మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

ప్రాచీన సాహిత్యంలో మహిళాస్వరం

by Thokala Rajesham May 28, 2026
written by Thokala Rajesham

మహిళలు వంటగదిని దాటి ఇప్పుడు ఉద్యోగాలలోకి వస్తున్నారు కానీ మొన్నమొన్నటి వరకు ఆ పరిస్థితి లేదు.అంతకుముందు వాళ్లకు అసలు చదువే లేదు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చి ఆడపిల్లలను చదువుకొమ్మనే దాకా మనవాళ్లకు ఆ ధ్యాసే లేదు.ఒకవేళ తెగించి ఎవరైనా చదువుదామని ప్రయత్నం చేస్తే మన సమాజంలోని చాందసులు గగ్గోలు పెట్టేవారు. ఆడపిల్లల చదువుకోసం జ్యోతిరావు ఫూలే దంపతులు ఎలాంటి కృషి చేశారో అందరికీ తెలుసు. వారికి అడుగడుగునా అడ్డుపడింది ఎవరో కూడా తెలుసు. ఆ వర్గం వారి కుట్రల ఫలితంగానే భారత దేశంలోని మహిళలు వందలేళ్ళుగా బానిసలుగా బతుకీడుస్తున్నారు.మహిళలు ఇంటిగడప దాటి బయటకు రావటమే మహాపాపంగా అభివర్ణించారు పండితులు.తమకున్న పాండిత్యంతో సమాజాన్ని ప్రభావితం చేసి మహిళలను అన్నిరకాలుగా అణిచివేశారు.ఈ అణిచివేత మొన్నమొన్నటి వరకు నిరాఘాటంగా కొనసాగింది.ఇప్పటికీ చాలా ఇళ్లలో ఇది అనధికారికంగా కొనసాగుతున్నది.ఈ కుట్రల రాజకీయానికి ఒక అందమైన పేరున్నది. అదే’పితృస్వామ్య వ్యవస్థ’.దీన్ని ‘పురుషస్వామ్య వ్యవస్థ’అని కూడా పిలుస్తున్నాం.మగవాడి ఆధిపత్యం నడిచే వ్యవస్థ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.మన సమాజాన్ని పరిశీలించినా, సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలించినా మగవాడి ఆధిపత్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది.ఈ ఆధిపత్యం కారణంగానే మహిళలు ఇప్పటివరకు అన్నిరంగాలలో మగవాళ్ళతో సమానంగా ముందుకు వెళ్లలేకపోయారు. ఇటీవలి కాలంలో ఆధునికత కేవలం చదువులోనే కాకుండా జీవితంలో కూడా చేరిపోయిన కారణంగా, మహిళలు తమ హక్కుల కోసం రాజ్యాంగ బద్ధమైన పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో వారి భాగస్వామ్యాన్ని సమాజం కొంత అయిష్టంగానైనా సరే ఆమోదించే పరిస్థితి వచ్చింది. దేనివెనుక పెద్ద చరిత్రనే ఉంది.స్థూలంగా చెప్పాలంటే 1975 నాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుకు వచ్చిన చైతన్యంలోనుంచి మహిళలు గొంతువిప్పటం ప్రారంభించారు.1980 తర్వాత స్త్రీల చైతన్య ధార స్త్రీవాదంగా రూపొందింది.


స్త్రీవాదం తెచ్చిన చైతన్యంతో స్త్రీలు చరిత్రలో తమ స్థానం గురించి రకరకాల కోణాల్లో పరిశోధనలు ప్రారంభించారు.ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యాన్ని స్త్రీ వాదం నుంచి రూపొందిన నూతన పరికరాలతో చూడటం ప్రారంభించారు. ప్రాచీన సాహిత్యాన్ని కూడా స్త్రీవాద దృక్పథంతో పరిశీలించటం మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే ప్రసిద్ధ రచయితలు కాత్యాయని విద్మహే,కె. ఎన్. మల్లీశ్వరి పూనుకొని ప్రాచీన సాహిత్యంలో తమ భాగస్వామ్యం ఉన్నప్పటికీ పురుషాధిక్యత కారణంగా మరుగున పడిపోయిన కవయిత్రులను వెలికి తీసి వారిని చరిత్రలో నిలిపే ప్రయత్నం చేశారు. చరిత్రను పరిశోధించి తెలుగులో రాసిన 18 మందితో పాటు, తెలుగువాళ్లే అయినప్పటికీ ప్రాకృతంలో,సంస్కృతంలో రచనలు చేసిన 22 మంది ప్రాచీన కవయిత్రులను “ప్రాచీన తెలుగు కవయిత్రులు”పేరుతో వేసిన పుస్తకంలో పరిచయం చేశారు.ఇది’ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’తరుపున వెలువడిన వ్యాస సంకలనం.
ముందే చెప్పినట్టు మహిళలు కాబట్టి వీళ్ల గురించి చరిత్రలో దొరికే ఆధారాలు తక్కువ.ఎందుకంటే ప్రాచీన కాలంలో మహిళలకు విద్యాహక్కు లేదు.శూద్రులతో పాటుగా బ్రాహ్మణ మహిళలకు కూడా విద్య నిరాకరింపబడింది. చదివితే తమతో సమానమవుతారనే స్వార్ధంతో నాటి పండితులు ధర్మ శాస్త్రాల ఉటంకింపులు చూపిస్తూ మహిళలను అన్నిరకాలుగా అణచివేశారు. ప్రాచీన కాలంలో కవిత్వం రాసిన కవయిత్రులందరూ ధిక్కార స్వభావం కలిగినవాళ్ళు.ఆనాటి ఆచారాలను ధిక్కరించి,పితృస్వామ్య భావజాలాన్ని ఎదిరించి చదువుకోవటమే కాకుండా కవిత్వం చెప్పగల స్థాయికి చేరటమంటే మామూలు విషయం కాదు.ఈ క్రమమంతా పండిత వర్గ భావజాలానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి సహజంగానే వారి గురించి సమాచారాన్ని తొక్కిపెట్టే అవకాశం ఉంది.అందుకే ప్రాచీనకాలంలో పురుష కవుల రచనలు గానీ వివరాలు గానీ లభ్యమైనంత సులభంగా కవయిత్రుల రచనలు గానీ వివరాలు గానీ లభించటం లేదు. సాహిత్య చరిత్రలు విస్మరించిన ఇటువంటి కవయిత్రులను వెలుగులోకి తీసుకురావడానికి ఈ పరిశోధకులు ఎంత ఎంత కష్టపడ్డారో?
ఇందులో కవయిత్రులను పరిచయం చేస్తూ కాత్యాయని గారు కొన్ని, మల్లీశ్వరి గారు కొన్ని వ్యాసాలు రాశారు. అయితే ఆ వ్యాసాలు సాహిత్య చరిత్ర నమూనాలో కేవలం వివరాలు చెప్పటానికే పరిమితం కాలేదు. సందర్భానుసారంగా ఆ కవయిత్రులు పితృస్వామ్య వ్యవస్థ రూపొందించిన చట్రంలోనుంచి మాట్లాడారా లేదా దానికి వ్యతిరేకంగా నిరసన పూర్వకమైన స్వరాన్ని వినిపించారా అన్న విషయాన్ని నిర్ధారిస్తూ వ్యాఖ్యానించారు.కుప్పాంబికను పరిచయం చేసే వ్యాసంలో “కుప్పాంబిక పద్యం ఒక శారీరక స్పృహ కలిగినటువంటి స్త్రీ యొక్క అంతరంగాన్ని, ఆంతరంగిక ఉద్వేగాన్ని వ్యక్తీకరించటంలో ఒక మలుపు”అని చెప్తూ చానమ్మ, ప్రోలమ్మల పద్యాలతో ఎలా పోల్చి చూడవచ్చో చెప్పారు.”ఖడ్గ తిక్కనను ఆడవాళ్లతో పోల్చటం ద్వారా అవమానపరిచాం అనుకున్నారు.అందులో తమను తాము కించపరచుకుంటున్నాం అన్న స్పృహ వాళ్లకు లేదు” అన్న విశ్లేషణతో చానమ్మ, ప్రోలమ్మలు ఆనాటి సమాజం నిర్దేశించిన చట్రంలో ఎలా ఒదిగిపోయారో వివరించారు.ఇలా కవయిత్రులను కేవలం వారి రచనల పట్టికలతో మాత్రమే పరిచయం చేయకుండా వారివారి వ్యక్తిత్వాలలోని వైవిధ్యాన్ని విమర్శా దృష్టితో పరిశీలన చేయటం ద్వారా ఈ పుస్తకాన్ని భావి పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా మలిచినట్లైంది.
ఇప్పటివరకు కేవలం కవయిత్రులను గురించి వచ్చిన సాహిత్య చరిత్రలు తెలుగులో రెండే ఉన్నాయి. అందులో ఒకటి ఆండ్ర శేషగిరిరావు రాసిన”ఆంధ్ర విదుషీమణులు”,మరొకటి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ రాసిన”ఆంధ్ర కవయిత్రులు”.వీటితో పాటు విడివిడి వ్యాసాల సందర్భంగా అక్కడక్కడా ప్రస్తావనకు వచ్చిన కవయిత్రుల తగుమాత్ర సమాచారం మినహా ఈ విషయంలో జరిగిన పెద్ద కృషి లేదు. వీటిలో కూడా రకరకాల కారణాలవల్ల,ముఖ్యంగా సమాచార లేమి వల్ల అందరూ చేరకపోవటం ఒక చిన్న వెలితి.దానిని పూరిస్తూ ఇప్పటివరకు నమోదైన అందరితోపాటు కొత్తవారిని కలుపుకొని వచ్చిన సమగ్ర సాహిత్య చరిత్ర ఇది.రచయిత్రుల మాటల్లో చెప్పాలంటే”అనేక పరిమితుల మధ్య ఇప్పటికి ఇది ప్రాచీన తెలుగు కవయిత్రులకు సంబంధించిన సమగ్ర సాహిత్య సమీక్షా రచన”.
ఈ సాహిత్య చరిత్రను మునుపటి రచనలకంటే సమగ్రం చేయటానికి వారు చాలా శ్రమ పడవలసి వచ్చింది. సమకాలీన సాహిత్య చరిత్ర రాయటం వనరుల లభ్యత దృష్ట్యా పెద్ద కష్టమైన పని కాదు. కానీ ప్రాచీన కవుల అందునా కవయిత్రుల చరిత్ర రాయటం నిజంగా కష్ట సాధ్యమైన పని. ఆ కష్టాన్ని వారు ఇలా చెప్పుకున్నారు.”చెలికాని చెల్లాయమ్మ గురించి ఏక వాక్య సమాచారాన్ని అందిపుచ్చుకుని ఆమె గురించి తెలుసుకోగలిగాము. అన్నదానం వెంకటాంబ, శిరిగంబూరు అన్నపూర్ణమ్మ వంటి కొత్తవాళ్లను పరిచయం చేసుకోగలిగాము.కృష్ణాజమ్మ గురించి ఇంకొన్ని వివరాలు సేకరించగలిగాము. బాల పాపాంబ,బలభద్ర దాసి, దార్ల సుందరమ్మ, మదిన సుభద్రయ్యమ్మ మొదలైన వాళ్ళ సాహిత్యాన్ని సంపాదించి విశ్లేషణలు మొదలుపెట్టాం. తెలుగు వాళ్లే అయి సంస్కృతంలో రాసిన కవయిత్రులను గురించి కూడా చదవటం చెప్పటం వలన తెలుగు స్త్రీల బహుముఖ ప్రజ్ఞను మొత్తంగా అర్థం చేసుకునే అవకాశం దొరికింది”.ఈ మాటల వల్ల ఈ సాహిత్య చరిత్ర నిర్మాణ క్రమం ఎంత పకడ్బందీగా జరిగిందో తెలుస్తుంది.
ముందే చెప్పినట్టు ఇది కేవలం సాహిత్య చరిత్ర పరిధిలోకి వచ్చే లక్షణాలతో సాగిన రచన కాదు.ఆయా కవయిత్రుల కవిత్వ సమీక్ష ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది.ఆయా సమాజాలలో కవయిత్రులుగా నిలబడటం దగ్గరినుంచి వారి జీవిత నేపథ్యం,అలాగే కవిత్వ నేపథ్యం వారి రచనలను ఎలా ప్రభావితం చేశాయో లాంటి కీలకమైన అంశాల ప్రస్తావన దాకా సాగిన ఈ సాహిత్య పరామర్శ విమర్శా లక్షణాలను పుణికి పుచ్చుకున్న సాహిత్య చరిత్రగా అవతరించింది. ఇట్లాంటి కృషి సాహిత్య చరిత్ర రచనలో ఏర్పడిన ఖాళీలను పూరించడానికి బాగా పనికి వస్తుంది. భవిష్యత్తులో ఇతర సమూహాల ప్రాచీనతను దేవులాడటానికి కూడా ఈ కృషి ఒక ఆదర్శంగా నిలుస్తుంది.

May 28, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఋగ్వేదపు స్త్రీస్వరం అపాలఆత్రేయ

by Vijaya Ranganatham May 28, 2026
written by Vijaya Ranganatham

వేదకాలపు బ్రహ్మవాదినులు కేవలం విదుషీమణులు మాత్రమే కాదు, వారు భారతీయ విజ్ఞాన, తాత్విక వారసత్వానికి మార్గదర్శనం చేసిన వారు. గార్గి తర్కవిన్యాసం, వాదన పటిమ, మైత్రేయి ఆత్మ జిజ్ఞాస, లోపాముద్ర సమన్వయ దృక్పథం, వాగామ్భృణి ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ వేదకాలపు స్త్రీల బహుముఖ ప్రజ్ఞను చాటి చెబుతున్నాయి.  అలా ఋగ్వేదంలో ప్రసిద్ధి చెందిన ఋషికలలో ఒకరుఅపాల ఆత్రేయి (ApālāĀtreyī). ఆమె గురించి ఉన్న సమాచారం చాలా ఆసక్తికరంగా, ఆధ్యాత్మికంగా కూడా లోతైనది. ఆమె చర్మవ్యాధితో బాధపడుతూ, ఇంద్రుని గూర్చి తపస్సు చేసి, ఆయన అనుగ్రహంతో స్వస్థత పొందిందని ఈమె రచించిన సూక్తం (8. 91) ఋగ్వేదంలో ఉంది.

అపాలఆత్రేయ అత్రి మహర్షి వంశం అయిన ఆత్రేయ గోత్రానికి చెందిన ఋషిక.ఆమెను ఒక స్త్రీ ఋషికగా గౌరవిస్తారు. ఋగ్వేదంలో మాండల 8, సూక్తం 91 (RV 8.91) ఆమె రచించినట్లుగా ఆపాదించబడింది.అపాల సూక్తంలో ఆమె దేవుడైన ఇంద్ర దేవుడిని ప్రార్థిస్తుంది.ఇందులో తన శరీరంలోనిరోగం / చర్మ వ్యాధి నుండి విముక్తి, తననుశుద్ధి చేయమని, అందంగా మార్చమని,తన జీవితంలోశుభం, శక్తి, కాంతిరావాలని కోరుతూ ప్రార్థిస్తూన్నవి ప్రధాన అంశాలు.

పురాణాలు, వ్యాఖ్యానాల ప్రకారంఅపాల పేరు “ఆత్రేయి” అంటేఆమెఅత్రి వంశానికి చెందినది. ఆమె తండ్రి ఒకఋషి వంశస్థుడు(అత్రి గోత్రం). కొన్ని వ్యాఖ్యానాల ప్రకారంఆమె తండ్రి ఒకవేదజ్ఞాని, ఋషి స్వభావం గలవాడు. ఆమె పెరిగింది ఒకఆధ్యాత్మిక వాతావరణంలో. కానీతల్లి పేరు, తండ్రి వ్యక్తిగత వివరాలువేదాల్లో స్పష్టంగా లేవు. అపాల బాల్యం గురించి నేరుగా వేదంలో కథ లేదు. సూక్తం ద్వారా పండితులు అంచనా వేసిన విషయాలు మాత్రమే.ఆమె చిన్నప్పటి నుంచేప్రజ్ఞాశాలి (intelligent), ధ్యాన స్వభావంకలిగినది. ప్రకృతి, యజ్ఞాలు, మంత్రాలు చూసి పెరిగింది.వేద కాలంలో ఋషుల కుటుంబాల్లోపిల్లలకు (కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకు కూడా)వేద మంత్రాలు వినడం అలవాటు. అలాగే ఆమె కూడా తండ్రి దగ్గర మంత్రాలు వింటుంది. కానీ ఆమెకు నిజమైన జ్ఞానంఅనుభవంలోవస్తుంది.

యజ్ఞ విధానాలు తెలుసుకోవడం, ధ్యానం, ఆత్మచింతననేర్పేవారు.అపాల ఒకఋషికకాబట్టిఆమెకువేద జ్ఞానం ఉంది. మంత్రాలనుస్వయంగా అనుభవించి పలికింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆమె కేవలం నేర్చుకున్నది కాదు. అనుభవం ద్వారా మంత్రం వెలువరించింది.అపాల వంటి ఋషికలు, వేదకాలంలో కొంతమంది స్త్రీలు కూడాఆధ్యాత్మిక విద్య పొందారు. మంత్ర దృష్టి (mantra-dṛṣṭā) సాధించారు. అంటేవారు “పఠించేవారు” మాత్రమే కాదు. “సృష్టించేవారు” కూడా.ఆమెకుచర్మ సంబంధిత వ్యాధిఆమె బాల్యంలోనే ప్రారంభమై ఉండవచ్చునని తెలుస్తుంది.దీనివల్ల సమాజంలో కొంతవేరుపాటు (isolation) ఎదుర్కొనిందని,ఆమెను సమాజం దూరం పెట్టిందని అదే ఆమెను అంతర్ముఖి (introverted, reflective) గా మార్చిందని చెప్పబడింది.ఒంటరిగా ప్రకృతిలో తిరుగుతూ ప్రశ్నలు వేసుకుంటుంది. “నేను ఎందుకు ఇలా?” అనే ఆత్మవిచారం.అపాల ఒకస్వతంత్ర ఆలోచన గల ఋషిక. ఆమె సూక్తం వేదాలలోస్త్రీ అనుభూతి, శరీర-మనస్సు బాధ, ఆత్మవిశ్వాసంని ప్రతిబింబిస్తుంది. ఆ కష్టం వల్లే ఆధ్యాత్మికంగా ఎదిగింది. చివరికి ఒకఋషికగా నిలిచింది.

ఒకసారి ఆమె అడవిలో సోమలత (Soma creeper)ను కనుగొని, దానిని నమిలిఆ సోమాన్నిఇంద్రదేవుడికి సమర్పించిందని, ఆమె భక్తి చూసి ఇంద్రుడుఆమెనురోగమునుండి విముక్తి చేశాడని,ఆమెకుఅందం, కాంతి, గౌరవంప్రసాదించాడని భావిస్తారు.అపాల ఇంద్రుడిని స్తుతిస్తూ రాసిన రచనలు ఋగ్వేదం లో RV 8.91సూక్తం ద్వారా తెలుస్తుంది. దానిలో ఒక స్త్రీ తనవ్యక్తిగత బాధను దేవునితో పంచుకుంటుంది. అది వేదాలలోస్త్రీ స్వరాన్ని (female voice) బలంగా చూపిస్తుంది. అపాల ఆత్రేయి రచించిన సూక్తం వేదాలలో చాలా ప్రత్యేకమైనది.

ఇక ఆమె రచించిన ఋగ్వేదం లో RV 8.91సూక్తాలను గమనిస్తే ఆమె భావాత్మకమైన అభ్యర్థన తెలుస్తుంది.

మంత్రం 1: ఉప త్వా సోమమింద్రాయ సున్వేబ్రాహ్మణో నృచక్షసం మనీషాం।అయం తే అస్తు హర్యతః సుతాసఃపిబా సోమం మదాయ గచ్చ॥

భావార్థం:ఓ ఇంద్రా! నేను సిద్ధం చేసిన ఈ సోమరసాన్ని నీకు సమర్పిస్తున్నాను. జ్ఞానంతో చేసిన నా ఈ యజ్ఞాన్ని అంగీకరించి, వచ్చి దీనిని పానం చేయి.

“ఓ ఇంద్రా! నేను కనుగొన్న ఈ సోమాన్ని స్వీకరించు.నా భక్తిని అంగీకరించు.”అంతర్భావం:ఆమెకు గురువు లేకుండా, స్వయంగా సోమాన్ని కనుగొని సమర్పిస్తుంది. ఇదిస్వయంప్రేరిత భక్తి (self-realized devotion).

మంత్రం 2: ఇమం మే గాథమింద్ర శృణు త్వంయథా నః శృణవో హవం పురూణాం।ఆ త్వా వహంతు హరయో వృషాణోయథా మదాయ పిబసి సుతస్య॥

భావార్థం:ఓ ఇంద్రా! నా ఈ గాథను, నా ప్రార్థనను విను. నువ్వు యజ్ఞాలలో భక్తుల ప్రార్థనలు ఎలా వింటావో, అలాగే నా పిలుపునూ ఆలకించి నా దగ్గరకు రా.

దైవాన్ని ఆహ్వానించడం. “ఓ ఇంద్రా! నా దగ్గరకు రా. ఈ సోమాన్ని పానం చేయి.”అంతర్భావం:దేవుని తన దగ్గరకు పిలిచే ధైర్యం. ఒక స్త్రీ స్వరం ఎంత నిశ్చయంగా ఉందో చూపిస్తుంది

మంత్రం 3: కన్యా వారవాయతి సోమమపాలాపిణ్వతి ధాన్యమివ ప్ర వృణక్తి।ఇంద్రాయ త్వా సుతమిమం జుషస్వయథా నః శృణవో హవం పురూణాం॥

భావార్థం:నేను అపాల అనే కన్యను. నేను ఈ సోమాన్ని సిద్ధం చేసి నీకు సమర్పిస్తున్నాను. నా ఈ అర్పణను స్వీకరించి, నా ప్రార్థనను విను.(ఇక్కడ అపాల తన వ్యక్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తుంది)

మంత్రం 4: త్రిః మామింద్రః పవమానః పునాతుత్రిః శుద్ధో భవామ్యంతరాత్మా।శిరో మే శుద్ధం కరోతు ప్రజాభ్యఃఅథో మే తన్వం శుచిమింద్ర కర్ధి॥

భావార్థం: ఓ ఇంద్రా! నన్ను మూడు సార్లు పవిత్రం చేయి. నా అంతరంగాన్ని శుద్ధి చేసి, నా శరీరాన్ని కూడా పవిత్రంగా, నిర్మలంగా మార్చు.(శరీరం–మనసు–ఆత్మ శుద్ధి భావం)

శుద్ధి కోసం ప్రార్థన భావం: “నా శరీరంలోని మలినాన్ని తొలగించు. నన్ను పవిత్రంగా మార్చు.”అంతర్భావం: ఇది కేవలం శరీర వ్యాధి కాదు. నా శరీరంలోని కఠినత్వాన్ని తొలగించు. మలినాన్ని పోగొట్టు.అంతరంగ శుద్ధికోసం కూడా ప్రార్థన.

మంత్రం 5: అస్మాన్ మే రోగాన్ అప హన్యాదింద్రఃత్వచం మే కృణుహి శుచిమింద్ర దేవ।యథా సూర్యః ప్రకాశతే దివితథా మే దేహి తన్వే శోభమానామ్॥

భావార్థం: ఓ ఇంద్రా! నా శరీరంలోని వ్యాధులను తొలగించు. నా చర్మాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మార్చు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్లు, నా శరీరం కూడా కాంతిమంతంగా ఉండేలా చేయి.

