మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

by Laxmi Madan July 30, 2026
written by Laxmi Madan

పేలాలతో ఆరోగ్యం

వీటిని రకరకాలుగా పిలుస్తారు.

తెలంగాణ & మహా రాష్ట్ర లో సుశీల అని..రాయల సీమలో ఉగ్గాని అని పిలుస్తారు.

ఏ పేరుతో పిలిస్తే ఏముంది! రుచిగా శుచిగా ఉంటే చాలు కదా!

ఈ పేలాలు లేదా మరమరాలు చాలా తేలికైన ఆహారం. సులభంగా అరుగుతుంది. ఊరికే కలుపుకొని తిన్నా కూడా ఎంతో బాగుంటుంది

ఇదంతా ఎందుకు కానీ ఈరోజు నేను సుశీల చేశాను. సుశీల అంటే ఒక అమ్మాయి కాదమ్మా! పేలాల తో పోహా లాంటిది లేదా ఉప్మా అనుకోండి.

ఏముంది ఇష్టం ఉన్నన్ని పేలాలు బాగా కడిగి జాలీలో వడగట్టి పెట్టుకోవాలి.

తర్వాత బాండ్లీ పెట్టుకొని పోపు వేసుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు స్వీట్ కార్న్ ఆలు, టమాటో, ఉల్లిపాయ కీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి మగ్గించి అందులో కొత్తిమీర కరివేపాకు వేసి ఆ తర్వాత ఈ తడిపిన పేలాలను అందులో వేసి ఉప్పు వేసి బాగా కలిపి మరొక ఐదు నిమిషాలు మగ్గించి నిమ్మకాయ పిండుకొని తినడమే!

రాత్రిపూట తింటే హాయిగా ఉంటుంది! డైటింగ్ పేరిట పచ్చి కూరగాయలు పిచ్చి కూరగాయలు తింటున్నారు కదా ఈమధ్య. అవే బ్రోకోలి లెట్యూస్..
ఇవన్నీ మన దేశపు పంటలు కాదు. అందులో పోషక విలువలు లేవని కాదు కానీ ట్రాన్స్పోర్ట్ లో మన దగ్గరికి వచ్చే వరకు చాలా టైం పడుతుంది అక్కడే ఫ్రెష్ గా తింటే బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఏ ప్రాంతంలో పండినవి ఆ ప్రాంతం లో తింటే అది మనకు సులభంగా ఒంట పడుతుంది జీర్ణం అవుతుంది. ఏదో ఫ్యాషన్ కదా అని వాళ్ళు తింటున్నారని వీళ్ళు తింటున్నారని తింటే ఏమో లెండి! ఎందుకు వచ్చిన తిప్పలు!

నేనైతే ఇలా చేశాను. మెక్కేసాను కూడా! అంత బాగుంది మరి..

వీటికి ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా! ఉంటే సూచించండి

July 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తరిగొండ వెంగమాంబ

by Vijaya Ranganatham July 30, 2026
written by Vijaya Ranganatham

తరిగొండ వెంగమాంబ (20 ఏప్రిల్ 1730 – 21 ఆగష్టు 1817), మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని కూడా పిలుస్తారు, 18 వ శతాబ్దంలో కవయిత్రి, వెంకటేశ్వరుని అపర భక్తురాలు. ఆమె అనేక పద్యాలు, పాటలు రాసింది.

తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730లోఏప్రెల్ 20నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నరసింహ క్షేత్రమైన వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో ఒక గొల్ల కుటుంబం కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఆమెబాల్యంలో తనతోటి పిల్లలతో ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగి తేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యంను సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలంలోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలల పాకడంతో తండ్రి ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి తగిన వరుని కోసం వెతకడం ప్రారంభించాడు.

ఇంటి పనులలో సహాయం చేయమని తల్లి చెప్పినపుడు తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందంగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపాలతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప వెంగమాంబను చూసి ముగ్ధుడై ప్రేమలో పడి ఆమెను వివాహానికి అంగీకరించాడని చెబుతారు. చిన్నప్పటి నుండి, ఆమె వేంకటేశ్వరునికి అత్యంత భక్తురాలు, ఆయనే తన భర్తగా భావించి వివాహాన్ని నిరాకరించింది. ఆమె భక్తితో గ్రామస్తులు ఆమెకు పిచ్చి అని చెప్పుకోసాగారు. కానీ పదేండ్ల చిన్న వయసులోనే ఆమెకు తల్లితండ్రులు బలవంతంగాఇంజేటి వెంకటాచలపతితోనేబాల్య వివాహం జరిపించారట.వివాహానంతరం వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసాడని, కానీ వెంగమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదని అంటారు.

ఆమె కాపురానికి వెళ్ళకుండానే పతిని కోల్పోయి బాల-వితంతువు అయితేశ్రీ వేంకటేశ్వరుడే తప్ప మరెవరినీ భర్తగా అంగీకరించడానికి నిరాకరించి వివాహితగా మంగళసూత్రం, రంగుల దుస్తులు, బొట్టు వంటివి ముత్తయిదువు చిహ్నాలను వీడలేదు. అప్పటి పరిస్తితుల దృష్ట్యా ఆమెకువిధవ సమారాలు చేయించాలని ప్రయత్నించిన సమాజాన్ని వ్యతిరేకించింది. అయినా వినకుండా ఆమెకు బలవంతంగా జుట్టు తీసేస్తే తిరిగి వెంటనే జుట్టు మరల వచ్చేదట. ఒకనాడు నరసింహ స్వామి ఆలయానికి వెళితే ఆలయ అర్చకుడు ఆమె జుట్టు పట్టుకుని మరీ బయటకు తోసి అవమానించటంతో బాధపడి ఆ ఊరే వదిలి తిరుమలకు బయలుదేరింది. కొండదారిలో స్వామి ప్రత్యక్షమై ఆమెను ఊహాలక్షి ఉపాసన చేయమని ఆదేశించారని, తిరుమలలో ఉండటానికి వసతిలేక తినడానికి భోజనం లేకపోయినా భగవంతుడి యందు భక్తి విశ్వాసాలతో ఊహలక్ష్మి ఉపాసన చేసిందని ప్రతీతి.

భగవత్ ప్రేరణతో అప్పటి హతిరాంజీ మఠం ఆమెకు ఉండటానికి ఒక గుడిసెలో ఏర్పాటు చేసి మఠం లో రోజూ ఆహారం ఏర్పాట్లు చేశారు. ఆగుడి పరిసరాల్ని శుభ్రం చేసి తులసి తోటను పెంచి రోజూ ఆలయంలోని స్వామి కైంకర్యానికి తులసిని తీసుకెళ్శేది. ఆమె భక్తి శ్రద్ధలు ఉపాసనా క్రమం చూసి ఆనాటి అన్నమయ్య వారసులు ఇంటికి తీసుకుని వెళ్ళి ఆశ్రయం కల్పించారు. అక్కడే ఆమె తులసి తోట పెంచి ఆలయానికి హారతీ తీసుకెళ్ళేవారు.

ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తుంది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క  దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం1890లో ఈస్టిండియా కంపెనీ వారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది.

ఆమె భక్తికి చలించి, ఆమె పద్యాలు, పాటలు వినడానికి ఆలయ గంటల తర్వాత ఆలయంలోకి ప్రవేశించడానికి వేంకటేశ్వర దేవుడు అనుమతించాడని చెప్పబడింది. వెంకమాంబ పద్యాలు పఠిస్తూ ప్రతి రాత్రి స్వామికి ‘హారతి’ తీసుకుని స్వామికి ముత్యాల తలంబ్రాలు చెల్లించేది. కొంతకాలంగా గర్భగుడిలోని ముత్యాలను గమనించిన పూజారుల అనుమానంఆమెపై విచారణకు దారితీసింది. శిక్షగా ఊరినుంచి బహిష్కరించి, తిరుమలకు 15 మైళ్ల దూరంలోని తుంబురకోనలోని ఒక గుహకు ఆమెను పంపివేశారట.

వేంకటేశ్వరస్వామి, గుహ నుండి ఆలయానికి ఒక రహస్య మార్గాన్నిసృష్టించాడని, వెంకమాంబ తన భక్తిని కొనసాగించడానికి ఆ గుహనే ఉపయోగించిందని ప్రచారం. తపస్సుమరియు రాత్రి హారతి ఆచారం 6 సంవత్సరాలు కొనసాగింది. చివరికి, పూజారులు వారి మూర్ఖత్వాన్ని గ్రహించి, వెంకమాంబ యొక్క భక్తి, అంకితభావాన్ని గుర్తించి, ఆమెను తిరిగి రమ్మని అభ్యర్థించారు. తిరిగి వచ్చిన తర్వాత, ఆమె ఏకాంత సేవలో పాల్గొనడానికి భగవంతుని చివరి హారతి తీసుకోవడానికి అనుమతించబడింది .

ఈమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించింది. చివరకు సా.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ  నవమి నాడు తిరుమల పుణ్యక్షేత్రంలో, తరిగొండ వెంగమాంబ, వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది.తిరుమల ఉత్తర వీధిలో, ఉత్తర దిశలో ఉన్న వనంలో ఈమె సమాధి ఇప్పటికీ ఉంది.ఆ సమాధి‘బృందావన్‘ చుట్టూ ఉన్న ప్రాంతం తరువాత పాఠశాల (SVBNR హైస్కూల్ తిరుమల)గా మార్చబడింది, పాఠశాల ప్లేగ్రౌండ్‌లో యాత్రికుల పూజల కోసం బృందావనం ఇప్పటికీ తెరిచి ఉంది.

ఆమె ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, మొదటి పద్యం తరిగొండ నృసింహ శతకం, దాని తర్వాత నృసింహ విలాస కథ, శివనాటకం, బాలకృష్ణ నాటకం యక్షగానం, రాజయోగామృత సారం, ద్విపద కావ్యాలు రాశారు. ఆమె తరికొండలో ఉన్నప్పుడు ఈ పనులు పూర్తయ్యాయి.

తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి. వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. తుంబురకోన గుహల నుండి తిరుమలకు తిరిగి వచ్చిన వెంగమాంబ విష్ణు పారిజాతం, చెంచు నాటకం, రుక్మిణీ నాటకం, జల క్రీడా విలాసం, ముక్తి కంఠి విలాసం (అన్ని యక్ష గానాలు), గోపీ నాటకం (గొల్ల కలాపం-యక్షగానం), రామ పరిణయం, శ్రీ కృష్ణ భాగవతం, మంజరి, తత్వ కీర్తనలు, వశిష్ట రామాయణం (ద్విపద), శ్రీ వేంకటాచల మహత్యం(పద్య ప్రబంధం) మరియు అష్టాంగ యోగం, సారం (పద్యకృతి)రచించారని తెలుస్తుంది.

భగవంతుడు వెంగమాంబ భక్తిని అంగీకరించినందున, ఆమె హారతి ప్రతి రాత్రి స్వామికి చేసే ఏకాంత సేవలో చేర్చబడింది. వెంకమాంబ వంశస్థుడు ముత్యాలను రుసుముగా చెల్లిస్తాడు మరియు హారతిని వెంకమాంబ హారతి అంటారు.ఈ సేవ నేటికీ జరుగుతూనే ఉంది. తిరుమలలోని నిత్యాన్నదాన సత్రానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని పేరు పెట్టారు.వెంగమాంబ చిత్రం 2009లో దురైస్వామి రాజు తెరకెక్కించారు. వెంకమాంబ పాత్రలో మీన ప్రధాన పాత్ర పోషించింది.ఆ చిత్రానికి, ఆమె కృతులను ఎమ్ ఎమ్ కీరవాణి గారు బాణీలు అందించారు. పూర్తి వెంకమాంబ హారతి ఆడియోలో పొందుపరిచారు.టిటిడి శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ వెంకమాంబ జీవితాన్ని “తరిగొండ వెంగమాంబ” అనే టెలి సీరియల్‌ని ప్రసారం చేశారు. ఈ సీరియల్ అద్భుతమైన స్పందనను పొందింది.ఆంధ్రప్రభ దిన పత్రికలో ఆమె జీవిత కథ సీరియల్‌గా వచ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి కార్యక్రమాలు తిరుమల, తిరుపతితో పాటు తరిగొండలో ను టీటీడీ బోర్టునిర్వహించింది.

రచనా వైశిష్ట్యం

తరిగొండ వెంగమాంబ గారి రచనా శైలి, కవిత్వం గొప్పదనం గురించి పలువురు ఆమె సాహిత్యాభిమానులు, చరిత్రకారులు తమ అభిప్రాయాలను, ఆవిడ భావనలను వెలువరించారు. ఆమె తన కృతి వేంకటాచలమాహాత్మ్యం అవతారికలో ఆమెకు సాహిత్యపు మెలకువలు, రహస్యాలు, అలంకార వ్యాకరణాది శాస్త్రాలు తెలియవని, కేవలం తన ఇష్టదైవం తరిగొండ నృసింహస్వామి దయ వల్లనే తనకు కవిత్వం చెప్పడం వచ్చిందని తన పద్యంలో వివరించింది. ఒకనాటి మధ్యాహ్న సమయంలో భగవానుడు భూసుర శ్రేష్ఠుని రూపంలో వచ్చి, భాగవతంలో తత్త్వార్ధాలు పామరులకుసైతం బోధపడేటట్లు సంగ్రహంగాను, శ్రీహరి మహిమలను విస్తారంగాను రచించవలసినదిగా వెంగమాంబను ఆదేశించాడని, ఆయనే మరికొంత సేపటికి బాలకృష్ణుని రూపంలో ఆమె చెంతకు వచ్చి, భగవ్త గ్రంధాన్ని చేతికిచ్చి దీనిని ద్విపదగా రచించిమని సూచించి వెళ్ళినాడని ఆమె తెలిపింది. 

నా చిననాట నోనామాలు నైన

నాచార్యుల చెంతనే జదువలేదు
పరుగు ఛందస్సులో బది బద్యములనైన
నిక్కంబుగా నేను నేర్వలేదు
లలితకావ్యనాటకాలంకారశాస్త్రముల
ల్వీనులనైనను వినగలేదు
పూర్వేతిహాస విస్ఫురితాంధ్రసంత్కృతు
ల్శోధించి వరుసగ జూడలేదు
చేరి తరికుండపురి నారసింహదేవు
డాన తిచ్చిన రీతిగ నే నిమిత్త
మాత్రమున బల్కుదును స్వసామర్థ్యమివ్వ
దరయ నించుక యేని నా యందు లేదు.

ఎంతో మంది పూర్వకవులు కావ్యరచనలు చేసారు, నువ్వు కొత్తగా నీ కావ్యాలలో చెప్పేదేముందని, ప్రాచీనుల కన్న నీ గొప్పతనం ఏమిటి? అనేప్రశ్నకు, తల్లితండ్రులకు, చిన్నపిల్లల జిలిబిలి పలుకులు ముద్దుగొల్పుతూ ఉంటాయని తరిగొండ వేంకమాంబ పండితులను, ప్రజలను ఇలా వేడుకుని, తన కావ్యాన్ని రుచి చూపింది.

పండితాగ్రగణ్యులార ప్రజలారా నా
బాలభాష కసూయపడక వినుడు
తల్లిదండ్రులు చిన్నపిల్లల పల్కుల
కానంద మొందెడునట్టు యిందు
మీరు నా తప్పొప్పు లేరీతిగానైన
గేలి సేయక చిత్తగింపవలయు
నాంధ్రగీర్వాణ మహాకృతులుండగా
నిప్పుడీ కృతి వినవేల యనగ
భక్ష్యములు మెక్కి యావల బచ్చడియును
నంజుకొనిన విధంబున నా ప్రబంధ
మాలకింతు రటంచు బేరాస చేత
నేను రచియింతు దాని మన్నించి గనుడు.

పండితులను, ప్రజలను, తన కావ్యాలను స్వీకరించి తనని ఉద్ధరించమని వేడుకొనడంలో, వెంగమాంబ వినయశీలం స్పష్టమవుతూంది.  ఆమె యోగరహస్యాలను సరళసుందరమైన భావమధురమైన శైలిలో వివరించింది. లలితమైన శృంగార భావనలను కూడా రమణీయశైలిలో చెప్పింది. యోగతత్వ విషయాలను ఎంతో విజ్ఞానప్రదంగా చెప్పింది. ప్రణయకోపాలను, సవతి మాత్సర్యాలను, నర్మగర్భసంభాషణలను, స్త్రీల ఎత్తిపొడుపు మాటలను, శ్రీకృష్ణుని శృంగారలీలలను, సహజంగా, రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసంతో మధురభక్తి కాక, జ్ఞానాత్మకమైన యోగభక్తితో, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రచనలు చేసింది. ఈమె పాడుకోడానికి వీలైన సింగారపు పాటలు, నలుగు పాటలు, ఆరగింపు పాటలు, లాలి పాటలు, మంగళహారతి పాటలు వ్రాసి, తన రచనలను సంగీతసాహిత్యసమ్మేళనాలుగా రూపొందించింది.

తరికొండ వేంగమాంబ రచించిన శ్రీకృష్ణమంజరి చాలా ప్రశస్తమైన స్తుతికావ్యం చెప్పబడుతుంది. దీనిని వావి కొలను సుబ్బారావు (“ఆంధ్ర వాల్మీకి” వాసుదాస స్వామి) తమ భక్తిసంజీవని అనే పత్రికలో జనవరి 1929 సంచికలో ప్రచురిస్తూ, ఈమెను మహాయోగిని, భక్తురాలు, కవయిత్రిగా పేర్కొన్నాడు.

శ్రీ వెంకటేశ! నా చిత్తంబు నందు
నీ పాదయుగళంబు నిల్పవే కృష్ణ
నన్నేల తరిగొండ నరహరాకృతిని
బ్రత్యక్షమై నన్ను బాలింపు కృష్ణ!

అని ఈ స్తుతిమంజరి కావ్యం మొదలై చివరలో ఈమె తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యుడు అని చెప్పడం జరుగుతుంది.సంస్కృత వరాహ, భవిష్యోత్తర, పద్మపురాణాలలోని వేంకటాచల మహాత్యం ప్రశంసలు ఆధారంగా, వేంగమాంబ, ‘వేంకటాచల మాహాత్మ్యం’ రచించింది. దీనిలో పద్మావతీశ్రీనివాసుల వివాహ వృత్తాంతాన్ని ఎంతో రమణీయంగా రూపొందించింది.స్త్రీ హృదయాంతరాళాలలోని సున్నితభావాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మగోపనాన్ని వేంగమాంబ అత్యంతమార్దవంగా, మార్మికతతో, చాకచక్యంతో, సరసంగా చిత్రించింది. శ్రీనివాసుని ద్వితీయవివాహసందర్భంలో లక్ష్మీదేవి అనుభవించిన బాధను ఆమె ఎంతో గొప్పగా వర్ణించింది. ఇది వెంకటగిరి క్షేత్రమహాత్యం వర్ణించే కావ్యం. తాను భాగవతం ద్వాదశస్కంధాలను ద్విపదకావ్యాలుగా రచించినట్టు, వేంకటాచలమాహాత్మ్యంలోని ఒక పదంలో చెప్పుకొంది.

