మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

వేకువ పాట

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు January 31, 2026
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

లావైన చేతిగడియారం లాగా
ప్రేమ నీ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది
నర్సు నీ అరిపాదాల మీద దెబ్బ వేయగానే
నీ బోసికేక పంచభూతాల్లో చేరింది

నీ రాకను పొగడుతూ
మా గొంతుకలు ప్రతిధ్వనిస్తాయి
అదొక కొత్త ప్రతిమ.
గాలితెమ్మెరలు నిండిన మ్యూజియంలో
నీ నగ్నత్వం మా క్షేమం వెన్నంటి నడుస్తుంది
గోడల లాగా చుట్టూ ఖాళీగా నిలబడతాం మేము

గాలివాటుకు స్వీయ ప్రతిబింబం
తుడుచుకుపోయేలా చేసే
మేఘపు అద్దంకన్న గొప్ప తల్లిని కాను నేను

రాత్రంతా పెద్ద పెద్ద గులాబీల మధ్య ఉండే
కీటకపు రెక్కల లాగా
నీ శ్వాస రెపరెపలాడుతుంది
దాన్ని వినేందుకు నేను నిద్రలోంచి లేస్తాను
దూరంలోని సముద్రమొకటి
నా చెవి దగ్గరికి చేరుతుంది

స్థూలకాయంతో నైట్ గౌనులో ఉన్న నేను
నీ ఒక్క కేకకు మంచం మీంచి కింద పడతాను
నీ నోరు నిర్మలమైన పిల్లినోరులాగా తెరుచుకుంటుంది
కిటికీ చట్రం కాంతితో వెలిగి,
మసకబారిన నక్షత్రాలను మింగేస్తుంది
ఇక నువ్వు కొన్ని మాటలను
మాట్లాడేందుకు ప్రయత్నిస్తావు
స్పష్టమైన అచ్చు స్వరాలు
బెలూన్ల లాగా పైకి లేస్తాయి

ఆంగ్లమూలం: సిల్వియా ప్లాత్

January 31, 2026 61 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం

by Dr. Kasarla Rangarao January 31, 2026
written by Dr. Kasarla Rangarao

చాణక్యుడు అర్థశాస్త్ర రచయిత . అర్థశాస్త్ర విషయములే కాకుండా పాలనా రీతి ,నీతి పాలనా విషయముల కూలం కుష పరిశీలన చేశాడు .అప్పుడు పరిపాలనలో ఉన్న నందవంశ పాలన (బౌద్ధమత అనియాయి )నిర్మూలింప జేసి గాంధారదేశంలో తిష్టవేసిన విదేశీ దురాక్రమదారుల పీచ మడచడానికై చంద్రగుప్త మౌర్యునితో కలిసి బలమైన పునాది నిర్మించాడు .అది దాదాపు ఒక ఎనిమిది లేదా తొమ్మిది వందల సంవత్సరాల వరకు ప్రత్యేకంగా ఒక దురాక్రమణదారు అనేది లేకుండా చేయగలిగింది .శకులు ,యవనులు ,కుషానులు మున్నగు వారు వచ్చి చిన్నచిన్న రాజ్యాలు ఏర్పరచినా వారు స్థానిక ప్రజలతో మమేకమై దాదాపు స్థానికులుగానే మిగిలిపోయారు .వివిధ కారణాల వల్ల వివిధ పేర్లతో వచ్చిన ఇస్లాం దండ యాత్రలు మొదటి రెండు మూడు వందల సంవత్సరాలు దోచుకుని పోవడానికే వినియోగించుకున్నారు . గుప్త సామ్రాజ్యం శాతవాహన రాజుల కాలాలు హిందూ బౌద్ధ మతావలంబనలకు అనుకూలంగా రాజ్యపాలన కావించి గుంపులు గుంపులుగా వస్తున్న వారిని అటకాయించి ఆపి వారిని స్థానికీకరించారు .ఈ మధ్యలో చిట్టచివరి ఉత్తర భారత సామ్రాజ్యం హర్ష చక్రవర్తిదే . దక్షిణ భారతంలో కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాలు కొంతకాలం తురుష్క దండయాత్రలకు తట్టుకున్న కాలక్రమంగా ఈ రెండు సామ్రాజ్యాలు తురక దండయాత్రలకు గాని పరస్పర యుద్ధాలకు గాని తట్టుకోలేక మొత్తం భారతదేశమంతా ఔరంగాజేబు పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యముగా మారిపోయింది .ఈ క్రమంలో ఈశాన్య భారతదేశంలో పాల సామ్రాజ్యం కొంతవరకు బౌద్ధాన్ని నిలబెట్టగలిగింది .ఇది క్రీస్తుశకం 800 నుండి క్రీస్తుశకము 1200 వరకు మాత్రమే .
క్రీస్తు శకం 8 00 నుండి క్రీ.శ. 1200 వరకు దక్షిణ భారతదేశము నుండి ఒడియనులు తెలుగువారు మరియు తమిళులు నౌక మార్గము ద్వారా ఇండోనేషియా ,జావా సుమత్రాలలో హిందూ బౌద్ధ రాజ్యాన్ని ఏర్పరిచినారు .
తక్షశిల, నలంద ,విక్రమశిల , నాగార్జున మున్నగు విశ్వవిద్యాలయముల నేర్పరచి ఆ కాలంలోనే భారతదేశం ప్రపంచ దేశాలకు విజ్ఞాన భిక్ష పెట్టింది . ప్రపంచంలో అన్ని మూలలనుండి విద్యార్థులు భూ,జల మార్గాల ద్వారా వచ్చి చదువుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం ఆ కాలంలోనే భారతదేశ వైభవం తెలుపుతుంది. ఈ విధంగా భూ జల మార్గాల ద్వారా వర్తక మరియు రవాణా జరిగాయని ఇవి వేలయేళ్ళ కొనసాగింపని తెలుస్తుంది. కాలక్రమంలో భారత దేశంలో బౌద్ధం మరియు మిగతా మతాలలో అనేక శాఖలు ఏర్పడి మతపరమైన ఘర్షణలు గందరగోళాలు ఏర్పడసాగాయి .పటిష్టమైన తర్కంతో హేతువాద భూమికతో యున్న బౌద్ధ మతము ఆరామాలు మఠములు ఆర్థిక తోడ్పాటుతో నైతికపతనం ప్రారంభమైంది . బౌద్ధంలో వజ్రయానం అనే శాఖ ద్వారా తాంత్రికం బయలుదేరి బుద్ధుడు ఏ విషయాలయితే చెడుగా చెప్పి జీవితంలో నుంచి బహిష్కరించాడో వాటికే పెద్ద పీట వేసి పతనం వైపుకు చేరుకుంది . ఈ మధ్యకాలంలో వైదిక మతము పంచ మకారాలను నిష్కర్షగా నిషేధించి సనాతన మతరూపంలో బౌద్ధ జైన శాఖలలోని అహింస హేతుబద్ధతల్ని కొంతవరకు జీవితానికి అనువయింపజేసే వీలు వసతి కల్పిస్తూ అద్వైత తత్వానికి దారులు వేసింది సరిగ్గా ఈ సమయంలోనే ఆదిశంకరుడు కాలడిలో జన్మించి చిన్నతనంలోనే ఏకసంథాగ్రహణంతో విద్యలన్నీ నేర్చుకొని నర్మదా తీరంలోని గోవిందాచార్యుల శిష్యరికంతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి అద్వైత మత ప్రస్థానం మొదలు పెట్టాడు .బౌద్ధ తత్వంలోని శూన్యవాదాన్ని తన మాయావాదంతో ఎదుర్కొని అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశ మంతట వేళ్ళూనుకునేటట్లు బలపడి పై చేయి సాధించేటట్లు చేయగలిగాడు .అయితే ఈ క్రమంలో బుద్ధుని భగవంతుని అవతారంలో ఒకరిగా చేర్చి బౌద్ధ సూక్తులు అన్నిటిని తీసుకున్నా డు . ఆ విధంగా అప్పటి బౌద్ధంలో వైదికల్లో ఉన్న చెడుపోకడలని నాశనం చేసి నిజమైన బౌద్ధ సనాతన ధర్మాన్ని ప్రతిష్టించాల్సిన అది శంకరుడు ఆ ప్రయత్నం చేశాడు. ఒకరకంగా హేతువాద దృష్టి తగ్గడం వల్ల భారతదేశ ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకుంది . బలమైన వైదిక మతస్తులు మత సంస్కరణ ఇష్టం లేనివారు అంతా కలిసి ఆదిశంకరుని ప్రచ్ఛన్న బౌద్ధునిగా నిరసించి నిందించారు .ఈ విధంగా ఒక సంధి కాలంలో విదేశీ దురాక్రమణం ఎదుర్కొన్న చాణక్యుడు ,మత సంస్కరణతో అన్ని శాఖలను పరస్పరం సమన్వయం చేసి గానపత్యులు ఇంకా నరబలులు జంతుబలులు చేసే వారిని మార్చి ఎదుర్కొని ఓడించి అద్వైత మత స్థాపన చేసిన ఆదిశంకరాచార్యుడు , ఇరువురు ప్రఖ్యాత పురుషులు మరియు ప్రత్యేక స్థలంలో ఉన్నవారైనప్పటికీ లక్ష్యసాధనలో చాణిక్యుడు సఫలం అయ్యాడని చరిత్ర నిరూపించింది . చాణక్యుడు విదేశీ దాడుల్ని దండయాత్రనని అణివేసే పరిస్థితి ఏర్పరిస్తే ఆ కోణంలో ఆదిశంకరుడు విఫలమయ్యాడు .
విగ్రహారాధన లేని ఒకే నిరాకార భగవంతుని విధేయతతో ఇస్లాం మతప్రభావం భారతదేశం పై బలంగా పడింది .దాదాపు ఒక వేయి సంవత్సరాలు ఇస్లాం మతస్తుల మతపరమైన పరిపాలనలో భారతదేశం ఉండిపోయింది .వర్తక వాణిజ్యాలకై వచ్చిన బ్రిటిష్ వారు (తెల్లవారు )1857 నుంచి 1947 వరకు నిరంకుశ పాలన గావించినా ఆధునిక ఇంగ్లీష్ విద్య పరిపాలన సంస్కరణల ద్వారా చదువుకున్న యువత ప్రజాస్వామ్య స్వయంపాలనకై అనేక రకములైన పోరాటాలు చేసింది .1920 నుంచి జాతీయ పోరాట రూపంలో గాంధీ నాయకత్వంలో క్రమక్రమంగా ప్రజా ఉద్యమాలు వెల్లవలా వచ్చాయి .శాంతి , అహింస,నిరాడంబరత మొదలైన మౌలిక విషయాల ద్వారా సత్యాగ్రహ ఉద్యమ రూపంలో ప్రజలు తండోపతండాలుగా ఉద్యమించారు .
ప్రభుత్వ హింసను హింస ద్వారానే ఎదుర్కోవాలనే వాదంతో బయలుదేరిన ఉద్యమాలన్నీ కొంతవరకు సాగి చివరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా జపాను తోడ్పడుతో బ్రిటిష్ ఇండియా విముక్తికై పోరాడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి అమెరికా రష్యా బ్రిటన్ కూటమి విజయం సాధించడం ద్వారా ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది .రష్యా మూడవ ప్రపంచ దేశాల స్వాతంత్రానికి బలంగా నైతిక మద్దతు తెలపడం , అమెరికా కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మద్దతు ప్రకటించడం వల్ల బ్రిటన్ కు మింగుడు పడని పరిస్థితి వచ్చింది. భారతదేశంలోని అన్ని కులాలను వర్గాలను మతాలను ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటంలో మమేకం గావించిన కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ పక్కలో బల్లెంలా తయారయింది. విభజించి పాలించు అనే కూటనీతితో బ్రిటిష్ వారు చివరకు భారత ఉపఖండమును పాకిస్తాన్ మరియు భారతదేశం ,రెండు దేశాలుగా విభజించి వెళ్లారు .విభజన సమయంలో కనీ వినీ ఎరుగని హింస విధ్వంసం చెలరేగాయి .ఎట్టకేలకు ఆగస్టు 14 , 1947నాడు పాకిస్తాన్ ,1947 ఆగస్టు 15 నాడు భారతదేశం (హిందుస్థాన్ ) స్వతంత్ర దేశాలుగా బ్రిటిష్ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినాయి.

January 31, 2026 4 comments
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

సనాతనమంటే?

by Kondapally Neeharini January 31, 2026
written by Kondapally Neeharini

(మయూఖ 2026 జనవరి పత్రిక ఎడిటోరియల్)

 మీరు స్మార్ట్ ఫోన్ తో ఉన్నారా? మీరు స్మార్ట్ టీవీ దగ్గర ఉండి మాట్లాడుతున్నారా? అయితే ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలనే కాదు మీ మనస్సు నూ పసిగట్టే శక్తి మిమ్మల్ని లోబరుచుకునే టెక్నాలజీ మీ చుట్టూ తిరుగుతుంది అని తెలుకోవాలి. రోజులు ఎంత మారిపోయాయి! కోవిడ్ వచ్చిపోయినప్పటినుండి అంతులేని వింతలే అన్నింటా!!

     ఈ గడ్డు కాలం లో ఆత్మవిమర్శ ఎంతో అవసరం. ఆత్మావలోకనం ఎంతో అవసరం. కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ మన జీవితాలను శాసిస్తోంది. తప్పదు. ఈ జీవన సమరం లో తేదీలు అస్త్ర శస్త్రాలయ్యాయి. పర్వాలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశ వాసులైనా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు పాటిస్తున్నారు. మనలాగే! తప్పులేదు. అయితే మనమేమో తెలుగు వాళ్లం , కొత్త సంవత్సరాన్ని వసంత ఋతువు, చైత్రమాసం లో కొత్త చిగురులెత్తే ప్రకృతి లా నవ వసంతోత్సవం చేసుకుంటుంటాం. నిత్య వ్యవహారంలో ఇంగ్లీష్ తప్పదు. వాళ్ళ పద్ధతులూ తప్పవు. మంచిదే .. నడిపిద్దాం… కానీ మనదైన సనాతన ధర్మాన్ని అనుసరించి ఆచార వ్యవహారాలు మానుకోకుండా ఆచరించాలి. మరి జనవరి నెలతో నూతన సంవత్సర ప్రారంభం.  తెలుగు వాళ్ళు ముక్కోటి ఏకాదశి తో పండుగలు ఇంగ్లీష్ కొత్త ఏడాదిలో వచ్చిందనీ , తర్వాత వెనువెంటనే సంక్రాంతి పండగ వస్తుందనీ సంబరపడుతూనే మార్చ్ నెలలో వచ్చే ఉగాది పండుగ కోసం ఎదురు చూస్తుంటారు . ఇక అది మొదలు   నక్షత్రాలు, తిథులను అనుసరించి ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం. వాటి సంపూర్ణ వివరణ లోకి పోకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు స్పృశించుంచుకుందాం.

     ప్రతి సంవత్సరం కూడా రెండు ఆయనలుగా  విభజించి ఆ రెంటిని కలిపే జీవన స్రవంతి సంక్రాంతి . ప్రముఖంగా ఈ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి  కారణమేమిటంటే, సకల జీవరాశులకి ఆధారభూతుడైన సూర్యుడు తన దిశను ఈరోజు మార్చుకోవడమే ప్రధాన

కారణం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం తన దిశని పూర్వముఖుడై సకల జీవనానికి సకల  జీవరాశులకు చైతన్య స్ఫూర్తిని కలిగించడమే … దక్షిణాయనంలో అంటే  దాదాపు జులై 7 నుంచి జనవరి 14 వరకు కొంతవరకు వీటికి దగ్గరగా ఉంటుంది.ఇది ఉత్తరాయణం ప్రారంభంలోనే ఉంటుంది . అది చైతన్య స్థితిని పొందుతుంది. అందుకే ఈ తేదీ లు కూడా మారకుండా  సూర్యుని పయనాన్ని అంటే రోజులుగా విభజించే పరిస్థితిని మార్చకుండా ఉంటుంది. దీనికి మన సనాతనంలో చెప్పింది ఏంటంటే ఒక పండుగ జరుపుకోవడం కన్నా ఒక చైతన్యాన్ని ముఖ్యంగా ఒక నూతనమైన ప్రణాళికతో మనిషి ముందుకు సాగాలని దీన్ని  పచ్చ పచ్చని పండుగ గా, ఒక మైలురాయిగా మార్చారు. అందుకే పంటలు రావడం .. కొత్త పంట  రావడం తర్వాత శీతాకాలం ఉండడంవల్ల రెండు ముఖ్యమైన పంటలను వేసుకోవాలి, పండించినవి మనం తీసుకోవాలని చెప్పారు.        

     ఒకటి నువ్వుల పంట. నువ్వు లు మన శరీర ఉష్ణోగ్రతకు దోహదపడేది. ఇంకొకటి బెల్లం అంటే మధురం. తీయదనం కోరుకోవడం, గళం విప్పారేందుకు సాయపడ్తుంది. మనిషి తన నూతన ఆవిష్కరణలకు ఇలా రెండు విధాలుగా ఉపయోగపడే పదార్థాలు తినాలి.  ఒకటి వాతావరణానికి అనుకూలమైనవి అవి నువ్వులు ఇంకొకటి మనం మాట్లాడే మాట మధురమైనదిగా అందరిని అలరించే విధంగా ఉండాలని సంకల్పంతో నువ్వులు బెల్లంతో కలిపిన పదార్థాలను ఈరోజు తినాలని నియమించారు. 

