మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

సంఘర్షణ

by Bhargavi Lahari March 18, 2026
written by Bhargavi Lahari

సిద్ధి ప్రాప్తికై
సిద్ధార్థుని
వన ప్రవేశం
గాఢాంధకారంలో మునిగిన
యశోధర వైవాహిక జీవనం

త్యాగ ఫలితం
బుద్ధుని జ్ఞానోదయం
యశోధర మనోఘాతం
సౌభాగ్యురాలి విరహం
రాజ మందిర వనవాసం

ఆతని వైరాగ్యం
ఆవిడ పాలిట శాపం
కాని ప్రపంచానికి
అదో ఆదర్శం

ఆ మహారాణి మనోవేదన
ఒకటే ఒక ప్రశ్న
పరిత్యజించినది పతి అయితే
తనకు ఎందుకీ సంఘర్షణ?

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓడి గెలిచే కలల స్నేహం

by Mrudula March 18, 2026
written by Mrudula

చేదు జ్ఞాపకమైతే
మరచిపోయినట్టు
నిర్లక్ష్యం చేయగలను
నువ్వొక
మరుగున దాచలేని
పచ్చి నిజానివి
నా జీవిత లక్ష్యానివి

కల తీరని బాధ చూశాకే
నీ వెంట పరిగెత్తాను
నా అంతర్మధనం తెలుసుకున్నాను
నువ్వు గుర్తుపెట్టుకునేంత
గెలవాలనుకున్నాను !!

మరచిపోవద్దని అనుకున్నాను కనుకే……..
కలలను ప్రోది చేసుకున్నాను
కన్నీళ్లను పొదువు చేసుకున్నాను
నవ్వులను ఆవిరి చేసుకున్నాను
మనసు పొరలను గోడగ చేసుకున్నాను

నన్ను నీ గమనంలోకి
నువ్వే ఆహ్వానించావన్న నిజాన్ని
నీకు గుర్తు చేసేంత సాధించాలనుకున్నాను
నువ్వు మార్చే ప్రకృతి రంగులు లెక్క చేయక మరీ ప్రయత్నించాను

కానీ నువ్వు కాలమనే మాయాజాలానివి
పండు వెన్నెల్లో వేణు గానం వినిపించగలవు
నిశీధి రాత్రిలో జాలిరాగం పాడగలవు

అయినా………
ప్రయత్నమే
అసలు విజయమైతే
గెలుపు నాదిగా
తియ్యని రాగాన్నై
వేణు గానంలో ఓలలాడగలను
ప్రతి రాత్రినీ వసంతరాత్రిగా
మార్చుకోగలను
నీ ఒడిని సైతం ఊయలగా అనుభవించగలను !!

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

శాలువా విలువెంత ?

by Divakarla Rajeshwari March 18, 2026
written by Divakarla Rajeshwari

రఘుపతి లోపలికి రాగానే ఆయన చేతిలో ఉన్న వస్తువులను అంది పుచ్చుకుంది రాగిణి. మెత్తని సిల్కు శాలువా! అందమైన కుచ్చులతో జరీ దారాల మెరుపులతో ఖరీదును చాటుతోంది. శ్రీ కృష్ణ దేవరాయల వెండి అచ్చు బొమ్మతో సభను ఏర్పాటు చేసిన వారి నామ ఫలకం తో జ్ఞాపిక స్వర్ణోత్సవం జరుపుకుంటోన్న సంస్థ వైభవాన్ని తెలుపుతోంది.
రఘు పతికి రోజూ సభలలో పాల్గొనడం తప్పని సరి అయిపోయింది. సభ లో అధ్యక్షుని గానో పుస్తక ఆవిష్కర గానో, లేదా సాహిత్య ప్రసంగ కర్త గానో ఆహ్వానాన్ని అందుకోడం పరి పాటిగా మారింది. రఘుపతి ప్రసంగం ఉన్న సభ ఒక వేడుకగా మారుతుంది. ఏ విషయాన్నైనా సమగ్రంగా అధ్యయనం చేసి ఆద్యంతం ఆసక్తి కరం గా ఉపన్యసించి రఘుపతి సాహిత్య సభలకు జన ప్రియతను కలిగించాడు.
రఘుపతి సభా పరిశ్రమను చేసి సంపాదించిన శాలువలను రాగిణి జాగ్రత్తగా భద్ర పరుస్తుంది. జ్ఞాపికలను ప్రత్యేకమైన గాజు బీరువాలో అలంకరణగా ఉంచుతుంది
రఘుపతి ఆ రోజు పొందిన సత్కార శాలువాను మడత పెడుతూ, “నారాయణకు రమ్మని చెప్పండి, మంచి నమూనాలను సిద్ధం చేసాను. ఈ సారి నారాయణ జాతీయ స్థాయిలో ప్రశంసను పొందవలసినదే “అంది
నారాయణ ఇప్పుడు దర్జీ గా పేరు సంపాదించాడు. నారాయణ జీవితం బాగు పడింది. కష్ట పడి పని చేస్తాడు. సమయానికి బట్టలు కుట్టి అందజేస్తాడు….
మీరు చెప్పినదంతా నిజమే .. కాని నారాయణ బాగుపడినదంతా మన చలవే ! మన సహాయం వల్లనే తాను పేరు తెచ్చుకోవడం జరిగిందని వచ్చి నప్పుడల్లా కృతజ్ఞతలతో ముంచి వేస్తాడు.
సరేలే !అది వాడి అభిమానం –
మొత్తానికి మీకు మంచి మిత్రుడు దొరికాడు.
నారాయణ వచ్చినప్పుడు ఇవ్వవలసిన, సూచనలు, డిజైన్లు ప్రింట్ అవుట్ తీసి పెట్టాలి అనుకుంటూ కంప్యూటర్ తెరిచింది రాగిణి.
—
రఘుపతి ఉద్యోగం లో చేరడానికి వచ్చినప్పుడు కళాశాలకు దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ గది గాలి వెలుతురు తో మనసుకు హాయినిచ్చేటట్లుగా ఉంది. ఊళ్ళో అతి కష్టం తో జీవన భత్యం గడుపుకుంటున్న టైలర్ నారాయణకు గదికి ఆనుకుని ఉన్న వసారాలో కుట్టు పనికి చోటును కల్పించాడు. తాము ఉండే గది కొంచం ఎత్తుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళ దృష్టికి ఆనుతూ ఉండడం వల్ల దర్జీ నారాయణను వినియోగ దారులు గుర్తించడం జరిగింది. నారాయణకు మంచి దర్జీ అని చుట్టు పక్కలవాళ్ళ మౌఖిక ప్రచారం ద్వారా చేతి నిండా పని దొరికింది.
నారాయణ తోడుగా ఉండడం రఘుపతికి సహాయకారి లభించినట్లయింది. నారాయణ కుట్టి ఇచ్చిన లాల్చీని వేసుకుని కళాశాలకు వెళ్ళిన రఘుపతి హుందాతనం పెరిగింది. తెలుగు ఉపన్యాసకునికి అభిమానులు అధికం అయ్యారు.
తరగతి గదిలో గంభీరంగా స్పష్టమైన ఉచ్ఛారణతో వివరంగా బోధించే పాఠ్యాంశాలు విద్యార్థులతో గురు శిష్య అనుబంధానికి గల ప్రమాణాన్ని పెంచింది.
అంత చిన్న వయసులోఅతడుసంపాదించినపాండిత్యానికి,విషయపరిజ్ఞానానికి,వాక్చాతుర్యానికి . రఘుపతి కి వక్తగా పరంపరల ఆహ్వానాలు మొదలయ్యాయి.
సభ వాళ్ళు ఇచ్చిన శాలువాలకు సత్కార సామాగ్రికి, గదిలో ఉన్న చిన్న చెక్క బీరువా సరిపోలేదు.
రఘుపతికి వివాహం అయింది. భార్య రాగిణి దుస్తుల నమూనా లలో డిప్లొమా కోర్స్ చేసింది. చాలా చురుకుగా ఉంటుంది. ఆమెకు గృహ అలంకరణ నిర్వహణలలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది.
పెళ్ళి కాగానే రఘుపతి పెద్ద ఇంట్లోకి మారాడు. అతని కి ఆచార్య పదవి వచ్చింది. నగరం లో ప్రముఖ సాహితీ విమర్శకునిగా ప్రసిద్ధి పొందాడు. స్వంత ఇల్లు కట్టుకున్నాడు. నారాయణ పని కూడా . సంతృప్తికరంగా సాగుతోంది. .
కాల గడచిన కొద్దీ రఘుపతి నారాయణల స్నేహం మరింత దృఢమవుతూ వచ్చింది. నారాయణ కుట్టిన లాల్చీ ధరిస్తే రఘుపతికి మిత్రుడు భుజం మీద చేయి వేసి నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి కుటుంబం పెరిగింది. పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు. కుటుంబ వ్యయం పెరిగింది.
నారాయణ కూతురు డాక్టర్ కోర్సు చదవాలని. గట్టి పట్టుదలతో ఉంది. తన సంపాదనతో కొడుకు ఇంజనీరింగ్,కూతురు మెడిసిన్ లను చదివించ గలనా? అని సందేహించాడు నారాయణ. కష్ట సుఖాలను ముచ్చటించుకుంటున్న సమయం లో పిల్లల చదువులను గురించి ప్రస్తావించాడు నారాయణ
నారాయణ సమస్యను విని పూర్తిగా అర్థం చేసుకుంది రాగిణి. బాగా ఆలోచించింది.
—
మర్నాడు తను పిలిచిన వెంటనే వచ్చిన నారాయణ ను కూచోమని కాఫీ ఇచ్చింది.
ఇప్పుడే వస్తాను ఉండు అంటూ బీరువాలలో ఉన్న శాలువలను. కొన్నింటిని తెచ్చింది
నారాయణా ఇవన్నీ రఘుపతికి సభా కార్య క్రమాలలో సత్కారానికి వచ్చినవి, ఇంకా చాలా ఉన్నాయి
ఇందులో కాశ్మీరు నుండి ఖద్దరు వరకూ, అనేక రకాలున్నాయి. వాటిని బట్టి నేను నమూనాలను గీసి ఇస్తున్నాను. వాటిని నువ్వు చూసి నేనిచ్చిన డిజైన్ లకు అనుగుణం గా కత్తిరించి దుస్తులను తయారు చేయి.. బ్లౌజులు, కుర్తీలు, బ్రైడల్ దుస్తులను తయారు చేయి.అందమైన దుపట్టాలు, స్కార్ఫ్ ల నమూనాలను కూడా ఇచ్చాను.
అవన్నీ ఆధునిక యువతీ యువకులకు నచ్చే టట్లుం డాలి. ఇక వయసు పై బడిన వారికి భుజాల మీదనుండి జారిపోకుండా చేతులకు పట్టి వుండేటట్లు, ధారణకు అనుకూలంగా కుట్టాలి. అందమైన రంగుల దారాలను ఉపయోగించి ధరించే వారి విలువను పెంచాలి ..
ఇలా ఆమె రూపొందించిన నమూనాలకు నారాయణ నైపుణ్యం జోడించి తయారు చేసిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి.
ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా నారాయణ, అతని భార్య అహర్నిశలు కావించిన శ్రమ కు ఫలితం లభించింది.
కుట్టిన వెంటనే దుస్తుల కొనుగోళ్ళు జరిగాయి. నారాయణ ఎప్పటికప్పుడు రాగిణికి సమాచారం అందించడం తో ఆమె పేర్చి ఉంచిన శాలువాలు అన్నింటినీ విడతల వారీగా నారాయణకు అందించడం , అతడు తయారు చేసిన వస్త్రాలు స్థానికం గానే కాక ,వివిధ దేశాలకు ఎగుమతి కావడం తటస్థించింది.
నారాయణ తాను రూపొందించిన దుస్తులు ఎప్పటికప్పుడు కొనుగోళ్ళు కావడానికి కారణం రాగిణి గారు అని, ఆ శాలువాలను తమ బుద్ధి పరిశ్రమ తో సంపాదించిన వారు ఆచార్య రఘుపతి గారని, తాను సంపాదించిన డబ్బును వారికి చెల్లించ బోతాడు.
రాగిణి, రఘుపతి ఆ మాటను నవ్వుతూ తిరస్కరిస్తారు.
మాది ఆలోచన మాత్రమే! నీది ఆచరణ. మాది కొంత ఔదార్యం ,నీది ఔపచారికం ,జీవితావసరం, నీ సంతాన భవిష్యానికి సోపానం. నీ కూతురు డాక్టరయితే అనేక మందికి ఆమె సేవా భాగ్యం కలుగుతుంది. కొడుకు దేశ ప్రగతికి దోహదం చేస్తాడు. మా ఔదార్యం వల్ల ఇంతగా మేలు జరుగుతే అంతకంటె మాకు ఇతర కానుకలు ఎందుకు? అంటారు.—
ఆ రోజు రాగిణి డిజైనర్ షాపు ఆరంభ దినోత్సవం . అధునాతనమైన దుస్తుల తయారీలో సాటి లేని ప్రతిభను చూపిన రాగిణీ డిజైనర్ షాపు యజమాని రాగిణి ని చూడాలని వచ్చిన అతిథులు ఎదురు చూసారు.
ఆవిష్కరణ రఘుపతి చేతుల మీదుగా జరిగింది.
రాగిణి ఎవరు అన్న ప్రశ్న మిగిలింది.
విలువ ఇంత అని చెప్పలేని గౌరవం, ఆప్యాయత, మరియు సత్కారానికి ప్రతిబింబమే రాగిణి అని, ఈ దుస్తులను ధరించిన వారు సంప్రదాయానికి, ప్రత్యక్ష సాక్షులు గా ఉండాలన్నదే రాగిణి డిజైనర్స్ ధ్యేయం “అత్యుత్తమ మైన భారతీయ సంస్కృతి కి ఆధిపత్యం వహించిన శాలువా సభా గౌరవాలకు పరిమితం కాకుండా బీరువాలలో నలిగి ఉక్కిరి బిక్కిరి కాకుండా, సర్వ జన గణ వినుత మాధ్యమం లో విస్తృత విలువలను అందుకోవాలన్నదే రాగిణి ఆశయం” అంది సభలో అప్పటి వరకూ మౌనంగా రాగిణి గారిని ఆరాధిస్తున్న డా చంద్రిక , నారాయణ గారి కూతురు……రాజేశ్వరి దివాకర్ల