సౌందర్యం, కాంతి కోరిక. భావం: “నన్ను అందంగా, కాంతిమంతురాలిగా మార్చు.” అంతర్భావం: సౌందర్యం అంటే కేవలం రూపం కాదు. అదిఆత్మవిశ్వాసం, జీవశక్తి

మంత్రం 6: సుశ్రియం మే కర్ధి సుపేశసం చయశో మే దేహి శుభగే సువీరమ్।అథో మే తన్వం వర్ధయ స్వస్తిఇంద్ర ప్రజాభ్యః శం యచ్ఛ నః॥

భావార్థం:నాకు శోభ, సౌందర్యం, మంచి కీర్తి ప్రసాదించు. నా జీవితాన్ని శ్రేయస్సుతో నింపి, నా శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచు. మా ప్రజలకు కూడా మేలు కలిగించు.

సంపూర్ణ మార్పు భావం: “నా లోపాలను పూర్తిగా తొలగించి, నన్ను నూతనంగా సృష్టించు.” అంతర్భావం: ఇది ఒకపునర్జన్మ భావన (inner rebirth)

మంత్రం 7: పితుర్మే గృహమావహ శ్రియమింద్రసుప్రజాస్త్వం కర్ధి మే గృహేషు।అథో మే దేహి శుభగే సువీరమ్జీవాతవే నః కృణుహి ప్రజాభ్యః॥

భావార్థం:ఓ ఇంద్రా! నా తండ్రి గృహానికి శోభ, సంపద తీసుకురా. మా కుటుంబానికి మంచి సంతానం, శ్రేయస్సు కలిగించు. మా జీవితాలు సుఖంగా, దీర్ఘకాలం ఉండేలా ఆశీర్వదించు.

కుటుంబ శ్రేయస్సు భావం: “నా తండ్రి గృహానికి శోభ తీసుకురా.” అంతర్భావం: ఆమె వ్యక్తిగత కోరిక మాత్రమే కాదు. కుటుంబ గౌరవం కూడా కోరుతుంది.

బాధ → భక్తి → మార్పు, శరీర వ్యాధి → ఆత్మ శక్తి, నిరాకరణ → ఆత్మవిశ్వాసం. అపాల సూక్తం మనకు చెప్తుంది. ఇది ఒక స్త్రీ యొక్కవ్యక్తిగత ప్రార్థనమాత్రమే కాదు. ఒకఆధ్యాత్మిక ప్రయాణం.అపాల తన పేరు చెప్పి ప్రార్థించడం →వ్యక్తిగత స్వరం. శరీర బాధను చెప్పడం →నిజమైన అనుభవం. శుద్ధి కోరిక →ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది ఆమె ప్రత్యేకత.

అపాల ఆత్రేయి గురించి పండితుల అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా, కొన్నిసార్లు భిన్నంగా ఉన్నాయి.ముఖ్యమైనపాశ్చాత్య, భారతీయ పండితుల వ్యాఖ్యానాల్లో అపాలా మహోన్నతంగా చూపబడింది.

1. రాల్ఫ్ టి.హెచ్. గ్రిఫిత్. అపాల సూక్తాన్ని ఆయన ఒక “personal prayer”గా చూసారు. ముఖ్యంగాఒక స్త్రీ తనవ్యక్తిగత బాధ (చర్మ వ్యాధి)గురించి దేవునితో మాట్లాడుతోంది. ఆయన దృష్టిలో ఇది“Prayer for healing and beauty”. ఇది ఒకవ్యక్తిగత అనుభవ కవిత్వం (personal lyric).

2. కార్ల్ గెల్డనర్. Geldnerప్రకారంఅపాల కథలోసోమ యాగం ఒక ముఖ్యాంశం. ఆమె సోమాన్ని నమిలి ఇంద్రుడికి సమర్పించడం → ఒక ప్రత్యేక దృశ్యం. ఆయన దీన్ని ఒక ritual + personal experience కలయికగా చూస్తారు. యజ్ఞ పద్ధతి + వ్యక్తిగత భక్తి.

3. స్టెఫిన్ జేమిసన్. అపాల సూక్తాన్ని: “female voice in Rigveda”గా విశ్లేషిస్తారు. ముఖ్యంగాఒక స్త్రీ తన శరీరాన్ని గురించి నేరుగా మాట్లాడడం. తన బాధను దాచకుండా వ్యక్తపరచడం. ఇదిస్త్రీ అనుభవానికి ప్రతిబింబం.

4. భారతీయ సంప్రదాయం (సాయణ భాష్యం) చెప్పిన వారు సాయన.సాయణాచార్యుల అభిప్రాయంప్రకారంఅపాలఆత్రేయ నిజంగా ఒకఋషిక (మంత్రదృష్ట). ఆమెసోమాన్ని సమర్పించిఇంద్రుడి కృపతోరోగ విముక్తి పొందింది.ఇది కేవలం కవిత్వం కాదుఒకయథార్థదైవానుభవం.భక్తి,  దైవకృప, శుద్ధి అని అర్థం.

5. ఆధునిక భారతీయ పండితులు కూడా అపాలసూక్తుల పై పరిశోధనలు చేసారు.అపాల సూక్తంఒకఆధ్యాత్మిక రూపకం (symbolic meaning). చర్మ వ్యాధి → అజ్ఞానం / కర్మబంధం, శుద్ధి → జ్ఞానం, ఇంద్రుడు → చైతన్య శక్తి గా అబభివర్ణించారు. ఇది inner transformation allegory.

క్లుప్తంగా చెప్పాలంటే గ్రిఫిత్ వ్యక్తిగత ప్రార్థన అన్నారు. గెల్డ్నర్ యజ్ఞం తో కూడిన అనుభవమని, జామిసన్ స్త్రీ స్వరం, సాయనా నిజమైన ఋషిక అనుభవం అంటే ఆధునికులు ఆధ్యాత్మిక రూపకం అని విశ్లేషించారు.ఆమె సూక్తం కేవలం శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే కాదు బాహ్య లోపాల కంటే అంతర్గత శక్తి ముఖ్యము. భక్తి మరియు స్వయంప్రయత్నం ద్వారా మార్పు సాధ్యం. ఒక స్త్రీ కూడాదైవానుభూతిని పొందగలదుఅనే భావన. అందుకే పండితులు దీనిని “Personal prayer of healing and transformation”గా కూడా విశ్లేషిస్తారు.

వేదకాలంలో ఇంత ఉన్నత స్థానంలో ఉన్న మహిళల స్థితి, వేదానంతర కాలంలో మహిళల స్థితికాలక్రమేణా మలివేద, సూత్ర, స్మృతుల కాలంలో క్షీణించడం ప్రారంభమైందని చెబుతారు పండితులు. దీనికి అనేక సామాజిక, రాజకీయ, మతపరమైన కారణాలు ఉన్నాయి. వర్ణ వ్యవస్థ పటిష్టం కావడం, యజ్ఞయాగాదులు క్లిష్టతరమవడం, ధర్మసూత్రాలు (ముఖ్యంగా మనుస్మృతి వంటివి) స్త్రీ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేసే నియమాలను ప్రవేశపెట్టడం వంటివి జరిగాయి. బాల్య వివాహాలు ప్రబలడంతో స్త్రీలకు విద్యనభ్యసించే అవకాశం లేకుండా పోయింది. క్రమంగా, స్త్రీలకు ఉపనయన సంస్కారం నిరాకరించబడివివాహమే వారికి ఉపనయనంతో సమానంగా పరిగణించబడింది. వారు పురుషులతో సమానంగా జ్ఞానయజ్ఞంలో పాల్గొని, వేద సాహిత్యానికి తమదైన ముద్ర వేసి, భారతీయ తాత్విక చింతనను సుసంపన్నం చేశారు. తరువాతి పరిణామాలలో వారి స్వేచ్ఛను కోల్పోయినా వారి వారసత్వం పూర్తిగా కనుమరుగు కాలేదు. వారి జీవితాలు, రచనలు ఆధునిక తరానికి, ముఖ్యంగా స్త్రీలకు, అంతులేని స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో మహిళల ఉన్నత స్థానాన్ని, వారి మేధో స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకోవడానికి,లింగ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి బ్రహ్మవాదినుల గురించి అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం. వారు భారతీయ సంస్కృతి అనే ఆకాశంలో శాశ్వతంగా ప్రకాశించే జ్ఞాన తారలు. 

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఉన్నత చదువుల శిఖరం

by Banda Saroja May 28, 2026
written by Banda Saroja

అది ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కీ.శే. ప్రొఫెసర్ రామరాజు వెంకటేశ్వర రావు ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా పని చేసి అంచెలంచెలుగా ఎదిగిన విద్యా కుసుమం. వారు నీతి, నియమం, నిజాయితీ, నిబద్ధతతో క్రమశిక్షణకు గీటురాయిగా నిలిచి పెరిగిన ఉపన్యాసకులు. కీ.శే. ప్రొఫెసర్ మల్లారెడ్డి మామిడి గారు శాఖాధిపతిగా ఉన్నప్పుడు వారు ఉపన్యాసకులుగా పని చేశారు. వారు ప్రొఫెసర్ పదవిని చేపట్టాలంటే కనీసం ఒక పిహెచ్.డి విద్యార్థికైనా పర్యవేక్షకులుగా పని చేయవలసిన అవసరం ఏర్పడింది. అలాంటి సమయంలో నేను మొదటి పిహెచ్.డి విద్యార్థిగా 38 సంవత్సరాల క్రితం 1988లో వారి దగ్గరకు వెళ్ళడం జరిగింది . అంతకు ముందే నేను యస్.సి.ఇ.ఆర్.టి. లో ఎన్నో కార్యక్రమాలకు ఢిల్లీ వెళ్లడం జరిగింది. స్త్రీ విద్య, బాలికల విద్య, అనియత విద్య, మూల్యాంకన విభాగాలలో యస్.సి.ఇ.ఆర్.టి.లో పని చేసిన విస్తృత అనుభవం ఉన్నందున యం.ఫిల్. అవసరం నాకు కలుగలేదు. 1980లో ప్రభుత్వ ఉన్నత స్థాయి విద్య అధ్యయన సంస్థలో నేను మహబూబియా హైస్కూలు నుంచి పదోన్నతి పొంది సమగ్ర విద్యా తత్వ కళాశాలకు వెళ్లాను. అప్పటి నా శాఖాధిపతులు కీ.శే. భాష్యం గారు. ఏవో తాను పాఠశాలల్లో మ్యాగజైనులల్లో రాసిన వ్యాసాలను చూపి పి.హెచ్.డి. లో స్థానం సంపాదించుకున్నారు. కాని వారు పిహెచ్.డి పూర్తి చేయలేకపోయారు. మల్లారెడ్డి గారు ముందు భాష్యం గారి పదవీ విరమణ దగ్గరగా ఉన్నందున ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. “అమ్మా! భాష్యం గారి తరువాత నేను తప్పకుండ నీటు ఇస్తాను. నీవు పిహెచ్.డి.కి కావలసిన సామాగ్రిని అంతా తయారు చేసుకొమ్మని” అనునయంగా చెప్పారు. వారి మాటను నేను శిరోధార్యంగా భావించాను. సరేనని చెప్పాను.

ఈ మధ్య కాలంలో పాఠశాల విద్య గుమాస్తా ఒకరు నన్ను కలువుమని చెప్పి సమాచార మందించారు. నేను ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించి యం.ఇడి. చదివాను కాబట్టి వారిని ఎందుకు కలవాలి? అని ఊర్కున్నాను. అదే కథ అడ్డం తిరిగింది. నాతో పాటుగా ఇద్దరు ఉపన్యాసకులు కళాశాలలో చేరారు. వారిద్దరూ ఏం చేశారో నాకు తెలియదు. నేను అమాయకురాలిని. లంచం ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. పల్లెటూరి బైతును. ఎంతసేపు “ప్రతిభ” ఆధారంగానే ఆశిస్తాను, ఆలోచిస్తాను. రెండు మూడు నెలలు నేను పచ్చ కామెర్లతో బాధపడ్డాను. కాబట్టి నేను పాఠశాల విద్యాశాఖలో పని చేస్తున్న గుమాస్తా దగ్గరకు పోలేదు. “మే” నెల అంతా కళాశాలకు సెలవులు. “జూన్”లో కళాశాల ప్రారంభమయింది. అలిఘడ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. రాజకీయ శాస్త్రం, హిందీ ప్రవీణ మొదలైన పరీక్షలు రాసిన ఇంకో ఉపన్యాసకుడు ఇద్దరికి 1981 జూన్ లో ప్రమోషన్ ఇచ్చారు. ఒకరికి ‘తెలుగు పండిట్’ కోర్సులో, ఇంకొకరికి ‘హిందీ పండిట్’ కోర్సులో. ఎం.ఏ. తెలుగు, యం.ఇడి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలనైన నన్ను ప్రమోషన్ నుంచి తప్పించారు. 1980లో యస్.సి. కోటాలో, 1981లో యస్.టి. కోటాల నన్ను మాత్రం “చాదర్ ఘాట్ బాలికల పాఠశాల” కమాల్ టాకీస్ కు పంపారు. ఇది నా జీవితంలో ఎదుర్కొన్న మొదటి వివక్ష, అన్యాయం నాకంటే ముందుగా నాంపల్లిలో పని చేసే ఒక ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న అగ్రకులస్తురాలైన ఉపాధ్యాయునికి ప్రమోషన్ ఇచ్చారు. అది “ప్రజాభీష్టం” కోసమట. “Public Interest”. “వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూచుంటే ఏమిటి?” అన్న సామెత పాఠశాల విద్యకు సరిపోతుంది. జరిగిన అన్యాయానికి ఎదురొడ్డి నిలిచి వెనువెంటనే కోర్టులో దావా వేశాను.

పాఠశాల విద్యలో జరిగే ఈ అన్యాయాన్ని ఉటంకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారక రామారావు గారికి ఒక కథనం రాని అర్జీ పెట్టుకున్నాను. ఒక శుభోదయం అబిడ్స్ లోని వారింటికి వెళ్లి వారి ఉచిత దర్శనం వేళల్లో వారికి అందజేశాను. విచారణ మొదలయ్యింది. ముఖ్యమంత్రి గారు ప్రాథమ్య క్రమంలో ‘సరోజన’కు ప్రమోషన్ ఇవ్వాలని అర్జీ పత్రంపై రాశారు. విద్యాశాఖలో గందరగోళం మొదలయ్యింది. కోర్టు కేసును విరమించుకుంటే ప్రమోషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ వారు నాకు రాయబారం పంపారు. మీరు ప్రమోషన్ ఇచ్చిన వెంటనే యాంత్రికంగా నా అర్జీ రద్దవుతుందని నేను చెప్పాను. పాఠశాల విద్యా డైరెక్టర్ కీ.శే. వెంకారెడ్డి గారు ఏదో ఒక శాఖలో నాకు ప్రమోషన్ ఇవ్వాలని శతవిధాల ప్రయత్నం చేశారు. తుదకు దృశ్య శ్రవణ విభాగంలో నన్ను సర్దడానికి ప్రయత్నించారు. కాని గుమాస్తా గారు, సూపర్నిడెంటు గారు వారి తెలివితేటల్ని ప్రదర్శించి అది కూడా చెల్లకుండా చేశారు. Audio visual A.V. Education ను A.V. Aducation Andhra University Education మన వద్ద ఎవరు లేరని బుకాయించారు.

నా పదోన్నతికి ఈ నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. రాజకీయ సంక్షోభం కారణంగా ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారు పదవీచ్యుతులై కీ.శే. నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో నియమితులయ్యారు. వారు అతి కొద్ది కాలం ఆ పదవిలో కొనసాగారు. పదవీ విరమణ కాలం 55 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలయింది. ఈ సంధి కాలంలో పదవీ విరమణ పొందిన శ్రీ భాష్యం గారు తన పదవిని మూడేండ్లు కొనసాగించాలని అర్జీ పెట్టుకున్నారు. నన్ను తన స్థానంలో సర్దుబాటు చేయడానికి విద్యాశాఖ అప్పటికే సన్నద్ధమయ్యింది. ఈ యాంత్రిక అభ్యంతరం తొలగిపోతే మీ ప్రమోషన్ కు దారి సుగమమవుతుందని విద్యాశాఖ వారు మాకు తెలిపారు. ఈ మధ్య కాలంలో వెంకారెడ్డి డైరెక్టర్ గారు పదవీ విరమణ చేశారు. కేరళకు చెందిన సతీనయ్యర్ ఐ.ఏ.యస్. గారు కమీషనరుగా విద్యాశాఖకు వచ్చారు. కీ.శే. ఆలె నరేంద్ర పాతబస్తీ టైగర్ సతీనయ్యర్తో సంప్రదింపులు జరిపారు. 3 సంవత్సరాల జీతభత్యాలు శ్రీభాష్యం గారికి చెల్లించి వారి అడ్డును తొలగించినారు. తేది 22 డిసెంబర్ 1983 రోజున ప్రమోషన్ ఇచ్చి సంతకం చేసి సతీనయ్యర్ ఐ.ఏ.యస్. తబాదిలా రీత్యా ఢిల్లీ విమానం ఎక్కారు. 23 డిసెంబరున నేను కళాశాలలో ప్రవేశించకపోతే నాకు 5 రోజులు ప్రభుత్వ సెలవులు వస్తాయి. 28 డిసెంబరు నెల నుంచి నా సర్వీసు మొదలవుతుంది. కాబట్టి చాదర్ ఘాట్ హెడ్మాస్టరు గారు సెలవుపై వెళ్లినందున ఒక సీనియర్ అధ్యాపకురాలు ప్రేమలతగారికి చార్జీ ఇచ్చారు. వారు కూడా ఊరు మీద తిరుగడానికి వెళ్లారు. దిక్కుతోచని పరిస్థితులల్లో వారిని పాఠశాలకు పిలిపించి నేను డ్యూటీ నుంచి విడుదలై విద్యా కళాశాలలో ప్రవేశించాను. (నాటి నుంచి 23 డిసెంబరు 1983) నా రెండవ దశ సర్వీసు మొదలయ్యింది. నేను యస్.సి. ప్రణాళికలో పని చేసిన 14 నెలల సర్వీసును కూడ నాకు కలిపారు. ఇంచుమించు 1 సంవత్సరం 9 నెలల సర్వీసు పోయింది. ఈ విధంగా ప్రభుత్వ రంగంలో కూడ “లంచగొండితనం” విశృంఖలంగా స్వైర విహారం చేస్తుంది. ‘బడిత ఉన్నోడితే బర్రె, నోరు ఉన్న వాడికే మోక్షం” అన్న సామెత ఋజువయ్యింది.

1985లో నాకు గెజిటెడ్ ప్రమోషన్ వచ్చింది. అప్పటినుంచి బాధ్యతాయుతమైన అన్ని పనులను డైరెక్టర్లు నాకు అప్పజెప్పడం మొదలయింది. అనేక రకాల పరీక్షా పత్రాలను తయారు చేయడం, జాతీయ స్థాయి కార్యక్రమ నిర్వహణ, కొత్త విద్యా ప్రణాళికను చేపట్టడం (1986) అనువాద కార్యక్రమాలు. విద్యా సంబంధమైన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణలో, మధ్య మధ్య ఆకాశవాణి హైద్రాబాదు కార్యక్రమాలు, పుస్తక రచన, పుస్తకాలను సమీక్షించి గ్రంథాలయాలను సూచించడం, అవసరాన్ని బట్టి ఇతర శాఖలకు సహకారాన్ని అందించడం లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక డైరెక్టర్, 11 మంది ప్రొఫెసర్లు, 11 శాఖలు, 34 మంది ఉపన్యాసకులు, నాన్ టీచింగ్ స్టాఫు, ఆ కాలంలో S.C.E.R.T. స్వర్ణ యుగాన్ని తలపించేది. దినమంతా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉండేది. వీలునుబట్టి సాహిత్య కార్యక్రమాలకు, సమావేశాలకు, డైటు సంస్థల పర్యవేక్షణకు హాజరయ్యేది.

ఒకనాడు నిజామాబాదు ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఉపన్యాసకులు డాక్టర్. సూర్య ప్రకాశ్ రెడ్డి గారు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థకు వచ్చారు. వారి చేతిలో ఏవో పేపర్లు ఉన్నాయి. రెడ్డీ! అని ఏమి పేపర్లని అడిగాను. పిహెచ్.డి. అప్లికేషన్ అని చెప్పారు. అవి నాకు ఇచ్చి నీవు వేరే తీసుకొమ్మని చెప్పాను. వారు మీరు అడగడం నేను ఇవ్వకపోవడమా? అని నాకు ఆ అప్లికేషను ఇచ్చి వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. నేను ఆ రాత్రి పిహెచ్.డి.కి కావలసిన అర్హత పత్రాలు, అప్లికేషన్ని నింపడం వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకొని తెల్లవారి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బోధనా కళాశాలకు వెళ్లి అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. నా ప్రవేశం పిహెచ్.డి.లో ఖాయమయ్యింది. ఉపశీర్షికల పట్టిక తయారు చేసి ఇచ్చాను. ఇక గైడును నిర్ధారించుకోవడమే మిగిలింది. ముందుగా డాక్టర్ శ్రీధరస్వామి ప్రొఫెసర్ ను పెట్టుకోవాలనుకున్నాను. శ్రీధర స్వామి గారు నా భర్త కీ.శే. కనకయ్య గారికి ఆప్తమిత్రులు. వారి దగ్గర పిహెచ్.డి. అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో తెలియదు. కాని కనకయ్యా! నేను నీ ముఖం చూసి సరోజనకు గైడెన్సు ఇస్తున్నానని అన్నారు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఒక విధంగా రోషం కూడా ఎక్కువే! నేను చాలా బాధ పడ్డాను. నా భర్తతో సారూ! మీ ముఖం చూసి శ్రీధర స్వామి గారు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నానని అన్నారు. వారు నా ప్రతిభను లెక్కించాలి కాని అదేమి మాట అని నొచ్చుకున్నాను. వారు ఆ మాటను గ్రహించారు. అయితే అక్కడే డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావని ఇంకొకరు ఉన్నారు. వారు కూడా నాకు ఆత్మీయులే. వారి దగ్గర పిహెచ్.డి. అభ్యర్థిగా చేరమన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

నేను అంతకుముందే పాఠ్యపుస్తకాల్లో స్త్రీ హోదా, చిత్రణ, స్త్రీ సమానత్వం, సాధికారత, వివక్షత ఏ విధంగా ఉందో? ఎన్నో సదస్సులకు, సమావేశాలకు హాజరయ్యాను. కూలంకషంగా అధ్యయనం చేశాను. స్త్రీ విద్య, బాలికల విద్య గురించి ఆపోషం పట్టాను. ఒక నిర్ధారిత భావం నాకుంది. 1986 విద్యా ప్రణాళికలో ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో ఉటంకించబడింది. మూల్యాంకన పత్రం కూడ ఇవ్వబడింది. ఇతిహాసం – పాఠ్యాంశం ఎంపిక, ప్రదర్శన, భాష, భావం, సామెతలు, జాతీయాలు, నానుడులు మొదలైన వాటి వివరణలు, వర్ణన, చిత్రీకరణ, ధనాత్మక, ఋణాత్మక భావాలు మొదలైన వాటి విస్తృత అధ్యయనం చేయడం జరిగింది. దానిలో స్వామికత్వం పొండం జరిగింది. చిత్రాలు, బొమ్మలను కూడ పరిశీలించడం, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, విద్య, వైద్యం, శాస్త్ర విజ్ఞానం, సృజనాత్మకత, సాంకేతిక, పశువైద్యం, కుటుంబం, పిల్లల పోషణ, శారీరక, మానసిక, బౌద్ధిక, మత సంబంధమైన అంశాలు, పాఠ్య పుస్తక రచన, సంపాదకత్వం, అన్నిట్లో కూడ స్త్రీల పాత్ర ఋణాత్మకమే. ఆడ మగ కూలి, ఆరోగ్యం, తిండి, పుట్టుక, వివాహం, విద్య, ఉద్యోగం, పోషణ అన్నిట్లో వివక్షతే. వీటన్నిటి సమూల అధ్యయనం వల్ల నాకు పిహెచ్.డి. సులభమైంది. క్రితంలో నేను రెండవ భాషగా తెలుగు బోధనాభ్యసన సమస్యలు, కారణాలు, నివారం ఉపాయాలు సమస్యగా తీసుకొని పిహెచ్.డి. చేయాలనుకున్నాను. కాని మనసు మార్చుకున్నాను.