ఈ  దివిపద భాగవతంలో, తత్వార్థాలను పామరులకు కూడా సరళంగా అర్థమయ్యేలా చేయడానికి, వేంగమాంబ తేటతెలుగు పదాలను ప్రయోగించి సంక్షిప్తసుందరంగా మలచినట్టు, ఈ ద్విపద పంక్తులను బట్టి తెలుస్తున్నది.కులాంగన అయిన వేంగమాంబ శృంగారం పేర అసభ్యవర్ణనలు చేయలేనని వేంకటేశ్వరమాహాత్మ్యంలో శ్రీకృష్ణునికి, అనగా కలియుగప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి ఇలా విన్నవించుకోవడం సమంజసంగానే ఉంది.

శృంగారాకృతి తోడ పచ్చి పదముల్‌ శృంగారసారంబు తో
డం గూఢంబుగ జెప్పు నీవనగ నట్లే చెప్పలేనన్న నన్‌
ముంగోపంబున జూచి లేచి యటనే మ్రొక్కంగ మన్నించి
తచ్ఛృంగారోక్తులు తానె పల్కికొను నా శ్రీకృష్ణుని సేవించెదన్‌.

వేంగమాంబ తన కావ్యంలో పచ్చి శృంగారవర్ణనలు చేయలేదు సరి కదా, అక్కడక్కడ సందర్భోచితంగా వెలువడిన శృంగార పద్యాలు కూడా కృతిపతి శ్రీకృష్ణుని చమత్కారాలే అని లోకానికి చెప్పినట్టు తెలిస్తున్నది. ఎరుకసాని పాత్రను వేంకటాచలమాహాత్మ్యం కావ్యంలో ప్రవేశపెట్టి పాత్రోచితభాషగా సోదిభాషను ప్రయోగించి, నాటకీయతను, రమణీయతను కలిగించింది వేంగమాంబ.

‘అవ్వోయవ్వ నీ తలంచిన తలంపు మేలవుతాదంట. దేవుళ్లు పలుకుసుండారు. తలచిన తలపేమంటివా, సెప్పెద విను దయితమ్మ! ఆ నల్లనయ్య యే దిక్కు నుండి వచ్చినాడంటావా? తల్లి ఇదిగో ఈ మూల నుండి వచ్చాడే….‘

తరిగొండ వేంగమాంబ శైలి, వేదాంతవిషయవివరణ సందర్భంలో కూడా మధురమై, వాస్తవానికి దగ్గరైనవిధంగా ఉండటం విశేషం. ఆమె రచనలు ఆత్మజ్ఞానానికి, ఔచిత్యానికి ఆటపట్టు. ఈమె నిర్గుణోపాసన నుంచి, సగుణోపాసులోకి దిగి మధురభక్తి సంప్రదాయాన్ని గురించి ప్రబోధాత్మకమైన, భక్తిదాయకమైన, రసోప్లావితమైన, అధ్యాత్మికచింతనాభరితమైన కమనీయకావ్యాలను రమణీయంగా రచించి, ఆంధ్రపాఠకలోకానికి అందించింది.

శ్రీమహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుని సంహరించి పాతాళాంతర్గతయైన భూమిని ఉద్ధరించిన తరువాత తన అవతారం గురించి భార్య లక్ష్మీదేవి ఏమి అడుగుతుందో, ఎలా గేలి చేస్తుందో అని తన సందేహాలను విష్ణువు గరుత్మంతునితో హాస్యంగా సంభాషించిన ఘట్టాలను ఆమె వర్ణించిన తీరు అత్యద్భుతమని విమర్శకులు శ్లాఘించారు.వెంగమాంబ రచించిన తొమ్మిది యక్షగానాల్లో నృసింహ విలాసము, బాలకృష్ణనాటకము, రుక్మిణీనాటకము, విష్ణుపారిజాతము, జలక్రీడా విలాసము అనే అయిదింటికి బమ్మర పోతన భాగవతం కల్పతరువు ప్రత్యక్షంగా కధావస్తువును ప్రసాదించింది.దశమస్కందంలోని రాసక్రీడాంశం ఆధారంగా వెంగమాంబ వ్రాసిన బాలకృష్ణ నాటకలో పోతన గారి ఒరవడికి చక్కని ఉదాహరణ.వెంగమాంబ రచించిన తాత్త్విక కావ్యాల్లోవిశిష్టమైనది రాజయోగామృతసారం మిక్కిలి ప్రసస్తమైనది. భాగవత తృతీయస్కంధంలోని కర్దమ ప్రజాపతి వృత్తాంతమే ఇందలి ఇతివృత్తం.ఈ కధలోని కపిలదేవహుతి సంవాదం ఆధారంగా వెంగమ్మ ఈ ద్విపదికృతిలో స్వానుభవ పూర్వకమైన రాజయోగ విజ్ఞానాన్ని మూడుప్రకరణాల్లో వివరించింది. ఈమె రచనలన్నింటిలో పరిమితిలోను, కవితా పరిణతిలోను ప్రధమగణ్యమైన గ్రంధం శ్రీభాగవతము.ఇది ద్విపదకావ్యము.

వెంగమాంబకు పూర్వం తెలుగులో ద్విపదభాగవతాలు కొన్ని వెలసి ఉన్నప్పటికీ, వెంగమాంబ కృతి యొక్కటే పోతనగారి రచనను ఆమూలాగ్రం సమర్ధవంతంగా అనుసరించిన ప్రఖ్యాతికి, ఆభక్తి గౌరవాలను నోచుకున్నది.ఇందువల్ల ఆనాటి (18వ శతాబ్దం) వెంగమాంబకు అందుబాటులో ఉన్న పోతన భాగవతిప్రతిలోని పాఠాలను గుర్తించగల సదవకాశం ఈనాడు మనకు ఆమె ద్విపదికృతి వల్ల సిద్ధిస్తూఉంది. వెంగమాంబ పోతన రచనను యధాతధంగా ద్విపదీకరించినప్పటికీ, ఆమె అచ్చటముచ్చట కధలో కొన్ని చిన్న మార్పులు చేర్పులు చేసింది.

పలు ప్రక్రియలలో ఇన్ని గ్రంథాలు వ్రాసిన కవయిత్రులు ఆ కాలంలో లేరు. ఇటీవలే వెంగమాంబకు సంబంధించిన జీవిత విశేషాలను, రచనల వివరాలను తెలుపుతూ ఒక జాతీయ సదస్సును టిటిడి ఉద్యోగుల శిక్షణా సంస్థ నిర్వహించింది. ఆమె కీర్తనలకు ప్రాచుర్యం కలిగించే లక్ష్యంతో “జీవనగానం” అనే సిడి ని 2007లోవిడుదల చేశారు.తరిగొండశ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెంగమాంబగారి విగ్రహం తరతరాలుగా పూజలు అందుకొంటున్నది. జనవరి 1న ఇతర పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయ.ఉత్తర మాడా వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందునుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.

July 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి

by Ananthaacharaya K.S. July 30, 2026
written by Ananthaacharaya K.S.

షట్ శాస్త్రాల్లో తలస్పర్శి
పాండిత్యం ఉన్నా,నిరాడంబరతతో మెదిలిన మహనీయులు డా. శ్రీ ఊ వే శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి వారు.
హర్షా మర్ష భయ క్రోధదులేవి స్పృశించని నిర్మలమైన జీవన శైలి ఆచార్యుల వారిది. నిష్కలంక చరిత్ర వారిది.
నడయాడే శ్రీ భాష్యం, కదిలే విజ్ఞాన సర్వస్వము, పుంభావ సరస్వతి. జ్ఞానానుష్టానములను భక్తి వైరాగ్యాలను కలిగిన వారు ఆచార్యులు శ్రీమాన్ రఘునాథ ఆచార్య స్వామి వారు.

సంస్కృత సాహిత్యంలో ఎంతటి మేరునగ శిఖరమో, విశిష్టాద్వైత సంప్రదాయంలో అంతటి లోతైన పరిజ్ఞానం కల అపర రామానుజ స్వరూపం వారిది. ఉపన్యాసం ద్వారా వేలాదిమంది ని తేజపరిచి నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రతి సభను అద్వితీయంగా నడిపిన ధిషణ వారిది.. అధ్యాపకులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపక కేసరి. వేలాది పండిత సభల్లో నూతన ప్రతిపాదనలు చేసిన ప్రతిభాశీలుడు. ఎంతటి ఉన్నతులైన, శాస్త్ర విషయాలలో రచనలలో తప్పులను ఎత్తిచూపి, సరియైన మార్గదర్శనం చేసిన మహానుభావులు.

జననం

పండితోత్తములు ప్రపన్నులు అయినా
శ్రీమాన్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తాతాచార్యులు శేషమ్మ గారలకు తేదీ 01.05 19 26న మోటూరు కృష్ణాజిల్లా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్. )లో
జన్మించినారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరంగం రఘునాథచార్య స్వామి వారు.

విద్యాయానం!!

అమావాస్య నాడు అక్షరాభ్యాసాన్ని పొందిన వీరు
తదుపరి అసమాన్యమైన పండితులుగా రూపుదిద్దుకోవడం జరిగింది.
చిన్ననాడే ఆచార్యులవారు తమ తండ్రిగారి వద్ద సంస్కృత ప్రాథమిక జ్ఞానాన్ని పొందినారు.
ఇంగ్లీష్ భాషా పాఠశాలలో వేసిన ఎందుకో అది అబ్బకుండా పోయింది.
వేదాంతవర్ధిని
సంస్కృత పాఠశాల సీతారాం బాగ్ హైదరాబాద్
లో విద్యాభ్యాసం కోసం తీసుకెళ్లినప్పుడు
వీరి భాష విజ్ఞానం చూసి భారవి క్లాసులో చేర్చుకున్నారు. సాధారణ విద్యార్థులు సంస్కృత ఎంట్రన్స్ పరీక్ష రాయటానికి ఒక్క సబ్జెక్టు మాత్రమే ఎంచుకొని రాస్తారు. కానీ ఆచార్యులవారు నాలుగు ఎంట్రన్స్ పరీక్షలను తర్క, వ్యాకరణ ,సాహిత్య మీమాంస శాస్త్రాలను ఒకేసారి రాసి విజయం పొందిన చురుకైన విద్యార్థి. గురువుగారైన శ్రీమాన్ శఠగోప రామానుజాచార్య స్వామి వారు ఆచార్యుల వారిని అప్పటినుంచి చతుస్తంత్రి అని పిలిచేటువంటివారు.
తదుపరి ఉద్యోగం నిమిత్తం విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకొని ఉపన్యాసకులుగా కొనసాగింపబడిన విరాణమూర్తి.

శ్రీమాన్ ఆచార్యుల వారు వేదాంతవర్ధిని సంస్కృత పాఠశాలలో చదివిన విద్యార్థి జీవితాన్ని, కృతజ్ఞతావిష్కరణం అనే పేరిట సంస్కృత కావ్యాన్ని అత్యద్భుతంగా వెలువరించి గురువులకు శిష్యులకు ఒక మార్గదర్శనం చేశారు. తదుపరి కృతజ్ఞతావిష్కరణం అనే సంస్కృత కావ్యాన్ని ఆచార్య లక్ష్మణ మూర్తి గారు తెలుగులోకి అనువదించటం విశేషం.

ఉద్యోగ ప్రస్థానం

ఆచార్య రఘునాథ చార్య స్వామి వారు 1946వ సంవత్సరంలో వరంగల్లోని సింహాద్రి కళాశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేరి నడిపించారు.
అక్కడ నుండి శ్రీమాన్ ఆచార్యులవారు శ్రీ ఆకారం నరసింహం గారి విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో వరంగల్లో అధ్యాపక వృత్తిని చేపట్టి 40 సంవత్సరాల పాటు కొనసాగించిన దేశికోత్తములు. వీరి వద్ద విద్యనభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉపన్యాసకులుగా, ఆచార్యులుగా, కవిపండితులుగా, రచయితలుగా, ఉన్నత పదవులలో ఉండడం విశేషం. ఆచార్యుల వారి అద్వితీయమైన బోధనకు 1972 సంవత్సరంలో జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది..

కాంచీపురం లోని శ్రీ ఉ వే శ్రీమాన్
ప్రభ అన్నంగలాచార్యుల వారి ముదిరేక్షణ శబ్దార్థ విచార పరమైన గ్రంథాలను రఘునాథ
ఆచార్యుల వారు చూసి ముదిరే క్షణార్థ పరిష్కారము అనే గ్రంథాన్ని రాసి అన్నంగలాచార్యుల వారి గ్రంథంలోని సాహిత్య పరమైన విశేషాలను ఎత్తిచూపి శతకోటి అనే గ్రంథం రాసి ప్రచురించినారు .
ఆచార్యుల వారికి అన్నంగలాచార్యుల వారికి జరిగిన వివాదం అనంతరం ముదిరే క్షణార్థ పరిష్కారః బహిష్కారఖండనం, గంబోలి, కషాకాతహ, శతకోటి అనే ఐదు పుస్తకాలు వేసి నిజ నిరూపణ చేసిన సుప్రసిద్ధ పండితులు ఆచార్యులు.
శ్రీమాన్ అద్దంకి కుమార తాతాచార్యుల వారి ఉత్తర రామ చరితం సంస్కృతం అనే నాటకానికి చక్కని వ్యాఖ్యను అందించినారు. ఇది తెలుగులో ఉంది. దీనిని తదుపరి రఘునాథాచార్య స్వామి వారు దేవనాగరలిపి లో అందించడం జరిగింది. ఆచార్య స్వామి వారు శ్రీ నమ్మాళ్వార్ తిరువాయి మోజిలోని రెండు దశకాలకు దివ్య సూరి సూక్తి సుధ
అనే సంస్కృత శ్లోకాలతో పాశురాలను అనువదించి సంస్కృతంలో వ్యాఖ్యానాన్ని రాయటం జరిగింది. వరంగల్ లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిర్దేశంలో జరిగిన పోతన శతజయంతి ఉత్సవాలలో రఘునాథ ఆచార్య స్వామి వారు పాల్గొని పోతన భాగవతంలోని విశిష్టాద్వైతం అనే అంశాన్ని గురించి అద్భుతమైన ప్రసంగాన్ని అందించడం జరిగింది. తదుపరి ఈ వ్యాసాలను సత్సాంప్రదాయ పరిరక్షణ సభ శ్రీ రఘునాథ సూక్తిమంజరి 2 పేరిట ప్రచురించటం జరిగింది. శ్రీమాన్ ఆచార్యులవారు ప్రసంగవ్యాసాలన్నీ సత్సాంప్రదాయ పరిరక్షణ రఘునాధ సూక్తిమంజరి పేరిట తెలుగు ,సంస్కృత విభాగాల్లో ప్రచురించి అందరికీ అందించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గుప్త పాశుపతం అనే నాటకం లోని దోషాలను ఎత్తిచూపిన ప్రతిభ శ్రీమాన్ ఆచార్యుల వారిది .

రసగంగా ప్రవాహం ఉపన్యాసం!!

శ్రీమాన్ ఆచార్యుల వారి ఉపన్యాసం లో ఆధ్యాత్మిక, సాహిత్య విషయాలతో పాటు, రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలు స్తోత్రాలు, కాళిదాసు, మాఘ, భారవి,లాంటి శ్లోకాలు దివ్య ప్రబంధ పాశురాలు ఉదాహరిస్తూ సాగుతూ ఉంటాయి. కొన్నివేల శ్లోకాలు పాశురాలు వారి జిహ్వ ఆగ్రంపై అలవోకగా నర్తిస్తుండేవి. వారి పాఠము ప్రసంగం అందరి హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయిందనుట అక్షర సత్యం. ఆచార్యులవారు ఎంత అద్భుతంగా ఉపన్యాసం బయట అందించేవారో,తరగతి గదిలో కూడా వీరి పాఠం అంత విశిష్టంగా ఉండేది.
శ్రీమాన్ రఘునాథ ఆచార్య స్వామివారిని నడయాడే ఉభయ వేదాంత విజ్ఞాన సర్వస్వమని సుప్రసిద్ధ పండితులు అని అభిమానులు శిష్యులు ప్రశంసిస్తూ ఉంటారు.
వీరికి సంస్కృతాంధ్ర సాహిత్యము ఉభయ వేదాంతలతోపాటు శాస్త్రీయ సంగీతం కూడా చాలా ఇష్టం.
ఇది వీరికి పరంపరగా పబ్బింది ఆచార్యుల వారి పిన తoడ్రులు శ్రీమాన్ న చ సింగరాచార్యులు గారు శ్రీమాన్ నచ శ్రీనివాసాచార్యులవారు సంగీత విద్వాంసులు. శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు గారు వేణువు, షహనాయి, గాత్ర సంగీత విధ్వాంసులు. అదే పరంపరగా వీరు సంగీత పై మక్కువ పెంచుకొని అనేక కార్యక్రమాల్ని నిర్వహించటం ఒక అద్భుతమైన అంశం.

పెద్దల సమాగమo!!

శ్రీ శ్రీ త్రిదండి రామానుజ పెద్ద జీయర్ స్వామి వారు, శ్రీశ్రీశ్రీ తిదండి చిన్న రామానుజ జీయర్ స్వామి గారు, న చ స్వామి వారి
సలహాలు సూచనలను స్వీకరించి సంప్రదాయ వ్యాప్తికి ఉపయోగించటం విశేషం.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర జీయర్ స్వామి వారు రఘునాథ ఆచార్య స్వామి వారి వద్ద శ్రీ భాష్యాన్ని సేవించారు.
శ్రీమాన్ అష్టాక్షరి సంపత్ కుమార్ జీయర్ గారు రఘునాథ్ దీక్షకుల వారి వద్ద శ్రీ వచన భూషణం తదితర సంప్రదాయ గ్రంథాలను సేవించినారు.
పెద్దలతో విశిష్టాద్వైత సంప్రదాయ విశేషాలతో పాటు అనేక విషయాల పైన సందేహాల నివృత్తి చేస్తూ ఉండేవారు.
అనేక యజ్ఞ యాగాది క్రతువులు
దేవాలయాల జీర్ణోద్ధరణ, ఇష్టులు
వీరందరితో కలిసి నిర్వహించిన వారు.
మరొకవైపు ప్రముఖ సాహితీవేత్తలు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు, విశ్వనాథ, కోవెల సుప్రసన్నాచార్యులు కోవెల సంపత్ మారాచార్యులు ఆచార్య లక్ష్మణమూర్తి ఇలాంటి మహాను భావులతో చర్చలు ఇష్టం జరిపేవారు. వీరి ఇల్లు ఎప్పుడు ఒక విశ్వవిద్యాలయంగా ఉండేది ఎంతోమంది విచ్చేసి విశిష్టాద్వైత సంప్రదాయ సంబంధిత గ్రంథ విషయాలను ఆచార్యుల ద్వారా నేర్చుకునే వారు. మరొకవైపు సాహి సాహితీ విశేషాల కోసం మరికొందరు విచ్చేసేవారు. విరసి వీరి ఇల్లు ఒక సరస్వతి ఆలయంగా కనపడేది. మరియు కోలాహలం గా ఉండేది. ప్రతినిత్యము విచ్చేసిన వారికి సాదరంగా సాపాటుతో పాటు
ఆత్మీయ అనుబంధాన్ని పంచేవారు. మీది మిక్కిలి ఆచార్యులవారు అలాగే వారి శ్రీమతి సీతామ్మవారు ఎన్నో దానధర్మాలను చేయడం అందరూ ఎరిగిన విషయమే.

