మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
Uncategorized

మనోరంజకం ( కథ)

by mayuukha May 30, 2026
written by mayuukha

“ఏమోయ్! ఎక్కడా ? ఫోన్లో అమ్మాయి మాట్లాడుతున్నది. త్వరగారా! “
నారాయణరావు అరుపుకు, ‘వారం అయింది అమ్మాయి ఫోన్ చేసి ఎందుకు చేయలేదో మరి‘
అనుకుంటూ అదే ఆలోచనలో కాఫీ కలుపుతూ ఉన్న సునీత,భర్త పిలుపుతో
“ఆ! వచ్చే, వచ్చే” తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది.
“ఇదిగో, మాట్లాడు ” అంటూ, నారాయణ రావు ఫోన్ భార్యకు అందించాడు.
“ఆ! శ్రీలు ఎలా ఉన్నారు? “
“అంతా బాగానే ఉన్నామమ్మా, కొత్త ఉద్యోగం కొంచెం పని ఎక్కువగానే ఉంటున్నది, నేను ఫ్రీ అయిన టైంలో మీకు అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేస్తే కంగారు పడతారని చేయలేదు అలా వారం గడిచిపోయిందమ్మా “
‘’ అలా కాదు శ్రీలు ఏ టైం అయినా పర్వాలేదు ఒక్కసారి పలకరించావంటే స్థిమితంగా ఉంటాము సరేనా తల్లీ!”
“అలాగే అమ్మా, ఈ సమ్మర్ లో ఇండియాకు రావాలని ప్లాన్ చేస్తున్నామమ్మా …. డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వివరంగా చెప్తాను. “
“అవునా, చాలా సంతోషం శ్రీలు.ఎండలు ముదరకముందే వచ్చేందుకు చూడండి. అలాగే నీకేం కావాలో కూడా ముందుగానే చెప్పు వచ్చినప్పటినుండి పరుగులే మీకు. పాప ఎలా ఉంది. అల్లుడు గారు బాగున్నారు కదా, అత్తమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? మనవాళ్లంతా క్షేమమే కదా! “
“అందరం బాగున్నామమ్మా. ఈయన వర్క్ లో చాలా బిజీగా ఉంటున్నారు. పాప బాగుంది. త్వరలో చూస్తారు కదా.
మనవాళ్ళందరిని కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాయనమ్మ తాతయ్య ఎలా ఉన్నారు?”
“తాతయ్య పరవాలేదు శ్రీలు. నాయనమ్మ ఆరోగ్యం తరచూ ఇబ్బంది పెడుతున్నది. ఆ గది దగ్గరకే వెళుతున్నాను పలకరించుకో చాలా సంతోషపడతారు”
మామగారికి ఫోన్ ఇచ్చి సగంలో వదిలేసిన కాఫీపని చూసేందుకు సునీత వంటగది వైపు కదిలింది.
“మధ్యాహ్నం భోజనాల తర్వాత అందరo హాల్లో కూర్చున్నపుడు. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందోనని నన్ను కనిపెట్టుకొనుoటూ, ఎక్కడికి కదలలేకున్నారు మీరు. పిల్లదాన్ని చూసి రెండేళ్లు దాటింది, ఫోనులో మాట్లాడుతున్నా, వీడియోలో చూస్తున్న, దగ్గరకు చేర్చుకోవాలన్న తపన తీరడం లేదు. దాని బిడ్డకు కూడా ఏ అచ్చట ముచ్చట తీర్చలేక పోతున్నాము.”
అంటూ అత్తయ్య బాధపడుతుంటే,
“అమ్మా!ఊరుకో, ఆ వెలితి తీర్చేందుకే నీ మనవరాలు వస్తున్నానని చెప్పింది కదా, నీ ఆయాసం అంతా ‘వూష్ కాకి ‘ అయిపోయి, చక చకా లేచి తిరుగుతావు చూడు.”
అంటూ మావారు ఉడికించారు. మావయ్య నవ్వుతూ చూస్తున్నారు.
శ్రీ లాస్య మా ఏకైక సంతానం. అల్లారుముద్దుగా పెరిగింది. అపురూప లావణ్యం అందమైన మనసున్న తనంటే మా బంధు వర్గానికి అంతా కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. అనుకోకుండా వచ్చిన సంబంధం, అందరికీ నచ్చినప్పటికీ, అమెరికా అనేసరికి, అంత దూరమా అని ఆగిపోయాము. కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి,
“అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఈడు జోడు కూడా చక్కగా కుదిరింది. అమ్మాయిని గురించి మీరు దిగులు పడకండి. మా ఇద్దరు పిల్లలు వసుధ, కృష్ణ చైతన్య ఇద్దరూ అట్లాంటాలో ఉంటారు. మీకు తెలుసు మా అమ్మాయికి పెళ్లయి ఇద్దరు పిల్లలు. మేము వారికిఐదారు గంటల ప్రయాణ దూరంలో సిన్సినాటిలో స్థిరపడ్డాము. తరచూ కలుస్తుంటాము. మా బంధు బలగమంతా కూడా అమెరికాలోనే ఉన్నారు.”
అంటూ మాకు నచ్చచెప్పి శుభస్య శీఘ్రం అనిపించారు. పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా, తప్పదు కదా అలవాటు పడ్డాము. ఏడాదికి ఒకసారి తను రావడమో మేం వెళ్లడమో జరుగుతుండటం, శ్రీలు డెలివరీ సమయంలో అక్కడే ఆరు నెలలు ఉన్నాము . పాపకిప్పుడు ఐదేళ్లు. మా అత్తయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత రెండేళ్లుగా మేము వెళ్లలేకపోయాము, ఉద్యోగాల మార్పులు,’ వీసా’ ప్రాబ్లమ్స్ తో శ్రీలు వాళ్ళు కూడా రాలేకపోయారు. ప్రొద్దున మాట్లాడినప్పటినుండి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుత పడుతున్నాము.

తీరా శ్రీలు వాళ్ళు వస్తున్న రోజు దగ్గర పడుతున్న కొద్ది మనోబలం కంటే మించింది లేదు అన్నట్లు మంచంపై నుండి కాలుకింద పెట్టేందుకు ఆయాస పడుతూ ఇబ్బంది పడుతున్న మా అత్తయ్య, మావారు అన్నట్లుగానే ఉత్సాహంగా ఆ పని ఈ పని అందుకుంటూ హడావిడి పడసాగారు.
“సునీతా, ఎలాగూ శ్రీలు వాళ్ళు శ్రీరామనవమికి ఇక్కడే ఉంటారు కనుక, మనవాళ్లందరినీ ఇక్కడికే రమ్మని చెబుదాము. అందరం ఒకచోట కలిసినట్లు ఉంటుంది. పైగా శ్రీలు వాళ్లు కూడా ఎండలకు తిరిగే పని తప్పుతుంది ఏమంటావు? “
అన్నాడు నారాయణరావు. ఈ ఆలోచన బాగుందనిపించింది అందరికీ. అలాగే చేద్దాం అనుకున్నాము. మా పుట్టిల్లు, మా ఆడపడుచులు అందరివి,మాఊరుకి యాభై కిలోమీటర్ల దూరాల్లో ఊర్లే. అదీ కాక,మాఊర్లో ప్రసిద్ధి పొందిన రామాలయం, శివాలయాలు ఉన్నాయి. శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు కనుక చుట్టుపక్కల గ్రామాల నుండి అందరు కూడా ఇక్కడకు చేరుతారు.

పండక్కు వారం ముందుగా శ్రీలు, మా అల్లుడుగారు కృష్ణచైతన్య, పాప వచ్చారు. శ్రీలును దగ్గరకు తీసుకుని అత్తయ్య ఆపుకోలేక ఏడ్చేశారు . నా కళ్ళల్లో తడి గుండెల్లో భారాన్ని తగ్గించింది. మావారి పరిస్థితి,మామయ్య స్థితి కూడాఅంతే. అల్లుడు గారిని సాదరంగా పలకరించుకుని దగ్గరకు తీసుకున్నారు. పాప పేరు శ్రీనిధి అమ్మానాన్నల అందమంతా పుణికి పుచ్చుకొని కుందనపు బొమ్మలా ఉంది. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నది దాంతో జేజవ్వ తాతయ్యల మురిపాలకు పొద్దు చాలడం లేదు, కథలు చెప్పమంటూ పాపవారిని వదలడం లేదు కూడా .

మరో రెండు రోజులకు బంధువులందరూ కూడా వచ్చేశారు. వాళ్ళ ఇళ్ళకు పిలిచి భోజనం పెట్టి పంపలేదు అన్న కొరత అందరిలో ఉన్నా, వచ్చిన మూడు వారాలకు అందులో ఎండలకు ఇబ్బంది పడతారని అందరూ ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. తన వయసు పిల్లలతో నిధి కూడా బాగా కలిసిపోయి ఆడుకుంటున్నది.
అల్లుడుగారు కూడా కొత్త పాత లేకుండా మొదటి నుండి అందరితో కలిసి పోయారు. శ్రీలు అత్తగారు మాకు, బంధువులందరికీ కూడా పేరుపేరునా బహుమతులు పంపించారు.

శ్రీరామనవమి పండుగ సంబరాలకు దేవాలయాల ముందు,ఇళ్ల ముందు తాటాకు చలువ పందిళ్లు వేసి, మామిడి తోరణాలు కట్టి ఊరును ముస్తాబు చేస్తారు. రంగులు రాట్నాలు, రకరకాల అంగళ్ళు, సందడి చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు పీచు మిఠాయితో చేతికి వాచీలు, ఉంగరాలు పెట్టించుకుని అవి(నాక్కుంటూ) రుచిచూస్తూ తిరగడం, రకరకాల ఆట బొమ్మలు, గాలి బుడగలుకొనడం సరదాలు. అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టి పెద్దపెద్ద కుండలలో తాగే నీరు,మజ్జిగ, పానకం సిద్ధం చేస్తారు. వేడిని తగ్గించే పానకం, వడపప్పు ఈ పండుగ ముఖ్య ప్రసాదాలు. పొద్దున్నే అందరo స్నానపానాదులు, పూజా కార్యక్రమాలు, ముగించుకుని దేవాలయానికి బయలుదేరాము. కన్నుల పండువగా జరిగిన సీతారామ కళ్యాణం చూసి తరించి కల్యాణ అక్షింతలు తలపై చల్లుకొని,కొన్ని అక్షింతలు శ్రీలు వాళ్ళతోఅమెరికా పంపేoదుకు తీసుకొని ఇంటికి చేరాము.

ఆరోజు రాత్రి ఆరు బయట చల్లగాలికి మధ్య మధ్యలో విసన కర్రలతో విసురుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు, రోజంతా పండుగ సందడిని గమనిస్తూ ఉన్న నిధి,జేజి తాతయ్య ఒడిలో కూర్చుని ,

“తాతయ్యా! శ్రీరామనవమి అంటే ఏంటి ” అని అడిగింది.
“రాముడు పుట్టినరోజు తల్లీ” అంటూ పెద్ద వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పే పండుగ విశేషాలు వినాలని అందరం మాటలు ఆపి కుతూహలంగా కూర్చున్నాము.
నిధి తలనిమురుతూ నీలాగ’ రామ ‘అనే పేరును కూడా పలుకలేని అడవిలో పక్షులను జంతువులను చంపుకుని తింటూ బ్రతికే ఒక బోయవానికి, నారాయణ నామాన్ని పలుకుతూ నారదముని కనిపించి, ఇలా ప్రాణులను చంపడం పాపమని చెప్పి’ మరా ‘ మరా’ అని పలికించి నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేవరకు ఇలాగే పలుకుతూ ఉండాలని చెప్పి వెళ్ళాడట. ఆ బోయవాడు ముని చెప్పినట్లు మరా, మరా అని చెబుతూ అక్కడే కూర్చుండిపోయాడు అంట. అదే రామ రామ అనే శబ్దంగా వినిపిస్తూ, ఆ బోయవాడు వాల్మీకి మహర్షిగా మారిపోయి మనందరికీ శ్రీరామ కథను చెప్పాడు తల్లి. రాముడు నీలాగా చాలామంచివాడు, ఎంతో బుద్ధిమంతుడు, అందరి పట్ల దయతో ఉండేవాడని చెబుతూ, రామచంద్రుని జననం, సీతా కళ్యాణం, వనవాసం, రామ భక్తుడైన హనుమంతుని గురించి,రావణ సంహారం, రామ పట్టాభిషేకం, లవకుశల జననం, అవతార సమాప్తి. ఒక్కొక్క ఘట్టాన్ని, వింటూ అందరం రామ కథలో, లీ నమైపోయాము. అందరి కళ్ల వెంట కన్నీళ్లు కారుతున్నాయి.
రాముడు లేడా!వెక్కి వెక్కి ఏడుస్తున్న నిధిని, సముదాయిస్తూ, రాముడు ఎక్కడికి వెళ్లిపోలేదు తల్లి మనతోనే ఉన్నా డు. రామ అని పలికితే హనుమంతుడు కూడా మన పక్కనే ఉంటాడు. అలా అయితే తాతయ్యా!రాముడిని పిలుస్తూ హనుమంతుని నా పక్కనే ఉంచుకుంటాను. అని చెబుతుంటే దాని బుద్ధి సూక్ష్మతకు, విశ్వాసానికి అందరం క్షణం సేపు నివ్వెర పోయాము.

