఉండటానికి కారణం తనదైన ప్రపంచంలో హాయిగా ఆనందంగా  జీవించడం , రాగద్వేషాలు కలిగి ఉండకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, వస్తువులకి విలువ్వివక పోవడం, ముఖ్యంగా ఎవరితోటి దేన్నీ పోల్చుకోకపోవడం… అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు గొప్పవారిగా  ఒప్పికుంటారా?” నాన్నమ్మ ప్రశ్న కి సమాధానంగా ఇద్దరం తలూపాం.
“మరి మీ బిడ్డ ఎదుగుదల పట్ల ఎందుకు అనుమానపడుతున్నారు.” నానమ్మ తర్కం అర్థంకాలేదు. నాన్నమ్మే మళ్ళీ “నా  మనవడు ఎండగా ఉన్నప్పుడు వాన కావాలి అంటాడు.  కుదిరిన ప్రతిమబ్బు కురవలంటాడు. అలా జరగనందుకు నిరుత్సాహ పడతాడు . ఒక్కోసారి విసుగు చెందుతాడు.  ఆ ఆలోచనలో నీకు లోపం కనిపిస్తే నీ భార్యకి అది ఆందోళని కలిగిస్తుంది. అసలు ప్రకృతే గమనించడం మానివేసిన మీలాంటి వారికి అదో మానసిక రుగ్మత లా కనిపిస్తుంది.”
నాన్నమ్మ మాట్లాడుతోంది. నాకు అర్థమై కానట్లుగా ఉంది. కాని ఎక్కడో ఏదో నా ఆలోచనల్లోనే లోపం ఉందని అర్థమైంది. వికాసమైన వికలత అయినా మనిషి ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. వాడి గురించి నేనలా ఆలోచించడం నా మనో వైకల్యoలా ఇపుడు అనిపిస్తోంది.
“మనిషి ఎదిగేకొద్దీ  వాడిలోని పసిమనసు కనుమరుగవుతుంది. మేధ పెరగడమే దానిక్కారణం అనుకుంటారు మీలాంటి మేథోవంతులు కాని అసలు సిసలు మేథ జిజ్ఞాసని ఎల్లప్పుడు జీవింపచేసి ఉంచటమే. ఆ మేధ వాడిలో ఉంది. మీ అజ్ఞానo వాడి మేధని అడ్డుకుంటోందని ఏనాడైనా ఆలోచించారా..?” సూటిగా ప్రశ్నించింది నాన్నమ్మ.
“నిజమే! అమ్మమ్మగారు. నలుగురిలోనూ ఆఖరికి నా భర్త సమక్షంలో కూడా నేనేనాడు నా బిడ్డకి మనో వైకల్యత ఉందని ఒప్పుకోలేదు. కాని నాకేతెలియకుండా నా అంతరంగాలలో ఎక్కడో ఎప్పుడో అదే అభిప్రాయం స్థిరపడినట్లుంది. అందువల్ల నిత్యం నేను , నాతో ఇతరులతో కూడా ఘర్షణ పడుతూ ఉండేదాన్ని. మీరు స్థిరంగా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అని చెప్తున్నారు.  నా మనస్సు , వాక్కు , చేత దేనికి పొంతన లేని కారణాన నా బిడ్డ జ్ఞానాన్ని జిజ్ఞాసని గుర్తించలేకపోయాను. సంఘంలో నా బిడ్డ స్థానం గురించిన ఆందోళనే తప్ప నా ఈ రకమైన ప్రవర్తన వాడి ఎదుగుదలకి అవరోధం అవుతోందని తెలుసుకోలేకపోయాను. ఇతరులకి భిన్నంగా ఉండడo ప్రత్యకమే తప్ప పొరపాటు కాదు అని ఆలోచించలేకపోయాను.” కళ్ళు వర్షిస్తుండగా మనసు విప్పి మాట్లాడుతోంది సుచరిత.
ఇన్నాళ్ళూ సుచరిత లో తప్పులు వెదకడమే తానూ చేసాడు  తప్ప తన ఆలోచనల్లో దాగి ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సుహృత్ కూడా ఆ బౌద్ధ గురువులాగే రాగద్వేషాలు లేనివాడు. దేనితోనూ ఏది పోల్చనివాడు. ప్రకృతి ని ప్రేమించేవాడు. అమ్మ అంటే విపరీతమైన అనురాగం, నిష్కల్మషమైన చిరునవ్వుతో అందరిని పలకరించే వాడి అమాయకత్వం… ఆలోచిస్తుంటే తెలుస్తోంది వాడి వ్యక్తిత్వపు పరిమళం.
నాన్నమ్మ పాదాలనoటి చెప్పాను “ఇంకెప్పుడు ఎవరితోనూ పోల్చను. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాడి మేధ ఎందులో ఉందో వెలికితీస్తాను.”
“ఈయన తిప్పని psychriyatist లేరు. కాని మీలా అర్థం చేయించిన వారెవరూ లేరు. చాలా థాంక్స్ అమ్మమ్మగారు…” ఆనందాశ్రువులు రాలుతుండగా రెండు చేతులూ జోడిచింది సుచరిత. మునుపెన్నడూ లేని సంతోషం సంతృప్తి కనిపించాయ్ ఆ కళ్ళల్లో.
“చాల్లెండర్రా ! మీరు మీ పొగడ్తలూ. వీడు నా మనవడు. వాడు నా మునిమనవాడు. నా కుటుంబంలోని పిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది కాని మీరు చెప్పే ఆ నాలుగు మాటలు వినే ఆ డాక్టర్ కి ఏం తెలుస్తుంది. యెంత తెలుస్తుంది. సరే!ఇంక మమ్మల్ని విసిగించక వెళ్లండి. మేమిద్దరం ఆడుకోవాలి….” అని నవ్వుతూ నా జీవితంలోని ఉప్పెనని ప్రశాంత నదీ ప్రవహంలా మార్చిన నాన్నమ్మ ఋణo ఏమిచ్చి తీర్చుకోగలను…..
 
 
 

May 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మానవత్వమా… నీ చిరునామా ఎక్కడ?

by Dr. Aruna Parandhamulu May 29, 2026
written by Dr. Aruna Parandhamulu

పట్టణపు వెలుగుల వెంబడి నడిచాను
నీలి దీపాల నీడల్లో తిరిగాను
ఎత్తైన గోడల మధ్య
మనుషుల గుంపులు కనిపించాయి
కానీ… మనసుల జాడ మాత్రం దొరకలేదు.

చెరువు ఒడ్డున ఆకలి ఏడుపు వినిపించింది.
చిన్నారి కళ్లలో ప్రపంచం మునిగిపోయింది.
“మానవత్వం ఎక్కడ?” అని అడిగితే
జవాబు కాదు కన్నీరు మాత్రమే జారింది.

ఆసుపత్రి గడప వద్ద జీవితం తడబడుతుంటే,
డబ్బు లేక ప్రాణం ఆగిపోతుంటే,
చేతులు జోడించిన తల్లి వేదనగా అడిగింది
“మానవత్వమా… నువ్వూ ధనవంతులింటికే చేరావా?”

రోడ్డు మీద రక్తం కథ చెబుతుంటే,
చుట్టూ నిల్చున్న కళ్ళు కెమెరాలయ్యాయి…
ఒక్క చేయి ముందుకు రాలేదు
అక్కడే మానవత్వం మౌనంగా చనిపోయింది.

కులం గోడలు కట్టిన లోకం ఇది,
మతం కత్తులు దించిన కాలం ఇది,
అధికారపు అహంకారంతో
మనిషి మనిషినే దహించుకుంటున్న దృశ్యం ఇది.

ఇంట్లో తల్లిదండ్రుల నిశ్శబ్దం విలపిస్తోంది,
వృద్ధాశ్రమాలే వారి చిరునామాలయ్యాయి.
బయట ప్రేమను బోధించే వాక్యాలు,
లోపల బంధాలను బంధించే తాళాలు…

అందుకే…
ఈ భూమిపై నీ జాడ కోసం తిరిగి
నా అడుగులు అలసిపోయాయి, మానవత్వమా!

నువ్వింకా బ్రతికి ఉంటే
ఆకలికి అన్నం అయ్యి రా,
కన్నీటికి ఓదార్పు మాటగా మారి రా,
పడిపోయినవారికి తోడు నిలిచే భుజమై రా.

ఎందుకంటే
మనుషుల కోసం గోపురాలు కట్టిన ఈ లోకంలో,
మనసుల కోసం మాత్రం గుడి కట్టలేకపోతున్నారు…
మనిషి కోసం ఒక్క మానవత్వ హృదయం కూడా
కనిపించదు ఈ కాలంలో—
ఇంకా నిన్ను వెతకను…
ఎందుకంటే…
నువ్వుంటే
అది ఒక మనసులో కాదు—
మనిషిలో కనిపించాలి.

