Home పుస్త‌క స‌మీక్ష‌ జ్ఞాన గుళిక -1

జ్ఞాన గుళిక -1

by Naresh Chary

“పలకలనుంచి పలుకులవైపు”
కందుకూరి శ్రీరాములు గారి కవితా సంపుటి

మిత్రులకు నమస్కారం
ఈరోజు జ్ఞాన గుళిక శీర్షికన నేను పరిచయం చేస్తున్న మొదటి పుస్తకం ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు గారి కవితా సంపుటి పలకల నుంచి పలుకుల వైపు. చదివి ఆనందిస్తారని ఆశిస్తూ….

ఉత్తమమైన పలుకులు

“మొక్కై వంగనిది మానై వంగునా”అనేది పెద్దల మాట. అది మనిషికి కూడా వర్తిస్తుంది‌. ఒక మంచి సమాజం రూపొందాలంటే ముందుగా వ్యక్తికి మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. ఆ వ్యక్తిత్వ నిర్మాణం బాల్యదశనుండే ప్రారంభం కావాలి. బాల్యదశ నుంచి తల్లిదండ్రులు, గురువులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతారు.ఆ తీర్చిదిద్దడంలో ఉపయోగపడేవి నీతి కథలు, కవితలు,పాటలు,పద్యాలు గేయాలు.వీటిని చిన్నప్పటినుండే పిల్లలకు అలవాటు చేస్తే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు.
ఎవరికి వారే యమునా తీరే అనేట్టుగా బ్రతుకుతున్న ఈ కాలంలో సాహిత్యకారులు మాత్రం ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అందులో కందుకూరి శ్రీరాములు గారి కృషి శ్లాఘనీయం. వారు 1974 (దివిటి)నుండి కవిత్వం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి తెలంగాణలో ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు. వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే కవిగా,సామాజిక శాస్త్రవేత్తగా మారడం ఎంతో మంది బాగుపడడానికి కారణమైంది.
లోగడ కందుకూరి శ్రీరాములు గారు ఎన్నో కవితా సంపుటాలను వెలువరించినా 2024 లో వెలువరించిన “పలకల నుంచి పలుకులవైపు”అనే కవితా సంపుటికి ప్రత్యేకత ఉంది. ఇందులోని కవితలన్నీ బాలలకు,కళాశాల విద్యార్థులకు సంబంధించినవే. ఇందులో 49 కవితలు ఉన్నాయి. ఇవి బాల్యాన్ని అద్భుతంగా చిత్రించిన కవితలు . ఎవరి జీవితం లోనైనా బాల్యం చాలా ముఖ్యమైంది.దానికి పేద,ధనిక బేధం ఏమీ ఉండదు. అందరికీ మంచివో, చెడ్డవో జ్ఞాపకాలు అనేకం ఉంటాయి. బాల్యం ఎలాంటిదో కవి ఈ విధంగా చెబుతాడు “కన్ను మీద కనురెప్ప పడ్డంత సున్నితం/మట్టిపెళ్ల మీద తొలకరి పడ్డంత /సునిశితం-సువాసనత్వం (చిగురు కల) నిజమే కదా!. బాల్యంలో ఎవరికైనా బడితో అవినాభావ సంబంధం ఉంటుంది. జ్ఞానాన్ని ఒంటబట్టించుకున్నవాడు గొప్పవాడిగా ఎదుగుతాడు, తల బరువు అనుకునేవాడు సమాజానికి భారంగా మారుతాడు. బడిలో ఎలాంటి వారు వస్తారు? ఎందుకొస్తారు? అసలు బడి అంటే ఏమిటో ఇలా చెబుతాడు కవి “ఒకడు అమాయకుడిలా వస్తాడు/ కొన్నిఊహలు పెంచి కొన్ని వ్యూహాలు చెప్పి /శస్త్రాస్త్ర విద్యలు నేర్పితే /వీరుడిలా తయారవుతాడు. ఒకడు బక్క చిక్కిన వాడు వస్తాడు/ వ్యాయామం మార్చి ఫాస్ట్ తో/ ఆరోగ్య సూత్రాలు చెప్పి బలవంతుడిని చేస్తే/ వస్తాదై కుస్తీకి దిగుతాడు. గుడ్డివానికి చూపు/ చెవిటివానికి వినికిడి/కుంటివానికి నడక/ తొంటి వానికి చేయి/ మూగవానికి మాట/గుండె లేని వాడికి శ్వాస అందించే కర్మాగారం/ఈ నారుమడి బడి(తుకం). పాఠశాలలో దెబ్బలు తింటే భవిష్యత్తులో లాఠీ దెబ్బలు తినే అవసరం రాదు అనేది ఇప్పుడు అంటున్న మాట.