తాతయ్య అందరి వైపు చూస్తూ, పదిపాకలున్న పల్లైనా రామాలయం తప్పక ఉంటుందన్నది మనమెరిగిన విషయమే కదా! సాయంత్రాలు తప్పనిసరిగా పిల్లలతో కలసి ,ఊరి వారందరూ అక్కడ చేరి రామ భజన చేస్తారు.
ఏ మహిమలు చూపని మనుజావతారం రామావతారం. రాజు గా ప్రజల పట్ల బాధ్యత, తల్లిదండ్రుల పట్ల విధేయత, భార్యాభర్తల అనుబంధం, సోదరులపట్ల అనురాగం, ఆశ్రమ వాసుల పట్ల రక్షణ, స్నేహ ధర్మం, శరణన్న శత్రువునైన క్షమించగలిగే ఔదార్యం. మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు. తాను నడిచి చూపి,మన జీవితాలకు ఆదర్శంగా నిలిచాడు. అందరి నాలుకలపై పలుకు తేనెలు కురిపించే రామనామం మన బతుకునావను ఆత్మస్థైర్యంతో నడిపే శక్తినిస్తూ ఒడ్డుకు చేరుస్తుంది.
శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రంకర్కాటక లగ్నం లో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు. శ్రీరాముని జన్మదినంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం కూడా నవమినాడే జరిగిందని ఆ రోజే కళ్యాణం కూడా జరుపుతారు, వనవాసానంతరం పట్టాభిషిక్తుడు అయ్యిందికూడా నవమినాడే అని చెప్తారు. రామ పట్టాభిషేకం పటoలేని, ఇల్లుఉండదు. పూజామందిరమూ ఉండదు. ముఖ్యంగా పెళ్లిళ్లలో,సీతా సమేతుడై, సింహాసనం పై కూర్చుని, సోదరులను, హనుమంతుని, సకల దేవతలను కూడిన శ్రీరామచంద్రుని తప్పక పూజిస్తాము.
శ్రీరామనవమి పండుగ మన తెలుగు లోగిళ్ళలో వసంతోత్సవం పేరిట తొమ్మిది రోజులు చాలా వైభవంగా జరుపుకుంటాము. మార్చి అంటే ఎండలు మొదలవుతాయి కాబట్టి వడపప్పు, మిరియాలు వేసిన బెల్లo పానకం, ప్రసాదంగా పంచి పెడతారు. వడపప్పు పానకం చలువనిచ్చి సేద తీరుస్తాయి. విసెన కర్రలు కూడా పంచుతారు. దేవాలయాల్లో ముఖ్యంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. గత ఏడాది మనమంతా భద్రాచలం వెళ్లి కళ్యాణం చూసి వచ్చాము కదా అంటూ తాతయ్యగుర్తు చేస్తూ, శ్రీరామ రామరామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే అని మూడుసార్లు పలికించి కళ్యాణ అక్షతలు అందరిపై చల్లాడు.

    ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోయారు.శ్రీలు వాళ్ళు ఊరికి వెళ్లే రోజు వచ్చింది. అందరి మనసులు భారంగా ఉన్నాయి అయినా, అక్కడ వాళ్లు దేనికి కొరత పడకూడదని, పచ్చళ్ళు, ఊరగాయలు, పొడులు,చిరు తిండ్లు. అన్నీ హాలంతా పరుచుకున్నాయి., ఇంకా బంధువులు ఇచ్చిన గిఫ్టులు, శ్రీలు అత్త,ఆడపడుచుల కొరకు మేం పంపుతున్న ప్రత్యేక బహుమతులు. ఇవన్నీచూస్తూ చైతన్య మేము తీసుకెళ్లేందుకేనా, విమానం సరిపోతుందా! అంటూ నవ్వుతుంటే! చూసేందుకు అలా అనిపిస్తుంది కానీ, తలా కాసింత పంచుకుంటే పూర్తిగా సరిపోవు కూడా అంటూ మా అత్తయ్య తనే స్వయంగా సర్దుతూ చెబుతుంటే, ఆమెను నొప్పించకూడదని మీరన్నది నిజమే అమ్మమ్మ, తనూ సూట్ కేసులు సర్దేందుకు కూర్చున్నాడు కృష్ణ చైతన్య. శ్రీలు వస్తానని ఫోన్లో చెప్పిన రోజు నుండి ఇప్పటివరకు మా అత్తయ్యేనా అని అబ్బురపరుస్తూ మందులకు మించిన శక్తి మనసుకు ఉందేమో అనిపిస్తున్నది.
    ఈసారి పాప కూడా బాగా చేరిక అయ్యి విడవలేకున్నాము. అయినా పసిది బెంగ పడుతుందని నిబ్బరంగామళ్లీ వాళ్లు రాబోయే రోజు కొరకు ఎదురు చూస్తూ అందరం మామూలుగా మసలాము. మనోరంజకమైన మన పండుగ పరమార్థం తెలుసుకున్న మనుమరాలు మరో దేశం వెళ్ళింది

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    ప్రేమ ఖరీదు.

    by Thatikola Padmavathi May 30, 2026
    written by Thatikola Padmavathi

    మాధవరావుకి ఇద్దరు ఆడపిల్లలే. ఉన్నంతలోనే పెద్ద కూతురు ఆరాధ్యకు డిగ్రీ వరకు చదువు చెప్పించాడు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
    “ఆరాధ్యకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఇంకా పై చదువులు చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అప్పటివరకు పెళ్లి చేసుకోను అన్నది.
    “నీకు ఇంకా పై చదువులు చెప్పిస్తే నీకన్నా ఆపై ఎక్కువగా చదువుకున్న వాడిని తీసుకురావాలి. నీ చెల్లెలు శాంతి ఇంటర్లో ఉన్నది. దానికి కూడా డిగ్రీ పూర్తి చేయించాలి.
    “నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అక్కడికి మా బాధ్యత సగం తీరిపోయినట్లు ఉంటుంది అన్నారు మాధవరావు.
    “నాకు ఇష్టం లేకుండా మీరు సంబంధాలేవి చూడకండి. నేను చేసుకోనని గట్టిగా చెప్పేసింది ఆరాధ్య.
    “పెళ్లి చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు. ఉద్యోగం కూడా చేయొచ్చు. పెళ్లికి దీనికి ముడి పెట్టవద్దన్న ఆరాధ్య వినలేదు.
    “దాని కర్మ మనమేం చేస్తామని ఊరుకున్నారు. ఆరాధ్య ఎంబీఏ లో చేరింది. డిగ్రీలో పరిచయమైన విశ్వం ఆరాధ్యను ప్రేమిస్తున్నాడు. ఉద్యోగాలు వచ్చాక ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అందుకే ఆరాధ్య పెళ్లికి అడ్డు చెప్పింది.
    “నాలుగేళ్లు వాళ్ళ ప్రేమను గోప్యంగా దాచి పెట్టారు. ఆరాధ్య చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగంలో చేరింది.
    “ఆరు నెలలు గడిచిన విశ్వానికి ఉద్యోగం దొరకలేదు.
    “విశ్వం పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఇప్పుడు కాదంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నది ఆరాధ్య.
    “ఒకరోజు నిలదీసి అడిగేసరికి ఉద్యోగం లేని వాడికి ఇంటి అల్లుడుగా మా వాళ్ళు ఒప్పుకోరు అంది.
    “మీ వాళ్ళు ఒప్పుకోరా! నీకే ఇష్టం లేదా! నువ్వు ఇదివరకులా నాతో ఫ్రీగా మాట్లాడటం లేదు. ఒకప్పుడు కాస్త సమయం దొరికితే చాలు సినిమాలకి షికారులకి తిరిగేవాళ్ళం. నీకు ఉద్యోగం వచ్చాక మనిద్దరి మధ్య ఎడబాటు పెరిగింది. నీ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పమన్నాడు విశ్వం.
    “నిజంగానే ఈమధ్య విశ్వం మీద ఆరాధ్యకు ప్రేమ తగ్గిపోయింది. తనకోసం మంచి మంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆస్తి అంతస్తులో విశ్వం కంటే గొప్ప వాళ్లే వస్తున్నారు.
    “ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మనిద్దరి కులాలు ఒకటి కావు. వాళ్లని ఎదిరించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నది.
    “ఆరాధ్య మనసులో ఉన్న మాటలు బయటపెట్టేసరికి విశ్వంకు కోపం వచ్చింది.
    “నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆరేళ్ల నుంచి నా చుట్టూ తిరిగి నాతో స్నేహం చేశావు. సినిమాలు షికార్లకు తిప్పి డబ్బు ఖర్చు పెట్టించావు. పుట్టినరోజు, పార్టీ లంటూ రెస్టారెంట్లకి తిప్పావు. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నావా! నీకు నా మీద ఉన్న ప్రేమంతా ఏమైపోయింది. నువ్వు కాదన్నా నేను వదిలేది లేదు. అనుకున్నట్లు మన పెళ్లి జరిగిపోవాల్సిందే అన్నాడు.
    “విశ్వం గట్టిగా అడిగేసరికి ఆరాధ్య అహం దెబ్బతిన్నది.
    “ఏంటి? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని రూలేమన్నా ఉన్నదా! అప్పటి పరిస్థితులు వేరు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ కలగడం లేదు. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. జరిగిందంతా మర్చిపోయి నువ్వు కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. అంతేకానీ నా పెళ్ళికి, నా సుఖానికి అడ్డు రావద్దు. కాదు కూడదని ఏమైనా ప్రయత్నం చేశావనుకో! నేనేం చేస్తానో అంటూ విశ్వాన్ని లెక్కచేయకుండా వెళ్లిపోయింది ఆరాధ్య.
    “ఎంత పొగరు! చూస్తా! ఎలా సుఖపడుతుందో నన్ను కాదని పెళ్లి చేసుకున్నా కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తానంటూ శపధం చేశాడు.
    “విశ్వం మాటలు పట్టించుకోలేదు ఆరాధ్య. అనుకున్నట్లుగానే ఆరాధ్య ఉద్యోగంలో చేరగానే గొప్ప గొప్ప పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. తనకంటే ఆస్తిపరుడు, ఎక్కువ జీతం సంపాదించే శేఖరంని చూసి ఇష్టపడింది. నిజంగా చెప్పాలంటే ఇది కూడా ప్రేమ వివాహమనే చెప్పాలి. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు. ఒక ముహూర్తాన ఇద్దరూ ఒకటయ్యారు.
    “మొదటి రాత్రి గదిలోకి వెళ్లి ఎదురుచూస్తున్నాడు శేఖరం. తెల్ల చీరలో అందంగా ముస్తాబై పాల గ్లాసు చేత పట్టుకొని సిగ్గుపడుతూ గదిలోకి అడుగు పెట్టింది ఆరాధ్య.
    “ఆమె చేతిలోని గ్లాసుని పక్కనపెట్టి రెండు భుజాలు పట్టుకొని మెల్లగా మంచం వైపు అడుగులు వేస్తూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు.
    సిగ్గుతో రెండు చేతులతో ముఖం కప్పుకుంది.
    “ఇదంతా సిగ్గేనా? ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు? ఆమె ముఖాన్ని చేతుల నుంచి తొలగించాడు.
    “ఈరోజు మన మొదటి రాత్రి”, మనసులు తనువులు పంచుకునే వేళ. మన మనసులు ఎటువంటి అరమరికలు ఉండకూడదు. మనసు విప్పి ఉన్న దున్నట్లు నిజం చెబితే మనిద్దరి మధ్య అపార్థాలకు తావుండదు. ఏమంటావు అన్నాడు శేఖరం.
    “మీరు చెప్పింది నిజమే! మీరు కూడా నా నుంచి ఎటువంటి నిజాలు దాయకూడ దన్నది ఆరాధ్య.
    “ఓకే! లేడీస్ ఫస్ట్ అన్నారు. ముందు నువ్వే చెప్పాలి అన్నాడు.
    “ఎందుకైనా మంచిది. ముందు చెబితే సరిపోతుంది. తర్వాత తెలిసినా ప్రమాదం ఉండదనుకొని ఆరాధ్య విశ్వంతో నడిపిన ప్రేమాయణం మొత్తం చెప్పేసింది.
    “నాకు లాగానే నీకు కూడా లవ్ ఎఫైర్ ఉందన్నమాట”
    “అంటే మీ వెంట కూడా అమ్మాయిలు వెంటపడేవారా?
    “ఏం! ఎందుకు పడరు. అందుట్లో నేను అందగాడిని! నావైపు ఆశగా చూసేవాళ్ళు వున్నారు.
    “మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా! మీరే ప్రేమించారా?
    “నేనైతే ఎవరిని ప్రేమించలేదు. ఒక అమ్మాయి మాత్రం నా వెంటపడి ప్రేమించింది. ఇప్పటికీ నా మనసులోనే ఉందనుకో!
    “మీ మనసులో ఆ అమ్మాయి నుంచు కొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆ పిల్లనే చేసుకోకపోయారా! అంటూ చిరు కోపం నటించింది.
    “ఈ బుంగమూతిలో నువ్వెంత అందంగా ఉన్నావో! చెప్పనా?
    “నా అందం సంగతి సరే! ముందు అమ్మాయి సంగతి చెప్పండి. మీ మనసు నుంచి ఆ అమ్మాయిని తీసేస్తేనే ఈరోజు మనం మొదటి రాత్రి జరుగుతుంది. లేకపోతే మీరక్కడ నేనిక్కడ అంటూ దూరం జరిగింది.
    “పిచ్చి పిల్లా! భర్త పరాయి స్త్రీని మనసులో దాచుకుంటే సహించలేని దానివి. నా మనసులో నువ్వు తప్ప రెండో వారికి స్థానం లేదు. నిన్ను ఆట పట్టించాలని అలా అన్నాను. అర్ధేచ కామేచ, మోక్షేచ, నాతిచరామి అంటూ నిన్ను పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నువ్వే నా భార్యవి. నువ్వే నా ప్రేయసివి కూడా. మాటలతోనే నిద్రపుచ్చుతావా! ముద్దు ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు శేఖరం.
    “వాళ్ళ వైవాహిక జీవితం ఆనంద సాగరంలో మునిగితేలుతున్నది.
    “జీవితం ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆరాధ్య ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
    “ఉన్నట్లుండి ఆరాధ్య జీవితంలోకి అనుకోని తుఫాను వచ్చి పడింది.
    “అర్ధరాత్రి 12 గంటలకి గాఢ నిద్రలో ఉన్నారు ఆరాధ్య ఆమె భర్త శేఖరం. ఫోన్ రింగ్ అయినా శబ్దం ఇద్దరికీ వినబడలేదు. రెండోసారి రింగ్ అయ్యేసరికి ఆరాధ్య కళ్ళు తెరిచి చూసింది. భర్త ఆదమరచి నిద్రపోతున్నాడు. మెల్లగా లేచి వెళ్లి కాల్ చూసింది. అంతే ఒక్కసారి ఆమె గుండె ఝల్లుమంది.
    “ఇతనా! ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు కాల్ చేసినట్లు. తిరిగి కాల్ చేయాలంటే భయం వేసింది. భర్తకి మెలకువ రాలేదు. అదే ఫోన్ మళ్ళీ రింగ్ అయింది.
    “లిఫ్ట్ చేయక తప్పలేదు. తన గొంతు తనకే వినబడనంతగా మెల్లగా ఎవరూ అన్నది.
    “నేనెవరో గుర్తుపట్టలేదా! గుర్తుపట్టిన ఎవరో తెలియనట్టు నటిస్తున్నావా! నేను నీ ప్రేమ పిపాసిని. నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను. నిన్ను నీడల్లే వెంటాడుతూనే ఉంటాను. ఎందుకంటే నీ మీద ప్రేమ అంత గొప్పది!
    “ఇంతకీ నీకేం కావాలి? నాకు పెళ్లయిన విషయం నీకు తెలుసు అనుకుంటాను. ఎప్పుడో మర్చిపోయిన నిన్ను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకెప్పుడూ ఫోన్ చేయకు అంటూ కట్ చేసింది.
    “ఏ.సి రూము అయినా ముఖమంత చెమటలు పడుతున్నాయి. శేఖరం లేవలేదు. బతికిపోయాననుకుని గుండెల మీద చెయ్యి వేసుకుంది. మంచం మీద పడుకున్నదన్న మాటే గాని నిద్ర పట్టడం లేదు. శేఖరం చూడలేదు చూసి ఉంటే ఏం జరిగేది?
    తన ఫోన్ నెంబర్ అతనికి ఎలా తెలుసు. అప్పటి పాత నెంబరు మార్చేసింది. అయినా ఫోన్ నెంబర్ తెలుసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకు చేసినట్టు. “బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడా! మళ్లీ చేసినప్పుడు చూసుకోవచ్చులే అని తనకు తానే ధైర్యం చెప్పుకోంది”.
    “తెల్లవారి లేచాక యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ పోతున్నది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించింది. భర్తకి బాక్స్ సర్దితను సర్దుకుంది. భార్యాభర్తలిద్దరు ఎవరి ఆఫీసులకు వాళ్ళు చేరుకున్నారు.
    ఆఫీసుకు వెళ్లిందన్న మాటే గాని వర్క్ చేయ బుద్ధి కాలేదు. మనసంతా చికాకుగా ఉంది. దానికి తోడు తలనొప్పి ఎక్కువైంది. సెలవు చెప్పి ఇంటికి వచ్చేసింది. ఎంత మర్చిపోదాం అనుకున్నా మనసులో భయం చోటుచేసుకుంది.
    “అది మొదలు ప్రతిరోజూ అర్ధరాత్రి పూట ఫోన్ రావడం ఆరాధ్య భయం భయంగా లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఆరోజు రాత్రి పది మిస్సిడ్ కాల్స్ వచ్చాయి. ఆరాధ్య గాఢ నిద్రలో మునిగి ఉంది.
    “కాల్ రాగానే శేఖరం లేచి లిఫ్ట్ చేశాడు. హలో నేను అడిగింది ఏం చేసావు? 10 లక్షలు ఇస్తానంటే ఓకే.! నా దగ్గర ఉన్న నీ వీడియోలు డిలీట్ చేస్తాను. అంత డబ్బు ఇవ్వలేకపోతే చెప్పు మీ ఆయన ఊర్లో లేనప్పుడు అప్పుడప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వెళ్తుంటాను. నాకు ఏదైనా పర్వాలేదు. నీకు ఏది ఇష్టమో చెప్పు. ఇంకా వెయిట్ చేయడం నావల్ల కాదంటున్నాడు.
    “హలో! మిస్టర్! నువ్వు చెప్పిన దాంట్లో నీకు ఏది ఇష్టమో చెప్పు ఆలోచిస్తాను అన్నారు శేఖరం.
    “ఓ! మీరే నా ఆరాధ్య భర్త. నా రెండు డిమాండ్స్ మీరు విన్నారు కదా. మీ ఆవిడ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. చూపించమంటారా అన్నాడు.
    “చూడు విశ్వం. నీ పేరు నీ కథంతా నాకు తెలుసు. ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతూ ప్రేమని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకునే వాడివి. ఆరాధ్య నాకు అంతా చెప్పింది. నీ దగ్గర వీడియోలు ఉన్నాయని నాకు తెలుసు. నీకు భార్య పిల్లలు ఉండే ఉంటారు. వాళ్లకోసం నువ్వేమైనా చేయగలవు. నేను కూడా అందుకు సిద్ధమే!
    “అయితే ఒక విషయం మనం డీల్ కుదుర్చుకునే ముందు నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు శేఖరం.
    “విశ్వం ఏమిటో చెప్పమన్నాడు.
    “ఆరాధ్య నువ్వు ప్రేమించుకున్నారని విషయం మా పెళ్ళికి ముందే అన్ని విషయాలు దాచకుండా నాకు చెప్పింది. ప్రేమించడం, ప్రేమించబడటం అనేవి వ్యక్తిత్వాన్ని బట్టి నచ్చుతాయి. బాధ్యతారహితంగా ప్రవర్తించే వాడిని ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటుంది. ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలి కానీ ద్వేషంతో వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూడకూడదు.
    “ప్రేమించబడిన వాళ్లు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ప్రేమంటే ఏమిటో తెలుసా? ప్రేమ విలువలతో కూడుకున్నది. దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, లైలా మజ్నుల ప్రేమ కథలు వినలేదా? పెద్దవాళ్లు అంగీకరించలేదని వాళ్ళ ప్రేమను త్యాగం చేసుకున్నారు. చివరికి చావుకు కూడా సిద్ధపడ్డారు. ప్రేమ కోసం కట్టుబాట్లలను పెంచుకొని పగ, ప్రతీకారాలు రగిలించుకోకుండా వాళ్ల ప్రేమకు సమాధులు కట్టుకున్నారు. పవిత్రమైన ప్రేమని ఆరాధించారు. ప్రేమించిన స్త్రీ కోసం వీడియోలు అడ్డం పెట్టుకుని ఏం సాధిస్తావు? పెళ్లయినాస్త్రీ జీవితాన్ని నాశనం చేసి అపవిత్రం చేస్తావా? లేకపోతే ప్రేమని డబ్బుతో కొనుక్కుంటావా?
    “ఆరాధ్య భర్తగా చెప్తున్నాను. కాదు కూడదని నీ డిమాండ్లకు లొంగి రాలేదని ప్రమాదం తలపెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ సహించను. చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుంది. ఒకసారి నీ భార్య పిల్లల్ని దృష్టిలో పెట్టుకో! మనసు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు శేఖరం.
    నీ ఆర్థిక అవసరాలకు ఏమైనా సాయం కావాలంటే అడుగు చేస్తానన్నాడు.
    “నాలుగు రోజుల తర్వాత పగటిపూట కాల్ చేశాడు విశ్వం. రాత్రివేళ కుదరదని పగలు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి వీడికి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందేనను కొన్నది ఆరాధ్య.
    “ఫోన్ లిఫ్ట్ చేయగానే సారీ ఆరాధ్య! నువ్వు చెప్పాలనుకున్న గుణపాఠం మీ వారు చెప్పారు. నా కళ్ళు తెరిపించారు. నువ్వెక్కడున్నా నీ సుఖమే కోరుకుంటాను. నా నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. నీ భర్త పిల్లలతో సుఖంగా ఉండమంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వం.
    “పక్కనే ఉండి అంతా విన్న శేఖరం అదంతా నేను చూసుకున్నాను. నీకేం భయం లేదంటూ ప్రేమగా భార్యని హృదయానికి హత్తుకున్నాడు.
    “ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో కోరుకుంటే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఆచితూచి అడుగులు వేయాలి అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు.