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya May 29, 2026
written by Sammeta Vijaya


వన్ ప్లస్ వన్ నాటిక

రచన మాడభూషి దివాకర్ బాబు గారు . దర్శకత్వం డా. శ్రీజ సాదినేని. నటీ నటులు శ్రీజ సాదినేని, శశిధర్‌ ఘణపురం
వన్ ప్లస్ వన్ సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో రసరంజని , శ్రీ చాట్ల శ్రీ రాములు థియేటర్ ట్రస్ట్ నిర్వహణలో ప్రతిభా పురస్కారం 2025 శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి (సీనియర్ రంగస్థల నటులు ) ప్రదానం చేసిన సభలో శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి ప్రతిభా పురస్కారం అందించి ఘనంగా సత్కరించిన తరువాత నాటిక ప్రదర్శన జరిగింది. ఇది డా. శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన 38 వ నాటిక.
డా. శ్రీజ సాదినేని ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర నటి, రచయిత్రి, దర్శకురాలు, వ్యాఖ్యాత, యాక్టింగ్ ఫ్యాకల్టీ, డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది. 1994, ఏప్రిల్ 14న తొర్రూరు పరిషత్ లో నిర్వహించిన నాటికల పోటీలలో జన చైతన్య ఒంగోలు వారి మేడిపండు నాటికలో అమ్ములు పాత్ర ద్వారా బాల నటిగా నాటకరంగంలో అడుగుపెట్టిన శ్రీజ అనేక ఇప్పటివరకు అనేక ప్రదర్శనల్లో పాల్గొని, మూడువేలకు పైగా బహుమతులను అందుకున్నది. 150 కి పైగా సాంఘిక నాటికలు/ నాటకాలలో, 15 కు పైగా పద్య నాటకాలు, 40 నాటికలు దర్శకత్వం వహించారు . కొన్ని నాటికలు, ఏక పాత్రలు స్వయంగా రచించారు. జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ‘వన్ ప్లస్ వన్‘ నాటిక ప్రదర్శించారు.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ గారు ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు. మంచి రచనా శిల్పం కలిగిన రచయిత. వైవిధ్యమైన నాటికలు నాటకాలు రచించి ప్రదర్శింపచేసారు.దివాకరబాబు నాటకములు , నాటికలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వీటిలో రెండవ వాల్యూమ్ లో వన ప్లస్ వన్ ప్రచురితమై ఉంది .
వన్ ప్లస్ వన్ నాటిక నేపథ్యం :
ఈ నాటికకు ఓ ప్రత్యేకత. నాటకం లో రెండు పాత్రలు. సరిగ్గా రెండు పాత్రలే. జీవితాన్ని ఒంటరిగా గడపడం తప్ప వేరే దారి లేదని భావించే అతను , జీవితాన్ని ఇష్టం లేని వృత్తిలో కొనసాగుతున్న ఆమె ఒకానొక పరిస్థితి లో ఎలా కలిశారు వాళ్ళ మధ్య జరిగిన హృద్యమైన సన్నివేశాల సమాహారం ఈ నాటిక . మనసు విప్పి ఒకరి భావాలు మరొకరు తెలియజేసుకున్న వైనం , ఎలాంటి పరిణామానికి దారి తీసిందో రచయిత సున్నితంగా ఆవిష్కరించారు.
కేవలం రెండు పాత్రలతో కథ నడపడం నాటిక ఎక్కడా విసుగు రాకుండా సాగించిన విధానంలో దర్శకత్వ ప్రతిభ కనబడింది. నాటకం ఆద్యంతం తమ నటనతో ఎప్పటికప్పుడు తగిన హావ భావాలు పలికిస్తూ విరామం లేకుండా నటించడం కష్టసాధ్యమైనప్పటికీ తమ నటనతో ఆకట్టుకున్నారు శశిధర్‌ , శ్రీజ. నాటిక ను సహజ నటనతో శశిధర్‌ సొంతం చేసుకుని ఆ పాత్రకు తగిన న్యాయం చేసాడు. శ్రీజ ఎక్కడా ఏ మాత్రం తడబాటు లేకుండా హుషారుగా పాత్రకు ప్రాణం పోసింది. ఇద్దరి మధ్య సున్నితమైన బంధం ఎక్కడా ఇబ్బందికరంగా లేకుండా కొనసాగింది. వారి మధ్య ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుబంధాన్ని
చూపించే ప్రయత్నంలో సంభాషణలు “మాటి మాటికి నిన్ను పిలిపించుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు” అన్న అతను “నీ దగ్గర నేనీ ఇంటి ఇల్లాలిననిపించేది” అన్న ఆమె సమాజంలోని స్థితిగతులను ప్రశ్నిస్తాయి.
నాటికకు సహకారం సాంకేతిక నిపుణులు మేకప్ అవినాష్, సంగీతం రాజశేఖర్, సెట్& లైటింగ్ సురభి ఉమా శంకర్ అందించారు.
జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ప్రదర్శించిన ‘వన్ ప్లస్ వన్‘ నాటికకు దర్శకత్వం వహించిన శ్రీజను రసరంజని వారు సత్కరించారు. నగదు బహుమానం అందించారు . కార్యక్రమ అతిథి శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు శ్రీజకు , శశిధర్‌కు , రచయితకు , సాంకేతిక నిపుణులు అవినాష్, రాజశేఖర్, ఉమా శంకర్ లకు నగదు బహుమానం అందజేసారు.
రెండు పాత్రలు అనగానే భూమిక థియేటర్ గ్రూప్ లో ఝాన్సీ రచించి వంశీ చాగంటి తో కలిసి ఇదే విధమైన రెండు పాత్రలతో నటించిన నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శించిన విషయం గుర్తు రాక మానదు. ఇటువంటి వైవిధ్య భరితమైన రచనలు తెలుసుకొని నాటకసాహిత్యంలో వాటి వైశిష్ట్యాన్ని తెలియజేయాలి. ప్రదర్శనలు జరిగినప్పుడు ఎంతో శ్రమకోర్చి సాధన చేసి ప్రదర్శించిన నాటిక చూడటం మన సాంస్కృతిక శోభను ఇనుమడింప చేసుకున్నట్లు అవుతుంది.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు , దర్శకురాలు డా. శ్రీజ సాదినేని, నటుడు శశిధర్‌ , సాంకేతిక నిపుణులు సర్వదా అభినందనీయులు.

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అనుబంధం

by Namani Sujanadevi May 29, 2026
written by Namani Sujanadevi

‘హలో…..హలో….దిస్ ఈజ్ తేజ….హూ ఈజ్ దిస్ ..’             

‘హలో……బుచ్చన్నా …..’  అటు నుండి ఆదుర్దాతో నిండిన అక్క  కంఠం….

అమ్మావాళ్ళకి తప్ప ఎవరికీ తెలియని తన అసలు పేరు …. ఇండియా నుండి …. దెబ్బకు నిద్రమత్తు వదిలింది…. బెడ్ పై నుండే కాల్ లిఫ్ట్ చేసినవాడినల్లా  దిగ్గున లేచాను …. ఇంత అర్ద రాత్రి .

‘అక్కా…. ఏమైంది …..’ వద్దనుకున్నా ఎదో భయం తొంగి చూసింది  నా కంఠం లో .

‘…. నాన్న కు కొంచెం ఆరోగ్యం బాలేక పొతే హాస్పిటల్ లో జాయిన్ చేసాను… నిన్నే కలవరిస్తున్నాడు …అమ్మ,  నాన్న దగ్గర హాస్పిటల్ లో ఉంది … తొందరగా రా…..’  అక్క అంది.

‘నాన్న …నాన్నకు ….ఇప్పుడెలా ఉందక్కా .. ప్రాబ్లం ఏమీ లేదు కదా….అమ్మతో నైనా మాట్లాడించ కూడదూ … నేను వెంటనే బయల్దేరుతాగాని …’

‘బానే ఉంది …హాస్పిటల్ లో సిగ్నల్స్ లేవు గాని …నువ్వు రారా ……’పెట్టేసింది ..

   ఇక నిద్ర పట్టలేదు…. ఎంతో అత్యవసర మైతే తప్ప అక్క రమ్మనదు . ఏమైంది నాన్న కి…

మనసెందుకో కీడు శంకించింది.

పక్కన సునీల, పిల్లలిద్దరూ  హాయిగా నిద్ర పోతున్నారు. తను ఒక్కడే వెళ్ళాలా …అందరు వెళ్ళాలా… ఇంత హడావుడిగా అంటే…. అయినా ఫర్లేదు… అందరు వెళ్ళడమే మంచిది.. అమ్మ ఎన్నో సార్లు అడిగింది అందరూ రమ్మని… దాదాపు ఆరేళ్ళవుతోంది పిల్లలతో వెళ్లి … పిల్లలతో ఏంటి… చిన్న పాప పుట్టిన దగ్గర నుండి కూడా అమ్మ,నాన్న  చూళ్ళేదు…స్కైప్  లో చూడడమే తప్ప ….  అందరితో కల్సే వెలితే  సరి ..