ఈ పండుగ పూర్తిగా సూర్యుని భ్రమణం ఆధారంగానే ఉంటుంది.అయితే ఏ మతంలోనైనా సూర్యుని తప్పనిసరిగా మన జీవనానికి ప్రకృతికి కేంద్ర బిందువుగా భావిస్తారు.  సాధనకోసం సనాతనంలో అయితే సూర్యదేవుడు సూర్యారాధన జరుపుతారు. సూర్యుడు ఆరోగ్యం ఇవ్వడం అనేది ఒక కర్మకాండ కాదు అది ఒక చేతనత్వానికి మనం ఇచ్చే గౌరవం. అందుకే ఆరోగ్యం స్నానం చేసి సూర్యారాధన చేయడం మతాలకతీతం ఎందుకంటే సూర్యుడే మనందరికీ అవసరమైన శక్తినిచ్చే కారకుడు.  నిజంగా, చెప్పాలంటే ప్రకృతి మూల దేవత అందులో సూర్యుడు ఆది దేవత అదే ఈ పండగ ప్రత్యేకత.

ఈ  పండుగ కోసం కొన్ని నియమాలను పెట్టారు.

శయనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాస దీక్ష ను చేయమన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి ని శయన ఏకాదశి అంటారు. భగవంతుడు యోగ నిద్రలోఉంటాడని నమ్ముతారు. ఇలాంటివి మరిన్ని…

త్రికాల సంధ్యలలో సంధ్యవార్చుకోమని ఎందుకు పెట్టారు అంటే

ఈ పండుగని ప్రకృతితో అన్వయించడంలో మన రుతు సంక్రమణం, రుతుభేదాలు కూడా అన్వయించారని చెప్పవచ్చు. కారణం

శ్రావణమాసం తో వర్షాలు తర్వాత శరత్ కాలంలో ఉండే వాతావరణం ప్రతి మనిషి ఎక్కువగా బయట తిరిగేందుకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ కాలంలో నాలుగు మాసాలు పూర్తిగా ఒక దీక్షతో ఉండాలని పెద్దలు చెబుతారు దాన్నే చాతుర్మాస్య దీక్షగా గుర్తించారు. అంటే ప్రతివారు చేసుకునే నిత్య కర్మలు అంటే సంధ్యావందనము అనేది సూర్యుణ్ణి కొలిచే ఒక ప్రక్రియ దానికి నియమం త్రికాల సంధ్యా అని అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసుకోవాలన్నారు. కారణం ఉదయించే సూర్యుడిని చూడడం మధ్యాహ్నపు సూర్యుణ్ణి ఆరాధించడం అస్తమించే సూర్యుడిని ప్రార్థించడం తిరిగి ఉదయించమని అంటే మనిషి తన చేతనాస్థితిని ఈ రకంగా ప్రకృతికి అన్వయించుకోవడం ఇది పూర్తిగా దక్షిణాయంలోనే ఉంటుంది అంటే భగవంతుడు యోగనిద్రలో ఉన్నప్పుడు ఈ విధులను తప్పనిసరిగా ఒకే ప్రదేశంలో ఉండి, అంటే ఇంట్లో ఉండి లేక ఒక ప్రదేశాన్ని నియమించుకొని అక్కడ ఉండి చేసుకోవాలి. అయితే ఉత్తరాయణంలో ఈ నియమం లేదు.అంటే చెప్పబడలేదు. కారణం ఇటువంటి ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు ఉత్తరాయణంలో ఉండవు. కాబట్టి అయితే చేతనాస్థితిని పొందడం ముఖ్యంగా కొత్త ఆలోచనలతో ప్రణాళికలతో మనిషి ఈరోజు ప్రారంభించేసుకోవడం అనేది సూచించబడింది దీన్నే ఇయర్ ప్లాన్ అని న్యూ ఇయర్ ప్లాన్ అని కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలు వేసుకోవాలని చెబుతుంటారు.

      మన పల్లెటూర్లలో దీన్ని  కొత్త లు తినడం కొత్తలు పెట్టుకోవడం అని కూడా ఒక సంప్రదాయంగా చేస్తారు.ముఖ్యంగా కొత్తగా పండిన పంట ఈరోజు తప్పనిసరిగా అంటే కొత్త బియ్యం తో  వండుకోవడం అనేది ఆచారం.

మనం అనాదిగా జరుపుకునే పండుగలు ఉగాది, సంక్రాంతి ఇవి విశ్వవ్యాప్తంగా జరుపుకునే పండుగలను చెప్పవచ్చు. కారణం ఇవి రెండూ ప్రకృతి పండుగ లు. సంక్రాంతి  సంక్రమణం ఆధారంగా అంటే మకర రాశిలో సూర్యుని ప్రవేశాన్ని  దృష్టిలో పెట్టుకొని చేశారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 రోజు మాత్రమే వస్తుంది దాని ఈ పండుగని మనం ఏ నక్షత్రం ఆధారంగా చేసుకో ము అలాగే ఏ తిథి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇదేవిధంగా ఉగాది కూడా ఏ దేవతను ఆరాధించే నియమాన్ని  సనాతనంగా చెప్పలేదు. ఈ పండుగకు కేంద్ర బిందువు కాలుడు మాత్రమే. కాలుడు అంటే కలకాలం అని అర్థం. చైత్రమాసం, వసంత ఋతు ప్రాముఖ్యత . దీన్నే విశ్వవ్యాప్తంగా కూడా వాడుకలో వాళ్ళ  వాళ్ళ పద్ధతుల్లో పండగ జరుపుకుంటున్నారు.

   మనం మాసాలను తీసుకున్నా,ఋతువులను తీసుకున్నా అయనాలను తీసుకున్నా ఇదే ప్రకారమైన ఆధారమని చెప్పుకోవచ్చు.మనిషి మనుగడకు  ప్రకృతి అనుసంధానం చేసేవే పండుగ లు. వీటిని ఆచారం గా చెప్తూ alert చేయడం, జ్ఞానం కలిగించడం, పద్ధతైన బ్రతుకును అనుభవించడానికే నియమాలు ఏర్పాటు చేసారు. మంచి అలవాట్లు అలవర్చడం వంటి ఉద్దేశ్యాలున్నాయి. పూర్వీకులు నిర్ణయించిన సూర్య చంద్ర గమనాల లెక్కల్లో మార్పు లేదు. ఇప్పటివరకు తేడా రాలేదు. వీటి లక్షణాల ఆధారంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పారు.ఇదే సనాతన ధర్మం.

ఏ దేశానికి ఆ దేశ కాలమాన పరిస్థితులకు తగినట్టుగా, భౌగోళిక ప్రాధాన్యత తో ఎండా వాన చలి తీవ్రత లకు తగినట్టుగా, నేల తీరు కూ, పండే పంటలకూ అనుకూలంగా చెప్పారు. చలికాలం తెల్లవారుజామున లేచి స్నానం చేయడం మంచిది. ఆ సమయంలో బావినీళ్లు వెచ్చగా ఉంటాయి . స్నానం వల్ల బద్ధకం పోతుంది, చురుకుగా ఉంటారు. చైతన్య వంతంగా ఆలోచిస్తారు ఇదే భావి జీవితానికి చక్కని మార్గం సుగమం చేస్తుంది.బుద్ధి వికసిస్తుంది . ఇలాంటివి చాలా పండుగ ల ఉద్దేశ్యం.ఈ చలనశీలత కోసమైనా ఎవరైనా వాళ్ళ పెద్దలు చెప్పే  సనాతన సంప్రదాయం పాటించి ధర్మనిరతితో ఉంటారు. వీటివల్ల అంతా మంచే! చెడు లేదు!!

 _____****____

January 31, 2026 9 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి

by Aruna Dhulipala January 30, 2026
written by Aruna Dhulipala

*ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, విశ్లేషకులు డా. జి. చెన్నకేశవరెడ్డి గారితో ‘మయూఖ’ ముఖాముఖి                                    -ధూళిపాళ అరుణ*

********************************************

     నిరంతరాన్వేషణతో అనేక పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా సాహిత్యలోకానికి సుపరిచితులైన డా. జి. చెన్నకేశవరెడ్డి గారి జీవన యాత్రను, వారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్! మీ వ్యక్తిత్వ, సాహిత్య జీవన విశేషాలను మా పాఠకులకు తెలియజేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది…మొదటగా….

1ప్ర. అత్యంత సాహిత్యాభిలాష కలిగిన మీరు జన్మించిన

ప్రాంతం ఏది? బాల్య జీవితాన్ని ఏ విధంగా గడిపారు? ఆ విశేషాలను చెప్తారా?

జ:   నమస్కారం! నేను విద్వద్గద్వాలగా ప్రసిద్ధి చెందిన గద్వాలలో 1945 ఏప్రిల్ 7వ తేదీన జన్మించాను. మా అమ్మ రంగనాయకమ్మ, నాన్న తిమ్మారెడ్డి. చిన్నతనం నుండీ గద్వాల సాహిత్య వాతావరణంలో పెరిగాను. నేను అయిదవ తరగతి చదివేటప్పుడు డా. సి. నారాయణరెడ్డి గారు హైస్కూలుకు వచ్చారు. అప్పుడాయన తన నోట్ బుక్ లో రాసుకున్న ‘నాగార్జునసాగరం’ కవితాగానం చేశారు. అది నన్ను ఆ వయస్సులోనే ఎంతో ప్రభావితుని చేసింది. మా ఊరి లైబ్రరీలో ఉండే పుస్తకాలన్నీ చదివాను. మొదట మా అక్కయ్య కొరకు తెచ్చే డిటెక్టివ్ నవలలను నేనూ చదివేవాడిని (గట్టిగా నవ్వుతూ). మా నాన్న తరతరాల వారసత్వంలో మాలీపటేల్ గిరీ చేసేవాడు. గద్వాల ఊరే కాక చుట్టుపక్కల ఏడు ఊళ్ళల్లో కూడా మా పూర్వీకులు పటేల్ గిరీ చేశారు. మా నాన్న పంచాయతీ తీర్పులు బాగా ఇస్తాడని ప్రసిద్ధి ఉండేది. అందువల్ల బండ్లు కట్టుకొని పక్కన ఊళ్ళల్లో నుండి కూడా సమస్యల తీర్పు కోసం మా నాన్న దగ్గరికి వచ్చేవారు. ఆయన చదువుకున్నది 7వ తరగతి వరకే అయినా ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు ఆయనకు బాగా వచ్చు. మేము ఏడుగురం సంతానం. అందులో అయిదవ వాడిని కావడం వలన నాకు అన్నలు, అక్క, తమ్ముడు, చెల్లెలు ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాను. తదనంతర కాలంలో  సినారె గారు నామీద  అభిమానంతో ‘కర్పూర వసంత రాయలు’ కావ్యగానానికి అంగీకరించి గద్వాలకు రావడం జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చింది.

2ప్ర. ప్రాథమిక విద్య నుండి మొదలుకొని వివిధ దశల్లో జరిగిన మీ పూర్తి విద్యార్జనను గురించి చెప్పండి.

జ:   మా ఇద్దరన్నలు హెచ్.ఎస్.సి స్కూల్ ఫైనల్ వరకు చదివారు. మా మూడో అన్న ఎఫ్.ఏ వరకు రెడ్డి హాస్టల్ లో ఉండి నిజాం కాలేజీలో చదివారు. ఆ కాలంలో ఆ చదువుకు ఉద్యోగాలు కూడా వచ్చేవి. మాకు రెండువందల ఎకరాల భూమి ఉండేది. పెద్ద వ్యవసాయ కుటుంబం. అందువల్ల ఒకరి కింద పని చేయడానికి ఒప్పుకునేవారు కారు. “ఉత్తం ఖేతి, మధ్యం బేపారే, కనిష్టం చాకిరీ” అంటారు కదా!(నవ్వుతూ) అందుకే మా అన్నయ్యలు ఇండిపెండెంట్ లైఫ్ కోరుకున్నారు. అంత చదువుకున్న మూడవ అన్నయ్య కూడా వ్యవసాయం వైపే మొగ్గు చూపాడు. దానివల్ల మా నాన్నకు నన్ను బాగా చదివించాలనే కోరిక పెరిగింది. చదువులో ముందే ఉన్నప్పటికీ గేరి(వాడ)లో పిల్లలతో ఎక్కువగా ఆటలు ఆడుతుండేవాడిని. ఓసారి మా నాన్న నేను పనికిరాకుండా పోతాననే భయంతో ‘కోదండం’ కూడా వేయించాడు. అంతేకాదు. నన్ను హైదరాబాద్ లో చదివించాలని నిర్ణయం చేసుకున్నాడు. అక్కడ గ్రామర్ హైస్కూల్లో 6వతరగతిలో చేర్పించాలనుకున్నాడు కానీ ఉపాధ్యాయుల ఉచ్చారణ నాకు అర్థం కాకపోయేది. ఆల్ సెయింట్స్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ ఆ బిల్డింగ్, అక్కడి ‘నన్స్’ వేషధారణను చూసి భయపడ్డాను. అందుకే అక్కడ చదవలేదు. అకడమిక్ ఇయర్ మధ్యలో కాబట్టి గద్వాలలో చేర్చుకోలేదు. ఆరు నెలలు గద్వాల పక్కనే ఉన్న ఆత్మకూరులో మేనమామ గారింట్లో చదువుకొని తరువాత గద్వాల చేరి పియుసి వరకు అక్కడే చదివాను. రెండు సంవత్సరాలు ఇంజినీరింగ్ చదివి నేను కూడా మా నాన్న కోరికను నెరవేర్చక నిరాశ పరిచాను (విచారంగా). ఇప్పటికీ తలచుకుంటే బాధగా ఉంటుంది. తెలుగు చదవాలని, నారాయణరెడ్డి గారి దగ్గర శిష్యరికం చేయాలని , ఆయనంతటి వాడిని కావాలని నా కోరిక. యూనివర్సిటీలో నాకంటే సీనియర్ పి. నర్సింహారెడ్డి అని ఉండేవాడు. ఆయన సినారె గారి క్లాసులు ఉండే సమయాన్ని నాకు చెప్పేవాడు. నా ఇంజినీరింగ్ క్లాసులు వదిలేసి ఆ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని. ఆయనకు ప్రత్యక్ష శిష్యుడిని కావాలని బిఏ తెలుగులో చేరాను. అమ్మంగి వేణుగోపాల్, వేలూరు సాయిబాబా, వీరితో పాటు మరో ఇద్దరు నాకు స్నేహితులుగా ఉండేవారు. సినారె గారితో పాటు చలమచర్ల రంగాచార్యులు గారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, దివాకర్ల వెంకటావధాని గారు, పాటిబండ మాధవశర్మ గారు, బిరుదురాజు రామరాజు గారు ఇట్లా హేమాహేమీలందరూ గురువులయ్యారు. తరువాత ఎమ్ ఏ లో చేరాను. నాతో పాటు నా మిత్రులలో అమ్మంగి వేణుగోపాల్ ఒక్కడే చేరాడు. దివాకర్ల వెంకటావధాని గారి కూతుళ్లు గాయత్రి, రాజేశ్వరి కూడా మాకు క్లాస్ మేట్స్.

3ప్ర. సాహిత్యరంగంలో మీ మొదటి అడుగు పడిన చోటు ఎక్కడో వివరిస్తూ, మీలో సాహితీ కాంక్షను ప్రేరేపించిన విధానం ఏమిటో తెలపండి.