ఆచార్యుల వారి కుటుంబం!!

శ్రీమాన్ న.చ.వారికి పదహారేళ్ళ వయసులో
సింహాచలం కు చెందిన శ్రీమాన్
కొమండూరి రాఘవాచార్యులు.. ఆండాళమ్మ గారి కూతురు 12 ఏళ్ల వయసు గల సీతమ్మ గారితో వివాహం జరిగింది.
సీతా అమ్మవారి కి రామాయణ భారత, భాగవత పద్యాలు ఆచార్య సూక్తులు, నాలాయిర దివ్య ప్రబంధం వీరికి
కంఠోపాఠం. అమ్మగారి మామ గారి వద్ద మీరు కొంత సంస్కృత విద్యాభ్యాసం చేశారు. చక్కని గాత్రంతో అందరినీ అలరిస్తుండేవారు. ఆచార్యుల వారి దంపతులకు మొత్తం ఐదుగురు కుమార్తెలు. మూడో అమ్మాయి భూదేవి చిన్నతనంలోనే అనారోగ్యం పాలై చనిపోయింది. శేషమ్మ శ్రీదేవి నీలాదేవి గోదాదేవి మిగతా నలుగురు అమ్మాయిలు విలక్షణ సంపన్నులు.

ఉ వే శ్రీమాన్ ఆచార్యులవారు అధ్యాపక వృత్తి నుండి విరమణ పొందినాక రెండు మూడు సంవత్సరాల పాటు కర్ణాటక రాష్ట్రంలోని మేలుకోట సంస్కృత సంక్షోధనా సంస్థ కేంద్రంలో అమూల్యమైన సేవలందించారు శ్రీమద్ శ్రీ భగవద్రామానుల వారి వేదార్థ సంగ్రహం ఉపనిషద్ భాష్యాలు ఇంకా విశిష్టాద్వైత పదకోశం నిఘంటువులను వీరు పరిష్కరించారు తదుపరి వీటిని అకాడమీ వారు ముద్రించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుకు కొద్దికాలం గౌరవ సలహాదారులుగా పనిచేసే వెంకటేశ్వర స్వామి సేవలు చేశారు.

బిరుదులు పురస్కారాలు!!

1964లో మహా మహోపాధ్యాయ శ్రీ కెఎస్ కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆచార్యులవారికి కవిశాబ్దిక కేసరి బిరుదునిచ్చి ఘన సత్కారాన్ని అందించారు.
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారు ఆచార్యుల వారిని మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసి గౌరవించారు.
జాతీయస్థాయిలో నాటి రాష్ట్రపతి శ్రీ వివిగిరి ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
సర్వ వైదిక సంస్థానం సంస్థాపనచార్యులు శ్రీమాన్ శ్రీ భాష్యం విజయసారథి గారు కరీంనగర్లో వీరికి శాస్త్ర రత్నాకర అనే బిరుదునిచ్చి సత్కరించి ఆచార్యుల వారిపై విశేషాలు అభిమానంతో శ్రీ రఘునాథ
దేశికోదాహరణం అనే సంస్కృత కావ్యాన్ని రచించి సమర్పించారు.
అప్పా జోసుల విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ వారు ఆచార్యుల వారిని విశిష్ట వ్యక్తిగా సన్మానించారు.
మైసూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఎం పి ఎల్ శాస్త్రి ప్రతిష్టాన్
వారి పురస్కారాన్ని అందుకున్నారు.
సర్వార్ధ సంక్షేమ సమితి పక్షాన పివి గారి తనయుడు మనోహర్ రావు గారు స్థితప్రజ్ఞ అవార్డును ఆచార్యుల వారికి అందించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారి స్నాతకోత్సవాల సందర్భంగా ఆచార్యుల వారికి
గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు.
2006 సంవత్సరంలో విజయవాడలో శ్రీ శ్రీ శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో న.చ.స్వామివారికి
కనకాభిషేక తులాభారాన్ని, గజారోహణ సన్మానాన్ని విజయవాడలో నిర్వహించటం
అత్యంత ఆనందకరం.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాటి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ద్వారా ఉత్తమ వేదాంత పండితులు పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి వారి శిష్యులైన కవిరత్న గుదిమళ్ళ రామానుజ ఆచార్య స్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారి కుమారులు కవిరత్న పురస్కారాన్ని అందించారు.
శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి వారు రఘునాథ దీక్షకుల వారిని ఉభయ వేదాంత ఆచార్య బిరుదునిచ్చి తామరపత్రాన్ని ఇచ్చి గౌరవించారు. మద్రాసు విశ్వవిద్యాలయం ద్వారా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన రామానుజ జీయర్ స్వామి వారు తొలి గోలోపాయన పురస్కారాన్ని
శ్రీ రఘునాథ దేశికుల వారికి
సమర్పించారు.
శ్రీ శ్రీ రామచంద్ర జీయర్ స్వామి వారు మంచిర్యాలలో ఆచార్యుల వారికి బ్రహ్మరథ సత్కారం అందించినారు.
లెక్కకు మిక్కిలి పురస్కారాల స్వామి వారు పొంది ఆదర్శనీయులుగా నిలిచారు.

సత్సంప్రదాయ పరిరక్షణ సభ

శ్రీమాన్ ఆచార్యులవారు అధ్యక్షులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారు గౌరవాధ్యక్షులుగా శ్రీమాన్ న.చ పట్టాభిరామాచార్యులు ప్రధాన కార్యదర్శిగా శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయ సేవ రామానుజ సిద్ధాంత ప్రచారం కొరకు సత్సంప్రదాయ పరిరక్షణ సభను ప్రారంభించారు. ఈ సభ ద్వారా
సుమారు 50 పుస్తకాలను సినిమా ఆచార్యులవారు రచించి ప్రకటించారు. ఇందులో చాలా గొప్ప గ్రంథం శ్రీ వైష్ణవ వైజయంతి. శ్రీమాన్
ఆచార్యుల వారి శ్రీ విష్ణు సహస్రనామ ఆంధ్ర వ్యాఖ్యాన గ్రంథం ఈ సంస్థ ద్వారానే ప్రకటితం కావడం విశేషం.
ఈ సత్ సంప్రదాయ పరిరక్షణ సభ కు ప్రస్తుతం
శ్రీమాన్ సముద్రాల
శఠగోపాలా చార్యులవారు ప్రధాన కార్యదర్శిగా ఉండి సంప్రదాయ గ్రంథ ప్రచురణ పండిత సత్కారాలు, ఉభయ వేదాంత సభలు, గోదా గోష్టులను అనేకం నిర్వహిస్తూ స్వామివారి ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఆచార్య రఘునాథ దేశకుల వారి పేరిట ఇప్పటివరకు సంప్రదాయంలో శిఖరాయమానంగా వెలుగొందిన వారికి అలాగే సాహితీవేత్తలు కవి పండితులకు శ్రద్ధ శతాధిక పురస్కారాన్ని అందించటం విశేషం. వరంగల్ ఎస్సార్ కాలేజీ వ్యవస్థాపకులు శ్రీమాన్ వరదారెడ్డి గారు ఈ సభకు అధ్యక్షులుగా ప్రస్తుతం ఉండి నడిపిస్తూ ఉండటం స్వామి వారి పైన ఉన్న వాత్సల్యం మాత్రమే. స్వామివారి ఈ సంవత్సరం
శత జయంతి సందర్భంగా అనేక విశేషమైన కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఆచార్యుల వారి సంపూర్ణమైనటువంటి సాహితీ, సంప్రదాయ, కుటుంబ, రచన, ఆలయాల జీర్ణోద్ధరణ
యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ శ్రీ వైష్ణవ సంప్రదాయ విస్తరణ లాంటి విశేషాలతో ఆచార్యుల వారి కుమార్తె శ్రీమతి
కిడాంబి గోదాదేవి గారు అల్లుడు శ్రీమాన్ రఘుపతి గారు చరితం రఘునాథస్య అనే పేరుతో ఒక ప్రత్యేక గ్రంథాన్ని తీసుకురావడం. చాలా ఆనందదాయకం

శ్రీమాన్ రఘునాథ ఆచార్య స్వామి వారు తేదీన 13.10. 2018
న పరమపదం వేంచేశారు.

ఆచార్యుల వారి జ్ఞాపకాలలో

ఆచార్య స్వామి వారు తరతరాల వారు తరించటానికి అవసరమైన మార్గాన్ని దర్శింపచేసే సద్గ్రంధాలను ఎన్నింటినో రచించి మనకు అందించారు. వారి మార్గంలో మనం నడవడం తప్ప వారిని సదా జపించుతూ ముందుకు వెళ్దాం.

(మహా మహోపాధ్యాయ కవిశాబ్దికకేసరి శాస్త్ర రత్నాకర శ్రీ వే శ్రీమాన్ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథచార్య స్వామి వారి శతజయంతి సందర్భంగా)

July 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

by వారాల ఆనంద్ July 30, 2026
written by వారాల ఆనంద్

కాలం
వాడిపోకుండా దాచుకోవడానికి
అది నా చేతిలో పూసిన పువ్వు కాదు

కాలం
మబ్బుల మునివేళ్ళ సందుల్లోంచి
జారిపడే చినుకుల సమూహం

అలా చూస్తుండగానే చినుకులు
నదిగా మారిపోయే క్షణం

నేనేమో నిన్నటి ఉదయం
ఇప్పటికీ నా కిటికీ దగ్గరే ఉందనుకున్నాను
తిరిగి చూసేసరికి కాలం ఒక జ్ఞాపకమై
గుండె గోడపై వేలాడుతోంది

ఎన్ని ఋతువులు వచ్చి వెళ్లాయో
ఆకాశం లెక్క పెట్టుకోదు
ఎన్ని పక్షులు తన కొమ్మలపై
వాలాయో చెట్టు గుర్తుంచుకోదు

అలాగే
జీవితం కూడా
మనం గడిపిన రోజుల సంఖ్యను కాదు
మనలో వెలిగిన వెలుగును గుర్తుంచుకుంటుంది
నవ్వులు కన్నీళ్లు నా వెంటే వున్నాయి
కొంతమంది తోడుగా నడిచారు
కొంతమందేమో దారిమధ్యలోనే
జ్ఞాపకాలై నిలిచిపోయారు
అయినా
నా ఉదయాలు ఆగలేదు
సూర్యుడు తన ప్రయాణం మానలేదు

నాలో కలలు కూడా
పరాజయాల బూడిదలోంచీ
మళ్లీ మొలకెత్తుతూనే ఉన్నాయి

ఇప్పుడు
కాలం ఎంత దూరం వెళ్లిందో కాని
నేను ఎంత దూరం వచ్చానో చూస్తున్నాను
ఎందుకంటే
సంవత్సరాలు గడిచిపోవచ్చు
శరీరం అలసిపోవచ్చు
జ్ఞాపకాల పుస్తకం పసుపురంగులోకి మారొచ్చు

కానీ
ప్రతి ఉదయంలో
కొత్త ఆశను పలకరించే నా చూపు
ప్రతి చీకటిలో
ఒక చిన్న దీపాన్ని వెతికే నా మనసు
ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి

అందుకే
కాలం గెలిచిందని నేను అనుకోను

నేను ఇంకా ఆశ్చర్యపడగలుగుతున్నాను
ప్రేమించగలుగుతున్నాను
కలలు కనగలుగుతున్నాను

అంతే చాలు
ఈ అనంత విశ్వంలో
నేను ఉన్నానని చెప్పడానికి


I Am Still Here

+++++ Varala Anand

Time
it is not a flower
that blossomed in my hand
to be preserved from withering

Time
is a gathering of raindrops
slipping through the misty fingers of clouds
and before one can fully behold them
those drops become a river
and flow away

I thought
yesterday morning
was still waiting by my window

But when I turned around
I found that time had become a memory
hanging upon the wall of my heart

The sky
does not count
how many seasons have come and gone

The tree
does not remember
how many birds have rested upon its branches

In the same way
life does not cherish
the number of days we have lived
it remembers instead
the light that once burned within us

Laughter and tears
have walked beside me

Some people journeyed with me for a while
others
halfway along the road
remained behind as memories

Yet
my mornings never ceased
and the sun
never abandoned its voyage

Within me, too
dreams continue to sprout
rising again
from the ashes of defeat

Now
I do not ask
how far time has travelled

I look instead
at how far I have come

For years may pass
the body may grow weary
and the book of memories
may yellow with age

But
the gaze that greets
each dawn with a new hope
the heart that searches
for a small lamp in every darkness
are still here

That is why
I do not believe
that time has won

I can still be astonished
I can still love
I can still dream
And that is enough
enough to say
in this infinite universe
that I am here.

July 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

“వర్తమానం – సాహిత్య దారి”

by Kondapally Neeharini July 30, 2026
written by Kondapally Neeharini

జులై 2026 మయూఖ సంపాదకీయం- డాక్టర్ కొండపల్లి నీహారిణి,ఎడిటర్

      ఈరోజు నాది అని అనుకునే ధైర్యం, సాహసం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి రావడం ఒక ప్రశ్న .ఉన్నన్ని రోజులు ఇవి ఎవరివి అవి ఎవరివి అని నిలదీయలేని అశక్తత. ఏ పదార్థాలు తినాలన్నా కల్తీ అనే చీడ పట్టుకుని ఉన్న రోజులు.

ఎక్కడ చూడు అవినీతి, అన్యాయాల తాండవమే. ఇటువంటి సందర్భంలో కవులు ఎటువైపు నిలబడాలి?

      న్యాయం పక్షాన నిలబడాల్సిన మనుషులే అన్యాయాలు చేస్తున్నారు. శుభ్రమైన  వ్యవస్థలో కీడు ప్రవేశించి భయభ్రాంతులను చేస్తున్నది. కవులు ఏం రాయాలి?

    ఏ దేశ పరిస్థితులు ఆ దేశానివి .ఏ దేశ భాష, వ్యవహార శైలి ఆదేశానిది. ఏ దేశ సామాజిక నేపథ్యం ఆ దేశానిది . ఇది ఆ భూభాగాన్ని పట్టి ,ఆ ప్రాంతంగా శీతోష్ణస్థితి  కారాణాలు . జపనీయులు ఒకలాగా, ఆఫ్రికన్సు ఒకలాగా, అమెరికన్స్ ఒకలాగా, మన

భారతీయులు ఒకలాగా ఉండడానికి ప్రధాన కారణం ఇదే. మళ్లీ మన భారతదేశంలోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రజల జీవన వ్యవహార శైలి ఒకటి కాదు. కొన్ని ప్రాంతాలలో రూపులు కూడా ఒకటి కావు .భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు  ఇవన్నీ పరిగణంలోకి తీసుకోవాలి. కానీ ఏ విషయం పైన నైనా భాష తత్వావిష్కరణ చేస్తుంది. లోక రహస్యాలు గొప్ప గొప్ప లెక్కలు లెక్కల్లో తేలుస్తుంది. ఇదే సాహిత్యం యొక్క ఛాయ గా చెప్తాం.

     సాహిత్యం ఏం చేస్తుంది? కాలానుగుణంగా నడుచుకుంటుంది . భూతకాలంలోని విషయాలను ఎప్పటికప్పుడు మననం చేయిస్తుంది. భవిష్యత్తు ఎలా ఉండాలో బాట వేస్తుంది. వర్తమానంలోని జీవితానికి ఒక అర్ధాన్ని చూపిస్తుంది. ఇటువంటి సాహిత్యం ఇప్పుడు ఎలా వస్తున్నది? ప్రయోజనాలను  ఆశించే సాహిత్యం రాయాలా? అనే ప్రశ్న కూడా  ఒక్కోచోట ఉదయిస్తుంది. ఆనందానికి, మనశ్శాంతికి రాసుకోవచ్చు కదా ? అనే వాళ్ళు ఉంటారు . ఈ ఆనందము ఈ మనశ్శాంతి దొరకాలి అంటే కంటి తెరపై ఉన్న ప్రపంచంలో సమాజం అనే

బొమ్మలు  వివర్ణమై చిత్రాలు చిత్రాలుగా కనిపిస్తున్నప్పుడు,  రోదనలు వేదనలు మాత్రమే శబ్దాలు చేస్తున్నప్పుడు సాహిత్యం ఎలా నిలబడాలి? అనే ప్రశ్న కవులలో రచయితల్లో వేసుకున్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ప్రాంతానికి, పరిసరాలకి. ఇక్కడ ఉండి ఎక్కడో జరిగేవి ఊహించి రాయడం ఎక్కడివాటినో తెలుసుకొని రాయడం కంటే ఇక్కడ నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు ఉంటావు కాబట్టి నిజాయితీగా అంతర్దృష్టితో పసిగట్టి  రాయాలి. ఒకవేళ  ఎక్కడి అంశాలనో రాసినా ఇక్కడి సమాజాని ఉపయోగపడేలా రాయాలి . అబద్ధాలను ఖండించి నిజాల నిగ్గు తేల్చాల్సింది సాహిత్యమే, కవులే, రచయితలే!   

       మనుషుల జీవితమే దీపం వంటిది . అటువంటిది సాహితీ రంగంలో రచనలు చేసేవాళ్లు ఎన్ని దీపాలుగా ప్రకాశించాలి ? ఎన్ని కాంతిపుంజాలను విరజిమ్మాలి ? ఎంతటి లోకము గమనింపులోకి రావాలి? తరాలు మారుతుంటే ఏది విచక్షణ అనే స్పృహతో ఎడారిలో మంచినీరులా, చీకటిలో దీపాలలా,ప్రవాహంలో తెడ్డులా సాహిత్యం నిలబడాలి.

      మంచి ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనుషుల్లో ఇవి రెండు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది . ఆదర్శవంతమైన కుటుంబాలే శక్తివంతమైన సమాజాన్ని నిర్మించగలదు .   సత్సాంగత్యం వల్ల మనసు ఆరోగ్యం  తో ఉల్లాసంగా ఉంటుంది ఈ సూత్రాలనే మూలాధారంగా చేసుకొని సాహిత్య సృజన జరగాలి. మంచి సాహిత్యం గొప్పతనం అంతా ఒక తరం వెళ్ళిపోయాక కానీ తెలుస్తుంది అనడం కంటే ఈ తరం వాళ్లు ఉన్నప్పుడే  వాళ్ల కు తెలిసేలా రాయాలి.  దేశభక్తులను సంస్కర్తలను సాధువులను ఎలా గౌరవిస్తామో సాహితీవేత్తలను కూడా అప్పుడు ప్రజలు గౌరవిస్తారు. అందుకే అంతరాత్మను ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి రచయితలు . అంతరంగ కాలుష్యం తగ్గించుకోవాలి. విచక్షణ, విశ్వాసం యువతకు ఆదర్శం కావాలి. ఏవో సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయట అని వ్యంగంగా చెప్పే వాళ్ళను చూస్తాం. మన ఫిలాసఫీని తెలుసుకోవాలి అంటే

సైన్స్ ఇంకా ఎదగాలి అంటారు.అటువంటి దేశం మన దేశం.