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జాగ్రత్త మహిళా..!

by Manjula Pathipati March 18, 2026
written by Manjula Pathipati

గుంట నక్కలు ముసుగేసుకుని మన
చుట్టు తిరుగుతు మాయ మాటలు
చెప్పి నిన్ను  మాయం చేస్తారు జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

బడికి వెళ్లే ఆడ పిల్లపై నీ వెయ్యి
కన్నులు వేసి ఉంచు మహిళా..!
రెప్పపాటు ఆదమరచినావో
డేగ లాగా తన్నుకొని పోతారు జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

పొలం పనుల కోసం పొయ్యేటప్పుడు
బుడ్డదాన్ని వెంట తీసుకునిపో…
మరచి పోయినావో కామాంధుల
కాటుకు బలై పోతుంది జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

కూలి నాలికి పొయ్యేటప్పుడు చీడ
పురుగుల బారిన పడకుండా
నిండు వస్త్రధారణతో వెళ్లు…
మరచి పోయినావో  చుట్టు ముట్టి
చిత్రవధ  చేస్తారు జాగ్రత్త మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!

అంతా నావాళ్ళే అని గుడ్డిగా నమ్మకు
మహిళా..!
నీ వెనక గోతులు తీసేది నీ వాళ్ళే అని
తెలుసుకో మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!

సమాజంలో ఉన్న కొంత మంది
గురించి మాత్రమే వారు మంచిగా
మారుతారు  అని  ఆశిస్తు…
తరలిపో తరలిపో.. చీకటి నుంచి
వెలుగుకు తరలిపో.. కుందేలువి కావు..
పులిలా మారిపో.. వెంటాడే ఒడిదుడుకుల
మృగాలతో యుద్ధానికి తరలిపో…’’
ఓ మహిళా మీకివే మా వందనాలు.
కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి వందనాలు

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వైజ్ఞానికం వందే జగద్గురుం

by Y. Sujatha March 18, 2026
written by Y. Sujatha

అగ్గిపుల్లా,
సబ్బు బిళ్ళా
తలుపు గొళ్ళెం,
గుఱ్ఱపు కళ్ళెం
సర్వం వైజ్ఞానికమే !

దేవుని హుండీ
పూల కుండీ
చొక్కా గుండీ
చక్రం బండీ
సర్వం వైజ్ఞానికమే !

లోహ విహంగం
విద్యుత్ తరంగం
నదీ సంగమం
డ్రోన్లు వీరంగం
సర్వం వైజ్ఞానికమే !

చేతిలో సెల్లు
కరెంటు బిల్లు
రాముని విల్లు
మేఘం జల్లు
సర్వం వైజ్ఞానికమే!

గ్రహాల భ్రమణం
జీవుల చలనం
ప్రకృతి గమనం
శరీర మరణం
సర్వం వైజ్ఞానికమే !

చంద్రయానం
సముద్ర శోధనం
అణు విస్ఫోటనం
కణ విచ్ఛిన్నం
సర్వం వైజ్ఞానికమే !

దృశ్య మాధ్యమం
ప్రింట్ చోద్యం
శ్రవణ పరికరం
రవాణా పరిశ్రమం
సర్వం వైజ్ఞానికమే !

విద్యా బోధన
వైద్య శోధన
ఆహార పోషణ
అంతరిక్ష వీక్షణ
సర్వం వైజ్ఞానికమే!

ఆనకట్ట
ఆయుధ గుట్ట
లెక్కల చిట్టా
టెక్నాలజీ పట్టా
సర్వం వైజ్ఞానికమే !

సర్వం
వైజ్ఞానికం
వందే జగద్గురుం

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సామాన్య వర్ణ విన్యాసంతో గంభీర భావాల ప్రదర్శించగల ప్రతిభాశాలి – కొండపల్లి

by mayuukha March 18, 2026
written by mayuukha

       – డాక్టర్  దాశరథి ,(1976 అక్టోబర్ 9-‘ఆంధ్రప్రభ’ దినపత్రిక,’రాగవల్లరి’)

పరుగెత్తే నది నైనా
బంధించును చిత్రం
అంతటి ఆకాశమైనా
ఇంతవును విచిత్రం

గదిలో నది:-
     చిత్రకారుని కుంచే గంగానది నైనా కాన్వాస్ మీద బంధించగలదు. శేషగిరిరావు గారి ‘గంగ’ను చూసినవారికి ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి.  అన్నీ పోతాయి, కళ ఒక్కటే మనతో ఉంటుంది అన్నారు అంటీన్ డాల్ఫిన్ .
రాజ్యాలు, సింహాసనాలు పోయాయి. అజంతా ఎల్లోరాలు మనకు మిగిలాయి. కాలం పరిగెత్తుతుంది. కళ నిలిచి ఉంటుంది.కదలాడే ప్రకృతి కళలో  ఘనీభవిస్తుంది.  అర్థం కానిదేదైనా గొప్పది అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. అయితే కడ కూడా వెర్రి తలలు వేస్తుంది ఒక చిత్రపడా ప్రదర్శనలో ఒక కంచు బొమ్మను ప్రదర్శించారట ఆ బొమ్మని పత్రికలో పొగిడాయట విమర్శకులు మెచ్చుకున్నారట ఆ కాన్స్టయ శిల్పం కింద ఇటాలియన్ భాషలో ఏదో పేరు ఉంది ఇటాలియన్ భాష తెలిసిన వారిని అడిగితే ‘ఏనుగులద్ది’అని అర్థం చెప్పారట!
అర్థం కానిదేదైనా గొప్పది-  అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. క్యూబిస్ట్, సర్రియలిస్ట్, డాడాయిస్ట్, నైరూప్య, అధునాతన చిత్రకళారూపాలను తెగ పొగిడే వారు ఉన్నారు. మనకు అర్థం కాని దల్లా గొప్పది అనుకోవడం ఎంత పొరపాటు అందులో ఏమీ లేదనుకోవడం అంత పొరపాటే .పాశ్చాత్య సంగీతం వినీ వినడంతోనే అందులో శ్రావ్యత లేని లేదు అనేస్తారు కొందరు మరి మన సంగీతం వారికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కొంత సంస్కారం కావాలి మరి.
‘ఉత్తమ కళ ఏ కాలంలోనైనా తన కాలాని కంటే ముందు పరుగెత్తుతుంది తన కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది కళ పయనించే వేగాన్ని సమాజం
అందుకోలేదు. కళ నేడు అందుకున్న దాన్ని సమాజం రేపు గాని అందుకొనదు. ఇక్కడే సమాజానికి కళాపధ ప్రదర్శకురాలు అవుతుంది”. అన్నారు ప్రసిద్ధ చిత్రకారులు, విమర్శకులు సంజీవ్ దేవ్ గారు.

