మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ప్రశ్నే ప్రస్థానం..

by mayuukha July 28, 2026
written by mayuukha

తొలుస్తున్న మెదడులోంచి
పుట్టిన బాణం ప్రశ్న
గిరగిరా తిప్పి విసిరే ఒడిసెలరాయే ప్రశ్న
సమాధానానిదేముంది,
కుక్కపిల్లలా తోకూపుకుంటూ వచ్చి
వాలుతుంది..!

ప్రశ్నే..
మనిషికి తొలి చలనం
ఎందుకు? అనే జిజ్ఞాస లోంచే
విజ్ఞాన చంద్రికలు ఉదయించినయ్
ఆపిల్ కిందే ఎందుకు పడిందని
న్యూటన్ ప్రశ్నించకపోతే..
గురుత్వాకర్షణ ఇంకెన్ని రోజులు చెట్టుకిందే పడి ఉండేదో!?
దుఃఖానికి కారణమేమిటి.!?
అని సిద్ధార్థుడు ప్రశ్నించకపోతే బుద్ధుడు ప్రపంచానికి దొరికేవాడా?
ఎందుకు మనిషికి మనిషి అంటరాని వాడు..!?
అని అంబేద్కర్ ప్రశ్నించకపోతే సమానత్వం రాజ్యాంగ పుటల్లో మొలకెత్తేదా!?
ఎందుకు స్త్రీ బానిస? అని సావిత్రీ బాయి ఫూలే ప్రశ్నించకపోతే
ఈ రోజు నా కలలకు అక్షరాల వెలుగు చేరేదా?

ప్రశ్న అంటే ఎదుటివాడిని ఓడించడం కాదు..
నిజాన్ని గెలిపించడం.
ప్రశ్న అంటే మూఢనమ్మకానికి నీళ్ళొదిలి
హేతుబద్ధంగా ఆలోచించడం
ప్రశ్న అంటే చీకటి గదిలో కిటికీ తెరవడం..
ప్రశ్నించని మనిషి నడిచే రాతిబొమ్మ
శ్వాసించే బానిస..!
ప్రశ్నించని సమాజం నిశ్శబ్ద సమాధి
అది ఎప్పటికీ స్థబ్దంగా ఉండిపోతుంది..!

అందుకే.. నేను
పిల్లలకు పాఠంతో పాటూ..
ఎందుకు, ఏమిటి, ఎప్పుడూ, ఎట్లా అని
అడగడం నేర్పించాను
రేపటి సమాజం చైతన్యంగా ఉండాలని చిరు ఆశ.
పౌరులు..”ఎందుకు, ఎట్లా..”?
అని అడగడం మానేసిన రోజు ప్రజాస్వామ్యం
శవపేటిక ఎక్కుతుంది..!
పాలనలోనూ ప్రశ్న ఉండాలి.!
ప్రతి ఓటులోనూ ప్రశ్న ఉండాలి.

అయితే ఒక్క మాట..!
ప్రశ్న కత్తిలా కోయకూడదు..దీపంలా వెలిగించాలి.
ప్రశ్న అవమానించడానికి కాదు,
అవగాహన పెంచడానికి.
ప్రశ్న గాయపరచడానికి కాదు,
గమ్యం చూపించడానికి.
ఎందుకంటే..
ప్రశ్నే పురోగతికి మొదటి అడుగు
ప్రశ్నే విప్లవానికి ఉనికి
ప్రశ్నే స్వేచ్ఛకు తొలి ఊపిరి..!

సమాధానాలతో చరిత్ర ముగుస్తుంది..
ప్రశ్నలతోనే కొత్త చరిత్ర మొదలవుతుంది..!
ప్రశ్నలు పుట్టిన చోటే జ్ఞానం
మొలుస్తుంది,
జ్ఞానం మొలిచిన చోటే స్వేచ్ఛ
పుష్పిస్తుంది.
ప్రశ్నించే పెదవుల్ని మూయించవచ్చు..
ప్రశ్నించే ఆలోచనను మాత్రం ఎవరూ బంధించలేరు.

July 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అందరిలో తానూ

by K. Bhanuja July 28, 2026
written by K. Bhanuja

నిర్ణయాలు తనవి కావు
మనోవేదననే తనది
అడుగు ఎప్పుడూ అందరికోసమే
అందులో తనుందో లేదో
సందేహాలు తనవే
సతమతమయ్యేది తానే
ఏదో అడ్డు అధిగమించేలోపే
మరోవైపు కి నెట్టేస్తారు

అంతా మారుతుంది మళ్ళీ
మొదటి నుండి ఇలా ఎన్నిసార్లో
తన ప్రయాణం ఆగిన చోటల్లా
అర్థం చేసుకుంటూ సాగుతున్న
ఆశయాలు, అందరిలో
అందరివైపే మొగ్గు చూపుతుంది
మనిషిగా చచ్చిపోయినా
అందరి మనసులో నిలిచి పోవాలనే తపన
గుర్తిస్తారేమోనే ఆశ
మిగులుతుంది ఆశగానే