జ:    మా అమ్మ ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసేది. నా చెవిలో ఆ శ్లోకాలు వినబడుతుండేవి. వాటివల్ల దేవాలయంలో జరిగిన భగవద్గీత పోటీలో ప్రైజ్ వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అయిదవ తరగతిలో సినారె గారి కవితాగానం నన్ను అబ్బురపరచి కవిత్వం అంటే ఇట్లా ఉండాలి అన్న భావన దృఢమైంది. 8వ తరగతిలో హిందీ కవిత ‘పథిక్’ను ‘పథికుడు’ అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. హిందీ టీచర్ ఎంతో మెచ్చుకుని మిగతా టీచర్లకు కూడా చూపించి, అప్పటినుండి ‘బాలకవి’ అని పిలవడం మొదలుపెట్టాడు. తెలుగు టీచరు లక్ష్మణాచారి గారు పండితుడు. ఆయన మంచి కంఠంతో రాగయుక్తంగా వసుచరిత్ర పద్యాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఒకసారి స్కూల్లో అవధానం పెట్టించారు. అది కూడా నన్ను బాగా ప్రభావితం చేసింది. పియుసి లో ఫస్ట్ బ్యాచ్ మాది. అందులో మొదటి రూల్ నెంబర్ నాదే. అందుకే మొదటి విద్యార్థిని కూడా నేనే(నవ్వుతూ). మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. రెండవ సంవత్సరం మళ్లీ పరీక్షకు కట్టి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. భాషా నిలయంలో గానీ, ఎక్కడ కవిసమ్మేళనాలు జరిగినా గానీ హాజరయ్యేవాడిని. ఉత్పల సత్యనారాయణాచార్య గారు, దివాకర్ల వారు మొదలగు పండితులు వచ్చేవారు. మల్లాది సూర్యనారాయణ మూర్తిగారు హంపీ ఎక్స్ కర్షన్ తీసుకెళ్లారు. కృష్ణదేవరాయల సాహితీ వైభవంతో విలసిల్లిన ప్రాంతం కాబట్టి అది కూడా నాకు ప్రేరణ కలిగించింది..ఇట్లా నా జీవితంలోని అనేక సంఘటనలు నాలో సాహిత్య కాంక్షను పెంచుతూ వచ్చాయి. నేను బిఏ చదువుతున్నప్పుడు కేశవపంతుల నర్సింహశాస్త్రి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాకు రేడియో ప్రోగ్రాం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ మీద పాశం చెన్నకేశవరెడ్డి అని రాశాను. అది చూసి ‘మీది ఏ ఊరు?’ అని అడిగారు. నేను గద్వాల అని చెప్పాను. “మీ ఊరు వాడేనయ్యా కొత్వాల్ (రాజా బహదూర్) వెంకటరామారెడ్డి. మీ వంశం వాడు కూడా” అని చెప్పారు. ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ విషయం మా ఊరికి పోయినప్పుడు మా నాన్నగారిని అడిగాను.  ఆయన మా ఇంటి ఎదుట ఉన్న ఇల్లు చూపించి ఇదే ఆయన ఇల్లు అని చెప్పారు. అంతటి గొప్పవాడు మా వంశీయుడు కావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కొత్వాల్ వెంకట రామారెడ్డి శతజయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో నన్ను సత్కరిస్తూ సినారె గారు ‘పాశం ఇంటి వారి మొలక’ అని పేర్కొనడం ఎప్పటికీ మరిచిపోలేను. అదే నా మొదటి సత్కారం. బి ఏ సెకండియర్ లో ఉన్నప్పుడు తెలుగు శాఖకు సెక్రటరీగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. సాహిత్య సప్తాహం పేరుతో ఏడు రోజులు కార్యక్రమాలు నిర్వహించాను. ఫైనల్ ఇయర్ లో కూడా నన్నే నియమించారు. గద్వాల కాలేజీ వాళ్ళు కూడా పిలిచేవారు. భాస్కరభట్ల కృష్ణారావు, యశోదారెడ్డి మొదలైన సాహితీవేత్తలతో సాన్నిహిత్యం ఉండేది.
         నంద్యాల అనంత రాఘవాచారి గారని జమ్మిచేడు. జమీందారు దగ్గర ఆస్థాన పండితుడు. నేను హైస్కూల్లో ఉన్నప్పుడే ఆయన దగ్గరకు వెళ్లి రఘువంశం, కుమార సంభవ కావ్యాలు, శబ్దమంజరి నేర్చుకున్నాను. అమరకోశం చదివాను కానీ నాకు రాలేదు. “అమరం నా నోటికమరలేదు”(బిగ్గరగా నవ్వుతూ). లక్ష్మణాచారి గారి వల్ల చిత్తూరు వారి సంస్కృత పరీక్షలు పరిచయ, అభిజ్ఞ, కోవిద పాసయ్యాను. ఆయన చెప్పని పేపరును కూడా బాగా రాయడంతో విద్యార్థులకు ఆ పేపరు చదివి వినిపించారు. అట్లా సంస్కృతం కూడా నేర్చుకోవడం జరిగింది.

4ప్ర. మీ వచన కవిత మొట్టమొదటగా ‘జ్యోతిర్మయి’ పత్రికలో ప్రచురించబడిందని విన్నాం. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ ఆ పత్రికతో మీ అనుబంధాన్ని వివరించండి.

జ:  ఎస్వీ రామారావు గారు పి హెచ్ డి చేస్తున్నప్పుడు హాస్టల్ లో ఉండేవారు. మహబూబ్ నగర్ జిల్లాలో ‘జ్యోతిర్మయి’ అనే సాహిత్య సంస్థను స్థాపించారు. గద్వాలకు నన్ను ప్రతినిధిగా నియమించారు.  గద్వాలలోని పెద్ద పెద్ద వర్తకులంతా మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆ సంస్థ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు. ‘జ్యోతిర్మయి’ పత్రిక ద్వారా మొదటగా జిల్లా కవితా సంకలనం ప్రచురించబడింది. అందులో ‘కాంతిచక్రం’ అనే నా కవిత అచ్చయింది. ఆ సంకలనానికి సినారె గారు ముందు మాట రాశారు. ‘జ్యోతిర్మయి’ ద్వితీయ వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ మా గద్వాలలో జరగడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

5ప్ర. మాత్రా ఛందస్సు, గేయ ఛందస్సుల మీద పరిశోధన చేయడానికి ప్రోత్సాహం ఎవరినుండి లభించింది?

జ:   మొదట నేను మార్క్సిజమ్ మీద పరిశోధన చేయాలనుకున్నాను. సినారె గారు నన్ను మాత్రాఛందస్సు మీద చేయమన్నారు. నేను వారి రచనల మీద చేస్తానన్నాను. అట్లా కాదని గేయ కవిత్వం మీద చేయమని సలహా ఇచ్చారు. గేయ కవిత్వం ప్రధానంగా గతి ప్రధానమైనది. అక్షర ఛందస్సు, మాత్రాగణ ఛందస్సు, మాత్రా ఛందస్సు అని ఛందస్సు మూడువిధాలు. మాత్రా ఛందస్సులో త్రిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులుగా ఉంటుంది. తొమ్మిది మాత్రలతో కూడా ఉంటుంది కానీ దాన్ని ఎవరూ రాయరు.

6. ‘ఆధునికాంధ్ర గేయకవిత్వం’పై మీరు చేసిన పరిశోధన గురించి వివరించండి.

జ:  సినారె గారు సూచించిన ప్రకారం నేను గేయ కవిత్వం మీద పరిశోధన చేయడానికి పూనుకున్నాను. గేయం గాన ప్రధానమైనది. లయబద్ధంగా భావం పూర్తవడమే గేయ ప్రధాన లక్షణం. నా పరిశోధన గ్రంథంలో  గేయలక్షణం, గేయ వికాసం, ఆధునిక యుగారంభం- గేయావతరణం, భావకవిత్వ యుగం- గేయరచనలు, అభ్యుదయ కవిత్వ యుగం- గేయ రచనల గురించి వివరించాను. గేయ కవుల గేయ ఛందస్సుల విశిష్టతలను వివరించాను. ఆధునికాంధ్ర గేయ కవిత్వాన్ని మొత్తం ఇందులో వివరణాత్మకంగా తెలిపాను. ఉస్మానియాలో ఈ ప్రక్రియ మీద పరిశోధన చేసిన తొలి పరిశోధకుడిగా గౌరవం పొందాను. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో గేయం ఎంత ప్రాధాన్యత పోషించిందో దానికి సంబంధించిన విశ్లేషణ కూడా ఇందులో చేర్చడం జరిగింది. ముఖ్యంగా వస్తువు, ఛందస్సు ఈ రెండింటిని ప్రధానంగా చేసుకొని పరిశోధన చేశాను.

7ప్ర. అప్పటికీ, ఇప్పటికీ గేయ సాహిత్యంలో వచ్చిన, వస్తున్న మార్పులెటువంటివి?

జ:   నిజానికి గేయ మూలాలు ప్రాకృత గాథా సప్తశతి కాలానికి సంబంధించినవి. పరిశోధన గ్రంథంలో కూడా నేను దీన్ని ప్రతిపాదించాను. ఎందుకంటే వీటిలో తెలుగు మాటలు కనిపిస్తాయి. శాసనాల్లో కూడా గేయ ప్రస్తావనలు మనం గమనించవచ్చు. సీస పద్యం కూడా గేయ ఛందస్సు నుండి పుట్టినదే. గేయ రూపమైన మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యం కంటే చాలా గొప్పది. మొదటి గేయకావ్యం ‘పలనాటి వీరచరిత్ర’ అయితే ఆధునిక కాలంలో గురజాడ ప్రథమ గేయకవిగా చెప్పవచ్చు. శ్రీశ్రీ లో గురజాడ ప్రభావం కనిపిస్తుంది. తరువాత కవులు దీనిని అనుసరించారు. నారాయణ రెడ్డి గారు గేయ కావ్యాలను రాశారు. అభ్యుదయ విప్లవ కవిత్వాలలో కూడా కవులు గేయ రచనలు చేశారు. తరువాత వచ్చిన వచన కవితా ప్రక్రియ, ఛందస్సును వదిలివేసే దిశగా సాగుతూ వచ్చింది. అయినా ఆధునిక కాలంలో కూడా గేయ సాహిత్యం పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. సినిమా పాటలన్నీ మాత్రా ఛందస్సులే కదా! గేయం ధ్వని ప్రధానంగా సాగుతూ విషయం సూటిగా హృదయాన్ని తాకుతుంది.

8ప్ర. “జయమిత్ర” అనే పేరు తో సాహిత్య సాంస్కృతిక వేదికను స్థాపించడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ సంస్థ ద్వారా మీరు నిర్వహించిన కార్యక్రమాలు ఎటువంటివి?

జ:    అది చాలా విచిత్రంగా జరిగింది. నేను, నా స్నేహితుడు అమ్మంగి వేణుగోపాల్ మా సిద్ధాంత వ్యాస గ్రంథాలకు ఏ పబ్లికేషన్ పేరు పెట్టాలని అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. వేణుగోపాల్ భార్య పేరు విజయలక్ష్మి, నా భార్య పేరు సుమిత్ర. వారి పేర్లలోని ముందు అక్షరం తీసేసి ‘జయమిత్ర పబ్లికేషన్’ అని పెట్టాను. నా తొలి పుస్తకావిష్కరణ (సిద్ధాంత గ్రంథం) జయమిత్ర వేదిక మీద జరిగింది. అదే సమయంలో నా మిత్రుడు వేణుగోపాల్ తన సిద్ధాంత గ్రంథాన్ని నాకు అంకితమిచ్చాడు. ఒకే వేదిక మీద పుస్తకావిష్కరణ, అంకితం తీసుకోవడం నా అదృష్టం. అదే రోజున రాత్రి జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అనే పేరుతో సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మిత్రులు సూచించారు. స్థానికంగా ఉండేవాడిని కాబట్టి నా అధ్యక్షతన సంస్థ ఏర్పడింది. ఉపాధ్యక్షునిగా నోముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా వేణు సంకోజ్ నియమితులయ్యారు. దీని తరఫున వందలాది సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం. అనేక పుస్తకాలను, అనువాదాలను ప్రచురించాం. సాహితీ ప్రముఖులను ఆహ్వానించి సాహిత్యోపన్యాసాలు ఇప్పించాం. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు బి.రామకృష్ణారెడ్డి గారు, కూరెళ్ల విఠలాచార్య గారు, శ్రీమతి ఉమా మహేశ్వరి గారు నారా కొండప్ప గారలను గౌరవ పూర్వకంగా సత్కరించాం. నా పుట్టినరోజు సందర్భంగా నా పేరు మీద ఈ సంస్థ ద్వారానే అవార్డు ఇస్తున్నాం. రాజకీయ నాయకులు లేకుండా ఉన్నతమైన కార్యక్రమాలు జరుపుతున్న సంస్థగా పేరు గడించడం మాకు గర్వకారణం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. నేను నా సిద్ధాంతగ్రంథం ప్రూఫులు చూస్తున్న సమయంలో అమెరికాలో ఉన్న నా డాక్టర్ మిత్రుడు ఉత్తరం రాస్తూ ఇప్పుడేం చేస్తున్నావని అడిగారు. ప్రూఫుల విషయం చెప్పాను. వెంటనే 15 వేల రూపాయలు విలువచేసే డాలర్లు పంపించాడు. నేను ఆశించింది కాదు. నా స్థితిగతులకు కొదువలేదు. ఇదేదో నా గొప్ప తెలియజేయడం కోసం చెప్తున్నది కాదు. ప్రేమ, స్నేహం ఎట్లా ఉంటాయో చెప్తున్నా. ఈ కాలంలో అవి కొరవడ్డాయి. వేణుగోపాల్ , నేను ఇంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉన్నాం. కారణం ఆ ఆత్మీయతే. అమ్మంగి వేణుగోపాల్ మొదటి పద్యకవి. నేనాయను వచనకవిత్వం వైపు తిప్పాను. మా స్నేహానికి గుర్తుగా తన సిద్ధాంత గ్రంథం ‘నవలా రచయిత గోపీచంద్’ గ్రంథాన్ని అంకితమిచ్చాడు. అమ్మంగి వేణుగోపాల్ తో అర్థశతాబ్ది స్నేహానికి గుర్తుగా నా విమర్శన వ్యాసాల సంపుటి ‘అక్షరన్యాసం ‘అంకిత మిచ్చాను. ఈ గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు విమర్శనరంగంలో సాహిత్య పురస్కారం ఇచ్చారు.

9ప్ర. ఉత్పల సత్యనారాయణ గారితో మీ అనుబంధాన్ని చెప్పండి.

జ:   ఉత్పల సత్యనారాయణ కూడా నాకు సన్మిత్రుడు. ఆయన రచించిన “ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు” కావ్యానికి తొలి శ్రోతనైన భాగ్యవశాన నా చేత పీఠిక రాయించుకోవడం గొప్ప విషయం. ఇద్దరు ఆస్థాన కవులు విశ్వనాథ, దాశరథి రాసినప్పటికీ నా చేత పీఠిక రాయించుకొన్నందువల్ల నేనాయన హృదయాస్దాన కవినయ్యాను. తర్వాత కూడా తన యుగళ గీతం గ్రంథానికి పీఠిక రాయించుకొన్నాడు. 2005 రసమయి సంస్థ అధ్యక్షుడు ఎన్. కె రాము గారు తలపెట్టిన నా షష్టిపూర్తి కార్యక్రమాన్ని మా గురువు నారాయణరెడ్డి గారు తాను అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణా సారస్వత పరిషత్తులో ఎంతో ప్రేమతో తన ఆధ్వర్యంలో జరిపించారు. అది ఎన్నటికీ మర్చిపోలేని సంఘటన. ఈ సందర్భంలోనే సత్కవి, సహృదయుడు ఉత్పల సత్యనారాయణ చార్య  గారు తన పద్య కృతి ‘శైవలినీ రాగాలు ఉత్పలినీ పరాగాలు ‘అంకితమిచ్చాడు. అది నా అదృష్టం.

10ప్ర. తెలుగు అకాడెమీలోను, తెలుగు విశ్వ విద్యాలయంలో మీరు నిర్వహించిన పదవుల అనుభవాలు ఎటువంటివి?

జ:    ఎమ్ ఏ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఉద్యోగాన్వేషణ ప్రారంభించాను. మహబూబ్ నగర్ ఎమ్.వి.ఎస్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. మూడు వారాలు తిరగక ముందే తెలుగు అకాడమీలో ఉద్యోగం ఇస్తున్నట్టు ఆర్డర్ వచ్చింది. కనీసం నేను అప్లై కూడా చేయలేదు. సినారె గారిని కలిసి ఈ విషయం చెప్పాను. అకాడెమీలో చేరవద్దని ఆయన నాకు మంచి సలహా ఇచ్చారు. అప్పటికి మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా, మా నాన్న కోరిక దృష్ట్యా చేరిపోయాను. కానీ పని ఒత్తిడి వల్ల సృజనాత్మకతను కోల్పోయాను. జె.ఎల్ గా వెళ్ళడానికి వేరే అవకాశం వచ్చినప్పటికీ ఇక్కడ కొంతమంది ప్రోద్బలంతో వెళ్లలేకపోయాను. ప్రమోషన్లను కూడా చాలా ఆలస్యంగా అందుకున్నాను. నాకు ప్రొఫెసర్ ను కావాలని బాగా కోరిక ఉండేది. తెలుగు విశ్వవిద్యాలయంలో విజ్ఞాన సర్వస్వ కేంద్రంలో ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిసి అప్లై చేశాను. అది ‘ప్రొఫెసర్- కం- డైరెక్టర్’ పోస్టు కావడం వలన తెలుగు విశ్వవిద్యాలయంలో సంచాలకుడిని అయ్యాను. జ్యోతిష్యం శాఖలో పి జి కోర్సు పెట్టించాను. పది విజ్ఞాన సర్వస్వాలకు రూపకల్పన చేశాను. ఈ విధంగా తెలుగు అకాడెమీలో ఇరవై ఐదేళ్లు, తెలుగు విశ్వవిద్యాలయంలో పది సంవత్సరాలకు పైగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.

11ప్ర. ‘వాణిజ్య పదకోశం’ ప్రధాన సంకలన కర్తగా మీరు చేసిన కృషి ఎటువంటిది?