      ” సమాజం కళ ను సజీవ పరుస్తుంది. కళ సమాజాన్ని ఆనందపరుస్తుంది.సమాజం గుప్తపరిచే దానిని కళ వ్యక్తపరుస్తుంది. గుప్తత  వ్యక్తత రెండు కూడా జీవన సాఫల్యానికి సమానావసరాలే” అన్నారు ఆయనే! కళను గురించి ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం అసాధ్యమేమో! అయితే గుప్తత, వ్యక్తత ఏ పాళ్ళలో ఉండాలన్నదే ప్రశ్న. గుప్తత ఎక్కువైపోయి,వ్యక్తత తగ్గిపోతే సుబోధకత తగ్గుతుంది. కనుక ఆయన చిత్రాలు చాలా వరకు సుబోధకం గా ఉంటాయి.వీరు స్పష్టతను కోరే కళాకారులు. అందులో అయోమయత్వం లేదు. పెన్సిల్ తో గీసినా కలంతో వ్రాసినా, కుంచెలో వాడినా,తైలవర్ణాలు ఉపయోగించినా, లలితములైన జలవర్ణాలు ప్రయోగించినా, ప్రాచీన చిత్రాలు రచించినా, పాశ్చాత్య రీతులను అనుసరించినా శేషగిరిరావు తన చిత్రంలోనే కనబడేలా చేయగల ప్రతిభాశాలి. చిత్రకళానిపుణులు, విమర్శకులు ఇది శేషగిరిరావు గారి బొమ్మ అని ఇట్టే చెప్పగలరు.

   శేషగిరిరావు శిల్పులకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి. ప్రపంచంలోని సుప్రసిద్ధ కళాకారులు శిల్పులు ఆయన మిత్రులు. ఆయనది సుకుమార హృదయం. ఉదారమైన మనస్తత్వం. నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ కేంద్ర లలిత కళా అకాడమీకి తొలి అధ్యక్షులు.ఊ అలాంటి వ్యక్తి అనురాగం ఆశ్రయాలు, ఉచిత విద్య శేషగిరిరావుకు లభించాయి.శాంతినికేతన్ లోని విశ్వభారతిలో చేరినప్పుడు ఆచార్య నందాలాల్ శిష్యులుగా ఎంతో అనుభవాన్ని పొందారు. ప్రముఖ చిత్రకారులు కుమారిల్ స్వామి వీరికి అక్కడ సహధ్యాయి.

     చిత్రకళా నిపుణులు విమర్శకులు అయినా వేలూరి రాధాకృష్ణ గారు, శేషగిరిరావు నందాలాల్ బోస్ గురించి చెప్పిన మాటలు ఈ సందర్భంలో గమనించవలసి ఉంది. నందాల్ లాల్ బోస్ వద్ద నేర్చుకోవడం మూలంగా నాలోని చాలా లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగాను.ఆయన వద్ద నేర్చుకోవడం గురుకులంలో మునివర్యుని వద్ద నేర్చుకోవడం వంటిది.”     తమకు అదే అనుభవం కలిగినట్లు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. ఆయన తను చేయు ‘కర్మకు బద్ధుడైన యోగి పుంగవుడు’ అన్నారు నందా బాబును గూర్చి.

   పందొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ చిత్ర కళాశాలలో శేషగిరిరావు అధ్యాపకులైనారు. బనస్థలి విద్యాపీఠంలో కుడ్య చిత్ర రచనలో తర్ఫీదు పొందిన శేషగిరిరావు ఎన్నో కుడ్య చిత్రాలు రచించారు.భారతీయ పౌరాణిక చిత్రాలు,ప్రకృతి చిత్రాలు రచించడంలో శేషగిరిరావుది అందవేసిన చెయ్యి. పల్లె ప్రజల జీవితాలను వివిధ కోణాల నుండి సున్నిక్షితంగా పరిశీలించి చిత్రాలు రచించడం శేషగిరిరావు లోని మరో విశిష్టత. రోజూ మనం వీధిలో వెళుతూ రకరకాలైన వృక్షాలను చూస్తాం. దాటిపోతాం .తన కుంచెలోని నైపుణ్యంతో శేషగిరిరావు వేసిన వృక్ష చిత్రాలు చూసి ఆగిపోతాం. దాటిపోలేం. ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుని ఆగిపోయేలా చేసి, ఆశ్చర్యచకుతునిగా చేసే శక్తి శేషగిరిరావు చిత్రాలలో ఉంది. అతడు వేసిన గుల్మోహర్ చూచి తీరవలసిందే.

   ఈయన చిత్రాలల్లో మరో విశేషం ఏమిటంటే రంగులు సామాన్యమైనవిగా ఉంటూ ఎంతో కండ్ల పండువగా  గంభీర భావాలను వ్యక్తపరుస్తాయి ఈయన న్యూరల్ పెయింటింగ్స్ లో కంపోజిషన్ అద్భుతంగా ఉంటాయి ఈయన బ్రష్ వర్క్ లో వేగం శక్తి జవం స్పేసింగ్ ఉట్టిపడుతుంటాయి సంతాల్ నృత్యం, వసంతం, కాకులు అనే చిత్రాలకు 1949లో, గేదెలు ,నెమళ్లు ఈ చిత్రాలకు 1953 లోను, సంతాపం, క్షమ అనే చిత్రాలకు బంగారు పతకం, బహుమతి, స్టేట్ హుడ్ అనే చిత్రాలకు కలకత్తా అకాడమీ అవార్డు లభించాయి.

     1963 ఏప్రిల్ లో హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో ఈయన పెయింటింగ్స్ ప్రదర్శన చూశాను సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ వివాస్కర్ ప్రదర్శనను ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించినవి నన్ను బుధ్ధిని చేసినవి కొన్ని చిత్రాలు ఇక్కడ ఉదాహరించడం యుక్తమని భావిస్తున్నాను.చేదిత దృమం, గుల్మోహార్, గంగ ,నూతన ప్రభాతం, అడవి కోన, విషాద ప్రకృతి  ఒక తరహాకు చెందిన ఉత్తమ చిత్రాలు అయితే, పద్మం, గర్భిణి ,చిత్రాంగద, శకుంతల, అరుంధతి బతుకమ్మ, అహల్య, గాయత్రి, రామానుజ, పార్వతి, దమయంతి మరొక రకమైన ఉత్తమ చిత్రాలు.

    శేషగిరిరావు చిత్రాలను స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఎందరో కళాభిమానులు కొన్నారు. హైదరాబాదు మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియంలోనూ, హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లోనూ, ఢిల్లీలోని వెస్టర్న్ కోర్టులోను, కాబూల్, కైరో , మాస్కో మ్యూజియం లండన్ ఇటలీలలోను శేషగిరిరావు చిత్రాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ భవనంలోనూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోను ఈయన చిత్రాలు ఉన్నాయి.

  అలంకరణ కళ పై శేషగిరిరావు ఒక గ్రంథం వ్రాశారు. ఇది ఇంకా ప్రచురణ కావలసి ఉంది.లేపాక్షి,తాడిపత్రి, హంపి దేవాలయాలలోని శిల్పాల రేఖాచిత్రాలు శేషగిరిరావు రచించారు.వాటి సంపుటమే ‘ సురేఖ’ .ఇది ప్రచురించబడింది .శేషగిరిరావు రచించిన పోతన, తిమ్మరుసు, అల్లసాని పెద్దన,ఉభయపార్వ్శాలలో గల అశ్వారూఢుడైన  శ్రీకృష్ణదేవరాయలు, కొంగలు మరపురాని చిత్రాలు.

   ప్రముఖ విమర్శకులు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయ పడినట్లు అతని రేఖలలో నుంచి జీవం ఉట్టిపడుతూ ఉంటుంది అతని రంగులలో నుంచి తేజస్సు తాండవం మాడుతూ ఆయన చిత్రాలు చూపురులను ముగ్ధులను లను చేస్తవి.పట్టు వస్త్రం పై శేషగిరిరావు గారు చక్కని భారతీయ శైలిలో చిత్రించిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నవి. అన్నింటికన్నా మించినవి అతని నలుపు తెలుపు చిత్రాలు చైనా సిరాలో ‘వాష్’ శైలిలో రచించిన చిత్రాలూను, వాటిలోని వేగం గమనింపదగింది. శేషగిరి రావు గారు తైల వర్ణాలతో కూడా మిగతారీతులలో వలె సులభంగాను చిత్రించగలడు. మన దేశంలోని అనేక ముఖ్య నగరాలలో శేషగిరిరావు తన సొంత చిత్రాల ప్రదర్శనలను ఏర్పాటు చేసి పండిత పామరుల  మన్ననలను పొందారు.

   సాంఘిక ప్రయోజనం లేని కళను ఆధునికులు హర్శించరు. ఇటీవల హైదరాబాదు నగరంలో జరిగిన బ్రహ్మాండమైన హరిజన మహాసభలలో శేషగిరిరావు గారు చిత్రించి, ప్రదర్శించిన “హరిజనోద్యమం”అని ప్యానెల్ లో సాంఘిక ప్రయోజనం తో పాటు ఆయన చిత్ర విద్యాలయపుణ్యం పరాకాష్ట నందుకు ఉన్నది. అందుకే అశేష ప్రజ్ఞాధురీణుడు శేషగిరిరావు అంటాను.

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సహన భారతం

by Thokala Rajesham March 18, 2026
written by Thokala Rajesham

సీ:కులము కులమటంచు కులుకుచుందురు గాని
                            కోరికవడి తెచ్చుకొనిరె కులము
   మతము మతమటంచు కతలుజెప్పుదురెల్ల
                           వారి మతములొక్క తీరు గాదె?
    ధనము నాకేయున్నదని గర్వ మేలకో?
                           పైసలనేదిని బతుకగలమె?
    అధికార బలమున్నదని తుల్లెదరు నాయ
                           కుల జేసినది ప్రజాబలము గాదె?

