ఉనిక –

by Anuradha Bodda

చెన్నమనేని స్వీయ చరిత్ర 

చెన్నమనేని విద్యాసాగర్ గారి ‘ఉనిక’ ఒక విజ్ఞాన ఖని అని చెప్పొచ్చు. చాలా రోజుల తరువాత ఒక మంచి పుస్తకం చదివాను అన్న భావన కలిగించింది. ఇది వారి రాజకీయ, సామాజిక అనుభవాలని, పరిజ్ఞానాన్ని మనకు పంచుతూ ఇచ్చిన ఒక కానుక. ఈ పుస్తకం నవ్విస్తుంది, ఆలోచింపచేస్తుంది, ఆహ్లాద పరుస్తుంది, కదిలిస్తుంది కూడా. There is really a feel good vibe running through the whole book. అయితే మనసుని కలిచివేసే సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో. ఈ  పుస్తకంలో వారు తన జీవన ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను ఎంతో క్రమబద్ధంగా తన బాల్యం నుంచి, విద్యాభ్యాసం వరకు, R.S.S. సభ్యత్వం నుంచి రాజకీయ వేత్తగా ఎదిగి, గవర్నర్ పదవికి న్యాయం చెయ్యటం వరకు పొందు పరిచారు. అలా పొందు పరచిన విధానం, ఉపయోగించిన భాష చూస్తే వారు ఒక మంచి రచయిత కూడా అని అనిపించక మానదు. 

శ్రీ విద్యాసాగర్ గారి నిశితమైన పరిశీలనా శక్తి, రాజకీయాల పట్ల అవగాహణ, విశ్లేషణ, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, మారుతున్న విలువల పట్ల ఆవేదన, దేశం పట్ల, పార్టీ పట్ల అపారమైన అభిమానం, వారి అత్యున్నత వ్యక్తిత్వం అన్నీ విశదంగా కనిపిస్తాయి వారి స్వీయ చరిత్రలో. ముఖ్యంగా ఇది ఒక పిక్టోరియల్ బుక్. పేజీల మధ్యలో ఉన్న ఫోటోలు, పేపర్ కట్టింగ్స్, జరిగిన సంఘటనలకు సాక్ష్యంగా నిలవటమే కాకుండా,  దీర్ఘమైన వచనం మధ్య ఒక విరామం ఇస్తూ  సంఘటనలను  దృశ్యీకరించుకోవటానికి ఉపయుక్తంగా ఉన్నాయి.

సుపరిచితమైన తెలంగాణా ప్రాంతాలను గుర్తు చేస్తూ, ఎక్కడో జ్ఞాపకాలలో మిగిలిన తెలంగాణ పదజాలమైన కయిసిప్ప, దాలి, గిలాసులు, డేగిసాలు, శిబ్బి, పాలగోకు, ఉట్టి లాటి ఎన్నో పదాలను ఉపయోగిస్తూ తాను అబ్బురంగా చూసిన క్రిమి కీటకాలు, పక్షి గూళ్ళు లాటివి వివరిస్తూ రాసిన వారి బాల్యాన్ని చదవటం మొదలు పెట్టగానే ఆ కథా విధానం మనల్ని కట్టిపడేస్తుంది.  

   ‘ఎవరినీ లెక్కచేయకుండా క్రిమికీటకాలు మరొకవైపు రాజ్యమేలుతుండేవి. నల్ల చీమలు, ఎర్ర చీమలూ, క్రమబద్ధంగా వాటి నడక, చెట్ల కొమ్మలకు వేలాడే పిట్ట గూళ్ళు, తేనెతుట్టెలు, ఆధునిక ఇంజనీరు యుగానికే సవాలుగా అనిపిస్తుంది. వీటిని చూసి ఆశ్చర్యపడటం ఒక్కటే అప్పుడు తెలిసేది.’ (page 57)

తెలంగాణాలో దొరలంటే చాలా గొప్పవారని ప్రతీతి. అలాటిది, విద్యాసాగర్జీ చిన్నతనంలో గడిపిన మధ్యతరగతి జీవనం, వర్షం వస్తే చూరులోంచి నీళ్లు కారేటువంటి ఒక పాకలో వారి జీవనం సాగిందని తెలియటం ఒకింత ఆశ్చర్యం కలిగించిన విషయం. చెప్పుకోగలగాలి కానీ ప్రతి ఒక్కరి జీవనం ఒక కావ్యం అవుతుంది అనిపించింది వారి చిన్నతనంలోని జీవన విధానం చదివితే. 