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    Uncategorized

    కాలభైరవాష్టమి ప్రాధాన్యత – విశ్వ నియమాల దృష్టి

    by mayuukha May 30, 2026
    written by mayuukha

    కాలాన్ని నియంత్రించే శక్తి కాలభైరవుడు. అశ్టమి తిథి ఆయనకు అత్యంత అనుకూలమైన శక్తి తరంగాలు ప్రసరించే సమయం. ఈ రెండూ కలిసినప్పుడు మనిషి జీవితంలో సమయం, కర్మ, శక్తి, భయం, అడ్డంకులు అన్నీ ప్రబలంగా మారుతాయి. ఈ రోజు విశ్వ నియమాలు అసాధారణంగా పనిచేస్తాయి.

    లా ఆఫ్ డివైన్ ఆనెస్స్ (ఐక్యత నియమం)
    కాలభైరవుడు కాలమనే విశ్వ శక్తి.
    అతనిని ఆరాధించడం అంటే మనలో ఉన్న కాల–ప్రజ్ఞను మేల్కొలపడం,
    మన శరీర రితువులతో (బయోలాజికల్ క్లాక్),
    మనసుతో, ఆత్మతో విశ్వప్రవాహం ఒకటిగా పనిచేసేలా చేయడం.
    అర్థం:
    ఈ రోజున చేసిన ధ్యానం మన అంతర్గత శక్తిని కాల ప్రవాహంతో కలుపుతుంది.
    తప్పిపోయిన సమయాన్ని తిరిగి సరి చేసుకునే అవగాహన వస్తుంది.

    1. లా ఆఫ్ వైబ్రేషన్ (కంపన నియమం)
      భైరవుడు అధిక తీవ్రత గల రక్షణాత్మక వైబ్రేషన్.
      అష్టమి తిథి చంద్రశక్తులు కూడా తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి పైకి లేవడం జరుగుతుంది.
      ఎందుకు ప్రభావం ఎక్కువ?
      ఈ రోజున భైరవ మంత్రం, భైరవ యంత్రం, ధ్యానం చేసినప్పుడు
      వైబ్రేషన్ శరీరంలోని
      మూలాధార
      స్వాధిష్ఠాన
      మనీపూర
      చక్రాలలోని భయాలు, అనిశ్చితి, గత కర్మ బంధాలు విడిచి పోతాయి.
    2. లా ఆఫ్ కార్మా (కర్మ నియమం)
      కాలభైరవుడు కాలాన్ని మాత్రమే కాదు, కర్మ ప్రవాహాన్ని కూడా నియంత్రించేవాడు.
      ఈ రోజున
      చేయబడిన శుద్ధి (repentance)
      చేసిన పూజ
      ఇచ్చిన దానం
      చేసిన సేవ
      కర్మఫలాన్ని సాధారణ దినాల కంటే వేగంగా ఇస్తుంది.
      అందుకే ఈ రోజున
      పాపాలు క్షమించబడతాయి,
      మనసు తేలిక అవుతుంది,
      కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
    3. లా ఆఫ్ అట్రాక్షన్ (ఆకర్షణ నియమం)
      ఈ రోజున మనస్సు భయంలేని స్థితికి చేరుతుంది.
      భయం తొలగితే ఆకర్షణ శక్తి పది రెట్లు పెరుగుతుంది.
      కాబట్టి ఈ రోజున:
      కోరికలు
      ధృడ సంకల్పాలు
      లక్ష్యాలు
      రక్షణ ప్రార్థనలు
      విశ్వానికి స్పష్టంగా చేరతాయి.
    4. లా ఆఫ్ యాక్షన్ (కార్య నియమం)
      భైరవుడు చర్య యొక్క దేవత.
      అంటే ఈ రోజున మనం మొదలు పెట్టిన పని
      ధైర్యం, స్పీడ్, నిర్ణయం అనే శక్తులతో నిండిపోతుంది.
      కాబట్టి ఈ రోజున:
      కొత్త వ్యాపారం
      కొత్త నిర్ణయం
      కొత్త సాధన
      కొత్త జీవన విధానం
      ప్రారంభించటం శుభం.
    5. లా ఆఫ్ కరెస్పాండెన్స్ (లోపలి – బయట సంబంధం)
      కాలభైరవాష్టమి రోజున లోపల ఉన్న భయాలు ప్రశాంతం అవుతాయి.
      లోపలి భయాలు తగ్గితే బయట జీవితం కూడా సరిగా నిలబడుతుంది.
      లోపల శాంతి = బయట రక్షణ
    6. షడ్చక్రాల దృష్టిలో ప్రాధాన్యత
      కాలభైరవుడు ప్రధానంగా మూలాధార చక్రం యొక్క అధిపతి.
      ఈ రోజున అయన శక్తి ప్రభావం పడేది:
    • మూలాధారము – భయం తొలగిస్తుంది
    • స్వాధిష్ఠానము – స్థిరత్వం ఇస్తుంది
    • మనీపూరము – ధైర్యం & నిర్ణయ శక్తి ఇస్తుంది
      ఈ రోజు ధ్యానం చేసినవారికి
      మానసిక దౌర్బల్యం తొలగి
      ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
    1. పంచభూతాల దృష్టిలో
      కాలభైరవుడు
      అగ్ని తత్త్వాన్ని శుద్ధి చేస్తాడు
      గాలి తత్త్వాన్ని సమసమానంగా చేస్తాడు
      భూమి తత్త్వాన్ని స్థిరపరుస్తాడు
      అంటే శరీరంలో
      వేడి
      ఒత్తిడి
      అలసట
      భయం
      తగ్గుతాయి.
    2. ఈ రోజున లభించే ఫలితాలు
      విశ్వ నియమాల ప్రకారం:
      గత కర్మాల శుద్ధి
      భయం, అడ్డంకుల తొలగింపు
      కోరికలు వేగంగా నెరవేరటం
      ఆర్థిక రక్షణ
      కుటుంబ రక్షణ
      చెడు శక్తుల నుండి విముక్తి
      మనసు–శరీరం సమతుల్యం
      ధైర్యం, స్పష్టత, నిర్ణయం
    3. ఆచరణ పద్ధతి (సరళమైనది)
    4. 8 దీపాలు వెలిగించండి (అష్టమి శక్తి)
    5. “ఓం కాళ భైరవాయ నమః” 108సార్లు చెప్పండి
    6. నువ్వుల నూనె దీపం వేయండి
    7. ఒక మంచి పని చేయండి (దానం, సేవ)
    8. రాత్రి ధ్యానం – 8 నిమిషాలు
      సారాంశం
      కాలభైరవాష్టమి అనేది ఒక ఇంటి పండుగ కాదు,
      ఒక దేవాలయ పూజ కాదు,
      ఇది కాలం – కర్మ – భయం – రక్షణ అన్న నాలుగు విశ్వ నియమాలు ఒకే స్థలం, ఒకే రోజున పనిచేసే సమయంలో నిర్మించిన విశ్వ శక్తి.
      ఈ శక్తిని గ్రహించినవారి జీవితం
      వేగంగా మారుతుంది,
      శుభ పథం లోకి వెళుతుంది,
      అడ్డంకులు చదరంగం లాంటి వేగంతో తొలగిపోతాయి.
    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    Uncategorized

