మహిళలు వంటగదిని దాటి ఇప్పుడు ఉద్యోగాలలోకి వస్తున్నారు కానీ మొన్నమొన్నటి వరకు ఆ పరిస్థితి లేదు.అంతకుముందు వాళ్లకు అసలు చదువే లేదు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చి ఆడపిల్లలను చదువుకొమ్మనే దాకా మనవాళ్లకు ఆ ధ్యాసే లేదు.ఒకవేళ తెగించి ఎవరైనా చదువుదామని ప్రయత్నం చేస్తే మన సమాజంలోని చాందసులు గగ్గోలు పెట్టేవారు. ఆడపిల్లల చదువుకోసం జ్యోతిరావు ఫూలే దంపతులు ఎలాంటి కృషి చేశారో అందరికీ తెలుసు. వారికి అడుగడుగునా అడ్డుపడింది ఎవరో కూడా తెలుసు. ఆ వర్గం వారి కుట్రల ఫలితంగానే భారత దేశంలోని మహిళలు వందలేళ్ళుగా బానిసలుగా బతుకీడుస్తున్నారు.మహిళలు ఇంటిగడప దాటి బయటకు రావటమే మహాపాపంగా అభివర్ణించారు పండితులు.తమకున్న పాండిత్యంతో సమాజాన్ని ప్రభావితం చేసి మహిళలను అన్నిరకాలుగా అణిచివేశారు.ఈ అణిచివేత మొన్నమొన్నటి వరకు నిరాఘాటంగా కొనసాగింది.ఇప్పటికీ చాలా ఇళ్లలో ఇది అనధికారికంగా కొనసాగుతున్నది.ఈ కుట్రల రాజకీయానికి ఒక అందమైన పేరున్నది. అదే’పితృస్వామ్య వ్యవస్థ’.దీన్ని ‘పురుషస్వామ్య వ్యవస్థ’అని కూడా పిలుస్తున్నాం.మగవాడి ఆధిపత్యం నడిచే వ్యవస్థ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.మన సమాజాన్ని పరిశీలించినా, సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలించినా మగవాడి ఆధిపత్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది.ఈ ఆధిపత్యం కారణంగానే మహిళలు ఇప్పటివరకు అన్నిరంగాలలో మగవాళ్ళతో సమానంగా ముందుకు వెళ్లలేకపోయారు. ఇటీవలి కాలంలో ఆధునికత కేవలం చదువులోనే కాకుండా జీవితంలో కూడా చేరిపోయిన కారణంగా, మహిళలు తమ హక్కుల కోసం రాజ్యాంగ బద్ధమైన పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో వారి భాగస్వామ్యాన్ని సమాజం కొంత అయిష్టంగానైనా సరే ఆమోదించే పరిస్థితి వచ్చింది. దేనివెనుక పెద్ద చరిత్రనే ఉంది.స్థూలంగా చెప్పాలంటే 1975 నాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుకు వచ్చిన చైతన్యంలోనుంచి మహిళలు గొంతువిప్పటం ప్రారంభించారు.1980 తర్వాత స్త్రీల చైతన్య ధార స్త్రీవాదంగా రూపొందింది.

స్త్రీవాదం తెచ్చిన చైతన్యంతో స్త్రీలు చరిత్రలో తమ స్థానం గురించి రకరకాల కోణాల్లో పరిశోధనలు ప్రారంభించారు.ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యాన్ని స్త్రీ వాదం నుంచి రూపొందిన నూతన పరికరాలతో చూడటం ప్రారంభించారు. ప్రాచీన సాహిత్యాన్ని కూడా స్త్రీవాద దృక్పథంతో పరిశీలించటం మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే ప్రసిద్ధ రచయితలు కాత్యాయని విద్మహే,కె. ఎన్. మల్లీశ్వరి పూనుకొని ప్రాచీన సాహిత్యంలో తమ భాగస్వామ్యం ఉన్నప్పటికీ పురుషాధిక్యత కారణంగా మరుగున పడిపోయిన కవయిత్రులను వెలికి తీసి వారిని చరిత్రలో నిలిపే ప్రయత్నం చేశారు. చరిత్రను పరిశోధించి తెలుగులో రాసిన 18 మందితో పాటు, తెలుగువాళ్లే అయినప్పటికీ ప్రాకృతంలో,సంస్కృతంలో రచనలు చేసిన 22 మంది ప్రాచీన కవయిత్రులను “ప్రాచీన తెలుగు కవయిత్రులు”పేరుతో వేసిన పుస్తకంలో పరిచయం చేశారు.ఇది’ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’తరుపున వెలువడిన వ్యాస సంకలనం.