అర్జెంట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను ….  ఆఫీస్ కి లీవ్  అరేంజ్ మెంట్స్ చేసుకున్నాను .

      విషయం చెప్పి అర్జెంట్ గా సునీలని పిల్లలని బయల్దేరదీసాను … ప్రతీ చోట సమయానికే తప్ప డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా , ఫ్లైట్ తర్వాత కూడా టాక్సీ , కాబ్ బుక్ చేసుకుని ఫోన్ లో అక్క, బావ లతో టచ్ లో ఉంటూ తమ ఊరిలోకి అడుగు పెట్టాడు. 

      మట్టి రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వచ్చింది. గుడిసె లలాంటి ఇంటి ముందర ఉండే ఆవులు, గడ్డి వాములు పోయి చిన్న చిన్న డాబా ఇళ్లయ్యాయి… పెంకుటింటి ముందు, డాబా ఇళ్ళ ముందు ఇంతక ముందు అందరూ కూర్చుని  మాట్లాడుకునే అరుగులు పోయి , గోడలు గేట్లు వెలిసాయి.  గడప పై పసుపు పూసి బొట్లు పెట్టి, గడప చుట్టూ ఎర్రమట్టి తో అలికి , వాకిట్లో పచ్చని పేడతో కల్లాపి చల్లి , తెల్లని ముగ్గు వేసే  సంస్కృతి  పోయి  సిమెంట్ వాకిళ్ళ పై కలర్లతో ముగ్గువేసే సంస్కృతి  వచ్చింది.  ఇపుడిపుడే నాగరికత సంతరించుకుంటున్న ఊరు … అప్పటి పాత ఆనవాళ్ళు లేకుండా చేసుకోవడానికి వ్యర్ద ప్రయత్నాలు చేస్తోంది.

     కారు నెమ్మదిగా పోతోంది… సునీల పిల్లలు దూర ప్రయాణం వల్ల అలసిపోయి నిద్రపోతున్నారు.. పక్కనున్న పచ్చని పోలాలనుంది చాలా స్వచ్చమైన పైరగాలి వస్తోంది. అది ఎంత ఆహ్లాద పరుస్తున్నా, తెలియని ఆందోళన మనస్సును మెలిపెడుతోంది. రాత్రి నుండి నిద్ర లేదు. విమానం లో కూడా ఎంత కళ్ళు మూసుకున్నా ఆలోచనలే తప్ప నిద్ర రాలేదు.. ఎన్నెన్నో  జ్ఞాపకాలు, మధుర స్మృతులు …

. నాన్న ఆజంజాహి మిల్ లో కార్మికుడు. ముగ్గురు  అన్నయ్యలు , ఒక అక్క  తర్వాత  తను పుట్టాడు. తను పుట్టక ముందు అనారోగ్యం చేసి అన్నయ్య లిద్దరూ పొద్దున్న ఒకరు,  సాయంత్రం ఒకరు చనిపోయారట.  అంతకు ముందే ఒక అన్నయ్య చనిపోయాడట. అమ్మ గుండెలవిసేలా ఏడ్చిందట.  అందుకే తను బతకాలని  పుట్టగానే ముక్కు కుట్టించి బిక్షపతి అని పేరు పెట్టారట. చిన్నప్పటి నుండి ఇంట్లో అమ్మ, నాన్న,అక్క అందరూ బుచ్చన్నా అనే పిలుస్తారు. వాళ్ళు , మేనమామ  తప్ప ఎవరైనా ఆ  పేరు పెట్టి పిలవరు. తన పెళ్ళికి ముందు ఎంగేజ్ మెంట్ లో  సునీల ముందు వాళ్ళు బుచ్చాన్నా అని పిలుస్తుంటే , ఆమె ఎవర్నో అనుకుందట. నాన్న కూడా స్కూల్లో చేర్పించేప్పుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ,తన ఇంటికి దేవుడిలా పుట్టాడని సూర్య తేజ అని పేరు పెట్టాడు…

      మిల్లు సైరన్ పొద్దున్న నాలుగు గంటలకే మోగేది. అప్పుడు నిద్ర లేసి  , అరగంట లో

తయారై వెళ్ళిపోయేవాడునాన్న. అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చి రమ్మని తనను,  అక్కను పంపేది. అప్పుడు మూడు నాలుగు గిన్నెలతో ఇంత పొడుగు టిఫిన్ బాక్స్ ఉండేది. అందులో  ఒక దాంట్లో గడక (జొన్నన్నం), ఒక దాంట్లో పెరుగు, ఒకదాంట్లో మామిడి కాయ పచ్చడి లేదా కూర , ఒక దాంట్లో పెరుగు ఉండేవి… ఆ టిఫిన్  బాక్స్, చెంబులో నీళ్ళు పట్టుకుని తను ,అక్క  అడ్డదారి గుండా మిల్లు లో ఉన్న నాన్నకు సద్ది తీసుకెళ్ళే వాళ్ళు. నీళ్ళు తాగడానికి కాదు. చెప్పులు లేని తమ కాళ్ళకు ఎండలో బొబ్బలు రాకుండా . అక్కా, తనూ పరుగెడుతూ కాళ్ళపై నీళ్ళు పోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. స్కూల్ కి కూడా అక్క, తను  చెప్పుల్లేని కాళ్ళ తోనే వెళ్ళేవాళ్ళు.  మిల్లు లోని కాంటిన్ లో  గళ్ళ లకు గళ్ళ ల్లా ఉండే బూంది నాన్నకు పది పైసలకే వచ్చేది. రోజూ నాన్న రాగానే లోపలనుండి పరుగెత్తుకుని వెళ్ళేవాళ్ళు  తను, అక్క… నాన్న ఇద్దరికీ బూంది ఇస్తూ చెరో ముద్దు ఇచ్చేవాడు.

 నాన్నకు ఆయుర్వేద వైద్యం తో పాటు , ఆధ్యాత్మికత, భజనలు ,పాటలు చాలా ఇష్టం. దాశరధిశతకం లోని ‘ముప్పున కాల కింకరులు ముంగిట నిల్చిన వేళ…. కఫము కుత్తుక జొచ్చిన వేళ..రామా… నీ నామ స్మరణ కలుగునో కలగదో …నాటి కిప్పుడే నేను జేసెద నీ నామ స్మరణ   దాశరధీ దయాపయోనిదీ ….’ పద్యం ,  ‘శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ ….  కంజ నేత్ర హిరణ్య కశ్య నాశక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ….ప్రహ్లాద వరద పాపద్వంస సర్వేశ కృష్ణ సాగర శయన కృష్ణ వర్ణా …పక్షి వాహన లసత్బ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మ యుగళా… చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల వైకుంట ధామ భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస …దుష్ట సంహార నరసింహ దురిత దూరా….’ అంటూ నరసింహ శతకం లోని పద్యాలు రాగ యుక్తంగా ఎంత చక్కగా పాడేవారో… తనకూ అందుకే కంఠతా అయిపోయాయి. ఇవి మాత్రమేనా …. ‘జై జై మహాత్మా గాంధీ …. నీదే స్వాతంత్రా దీక్షా ….’ అంటూ గాంధీ గురించిన దేశ భక్తీ గేయాలు, పక్కనే ముస్లిం వాళ్ళు ఉండటాన ఉర్దూ లో గేయాలు పాడేవాడు. దూదేకుల వాళ్ళ ఇల్లు, దర్జీ పని చేసే ఖాజుద్దిన్ వాళ్ళిల్లు అన్నీ పక్క పక్కనే ఉండటం వల్ల హిందీ కూడా తెలుగంత స్పష్టం గా మాట్లాడే వాడు. తనూ వహీదక్క, జునీదన్న అని గోడ పక్కనే ఉన్న  వాళ్ళింట్లో ఎప్పటికీ ఆడుకుంటూ ఉండేవాడు. ఇక సాయంత్రం అయితే చాలు ఏడు గంటల వరకే అంతా భోజనాలు చేసి తమ ఇంటి ముందున్న అరుగు మీదకు చేరేవారు..సరిగ్గా వీధి లైట్  తమ ఇంటి ముందే ఉండేసరికి అంతా అక్కడికే చేరే వారు.  ఇక అక్కడ నాటకాలు, పద్యాలు, భజనలు, జోకులు, కష్ట సుఖాలు సకలం పంచుకునే వారు. మగవాళ్ళు నాటకాలు వేస్తూ , పద్యాలు పాడుతుంటే ఆడవాళ్ళు అంతా ఒక పక్కన మిగతా అరుగుల పైన కూర్చుని చూసేవారు. పిల్లలు అమ్మా నాన్నలతో పాటు చిరతలు, తబలా లాంటివి వాయిస్తూ తమ తోటి పిల్లలతో ఆడుతూ ఎంజాయ్ చేసేవారు.  అసలు ఆ సమావేశం ఎంత  లైవ్ లీ గా ఉండేదంటే అందరూ  రోజూ పోద్దటి నుండి చేసిన శ్రమ నంతా అక్కడ మర్చి పోయేవారు. ఆ సాయంత్రం కోసం ఎదురు చూసేవారు.