    శాంతి ఓటమి కాదు!మానవజాతి విజయం!!

    by mayuukha May 30, 2026
    written by mayuukha

    మన పూర్వీకులు ఏదైనా మంచి ఆలోచన లేదా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే ఉగాది మరుసటి రోజు ఈ రోజునుండి దీన్ని ఆచరిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకునే వారు.(Resolution) వలె… ఆ పని మీదే ధ్యాస పెట్టి మరీ చేసేవారు.
    అలా మనం కూడా ప్రపంచ శాంతి కోరుకుంటూ ఆ దిశగా ఒకరికొకరం చెప్పుకుంటూనో? ఆచరిస్తూనో సాగుదాము.
    ప్రపంచ శాంతి అనే గొప్ప సంస్కారం మనకు మహాభారతం నుండి హిరోషిమా వరకు ఒక హెచ్చరిక చేసింది.
    ఈ విశాల భూమండలంలో మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు.కానీ అదే మనిషి, తన అహంకారంతో, తన కోపంతో, తన స్వార్థంతో…
    ప్రపంచాన్ని ఎన్నోసార్లు నాశనం అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇది చరిత్ర సాక్షిగా జరిగిన సత్యం.
    శాంతి అనేది ఒక పదం కాదు!అది మానవ జాతి నిలబెట్టే మూల స్తంభం.
    మన దేశ చరిత్ర లోని సంఘటనలు మనకెన్నో పాఠాలు చెప్పాయి….
    మహాభారతం ఇతిహాసమే తీసుకుంటే…..ఆ యుద్ధం ముందు వచ్చిన శాంతి కోసం ప్రయత్నాలెన్నో… అవకాశాలు అన్నన్ని…( కృష్ణ- సంజయ- రాయబారాలు; ధౌమ్య- వ్యాస-విదుర హితోక్తులు, మునుల సందేషాలు) అందుకే మహాభారతం ఒక గొప్ప అద్దంవంటిది.
    శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి దూతగా కౌరవుల దగ్గరకు వెళ్లి, పాండవులకు వారి కుటుంబాలను పోషించుకోవడానికి “ఐదు గ్రామాలు ఇవ్వండి” అని హితవు పలికాడు…రాయబారం నడిపాడు.కానీ దుర్యోధనుడు అహంకారంతో….
    సూది మొన ఆనేంతైనా భూమి ఇవ్వను” అన్నాడు.
    ఆ ఒక్క మాట —
    లక్షల ప్రాణాలను బలి తీసుకున్న యుద్ధానికి నాంది పలికింది.యుద్ధం ముగిసిన తర్వాత: ఏమైంది?
    గెలిచిన పాండవులు కూడా ఆనందించలేదు! కృష్ణుడికి గాంధారి శాపంతో బాధ మిగిలింది!
    కుటుంబాలు, రాజ్యాలు చిద్రమయ్యాయి
    మహాభారతం చెబుతున్నది స్పష్టంగా ఇదే:
    యుద్ధం గెలిచినా, జీవితం ఓడిపోతుంది.

    మరో ఉదాహరణ కూడా మనందరికీ తెలిసిందే!

    హిరోషిమా..సంఘటన ఎప్పుడో యుగాల కింద జరగలేదు! నిన్నా-మొన్నా ఆధునిక యుద్ధపు భయానక చిత్రం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది…పీడకలవలె ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన తరం నాకు చెప్పిన విషయాలు ఎన్నటికీ మరువలేను.ఇది కేవలం పురాణ కథ కాదు!మన ఆధునిక చరిత్ర కూడా ఇదే నిజాన్ని చెబుతోంది.
    1945లో, జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు పడింది.ఒక క్షణంలోలక్షల మంది ప్రాణాలు కోల్పోయారు;నగరం బూడిద కుప్ప అయింది. మరణించగా మిగిలినజీవించిన వారు జీవితాంతం బాధలు అనుభవించారు.చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు —అందరూ యుద్ధానికి బలయ్యారు.ఆ రోజు ప్రపంచం తెలుసుకున్నది…
    యుద్ధం అనేది శత్రువును కాదు, మానవత్వాన్ని నాశనం చేస్తుంది. అని…ఎంత నిజం.. కానీ ఏం లాభం? సమాజ హితైషులు అన్ని రంగాలలోని వారు గగ్గోలు పెట్టారు.శాంతి కావాలని, ఎవరికైనా మనదేశంలో జరగడం లేదు కదా? అనిపించవచ్చు! మనది వేద భూమి- కర్మభూమి.మన వేదం చెప్పిన విషయం వసుధైకకుటుంబకం అనే భావనలో జీవించాం! జీవిస్తున్నాం…ఇకముందు తరాలు కూడా జీవించేలా నేర్పాలి.
    ఐనా పక్కిల్లు కాలిపోతుంటే మన ఇంట్లో సుఖంగా ఉండగలమా? ఆ మంటల తాలూకు సెగలు మనకు సోకవా? పసిపిల్లల రోదనలు – అమాయక ప్రజల ఆక్రందనలు మనకు కూడుతిననిస్తాయా? కునుకు పట్ట నిస్తుందా ? ఆ వ్యర్ధాలతో వాయు- జల – వాతావరణ కాలుష్య మేర్పడదా? మన ఆరోగాయాలమీద ఆ మిసైళ్ళ తాలూకు- బాంబుల రసాయనాలు శారీరక- మానసిక రుగ్మతలు తెచ్చిపెట్టవా?
    ముందు మానవత్వం తో పక్కవాడి మేలు కోరుకుందాము! తర్వాత మనను మనం ప్రేమించుకుందాము! అందుకే దేశిధి నేతలు
    యుద్ధం – లాభనష్టాల బేరీజు వేసికొని,
    ప్రపంచ దేశాలు ఒకసారి ఆలోచించాలి!
    యుద్ధం వల్ల లాభం ఏమిటి? వస్తే కొంత భూభాగం వస్తుందేమో? లేదా ఆధిపత్యం వస్తే వస్తుంది కావచ్చు.అది కూడా తాత్కాలిక ఆధిపత్యమే!
    కానీ నష్టం ఏమిటి?
    అనేక ప్రాణాలు పోతాయి, అదికూడా అన్నెంపున్నెం ఎరుగని పౌరులు, పసివారు, ఆడవాళ్ళు…వీరికీ ఆ యుద్ధానికి సంబంధమే ఉండదు.ఐనా బలౌతారు…అనాధలౌతారు…ఒక తరం వెనుక బడుతుంది.ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి…సంవత్సరాల కొద్దీ నిర్మించుకొన్న భవనాలు కూలిపోతాయి, చారిత్రక సంబంధ ఆనవాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఆ దేశ – ప్రాంత అస్థిత్వమే కోల్పోతుంది
    ఆ జాతి. అదెంత నష్టమో ఆలోచించరా?
    భవిష్యత్ తరాలపై చెడు ప్రభావం ఆరోగ్య పరంగానూ, ఆ చేదు విషాదంతో మానసికంగానూ ఎంతగానో పడుతుంది.మనుషులు మృదుత్వం కోల్పోయి హృదయాలు కరుడుకట్టుతాయి . దాంతోమానవ విలువల పతనం ఔతుంది…కనుక
    యుద్ధం వల్ల లాభం తక్కువ నష్టం అంతులే నంత! అదే ప్రపంచంలో శాంతి ఉంటే:దేశాలు అభివృద్ధి చెందుతాయి;విద్య, వైద్యం, విజ్ఞానం పెరుగుతాయి!మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మన ప్రాచీన మహర్షులు చెప్పినట్లు:

    అహింసా పరమో ధర్మః”

    హింసను విడిచి శాంతిని ఆచరించడమే పరమ ధర్మం.
    చుట్టుపక్కల జరుగుతున్న భీకర యుద్ధ బీభత్సం చూసే పాలకులకు- ప్రభువులకు చీమ కుట్టినట్టైనా లేదా?

    మహాభారతం మనను హెచ్చరిస్తోంది…
    హిరోషిమా మనకు గుర్తుచేస్తోంది…

    యుద్ధం అనేది పరిష్కారం కాదు!
    శాంతి మాత్రమే శాశ్వత మార్గం! అని….

    కాబట్టి మనం, ఆ యా దేశాలు, వాటి నాయకులు
    అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి:
    అస్త్రాల కంటే ఆలోచనలు గొప్పవి”
    యుద్ధాల కంటే సంభాషణలు శ్రేష్ఠమైనవి.”
    ప్రపంచ ప్రజలంతా కలసి అనుకోవాలి! సమాజ హితైషులంతా కలిసి అహింసా- శాంతి నినాదాన్ని యుద్ధకాముకులదాకా చేరవేయాలి…
    దుష్టులను శిక్షించండి! కాదనము! కానీ శిష్టులను రక్షించే మరో కృష్ణులు కమ్మని మాత్రమే కోరుకుంటూ… ఎలుక చొచ్చిందని ఇల్లు తగుల బెట్టుకోనవసరం లేదుకదా? ఎలుకలను ఏరిపారేయండి! ఏమీ తెలియని అమాయకులను బలిచేయకండి!

    “ప్రపంచం యుద్ధ రహితంగా ఉండాలి*… శాంతి పతాకం ఎల్లప్పుడూ ఎగరాలి!”

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    గతమెంతో ఘనము

    by Dr. G. Bavani Krishnamurty May 30, 2026
    written by Dr. G. Bavani Krishnamurty