July 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

వెతకకండి

by Vijaya Kandala July 28, 2026
written by Vijaya Kandala

మా అత్తగారితో లేకుండా ఉన్నాను . ఎప్పుడు ఏదో గొణుగుతూ విసుక్కుంటూ ఉంటుంది  . ఇం ట్లో ఉండాలంటే ముళ్ళ మీద ఉన్నట్టు ఉంది  ,అన్నది మా సుశీల మొన్న ఇంటికి వచ్చినప్పుడు  .సుశీల మామగారు పోయి ఏడాది అయింది  .అప్పటినుంచి అత్తగారు సుశీల దగ్గరే ఉంటుంది  .
విసుక్కోవడం కొనుక్కోవడం నీ మీదనా లేక మరెవరి మీద నన్నా  మొదట్లో నా మీదే అనుకున్నాను  .చూడగా చూడగా ఎవరిమీద కాదేమో అనిపిస్తుంది  .24 గంటలు మూత పడదు గదాఆ  నోరు  . ఇంటి పని పాటల్లో సాయం చేస్తుందా నీకు అని అడిగాను తిరిగి  .అలాంటి వాటికి తడుముకో నక్కరలేదు పిల్లల పని  ,వంట పని అన్ని ఆవిడే చూసుకుంటుంది  .ఆవిడొచ్చింది నాకు పని తేలికైన మాట నిజమే కానీ  ,ఆ గునుగు మటుకు భరించలేకుండా ఉన్నాను  .నీ మీద కాదు కదా అది  .ఆమె స్వభావమే ఉండవచ్చు విననట్టు ఊరుకో రాదా అని సలహా ఇచ్చాను .
ఏమో బాబు ఆ గుణ గుడు తో ఆవిడ మీద ఉండే గౌరవం పోతుంది  .సుశీలా  మనుషుల్లో అన్నీ మంచి గుణాలే కావాలి  ,మనుషులంతా లోపరహితులై ఉండాలి అనుకోవడం  ,అందరాని పండ్లకు ఆశించడం లాంటిది  .మనకి ఇబ్బంది కలగని వి మనకి అ పకారం చేయనివి అయిన గుణాలు ఇతరుల్లో ఉంటే  ,వాటిని గురించి ఒకటికి పది సార్లు అనుకుని అవతల వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతాం  . అది తప్పు కదా.

మా సుశీల మాటే చూడండి అన్ని పనులు ఇ ట్టే  చేస్తుంటే సుఖ పడక  ,ఆ ద్వేషించడం ఎందుకు చెప్పండి . ప్రేమించడం కంటే ద్వేషించడం తేలిక  .సుశీల అత్తగారి లో ఉన్న గొణుగుడు సుశీలకి ఏమాత్రం ఇబ్బంది కలిగించేది కాదు .అసలు సుశీల ఆ గొణుగుడు గురించి ఆలోచించడం మా నేసి అత్తగారి లోని ఇతర మంచి గుణాలు చూసి ప్రేమించడం నేర్చుకుంటే ఎంతో సుఖపడుతుంది  . జీ వితంలో సుఖపడాలి  ,చుట్టూ ఉన్న వారిని సుఖ పెట్టాలి అనుకుంటే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి  . అం టే చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి  .వారి సుగుణాన్ని , లోపాన్ని ఒకే దృష్టితో తీసుకొని అవతలి వారిని అర్థం చేసుకోవడం మొదలు పెడితే చాలా హాయిగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది  .అవతల మనిషిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే     .హృ దయ వైశాల్యం పెరిగి మన అంతరాంతరాలలో  ఉన్న అసూయ  ,క్రోధం  ,ద్వేషం లాంటి భావాలు మాయమైపోతాయి.
ఎప్పుడు రుస రుస లాడే మనిషి కూడా కొన్ని కొన్ని క్షణాలలో మనసారా నవ్వకుండా ఉండలేడు  .ఇలాంటి క్షణాలు కల్పించడం లోనే ఉంది మన చాకచక్యం  .ఆఫీసులో ఉన్న అరడజనుమంది ఉద్యోగి ను లలో మేరీని చూస్తే అందరికీ హడల్  .మేరీ ఎప్పుడైనా నవ్విందా  అని అనుమానంగా ఉండేది  .మేరీ ని అందరూ పులి అని పిలుస్తుండేవారు .
ఆఫీస్ లో  కొత్తగా జాయిన్ అయిన జానకి మాత్రం మేరీ తో చాలా చనువుగా నవ్వుతూ మాట్లాడుతుండేది  .అసలు జానకి రాకతో మేరీ నవ్వడం నేర్చుకుంది  .జానకిని ఎవరో అడిగారు మేరీ తో స్నేహం ఎలా చేస్తున్నావు అని  .మొదట్లో మీరు చెప్పినట్టే మేరీ పులి అనుకున్నాను . పదేపదే పలకరించడంతో అసలు మేరీ పులి కాదు మేక పిల్లఅని  తేలింది  .మేరీ అంత మంచి మనిషి కు ఇంతవరకు కనపడలేదు  .మేరీ ని అర్థం చేసుకునే అంత ఓపిక లేక పోయిందిఅందరికీ  . నాకు అందరూ నవ్వుతూ ఆనందంగా ఉండాలనిపిస్తుంది  .మీరు కూడామేరీ నవ్వుతుంది గమనించారా . అందరూ జానకి లాగా నవ్వుతూ చుట్టూ ఉన్న మనుషుల్ని నవ్విస్తూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే జీవితం ఎంతో హాయిగా ఉంటుంది .
మనుషులలో అన్ని సద్గుణాలు కావాలి  ,దుర్గుణాలు వద్దు అంటే లాభం లేదు  .వెలుగునీడలలా  మానవులలో మంచి చెడు రెండూ ఉంటాయి . ఈ రెండింటితో మనం మనుషుల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తేనే ఆనందం  .ముందు మీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి  ,వాళ్ళ మిమ్మల్ని నమ్మేట్టు  చేసుకుంటే అబద్దాలు  ,పాపాలు చాలా మటుకు తగ్గిపోతాయి . ప్రతి నూతన పరిచయాన్ని  పదిలంగా చూసుకోవాలి      .కొత్త వాళ్ళని కలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తూ  ,వారిని అర్థం చేసుకునేందుకు మీ హృదయం తెరిచి ఉంచుకోవాలి  .ఒంటరి  జీవితంలో   నైరాశ్యం చోటు చేసుకుంటుంది . అనుభవాలు ఎక్కువైన కొద్దీ భిన్న ప్రవృత్తులు గల వారిని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. అంటే మీ భావ ప్రపంచం కూడా విస్తరిస్తుంది . వారి మీద ద్వేషానికి బదులు అనుభూతి కలుగుతుంది  .సూర్యోదయం ఎలా కొత్త దో అలాగే ప్రతి కొత్త పరిచయం జీవితానికి నూతన వెలుగు ఇచ్చేటట్టు చేసుకోవడం మనలో ఉంది  .అంటే సానుభూతితో అర్థం చేసుకుని ప్రేమించాలి  .అందరినీ  ద్వేషిస్తూ  పోతే ప్రేమించడానికి ఎవరు మిగలరు .