 అందుకే ఆదర్శవంతమైన జీవితాలు అందాలంటే మంచి సాహిత్యాన్ని చదవగలే  అవకాశాలు రావాలి ఎవరికైనా. అంటే ప్రభుత్వాలు, సంస్థలు మంచి సాహిత్యాన్ని రచించే రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి రాయించి  అవి విద్యార్థులకు అందేలా చేయాలి . ఈనాటి బాలలే రేపటి పౌరులు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్లకి సరైన విద్యా వ్యవస్థను ఎట్లాగైతే అందిస్తామో సాహిత్య విలువలను కూడా అందించాలి.

      గున్న మామిడిని అయినా గడ్డి పోచనైనా సమానంగా చూడగలడమే సాహిత్య సౌందర్య తత్వం. ఈ సౌందర్యం సరైన విధానంలో వ్యక్తం కావాలంటే భాషా పట్టుత్వం ఉండాలి. ఉదాహరణగా సంస్కృత శబ్దం తెలుగు శబ్దం రెండింటిని ఉపయోగిస్తున్నవిధానంలో ..కాలము అనేది సంస్కృత పదం . సమయము సంస్కృత పదం. ఇవి తెలుగు పదాలుగా కలిసిపోయాయి ఎంతసేపు అనే మాట టైమ్ ను సూచించే పదం. సేపు అనేది సమయం ఎంత అయిందిఅనడాని వాడుతాము. 

మనం కొన్ని పదాలను ఎరువు తెచ్చుకుంటున్నాం. ఇవి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మాటలు అలాగే ప్రేమ అనే పదం….ఇది సంస్కృత పదం.. తెలుగులో వలపు అంటాము . స్నేహితులపై చూపే ప్రేమను నెనరు  అని అంటాం. ఇఇట్లా పదాల శక్తిని తెలుసుకోవాలి. అలాగే పౌరుషం అనే మాటకు పటిమ అని అర్థం. కడిమి అనే పదానికి పరాక్రమం అని అర్థం. పంచె అనేది మరాఠీ పదం కోక తెలుగు పదం ఇది ఒక వస్త్ర విశేషం కానీ పంచకట్టు అనేది వాడుకలోకి తెచ్చారు మన తెలుగు వాళ్ళు. ఇలా పదాల అర్థాలను పర్యాయపదాలను నానార్థాలను కవుల గమనింపులోకి రావాలి, అలా ప్రయోగించగలగాలి. అన్ని భాషలను తనలో కలుపుకునే సౌందర్యమే తెలుగు భాష ది. 

      తమిళ భాషను మణి ప్రవాళ భాష అంటారు. మణులు అంటే వజ్రాలు, ప్రవాళాలు అంటే ముత్యాలు. వజ్రాలు ముత్యాలు కలగల్సిన భాషగా చెప్తారు . తెలుగు అజంత భాష. సంస్కృతము, ఉర్దూ పదాలను ఇంగ్లీష్ పదాలను హిందీ పదాలను తనలో కలుపుకుని వినసొంపుగా చేసేటువంటి తెలుగు భాష గొప్పతనాన్ని కవులు విస్తృతంగా

అభ్యసించి వంటబట్టించుకుని కవిత్వంలో రాయగలిగాలి. ఇటువంటి కవిత్వాన్ని కథలను ఈనాటి వాళ్లు చదివి నేర్చుకుంటారు, ఉపయోగిస్తారు. అలా ముందు తరానికి ప్రవహింప చేస్తారు. భాష ఒక ప్రవాహ సందోహంతో ఉంటుంది.            మనిషికి వెన్నెముక ఎలాగో సాహిత్యానికి భాష  అటువంటిది. ఎన్నో వ్యాకరణ అంశాలు  భాషను పటిష్టం చేస్తాయి. తెలుగు భాష సంస్కృత భాష తో కలిసి పోయింది . సంస్కృత భాష కర్మణి రూపంతో ఉంటుంది. తెలుగు సహజ సుందరమైన భాష. సంస్కృత భాషలో  నామవాచక గుణవాచకాలకు ఒకే లింగ విభక్తులు ఉంటాయి. తెలుగులో లింగ వాచకాలు అని అనం. పురుష వాచకాలు, స్త్రీ వాచకాలు, నపుంసక వాచకాలు అనేవి అర్ధాన్ని బట్టి మారుతూ ఉంటాయి . సంస్కృతంలో లింగ భేదాలు అర్ధాన్ని బట్టి గాక శబ్దాన్ని బట్టి ఉంటాయి.  సంస్కృత సంప్రదాయంలో శబ్దం దేన్నీ ప్రతిపాదిస్తుందో అదే లింగం. కానీ తెలుగులో అలా కాదు. ఇక వచనం విషయానికొస్తే తెలుగులో ఏక వచనం బహువచనం ఉంటాయి. సంస్కృతంలో బహువచనం, ఏక వచనం, ద్వివచనం ఉంటాయి.

ఛందస్సు కొంతైనా తెలియాలి. అలంకారాల  ప్రయోగాలు తెలియాలి.  కవిత్వ లక్షణాలు, కథా రచానా శైలి తోబాటు ఇటువంటి సామాన్య వ్యాకరణ విశేషాలను రచయితలే తెలుసుకోకుండా ఉంటే వాళ్ల రచనలలో  ఏం ప్రతిబింబిస్తారు?

        ఇక భాష మీద పట్టు సాధించిన తర్వాత కవులకు రచయితలకు కావలసింది సామాజిక విచక్షణ. రవిగాంచని చోట కవిగాంచును అంటారు. దృష్టకు దృష్టి కోణం కొత్తగా ఉంటుంది. ద్రష్టలుగా ఆలోచించాలి కదా!

        ఆధునిక నాగరికత పల్లెల్లో చేరని కాలం నుండి అరచేతిలోకి ప్రపంచం వచ్చిన కాలానికి మధ్య ఉన్న తేడాను పసిగట్టి రచనలలో చూపాలి. అది మంచిగా చెడుగా ఎందుకు అనుసరిస్తున్నాము ఎందుకు అనుసరించకూడదు చెప్పాలి. ఈ బడి చదువులలో పనికొచ్చేలా లేవన్నట్లు చేతిలో ఫోన్ తో ఆడుతున్నారు పిల్లలు. ఊహాత్మకమైన వ్యవస్థ నుంచి తన నుంచి తన వరకు చెప్పగలిగే కవులు కొత్త దృష్టితో అక్షరాలను సాధనాలుగా చేసుకోవాలి. అక్షరము అబద్ధం కావొద్దు.

____****____

July 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

The first woman Engineer of India

by Vijaya Kandala July 30, 2026
written by Vijaya Kandala

లంగా ఓణి  తో కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తిని అందరూ ఆశ్చర్యంగా చూశారు .

 కారణాలు చాలానే ఉన్నాయి స్త్రీ కావడం మొదటిది  .

అది ఇంజనీరింగ్ కాలేజ్ కావడం రెండవది

మనకు సాధారణమే అనిపిస్తాయి ఈ రోజుల్లో .కానీ అది క్రీస్తు శకం 1940వ సంవత్సరం . ఎందుకంటే ఆ రోజుల్లో నైతిక విద్య మగవారికి మాత్రమే అభిప్రాయం జనసామాన్యంలో బలంగా ఉండేది  . అలా  అందరినీ ఆశ్చర్యంలో ముంచి వేసిన ఆ విద్యార్థిని పేరు లలిత  .అంటే అయ్యల సోమయాజుల లలిత  .లలిత ఆగస్టు 27   ,1919లో మద్రాసులో 8 మంది తోబుట్టువుల్లో  ఐదవ సంతానంగా జన్మించింది  .మధ్య తరగతి కుటుంబం  .ఆ రోజుల్లో బాల్యవివాహాలు సర్వసాధారణం  .అలా 14వ సంవత్సరంలోనే ఆమెకు వివాహం జరిగింది .తండ్రి ప్రోత్సాహం తో  చదువు కొనసాగించింది  .ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పాస్ అయింది . తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే తల్లి కూడా అయింది  .విచారకరమైన విషయం ఏంటంటే పాపకి నాలుగు నెలల వయస్సులోనే ఆమె భర్త మరణించాడు .వితంతువుగా మిగిలిన జీవితమంతా గడిపింది ఆమె

లలిత తండ్రి శ్రీ పప్పు సుబ్బారావు గారు మద్రాసులోని గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ శాఖలో ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు   .అభ్యుదయవాది .చాలా ధైర్యసా హసా లతో  సమాజ రీతికి ఎదురీది  కూతురిని పై చదువులు చదివించాలని నిర్ణయించుకున్నారు .బంధు మిత్రుల  నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు  .

కూతురుని క్వీన్ మేరీ కాలేజీలో పై చదువులకు పంపాలని నిర్ణయించుకున్నాడు  .12 వ త ర గతి మొదటి తరగతిలో పాస్ అయింది  . మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలని   ఆమె కోరిక . కానీ ఓ చిన్న పాపకు తల్లి కూడా  అయినందువల్ల తన ఆలోచనను మార్చుకుని ,పై చదువులకు ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకుంది  .ఇంత  వరకు ఇలాంటి నిర్ణయాన్ని ఎవరుతీసుకోలేదు .

తండ్రి వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ ను  ,డైరెక్టర్ ను కలిసి విషయాన్ని వివరించాడు  . వారి ప్రోత్సాహంతో లలిత దేశంలోనే తొలి ఇంజనీరింగ్ విద్యార్థినిగా చేరే అపురూపమైన అవకాశాన్ని చేజిక్కించుకుంది . గిండీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఆసియాలోనే తొలి సాంకేతిక కళాశాల  .కాలేజీ మొత్తం లో ఒకే స్త్రీ అవడం వల్ల ఆమె కాలేజీ  వాతావరణంలో  ఒంటరిగా మసలుకో వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి  .ఇది గమనించిన తండ్రి ఆ రోజుల్లో హిందూ దినపత్రికలో ఆసక్తి గల మహిళ అభ్యర్థులకు కాలేజీ అవకాశాలు ఉన్నాయని ప్రకటన ఇచ్చాడు  .థె రెసా  ,లీలమ్మ జార్జ్ అనే ఇద్దరు స్త్రీలు సివిల్ ఇంజనీరింగ్ లో చేరారు  .ముగ్గురు  కలిసి చదువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ  వహించారు .వారిలో కొత్త ఉత్సాహం చోటు చేసుకున్నది  .1943 లో లలిత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ  పూర్తి చే సింది .

ఆ రోజుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయాలంటే  ,చివర గా ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్గా పని చేయడం  తప్పనిసరి అని  నియమం ఉండేది  .అలా లలిత జమాల్పూర్ లోని రైల్వే వర్క్ షాప్ లో అప్రెంటిస్ శిక్షణను పూర్తి  చేసింది  .1944లో డిగ్రీ చేతికి వచ్చింది . మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే తొలి మహిళ ఇంజనీర్ అని చెప్పుకున్నాం కదా అందువల్ల డిగ్రీ సర్టిఫికెట్ లో ఆ రోజుల్లో  HE మాత్రమే ఉండిందని కొట్టేసి SHE అని రాశారట  .

ఆమెతో కలిసి చదివిన లీ లమ్మ జార్జి గారు కేరళ తొలి చీఫ్ ఇంజనీర్ గా పని చేశారట .1944  లో సిమ్లాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా చేరారు  .అక్కడ తమ్ముని కుటుంబంతో కలిసి ఉండేవారు  .ఆ చిన్న పాప బాధ్యతను మరదలు చూసుకునేది  .గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు  .1948లో కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో ఉద్యోగంలో చేరారు  .చాలా కాలం  ఆ కంపెనీలో పని చేశారు  .అందులో భాగంగా దేశంలోని చాలా ప్రాంతాలను సందర్శించారు . ఎన్నో రాష్ట్రాలకి గ్రిడ్ సబ్ స్టేషన్ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ రూపొందించడంలో సహాయపడ్డారు భాక్రానంగల్ డ్యామ్ నిర్మాణంలో ఆమె పాత్ర ప్రముఖమైనది .

1964లో న్యూయార్క్లో జరిగిన ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ విమెన్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్ మన దేశానికి ప్రతినిధిగా వెళ్లారు  .1977లో ఆమె రిటైర్ అయ్యారు 79 అక్టోబర్ 12న   60 సంవత్సరాల వయసులో మరణించారు  .ఆ రోజుల్లో ఉన్న సాంఘిక కట్టుబాట్లలో 18 సంవత్సరాల వయస్సులో నాలుగు నెలల చిన్న పాపతో ఆమె సాధించిన విజయాలు సాగించిన ప్రయాణం స్త్రీ లోకానికి స్ఫూర్తి దాయకం .

వితంతు వివాహాన్ని ఆమె బలపరిచే వారు  .తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చేవారు . తనకి కూతురి  బాధ్యత ఉన్నందున తాను అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేవారు . ఈ రోజుల్లో కూడా ఎందరో స్త్రీలు ఇంజనీరింగ్ కాలేజ్ చేరి ఏవో చిన్నపాటి కారణాలతో మధ్యలో చదువు మానేస్తున్నారు  . అ లాంటిది 85 సంవత్సరాల క్రిందటి ఆమె పోరాటాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆమె చరిత్ర నుండి స్ఫూర్తి పొందుదాం దేశ పురోగతిలో మనము పాలుపంచుకుందాము .

July 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ధరణి

by Thata Kameshwari July 30, 2026
written by Thata Kameshwari

“అమ్మా నిధీ,ఒక్కసారిచిరాకుపడకుండానా మాటవిను. మాతృత్వం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం, దానిని అలా జారవిడవకు. ఈరోజు ఎందరోస్త్రీలు మాతృత్వం కోసంలక్షలుఖర్చు చేసినా ప్రయోజనంఉండటంలేదు. నీమంచికోరిచెపుతున్నా,ఇంకా ఆలస్యంచేస్తేపిల్లలుపుట్టడంకష్టంఅవుతుంది” అంటున్నతల్లిమాటలుకు శ్రీనిధి”అమ్మా, నావద్ద  పిల్లల ప్రస్తావన ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను. మాటిమాటికి ఆ విషయం గురించి నువ్వు వర్ణించినానా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు” అంటూ తల్లి ఏమి అంటుందో కూడా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది.

శ్రీనిధితల్లితండ్రులకు ఒక్కగానొక్కకూతురు అవడంతో చాలా గారాభంగా పెరిగింది. తండ్రిది చిన్న గుమస్తా ఉద్యోగం అయినా శక్తికి మించి మంచి కాలేజిలో ఇంజనీరింగ్ చదివించి, మాస్టర్ చెయ్యడానికి అమెరికా కూడా పంపించారు.శ్రీనిధి ఇండియాతిరిగివచ్చిమంచిఉద్యోగంసంపాదించుకుని, తనతోపాటుపనిచేస్తున్న శ్రీకర్ అనే అబ్బాయినిపెళ్లిచేసుకుంటానంటేఒప్పుకునిచాలాఘనంగాపెళ్ళిచేశారు. శ్రీనిధికి పెళ్లియ్యి ఎనిమిది ఏళ్లు అయినా పిల్లలు లేరు.అయ్యో!మళ్లీ మీరు వారికి ఏదో లోపం వల్ల పిల్లలు కలగలేదు అనుకోకండి. వీరు పెళ్లియిన రోజే ఈ కాలం యువతఅనుసరిస్తున్న డింక్ ‘డబల్ ఇనకమ్ నో కిడ్స్’జీవనశైలిని పాటీస్తూ పిల్లలను కనద్దు అనినిశ్చయించుకున్నారు.తల్లిదండ్రులకు కూడా అదే చెప్పి, వారు ఏమి అనే లోపే, పిల్లలు వల్ల ఎన్నో సమస్యలు ఎదురుకొవాలని, పిల్లలు వారి స్వేచ్ఛకు, సరదాలకూఅడ్డని, భాద్యతలు పెరిగితే ఉద్యోగంలోకూడారానించలేరని చెప్పి ఎప్పుడు పిల్లల ప్రస్తావన ఎత్తదని కఛితంగా చెప్పేసారు.

మొదట్లోశ్రీనిధి తల్లి కొన్నాళ్ళకి వారే నిర్ణయం మార్చుకుంటారు అనుకుంది, కానీ ఇన్నాళ్లకు కూడా వారి నిర్ణయం మారకపోవడంతో ఆమె తల్లి మనసు తట్టుకోలేక శ్రీనిధితో తరుచుగా ఈ విషయం ఎత్తితే చాలు ఆమె కోపంగా ఫోన్ పెట్టేసేది, ఇవాళ కూడా అదే జరిగింది.

శ్రీనిధి రెండు రోజులు సెలవు తీసుకుని తల్లిదండ్రులను చూసి వద్దాం అనుకుంది. ఆనాడే ప్రయాణం, కానీ పొద్దున్న తల్లితో జరిగిన గొడవతో ఆమె టికెట్ కాన్సెల్ చేసుకుని, ప్రయాణం మానుకుందాం అనుకుంది. కానీ వెంటనే ఆమెకు కష్టపడి పెంచిన తండ్రి ముఖం గుర్తొచ్చి, బాగ్ లో రెండు బట్టలు వేసుకుని స్టేషన్ కి బయలుదేరింది.

ఆప్పటికే స్టేషన్ చేరడానికి ఆలస్యం అవడంతో ట్రైన్ ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉంది. ట్రైన్ ఎక్కి బెర్త్ క్రింద బ్యాగ్ పెట్టుకుని కిటికీకి తల ఆనించి కళ్లు మూసుకుంది శ్రీనిధి. ఆలోచనలో ఉన్న ఆమెకు చంటిపాప ఏడుపు వినిపించింది. ఆమె దృష్టి ఎదురుగా ఉన్న బెర్త్ వైపు మరలింది. సుమారు తన వయసు ఉన్న ఒక ఆమె చిన్న పాపను అడిస్తూకనపడింది, ఆమె పక్కనే నడివయసు సుమారు యాభై ఏళ్లు ఉంటాయి, బహుశా యువతి తల్లి అవచ్చు అనుకుంది శ్రీనిధి.ఆ యువతి ఓ వైపు ఆఫీస్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కు సమాధానమిస్తూ మరోవైపు పసిపాపను చూసుకుంటోంది. పక్కనే ఉన్న తల్లి పాపను ఇమ్మన్నా వారించి “అమ్మా, రేపటినుండి నేను ఆఫీస్‌కు వెళ్తేచిన్నిని నువ్వే చూసుకోవాలిగా.దానితో ఉన్నపుడు అయినా నేనుదానిని చూసుకుంటానమ్మా”,అన్న ఆమె మాటకి శ్రీనిధి ఆయువతిని పరిశీలనగా చూసింది. ఆమె వేసుకున్న బట్టలు, పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అన్నీ అతి సాధారణంగా ఉన్నాయి, కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం, వినయంశ్రీనిధిని ఆకట్టుకున్నాయి.