దాన్ని గుర్తుకు చేస్తూ “అక్షరాలు నేర్పటం ఎంత ప్రయత్నం/ జ్ఞానం పొందటం ఎంత పరీక్ష /ప్రతి పీరియడ్ నెలవంకల గోడ కుర్చీలే /నిండు పూర్ణిమ జ్ఞానం పొందడానికి/ ప్రతిరోజూ గుండు సున్నాల కోదండాలే/ నిలువెత్తు సంతకం ఆకాశమంత రాయటానికి-/ఎందుకు చదవలేదని అటు గోడ దెబ్బ ఇటు చెంప దెబ్బ /అమ్మ – గురువు(బరిగె) అప్పట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి దాదాపు ఒకసారైనా ఇలాంటి అనుభవం ఎదురవుతుంది.
శిక్ష అనుభవిస్తున్నప్పుడు మనకు టీచర్ పై కోపం వచ్చినా ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది. ఏ గురువుకు కూడా విద్యార్థి శత్రువు కాదు.వారి భవిష్యత్తు బాగుండాలని, తనకంటే పై స్థాయికి ఎదగాలని కలగంటాడు. అప్పట్లో పెద్దబాలశిక్ష చదివితే మొత్తం చదువు వచ్చినట్టుగానే భావించేవారు. ఎందుకంటే అది ఒక ఎన్సైక్లోపిడియా. కాలక్రమేనా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్దబాలశిక్ష కనుమరుగైపోయింది కానీ అప్పట్లో పెద్దబాలశిక్ష పూర్తి చేశామంటే డిగ్రీ పూర్తి చేసినట్టు లెక్క.ఇప్పుడున్న ప్రతి మేధావి పెద్దబాలశిక్షతో అనుబంధం ఉన్నవాళ్లే‌. దాని పేరు మీదనే అద్భుతమైన కవితను అందించారు కవిగారు. అందులో “మనం మనిషిని మనిషిగా చేయడం మరిచాం/ శిల్పానికి గుండెనిచ్చి బొమ్మకు కన్నీళ్ళని ఇవ్వాలి/మాతృస్తన్యం తాగి పెరిగిన యువకుల్లారా/ పారతంత్ర్యం అనే మాట వద్దు/శాస్త్ర విజ్ఞానం లేని భాషా బట్టీయం/అమ్మా అని అర్థం తెలియని అవిద్య పాఠాలు/ బాధలు కన్నీళ్లు తెలియని గుడ్డులో దాగి ఉన్నాం/ ఇవాళ రేపు తెలియని ఇంగ్లీష్ వ్యామోహంలో పడ్డాం/అంటూ నేటి విద్యా విధానాన్ని ఎండగట్టాడు.ఇదే కవితలో “సామాజిక రుగ్మతలు అర్థమైతే తప్ప /వాడు డాక్టర్ అయినా లాభం లేదు/ శ్లోకం కంటే ముందు శోకం తెలుసుకోనీయండి” (పెద్దబాలశిక్ష) అంటూ చదువుకునే యువతకు దిశానిర్దేశం చేస్తాడు. నిజమే కదా ! బట్టీ విధానం ద్వారా ఏమొస్తుంది? ఏమీ రాదు. విషయం అర్థమైతే తప్ప తనెంచుకున్న రంగంలో నిపుణుడు కాలేడు. విద్య యొక్క విలువలు ఒంటబట్టించుకుంటే తప్ప దేశం పురోగతిని సాధించదు. విద్యార్థులు స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఎక్కువగా నేర్చుకుంటారని సృజన శక్తి కూడా బయటకు వస్తుంది అని చెప్పే ఈ కవితా వాక్యాలు అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి”అందమైన చేపను/ తలకిందులుగా వేలాడదీసి /ప్రశ్నల జవాబుల పరీక్ష పెట్టకు/ నీళ్లలో వదులు/ వేయి వయ్యారాలు పోతుంది”(బోర్డు మీద బొండు మల్లెలు)