ఒకరోజు మామిడి మల్లారెడ్డి శాఖాధిపతుల దగ్గరకు వెళ్లి, సార్! నా పిహెచ్.డి. పర్యవేక్షకులను నిర్ణయించండి. నా శీర్షికను గైడును మార్చుకోవడానికి నాకు అనుమతి నివ్వండి అని కోరాను. వారు డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు గారి గదికి నన్ను తీసుకెళ్లి సరోజనకు పర్యవేక్షకులుగా వ్యవహరించమని కోరారు. వెంకటేశ్వరరావు గారు సార్ నాకు ఆ సమస్య చాలా కొత్త అని చెప్పారు. అప్పుడు మల్లారెడ్డి గారు ఏముందిలే సరోజన “నీకు అంతా చెప్పుతుంది” అన్నారు. తరువాత నేను వారికి సంక్షిప్తంగా అన్ని విషయాల గురించి చెప్పాను. వారు సుముఖత వ్యక్తపరిచారు. ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసింది.

రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థకు సాధారణ సెలవు దినాలున్నప్పుడు, రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాలల్లో అలకాపురిలోని వెంకటేశ్వరరావు గారి ఇంటికి నేను వెళ్లేదాన్ని, వారి సూచనలు, సలహాలు, గమనికలు తీసుకునేదాన్ని, ఉస్మానియా విశ్వవిద్యాలయం, గ్రంథాలయానికి వెళ్లి పరిశీలనా గ్రంథాలు తీసుకొని నోట్సు తయారు చేసుకోవడం, ప్రశ్నావళిని రూపొందించుకోవడం, ముఖాముఖి కోసం ప్రశ్నలు తయారు చేసుకోవడం, గవర్నర్ సదనానికి వెళ్లి సంబంధిత సాహిత్యాన్ని తీసుకోవడం, ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం కీ.శే. తరుగా జానకి రాణి దగ్గర నుంచి కీ.శే. మల్లాది సుబ్బమ్మ వరకు స్త్రీల సమస్యలపై పోరాడే వాళ్లను సంప్రదించి వివిధాంశాలను సేకరించేదాన్ని. అప్పట్లో మహిళా సాధికారత, చైతన్యం కోసం ఆకాశవాణి హైద్రాబాదులో అనేక వ్యాసాలను రాసి ప్రసారం చేసేదాన్ని. ఒకసారి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థలో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తీసి పరిశీలించాను. అందులో నుంచి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో 1958లో వెలువడిన “National committee on Women Education” అనే పుస్తకం దొరికింది. వీటన్నిటితో నా పీహెచ్.డి. గ్రంథానికి పరిణతి లభించింది. మొత్తం 247 పాఠశాల పుస్తకాలను పరిశీలించాను. ధనాత్మక, ఋణాత్మక విషయాలను క్రోడీకరించాను. వివిధ రంగాలలో మహిళల స్థాయిని, హోదాను పరిగణలోకి తీసుకున్నాను. 14 మంది పాఠశాల విద్యకు సంబంధించిన అత్యున్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్ల డైరెక్టర్ల ముఖాముఖి తీసుకొని విషయ వివరణ చేశాను. మూల్యాంకన విభాగానికి చెందిన మా ‘అధిపతి’ని సంప్రదించాను. మొత్తం మీద ఆర్. వెంకటేశ్వరరావు పర్యవేక్షకులుగా నా విహెచ్.డి. 1992లో ముగిసింది. అది ఫిబ్రవరి నెల. ఈ తతంగంలో నాకు అండగా నిలబడి ‘స్టాటిటిన్స్’ చేయించిన శ్రీధరస్వామి ప్రొఫెసర్ గారికి నా కృతజ్ఞతాభివందనాలు. ఎండనక, వాననక కష్టపడి ఒక నిజమైన విహెచ్.డి. చేసినందుకు విద్యాశాఖ నుంచి నాకు పొగడ్తలు అందాయి. ఏడవ తరగతి నుంచి ఒక పిహెచ్.డి. స్థాయికి ఎదిగినందుకు నేను నన్ను అభ్యుదయ పథంలో నడిపించిన ఆ “అజ్ఞాత శక్తి”కి ఎల్లవేళలా ఋణపడి ఉంటాను. ప్రొఫెసర్ మల్లారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నా పర్యవేక్షకులు ఆర్.వెంకటేశ్వరరావు, శ్రీధరస్వామి, సాందీప్, అడుగడుగున నన్ను నడిపించారు. ప్రొఫెసర్ నాయుడు, రాధాకృష్ణ, రుక్మారావు, ఫరీదాభాతూన్, అన్వర్ జహాన్, బృందావనం, శ్రీరామమూర్తి, డా. సుబ్రహ్మణ్యం బోధనతో తరించిన ఆ రోజులు స్వర్ణయుగాన్ని తలపిస్తాయి. ప్రొఫెసర్ వేదాంతాచారి గారి బోధన నన్ను ముగ్దురాలిని చేసేది.

ప్రొఫెసర్ ఆర్.వెంకటేశ్వరరావు గారు నల్లగొండ జిల్లా జాజిరెడ్డి గూడెంలో జన్మించారు. తండ్రి రాఘవరావు, తల్లి లక్ష్మీదేవమ్మ. వారు ఎం.ఏ. తెలుగు. యం.ఇడి. విహెచ్.డి. చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, విద్యా కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. వారి జీవిత భాగస్వామి కీ.శే. సుజాతమ్మ, హైద్రాబాదులోని అలకాపురి వారి స్థిర నివాసం. వారి సంతానం ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్దవాడు కుమారుడు రాం మోహన్ రావు, కూతుళ్లు రాధ, రేఖ.

వద్దిరాజు సీతారామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు ఈ ఇద్దరు అన్నదమ్ములు వద్దిరాజు సోదరులుగా చరిత్ర ప్రసిద్ధి నందిన వారు. చిన్నవాడు వద్దిరాజు రాఘవ రంగారావు కూతురు రంగరాజు పద్మజ కవయిత్రి, రచయిత్రి. వారు అనేక ఉత్తమ రచనలు చేసిన యశఃకాములు. పద్మజ భర్త కీ.శే. రంగరాజు వెంకటేశ్వరరావు గారు, జనగామ నివాసి. ప్రసిద్ధ న్యాయవాది. రామమోహనరావు గారి అర్ధాంగి రంగరాజు పద్మజ కూతురు, పద్మజ ఆడపడుచు కీ.శే. రంగరాజు సుశీల ప్రముఖ రేడియో కళాకారిణి. వీరి కుటుంబ సభ్యులంతా విద్యాధురీణులు, విజ్ఞాన విభవులు, విశేష సాహితీ సంపన్నులు.

కీ.శే. పెండ్యాల రాఘవరావు స్వాతంత్య్ర సమరయోధులు. ఆ కాలంలో లబ్దప్రతిష్ఠులైన కమ్యూనిస్టు నాయకులు. ముచ్చటగా మూడు సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన ప్రజారంజకులుగా పేరు గాంచిన రాజకీయ నాయకుడు.

తమ ఊరు పెండ్యాల గ్రామాన్ని ఇంటి పేరుగా మలచుకొన్న జాతీయ నాయకుడు. వారి కుమార్తె డా.కొండపల్లి నీహారిణి. ప్రముఖ కవయిత్రి, మేటి రచయిత్రి, సాహిత్య విదుషీమణి, సారస్వత రంగంలో అందెవేసిన చేయి. వారి భర్త వేణుగోపాల్ గారు ప్రముఖ ఇంజనీరు. నీటిపారుదల శాఖలో ముఖ్య ఇంజనీరుగా పదవీ విరమణ చేశారు. నా సోదరుడు కీ.శే. బండ రామయ్య గారికి చిరపరిచితులు. డా. కొండపల్లి నీహారిణి తరుణి, మయూఖ లాంటి పత్రికలకు అధినేత్రి. (అవి ఆన్ లైను పత్రికలు).

రంగరాజు పద్మజ, అరుణ ధూళిపాల ఎంతోమంది లబ్దప్రతిష్టులైన వారి ముఖాముఖిని నిర్వహించి నెల్లుట్ల రమాదేవి ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ప్రజాసంబంధాల శాఖతో పాటు కీర్తి ప్రతిష్టల నందారు. కొండపల్లి నీహారిణి వద్దిరాజు సోదరులపై విహెచ్.డి. చేసి కృతకృత్యులయ్యారు. వీరి కుటుంబంలోని వారందరు విద్యాగంధంతో విలసిల్లిన వారే. సాహితీ క్షేత్రం, సారస్వత రంగ పారంగతులే. ప్రజాసేవకులుగా పరిణతినందిన వారే. కొండపల్లి నీహారిణి మామగారు కీ.శే. కొండపల్లి శేషగిరి ఆవు గారు ప్రసిద్ధ చిత్రకారులు. వైవిధ్యభరితమైన బొమ్మలతో, ఎన్నో కులాల వారి సమ్మేళనంలో రూపుదిద్దుకున్న వారి కళాభిరతి, కళాభిమానం, తెలంగాణ తేజోకిరణాలుగా నలువైపులా ప్రసరించాయి. వారు పుణ్యజీవులు. ధన్యాత్ములు. కళామూర్తులు.

నా పిహెచ్.డి. పర్యవేక్షకులు డా.ఆర్. వెంకటేశ్వరరావు తమ్ముడు కీ.శే.ఆర్. విద్యాసాగర రావు గారు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి వద్ద నీటిపారుదల శాఖ సలహాదారుగా పని చేశారు. రంగరాజు వెంకటేశ్వరరావు న్యాయవాది, మా అన్నయ్య కీ.శే. బండ శ్రీహరి న్యాయవాదికి జనగామలో ఆత్మీయ మిత్రుడిగా పేరెన్నిక గన్నవారు. ఈ విధంగా మేమంతా స్నేహ సంబంధ బాంధవ్య, ఆత్మీయులుగా కలిసి ఉండడానికి కారణభూతమయ్యాయి

నా భర్త కడారి కనకయ్య గారిక శ్రీధరస్వామి, వెంకటేశ్వరరావు గారు ఆత్మీయ మిత్రులు. కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కీ.శే. డాక్టర్ వేణుమాధవ్ గారు బాల్యమిత్రులు. శిశు తరగతి నుంచి వారు ఒకే తరగతిలో చదువుకున్నారు. కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య వారి సహబోధకులు. వీరి గ్రంథ సమీక్షలు చేయడం వల్ల అరుణ ధూళిపాల కూడ నాకు ఆత్మీయులైనారు. అరుణ ధూళిపాల మంచి భాషా నిష్ణాతులు, భాషా ప్రేమికులు, భాషా విన్యాసకులు.

కనకయ్య గారి స్నేహితుల కూటమి 22 మంది. సంతుల వారీగా వీరంతా విందు భోజనాలు ఆరగించేవారు. వారి కాలం, వారి స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అనుబంధాలు కూడ మనం ముందు తరాలలో చూడలేము. వారు జీవించిన కాలం చరిత్రకో నిదర్శనం.

“వయసులో చిన్న అయినా జ్ఞానంలో మిన్న” అయిన డా. కొండపల్లి నీహారిణి, రంగరాజు పద్మజ, ధూళిపాళ అరుణ, నెల్లుట్ల రమాదేవి స్నేహ సాంగత్యాలు లభించినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“కళింగ కథా జాడ”

by Maji Bharathi May 28, 2026
written by Maji Bharathi

నాలుగుతరాల రచయితల కథల మూట, ఈ “కళింగ కథా జాడ” అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కళింగాంధ్ర ప్రజల బ్రతుకు చిత్రాలతో, ముందు తరాలకు కథల బాటను వేస్తుంది అనడంలో కూడా సంశయం లేదు. ఈ పుస్తకంలోని కథలన్నీ కళింగాంధ్రకే ప్రత్యేకమైన బాస, యాస, స్థితిగతులను ప్రతిఫలించి, మానవ స్వభావాలను నగ్నంగా, మన ముందు నిలబెట్టినవే. తరాలు మారినా పేదల తలరాతలు మారలేదన్నది కాదనలేని సత్యం. కాలమేదైనా, పాత్రలేవైనా మానవ స్వభావం మారలేదన్న పచ్చి నిజాన్ని మనకు చెప్పేవే ఇందులోని కథలన్నీ. కొందరి స్వార్థమే ఎందరి వెతలకో కారణమౌతుంది. అందుకే తరాల క్రింద వ్రాసినా, నేటి పరిస్థితులకు కూడా అన్వయించేలా, కొన్ని కథలు ఈనాటివిలాగే అగుపిస్తాయి. మనం గమనిస్తే, మానవ స్వభావాలను చిత్రీకరించే కథలు ఏ తరం రచయితలు వ్రాసినా, ప్రస్తుత తరంలోని సమాజానికి కూడా అన్వయించేటట్లుగానే ఉన్నాయి.

ఈ సంకలనంలో ఎక్కువ శాతం కథలు ఉత్తరాంధ్ర మాండలికంతో వన్నె నింపుకున్నవే, వస్తు శిల్పాల్లో వైవిధ్యమున్నవే, అణగారిన బ్రతుకుల గురించి, ప్రజల జీవన స్థితిగతులను మన కళ్ళముందు నిలిపేవే.
మొదటి, రెండవ తరం కథలలో ఎక్కువగా పెత్తందారుల, శ్రామికవర్గాల మధ్య తారతమ్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆ కాలంలో ఉన్న సమస్యలను చర్చించే కథలుంటే, మూడవ తరం వారు వ్రాసిన కథలు, రెక్కాడితేగాని డొక్కాడని పల్లె బతుకులను, ఆదివాసి పోరాటాలను మన కళ్ళముందు నిలబెట్టాయి. సంపాదకులు చెప్పినట్లు నాల్గవ తరం సమాజంలోని అన్ని వర్గాలను స్పృశిస్తూ కథలల్లారు. ఏ తరమైనా సమకాలీన, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేటట్లుగా కథలను వ్రాశారు. ఇందులోని ప్రతి కథా ఆణిముత్యమే.

మొదటి తరం రచయితల కథలు:
“దిద్దుబాటు” కథ ద్వారా తెలుగు కథకు ఆద్యుడైన గురజాడవారి “దేవుళ్ళారా మీ పేరేమిటి” లో, ఒక వ్యక్తి స్వార్థచింతన కారణంగా శైవులకు వైష్ణవులకు మధ్య ఘర్షణలు చెలరేగే పరిస్థితి… నిజానికి దేవుడిని నమ్మిన ఎవరైనా, ఇతరులతో సంబంధం లేకుండా తమ నమ్మకానికి కట్టుబడి ఉంటూ, ఇతరుల నమ్మకాలకు కూడా గౌరవిస్తూ సమాజ ధర్మం పాటిస్తారు. గాని కొంతమంది స్వార్థపరుల కారణంగానే మతాలమధ్యనో, లేక ఒకే మతంలో ఉన్న వేర్వేరు వర్గాల మధ్యనో కలహాలు చెలరేగుతుంటాయి.
“ఈ కథలో పీరు అనేది ఏమిటనుకున్నారు స్వామి వారి తిరునామమే” అంటూ, నాంచారమ్మ అనే ఒక బలమైన పాత్రను సృష్టించి, ఆ పాత్ర ద్వారా చెప్పించి, ఆఖరికి అది త్రిశూలాకారం గనక శివ పీరని శైవులు, రామస్వామి వారి నామము గనుక విష్ణు పీరని వైష్ణవుడు వాదించినప్పుడు, శివుడు విష్ణు పీర్లే అయినప్పుడు బుద్ధుడు శివుడు కారాదా అని ఒక ప్రశ్న ఇంకొకరితో లేవనెత్తించి, “శివుడో, విష్ణువో, పీరో, బుద్ధుడో… పేరేదైనా పరమాత్మ ఒక్కడే కదా!” అన్న బ్రహ్మాండమైన సందేశాన్ని ఇస్తారు గురజాడవారు.
కూలిపనినే వారసత్వంగా పిల్లలకిచ్చే పేదరికాన్ని “వారసత్వం” కథలో ఆయల నరసింహశర్మ గారు ఆవిష్కరిస్తే, పనిచేస్తున్న వాళ్లు ఎందుకు పడుండాలని ప్రశ్నిస్తుందొక గొంతు “ప్రభువెక్కిన పల్లకి”లో బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావుగారి కలం నుండి. పెత్తందారులు ఏమి చేసినా మారు మాటాడకుండా చేసిన తరం నుండి, ప్రశ్నించే స్థాయికి చేరుకుంది ఆ తర్వాతి తరం.
రెండవ తరం రచయితల కథలు:
పొయ్యి మీదకు ఉన్నా, లేకపోయినా పొయ్యి లోపలికి కంపో, ఎండిన ఆకులో తేవలసిన బాధ్యత, బడికి వెళ్లి చదువుకోవలసిన ఎనిమిదేళ్ల బాలిక మీద పడితే, ఆ ఎండుటాకులు ఏరడానికి ఆ బాలిక పడే అవస్థ ద్వారా… “కుంకుడాకు”లో చాసోగారు పేదల దయనీయ స్థితిని వర్ణిస్తే, తప్పులెన్ని చేసినా శివరాత్రి రోజు చనిపోతే స్వర్గప్రాప్తి అవుతుందన్న ప్రజల మూఢ నమ్మకాన్ని వ్యంగ్యంగా చెప్పిన కథ రావిశాస్త్రి గారి “పాపి”.
మా అమ్మ చాలా మంచిది, నన్ను చెప్పలేనంత ప్రేమిస్తుంది, నా కొరకు ఎంత కష్టమైనా ఓరుస్తుంది, అన్నమాట తల్లి హృదయమేమిటో, కులమత ఆర్థిక స్థితులకు అతీతంగా, దేశ, కాలమాన పరిస్థితులకు అతీతంగా అమ్మంటే ఏమిటో హృదయానికి హత్తుకునేలా చెప్పారు అవసరాల రామకృష్ణారావు, “అమ్మ చాలా మంచిది” అన్న కథలో.
కారా మాస్టారు గారి “ఆర్తి” కథనే తీసుకుంటే… “ఎంగిలాకుల కోసం వీధి కుక్కలు ఎందుకు చస్తాయో, ఆ విస్తళ్ళలో భోజనం చేసిన వారికి అర్థం కాకపోవచ్చంటూ”, కాలు ఆడి కూలి చేస్తే గాని నోటికెల్లని వేళ్ళు, కూలి డబ్బుల కోసం బంధువుల మధ్య చెలరేగే తగాదాలు, పల్లెటూర్లలో సామాన్య ప్రజానీక స్థితిగతులు, ఆకలి తీరడానికి పడే పాట్లు, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి ఆ కథలో. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు, పని చేస్తే వచ్చే కూలి కోసం కూతురు నా దగ్గర ఉండాలని తల్లి, కోడలు నా ఇంట్లో ఉండాలని అత్త పోట్లాడుకోవడం పేదల బతుకులకు అద్దం పడుతుందీ కథ.

మూడవ తరం రచయితల కథలు:
భర్త తాగి వచ్చి కష్టాలు పెడుతున్నాడని బాధపడ్డ పనమ్మాయితో, అటువంటి భర్తను విడిచి పెట్టాలని సలహా ఇచ్చిన ఇల్లాలు, తన వరకు వచ్చేసరికి… తన భర్తకు అక్రమసంబంధం ఉందని తెలిసాక, నిలదీస్తే నా ఇష్టమన్న భర్తను వదిలేయలేక పోతుంది ఆ ఇల్లాలు. మహిళల గురించి ఆమె ఊహించుకున్న స్వాతంత్ర్యం, స్త్రీ పురుష సమానత్వం తన దగ్గరికి వచ్చేసరికి ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఆడవాళ్ళ స్థితిగతులేవైనా ఫలితం ఒక్కటేనంటూ సుతిమెత్తగా చాగంటి తులసి గారు చురక వేసి చెప్పిన కథ “మనువు.

అన్యాయం అయిపోతున్న వాళ్ళు, వాళ్లకు న్యాయం చేయాలనుకుంటున్న వాళ్ళు, తుపాకులు పట్టుకొని అడవి దారి పడుతున్నారు. దౌర్జన్యం, అన్యాయం లేకపోతే అడవి దారి పట్టాల్సిన అవసరమేమిటి ఎవరికైనా? ఈ విషయం సమాజం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ, ఆదివాసీ రైతులకు అప్పులిచ్చి, వడ్డీ రూపంలో పండిన పంటను పీల్చేస్తూ, అసలు కోసం దౌర్జన్యంగా భూమిని రాయించుకుంటే తిరగబడ్డ రాజన్న గురించి “ఇదే దారి” లో భూషణం గారు చెప్తారు.
నాల్గవ తరం రచయితల కథలు:
“మీ రేపటి కోసం మా నేటిని త్యాగం చేస్తున్నామన్న వాళ్లు”… వాళ్ళెవరో పాఠకుల ఊహకే వదిలేస్తూ కథ మొత్తం నడిపించారు ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడుగారు “వాళ్లు” కథలో. వాళ్లను పట్టుకోవడానికి వచ్చినా, “వాళ్ల తుపాకులకు ఆశయముందని భావించి, తుపాకీతో వాళ్ల ఉద్యమాన్ని ఆపగలమా?” అని తనను తానే ప్రశ్నించుకుంటూ, తాను వ్రాస్తున్న కథకైనా, ఇప్పటి వర్తమానానికైనా, జరుగుతున్న ఎన్ కౌంటర్… ఇది ముగింపేనా అన్న సంశయంతో తటపటాయిస్తూ నమ్మిన సిద్ధాంతానికి, డ్యూటీకి మధ్య నలిగిపోయిన వ్యక్తిగా ఈ కథలో జిల్లా ఎస్పీ కనిపిస్తారు.
తాత ముత్తాతల నుండి పొలాలకు అరకలు, బండ్లు వెళ్లే త్రోవలను మూసివేసి, పంట పండించుకోవడానికి వీల్లేకుండా చేసి, పొలం అమ్ముకొనక తప్పనిసరి పరిస్థితులను సృష్టించి, ఉత్తరాంధ్రలోని భూములను చవగ్గా కొనుక్కొని ఇక్కడి రైతుల మీదే పెత్తనం చలాయించే దొరల గురించి, తమ పొలాల్లో తామే పాలేరులైన దుస్థితి గురించి “తిరుగుడిగుమ్మి” లో, ఇంకొక ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడుగారు విశదపరిచిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
తప్పనిసరి పరిస్థితులలో పొలాలను అమ్ముకున్న రైతుల కష్టాలను దగ్గరనుండి చూసిన వారి కలం, “ఎక్కడి నుంచో ప్రవహించి వచ్చిన పెట్టుబడులు, మన ముందు ఓ సాగరంలాగ తయారై, అలల నాలుకల తోటి ఆహ్వానిస్తుంటే, ఈతకొలను అనుకొని మురిసిపోతున్నాం గాని, అదొక తిరుగుడు గుమ్మని తెలుసుకోలేక పోతున్నాం. రేపది మన ఊళ్ళనే ముంచేస్తుందన్నా ఆశ్చర్యం లేదు” అంటూ పదునైన సంభాషణలను రాయడం ద్వారా, తాత ముత్తాతల నాటి తమ ఊర్లలో, తామే వలసదారులైన ఉత్తరాంధ్ర రైతుల దుస్థితి గురించి చెప్పారు.
అణగారిన కులాలకు రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వంలో పదవులు ఇచ్చినా, అవి పేరుకు మాత్రమేనని “పెద్దోళ్ళు” కథలో బొడ్డ కూర్మారావు గారు తెలియబరిస్తే, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాలు శుద్ధి చెయ్యకుండా వదిలేస్తుంటే భూగర్భ జలాలు, భూమి, గాలి కలుషితమై ప్రజానీకం జబ్బులు పాలవుతుంటే, తనకెందుకులే అని ఊరుకోలేక, చేస్తున్న పీహెచ్డీని వదిలి, ప్రజల మధ్య ఉండి పోరాడాలని కొడుకు అనుకుంటే, అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల బాధను తెలిపే కథ, బివిఏ రామారావు నాయుడుగారి “ఎదిగొచ్చే కొడుకు.