ఆమెతో ఎలాగైనా పరిచయం చేసుకోవాలన్న కోరికతో శ్రీనిధి మోహమాటంగానే వారితో మాట కలిపి తనను పరిచయం చేసుకుని వారి ఎక్కడివరకు వేళ్లుతున్నరని అడగడం తో  ఆ పెద్ద ఆమె “అమ్మా, నా పేరు వసుంధర, ఇమే నా కూతురు ధరణి, ఇది నా మానవరాలు చిన్ని. మేము ఆనకాపళ్లీ వేళ్లుతున్నం” అనడం తో శ్రీనిధి “ ఆవునా, మా విశాఖపటనం కి దగ్గరే. అనకాపల్లి లో మా పెద్ద మావయ్య కొన్నాళ్ళు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేసెవారు. చిన్నప్పుడు రెండు ముడు సార్లు వేసవి సెలవులో అమ్మ తో పాటు అక్కడికి వెళ్ళాను. మావయ్య మా అందరిని నూకాంబికఅమ్మవారి గుడి కి, బొజ్జన్నకొండ, లింగాలకొండ లో బౌద్ధ మూలానికి చెందిన రాతి గుహలను చూపించడానికి కుడా తీసకేళ్ళెవాడు. అమ్మ అక్కడ బేల్లం బాగుంటుందని రెండు-ముడు కేజీలు కొని తెచ్చేది.  మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు అక్కడ?” అని అడిగింది శ్రీనిధి. దానికి వసుంధర గారు “ధరణి కి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పోస్టీంగ అయి ముడు ఏళ్లు అయిది. నేను ఆమెకు సహయంగా మధ్య మధ్య లో వచ్చి పోతుంటాను. పాప పుట్టేకాఆరు నెలలు మెటర్నిటీ లీవ్ లో ఉంది.  రేపటినుండి తిరిగి జాయిన్ ఆవుతుంది ” అంటూ గర్వంగా చెప్పడంతోధరణి వేపు ఆసక్తిగా చూస్తున్న శ్రీనిధితో వసుంధర గారు“అది నా కూతురు అని గొప్ప చెపుకొవడం కాదు కానీ ధరణి ఆ జిల్లాని, అక్కడ ఉన్న ప్రజలను చాలా సమర్థవంతంగా చూసుకుంటుంది. అందుకె ఆమెకు ఈ మధ్యేరాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డుతో సత్కరించింది”అంటున్న తల్లి మాటలకి ధరణి సిగ్గుపడుతూ “ఆదేమి లేదండీ నాఉద్యోగ ధర్మం సాయశక్తులా నిర్వర్తిస్తాను అంతే” అంది నిరాడంబరంగా.

అంత నిగర్వంగా ఉన్న ధరణి ని చూసి ‘అందుకేమన పెద్దలు నిండుకుండ తొణకదు అంటారు’అనుకుంది శ్రీనిధి.అంతదగ్గర నుండి ఎప్పుడూ ఒక కలెక్టర్ ని చూడని శ్రీనిధికి ఆమె గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలంతో “ధరణి గారు, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట అడగనా?” అండంతో ధరణి అంగికారంగా తలఉపింది. “నఇన్ టు ఫైవ్జాబ్ చేస్తున్న నాకే ఇల్లు ఆఫీసు రెండు చూసుకోవడం చాలా కష్టంగావుంది,అలాంటిది మీరు ఇంత చిన్న వయసులో రాత్రి పగలు ఆనక ఒక జిల్లాకలెక్టర్ గా, గృహిణిగా,  తల్లిగాఇన్ని బాధ్యతలు ఇంత సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నారు. పాప పుట్టేముందు మీకు ఆమెను సరిగా పెంచగలనా లేదా అన్న సందేహం రాలేదా?” అంది శ్రీనిధి కుతూహలంగా.

దానికి ధరణి నవ్వి, “శ్రీనిధి గారు, నాకు పెళ్లికి ముందు అలాగే పాప పుట్టేముందు కూడా యిన్ని బాధ్యతలుసవ్యయం గా  చెయ్యగలనా అన్న భయం మనసులో ఉండేది కానీ ఏ కొత్త బాధ్యత అయినా, పని అయినా చేయడానికి ముందు భయం ఉండడం సహజమే కదా. నన్ను అర్థం చేసుకుని నాకు తోడు నీడగా ఉండే  భార్త ,ఆన్ని విధాలగా సాయపడే కుటుంబం తోడు ఉంటే ఇక బెంగ ఎందుకు అని ముందడుగు వేసాను. నాకు సాయంగా ఇప్పుడు అమ్మ వస్తే, మరి కొన్నేళ్లకి అత్తయ్య వచ్చి నాకు సాయంగా ఉంటారు. నాకు ఎప్పుడు “అమ్మా” అన్న పిలుపు వినాలన్న కోరిక ఉండేది. చిన్ని నా జీవితం లోకి రావడం తో నా కోరిక నేరవేరింది. నేను బాధ్యతలకు భయపడి, స్వేచ్ఛ కోల్పోతానని అనుకుంటే ఈ అమ్మాతం లో ఉన్న తియ్యదన్నాని కొలిపోయివుండేదానిని. ఇప్పుడు చిన్నేనా లోకం, దాని పనులన్నీ నేనే స్వయంగా చేసి మాతృత్వంలో ఉన్న మధురానుభూతిని ఆస్వాదిస్తున్నాను. అన్నట్టు శ్రీనిధిగారు, మిమ్మలని నా మాటలతో విసగిస్తున్నానా?”అనడంతో శ్రీనిధి, “లేదండి, మీరు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది” అంటూ మనసులో ‘అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే చెపతువుంటుంది కాని నేనే ఆమె మాటను పట్టించుకోలేదు’ అనుకుంది బాధగా.

తెల్లవారుతూనే వారి స్టేషన్ రావడంతో ధరణి, వసుంధర పాపను ఎత్తుకుని శ్రీనిధికి బై చెప్పి భోగీదిగగానే చాలామంది ధరణిని పూలగుత్తులతో, దండలతో స్వాగతించారు. అది చూసిన శ్రీనిధి మనసులో, సమాజంలో ఇంకా చాలామంది స్త్రీలు ధరణిలాగేనే ఎదగాలని కోరుకుంది. ట్రైన్ వేగం అందుకుంది, శ్రీనిధి మనసూ కూడా ధరణి అన్న మాటకి ఆమె ఇన్నాళ్ళుగా చేస్తున్న తప్పు తెలుసుకుని పాశ్చతాపంతో కుమిలిపోయింది. ఇన్నాళ్లు మాతృత్వానికి దూరంగా ఉండి ఎంత విలువైన అనుభూతిని కోల్పోయిందో అర్థమై, అది ఆస్వాదించాలన్న కోరిక బలపడింది.

 ఈ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. శ్రీనిధి ఇల్లు బంధుమిత్రులతో సందడిగా ఉంది. శ్రీకర్,శ్రీనిధి చంటి పాపనుఒడిలోపెట్టుకుని బారసాల పీటలపై కూర్చున్నారు. పురోహితుడు పూజ చేయించి, పాప పేరు బియ్యంలో రాయమనడంతో శ్రీనిధి శ్రీకర్ చెవిలో పాప పేరు  చెప్పిది. ఆయన పసుపుకొమ్ముతో బియ్యంపై ‘ధరణి’ అని రాశాడు. పాప పేరును చూసిన శ్రీనిధి సంతోషంతో“నా చిట్టితల్లి,ధరణి”అంటూ ముద్దు పెట్టుకుని మురిసిపోయింది.

శ్రీనిధికి ధరణి అన్నది ఒక పేరు మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని ఒక అందమైన మలుపు తిప్పిన పేరు. ఒడిలో ఉన్న పాపను చూస్తున్న ఆమెకు ట్రైన్ లో కలిసిన కలెక్టర్ ధరణి లాగె ఆమె పాపకికుడా అంత గొప్ప వ్యక్తిత్వం కలగాలని దేముడిని కోరుకుంది.

***

July 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆపద్బాంధవుడు

by Padmasri Chennojwala July 30, 2026
written by Padmasri Chennojwala

తెల్లకోటు మాటునున్న అతని గుండెలో మానవత్వపు ఊట
విలువల వలువలు తొడిగిన అతని ఆశయం సామాన్యుని పాలిటి సంజీవని
జేబులో బొమ్మల ధ్యాసేలేని ఔన్నత్యం
అంతరాలెంచని ఔదార్యం
ప్రణాళికాపఠనం సమన్వయమై
రేయీపగలూ శ్రమించిన కార్యశీలి
స్వప్నం సాకారమైన ధన్వంతరీ ప్రతినిధి
ఉదయసంధ్యల నడుమ
పరుగెడుతూ వృత్తిలో తరించిన సేవాతత్పరుడతను

కాలం ఏ గాయం చేసిందో మరి!!
శరీరమే పట్టు తప్పిందో
మనసే మాట విననందో
కర్తవ్యం శూన్యంలోకి జారుకుంది
దండెంపై దీనంగా వేలాడుతూ తెల్లకోటు!
చిలక్కొయ్యకు వేలాడుతూ
స్టెతస్కోప్!

లబ్ డబ్ ల నడుమ పేదగుండె పెనుగులాడుతోంది
కుంచించుకు పోయిన కవాటాల నడుమ గావుకేకలు పెడుతోంది
వైద్యం వ్యాపారమై సిరల్లో రక్తం చిక్కబడుతోంది
బతుకు పలుచనై ఔషధం అందనంటూ దౌడు తీస్తోంది

లే!!
జూలు విదిల్చిన సింహానివై
సంధించిన బాణానివై
కర్తవ్యానికి సమాయత్తమవ్వు

పేరుకుపోయిన నైరాశ్యాన్ని తరిమికొట్టు
రంగు మాసిన తెల్లకోటు మకిలి వదిలించు

కొడిగట్టే దీపంలో ఏ వీరుడు దాగున్నాడో!
దేశ రక్షణకు నువ్వో పరోక్ష కంచెవి

ఆరిపోయే జ్యోతిలో ఏ శాస్త్రజ్ఞుడు నక్కి ఉన్నాడో!
సరికొత్త ఆవిష్కరణలకు నువ్వో చక్కని ఔషధ మిశ్రమానివి

ఔన్నత్యంతో నిండిన నీ గుండె అమృత కలశమై రోగుల పాలిటి జీవగంగ కావాలి

ధన్వంతరీ ప్రతినిధివై సుశ్రుతుని వారసునివై పీడితుల నడుమ బొంగరమై తిరుగు
చికిత్సాలయంలో వైద్య నారాయణడివై అవతరించు

వైద్యుడు ప్రపంచాని కవసరం
మనసున్న వైద్యుడు పేదవాడి కత్యంత అవసరం

లే!!!
ఉదయించే సూర్యుడివై
తూర్పు తలుపు తెరువు
ఆశలుడిగిన కళ్ళలో
వెలుగువై ప్రసరించు

July 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

‘మంచి’ అనేది సమాజంలోకి వెళ్లాలి – అంపశయ్య నవీన్

by Aruna Dhulipala July 30, 2026
written by Aruna Dhulipala

కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ నవలాకారులు అంపశయ్య నవీన్ గారితో మయూఖ ముఖాముఖి…….

తమ రచనల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసి, అనేకుల అభిమానాన్ని సంపాదించుకొని ‘అంపశయ్య’ అనే తమ నవలనే ఇంటిపేరుగా చేసుకొని ప్రసిద్ధి వహించిన ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ గారి జీవనం మరియు సాహిత్య ప్రస్థానాలను గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏🏼

మీ నవలల ద్వారా విశేష ప్రజాదరణ పొంది, ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు. అటువంటి మీ జీవిత విశేషాలను మా మయూఖ పాఠకులకు పరిచయం చేయడం సదవకాశంగా భావిస్తున్నాం. సమగ్ర రూపంలో మీ జీవిత విశేషాలను తెలియజేయండి. మొదటగా….

1.  మీ జననం ఎక్కడ జరిగింది. మీ కుటుంబ విశేషాలు చెప్పండి.

జ:    నమస్కారం! నేను పాలకుర్తి దగ్గర వావిలాల గ్రామం. దొంగరి పిచ్చమ్మ, దొంగరి నారాయణ నా తల్లిదండ్రులు. నేను 1941, డిసెంబర్ 24 న పుట్టాను. మా నాన్నగారు పూర్తి వ్యవసాయదారుడు. మాకు చాలా భూములు ఉండేవి. నేను కూడా అదే వృత్తి స్వీకరించాలని మా నాన్న కోరిక. కానీ నాకు ఇష్టం లేకుండేది. బాగా చదువుకొని లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించుకున్నాను. ఒక రచయితగా అందరి మన్ననలు పొందాను. నాకు ఒక తమ్ముడు, నలుగురు సిస్టర్స్. నేను ఉద్యోగం చేసేటప్పటికి ఇద్దరు సిస్టర్స్ ని చదివించగలిగాను. వాళ్లిద్దరూ టీచర్లు అయ్యారు. మా తమ్ముడు ఎమ్. కామ్ చేసి జాబ్ సంపాదించుకున్నాడు. మా అమ్మ సాధారణ గృహిణి.

2. మీ విద్యాభ్యాసం ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది?

జ:      నేను మా ఊళ్ళో మూడవతరగతి వరకు చదివాను. నిజాం హయాం కాబట్టి ఒకే ఒక్క ముస్లిం టీచరు ఉండేవాడు. ఉర్దూ మీడియం. నాకు నచ్చేది కాదు. స్వాతంత్య్రం వచ్చాక  తెలుగు మీడియం వచ్చింది. ఒక మంచి టీచరు స్కూలుకి రావడంతో చదువు మీద ఇంట్రెస్ట్ కలిగింది. మా ఊరికి దగ్గర్లో ఉన్న కొడకండ్లలో మా ఇద్దరు మేనత్తలు ఉండేవారు. అక్కడ నన్ను నాలుగవ తరగతిలో చేర్పించాడు మా నాన్న. అక్కడికి దగ్గర్లోనే ‘కొరివి’ అనే ఊళ్ళో మా చిన్నమ్మ ఉండేది. ఆ ఊళ్ళో ఐదవ తరగతి చదివాను. తిరుమల గిరి ఊళ్ళో 6,7 తరగతులు చదివాను. ఇక ఎనిమిదవ తరగతికి చుట్టుపక్కల అవకాశం లేదు.  అందువల్ల వరంగల్ ఎ. వి. స్కూల్లో చేరాను. అది మంచి ప్రయివేటు స్కూల్. విశ్వనాథ వారి తమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు మాకు తెలుగు చెప్పేవారు. మాథ్స్ కొండల్ రావు గారు చెప్పేవారు. మాకు ప్రిన్సిపాల్ గా ఉన్న వై. కె. శాస్త్రిగారు ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు. మంత్లీ టెస్ట్ పెడితే నేనొక్కణ్ణే పాసవడంతో ఆయన నామీద ప్రత్యేక దృష్టి పెట్టారు. 1957 లో మెట్రిక్యులేషన్ మంచి మార్కులతో పాసయ్యాను. అదే సమయంలో కరువు రావడం, వ్యవసాయాధారిత కుటుంబం కావడం వల్ల మా నాన్న ఇక కాలేజీలో చదివించలేనని మెట్రిక్యులేషన్ తో కూడా జాబ్ వస్తుంది కాబట్టి ఉద్యోగం చూసుకోమన్నాడు. నిజానికి టీచరు జాబ్ చేయడం నాకిష్టం లేకుండేది.

అరుణధూళిపాళ అంపశయ్య నవీన్ గారితో

3.  ఇటువంటి పరిస్థితుల్లో మీరెటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఏ విధంగా పై చదువులు చదువుకోగలిగారు?

జ:   ఆ సమయంలో “చూద్దాం! పరిస్థితులు మారకపోతాయా?” అన్న ఆశతో ఒక సంవత్సరం పాటు ఊళ్ళోనే వ్యవసాయపు పనులలో మా నాన్నకు సహాయం చేస్తుండేవాడిని. కానీ నా వల్ల కాలేదు. అమ్మ దగ్గర పది రూపాయలు తీసుకొని వరంగల్లుకు వచ్చాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అప్లికేషను పెట్టాను. పి యు సి లో సీట్ వచ్చింది. నాకు 8వతరగతి నుండే వంట చేసుకోవడం అలవాటు. మా స్నేహితులతో కలిసి ‘సత్సంగ్’ అనే దాంట్లో రూమ్ కిరాయికి తీసుకున్నాం. పియుసి తర్వాత బిఏ కూడా అక్కడే పూర్తి చేశాను. జి.వి.సుబ్రహ్మణ్యం గారు, ఇరివెంటి కృష్ణమూర్తి గారు, వేటూరి ఆనందమూర్తి గారు వంటి హేమాహేమీలు ఉపాధ్యాయులుగా ఉండడం నాకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి కల్గించింది. శ్రీనివాస ఉపాధ్యాయ అని ఎకనామిక్స్ అద్భుతంగా చెప్పేవాడు. నిజంగా చెప్పాలంటే ఆ కాలేజీ నన్ను బాగా ప్రభావితం చేసింది. మొదటిసారి ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ చూశాక ఇక్కడ చదవకపోతే నా జన్మ వ్యర్థం అనిపించింది. మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. మళ్లీ అమ్మ చాటుగా డబ్బులు ఇచ్చింది. స్కాలర్ షిప్ కూడా కొంత వచ్చింది. వరవరరావు, రాంరెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ముందు పొలిటికల్ సైన్సు, తెలుగు రెండు సబ్జెక్టులలో  సీట్ వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్ ఎకనామిక్స్ అయితే బాగుంటుందని, వెంటనే ఉద్యోగం కూడా వస్తుందని ఒత్తిడి చేశారు. దాంట్లో అప్లై చేస్తే అందులో కూడా సీట్ వచ్చింది. ఆ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్. ఏ పూర్తి చేశాను. వాళ్ళు చెప్పినట్టు ఎమ్. ఏ అయిపోయిన రెండు నెలలకే జాబ్ వచ్చింది.

4. ఇన్ని ఒత్తిడుల మధ్య మీకు సాహిత్యంపై అభిరుచి ఎట్లా ఏర్పడింది? దాని నేపథ్యం ఏమిటి?