కందుకూరి శ్రీరాములు గారికి బోధన అంటే మక్కువ ఎక్కువ. త్రికరణశుద్ధిగా కర్తవ్య నిర్వహణ చేశాడు కాబట్టే మండల స్థాయి, జిల్లాస్థాయి,రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులను అందుకోగలిగాడు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణమవుతుంది అనే మాటను బలంగా నమ్మాడు కాబట్టే అహర్నిశలు శ్రమించి తనవంతుగా దేశానికి ఉత్తమ పౌరులను అందించగలిగాడు. తను పని చేస్తున్న కాలంలో పాఠశాలలో ఏ చిన్న సమస్య వచ్చినా అది ఉపాధ్యాయునికి కావచ్చు లేదా విద్యార్థికి కావచ్చు దానిపైన కవితతో స్పందించాడు. విద్యార్థుల భవితకై ఎన్నో కవితలు రాశాడు. వాళ్లలో కవితా స్పృహను కలిగించాడు. ఆలోచన దృక్పథాన్ని మార్చగలిగాడు. ప్రతి విద్యార్థి ఏదో సామర్ధ్యాన్ని కలిగి ఉంటాడని నమ్మాడు. దాన్ని గురించి ఒక కవితలో ఇలా చెప్తాడు “అది మొగ్గే కావచ్చు/ స్పృశించు/ వేయి రెక్కలై విచ్చుకుంటుంది/ ఆ పాప మూగే కావచ్చు/కదిపి చూడు /కళ్లతో మాట్లాడుతుంది/ ఆ చేయికి అ ఆ లు చుట్టరావనకు సున్నాలు చుట్టిన చేయే సన్నాయి రాగం పలుకుతుంది/ బలపాలు కారిన ముక్కే/ ప్రభంజనాల్ని శ్వాసిస్తుంది/పూల గొట్టాలనూదినన నోరే/శబ్ద శంఖారావమవుతుంది గోడను ఆసరా పట్టుకొని లేస్తున్న కాళ్లే/ కదనరంగంలో తురంగాలు అవుతాయి/ అంటూ చెబుతూనే గురువుగారి కర్తవ్యం కూడా “వాళ్ళమ్మ ఒడిలో పడుకోబెట్టుకోవచ్చు/ నువ్వు జనం కత్తుల ఒరలో నిద్ర లేపు” (శిలను చెక్కితే) అంటూ గుర్తు చేశాడు. తను ఏం చేశాడో మరో కవితలో ఇలా అద్భుతంగా చెప్పాడు” అక్షరాన్ని ఆయుధం చేశాను/ చూపుకు పదును పెట్టి /గురి తప్పని కిరణమై/ చీకటి మండలాన్ని /కూకటివేళ్లతో పెగిలించింది (ఆకాశం అంచు).
కవిత్వం సానుభూతి లేదా సహానుభూతి నుండి వస్తుంది.పాఠశాల స్థాయిలో రకరకాల విద్యార్థులను చూసిన కందుకూరి శ్రీరాములు గారు ఎన్నో కవితలు రాశారు.అందులో చేతుల్లేని విద్యార్థిని చూసి రాసిన కవిత ఆనాటి దృశ్యాన్ని మనకు కళ్ళ ముందు చూపుతుంది “నిండిన హాస్య సభలో నవ్వుల జల్లులు కురిసినప్పుడు/అందరి కరతాళ ధ్వనుల మధ్య/ వాడి భుజాలకు వేలాడుతున్న/ కుక్క చెవుల చేతులు టపటపలాడినప్పుడు/అప్పటి వాడి సంతోషం మనకు దుఃఖంగా /అప్పటి వాడి ఆనందం మనకు అంతర్మధనంగా మారకపోతే/ అసలు మనం మనసున్న మనుషులమే కాదు”( శబ్ద శరీరం) ఎంతో ఆర్ద్ర హృదయం ఉంటే తప్ప ఇలాంటి కవిత రాదు. అలాగే ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి నడుము విరిగిన విద్యార్థిని చూసి రాసిన కవిత కూడా అప్పటి దృశ్యాన్ని మన కళ్ళ ముందుంచి గుండెని మెలిపెడుతుంది.” వాడు /ఇంజనీర్ కావలసిన వాడు/ విరిగిన ఎముకలని కొలుచుకుంటున్నాడు/ డాక్టర్ కావలసిన వాడు/ నాడీ సరి చూసుకుంటున్నాడు/ శాస్త్రజ్ఞుడు కావలసిన వాడు/ భూమి మీద అంబాడుతున్నాడు/ మేఘాలలోకి ఎగిరే రెక్కలు తెగిపోయి/ బురదలో కుమ్మరి పురుగైనాడు”(ప్రభాకరుడు )అంటూ విద్యార్థి స్థితిని ఎంతో ఆవేదనాభరితంగా కవితలో చిత్రించాడు.