ముందే చెప్పినట్టు మహిళలు కాబట్టి వీళ్ల గురించి చరిత్రలో దొరికే ఆధారాలు తక్కువ.ఎందుకంటే ప్రాచీన కాలంలో మహిళలకు విద్యాహక్కు లేదు.శూద్రులతో పాటుగా బ్రాహ్మణ మహిళలకు కూడా విద్య నిరాకరింపబడింది. చదివితే తమతో సమానమవుతారనే స్వార్ధంతో నాటి పండితులు ధర్మ శాస్త్రాల ఉటంకింపులు చూపిస్తూ మహిళలను అన్నిరకాలుగా అణచివేశారు. ప్రాచీన కాలంలో కవిత్వం రాసిన కవయిత్రులందరూ ధిక్కార స్వభావం కలిగినవాళ్ళు.ఆనాటి ఆచారాలను ధిక్కరించి,పితృస్వామ్య భావజాలాన్ని ఎదిరించి చదువుకోవటమే కాకుండా కవిత్వం చెప్పగల స్థాయికి చేరటమంటే మామూలు విషయం కాదు.ఈ క్రమమంతా పండిత వర్గ భావజాలానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి సహజంగానే వారి గురించి సమాచారాన్ని తొక్కిపెట్టే అవకాశం ఉంది.అందుకే ప్రాచీనకాలంలో పురుష కవుల రచనలు గానీ వివరాలు గానీ లభ్యమైనంత సులభంగా కవయిత్రుల రచనలు గానీ వివరాలు గానీ లభించటం లేదు. సాహిత్య చరిత్రలు విస్మరించిన ఇటువంటి కవయిత్రులను వెలుగులోకి తీసుకురావడానికి ఈ పరిశోధకులు ఎంత ఎంత కష్టపడ్డారో?
ఇందులో కవయిత్రులను పరిచయం చేస్తూ కాత్యాయని గారు కొన్ని, మల్లీశ్వరి గారు కొన్ని వ్యాసాలు రాశారు. అయితే ఆ వ్యాసాలు సాహిత్య చరిత్ర నమూనాలో కేవలం వివరాలు చెప్పటానికే పరిమితం కాలేదు. సందర్భానుసారంగా ఆ కవయిత్రులు పితృస్వామ్య వ్యవస్థ రూపొందించిన చట్రంలోనుంచి మాట్లాడారా లేదా దానికి వ్యతిరేకంగా నిరసన పూర్వకమైన స్వరాన్ని వినిపించారా అన్న విషయాన్ని నిర్ధారిస్తూ వ్యాఖ్యానించారు.కుప్పాంబికను పరిచయం చేసే వ్యాసంలో “కుప్పాంబిక పద్యం ఒక శారీరక స్పృహ కలిగినటువంటి స్త్రీ యొక్క అంతరంగాన్ని, ఆంతరంగిక ఉద్వేగాన్ని వ్యక్తీకరించటంలో ఒక మలుపు”అని చెప్తూ చానమ్మ, ప్రోలమ్మల పద్యాలతో ఎలా పోల్చి చూడవచ్చో చెప్పారు.”ఖడ్గ తిక్కనను ఆడవాళ్లతో పోల్చటం ద్వారా అవమానపరిచాం అనుకున్నారు.అందులో తమను తాము కించపరచుకుంటున్నాం అన్న స్పృహ వాళ్లకు లేదు” అన్న విశ్లేషణతో చానమ్మ, ప్రోలమ్మలు ఆనాటి సమాజం నిర్దేశించిన చట్రంలో ఎలా ఒదిగిపోయారో వివరించారు.ఇలా కవయిత్రులను కేవలం వారి రచనల పట్టికలతో మాత్రమే పరిచయం చేయకుండా వారివారి వ్యక్తిత్వాలలోని వైవిధ్యాన్ని విమర్శా దృష్టితో పరిశీలన చేయటం ద్వారా ఈ పుస్తకాన్ని భావి పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా మలిచినట్లైంది.