జ:    వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ నన్ను బాగా ప్రభావితం చేసిందని ఇందాక చెప్పాను కదా! అక్కడ ఎప్పుడూ కథానిక, లేఖ, కవిత్వం, విమర్శ, ఇట్లా అన్ని ప్రక్రియల మీద సాహిత్య పోటీలు జరిగేవి. వాటిల్లో నేను పాల్గొనేవాడిని. తేటగీతిలో పద్యాలు కూడా రాశాను. కానీ గద్యం మీద ఉన్న ఆసక్తి పద్యం మీద ఉండేది కాదు. నేను ఎ. వి స్కూల్లో చదువుతున్నప్పుడే ఒక కథ రాసి విశ్వనాథ వెంకటేశ్వర్లు గారికి చూపెడితే చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. అడవి బాపిరాజు నవలలన్నీ చదివి వాటి మీద ఒక వ్యాసం రాసి జి.వి.సుబ్రహ్మణ్యం గారికి చూపితే “ఇంత చిన్న వయసులో చాలా బాగా రాశావు” అని ప్రశంసించారు. ఒక యదార్థ సంఘటన తీసుకొని దాన్ని కథగా మలచి పోటీకి పంపితే ప్రైజ్ వచ్చింది. మా కాలేజీలో మంచి లైబ్రరీ ఉండేది. బుచ్చిబాబు నవలలు నన్ను బాగా ఆకర్షించాయి. మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ వచ్చారు. చలం మ్యూజింగ్స్, బుచ్చిబాబు ఆశావాది నవల ఆ ఉత్సవంలో నాకు వచ్చిన బహుమతులు. అవి నన్ను బాగా ఆకట్టుకోవడంతో వాళ్ళ రచనలన్నీ చదివాను. అప్పటికి చదవడానికి నాకు శ్రీశ్రీ పుస్తకాలు నాకు దొరకలేదు. ఒకసారి వరంగల్ చౌరాస్తాలో బస్సు కోసం నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఒకతను పుస్తకాలు అమ్ముతున్నాడు. అందులో శ్రీశ్రీ మహాప్రస్థానం కనిపించింది. నా దగ్గర బస్సు టికెట్ కోసం ఒక్క రూపాయి మాత్రమే ఉంది. పుస్తకం వెల ఒక్క రూపాయి. వెంటనే పుస్తకం కొని హన్మకొండ వరకు నడుచుకుంటూ వచ్చాను. ప్రతీ సంవత్సరం కాలేజీలో పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకునేవాడిని. శ్రీశ్రీ, బుచ్చిబాబు, చలం వీళ్ళ ప్రభావం నా మీద చాలా ఎక్కువ.

5. మీ నవలా రచనకు తొలిబీజం ఎక్కడ పడింది?

జ:   నేను మొదటినుండీ నవలలు విపరీతంగా చదివేవాణ్ణి. ఎమ్.ఏ సెకండ్ ఇయర్ లో డబ్బులు లేక చాలా కష్టపడ్డాను. ఈ కష్టాలన్నిటిని ఒక నవలగా రాస్తే ఎట్లా ఉంటుంది అనిపించింది. నల్గొండలో నాకు ఉద్యోగం వచ్చిన తరువాత అంపశయ్య రాసి వరవరరావుకు చూపించాను. చాలా బాగుందని చెప్పాడు. దీన్ని “Stream of Consciousness” అంటారని చెప్పాడు. అట్లా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. ఆ రకంగా మొదటి నవల రాయడం జరిగింది.

6. ఒక్కరోజులో 18 గంటల పాటు ఒక వ్యక్తి అంతర్గత సంఘర్షణలను నవలగా మలచడం సులభ సాధ్యం కాదు. కథానాయకుడు రవి పాత్ర పూర్తిగా మీదేనని అర్థమైంది. ఈ నవలకు పాఠకుల నుండి వచ్చిన స్పందన ఎటువంటిది?

జ:    రవి పాత్ర పూర్తిగా నాదే అనడంలో ఎటువంటి సందేహం లేదు (పెద్దగా నవ్వుతూ). అయితే ఈ నవల ఒకేసారి రాసింది కాదు. రెండు సంవత్సరాల్లో పూర్తయింది. నవల పుస్తకరూపం రావడానికి చాలా కష్టపడ్డాను. ఈ నవలను చూసి మా స్నేహితుడు ఆంధ్రజ్యోతికి పంపుమని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో కొత్తవారికి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. విజయవాడకు వెళ్లి, పత్రిక ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యశర్మను కలిసి నవల ఇచ్చాను. ఆయన రెండు నెలల్లో చెప్తానన్నాడు. నాలుగు నెలలు ఎదురుచూసినా ఎటువంటి సమాచారం రాలేదు. మళ్లీ వెళ్లి కలిశాను. “అంత తొందరైతే ఎలా? మీకు ఇష్టం లేకపోతే తీసుకువెళ్లండి” అన్నాడు నిర్లక్ష్యంగా. వెంటనే తెచ్చుకున్నాను. హైదరాబాద్ లో ‘యువ’ అనే మాసపత్రిక వచ్చేది. దానికి ఎడిటర్ చక్రపాణి. కానీ మొత్తం చూసే వ్యక్తి దండమూడి మహీధర్. ఈయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాడు. ఆయనకు ఇచ్చాను. కొత్తగా చాలా బాగుందని, ఎడిటర్ కు చూపించి చెప్తానన్నాడు. చక్రపాణి గారు ఓ పదిపేజీలు చదివి “ఇది వేస్తే మన పేపర్ సర్క్యులేషన్ పడిపోతుంది” అన్నాడట. నాకసలు ఏమీ తోచలేదు. చదివిన వాళ్ళు అంతా బాగుంది అంటున్నారు. కానీ ఏ పత్రికలో రావడం లేదు. పత్రికలో రాకుండా ప్రజలకు చేరేదెలా? వరవరరావు, నేను చాలా చర్చించుకున్నాం. ఆ సమయంలో మేం ‘సృజన’ అనే మ్యాగజైన్ తెస్తున్నాం. అది త్రైమాసిక పత్రిక. దాంట్లో వేయాలంటే అంత పెద్ద నవలను వేయడం కష్టం కదా! ముందు సీరియల్ గా వేద్దామనుకున్నాం. పాఠకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. పుస్తకంగా వేద్దామంటే డబ్బులు లేవు. నా భార్య తన బంగారు గొలుసు ఇచ్చి బ్యాంకులో పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ప్రింటు చేయమన్నది. ఆ గొలుసుకు 1200 రూపాయలు వచ్చాయి. దాంతో పుస్తకంగా ప్రచురించాం. నర్సింహారెడ్డి అనే చిత్రకారుడు రేఖాచిత్రంగా ముఖచిత్రం వేశాడు. అది కూడా అందరినీ చాలా ఆకట్టుకుంది. 4,5 నెలల్లోనే 100 పుస్తకాలు అయిపోయాయి. అద్దేపల్లి రామ్మోహన్ గారు, ఆవంత్స సోమసుందర్ గారు, ఆరుద్ర గారు చదివి ప్రశంసించారు. శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. నేనూ వెళ్ళాను. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు నేను వచ్చానని తెలిసి నన్ను కలవడానికి వచ్చారు. మా హాస్టల్ లో జరుగుతున్న విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టు రాశారు. ఇవన్నీ మీకెట్లా తెలిశాయి? అని ఆశ్చర్యంగా అడిగారు. నా రచన అందరినీ ఆకట్టుకుంటున్నదని అర్థమైంది. ఇప్పటికి 17 పర్యాయాలు రీప్రింట్ అవడమే పాఠకుల ఆదరణకు ఉదాహరణ.

7. ‘రవిత్రయం’గా పేరు పొందిన అంపశయ్య, ముళ్లపొదలు, అంతస్స్రవంతి..ఈ మూడు నవలలను సీక్వెల్ గా రాయాలనే ఆలోచనకు ప్రేరణ ఏమిటో చెప్పండి.

జ:    బిభూతి భూషణ్ అనే రచయిత రాసిన బెంగాలీ నవలను ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే  పథర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్ అనే సీక్వెల్ గా మూడు సినిమాలు తీశాడు. అది చూసి అట్లా రాయాలనే ప్రేరణ కలిగింది. మొదటి నవల ‘అంపశయ్య’లో రవి అనేక కష్టాల మధ్య చదువుకుంటాడు. రెండవది ‘ముళ్లపొదలు’ .రవి, అతని స్నేహితుల పాత్రలతో రాశాను. వారి ఆలోచనా మార్గాలు వేరు. ఒకరేమో లెఫ్టిస్ట్ భావాలు కలవాడు. మరొకరు నక్సలైట్, ఒకతను ప్రత్యేక తెలంగాణ కోరుకునేవాడు. మరొకరు అమెరికా వెళ్లాలనే కలలు కనేవాడు. రవి సాహిత్యంలో ఉన్నవాడు. ఆ కాలంలో జాబ్స్ పొందడానికి ఎన్ని కష్టాలు ఉండేవో ఒక్కో క్యారెక్టర్ ద్వారా వివరించాను. దాశరథి రంగాచార్య నాకు స్నేహితుడు. కథ చదివి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ముళ్లపొదలు అనే పేరు ఆయనే పెట్టాడు. ఇక మూడవది ‘అంతస్స్రవంతి’. ఇందులో రవికి జాబ్ రావడం, పెళ్లి జరగడం, వైవాహిక జీవితంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు అన్నీ వివరించాను. మొత్తంగా ఒక వ్యక్తి జీవితంలోని సంఘర్షణ పరిపూర్ణంగా మూడు నవలల్లో ఉంటుంది.

8. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందిన “కాలరేఖలు” నవలకు పురికొల్పిన పరిస్థితులు ఏమిటి?

జ:  ఆ కాలంలో జరిగిన ఆంధ్ర మహాసభలు పునరుజ్జీవనాన్ని కలిగించాయని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగానే గ్రంథాలయోద్యమం వచ్చింది. ప్రతీ ఊళ్లో ఒక స్కూల్, ఒక లైబ్రరీ ఏర్పాటు, వెట్టిచాకిరీ నిర్మూలన వంటివి ఆంధ్ర మహాసభ లక్ష్యాలు. ఆ తరువాత అది అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. అయితే 11 వ ఆంధ్ర మహాసభ జరిగేనాటికి అది పూర్తిగా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1944లో భువనగిరిలో 11 వ ఆంధ్రమహాసభ ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు అన్ని గ్రామాల్లో మీటింగులు పెట్టి, దాని గురించి వివరించి, సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే మా ఊళ్లోనూ ఒక మీటింగ్ నిర్వహించారు. రావి నారాయణరెడ్డి దానికి అధ్యక్షుడు. ఆయనతో పాటు బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా సభకు వచ్చారు. 11 వ మహాసభకు సంకేతంగా ఒక బండిని బాగా అలంకరించి, 11 జతల ఎడ్లతో వీధుల వెంబడి ఉత్సవంగా తిప్పారు. అప్పుడు నాకు నాలుగైదేండ్ల వయస్సు. ఆ ఘట్టం నన్ను బాగా ఆకర్షించింది. రావి నారాయణ రెడ్డి గారు ప్రధాన వక్తగా ఆనాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. అంపశయ్య రాసిన తర్వాత మరో నవల రాయలని ఆలోచన వచ్చింది. ఈ 11వ మహాసభ గురించి , తెలంగాణ పరిస్థితులను గురించి రాయాలని కాలరేఖలు రాశాను.

9. ‘కాలరేఖలు’ నవలను కూడా నవలాత్రయంగా మలిచారు కదా! ఈ ట్రయోలజీ రూపానికి కారణం ఏమిటి?

జ:    అవును. రవిత్రయం లాగా “కాలరేఖలు” కూడా ట్రయోలజీలో రాశాను. నేను దీంట్లో పూర్తి తెలంగాణ చరిత్రను రాయాలనుకున్నాను. 1944 నుండి మొదలుకొని 1995 వరకు తెలంగాణా ప్రజల చరిత్ర అది. నేను 1996 రిటైర్ అయ్యాను. అప్పుడు రాసిన నవల ఇది. ఇంత చరిత్రను ఒకే పుస్తకంగా కూర్చడం చాలా కష్టం. అందుకే మూడు భాగాలుగా చేశాను. 11 జతల ఎడ్ల బండి దానికి ప్రేరణ. మూడూ కలిపి1600 పేజీలకు పైగా ఉంటుంది. మొదటిది కాలరేఖలు 1944 నుండి 1956 వరకు తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు, చారిత్రక సంఘటనలను గురించి రాశాను. దీనికే 2004 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రెండవది చెదిరిన స్వప్నాలు. ఇందులో 1957 నుండి 1970 వరకు ఆ కాలంలో జరిగిన చైనా, పాకిస్తాన్ యుద్దాలు మొదలైన సంఘటనలతో పాటు భారతీయులు స్వతంత్రం వచ్చాక కన్న కలలు నెహ్రూ పాలనలో భంగం కావడాన్ని చెదిరిన స్వప్నాలుగా వివరించాను. ఇక 1970 నుండి 1995 వరకు జరిగిన ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య, ఆర్థికంగా వచ్చిన మార్పులు వీటన్నింటినీ మూడవది “బాంధవ్యాలు” లో చిత్రించాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే సమస్యలను వివరించాను. రవిత్రయం వ్యక్తి ప్రధానమైతే, కాలరేఖలు చరిత్ర ప్రధానమైంది. నా స్నేహితుడు, నాకు శిష్యుడు ఒకతను నేను రాస్తున్నప్పుడు చూసి ఇంత పెద్ద పుస్తకం వేయడం కష్టం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లు నవల గానీ ఆటో బయోగ్రఫీ కానీ రాసినవాళ్లకు ముద్రించే స్కీమ్ ఒకటి పెట్టారని, దానికి పంపుమని సలహా ఇచ్చాడు. నా పేరు మీద అతనే ఫారం నింపి పంపాడు. ఎంతో ఆశ్చర్యం! కేంద్రప్రభుత్వం రెండేళ్లలో దానిని పూర్తి చేయడానికి నెలకు ఆరువేల చొప్పున సీనియర్ ఫెలో షిప్ ఇచ్చింది. అట్లా రెండేళ్లలో దాన్ని పూర్తిచేశాను. విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నాను.

10. ఈ “చైతన్య స్రవంతి” (Stream of Consciousness) లక్షణాలేమిటో తెలపండి.

జ:    బయట ఏం జరుగుతున్నదో కాకుండా అంతర్గతంగా మనిషిలో జరిగే సంఘర్షణను తెలియజేయడం చైతన్య స్రవంతి లక్షణం. వర్జీనియా ఊల్ఫ్ అనే రచయిత్రి ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ నెస్ అనే దానికి మార్గదర్శి. “మిసెస్ డలోవే” అనే నవలలో ఆమె ఈ పద్ధతిని ప్రారంభించారు. జేమ్స్ జాయిస్ ఈ లక్షణాన్ని తన “యూలిసెస్” అనే నవలలో పరాకాష్టకు తీసుకువెళ్లాడు. “మిసెస్ డలోవే” లో ఉన్న లక్షణానికి ఇది విస్తృత రూపం. ‘Ulysses’ అందుకోవడం చాలా కష్టం. ఆయనే “A portrait of the artist as a young man” అనే పుస్తకాన్ని ఇదే శైలిలో రాశాడు. అది కొంతవరకు మనకు అర్థమవుతుంది. గమ్మత్తేమిటంటే నేను అంతకుముందు ఈ రచనలేవీ చదవలేదు. ఇవేవీ తెలియకుండానే ఇటువంటి రచన చేశాను. నా స్నేహితుడు ఈ రెండు నవలలను చదవమని, వాటిల్లో నువ్వు రాసిన లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పాడు. ఇవి చదివిన తర్వాత ఈ లక్షణానికి అనుగుణంగా మార్పు చేశాను. మొదట తెలియనప్పుడు రాశాను. తెలిసిన తర్వాత కొంత మార్పు చేశాను. ఆ తర్వాత పూర్తి లక్షణాలతో రాశాను.

11. సినిమాల పట్ల మీకు అభిరుచి కలగడానికి కారణం ఏమిటి? కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఫిలిం సొసైటీ ద్వారా మీరు చేసిన కృషి ఏమిటి?

జ:    సహజంగా ఇది హైస్కూల్లో చదువుతున్నప్పటి నుండే మొదలయింది. అంతకుముందు పల్లెటూళ్ళో ఉండేవాడిని కాబట్టి తెలియదు. వరంగల్ వచ్చాక మొట్టమొదటి సారి 8వ తరగతిలో మా స్నేహితుడు “మనోహర” అనే డబ్బింగ్ మూవీకి తీసుకువెళ్లాడు. అట్లా అలవాటయి వరుసగా చూసేవాణ్ణి. సినిమాలు చూడడం వల్ల నా చదువుకు ఎటువంటి ఆటంకం కలుగలేదు. జ్ఞాపకశక్తి బాగా ఉండేది. అసలు మొదట్లో సినిమాలకు కథలు రాయాలని, నటించాలని ఉండేది. కానీ తెలంగాణా వాళ్లకు అవకాశం రాదని అర్థమైంది. మంచి కథలతో కూడిన ఆర్ట్ సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడేవాణ్ణి. సత్యజిత్ రే సీక్వెల్ గా తీసిన సినిమాలు చూశాను. నేను కరీంనగర్ లో పన్నెండు సంవత్సరాలు ఉన్నాను. అక్కడ స్నేహితులతో కలిసి ఫిలిం సొసైటీ ఏర్పాటు చేశాం. దాని ద్వారా బెంగాలీ, మరాఠీ వాటిలోని మంచి సినిమాలు ప్రదర్శింపజేశాం. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సినిమా అనిపించుకున్న సినిమాలన్నీ ఆ సొసైటీ ద్వారా ప్రదర్శించాం. అక్కడినుండి నాకు వరంగల్ ఉమెన్స్ కాలేజీకి ట్రాన్స్ ఫర్ అయింది. అప్పటికే వరంగల్ లో ఫిలిం సొసైటీ ఉంది. దాన్ని ఇంకా అభివృద్ధి చేశాం.

12.  మీ ‘దృక్కోణం’ నవలకు కూడా సినిమా నేపథ్యం ఉందని విన్నాం. ఆ విషయాలను చెప్పండి.

జ:  అవును. నా నవలల్లో నేను చూసిన సినిమాల ప్రభావం ఉంది. మీరన్నట్టు దృక్కోణం కూడా ఆ విధంగా వచ్చిందే. జపనీస్ డైరెక్టర్ అకీరా కురోజవా తీసిన ‘Rashoman’ సినిమాలో ఉన్న కథ చాలా విభిన్నమైంది. ఒక జరిగిన సంఘటనను చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తారు. ఎవరి ఆలోచనా విధానం వారిది. ఆ సినిమా ఆధారంగా “దృక్కోణాలు” రాశాను. ఇతివృత్తం ఏంటంటే ఒక డెంటిస్ట్ దగ్గర పనిచేసే వ్యక్తి ఆయనను దగ్గరగా చూస్తూ అన్ని పనులూ నేర్చుకున్నాడు. మంచి మనసు కలవాడు. తనే ఒక క్లినిక్ పెట్టి, ఫీజు తక్కువగా తీసుకొని వైద్యం చేసేవాడు. చాలా మంది ఆయన మీద నమ్మకంతో వచ్చేవారు. వచ్చినవారికి పంటి సమస్యలు బాగా తగ్గిపోయేవి. ఒకరోజు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన పన్ను తీయడానికి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె నొప్పి భయంతో గట్టిగా అరిచింది. దాంతో ఆయనంటే గిట్టని వాళ్లు ఆయన మీద నిందలు మోపారు. ఆయన మంచితనాన్ని తెలిసిన వాళ్లేమో ఆయన అలాంటివాడు కాదనడం. ఇట్లా అందరూ అనేకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆ మాటలు నేను విన్నాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇంత జరిగితే అసలేమైందో ఎవరికీ తెలియదు. చెప్పేవాళ్లూ ఉండరు. ఇలాంటివి లోకంలో ఎన్నో జరుగుతుంటాయి. అందుకే నా ఉద్దేశ్యం ఏమిటంటే ‘మంచి’ అనేది సమాజంలోకి, ప్రజల్లోకి వెళ్లాలని.