తే:  ప్రజల కన్నీటిలోని ఆపదలనెల్ల
   తీర్పజాలిన నాడు-విద్వేష బుద్ధు
   లింకిపోవవే? కాని నెడెందు జూడ
    నాయకులె రెచ్చగొట్టుట నడుచు చుండె

చ:మతముల పేరుజెప్పుకొని మారణహోమము రేపి చీకటుల్
    బతుకులలోన నింపుట-శవమ్ములపై పడు చిల్లరేరు దు
    ష్కృతములు సాగవెల్లపుడు-కిందిది పైనది కాకపోదు-స
    మ్మతములు తారుమారుగను మారక పోవునె?భారతావనిన్

ఆ:మతములోన గలుగు మానవత్వమ్మును
    గొంతుబిసికి చంపి గోతి లోన
    పూడ్చిపెట్టి సుద్ద పూసమాటలు నేడు
    చెప్పు చుండ్రి లేని గొప్ప కొరకు

క: పరమతములపై పడి యె
    వ్వరు’దూషింపండి’యనుచు ప్రవచించిరి నె
    త్తురులను పారింపుమనుచు
    విరచించిరె గ్రంథముల పవిత్రత నెరుపన్

ఆ:మధ్యలోన పుట్టి మధ్యలోనే పోయె
    గతమునందు కొన్ని మతములవని
    మానవత్వమనెడు మతమొక్కటే మాన
    వాళితోడ చివరి వరకు నిలుచు

తే:చెట్టుపై కిచకిచలాడు పిట్టలందు
    కులము మతములు గలిగెనే? కుట్రలేవి
    యేని పొడసూపెనే?లేని పోని లొల్లు
    లొక్క మనుషులందే కల్గియుండుటేమి?

తే:మనది ఉపఖండమని చెప్పుకొనుచు
    పక్క వారి సంస్కృతి కించపరుచ నేల?
    మాలలో తీరుతీరైన పూలు గలుగ
    చూడ ముచ్చట గొల్పదే శోభ హెచ్చి                   –

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సుయజ్ఞోపాఖ్యానము

by Devaraju Revathi March 18, 2026
written by Devaraju Revathi

ఎన్నో జన్మల పుణ్యఫలంతో అదృష్టవశాత్తు లభించిన మానవ జన్మ నిరంతరం భగవన్నామ స్మరణతో సఫంలం చేసుకోవాలే తప్ప భౌతిక మోహాలకు లొంగి వ్యర్థం చేసుకోకూడదనే వేదాంత పరమార్థం తెలియ జెప్పేదే సుయజ్ఞోపాఖ్యానం.ఇహము పరము మధ్యలో కొట్టు మిట్టాడే మనిషి ఆత్మకు పరమాత్మకు అనుసంధానం పొందే విధమైన ఆత్మజ్ఞానం పొందటానికి వేదవ్యాసుడు సమవర్తి అయిన యమధర్మరాజు నోటి వెంట చెప్పించిన తత్వ విచార సారాంశంగా అర్థం చేసుకోవచ్చు.

వేదాలను విభాగం చేసి పంచమ వేదంగా మహాభారతం వ్రాసినప్పటికీ అసంతృప్తి తో వేదన చెందుతాడు బాదరాయణుడు. కారణమేమిటో విచారించిన నారద మహర్షి భగవన్నామ సంకీర్తన లేని కావ్యం అంతగా సంతృప్తి కలిగించిందని చెప్పి పురాణ రచనకు ప్రోత్సహిస్తాడు. అందులో తొలి పురాణంగా వ్యాసుడు వ్రాసింది భాగవత పురాణమే.దానిలో భక్తి,గమ్యం,వైరాగ్యం,తత్త్వం,ముక్తి ఐదు అంశాలను సమపాళ్ళలో నింపి ఇతిహాసాల స్థాయితో తీర్చిదిద్దాడు.విష్ణుమూర్తి తో మూడుజన్మల వైరం కోరుకున్న హిరణ్యాక్షుడిని యజ్ఞావరాహస్వామి అవతారంలో కేశవుడు
సంహరిస్తాడు అసందర్భంగా అంత్యక్రియలు చేయటానికి పూనుకున్న హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన తల్లి దితికి జీవితము కర్మఫలాల గురించి వివరించిన అంశాలలో సప్తమ స్కంధములో సుయజ్ఞోపాఖ్యానం చేర్చాడు.

సుయజ్ఞుడు ఉశీ నగరానికి రాజు.తెలివిగలవాడు,యుద్ధ విద్యలలో నైపుణ్యం గలవాడు.కీర్తి ప్రతిష్టలు కలవాడు.రాజులకు యుద్ధాలు,గెలుపు ఓటములు సహజములు.ఎన్నో సంగ్రామాలలో విజయం సాధించినప్పటికీ ఒక బలహీన క్షణాన యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.దేహము తునాతునకలై పోతుంది.రత్నకిరీటం ముక్కలౌతుంది.ఆభరణాలు అక్కడక్కడా పడిపోతాయి.కనుగడ్లు పైకి వస్తాయి.చెవులు తెగిపోతాయి.పెదవులు రక్తసిక్తమైపోతాయి.అందమైన ముఖం అనామకమై చిన్నాభిన్నమై వికారమై భయంకరమై చూడలేకుండా పోతుంది.ఈవిషయం తెలిసి భార్యలు చెప్పలేనంతగా ఏడుస్తుంటారు.వాళ్ళ విలాపానికి బండలు కూడా కరుగుతాయా అనిపిస్తుంది.అతడు బ్రతికిన కాలంలో చేసిన మంచి పనులను వేనోళ్ళ పొగుడుతుంటారు.రాజ్యంలోని ప్రజలు దురదృష్టవంతులని మంచి మహారాజును కోల్పోయారని సానుభూతి వచనాలు వినపడుతాయి.
ఇదంతా గమనించి
యమధర్మరాజు చిన్నపిల్లవాని రూపంలో వచ్చి ఆత్మజ్ఞానం బోధించి
వైరాగ్యం వల్ల కలిగే ఆత్మ శాంతిని వివరించటమే ఈ కథలో ముఖ్యవిషయం.

కథగురించి విచారిస్తే హిరణ్యకశిపుడి ద్వార తల్లి దితికి పదహారు శ్లోకాలలో
ఆత్మజ్ఞానం బోధిస్తూ యమధర్మరాజు నోట
ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్భౌతిక మీయతే గృహమ్ యథౌదకైఃపార్థివ తైజసైర్జనః కాలేనజాతో వికృతో వినశ్యతి
అంటూ ఇరవై మూడు శ్లోకాలో శరీరానికి ఆత్మకు మధ్య ఉండే సంబంధాన్ని వేదవ్యాసమహర్షి సంస్కృత మహాభాగవతం లో వివరిస్తారు.ఇదే అంశాన్ని తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు

నీరాగారనివిష్టపాంథులక్రియన్ అంటూ నలభై పద్యాల్లో సుయజ్ఞోపాఖ్యానంలో ఆత్మజ్ఞానం వివరించారు.దీనిలో తొలుత హిరణ్యకశిపుడు తల్లి దితికి , తర్వాత బాలుని రూపంలో యమధర్మరాజు సుయజ్ఞుని భార్యలకు చెప్పిన పరోక్ష కథనాలద్వారా ఆత్మజ్ఞానం వివరణ కన్పిస్తుంది.

హిరణ్యకశిపుడు తల్లి దితితో
అమ్మా!బాటసారులు దారిలో స్నేహం చేసి గమ్యం చేరగానే విడిపోతారు.జీవిత గమనమంతే.కర్మానుసారంగా పుట్టుక,మరణంతో కాయం మాయమవుతుంది.కాని ఆత్మ
వాసాంసిజీర్ణాని యథావిహాయ అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు తనువు వీడి మరో ఉపాధి లో ప్రవేశిస్తుంది.ఆత్మకు మరణంలేదు.శరీరములో ఉన్నంత వరకే సుఖదుఃఖాలు పొందుతుంది.నీరు కదలికలో మన ప్రతిబింబం తిరిగినట్లనిపిస్తుంది.కాని తిరుగదు.అట్లే విషయ వాసనల వలన తిరిగినదని భ్రమిస్తాము అదే ఆత్మ జ్ఞానం అంటు సుయజ్ఞునికథ చెబుతాడు.
సుయజ్ఞుని భార్యలు పరివారం ఏడుస్తున్న వేళ
దండధరుడు బాలుని రూపములో వస్తాడు.
చచ్చిన వాని కేడ్చెదరు చావున కొల్లక డాగ వచ్చునే యెచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్ అంటూ జననము,మరణము రాగ బంధాల నుండి విముక్తుడై మోక్షమార్గం మునకు తరలిపోయే ఆత్మ గురించి ఓపికతో వివరిస్తాడు.
సీసము పాంచ భౌతికమైన భవనంబు దేహంబు పురుషుడు దీనిలో బూర్వ కర్మ వశమున నొక వేళ వర్తించు దీపించు దఱియైన నొకవేళ దలగి పోవు జెడెనేని దేహంబు సెడుగాని పురుషుండు సెడ డాతనికినిం సేటు లేదు పురుషునికిని దేహ పుంజమునకు వేఱుగాని యేకత్వంబు గానరాదు ఆటవెలది దారువుల వెలుంగు దహనుని కైవడి గాయముల చరించు గాలి భంగి నాళలీనమైన నభము చాడ్పున వేఱు తెలియ వలయు దేహి దేహములకు ( పోతన భాగవతం సప్తమ స్కంధం 51 వ పద్యం)
అంటూ శరీరానికి ఆత్మకు దోస పండుకు తీగకు ఉన్నటువంటి బంధంగా విశ్లేషిస్తారు.తల్లిగర్భములోనున్నపుడు కాపాడింది భగవంతుడే.వాడేజీవులన్నింటినీ కాపాడుతాడు.తనలీల కొరకే సృష్టి,స్థితి,లయము చేస్తాడు‌.ఇది అతని బొమ్మలాట.కర్మ వలన జనన మరణములు కలుగును.ఆత్మకు అంటవు.దేహము,మట్టి,నీరు,తేజస్సు అనేవి పరిణామక్రమము.ఆత్మకు ఆకార వికారములు లేవు.ఆత్మ శరీరము వేరు.సుయజ్ఞుని కళేబరము మీ ముందరే ఉన్నది.అందులో ఉండాల్సిన వాడు లేడు.ఇంకా ఏడ్చు టేల?దేహము లోని ఇంద్రియా లన్నిటికి ప్రాణమే హేతువు.అది ఉంటేనే మాట్లాడుట,వినుట,కనుట.ప్రాణమే లేనిది ఇవేవీ సాధ్యము కాదు.ఆత్మ సర్వవ్యాపకము.ఆత్మశరీరమును త్యజించి పోతుంది.మాయా మోహములకు కష్ట నష్టములకు కర్మ బంధములే కారణము.అందుకే అశాశ్వతమైన శరీరము కొరకు ఏడ్చుట అజ్ఞానము. అంటూ యమ ధర్మరాజొక కథ చెబుతాడు.
ఒక అడవిలో బోయ వాడొకడు పక్షులకు యముని లాంటి వాడు.పిట్టల జంటకు ఎరపెట్టి వల పన్నుతాడు.ఆడపిట్ట వలలో చిక్కుకుంటుంది. దాన్ని విడిపించే శక్తి లేక మగపక్షి విలవిలలాడుతుంది.
పసి కూనలైన పిల్లల రక్షణ బాధ్యత తనకు గుర్తు వస్తుంది. ఈ విచారంలో జాగరుకత కోల్పోయిన మగపిట్టను బోయవాడు బాణంతో చంపుతాడు.భార్య గురించి విచారిస్తూ తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు.అందువల్ల సుయజ్ఞుని గురించి మీరెన్నేళ్ళు ఏడ్చినా తిరిగిరాడని బాలుడైన యముడు సముదాయించటంతో భార్యలు,పిల్లలు జ్ఞానులై సుయజ్ఞునికి కర్మకాండలు జరిపిస్తారు.గతంలో జరిగిన ఈ కథ తన కొడుకు హిరణ్యకశిపుని ద్వారా విన్న దితి,హిరణ్యాక్షుని భార్యలకు ఆత్మజ్ఞానం కలుగుతుంది.దుఃఖము నియంత్రించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.అందుకోసమే జ్ఞానంతో ఉన్నప్పుడే మానవత్వంతో జీవరాశికి సేవ,హరినామ స్మరణతో మోక్ష మార్గములో పయనించాలని మహా భాగవతములోని సుయజ్ఞోపాఖ్యానం లోకానికి మార్గదర్శనం చేస్తున్నది.