July 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పాటల బృందావనం

by mayuukha July 28, 2026
written by mayuukha

మళ్ళీ ఎప్పుడు పుడుతుందో ఈ గాత్రం….సంగీతం పరవశించింది ఈమె గళం లో….సప్తస్వరాలు తమ జన్మ ధన్యమైందని మురిసి పోయాయి ఈ మహా గాయని కంఠం లో….పదిహేడు భాషల పాటలు ఈమె గాత్రాన్ని అని నిత్యం స్తుతించాయి….అమ్మా జానకమ్మ ఏమి వ్రాయగలను నీ గురించి …ఒక సంగీత అభిమాని ఆయుష్షు లో ఒక్కో సంవత్సరం ఆయుష్షు ను తీసి భగవంతుడు నీకు ఇచ్చి ఇంకా కొన్నేళ్ళు మి మ్ముల్ని ఈ భూమి మీద ఉండేలా చేయలేకపోయాడా ఆ దేవుడు…..విధి ఎంత కర్కశ మయినది..
మంచి సంగీతానికి రాళ్ళు కరిగి పోతాయని అంటారు….మా అమ్మ జానకమ్మ కంఠం లోని ఏ పాటకయినా రాళ్ళు కాదు గుట్టలు కూడా అంతకన్నా కఠినమైన మనిషి గుండె కూడా కరిగి పోతుంది……50 వేల కు పైగా పాటలు ఎంత పుణ్యం చేసుకున్నాయో ….అమ్మా జానకొమ్మా సామ వేదం నీకు నమస్కరిస్తుంది…గంధర్వ లోకం నిన్ను ప్రతి నిత్యం కీర్తిస్తుంది….మా తరం లో నీ పాట వినిపించినందుకు మేము ధన్యులమే….మా తరం కళ్ళకి అమృత తుల్యమైన గళం గల నీ రూపం కన్నులారా చూసినందుకు మేము చరితార్థులం తల్లీ …ఇవే నీకు మా వేల వేల ప్రణామాలు
అమ్మా జానకమ్మ త్యాగరాజ కీర్తనల తో మా మనసు లను రంజింప జేశావు..అన్నమయ్య కీర్తనలతో మమ్ముల్ని పులకింప జేశావు….. మధుర సినీ గీతాలతో మాకు మధురాలు భూతుల్ని అందించావు…
ఏ పాట ను విన్నా జానకమ్మ….మళ్ళీ మళ్ళీ వినాలనిపించే లా వుంటాయి నీ ఆణిముత్యాలు…. తాన్ సేన్ అనే సంగీత విద్వాంసుడు ద్రుపద రాగం లో పాట ను వినిపిస్తే గుడిలో గంటలు మ్రోగేవి అని అది కళ్ళారా చూసిన అక్బర్ చక్రవర్తి ఆ సంగీత విద్వాంసుణ్ణి తన ఆస్థాన పండితునిగా నియమించు కున్నాడని చరిత్ర లో ఉంది….ఆ విషయం ఏమో గాని మా జానకమ్మ పాట దేవుడే వచ్చి పాట విని వెళ్లిపోతాడు..

గాన గంధర్వుడి ని చిన్న పిల్లాడి లా చూస్తూ వీడు చిలిపి చిలిపి పిల్లోడు అల్లరి బాలుడు అంటూనే ఎన్ని మధుర మైన పాటల్ని ఆ అల్లరి బాలుని తో మాకు అందించావు జానకమ్మ…..ఎంత చెప్పనమ్మా నీ ఘనతను..ఆకాశం దాటింది నీకీర్తి….అష్ట దిక్కులకు ఆవల కు వెళ్ళి పోయిందమ్మ నీ ఖ్యాతి..
ప్రళయ కాలం లో ఆకాశం భూమి సూర్యచంద్రులు ఏమీ ఉండవట….అంతా జలమయమై వుంటుంది….అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏడాది బాలుడు గా వట పత్ర శాయి యై (మర్రి ఆకు పై) తన కుడి కాలు బొటన వేలు ను నోటిలో పెట్టుకుని ఆడుతూ వుండగా అప్పుడు సనక సనందన (వీరికి మరణం లేదు) మునులు స్తుతించగా స్వామి దివ్య తేజము కలిగి విష్ణు రూపుడై శివ బ్రహ్మ లను సృష్టించి అప్పుడు సృష్టిని ప్రారంభిస్తాడని విష్ణు పురాణం చెప్తున్నది…మా జానకమ్మ గళం లోని ఈ పాట ను వినినట్లయితే ఆ విష్ణువు బాలుడిగా మారి సృష్టిని మరచి పోయి ఊయల లో ఊగుతూనే ఉంటాడు…….అది మా జానకమ్మ సంగీత ప్రతిభ…
ఈ పాట మైకం లో పరమ శివుడు పార్వతిని కూడా మరచి పోతాడు…. ప్రళయ కాలం లో లయకారుడు తాండవం చేయగా అంతా లయమై పోతుంది……ప్రళయ కాల రుద్రుడు నిర్నిదృడై చేసే తాండవ సమయం లో మా జానకమ్మ పాట వింటే తాండవం ఆపి ధ్యానం లో ఉండవలసిందే…అప్పుడు ఏ జీవికి మరణం ఉండదు…..కైలాసం కూడా విడిచి పాట కోసం పరుగులు తీయవలసిందే……ప్రమాద గణాలు కూడా సర్వమూ మరచి పాటలో లీనమై పోవాల్సిందే….అమ్మా జానకమ్మ నువ్వు మా తెలుగు నెలలో జన్మించడం మా తెలుగు భాష అదృష్టం…..కొంత కాలం కరీం నగర్ జిల్లా సిరిసిల్ల లో ఉన్నావంటా….ఆ నగరం ఎంత పునీతురాలు అయిందో…..నీవు జన్మించిన పల్లపట్ల గ్రామం ఎంత అదృష్ట వంతురాలు….ఎప్పుడూ నవ్వుతూనే సామ వేదాన్ని ఔపాసన పట్టి ఆ రసాన్ని సంగీతాభిమానులకు పంచినావు జానకమ్మ…ఆ రసాన్ని రోజూ చవి చూస్తున్న మేము ఎంతో ధన్యులం అయ్యాము..
బృందావన విహారి రాధా సమేతుడై యమునా తీరం లో తన వేణువు తో మోహన రాగం లో రాగాన్ని ఆలపించగా రాదా దేవి ధ్యాన నిమగ్నురాలై ఐహిక ఆముష్మిక సుఖ భోగాలను వదిలి కృష్ణుడిలో కలిసి పోతుందని కృష్ణ చరితం ఒక మాట..ఇక్కడ కృష్ణుడు భగవంతుడు ….రాదా దేవి జీవుడు…మోహన రాగం అనేది జీవుడు దేవుని కై చేసే స్తుతి…… కాని మా జానకమ్మ పాడిన ప్రతి పాట అది పాట కాదు ఒక స్తుతి…. అంతే కాదు ఒక్కో వేద మంత్రం…..కృష్ణుని మోహన రాగం వేణువు అన్నీ కూడా మా జానకమ్మ రాగం ముందు ఎంత…ఆమె పాట విన్న ప్రతి చోటు బృందావనమే…