పదేళ్ల వయసులో తన తండ్రి కాలం చేసినప్పుడు, వారి అంత్యక్రియలు జరిగినప్పుడు అర్ధం కాలేదు కానీ, అమ్మ మట్టెల చప్పుడు వినపడనప్పుడు తన తల్లికి ఆ లోటు ఏంటో అర్థమయి ఎంతగానో దుఃఖించానని ఆ పసి వయసు దుఃఖాన్ని తన ‘కాళ్ళ మట్టెలు’’ కథనం ద్వారా సాగర్ జీ చెప్పుకున్న విధానం మనసుని కదిలించివేస్తుంది. అది కూడా తాను జైలు జీవితం గడుపుతున్న సమయంలో గస్తీ తిరుగుతున్న గార్డుల బూట్ల చప్పుడు వింటూ గుర్తు చేసుకుంటూ బాధపడటం మరీ కదిలిస్తుంది. 

‘అమ్మ కాళ్ళ మట్టెల చప్పుడుని బట్టి నేను పడుకుని ఉన్నా… అమ్మ ఎక్కడ ఉన్నది  తెలుసుకోగలిగేవాణ్ణి. మెల్లగా నావైపు వస్తున్న కాళ్ళ మట్టెల చప్పుడును వింటూ ఎప్పుడు నా కడుపు మీద అమ్మ చేయి ఉంచుతుందో తెలుసుకునే వాణ్ణి’ (page 69)

‘ఎప్పుడో అమ్మ వస్తుందనీ, కడుపు నిమిరి మళ్ళీ అన్నం తినిపిస్తుందనీ, వద్దన్నా అది తప్పించుకోలేననీ చూస్తున్నాను. అమ్మ వస్తున్నట్టు అనిపించింది కానీ తనేనా కాదా అని అనుమానం వచ్చింది. కడుపు మీద చేయి ఉంచి నిమిరేవరకు అమ్మ వచ్చిందని తెలియలేదు. అమ్మ కాళ్ళ మట్టెల చప్పుడుని గుర్తుపట్టి ఎక్కడికి పోతుందో ఎప్పుడు వస్తుందో తెలిసిపోతుంది. కానీ ఆ రోజు తెలియడం లేదు. అమ్మ కడుపు మీద నిమురుతూ ఒక్క ముద్ద తిను అన్నప్పుడు అమ్మ వచ్చిందని తెలిసింది. మరి కాళ్ల మట్టెలు? అప్పుడు నాన్న చనిపోయింది జ్ఞాపకానికొచ్చింది. మొట్టమొదటి సారి దుఃఖం పెల్లుబికింది.’ (page 70)  

ఎమర్జెన్సీలో రాజకీయ నాయకుల జైలు జీవితం గూర్చి నేను విని ఉన్నాను. కానీ వీరి ద్వారా మరొక కొత్త కోణం చూసాను. జైలు జీవితంలో ఉన్న ఇతర నేరస్తులను ఈ రాజకీయ ఖైదీల సహాయానికి నియమించేవారని, వారితో మాట్లాడటం, వారి కధలు అన్నీ వింటూ, వారి విభిన్న మనస్తత్వాలను తెలుసుకునేవారని, ఒక అడ్వొకేటుగా వారి సమస్యలు, వారి కధలు విన్న తరువాత, వారి విడుదలకి అర్జీ లేఖలు రాసి ఇచ్చేవారని, కొన్నిసార్లు వారు నేరస్థులు అని తెలిసీ వారికి అర్జీ లేఖలు రాసి ఇవ్వటం సరైన పనేనా అనే ఆత్మ విమర్శ చేసుకునేవారనీ చెప్పుకొచ్చారు. ఇదంతా  కూడా వారి మానవీయతను చాటుతుంది. ఆ సందర్బంగా జైలు నుంచే వారు ‘అలర్జీ’ అనే పేర ఒక కథ రాసారు. ఎవరు మనకు ఎన్ని సహాయాలు చేసినా స్వధర్మంని మించిన దేముంటుంది అని చెప్తుంది ఈ కథ. 

“పొడిసేస్త దొర!’ అతను కిందికి చూస్తూ అన్నాడు. 

రామారావు గుండె ధడేలు మన్నది. మొఖం రంగు మారింది. గుడ్లలో నీరు తిరిగింది. కొంచెం ముందుకు వంగి… “నా భార్య ముందు, నా చిన్నారి పసిపాపల ముందు… నీకు సహాయం చేసిన నన్ను… చంపేస్తావా?” రామారావు ఆవేశంతోనే అడిగాడు. 