జ:   తెలుగు అకాడెమీ 1985 లో వాణిజ్య పదకోశాన్ని రూపొందించడానికి నిర్ణయించినప్పుడు నేను దానికి ప్రధాన సంకలన కర్తగా వ్యవహరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 28 వాణిజ్య కేంద్రాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని దీన్ని రూపొందించాం. సామాన్య ప్రజానీకం నిత్య జీవితంలో వ్యాపార లావాదేవీలలో ఉపయోగించే  పదాలకు ప్రాధాన్యతనిచ్చాం. భాషకు సంబంధం లేని వర్తకులకు మాత్రమే అర్ధమయ్యే కోడ్ పదాలను కూడా చేర్చడం జరిగింది. అట్లాగే వ్యాపార సంబంధ సామెతలను, జాతీయాలను, అన్యదేశ్యాలను కూడా జోడించాం.

12ప్ర. విశ్వనాథ సత్యనారాయణ గారితో మీకు ఏర్పడిన పరిచయ నేపథ్యాన్ని తెలపండి.

జ: మల్లాది సూర్యనారాయణ మూర్తి గారు తాము రాసిన ‘శివభక్తుల చరిత్ర’ను శ్రీశైల మల్లికార్జుని సన్నిధిలో సమర్పించడానికి శ్రీశైలం వెళ్తూ నన్ను వెంబడి తీసుకెళ్ళారు. అప్పుడు నేను పియుసి సెకండియర్ లో ఉన్నాను. అక్కడినుండి విజయవాడకు వెళ్లాం. అక్కడ మల్లాది గారి తమ్ముడు ఇరిగేషన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఇంట్లో మూడు రోజులు ఉన్నాం. అప్పుడే మల్లాది గారు నన్ను విశ్వనాథ వారింటికి తీసుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ‘పురాణ వైర గ్రంథమాల’ ను డిక్టేట్ చేస్తున్నారు. అరగంట సేపు కూర్చొని వింటూ ఆనందించాం. తర్వాత మల్లాది వారు “ఇతను నా శిష్యుడు. కవిత్వం రాస్తాడు. మీరంటే చాలా అభిమానం” అంటూ ఆయనకు నన్ను పరిచయం చేశారు. ఆ తరువాత నా మీద అభిమానంతో సాహిత్య పరిషత్తు సమావేశాలకు కూడా వచ్చారు. అంతటి సహృదయులు విశ్వనాథ వారు.

13ప్ర. మీరు రచించిన, వెలువరించిన పుస్తకాలను గురించి చెప్పండి.

జ:  నా రచనలు ఇప్పటివరకు కవితా సంకలనాలు, వ్యాససంపుటాలు, మోనోగ్రాఫులు, పి. వి నరసింహారావు గారి జీవితచరిత్ర ఇట్లా పదిహేను వరకు వచ్చాయి. సంపాదకత్వం వహించినవి మరో పదిహేను వరకు ఉంటాయి. నా వరకు నేను రాసినంతవరకు సంతృప్తికరంగానే ఉన్నాను.

14ప్ర. జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడడంలో మీరు ముఖ్య పాత్ర వహించారు కదా! అందులో మీ కృషి ఎటువంటిది?

జ:    నాకు చిన్నప్పటి నుండి నేను పుట్టిన ఊరు గద్వాల అంటే చాలా ఇష్టం. ప్రజల్లో రాజకీయ చైతన్యానికి కరపత్రాలు పంచేవాడిని. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గద్వాల, ఆలంపూర్ లను కలిపి వనపర్తి జిల్లాలో కలపాలనుకున్న ముఖ్యమంత్రి ప్రతిపాదన నాకు బాధను కలిగించింది. జోగులాంబ గద్వాల జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమంలో కార్యకర్తనయ్యాను. మాజీ మంత్రి డి కె అరుణ పాదయాత్ర చేయాలని సంకల్పించినప్పుడు గద్వాల జములమ్మ గుడి నుండి ఆలంపూర్ జోగులాంబ గుడి వరకు చేస్తే బాగుంటుందని ఆమెకు సూచించి అమలు చేయించాను. సాహితీ ఘన చరిత్ర కలిగిన గద్వాలను చిన్న సంస్థానమైన వనపర్తిలో చేర్చడం ఆత్మ గౌరవానికి భంగమని, తెలంగాణాలో ఉన్న ఒకే ఒక శక్తిపీఠం కలిగిన ప్రాంతంగా దానికి ప్రాధాన్యత నివ్వాలని తెలుపుతూ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాను. ఆయన దృష్టికి వచ్చేలాగా కరపత్రాలు ప్రచురించి పంపాను. ఉద్యమ తీవ్రతను గుర్తించి ముఖ్యమంత్రి గారు జోగులాంబ గద్వాల జిల్లాను ప్రకటించారు. ఒకసారి రసమయి సంస్థ తరఫున నారాయణరెడ్డి గారి పేరు మీద అవార్డు అందుకొంటున్న సందర్భంలో సభకు డి కె అరుణ గారు వచ్చారు. “జోగులాంబ గద్వాల జిల్లా పేరును ప్రతిపాదించింది చెన్నకేశవ రెడ్డి అని, ఆయన సెంటిమెంటు ప్రజల్లోనూ, ముఖ్యమంత్రిలో కూడా బాగా పనిచేసిందని, జిల్లా ఏర్పాటులో చెన్నకేశవ రెడ్డి పాత్ర చాలా కీలకమైంద”ని ఆమె సభాముఖంగా ప్రశంసించారు.

15ప్ర. మీరు అమెరికాలో నిర్వహించిన కార్యక్రమాలు ఎటువంటివి?

జ:   నేను మొట్టమొదట 1998 లో ఆటా ఆహ్వానం మీద అమెరికా వెళ్లాను. ఆ వేదిక మీద వక్త గాను కవిగాను అవధాన పృచ్ఛకుడిగాను పాల్గొన్నాను. తర్వాత మా పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందువల్ల రెండు సందర్భాలలో తానా సభలోను , ఆటా సభలోను వక్తగా, కవిగా పాల్గొన్నాను. కాలిఫోర్నియా రాష్ట్రం బే ఏరియాలో మా అబ్బాయి ఉండటం వల్ల ఆరు నెలలకోసారి వెళ్ళినప్పుడల్లా  అక్కడ వీక్షణం సంస్థ నెలనెలా జరుపుతున్న సాహిత్య సమావేశాలలో ప్రతినెలా వెళ్లి నా కవిత్వాన్ని వినిపించేవాణ్ణి.

16ప్ర. మీ దృష్టిలో వర్తమాన కవుల, రచయితల దృష్టి కోణం సమర్థనీయమేనా? ఎట్లా?

జ:   ఒక్కో రచయితకు ఒక్కో దృక్పథం ఉంటుంది. నేను అందరి రచనలు చదువుతాను. అన్నిటినీ అధ్యయనం చేస్తాను. అయితే ఏ రచన అయినా, ఏ ప్రక్రియ అయినా ఆ రచయిత దృక్పథంతోనే చూడాలి అని నా భావన. సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి. ఏదో ఊహాలోకంలో విహరించినట్లు కాకుండా వాస్తవానికి దగ్గరగా, సమకాలీన అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలతో రాస్తే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రాంతీయ భాషలో యశోదారెడ్డి గారు రాసినట్లు రాస్తే ప్రజలకు ఇంకా చేరువవుతుంది.

17ప్ర. సాహిత్య ప్రక్రియలు వివిధరీతులుగా శాఖోపశాఖలుగా విస్తరిల్లుతున్న వర్తమాన సమాజంలో భాషాభివృద్ధి జరుగుతున్నట్లు మీరు భావిస్తున్నారా?
ఏ విధమైన రచనల ద్వారా సమాజాన్ని పరిణామ దిశగా, బలోపేతం చేయవచ్చో తగు సూచనలు ఇవ్వండి.

జ:   భాషాభివృద్ధి జరుగుతున్నదనే నేను భావిస్తాను. ఎందుకంటే వివిధ పంథాలో, వివిధ దృక్కోణంలో అనేక అంశాలతో రచనలు వస్తున్నాయి. అటువంటప్పుడు అభివృద్ధి లేదని ఎట్లా అంటాం? పోరంకి దక్షిణామూర్తి ఆయన ఎమ్ ఏ చేస్తున్నప్పుడే తెలంగాణ మాండలికంలో ‘ముత్యాల పందిరి’ రాశాడు. మా అందరికీ చదివి వినిపించేవాడు. ఇదేకాక ‘వెలుగు వెన్నెల గోదారి’ అని కోస్తా మాండలికంలో, ‘రంగవల్లి’ అనే దానిని రాయలసీమ మాండలికంలో రాశాడు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. పోరంకి దక్షిణామూర్తి ఏర్పరచుకున్న తన సొంత గ్రంథాలయాన్ని ఆయన మరణం తర్వాత ఆయన  కుమారులు మా స్నేహాన్ని గుర్తించి ఉచితంగా ఆ పుస్తకాలన్నీ నాకు ఇచ్చారు. ప్రాంతీయ భాషల్లో రచనలు భాషను అభివృద్ధి పరుస్తాయి. అందరికీ సులువుగా అర్థమవుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ భాషైనా సమాజానికి స్ఫూర్తి దాయకంగా ఉండే రచనలు చేయాలి. ముందుగా రచయితలు తమను తాము ఎడ్యుకేట్ చేసుకోవాలి. దానికోసం ఎక్కువగా పుస్తకాలను చదవాలి. వారి భావనా పరిధిని విస్తృతం చేసుకోవాలి. ఏ అంశాన్ని వారు చెప్తున్నారో, దేని గురించి రాస్తున్నారో దాని పట్ల నిజాయితీ ఉండాలి. వాస్తవ జీవితాలకు దగ్గరగా ఉండడం ఉపయోగకరంగా ఉంటుంది.

నమస్కారం సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం వెచ్చించి, మీ జీవన, సాహిత్య విశేష విషయాలను తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేకానేక కృతజ్ఞతలు సెలవు.

January 30, 2026 8 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

by Aruna Dhulipala January 30, 2026
written by Aruna Dhulipala

       ఒక వ్యక్తి తాను అనుకున్న రీతిగా లక్ష్యాలను చేరుకుంటూ తన ఏడు పదుల జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం సామాన్య విషయం కాదు. కానీ అందులో కృతకృత్యులై జీవన సాఫల్యాన్ని చవి చూసినవారు దాస్యం సేనాధిపతి గారు. అందరిలాగే జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కున్నా కవిగా, రచయితగా, సమీక్షకులుగా, ఉత్తమ సభా నిర్వాహకులుగా పలువురి మన్ననలను అందుకున్నారు. ఇటీవలే సప్తతి మహోత్సవాన్ని జరుపుకొని ఆత్మీయులనేకులు అక్షరరూపంలో వ్యక్తీకరించిన ఆప్యాయతానురాగాలను ‘అక్షరగీతం’ పేరుతో అభినందన సంచికగా వెలువరించారు. ఇది కేవలం అభినందనలకు పరిమితమైన పొత్తంగా కాక అభినందన పురస్సర జీవితచరిత్రగా చెప్పవచ్చు. అక్షరదాసులైన సేనాధిపతి గారు వారి సతీమణి గీతారాణి పేరును కూడా ఈ అభినందన సంచిక పేరులో పొదువుకొని ‘అర్ధాంగి’ అనే మాటను సార్థకం చేశారు.

     ఇందులోని అంశాలను బట్టి దీనిని ఆరు భాగాలుగా విభజించుకోవచ్చు.

* మొదటి మరియు మూడవ భాగంలో వివిధరంగాల  ప్రముఖులు, సాహితీవేత్తలు, బంధుమిత్రుల సందేశాలు, వ్యాసాలు, కవితలు ఉంటాయి.

* రెండవ భాగమంతా సేనాధిపతిగారి సాహిత్య సమాలోచన చేస్తూ ప్రసిద్ధ సాహితీవేత్తల విశ్లేషణలు, ప్రత్యేక వ్యాసాలున్నాయి.

* నాల్గవ భాగంలో ఆయనవి రెండు ఇంటర్వ్యూలు… పూర్తి సాహిత్య వివరాలతో ఆయన మాటల్లోనే చెప్పిన విశేషాలతో ఒకటి, వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన వివరించిన అంశాలతో ఒకటి ఉంటాయి.

* అయిదవ విభాగమంతా వివిధ వర్ణ చిత్రాలు, ఆయా సందర్భాలలో ఆయనకు సంబంధించి వివిధ పత్రికల్లో వెలువడిన విశేషాలుంటాయి.

* ఆరవది పూర్తిగా ఆయన జీవిత పరిచయం ఉంటుంది.

పుస్తకం ఆసాంతం ఆయనతో ఆత్మీయత గలవారి ఛాయా చిత్రాలు సందర్భానుసారంగా క్రమపద్ధతిలో కూర్చడం ఈ పుస్తకానికి ఎంతో వన్నె తెచ్చింది.

       మాన్యులు సి.హెచ్. విద్యాసాగర్ రావు గారు దీనిని ఒక కర్తవ్య గాథగా పేర్కొంటూ “వాక్చాతుర్యంతో మంత్రించగలగడం మాత్రమే కాదు. మౌనంగా నిర్దేశం చేయగల శక్తి ఆయనది” అన్న మాటలు దాస్యం వారి జీవితస్వరూప స్వభావాన్ని మొత్తంగా ప్రత్యక్షం చేయిస్తాయి.

         మనం ఎన్నో అభినందన సంచికలను చూసి ఉంటాం. వాటిల్లో ఇది విభిన్నమైనది. సందేశాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనకు కుటుంబంతో ఉన్న అనుబంధం, బంధుమిత్రులతో ఉన్న వాత్సల్యం, ఉద్యోగ ప్రస్థానంలో వారు తమ సహోద్యోగుల పట్ల చూపిన ఆదరాభిమానాలు, వారితో ఉన్న స్నేహశీలత వల్ల ప్రతీఒక్కరూ వారిని గురించి తమ ఆత్మీయతను ఇందులో వెల్లడించడం దీనికొక ప్రత్యేకతను ఆపాదించింది. ఒకవైపు కౌటుంబిక జీవితానికి ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు సాహిత్యంతో మమేకమై సభలు, సమావేశాలు , సాహితీ సంస్థలతో అనుబంధాన్ని పెనవేసుకొని ముందుకు సాగుతున్నారాయన.

          “మా కురు ధన జన యవ్వన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్” అన్న శంకరాచార్యుల మాటలను ఆయన తమ జీవితంలో ఆచరణాత్మకంగా నిరూపించారు. క్షణభంగురమైన జీవితంలో ప్రతీ క్షణాన్ని వినియోగించుకున్నారు. ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ప్రయోజనకరంగా మలచుకున్నారు.

       ఒక వృత్తిలో ఉన్నవారికి క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం ప్రధానలక్షణాలు. అందులో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. దీనికి ఉదాహరణగా వారి సతీమణి గీతారాణి గారు ఈ పుస్తకంలో తమ దాంపత్య జీవితాన్ని వివరిస్తూ చెప్పుకున్న అనుభవాల్లో ఒకదానిని చూద్దాం. ఆయన శిశుమందిర్ జిల్లాల పర్యవేక్షణాధికారిగా ఉన్నప్పుడు సూర్యోదయానికి ముందే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. ఒకనాడు మూడేళ్ళ కుమారుడు సేనాధిపతిగారిని చూసి ‘ఈయనెవరు?’ అని అడిగిన మాట ఆ తల్లిదండ్రుల మనస్సులను ఎంతగా కలచివేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి కార్యదీక్షాపరులు సేనాధిపతిగారు.

“Duty is more important than beauty and personal happiness” అని అంటారు. అయితే కావచ్చు. కానీ వృత్తిలో నిబద్ధత కలిగిన వ్యక్తులు కొన్ని అపురూపమైన ఆనందాలను కూడా త్యాగం చేయడం తప్పనిసరి అవుతుంది.

      “ప్రతిభా నవనవోన్మేష శాలినీ” అన్నట్లు ఆయన ఎప్పటికప్పుడు తమ ఆలోచనాసరళిని కొత్తగా రూపు దిద్దుకుంటూ వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఇప్పటివరకూ 16 పుస్తకాలను వెలువరించి తమ సమర్థతను చాటుకున్నారు. సామాజిక అంశాలపై వెయ్యికి పైగా సంపాదక లేఖలు రాయడం వారి సాహిత్యాభిరుచితో పాటు వైశిష్ట్యాన్ని, వైయక్తిక అభీష్టాన్ని వ్యక్తపరుస్తుందని శ్రీ కె. వి. రమణాచార్యులు గారు దాస్యం వారిని ప్రశంసించారు.