13. మీరు రాసిన నవలల్లో మీకు ఎక్కువ ఇష్టమైన నవల ఏది?

నవీన్ గారి రచనలు

జ:   అంపశయ్య నా జీవితమే కాబట్టి మొదట అదే ఇష్టం. ఆ తర్వాత నాకు బాగా పేరు తెచ్చిన నవల, ఇష్టమైన నవల “చీకటిరోజులు”. 1975లో ఎమర్జెన్సీ విధించారు. ఇందిరాగాంధీని ఎలక్షన్స్ లో పాల్గొనకూడదని జడ్జిమెంట్ వచ్చినరోజులు. ఆమె రిజైన్ చేయకుండా తనకు వ్యతిరేకులైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించింది. నా స్నేహితుడు తిరుపతయ్య. అతను అమాయకుడు. వరవరరావు వల్ల విరసంలో జాయిన్ అయ్యాడు. నన్ను కూడా చేరమని ఒత్తిడి చేశారు కానీ నేను చేరలేదు. దేంట్లోనైనా ఒక పక్షం వహించడం నాకు ఇష్టం ఉండదు. తటస్థంగా ఉంటాను. వరవరరావు తిరుపతయ్యకు రాసిన రెండు, మూడు ఉత్తరాలు ఆయనకు చేరకుండానే వాళ్ల కంట్లో పడడం వల్ల తిరుపతయ్యను కూడా లెఫ్టిస్టు అనుకొని అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచారు. నేను వెళ్లి అతన్ని కలవడానికి కూడా వీలు లేకుండేది. ఆయన విడుదలయ్యాక ఆయనను కలిశాను. అక్కడ తనను అంతగా హింసించకపోయినా త కళ్ళముందు జరిగిన హింసాత్మకమైన విషయాలను గురించి చెప్పాడు. “ఇవన్నీ ఒక నవల రాయొచ్చు కదా!” అని అడిగాను. “ఇప్పటికే వాళ్ళ దృష్టిలో నేనున్నాను. నువ్వు రాయి” అన్నాడు. ఆలోచించి నవల లాగా కాక ఒక డైరీ లాగా రాయాలనుకున్నాను. “చీకటిరోజులు” అనే పేరుతో రాశాను. ఈనాడులో నా ఫ్రెండ్ చలసాని ప్రసాదరావు ఇది చదివి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆదివారం ఎడిషన్ లో వేద్దామన్నాడు. రామోజీరావుకు చూపించాడు. అప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. నా నవల కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న నవల. కాబట్టి పేపర్ లో వేస్తే ఇబ్బంది అవుతుందని ఆయన అన్నాడు. పత్రికల్లో వేయించడానికి ఎన్నో అగచాట్లు ఎదుర్కొని చివరకు ప్రత్యేకంగానే పుస్తకం వేశాను.

14. ఆంగ్ల సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఎట్లా ఏర్పడింది? ఇతర భాషా సాహిత్యాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?

జ:   నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆంగ్ల సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. ఇంగ్లీష్ సాహిత్యంలో మంచి నవలలు వచ్చాయి. మంచి కవిత్వమూ వచ్చింది. హెల్లీ, కీట్స్, మొదలగు గొప్ప కవులు ఉన్నారు. ఛార్లెస్ డికెన్స్, థామస్ హార్డీ నవలలను చదివితే వదిలిపెట్టనంత బాగుంటాయి. ఎంత పెద్ద నవలలైనా వాటిని చదివేవాడిని.  ఎక్కాబుడ్డి ముందర కూచొని రాత్రిపూట చదువుతుండేవాడిని. టెక్స్ట్ బుక్స్ చదవడం పూర్తి చేసి మిగతా సమయమంతా ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదివేవాడిని. ఇంగ్లీష్ నుండే కదా షార్ట్ స్టోరీస్ మొదలైన ప్రక్రియలు తెలుగులోకి వచ్చినవి. ముఖ్యంగా నవలల్లో చదివించేగుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంట్రెస్ట్ తో చదువుతారు. అందువల్ల జీవిత విలువలు తెలుస్తాయి. ఇతర భాషా సాహిత్యాలను చదవడం వల్ల వారి సాహిత్యంలో ఉన్న విలువలు, మన భాషా సాహిత్యానికి, వాటికీ ఉన్న పోలికలు, తేడాలు తెలుస్తాయి. మన సాహిత్యాన్ని మనమింకా ఎంతగా మెరుగుపరచుకోవచ్చో అర్థమవుతుంది.

15. చలం గారి జీవితచరిత్రను రాశారు కదా! దాని గురించి చెప్పండి.

జ:   చలం గారి జీవితంలోని విషయాలను “ప్రేమకు ఆవలి తీరం” అనే నవలగా రాశాను. వాస్తవానికి చెప్పాలంటే 1950 తర్వాత చలం అంతకుముందు చలం కాదు. రమణాశ్రమానికి వెళ్లిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు “మ్యూజింగ్స్” లో భగవద్గీతను ‘సిల్లీ బుక్’ అని రాసిన వ్యక్తి అక్కడికి వెళ్లిన తర్వాత భగవద్గీతకు వ్యాఖ్యానం రాయడం చాలా ఆశ్చర్యం. ఆ మాయలో ఎంతగా పడిపోయాడంటే.. 1962లో “అష్టగ్రహ కూటమి” అనేది ఒకటి వస్తున్నట్లు, దానివల్ల ప్రళయం సంభవించబోతున్నట్లు వచ్చిన వార్తలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. దానికి ఆయన ఆ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకొని బతకాలంటే రమణ మహర్షి ఆశ్రమానికి రమ్మని శ్రీశ్రీ వంటి ఎంతోమందికి ఉత్తరాలు రాయడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకు ఆయనతో ప్రత్యక్షంగా పరిచయం లేకున్నా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఈ విషయంలో నాకు కూడా ఆ ఉత్తరం వచ్చింది. అంతేకాదు ఉత్తరంతో పాటు చిన్న విభూతి పొట్లాన్ని కూడా పంపాడు. మూఢ నమ్మకాలను పూర్తిగా ఖండిస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్నీ, స్త్రీ స్వేచ్ఛను కోరుకున్న వ్యక్తి, ఆ భావజాలంతో పుస్తకాలు రాసిన వ్యక్తి మూఢనమ్మకాల వలయంలో చిక్కుకుపోవడం నాకు ఎట్లాగో అనిపించింది. అందువల్ల ఇటువంటి విషయాలు కాకుండా ఆయన అంతకుముందున్న చలంగానే రాశాను. ఇది “Beyond the shore of love” అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించబడింది.

16. మీ సతీమణి గారి స్మృత్యర్థం “అనురాగదీపం” నవల రాశారు. ఆ అనుభవాలను చెప్పండి.

జ:   నా భార్య అనసూయ. అంపశయ్య నవలా ముద్రణకు ఆమె బంగారు గొలుసు ఇవ్వడం గురించి మీకు చెప్పాను కదా! మా అరవయ్యేళ్ళ దాంపత్యానికి సంకేతంగా “అనురాగదీపం” అని పేరు పెట్టి నవల రాశాను. ఆమెతో నా స్మృతులు, ఆమె లేకపోవడం వల్ల కలిగిన వేదనకు అక్షరరూపం ఈ నవల. అందులో ఎక్కడా కల్పన లేదు. నాకు ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఉన్నది ఉన్నట్టు రాశాను. ఆమె ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి అది క్యాన్సర్ అని తేలింది. అది చివరిదశ. ఆమెకు కూడా తాను ఎక్కువరోజులు బతకదని తెలిసిపోయింది. ఇక రెండ్రోజుల్లో చనిపోతుందనగా నాతో రాస్తూనే ఉండమని, రాయడం ఆపవద్దని, మా చిన్నబ్బాయికి సమస్య ఉండడం వల్ల వాడిని బాగా చూసుకోమని ఈ రెండు విషయాలు గట్టిగా చెప్పింది. ఆమె మాటలను ఆచరిస్తూనే ఉన్నాను.

17. సాహిత్యంలో ఉండే విభిన్న వాదాల గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ:   ఇవేంటంటే ఇవి ఏర్పరచుకున్న వ్యక్తులు వాటికి కట్టుబడి ఉంటారు. ఉదాహరణకు స్త్రీ వాదం రాకముందే నేను స్త్రీల పట్ల సానుభూతితో రాసిన ఎన్నో నవలలు ఉన్నాయి. అందరూ అదే మాట అనడం జరిగింది కూడా. కానీ ఎప్పుడూ అదే వాదం నిలుస్తుందనడానికి వీలుండదు. కాలక్రమంలో మార్పులు జరగొచ్చు. జరిగిన మార్పులను బట్టి వాళ్ల దృక్పథాలను వాళ్లు మార్చుకోరు. దానివల్ల నష్టాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. ఈ వాదాలకంటే ఏది మంచి, ఏది న్యాయమో ఆ పక్షం వహించి ఉండడం సమాజానికి ఉపయోగకారి అవుతుంది.

18. మీ నవలల్లో మొదటినుండీ చివరి వరకు ఆపకుండా చదివించే గుణం ఉంటుంది. అలా ఒక నవల రాయాలంటే నవలాకారునికి ఉండాల్సిన లక్షణం ఏది?

జ:   ముఖ్యంగా ఒక నవల అంటే ఆ నవలల్లో ఉండే పాత్రలు రీడర్ కు కనెక్ట్ కావాలి. తనను తాను చూసుకున్నట్టు ఉండాలి. తనలో ఆ పాత్ర ప్రతిబింబించాలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఇతివృత్తాలు కావాలి. ఊహలకు, కల్పనలకు తావు ఉండకూడదు. నేను ఏది రాసినా అలాగే రాశాను. చాలామంది ఫోన్లు చేసి చెప్పేవారు. అందువల్లే అందరినీ ఆకట్టుకున్నాయి. యద్దనపూడి సులోచనారాణి నవలలు బాగా చదివేవాడిని. ఏ రచయిత్రి రచనలు కూడా నేనంతగా చదవలేదు. ఆమె ఒకసారి నాతో “మీ నవలలు చాలా బాగుంటాయి” అన్నారు. ఆమెను ప్రత్యక్షంగా కలవాలనుకున్నాను. కానీ ఆ కోరిక తీరలేదు.

19. పాఠకుని ఆకట్టుకునే ప్రతీ రచనా సమాజానికి ఉపయోగపడుతుందంటారా?

జ:   లేదు. అట్లా చెప్పడానికి వీలు లేదు. మంచి రచయిత లక్షణమేమిటంటే ‘ఇది మంచి’ అని చెప్పకూడదు. తాను చెప్పదలచుకున్నది మాత్రమే చెప్పాలి. కానీ ‘ఇదే’ అని నిర్ధారణ చేయకూడదు. ఒక రచనను చదివినప్పుడు పాఠకుడు అది మంచిదా కాదా? సమాజానికి ఉపయోగపడుతుందా లేదా? అని తానే నిర్ణయించుకోవాలి. నేను రాసిన “రక్త కాసారం” నవలలో ఆనాడు పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఉండే వాతావరణాన్ని చిత్రించాను. ఒక కవి “మీరు ఎవరిని సమర్థిస్తున్నారని, స్పష్టంగా చెప్పకుండా ఎందుకు వదిలేశార”ని నన్నడిగాడు. అక్కడ ఎవరు కరెక్ట్ అనేది చెప్పినందువల్ల అది కేవలం నా అభిప్రాయమే అవుతుంది. అందువల్ల అక్కడ వాతావరణాన్ని చిత్రించినప్పుడు దాన్ని బట్టి పాఠకుడు మంచి చెడుల అంచనా వేస్తాడు. కాబట్టి రచయిత ఎప్పుడూ తన అభిప్రాయాలను పాఠకుల మీద రుద్దకూడదని నా ఉద్దేశ్యం.

20.   ఇన్ని రచనలు చేసిన మీకు ఇంకా ఇది రాయాలనే కోరిక కానీ , ఇది చేయలేకపోయానని అసంతృప్తి కానీ ఏమైనా ఉన్నాయా?

జ:  ఉన్నమాట నిజమే (నవ్వుతూ). నా జ్ఞాపకాలను గురించి రాయాలని ఉంది. స్నేహితులు కూడా చెప్తున్నారు. బహుశా 1770-71 ప్రాంతంలో శ్రీశ్రీ షష్టిపూర్తి ఎంతో వైభవంగా జరిగింది. ఎంతోమంది సాహితీ దిగ్గజాలు వచ్చారు. ఒకవేళ ఆనాటి నా జ్ఞాపకాలను నేను రాస్తే అప్పటి రచయితలు, కవులు, వారి మాటలు అన్నీ ఈనాటి కాలం వారికి తెలుస్తాయి కదా! ఒక సాహితీవేత్తగా, నవలాకారునిగా, నాకున్న అనుభవాలను, మధురస్మృతులను రాసుకుంటే తర్వాతి తరాలకు తెలుస్తాయి. అందువల్ల అది రాయాలని కోరిక. ఇక మీరడిగినట్టు అసంతృప్తి కూడా ఉంది. ఒక పత్రికకు ఎడిటర్ కావాలని ఉండింది. ‘సృజన’ అని వరవరరావుతో కలిసి పెట్టాం. ఆయనే ఎడిటర్.  ఆధునిక సాహిత్య వేదిక అనేది దాని టాగ్ లైన్. అంటే కొత్తగా వచ్చే రచనలను ప్రోత్సహించాలని మా ఉద్దేశ్యం. మొదట్లో అది త్రైమాసిక పత్రిక. తరువాత మాసపత్రికగా మార్చాం. నా పత్రిక అన్నట్టు వర్క్ చేసేవాడిని. 15 ఎడిషన్స్ వచ్చాక వరవరరావు పూర్తిగా విప్లవ సాహిత్యం వైపు వెళ్లాడు. అప్పుడది విప్లవ సాహిత్యవేదిక అనిపించుకుంటుంది కానీ ఆధునిక సాహిత్యవేదిక కాదు. అందుకే వదిలేశాను. ఆవిధంగా నా కోరిక నెరవేరలేదు. రాజకీయాలతో ప్రమేయం లేకుండా పూర్తి సాహిత్యపత్రిక పెట్టాలన్న నా కోరిక అట్లాగే మిగిలిపోయింది. చాలా పత్రికలు మంచి లక్షణాలతోనే మొదలవుతాయి. కానీ తొందరగా మూతపడతాయి. ఎప్పుడైనా కొత్తగా రాసేవాళ్లకు అవకాశం ఇవ్వాలి. రచనలు రాసే వారి సంఖ్యను పెంచాలి. చాలా సంతోషం సార్🙏🏼మీ అమూల్యమైన సమయాన్ని  మా కోసం వెచ్చించి మీ జీవితంలోని ఎన్నో అనుభవాలను, మీ సాహితీ ప్రస్థానాన్ని గురించి సమగ్రంగా తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేక కృతజ్ఞతలు.

July 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అమ్మకొంగు

by S. Srilatha July 30, 2026
written by S. Srilatha

ఎండలు మొదలయ్యాక ఆ ఊరిలో మధ్యాహ్నాలు మరీ నిశ్శబ్దంగా మారిపోతాయి. చెరువు కట్ట మీదున్న రావిచెట్టు కూడా ఆ వేళ గాలి కోసం ఎదురు చూస్తున్నట్టు కదలకుండా నిలబడిపోతుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని మాత్రం ప్రతి రోజు ఒకే శబ్దం చీల్చేది.

“పోస్టుమాస్టారూ… మా రవికి ఏమైనా ఉత్తరం వచ్చిందా?” గ్రామ పోస్టాఫీసు గుమ్మం దగ్గర నిలబడి అడిగేది సుబ్బమ్మ.

పోస్టుమాస్టర్ చిరునవ్వుతో తల ఊపేవాడు.

“ఈరోజూ లేదు అక్కా.”

“సరే బాబూ…”

అని చెప్పి వెనక్కి తిరిగేది. అడుగులు మాత్రం భారంగా ఉండేవి.

ఆమె వయసు అరవై దాటింది. తలలో సగం జుట్టు వెండిరంగు పట్టేసింది. చీర మాసిపోయినా పరిశుభ్రంగా ఉంటుంది. నుదుటి కుంకుమ చిన్నదే కానీ, ఆత్మగౌరవం మాత్రం పెద్దది.

సుబ్బమ్మకు ఒకడే కొడుకు.. రవి. భర్త రామయ్య చనిపోయినప్పుడు రవికి ఆరేళ్లు. అప్పటి నుంచి ఆమే తల్లీ, తండ్రీ. ఒక ఎకరం పొలం. రెండు మేకలు. ఐదు కోళ్లు. అంతే ఆస్తి. కానీ ఒక కల మాత్రం చాలా పెద్దది.

“నా కొడుకు నాకన్నా మంచి జీవితం బతకాలే.” అనుకుని ఆ కల కోసం ఆమె చేసిన త్యాగాలకు లెక్కలేదు.

రవి చిన్నప్పుడు స్కూలుకు వెళ్లనని మొండికేసిన రోజులు గుర్తొచ్చాయి.

“అమ్మా… మాస్టారు కొడతాడు.” అని ఏడుస్తుంటే, సుబ్బమ్మ అతన్ని ఒడిలోకి తీసుకుని.. “ముందు నువ్వు నా కొంగులో దాక్కో బాబు. భయం తగ్గాక స్కూలుకు వెళ్దాం.” అనేది. వాడికి నిజంగానే భయం తగ్గిపోయేది. రవి ఏడ్చిన కన్నీళ్లు మొదట తుడిచింది ఆమె చేతి కాదు…ఆమె చీరకొంగే. ఆ కొంగులోనే అతని మొదటి బొమ్మ ఉండేది. ఆ కొంగులోనే పాఠశాల ఫీజు కోసం దాచిన ఐదు రూపాయల నోటు ఉండేది. ఆ కొంగులోనే మధ్యాహ్నం తినడానికి.. మామిడికాయ పచ్చడి రాసిన జొన్నరొట్టె ఉండేది. రవి పెద్దవాడయ్యే వరకు…ఆ చీరకొంగు అతనికి ఒక చిన్న ప్రపంచం. పదో తరగతిలో జిల్లా ఫస్ట్‌ వచ్చాడు రవి. ఊరంతా వచ్చి అభినందించింది.

“సుబ్బమ్మా… నీ కష్టం ఫలించింది.” అన్నారు.

సుబ్బమ్మ మాత్రం నవ్వి…” ఇప్పుడే మొదలే అయ్యింది.” అంది.

ఇంటర్, డిగ్రీ, ఆ తర్వాత పోటీ పరీక్షలు చదవడానికి డబ్బు సరిపోలేదు. ఒక రోజు రాత్రి…ఇంట్లో దీపం వెలుతురులో రవి పుస్తకం చదువుతున్నాడు. సుబ్బమ్మ, పెట్టెలో భద్రంగా ఉన్న బంగారు తాళిబొట్టును తీసి చూసింది. రామయ్య బ్రతికున్న రోజుల్లో పెట్టిన ఒక్కటే బంగారం. మరుసటి రోజు దాన్ని అమ్మేసింది. రవి ఆ విషయం తెలుసుకున్నాడు.

“అమ్మా… ఇది ఎందుకు చేశావు?”