July 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-

by mayuukha May 31, 2026
written by mayuukha

సంపాదకీయం-
” ఎన్నికలు- యువతరం”- డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్

కవితలు –

  1. మనసుతో మాట్లాడుతున్నాను – కందాళై రాఘవాచార్యులు
  2. పరమ ధర్మం
    -రమాదేవి నెల్లుట్ల
    3.మినీ కవితలు
  • లక్కరాజు నిర్మల
    4.మానవత్వమా నీ చిరునామా ఎక్కడ?
  • అరుణా పరంధాములు
    5.శాంతి విలువ. – డాక్టర్ కె. గీత
  1. మార్పు కోసం నా అక్షరాలు. – మంజుల పత్తిపాటి. 7. ఆణిముత్యాలు. – రాధికా సూరి.
    8.ఆడవారం. – – R.భాగ్య లక్ష్మి,టీచర్ డి. పి. యస్
    9.భాషా సుందరి. – పద్మశ్రీ చెన్నోజ్వల 10 మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ 11. తేట తెనుగు. – రాధికా సూరి 12. ఇల్లంతా ఇల్లాలు. – గడ్డం సులోచన 13. గుండె నిండిన స్వప్నాలు. – కేశిరాజు వేంకట ప్రభాకర్
    14కవి చివరి చరణం. – కె. ఎస్. అనంతాచార్య, కరీంనగర్
    15మనసుతో మాట్లాడుతున్నాను. – కందాళై రాఘవాచార్య

కథలు –
1 . సమాధి పూలు

  • హుమాయూన్ సంఘీర్
    2.నిష్కామ కర్మ
  • డాక్టర్ మజ్జి భారతి
    3.అనుబంధం
  • నామని సుజనా దేవి
    4 ప్రేమ ఖరీదు – తాటికోల పద్మావతి
  1. మౌన లోకం డా. వరిగొండ సత్య సురేఖ.
    6.కొత్త ప్రపంచం. – లక్ష్మీ మదన్. 7. స్నేహం. -వరలక్ష్మి యనమండ్ర , హైదరాబాద్. 8. ఆమె నా కావ్య నాయిక.
  • పద్మావతి నీలంరాజు. 9. బోనె పెట్టె. – తాతా కామేశ్వరి. 10. నాన్న డైరీ – కట్టెకోల విద్యుల్లత 11. మనకు మనమే. – మాధవపెద్ది ఉష , హైదరాబాద్
  1. సడి చేయని చప్పట్లు. – రోహిణి సత్య , బెంగళూరు 13. గిల్టు నగ – లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
    14నమ్మకం- మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల. 15. మనోరంజకం- శ్యామదాసి 16 గతమెంతో ఘనము. – భవానీ కృష్ణ మూర్తి

వ్యాసాలు –

  1. మన తెలుగు నాటకాలు
  • సమ్మెట విజయ
    2 శాంతి ఓటమి కాదు! మానవ విజయం. – రంగరాజు పద్మజ. 3.కాలభైరవాష్టమి ప్రాధాన్యత- విశ్వనియమాలు – లక్కరాజు నిర్మల
    4.సెలవంటూ నింగికెగిసిన గంభీర స్వరం- టేకులపల్లి గోపాల రెడ్డి. – రాధికా సూరి.
    5.తరిగొండ వెంగమాంబ. – విజయా రంగనాథమ్
    6చరిత్రకెక్కని శత్రుఘ్నులు. – పద్మశ్రీ చెన్నోజ్వల. 7. కవిత్వాస్వాదన- ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు – ” గుండు రమణయ్య- ‘ అమ్మ‘ కవితా విశ్లేషణ- సందినేని నరేందర్
    8బాల సాహిత్యం – వర్తమానం- భవిష్యత్తు. – బండి ఉష , ఖమ్మం 9. సురవరం ప్రతాపరెడ్డి. – గడ్డం సులోచ , హైదరాబాద్
    10 . రక్త చరిత్ర – విజయా రంగనాథమ్
    అనువాద సాహిత్యం –
    11ఉన్నత చదువుల శిఖరం. – డాక్టర్ బండ సరోజన 12 ఋగ్వేదపు స్త్రీ స్వరం- అపాల ఆత్రేయ – విజయ రంగనాథమ్ 13. పేరంటాలు. – విజయ కందాళ 14. ప్రాచీన సాహిత్యం లో మహిళా స్వరం – తోకల రాజేశం 15. జ్వలిత చేతనం : బాలలత మల్లవరపు. – రాధికా సూరి 16. అమెరికా లో ఒక అనుభవం. – చెందు పెండ్యాల 17. క్రైం చిత్రాల గీతాలలో- కావ్య విలువలు
  • డాక్టర్ వి. వి. రామారావు 18. కొత్త కోణాలు ఆవిష్కరించిన విమర్శకుడు. – అమ్మంగి వేణుగోపాల్. 19. అనుబంధాల లో మేనత్త. – ఎస్. స్వయం ప్రభ. 20. అనంతం- అద్భుత-అపూర్వం. – రామరాజు విశాలాక్షి 21. భ్రమలో – బంధం. – రంగరాజు పద్మజ 22. ఆధ్యాత్మిక భాస్కరుడు‘ ఆదిశంకరాచార్యులు‘. – కావ్య సుధ , హైదరాబాద్. 23 . ఆకాశానికి ఎగిసిన పాతకెరటం – చంద్రకళ దీకొండ, హైదరాబాద్