నేటి సినిమాలు పిల్లలనెలా ప్రభావితం చేస్తున్నాయో “ఆయుధపాణి”లో దాసరి రామచంద్రరావు గారు వివరిస్తే, నాటకాలు వేయడానికి ఇష్టపడే రైతు మనోవేదనను, పూర్వకాలంలో నాటకాలు చూడడానికి గ్రామస్తులు ఎలా వెళ్లేవారో వివరిస్తూ జ్ఞాపకాలలోనికి తీసుకు వెళ్తుంది, ఆల్తి మోహనరావుగారి “ఋషి” కథ.
యాక్సిడెంట్ అయిన వ్యక్తిని రక్షించే క్రమంలో, తన ఎంట్రెన్స్ ఎగ్జామ్ టైం దాటిపోయినా బాధపడని యువకుడు, కొడుకు చేసిన పనిని సమర్థిస్తూ ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదని భావించే తండ్రి, విద్యార్థులకు పరీక్షల్లో సోషల్ బిహేవియరుకు కూడా మార్కులుంటే బాగుండేదని ఆ తండ్రి అన్నప్పుడు, “పొలమైనా, రానున్న తరమైనా సరిగ్గా సాకగల చేతుల్లో ఉన్నప్పుడే ఫలవంతం అయ్యేదని”, “ఫలితం” కథలో తన భావాన్ని వ్యక్తీకరిస్తారు మాజీ ఎంపీ, రచయిత డివిజి శంకర్రావుగారు. పుట్టుకతో ఎవరూ దొంగలు కాదు పరిస్థితుల బట్టి దొంగలమయ్యామంటూ “సమాజం చెక్కిన దొంగలు”లో కలమట దాసుబాబుగారు చెప్తున్నారు.
రచయిత్రులను తీసుకుంటే, తొలితరంలో రుక్మిణమ్మగారు సాధారణంగా కుటుంబాల్లో దాయాదుల మధ్య జరిగే గొడవల గురించి చెప్తే, మూడవతరంలో చాగంటి తులసిగారు – “మనువు”లో భార్యల మీద భర్తల దాష్టీకం, భార్యల సర్దుకుపోయే తత్వాన్ని చెప్తే, నాల్గవ తరంలో మల్లీశ్వరిగారు భర్త చేతిలో కష్టాలు పడ్డ రావులమ్మ కథ చెప్తే, తండ్రైనా, భర్తైనా, బాంధవ్యం ఏదైనా మగాడన్నవాడి చేతిలో దగా చెయ్యబడుతూనే ఉంటారు ఆడవాళ్లు. అలా దగా కాబడ్డ కనక గురించి “కూరాకుల మడి”లో అయ్యగారి సీతారత్నం గారు చెప్తే, “మా ఊరి కథ” అని ఇనుగంటి జానకి గారు ఆ ఊరిలో జరిగిన కథల గురించి చెప్తూ, అందులో మరల అన్యాయంగా చనిపోయిన స్త్రీ మూర్తుల కథలే ఉంటే, చెట్లను నరుకుతూ, డైనమైట్లు పెట్టి కొండల్ని పిండి చేస్తూ, భూగర్భ జలాలను ఇష్టానుసారం తోడేస్తూ, పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే, భూకంపాలు రాక ఏమవుతాయని ప్రశ్నిస్తూ, అలా కాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో “కల” కథలో మజ్జి భారతి గారు, వివరిస్తారు.
ఉత్తరాంధ్ర కవుల కథలను సంకలనంగా చేసి, “కళింగ కథా జాడ” అని పేరు పెట్టారు గాని, ఇందులోని అన్ని కథలు, అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ, సమస్యలకు ముగింపు ఏ రకంగా దొరుకుతుందని పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వ్యాసంలో కొన్ని కథలనే ఉటంకించడం జరిగింది. గాని, ఇందులోని ప్రతికథ ఒక ఆణిముత్యమే. అందుకే కొని, చదవవలసిన కథల సంకలనమిది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సంకలనం తేవాలన్న ఆలోచన చేసి, శ్రమ కోర్చి, కథలను యేరి, వడబోసి, అర్థవంతమైన ముఖచిత్రంతో అలంకరించి, మనకందించిన సంపాదకత్రయం అట్టాడ అప్పలనాయుడు గారు, గంటేడ గౌరునాయుడు గారు మరియు చీకటి దివాకర్ గార్లకు ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ, మాతృకలో ప్రచురింపబడ్డ నా కథ “కల” ను కూడా, ఈ సంకలనంలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి
*

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రక్త చరిత్ర మన మేడే

by Vijaya Ranganatham May 28, 2026
written by Vijaya Ranganatham

ఉదయం సూర్యుడు ప్రపంచాన్ని నిద్రలేపే ముందు మనం పట్టించుకోని, సాధారణంగా జరిగుతున్న విషయం, ఎవరో ఒకరి చెమట భూమిని తడుపుతుందని.  మనం గ్రహించని, కళ్లకు కనిపించని ఆ క్షణంలోనే ప్రపంచం మేలుకుంటుందని.

మానవ సమాజం నాగరికతను, అభివృద్ధిని రూపుదిద్దుకుంటున్న వేళ పంటలను పండించడం, పండిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించి నిప్పులపై వండుకుని తినే కాలం వచ్చింది. నివాసయోగ్యమైన నీడను కల్పించుకునే దశలోకి ప్రవేశించాడు మానవుడు. అప్పటినుండే పొలం దున్నే రైతు చెమటలో అన్నం మొలుస్తుంది. ఇటుక మోసే కూలీ భుజంపై ఇల్లు నిలబడుతుంది. మిల్లులో చక్రం తిప్పే కార్మికుడి చేతుల్లో సమాజం కదులుతుంది. వారివల్లే ప్రపంచం ఒక విస్తారమైన రంగస్థలం అయితే, దానిపై నిశ్శబ్దంగా నడిచే పాత్రలు శ్రామికులయ్యారు. వారి పేర్లు చరిత్ర పుస్తకాలలో పెద్ద అక్షరాల్లో ఉండకపోవచ్చు… కానీ వారి చెమట చుక్కలతోనే నాగరికత తన కథను రాసుకుందనేది జగమెరుగని సత్యం.

ప్రథమంగా ప్రధానమైంది వ్యవసాయం. ఎక్కువ మంది రైతులుగానే ఉండేవారు. తమ భూముల్లో లేదా జమీందార్ల భూముల్లో పనిచేసేవారు. వీరికి సమయ నిబంధన ఏదీ లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు, ప్రకృతి  ఆధారితంగా పని చేసేవారు.

తరువాత వృత్తిదారులు. అంటే నేయుగాళ్ళు, కమ్మర్లు, కుండలు చేసేవారు, బంగారు పని చేసే వారు. ఇవే వీరి కులవృత్తులుగా మారాయి. వీరంతా తమ ఇంటి దగ్గరనుంచే, కుటుంబం అంతా కలిపి పని చేసే తమ పనికి తామే యజమానులు ఉండేవారు. కుటుంబ ఆధారిత పనులు. పిల్లలు కూడా  చిన్న చిన్న పనుల్లో సహాయం చేసేవారు. పిల్లల శ్రమలాగా కాకుండా కుటుంబ సహాయంగా ఉండేది.

రాజులు, జమీందారుల వ్యవస్థ ఏర్పడింది. చాలా మంది “సర్వులు” (serfs)గా ఉండేవారు. భూమి యజమానుల కోసం పనిచేసేవారు. చాలా భాగం తమ స్వేచ్ఛను కోల్పోయారు. వారి పనికి సమయ నిబంధనలు హరించుకు పోయాయి.

18వ శతాబ్దం చివరిలో పారిశ్రామిక విప్లవం (Industrial Revolution)ప్రారంభమైంది.  యంత్రాలు వచ్చాయి. ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ప్రజలు తమ భూములు భూస్వాముల ఆధీనంలోకి వెళ్ళి పోవటంతో జీవనాధారం కోసం గ్రామాలనుండి పట్టణాలకు వలసలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీలలో పని చేయటం వల్ల వారి జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. ముందు “తమ పని-తమ సమయం” తర్వాత “యజమాని పని-నిర్ణీతకాలం” అయిపోయాయి. ఇదే “కార్మికుడు” అనే కొత్త వర్గాన్ని సృష్టించింది. ఎడతెరపిలేని పని వల్ల పని చేసే గంటలు కూడా పెరిగాయి. 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. యంత్రాలు 24 గంటలు నడవాలి. యజమానులు లాభాలకోసం ఎక్కువ పని చేయించేవారు. ఫాక్టరీల ప్రారంభ దశ కావడంతో ఉద్యోగాలు తక్కువ, పోటీలు ఎక్కువగా ఉండి, ఆ కార్మికుడు బలవంతంగా ఎక్కువ సేపు పని చేయాల్సి వచ్చేది. వారి జీవిత కాలంలో ఎక్కవ భాగం ఫాక్టరీల్లోనే గడిచిపోయేది. ఆరోగ్యాలు పాడై పోయేవి. అప్పుడు చట్టాలు, కార్మికుల హక్కులు లేవు.

ముందు స్వయం ఉపాది, ప్రకృతి ఆధారితం, కొంత స్వేచ్ఛ, కుటుంబ పనిగా ఉండే జీవనోపాధి రానురాను ఫాక్టరీ ఉద్యోగం, యంత్రాల ఆధారితం, కఠిన నియంత్రణ, వేతనాల కార్మికుడి జీవితం చట్రంలో బంధింపబడింది. మానవుడు ఒకప్పుడు తన పనికి యజమాని… పరిశ్రమల యుగంలో తన శ్రమకు మాత్రమే యజమాని అయ్యాడు.

కర్మాగారాల గోడలు మానవ విలాపనలు వినేవి. వెలుతురు కన్నా చీకటి ఎక్కువగా ఉండే కార్మికుల జీవితాలు యంత్రాల కంటే చవకగా మారాయి. పగలు-రాత్రి అనే తేడా లేకుండా, 16 గంటల వరకు పనిచేసే వారి శరీరాలు అలసిపోయేవి. కర్మాగారాల పొగమంచులో మానవ శ్వాసలు కనుమరుగైపోవటం ప్రారంభమైంది. యంత్రాల గర్జనలో మనిషి హృదయ స్పందన వినిపించని కాలమై పోయింది.

ఏదైనా పెరుగుట విరుగుట కొరకే. ఎంత అణచి వేతలుంటాయో అంత తిరుగుబాట్లు మొదలవుతాయనటానికి నిదర్శనంగా వారి ఆశలు మేల్కొన్నాయి. ఆ ఆశలే ఒక రోజు నినాదాలుగా మారాయి. అప్పుడు ఒక చిన్న స్వరం పుట్టింది. “జీవితం కూడా కావాలి…” ఆ స్వరం పెరిగి నినాదమైంది. “ఎనిమిది గంటల పని… ఎనిమిది గంటల విశ్రాంతి… ఎనిమిది గంటల మనసు కోసం…” ఆ నినాదం వీధుల్లో ప్రవహించింది… చికాగో గుండెల్లో అగ్నిలా రగిలింది… అక్కడే చరిత్ర రక్తంతో రాసుకుంది. “ఎనిమిది గంటల పని… ఎనిమిది గంటల విశ్రాంతి… ఎనిమిది గంటల జీవితం.” ఆ నినాదాల ప్రతిధ్వని 1886 మే 1న అమెరికాలో గర్జించింది. చికాగో వీధుల్లో కార్మికుల అడుగులు భూమిని కంపించాయి. కానీ ఆ స్వరాలను అణచివేయడానికి ప్రయత్నించిన హింస, రక్తపాతం చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ రోజు జరిగిన హింసాత్మక సంఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ నిరసనలో బాంబు పేలుళ్ళు, పోలీసుల కాల్పులు జరిగాయి అనేక మంది కార్మికులు, పోలీసుల మరణించారు. ఈ సంఘటన కార్మిక ఉద్యమానికి మలుపు తీసుకువచ్చింది.

ఆ త్యాగాలు వృథా కాలేదు. అవి ప్రపంచ కార్మిక హక్కుల పునాది అయ్యాయి. ఆ సంఘటననే మనం “హేమార్కెట్ అఫైర్” (Haymarket Affair)గా ప్రపంచం గుర్తుంచుకునేలా చేసింది. అక్కడ చిందిన ప్రతి రక్తపు చుక్క, భవిష్యత్తులో కార్మిక హక్కుల విత్తనంగా మొలిచింది. ఆ రక్తపు ప్రతి చుక్క ఈ రోజు మన హక్కుల పునాది అయింది.

1886 మే 1న అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం, చికాగోలో జరిగిన Haymarket Affair ద్వారా ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపు తీసుకుంది.చికాగోలో జరిగిన ఉద్యమం ఒక చినుకు కాదు, అది ప్రపంచవ్యాప్తంగా కార్మిక చైతన్యాన్ని రగిలించిన మెరుపు. భారీ సమ్మెలు, 8 గంటల పని కోసం పోరాటాల అంకురార్పణ జరిగింది. ఇదే ప్రపంచ కార్మిక ఉద్యమానికి బీజం.

ఇది అలలా వ్యాపించిన ఉద్యమం ఒకేసారి అనేక ప్రాంతాల్లో పెల్లుబికింది. చరిత్రలో నిలిచి పోయింది.  ప్రపంచమంతా వ్యాపించింది. చికాగోలో మొదలైన ఆ నినాదం, సరిహద్దులు దాటి ఖండాలను తాకింది. ఒక నగరంలో పుట్టిన స్వరం, ప్రపంచ కార్మికుల గొంతుకగా మారింది.

తరువాత 1880ల చివరన కెనడాలో అమెరికా ప్రభావంతో కార్మిక సంఘాలు బలపడాయి. 8 గంటల పని కోసం డిమాండ్లు మొదలయ్యాయి.

1889–1891 కాలంలో యూరప్ లో ఉద్యమం వేగంగా వ్యాప్తి చెందింది. సెకెండ్ ఇంటర్నేషనల్ సమావేశం పారిస్ లో  1889 సంవత్సరంలో ముఖ్య మలుపు తిరిగింది. మే 1ను అంతర్జాతీయ కార్మిక దినంగా ప్రకటించారు. వెంటనే యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలుబ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో విస్తరించాయి. 1890లోనే యూరప్ అంతటా మొదటి “గ్లోబల్ మే డే” జరుపుకున్నారు.

1890లు–1917 లలో రష్యా విప్లవ దిశగా అడుగులు వేసింది. సర్కార్ భయం వల్ల మే డే రహస్యంగా జరిపేవారు. తర్వాత ఇది పెద్ద రాజకీయ ఉద్యమంగా మారింది. చివరికిది రష్యన్ రెవల్యూషన్  (Russian Revolution) కి దారితీసిన చైతన్యంలో భాగమైంది.

1900–1920 ఆసియాలో ప్రారంభమై వ్యాప్తిచెందింది.జపాన్, చైనా దేశాల్లో కార్మిక ఉద్యమాలు మొదలయ్యాయి. మే డే జరుపుకోవడం ప్రారంభమైంది

భారతదేశం లో 1923 లో అధికారికంగా ఆరంభం మైంది.మొదటి మే డే చెన్నైలో జరిగింది. సముద్ర గాలిలో ఎర్ర జెండా, చెన్నైతీరాన ఎమ్. సింగరవేలు చెట్టియార్చేతుల్లో మొదటిసారి ఎగిరింది. అది కేవలం జెండా కాదు వేదనకు రంగు, పోరాటానికి రూపం. ఆయనేభారత కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించి మార్గదర్శకుడిగా నిలిచారు. అదే సందర్భంలో ఎర్ర జెండాను కార్మిక ఐక్యతకు ప్రతీకగా ఎగురవేశారు. ఆ జెండా కేవలం ఒక రంగు కాదు, అది బాధల జ్ఞాపకం, పోరాటాల ప్రతీక, ఐక్యతకు సంకేతంగా ముద్రవేసుకుంది. అప్పటి నుంచి మే డే భారతదేశంలో కూడా శ్రమకు గౌరవం ఇచ్చే రోజుగా స్థిరపడింది. ఇక్కడి నుంచి భారత కార్మిక ఉద్యమం బలపడింది.

ప్రపంచవ్యాప్తంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇతర ఆసియా దేశాలలో 20వ శతాబ్దం మధ్యకాలంలో విస్తరించింది.  అప్పటినుండి మే డే ఒక గ్లోబల్ ఉద్యమంగా మారింది. శ్రామికుడి చెమటకు భాష్యం చెప్పిన రోజే ఆ మేడగా అవతరించింది.
ఆ శ్రమించే కార్మికుడి చేతుల్ని మనం ఎప్పుడైనా గమనించామా? ఆ చెమట చుక్కలకి కూడా ఒక రోజు పండుగగా చేసుకునే రోజుకొటి ఉంది. అదే మే ఒకటవ తారీకు అని చరిత్ర నినదించింది. మనమది“ఇంటర్నేషనల్ వర్కర్స్ డే” అని పిలుస్తాం.

కానీ, ఆ రోజు కేవలం ఒక తేదీ కాదు. నిశ్శబ్దంగా రాసుకున్న రక్త గాథ. ప్రపంచాన్ని ముందుకు నడిపేది యంత్రాలు కాదు. వాటిని నడిపించే చేతులు. ఆ చేతుల వెనుక ఉన్న శ్రమ, చెమట, నొప్పి, ఆశల సమాహారానికి ప్రతీకగా నిలిచిన రోజు మే డే. ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే International Workers’ Day కేవలం ఒక పండుగ కాదు. ఇది పోరాటాల చరిత్ర, హక్కుల సాధన, సమానత్వ స్వప్నాలకు చిహ్నం.

మే డే మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. పని చేసే ప్రతి మనిషి గౌరవించబడాలి. కనీస వేతనం, సురక్షిత పని పరిస్థితులు, సమాన అవకాశాలు ఇవన్నీ హక్కులుగా మారడానికి ఈ రోజు పునాది వేసింది. కార్మికుల ఐక్యత ఎంత శక్తివంతమో ప్రపంచానికి తెలియజేసింది.

ఆశ్చర్యకరంగా, ఈ ఉద్యమానికి జన్మనిచ్చిన అమెరికాలో మే 1న లేబర్ డే జరపరు. అక్కడ అది సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మే డే ఒకప్పుడు యూరప్‌లో వసంత ఋతువును ఆహ్వానించే పండుగగా కూడా ఉండేది. కాలక్రమేణా అది కార్మికుల హక్కుల దినంగా మారింది.

మే డే కేవలం ఒక సెలవు రోజు కాదు. ఇది మనం వినియోగించే ప్రతి సౌకర్యం వెనుక ఉన్న శ్రమను గుర్తు చేసే రోజు. కార్మికుల చెమటతో నిర్మితమైన ఈ ప్రపంచంలో, వారి గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. శ్రమే శక్తి… శ్రామికుడే సమాజానికి అసలైన ఆధారం. చెమట చుక్కల చరిత్ర – మే డే”.  ఇది మనకు ఒక గాఢమైన సత్యాన్ని చెబుతుంది. శ్రమే సృష్టి మూలం. ఈ ప్రపంచం నడిచేది చేతుల శ్రమతోనే. ఈ రోజు వెనుక మరో మృదువైన గాథ ఉంది. ఒకప్పుడు మే 1 వసంత ఋతువు ఆరంభంగా పండుగలా జరుపుకునేవారు. ప్రకృతి పచ్చదనాన్ని ఆహ్వానించే ఆ రోజు, కాలక్రమేణా శ్రమికుల గౌరవానికి అంకితమైంది. ప్రకృతి పునర్జన్మ పొందినట్లే, కార్మికుల హక్కులు కూడా పునర్జన్మ పొందిన రోజు ఇది.

మే డే చరిత్రలో మహిళల అడుగులు కూడా స్పష్టంగా వినిపిస్తాయి. నూలు మిల్లులలో, గార్మెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసిన మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడ్డారు. తమ హక్కుల కోసం ముందుండి పోరాటం చేశారు. వారి స్వరం సున్నితమైనదైనా, దాని ప్రభావం గొప్పది. అలాగే చిన్నారులపై బానిసత్వపు బరువును తగ్గించడంలో కూడా ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మే డే చరిత్రలో మహిళల పాత్రను ప్రత్యేకంగా గుర్తించాలి. అలాగే పిల్లల శ్రమ నిర్మూలనలో కూడా కార్మిక ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయి.

ఈరోజు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నప్పటికీ, శ్రమ విలువ తగ్గలేదు. కొత్త రూపాల్లో సమస్యలు మారినా అసంఘటిత రంగం, అందుకే మే డే కేవలం చరిత్ర కాదు… అది ప్రస్తుతానికి కూడా మార్గదర్శకం. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగినా, కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. కొన్నిరంగాలలో పనిచేసే వారికి ఇంకా సరైన రక్షణ లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, గిగ్ వర్క్ కార్మికుని పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి కొత్త తరహా కార్మికులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే మే డే ప్రాముఖ్యత ఇప్పటికీ తగ్గలేదు. అది మరింత అవసరమైంది.