    పరంధామయ్య, సుభద్రమ్మ రెండు రోజులు అయింది, కొడుకు దగ్గరకి వచ్చి. స్టేషన్నుంచి ఇంటికి తీసుకొచ్చి, ఆఫీసులో మీటింగ్ ఉందని వెంటనే వెళ్ళిపోయాడు కొడుకు సుధాకరం. ఇద్దరికీ టిఫిన్ పెట్టి, “భోజనం టేబుల్ మీద పెట్టాను. మీ టైముకి మీరు పెట్టుకుని తినండి అత్తయ్య… బాబుని స్కూల్ దగ్గర దింపి, నేనూ ఆఫిస్ కి వెళ్ళొస్తాను ” చెప్పి, హడావిడిగా వెళ్ళిపోయింది కోడలు కమల.
    సాయంత్రం వరకూ ఇద్దరూ మాటలు రాని బొమ్మల్లా కూర్చున్నారు.
    ఆరుగంటలకి కోడలు మనవడిని తీసుకుని వచ్చింది.
    వాడికి పాలు తాగించి,అదే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉన్న ట్యూషన్ కి తీసికెళ్లి దిగబెట్టి వచ్చింది.
    బట్టలు మార్చుకుని నైటీ వేసుకుని, సెల్ లో మాట్లాడుతూ సోఫాలో కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఎదురుగా అత్త మామలున్నారన్న ధ్యాసకూడా లేకుండా కాలు ఊపుతూ మాట్లాడుతూనే ఉంది.
    ఎనిమిది అవుతుంటే, “డిన్నర్ టేబుల్ మీదుంది, మీకు ఆకలి అయినప్పుడు తినండి. నేనలా వెళ్ళి బాబుని ట్యూషన్ నుంచి తీసుకొస్తాను ” చెప్పి, తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది.
    తొమ్మిది అవుతుంటే వచ్చింది కోడలు కమల.
    కొడుక్కి తినిపిస్తూ “మీరు తినలేదేం?” అడిగింది.
    ‘”అబ్బాయి వచ్చాక తింటాo లేమ్మా ” అంది సుభద్రమ్మ.
    “సుధా వచ్చేసరికి లేట్ అవుతుందట. మిమ్మల్ని తినేసి పడుకోమన్నాడు”. హోటల్ నుంచి తెచ్చిన డిన్నర్ పేకెట్స్ విప్పి, ప్లేట్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చింది.
    బిర్యానీలో మసాలా, వెల్లుల్లి వాసన అలవాటు లేక పోవడంతో సుభద్రమ్మ “నాకంతగా ఆకలిగా లేదు ఇంతవద్దు తీసేయమ్మా “అని తనే కొద్దిగా ఉంచుకుని మిగిలినది బౌల్లో వేసేసింది. ఆ కాస్త తిన్నాననిపించి చేయి కడుక్కుంది. పరంధామయ్యకి సహించక పోయినా ఆకలికి ఆగలేక ముద్దకి ముంతడు నీళ్లు అన్నట్లు, ముద్ద నోట్లో పెట్టుకుని, నీళ్లు తాగి లోపలికి పంపాడు.
    ఇద్దరూపడుకున్నాక కొడుకు ఎప్పుడొచ్చాడో వారికి తెలియదు.
    ఉదయం ఇద్దరూ తొందరగానే లేచి, తయారై హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కొడుకు లేచి వస్తే మాట్లాడవచ్చు అనుకున్నారు.
    సుధాకరం ఎనిమిదిన్నర దాటాక బెడ్ రూమ్ లోనుంచి బయటికి వచ్చాడు. ఆఫీస్ కి వెళ్ళడానికి తయారై ఉన్నాడు.
    తల్లిదండ్రుల్ని చూసి, “బ్రేక్ఫాస్ట్ చేశారానాన్నా,? ” అడుగుతూనే, తనే డిష్ లో ఉన్న ఇడ్లి ప్లేట్ లో పెట్టుకుని తినడం మొదలు పెట్టాడు.
    కొడుకుతో కలిసి తిందామని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.
    కొడుకు, కోడలు మనవడిని తీసుకుని వెడుతూ “అత్తయ్యా!సుధా కి ఈ రోజు ఆఫీస్ లో లంచ్ ఉందట.నేనూ కేంటేన్ లో తినేస్తాను. మీరు ఏం కావాలో వoడుకుని తినేయండి.”సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయారిద్దరూ.
    పరoధామయ్య, సుభద్రమ్మ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
    –
    తను ఖమ్మం లో ఉద్యోగం చేసే రోజుల్లో మొదటిసారి అమ్మ నాన్న ఖమ్మం వచ్చినప్పుడు తను స్టేషన్ కి వెళ్ళి,వారిని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకొచ్చాడు.సుభద్ర ఎదురొచ్చి వారిని ప్రేమగా పలకరించి, అత్తగారి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. కుశల ప్రశ్నలు వేసి కాఫీ ఫలహారాలు అందించింది.
    ఆ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టేశాడు తను.
    లోపలికి వెళ్ళి “చూడు. అమ్మకి నాన్నకి ఏం కావాలో కనుక్కుని సమయానికి ఇవ్వు.భోజనంలోకి కూడా ఏం తింటారో కనుక్కుని చెయ్యి. నాన్న కారంకారంగా తింటారు. చూసి చెయ్యి తెలియకపోతే అమ్మని కనుక్కునిచెయ్యి ” చెప్పాడు.
    “ఆ విషయo మీరు ప్రత్యేకంగా చెప్పాలా? అదంతా నేనూ చూసుకుంటాను మీరు ఆఫీస్ కి వెళ్ళండి “అంది సుభద్ర.
    వాళ్ళు ఉన్న వారం రోజులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని తల్లిదండ్రులకి చెప్పి, వారిని జాగ్రత్త గా చూసుకోమని, వేళకి భోజనం పెట్టేయమని భార్యకి చెప్పి వెళ్ళేవాడు. సాయంకాలం వచ్చేటప్పుడు వారికి నచ్చిన ఉపాహారాలు, పళ్ళు తీసుకొచ్చి, ప్లేట్స్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చేవాడు
    రాత్రి భోజనాలు అయ్యాక నలుగురు కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునే వారు.
    “మీరిద్దరూ ఒంటరిగా అక్కడెoదుకు,?. ఇక్కడే మాతోపాటు ఉండిపోవచ్చుగా ” అంది సుభద్ర.
    “లేదులేమ్మా….. ఇంకా మాకు కాస్త ఓపిక ఉందిగా.. ఓపిక తగ్గితే మీ దగ్గరకే వస్తాం. మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? ” అన్నాడు తండ్రి.
    “అవునమ్మాయ్! మీకూ మొన్నీ మధ్యనేగా పెళ్లయింది. కొన్నాళ్ళు సరదాగా ఉండండి. పిల్లా పాప బయలుదేరితే మనవడితో ఆడుకోడానికి అప్పుడు వచ్చి ఉంటాములే.”అంది అత్తగారూ కోడలికి బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంటూ.
    ఇద్దరికీ బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీసులు తీసుకున్నారు.
    పరoధామయ్య కొంత డబ్బు తండ్రి చొక్కా జేబులో పెట్టి, “ఏవైనా ఖర్చులకి ఉంటాయి ” చెప్పాడు.
    “ఎందుకురా నాదగ్గర ఉన్నాయిలే “తండ్రి తియ్యబోతుంటే,”మీ దగ్గర లేవని కాదు, ఏదో నాతృప్తి కోసం ” తండ్రి చేతి మీద చెయ్యి వేసి ఆపాడు.
    వాళ్లిద్దరూ ప్రయాణమై వెడుతుంటే పరంధామయ్య, సుభద్ర కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు. స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కించి, ట్రైన్ కదిలే వరకు ఉండి వచ్చారు…..”తలుపు చప్పుడు అవుతుంటే
    ఆలోచనలనుంచి తేరుకొని తలుపు తెరిచింది సుభద్రమ్మ.
    కోడలు మనవడుని తీసుకుని వచ్చింది.
    ఆమె కాళ్లు కడుక్కుని డ్రెస్ మార్చుకుని వచ్చే వరకూ ఆగి,”అమ్మాయ్! మేము బయలుదేరుతున్నాం అబ్బాయి వచ్చాక చెప్పు.”బేగ్ తీసుకుని చెప్పారు.
    ” అదేంటీ, పది రోజులు ఉంటారని చెప్పాడు సుధా,…” మనసులో సంతోషంగా ఉన్నా, అయోమయం నటించిందికమల.
    “మరోసారి వస్తాం లేమ్మా,అయినా పిల్లాడికి సెలవులిచ్చినప్పుడు మీరే రండి. మేమిక్కడుంటే మీకూ ఇబ్బంది, మేమూ తిని కూర్చోవడం. అక్కడైతే గుడి, గోపురం, తెలిసినా వాళ్ళు రావడం, పోవడం . ఏదో కాలక్షేపం అయిపోతూo టుంది .”అన్నాడు పరoధామయ్య.
    కమల సెల్ తీసుకుని “సుధా!మీ అమ్మ, నాన్న వెళ్ళిపోతామంటున్నారు…” చెప్పింది.
    ” అప్పుడేనా? అదేంటి.. నిన్ననే కదా వచ్చారు, ఉదయం నాతో ఏమి చెప్పలేదు.
    ఉండమని చెప్పకపోయావా? ” “
    “… చెప్పాను వెళ్లాలట…..”
    “సరే! నాకు ఇప్పుడే రావడానికి కుదరదు.. దారిఖర్చులకి డబ్బులున్నాయో లేదో ? వెయ్యో, రెండూవేలో ఇచ్చి పంపించు ” చెప్పాడు.
    వెయ్యి రూపాయలు తెచ్చి వారి చేతిలో పెట్టి, వాళ్ళు బయటికి రాగానే తలుపులు మూసుకుంది.
    ఇద్దరూ ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్ళి తమ ఊరు వెళ్లే బసు ఎక్కి కూర్చున్నాక,మనసు స్థిమిత పడినట్లు అయింది. హాయిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి జార్లబడి కూర్చున్నారు.
    “గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ ” భారతoలో నన్నయ రాసిన పద్య పాదం గుర్తుకొచ్చింది పరoధామయ్యకి.

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    స్నేహం

    by Varalakshmi Yanamandra May 30, 2026
    written by Varalakshmi Yanamandra

    గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ అభినందన సభకు జిల్లా కలెక్టరే కాక జిల్లాలో, మండలంలోని ప్రముఖులందరూ హాజరవడం విశేషం.

    ఆ ఊరికి చెందిన ఇద్దరమ్మాయిలు “ఐఏఎస్” పూర్తి చేసి కలెక్టర్లుగా పక్కపక్క జిల్లాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్న సందర్భం. ఎందరో కలెక్టర్లు అవవచ్చు.. కానీ ఇదొక ప్రత్యేక సందర్భం.

    ఈ సభకు ఊరు ఊరంతా హాజరయ్యారు. పెద్ద బహిరంగ సభ అది.
    అందరూ మాట్లాడడం ఐపోయింది. జిల్లా కలెక్టరు గారు జానకి, శైలజలకు సన్మానం చేయబోతున్నారు.

    వారి గురించి ఆఊరి సర్పంచ్ చెబుతున్నారు ఇలా …
    “జానకి, శైలజ మంచి స్నేహితులు. జానకి అతి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, అంతే కాక తనకు చిన్నప్పుడు( కాలికి) పోలీయో వచ్చి సరిగా నడవలేదు.‌ ఐతే చాలా తేలివి గలది జానకి.
    ఇంటరు పూర్తిచేశారు జానకి, శైలజ ఇద్దరూ. ఐతే జానకి చదువు ఆపేసింది….”
    ఇంతలో కలెక్టరు గారు వాళ్ళనే చెప్పమన్నారు..
    జానకి “అలాటి పరిస్థితిలో శైలజ చేసిన గొప్ప సహాయం, మరువరానిది
    నా కోసం డబ్బు ఖర్చు పెట్టింది. నాకాలికి వాళ్ళ నాన్నగారిచేత వైద్యానికి సంబంధించి సహాయం చేయించింది.. తాను ఎక్కి చదువుకుందో…నన్నుకూడా తనతో పాటుగా చదివించిన ఆ కుటుంబానికి ఋణం తీర్చుకోలేను. శైలజ నాకు దేవుడిచ్చిన వరం.”
    అంటూ కన్నీరు పెట్టుకుంది.

    ఇక శైలజ మాట్లాడుతూ” జానకి చదువుకు సహాయం చెయ్యడం గొప్ప కాదు.తను ఏకసంథాగ్రాహి. నేను ఈ పరీక్ష ఉత్తీర్ణత పొందడానికి నాకు తాను నాకు చక్కగా తెలియని అంశాలన్నీ వివరంచడమే ముఖ్య కారణము. కాబట్టి తను ఉన్నత వ్యక్తిత్వం గలది “…. అంటూ ముగించిది.

    ఇక కలెక్టరు గారు ఇద్దరికీ వారు పొందిన విజయాన్ని పురస్కారించుకుని చాలా గొప్పగా సన్మానం చేశారు. చివరగా ఆయన చెప్పిన సందేశానికి పెద్ద ఎత్తున చప్పట్లు మారు మ్రోగిపోయాయి… “ఇద్దరికి ఇద్దరూ గొప్పవారే…వారి ఆశరం ఉన్నతం, ఉత్తమం… సమాజం పట్ల వారికున్న అవగాహనను నేను వారి మాటలలో తెలుసుకున్నాను.అంటూ…….
    ” ఏమతమైనా వివరించేదో మానవత్వమే,” అని వీరిరువురూ నిరూపించారు. “విధాత సృష్టిలో లోపం లేదు, మానవ దృష్టిలోనే శాపం ఉంది.” ఆ శాపాన్ని వీరువురూ బాపారు ఒకరికొకరు. “బాధ్యతల సుడిగుండాల్లో మనిషి జీవితం ముడిపడి ఉంది.” అనేది కూడా చక్కగా ఋజువు చేసి సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేశారు. చివరిగా అతి గొప్ప మాట చెప్పారు…..” స్వచ్ఛమైన స్నేహానికి ఎల్లలు లేవు” అని వీరువురూ నిరూపించారు.
    వీరిరువురి వలన ఇంకా మరన్ని మేళ్ళు జరగాలని ఆశిస్తూ చిరంజీవులను ఆశీర్వదిస్థున్నాను.” అంటూ సభను ముగించారు..‌సభలోని వారంతా కరతాళధ్వనులతో అభినందించారు.