ఉపయుక్తగ్రంథసూచి:
1.వేదవ్యాసమహర్షి రచించిన శ్రీ మహాభాగవతం( సంస్కృతం-తెలుగులిపీ)గీతం ప్రెస్ గోరఖ్ పూర్ వారి ప్రచురణ
2.శ్రీమదాంధ్రమహాభాగవతము( బమ్మెరపోతనామాత్యప్రణీతము)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
3.డాక్టర్ దాశరథి రంగాచార్య రచన
భాగవతవ్యాఖ్యానం
1977ముద్రణ

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

వ్రజేంద్రా నందన

by Devulapalli Vijayalaxmi March 18, 2026
written by Devulapalli Vijayalaxmi

“చూడు దేవకి…వాసు నీ ఒక్కదానికే కాదు నాకూ కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలనేది నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. సౌమ్య…
నీ అన్నకూతురు అనే ఒక్కఅంశం తప్ప  ఎందులో వాసుగాడికి సరిపోతుంది చెప్పు? నీ మాట కాదన్నా నని తప్పుగా అనుకోకు. నాకు వాసుభవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు నీ మనోభావాలు అంటేఅంత గౌరవం. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నీ‌మాట ఏమిటో చెప్పు. నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది.” అన్నాడు భార్గవ. భర్త మాటలకు చిరాగ్గా తలతిప్పుకోబోయి గుమ్మందగ్గర ఏదో అలికిడి అవటంతో అటు తిరిగి చూసింది దేవకి.
ప్రొఫెసర్ రాధాదేవిని చూసి అలానే చేష్టలుడిగిపోయి సర్పద్రష్టలా నిలబడి పోయింది దేవకి.
అది గమనించిన భార్గవ, అవాక్కయి,ఆపై గుండెల్లో సన్నని మెలితిరుగుతూ నొప్పిరాగా, ” దేవకి….” అంటూ నేలకొరిగిపోయాడు.
                               ★★★
ప్రొఫెసర్ రాధాదేవి గంభీరంగా లోపలికివచ్చి “దేవకి!మంచినీళ్ళు తీసుకురా!” అంది.  
మరబొమ్మలా మంచినీళ్ళగ్లాసు తీసుకొచ్చిన దేవకి చేతిలోంచి రాధాదేవి గ్లాసుతీసుకుని వాసుని భార్గవని వడిలోకి తీసుకోమని , భార్గవ మొహాన నీళ్ళు చిలకరించింది. రాధాదేవి.
ఏమాత్రం ఊహించనిది. ఈవిధంగా మళ్ళీ రాధాదేవిని చూస్తాను,కలుస్తాను,అదీ తమఇంటిలో అని కలలో కూడా ఊహించలేదు దేవకి, భార్గవలు.
అంతా సవ్యంగా జరిగితే. వాసు పెళ్ళిచేసి సంఘంలో ఒక మంచితండ్రిగా నిలబడదామనుకున్నాడు. విధి ఆడిన వింతనాటకంలో  ఇప్పుడే తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని అదీ వాసువల్ల సంపాదించుకున్నాడు. ఫలితం చేతికందే సమయానికి ప్రొఫెసర్ రాధాదేవిరాక దేవకి, భార్గవలకి పచ్చి    వెలగపండు గొంతులో పడ్డట్టయింది.
                             ★★★
భార్గవ డా||వి.ఎస్.కృష్ణ కాలేజీలో  ఫిజిక్స్ లెక్చరర్ గా ఉండేవాడు. ప్రొఫెసర్ రాధాదేవి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. వృత్తిపరంగా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పుడూ భార్గవని, దేవకిని ఇంటికి టీకి పిలిచేది రాధాదేవి. కాలేజీ పిక్నిక్స్ కి కుటుంబాలతో వెళ్ళటంతో దేవకి రాధాదేవి తో చనువు ఏర్పడింది.
ఎంతో చలాకీగాఉండే దేవకి అప్పుడప్పుడూ దిగులుగా, పరధ్యానంగా ఉండటంచూసి, “ఎందుకు దేవకి? హఠాత్తుగా ఏదో కోల్పోయిన దానిలా ఉంటావు.” అంటూ గుచ్చి గుచ్చి అడిగింది రాధాదేవి.
“ఏమీ లేదండీ! అన్నీ ఉన్నాయి కాని ఆడదానిగా నాకు భగవంతుడు తల్లినయ్యే యోగ్యత ఇవ్వలేదు. ఎన్నోపరీక్షలు చేయించుకున్నా కానీ ‘అనోవ్యులేషన్’ అంటే అండాశయం విఫలం కారణంగా నాకు పిల్లలుపుట్టే అవకాశం లేదన్నారు. దానితో నాకు విడాకులిచ్చి మళ్ళీపెళ్ళి చేసుకోమని భార్గవ వైపు వారు బలవంతం చేస్తున్నారు.” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దేవకి.
ఈవిధంగా తన బాధను పంచుకుని మరింత సన్నిహితురాలయింది దేవకి రాధాదేవికి.
                         ★★★
చదువుకునే రోజుల్లో మాధవ్ అంటే ఎంతో ఇష్టపడింది రాధాదేవి. రాధాదేవి శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో ఐదుగురు సంతానంలో పెద్దాడపిల్ల.
మాధవ్ ఒక్కగానొక్క కొడుకు. కులంవేరు.
రాధాదేవి తల్లిదండ్రులకి మాధవ్ కులం అభ్యంతరం అయితే, మాధవ్ తల్లిదండ్రులకి రాధాదేవి అంతస్తు అభ్యంతరమైంది.
ఇరువురు ఇరుకుటుంబాలకి నచ్చచెప్ప ప్రయత్నించారు.
“ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి. ఇద్దరు మగపిల్లల్ని చదివించాలి. ఇంటికి  పెద్ద ఆడపిల్లవి నువ్వే తప్పటడుగు వేస్తే, నీ బాటలోనే అందరూ వెళ్తారు. చెల్లెళ్ళకు సంబంధాలు రావు. మత్స్యమాంసాదులు తినే అతనితో కాపురం సజావుగా ఉండదు. ఏ ఆలూమగలకైనా ఎంత ప్రేమ ఉన్నా భోజనం సరిగ్గా లేకపోతే ఆ మగాడు కేవలం ప్రేమని ఆస్వాదిస్తూ బ్రతుక లేడు. అలా అని నువ్వు అవి వండిపెట్టగలవా!”  అంటూ రాధాదేవికి అనునయంతో తండ్రి  ప్రభాకరశాస్త్రిగారు అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ప్రేమపెళ్ళిళ్ళు సాధారణంగా విఫలమవటానికి ముఖ్యంగా ఆహారవ్యవహారాలేనని ఎన్నో ఉదాహరణలు తెలిపారు.
అటు మాధవ్ తల్లిదండ్రులు మాధవ్ ను వారికి అనుకూలంగా నయాన్న భయాన్న లొంగదీసుకున్నారు.
చదువు పూర్తికాలేదు.ఉద్యోగం వస్తుందన్న ఆశలేదు..
జీవితం సినిమా కాదని ప్రస్తుతానికి తల్లిదండ్రులమాటవిని తనకాళ్ళమీద తాను నిలబడ్డాక రాధాదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు మాధవ్.
తండ్రి చెప్పిన మాటలు విన్న రాధాదేవి,”నాన్నా! మీరు నా చదువుకి అడ్డం చెప్పకుండా నేను చదువుకోవాలని అనుకున్నంతవరకూ చదివించండి.” అని ప్రాధేయపడింది.
దానికి ప్రభాకరశాస్త్రి రాధాదేవి తల నిమిరాడు ‘సరే’ అన్నట్లు.
ప్రభాకరశాస్త్రి కి మనస్సులో “అయ్యో ఏమీ అడగని నా చిట్టితల్లి అడిగినది కాదన్నానే!” అన్నబాధ, ఏదో తప్పుచేసానన్న భావన దహించి వేయసాగింది.
రాధాదేవి ఎమ్.ఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రభాకరశాస్త్రి భయపడుతూనే రాధాదేవి తో పెళ్ళి విషయం ప్రస్తావించాడు. తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఖచ్చితంగా చెప్పటంతో చేసేదిలేక రాధాదేవి చెల్లెళ్ళిద్దరికీ వివాహం చేసాడు.
మగపిల్లలిద్దరికి శాస్త్రోక్తంగా వడుగులు, పెళ్ళిళ్ళు చేసాడు.
తండ్రిగా పెద్దకూతురుకి అన్యాయం చేసానన్న బాధతో అనుక్షణం ఆలోచించి మాసివ్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. భర్త చాటు భార్య అయిన సుశీలమ్మ భర్తమరణంతో అయోమయ స్థితిలోకి వెళ్ళింది. పెట్టింది తినడం శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం,ఉలుకూ పలుకూ లేదు.
రాధాదేవి తమ్ముళ్ళిద్దరూ ఒకరు ఢిల్లీలో ఇంకొకరు కేరళాలో ఉద్యోగరీత్యా ఉన్నారు. తల్లిని తమతో ఉంచుకోవాలన్న ఆలోచన ఏమాత్రమూ లేదు.
పైగా పెళ్ళిపెటాకులు లేకుండా ఉన్నఅక్క చూసుకుంటుందిలే అన్న ధీమా.
జీవనస్రవంతిలో మరో మలుపు చోటుచేసుకుంది వారి కుటుంబంలో.
అందరికంటే చిన్నది అయిన చిన్న చెల్లెలు ప్రసవానికివచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బిడ్డని చూడటానికి వస్తున్న వాణి భర్త, విధివంచితుడై రోడ్ ఏక్సిడెంట్ లో అసువులుబాసాడు. ఆవార్తవిన్నపురిటాలు వాణి షాక్ లో కోమాలోకి వెళ్ళింది. వాణి భర్త ఒక్కడే సంతానం వారి తల్లిదండ్రులకు. కొడుకే పోయాక తమకు వారికి ఏసంబంధం లేదని వాణి అత్తమామలు చెప్పటంతో రాధాదేవికి ఏంచేయాలో పాలు పోలేదు. పెద్దచెల్లెలుని, తమ్ముళ్ళను బ్రతిమాలింది. ఎవరూ తాత్కాలికంగా  కూడా బిడ్డ బాధ్యత తీసుకునేందుకు సిధ్ధంగా లేకపోయారు.
ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో దేవకి, భార్గవలు గుర్తుకొచ్చారు. దేవకి, భార్గవలను పిలిచి  విషయం వివరించి “పిల్లవాడిని పెంచుకుంటారా!” అని అడిగింది రాధాదేవి.
అడగకుండానే వరాలిచ్చినంత సంతోషపడ్డారు దేవకి,భార్గవలు.తడుముకోకుండా వెంటనే అంగీకారం తెలిపారు.
పిల్లవాడికి ఆయే ఖర్చు తానేభరిస్తానని, పిల్లవాడి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తనకు తెలియకుండా తీసుకోవడానికి వీలులేదని ఒప్పందం కుదుర్చుకుంది రాధాదేవి. పసివాడికి  తానే వాసుదేవ్‌ అని నామకరణం చేసింది రాధాదేవి.
                            ★★★
రాధాదేవి ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ
కుటుంబంలో అనుకోని పరిణామాలకు మానసికంగా దెబ్బతిన్న రాధాదేవి మార్పుకోరింది. తల్లి కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు తను చెల్లి వాణి.
ఒకరాయివేద్దాం ఏమవుతుందో చూద్దాం మన్నట్టు కెలిఫోర్నియా  యూనివర్సిటీకి పి.హెచ్.డి కి అప్లై చేసింది. వెంటనే పి.హెచ్.డి లో సీటు వచ్చింది. చెల్లెలు వాణిని  కేరళాలో పెద్దతమ్ముడు వద్ద కేరళా వైద్యానికి ఉంచి తాను కెలిఫోర్నియాకి బయలుదేరింది రాధాదేవి.