ముగింపుగా, మే డే మనకు ఒక ప్రశ్న వేస్తుంది. “మన జీవితాన్ని సులభం చేసిన ఆ చేతులను మనం గౌరవిస్తున్నామా?” ప్రపంచం, ఎత్తుకు ఎదిగిన ప్రతి మెట్టు వెనుక, ఒక కార్మికుడి చెమట చుక్క ఉంది. ఆ చుక్కను గుర్తు చేసుకోవడమే మే డే. ఇది ఒక ప్రశ్న, ఒక జ్ఞాపకం, ఒక కర్తవ్యం. హక్కులు పుట్టాయి పోరాటంతో. నిశ్శబ్దంగా పనిచేసే మహిళా చేతులు చరిత్రను నెమ్మదిగా మార్చాయి. చిన్నారి కన్నీళ్లు తగ్గించడానికి ఈ ఉద్యమం కవచమైంది. ఇప్పటికీ ప్రపంచం మారినా శ్రమ మారలేదు. పేర్లు మారాయి. గిగ్ వర్కర్… కాంట్రాక్ట్ ఉద్యోగి…కానీ బాధ మాత్రం అదే… అందుకే మే డే ఇంకా ముగియని కవిత. మన సుఖాల వెనుక వారి నిశ్శబ్ద త్యాగం ఉంది. ఆ చెమటకు నమస్కరించే రోజు మే డే.

శ్రమ ఒక పదం కాదు. అది జీవితం. శ్రామికుడు ఒక మనిషి కాదు. అతడే సమాజం. శ్రమకు నమస్కారం… శ్రామికుడికి గౌరవం… అదే మే డే సారాంశం. చెమట చుక్కల సాక్ష్యం మే డే”

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కథా వచనానికి పద్య రూపం ,   ఒక ప్రయోగం

by Dr. Kanchanapalli Govarndhana Raju May 28, 2026
written by Dr. Kanchanapalli Govarndhana Raju

కీర్తిశేషులు గుండవరం చంద్రశేఖర రావు గారు రచించిన పద్య కావ్యం ప్రబోధ నిర్వచనం నీతి చంద్రిక, మిత్ర లాభం.  ఆయన పుత్రులు, కవి, గుండవరం ప్రభాకరరావు ,రెండవ కుమారుడు కొండల్ రావు ,కూతురు శారదాదేవి   ఈ పుస్తకాన్ని పునర్ ముద్రించారు. భవానీ సాహిత్య వేదిక నిర్వాహకులు వైరాగ్యం ప్రభాకర్ ప్రచురణ కర్తగా వ్యవహరించారు.

       బుద్ధి కుశలత లేని రాజకుమారులను తీర్చిదిద్దడం లక్ష్యం. విష్ణుశర్మ అనే గురువు ద్వారా  ఇది  జరిగింది. ఒకప్పుడు సంస్కృత సాహిత్యంలో భానుని కాదంబరి, దండి దశకుమార చరిత్ర గొప్ప వచన గ్రంథాలు. తెలుగులో చిన్నయ్య సూరి బాల వ్యాకరణం, వ్యాకరణం అభ్యసించే వాళ్ళకి అనుకూలంగా తీర్చారు. అదే క్రమంలో రచించిన నీతి కథల వెన్నెల ఈ నీతి చంద్రిక. అందులోని మిత్ర లాభాన్ని గుండవరం వారు చాలా చక్కని పద్యాలలో రచించారు.

      పీఠికలో గండ్ర లక్ష్మణరావు గారు చెప్పినట్టు వచనాన్ని పద్యంలో రాయడం చాలా కష్టం. ఈ కష్టమైన కృతి నిర్వహణ చంద్రశేఖర రావు గారి చేతిలో ఆలవోకగా కొనసాగింది.

గుండవరం  చంద్రశేఖర రావు ఈ రచనను పూర్తిస్థాయి ప్రాచీన కావ్య రచనా పద్ధతిలోనే రచించారు. ఇష్ట దేవతా స్తుతి, మాతృ స్తుతి, పండిత స్తుతి. మొదలైన కావ్య సంప్రదాయాలను పాటించారు. పద్యాలను ఎత్తుకోవడం, నడిపించడం, సమస్తము నాటి ప్రబంధ పద్ధతే. ఆయన మిత్ర లాభము కథను ఈ పద్య  శిల్పంతో చెప్పడం ఆధునిక సాహితీ రంగంలో ఒక నూతన ప్రయోగం.

      చిన్నయ్య సూరి నీతిచంద్రికలో వివిధ జంతువులు మాట్లాడుతాయి. మానవుల వలె ఆలోచిస్తాయి. ఇట్లాంటి anthropomorphism ఆనాడే చిన్నయ్య ప్రయోగించాడు. ఇది గుండవరం చేతిలో మరింత రసవంతమైంది.

ఆయన మిత్ర లాభం కథా ప్రారంభం చిన్నయ్య సూరి పద్ధతిలోనే మొదలుపెట్టినా నాటి ప్రబంధాలనే స్తురింపజేస్తుంది. “గంగ కనతి దండ గలదొక్క నగరంబు, అఖిల సంపదగల్గి అలరుచుండు”

 అంటూ మొదలవుతుంది. పావురములు వలలో చిక్కుకోవడం, బ్రాహ్మణుడు పులి కథ, లఘు పతనకుడు హిరణ్యకుని స్నేహమాశించడం, పిల్లి  చేసిన మోసం వల్ల ముసలిగద్ద బలి కావడం, హిరణ్యకుడు పూర్వకథ చెప్పడం,బ్రాహ్మణుడు_ నువ్వుల కథ, మందరుడునక్క_విల్లు  కథ చెప్పడం, చిత్రాంగుడు తన పూర్వ కథ చెప్పడం, ఇలాంటి కథలూ , ఉపకథలతో సాగిపోతుంది కథాకథనం.

      గుండవరం వారి శైలి ప్రసాద మాధుర్యంతో ఉంటుంది. ఆయన పద్యాలు పాంచాలి రీతిలో కొనసాగుతాయి. ఆయన వాడిన అలంకారాలు ఆధునిక కవి మార్గదర్శకాలు.

      చింతలు గ్రమ్మె చందురుని చీకటి మబ్బులు ముంచునా విధం, (28 పేజీలో 5వ పద్యం) కాల ప్రవాహము నాపశక్యమే ( 47వ పేజీలో 108వ పద్యం ) భీరుని కైవడి భూరుహంబునన్ (136 పద్యం 52 పేజీ ) గణనౌనగు వన ప్రకృతి, వనితామణి నీల గగన  వర్ణము తోడన్, ( 88వ పేజీ 339 పద్యం )

      ఈయన పద్యాలలో లోక సహజ రీతి సామెతలుగా నిలబడిపోగలిగే పాదాలు ఎన్నో కనబడతాయి.

      బుద్ధిబలుండబలుడై నభూషణుడవనిన్. (56వ పద్యం ) ఆశింపకు కపట కుఠిల మానస మైత్రిన్ ( 43 వ పద్యం )

      ఈయన రాసిన పద్యాలు ప్రసిద్ధ కవుల ఒరవడిలో సాగినవి. 43 వ పద్యం కొరవి గోపరాజును, 47 వ పద్యం బలిజేపల్లి లక్ష్మికాంతమును, 68, 82, పద్యాలు కరుణశ్రీని, 72వ పద్యం పోతనని,76వ పద్యం పెద్దనను, 113 వ పద్యం ముక్కు తిమ్మనను,  స్పురింపజేస్తాయి. 161 పద్యంలో కవి ప్రయోగించిన దుష్కరప్రాస ఈయన పద్య రచనా కౌశలాన్ని తెలియజేస్తుంది.

పావురాలన్నీ వలలో చిక్కుకున్న తర్వాత తమను అందుకు ప్రోత్సహించిన వృద్ధకపోతాన్ని మిగతా పావురాలు చిన్నయ్య సూరి కథనంలో ఈ విధంగా నిందిస్తాయి. “నీవు వృద్ధుడవు, తెలిసిన వాడివి అని భ్రాంతిపడి నీ మాటలను విని, ఈ విపత్తు తెచ్చుకుంటిమి. ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కాని, ఏండ్లు మీరిన వాడా  వృద్ధుడు..

 ఈ మాటలకు చంద్రశేఖర రావు పద్యానువాదం చూడండి,

  వృద్ధులిట లక్షలున్నను

  బుద్ధికి బలుడైనవాడె,వృద్ధుండిల సద్,

 బుద్దికి వృద్ధుడె బద్దుడ

 బుద్దిబలుండబలుడైన  భూషణు డవనిన్

ఇంత చక్కని ఈ పద్య కావ్యం లో అక్కడక్కడ యతిభంగి పద్యాలు చేరాయి. ఇది డిటిపి చేసిన వాళ్ల దోషం అయి ఉంటుంది.

 మరొక ముద్రణలో దీన్ని సవరించుకోవాలి.

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుండు రమణయ్య “అమ్మ” కవిత

by Narendra Sandineni May 28, 2026
written by Narendra Sandineni

కవి గుండు రమణయ్య వృత్తిరీత్యా కరీంనగర్ లోని వాణి నికేతన్ బాల విహార్ తెలుగు మీడియం పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా సేవలందిస్తూ, ప్రవృత్తిరీత్యా రచనా వ్యాసంగంలో నిమగ్నమై ఉన్నారు.ఇటీవలే తల్లిని కోల్పోయిన వేదనలో ఆమె స్మృతిగా అమ్మ అనే కవితను రచించారు.గుండు రమణయ్య కలం నుండి జాలువారిన “తొలి మెట్టు” కవితా సంపుటిలోని అమ్మ కవిత పై విశ్లేషణా వ్యాసం.అమ్మ ప్రేమ,త్యాగం,వాత్సల్యానికి ప్రతిరూపం.నవ మాసాలు గర్భంలో మోసి మనకు జన్మనిచ్చే అమ్మ, నిస్వార్ధమైన ప్రేమను కురిపిస్తూ, పిల్లల సంతోషం కోసం తన జీవితాన్ని అంకితం చేసే కల్పవృక్షం.అమ్మ చల్లని నీడలో కష్టాలు కరిగిపోతాయి.ఆమె ఆశీస్సులు జీవితానికి కొండంత అండగా నిలుస్తాయి.సృష్టిలో కనిపించే నిజమైన దైవం అమ్మ. బిడ్డకు నడక,నడత,సంస్కారం, మంచి – చెడులను నేర్పే మొదటి గురువు అమ్మ.ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన పిల్లల సౌఖ్యం కోసం శ్రమించే త్యాగమయి. బిడ్డకు క్షేమం,భద్రత,ధైర్యానికి కవచం అమ్మ.అమ్మ రుణం తీర్చుకోలేనిది.ఆమెను గౌరవించడం,ప్రేమించడం ప్రతి బిడ్డ బాధ్యత.అలాంటి అమ్మ కవితా చరణాల్లో నిక్షిప్తమైన భావాలను ఆస్వాదిస్తూ,కవిత్వానుభూతుల సుగంధంలోకి మనం ప్రవేశిద్దాం.

“అమ్మ నడిచిన అడుగుల గుర్తులు/నా భవిష్యత్తుకు వెలుగు బాటలయ్యాయి/కవి తల్లి పాత్రను అత్యంత గౌరవంతో చిత్రించారు. అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ కవితా పంక్తులు లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి.అమ్మ కేవలం జన్మనిచ్చిన తల్లి మాత్రమే కాదు, బిడ్డకు ఈ లోకాన్ని పరిచయం చేసే తొలి గురువు.బిడ్డ నడక నేర్చుకునేటప్పుడు,అమ్మ వేసిన అడుగులే బిడ్డకు ఆధారం అవుతాయి.ప్రేమకు ప్రతిరూపంగా, త్యాగానికి నిలువుటద్దంగా అమ్మను వర్ణిస్తారు.ఇక్కడ ‘అమ్మ అడుగుజాడలు’అంటే,ఆమె అనుసరించిన విలువలు మరియు ఆమె పడిన కష్టం అని అర్థం.
అమ్మ మార్గదర్శకత్వం బిడ్డ నడిచే ప్రతి అడుగుకు దారి చూపుతుంది. అమ్మ తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు,చూపిన ఓర్పు,ఆమె పాటించిన ధర్మం – ఇవన్నీ బిడ్డకు మార్గదర్శకంగా నిలుస్తాయి.అమ్మ నడిచిన అడుగుల గుర్తులు,అనుభవాల పాఠాలుగా మారి,బిడ్డ జీవితంలో ఎదురయ్యే కష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి.
అమ్మ చూపిన వెలుగు బాట బిడ్డ భవిష్యత్తుకు దిశానిర్దేశం అవుతుంది.చీకటిలో వెలుగు ఎలా దారి చూపిస్తుందో,అలాగే అమ్మ నేర్పిన సంస్కారం,ఆమె చూపిన ఆదర్శం బిడ్డ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తాయి. తల్లి పడిన శ్రమను,ఆమె ఆశయాలను అర్థం చేసుకున్న బిడ్డ,అమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు.
కవి ఈ పంక్తులలో ప్రధానంగా తెలియజేసేది ఏమిటంటే,తల్లి తన జీవితాన్ని త్యాగంగా మార్చి బిడ్డ భవిష్యత్తు కోసం పునాది వేస్తుంది. తల్లి అనుభవాలే బిడ్డకు దిశానిర్దేశం చేసే జ్ఞానజ్యోతులు. అమ్మ అడుగుజాడలు కేవలం గుర్తులు మాత్రమే కావు ; అవి విజయవంతమైన జీవితానికి రాజ మార్గాలు.
వస్తుపరంగా,ఈ కవితలో తల్లి జీవితం,ఆమె అనుభవాలు,ఆమె చేసిన త్యాగాలు – పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని తెలియజేస్తుంది. ’తల్లి నడిచిన అడుగుల గుర్తులు’ అనేది ఒక రూపకం (metaphor). అది కేవలం భౌతిక అడుగులు మాత్రమే కాదు ; ఆమె జీవన విలువలు,కష్టనష్టాలను ఎదుర్కొన్న తీరు,నైతిక బోధనలు – అన్ని ఇందులో అంతర్లీనంగా ఉన్నాయి.
భావపరంగా,కవితలో తల్లి పట్ల బిడ్డ చూపిన కృతజ్ఞతాభావం స్పష్టంగా వ్యక్తం అవుతుంది.కవి తన జీవితంలో పొందిన దారిదీపం తల్లిదే అని అంగీకరిస్తూ,ఆమెను వెలుగుదారి చూపే మార్గదర్శిగా చిత్రించారు.
‘వెలుగుల బాటలు’అనే పద ప్రయోగం ద్వారా తల్లి చూపిన దారి సత్యం,సద్గుణం విజయానికి నడిపించేదిగా సూచించబడింది.
శైలీ పరంగా,ఈ పంక్తి చాలా సరళంగా ఉంది.అలంకారాలు ఎక్కువగా లేకపోయినా,భావ గాఢత స్పష్టంగా కనిపిస్తుంది. స్వల్ప పదాలతో,గంభీరమైన సందేశాన్ని అందించడం ఈ కవిత ప్రత్యేకత.
ఈ కవితలో తల్లి జీవితం పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని,ఆమె చూపిన దారిలో నడిస్తే పిల్లల జీవితం ప్రకాశవంతంగా మారుతుందని తెలియజేస్తుంది.తల్లి పట్ల కృతజ్ఞత,గౌరవం,ప్రేమ వంటి భావాలను హృద్యంగా ప్రతిబింబించిన కవితగా ఇది నిలుస్తుంది.
“అమ్మ చెప్పిన మంచి మాటలు/ నాకు చక్కని జీవితాన్నిచ్చాయి../ అమ్మ మాటల్లోని శక్తిని,అవి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో ఈ పంక్తులు చాలా చక్కగా వివరిస్తున్నాయి. ఇందులో అంతర్లీనంగా ఉన్న భావం ఎంతో లోతైనదిగా, హృద్యమైనదిగా అనిపిస్తుంది.
అమ్మ చెప్పిన మంచి మాటలను అమృతంతో సమానంగా భావిస్తారు.అమ్మ మాటను వేద వాక్కుతో పోలుస్తారు.ఒక బిడ్డకు మంచి చెడుల మధ్య విచక్షణను అమ్మ నేర్పుతుంది.అమ్మ చెప్పిన చిన్న చిన్న నీతి కథలు,ఆమె ఇచ్చే మంచి సలహాలు బిడ్డ మనసులో బలమైన ముద్రను వేస్తాయి. ఇక్కడ‘మంచి మాటలు’అంటే కేవలం సంభాషణ మాత్రమే కాదు ; అవి బిడ్డ జీవితానికి అవసరమైన విలువలు, సంస్కారం.అమ్మ నేర్పిన సంస్కారమే బిడ్డ జీవితానికి అసలైన ఆస్తి అని భావిస్తారు. ’అమ్మ చెప్పిన మంచి మాటలు నాకు చక్కని జీవితాన్నిచ్చాయి’ అన్నప్పుడు ఆ జీవితం కేవలం ధనవంతుడిగా ఉండటాన్ని సూచించదు ; అది ఒక ఉత్తమమైన మనిషిగా ఎదగడాన్ని సూచిస్తుంది.అమ్మ మాటలు విత్తనాల్లాంటివి.అవి బిడ్డ మనసు అనే భూమిలో నాటుకుని,పెరిగి, చివరకు బిడ్డ జీవితాన్ని పూల బాటగా మారుస్తాయి.