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    ఇంద్రధనుస్సు

    మట్టిలో మాణిక్యం శ్రీ ఉడతా రామకృష్ణ

    by Achyutuni Rajasri May 30, 2026
    written by Achyutuni Rajasri

    ఆయన ఓప్రసిద్ధ జర్నలిస్టు, ఆకాశ వాణిలో గళం విప్పిన శ్రీ ఉడతా రామకృష్ణ గారి జీవితం నల్లేరుపై బండి కాదు. ఆయన బాల్యం యవ్వనం సంకుల సమరం అనే చెప్పాలి.
    కృష్ణాజిల్లాలోని గొల్లనపల్లి గ్రామంలో ఉడతా వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులకు 2.2.1961లో జన్మించారు. ఈయన 5వ ఏటనే తండ్రి చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, బాల్యం అంతా కష్టాలలో గడిచింది. ఆ తండ్రి 1966 లో వెళ్లిపోయిన ఆయన తిరిగి 1982 లో రావటం మరవలేని జ్ఞాపకం. ఐనా తండ్రిని ఆదరించి అక్కున చేర్చుకున్న రామకృష్ణ, ఆయన తల్లిని మనం అభినందించి తీరాల్సిందే! నిజంగా ఇది నమ్మలేని నిజం! కన్నతల్లి అండదండలతో రామకృష్ణ ఎస్.ఎస్.సి. చదివి పేదరికం, కుటుంబ పోషణ కై చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి కులవృత్తి ఐన మగ్గంపై చేనేత వస్త్ర తయారీలో నిమగ్నమైనారు 1975_1988…
    అలా రేడియోతో బంధం అనుబంధం ఏర్పడ్డాయి.నేత రాత పడుగుపేకలా సాగాయి.మంచి విశ్లేషణాత్మక లేఖలతో వివిధ భారతి సిన్మాపాటలతో కూర్చిన ప్రోగ్రాంలు (అరగంట ) తయారుచేసి పంపటం వరకు ఎదిగింది ఆయన కలం!అవిప్రసారం కావటంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన లో రచయిత విజృంభించాడు.రేడియో సంగీత పాఠాలు మొదలు కార్మికుల కార్యక్రమాలు కూడా శ్రద్ధగా ఆసక్తిగా వినేవారు.తన గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చేనేత కార్మికుల చేత
    ప్రోగ్రాములు చేయించడం తో మంచి గుర్తింపు వచ్చింది.చాణుక్యుడు,చంద్రగుప్తుడు ఏకపాత్రాభినయం తో ఆయన లో నటుడు బైటికొచ్చాడు.తన 20వ ఏటకృతజ్ఞత కృతఘ్నత అనే స్వంత కథను రికార్డింగ్ లేకుండ సరాసరి చదవటం ఆలైవ్ ప్రసారంతో రామకృష్ణ లో ఆత్మవిశ్వాసం పెరగటం,దీనికితోడునిర్వాహకులు శ్రీమాడుగుల రామకృష్ణ గారి మెప్పుపొందటం ఓమధురానుభూతి.
    శ్రీసుధామ గారి ప్రోత్సాహంతో రేడియో లో “రాబోయే ఎన్నికలు, నడుస్తున్న చరిత్ర( వారంవారం) ఏనుగులవానిలంక బ్లోఅవుట్ ” రేడియోలో ప్రసారమై అశేషజనాదరణ పొందాయి.చమురుబావిలో మంటలు ఎగిసిపడటాన్ని ప్రత్యేకంగా చెప్పి రాయించిన సుధామ గారికి తను ఋణపడి ఉన్నానని అంటారాయన!
    కానీ రామకృష్ణ కు ఏలూరు బదిలీ కావటంతో రేడియోకి దూరమైనారు.
    ఇక జర్నలిస్టుగా ఆయన యాత్ర కు మార్గదర్శకులు గన్నవరం ఈనాడు విలేఖరి శ్రీ అవ్వారి గోవిందరాజులుగారని, ఆయనే తన తొలిగురువని చెప్పారు.1988లో ఆయన పరిచయంతో రామకృష్ణ పాత్రికేయునిగా స్థిరపడటానికి దోహదం చేసింది.1990లో ప్రజాశక్తిలో పాత్రికేయుడిగా జీవితం గొప్ప మలుపు తిరిగింది.36ఏళ్లు ఆపత్రికలో విలేఖరిగా, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యునిగా ,జర్నలిజం కాలేజీ ఇన్ఛార్జిగా,ప్రిన్స్ పాల్ గా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా ఎదిగినా ఒదిగి ఉన్న నిగర్వి కావటంతో అందరిచేత సెభాష్ అనిపించుకొన్నారు. 2019లో రిటైరైనాక ప్రస్తుతం రైతువాణి మాసపత్రిక బ్యూరో చీఫ్ గా ఉన్నారు2020నుంచి.ఆయన కలంపేర్లుఉష్ణ, శ్రీవర్ష, వరుణ్. ఆయన ప్రజాశక్తి ఆదివారం లో వారం వారం రియల్ స్టోరీస్,సాహిత్య నృత్య శిల్ప చిత్ర, నాటక, సినీ నిపుణుల ఇంటర్వ్యూలు,రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ రాజకీయ యోధులచరిత్రలు వెలువడ్డాయి. తెలకపల్లి రవిగారి సలహాపై 36వ ఏట టైప్ ఇన్ స్టిట్యూట్ కెళ్లి 15ఏళ్ల పిల్లల తో కల్సి టైప్ నేర్చుకోటం చిన్నతనంగా భావించలేదు రామకృష్ణ. కారణం కుటుంబ బాధ్యతలు,ఉదరపోషణ!ఆయన ఇంటర్య్వూ చేసిన ప్రముఖ వ్యక్తులుపద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, కోరాడ నర్సింహ్మారావు,కర్నాటి లక్ష్మీ నరసయ్య, వల్లం నరసింహారావు,చిత్ర కారుడు పద్మశ్రీ రామారావు,అంతర్జాతీయ శిల్పికాటూరి వెంకటేశ్వర రావు,వి.కోటేశ్వరమ్మ, వీరనారి నాగళ్ల రాజేశ్వరమ్మ..ఇలా ఎందరెందరో!
    ఇక ఈయన అమ్మకు అక్షరనైవేద్యం,బోనాలపై 535 కవితాసంకలనం,550కవితలతో సమ్మక్కసారలమ్మలపై సంకలనాలు వెలువరించినవిషయనిపుణుడిగా చరిత్రసృష్టించారు

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    అనువాద సాహిత్యం

    వేటగాడు

    by ఎలనాగ, సురేంద్ర నాగరాజు May 30, 2026
    written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