     అలా పది వరకు ఆడుతూ పాడుతూ చదివిన తను ఇంటర్ లో తప్పని సరై దగ్గరలోని పట్టణం లో హాస్టల్ లో చేరాడు. అమ్మానాన్నలను వదిలి అలా ఉండడం అదే మొదటి సారి కావడంతో చాలా కష్టమయ్యేది. అమ్మానాన్న లకు కూడా అంతే… వారానికి ఒక్క రోజు ఇంటికి వచ్చే తన కోసం కళ్ళు కాయలు కాస్తూ ఎదురు చూసేవారు.

     నాన్నకు తానంటే చాలా ప్రాణం. ఒక సారి అమ్మ ఇంట్లో బోడ కాకరకాయ కూర వండింది.

నాన్న తో పాటు అందరూ శాఖాహారులే.  అదే చాలా మంచిది అనేవాడు.   తనకు బోడ కాకరకాయ కూరంటే చాలా ఇష్టం. కాబట్టి నాన్న ఆరోజు, ‘ ఆకూర నా కొడుక్కు ఇచ్చి వస్తాను ….బాక్స్ లో పెట్టి ఇవ్వు’ అన్నాట్ట…. దానికి అమ్మ, ‘ బస్ లో వెళితే రాను పోనూ డబ్బులు ఖర్చు అవుతాయి…ఎలాగూ వాడు మరో రెండు రోజుల్లో ఆదివారానికి వస్తాడు కదా… ఏమొద్దు’ అందిట. దానికి నాన్న, ‘ ఈ కూర వాడికి బాగా ఇష్టం ..ఇవ్వాళ ఎలాగైనా వాడిని చూడాల్సిందే … నా చేత్తో వాడికి ఈ కూర పెట్టాల్సిందే….  బస్ కి డబ్బులు అంటున్నావు కాబట్టి నా సైకిల్ పై వెళతాను…’ అన్నాట్ట. అమ్మ , ‘ రాను పోను నలభై కిలో మీటర్లు ఎలా తోక్కుతావయ్యా … వద్దులే..’ అన్నా వినకుండా  బాక్స్ లో పెట్టమన్నా డ ట. కొంచెం కూర ఇంట్లో ఉంచి మిగతాది వేసిస్తే, ‘  వద్దు..మనకు లేకున్నా ఫర్వాలేదు…వాడి ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా… నీ చేయివంట అందరికీ ఇష్టమే.. మొత్తం వేయి ..అంటూ గిన్నె మొత్తం ఊర్పించి బాక్స్ లో పెట్టి సైకిల్ పై బయల్దేరాడట… అయితే అదే రోజు తనకు నాన్నను చూడాలని పించడం తో , కాలేజీ హాస్టల్ లో పర్మిషన్ తీసుకుని బయల్దేరాడు. అప్పుడు ఫోన్ లు లేవు కాబట్టి నాన్న సైకిల్ పై అటు, తాను  బస్ పై  ఇటు వచ్చామట… నాన్న తన ఫ్రెండ్స్ కి ఆ కూర ఇచ్చి , ఉసూరు మంటూ మళ్ళీ సైకిల్ పై వచ్చేసరికి చాలా రాత్రయి పోయింది. నాన్న రాగానే తనను దగ్గరకు తీసుకుని ఈ విషయం చెబుతుంటే, అమ్మ, ‘ ఇంట్లో కొంచెం కూడా వాడికి దక్కనియ్యక మొత్తం కూర తీసుకుని, వాడిని తినకుండా చేస్తివి’ అంటూ ముద్దుగా విసుక్కున్నా..అందరం తెగ నవ్వుకున్నాం.   ఆ రోజు తన కిష్టమైన కూర తినకున్నా నాన్న కోసం తాము ఎప్పటిలా  తినకుండా ఎదురు చూసి వచ్చాక పచ్చడి మెతుకులు తిన్నా , ఆ ఆనందమే వేరు…

  అలాగే నాన్నకు చలి అస్సలు పడేది కాదు . చిన్న చిరు చలి కైనా వణికి పోతూ రగ్గు కప్పుకునే వాడు . తల చుట్టూ నల్లని మఫ్లర్  కట్టుకునేవాడు. అమ్మ, అక్క వెక్కిరిస్తుంటే తను నాన్న జట్టుండి నాన్నకు ఇంకా వెచ్చగా కప్పేవాడు. మిల్లుకు చలికాలం  చలి లో నాన్న వెళ్ళడానికి చాలా కష్ట పడేవాడు. ఒక్కోసారి షిఫ్ట్ మార్చుకునేవాడు. అయినా అలా అయితే మధ్యాన్నం వెళ్ళినా రాత్రి పది గంటలకు చలి ఉండేది. కాబట్టి తను నాన్నకు తెలీకుండా తమ ఇంటికి వచ్చిన మామయ్యలు , చుట్టాలు ఇచ్చిన డబ్బులు,  తన పుట్టిన రోజుకు బట్టలు వద్దు …గల్లాలో దాచుకుంటా అంటే అమ్మానాన్న ఇచ్చిన డబ్బులతో ఒక స్వెట్టర్,   మంకీ కాప్ కొన్నాడు నాన్నకి. దానికి నాన్న ఎంత సంతోష పడ్డాడో… ఎంత మందికి చూపించి , నా కొడుకు ఇచ్చాడని గర్వంగా చెప్పాడో…. ఇప్పటికీ తను అమెరికా నుండి పంపించిన మంచి మంచి స్వెట్టర్ లు ఉన్నా నాన్న దాన్నే ఇష్టపడతాడు. అలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్ని జ్ఞాపకాలో….

        మొన్న నాన్న మాట్లాడేప్పుడు, ‘ తమ ఇంటికి ముందున్న ఖాళీ స్థలం లో ఒక వేదిక,  హాల్ కట్టిస్తే , నాట్యం, సంగీతం , నాటిక ,పెళ్లి, సంబరాలు అలా ఆ ఊరిలోని ఎ వేడుక కైనా అది వేదిక అవుతుంది, కళలను పోషించినట్లు, పేదవాళ్ళని ఆదు కున్నట్లు అవుతుంది రా… అలాగే అమ్మ కి గుడి అంటే ఇష్టం. ఎప్పటికి నేను అన్నివేళలా ఉండను కదా తనను తీసుకెళ్ళడానికి, అందుకే చిన్న గుడి కట్టిస్తే బావుండు… ఖాళీ సమయాల్లో అక్కడ అమ్మ , నేను చిన్న పిల్లలకి, భగవత్గీత , సుమతి, వేమన, నరసింహ శతకాల లోని పద్యాలు చెప్పొచ్చు.’ అన్నాడు. ‘సరే…చూద్దాం నాన్నా.’ అన్నాడు.ఆ విషయం కూడా మాట్లాడాలి.

     చిన్న కుదుపుతో కారు ఆగేసరికి  ఆలోచనల నుండి బయటకు వచ్చాను. ఆ కుదుపు తో సునీల కూడా లేచి చుట్టూ చూస్తోంది. బయటకు చూసాను. టెంట్ వేసిన ఎదో ఇంటి ముందు కారు ఆగింది. ఇది మా ఇల్లు కాదంటూ కార్ డ్రైవర్ కి చెప్పబోతూ ఆగిపోయా…. ఎందుకంటే ఆ అరుగుల మీద ఉన్న బావ, మామయ్యా, ఇతర బంధువులు కారు ను చూసి లేచి కారు దగ్గరకు వస్తున్నారు. ఉలిక్కి పడి  తీక్షణంగా చూసా… మా ఇల్లే… ఇంటి ముందు కాలుతున్న కట్టెలు … 

 అంటే….. మస్తిష్కం మొద్దు బారింది.. రెండు రోజుల ముందు,’కన్నా…  మన ఊళ్ళో గుడో, బడో కట్టించాలని ఉందిరా ….దేశం గాని దేశం లో ఉన్నావ్..జాగ్రత్త .. ‘ అంటూ తనకు జాగ్రత్తలు చెప్పిన నాన్న  తన జాగ్రత్త చూసుకోలేక పోయాడు… తను ఇంకా తన కోసం తన కిష్టమైన కూర నాన్న వండించి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నాడు… ఇంత హటాత్తుగా…కారు దిగిన తనను బావ, మామయ్య హత్తుకున్నారు  విలపిస్తూ…  మానసికంగా నిర్వీర్య మైన తన దేహాన్ని  ఇద్దరూ  అతి కష్టం పైన నడిపిస్తూ లోనకు తీసుకెళ్ళారు. లోపల హాల్లో నాన్న  వాలు కుర్చీ పక్కన మంచు ముక్కల పైన నాన్న దేహం నిర్జీవంగా …పూలదండలతో ….