         “ఇప్పుడు వస్తున్న కవిత్వంలోనూ, ఇతర రచనల్లోనూ పైపైన అక్షరాలు వెల్లువెత్తినంతగా హృదయం వెల్లువెత్తడం లేదు. హృదయస్పందన లేని కవిత్వం వ్యర్థమ”ని దాస్యం సేనాధిపతిగారు చెప్పిన మాటలు రచనల పట్ల కవులు, రచయితలకు ఉండాల్సిన బాధ్యతను స్పష్టం చేస్తాయి. ఆయన సునిశిత పరిశీలనా దృక్పథాన్ని తేటతెల్లం చేస్తాయి. కాలక్షేపానికో, మేమూ రాయగలమని పదిమందికి చెప్పుకోవడానికో రాస్తున్న వారందరూ ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

       ఒక పుస్తకం ఆయన చేతిలో పడడమే ఆలస్యం. వెంటనే స్పందించడం ఆయన నిరంతర అధ్యయన శీలత్వానికి నిదర్శనం. చదివిన వెంటనే స్పందించి దానికి సమీక్ష రాయడం మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వర్ధమాన కవులను కూడా ప్రోత్సహించడం ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణం. ఆయన సమీక్ష మూల గ్రంథాన్ని మించిన సౌందర్యాన్ని సంతరించుకోవడం పరిపాటి. ఇప్పటివరకు 1500 కు పైగా సమీక్షలు రాసారంటే ఆయన అక్షరాన్ని ఎంత ప్రేమిస్తారో, ఎంత బాధ్యతగా భావిస్తారో అర్థం చేసుకోవచ్చు.

      “ఈనాడు సాహిత్యం వికాసదశలో కాకుండా ప్రతికూల దశలో పయనిస్తున్న సందర్భంలో సహృదయ సార్వభౌముల కొరత మీవంటి వారి వల్ల తీరుతున్నది” అని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు దాస్యం వారిని అభినందించడం సేనాధిపతి గారి సాహితీ ప్రకాశనానికి నిదర్శనం. వాణిజ్యశాస్త్ర పయోనిధి అయినప్పటికీ నిరంతర అధ్యయనం, సహృదయత, మానవీయత మొదలగు సల్లక్షణాలు కలిగిన సేనాధిపతిగారు సారస్వతార్చనలో మేటిగా, ఆధ్యాత్మ చింతనా వాహినులుగా తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు.

         ఈ అభినందన సంచిక దాస్యం సేనాధిపతి గారి జీవితాన్ని వడ్డించిన విస్తరిలా మన ముందుంచుతున్నది. కంటికింపైనది మనసుకింపైనట్లు అందమైన పుస్తకంతో పాటు ఆయన వ్యక్తిత్వ, సాహిత్య జీవితాలు హృదయంగమంగా పాఠకులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇంతటి పుస్తకాన్ని వెలువరించడానికి ‘ఉదయసాహితి’ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాస్యం లక్ష్మయ్యగారితో పాటు అంకితభావం కలిగిన ఆ సంస్థ నిర్వాహక సభ్యులు చేసిన కృషి ప్రశంసించదగినది. దాస్యం సేనాధిపతి గారు పరిపూర్ణ ఆరోగ్యవంతులై శతాధిక ఆయుష్మంతులై మరింత సాహితీ కృషి చేయగలగాలని కోరుకుంటూ సప్తతి మహోత్సవ సందర్భాన వారికి అభినందనలు.

January 30, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాలేశుని జాతర

by mayuukha January 30, 2026
written by mayuukha

ఆసిఫాబాద్ కుమ్రంభీమ్ జిల్లా లో జరిగే బాలేశుని జాతర రేపటికి లాస్ట్


1.కందము
బాలేశుని జాతరయే
కోలాహలముగ జరుగును కూరిమి పెంచున్
వేలుపు జనగామ ప్రజల
మేలొన రించుచు ముదముగ
మిక్కిలి ప్రియమై!
2.
తలచిన చాలును భక్తిగ
కలలో నగుపడి యొసగును కామిత సిద్ధిన్
వెలసెను వాగొడ్డున తా
బల వికరుణుడయి కరముల ప్రార్థన వలనన్!
3.
తర తరములుగా పూజలు
విరివిగ జేయుచు రథమును వేడుక తోడన్
పురమున భవుడిని త్రిప్పగ
కరమగు పాటలు భజనలు కళ్యాణమిడున్!
4.
గొప్పగ జరుగును జాతర
లొప్పుగ ముడుపులు శివునికి నుత్సాహముతో
కుప్పలు తెప్పలుగ జనులు
నప్పుర మందు నడయాడు నచ్చెరు వొందన్!
5.
జంగమ వంశపు వారలు
లింగని కభిషేకములను ప్రేమగ జేయన్
హంగులు నార్భాటముతో
పొంగులు జిమ్మును మెరుపులు పున్నమి వెలుగుల్!
6.
అన్నుల మిన్నగ శివుడిని
సన్నుతి జేయగ మనమున స్వాంతన కలుగన్
పిన్నలు పెద్దల కలయిక చెన్నుగ రథయాత్ర శోభ చిత్రము నుండున్!
7.
కన్నుల పండుగ జాతర
మిన్నును దాకెడు దరువులు మేలిమి రవముల్
సన్నిహితము జేయు జనుల
కున్నతి‌ కాంక్షలు మలుపుల నొప్పును జవమై!
8.
రవి సప్తాశ్వముల రథము
పవిధముల శక్తియుక్తి పటుతర‌ పర్చన్
సవితా రాధన దీవెన
నవ తేజము నింపు నవని నాశము లేకన్!
9.
పర్వము రథసప్తమి యై
సర్వము సుఖ శాంతు లొసగు సౌరులు పంచున్
నిర్వీర్యత ద్రుంచు ప్రజల
నిర్వాహక మైక్య సంఘ నేస్తము లొకటై!
10
రంగుల సింగిడి గా రవి
నింగిని వెదజల్లె కాంతి నీలపు రూపున్
చెంగున దూకుచు ధరణీన
మంగళ మూర్తిగ నిలిచెను మౌళి భృకుటి పై!

January 30, 2026 6 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan January 30, 2026
written by Laxmi Madan

7 వ భాగం

జరిగిన కథ

అపర్ణ సుధ తో కలిసి పెళ్లికి బయలుదేరుతుంది.దారిలో తన చిన్నప్పటి జ్ఞాపకాలను తలుచుకుంటుంది.అయ్యవార్ల ఇంటి బడి చదువు,తల్లి గాజులు పెట్టుకోవడం గుర్తిస్తుంది.సాంప్రదాయ మైన పెళ్లిని ఆస్వాదిస్తూ ఉంటుంది

తెల్లవారి జరిగే పెళ్లి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆలోచనలోకి వెళ్ళిపోయారు….

పెళ్లికూతురు, పెళ్ళికొడుకు మధురమైన ఊహలలో తేలిపోయారు.
ఎప్పుడెప్పడు ఒకరిని ఒకరు చూసుకోవాలని ఆరాటం.

పెళ్లికూతురు తల్లిదండ్రులకి ఏ విఘ్నాలు లేకుండా పెళ్లి సజావుగా జరగాలని ఆలోచనలో వినాయకుడికి మ్రొక్కుతున్నారు.

పెళ్ళికొడుకు తరపు వాళ్ళు’పెళ్లి బాగా చేస్తారా ?మర్యాదలు బాగా జరుగుతాయా?వచ్చిన బంధువులలో తక్కువైపోము కదా !’ఇలాంటి ఊహలలో ఉన్నారు

వచ్చిన బంధువులు మాత్రం కలుసుకున్న బంధుమిత్రులతో ముచ్చటిస్తూ నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఉన్నారు.

తెల్లవారి పెళ్లి ముహూర్తం సమయం కానే వచ్చింది. అందరూ చక్కగా ముస్తాబయ్యారు పెళ్లికూతురుని ముందుగా గౌరీ పూజ కోసం మంటపంలో కూర్చోబెట్టారు. మధు పర్కాలు కట్టుకొని, నుదుట పెళ్లి బొట్టు, బాసింగం కట్టుకొని ఎంతో ఒద్దికగా కూర్చుంది పెళ్ళికూతురు.

పురోహితులు చెప్పినట్లుగా గౌరీ పూజ చేస్తూ కూర్చుంది.

మధ్యలో కట్టిన తెర వెనుక పెళ్ళికొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు.

ముందుగా పెళ్లి కొడుకుకు అత్తమామలు యజ్ఞోపవీత ధారణ చేయించి ఆ తర్వాత కన్యా దానంలో భాగంగా కాళ్లు కడిగారు.

సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం వధూవరులు పెట్టుకుని, ఆ సమయంలో ఒకరికొకరు చూపులు కలుపుకొని ఉండగా వచ్చిన బంధువులంతా వారిని ఆశీర్వదించారు.

పెళ్లిలో ముఖ్యమైనది సుముహూర్త ఘట్టం అది సెకండ్ లతో సహా పాటించాల్సిందే! మిగతా తంతు మెల్లిమెల్లిగా చేసుకున్నా పరవాలేదు.

ఇక ఆ సమయంలో అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు.

అపర్ణకు రైల్లో కలిసిన వసంత తాలూకు బంధువులు కన్పించారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

కాసేపు అయిన తర్వాత అక్కడికి సుధ ఇంట్లో కలిసిన తన మిత్రుడు శ్యామ్ కనిపించాడు.

చక్కని అలంకరణలో ఉన్న అపర్ణను చూసి..

” చాలా బాగున్నావు అపర్ణ. ఇది కాంప్లిమెంట్ మాత్రమే అపార్థం చేసుకోవద్దు” అన్నాడు శ్యామ్

చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది అపర్ణ.

” మీ భార్య రాలేదా”? అని అడిగింది అపర్ణ.

” వచ్చింది. ఒకసారి వసంత గారిని కలిసి వస్తానని వెళ్ళింది. నీకు పరిచయం చేస్తాను” అన్నాడు.

ఇంతలో దూరంగా ఒక మహిళ కనిపించింది.

ఆవిడ వీళ్ళ వైపే నడుచుకుంటూ వచ్చింది.

ఆమె దగ్గరికి రాగానే…

” ఈమె నా భార్య ఇందిర.

“ఇందిరా! ఈమె నా స్నేహితురాలు అపర్ణ” అని పరస్పర పరిచయం చేయించాడు.

అపర్ణ ఒక్కసారి షాక్ అయ్యింది.

“ఏంటి ఇతని భార్య ఇ లా ఉంది. వయసులో చూడటానికి పెద్దదిగా ఉంది. అతనికి ఏ మాత్రం సరిపోదు. అతను ఎంతో అందంగా ఉంటే ,ఈమె అతనికి సరిపోయేలా లేదు. అందం గురించి అలా అనుకోకూడదు కానీ ఎలా చేసుకున్నాడు?’ అని అనుకుంది..

ఈమె భావాలు పసిగట్టిన అతను..

” నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అపర్ణా “అని చెప్పాడు.

ఇప్పుడు మరీ ఆశ్చర్యపోయింది అపర్ణ.

కానీ ఏమీ అడగలేక ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాట్లాడడానికి సిద్ధంగా లేదు. అపర్ణని తేరిపారా చూస్తుంది. భర్తను కూడా ఒకరకంగా చూడ సాగింది. స్నేహాన్ని అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండదు.అనుమానం మనిషిలా అనిపించింది.

ఇంకా ఎక్కువ సమయం అక్కడ ఉండకూడదని అనుకున్న అపర్ణ..
“సరే శ్యామ్! వసంతకి ఏదైనా అవసరం ఉంటుందేమో నేను వెళ్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయింది.

మంగళ సూత్ర ధారణ మరియు తలంబ్రాల ఘట్టం అయ్యింది.తలంబ్రాలు పోసుకోవడం కూడా ఒక సుందర దృశ్యం.

అలేఖ్య కళ్ళలో సిగ్గుతో పాటు చిలిపి తనం కనిపించింది. పెళ్ళికొడుకు మనోహర్ కన్నా తొందరగా తలంబ్రాలు పోసేసింది. పెళ్ళి కొడుకువైపు వాళ్ళు “నువ్వు తొందరగా పోయారా “అని తొందర పెడుతున్నారు. ఇలా నవ్వులతో అద్భుతంగా సాగింది ఆ ఘట్టం…

పెళ్లి సంబరాలను చక్కగా ఆస్వాదిస్తున్న అపర్ణ కు దూరంగా వేణు వస్తూ కనిపించాడు.

మెల్లగా వేదిక పై నుండి కిందికి వచ్చి వేణు దగ్గరికి వెళ్ళింది అపర్ణ. అక్కడే శ్యామ్ కూడా ఉన్నాడు.

” ఏరా వేణు ఇంత ఆలస్యంగా వచ్చావ్” అని అడిగాడు శ్యామ్..

” నీకు తెలుసు కదరా! నాన్న పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఏవో పనులు నాకు ఉండనే ఉంటాయి. అందుకని కొంచెం ఆలస్యంగా వచ్చాను అదిగో అపర్ణ వస్తుంది” అన్నాడు వేణు అపర్ణ ను చూస్తూ.

అపర్ణ అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా చూడటం తప్పని తెలిసినా కూడా కళ్ళు తిప్పు కోలేకపోయాడు.

” అప్పటిలాగే ఎంతో అందంగా ఉంది. నిజంగా జీవితంలో నేను పోగొట్టుకున్న లావణ్య రాశి అపర్ణ” అని మనసులో అనుకున్నాడు వేణు

” హాయ్ వేణు ఇంత ఆలస్యంగా వచ్చావ్! ఏంటి ఇంకా మన స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నాను” అన్నది అపర్ణ

“వచ్చారు వాళ్లంతా భోజనాల దగ్గర బిజీగా ఉన్నారు. ఈ రోజుల్లో అంతే కదా! రావడం కట్నం చదివించడం భోజనం చేయడం వెళ్లిపోవడం. తీరిగ్గా ఎవరు కూర్చుని చూస్తున్నారని” అన్నాడు శ్యామ్

” వేణూ! మీ శ్రీమతిని తీసుకొని రాలేదా మాకు చూపిస్తే అరిగి పోతుందా! కరిగిపోతుందా” అని నవ్వింది అపర్ణ.

వెంటనే శ్యామ్ అన్నాడు…

” వీడు వాడి భార్యను ఎక్కడికి తీసుకొని రాడు. నీకు ఒక విషయం తెలుసా అపర్ణా! వీడు అసలు పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని ఉన్నాడు. ఎందుకో చాలా రోజులు మూడీ గానే ఉన్నాడు. మేము అడిగినా ఏమి చెప్పలేదు. చాలా ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా వాళ్ళ ఇంట్లో అందరూ బలవంతంగా మేన మరదల్ని ఇచ్చి చేశారు”అన్నాడు శ్యామ్ వేణు వంక చూస్తూ.

” ఇదంతా ఇప్పుడు అవసరమా? ” అన్నాడు వేణు..

” అపర్ణ మన ఫ్రెండే కదా చెప్తే ఏముంది” అన్నాడు శ్యామ్.

” ఏంటి వేణు! నాకు తెలిస్తే ఏమవుతుంది? నేను కూడా మీ స్నేహితురాలినే కదా”! అన్నది. కానీ మనసంతా వేణు గురించే ఆలోచిస్తుంది.

‘అసలు వేణు పెళ్లి చేసుకోను అనడానికి కారణం తనేనా? తన మనసులో నన్ను పెట్టుకొని మూడీగా ఉన్నాడా? ఎందుకు పెళ్లి వద్దన్నాడు’ అని మనసులో అనుకుంటూ వేణు వైపు చూసింది..

తన వైపే చూస్తున్న వేణు కంగారుగా కళ్ళు తిప్పుకున్నాడు. అతని కళ్ళల్లో భావం అర్థం అయిపోయింది అపర్ణకు.

ఇంకా ఎక్కువ సేపు అక్కడ ఉండడం భావ్యం అనిపించలేదు. వెంటనే వసంత దగ్గరికి వెళ్లిపోయింది.

పెళ్లి తంతు పూర్తిగా అయిపోయిన తర్వాత భోజనాల హాల్లోకి వెళ్లిపోయింది అపర్ణ. అక్కడ కొంతమంది తన చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంది. ఊళ్లో వాళ్ళు కూడా కొంతమంది అపర్ణను గుర్తుపట్టి పలకరించారు. ఇలా అందరితో మాట్లాడుతూ తాను కూడా భోజనం చేసింది.

స్థాలీ పాకం, నాగవెల్లి అన్ని పూర్తయిన తర్వాత అప్పగింతలు జరిగాయి. అప్పగింతల సమయంలో వసంత దుఃఖాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. అపర్ణకి కూడా చాలా ఏడుపు వచ్చింది.

ఇన్నేళ్లుగా ఆడపిల్లను పెంచుకొని, కొత్త వాళ్ళ ఇంటికి పంపించడం బాధనే కదా! నిజంగా ఎంత చదువుకున్నా పద్ధతులు ఆచారాలను పాటించ వలసిందే. కానీ ఇప్పటి రోజులు పాత రోజు లాగా లేవు. మగ పెళ్లి వాళ్ళు కూడా అర్థం చేసుకొని కోడలికి స్వేచ్ఛని ఇస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ కాపురాలను చక్కదిద్దుకుంటున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు.

రాత్రి భోజనాలు అయిన తర్వాత పెళ్లి వాళ్ళు వాళ్ళ ఊరికి బయలుదేరారు. అక్కడ సత్యనారాయణ వ్రతం ఉంటుంది కాబట్టి వసంత వాళ్ళు తెల్లవారి వెళ్లాలనుకున్నారు. అపర్ణను కూడా రమ్మని అడిగితే తాను అత్త దగ్గర ఉంటానని, స్కూల్లో అందర్నీ కలుసుకుంటానని చెప్పింది. వసంత వాళ్ళ ఇంట్లో చేసే వ్రతానికి వస్తానని మరీ మరీ చెప్పింది.