బాల సాహిత్యం. :-

  1. కష్టపడితే నే ఫలితం. – సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
  2. Animal Time – keyura kondapalli కేయూర కొండపల్లి. 3. బంగారు చేప – ఒద్దిరాజు మురళీధర్ రావు. 4. ఒక విందు. ,,. 5. నవ్వే రాణి. ,,. 6. ఒక పిల్ల పక్షి. ,,. 7. తెలివికల్ల చిన్న కోడి పుంజు – ఒద్దిరాజు మురళీధర్ రావు.
    అనువాద సాహిత్యం:-. 1. అన్వేషణ ( కాశ్మీరీ కథ – ధీబా నజీర్). – అనువాదం – చింతపట్ల సుదర్శన్ 2. వేటగాడు ( రష్యన్ మూలం అంతేనా చెహోవ్ ). ఆంగ్లం నుండి అనువాదం – ఎలనాగ

పుస్తక సమీక్షలు -. 1 . కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు- ” జన్య భారత ” సరికొత్త ప్రయాణం- నవల part 2 – మనోభిరామ్ నెల్లుట్ల

  • మయూఖ సంపాదకవర్గం
    2.కథా వచనానికి పద్య రూపం – గండవరం చంద్రశేఖర్ రావు మిత్ర లాభం పద్య కావ్యం. – కాంచనపల్లి గోవర్ధన్ రాజు. 3. కళింగ కథా జాడ పుస్తకం ఇది. – డాక్టర్ మజ్జి భారతి

మయూఖ ముఖాముఖి -.

  1. బహుముఖ ప్రజ్ఞాశాలి- నారుమంచి వేంకట అనంత కృష్ణ శర్మ గారి తో ముఖాముఖి.
    -అరుణా ధూళిపాళ 2. ఆమె కలం … ప్రార్థన కూడా…. ప్రబోధం కూడా – ప్రముఖ రచయిత్రి వీణారెడ్డి గారి తో ముఖాముఖి – రంగరాజు పద్మజ
  2. పాఠశాల గదిలో జీవిత పాఠాలు – తిరునగరి పద్మ తో ముఖాముఖి- రంగరాజు పద్మజ

ఇంద్ర ధనుస్సు:-

  1. ఆచంట హైమవతి గారు గానం చేసిన లలిత గీతాలు ( ఆడియో)
    2.Quiz Comptetion – by Indrani Nellutla
  2. ⁠అలాస్కా ప్రయాణం – ( ట్రావెలాగ్) – రంగరాజు శ్యామ్ సుందర్ రావు 4. మట్టిలో మాణిక్యం ఉడతా రామకృష్ణ – అచ్యుతుని రాజ్యశ్రీ
  3. ⁠⁠**_
May 31, 2026 204 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు

by Achanta Hymavthi May 31, 2026
written by Achanta Hymavthi
May 31, 2026 28 comments
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

ఎన్నికలు- యువతరం

by Kondapally Neeharini May 31, 2026
written by Kondapally Neeharini

రాజకీయాలు అత్యంత విలువైనవి. దేశ ఆర్థిక, స్వాతంత్ర్య, సామాజిక విలువలను పరిరక్షించుకోవడానికి, మనదైన పార్లమెంటరీ విధానం ఏర్పరచుకున్న దేశం మనది. ఒక ఇంటికి కుటుంబ పెద్ద రక్షణ ఎలాగో, ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఎలాగో, ఒక కళాశాలకు ఒక విశ్వవిద్యాలయానికి ప్రముఖులు ఎలాగో అట్లా దేశ పాలన విధానానికి ప్రధానమంత్రి అవసరం. ప్రధాని ఎవరు అని చర్చించుకోవడానికి ప్రజలు తప్పకుండా ముందుంటారు. అట్లాగే వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులను నిర్ణయించుకోవడానికి కూడా ప్రజలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు.

    ప్రజలు తెలియని తనంతో ఉంటారనుకోవడం ఒక భ్రమ. వాళ్ళ పరిశీలన అనుభవం చాలా గొప్పది. దీనికి ఉదాహరణగా ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలను కూడా తీసుకోవచ్చు. అప్పటినుంచి

తెలుసు వాళ్ళకి రాజకీయాలు ఎలా ఉంటాయని! ఇవన్నీ అనుభవాలు నేర్పిన పాఠాలు! ప్రజలను, ప్రత్యేకంగా యువతరాన్ని ఎప్పుడు విస్మరించవద్దు. యువతరం భావి భారత పౌరులు, కాబోయే నేతలు . ఎందరో తెలివైన వారే ఉంటారు కాబట్టి యువత గొప్ప పరిశీలనతో ఓట్లు వేస్తారు. ఇవాళ ఓటును వినియోగించుకునేప్పుడు వాళ్ళకన్నా ముందు తరం పెద్దలను ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి? రైతుల కోసం ఏ సహకారం అందిస్తోంది? బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఏ పథకాలను వేసి ఎట్ల నిర్వహణ చేస్తుంది? స్త్రీ ఉన్నతికి గవర్నమెంట్ ఎలాంటి  రూపకల్పన లు చేస్తున్నది అనేవి యువకులు చూడరు అనుకోవడం కూడా ఒక పెద్ద భ్రమనే. ఇవన్నీ ఈరోజు ఎన్నికల ద్వారా బహిర్గతమయ్యాయి. ఎంత ఆధునిక సాంకేతిక శాస్త్రీయ విధానాలు వచ్చి యాంత్రిక జీవనాన్ని తీసుకువస్తున్నా కూడా యువత ఇవి ఏవి  బయట విషయాలు పట్టించుకోవడం లేదు అని అనుకోకూడదు.