బిడ్డకు అమ్మ మార్గదర్శకత్వం ఉంటేనే జీవితం చక్కగా సాగుతుంది.లోకం పోకడ తెలియని వయసులో అమ్మ తన మాటల ద్వారా బిడ్డకు దిశానిర్దేశం చేస్తుంది.అమ్మ చెప్పిన మంచి మాటలు ఆ బిడ్డకు దిక్సూచిలా పని చేస్తాయి.అమ్మ నేర్పిన ఓర్పు,సహనం,నిజాయితీ అనే పునాదుల మీదనే బిడ్డకు చక్కని జీవితం నిర్మితమవుతుంది‌.తల్లి చెప్పే హిత వాక్యాలు బిడ్డ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి.అమ్మ మాటలను ఆచరించిన బిడ్డ అపజయాలు ఎదురైనా తట్టుకొని నిలబడగలడు.అమ్మ మాటలు వెలుగునిచ్చి ముందుకు నడిపిస్తాయి.అందుకే అమ్మ మాట కేవలం శబ్దం కాదు ; అది ఒక జీవన వేదం.తల్లి మాటల ప్రభావం మనిషి జీవితంపై తప్పకుండా ఉంటుంది.తల్లి మాటలు ఎంత గొప్పవో కవి సూటిగా,సరళంగా వ్యక్తం చేశారు.
వస్తుపరంగా,ఈ పంక్తి తల్లి బోధనల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.’మంచి మాటలు’ అనేవి కేవలం ఉపదేశాలు మాత్రమే కావు ; అవి జీవితానికి మార్గ నిర్దేశం చేసే విలువలు,నైతిక సూత్రాలు, అనుభవాల సారం.తల్లి చెప్పిన ప్రతి మాటలో ప్రేమ,శ్రద్ధ,అనుభవ జ్ఞానం నిండి ఉంటాయి. ఇవే పిల్లల జీవితాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
భావపరంగా,ఇందులో కృతజ్ఞతాభావం ప్రధానంగా వ్యక్తమవుతుంది.కవి తన జీవితంలో వచ్చిన సౌఖ్యం, స్థిరత్వం,విజయం అన్నీ తల్లి మాటల ఫలితమే అని భావిస్తూ ఆమెకు కృతజ్ఞత తెలుపుతున్నాడు. ‘చక్కని జీవితం’అనే పదబంధం ద్వారా శారీరక,మానసిక,నైతిక పరిపూర్ణత కలిగిన జీవితం సూచించబడింది.
ఈ పంక్తిలో రూపక అలంకారం స్పష్టంగా కనిపిస్తుంది. ’మంచి మాటలు’అనే భావన ఇక్కడ జీవితాన్ని తీర్చిదిద్దే శక్తిగా రూపాంతరం చెందింది.అవి ఒక మార్గదర్శక దీపంలా భావించవచ్చు.తల్లి చెప్పే మంచి మాటలు కేవలం శబ్దాలు కాకుండా, జీవితాన్ని మార్చే శక్తిగా చిత్రీకరించబడ్డాయి. శైలీ పరంగా,ఈ పంక్తి చాలా సహజంగా,స్పష్టంగా ఉంది. క్లిష్టమైన పదజాలం లేకుండా, సాధారణ భాషలోనే గొప్ప భావాన్ని వ్యక్తం చేయడం దీని ప్రత్యేకత.ఇది పాఠకుని మనసును వెంటనే హత్తుకునేలా ఉంటుంది.
ఈ పంక్తి ద్వారా తల్లి బోధనలు బిడ్డల జీవితాన్ని సుసంపన్నంగా, సార్థకంగా మలుస్తాయని తెలియజేస్తుంది.తల్లి మాటలలో దాగి ఉన్న జ్ఞానం,ప్రేమ, మార్గనిర్దేశం జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయని ఈ భావవ్యక్తీకరణ స్పష్టంగా తెలియజేస్తుంది.
“అమ్మ పెందలకడనే లేచి వాకిలి ఊడ్చి కల్లాపుజల్లి/ముగ్గులు పెట్టిన పంచపాల/నా జీవితంలో రంగులు నింపింది/ముఖ్యంగా అమ్మ తెల్లవారు జామున లేచి చేసే పనుల వెనుక ఉన్న సౌందర్యాన్ని ఇది సూచిస్తుంది.
మాతృత్వం ఒక నిరంతర చైతన్యాన్ని సూచిస్తుంది. ’పెందలకడనే’లేచి అనే పదం కేవలం సమయాన్ని మాత్రమే కాదు,అమ్మ బాధ్యతను కూడా సూచిస్తుంది.లోకం ఇంకా నిద్రలోనే మునిగి ఉన్నప్పుడు,ఇల్లు మేల్కొనే ముందే తాను మేల్కొని ఒక చైతన్య శక్తిలా అమ్మ ఇంటిని శుద్ధి చేస్తుంది.అమ్మ కదలికలతోనే ఆ ఇంట్లో ప్రాణం మొదలవుతుంది.
అమ్మ దైనందిన జీవితంలోని ఒక సాధారణమైన పని అయిన ముగ్గులు వేయడం,బిడ్డ జీవితానికి రంగులు అద్దే అద్భుతమైన జీవన చిత్రలేఖనంగా కవి వర్ణించిన విధానం ఎంతో బాగుంది.అమ్మ కర్తవ్యపరాయణతను ఈ ప్రాతః కాల దృశ్యం తెలియజేస్తుంది. పెందలకడనే నిద్ర లేచి,వాకిలిని శుభ్రం చేసి,కల్లాపి చల్లడం అనేది క్రమశిక్షణకు ప్రతీక.ఇది ఒక ఇంటి సంస్కృతికి అద్దం పట్టే దృశ్యం. అమ్మ చేసే పనులు కేవలం ఇంటి శుభ్రత కోసం మాత్రమే కాకుండా, తన కుటుంబం కోసం ఆ రోజును ప్రశాంతంగా,శుభప్రదంగా ప్రారంభించి ఇవ్వాలనే ఆమె సంకల్పాన్ని తెలియజేస్తాయి. కల్లాపి చల్లడం అంటే భూమిని శాంతింప జేయడం.ముగ్గులు పెట్టడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడం.అమ్మ కుటుంబం కోసం వాకిలి ముంగిట వేసే ముగ్గులలో ఒక క్రమశిక్షణ,ఒక కళాత్మక దృష్టి ప్రతిపలిస్తుంది.
‘నా జీవితంలో రంగులు నింపింది’ అనే పంక్తి చాలా లోతైనది.అమ్మ ఇంటి ముందు వేసే ముగ్గులు కాలక్రమేణా చెరిగిపోవచ్చు.కానీ ఆ వాతావరణంలో పెరిగిన బిడ్డ మనసులో అమ్మ నేర్పిన సంస్కారం,క్రమశిక్షణ,ఆప్యాయత అనే రంగులు శాశ్వతంగా నిలిచి పోతాయి.అమ్మ ఇంటి ముంగిట ముగ్గును సృష్టిస్తుంది. చీకటిని తరిమేసి ముగ్గుతో శూన్యంగా ఉన్న వాకిలిని ఒక అందమైన చిత్రపటంగా మార్చే కళాకారిణి ఆమె.పంచపాల పెట్టె వేదికగా ఆమె నేర్పిన జీవన సూత్రాలే కవిని ఈ రోజు ఇంతటి గొప్ప భావుకుడిగా తీర్చిదిద్దాయి.అమ్మ ముగ్గులు వేయడం అనేది ఒక సాధారణ గృహ కృత్యంలా కాకుండా,ఒక మంగళకరమైన క్రతువులా కనిపిస్తుంది.అమ్మ ముగ్గు కోసం వాడే వస్తువులన్నీ ప్రకృతి ప్రసాదించిన బియ్యపు పిండి,ఇది కేవలం అందం కోసం కాదు ; భూత యజ్ఞంలో ఒక భాగం.చీమలకు,ఇతర కీటకాలకు ఆహారం పెట్టడం ద్వారా అమ్మ జీవ కారుణ్యం అనే పాఠాన్ని ఆ పంచ పాల పెట్టె నుంచే ప్రారంభిస్తుంది. పసుపు,కుంకుమ,గంధం ఇవి మంగళప్రదానికి చిహ్నాలు.ఇంటి గుమ్మం వాకిలిలో వేసిన ముగ్గు మధ్యలో పసుపు,కుంకుమ,గంధం అద్దడం అంటే ఆ ఇంటికి ఒక రక్షణ కవచాన్ని,పవిత్రతను చేకూర్చడమే.రంగుల వెనుక ఉన్న భావోద్వేగం కూడా విశేషమే.తెల్లని బియ్యపు పిండి,సుద్ధతో వేసే ముగ్గులు నిర్మలత్వానికి నిదర్శనం.ఆ తెల్లని ముగ్గు మధ్యలో అమ్మ అద్దే పసుపు, కుంకుమ,గంధం,జీవితంలోని సౌభాగ్యాన్ని,సంతోషాన్ని సూచిస్తాయి.
పంచపాల పెట్టె అనేది సంప్రదాయాల నిధి.పంచపాల చెక్క పెట్టె ఇక్కడ ఒక విలక్షణమైన అంశం.పసుపు,కుంకుమ, గంధం,అక్షతలు,బియ్యపు పిండి,సుద్ధ పొడి వంటివి పవిత్రతకు గుర్తులు.అమ్మ ఆ పెట్టెను పట్టుకొని వెళ్లి ముగ్గులు వేయడం అంటే,ఆమె తనతో పాటు ఐశ్వర్యాన్ని, శుభాన్ని,సాంప్రదాయాలను మోసుకెళ్తున్నట్టే.ఒక శిల్పి ఉలిని వాడినట్లుగా,ఒక చిత్రకారుడు రంగుల పలకను వాడినట్లుగా, అమ్మ ఆ పంచపాల పెట్టెను ఆయుధంగా చేసుకొని,ఇంటి ముంగిట అందమైన ముగ్గులను సృష్టిస్తుంది.
అమ్మ వేసిన ముగ్గులు జీవితానికే రంగులు అద్దినట్లుగా ఉంటాయి. అందుకే ‘అమ్మ నా జీవితంలో రంగులు నింపింది’అనే ప్రయోగం చాలా గంభీరమైనది.ముగ్గు అనేది కేవలం సుద్ధతో వేసిన గీతలు మాత్రమే కావు ; జ్యామితి వలె అది ఒక క్రమ పద్ధతి,ఓర్పు, సృజనాత్మకతకు ప్రతీక.అమ్మ ముగ్గులు వేస్తూ బిడ్డను పెంచడం అంటే ఆ ముగ్గులోని రంగుల్లాగే బిడ్డ జీవితం కూడా ఆనందాలతో, విలువలతో నిండి ఉండాలని ఆమె కోరుకోవడం.ఆమె వేసిన ముగ్గులు ఆ ఇంటికి అందాన్ని తెస్తే,ఆమె నేర్పిన సంస్కారం,బిడ్డ వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి.
ఈ పంక్తిలో అమ్మ ఒక కళాకారిణి.
పంచపాల పెట్టెలోని పవిత్రమైన వస్తువులతో ఆమె ఇంటి ముంగిట ముగ్గులు వేస్తూనే,తన బిడ్డ జీవితాన్ని ఒక అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దింది.అమ్మ పడిన కష్టం,ఆమె పాటించిన సంప్రదాయం,బిడ్డ ఎదుగుదలకు పునాదులయ్యాయని ఈ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.
ఈ కవితా పంక్తులు గ్రామీణ జీవన శైలిలో తల్లి పాత్రను,ఆమె సాధారణ దైనందిన చర్యల్లో దాగి ఉన్న గొప్పతనాన్ని కవి ఎంతో హృద్యంగా ప్రతిబింబించాయి. వస్తుపరంగా,ఈ పంక్తులు తల్లి చేసే చిన్న చిన్న పనులలో ఉన్న మహత్తును తెలియజేస్తాయి. ‘పెందలకడనే లేచి’ అనే పదబంధం ఆమె కష్టశీలతను సూచిస్తుంది.
పంచపాల అనేది కేవలం ముగ్గులు
వేసేందుకు ఉపయోగించే పదార్థాల సమాహారం మాత్రమే కాదు ; అది భారతీయ సాంప్రదాయం,పవిత్రత, శుభప్రతీకల సమ్మేళనం.ఇందులోని పసుపు, కుంకుమ,గంధం, అక్షతలు,బియ్యపు పిండి,సుద్ద పొడి అన్నీ ఇవి శుభకార్యాలకు మంగళానికి సూచికలు.తల్లి పంచపాలతో ముగ్గులు వేయడం అనేది ఒక సాధారణ దృశ్యంలా కనిపించినప్పటికీ,దీని అర్థం చాలా విశాలమైనది.ఈ పదార్థాలు కలిసినట్లే,తల్లి కూడా తన ప్రేమ,శాంతి, విలువలు, సంస్కారాలను కలిపి పిల్లల జీవితాన్ని అందంగా తీర్చి దిద్దుతుంది. పంచపాల అనేది తల్లి జీవన తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.పసుపు పవిత్రతను, కుంకుమ మంగళాన్ని,గంధం శాంతిని,అక్షతలు సంపూర్ణతను, బియ్యపు పిండి ఆహారాన్ని,సుద్ధ పొడి శుభ్రతను సూచిస్తాయి.ఈ అన్ని గుణాలు తల్లిలోనే సమాహారమై ఉంటాయి. అందుకే కవి ‘నా జీవితంలో రంగులు నింపింది’అని చెప్పినప్పుడు,అది కేవలం ఆనందం మాత్రమే కాకుండా,సంపూర్ణమైన జీవన సౌందర్యాన్ని సూచిస్తుంది.ఇక్కడ రూపక అలంకారం మరింత బలంగా కనిపిస్తుంది.పంచపాలతో వేసిన ముగ్గులు తల్లి చేతుల ప్రేమతో రూపుదిద్దుకున్న జీవితం అనే భావాన్ని వ్యక్తపరుస్తాయి. ముగ్గులోని రంగులు వాకిలిని ఎలా అందంగా మారుస్తాయో,తల్లి ఇచ్చే విలువలు కూడా జీవితాన్ని అలంకరిస్తాయి.సాంస్కృతిక కోణంలో ఈ దృశ్యం భారతీయ గృహ జీవనంలోని నిత్య కర్మలను ప్రతిబింబిస్తుంది.ఉదయాన్నే వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేయడం అనేది శుభారంభానికి సంకేతం.అదే విధంగా,తల్లి పిల్లల జీవితాన్ని ప్రతిరోజు కొత్త ఆశలతో ప్రారంభించే మార్గదర్శిగా నిలుస్తుంది.
‘పంచపాల’అనే పదం కవితలో సాధారణంగా కనిపించినప్పటికీ, అది తల్లి ప్రేమ,సంస్కారం, శుభ్రత,సంస్కృతుల సమాహారంగా మారి కవితకు మరింత భావ గాంభీర్యాన్ని అందిస్తుంది.
భావపరంగా,ఈ కవితలో తల్లి పట్ల గాఢమైన ప్రేమ,గౌరవం,కృతజ్ఞత వ్యక్తమవుతున్నాయి.తల్లి వేసిన ముగ్గులు కేవలం వాకిలి అందాన్ని పెంచేవి మాత్రమే కాకుండా,కవి జీవితానికి కూడా రంగులు నింపినట్లు భావ ప్రకటన ఉంది.ఇక్కడ ‘నా జీవితంలో రంగులు నింపింది’అనే ప్రయోగాన్ని క్రియా రూపకంగా పరిగణించవచ్చు.తల్లి ప్రేమ, సంస్కారం వల్ల జీవితం ఆనందభరితంగా,సార్థకంగా మారిందని ఇది సూచిస్తుంది. అలంకారపరంగా రూపకం (metaphor) ప్రధానంగా కనిపిస్తుంది.ముగ్గులు అనే దృశ్య రూపాన్ని జీవితంలోని రంగులతో అనుసంధానించడం ద్వారా కవి తన భావాన్ని సజీవంగా వ్యక్తం చేశారు.అలాగే ‘పంచపాల’ అనే పదం వర్ణ చిత్రాన్ని కళ్ళ ముందు నిలబెడుతూ దృశ్య రూపాన్ని సృష్టిస్తుంది.
శైలీపరంగా,ఈ పంక్తిలో భాష సహజంగా,గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది.పదాల సరళతతో పాటు భావ గాఢత కూడా నిండి ఉంది. చిన్న చిన్న దృశ్యాల ద్వారా గొప్ప భావాన్ని వ్యక్తం చేయడం ఈ కవిత ప్రత్యేకత. ఈ కవితలో తల్లి చేసే సాధారణ పనులే,పిల్లల జీవితానికి ఆనందం, విలువలు అందిస్తాయని తెలియజేస్తుంది.ఆమె చేతుల పని కేవలం శ్రమ మాత్రమే కాదు ప్రేమ,సంస్కృతి,జీవన సౌందర్యం దాగి ఉన్నాయని,ఈ కవిత సున్నితంగా వ్యక్తం చేస్తుంది.వాకిలి ఊడ్చి,కల్లాపిజల్లి,ముగ్గులు పెట్టడం వంటి చర్యలు భారతీయ సంస్కృతిలో పవిత్రత,శుభ్రత, క్రమశిక్షణకు ప్రతీకలు.
“కాని‌.. ఇప్పుడూ…/అమ్మ
స్వర్గస్తురాలై… కూడా/నేను
నిలబడ్డ జీవితానికి ఊత కర్రై/
నా గుండెల్లో నిలిచింది…/అమ్మ భౌతికంగా దూరమైనా,ఆమె అందించిన సంస్కారం తనని నడిపిస్తుందన్న కవి భావం అత్యంత హృద్యంగా ఉంది.అమ్మ భౌతిక అదృశ్యాన్ని,ఇక్కడ స్మృతి సంస్కారంగా భావించవచ్చు. ‘స్వర్గస్తురాలై కూడా’ అనే పంక్తిలో వేదన ఉన్నప్పటికీ,అమ్మ నిజంగా మరణించ లేదన్న సత్యం వ్యక్తమవుతుంది.దీనినే అమరత్వం అంటారు.అమ్మ శరీరం మట్టిలో కలిసినా,ఆమె నేర్పిన పద్ధతులు,వేసిన ముగ్గులు,దిద్దిన అక్షరాలు తనలో ఇంకా జీవిస్తున్నాయి.అమ్మ ఒక వ్యక్తిగా దూరమైనా,తనలో ఒక శక్తిగా స్థిరంగా నిలిచిపోయింది.తన జీవితానికి ఆమె ఊతకర్రగా,అదృశ్య ఆలంబనగా నిలిచింది.కవి ఊహించిన ‘ఊతకర్ర’అనే పద ప్రయోగం అద్భుతమైనది.తాను నిలబడిన జీవితానికి అది ఆసరాగా మారింది.మనిషి జీవితంలో అలసిపోయి,ఆశను కోల్పోయి కింద పడిపోతున్నప్పుడు,ఊతకర్ర ఆసరాతో మళ్ళీ పైకి లేస్తాడు.ఇక్కడ అమ్మ స్మృతి కవికి ఆశను,ధైర్యాన్ని ఇస్తోంది.
ఒకప్పుడు పంచపాలతో ముగ్గులు వేయడానికి వంగిన అమ్మ వెన్నెముక, ఇప్పుడు తన జీవితం నిటారుగా నిలబడేందుకు ఊత కర్రగా మారిందని చెప్పడం కవి కృతజ్ఞతాభావానికి పరాకాష్ట.
అమ్మ గుండెల్లో నిలిచిన గోపురంలా ఉంటుంది.పంచపాలతో వసారాలో ముగ్గులు వేసినా,ఇప్పుడు అమ్మ తన హృదయమనే అంతరంగంలో నిలిచిపోయింది.అమ్మ వేసిన ముగ్గులు గాలికి,వర్షానికి చెరిగిపోవచ్చు.కానీ బియ్యపు పిండి,పసుపు,కుంకుమలతో అమ్మ తన మనసుపై వేసిన సంస్కారపు ముగ్గు ఎప్పటికీ చెరగనిది‌.అమ్మ ఇప్పుడు భౌతికంగా లేకపోయినా,ప్రతి కష్ట కాలంలో ఆమె స్మృతి తనను ఎల్ల వేళలా తాను పడిపోకుండా కాపాడుతుంది.ఇక్కడ అమ్మ కేవలం ఒక తల్లి మాత్రమే కాదు ; ఆమె తన జీవితానికి దారి చూపే దిక్సూచి.కటిక చీకట్లో అమ్మ వెలిగించిన దీపం లాంటి సంస్కారమే, నేడు తాను ఎదుర్కొంటున్న లోకపు చీకట్లను చీల్చుకుంటూ ముందుకు నడిపిస్తోంది.అమ్మ జ్ఞాపకం ఒక దుఃఖం కాదు ; తనను నడిపించే నిరంతర ప్రేరణ.
ఈ కవితా పంక్తుల్లో కవి భావ ప్రపంచం మరింత గాఢంగా, భావోద్వేగభరితంగా వ్యక్తమవుతుంది.ఇక్కడ తల్లి భౌతికంగా లేకపోయినా,ఆమె ఆత్మీయ సాన్నిధ్యం జీవితంలో ఎలా నిలిచి ఉంటుందో ఎంతో హృద్యంగా ప్రతిబింబించబడింది.
వస్తు పరంగా,ఈ పంక్తులు తల్లి మరణానంతరం కూడా ఆమె ప్రభావం సజీవంగా ఉండటాన్ని సూచిస్తాయి.‘స్వర్గస్తురాలై కూడా’ అనే పద బంధం ద్వారా తల్లి శారీరకంగా దూరమైనా,ఆమె అందించిన గొప్ప విలువలు,బోధనలు,జ్ఞాపకాలు మాత్రం కవికి శాశ్వతంగా తోడుగా ఉన్నాయని తెలుస్తుంది.
భావపరంగా ఈ పంక్తిలో ఆవేదనతో కూడిన కృతజ్ఞతా భావం కనిపిస్తుంది.తల్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ,ఆమె ఇచ్చిన బలం వల్లనే కవి జీవితంలో ధైర్యంగా నిలబడగలిగాడు అనే భావం ప్రధానంగా వ్యక్తమవుతుంది.ఇది బాధతో కూడిన గౌరవానుభూతిని ప్రతిబింబిస్తుంది.
అలంకారపరంగా,’ఊత కర్ర’ అనే రూపకం చాలా శక్తివంతమైనది.ఊత కర్ర అంటే నడవడానికి ఆధారం.ఇక్కడ తల్లి జీవితం కవికి ఆధారంగా నిలిచింది అని సూచిస్తుంది.ఈ రూపకం ద్వారా కవి భావాన్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రించాడు. అలాగే,’నా గుండెల్లో నిలిచింది’ అనే పంక్తిలో తల్లి జ్ఞాపకాలు హృదయంలో శాశ్వతంగా నిలిచి పోయినట్లు తెలియజేస్తుంది.
శైలీపరంగా,విరామ సూచకాలను ఉపయోగించడం ద్వారా కవి తనలో చెలరేగే భావోద్వేగాలను ఆప్యాయంగా, కొంత ఆవేదనతో వ్యక్తం చేశాడు.
ఈ కవితలో తల్లి శారీరకంగా లేకపోయినా,ఆమె ప్రభావం ప్రేమ, మార్గదర్శకత్వం మనిషి జీవితంలో శాశ్వతంగా నిలుస్తాయని తెలియజేస్తుంది.తల్లి అనేది కేవలం ఒక వ్యక్తి కాదు ; జీవితాన్ని నిలబెట్టే శక్తి.తల్లి పిల్లల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఆత్మీయ జ్ఞాపకం అని ఈ భావవ్యక్తీకరణ స్పష్టం చేస్తుంది.
“అమ్మ పాత చీర కొంగు నేను తినే తిండి/ బియ్యం సంచికి మూతి కట్టయ్యింది…/ఈ కవితా పంక్తులు సామాన్యమైనవి కావు,ఇవి పల్లెటూరి పేదరికంలోని గొప్పతనాన్ని,అమ్మ త్యాగాన్ని ఆవిష్కరించే అద్భుతమైన ప్రతీకలు (metaphors).ఇక్కడ పాత చీర కొంగు ఒక పవిత్ర వస్త్రంలా నిలుస్తుంది. అమ్మ కట్టుకున్న పాత చీర కేవలం ఒక గుడ్డ కాదు ; అది రక్షణ కవచం. ఎన్ని సార్లు ఆ చీరను ఉతికినా,ఆ చీర కొంగులో అమ్మ వాసన,అమ్మ ప్రేమ ఎప్పటికీ అతుక్కునే ఉంటాయి.బియ్యం నింపిన సంచిని పాత చీర కొంగుతో ముడి వేసి కట్టారు.అంటే, అక్కడ ఆ చీర తన మామూలు ఉనికిని కోల్పోయి,బిడ్డల ఆకలి తీర్చే సాధనంగా రూపాంతరం చెందింది.అమ్మ కట్టుకున్న పాత చీర కొంగు త్యాగానికి చిహ్నంగా నిలుస్తుంది.అమ్మ తాను కొత్త చీరలు కొనుక్కోదు ; ఆ పాత చీరను కూడా పారేయదు.ఆ పాత చీరను ఇంట్లోనే ఒక మూలన జాగ్రత్తగా దాచి పెడుతుంది‌. ఆమె దాచి పెట్టిన పాత చీర కొంగు భాగమే ఇప్పుడు తినే తిండి కోసం ఉంచిన బియ్యం సంచిని ముడి వేయడానికి ఉపయోగపడుతోంది.ఇప్పుడు సంచిలో బియ్యం పోసి,ఆ పాత చీర కొంగుతో ముడి వేసి కట్టి వాడుతున్నారు.ఇక్కడ ‘బియ్యం సంచికి మూతి కట్టయ్యింది’ అనడంలో ఒక లోతైన అర్థం ఉంది.అమ్మ పాత చీర కొంగుతో బియ్యం సంచిని ముడి వేసినందు వల్లనే ఆ బియ్యం సంచి పడి పోకుండా భద్రంగా నిలుస్తుంది.అమ్మ తన బిడ్డల అవసరాల కోసం చీరను త్యాగం చేసింది. బిడ్డల ఆకలి తీర్చే బియ్యం సంచిని కాపాడే కాపలాదారిగా అమ్మ నిలిచింది.ఇక్కడ అమ్మ పట్ల గల కృతజ్ఞతా భావం స్పష్టంగా వ్యక్తమవుతోంది.బిడ్డ తినే ప్రతి మెతుకులోను అమ్మ కష్టం ప్రతిఫలిస్తోంది. అమ్మ పాత చీర కొంగు దీనికి సాక్షిగా నిలుస్తోంది.తాను కట్టుకున్న ఆ పాత చీర కొంగును,బిడ్డకు అన్నం పెట్టే సంచికి ముడి వేసి రక్షణగా మార్చిన అమ్మ ఆలోచనలో ఒక ఆత్మీయ ఆర్ద్రత ఉంది.
ఇప్పుడు అమ్మ తాను జీవించి లేకపోయినా,ఆమె కట్టుకున్న పాత చీర కొంగు,ఆమె వాడిన వస్తువులు,ఇంకా తన బిడ్డ ఇంట్లో పనిముట్లుగా మారి,వారి జీవితాన్ని సాకుతునే ఉన్నాయి.అంటే, అమ్మ తన వస్తువుల ద్వారాను,తన బిడ్డలపై అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తునే ఉంది.“అమ్మ పాత చీర కొంగు’ఇది ఒక గొప్ప కవితా పంక్తిగా మారింది.అమ్మ తనను తాను అరిగించుకుంటూ,తన వస్తువులను కూడా అరిగిపోయే వరకు ఉపయోగిస్తూ తన బిడ్డలను ఒక స్థాయికి చేర్చిందనే కృతజ్ఞత ఈ కవితలో ప్రతిబింబిస్తోంది.
ఈ కవితా పంక్తులు సాధారణ దృశ్యాన్ని ఆవిష్కరించినప్పటికీ, వాటి వెనుక ఉన్న అసాధారణ భావం అత్యంత గాఢమైనది.
వస్తు పరంగా,ఈ పంక్తిలో తల్లి ఉపయోగించిన పాత చీర కొంగు ఇప్పుడు బియ్యం సంచికి ముడి వేయడానికి ఉపయోగపడిందనే దృశ్యాన్ని చక్కగా చిత్రించారు.ఇది ఒక సాధారణ గృహ జీవన ఘట్టంలా కనిపించినా,దాని వెనుక తల్లి సాన్నిధ్యం,జ్ఞాపకాలు,ఆమెతో ఉన్న అనుబంధం స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి భావపరంగా,ఇందులో లోతైన బాధ, జ్ఞాపకాలతో కూడిన మమకారం వ్యక్తమవుతుంది.తల్లి లేని లోటు ఇక్కడ కనిపిస్తుంది.తల్లికి చెందిన ఒక చిన్న వస్తువు కూడా జ్ఞాపకంగా మారింది.కవి తల్లిని స్మరించుకోవడం ద్వారా ఒక ఆత్మీయ అనుభూతిని కలిగిస్తున్నారు.
“నేను తినే తిండి’అనే పదబంధం ద్వారా తల్లి ఇప్పటికీ అతని జీవనాధారంలో ఏదో విధంగా అనుసంధానమై ఉన్నదనే భావం వ్యక్తమవుతుంది.
అలంకారపరంగా,ఈ పంక్తుల్లో రూపక అలంకారం సున్నితంగా ప్రతిఫలిస్తుంది. పాత చీర కొంగు కేవలం వస్త్ర భాగం మాత్రమే కాదు ; అది తల్లి సాన్నిధ్యానికి ప్రతీకగా మారింది.బియ్యం సంచికి చీర కొంగును కట్టి ముడి వేయడం ద్వారా తల్లి ఇప్పటికీ పిల్లల ఆహారాన్ని కాపాడుతున్నట్టుగా భావ వ్యక్తీకరణ కనిపిస్తుంది.ఇది ఒక భావాత్మక రూపాంతరంగా నిలుస్తుంది.
ప్రతీకాత్మకంగా,ఈ దృశ్యం ఎంతో గాఢమైనది.తల్లి జీవితంలో ఉపయోగించిన వస్తువులు కూడా ఆమె ప్రేమను,జాగ్రత్తను ప్రతిబింబిస్తాయి‌.తల్లి ఇప్పుడు భౌతికంగా లేకపోయినా,ఆమెకు సంబంధించిన వస్తువులు పిల్లల జీవితాలలో భాగమై ఉండటం ద్వారా ఆమె ఉనికి ఇప్పటికీ కొనసాగుతుందని సూచిస్తుంది. ‌
శైలీ పరంగా,కవి చాలా సరళమైన, సహజమైన పదాలతో లోతైన భావాన్ని వ్యక్తం చేశారు.ఎలాంటి క్లిష్టమైన అలంకార పదజాలం లేకపోయినా,ఈ పంక్తులు పాఠకుని మనసుని మృదువుగా తాకుతాయి‌.
ఈ కవిత ద్వారా తల్లి జ్ఞాపకాలు,ఆమెకు చెందిన చిన్న చిన్న వస్తువులు కూడా బిడ్డల జీవితాలలో ఎంతో ఆత్మీయమైన స్థానం కలిగి ఉంటాయో తెలియజేస్తుంది.తల్లి అనుబంధం కాలంతో పాటు ముగియదు,అది ప్రతి రోజు మన జీవనంలో ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంటుందనే భావాన్ని ఈ కవిత స్పష్టంగా వ్యక్తం చేస్తుంది.అమ్మ అనే చక్కటి కవితను అందించిన కవి రమణయ్యను అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయాలని మనసారా కోరుకుంటున్నాను. ఉన్న అనుబంధం స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి భావపరంగా,ఇందులో లోతైన బాధ, జ్ఞాపకాలతో కూడిన మమకారం వ్యక్తమవుతుంది.తల్లి లేని లోటు ఇక్కడ కనిపిస్తుంది.తల్లికి చెందిన ఒక చిన్న వస్తువు కూడా జ్ఞాపకంగా మారింది.కవి తల్లిని స్మరించుకోవడం ద్వారా ఒక ఆత్మీయ అనుభూతిని కలిగిస్తున్నారు.
“నేను తినే తిండి’అనే పదబంధం ద్వారా తల్లి ఇప్పటికీ అతని జీవనాధారంలో ఏదో విధంగా అనుసంధానమై ఉన్నదనే భావం వ్యక్తమవుతుంది.
అలంకారపరంగా,ఈ పంక్తుల్లో రూపక అలంకారం సున్నితంగా ప్రతిఫలిస్తుంది. పాత చీర కొంగు కేవలం వస్త్ర భాగం మాత్రమే కాదు ; అది తల్లి సాన్నిధ్యానికి ప్రతీకగా మారింది.బియ్యం సంచికి చీర కొంగును కట్టి ముడి వేయడం ద్వారా తల్లి ఇప్పటికీ పిల్లల ఆహారాన్ని కాపాడుతున్నట్టుగా భావ వ్యక్తీకరణ కనిపిస్తుంది.ఇది ఒక భావాత్మక రూపాంతరంగా నిలుస్తుంది.
ప్రతీకాత్మకంగా,ఈ దృశ్యం ఎంతో గాఢమైనది.తల్లి జీవితంలో ఉపయోగించిన వస్తువులు కూడా ఆమె ప్రేమను,జాగ్రత్తను ప్రతిబింబిస్తాయి‌.తల్లి ఇప్పుడు భౌతికంగా లేకపోయినా,ఆమెకు సంబంధించిన వస్తువులు పిల్లల జీవితాలలో భాగమై ఉండటం ద్వారా ఆమె ఉనికి ఇప్పటికీ కొనసాగుతుందని సూచిస్తుంది. ‌
శైలీ పరంగా,కవి చాలా సరళమైన, సహజమైన పదాలతో లోతైన భావాన్ని వ్యక్తం చేశారు.ఎలాంటి క్లిష్టమైన అలంకార పదజాలం లేకపోయినా,ఈ పంక్తులు పాఠకుని మనసుని మృదువుగా తాకుతాయి‌.
ఈ కవిత ద్వారా తల్లి జ్ఞాపకాలు,ఆమెకు చెందిన చిన్న చిన్న వస్తువులు కూడా బిడ్డల జీవితాలలో ఎంతో ఆత్మీయమైన స్థానం కలిగి ఉంటాయో తెలియజేస్తుంది.తల్లి అనుబంధం కాలంతో పాటు ముగియదు,అది ప్రతి రోజు మన జీవనంలో ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంటుందనే భావాన్ని ఈ కవిత స్పష్టంగా వ్యక్తం చేస్తుంది.అమ్మ అనే చక్కటి కవితను అందించిన కవి రమణయ్యను అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయాలని మనసారా కోరుకుంటున్నాను.