సుధ ఇంటికి ముందే వెళ్లిపోవడం వల్ల తాను మెల్లగా నడుచుకుంటూ వెళ్తానని అనుకుంది. ఇంతలో అక్కడికి వేణు వచ్చాడు.

” వేణూ? భోజనం చేసావా? నువ్వు వెళ్ళి పోయావు అనుకున్నాను” అన్నది అపర్ణ.

“భోజనం చేసి ఇంటికి వెళ్లి పోయాను. మళ్ళీ నిన్ను కలిసి వెళ్దామని వచ్చాను. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటావా? లేదా ఇంటికి వెళ్తావా? అన్నాడు వేణు.

” ఇప్పుడే వసంతకు చెప్పాను వ్రతానికి వస్తానని, సుధత్త దగ్గర ఈరోజు రేపు ఉంటాను. అలాగే ఊళ్లో అందర్నీ కలుసుకొని ఒక్కసారి ఊరంతా తిరుగుతాను. చిన్నప్పటి పరిసరాలను చూసుకోవాలనిపిస్తుంది. ముఖ్యమైనది మన ఊరి గుడి” అన్నది అపర్ణ.

” నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. అలాగే ఊరంతా కూడా తిప్పి చూపిస్తా. కాసేపు నీతో మాట్లాడటానికి సమయం ఇస్తావా”? అన్నాడు వేణు.

” ఇలా మనం మాట్లాడుకోవడం చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వేణూ! ” అన్నది అపర్ణ.

” ఇంకా ఏ కాలంలో ఉన్నావు. ఒకరిని ఒకరు పట్టించుకునే రోజులు పోయాయి. వస్తావా? ఏ విషయం తొందరగా చెప్పు” అన్నాడు వేణు..

” అసలు నోట మాట రాని వేణూ యేనా నువ్వు” అన్నది అపర్ణ నవ్వుతూ..

” సరే, నేను వసంతకు చెప్పి నా బ్యాగ్ తీసుకొని వస్తాను. ఫంక్షన్ హాల్ బయట వెయిట్ చెయ్” అని చెప్పి వసంత దగ్గరికి వెళ్లి తనను కలిసి విషయం చెప్పి బ్యాగ్ తీసుకొని వచ్చింది అపర్ణ..

సంశయిస్తూనే వేణు కారెక్కింది…

” కంఫర్టబుల్గా కూర్చో అపర్ణ” అన్నాడు వేణు..

” సరే వేణు. కానీ ముందుగా మన గుడికి వెళ్దాం. కాసేపు కూర్చొని అప్పుడు ఇంటికి వెళ్దాం” అన్నది అపర్ణ..

ఒక్కసారిగా వేణు కళ్ళల్లో మెరుపు కనిపించింది

 వేణు కారును గుడి వైపు పోనిచ్చాడు. అప్పటి రోజులన్నీ ఇద్దరు గుర్తుకు చేసుకో సాగారు. దారిలో ఉన్న పెంకుటిళ్లన్నీ మాయమైపోయి. కాంక్రీట్ భవనాలు వచ్చాయి. కానీ, అప్పటి జ్ఞాపకాలకు గుర్తుగా కొన్ని ఇళ్ళు అలాగే ఉన్నాయి. అన్నిటిని చూసుకుంటూ గుడి ముందర కారు ఆపాడు వేణు..

చీకట్లు కమ్ముకున్నాయి. గుడి మొత్తం మారిపోయింది .అప్పటి గుడి స్థానంలో కొత్త గుడి వెలిసింది. కానీ ,కొన్ని జ్ఞాపకాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అప్పటి ద్వారము, రథము మాత్రం అలాగే ఉన్నాయి.

సీతారాముల వారు కళ్యాణం చేసుకునే మంటపమును చూసుకుంటూ గుడిలోకి అడుగు పెట్టారు వేణ, అపర్ణ.

ముందుగా హరికథలు జరిగే చోటికి వెళ్లారు. అక్కడే ఇద్దరూ చూపులతో మాట్లాడుకున్న సంఘటన గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నారు.

గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గుళ్లోకి వచ్చారు. అప్పటి పూజారులు కూడా ఎవ్వరూ లేరు. అపర్ణను ఎవరు గుర్తుపట్టే పరిస్థితిలేమీ లేవు. వేణు అక్కడే ఉంటాడు కాబట్టి అందరూ పలకరించారు. అపర్ణ ఎవరో వారికి పరిచయం చేశారు. అపర్ణా వాళ్ళ నాన్నగారు దక్షిణా మూర్తిగారు గుడిలో అందరికీ పరిచితులే. వారు కూడా గుడి సేవలో భాగం పంచుకునే వాళ్ళు. అందరూ అపర్ణతో ఆప్యాయంగా మాట్లాడారు.

కాసేపు గుళ్లో కూర్చున్న తర్వాత ఇద్దరు కలిసి ఆ రోజు కూర్చున్న ప్రదేశానికి వెళ్లారు. ఇద్దరు చెరొక వైపుగా కూర్చున్నారు.

” వేణూ! ఇప్పుడు చెప్పు నీ గురించి. ఎందుకు పెళ్లి చేసుకోను అన్నావు? నీ భార్యని ఎందుకు ఎక్కడికి తీసుకుని రావు? నాకు వివరాలన్నీ కావాలి. ఏ రోజు నీతో నేను మాట్లాడింది లేదు. మొదటిసారిగా ఈ రోజే మనం మాట్లాడుకుంటున్నాము. కానీ ,మన మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉండి ఎంతో పరిచయం ఉన్న వాళ్ళలాగే ఉన్నాము. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకనే నీ గురించి వివరాలు నాకు కావాలి” అని అడిగింది అపర్ణ.

” ఏం చెప్పాలి నా గురించి? నేను చదువు కోసం హైదరాబాద్ కు వెళ్లానే కానీ సరిగా చదవలేదు. ఫ్రెండ్స్ తో తిరగడము ఇదే సరిపోయింది.అందులో నువ్వు బాగా గుర్తొచ్చేదానివి.

అందుకని పదవ తరగతిలో ఫెయిల్ అయ్యాను. మా నాన్నగారు బాగా తిట్టారు. తర్వాత కొంచెం కష్టపడి చదివి పాస్ అయ్యాను. ఇంటర్లో జాయిన్ అయ్యాను.
ఒకరోజు నేను హైదరాబాద్ వెళుతున్నాను. నాకు నువ్వు కనిపించావు” అని ఇంకా చెప్పబోతుంటే..

అపర్ణ అతన్ని ఆపింది..

” ఇప్పుడు నేను చెప్తాను విను.నేను కూడా వేరే ఊర్లో కాలేజీ చదువుతున్నాను. అప్పటికే నేను ఇంటర్ సెకండియర్ లో ఉన్నాను. సెలవులు అయిపోయాక నేను నా కాలేజ్ కోసం బయలుదేరాను. మన ఇద్దరి దారులు ఆపోజిట్ సైడ్ .అక్కడ నేను నిలబడ్డాను. నిన్ను చూసాను కానీ మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు కదా! ఊరికే నవ్వి నా లగేజ్ తో నేను అక్కడ చెట్టు కింద నిలబడ్డాను.

అప్పుడు నువ్వు నాకోసం వచ్చావు.వచ్చి పలకరించావు .నువ్వు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నావని’ చెప్పావు. అలాగే మరొక విషయం చెప్పావు. “నీకు నేను ఉత్తరం రాసాను అన్నావు.అది కూడా కాలేజ్ అడ్రస్ కి అప్పుడు నేను చెప్పాను, అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు ఉత్తరాలు తెచ్చి ఇవ్వరు. వాళ్లే చదివేసి చింపి పడేస్తారు.ఇకముందు రాయొద్దు అన్నాను. నువ్వు సరే అని చెప్పి వెళ్ళిపోయావు. అంతే కదా వేణు” అన్నది అపర్ణ..

” అవును అంతే !కానీ, తర్వాత మళ్లీ ఒకసారి నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నిన్ను చూశాను .అప్పుడు కూడా పలకరించాను, ఇదంతా జరిగిన తర్వాత మరొక ముఖ్యమైన సంఘటన జరిగింది .అది నాకు బలంగా గుర్తుండిపోయింది” అన్నాడు వేణు బాధగా..

” ఏంటది” అన్నది అపర్ణ..

” నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అప్పటికి నీది ఇంటర్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయ్యావ్ అనుకుంటా! నేను మీ ఇంటికి బుక్స్ సాకుతో వచ్చాను. ఇంట్లోకి రాలేదు బయటనుంచి ఎవరినో పంపిస్తే నిన్ను పిలిచారు. నీ దగ్గర ఫిజిక్స్ బుక్ తీసుకొని వెళ్ళాను. అలా రెండు మూడు సార్లు బుక్స్ తీసుకొని వెళ్లాక, మూడవసారి అనుకుంటా నేను మళ్ళీ సైకిల్ పైన మీ ఇంటికి వచ్చాను అప్పుడు నీకు……” అలా వేణు చెప్పబోతుంటే మళ్ళీ ఆపింది అపర్ణ.

” నేను చెప్పనా! నువ్వు నా బుక్కు తీసుకొని వచ్చావు. బుక్ చేతికి ఇచ్చి ఏం చెప్పావో తెలుసా! ఇందులో లెటర్ ఉంది. చదివి,రిప్లై ఇవ్వు .సాయంత్రం లైబ్రరీ దగ్గరికి వస్తావా అన్నావు..”

నేను మా ఇంటి ముందు ఉన్న అరుగు పై నిలబడ్డాను .నువ్వేమో సైకిల్ మీద వచ్చి అలాగే కాలు కింద పెట్టి సైకిల్ పైన ఎక్కి కూర్చున్నావు.

అప్పుడు నేను చెప్పాను..

” ఇలాంటివి వద్దు” అని చెప్పి పుస్తకాన్ని మాత్రం తీసుకున్నాను.

నీ ముఖం వైపు చూసే సాహసం నేను చేయలేదు. బాధపడే ఉంటావు అని అనుకున్నా…

ఇంట్లోకి వెళ్లిపోయాను. మనసంతా బాధగా ఉంది. కానీ, నేను నా కట్టుబాట్లకు లోబడి ఉన్నాను. నాఇంటి పరిస్థితులను అర్థం చేసుకున్నాను. అందులో మా నాన్నగారు అచ్చమైన పౌరోహిత్యం లో ఉన్నారు. ఆయన ఉద్యోగం చేస్తూ కూడా దీన్ని కొనసాగించారు. నేను ఏ మాత్రం తప్పటడుగు వేసినా అందరి గౌరవం పోతుంది .ఇంత విపులంగా ఆ రోజు నేను ఆలోచించకపోవచ్చు.. కానీ ఇది చేయకూడదు అని నా మనసుకు అనిపించింది.ఎన్నో విషయాలు అస్పష్టంగా మనసులో మెదిలాయి. అంతే తలుపులను నా మదిలో తలపులను మూసాను. ఇది అందరికీ మంచే జరిగింది వేణు. ఏ మాత్రం పొరపాటు నిర్ణయం తీసుకున్నా ఇరు కుటుంబాలు బాధపడేవి కదా !ఇప్పుడు నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావో”? అన్నది అపర్ణ.

” చాలా బాధపడ్డాను. కన్నీళ్లు వచ్చాయి. నువ్వు ఇంట్లోకి వెళ్లిపోయావు. నాకు గుర్తుంది. ఆ రోజు నువ్వు లంగా ఓణీ వేసుకున్నావు? తల స్నానం చేసావేమో జుట్టంతా వదిలేసావు. నా మనసులో ఆ రూపం ముద్రించుకొని పోయింది. అలా బాధతో ఇంటికి వెళ్ళిపోయాను”. అన్నాడు వేణు బాధగా.

వేణును చూసి బాధపడింది అపర్ణ.

“వేణూ! అప్పుడు మనము పెళ్లి గురించి నిర్ణయం తీసుకునే వయసేనా? ఆ సమయంలో ప్రేమలేఖలు రాసుకొని చదువులు పాడు చేసుకుని ఏంచేస్తాం?. అయినా ఆ వయసులో జీవితం గురించి మనకు ఏమైనా అర్థమవుతుందా? నేను తల్లిదండ్రుల చాటు బిడ్డని. నా ఇంటి వాతావరణం ఎలాంటిదో తెలుసు. అప్పటివరకు ఇలాంటివి తెలియని నాకు నీవు ఉత్తరం అనగానే నాకు వణుకు వచ్చేసింది. అందుకే నాకు ఏమీ తోచలేదు.నేను నీకు ‘అలా చేయకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను’ ఆ అర్థంకాని వయసులో నాకు కూడా చాలా బాధ కలిగింది. ఎన్నో రోజులు నిన్ను తలచు కున్నాను. ఇప్పుడు చెప్పు తర్వాత ఏం జరిగింది?” అన్నది అపర్ణ.

“కష్టపడి డిగ్రీ పూర్తి చేశాను. పెద్దగా చదువు మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ తర్వాత మన ఊరికి వచ్చాను. నాన్న ఎలాగో పొలిటిషన్ కదా! తనకి ఏదో విధంగా సహాయం చేద్దామని వచ్చాను. నేను వ్యాపారం కూడా చేస్తున్నాను. ఇక నాకు 24 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండి ఇంట్లో పెళ్లి చేసుకోమని అడగడం ఎక్కువైపోయింది. నాకు అసలు పెళ్లి చేసుకోవాలి అనిపించలేదు. అలాగే చాలా రోజులు ఉండిపోయాను. ఇప్పుడు నాతోటి చదువుకున్న వాళ్ళ పిల్లలు పెళ్లిళ్లు కూడా అయి ఉంటాయి. అలాగే నీ పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాయని తెలిసింది. నాకు మాత్రం ఇప్పుడు మూడేళ్లు మరియు ఐదేళ్లు వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అది కూడా నాన్న బలవంతంతో పెళ్లి చేసుకున్నాను. నేను చేసుకున్న అమ్మాయి నాకు మేన మరదలే అవుతుంది. చిన్నప్పటినుండి అనుకున్న సంబంధమే. కానీ, నాకు ఇష్టం లేకపోయింది. ఆ అమ్మాయి పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. కానీ కొన్ని కారణాలవల్ల విడాకులు జరిగి మన ఊరికే వచ్చేసింది. పెద్దలందరి కోరిక మేరకు ఆఅమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పటికీ తనతో మనస్ఫూర్తిగా నేను ఉండలేకపోతున్నాను. కారణం నువ్వు అని నేను చెప్పలేను. కానీ , నాకెందుకొ ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందరూ అంటారు ఆమెని ఎక్కడికి తీసుకెళ్లనని .నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు” అన్నాడు వేణు కన్నీళ్ళతో.

“నువ్వెంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? తెలిసి తెలియని వయసులో మనం ఒకరినొకరం చూసుకున్నాం .అది ఇష్టమో? ప్రేమో? మనకే తెలియని వయస్సు. ఇన్నేళ్లు గడిచాయి ఇంకా అదే మనసులో పెట్టుకొని నువ్వు మరొకరి జీవితాన్ని బాధ పెట్టడం నాకు నచ్చలేదు. నాకే తెలియదు ఎందుకు ఇలా ఉంటున్నాను అని అంటున్నావు, దానికి కారణం నేనే అని నాకు తెలుసు. నువ్వు కప్పి పుచ్చాలని ఎంత ప్రయత్నం చేసినా నేను అర్థం చేసుకోగలను. కానీ నా పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలకు తల్లిని. వాళ్ల పెళ్లిళ్లు కూడా చేశాను. ఇంకా నువ్వు నీ జీవితాన్ని అలాగే వేదన పాలు చేస్తుంటే నేను బాధ పడాలో? కోపగించు కోవాలో? అర్థం కావడం లేదు. ఇది మాత్రం తప్పు. చిన్న వయసులో ఎన్నో ఊహించు కుంటాము. అవన్నీ నిజం కావాలనుకుంటే అవుతాయా? కళ్ళు చూసి ఇష్టపడితే కాళ్లు వెళ్లి ఆ వస్తువుని తీసుకొని రాలేవు. అలాగే మన విషయంలో నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. మనలాగా ఇలా ఇష్టపడి దూరమై వారి ఇష్టమైన పెళ్లిళ్లు చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతదాకా ఎందుకు నేను సంతోషంగా లేనా? అది చిన్న వయసులో జరిగిన చిన్న క్రష్ మాత్రమే. దాని గురించి ఇంకా ఆలోచించడం అవివేకం. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని నువ్వు అవమానిస్తున్నట్లే లెక్క. ఇకముందు నువ్వు ఇలా ప్రవర్తించవద్దు. నీ భార్యతో సంతోషంగా ఉండు. తనే నీ జీవితం. ఇది చెప్పడానికే ముందుగా గుడికి వెళదామని నేను నిన్ను అడిగాను. నువ్వు ఇంకేదో ఊహించు కోవద్దు. ఆడవాళ్లు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు?