       ప్రజలు కూడా అంతే .. వస్తున్న సాంకేతిక సౌకర్యాలనుండి చాలానే లబ్ది పొందుతున్నారు

.ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ అనే ఒక మంత్రం… అరచేతిలో వైకుంఠం లాగా. ఈ సెల్ఫోన్ అనేది ఇక్కడ ఒక యంత్రం కాదు ఒక మంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలు చాలా తెలివిగా అయ్యారు. ఇవన్నీ మనకు సాక్షులు. జరుగుతున్న ఇదే చెప్తోంది ఇప్పుడు .

    జాతి మత కుల వివక్షలను ఎన్ని తీసుకువచ్చినా అసలు సిసలైన మానవీయ కోణం అనేది కూడా ఒకటి ఉంటుంది అని ఎవరూ మరవకూడదు. పరాజయాన్ని పొందిన రాజకీయ నాయకులు బాధతో రకరకాల అభిప్రాయాలను వ్యక్త పరుస్తారు. అవన్నీ సత్యాలు కావు. అలా అని మొత్తం అసత్యాలు కావు. అలాగే విజయపథంలో దూసుకుపోతున్న రథసారథులు కూడా అంతే వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఎటువంటి ధైర్యాన్ని ఉసిగొల్పాలో అటువంటి మాటలను మాట్లాడడానికి ఏమాత్రం వెనుకాడరు. ఎక్కడైనా నిజాలు అబద్ధాలు రెండు బహు  పాత్రలు  వహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా భారత దేశ రాజకీయ సామాజిక చరిత్రలో తప్పకుండా మార్పులను తీసుకువస్తాయి. ఈ మార్పుల ఫలితమే ఈరోజు ఎన్నికలు.

     ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవడానికి కారణం వాళ్ళ అసమర్థతనే!  ఎన్నికల ముందు ప్రచార హోరులో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే! ఇవన్నీ గమనించిన ప్రజలే కదా ఓట్లు వేసేది? అందుకే హామీలు ఇచ్చే ముందు శక్తి సామర్థ్యాలను ఒకటికి పది సార్లు చర్చించుకుని ఆలోచించుకుని గట్టి నిర్ణయం తీసుకొని బయటపెట్టాలి. అంతేకానీ గత పార్టీలు చేసిన దానికి మరికొంత జోడిస్తే మాకు గొప్పతనం వస్తుంది అని చెప్పి ఆ మాటలను తీర్చలేకపోతే మరోసారి వచ్చే ఎన్నికల్లో పర్యవసానం ఇలాగే ఉంటుంది. ఇది ఏ పార్టీ వాళ్ళకైనా… ఇప్పుడు గెలిచిన వాళ్లకైనా… భవిష్యత్తు అంతే! ఇదే సత్యం !! పారదర్శకత ఉండాలి పరిపాలనలో…. పట్టుదలతో సాధించాలి… ప్రజలకు చేరువగా ఉండాలి. ఇవి మూడు  ముఖ్యమైన విషయాలు. ప్రజలు కొత్త రాజకీయవేత్తలను కోరుకుంటున్నారు అని స్పష్టమైనది ఈసారి .

      ప్రసార మాధ్యమాలు ఎక్కువైన ఈ నేపథ్యంలో వెంట వెంట సమాచారాలను అందిస్తున్న ఈ పరిస్థితుల్లో పదేళ్ల పిల్లవాడికి కూడా రాజకీయాలు

అర్థమవుతున్నవి.

అయితే మంచి లేదా? రాజకీయ నాయకులందరూ చెడుబుద్ధి తోనే ఉన్నారా? లేదు లేదు..

కులమత రాజకీయాలను సృష్టించి బలపరిచి భయంకర రూపం దాల్చేలా చేసి ఈ రాజకీయాలు ఏ మార్గాలను అనుసరిస్తున్నాయో అర్థం కావడం లేదు

దేశం ఎటు పోతుందో అని వేద చెందుతున్నారు పాతతరం వాళ్ళు.

జెన్ జీ  తరం ఆవేశపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తూ ఆన్లైన్ లో అరాచకాలను సృష్టిస్తున్న ఈ వైనం నిజమైన  దేశభక్తులకు హృదయ వేదనం కలిగిస్తున్నది.

విచిత్రం ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయా దేశాల బాగు కోసం పాటుపడుతున్నారు. ఎక్కడో ఒకచోట వ్యతిరేకులు ఉంటారు. వాళ్ల ను అధిగమిస్తూ ముందుకు పోతున్నారు. కానీ,మనదేశంలో ఈ పరిస్థితులు లేవు .వీటికి భిన్నంగా ఉన్నాయి.  దేశం పురోభివృద్ధిని  సాధించటం మాట అటు ఉంచి ఉన్న తీరున ఉంటు సుభిక్షంగ ఉండడమే కావాలి. 

   యువతరం  రాజకీయాల లో  చురుకుగా

పాల్గొనాలంటే  ప్రపంచ  రాజకీయాల పై అవగాహన ఉండాలి.  చరిత్ర ను చదవాలి.  సర్వమత సౌభ్రాతృత్వ భావనలు అర్థం కావాలి  దీనికి  మనదేశ పు  పూర్వ  రాజకీయాల పట్ల అవగాహన అవసరం. ఆ రీతిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.  మన కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి ప్రపంచం కళ్ళతో మన దేశాన్ని చూడాలి అప్పుడే యువతరం దేశ రాజకీయాలపై బట్టలు ఇస్తుంది ఈ భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదిగే శక్తిగా తయారవుతారు.

    ఎలక్షన్ విధి విధానాలు తెలుసుకొని కళాశాల చదువుల నుండి విశ్వవిద్యాలయాల వరకూ,  పౌరుల హక్కుల పైనే కాదు బాధ్యత ఎంత అనేదీ తెలియాలి.  పార్లమెంట్,  లోక్ సభ సభ్యులకు ఉన్న  విధులేమిటో ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి.  పొలిటికల్ పార్టీల ఆవిర్భావాలు ఆచరణలు సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలలు కన్నా సాధించుకోగలరు సాధించుకోవాలన్న తపనతో కలలను కలగలరు , కలలను తీర్చుకొనగలరు.  ఎన్నికలు యవతను ఎన్నికలలో  కనమంటూ అంటుంటే వ్యక్తిత్వ వికాసానికి సమిష్టి 

వికాసాని కి వారధులుగా యంగర్ జనరేషన్  ఉండాలి. 