    చలికి వణికి పోయే నాన్న దేహం ఇప్పుడు మంచు ముక్కలపై…అన్ని గంటలు… నా కోసం…

ఆ దేహం పై చిన్నప్పుడు నేను కొనిచ్చిన స్వెట్టర్… భరించ లేక పోయా…. నాన్న పాదాల పక్కన రేగిన జుట్టు , ఉబ్బిన కళ్ళతో  శోక దేవత లా అమ్మ, పక్కనే  నిలువెల్లా నీరైన అక్క.

   నన్ను, సునీలను, పిల్లలను చూడగానే ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి…  అమ్మ ఒళ్లో వాలుతూ  చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను.  నాన్న పాదాలను కన్నీటి తో కడిగాను..

     ఇక తర్వాత తతంగం అంతా కలలోలా జరిగి పోయింది. చిన్ననాటి నేస్తాలంతా ఎంతో ఆప్యాయంగా హత్తుకుని ఓదార్చారు.  చిన్ననాటి ఊసులెన్నో మాట్లాడు కున్నాం..నాన్న  బూడిద, అస్తికలు అన్నీ కాశీ, కాళేశ్వరం  అన్ని పుణ్య క్షేత్రాలలో కలిపాం.

అయిదవ రోజు అక్క, బావ , ‘అమ్మ ఇక పై ఎక్కడ ఉంటుంది’  అన్న విషయం లేవదీసారు .

‘నాన్న లేని ఈ ఇంట్లో ఇక అమ్మ ఉండదు.ఉంటె పదే పదే నాన్న జ్ఞాపకాలతో ఆరోగ్యం ఖరాబవుతుంది… కాబట్టి నేను తీసుకెలతాను… లేదంటే నేను అక్కడ రిజైన్ చేసి ఇక్కడికే వచ్చేయమన్నా వస్తాను…  అమ్మకు ఏది ఇష్టమైతే అలాగే చేద్దాం..’  అన్నాను.

‘అమ్మ గురించి నువ్వు నీ సెటిల్ అయిన జీవితాన్ని ఈ వయసులో వదిలి ఎందుకు బాధ పడటం.. అమ్మ నే తీసుకెళ్ళు.. అమ్మకీ స్థల మార్పిడి అయి కొంచెం ఆరోగ్యం కుదుట పడుతుంది’ అన్నారు బావ.

  ‘అలా  అయితే ఈ ఇళ్లెం  చేసేది… తాళం వేస్తె వట్టిగా బూజులతో పాడు పడి పోతుంది….

ఆ తర్వాత అయినా నువ్వేమయినా ఇక్కడికి వచ్చి ఉండేది ఉందా….. ఈ ఊరు సర్పంచ్,  ఇల్లు అమ్మితే కొంటా నంటున్నాడు… ఈ సమయం లో ఇది అడగడం తప్పే అయినా నువ్వు మళ్ళీ అమెరికా వెళితే కష్టం కాబట్టి అడగమన్నాడు ‘ అన్నాడు మామయ్యా…

‘మీ ఇష్టం మీరెలా అంటే అలాగే…..’ అన్నాను.

  ఆ సాయంత్రం మల్లె చెట్టు పందిరి కింద మంచం లో అమ్మ  పక్కనే కూర్చున్నా…. జాజి, మల్లె , మరువం,లిల్లి రకరకాల పూల చెట్ల నుండి పరిమళం హాయిగా ఉన్నా మనస్సంతా ఎదో ఆందోళన… ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని బాధ…. అమ్మానాన్న ఈ ఇంటి కోసంఎన్నో కష్టాలు పడ్డారు … నాన్నకు చలి పడదని , తను గోడలకు నీళ్ళు పట్టేవాడు.పుస్తకాల అర, బట్టలు పెట్టుకునే అరలు అక్క, తను కొట్లాడి తమ కిలా ఉండాలని ఎదో రారాజుల్లా తమ కిష్ట మైనట్లు కట్టించు కున్నారు. వాటిలో పుస్తకాలే కాదు ,,వాటి మధ్యలో వెలుతురు  చూడని నెమలీకలు, అమ్మ రాత్రితన వంతుకు  ఇచ్చే సర్వ పిండి చెక్కలను, చింతగింజలను , డబ్బులు దాచుకునే గల్లాను ఇలా  సకలం పెట్టుకునేవాడు. ఆ అర పక్క గోడ పై దేవుడి బొమ్మలు, రోజు వారి టైం టేబుల్ అంటించు కునేవాడు. అమ్మ కూడా స్టౌ పెట్టడానికి గట్టు, పక్క గిన్నెలు పెట్టడానికి, అటక పైన తమకు అందకుండా పిండి వంటలు పెట్టడానికి అరలు అలా చేయించింది. ఇక దేవుడి గది అయితే దీపావళికి నోము కుండ లకు అమ్మ పెట్టె బొట్లతో, దీపాలతో వెలిగి పోయేది . ఆ ఇంట్లోని ప్రతీ వస్తువుతో, ప్రతీ చోటుతో తనకెంతో మధురమైన మరపురాని అనుబంధం ఉంది. తనకే ఇలా ఉంటె తన కన్నా ఎక్కువ ఏళ్ళు నాన్నతో ఇదే ఇంట్లో గడిపిన అమ్మకెన్ని ఉండాలి. అసలు అమ్మను ఒక్క మాట అడక్కుండా అమ్మేద్దాం అనేసాడు…

  ‘అమ్మా… ఇల్లు అమ్మేయడం నీకు ఇష్టమేనా….’ అన్నాను… మాటివ్వడం, ఒప్పందం అన్నీ అయిపోయాక అడుగుతున్నందుకు గిల్టీగా ఫీలవుతూ… అమ్మ మాట్లాడ లేదు. కాని అమ్మ కంటి నుండి వచ్చిన నీళ్ళు ఎన్నో అర్దాలు చెప్పాయి.

    తెల్లవారి పదవ రోజు .. ‘ఇప్పటి వరకేప్పుడూ ఎ పక్షీ తొందరగా ముట్టడం లేదు… నాన్న కోరికేదైనా  ఉందేమో … సరిగ్గా మొక్కుకో రా బుచ్చన్నా..’ అక్క గద్గద కంఠం తో అంది. ఇవన్నీ నమ్మక పోయినా నాన్నను తల్చుకుని , ఒక కోరిక చెప్పుకున్నా… అంతే….

‘అరె..ఏమనుకున్నావురా, ఇప్పటివరకూ లేనిది ..అదిగో రకరకాల పక్షులన్నీ ఎలా గుంపుగా వచ్చి ముడుతున్నాయో’ సంభామాశ్చర్యాలతో అక్క, బావ అంటున్నారు. కళ్ళు తెరిచాను. నిజమే…

  ఇంటి కొచ్చాక  అందరి ముందు ,’ అక్కా… అమ్మా…. అందరికీ చెబుతున్నాను… నేను ఇంతకూ ముందు కోరుకున్న కోరిక, నాన్నకు నచ్చిన కోరిక చెబుతున్నాను. ఈ ఇల్లు అమ్మ బోవడం లేదు. ఇక్కడి మనుషులతో, ఈ నేలతో నాకున్న అనుబంధం మరపురానిది, మరవలేనిది. ఏనాటికైనా  ఇక్కడికి వచ్చినప్పుడు నాకూ ఈ ఊరితో గానీ, ఈ ఇంటి తోగాని, ఇక్కడి ఆత్మీయులతో గాని  ఎ సంబంధం లేదన్నది నేను ఊహామాత్రంగా నైనా భరించలేను. అందుకే ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశం లో చిన్న గుడి, దాని పక్కనే లైబ్రరీ ని, సకల కళలు ప్రదర్శించడానికి వేదిక, హాలు  ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అలాగే అమ్మ నుదుటి సింధూరం లో నాన్న కనపడతాడు. గాజుల గలగలల్లో నాన్న వినపడతాడు. చిన్నప్పటి నుండే  వచ్చిన కుంకుమ,పసుపు, పూలు తీసే హక్కు ఎవరికీ లేదు .  ఒక్క అమ్మ విషయం లోనే కాదు , మహిళలను ఏంతో  మానసిక వేదనలకు గురి చేసే ఆ తంతు,  భర్త పోయిన ఎ మహిళ కూ జరగకుండా చూస్తానన్నది ’  నాన్న కిచ్చిన మాట …’ నామాటలింకా ముగిసాయో లేదో, అందరి చప్పట్ల మధ్య అమ్మ నుదుటి పై ముద్దిచ్చి , అమాంతం  నన్ను అక్కున చేర్చుకుంది. అది నాన్న భరోసాలా, అమ్మ అనురాగంలా హాయిగా ఉంది .