మీరు నన్ను చూసినంక కోర్టుల… గవాయి పలికితే… ఇగ.. నాకేముంటద్దొర! ఉరే అయితది. నా పెండ్లాం, పోరగాండ్ల గతేమయిద్ధి!” మెల్లిగా మట్టి గిల్లుతూ అన్నాడతను.  (page 115)

సూర్యోదయం రోజూ ఒకలాగే ఉంటుంది, కానీ అది మనకు అప్పుడుడప్పుడు మాత్రమే ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది మన మనసు స్థితిని బట్టి ఉంటుంది అని ఎక్కడో విన్నాను. అలాగే జైలులో ఎన్నో మల్లెలు పూసేవనీ, కానీ ఆ మల్లెలు ఎంత అందమైన వైనా జైలు జీవితంలో అవి ఎవరినీ ఆకర్షించేవి కావు, అంటూ చేప్పే వారి కవిత వారిలోని కవితాత్మకతను చాటుతుంది.  

జైలు మల్లెల పొదలు

పెరుగును వరుసగ

జీవన బందీలుగ

చూచును దిగులుగ  (page 109)

రాజకీయ నాయకులు అనగానే వారికేంటి, రాజల్లాంటి బ్రతుకులు, అనుకుంటాం మనం. కానీ ఆ రాజకీయ జీవితం పూల పాన్పు కాదు, అది ఊరికే కూడా రాదు. ఆ నాయకత్వం పొందటం వెనుక, వారి అకుంఠిత దీక్ష, పార్టీ పట్ల, ప్రజల పట్ల వారి నిబద్దత, వారి నిరంతర శ్రమ ఎన్నో దాగుంటాయి. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆటుపోట్లను తట్టుకుని అడుగేస్తే ఆ నాయకత్వం చేజిక్కుతుంది. అది చేజిక్కిన తరువాత కూడా వారి జీవితం కత్తిమీద సాములాగే ఉంటుంది. అలాటి శ్రమ, దీక్ష అన్నీ కనిపిస్తాయి, విద్యాసాగర్ గారి రాజకీయ ప్రయాణంలో. మెట్టుపల్లి ఎన్నికలకు ముందు పలు రకాల వ్యతిరేకతలను ఎదుర్కొంటూ కూడా వారు గ్రామ గ్రామాలకు తిరుగుతూ, అందరితో కరచాలనం చేస్తూ ప్రజల మనసులను గెలవటం నిజంగా అభినందనీయం. అంతేకాకూండా, తమ ప్రచార సమయంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి వారు చేసిన కృషి కూడా అభినందనీయం. 

విద్యాసాగర్ గారు, రాజకీయ నాయకులే కాకుండా మంచి విజ్ఞానవేత్త. ఎన్నో చోట్ల వారు చదివిన పుస్తకాలను, అవి నేర్పిన మంచిని ఉటంకించారు.  శ్రీపాద డాంగే, కార్ల్ మాక్స్, అంబెడ్కర్, సినారే, వివేకానంద, ఎల్.కె. అద్వానీ, అటల్ బిహారీ వాజపేయి వంటి మరెందరో రచనల్ని క్షుణ్ణంగా చదివారని వాటినుంచి, తమ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకున్నారనీ అర్ధమవుతుంది. ఈ పుస్తకం అడుగడుగునా వారి వ్యక్తిత్వానికి అద్ధం పడుతుంది. 

ఒక సందర్భంలో సినారే గురించి ఇలా చెబుతారు. 

‘అయన సాహితీధార కూడా సమయానుకూలంగా ప్రజల ఉద్యమాల కనుగుణంగా మలుపులు తిరుగుతూ వచ్చింది. ఒక దశలో ‘గోమాత గిట్టలలో కొడవలి అంచులు నడుస్తున్నాయి.’ తెగిపోతున్న కండరాలు / ఎగురుతున్న జండాలు అన్నారు. అయన తెలంగాణా పదబంధ సుగంధంలో ఎన్నో సామాజిక విషయాల విశ్లేషణలు కనపడతాయి..’ (page 254) 

ఇక శాసనసభ సమావేశ విశేషాలు చదువుతుంటే వారి చతురత, సమయస్ఫూర్తి, స్పాంటేనియస్ సమాధానాలు, నవ్విస్తాయి, అబ్బురపరుస్తాయి. చిన్న వయసు నుంచి, రాజకీయముగా ఎంతో ఎత్తుకు ఎదిగిన జీవితం వరకు కూడా, తాను చేసిన తప్పులను తప్పుగా ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చటంలో వారి ఆత్మావలోకనం కనిపిస్తుంది.  