___***___

May 31, 2026 17 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మార్పు కోసం నా అక్షరాలు

by Manjula Pathipati May 31, 2026
written by Manjula Pathipati

నగరాల వెలుగుల్లో నీడలు పెరుగుతుంటే
గ్రామాల నిశ్శబ్దంలో బాధలు మోగుతుంటే
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

మనుషుల మధ్య గోడలు ఎత్తుగా పెరిగిన వేళ
మానవత్వం పుటల్లో మౌనం చేరిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

మద్యము మత్తుకి బానిసై కుటుంబ-
సభ్యులను రోడ్డుపైన పడేస్తున్న వేళ…
ఎండిన డొక్కలతో అన్నం కోసం ఎదురుచూసే నిరీక్షణ కళ్లలో కారం పొడి చల్లిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఉద్యోగ అవకాశం కోసం తలుపులు తట్టే ఆశల్లో
మన్ను కొట్టిన వేళ…
పేదల బాధలు రుధిర గీతాలై పాడిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ప్రకృతి కన్నీటి చుక్కలు నా సాహిత్య చేతి ద్వారా
సమాజ భవిష్యత్తును ప్రశ్నిస్తున్న వేళ…
నింకను పసిమొగ్గల నుండి ముసలి ముతక వరకు
అత్యాచారాలు చేస్తూ, దాడులు చేస్తున్న వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఒక్కసారి ఆలోచించండి…
ఒక్కసారి రేపటి ప్రపంచం కోసం ఆలోచించండి…

May 31, 2026 20 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

by mayuukha May 31, 2026
written by mayuukha

– మయూఖ ప్రత్యేక వ్యాసం

మహాభారతం అంటే కేవలం రాజుల కథ మాత్రమే కాదు, అది ఒక కాలం.. ఒక నాగరికత.. మరియు కొన్ని వేల సామాన్య జీవితాల సంఘర్షణ. ఈ సత్యాన్ని ఆధునిక పాఠకులకు పరిచయం చేస్తూ, మను (మనోభిరామ్) నెల్లుట్ల గారు రచించిన ‘జన్య భారత’ (Janya Bharata) సిరీస్ ఇప్పుడు చారిత్రక నవలా ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తోంది. మొదటి భాగం ‘The War’ తో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు రెండవ భాగం ‘The Deluge’ తో పతాక స్థాయికి చేరుకుంది. ఢిల్లీ వైర్ (Delhi Wire) ద్వారా ‘టాప్ 50 ఇన్ ఫ్లుయెన్షియల్ రైటర్స్’ లో ఒకరిగా గుర్తింపు పొందిన మను గారు, ఈ సిరీస్ ద్వారా ఇతిహాసాలను ఒక సరికొత్త దృక్కోణంలో ఆవిష్కరించారు

1. జన్య భారత: The War – సామాన్యుడి కళ్లలో కురుక్షేత్రం

మనం విన్న మహాభారతంలో అర్జునుడి గాండీవం, భీముడి గద గురించి వింటాం. కానీ, ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది సామాన్య సైనికుల మాటేమిటి?

ఈ సిరీస్‌లో మొదటి పుస్తకం ‘The War’, ‘ఉష్ట్రకర్ణిక’ (Ustrakarnika) అనే ఒక చిన్న తెగకు చెందిన మిత్రజిత్ (Mitrajit) అనే సామాన్యుడి చుట్టూ తిరుగుతుంది.

  • యుద్ధం వద్దు అనుకున్నవాడే యుద్ధంలోకి: మిత్రజిత్ తన భార్య, కూతురుతో ప్రశాంతంగా జీవించాలని కోరుకునే వ్యక్తి. కానీ, కృష్ణుడు రాయబారం విఫలమయ్యాక, పరిస్థితులు అతన్ని బలవంతంగా కురుక్షేత్రానికి లాగుతాయి.
  • భయం మరియు ధర్మం: ఒక సామాన్య తండ్రి, తన ధర్మాన్ని పాటించాలా లేక తన కుటుంబాన్ని రక్షించుకోవాలా? అనే మానసిక యుద్ధాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించింది.
  • కొత్త కోణం: రాజుల అహంకారం కోసం సామాన్యులు ఎలా బలైపోయారో ఈ పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

2. జన్య భారత: The Deluge – ద్వారక పతనం మరియు ఒక యుగాంతం

మొదటి భాగం యుద్ధాన్ని వర్ణిస్తే, రెండవ భాగం ‘The Deluge’ (ద డెల్యూజ్) ఆ యుద్ధం మిగిల్చిన శూన్యాన్ని, మరియు ఊహించని ప్రకృతి ప్రళయాన్ని వివరిస్తుంది.

ఈ పుస్తకంలోని ప్రధాన ఆకర్షణలు:

  • మునిగిపోయిన స్వర్ణం – ద్వారక: కృష్ణుడు నిర్మించిన అద్భుత నగరం ద్వారక, సముద్ర గర్భంలో ఎలా కలిసిపోయింది? ఆ ప్రళయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ ఘట్టాన్ని రచయిత అత్యంత నాటకీయంగా, ఉత్కంఠభరితంగా వర్ణించారు.
  • యాదవ కుల వినాశనం: కురుక్షేత్రం ముగిసిన 36 ఏళ్ల తర్వాత, శాపం వల్ల యాదవులు తమలో తామే కలహించుకుని ఎలా అంతమయ్యారో ఈ కథలో చూడవచ్చు.
  • కలియుగ ఆరంభం: ద్వారక మునిగిపోవడం అనేది కేవలం ఒక నగరం అంతం కావడం కాదు, అది ఒక శకానికి ముగింపు. సముద్రపు అలలు నగరాన్ని కమ్మేస్తున్న వేళ, మిగిలిన ప్రజలు ప్రాణాల కోసం చేసే పోరాటం పాఠకులను కదిలిస్తుంది.