“బంగారం మెడలో ఉంటే ఆభరణం. పిల్లాడి చదువుకు ఉపయోగపడితే భవిష్యత్తు.” ఆ మాట విని రవి మాట్లాడలేకపోయాడు. ఆ రాత్రి తల్లి నిద్రపోయాక ఆమె కాళ్ల దగ్గర కూర్చుని చాలాసేపు ఏడ్చాడు. కాలం గడిచింది. రవికి నగరంలో ఉద్యోగం వచ్చింది. ఊరంతా సంబరపడింది. బస్సెక్కే రోజు…సుబ్బమ్మ కొత్త చొక్కా తీసి ఇచ్చింది.

“ఇది ఎప్పుడు కొన్నావమ్మా?”

“నువ్వు అడిగితే కొనలేను. అడగకుండా కొంటేనే తల్లి సంతోషం.”

బస్సు హారన్ కొట్టింది. రవి ఎక్కబోతుండగా… సుబ్బమ్మ తన చీరకొంగులో ముడివేసిన చిన్న పొట్లం అతని చేతిలో పెట్టింది.

“ఇది ఏమిటమ్మా?”

“బస్సు వెళ్లాక తెరిచి చూడు.”

బస్సు ఊరిని దాటాక తెరిచి చూశాడు. రెండు వందల రూపాయలు… ఒక చిన్న కాగితం. దానిపై వంకర వంకర అక్షరాల్లో ఇలా ఉంది.. “ఆకలేస్తే తిను. బాధేస్తే ఇంటికి రా. కానీ ఎవరి ముందు తల వంచకు. – అమ్మ.” ఆ కాగితం మీద రెండు నీటి చుక్కలు పడ్డాయి. అవి రవి కన్నీళ్లా…లేదా సుబ్బమ్మ కళ్లనుంచి పడినవో…అతనికి అర్థం కాలేదు. నగరం రవిని ఆప్యాయంగా ఆహ్వానించలేదు. పరుగెత్తించింది. ఉదయం తొమ్మిదింటికి ఆఫీసు. రాత్రి తొమ్మిదింటికి గది. నెలాఖరుకు జీతం. ఆ జీతం వచ్చేలోపే ఈఎంఐలు, అద్దె, ఖర్చులు. మొదట్లో ప్రతి రాత్రి తల్లికి ఫోన్ చేసేవాడు.

“తిన్నావా అమ్మా?”

“ఈరోజు పొలానికి వెళ్లావా?”

“మందులు వేసుకున్నావా?” సుబ్బమ్మ మాత్రం ప్రతిసారీ ఒకటే అడిగేది.

“నువ్వు క్షేమంగా ఉన్నావా నాన్నా?” అని.

కొడుకు గురించి తెలుసుకోవడమే ఆమెకు చాలు. తన గురించి చెప్పేది కాదు. ఒక రోజు కంపెనీలో రవికి ప్రమోషన్ వచ్చింది. కొత్త బాధ్యతలు. కొత్త స్నేహాలు. కొత్త జీవితం.

ఆ జీవితం నెమ్మదిగా అతనిలోని పల్లెను చెరిపేస్తోంది. ఆఫీసులో అందరూ ఇంగ్లీషులో మాట్లాడేవారు. గ్రామం గురించి చెప్పడానికి కూడా అతనికి సంకోచం కలిగేది. ఒకసారి సహోద్యోగి అడిగాడు.

“నీ అమ్మ ఏం చేస్తుంది?”

ఒక్క క్షణం రవి తడబడిపోయాడు.

“ఫార్మర్…” అన్నాడు.

‘కూలి పని చేస్తుంది’ అని చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు. ఆ రోజు మొదటిసారి…తల్లి కష్టాన్ని అతడు తన మాటల్లో దాచేశాడు. సుబ్బమ్మకు ఇవేవీ తెలియవు. ప్రతి శుక్రవారం ఆమె ఒక ఉత్తరం రాసేది. అక్షరాలు అందంగా ఉండేటివి కావు, కానీ ప్రేమ మాత్రం ప్రతి పంక్తిలో ఉండేది.

“నాన్నా… ఈ ఏడాది మామిడి చెట్టు బాగా కాసింది.”

“నీ చిన్నప్పటి స్నేహితుడు శేఖర్‌కి పెళ్లయింది.”

“నీకు ఇష్టమైన జాజిపూలు మళ్లీ పూశాయి.”

ఆ ఉత్తరాల చివర ఎప్పుడూ ఒకే వాక్యం ఉండేది.

“సమయం దొరికితే ఒక్కసారి రా. చూడాలని ఉంది.” రవి వాటిని చదివేవాడు. జవాబు మాత్రం రాసేవాడు కాదు.

“ఈ వీకెండ్ వెళ్లొస్తాను …” అనుకుంటూ వాయిదా వేస్తుండేవాడు. మూడేళ్లు గడిచాయి. ఒక రోజు ఊర్లో పాత ఇంటి గోడ కూలిపోయింది. వాన రాత్రి. సుబ్బమ్మ బయట అరుగు మీద కూర్చుని తెల్లవార్చింది. పక్కింటి వెంకటమ్మ అంది.

“నీ కొడుక్కి ఫోన్ చేయి.”

“ఇప్పుడు చెబితే రాత్రంతా కంగారు పడతాడు.”

“అయితే రేపు చెప్పు.”

సుబ్బమ్మ నవ్వింది.

“రేపు చెప్పినా… వాడు వచ్చి గోడ కట్టలేడు. నేనే కట్టించుకుంటాను.” అది గర్వం కాదు. కొడుక్కి భారంగా మారకూడదనే తల్లి మనసు. ఆదివారం. రవి ఊరికి ఫోన్ చేశాడు.

“అమ్మా… ఎలా ఉన్నావు?”

“బాగున్నాను.”

“ఇంట్లో అంతా బాగానే ఉందా?”

“అంతా బాగానే ఉందిరా.”  గోడ కూలిన విషయం చెప్పలేదు. మరుసటి రోజు పొరుగువాడు ఫోన్ చేసి చెప్పాడు.

“రా రవి… మీ ఇంటి గోడ పడిపోయింది.” రవికి ఒక్కసారిగా గుండె దడదడలాడింది.

“అమ్మ ఎందుకు చెప్పలేదు?”

“నువ్వు బాధపడతావని.”

ఆ మాట విన్న తర్వాత చాలా సేపు ఫోన్ చేతిలోనే పట్టుకుని కూర్చున్నాడు. అతనికి మొదటిసారి ఒక నిజం అర్థమైంది. తల్లులు అబద్ధాలు చెబుతారు… కానీ ఆ అబద్ధాలన్నీ పిల్లల ప్రశాంతత కోసమే. దీపావళి వచ్చింది. ఆఫీసులో అందరూ తమ తమ ఊర్లకు బయలుదేరారు. రవి కూడా టికెట్ బుక్ చేశాడు. అప్పుడే మేనేజర్ పిలిచాడు.

“ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. ఎవరో ఒకరు ఉండాలి.”

పదోన్నతి కళ్లముందు కనిపించింది. అతను టికెట్ రద్దు చేసుకున్నాడు. సుబ్బమ్మకు ఫోన్ చేశాడు.

“అమ్మా… ఈసారి రాలేను.”

అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత మామూలుగానే…

“పర్లేదు నాన్నా. పని ముందు.” అంది. ఫోన్ పెట్టేసిన తర్వాత… ఆమె గుమ్మం దగ్గర వేసిన రంగవల్లిని చాలాసేపు చూస్తూ కూర్చుంది. ఈసారి ఆ రంగవల్లిని చూసి మెచ్చుకునే కొడుకు రాడు. అతనికి ఇష్టమైన అరిసెలు అలాగే మిగిలిపోతాయి. ఆ రాత్రి ఆమె తినలేదు. అయినా మరుసటి రోజు ఫోన్‌లో మాత్రం…

“నిన్న బాగా తిన్నాను.” అని నవ్వింది.

నెల రోజుల తర్వాత…ఒక సాయంత్రం రవికి అనుకోకుండా గ్రామం నుంచి ఫోన్ వచ్చింది.

“బాబూ… వెంటనే బయలుదేరు.”

“ఏమైంది?”

“నీ అమ్మకు ఏమీ కాలేదు… కానీ ఒకసారి వచ్చేయ్.” ఆ మాటలో దాగిన వణుకు రవిని భయపెట్టింది. రాత్రి బస్సు ఎక్కాడు. ప్రయాణమంతా చిన్నప్పటి జ్ఞాపకాలే. జ్వరం వచ్చినప్పుడు తల్లి తన చీరకొంగుతో చెమట తుడిచిన రాత్రి… పాఠశాలకు వెళ్లేటప్పుడు అతని టిఫిన్ అదే కొంగులో కట్టి ఇచ్చిన ఉదయం… వర్షంలో తడవకుండా తన కొంగు కప్పి ఇంటికి తీసుకొచ్చిన సాయంత్రం…అతనికి ఒక్కసారిగా అనిపించింది… తాను నగరానికి వచ్చాక… అమ్మను కాదు… ఆ కొంగునే వదిలేసి వచ్చేశానని.

బస్సు గ్రామంలోకి చేరుకుంది. ఇంటి ముందు అసాధారణ నిశ్శబ్దం. గుమ్మం దగ్గర చాలా చెప్పులు. రవికి గుండె ఒక్కసారిగా బరువైంది… అతను వణుకుతున్న చేత్తో తలుపు నెట్టాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మసక వెలుతురులో ఇంటి మధ్యన సుబ్బమ్మ మంచం మీద కూర్చొని ఉంది. చుట్టూ ఊరివాళ్లు. రవిని చూడగానే అందరూ కాస్త పక్కకు జరిగారు.

“రా నాన్నా…” అంది సుబ్బమ్మ.

ఆ స్వరం వినగానే రవి గుండెల్లో పేరుకుపోయిన భయం కరిగిపోయింది. ఒక్క అడుగులో ఆమె దగ్గరకు చేరుకున్నాడు.

“అమ్మా… ఏమైంది? అందరూ ఎందుకు వచ్చారు?”

సుబ్బమ్మ నవ్వింది.

“నాకేం కాలేదు రా. కొంచెం ఛాతిలో నొప్పి వచ్చింది. డాక్టర్ చూసి మందులు ఇచ్చాడు. కానీ…” ఆమె మాట మధ్యలో ఆగిపోయింది. పక్కనే ఉన్న గ్రామ వైద్యుడు నెమ్మదిగా అన్నాడు.

“రవిబాబూ… భయపడాల్సిందేమీ లేదు. కానీ అక్కకి విశ్రాంతి చాలా అవసరం. ఇక పొలం పనులు చేయకూడదు.” రవి తల వంచుకున్నాడు. ఆ గదిలోని ప్రతి వస్తువూ అతన్ని ప్రశ్నిస్తున్నట్టనిపించింది. మూలలో విరిగిన కుర్చీ. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్. మంచం పక్కన మందుల సీసాలు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. మారిపోయింది ఒక్క తానే.

మరుసటి రోజు రవికి ఆ ఇంట్లో ఇనుప పెట్టె కనిపించింది. దానికి తాళం లేదు. తెరిచి చూశాడు. అందులో తన చిన్నప్పటి ప్రపంచం నిద్రపోతోంది. మొదటి తరగతి పలక. అరముక్క పెన్సిల్. జిల్లా ఫస్ట్ వచ్చినప్పుటి సర్టిఫికేట్. చిరిగిపోయిన నీలం రంగు స్కూలు బ్యాగ్. వాటి కింద పాత బట్టలో చుట్టిన ఒక మూట. విప్పి చూడగానే ఆశ్చర్యపోయాడు. తాను నగరం నుంచి పంపిన ప్రతి మనీ ఆర్డర్ రసీదు. తాను చిన్నప్పుడు గీసిన వంకర వంకర బొమ్మ. అన్నింటికన్నా కింద… చాలా జాగ్రత్తగా మడతపెట్టిన ఒక పాత చీర. అది సుబ్బమ్మ ఏళ్ల తరబడి కట్టుకున్న చీర. దాని కొంగు దగ్గర చిన్న చిన్న కుట్టుముక్కలు. పలుచోట్ల పసుపు మరకలు. ఒక మూలలో పాలు ఒలికిన తెల్లని మచ్చ. రవికి ఒక్కసారిగా చిన్ననాటి దృశ్యాలు కళ్లముందు కదిలాయి. ఆ కొంగుతోనే అమ్మ తనకు ఉయ్యాల కట్టింది. అదే కొంగుతో ఎండలో తల కప్పింది. జ్వరంలో చెమట తుడిచింది. పాఠశాలకు వెళ్తూ టిఫిన్ కట్టింది. ఆ చీర కేవలం బట్ట కాదు. తన బాల్యం మొత్తం. అప్పుడే వెనుక నుంచి సుబ్బమ్మ స్వరం వినిపించింది.

“ఏం చూస్తున్నావు నాన్నా?”

రవి చీరను చేతిలో పట్టుకుని తిరిగాడు.

“ఇంకా దీనిని ఎందుకు దాచుకున్నావమ్మా?”

సుబ్బమ్మ నెమ్మదిగా నవ్వింది.

“దాన్ని పారేయాలని ఎన్నిసార్లో అనుకున్నాను.”

“మరి?”

“కొంగు చేతిలో పడగానే నీ చిన్నప్పటి వాసన వచ్చేది. పారేయలేకపోయాను.”

ఆ మాట విన్న రవి కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తల్లి అతని దగ్గరకు వచ్చి… అతని తలను మెల్లగా తన చీరకొంగుతో తుడిచింది.

“ఏడవకు.” అంది.

“అమ్మా… నేను చాలా దూరమైపోయాను కదా?”

సుబ్బమ్మ అతని జుట్టు నిమురుతూ మృదువుగా అంది.

“దూరమయ్యేది మనిషి కాదు రా… మనసు. మనసు తిరిగి వస్తే…దూరం అనే మాట ఉండదు.”

ఆ మాట విన్న రవికి… మొదటిసారి తనకు నిజమైన ఇల్లు దొరికినట్టు అనిపించింది. ఆ రోజు సాయంత్రం…ఇంటి ముందు ఉన్న అరుగు మీద తల్లితో కలిసి కూర్చున్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు పొలాల మీద బంగారు వెలుతురు చల్లుతున్నాడు. పక్కింటి పిల్లలు దుమ్ములో ఆడుకుంటూ నవ్వుతున్నారు. ఆ నవ్వుల్లో తన చిన్ననాటి అడుగుల శబ్దం వినిపించినట్టనిపించింది.

“అమ్మా…” అని మెల్లగా పిలిచాడు.

“ఏంట్రా నాన్నా?”

“నేను మళ్లీ నగరానికి వెళ్లాలి.”

సుబ్బమ్మ నవ్వింది.

“వెళ్లాలి. ఉద్యోగం ఉంది కదా.”

రవి కొద్దిసేపు మౌనంగా ఆమెను చూస్తూ… ” అమ్మా.. ఉద్యోగానికి నేను రాజీనామా చేద్దామనుకుంటున్నాను.” చెప్పాడు.

ఆ మాట విన్న సుబ్బమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

“పిచ్చి మాటలు మాట్లాడకు రా! అంత కష్టపడి సంపాదించిన ఉద్యోగం.”

రవి తల ఊపాడు.

“ఆ ఉద్యోగంతో నేను చాలా సంపాదించాను అమ్మా… కానీ… నిన్ను కోల్పోయాను”

అతని గొంతు వణికింది.

“డబ్బు మళ్లీ సంపాదించగలను. కానీ…నీతో గడపాల్సిన ఈ రోజులు మళ్లీ రావు.”

సుబ్బమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.

“నేను నీకు భారమవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు నాన్నా.”

రవి వెంటనే ఆమె చేతులు పట్టుకున్నాడు.

“నువ్వు భారం కాదు అమ్మా… నేను మోసుకున్న అతిపెద్ద అదృష్టం.”

వారం రోజుల తర్వాత.. రవి నగరానికి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

స్నేహితులందరూ ఆశ్చర్యపోయారు.

“ఇంత మంచి ఉద్యోగం ఎందుకు వదులుకుంటున్నావు?”

రవి చిరునవ్వుతో ఒక్క మాటే చెప్పాడు.

“నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తికి… ఇప్పుడు నా సమయం కావాలి.”

ఆరు నెలలు గడిచాయి. పాత ఇంటిని కూల్చకుండా మరమ్మతులు చేశాడు. తండ్రి జ్ఞాపకంగా చిన్న తోట పెంచాడు. సుబ్బమ్మ ఇక పొలం పనికి వెళ్లడం మానేసింది. అధిక స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఆ ఊరివాళ్ళని చూసి రవి మనసు చలించింది. తక్కువ ఫీజులతో తన తల్లి పేరు మీద ఒక స్కూలు కట్టించాడు. ఒక రోజు ఊరివాళ్లంతా ఆ బడి దగ్గరికి చేరుకున్నారు. కొత్తగా నిర్మించిన భవనం ముందు రంగురంగుల తోరణాలు కట్టారు. రవి, సుబ్బమ్మ ఇద్దరూ కలిసి రిబ్బన్ కత్తిరించారు. ఆనందంగా పిల్లలు స్కూలు వెళ్ళడం మొదలు పెట్టారు. ఆ దృశ్యం చూసి సుబ్బమ్మ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.

“ఇంత పెద్ద పని ఎందుకు చేశావు నాన్నా?” అని అడిగింది.

రవి ఆమె వైపు చూసి నవ్వాడు.

“నువ్వు నాకు చదువు ఇచ్చావు అమ్మా. నేను ఈ ఊరి పిల్లలకు అవకాశం ఇస్తున్నాను. ఇది నీ ఋణంలో ఒక చిన్న వడ్డీ మాత్రమే.”

ఆ రాత్రి… ఇంట్లోని హాల్లో గోడపై ఒక అందమైన చెక్క ఫ్రేమ్ వేలాడుతోంది. అందులో…

సుబ్బమ్మ పాత చీరలోని ఆ కొంగు. దాని పక్కనే చిన్న అక్షరాల్లో ఒక వాక్యం. “ఈ కొంగు…నా కన్నీళ్లు తుడిచింది. నా ఆకలి దాచింది. నా భయాన్ని కప్పింది. నా భవిష్యత్తును మోసింది. ప్రపంచంలో ఏ జెండాకైనా గౌరవం ఉంటుంది… కానీ నాకు మాత్రం… ఈ చీరకొంగే నా జీవితంలో ఎగిరిన మొదటి జెండా. ఒక తల్లి తన చీరకొంగులో దాచింది డబ్బు కాదు… ఒక తరం భవిష్యత్తు. ఆ మాటలు చదివిన సుబ్బమ్మ… మెల్లగా రవి తలపై చేయి వేసింది. చిన్నప్పుడు చేసినట్టే… తన చీరకొంగుతో అతని నుదుటి చెమట తుడిచింది. రవి కళ్లను మూసుకున్నాడు.  ఎందుకంటే… ఎంత పెద్దవాడైనా…తల్లి చీరకొంగు తాకితే… ప్రతి కొడుకూ మళ్లీ చిన్నవాడే కదా!

July 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను
  • “వర్తమానం – సాహిత్య దారి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us