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహిళా సమస్యలపై నవ’తరాన’ -మిస్సెస్ ఫలాన

by Ainampudi Laxmi May 29, 2026
written by Ainampudi Laxmi

50 కవితల ఈ సంపుటిని పలకరిద్దామని చేతుల్లోకి తీసుకున్నాను .కవితా గంధం జారిపడింది .హృదయం గొప్ప అనుభూతితో పరవశించింది. నామని సుజనాదేవి నాకు 25 ఏళ్ళ క్రితం పత్రికల ద్వారా, పరోక్షంగా…ఫోను ద్వారా స్వర పరిచయంగా … తర్వాత ఆకాశవాణి ద్వారా ప్రత్యక్ష పరిచయంగా ..అక్షరయాన్ ద్వారా వ్యక్తిగత పరిచయం గా దఫ దఫాలుగా నా మనసుకు దగ్గరయ్యింది .
తెలుగులో ఏ ప్రక్రియలో పోటీ జరిగినా తన పేరు ఉండడాన్ని గత రెండు దశాబ్దాలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఆగని సాహిత్య కర్మగారాన్ని వృద్ధి చేస్తుందా? లేక అక్షర సేద్యం చేస్తుందా? అన్నది నాకు ఒక ప్రశ్నగానే ఉండి
పోయింది. తన సాహితీయానాన్ని రెండు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వస్తున్న నాకు తనని తానే అధిగమిస్తూ, తనని తానే గెలుచుకుంటూ ముందుకు సాగుతున్న తన జీవన ప్రయాణం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే నామని నా సాహితీ యానం మీద పరిశోధన చేయాలనుకున్న విద్యార్థి. తన సాహిత్యం మీద అప్పటికే ఒక పీహెచ్డీ జరిగినప్పటికీ ఎందుకో తాను నన్ను బాగా అభిమానించేది.
నేను చేసే వైవిధ్యభరిత కార్యక్రమాలంటే తనకి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా ప్రసారమైన నా ‘కొత్త ప్రేమలేఖలు’ విని మొదట ఫోన్ చేసేది సుజనా, వారి భర్త సంపత్ గారే! మా ఇంటికి కూడా వచ్చారు. ఆ ఆటైంలో నా ఇంటర్వ్యూ, నా రచనల మీద సమీక్షలు రాసారు కూడా .
తాను తన తోటి రచయిత్రుల పట్ల ఎంతో గౌరవం చూపిస్తుంది. అది నాకు బాగా ఇష్టం. ఓపిక, వినయం , నేర్చుకోవాలన్న తపన తన వ్యక్తిత్వాన్ని సాన పడితే … నిరంతరం సమకాలీన సాహిత్యాన్ని చదవటం వల్ల తన రచనా వ్యాసంగం మరింత పదును తేలింది అని నాకు అనిపించేది . అందుకే తాను మా అందరికీ ఇష్టురాలు కాగలిగింది అనిపిస్తుంది .
నామని సుజన కథలు ఎన్నో మార్లు ఎన్నో చోట్ల పరిశీలనకు రావటం .. అందులో నేను న్యాయ నిర్ణేతగా ఉండటం అప్పుడు మిగతా వాళ్ళు సుజన కథల పట్ల ఎలా స్పందిస్తుంటారో చూస్తూ వచ్చాను. ఎంచుకునే అంశంపట్ల .. రాసే కథనం పట్ల ..వస్తూ పోయే పాత్రల పట్ల తనకి గొప్ప క్లారిటీ ఉంటుంది. అదే తన విజయ రహస్యం నిజానికి.
కవిత్వంలోకి ఒదగని సంఘటన, సన్నివేశం ఉన్నప్పుడే నా కలం కథని ఎంచుకుంటుంది. కానీ సుజనకి కథ అంటే చాలా సులువు. తన కథల్లో ఒక స్పార్క్ ఉంటుంది. మనింటి కథే కదా అనిపిస్తుంది. లేదా మన ఎదిరింట్లో జరిగిందో లేక, ఎక్కడో వినిందో అనిపిస్తుండటం తన ప్రత్యేకత. కథ నేపథ్యాలు అందరూ చెప్పలేరు. కానీ సుజన రాసే ప్రతి కథ నేపథ్యం బాగా చెప్పగలదు. నిజానికి తనంతటి స్పీడ్ రచయిత్రిని నేను ఇంతవరకు చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి పుస్తకానికి …అందునా ఒక కవితా సంపుటికి నేను ముందుమాట రాయగలగటం అంటే కత్తి మీద సాము చేయడమే కదా అనిపించింది. కానీ నాకెంతో ఇష్టమైన కవిత్వం… నా ప్రాణమైన కవిత్వం .. నా అస్తిత్వమైన కవిత్వంతో అందునా మరొక సమవుజ్జి కవిత్వాన్ని తూచడం అంటే భలే మజాగా ఉంటుంది కదా !దాన్ని ఆస్పాదిస్తూ ముందుకెళుతుంటే ఎన్నెన్ని రవ్వలు దొరికాయో! ఎన్నెన్ని రత్నాలు కవిత్వపు పంక్తుల్లో ఒలికాయో ..చెప్పలేను. కవిత్వాన్ని ఆస్వాదిస్తూ ఒకసారి… ఆలోచిస్తూ ఒకసారి… పరిశీలిస్తూ ఒకసారి… పరిశోధిస్తూ ఒకసారి… ఇలా నాలుగు, ఐదు సార్లు ఈ సంపుటిని చదివాక నాకు ఒక స్పష్టత ఏర్పడింది. నిస్సందేహంగా ఇది మహిళ సమస్యలపై నవ’తరాన’ మిస్సెస్ ఫలానా అని….

‘తరాన’ అనేది పర్షియన్ పదం… అంటే ఒక రాగాన్ని అల్లటం… స్త్రీల సమస్యల మీద తాను సరికొత్త స్వరాల్లో… విభిన్న బాణీల్లో, చిక్కటి కవిత్వాన్ని మనకి వినిపించే ప్రయత్నంలో తాను మొదటి స్థానంలో నిలిచిందనే నిస్సందేహంగా నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఏ బేషజాలూ ఉండవు. మంచిని మంచిగా, గొప్ప కవితని గొప్పగా ఎప్పుడు చెప్పుతూనే ఉంటాను. నాకు గొప్పగా అనిపిస్తే సత్కరించటం… ఎక్కడ విన్నా పిలిచి సన్మానించడం… నిరంతరం అక్షరయాన్ ద్వారా చేస్తూనే ఉన్నాం. ఇక్కడ అక్షరయాన్ ప్రసక్తి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అక్షరయాన్ అనేది ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 1508 మంది రచయిత్రుల్ని ఒక వేదిక మీద కి తీసుకొచ్చిన తెలుగు సంస్థ అక్షర యాన్. తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్. దీంట్లో నిరంతరం చాలా ఉత్సాహంగా… ఉత్తేజంగా పనిచేస్తూనే ఉంటుంది నామని సుజన. అక్షరయాన్ లో కూడా తనకి బహుమతులు రావటం జరిగింది. ఎన్నో సందర్భాల్లో తన కథల ఫలితాన్ని, తన ఇంటర్వ్యూని కూడా మేమందరం కూడా కలిసి పంచుకొని, అభినందించిన సందర్భాలు కూడా లేకపోలేదు. అందుకే తాను బహుముఖీన ప్రజ్ఞావంతురాలు అంటారు అందరు. నేను మాత్రం తన రచనంత గొప్ప మనసు తనది అంటూ ‘మానవి ‘గా చూస్తాను .
నామని సుజనాదేవి సమకాలిన కవిత్వంలో తనదైన ముద్రని వేసుకుంటున్నమంచి కవయిత్రి. సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ,సవాళ్లను ఆకలింపు చేసుకుని వాటి వెనక ఉండే సామాజిక ,ఆర్థిక, రాజకీయ పరమైన కారణాల విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్న మంచి కవయిత్రి. ఒక కవికి

సమకాలీనత, సామాజికత, సార్వత్రిక అనే లక్షణాలు ఎంత అవసరమో ఆమె కవిత్వాన్ని చదివితే మనకు అర్ధమవుతాయి.
అనాదికాలం నుంచి స్త్రీలకు వేరువేరు రూపాలలో సమస్యలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు సామాజికంగా కుటుంబపరంగా ఎదుర్కొన్నప్పటికీ, ప్రతి యుగంలో, ప్రతి దశలో ఆమె ఆ సమస్యలను అధిగమించిన తీరు ఎప్పటికప్పుడు ఆశ్చర్యమే అనిపిస్తుంది. అలాంటి అసమానతలను తన కవితల్లో, తన అక్షరాలలో, తన వాక్యాలలో పొదిగి స్త్రీ తాలూకు హృదయ వేదనని అందంగా అక్షరీకరించిన కవయిత్రి సుజనాదేవి.
సున్నితత్వం, సృజనాత్మకత, సార్వత్రిక అనే అంశాల ప్రాతిపదికగా ఆమె రాసిన ఈ కవిత్వం అందరినీ ఆలోచింపజేస్తుంది. అయితే ప్రతి కవికి తనకంటూ ఒక జీవన తాత్వికత ఉంటుంది. తన పూర్వకవుల ప్రభావమో, చూసిన ప్రపంచమో, సన్నివేశాలు… సందర్భాలు… వ్యక్తులు… వాటి ప్రభావం …. మరొకవైపున తన అంతరంగం …హృదయంలో… మస్తిష్కంలో జరిగే సంఘర్షణల తాలూకు సంఘర్షణ కూడా తోడవుతాయి. అలాంటి సంఘటనే మనకు నామని కవితల్లో స్పష్టంగా… ప్రస్ఫుటంగా కనిపిస్తుంది .
ఇలా తనదైన ఒక స్త్రీవాద కోణాన్ని, స్త్రీ హృదయం ఆవిష్కరణ చేస్తున్న క్రమంలో ఆమెని ఒడిసిపట్టే గల కవిత గా నాకు అర్థమైన కవిత ‘ఆమె ‘అనే శీర్షిక గల కవిత.