పాఠకులను కట్టిపడేసే అంశాలు:

ఈ సిరీస్ మిగిలిన పుస్తకాల కంటే భిన్నంగా ఉండటానికి కారణం కేవలం కథ మాత్రమే కాదు, రచయిత అనుసరించిన శైలి.

  1. రచయిత మను నెల్లుట్ల గారు తన వృత్తిపరమైన అనుభవాన్ని ఉపయోగించి, సమాజంలోని వ్యవస్థలు ఎలా కూలిపోతాయో, ఒక చిన్న సంఘటన మొత్తం రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించారు.
  2. ఇందులో పాత్రలు అద్భుత శక్తులతో కాకుండా, రక్తమాంసాలున్న మనుషులుగా ప్రవర్తిస్తాయి. వారి బాధ, ఆనందం, మరియు భయం మనకు అత్యంత సహజంగా అనిపిస్తాయి.
  3. చదువుతుంటే మన కళ్ల ముందే కురుక్షేత్ర రణరంగం, ద్వారక సముద్ర తీరం కనిపిస్తున్నట్లు ఉండే సినిమాటిక్ ఫీల్ ఈ పుస్తకాల ప్రత్యేకత.

చరిత్రను ప్రేమించే వారికి, ఇతిహాసాలను కొత్త కోణంలో చూడాలనుకునే వారికి ‘జన్య భారత’ ఒక అద్భుతమైన బహుమతి. కురుక్షేత్ర రక్తం నుండి ద్వారక ప్రళయం వరకు సాగే ఈ ప్రయాణం, పాఠకులను ముగింపు పేజీ వరకు ఊపిరి బిగబట్టి చదివిస్తుంది.

మీరు ఇంకా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టకపోతే, వెంటనే ‘The War’ మరియు తాజాగా విడుదలైన ‘The Deluge’ పుస్తకాలను చదవండి. మారుతున్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ కథల్లో ఎన్నో ఉన్నాయి!

రచయిత మను: ఒక అంతర్జాతీయ ప్రతిభ

కెనడాలో నివసిస్తున్న తెలుగు మూలాలున్న రచయిత మను (మనోభిరామ్) గారు కేవలం రచయితగానే కాకుండా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు TEDx స్పీకర్‌గా కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. మూడు ఖండాల్లో నివసించి, ఐదుకు పైగా భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఆయన జీవితం మరియు సాహిత్యం గురించి మరింత తెలుసుకోవడానికి, ప్రసిద్ధ ‘గ్లోబల్ ఇండియన్’ (Global Indian) పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు: 👉 మను నెల్లుట్ల: ఒక మేధావి ప్రయాణం (Global Indian Article)

ఇప్పుడే మీ ప్రతిని కొనుగోలు చేయండి!

“జన్య భారత” సిరీస్‌లోని ఉత్కంఠభరితమైన కథలను మీరు కూడా ఆస్వాదించాలనుకుంటున్నారా? పుస్తకాలను కొనుగోలు చేయడానికి క్రింది లింక్‌లను క్లిక్ చేయండి:

  • 🛒 Amazon India నుండి కొనుగోలు చేయండి: Janya Bharata Series on Amazon

మరిన్ని వివరాల కోసం మరియు రచయితతో నేరుగా సంప్రదించడానికి ఆయన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: 🌐 ManuNellutla.com

ముగింపు: చరిత్రను ప్రేమించే వారికి, మన మూలాలను గౌరవించే వారికి ఈ సిరీస్ తప్పక చదవాల్సిన పుస్తకం. మారుతున్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన ధర్మాలు మరియు సత్యాలు ‘మను’ గారి కలం నుండి జాలువారిన ఈ ‘జన్య భారత’లో పుష్కలంగా ఉన్నాయి.

aw2

May 31, 2026 19 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

నవ్వే రాణి

by ఒద్దిరాజు మురళీధరంరావు May 31, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు


అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె గోడపైనున్న పటాలు, గదిలోని ప్లేట్లు కిందపడే వరకు బిగ్గరగా నవ్వేది. చాలా చిన్న విషయాలకు కూడా ఆమె నవ్వేది. ఆమె నవ్వు ఎంత బిగ్గరగా ఉండేదంటే న్యాయస్థానంలో ఉన్న వారందరు, నౌకర్లు, కింద అంతస్తులో ఉన్నవారు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది. వారు మొదటగా వారి చేతివేళ్ళను వాడేవారు, చివరికి చెవిలో దూది పెట్టుకొని పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఎవరికి కూడా రాణి పేరు తెలియదు. ఎందుకంటే ఆమెను అందరూ హర్‌ మెర్రీ మెజస్టీ అంటే దొరసానిగా పిలిచేవారు. చాన్సలర్‌ రాజ్యం అప్పులపాలు అవుతుందని ఆమెకు తెలియగానే గిలిగింతలు పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీది నుండి జారిపడి కాలు విరగ్గొట్టుకుంది. భూకంపం వచ్చినపుడు బంగ్లా మొత్తం ధ్వంసం అయ్యింది. అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేవరకు నవ్వింది. పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేతి సైగతో వాళ్ళను రానివ్వలేదు. నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్లల్లో నీళ్లు ముఖంపైకి కారే వరకు నవ్వింది. కానీ నవ్వు జీవితంలో మంచి అలవాటు. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఆమెకు ఇష్టం కానిది, ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవటంతో ఆమె చాన్సలర్‌ ను చంపేసింది. ఇది ఎంత హాస్యమో…. ఈ సారి ఆమె నవ్వు ఆపుకోలేక నవ్వీ నవ్వీ శ్వాస ఆడక చనిపోయింది. చివరికి దర్బారులోని వారు దేశీయులు కొంత శాంతి, నిశ్శబ్దము, సంతోషంగా అనుభవించగలిగారు. అతి సర్వత్రా వర్జయేత్‌.

May 31, 2026 26 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ప్రశ్నే ప్రస్థానం..
  • అందరిలో తానూ
  • వెతకకండి
  • పాటల బృందావనం
  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us