    రష్యన్ మూలం: అంతోన్ చెహోవ్
    ఆంగ్లంనుండి అనువాదం: ఎలనాగ

    మధ్యాహ్నం. ఉక్కగా ఉంది. ఆకాశంలో ఒక్క మబ్బు సైతం లేదు. ఎండ ధాటికి గడ్డి వడలిపోయి దీనత్వాన్ని, నిరాశను ప్రతిఫలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ వాన పడినా పచ్చదనం నెలకొనదు అన్నట్టుగా చెట్ల పైచివరలతో దేన్నో చూస్తూ ఉపశమనాన్ని ఆశిస్తున్నదా అన్నట్టు అడవి నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంది.
    చెట్లు లేని ఒక ఖాళీ ప్రదేశంలో ఎత్తైన నలబయ్యేళ్ల పురుషుడొకడు కాళ్లీడ్చుకుంటూ, తడబడుతూ, మందకొడిగా, వంగివంగి నడుస్తున్నాడు. అతడు వెడల్పు లేని భుజాలతో, ఎర్ర చొక్కా మచ్చల ప్యాంటూ పొడవైన బూట్లూ ధరించి ఉన్నాడు. రోడ్డు వెంట రికామీగా నడుస్తున్నాడు. కుడివైపున పచ్చని చెట్లు, ఎడమ వైపున లేత బంగారు వర్ణంతో కనుచూపు మేర వ్యాపించిన సముద్రం ఉన్నాయి. అతడు ఒగరుస్తూ చెమటలు కారుస్తున్నాడు. తలమీద తెల్లని టోపీ ఉంది. దాన్ని ఉదారుడైన ధనిక మిత్రుడెవరో బహూకరించాడు అనిపిస్తోంది. చనిపోయిన అడవికోడి ఒకటి అతని బుజానికి వేలాడుతున్న బట్టసంచిలోంచి కనిపిస్తోంది. అతడు రెండు గొట్టాల తుపాకీనొకదాన్ని పట్టుకున్నాడు. దాని ట్రిగ్గర్ వెనక్కి లాగివుంది. పొదలను వాసన చూస్తూ పరుగులాంటి నడకతో ముందు పోతున్న కుక్కమీదనే దృష్టిని కేంద్రీకరించాడతడు. పక్షులు, జంతువులు వేడిమిని తప్పించుకోవడం కోసం చల్లని ప్రదేశాల్లో దాక్కొనడం చేత చుట్టూ నిశ్శబ్దం, స్తబ్ధత ఆవరించి ఉన్నాయి.
    “యెగోర్ వ్లాసిచ్,” అకస్మాత్తుగా మంద్రస్వరంలో ఒక పిలుపు వినిపించింది.
    ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ ముఖం చిట్లించాడతడు. భూమిలోంచి ఉబికివచ్చిందా అన్నట్టు సుమారు ముప్పయ్యేళ్ల వయసున్న ఒక స్త్రీ పాలిపోయిన ముఖంతో, చేతిలో కొడవలితో అతని పక్కనే ఉంది. క్షీణించిన ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ అతని ముఖంలోకి చూస్తోంది ఆమె.
    “ఓ నువ్వా పెలాజియా. ఇక్కడికి ఎలా వచ్చావు?” అన్నాడు ఆ వేటగాడు, తుపాకీ ట్రిగ్గర్ ను మూస్తూ.
    “మా ఊరి మహిళలు కొందరు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. వాళ్లతో కలిసి వచ్చాను.”
    “ఓ అలాగా,” అని మెల్లగా నడవసాగాడు యెగోర్ వ్లాసిచ్.
    పెలాజియా అతని వెంట నడుస్తోంది. వాళ్లు మౌనంగా ఇరవై అడుగుల దూరం నడిచారు.
    “నిన్ను చూడక చాలా కాలమైంది యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా అతని మృదువైన భుజాలను ఆర్తితో చూస్తూ. “ఈస్టర్ నాడు దాహం తీర్చుకునేందుకు ఒక నిమిషం కోసం నా గుడిసెకు వచ్చి నువ్వు నన్ను తిట్టి కొట్టి వెళ్లిపోవడం ఆ దేవునికే ఎరుక. అప్పట్నుంచి నీకోసం ఎదురుచూసి చూసి నా కళ్లు కాయలు కాచాయి. ఓ యెగోర్ వ్లాసిచ్, ఒకసారి రావచ్చు కదా.”
    “వచ్చి అక్కడ నేను చేసేదేముంది?”
    “అవుననుకో. అక్కడ నువ్వు చేసేదేమీ లేదు కానీ, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తూ నువ్వు సంరక్షించాల్సిన చోటు అది. నువ్వే యజమానివి కదా. నువ్వొక అడవికోడిని తుపాకీతో కొట్టావు. ఇప్పుడు నువ్వు కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి యెగోర్ వ్లాసిచ్.”
    ఈ మాటలను అంటున్నప్పుడు పెలాజియా చిలిపి అమ్మాయిలాగా నవ్వుతూ యెగోర్ ముఖాన్ని చూసింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
    “నీకిష్టమైతే ఇక్కడ కూర్చో. ఎందుకు నిల్చున్నావు? నువ్వూ నాతో పాటు కూర్చోవచ్చు,” అన్నాడు యెగోర్ నిర్లక్ష్యం నిండిన గొంతుకతో. రెండు దేవదారు వృక్షాల మధ్య కూర్చున్నాడతడు.
    పెలాజియా కొంచెం దూరంలో నీడలో కూర్చుంది. తన ఆనందం తనకే సిగ్గును తెప్పిస్తుంటే నోరుమీద చెయ్యి పెట్టుకుంది. రెండు నిమిషాలు మౌనంలో గడిచాయి.
    “ఒకసారి వస్తే బాగుంటుంది,” అన్నది పెలాజియా.
    యెగోర్ తలమీది టోపీని తీసి నుదురును చేయితో తుడుచుకుంటూ, “దేనికోసం రావాలి నేను? వచ్చేందుకు కారణమేదీ లేదు. ఒక గంట లేక రెండు గంటల కోసం వస్తే అది సమయాన్ని వృథా చేయటమే అవుతుంది. వచ్చి నీకు బాధ కలిగిస్తూ ఆ ఊళ్లో ఎప్పటికీ నివసించడాన్ని నా హృదయం భరించలేదు. నేను ఎక్కువగా సుఖాలకు అలవాటు పడినవాడినని తెలుసు నీకు. నాకు పడుకునేందుకు ఒక పరుపు, తాగేందుకు టీ, వీటికి అదనంగా మంచి సౌకర్యాలు, నాగరిక సంభాషణ కావాలి. నువ్వేమో దుమ్ము నిండిన ఊళ్లో దారిద్ర్యంలో బతుకుతున్నావు. అక్కడ నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నీతో కలిసి జీవించేందుకు ఒకవేళ అక్కడ ఒక భవనం ఉన్నా నేను నీ గుడిసెను కాల్చెయ్యాలి, లేదా నన్ను నేను బాధించుకోవాలి. చిన్నప్పట్నుంచీ సుఖజీవనం అలవాటైపోయింది నాకు. ఏమీ చేయలేము,” అన్నాడు వ్లాసిచ్.
    “ఇప్పుడెక్కడ ఉంటున్నావు నువ్వు?”
    “డిమిత్రి ఇవనోచ్ ఆనే ఆసామి దగ్గర వేటకానిగా ఉంటున్నాను. అతని తిండికోసం అడవి జంతువులను, పక్షులను వేటాడుతాను. కానీ నాకు తన యింట్లోనే ఆశ్రయమిచ్చాడతడు. అది అతని ఆనందం కోసమే తప్ప వేరే కారణం ఏదీ లేదు.”
    “నువ్వు చేస్తున్న పని సరైనది కాదు యెగోర్ వ్లాసిచ్. వేరేవాళ్లకైతే అది వినోదపు వ్యాపకం లాగా బాగుంటుంది. నీకు మాత్రం అది వ్యాపారం లాంటిదవుతుంది.”
    ఆకాశం వైపు విచారంగా చూస్తూ, “నువ్వు అవివేకురాలివి పెలాజియా,” అని తర్వాత ఇలా కొనసాగించాడు యెగోర్: “నీకెప్పటికీ అర్థం కాదు. నేను ఏ రకం మనిషినో నీ మొత్తం జీవితంలో తెలుసుకోలేవు నువ్వు. నేను చెడిపోయిన మూర్ఖుడినని అనుకుంటున్నావు నువ్వు. కానీ వివేకం ఉన్న ఎవరైనా ఈ మొత్తం జిల్లాలో నేను అత్యుత్తముడిని అంటారు. పెద్దమనుషులు ఈ సత్యాన్ని గుర్తించడమే కాకుండా నేను చాలా మంచి వేటగాడినని ఒక పత్రికలో ప్రచురించారు. నాతో పోల్చతగిన స్ఫూర్తిమంతుడైన వేటగాడు లేడు. దానికి కారణం నేను నీ ఊరిజీవితాన్ని నిరసించడం గానీ సుఖమయ జీవితాన్ని అనుభవించడం గానీ కాదు. చిన్నప్పట్నుంచీ నాకు తుపాకులతో, జాగిలాలతో గడపటం తప్ప ఎప్పుడూ వేరే వ్యాపకం లేదు. నా తుపాకీని లాక్కున్నప్పుడు నేను గాలం తీసుకుని బయటికి పోయేవాణ్ని. గాలాన్ని లాక్కున్నప్పుడు పిట్టలను, జంతువులను చేయితో పట్టుకునేవాణ్ని. గుర్రాల కొనుగోలు, అమ్మకం కూడా చేశాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నేను సంతలకు పోయేవాడిని. ఒక రైతు క్రీడాకారునిగా మారినా లేదా గుర్రాల వ్యాపారం చేసినా వాడు వ్యవసాయానికి వీడ్కోలు చెప్పినట్టే. ఎవడినైనా ఒక్కసారి స్వతంత్రేచ్ఛ ఆవహించిందంటే దాన్ని నిర్మూలించడం జరగని పని. అదేవిధంగా ఎవడైనా అభినయం మొదలైన కళను ఆశ్రయించాడంటే వాడెప్పుడూ అధికారిగా కానీ భూస్వామిగా కానీ మారడు. నువ్వొక ఆడదానివి. కాబట్టి దీన్ని నువ్వర్థం చేసుకోలేవు. కానీ అర్థం చేసుకోవాలి.”
    “నాకు అర్థమైంది యెగోర్ వ్లాసిచ్.”
    “ఏడిస్తే నీకు అర్థం కాదు.”
    అటువైపు తిరుగుతూ, “నేను ఏడ్వటం లేదు. నేను పాపిష్ఠిదాన్ని యెగోర్. అయినా అదృష్టహీనురాలైన నాతో నువ్వు ఒకరోజు గడపవచ్చు. మన పెళ్లి జరిగి పన్నెడేళ్లవుతోంది. కానీ ఒక్కసారి సైతం మన మధ్య ప్రేమ చిగురించలేదు. నేను ఏడ్వటం లేదు,” అన్నది పెలాజియా.
    “ప్రేమ …” అని గొణిగాడు యెగోర్, తల గోక్కుంటూ. తర్వాత, “మన మధ్య ప్రేమ చోటు చేసుకోవడం జరగదు. పేరుకు మాత్రమే మనం ఆలుమగలం. నీ దృష్టిలో నేను ఆటవికుడిని. నా అభిప్రాయం ప్రకారం నువ్వు జ్ఞానం లేని మామూలు రైతు స్త్రీవి. మనం ఒకరికొకరం బాగా సరిపోయామా? నేను సుఖాలు పొందగోరే స్వేచ్ఛా జీవిని. నువ్వేమో తాటాకులతో చేసిన చెప్పులు తొడుక్కుని నడుము వంచకుండా పని చేసే శ్రామికురాలివి. నేను ప్రతి సాహసకార్యంలో ముందుండే మగవాణ్ని. నువ్వేమో నన్ను సానుభూతితో చూస్తావు. ఇప్పుడు చెప్పు మన జత బాగా కుదిరిందా?” అన్నాడు వ్లాసిచ్.
    “కానీ మనం ఆలుమగలం. కామా యెగోర్?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
    “ఆ పెళ్లి స్వేచ్ఛా సంకల్పంతో జరగలేదని మరచిపోయావా? నువ్వు సెర్గేయ్ పేలోవిచ్ దొరనూ, నిన్ను నువ్వూ అభినందించుకోవాలి. నేను అత్యుత్తమ వేటగాడిననే ఈర్ష్యతో ఆ దొర నాకు ఒక నెలరోజుల పాటు వరుసగా మద్యం తాగించాడు. బాగా తాగి ఉన్నప్పుడు ఎవరికైనా పెళ్లి చేయడమే కాదు అతడి చేత మతాన్ని కూడా మార్పించవచ్చు. నా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు, నేను బాగా తాగివున్నప్పుడు మన పెళ్లి జరిపాడు ఆయన. ఒక వేటగాడికి ఆటవిక అమ్మాయితో పెళ్లి! నేనప్పుడు విపరీతమైన నిషాలో ఉన్నానని తెలిసి కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు కౌలుదారువు కాదు కనుక ప్రతిఘటించగలిగేదానివి. ఒక ఆటవిక స్త్రీ ఒక వేటగాడిని పెళ్లాడటం అదృష్టమే అనుకో. కానీ అప్పుడు నువ్వు ఆలోచించి ఉండవలసింది. ఇప్పుడు ఏడుస్తూ కూచో. ఈ వ్యవహారం ఆ దొరకు ఒక జోక్ అయింది. నీకు మాత్రం ఏడుపు తెప్పించే విషయం. గోడకేసి తల కొట్టుకో.”
    కొంత సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. మూడు అడవిబాతులు పైనుంచి ఎగురుతూ వెళ్లాయి. అవి చిన్న చుక్కలుగా మారి కింద వాలేంత వరకు యెగోర్ వాటిని నిశితంగా చూస్తూ నడిచాడు.
    “బతుకుతెరువు కోసం ఏం చేస్తున్నావు నువ్వు?” అని పెలాజియాను అడిగాడతడు, చూపును మరల్చుతూ.
    “ప్రస్తుతం బయటికి పోయి కూలిపని చేస్తున్నాను. చలికాలంలో ఫౌండ్లింగ్ హాస్పిటల్ లో ఒక పాపకు సీసాతో పాలు తాగిస్తాను. అందుకు నాకు నెలకు ఒకటిన్నర రూబుల్స్ ఇస్తారు.”
    “ఓ, అలానా?”
    మళ్లీ నిశ్శబ్దం చోటు చేసుకుంది. కోసిన పైరు తాలూకు మొదళ్ల మీంచి మృదువైన పాట వినపడింది. వేడిమి ఎక్కువగా ఉంది.
    “అకులినా కోసం గుడిసెను నిర్మించావని చెప్పుకుంటున్నారు,” అన్నది పెలాజియా.
    యెగోర్ మాట్లాడలేదు.
    “అయితే ఆమె నీకు ప్రియురాలు అన్నమాట.”
    “అది నీ దురదృష్టం, నీ కర్మ. పాపం, దాన్ని నువ్వు భరించాలి. ఓకే, బై. నీతో చాలా సేపటినుండి మాట్లాడుతున్నాను. సాయంత్రానికి నేను బోల్టోవో దగ్గర ఉండాలి,” అన్నాడు వ్లాసిచ్ ఒళ్లు విరుచుకుంటూ.
    అతడు లేచి నిలబడి, తుపాకిని బుజానికి తగిలించుకున్నాడు. పెలాజియా కూడా లేచి నిలబడింది.
    “నా ఊరికి ఎప్పుడొస్తున్నావు?” అని అడిగింది మృదువుగా.
    “రావాల్సిన పని నాకు లేదు. ఎప్పుడూ మత్తులో లేకుండా రాను నేను. తాగివున్న నాతో నీకు ప్రయోజనం ఉండదు. మద్యపు మత్తులో మునిగినప్పుడు నేను ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాను. బైబై.”
    “బై, యెగోర్ వ్లాసిచ్.”
    యెగోర్ టోపీని తల వెనుకభాగం మీద పెట్టుకొని, ధ్యాసను మళ్లీ జాగిలం మీదికి మరల్చి, వెళ్లిపోయాడు. పెలాజియా అతణ్నే చూస్తూ నిశ్చలంగా నిలబడింది. అతని బుజాలను, సొగసైన టోపీని, నిర్లక్ష్యపు నడకను చూస్తున్న ఆమె కళ్లు విషాదంతో, కరుణ పూరితమైన ప్రేమతో నిండిపోయాయి. ఆమె చూపు తన భర్త శరీరం మీదికి పోయి మృదువుగా స్పృశించింది. ఆ చూపుస్పర్శ అనుభూతమైందా అన్నట్టు అతడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అతడేం మాట్లాడలేదు. ఏదో చెప్పాలనుకుంటున్నాడని తెలిసింది ఆమెకు అతని ముఖం ద్వారా, బుజాల ద్వారా. ఆమె భయంగా అతని దగ్గరికి పోయి, వేడుకుంటున్న కళ్లతో అతడిని చూసింది.
    యెగోర్ వెనుకకు తిరిగి, “దీన్ని తీసుకో” అని, నలిగిన ఒక రూబుల్ నోటును ఇచ్చి వెళ్లిపోయాడు.
    దాన్ని తీసుకుంటూ “గుడ్ బై యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా యాంత్రికంగా.
    నిటారుగా నడుస్తూ రోడ్డుమీద నడిచాడతడు. ఆమె పాలిపోయి రాతిబొమ్మ లాగా అతని ప్రతి అడుగును అపేక్షగా చూసింది. కొద్దిసేపటి తర్వాత అతని ఎర్రచొక్కా, నల్లని పంట్లాము, బూట్లు అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏమీ కనపడలేదు. పచ్చదనం నిండిన చెట్లలోకి యెగోర్ ఎకాయెకిన మలుపు తిరగడంతో టోపీ కూడా అదృశ్యమైంది.
    “గుడ్ బై యెగోర్ వ్లాసిచ్” అని గుసగుసగా అనుకొని, అతని తెల్లని టోపీని మరొకసారి చూసేందుకు కాళ్ల మునివేళ్ల మీద నిలబడింది పెలాజియా.

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    కవితలు

    కవి చివరి చరణం !!

    by Ananthaacharaya K.S. May 30, 2026
    written by Ananthaacharaya K.S.

    పుట్టడం సహజం
    చావడమూ అంతే
    మధ్యకాలo అర్ధయ్యేసరికి
    కళ్ళముందు పొద్దువాలి పోతుంది!!

    ఈ మధ్యలో
    ఎన్ని అక్షరాలు చెక్కాడో
    అవే చరిత్రలో నిలబడే సూచీ స్తంభాలు!!

    పూలదండలు
    పురస్కారాలు పొగడ్తలు
    కవికి కొత్త ఊపిరియే కానీ
    ఊనిక కాదు కొలమానాలు కావు
    దినపత్రిక మీద మురిపించే
    ఒక రోజు బాక్స్ ఐటమ్ !!

    కవి అంతిమయాత్ర లో
    అతని పద్యాలలోని
    పాదాలు గులాబీ రెక్కలై వీధుల గుండా చల్లబడుతాయి!

    సిరచుక్కలు ఇకపై
    గడ్డ కట్టుకుని పోతాయి
    జీవితం శూన్యమా అన్నట్టు
    కవి గారి డైరీ చివరి పేజీ అసంపూర్తి
    గా బిగుసుకు పోతుంది!

    ఆయన పుస్తకాలు పార్థివ దేహం దగ్గర
    తలగడయై, కృతజ్ఞతగా ఒదిగి ఉంటాయి!
    ఎవరో ఒకరు, పుటలు తెరిస్తే, బావురుమంటాయేమో ?

    అంజలి ఘటిస్తూఎవరో అస్పష్టంగా చెప్పిన అమర్ రహే
    పదాలు
    డోలాయమానమై గాల్లో
    ఊగిసలాడుతూనే ఉంటాయి !
    ఒంటరిగా..
    జై కొట్టే లోగొంతుకలయినా లేక!

    కవీ!! బతికి ఉన్నన్ని నాళ్ళు
    పుస్తకాల్లో తల ఇముడ్చుకుని
    కూర్చున్నావు
    ఇప్పుడు నీ గేయం మీద
    జ్ఞాపకానివై నిలబడ్డావు!

    ప్రజాస్వామ్యం కొరకు
    శిర మెత్తి అన్యాయం మీది అరిచిన అరుపులు
    నిరసన చెణుకులు క్రమంగా కవి కులం నుండి వెలివేయబడతాయి!

    అయినా కవీ
    నీ కలం లో పుట్టిన
    పదాలు మౌన
    విస్పోటనాలు!
    దాని
    అణుధార్మికత
    మెదళ్ళలో
    మెల్లిగా మొదలౌతుంది!
    కవీ!

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    ‘ఆధ్యాత్మిక భాస్కరుడు’ ఆదిశంకరాచార్యులు *

    by కావ్యసుధ (హరిశంకర్) May 30, 2026
    written by కావ్యసుధ (హరిశంకర్)

    భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి. భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి ముప్పువాటిల్లుతున్న సమయంలోఒక మహాత్ముడు అవతరించి వ్యవస్థను, చక్కదిద్దడం మనకు యుగాలుగా వస్తున్నది.అట్టి వారిని అవతార పురుషులుగా భావించి, ఆరాధించి ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. శివుని అంశతో జన్మించిన ఆదిశంకరాచార్యుల వారు కేవలం 32 ఏళ్ల వయస్సులోనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని సాధించి ,లోకానికి జ్ఞానం బోధ చేశారు.