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మనకు మనమే……

by Madhavapeddi Usha May 26, 2026
written by Madhavapeddi Usha

“అమ్మా అమ్మా” అంటూ రుసరుసలాడుతూ వచ్చింది రుక్కమ్మ.

“అదేంటి, ఈ రోజు హాట్ హాట్‌గా ఉన్నావు. ఏమైందేమిటి?” అన్నది కనకదుర్గ.

“అది కాదమ్మా, రోజురోజుకీ ఎండలు ముదురుతున్నాయి కదా. ఆ వసంతమ్మ పొద్దున్నుంచీ చాకిరీ చేస్తున్నాననైనా లేకుండా, పోనీ అన్నం పెట్టకపోతే మానే, ఇంత మజ్జిగ నీళ్లైనా పోయవచ్చు కదా… అదీ లేదమ్మా. మీ పెద్దోళ్లు హాయిగా నీడపట్టున కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటారు కదా. ఎండలో పడి నాలుగిళ్లల్లో కష్టం చేసుకు బ్రతికేటోళ్లం మా మీద కాసింత జాలి చూపించకపోతే ఎట్టాగమ్మా, నాకు తెలవక అడుగుతున్నా…!” అన్నది.

దాని ముఖంలో నిజంగానే ఉదయం నుంచి గొడ్డు చాకిరీ చేసిన అలసట ఉట్టిపడుతోంది. ఉన్న మాట చెప్పొద్దూ, దుర్గ కడుపు తరుక్కుపోయింది జాలితో!

వెంటనే “పోనీలే రుక్కమ్మా, మజ్జిగకేం భాగ్యం చెప్పు. నేనిస్తా” అంటూ అప్పటికప్పుడు పెరుగు కవ్వంతో చిలికి అందులో చిటికెడు ఉప్పు వేసి కలిపి ఇచ్చింది కనకదుర్గ. మజ్జిగ తాగిన రుక్కమ్మ కళ్లల్లో ఎనలేని ఆనందం, కృతజ్ఞత కనిపించాయి.

అప్పుడు ఆమె అన్నది కదా, “అమ్మా, ఇయ్యాలయితే నువ్వు ఇచ్చినావు. ఈ ఎండాకాలం ఇంకా రెండు నెలలుంటది, రోజూ ఎవురిస్తారమ్మా గిట్ల…!” అన్నది.

ఆ మాటలకు దాని మీద ప్రేమాభిమానాలు పొంగుకురాగా, “ఫరవాలేదు, ఈ రెండు నెలలూ నేను పోస్తాగా మజ్జిగ. నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు” అన్నది భరోసా ఇస్తూ.

అది కూడా “నీ కడుపు చల్లగుండ, చాలా థాంక్స్ అమ్మా” అని సంతోషంగా వెళ్లిపోయింది.

ఆ తరువాత కనకదుర్గ కూడా భోజనం చేసి పడుకుంది రోజూలానే. పిల్లలు స్కూల్ నుంచి రావటానికి ఇంకా టైం ఉంది అనుకుంటూ నిద్రపోవడానికి ట్రై చేసింది. కానీ ఆలోచనలు రుక్కమ్మ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి.

ఈ బడుగు వర్గాలు ఎంత అల్ప సంతోషులో కదా… పిచ్చిది, నేను రోజూ మజ్జిగ పోస్తాననే టప్పటికీ ఎంత సంతోషించింది…! ఒక్క మనిషికి మజ్జిగ పోయంగానే అయిపోయిందా? ఇలా ఎండలో పడి కాయకష్టం చేసుకునే పేదలు ఎంతోమంది ఉన్నారు… వారందరికీ కూడా చేయగలిగితేనే మానవ జన్మకి సార్థకత! అందుకేగా ఎండాకాలంలో దారిన పోయే బాటసారుల కోసం చలివేంద్రాలూ అవీ వెలిసింది అనుకుంటుండగానే దుర్గకి మెరుపు లాంటి ఆలోచన తట్టింది.

అంతెందుకు, మన సొసైటీలోనే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండనక వాననక కాలనీ అంతా ఎప్పటికప్పుడు ఊడుస్తూ పరిసరాలను శుభ్రంగా స్పిక్ అండ్ స్పాన్‌గా ఉంచే ఊడ్చే ఆడవాళ్లు, సెక్యూరిటీ సిబ్బంది… వీళ్లందరికీ రోజూ 12 గంటలకు మజ్జిగ పోస్తేనో అన్న ఐడియా వచ్చింది.

వెంటనే దాన్ని అమల్లో పెట్టింది. పాలవాడికి రేపటి నుంచి ఓ రెండు లీటర్ల పాలు ఎక్స్ట్రా పోయమని చెప్పింది. అంతే కాదు, సొసైటీలో ఊడ్చేవాళ్లకీ, సెక్యూరిటీ సిబ్బందికీ ఫోన్ చేసి చెప్పింది, రేపట్నుంచి 12 గంటలకు వచ్చి మజ్జిగ తీసుకుని వెళ్లమని.

ఇలా ఆ మజ్జిగ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండగా ఆదివారం వచ్చింది.

ఆ రోజు కనకదుర్గ, కాలనీ పనివాళ్లకి మజ్జిగ ఇవ్వడం పిల్లలు ప్రశాంత్, ప్రత్యూష చూశారు. వాళ్ల లేత మనసులో ఓ చిన్న డౌట్… పదేళ్ల బాబు ప్రశాంత్ అడిగాడు తల్లిని.

“అమ్మా, పనివాళ్లకి రోజూ మజ్జిగ ఎందుకిస్తున్నావమ్మా?” అని అడిగాడు.

“ఎందుకంటే వాళ్లు కష్టపడి ఎండల్లో పనిచేస్తున్నారు కదా నాన్నా, అందుకని మనలాంటి వాళ్లం సహాయం చేయాలి నాన్నా” అన్నది.

“మరైతే వాళ్లు ఏమైనా మనకు పని చేస్తారా? మనం వాళ్లకి ఊరికే ఎందుకు చేయాలి… మనకీ డబ్బవుతుంది కదా” అని ఈ సారి ఏడేళ్ల పాప ప్రత్యూష అందుకుంది.

వాళ్లిద్దరి సునిశిత పరిశీలనా దృష్టికి అబ్బురపడి వాళ్లని అక్కున చేర్చుకుంటూ ఇలా అన్నది. “ఛ, తప్పు నాన్నా అలా అనకూడదు. మనం చేతనైనంత సాయం, అదే హెల్ప్, ఇతరులకి చేయాలి. మనకన్నా బీదవాళ్లకీ, పూర్ పీపుల్‌కి చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు మనకి కూడా హెల్ప్ చేస్తాడు దేవుడు. తరువాత, మనం చేసే మంచి పనులకి ప్రతిఫలం అంటే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ మనకి ఒక శ్లోకం ద్వారా చెప్పారు” అన్నది.

“అదేం శ్లోకం అమ్మా, నాకు కూడా చెప్పవూ…?” అడిగాడు ప్రశాంత్.

ఆ శ్లోకం ఇదే నాన్నా –
*“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి.”_

అంటే, కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది, ఫలం మీద కాదు అని చెప్పారు. కాబట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా మనం కర్మలు చేయాలి అని శ్రీ కృష్ణుడు మనకు బోధించాడు” అని చెప్పింది దుర్గ.

అప్పుడు బాబు అన్న మాటలు విన్న దుర్గ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఇంతకీ ప్రశాంత్ ఏమన్నాడంటే, “అయితే అమ్మా, బీదవాళ్లకు అన్నం పెట్టడం కూడా మంచిపనే కదమ్మా?”

“ఓ యస్, తప్పకుండా నాన్నా” అన్నది.

“అయితే మనం ఈ పనివాళ్లకి రోజూ అన్నం కూడా పెడదామా?” అన్నాడు సందేహిస్తూ.

దానికి బాబుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుని ఇలా అంది, “శభాష్ నాన్నా, ఇప్పుడు నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావు… ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ! అలాగే తప్పకుండా పెడదాం నాన్నా. కాకపోతే, రోజూ అందరికీ అన్నం పెట్టాలంటే ఖర్చు, సమయం రెండూ ఎక్కువ కావాలి కదా. అందుకే ఆదివారం ఆదివారం పెడదాం ఏం…!” అనంగానే పిల్లలిద్దరూ ‘యే’ అంటూ చప్పట్లు కొట్టారు ఆనందంగా!!!

May 26, 2026 7 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

బాలసాహిత్యం- వర్తమానం, భవిషత్తు

by Bandi Usha May 26, 2026
written by Bandi Usha

            “సహిత్యస్య భావ:” అంటే అర్థవంతమైన జ్ఞానముతో హితము చేకూర్చేది సాహిత్యం. సృజనాత్మక జ్ఞానాన్ని, భవిష్యత్ తరాలకు అందజేసే సాధనము సాహత్యం. సాహిత్యం వయసును బట్టి పలురకాలుగా బాల, వయోజన, ఫ్రౌడ, వృద్ధ సాహిత్యం ఉంది. పదిహేను సంవత్సరముల లోపు పిల్లల కోసం బాలసాహిత్యం నైతిక విలువలు, మానసిక వికాసము, భాషాభివృద్ధితో వారి స్థాయికి తగినట్లుగా ఉంటుంది.

బాల సాహిత్యం ప్రత్యేకంగా ఎందుకు?

            పెద్దల సాహిత్యం కన్నా బాల సాహిత్యం ఎన్నో రెట్లు ముఖ్యం.  పిల్లల అవగాహన, ఆలోచన, భాష, పెద్దల అవగాహన, ఆలోచన, భాష వేరుగా ఉంటాయి. పిల్లల మెదడు వికసించే దశలో విలువలు, భాష, సాధించాýన్న తపన ఒకసారి ముద్ర పడితే జీవితాంతం ఉంటుంది. 

            ఉత్తమ సాహిత్యం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ మార్చే శక్తి బాల సాహిత్యానికి ఉంది. ప్రశ్నించడం సాహిత్యం ద్వారా అలవడుతుంది.

            మనం ఇల్లు కట్టేటప్పుడు పునాదిపై ఎంత శ్రద్ధ పెడతామో బాల సాహిత్యంపై అంతే శ్రద్ధ పెట్టాలి.  పిల్లల కోసం రాయడం అంటే భవిష్యత్తు కోసం రాయటమే.

బాల సాహిత్య ముఖ్య లక్షణాలు

            బాల సాహత్యం పిల్లల వయసుకు తగినట్లు ఉండాలి.  మరీ చిన్న పిల్లలకు అమ్మ పాడే జోలపాట నుండి బొమ్మలతో కూడిన పదాలు, శబ్దాలు, ఒకటి రెండు వాక్యాలు ఉండాలి –

            ఆరు నుండి పది సంవత్సరాల పిల్లలకు తమాషాగా, సాహసంగా, స్నేహితులతో కూడిన బాల సాహిత్యం ఉండాలి.

            పది నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకు సమస్యలు పరిష్కారం ఉంటే ఇష్టపడతారు. ఇవి ఏ ప్రక్రియలోనైనా ఈ లక్షణాలతో ఉండాలి.

            చిన్న పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా వారికి అర్ధమయ్యే భాషలో రాసిన రచనలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించడం, సంస్కృతిని నేర్పడం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉండాలి.

            కథలు, గేయాలు,  నీతి కథలు, పిట్ట కథలు, పద్యాలు, చిన్నచిన్న వాటికలు, నవలలు బాల సాహత్యంలో భాగమే.

            పిల్లల మానసిక స్థాయి, వయసుకు తగినట్లుగా కథలు, గేయాలు, పద్యాలు మొదలగు వాటిలో సరళత, వాక్యాలు చిన్నవిగా, కుతూహలం, ఊహాశక్తి పెంచే విధంగా, ఆనందంగా, భయపడకుండా, దృశ్యాత్మకంగా, పెద్ద అక్షరాలతో స్ఫూర్తిదాయకంగా, కల్పనాశక్తిని పెంపొందించేవిధంగా, నీతివంతంగా ఉన్నప్పుడే వారిలో నైతిక విలువలు, భాషా నైపుణ్యాలు పెంపొందుతాయి.

బాల సాహిత్యము ఎప్పుడు ప్రారంభమైంది?

            బాల సాహత్యం కొత్తగా ప్రారంభమైనది ఏమీ కాదు. 17వ శతాబ్దంలో మొట్టమొదటి బాలల పుస్తకం లాటిన్ భాషలో వచ్చింది.

            తెలుగులో బాల సాహత్యం మౌఖికంగా వేల సంవత్సరాల నుండే అమ్మమ్మ కథలు, జానపద గేయాలు, పంచతంత్ర కథలు చెప్పేవారు. అవి రాతలలో లేవు.

            ప్రత్యేకముగా బాల సాహిత్యము అని లేకపోయినప్పటికీ బసవ పురాణములో బాల్యము వర్ణనను బాల సాహిత్యముగా చెప్పవచ్చును. నాచన సోమనాధుడు, శ్రీనాధుడు తమ రచనలలో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు.

            సుమతీ, వేమన శతకాలలో కూడా బాల్యపు ఛాయలు కనిపిస్తాయి. మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలలో బాల సాహిత్యం కనిపిస్తుంది.

            19వ శతాబ్దం నుండి తెలుగులో పిల్లల కోసం నీతి కథలు, వర్ణమాల, బాలశిక్ష లాంటివి ముద్రించారు.

            ఆధునిక బాలసాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు ఈ కోవకు చెందినవే.  బాల సాహత్య పురోగతి ప్రారంభమైంది. బాల సాహిత్యంలో ఎన్నెన్నో  మార్పులు సంతరించుకున్నాయి.  గేయ, పద్య, గద్య, కథల, నాటికల, నవలల రూపంలో బాల సాహత్యం కనిపిస్తుంది.

            చిన్నయసూరి నీతిచంద్రికలో కథలుగా, కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం, పార్వతీశ కవులు బాల సాహిత్యాన్ని రచించారు.  ఆధునిక కాలంలో మర్యాద రామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు మొదలగు కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.

            అన్నమయ్య రచించిన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’, ‘చందమామ రావే’ వంటి లాలి పాటలు ఇప్పటికీ పిల్లలను ఆనంద పారవశ్యంలో ముంచుతూనే ఉన్నాయి.

            పెద్దల కోసం పరుగెత్తిన కలం పిల్లలకూ జోల పాట పాడింది.  ఆ కలం, గళం తెలంగాణ బాలగేయాల చక్రవర్తి  దాశరధి కృష్ణమాచార్య గారిది. తెలంగాణా మాండలికంలో పాపాయి పాటలు తేలికైన పదాలతో, లయతో ఊయల పాటలుగా మారాయి.

            దాశరథి గేయాలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

వర్తమానంలో బాలసాహత్యం

            19వ శతాబ్దం నుంచి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న బాలసాహత్యం మరిన్ని ప్రక్రియలతో ముందుకు వచ్చింది.  ఒకప్పుడు ఒకప్పుడు ‘అనగనగా…’ అంటూ కథలు వచ్చేవి. పంచతంత్ర కథలు, నీతి కథలు ఉండేవి.  ప్రస్తుతం స్కూలు, స్నేహాలు, పర్యావరణం, గ్రహాలు, మొబైల్ గురించిన కథలు వస్తున్నాయి.  వాడుక భాషలో తేలికగా పిల్లలకు అర్ధమయ్యే విధంగా,  ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా, నవ్వించే విధంగా ఉంటున్నాయి.

             ప్రపంచమే కుగ్రామంగా మారటంతో సాహిత్యం బాగుంటే క్షణాల్లో  వైరల్ అవుతుంది.  అనువాద సాహిత్యం విస్తరిస్తోంది.  ఏఐ ద్వారా సాహిత్యం అందుతోంది.  బాల సాహిత్యం మరింత పెరిగింది. కానీ ఫోనుకు అప్‌డేట్ అయ్యింది.

            బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతం నుండి, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచార్య, బోయ జంగయ్య, వాసాల నరసయ్య వంటి ప్రముఖుల వరకూ పిల్లలకోసం ఎన్నో నీతిదాయకమైన కథలు, గేయాలు అందించారు. పిల్లలు వాటిని ఇప్పటికీ ఇష్టపడుతున్నారు.

బాల సాహితీవేత్తలు 

            నాటి నుండి నేటివరకు ఎందరో బాల సాహితీవేత్తలు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలలోను పిల్లలకోసం తెలుగులో రాశారు. రాస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం రేఖామాత్రంగా కొందరు తెలంగాణ బాల సాహితీవేత్తల గురించి తెలుసుకుందాం.

            ఉభయ తెలుగు రాష్ట్రాల బాల సాహితీవేత్తల దిక్సూచి, తెలంగాణ సారస్వత పరిషత్‌లో బాల సాహిత్యం కోసం ప్రధాన పాత్ర పోషిస్తున్న కవి, నిగర్వి, నిరాడంబరుడు గరిపల్లి అశోక్ గారు.  చదువుతున్న కాలం నుండే సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తెచ్చి, తదుపరి కాలంలో బాల సాహిత్యంపై ఎన్నో పుస్తకాలు రాయటమే కాదు, విద్యార్థులతో రాయించారు.  ‘కీర్తి’ పురస్కారంతో సహా ఎన్నో అవార్డులు పొందారు.  బాల సాహిత్యం కోసం ఎన్నో కార్యశాలల నిర్వహించారు.  వీరి కథలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. వీరి సేవలను గుర్తించి తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులుగా నియమించారు.

            సంగనభట్ల చిన్న కృష్ణయ్య, పుప్పాల కృష్ణమూర్తి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వడ్డేపల్లి వెంకటేష్, డాక్టర్ అమరవాది నీరజ,   ముక్కామల జనకీరామ్, ఉండ్రాళ్ళ రాజేశం, బైతి దుర్గయ్య, బూర్ల  నటేశ్వరరావు, డాక్టర్ వి.ఆర్. శర్మ, డాక్టర్ సమ్మెట విజయ,  సమ్మెట ఉమాదేవి, సిద్ధాంతం ప్రభాకరాచార్యులు, కన్నెగంటి వెంకటయ్య, యడవల్లి శైలజ,  వురిమళ్ల సునంద, ఎస్‌కె షఫీ,    పోతగాని సత్యనారాయణ, డాక్టర్ సిరి, కందుకూరి భాస్కర్,  దేశముఖ్ ప్రవీణ్ శర్మ, డాక్టర్ కాసర్ల స్వర్ణ మమత, అమ్మిన శ్రీనివాస రాజు, మీసాల సుధాకర్, డాక్టర్ యు. పద్మ, కొమ్మవరపు కృష్ణయ్య, డాక్టర్ సాగర్ల సత్తయ్య, అంజన్‌రెడ్డి, కాల్వ రాజయ్య, నిర్మల, ఈ వ్యాస రచయిత్రి బండి ఉష వీరంతా పిల్లల కోసం సాహిత్యాన్ని అద్భుతంగా సృజిస్తున్నవారే. కొందరు పిల్లలను కాదుకాదు దాదాపుగా పిల్లలను ప్రోత్సహిస్తూ అనేక సంకలనాలు తీసుకొచ్చినవారే. 