తను ‘ఫలానా’ గా మిగిలి పోవడానికి కారణం అవుతున్న సామాజిక, కుటుంబ, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను… దాని వెనక ఉన్న కుట్రలను కూడా చాలా ఆలోచనాత్మకంగా మనకు అందిస్తూ వచ్చింది ఈ కవిత. అందుకే ఈ కవిత నా మనసుకు నచ్చిందేమో? భారతీయ చింతనకి.. తాత్వికతకి కొలమానంగా సాగే క్రమంలో …

పల్లేరు కాయలు ఆమె దారివెంట ఉన్నాయని అవి సహజంగా పెరిగినవి కాకుండా పరిచినవి గా ఉండటం అనే మాట చెప్పడం వల్ల ఇది సమాజము పురుషుల్లో లేదా వ్యవస్థలో స్త్రీ ప్రగతికి ఆటంకాలని …కుట్రతో చేసినఅంశంగా ఉన్నాయని అంతర్లీనంగా ఆమె తొలి వాక్యాల లోనే మనకు చక్కగా చెబుతుంది. అలాగే చాలా సమాజాలలో ఆడపిల్లని భారంగా… బరువుగా భావిస్తూ ఆమె పుట్టగానే వడ్లగింజ వేసి చంపారనే ఉదంతాలన్నీ, సంఘటనలన్నీ మనం నిత్యజీవితంలో చూస్తూ వస్తున్నాం. అలాంటి ఒక దయనీయమైన అమానవీయ జ్ఞాపకాలతో, పుట్టినప్పుడే వడ్లగింజతో తీయాలనుకున్న ప్రాణాన్ని నిలబెట్టుకున్న దాన్ని అందుకేనేమో తలవంచుకొని వెళ్ళడం అలవాటయ్యింది అన్న వాక్యాల్లో ఆమె చాలా ఆలోచనాత్మకంగా తన ఆవేదనని వ్యక్తీకరిస్తుంది .అంతేకాకుండా ప్రతి చోటా జరుగుతున్న వివక్షను ..పక్షపాతాన్ని కూడా ఎండకడుతుంది .
కూలి పని లో వంట పనిలో అన్నిటిలో అసమానతల్ని ఆమోదిస్తూ, తన జీవితంలో అంతర్భాగంగా జీర్ణించుకున్న విషయాన్ని కూడా ఇక్కడ వ్యక్తీకరిస్తుంది
మరొకవైపున వంట పాత్రల పైన తన పేరు లేనితనాన్ని
ఎంతో హృద్యంగా… మరెంతో వేదనతో ఈ కవితలో ఆమె వ్యక్తీకరించిన తీరు చదివి తీరాల్సిందే!

స్త్రీత్వం ..స్త్రీ తత్వం ..
తనదైన అస్తిత్వాన్ని పోగొట్టుకొని కుటుంబం కోసం పిల్లల కోసం సమాజం కోసం బ్రతుకుతూ

మానవీయ తత్వాన్నికొనసాగిస్తూ సాగే మానవి నైజాన్ని ఆమె ఎంతో చక్కగా ప్రస్తావిస్తుంది .ఇలాంటి తత్వాన్ని కలిగి ఉండటం ఉదాత్త భావనగా కనిపించినప్పటికీ ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర పరిమాణం లోకి మారిపోయే స్థితికి రావడం తన ఆత్మగౌరవాన్ని… తన వునికిని పోగొట్టుకోవడంగా ఆమె కొత్త కోణంలో మనకు పరిచయం చేస్తుంది .ఇలా ఈ కవిత మొత్తం స్త్రీ తాలూకు అస్తిత్వ వేదనగా… అంతర్గత పరివేదన గా సామాజిక అణచివేత నుంచి ఏర్పడ్డ దుఃఖం గా నకు ప్రతి పదంలో కనిపిస్తుంది .
మన హృదయాల్ని కన్నీటితో తడుపుతుంది .అయినప్పటికీ ఒక ఆశావహ దృక్పథం, మరొక అచంచలమైన విశ్వాసం ఇంకొంచెం జీవనో త్సాహం ఈ కవితలో కనిపించకుండా ఉండదు .ఆమెలో ఉప్పెన ఎగిసే ఉత్సాహం ఉంది .మెరిసే మేఘ లాంటి పట్టుదల ఉంది .ఆగ్రహిస్తే అగ్నిలా దహించే ఆవేశం ఉంది .అన్నిటినీ భరించే ధైర్యం ఉంది .అన్నిటిని మించి క్షమించే సహనం ఉంది .అన్నిటిని కలుపుకుపోయే గొప్పతనం ఉంది అంటూ ఒక గొప్ప ఆశావహ దృక్పథాన్ని చూపుతుంది నామని సుజనాదేవి.
వేదన, పరివేదన, సంవేదన, సంక్షోభం, సందిగ్ధత, సందేహం, సంఘర్షణ, పోరాటం ,విప్లవం ,తిరుగుబాటు ,చైతన్యం ,మార్పు ,ఆశ అనే అంశాల ని మనకు మరొక్కసారి సరికొత్తగా ఇంకొంచెం హృదయానికి హత్తుకునేలా
పరిచయం చేసి పాఠకులఅందరిలో ఒక నవ్య ఉత్సాహాన్ని నింపుతాయి తన కవితలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నామని సుజనమంచి కథకురాలే కాక మంచి కవయిత్రి గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఈ కవితా సంపుటితో అని చెప్పొచ్చు. ఇలాగే మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ…

ప్రతులకు సంప్రదించవలసిన చరవాణి…7799305575&
9247577004


May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పచ్చని ఆకులు

by dr. Lakkraju Nirmala May 29, 2026
written by dr. Lakkraju Nirmala

పచ్చని ఆకులు
తళ తళ మెరుస్తాయి
మరి ఎండుటాకులు
గలగల అరుస్తాయి.

నా భావాలన్నీ
మౌనంగా డైరీలు అయ్యాయి
నన్ను ఖైదీని
చేశాయి

ఎదుటి మనిషి ఆనందంగా
ఉన్నాడు అనుకుంటున్నావు
అతను నోరు విప్పితే
నీ గుండె చె రువుఅవుతుంది

పేరు ప్రతిష్టలు
ఎన్నో త్యాగాల ఫలాలు
ఎంత అప్రతిష్ట
ఒక్క మాట వల్ల

కోపాన్ని
క్షణం ఆపు
మార్పునిలో
ఎంతో గమనించు

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

జీవితంలో ఢక్కా మొక్కీలు తిని ఆవేదనను కవిత రూపంలో వెలువరించిన శ్రీదుబ్బాకుల కృష్ణ స్వామి!

by Achyutuni Rajasri May 28, 2026
written by Achyutuni Rajasri

ఆయన లో వేదన మానసిక అశాంతిని సంఘర్షణను “స్మృతిపధంలో పద్మ” అని తన భార్య పేరుతో అచ్చేసిన పుస్తకంలో చూడవచ్చు.దానికికారణం కృష్ణ స్వామి నామాట లో నేటి కార్పొరేట్ హాస్పిటల్ వల్ల తన భార్య మరణించారని స్పష్టంగా ఢంకా బజాయించి చెప్పారు.బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ వారి ధనదాహానికి ఆమె బలైనారు అని ఐదులక్షలుగుంజి ఆపరేషన్ చేశారని ఆయన నిజాయితీగా నిప్పులు చెరిగారు.ఆమె భౌతిక కాయంని ఇంటిముందు ఉంచాక కన్నీటి ధారలో భావాలు పద్యాలుగా వచ్చాయి.బ్యాంకులో నామినీలేకపోతే పడే ఇబ్బందులు,తహశీల్ ఆఫీసుచుట్టూ ప్రదక్షిణాలను దుయ్యబట్టారు.ఆఖరున” కష్టంలేని మరణాన్ని, పరుల యాచించకూడని మరణాన్ని ఇవ్వమని శివుని వేడుకోటం నిజంగా ఆఖరి చరమదశలో అందరం కోరుకోవలసిందే సుమా!
24.6.1954 లోరంగారెడ్డి జిల్లాలోని తల్లారం గ్రామంలో పుట్టారు.తల్లిదండ్రులు రుక్కమ్మ, కొమరయ్యగౌడ్.తాత ఎల్లాగౌడ్ సమాజసేవకుడు,పల్లెవారికి పట్టుగొమ్మ ఆయన.