ఇప్పటివరకు కేవలం కవయిత్రులను గురించి వచ్చిన సాహిత్య చరిత్రలు తెలుగులో రెండే ఉన్నాయి. అందులో ఒకటి ఆండ్ర శేషగిరిరావు రాసిన”ఆంధ్ర విదుషీమణులు”,మరొకటి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ రాసిన”ఆంధ్ర కవయిత్రులు”.వీటితో పాటు విడివిడి వ్యాసాల సందర్భంగా అక్కడక్కడా ప్రస్తావనకు వచ్చిన కవయిత్రుల తగుమాత్ర సమాచారం మినహా ఈ విషయంలో జరిగిన పెద్ద కృషి లేదు. వీటిలో కూడా రకరకాల కారణాలవల్ల,ముఖ్యంగా సమాచార లేమి వల్ల అందరూ చేరకపోవటం ఒక చిన్న వెలితి.దానిని పూరిస్తూ ఇప్పటివరకు నమోదైన అందరితోపాటు కొత్తవారిని కలుపుకొని వచ్చిన సమగ్ర సాహిత్య చరిత్ర ఇది.రచయిత్రుల మాటల్లో చెప్పాలంటే”అనేక పరిమితుల మధ్య ఇప్పటికి ఇది ప్రాచీన తెలుగు కవయిత్రులకు సంబంధించిన సమగ్ర సాహిత్య సమీక్షా రచన”.
ఈ సాహిత్య చరిత్రను మునుపటి రచనలకంటే సమగ్రం చేయటానికి వారు చాలా శ్రమ పడవలసి వచ్చింది. సమకాలీన సాహిత్య చరిత్ర రాయటం వనరుల లభ్యత దృష్ట్యా పెద్ద కష్టమైన పని కాదు. కానీ ప్రాచీన కవుల అందునా కవయిత్రుల చరిత్ర రాయటం నిజంగా కష్ట సాధ్యమైన పని. ఆ కష్టాన్ని వారు ఇలా చెప్పుకున్నారు.”చెలికాని చెల్లాయమ్మ గురించి ఏక వాక్య సమాచారాన్ని అందిపుచ్చుకుని ఆమె గురించి తెలుసుకోగలిగాము. అన్నదానం వెంకటాంబ, శిరిగంబూరు అన్నపూర్ణమ్మ వంటి కొత్తవాళ్లను పరిచయం చేసుకోగలిగాము.కృష్ణాజమ్మ గురించి ఇంకొన్ని వివరాలు సేకరించగలిగాము. బాల పాపాంబ,బలభద్ర దాసి, దార్ల సుందరమ్మ, మదిన సుభద్రయ్యమ్మ మొదలైన వాళ్ళ సాహిత్యాన్ని సంపాదించి విశ్లేషణలు మొదలుపెట్టాం. తెలుగు వాళ్లే అయి సంస్కృతంలో రాసిన కవయిత్రులను గురించి కూడా చదవటం చెప్పటం వలన తెలుగు స్త్రీల బహుముఖ ప్రజ్ఞను మొత్తంగా అర్థం చేసుకునే అవకాశం దొరికింది”.ఈ మాటల వల్ల ఈ సాహిత్య చరిత్ర నిర్మాణ క్రమం ఎంత పకడ్బందీగా జరిగిందో తెలుస్తుంది.
ముందే చెప్పినట్టు ఇది కేవలం సాహిత్య చరిత్ర పరిధిలోకి వచ్చే లక్షణాలతో సాగిన రచన కాదు.ఆయా కవయిత్రుల కవిత్వ సమీక్ష ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది.ఆయా సమాజాలలో కవయిత్రులుగా నిలబడటం దగ్గరినుంచి వారి జీవిత నేపథ్యం,అలాగే కవిత్వ నేపథ్యం వారి రచనలను ఎలా ప్రభావితం చేశాయో లాంటి కీలకమైన అంశాల ప్రస్తావన దాకా సాగిన ఈ సాహిత్య పరామర్శ విమర్శా లక్షణాలను పుణికి పుచ్చుకున్న సాహిత్య చరిత్రగా అవతరించింది. ఇట్లాంటి కృషి సాహిత్య చరిత్ర రచనలో ఏర్పడిన ఖాళీలను పూరించడానికి బాగా పనికి వస్తుంది. భవిష్యత్తులో ఇతర సమూహాల ప్రాచీనతను దేవులాడటానికి కూడా ఈ కృషి ఒక ఆదర్శంగా నిలుస్తుంది.