వెళ్ళేముందు భార్గవని కలిసి పిల్లవాడికి ఎటువంటి లోపం రాకుండా ఒక ఇరవై లక్షలు బ్యాంకులో పిల్లవాడి పేరును డిపాజిట్ చేసి వాడిని బాగా చదివించాలని, డబ్బుకి వెనుకాడవద్ధని,తనతో కాంటాక్ట్ లో ఉండమని,వాడిని హయ్యర్ స్టడీస్ కి తనతో అమెరికా తీసుకెళ్తానని, వాడితో
తల్లిదండ్రులుగా వారు రావచ్చని చెప్పి కెలిఫోర్నియాకు ప్రయాణమైంది రాధాదేవి.
                               ★★★
  వాసురాకతో మోడుబారిన దేవకి, భార్గవల జీవితం కొత్తచిగురులు తొడిగింది. వారిజీవితంలో చైతన్యం వెల్లివిరిసింది. దేవకి ఎంతో అపురూపంగా పసివాడి ఆలనా పాలనా చూడసాగింది. కానీపిల్లవాడికి   బాటిల్ పాలు పట్టినప్పుడు దేవకి మాతృహృదయం తల్లడిల్లేది. వారి జీవితం వాసు రాకతో పరిపూర్ణత్వం సంతరించుకుంది.
రాధాదేవి ప్రతీ ఆదివారం వీడియోకాల్లో వాడి ఎదుగుదల చేష్టలు చూసి మురిసిపోయేది. వాసు ఐదవ పుట్టినరోజుకి రాధాదేవి ఇండియాకి వచ్చినప్పుడు వాసు కొత్త లేకుండా రాధాదేవి దగ్గరకు వెళ్ళాడు. అమ్మక్క అంటూ ఆవిడిచ్చిన బొమ్మలు, డ్రెస్సులతో వాసుకి రాధాదేవంటే మరింత ఇష్టం ఏర్పడింది. రాధాదేవి వెళ్తుంటే వెక్కివెక్కి ఏడ్చాడు తీసుకెళ్ళమని. వాడిని సముదాయించలేక  దేవకి సతమతమయ్యింది. రాను రాను వీడియో కాల్ చేసినప్పుడల్లా అమ్మక్క అంటూ కబుర్లు చెప్పటం.దా!దా! అనిపిలవడం దేవకి మనస్సులో రాధాదేవి అంటే ఈర్ష్య, ద్వేషం, భయం ఉత్పన్నం కాసాగింది. అదేవిషయం భర్త భార్గవతో అంది. భార్గవకి గూడా బిడ్డని తాము పెంచుతున్నా రాధాదేవి సూచనలు విసుగ్గా ఉండేది.
రానురాను రాధాదేవి వీడియో కాల్ చేసినప్పుడు ఎత్తకపోవటం, లేదంటే బయట ఉన్నాం తరువాత చేస్తామనటం, పిల్లవాడు పడుకున్నాడని కుంటిసాకులతో, పదిసార్లు చేస్తే ఒక్కసారి మాట్లాడుతూ మరో రెండేళ్లు గడిచాయి.
వాసుకి ఏడేళ్ళు వచ్చాయి. అన్నీ అర్ధమయ్యే వయసు. ఈవయసులో వాడికి రాధాదేవి కానీ వాడి జన్మమూలం కాని తెలియనివ్వకూడదనుకున్నారు దేవకి, భార్గవలు. వాసు వారికి భగవంతుడిచ్చిన మహాప్రసాదం.అది జారవిడుచుకునే ఆలోచన ఏమాత్రం లేదు.
                         ★★★
ముందు ప్రణాళికగా భార్గవ కాలేజికి రిజైన్ చేసాడు. లేని తల్లికి అనారోగ్యం, ఊళ్ళో తోటలు చూసుకోవాలన్న కారణం చెప్పి  స్నేహితులని నమ్మించాడు.
తరవాత ఫోనునంబరు మార్చి కొత్తసిమ్ కొత్తఫోను  తీసుకున్నాడు.
ఆతరువాత విశాఖపట్నం నించీ హైదరాబాదుకి మకాం మార్చి ఊరిలో కొంతతోట అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఒకవిల్లా కొన్నాడు.
భార్గవ ఎక్స్పీరియన్స్ కి చైతన్యగ్రూప్ఆఫ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాసుని ‘ఐ.జి.సి.ఎస్.ఇ’ సిలబస్ లో జాయిన్ చేసాడు.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
జన్మతః తెలివిగలవాడు అవటంతోను,భార్గవ
మార్గదర్శకత్వంతో  ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు.
బిట్స్ పిలాని  విద్యా విహార్  పిలాని రాజస్తాన్ లో  సీటు వచ్చింది. దానితో వాసు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది.
కాలం చిన్నప్పటి అమ్మక్కని మరుగున పడేసింది.వాసుదేవ్ కి లోకమంతా తల్లి దేవకి, తండ్రి భార్గవ. బాగా చదువుకో వాలి, పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే పట్టుదలతో చదువుకో సాగాడు.
                              ★★★
రాధాదేవి గత పన్నెండేళ్ళనించీ భార్గవ ఆచూకికోసం ప్రయత్నిస్తూనే ఉంది.ఒక సందర్భంలో పోలీసు కంప్లైంటు ఇద్దామనుకుంది. సహాయం చేసిన భార్గవగురించి తప్పుగా ఆలోచించటానికి మనస్కరించలేదు. దేవకి, భార్గవల మీద రాధాదేవికి ఎంతో నమ్మకం.పొరపాటునకూడా వారి మీద వ్యతిరేక భావన చూఛాయగా కూడా రాలేదు. ఎంతకీ భార్గవ  ఏకష్టంలో ఉన్నాడో అనిఆందోళన చెందేది. అలాఅని ఊరుకోకుండా తనకు తెలిసిన మార్గాల ద్వారా భార్గవ్ ఆచూకి తీస్తూనే ఉంది.
తమ్ముళ్ళు, పెద్దచెల్లెలు రాధాదేవిని తప్పుపట్టారు.
” పెళ్ళిపెటాకులు లేవు. తల్లిహృదయం ఏం తెలుస్తుంది? ముక్కుమొహం తెలియని వాడికి ఏదో వస్తువు అప్పచెప్పినట్లు పసిగుడ్డుని ధారాదత్తం చేసింది. ఆమాత్రం ఎవరమైనా పెంచలేక పోయేవాళ్ళమా!” అంటూంటే, ఈ మనుషులేనా ‘మా అత్తవారు ఒప్పుకోరు’ అని పెద్ద చెల్లెలు , ‘మీ మరదళ్ళ వల్లకాదు.’ అని తమ్ముళ్ళు అనటం వల్లనే కదా తాను అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వారి మాటలు శూలాల్లాతగిలి బాధపడింది రాధాదేవి.
రాధాదేవి మనస్సుకి ఎప్పటికైనా వాసు అజ్ఞాతవాసం నించీ తనకళ్ళబడతాడని బలమైన నమ్మకంతో ఉంది.
కెలిఫోర్నియా యూనివర్సిటీలో  “క్వాంటమ్ కంప్యూటింగ్”  మీద పి.హెచ్.డి లో గోల్డ్ మెడల్ సాధించింది రాధాదేవి.అదే యూనివర్సిటీలో పేరున్న ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నా నీలినీడలా వాసు కళ్ళముందు కనపడుతూ కంటికి కునుకు కరువైంది రాధాదేవికి. ‘ తనేం అనుకుంది? ఏంజరిగింది? జీవితంలో మధురిమని ఏ చెల్లెళ్ళు తమ్ముళ్ళగురించి త్యాగం చేసిందో వారే తనని దోషిగా నిలబెట్టారు.’ అని మధనపడని రోజులేదు.
                             ★★★
భగవంతుడు దయామయుడు.మనంచేసే ప్రతీపని వెనుక ఆయన హస్తం ఉంటుంది. ఆయన దృష్టిని ఎవరూ దాటిపోలేదు.
ఆరోజు కాఫీత్రాగుతూ లాప్టాప్ లో హిందూ పేపర్ చదువుతోంది రాధాదేవి. హఠాత్తుగా ఒక న్యూస్ కాలమ్ రాధాదేవిని ఆకర్షించింది.
“వాసుదేవ్ భాగవతుల ఈస్ టాప్ ఇన్ ఏస్ట్రోఫిజిక్స్ అండ్ కాస్మాలజీ ఎట్ బిట్స్ పిలాని. హి ఈస్ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ బిట్స్ పిలాని అండ్ ప్రౌడ్ సన్ ఆఫ్
భార్గవ్ భాగవతుల అండ్ దేవకి. మిస్టర్ భార్గవ ఫాదర్ ఆఫ్ వాసుదేవ్ భాగవతుల ఈస్ రెండరింగ్  హిస్ సర్వీసెస్ ఫర్ చైతన్యాకాలేజ్  ఏస్  ఫాకల్టీ ఇన్ ఫిజిక్స్.హార్టీ కంగ్రాట్యులేషన్స్.”
రాధాదేవి కళ్ళల్లోంచి కన్నీరు జలజలా కారింది. అది ఒక అద్వైత అనుభూతి.
తప్పిపోయిన బిడ్డ దొరికిన ఆనందం…….
పోగొట్టుకున్నానుకున్న పెన్నిధి దొరికిందనిసంతోషం..
వాసు ప్రయోజకుడయ్యాడన్న గర్వం…,
అమ్మక్క రక్తం వాడిలో ప్రవహిస్తోందన్న తృప్తి….
అంతలోనే ఆ ఆనందబాష్పాల ప్రకృతి మారిపోయి విషాదం నెలకొంది.
భార్గవ ఎందుకిలా చేసాడు?
ఎంతో నమ్మకంతో ఒక ప్రాణం లేని వస్తువుని కాదు, ఒక పెంపుడు జంతువునికాదు, తమ ఇంటి ప్రాణాన్ని తన చెల్లెలు బిడ్డని, తనకే హక్కు లేదు అయినా అనివార్య పరిస్థితిలో నమ్మి తాత్కాలికంగా పెంపకానికి ఇచ్చినందుకు ఇంత మోసం చేస్తాడా!
అంతలోనే రాధాదేవి వివేకం విచక్షణతో ఆలోచించసాగింది.
‘ఔను భార్గవకు తాను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పరాయి బిడ్డను తనదిగా చేసుకోవటమే కాక విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలపెట్టినందుకు తాను భార్గవకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు. పురిటిగుడ్డుని భార్గవ చేతిలో పెట్టిన తనకే ఇంత మమకారముంటే, పెంచి పెద్దచేసిన భార్గవ,దేవకిలకి ఇంకెంత ఉంటుంది. అనుకోకుండా దొరికిన అదృష్టం. చేయి జారిపోతుందేమోనన్న  భయాందోళనతో తన ఉనికిని మరుగునపెట్టాడు.గవర్నమెంటు ఉద్యోగానికి రాజీనామా చేసి అజ్ఞాతవాసంలో పిల్లవాడిని ఈ స్థాయికి తేవడం ఒక్కొక్కసారి కన్నతల్లితండ్రులకే సాధ్యంకాదు.’
ఆలోచనలకి విరామచిహ్నంపెట్టి వెంటనే రాజస్థాన్ పిలానికు ఫ్లైట్  బుక్ చేసుకుంది రాధాదేవి.
                         ★★★
యూనివర్సిటీలో అడుగుపెట్టిన రాధాదేవి వాసుదేవ్ భాగవతుల గురించి అడిగింది. తాను వాసుదేవ్ కి పెదతల్లినని గర్వంగా చెప్పుకుంది.
“కూర్చోండి మేడమ్..” అంటూ రాధాదేవికి లాంజ్ చూపించాడు.ఇప్పుడే కబురు పెడతాను అంటూ బాయ్ ని పంపాడు.‌
గెస్ట్స్ లాంజ్ లో అడుగుపెడుతూనే, ‘ఎవరై ఉంటారు తనగురించి ఇక్కడికి వచ్చేవారు? అమ్మా నాన్నా అయితే కాదు.’ అనుకుంటూ అడుగుపెట్టిన వాసుకి జ్ఞాపకాల పొరలో అట్టడుగున నీడలాంటి ఒక ఆకారం స్ఫురించింది.
అస్పష్టంగా, ‘ అ….మ్మ …క్కా….’ అన్నాడు.
కట్టలుత్రెంచుకొచ్చిన దుఃఖాతిశయంతో నిలువెత్తు వాసుని సంకోచించకుండా కావలించుకుని వాసు గుండెలమీద సేద తీర్చుకుంది రాధాదేవి.
“ఇన్నాళ్ళు ఏమయ్యావు అమ్మక్కా? నీ గురించి  అమ్మనాన్నని అడిగితే తెలియదన్నారు.