వయసు పెరిగిన కొద్దీ ఆడవాళ్ళలో పరిణితి పెరుగుతుంది. నేను అంత చిన్న వయసులోనే నీకు నో చెప్పాను అంటే నేను ఆ వయసులోనే ఎంత ఆలోచించి ఉంటానో అర్థం చేసుకో. నిజంగా అలా చెప్పడం మన ఇరువురికి మంచిదే అయ్యింది. మన కుటుంబాల గౌరవాలను కాపాడాము. అయినా మనకు అంత వయసు కూడా లేదు. మనమేమీ కలిసి తిరగలేదు .ప్రేమను పంచుకోలేదు. ఓన్లీ చూపులతో మాట్లాడుకున్నాము .అది ఒక ఆకర్షణ. దాని నుండి బయటకు వచ్చి ఇకనుండి నీ జీవితాన్ని సంతోషంగా కొనసాగించు” అని చెప్పింది అపర్ణ.

అపర్ణ మాటలను వింటున్న వేణుకు ఏదో అర్థమైనట్టుగానే అనిపించింది .ఎందుకో మనసులో ఉన్న భారం కూడా దిగినట్లు అనిపించింది.

“పద నిన్ను మీ అత్త వాళ్ళింట్లో దింపేస్తాను” అన్నాడు నవ్వుతూ.

“నీకు నవ్వు కూడా తెలుసా? వెరీగుడ్ నా మాటలు నీపై ప్రభావం చూపించాయని అర్థమవుతుందిm ఆల్ ద బెస్ట్ వేణు” అని అతని చేతులు తన చేతిలోకి తీసుకొని గట్టిగా నొక్కి వదిలిపెట్టింది.

“ఇలా ముట్టు కున్నానని దీనిని కూడా మర్చిపోలేను అని అనుకోవద్దు. నా ఈస్పర్శ నీకు ధైర్యం రావడానికి .నువ్వు సంతోషంగా ఉండటానికి, నువ్వు నాకు ఎప్పుడు స్నేహితుడివే సరేనా” అన్నది అపర్ణ.

కళ్ళతోనే అవునన్నట్లు తల ఊపి వేణు గుడి బయటకు వచ్చి, కారు స్టార్ట్ చేశాడు. అపర్ణ వచ్చి కారులో కూర్చుంది. వాళ్ల అత్త వాళ్ళ ఇంట్లో దింపేసి ఇంటికి వెళ్లిపోయాడు వేణు.

సశేషం

January 30, 2026 6 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అద్వైత వేదాంతి మైత్రేయి

by Vijaya Ranganatham January 29, 2026
written by Vijaya Ranganatham

జ్ఞాన సముపార్జనకు పూర్వ కాలం నుండి ఎంతో మంది తపస్సులు చేసారు, ఎన్నో వేదవేదాంగాలు, గ్రంథాలు చదివారు. అలా ఎంతో మంది తత్వవేత్తలను మనం పురాణేతిహాసాలలోను, చరిత్రలోనూ చూస్తాము. పురుషాధిక్యత ఉన్న వేదకాలంలో పతుల నీడలోనే, గృహాల్లోనే కాలం వెళ్ళబుచ్చే మహిళలు జీవించే వ్యవస్థనుండి ప్రపంచానికి తమ ఉనికిని చూపిన మహోన్నతస్త్రీలు కూడా ఉన్నారనటానికి ఉదాహరణ లోపాముద్ర, గార్గి, అపాలా, మైత్రేయి వంటివారు.
మైత్రేయి వేదకాలంలోనే మహిళలు చదువుకుని, తత్వవిచారం చేసినారని చెప్పడానికి మంచి ఉదాహరణ. భారతీయ మహిళల విజ్ఞానానికి, ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆమె ఒక ప్రతీక. మైత్రేయి ప్రాచీన భారతదేశ వేదకాలానికి చెందిన ప్రముఖ మహిళా తత్వవేత్త. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆమెను యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు. రెండవ భార్య కాత్యాయనీ. యాజ్ఞవల్క్యుడు క్రీ.పూ. సుమారు 8వ శతాబ్దానికి చెందినవాడిగా పండితులు అంచనా వేస్తున్నారు.

మైత్రేయి ఆస్తి, సంపదలకంటే బ్రహ్మజ్ఞానమే శాశ్వతమని విశ్వసించిన బ్రహ్మవాదిని. యాజ్ఞవల్క్యునితో ఆమె చేసిన తత్త్వచర్చలు ఉపనిషత్తులలో ముఖ్యమైన స్థానం పొందాయి. ఈ సంభాషణలలో ప్రతిఫలించే ఆత్మ బ్రహ్మ ఏకత్వ భావన తరువాత కాలంలో రూపుదిద్దుకున్న అద్వైత వేదాంతానికి మౌలిక ఆధారంగా పరిగణించబడుతుంది. మహాభారతం, మరి కొన్ని స్మృతి వ్యాఖ్యాన సంప్రదాయాలలో మైత్రేయిని బ్రహ్మజ్ఞాన సాధనకు అంకితమైన మహిళగా వర్ణించారు. ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఆమెను బ్రహ్మవాదినిగా అంటే వేదతత్త్వాలపై లోతైన అవగాహన కలిగిన తత్వవేత్తగా గౌరవించారు. మైత్రేయి భారతీయ తత్త్వచింతనలో మహిళల మేధస్సు, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఋగ్వేదంలో మహిళా ఋషులు ఉన్నారు (లోపాముద్ర, గార్గి, అపాలా వంటివారు), కానీ మైత్రేయి ఋగ్వేద ఋషిగా పేర్కొనబడలేదు. మైత్రేయి ప్రధానంగా ఉపనిషత్తుల కాలానికి చెందిన వ్యక్తి, ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులోనే ఆమె స్థానం స్పష్టంగా కనిపిస్తుంది. మైత్రేయి యాజ్ఞవల్క్య సంభాషణ భారతీయ తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది. వేదకాలంలో మహిళలకు విద్య, తత్వచింతన అవకాశాలకి మైత్రేయి ఉదాహరణ. ఆమె ప్రాచీన భారతదేశానికి చెందిన మహిళా తత్వవేత్త. ఆమె గురించి ఋగ్వేదంలో సూక్తాలు లేవు. మైత్రేయి ప్రధానంగా బృహదారణ్యక ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఆ ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షితో ఆమె చేసిన సంభాషణలో ఆత్మ అంటే ఏమిటి, మనుషులు ఎందుకు ప్రేమిస్తారు అనే విషయాలు చర్చించబడతాయి. ఈ సంభాషణ ప్రకారం, మనం ఇతరులను లేదా వస్తువులను ప్రేమించేది మన ఆత్మ కారణంగానే. ఈ సంభాషణలో చెప్పిన ఆత్మ, బ్రహ్మ ఏకత్వ భావన
2 / 8
తరువాత కాలంలో ఏర్పడిన అద్వైత వేదాంతానికి ఆధారంగా పరిగణించబడుతుంది. శంకరాచార్యుల శిష్యుడు సురేశ్వరాచార్యుడు తన వర్తిక గ్రంథంలో ఈ విషయాలను మరింత వివరించాడని చెబుతారు.
మైత్రేయి ఎక్కడ పుట్టింది అనే విషయంపై ఉపనిషత్తులు మౌనం పాటిస్తున్నాయి. కేవలం యాజ్ఞవల్క్య ఆశ్రమం / గృహ పరిసరాల్లో ఆమె జీవించింది అనే అంచనా మాత్రమే. పండితుల అంచనాలు (ఊహలు మాత్రమే – సాక్ష్యాలు కావు) విదేహ దేశం (మిథిలా ప్రాంతం) లేదా కురుపాంచాల ప్రాంతం. ఎందుకంటే యాజ్ఞవల్క్యుడు ఈ ప్రాంతాలవాడని వినికిడి. కానీ ఇది శాస్త్రీయ నిర్ధారణ కాదు.
బృహదారణ్యక ఉపనిషత్తులో ఆమెను “మైత్రేయి” అనే పేరుతో మాత్రమే పరిచయం చేస్తుంది. ఆమె భర్త యాజ్ఞవల్క్యుడు అని మాత్రమే చెబుతుంది. ఆమె తండ్రి పేరు, తల్లి పేరు, ఆమె వంశం (గోత్రం) ఎక్కడా ధృవీకరించలేదు. ఇది ఉపనిషత్తుల స్వభావమని చెబుతారు. ముఖ్యమైన తాత్విక కారణ మేమిటంటే వేద–ఉపనిషత్తు సంప్రదాయంలో “ఎవరి కుమార్తె?” కంటే “ఏ సత్యాన్ని తెలిపింది?” అన్నదే ముఖ్యం. మైత్రేయి విషయంలో ఆమె ప్రశ్నలే ఆమె గుర్తింపు. ప్రామాణికంగా చెప్పగల విషయాలు ఆమె బ్రహ్మవాదినీ, అత్యున్నత వేదాంత విద్య పొందిన స్త్రీ, గురువునే ప్రశ్నించే స్థాయిలో మేధస్సు కలది. గృహస్థ జీవితం కంటే జ్ఞానజీవితాన్ని ఎంచుకున్నది. అంటే ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె ఆలోచనలే నిర్వచించాయి, వంశం కాదు.
“మైత్రేయి తల్లి–తండ్రులు లేదా ఆమె జన్మస్థలం గురించి ఉపనిషత్తులు ఎటువంటి వివరాలు ఇవ్వవు. ఇది వేదకాల గ్రంథాల ప్రత్యేకత. వ్యక్తిగత చరిత్ర కంటే, ఆమెలో వ్యక్తమైన తాత్విక చైతన్యమే ముఖ్యమని ఇది సూచిస్తుంది. మైత్రేయి గుర్తింపు ఆమె వంశం వల్ల కాదు, ఆమె అడిగిన ‘అమృతత్వం’ ప్రశ్న వల్ల నిలిచింది.” కానీ ఆమె మానవ జ్ఞానానికి కుమార్తె అని మాత్రం స్పష్టంగా తెలుస్తుందని పండితుల అభిప్రాయం. మైత్రేయి తల్లి, తండ్రులు, జన్మస్థలం గురించి ఉపనిషత్తులు గానీ, వేద గ్రంథాలు గానీ ఎక్కడా పేర్కొనలేదు. ఈ వివరాలు చారిత్రికంగా లభ్యం కావు. మైత్రేయి తల్లి–తండ్రులు, ఆమె జననం ఎక్కడ అనే విషయంపై స్పష్టంగా, ప్రామాణికమైన వివరాలు దొరకలేదు. వేదాలు వ్యక్తిగత జీవన చరిత్ర కాదు, తత్త్వజ్ఞానమే ప్రధానమని చెబుతాయి. ఉపనిషత్తులు ఆమె అంతర్గత జీవితం గురించి మాత్రమే మాట్లాడతాయి, బాహ్య జీవితం గురించి కాదు.
మరి మైత్రేయి ఎవరు? మైత్రేయి వేదాంత కాలానికి చెందిన బ్రహ్మవాదినీ — అంటే బ్రహ్మం (పరమసత్యం) గురించి విచారించే తత్వవేత్త. ఆమె పేరు బృహదారణ్యక ఉపనిషత్తులో అత్యంత గౌరవంతో ప్రస్తావించబడింది. ఆమె యాజ్ఞవల్క్య మహర్షి ఇద్దరి భార్యలలో ఒకరు, కానీ సాధారణ గృహిణిగా కాకుండా జ్ఞానాన్వేషిణిగా నిలిచింది. కాలం సుమారు క్రీ.పూ. 800–700. స్థానం విదేహ రాజ్యం జనక మహారాజు కాలం. ఆమె స్వభావం జిజ్ఞాస, తత్త్వవిమర్శ, ధైర్యం. గ్రంథాల ద్వారా కనిపించే లక్షణాలు ప్రశాంత స్వభావం, స్పష్టమైన ఆలోచన, వినమ్రత, ధైర్యం, భావోద్వేగం కంటే తత్త్వబుద్ధి. ఇవే మనకి అందుబాటులో ఉన్న సమాచారం.
అంతేకాక మైత్రేయి గురించి కొన్ని ప్రత్యేకతలు వివరించారు. వాటిలో సంపదను త్యజించిన స్త్రీ అని, ప్రాచీన కాలంలో ఆస్తి పంచుకోవడం గొప్ప అవకాశమైనా, ఆమె దాన్ని తిరస్కరించిందని పండితుల ఉవాచ. అంతే
3 / 8
కాక ఆమెలో ప్రశ్నించే ధైర్యం ఎక్కువని, యాజ్ఞవల్క్య బోధ మధ్యలో “ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు, మరింత వివరించండి” ఆమె భర్తను ప్రశ్నించేది. ఆ ప్రాచీన వ్యవస్థలో భర్తతో మాట్లాడటానికే చాలా ధైర్యం కూడదీసుకోవలసిన తరుణంలో మైత్రేయి నిస్సంకోచంగా ప్రశ్నించటమే తన జ్ఞానమార్గమని భావించింది.
ఆమె గార్గితో సమకాలీకురాలు, సమాన స్థాయిగా పేరొందారు. గార్గి సభలో ప్రశ్నించింది. మైత్రేయి గృహంలో ప్రశ్నించింది. ఇద్దరూ తత్వంలో సమానులు. కాని మైత్రేయి జనకుడి సభలో ఉండిందన్న దానికి ఆధారాలు లేవు. ఆ సభలో పాల్గొన్నది గార్గి మాత్రమే. ఈ ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు మార్గాల్లో ఉపనిషత్తుల తాత్విక పరిపక్వతకు దోహదం చేశారు.” గార్గి, సభలో ప్రశ్నించిన తాత్విక ధైర్యం. మైత్రేయి, జీవితార్థాన్ని వెలికితీసిన తాత్విక లోతు. ఇద్దరూ ఉపనిషత్తుల రెండు ముఖాలని పండితుల అభిప్రాయం.
ప్రసిధ్ధ మైన విదేహ రాజు జనకుడి సభలో యజ్ఞవల్కుడు, ఉద్దాలక ఆరుణి, అశ్వలాయనుడు, కాహోళుడు, భుజ్యుడు, గార్గివాచక్నవి వంటి మహాతాత్వికులు పాల్గొన్నారు. ఇది ఒక పబ్లిక్ ఫిలసాఫికల్ డిబేట్. గార్గి సభలో నిలబడి యాజ్ఞవల్కుడిని నేరుగా ప్రశ్నిస్తుంది. రెండుసార్లు వాదన చేసినట్టుగా చెప్పబడుతుంది. అందుకే గార్గి సభా తత్వవేత్త. కాని మైత్రేయి జనకుడి సభలోను, పండితుల సభలోను, రాజసభలోను ఎటువంటి తత్వ విచారం చేసినట్టుగా బృహదారణ్యక ఉపనిషత్తు 2.4, 4.5 అధ్యాయాలలో లేదు.
కాని యాజ్ఞవల్క్యుడు – మైత్రేయి మధ్య వ్యక్తిగత తాత్విక సంభాషణ మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఆమె యాజ్ఞవల్క్యుడితో వ్యక్తిగతంగా జరిపిన సంభాషణ ద్వారా వేదాంతానికి అంతఃస్వరూపాన్ని ఇచ్చింది. ఇది గృహ పరిసరాల్లో జరుగుతుంది. అంతర్ముఖమైన (introspective) వేదాంత బోధ, మోక్ష, ఆత్మ, అమృతత్వం గురించిన ఉపదేశం మాత్రమే. అందుకే మైత్రేయి అంతఃతాత్విక విచారణకారిణి (private philosopher) అని వివరించారు.
ఎందుకు ఈ తేడా. ఇది చాలా ముఖ్యమైన తాత్విక విషయం. గార్గి, సమాజంలో జ్ఞానస్థాయిని ప్రశ్నిస్తుంది. తత్త్వానికి బాహ్య సరిహద్దులను పరీక్షిస్తుంది. “ప్రపంచానికి ఆధారం ఏమిటి?” అని అడుగుతుంది. మైత్రేయి, జీవనార్థాన్ని ప్రశ్నిస్తుంది.“నేను అమృతత్వాన్ని ఎలా పొందగలను?” అని అడుగుతుంది. తత్త్వాన్ని జీవితంతో అనుసంధానిస్తుంది. ఒకరు లోకాన్ని ప్రశ్నించారు, మరొకరు జీవితాన్ని ప్రశ్నించారు. ఇక మనం మైత్రేయి జ్ఞానోపదేశం, తత్వ విచారం ఎలా పొందిందని ఆమే భర్తతో చేసిన వాదనలను బట్టి మనకు అవగాహనకు వస్తుంది.
మైత్రేయి–యాజ్ఞవల్క్య సంభాషణ (బృహదారణ్యక ఉపనిషత్తు 2.4). ఈ సంభాషణను ఉపనిషత్తుల హృదయం అని కూడా అంటారు.
యాజ్ఞవల్క్యుడు గృహస్థాశ్రమాన్ని వదలి వనప్రస్థానికి వెళ్లాలని నిర్ణయించే సందర్భంలో, తన ఆస్తిని ఇద్దరు భార్యలకు పంచాలనుకుంటాడు. దానికి మొదటి భార్య కాత్యాయనీ గృహ జీవితం కోరింది. కాని రెండవ భార్య
4 / 8
అయిన మైత్రేయి జ్ఞానాన్ని కోరింది. లక్ష్యం- బ్రహ్మజ్ఞానం, దారి – తత్త్వవిచారణ, ప్రతీక- జ్ఞాన దాహం మైత్రేయి తత్వ విచారమైతే, కాత్యాయనికి గృహసుఖం, కర్తవ్యాచరణ, సంప్రదాయం ప్రధానమైనాయి.
అప్పుడు మైత్రేయి తన భర్తను అడిగిన ప్రశ్నే వేదాంత చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైనది.
“స్వామీ! ఈ సంపదతో నాకు అమృతత్వం లభిస్తుందా?” దానికి యాజ్ఞవల్క్య సమాధానంగా “లేదు మైత్రేయి! ధనంతో అమృతత్వం రాదు. ధనం కేవలం భౌతిక సుఖాన్ని ఇస్తుంది.” అంటాడు.
అప్పుడు మైత్రేయి:
“అయితే నాకు ఆస్తి అవసరం లేదు. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి.” అని తన ఖచ్చితమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇది ఆమె వైరాగ్యం + తత్త్వజిజ్ఞాసకు నిదర్శనం. మైత్రేయికి బోధించిన తత్త్వసారం.
1.ఆత్మకేంద్ర తత్త్వం యాజ్ఞవల్క్యుడు చెప్పిన ప్రసిద్ధ వాక్యం:
“ఆత్మవా అరే దృష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః, నిదిధ్యాసితవ్యః”
అర్థం ఆత్మనే చూడాలి, వినాలి, ఆలోచించాలి, ధ్యానించాలి. ఉపనిషత్తుల కేంద్ర సిద్ధాంతం ఇదే.
2.ప్రేమకూ మూలం ఆత్మే అని అద్భుతమైన మానసిక-తాత్విక విశ్లేషణను యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి వివరిస్తాడు.
· భార్యను భార్యగా కాదు — ఆత్మ వల్లే ప్రేమిస్తాం
· భర్తను భర్తగా కాదు — ఆత్మ వల్లే ప్రేమిస్తాం
· కుమారుడు, ధనం, లోకం — అన్నీ ఆత్మ వల్లే ప్రియమైనవి
3.ఆత్మ = బ్రహ్మం. మైత్రేయికి బోధించిన అత్యున్నత సత్యం:
· ఆత్మకు ద్వితీయమేదీ లేదు
· ఆత్మే బ్రహ్మం
· అన్నీ చివరికి ఆత్మలోనే లీనమవుతాయి.
మైత్రేయి కాలం: వేదాంత ప్రారంభ దశ (సుమారు క్రీ.పూ. 800–700). గ్రంథ మూలం: బృహదారణ్యక ఉపనిషత్తు. 2.4 అధ్యాయం. 4.5 అధ్యాయం. పాత్ర: బ్రహ్మవాదినీ (బ్రహ్మజ్ఞానం కోరిన స్త్రీ తత్వవేత్త). సంబంధం: యాజ్ఞవల్క్య మహర్షి భార్య. ఉపనిషత్తుల్లో పేరు స్పష్టంగా పేర్కొనబడిన కొద్ది మంది స్త్రీలలో మైత్రేయి ఒకరు — ఇదే ఆమె గొప్పతనమని ఇదే ఆమె చారిత్రిక స్థానం మని పండితుల అభిప్రాయం.
“బ్రహ్మవాదినీ” అంటే ఏమిటి? వేదకాలంలో స్త్రీలు రెండు రకాలుగా వర్ణించబడ్డారు.
5 / 8