            తెలంగాణలో ఇంకా ఎందరో బాల సాహితీవేత్తలు ఉన్నారు,  ముందు ముందు నా విస్తృత వ్యాసంలో బాల సాహితీ వేత్తలు ఎక్కడ ఉన్నా అందరి గురించి రాసే ప్రయత్నం చేస్తాను.  చివరగా డాక్టర్  పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత.  బాలల తాతా బాపూజీ గేయ కథకు ఈ అవార్డు పొందారు.

            ఆయన పిల్లల కోసం అనేక పుస్తకాలు రాశారు.  ఇతర భాషల కథలను, పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.  నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగంలో సంపాదకులుగా పనిచేశారు.  ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆయన చేసిన అనువాద పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అవిష్కరించారు.  నేషనల్ బుక్ ట్రస్ట్ భారత ప్రభుత్వంలో దక్షిణ భారత ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

            వాసాల నరసయ్యగారు, డాక్టర్ భూపాల్ గారు, డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు తెలంగాణ బాల సాహితీవేత్తలు. వీరు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు అందుకున్నారు.

             పైడిమర్రి రామకృష్ణ, ముక్కామల జానకీరామ్, వాసరవేణి పర్శరాములు, భీంపలి శ్రీకాంత, సబ్బని సుమిత్రా దేవి ఇలా బాలసాహిత్యంలో ఎందరో ఆరితేలినవారు ఉన్నారు.

            రాబోయే నా విస్తృత వ్యాసంలో అందరినీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

బాల సాహిత్యంలో పత్రికలు

            మొదటి బాలల పత్రిక 1923లో న్యాయపతి రాఘవరావు ప్రారంభించారు. 1947లో చందమామ వచ్చింది. తరువాత కాలంలో విస్తరించి బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నారి, బాలబాట వంటి పుస్తకాలతోపాటు వేదకుమార్ గారి బాల చెలిమి, వేదాంతం సూరి గారి మొలక, వివిధ పత్రికలలో, పేపర్లలో చిన్నారి సాహిత్యానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు.

            దాశరథి, సినారె గారు బాలల కోసం రాసిన గేయాలు ఇప్పటికీ నవనవోన్మేషంగానే ఉన్నాయి.  ఈ మధ్య కాలంలో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ‘కొమ్మా ఉయ్యాల” పాట ప్రతి ఒక్కరి హృదయంలో చోటు చేసుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

            డిజిటల్ బూమ్ వచ్చింది.  కథ చెప్పవా అమ్మమ్మ లాంటివి పిల్లలు చూస్తున్నారు.  రేడియో, దూరదర్శన్‌లో బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

బాలసాహిత్యం కోసం వివిధ కార్యక్రమాలు – పురస్కారాలు

            తెలంగాణ సాహిత్య అకాడెమీ 33 జిల్లాలలో 33 పుస్తకాలను ప్రచురించింది.

            తెలంగాణ సారస్వత పరిషత్ 11 పుస్తకాలను, వేదకుమార్ గారు 48 పుస్తకాలను ప్రచురించారు.

            2022 మార్చి 4న ఒకే సమయం, ఒకే అంశంపై ఐదు లక్షల మంది విద్యార్థులు రాశారు.

            2026 సంవత్సరంలో విద్యార్థులు 36 పుస్తకాలను రాశారు.

            పురస్కారాలు : బాల సాహిత్యాన్ని ప్రోత్సహించే దిశగా అనేక మంది పురస్కారాలను అందిస్తున్నారు. చింతోజు బ్రహ్మయ్య డాక్టరు అమరవాది నీరజ గారు  సాహిత్య అకాడెమీ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి తండ్రి గారి పేరు మీదుగా పురస్కారం, వురిమళ్ల ఫౌండేషన్, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, తెలంగాణ సాహిత్య అకాడెమీ పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారాలు, డెందోట బాల సాహిత్య పీఠం వారి పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ ` తెలంగాణ శాఖ పురస్కారం అందిస్తున్నారు. సేవా దృక్పథంతో ఇంకా అనేక ప్రైవేట్, సాహిత్య సంస్థలు పురస్కారాలను అందజేస్తున్నాయి.

భవిష్యత్‌లో బాల సాహిత్యం

            ఎఐ బాగా విస్తరిస్తోంది. ఛాట్ జిపిటి, జెమిని అడిగినవన్నీ ఇస్తోంది. పిల్లల్లో ఆలోచనా శక్తి తగ్గుతుంది.  ప్రతి విద్యార్థి సాహిత్యాన్ని రాస్తాడు.  కానీ స్వయంగా కాదు. టెక్నాలజీని ఉపయోగించి.  ఆస్వాదించటం తగ్గిపోతుంది.

            చందమామ నుండి చంద్రయాన్ వరకు వచ్చాము కానీ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. దీనికి కారణం ఆంగ్ల మాధ్యమంలో బోధన.

            ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నాము.  ప్రణాళికల వద్దే ఆగిపోతుంది.  విద్యార్థులలో మానసిక వికాసము కలగాలంటే కొంత వరకు మాతృ భాషలో బోధన జరగాలి.  సాహిత్య సృజన పాఠ్యాంశంలో భాగము కావాలి.  పోటీలు నిర్వహించి వాటి ఆధారంగా ఉన్నత చదువులలో ప్రత్యేక అవకాశం కల్పించాలి.

            పిల్లలు పడుకొనే ముందు కథ వినేలా చేయాలి.  పిల్లల అభిరుచుల మేరకు సాహిత్య సృజన జరగాలి. అప్పుడే భాష బతుకుతుంది.  విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. రచయితలకు ప్రభుత్వ  ప్రోత్సాహం ఉండాలి.  అప్పుడే బాల సాహత్యం శాఖోపశాఖలుగా మరింత విస్తరిస్తుంది.

May 26, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చరిత్ర కెక్కని శతఘ్నులు

by mayuukha May 26, 2026
written by mayuukha

భరతమాత దాస్యశృంఖలాలను త్రెంచడానికి తమ జీవితాలను ఫణంగా పెట్టిన ఎంతోమంది వీరులు, యోధుల చరిత్రలు మనకు తెలిసినవే. అది ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమే కావచ్చు , సిపాయిల తిరుగుబాటే కావచ్చు , మరింకేదైనా అయి ఉండవచ్చు. కానీ అంతిమంగా వారందరి లక్ష్యం ఒక్కటే. స్వాతంత్ర్య సముపార్జన. ఎన్నో త్యాగాల ఫలితంగా వారు మన కందించిన స్వేచ్ఛా వాయువులకు సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ మనం అభిమానం చాటుకుంటూనే ఉన్నాం. అంజలి ఘటిస్తూనే ఉన్నాం. మరి లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ చరిత్ర కెక్కని శతఘ్నుల మాటేమిటి? వీరి త్యాగాలు తెర మరుగు కావాల్సిందేనా? వీరు చిందించిన రక్తం ఈ మట్టిలో ఇంకిపోవాల్సిందేనా? అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ వీరవనితల త్యాగాలను మన వంతు బాధ్యతగా మరికొంత మందికి తెలియజేద్దాం.

వీరమంగై కుయిలీ :

పరాయి పాలనను అంతమొందించడానికి తన్నుతాను ఆహుతి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి ఆత్మార్పణ యోధురాలు. శివగంగై (తమిళనాడు) రాజ్యపు వీరమంగై కుయిలీ.
పెరియముతాన్ – రాకు దంపతులకు జన్మించిన 17వ శతాబ్దపు దళిత యువతి. పంట పొలాలను నాశనం చేస్తున్న ఒక అడవి ఎద్దును ఎదుర్కొనే ప్రయత్నంలో హతమైన సాహస వంతురాలి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ కుయిలీ. భార్య మరణంతో కలత చెంది, కూతురిని తీసుకుని తానున్న చోటు నుండి శివగంగై రాజ్యానికి వెళ్ళిపోతాడు ఈమె తండ్రి. తండ్రి ద్వారా తన తల్లి యొక్క వీరోచిత గాథల్ని తెలుసుకొని, స్ఫూర్తి పొంది తల్లిని మించిన తనయగా రూపుదాలుస్తుంది. తండ్రి మార్గదర్శకత్వంలో యుద్ధ విద్యలన్నిటిలోనూ అంతులేని నైపుణ్యాన్ని సంపాదిస్తుంది.
1780 లో జరిగిన మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వలసదారులపై తిరగబడిన మొట్టమొదటి భారతీయ పాలకురాలు రాణి వేలునాచియార్. బ్రిటిష్ వారితో సలిపిన పోరులో తన భర్త అమరుడవడంతో, అజ్ఞాతంలోకి వెళ్లిన రాణీగారి సైన్యంలో గూఢచారిగా ఇతను (కుయిలీ తండ్రి) నియమింపబడుతాడు. అతనిలోని అంకితభావం, నిబద్దతల కారణంగా రాణీగారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా మారుతాడు. అతని ద్వారా అతని కూతురులోని ధైర్యసాహసాలను తెలుసుకున్న రాణీగారు ఆమెను తన అంతరంగికురాలిగా నియమించుకుంటారు. తల్లి రక్తపుజాడలు, తండ్రి దిశా నిర్దేశంతో రాణీగారిని కంటికి రెప్పలా కాపాడుతూ, బ్రిటిష్ వారు 2,3 సార్లు ఆమెపై చేసిన హత్యా యత్నాలను అత్యంత చాకచక్యంగా తిప్పికొడుతుంది. ఈ ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతుంది. రక్త మోడుతున్న ఆమె గాయాలకు కట్టుగట్టే నిమిత్తం రాణీగారు తృటిలో తన చీరకొంగును చింపారంటే, వారి హృదయంలో ఆమె ఎంతటి స్థానాన్ని సంపాదించుకుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరో సందర్భంలో తన సిలంబం(ఆయుధ ఆధారిత యుద్ధ కళ) గురువును రాణీ గారిని హతమార్చడానికి నియమింపబడిన శత్రుపక్షపు గూఢచారిగా పసిగట్టి, అతన్ని అక్కడికక్కడే హతమారుస్తుంది. దీంతో రాణీగారు ఆమెను తన సైన్యంలోని మహిళా విభాగానికి సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తారు.
ఎనిమిదేళ్ల అజ్ఞాతవాసంలో మారుతుపాండ్యార్లు, టిప్పు సుల్తాన్, హైదర్అలీ వంటి రాజకీయ దిగ్గజాలతో కూటమి నేర్పరచుకున్న రాణీగారు పటిష్టమైన సైన్యంతో తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరిస్తారు. ఈ ప్రయత్నంలో వారిపై పలుమార్లు విజయం సాధించినప్పటికీ, అత్యంత శక్తిమంతమైన వారి ఆయుధ సంపత్తి తమ విజయానికి అవరోధం అనే ఆలోచనలో పడతారు వేలునాచియార్.
నాచియార్ నీడైన కుయిలీకి పరిష్కారమార్గం రెండు రూపాల్లో కనిపిస్తుంది. మొదటిది వారి ఆయుధాలను స్వాధీనం పరుచుకోవడం లేని పక్షంలో వాటిని సమూలంగా నాశనం చేయడం. దీనికోసం పథకం రచించడం మొదలు పెడుతుంది.
శరన్నవరాత్రుల పరిసమాప్తి సందర్భంగా పదవ రోజు కోటలోని రాజరాజేశ్వరి అమ్మన్ దర్శనార్థం మహిళలను లోనికి అనుమతించారన్న వార్తను వింటుంది. తలవని తలంపుగా అందిన ఈ అవకాశాన్ని తన పథకం అమలుకు దొరికిన సువర్ణావకాశం గా భావిస్తుంది.
తన అధ్యక్షతలోని మహిళా (40,000 మందితో కూడిన) సైన్యాన్ని సాధారణ పౌరుల వలె కోట చుట్టూ మోహరింపజేస్తుంది. పువ్వులు, పండ్ల బుట్టల లోపల ఆయుధాలను దాచిపెట్టి మరి కొంతమంది మహిళలు కోటలోనికి ప్రవేశిస్తారు. వీరిని అంచనా వేయడంలో బ్రిటిష్ వారు దారుణంగా విఫలమౌతారు. దీపాలు వెలిగించడానికి వెంట తెచ్చుకున్న నెయ్యిని (పథకంలో భాగంగా) మహిళలు మూకుమ్మడిగా ఆమెపై గుమ్మరించడం, ఆమె స్వయంగా నిప్పంటించుకుని, జ్వలించే అగ్నిగోళమై రెప్పపాటులో ఆయుధాగారంలోకి దూసుకెళ్తుంది. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపో యిన బ్రిటిష్ వారు తీరుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని వేలునాచియార్ వారిపై గెలుపు సాధించి రాజ్యాన్ని కైవసం చేసుకుంటుంది.
తమిళ భాషలో ‘వీరమంగై’ అంటే వీరనారి అని అర్థం. తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు వీరి స్మారక స్థూపాన్ని తమిళనాడులోని శివగంగ జిల్లాలో
స్థాపించింది.

హాడీరాణి(సహల్ కన్వర్):

హాడీరాణి అంటే ‘హడా’ వంశానికి చెందిన స్త్రీ అని అర్థం. ఈ విధంగా పిలువబడటం వారి వంశాచారం.శౌర్యప్రతాపాలకు మారుపేరైన వీరు యుద్ధ ప్రియులు. రాజపుత్రులు పరిపాలించిన రాజ్యం కనుక ఈ ప్రాంతం ‘ రాజస్థాన్ ‘ గా పేరుగాంచింది.
పలు వీరగాథలతో నిండిన సాహిత్యం, చరిత్రలను బట్టి వీరి పరాక్రమాలను అంచనా వేయవచ్చు. యుద్ధానికి వెళ్లే రాజులకు వారి జీవిత భాగస్వాములైన రాణులు వీర తిలకం దిద్ది పంపించడం మనం చరిత్రలో చాలాసార్లు చదువుకున్నాం. కానీ యుద్ధభూమిలోని భర్తకు ఒక అసాధారణమైన కానుకను పంపించిన క్షత్రియకాంతనే ఈ హాడీరాణి. రాజ్య శ్రేయస్సు కోసం ఆమె చేసిన త్యాగమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హడా చౌహాన్(చౌహాన్ అనేది ఉత్తర భారతదేశంలోని రాజపుత్ర తెగకు చెందిన వారి ఇంటి పేరు. ‘రాజు’ మరియు ‘ధర్మానికి అధిపతి’ అని దీని అర్థం. అగ్నిగుండం నుండి ఉద్భవించిన వారు అని మరో నమ్మకం ఉంది. అందువల్లనే వీరిని అగ్ని వంశీయులు అని కూడా అంటారు.రాజ్ పుత్ సంగ్రామ్ సింగ్ కుమార్తె సహల్ కన్వర్ (హాడీ రాణి). మేవాడ్ లోని సలుంబర్ ప్రాంతానికి చెందిన రతన్ సింగ్ చుండవత్ అనే వ్యక్తిని వివాహమాడుతుంది. మేవాడ్ పాలకుడైన రాణా రాజ్ సింగ్ సైన్యంలో ఇతను సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు.
మొఘల్ చక్రవర్తి ఐన ఔరంగజేబు తన సైన్యంతో మేవాడ్ రాజ్యాన్ని చుట్టుముట్టడంతో, సైన్యాధ్యక్షుడిగా యుద్ధభూమికి వెళ్లవలిసిందిగా రాజుగారు ఆజ్ఞను జారీ చేస్తారు.
అప్పటికి అతనికి వివాహమై కేవలం రెండు రోజులు మాత్రమే అవుతుంది. సౌందర్యంతో వెలిగిపోతున్న నవవధువు (అర్ధాంగిని)ను వదిలి యుద్ధభూమికి వెళ్ళడానికి అతని మనసు అంగీకరించదు. కర్తవ్య పాలనలో భాగంగా యుద్ధానికి వెళతాడే కానీ
అతని మనసు ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుంది.
పగలంతా శత్రువులతో పోరాడిన అతను, యుద్ధ విరామ సమయంలో ప్రతీరోజు ఒక సైనికుడిని ఆమె వద్దకు పంపించి, ఆమె క్షేమసమాచారాన్ని తెలుసుకొని, ఆమెకు ప్రతిగా ఆమె నుండి ఏదైనా కానుకను తీసుకొని రమ్మని పంపిస్తూ ఉండేవాడు. వరుసగా నాలుగు రోజులు ఇదే తతంగం నడవడంతో ఆమె ఆలోచనలో
పడుతుంది. తనపై ఉన్న మోహం కారణంగా అతడు యుద్దంపై మనసు లగ్నం చేయలేక పోతున్నాడనీ,ఇదే పరిస్థితి కొనసాగితే రాజ్యం శత్రువుల వశమై పోతుందనీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదని ఒక బలమైన నిర్ణయానికి వస్తుంది.
శత్రువుపై గెలవడానికి యుద్ధభూమిలో వారు (యోధులు) ఎంత వీరోచితంగా పోరాడుతారో, అంతఃపుర కాంతలు అదే స్థాయిలో వారికి మానసిక బలాన్ని అందిస్తారనే చారిత్రక సత్యం పలుమార్లు రుజువైనదే.
మోహానికి లొంగడం వీరుడి లక్షణం కాదనీ, తన నుండి మనసు మరల్చుకోకపోతే, శత్రువుపై విజయం సాధించడం అసంభవమనీ, తాను అతని వెంటనే ఉన్నాననే భావనతో రణరంగంలో విజృంభించమనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాననీ ఉత్తరం వ్రాసి, మరసటి రోజు సైనికుడి రాగానే అతనికి విషయాన్ని తెలియపరచి, తన తలను ఖడ్గంతో నరికేసుకుని, అతనికి కానుకగా పంపిస్తుంది. దానిపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఆమె చెప్పిన ప్రకారంగా అతను (సైనికుడు) వెళ్లి, ఆమె భర్తకు అందజేస్తాడు. విషయం తెలుసుకున్న అతని మనసు తీవ్రమైన దుఃఖానికి లోనైనప్పటికీ, అతనిలోని వీరుడిని మేల్కొల్పుతుంది. తలకు వేలాడుతున్న ఆమె జడతో తన మెడలో ముడి వేసుకొని,అరివీర భయంకరుడై శత్రుసైన్యాన్ని ఆవలిగట్టుకు తరిమికొడతాడు. కానీ ఆమె వియోగాన్ని భరించలేక అదే యుద్ధభూమిలో మోకాళ్ళపై కూర్చుని ఖడ్గంతో తన తలను నరుక్కుని, ఆమె జాడ వెతుక్కుంటూ స్వర్గానికి చేరుతాడు.
రాజస్థాన్ సైన్యంలోని ఒక బెటాలియన్ కు ఈమె పేరును పెట్టారు. డానీ సోలంకి అనే రచయిత ఈమె పేరు మీదుగా ‘ హాడీ రాణి ‘ అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఈమె సాహసం రాజస్థాన్ లోని పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చబడింది. అక్కడి జానపదులు ఈమె సాహసంపై బాణీ కట్టి ఆమెపై తమకున్న గౌరవాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉంటారు.

ఓనకే ఓబవ్వ:

కన్నడ చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన 17 వ. శతాబ్దపు ధీరవనిత. హోలయ తెగకు చెందిన ఒక సాధారణ స్త్రీ. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం పేరు వినపడగానే చరిత్రకారులకు ఈమె సాహసం జ్ఞాపకం రాక మానదు. చిత్రదుర్గంలోని రాతికోటకు కాపలాదారుడైన కాహళే ముద్ద హనుమ భార్య. శత్రువులు కోటను చుట్టుముట్టినప్పుడు సైనికులను అప్రమత్తపరచడం అతని విధి. కానీ ఒకరోజు అతను భోజనానికి వెళ్లిన సమయంలో హైదర్ అలీ (మైసూర్ పాలకుడు మరియు టిప్పు సుల్తాన్ తండ్రి) సేనలు ప్రదుర్గంపై దాడిలో భాగంగా కోటలోని చిన్న రంధ్రం ద్వారా లోపలికి రావడాన్ని గమనిస్తుంది. పక్కనే ఉన్న రోకలి బండను తీసుకొని వాళ్ల తలలపై బాదుతూ ముందుకు వెళ్లకుండా ఆపగలుగుతుంది. ఆమె దాడిలో చాలామంది శత్రు సైనికులు హతమౌతారు. భోజనానికి వెళ్లిన ఆమె భర్త తిరిగి వచ్చేసరికి ఆమె చేతిలో రోకలిబండతో ఒళ్లంతా రక్తమోడుతూ అప్రమత్తం చేయడంతో, శత్రువుల బారి నుండి వారు కోటను రక్షిస్తారు. కానీ శత్రువర్గంలోని ఒక సైనికుడు అకస్మాత్తుగా ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంది.
కన్నడ భాషలోని ‘ ఓనకే ‘ అనే పదానికి తెలుగులో రోకలిబండ అని అర్థం. రోకలి బండతో శత్రువుల నెదుర్కొన్నందు వలన ‘ఓనకే ఓబవ్వ ‘ అని చరిత్రలో స్థిరపడింది.
ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు లేకుండా ఒక సాధారణమైన పనిముట్టుతో బలవంతమైన శత్రుసైన్యాన్ని ఎదుర్కొన్న ఆమె ధైర్యం స్త్రీ శక్తికి నిదర్శనంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. యుద్ధ విద్యల్లో నైపుణ్యం,ఆయుధాల వినియోగంపై అవగాహన కంటే కూడా బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి యుద్ధభూమిలో కీలకమైన పాత్ర పోషిస్తాయనీ, ఒక సాధారణ స్త్రీని సైతం అసాధారణ శక్తిగా నిలుపగలవని నిరూపించింది.
కర్ణాటక ప్రభుత్వం 2021 వ. సంవత్సరం నుండి నవంబర్ 11 వ. తేదీని ‘ఓనకే ఓబక్క జయంతి’ గా అధికారికంగా నిర్వహిస్తోంది.

జీవన గమనంలోని మరే పార్శ్వాన్నీ పట్టించుకోకుండా, బంధాలు, అనుబంధాలకు లొంగకుండా కేవలం స్వాతంత్ర్య ఫలాలను పండించడమే లక్ష్యంగా కదిలిన ఈ దేశభక్తులకు చరిత్రలో సముచిత స్థానం దక్కలేదన్నది మేధావుల భావన. ఇటువంటి మహోన్నతుల విజయగాథలు తెలుసుకోవడం, నలుగురికి తెలియపరచడమే (చంద్రునికో నూలుపోగులా) మనం వారికి సమర్పించే నివాళి.

May 26, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ప్రాచీన సాహిత్యంలో మహిళాస్వరం
  • ఋగ్వేదపు స్త్రీస్వరం అపాలఆత్రేయ
  • ఉన్నత చదువుల శిఖరం
  • “కళింగ కథా జాడ”
  • రక్త చరిత్ర మన మేడే

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us