ఇండియాలో లేవన్నారు. క్రమేపి నేనుకూడా నిన్ను జ్ఞాపకాల అడుగు పొరల్లో ఖననం చేసాను.న అమ్మక్కా!” అన్నాడు వాసు.
“వాసు నేను డైరక్ట్ గా ఎయిర్పోర్ట్ నించీ ఇక్కడికి వచ్చా ఇక్కడ దగ్గరలో హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా! రూముకివెళ్ళిఫ్రష్ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. పన్నెండేళ్ళు గా ఒంటరిగా నేననుభవిస్తున్న మానసిక క్షోభ నీకు చెప్పుకుని నా హృదయం భారాన్ని  తగ్గించుకోవాలిరా కన్నా!”          
అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాధాదేవి.
వాసుకి అంతా అయోమయంగా ఉంది. ‘ఎందుకు అమ్మక్క ఇంత ఉద్వేగంగా మాట్లాడుతోంది? ఇన్నేళ్ళ తరువాత….’
” సరే అమ్మక్కా! నేను రేపు హైదరాబాద్ వెళ్ళటానికి హాస్టల్ రూము ఖాళీ చేద్దామనుకున్నా. రూము లాక్ చేసి వస్తా.”అంటూ వెళ్ళాడు.
                             ★★★
బ్రేక్ఫాస్ట్ అయ్యాక నెమ్మదిగా, ” వాసూ నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి.నేను చెప్పే విషయాన్ని అన్ని కోణాల్నించి ఆలోచించగల వ్యక్తిత్వం నీకుందని తెలుసు. ఇందులో నాతప్పుంటే నాకు నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి సిధ్ధంగా ఉన్నా తండ్రీ!”  అంది రాధాదేవి.
“అదేమిటి అమ్మక్కా! పెద్దదానివి నిన్ను శిక్షించటమేమిటి?”అంటూ రాధాదేవి చేయిపట్టుకున్నాడు.
రాధాదేవి పూసగుచ్చినట్లు వాసు పుట్టటం,అప్పటి పరిస్థితుల్లో తనకు మంచిదనిపించిన నిర్ణయం తీసుకోవటం,తరువాత దేవకి, భార్గవలు ఏవిధంగా తనతో సంప్రదింపులు కోల్పోయారో చెప్పింది. ఒకానొక సందర్భంలో పోలీసు కేసుపెట్టి ఎంక్వయిరీ చేయిద్దామనుకొని వారిని బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నట్లు చెప్పింది.
ఈ పన్నెండేళ్ళు బంధువులతో తాను పడ్డమాటలు వాసుతో  చెప్పి ఊపిరి పీల్చుకుంది రాధాదేవి.
ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత గభాల్న వాసు రాధాదేవి కాళ్ళదగ్గర కూర్చొని వళ్ళోతల పెట్టుకుని తనివి తీరా ఏడ్చాడు.
“అమ్మ ఎలావుంటుంది? అమ్మ ఇప్పుడెలా ఉంది‌. నువ్వు ఆ సాహసం చేయకపోతే నేనెలా ఉండేవాడినో!  నేనెంత అదృష్టవంతుడివి.అందరికీ ఒక అమ్మ అయితే నాకు ముగురమ్మలు.అమ్మక్కా!ముందు అమ్మని చూడాలి.తర్వాత హైదరాబాద్ వెళ్దాం అంటూ కేరళాకు టిక్కట్లు బుక్ చేసాడు వాసుదేవ్.
                              ★★★
తల్లి,తండ్రితప్ప బంధువులుఎవరూలేరని ఉదాసీనంగా గడిపిన వాసు మనసు అందరినీ కలవాలని ఉవ్వీళ్ళూరింది.
‘మొదటి సారి తనను నవమాసాలు మోసికన్న కన్నతల్లిని చూడబోతున్నాడు.తల్లిని కనిపెట్టుకుని ఉన్న మేనమామని కలువ బోతున్నాను.’ ఆ ఆలోచనే ఎంతో ఉద్వేగంగా ఉంది అనుకున్నాడు వాసు.
గుమ్మంలో అడుగుపెట్టిన వాసు విరబూసిన మల్లె కుదుళ్ళమధ్య పసిపిల్లలాంటి అమాయకమైన మల్లెపూవులాంటి స్వచ్ఛమైన కన్నతల్లిని చూసాడు.
“అమ్మా!”అంటూ కాళ్ళకి నమస్కరించాడు వాసు.
నిర్వికారంగా నిశ్చలంగా ఉన్న వాణి లో ఏదో చలనం. వాసు వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
“నేనమ్మా!నీ బిడ్డని.” అంటూ వడిలో తల పెట్టుకున్నాడు వాసు.
అప్రయత్నంగా తలమీద చేయుంచింది వాణి.
అ దృశ్యం ‘శతమానం భవతి ‘ అని తల్లి వేద ఆశీర్వచనం చేస్తున్నట్లుంది.
మేనమామ కృష్ణమోహన్ కధనం ప్రకారం తన పనులు తాను చేసుకునే స్థాయికి తేగలిచారు గాని మెదడుకు తగిలిన షాక్ నించీ ఇంకా కోలుకోలేదని,ఎవరూ గుర్తులేరని తెలిపాడు.ఆమె లోకం ఆమెది. ఆకలిదప్పులు ఏమీ తెలియవని,తామేమైనా తినమని ఇస్తే తింటుంది. లేకపోతే లేదని కృష్ణమోహన్ వాసుకి రాధాదేవికి చెప్పాడు.
ప్రస్తుతం వాణి ఎమ్నీషీయాలో ఉందని డాక్టర్లు నిర్ధారించారని తెలిపాడు కృష్ణమోహన్‌.
“మావయ్యా ‘ఎమెన్షియా’, ‘డిమెన్షియా అంత ప్రమాదకరమైనది కాదు. నాకెందుకో అమ్మని కొంతవరకూ మామూలు పరిస్థితికి తేవచ్చుననిపిస్తోంది.”అన్నాడు వాసు.
“వాసు చెప్పింది నిజమే రా! నువ్వు కష్టపడి దాన్ని ఈ స్థాయికి తెచ్చావు. నేను చెల్లాయిని నాతో పాటే అమెరికా తీసికెళ్ళి  వైద్యం చేయిస్తా.అన్నట్లు వాసు ఇంతవాడవటానికి కారణమైన దేవకి భార్గవలకి మనమెంతో ఋణపడి ఉన్నాం. ముందు మనం హైదరాబాదు వెళ్దామని ముగ్గురూ కలిసి హైదరాబాదు వచ్చారు.
    .      ‌‌.               ★★★
ముందుగా ప్రొఫెసర్ రాధాదేవిని, ప్రక్కనేవాసు, కృష్ణమోహన్ లను చూసిన దేవకి సర్పద్రష్టలా నిలబడిపోయింది.
అది గమనించిన భార్గవ అవాక్కయి సన్నగా గుండె నొప్పితో నేలకొరిగాడు.
“నాన్నా!” అంటూ ఒక్కో ఉదుటున వాసు భార్గవని పొదివి పట్టుకోగా, రాధాదేవి మొహంమీద నీళ్ళు చిలకరించింది.
కళ్ళు తెరిచిన భార్గవ రాధాదెవి కళ్ళలో కళ్ళుపెట్టి చూడలేక దోషిగా తలవంచుకున్నాడు.
ఆపరిస్థితులల్లో దేవకి, భార్గవి ని చూసిన రాధాదేవి వాసుకి కనుసైగ చేసింది. వెంటనే ఒక్క ఉదుటున తల్లిని(దేవకిని) పట్టి ఊపుతూ, “అమ్మా నాకు గోల్డ్ మెడల్ వచ్చిందమ్మా.ఇదంతా మీ ఆశీర్వాదం.” అంటూ దేవకి, భార్గవ కాళ్ళకి నమస్కరించాడు. న్యూస్ పేపర్లో వారిద్దరి పేర్లు చూపించాడు.
“ఎప్పటికీ నేను మీ వాసునే నాన్నా! అందరికీ ఒకే తల్లి.నాకు ముగ్గురు తల్లులు. ఒకరు కన్నతల్లి అయితే ఇంకొకరు మమతానురాగాలు తో పెంచిన తల్లి.మరొకరు నా దశదిశ నిర్దేశించిన తల్లి. ఇంతటి అదృష్టం ఎవరికుంటుంది?” అన్నాడువాసు కంఠం భావోద్వేగంతో పూడుకుపోగా.
భార్గవ మీభయం నాకర్ధం అయ్యింది. మీరు అమితమైన ప్రేమతో చేసిన తప్పు మిమ్మల్ని దోషిని చేయదు.మీరు వాసుని ఇంతటి ప్రయోజకుడిగా చేయటానికి వెనుక మీ ఆలుమగల కృషి అభినందనీయం. మీరు వాసుని ఎంతప్రేమిస్తున్నారన్నది మీరు గవర్నమెంట్ కాలేజీకి రాజీనామా చేయటంలో తెలుస్తోంది.” అంటూ భార్గవని భయం నించీ బయటకుతేవటానికి ప్రయత్నించింది రాధాదేవి.
“కన్నతల్లి కన్నబిడ్డను గుర్తించలేని దుస్థితిలో ఉన్నప్పుడు మీరెందుకు భయపడతారు భార్గవ గారు.” అన్నాడు కృష్ణమోహన్ నిర్లిప్తంగా.
దేవకి అందరికీ కాఫీ కలుపుకొని తెచ్చింది.వాసు అందరికీ కాఫీ ఇచ్చాడు.
“రాధాదేవి గారు మీది ఎంతో విశాలహృదయం‌. ఎంతో సంస్కార వంతులు కాబట్టి నా తప్పుని నిలదీసి అడగాల్సిన సందర్భంలో సహితం నాకు మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీరు గొప్ప మనస్సుతో క్షమించినా, అది అందుకునే అర్హత నాకు లేదని నా అంతరంగం చెపుతోంది.
వాసు మీవైపు మొగ్గు తున్నాడని, మీరు వీడియోకాల్ చేసినప్పుడు వాడి కళ్ళలో ఆనందం చూసి ఈర్ష్య పడ్డాం.మీకాల్ గురించి వాడు ఎదురు చూడటం,ఆతరువాత వాడు నీగురించి పేచీ పెట్టటంతో వాడు మాకు దూరమౌతున్నాడన్న భయంతో ఈ విధంగా ఫోన్ నెంబరు మార్చటం. మా ఉనికిని గోప్యంగా ఉంచడానికి ఇలా ఇక్కడ సెటిల్ అయ్యాం. కానీ సూర్యుడిని అరచేతితో మూయలేమని ఇప్పుడే తెలుసుకున్నాం.ఇన్నాళ్ళు బిడ్డలు లేని మాకు మాతృత్వపు, పితృత్వపు మధురిమలు ఆస్వాదించడానికి అవకాశం కల్పించిన ఆ భగవంతునికి అవకాశమిచ్చిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.దేవకి కి జన్మించిన కృష్ణుడు యశోదతనయుడుగా నందయశోదలకు ప్రేమ అనే అమృతాన్ని పంచాడు. కానీ శాశ్వతంగాలేడు‌అలాగే ఈ వాసుదేవ్ ఈ నందయశోదలకు తన అమృతం తుల్యమైన ప్రేమను పంచి మమ్మల్ని సమ్మోహితుల్ని చేసాడు.దానికి మాకు గర్వంగా ఉంది.ఇక ముందు ప్రయాణానికి రాధాదేవిగారికి సంతోషంగా అప్ప చెప్తున్నాం.” అంటూ వాసు చేతిని రాధాదేవి చేతిలో పెట్టిన నమస్కరించారు దేవకి,భార్గవలు.
రాధాదేవి తో కన్నతల్లి వాణిని తీసుకుని పై చదువులకి అమెరికాకి ప్రయాణమయ్యాడు వాసుదేవ్.
గుండెలనిండా ప్రేమతో మనస్పూర్తిగా ఆశీర్వదించారు వాసుని దేవకి, భార్గవలు.
                            ★★★
“దేవకీ! దేవకీ!” అంటూ హడావుడిగా వంటింట్లోకి వచ్చాడు భార్గవ.
“ఏమిటండీ ఆ గావుకేకలు!”  అని కసురుకుంది.రాధ.
“కేకలేంటి మైకు పెట్టుకుని అరుస్తా! మన వాసు భార్గవ. ఎమ్.ఎస్ పూర్తి అయింది.కెలిఫోర్నియా యూనివర్సిటీలోనే టాపర్. అమెరికన్ గవర్నమెంటు వారి స్వంత ఖర్చుతో వాడికి సర్దార్ ఎడ్యుకేషన్ కి బాధ్యతవహిస్తోంది.
మనల్ని గ్రాడ్యుయేషన్ డేకి రమ్మని  ప్రయాణానికి కావలసిన ఫ్లైట్ టికట్టుతో  కావలసిన డాక్యుమెంట్స్ పంపించాడు మన వాసు.” అంటూ దేవకిని గిరగిరాతిప్పి ఆనందభాష్బాలు రాల్చాడు భార్గవ.
వాసు మ…న… బి…డ్డే…నండీ అంటూ అస్పష్టంగా గొణిగింది దేవకి.
                         శుభం.
                                                .సమాప్తం