కృష్ణ స్వామి గారి మాటల్లోనే ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం-
నాకు 1972 లో ఇంటరు రెండవ సంవత్సరం చదువుతుండగా వివాహం జరిగింది. 1973 లో ఇంటరు రెంవసంవత్సరం చదువుతుండగా తీవ్రమైన కరువు వచ్చింది.పశువులకు మేకకరువయింది.మనుషులకుధాన్యం కారు వొచ్చింది.మానసికంగా ఆందోళన ఎక్కవైంది.చదువు మానుకున్నాను.అప్పుడు నాకు చిత్రకళ పై ఆసక్తి పెరిగింది. వ్యవసాయం చేస్తు చిత్రకళ సాధన చేశాను.నాగలి దున్నుతున్నప్పుడు ఎడ్లకు కొందసేపు విశ్రాంతినిచ్చేవాము ( దానని దమ్మకు నిలబెట్టుట ) అంటారు అప్పుడు నానాగలికి కట్టిన ఎడ్లను చిత్రిస్తుండే వాడిని.ఆబొమ్మను చూడగానే అది ఏ ఎద్దు అనేది అందరు వెంటనే గుర్తుపట్టేవారు.అప్పుడు మాతమ్ముడు ఆలూరు హైస్కూలలులో చదువుకునేవాడు.తెలుగుపండిత్ కృష్ణయ్యగౌడు సారు బాగా డ్రాయింగ్ ఏస్తాడని నాకు పరిచయం చేశాడు .ఆయన నాకు వాటర్ కలర్స్ ట్యఃబులు,బ్రష్ ఇచ్చాడు.నాకు అంతవరకు వాటర్ కలర్స్ బ్రష్ లు చూడలేదు వాటితో నేను వ్యవసాయం చేస్తు సమయం దొరికినప్పుడు సాధన చేస్తుండేవాడిని.కొన్నిరోజులు ఉద్యోగానికని హైదరాబాద్ లో మా బంధువుల ఇంట్లో ఉండగా ఫైన్ ఆర్ట్స్ కాలేజ లో ఇంటర్వూ ఇచ్చాను సెలెక్ట్ అయినాను.కాని ఖర్చులకు భయపడి మానుకున్నాను.అప్పుడే ఉద్యోగవేటలో నాకు హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో పుస్తకాలు చదివే అలవాటు అయినది. అదికూడ నాజీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుపు తిప్పింది.మళ్ళీ ఊరికి పోయి వ్యవసాయం చిత్రకళ సాధన మొదలు పెట్టాను. 1976 మార్చిలో షాద్ నగర్లో నారాయణ శంభు డ్రాయింగ్ టీచర్ వద్ద డ్రాయింగు పరిక్ష నిమిత్తం పదిలహరోజులు ట్యూషన్ వెళ్ళాను. అదే సంవత్సరం లో ఆగస్టులో మా ప్రక్క ఊరి ఒక పెద్దభనిషి తన మిత్రునికి ఉత్తరం వ్రాసి నన్ను IZRA లో పెయింటర్ గా చేర్పించాడు.ఇక అప్పటి నుండి 2006వ సంవత్సరం వరకు పెయింటర్ గా పనిచేశాను.డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన కారణంగా మా పెయింటర్ల ఉపాది ఊడిపోయి రోడ్లపాలైనాము .అప్పుడు మళ్ళీ వ్యవసాయంలో కే వెళ్ళిపోయాను.2024 మే 8 వె తేదిన నాభార్య మరణంతో ఊరునుండి హైదరాబాదు మాకొడుకులవద్దకు వచ్చాను..

1 కవిత్వం నాకు రావడానికి కారణం వాజిపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో 13 రోజుల్లో పడిపోవడం ఒక కారణం .
2 యన్ టి రామారావు గారిపై వైస్రాయి హోటల్ ఆవరణలో చెప్పులు విసరడం ఆయనను పదవీచ్యుతుని చేయడం బాధ కలిగించింది .
3 నేను మాకు తెలిసిన వారికి బ్యానర్లు వ్రాసిఇచ్చి డబ్బులడిగితే తిట్టడం మూడవ కారణం అప్పుడు నాలో బాధ ఏక్కవై వారిపై ఆశువుగా ఆటవెలదులలో పద్యాలలో నాభావాన్ని వ్యక్తపరుచు కున్నాను.కాని అనుకోకుండా ఎనభై శాతం ఛందస్సు కలిసిందని నాకు తెలిసిన టీచర్ కు చూపిస్తే చెప్పాడు.అప్పటికి నాకు ఛందస్సు రాదు.ఆయన ఛందస్సు పుస్తకం తెచ్చుకోమని సూచించారు.అది తీసుకొని ఒక్కొక్క ఛందస్సు నేర్చుకొని వ్రాయడం ప్రారంబించాను.అది 2001 వె సంవ్తసరం.అప్పుడు నేను శాకాహారం పై పద్యాలు వ్రాయడం ప్రారంబించి తొలిపుస్తకం విడుదల చేశాను. దానికి మంచి స్పందన రావడంలో ఇక వరుసగా వ్రాయడం మానలేదు.

మీరు నాచిత్రలనుఇచూడాలంటే ఫేస్ బుక్ లో ,లేదా నా వాట్సప్ స్టేటస్ లో, లేదా నా పర్సనల్ గ్రూపు ఉంది దుబ్బాకుల కళాసాహితి అందులో నాచిత్రాలు.మా పెద్దకుమారుడు వేసిన చిత్రాలు,నా సాహిత్యం,చూడవచ్చు అందులో చూసినా చూడకున్నా 24 గంటలలో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి.అందులో వేరేవారు పోస్టులు పెట్టరు.మీరు దేనినైన ఎన్నుకోవచ్చు.

పెద్దకుమారుడు చిత్రకారుడు జే యన్ టి యు లో డిప్లొమా చేశాడు.కాని దానిక సంబంధం లేని రాజేంద్రనగర్ మున్సిపల్ లో పనిచేస్తున్నాడు.చిన్నకుమారుడు ఆబిడ్స్ చెర్మాస్ లో చేస్తున్నాడు . ఇద్దరి కుమార్తెల వివాహాలు అయిపోయాయి.ఇద్దరు కుమారుల వివాహాలు అయిపోయాయి.అందరికి పిల్లలు అయినారు.

ఇక కృష్ణ స్వామిగారికి టైలరింగ్,మట్టి సిమెంట్ విగ్రహాల తయారీ,లాంగ్ సర్వే లో ప్రవేశం ఉంది.ఇక సమాజసేవకునిగా గ్రామంలో శివాలయనిర్మాణం, 1983,1984,1985లో శివరాత్రి మరునాడు కట్నంలేని పెళ్లిళ్లు చేశారు.
ఇక ఈయనకొచ్చిన పురస్కారాలు కోకొల్లలు.కృష్ణ సందేశం ని రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ వారుఎన్నుకొనితెలుగురాష్ట్రాల గ్రంథాలయాలకు పంపిణీ చేశారు.2012లో ప్రపంచ తెలుగుమహాసభల్లో ఉత్తమ కవిగా సన్మానం, స్వర్గీయ వెంకట్రావు పంతులుగారి ధార్మిక సాహితీ పురస్కారం ,హంపీపీఠాధిపతులు విద్యారణ్యభారతీస్వామివారు పీఠంతరుఫున భక్తిమందారాలు అచ్చేయించి ఆవిష్కరించారు.చిన్న జీయర్ స్వామి తిరుప్పావై విద్యాసంపుటికి మంగళాశాసనాలు వ్రాశారు.2014లోతెలంగాణ ఆవిర్భావ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సన్మానించారు.చేవెళ్ల మండల ఎం.ఎల్.ఎ. లాలె యాదయ్య గారు 10,116 నగదుతో సత్కరించారు.2016లోరవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి పద్యకవుల సమ్మేళనంలో పాల్గొన్నారు.పటేల్ శాంతమ్మ సాహిత్య పురస్కారం,డా.కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళాపీఠంవారి సన్మానం…ఇలా ఎన్నో,ఎన్నెన్నో!

ముద్రిత రచనలు _ శాకాహార శతకం కృష్ణ గీత, కృష్ణ సందేశం,శ్రీశివానందలహరి సౌందర్య లహరి తిరుప్పావై మొదలైనవి.

ఇటు సాహిత్యం కవితారచన అటు చిత్ర లేఖనంలో అందెవేసిన చెయ్యి ఓ అపురూప మణిదీపం

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • కొత్త ప్రపంచం
  • పాఠశాల గదిలో జీవిత పాఠాలు
  • శాంతి విలువ
  • మౌనలోకం
  • మానవత్వమా… నీ చిరునామా ఎక్కడ?

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us