తాను అధిరోహించిన పదవులకు న్యాయం చేస్తూ, సామాజిక సమస్యలకు తగు సమయంలో తగు విధంగా స్పందించి నీటి సరఫరా, గ్రామ గ్రామానికి దోబీ ఘాట్ నిర్మాణాలు, యూదులకు మైనార్టీ స్టేటస్ కల్పించటం, బహు భార్యత్వంకి సంబంధించిన చట్టంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం, లాటి అనేక ఉపయుక్తమైన కార్యక్రమాలు చేపట్టారు. మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల అభివ్రుద్దికి  కృషి చేశారు. సర్దార్ వల్లాభాయి పటేల్, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్ వంటి వీరుల జీవిత చరిత్రలను వివరిస్తూ, వాటిని స్కూళ్లలో పాఠ్యంశాలు గా చేర్చాలనే తపన వ్యక్తం చేసారు. వారి తల్లి చంద్రమ్మ గారి పేరిట ఎంతో  మంది పేదలకు, రోగులకు సహకారం అందేలా చేశారు. ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు అని చెప్పే ప్రయత్నం చేసారు. 

ఏదో ఉడతా భక్తిగా పనులు చెయ్యటం కాకుండా తాను చేపట్టిన ప్రతి పనీ ఎక్కడా జంకకుండా, మధ్యలో వదిలేయకుండా ఆ పనులు పట్టుదలతో సాధించారు. ఉదాహరణకి గిరిజనులకు చట్ట ప్రకారం అటవీ ఉత్పత్తులపై వారు పొందవలసిన హక్కులను సమకూరుస్తూ, అది సద్వినియోగం అవ్వాలంటే హక్కులు మాత్రమే ఇస్తే సరిపోదని,  ఎంతో ప్రణాళికా బద్దంగా వాళ్ళకి నిధులు, నీటి వనరులు కల్పిస్తూ, కావాల్సిన శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేసారు. ఇవన్నీ కూడా వారి సిన్సియారిటీకి, సేవానిరతికి, పట్టుదలకీ సాక్షాలు. 

ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశం ఎక్కువ యువత ఉన్న దేశం. ఈ యువతకు సరయిన శిక్షణని ఇవ్వకపోతే ‘Demographic Dividend’ turns to ‘Demographic Disaster’ అని కూడా వారొక చోట వాపోయారు. 

చరిత్ర ఎప్పుడు నిలిచిపోవాలని, రాబోయే తరాలకు అది మార్గ దర్శకంగా నిలవాలనే తాపత్రయంతో ఎన్నోచోట్ల మహానాయకుల విగ్రహ ప్రతిష్ట చేయించటం, వారికి సంబందించిన చరిత్రను వెలుగులోకి తేవటం లాటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. మహారాష్ట్ర లోని రాజభవన్ ప్రజల దర్శనానికి తెరిచేలా చేసారు. అదే రాజభవన్లోని బ్రిటీష్ కాలం నాటి అండర్ గ్రౌండ్ బంకర్ వెలుగులోకి వచ్చేలా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.  

ముందే పేర్కొన్నట్టు ఈ పుస్తకం ఒక విజ్ఞాన ఖని. దీని ద్వారా ఎన్నో రాజకీయ పరిస్థితులు, విశ్లేషణలు తెలుస్తాయి, ఎన్నో పుస్తకాల గురించిన సమాచారం తెలుస్తుంది, భారతీయ తత్వం, దాని గొప్పతనం తెలుస్తుంది. ఇలా ఎన్నో విషయాలను తెలుపుతూ ఆయా కాలాల సామాజిక రాజకీయ పరిస్థితులను రికార్డు చేసిన ఈ పుస్తకం stands as a good resource for research students. భవిష్యత్తులో నాయకులు కావాలనుకునే వ్యక్తులకి ఇది ఒక దిక్సూచి కూడా.  ఈ విషయాలన్నీ దాదాపుగా ప్రముఖంగా పత్రికలలో ప్రచురించ పడినవే. రెగ్యులర్గా వార్తలు ఫాలొ అయ్యేవారికి కొత్త కాకపోవచు. అయితే తెలిసిన వారికి విషయాలను కొత్త కోణంలో పరిచయం చేస్తుంది, తెలియనివారికి  విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది ఈ ‘ఉనిక’. 

సాగర్జీ పార్టీ కార్యకర్తగా, వకీలుగా, జైలులో ఖైదీగా, శాసన సభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, గవర్నరుగా… ఏ పాత్రలో ఉన్నా ప్రజల మనిషిగా ప్రజలకు ఉపయోగపడాలని అనునిత్యం పాటు పడిన నాయకుడిగా ప్రజల మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఈ ‘ఉనిక’ వారిని మంచి రచయితగా కూడా గుర్తుంచుకునేలా చెస్తుంది. 

You may also like

Leave a Comment