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వేకువ పాట

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు January 31, 2026
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

లావైన చేతిగడియారం లాగా
ప్రేమ నీ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది
నర్సు నీ అరిపాదాల మీద దెబ్బ వేయగానే
నీ బోసికేక పంచభూతాల్లో చేరింది

నీ రాకను పొగడుతూ
మా గొంతుకలు ప్రతిధ్వనిస్తాయి
అదొక కొత్త ప్రతిమ.
గాలితెమ్మెరలు నిండిన మ్యూజియంలో
నీ నగ్నత్వం మా క్షేమం వెన్నంటి నడుస్తుంది
గోడల లాగా చుట్టూ ఖాళీగా నిలబడతాం మేము

గాలివాటుకు స్వీయ ప్రతిబింబం
తుడుచుకుపోయేలా చేసే
మేఘపు అద్దంకన్న గొప్ప తల్లిని కాను నేను

రాత్రంతా పెద్ద పెద్ద గులాబీల మధ్య ఉండే
కీటకపు రెక్కల లాగా
నీ శ్వాస రెపరెపలాడుతుంది
దాన్ని వినేందుకు నేను నిద్రలోంచి లేస్తాను
దూరంలోని సముద్రమొకటి
నా చెవి దగ్గరికి చేరుతుంది

స్థూలకాయంతో నైట్ గౌనులో ఉన్న నేను
నీ ఒక్క కేకకు మంచం మీంచి కింద పడతాను
నీ నోరు నిర్మలమైన పిల్లినోరులాగా తెరుచుకుంటుంది
కిటికీ చట్రం కాంతితో వెలిగి,
మసకబారిన నక్షత్రాలను మింగేస్తుంది
ఇక నువ్వు కొన్ని మాటలను
మాట్లాడేందుకు ప్రయత్నిస్తావు
స్పష్టమైన అచ్చు స్వరాలు
బెలూన్ల లాగా పైకి లేస్తాయి

ఆంగ్లమూలం: సిల్వియా ప్లాత్

January 31, 2026 64 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • సంఘర్షణ
  • ఓడి గెలిచే కలల స్నేహం
  • శాలువా విలువెంత ?
  • జాగ్రత్త మహిళా..!
  • వైజ్ఞానికం వందే జగద్గురుం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us