ఉపాధ్యాయ వృత్తి అంటేనే నిత్యం పుస్తకాలతో కుస్తీ. పుస్తకంపై కూడా రాసిన కవిత గొప్పగా అనిపిస్తుంది.”అక్షరాల్లో /పత్రహరితం నింపుకొని/ ఆరిపోయే దీపానికి /ఆక్సిజన్ వదులుతుంది(పూసే పుస్తకం) అంటూ పుస్తక స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే విద్యార్థుల మధ్య స్పర్ధ ఉన్నట్లయితే చదువులో ఎక్కువగా రాణిస్తారు.వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉత్సాహవంతమైన మాటలు చెప్తేనే వాళ్లు గమ్యం వైపు వడివడిగా అడుగులు వేస్తారు. ఆ ప్రయత్నమూ చేశారు కందుకూరి వారు. “నువ్వో మెట్టెక్కావనుకో /నీ పక్కనుండి వెళ్లి /వాడు రెండు మెట్లు ఎక్కుతున్నాడు/ నువ్వు అలాగే నుంచున్నావనుకో /వాడు ఆకాశాన్ని ఆక్రమిస్తాడు/ నువ్వు అడుగంటుతావు”( కాలజ్ఞానం )అంటూ విద్యార్థులను తట్టి లేపుతాడు కార్యోన్ముఖులను చేస్తాడు.
పిల్లలను మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా రూపుదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయుల పైనే ఉంటుంది.విద్యార్థులు మట్టిముద్దలాంటివారు. వాళ్లను ఎలా అంటే అలా మలవవచ్చు. ఉపాధ్యాయులు పాఠశాలలో నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధతే విద్యార్థికి జీవితాంతం తోడుండి విజయం వైపు అడుగులేయిస్తాయి. కాబట్టి వారి అందమైన భవిష్యత్తు రూపకల్పనలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమని చెప్పే ఈ కవిత సార్వకాలీనమైంది.” బువ్వ తినిపించటమూ/బుజ్జగించటమూ అది మీ ధర్మమైతే/ విల్లు వంచమనటం/ అల్లే తాడు బిగించి బాణాలు సంధించమనటం/ ఇది మా కర్తవ్యం/మీరు లాలి పాటలు జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు/ మేము శ్లోకాలు చెప్పి వాటికి అర్థాలు చెప్పి బుద్ధిని మేల్కొల్పుపుతాం/ మీరు బట్టలు కొని కుట్టించి తొడిగించి /మల్లెపూలను చేసి పంపుతారు/మేం ఆ మల్లెల్ని దారాల సూదుల్తో గుచ్చి/ దండలల్లి ఒక హోదాను కల్పిస్తాం/ కని పోషించడం మీకు తెలుసు/ కనిపించేట్లు అందలమెక్కించడం మాకు తెలుసు”అని చెప్తూనే “తీర్పు చెప్పే మా ఎర్రపెన్నుంది చూశారూ!/ సుప్రీంకోర్టు కన్నా గొప్పది/ తిరుగులేని తీర్పు చెపుతుంది”. (స్పాట్) అంటూ తలుచుకుంటే గురువు విద్యార్థిని సక్రమ మార్గంలో పెట్టడానికి ఏమైనా చేయగలడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.
కందుకూరి శ్రీరాములు గారు రాసిన ఈ “పలకల నుంచి పలుకుల వైపు” కవితా సంపుటిలో మొత్తం విద్యార్థుల్లో చైతన్యపరిచే కవితలు,ఆలోచింపజేసే కవితలు, అనుసరించే కవితలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని కవితలు కంటతడి పెట్టిస్తాయి. కందుకూరి వారి శైలి, శిల్పం అలంకారికత ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ఇవన్నీ ఉత్తమ మైన పలుకులు,పిల్లలకి, కాలేజీకి వెళ్లే యువకులకు ప్రోత్సహించే కవితలు ఇందులో ఉన్నాయి. ఇది అందరూ చదవదగ్గ పుస్తకం.

You may also like

Leave a Comment