  1. సద్యోవధూవులు – గృహజీవితం ఎంచుకున్నవారు
  2. బ్రహ్మవాదినులు – బ్రహ్మజ్ఞానం కోరినవారు
    మైత్రేయి రెండవ వర్గానికి చెందినది. ఆమెకు వివాహం గృహసుఖం కోసం కాదు. జ్ఞానసాధనకు ఒక దారి మాత్రమే.
    మైత్రేయి–యాజ్ఞవల్క్య సంభాషణ, సందర్భం. యాజ్ఞవల్క్యుడు గృహస్థాశ్రమం విడిచి వనప్రస్థం / సన్యాసానికి సిద్ధమవుతాడు. తన ఆస్తిని భార్యలైన కాత్యాయనీ, మైత్రేయికి పంచాలనుకుంటాడు.ఇక్కడే మైత్రేయి అడిగిన ప్రశ్న వేదాంత చరిత్రను మార్చింది.
    మైత్రేయి ప్రశ్న – వేదాంతానికి మూలబిందువు
    ప్రశ్న:”స్వామీ! ఈ సంపదతో నేను అమృతత్వాన్ని పొందగలనా?”ఇది సాధారణ ప్రశ్న కాదు.
    ఇది మూడు విషయాలను సూచిస్తుంది:
  3. ఆమెకు మరణభయం లేదు, కానీ మరణాతీత స్థితి కావాలి
  4. ఆమెకు సంపద విలువ తెలుసు, కానీ అది తుదలక్ష్యం కాదని తెలుసు
  5. ఆమెకు మోక్ష జిజ్ఞాస ఉంది
    ఇదే వేదాంతానికి ఆరంభం.
    యాజ్ఞవల్క్య సమాధానం. “న ఆరే అమృతత్వస్య ఆశా అస్తి విట్టేన” (ధనంతో అమృతత్వం రాదు)
    అర్థం: ధనం సుఖం ఇస్తుంది. కానీ శాశ్వతత్వం ఇవ్వదు.
    మైత్రేయి వెంటనే స్పందిస్తుంది:
    “యేనాహం న అమృతా స్యామ్ కిమ్ అహం తేన కుర్యామ్”
    (అమృతత్వం రానిదైతే, అటువంటి దానితో నాకు పనేముంది?) ఇది ఆమె తాత్విక ధైర్యానికి అద్భుత ఉదాహరణ.
    మైత్రేయి ఎంపిక – జ్ఞానమే సంపద ఆమె స్పష్టంగా చెబుతుంది.“నాకు ఆస్తి వద్దు” “నాకు బ్రహ్మజ్ఞానం కావాలి” ఇది త్యాగం కాదు, తత్త్వబుద్ధి.
    యాజ్ఞవల్క్య బోధించిన మహత్తర సిద్ధాంతం ఆత్మకేంద్రీకరణ “ఆత్మవా అరే దృష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః, నిదిధ్యాసితవ్యః”
    6 / 8
    అర్థం ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మను ధ్యానించాలి.ఆత్మను అనుభవించాలి.ఇదే ఉపనిషత్తుల సారం.
    ప్రేమ తత్త్వం – ప్రపంచంలో అత్యద్భుతమైన విశ్లేషణ
    యాజ్ఞవల్క్యుడు చెబుతాడు: భర్త భర్తగా కాదు → ఆత్మ వల్లే ప్రియుడు. భార్య భార్యగా కాదు → ఆత్మ వల్లే ప్రియురాలు.కుమారుడు, ధనం, లోకం → అన్నీ ఆత్మ వల్లే ప్రేమించబడతాయి
    ఇది భారతీయ తత్త్వంలో తొలి మానసిక విశ్లేషణ.
    ఉపనిషత్తులో ప్రసిద్ధ వాక్యం ఉంది.
    న వా అరే పత్న్యాః కామాయ పతిః ప్రియో భవతి
    ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి
    అర్థం: భార్య కోసం భర్త ప్రియుడు కాదు; ఆత్మ కోసం భర్త ప్రియుడు అవుతాడు.
    ఆత్మ అంటే బ్రహ్మం. ఆత్మకు రెండవది లేదు. ఆత్మే పరమసత్యం. అన్నీ చివరకు ఆత్మలో లీనమవుతాయి. మైత్రేయి ఇదే జ్ఞానం కోరింది.
    మైత్రేయి ప్రత్యేకతలు (లోతైన విశ్లేషణ)
    1) ప్రశ్నించే హక్కు
    ఆమె యాజ్ఞవల్క్య బోధలో మధ్యలోనే చెబుతుంది: “ఇది నాకు ఇంకా స్పష్టంగా లేదు”
    వేదకాలంలో గురువును ప్రశ్నించే హక్కు ఆమెకు ఉంది.
    2) సంపదను తిరస్కరించిన స్త్రీ ఇది త్యాగం కాదు —సారాన్ని గుర్తించిన బుద్ధి.
    3) గార్గితో తుల్యత. గార్గి సభలో ప్రశ్నించింది. మైత్రేయి గృహంలో ప్రశ్నించింది. ఇద్దరూ బ్రహ్మం గురించే ప్రశ్నించారు.
    మైత్రేయి తత్త్వం:నీ విలువ బయట ఉన్న వాటితో కాదు. నీ లోపల ఉన్న ఆత్మబుద్ధితో నిర్ణయించాలి. “ధనం కాదు, జ్ఞానమే అమృతత్వం” అని లోకానికి నేర్పిన మహాస్థ్రీ మైత్రేయి. జీవితం సుఖంగా ఉండాలి కానీ జీవితార్థం తప్పిపోకూడదు. సంబంధాలు ప్రేమకు మూలం.
    యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పిన అత్యంత లోతైన మాట: “భర్తను భర్తగా కాదు — ఆత్మ వల్లే ప్రేమిస్తాం.”
    7 / 8
    ఆధునిక అన్వయం: సంబంధాలు స్వార్థంపై ఆధారపడితే అవి నిలవవు.“నువ్వు నాకు ఏం ఇస్తావు?” అన్న భావనకు బదులు. “నువ్వు ఉన్నావు కాబట్టి నేను సంపూర్ణుడిని” అన్న భావన రావాలి. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు మూలం అని విశ్లేషకులు అంటారు.
    మహిళా సాధికారత – మైత్రేయి ఆదర్శం. సంపదను తిరస్కరించింది. జ్ఞానాన్ని ఎంచుకుంది.గురువునే ప్రశ్నించింది.
    ఆధునిక మహిళలకు ఇది చెబుతున్న సందేశం. ఆర్థిక స్వావలంబన ముఖ్యం. కానీ బౌద్ధిక స్వాతంత్ర్యం మరింత ముఖ్యం. ప్రశ్నించే ధైర్యమే నిజమైన సాధికారత. ఆధునిక జీవితంలో ఆందోళన, ఒంటరితనం,అర్థశూన్యత పెరుగుతున్నాయి.
    మైత్రేయి దృష్టిలోని పరిష్కారం. ఆత్మపరిశీలన, మౌనం, లోపలి అవగాహన.ఇవే నేటి mindfulness, self-awareness భావనలకు మూలం. మైత్రేయి తత్త్వం – ఒక వాక్యంలో “బయట సంపాదించేది జీవితం; లోపల తెలుసుకునేది జీవనార్థం.” మైత్రేయి జీవితం మనకు చెబుతున్నది ఒకే ఒక్క సత్యం: “ధనం జీవనానికి అవసరం; జ్ఞానం జీవనార్థానికి అవసరం.” ఈ సత్యం కాలాతీతం. వేదకాలంలో ఎంత నిజమో, ఈ ఆధునిక యుగంలో కూడా అంతే నిజం.
    మైత్రేయి మన ఆధునిక పండితుల దృష్టిలో కూడా మహోన్నత స్త్రీ అయింది.
    మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఎస్. రాధాకృష్ణన్ గారు మైత్రేయి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు.
    “Vedanta begins with questions like Maitreyi’s.”
    “మైత్రేయి అడిగిన ప్రశ్నలతోనే వేదాంతం ప్రారంభమవుతుంది.” అని చెప్పొచ్చునంటారాయన.
    ఫ్రెడ్రిక్ మాక్స్ ముల్లర్ (Friedrich Max Müller).ఆయన ఒక జర్మన్ మూలాలున్న భాషావేత్త, సంస్కృత పండితుడు, తత్వవేత్త. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, భారతీయ తత్వశాస్త్రంను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ విద్వాంసుడు. ఋగ్వేదాన్ని సంపాదించి, విమర్శాత్మకంగా సవరించి ప్రచురించిన తొలి పండితుల్లో ఒకరు. అంతటి ప్రముఖుడు మన మైత్రేయిని శ్లాఘిస్తూ ఇలా అన్నారు.
    “Maitreyi is the philosophical conscience of the Upanishads.”
    “ఉపనిషత్తుల తాత్విక అంతఃసాక్షి మైత్రేయి.”
    భారత దేశానికి చెందిన ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ మైత్రేయి గురించి చెబుతూ “Her dialogue shows complete intellectual equality.” “ఆమె సంభాషణ సంపూర్ణమైన మేధో సమానత్వాన్ని ప్రతిబింబిస్తుంది.” అన్నారు.
    8 / 8
    ఇంతటి గొప్ప వ్యక్తుల ప్రశంసలను పొందిన మైత్రేయి నిజంగా స్త్రీ శక్తికి నిదర్శనమని, ప్రశ్నించే హక్కు మహిళలకూ ఉందని మనందరికి మార్గదర్శిగా ఆకాలంలోనే మనకు బాట వేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనిపిస్తుంది.
    భారతీయ తత్త్వచింతనలో తొలి స్త్రీ తత్వవేత్తలలో ఒకరు. స్త్రీ విద్య, తత్త్వచింతనకు ఆదర్శం. నేటికీ పుస్తకాలు, వ్యాసాలు, నాటకాల్లో ప్రేరణగా నిలుస్తుంది. మైత్రేయి ‘ధనం కాదు, జ్ఞానమే అమృతత్వం’ అని లోకానికి చెప్పిన మహాస్త్రీ. స్త్రీ జ్ఞానానికి ప్రతీక, భారతీయ తత్త్వచింతనలో తొలి స్త్రీ స్వరం, నేటికీ స్త్రీ విముక్తి, విద్యా ఉద్యమాలకు ప్రేరణ ఇవే ఆమె వారసత్వంగా నిలుస్తాయని చెబుతారు.
    మైత్రేయి వేదాంత తత్వంలో ఒక మహానుభావి.
January 29, 2026 5 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భృూణహత్య (అనుకున్నావు….కానీ…)

by Kayita Anusha January 29, 2026
written by Kayita Anusha

కలకాలం ఆనందంగా బ్రతుకుదామనుకున్నావు నీవు,
కానీ నువ్వు గ్రహించలేదు, కడుపులోవున్నపుడే కత్తుల హత్యకి బలౌతవని…
నీ జన్మని ఈ భూదేవితో బంధం ఏర్పడుచుకోవాలకున్నావు నువ్వు
కానీ నీవు అనుకోలేదు, నీ పాదం ఈ భూమి పై ఏ ఒక్క అణువుతో సంబంధం కుదుర్చుకోలేదని …
కడుపులోవున్నపుడే ఈ లోకాన్ని కొత్తకోణం లో చూద్దామనుకున్నావు నీవు,
కానీ నీకు తెలియదు గర్భం దాటి లోకాన్ని చూడలేవని…
నీవు ఊహించలేదు నీ జీవితాన్ని మంచి జ్యోతి లా నిలిపేవాళ్ళే,
ఒక్క నిమిషం లో నీ జీవితాన్ని ఆర్పేయడానికి సిద్ధం అవుతారని…
కానీ ఇప్పుడు అర్థం అర్థమౌతుంది, నీ పాదం తో ఈ స్పృష్టి పులకరించాల్సిన స్థితి నుండి ఇప్పుడు నీ పిండ రూపాన్ని కడుపులోనే కనుమరుగు చేసే స్థితికి ఈ లోకం దిగజారిపోయిందని…
చివరికి నీకూ తెలిసిపోయింది,
ఇక ఈ జన్మకి నీకు సెలవని…

January 29, 2026 7 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కాల స్రవంతి

by mayuukha January 29, 2026
written by mayuukha

కాల గమనం
రేయింబవళ్ళ సూర్యచంద్రుల
యానం
కాల గమనంలో మలుపులు
కాలక్రమంలో అవి
అదృష్టాల పిలుపులు!
నేడుకు
నిన్నటి మాపు ఒక ఊపు
నేటి ఊపులు
రేపటి ఊహల చూపులు!
క్షణం క్షణం కరిగిపోయే కాలాన్ని
అనుక్షణం ఆస్వాదించు
కాలం ఒక ప్రవాహం అయితే
నీ జీవన స్రవంతిలో నీవు సాగు
కాలం ఓ ప్రయాణం అయితే
నీ గమ్యం చేర్చే దారిలో
నలుగురితో కలిసి ఏగు!
కాలం ఓ తెల్ల కాగితం అయితే
హృదయాన్ని ఆవిష్కరించుకో!
కాల స్రవంతి లో జీవితం తంతు
కలకాలం జీవించు నీ వంతు
కాలం కర్మం కలిసి వస్తే
అదృష్టం నట్టింటికి నడిచి వస్తుంది !
విరాట్ స్వరూపమైన కాలం
విశ్వ సమస్తానికి మూలం !
కాలం ఊరికే ఉండదు ఉండనీయదు
ఏదో ఒకటి జరిపిస్తనే ఉంటది
వృధా గా గడిపేయకు
మానవత్వానికి వన్నెలద్దు!
కాలం తీర్పు విలక్షణ మార్పు
అది చేర్పుల, తీసివేతల కూర్పు!
కాలం దిక్కు చూడకుంటే చిక్కు
కాలంలో బ్రతికే కాయాలు సృక్కు!
కాల…

January 29, 2026 9 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us