    వేదములు, స్మృతులు శ్రీశంకరుల అవతారము వల్లనే పున రుద్ధరింపబడినవి, వాటి పునరుద్ధరణ చేతనే మనము శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, సంక్రాంతి తదితర పండుగలు జరుపుకోవడమనే ఆచారం పునరుద్ధరింపబడినది. అట్టి విధంగా శంకర జయంతియే మిగతా అన్ని జయంతులు జరగడానికి మూల కారణమయిందని కామకోటి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఉద్ఘాటన.


    పరమశివుని అవతారమైన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి అవిశ్రాంత కృషివలనే ఈనాడు మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం ఆ మహానీయ ఆచార్యులు దేశమంతటా పర్యటించి ఉపనిషత్తుల అద్వైత సారాన్ని వ్యాప్తి చేశారు గొప్ప దూర దృష్టితో శ్రీ ఆదిశంకరాచార్యులు భారతదేశంలోని నాలుగు దిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు వీటిలో శృంగారిలో స్థాపించబడిన దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రత్యక్ష శిష్యుడైన శ్రీ సురేశ్వర ఆచార్యుల నుండి మొదలుకొని అవిచ్ఛిన్నమైన ప్రసిద్ధ గురువుల పరంపరతో అలంకరించబడింది. ఆచార్యుల జీవితాలు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఉద్యమాన్ని కొనసాగించడానికి వారు చేసిన ప్రయత్నాలు అద్భుతమైనవి, విశిష్టమైనవి.హిందూ తత్వ శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు ఆదిశంకరాచార్యుల వారు చేసిన సేవలను ,వారి జీవితాన్ని గౌరవించడమే శంకరాచార్య జయంతి యొక్క ప్రాముఖ్యత.

    భారత చరిత్రలో ఆది శంకరాచార్య భగవత్పాదులు ఒక అద్భుతమైన శక్తి, భారతీయ జీవన విధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవన గడ్డయైన వేదాంతాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే అద్వైత సిద్ధాంతం. పరమాత్మ, జీవాత్మ ఒక్కటే, జీవాత్మ పరమాత్మలకి అభేదం “ఏకమేవా అద్వి తీయం బ్రహ్మ’ ‘జీవో బ్రహ్మైని నా పరః” అనే వ్యాఖ్యల అద్వైత, సిద్ధిని చెబుతాయి. ఈ జ్ఞానాన్ని పొందిన జీవాత్మ మోక్షం పొందగలు గుతుంది. అంటే పరమాత్మలో లీనమౌతుంది. ఇలాంటి జ్ఞానం పొందడానికీ అందరికీ సాధ్యం కాదు. భారతీయ సంస్కృతి వైభవా నికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు. సాక్షాత్తు పరమశివుని అవతారంగా చెప్పబడుతున్న ఆదిశంకరుల శక్తి అనన్య సామాన్యమైంది.

    భారతీయ సంస్కృతి వైభవానికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలనే త్రిమతాలు. ఆనాటి ఆర్ష ధర్మానికి వ్యతిరిక్తంగా వున్న మతాలను ఖండించడమే కాకుండా భారతీయ సంస్కృతిలో అద్వైత సిద్ధాంత సమభావాన్ని ఆధారం చేసుకొని శంకరులు శైవం, వైష్ణవం, శాక్తం, శూలం, గానపత్యం, కౌమారం అనే మతాలలోని దోషాలను తొలగించి షణ్ముఖ స్థావనాచార్యులై వివిధ మతాల మధ్య సామరస్య భావన పెంపొందించుటకు, సంప్రదాయాల మధ్య వున్న అంతర్లీన సూత్రాన్ని ప్రచారం చేసి, పంచాయ తన పూజా విధానాన్ని వ్యాపింపజేసి, ఇష్ట దైవాన్ని పూజించేట్లుగా విధి విధానాలను అమలు చేసేవిధంగా పూజా విధానంలోని లోపాలను సవరించిన ఆధ్యాత్మిక సంస్కర్త శంకరాచార్యులు.

    వేదమాత పునరుద్ధరణ కోసం తొలుత వ్యాసులుగా పిమ్మటశంకరులుగా అవతరించారు.వ్యాసులు నారాయణ స్వరూపం. శంకరులు ఈశ్వర స్వరూపం.ఈశ్వరనామ సంవత్సర, ఉత్తరాయణం, వైశాఖమాసం, వసంత ఋతువు, శుద్ధ పంచమి, సోమవారం, కర్కాటక లగ్నంలో, ఆరుద్ర నక్షత్ర యుక్త ప్రథమ పాదంలో, నవగ్రహాలలో ఐదు గ్రహాలు ఉచ్ఛలో ఉండగా కేరళ రాష్ట్రంలోని పూర్ణానది తీరానగల వృషభా చల వృషాదీశ్వర స్వామి అంతచే ‘కాలడి’ అనే గ్రామంలో శివగురు, ఆర్యాంబ పుణ్యదంపతుల తపః ఫలంగా శంకరులు జన్మించారు.
    లౌకిక విషయాలు దుఃఖ మిశ్రితాలు, పారమార్ధికాలు, సుఖ రూపాలు దుఃఖ రహిత సుఖస్వరూపాలు “శంకరోతీత శంకరః” అని దివ్యమైన సుఖాలను ప్రస్తావించువాడు ‘శంకరుడు కనుక ఆ బాలునికి ‘శంకరుడు’ అని నామకరణం చేశారు. ‘శం’ అనే అక్షరం ‘ఐదు’ అంకెకు సంకేతం. ‘క’ అనే అక్షరము ‘ఒకటి’ అనే అంకెకు పర్యాయము. ‘ర’ అనే అక్షరం, ‘రెండు’ అంకెకు సంకేతం. శంకరులు జన్మించిన తిథి, వార, పక్ష, మాస, నక్షత్రాలను అనుసరించి చూచినవారు జ్ఞానం ద్వార ప్రపంచానికి నిత్య సుఖము ప్రసాదించేవాడని స్పష్టం చేశారు.
    శంకరులు మూడవ ఏటనే చదవడం, వ్రాయడం ఐదవ సంవత్సరం వచ్చేసరికి సంస్కృత భాషలో వైదుష్యం సంపాదించి, మూడు వత్సరాల కాలంలోనే సమస్త విద్యలను అభ్యసించి సర్వ శాస్త్ర కోవిదుడయ్యాడు. శంకరుని వైదుష్య వైదగ్ధ్యాలను చూసి విద్వాంసులు విస్మయం చెందారు.
    శంకరులకు ఏడవ ఏట ఉపనయం చేశారు. ఎనిమిదవ ఏటకే వేద విజ్ఞానాన్నంతటిని ఔపోసనం పట్టారు. ఈ మధ్య ‘కాలంలోనే తండ్రి శివగురువు మరణించాడు. కారణ జన్ములైన శంకరులు నర్మదా నదీతీరంలో శ్రీగౌడ నాదాచార్యుల శిష్యులైన శ్రీగోవింద భగవత్పాదుల నాశ్రయించి సన్యాస దీక్షను స్వీకరించారు. నాలుగు వేదాలను తర్మవిద్యల సభ్యసించి బ్రహ్మ విద్యోపదేశం పొందాడు. తర్క వితర్కాల శాస్త్ర చర్చలలో భారతీయులకు తిరుగులేదని ఋజువు చేసి ఆరాధ్య గురువయ్యాడు.

    శంకరులు జన్మించేనాటికి శైవం, జైనం, బౌద్ధం, పలు మతాలు ప్రాబల్యం స్థితిలో ఉన్న సమయంలో స్మార్త, వైష్ణవ, సౌర, శాక్తేయ, గణాపత్య, శైవ మతాల వారితో వాదించి ఏ మతాన్ని నిరసించకుండా వారి ఆచార విదానాలను సంస్కరించి షణ్మత స్థాపకులై శాస్త్ర దృక్పథంలో ఇతర మతాలన్నింటినీ ఒకటిగా గ్రహించి అన్ని మతాలనూ అంతర్లీనం చేసుకొని, భౌతిక, విజ్ఞాన, వాదం చేసే మతాలన్నీ అద్వైత స్థితికి తీసుకొనిపోయే సోపానాలనీ, సిద్ధాంతీకరించి, విశ్వమానవ మతాన్ని స్థాపించినారు శంకరులు. సమాజాన్ని అద్వైత స్థాపనతో ఒకటి చేసిన శంకరులు ప్రచారం కోసం తూర్పున గోవర్ధన మఠం, దక్షిణాన శృంగేరి మఠం, పశ్చి మాన ద్వారక మఠం, ఉత్తరాన జ్యోతిర్మఠం పేరిట భారతదేశంలో నాలుగు మఠాలు స్థాపించి ఈ పీఠాలకు పద్మపాదుడు, సర్వేశ్వరుడు, హస్తామలకుడు, తోటకాచార్యులను పీఠాధిపతులుగా నియమిం చాడు. తదనంతరం దేశమంతటా పర్యటించి ఇతర విశ్వాసాలతో ఉన్న వారినందరినీ అద్వైతంలోకి తెచ్చారు. కర్నాటకలోని తుంగ భద్రానదీ తీరమందున్న శృంగేరికి వేంచేసి అద్వైత వ్యాప్తికి శారదా పీఠాన్ని స్థాపించారు. ఇది శంకరులు స్థాపించిన తొలి శృంగేరి పీఠం, ఆ పీఠాధిపతులందరినీ శంకరాచార్యులనీ పిలుస్తారు.

    అద్వైత మనునది అద్భుతమైన, అనిర్వచనీయమైన ఆనందానుభూతి. అద్వైత మనేది ఆచారము కాదు, మతమూ కాదు. జ్ఞాన మార్గంద్వారా పొందేది. తర్కయుక్తులతో సాధించబడేది కాదు. అద్వైతము శంకరులతో ఆరంభమైనది కాదు. అద్వైత ప్రమాణమును శంకరులకు పూర్వీకులైన ఆచార్యులైన, వశిష్ఠ, గౌడ పాద, బ్రహ్మదత్తాదులు ప్రవచించారు.
    శంకరులు తమ అసమాన ప్రతిభా పాటవాలతో ఉపనిష త్తులలో వివరించబడిన సనాతన ధర్మము, ఆచారములు విశిదపరిచి వైదిక ధర్మాచరణము సుష్టుపరిచాడు. ఈనాడు భారతీయ వైదిక సంస్కృతి అవిచ్చిన్నంగా పరిఢవిల్లుతున్నదంటే అందుకు కారణం శ్రీశంకరాచార్య భగవత్పాదులే! పతనావస్థలో ఉన్న భారతీయ సంస్కృత సనాతన ధర్మాన్ని పరిరక్షించారు.

    వామాచార ధోరణులతో నరులు, పశువుల బలులతో కూడిన అవైదిక పద్ధతులను, పూజాదికాలను, వైదిక ధర్మానికి విఘాతం కలిగించే విధానాలను రూపుమాపాడు. రుద్రమూర్తులైన ఎన్నో దేవతామూర్తులలోని రౌద్రాత్మకమైన బీజాక్షరాలను తొలగించి శాంతపరిచి, సాత్వికరూపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడు.

    32 సంవత్సరాలు తన జీవిత కాలంలో 24 గ్రంథాలకు భాష్యాలు రచించడం జరిగింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతపై భాష్యాలు, అమరోక్షానుభూతి, భజగోవిందం, వివేక చూడామణి, శతశ్లోకి, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, భవానీ భుజంగ, గణేశ పంచరత్న, దక్షిణామూర్తి, లక్ష్మీనరసింహ, మీనాక్షి, పంచరత్నాలను ఇంకా బ్రహ్మ మీమాంస, ఉత్తర మీమాంస, బ్రహ్మసూత్రాలను, కనకధారా స్తోత్రాన్ని, మనీష పంచకం, ఇలా ఆదిశంకరాచార్యులు వ్రాసినన్ని విషయాలు ఈ ప్రపంచం మొత్తం మీద మరెవరూ వ్రాసి ఉండరు. అందుకే ఆయన కృతయుగంలో ఆదిశంకరులు అని పండితుల వచనం.
    మానవులకు భక్తి, జ్ఞానం, ధర్మాల ద్వారా మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తికి మార్గం చూపిన మార్గదర్శకులు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు కేవలం 32 సంవత్సరాలు జీవించారు.

    శంకరాచార్యను స్మరించడం ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందిస్తుంది, అద్వైత వేదాంతంపై అవగాహనను పెంచుతుంది మరియు హిందూ తత్వశాస్త్ర సంప్రదాయంతో అనుబంధాన్ని బలపరుస్తుంది.అంతే కాకుండా, భక్తులు ఆది శంకరాచార్యుల వారి కాలాతీత జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి మరియు ఆయన బోధనలను తమ దైనందిన జీవితంలో అన్వయించుకోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా ఉపయోగపడుతుంది.

    సనాతన ధర్మ వృక్షాన్ని చిగురింపజేసి, ద్వైత చీకట్లను తొలగించిన అద్వైత ఆనందమూర్తి ఆదిశంకరులు.

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    Newer Posts
    Older Posts

    Recent Posts

    • మనోరంజకం ( కథ)
    • ప్రేమ ఖరీదు.
    • కాలభైరవాష్టమి ప్రాధాన్యత – విశ్వ నియమాల దృష్టి
    • శాంతి ఓటమి కాదు!మానవజాతి విజయం!!
    • గతమెంతో ఘనము

    @2021 - All Right Reserved to Mayuukha The Magazine


    Back To Top
    మయూఖ
    • హోమ్
    • కవితలు
    • కథలు
    • ధారావాహిక నవల
    • వ్యాసాలు
    • బాల‌సాహిత్యం
    • ఇంద్రధనుస్సు
    • ఇంట‌ర్వ్యూలు
    • పుస్త‌క స‌మీక్ష‌
    • అనువాద సాహిత్యం
    • About Us