ఏకధార (కందాళై రాఘవాచార్య గారి కవితా సంపుటి)
8790593638
ఎవరి కవితనైనా చదివిన తరువాత తన విలక్షణమైన స్పందనతో ఆకట్టుకునే కందాళై రాఘవాచార్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలురు.వీరు బండలింగాపురం( ఉమ్మడి కరీంనగర్ జిల్లా) వాస్తవ్యులు ,1969 నుంచి కవిత్వం రాస్తున్న సీనియర్ కవుల్లో ఒకరు. అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపుగా 4000లకు పైగా కవితలు రాశారు. నాకు సోమవారం కవి సమ్మేళనం ద్వారా పరిచయమైన కందాళై రాఘవాచార్య గారు తన విశిష్టమైన కవితా వస్తువులతో, కవిత్వంతో నన్ను ఆకర్షించారు. నేను అడగ్గానే తన తొలి కవిత సంపుటి “ఏకధార”ను నాకు 12-07-2021న పంపించారు. పంపిన రోజే దాన్ని పూర్తిగా చదివి అభిప్రాయం కూడా చెప్పాను.వారు చాలా సంతోషించారు కూడా. అనంతరం తనను మయూఖ ఆన్లైన్ పత్రిక కోసం ఇంటర్వ్యూ కూడా చేశాను. అందులో వారు ఎన్నో కొత్త విషయాలను వెల్లడించారు.
ఇక ఈ కవితా సంపుటి ” ఏకధారలో “మొత్తం 100 కవితలున్నాయి. ఈ నూరు కవితలు / రేపటి నారు కవితలని కవి ఎంతో ఆశాభావంతో చెప్పడంవల్ల కవిత్వం ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావచ్చు. ఈ సంపుటిలో నందిని సిధారెడ్డి రెడ్డి సార్ గారి ముందు మాటలు,తన చిరకాల మిత్రుడైన వి.పి చందన్ రావు గారి స్పందన విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఏ కవికైనా తొలినాళ్ళలో తన చుట్టూ ఉన్న వాతావరణం,పరిస్థితులు కవితావస్తులవుతాయి అందులో చెరువు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగప్పుడు,ఈతలు నేర్చుకుంటున్నప్పుడు, చేపలు పడుతున్నప్పుడు చెరువు బాల్యానికి విశేషమైన జ్ఞాపకాలను ఇస్తుంది. అందుకే గ్రామీణ వాతావరణంలో పుట్టిపెరిగిన ప్రతి ఒక్కరికీ చెరువుతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. అందుకే ప్రతికవీ చెరువు మీద కవిత రాయకుండా ఉండలేడు. కందాళైగారు కరువు కాలం నాటి చెరువుల గురించి ఏమంటారంటే “భూమి పూజ కాదు/చెరువు పూజ చేయాలి/ ఇప్పుడు ఉన్నవన్నీ పేరున్న చెరువులే/ నీరున్న చెరువులు కావు/అని చెరువులు ఎండిపోతున్న వైనాన్ని కళ్ళకు కడతాడు. సానుభూతి,సహానుభూతి ఉంటే తప్ప కవిత్వం రాదు. కవికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్వచనాలు ఇచ్చారు.కందాళైగారు ” కవి/ దుఃఖానికి చిరునామాగా /అందరి నోటా నానుతున్నాడని” కవికి కొత్త భాష్యం చెప్పారు. (దుఃఖం ద్వీపకల్పం). ఈ ప్రపంచం మొత్తం దుఃఖమే ఉందని రాస్తూ దుఃఖం హృదయ మథనంగా/ నిలువెత్తు మనిషిని నీరు చేస్తుంది/ దుఃఖానికి జవాబులు ఏ గ్రంథంలో దొరుకుతాయి” (దుఃఖద్వీపకల్పం) అని ప్రశ్నిస్తూనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడమే దుఃఖనివారణకు సరైన పరిష్కారమని పరోక్షంగా చెబుతాడు. సమాజంలోని సమస్యలను ఎత్తిచూపడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కవి లక్షణం. మన సమాజంలో అస్పృశ్యత ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది.అస్పృశ్యత గురించి కవులు ఎన్నో రకాలుగా కవితాస్త్రాలను సంధించారు. కందాళైగారు కూడా అస్పృశ్యతను ప్రత్యక్షంగా చూసి కవితాస్త్రాన్ని సంధించారు.”ఊర్ల ఓట్లకాడ అందరం ఒకటంటారు/ రమ్మంటరు – రాకుంటే లేప్కపోయి ఓట్లేపిస్తరు/ దొరలను అరుసుకున్నట్లు అరుసుకుంటరు/రాస్కుని పూస్కొని తిరుగుతరు/ అప్పుడు గిట్ల ముట్టుడు లేదు-అంటుడు లేదు/ ఈడ చాగిలాస దగ్గర ముట్టుడచ్చింది”(చాగిలాస) అని వాస్తవ స్థితిని మన కళ్ళకు కడతాడు,ఆలోచనలో పడేస్తాడు.
మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అన్యాయాలు,అక్రమాలతో భరతమాత దుఃఖిస్తూ ఉన్నదని చెబుతాడు. అందుకే “దేశం నాలుగు దిక్కులూ కన్నీటికి వేదికే/ కొన్ని కోట్ల జనాల కన్నీళ్ళతోనే సముద్రం పురుడు పోసుకుంది”(కన్ను జాగ్రత్త- కన్నీరు జాగ్రత్త). నేడు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు భూమి కరువవుతోందని ఇప్పుడు “దున్నేవాడిది కాదు భూమి /కొన్న వాడిదే భూమి/ కబ్జాతంత్రం చేసినవాడిదే భూమి /ఇక పంట భూమిలోని నాగలికి పక్షవాతం వచ్చినట్టే అని వాస్తవాన్ని మనకు తెలియజేస్తూనే “భూమిపై ఎవడూ జెండా పాతలేడు/భూమే అందర్నీ పాతేస్తుంది” అనే నగ్న సత్యాన్ని చెబుతాడు(కొన్న వాడిదే భూమి). అంతేకాకుండా ఈ కవిత సంపుటిలో భూమిపైనే రాసిన మరిన్ని కవితలు మనల్ని ఎంతో ఆలోచనలో పడేస్తాయి, ఆర్ద్రతను కలిగిస్తాయి. “భూమి జపం” శీర్షికన రాసిన కవితలోని కొన్ని కవితా వాక్యాలు ఒకసారి పరికించండి “భూమి ఈరోజు ఒకడిది /రేపు మరొకటిది/ చేతులు మారిన భూమికి ఇద్దరూ రక్తం అంటిస్తారు/ కొందరు జెండాలు నాటితే/ కొందరు తూటాలు చల్లుతారు/ అమాయకులు భూమిపై ఒరిగిపోతారు/ అని చెబుతూనే వర్షం పడని కాలం భూమికి ఆకాల జ్వరం – కరువు క్యాన్సర్ అంటాడు. “పంట భూమి పట్నం వాడి చేతిలోకి కట్నంగా పోతుంది/ ఏమీ లేని వాడికి భూమి లేమి బుక్కలేమి”/ అంటూ సామాన్యుని పక్షాన నిలబడతాడు.
తెలంగాణ తొలి దశ పోరాటాన్ని మలిదశ పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన కవి కాబట్టి చాలా విషయాలను కవితల్లో చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే కాకుండా తెలంగాణ భాష యాస సంస్కృతి నిలబెట్టుకోవడం కోసం కూడా తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది. దీనిపైన ఎందరో కవులు కవితలల్లారు. 2009 నుంచి 2014 వరకు మలిదశ పోరాటం అనంతరం మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందో అంటే అవి ఇలా చెప్తాడు “తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చినాక /తంగేడు పూలకు రాచరికం వచ్చింది” (పెరట్లో తంగేడు). తెలంగాణ సాంస్కృతిక కళారూపం బతుకమ్మ. దాంట్లో తంగేడు పువ్వుకు విశిష్టమైన స్థానం ఉంది. ఆంధ్ర పాలనలో బతుకమ్మకు అంతగా గుర్తింపు రాలేదు.తెలంగాణ వచ్చాకే బతుకమ్మ విశ్వసుందరైంది.
నిరాశ ఎంతటి మనిషిలోనైనా చైతన్య జ్యోతిని ఆర్పేస్తుంది. ముందుకెళ్లాలన్నా ఏదైనా సాధించాలన్నా ఆశాభావం అనేది చాలా ముఖ్యం.అందుకే కవి “అన్ని పంటల కన్నా/ఆశ పంట గొప్ప/ఆశ కోయవద్దు/ నిరాశ అసలు వద్దు/ నువ్వు బతితేనే /లోకమంతా బతుకు” (పొద్దుతిరగని పువ్వు) అంటూ ఉత్సాహం నింపే కవితా వాక్యాలు రాస్తాడు. వ్యక్తి బాగుపడాలన్నాదేశం బాగుపడాలన్నా,పాలకులు సరైన దిశలో పాలన కొనసాగించాలని చెబుతూ పాలకులు పదేపదే మాట తప్పడం వలన ప్రజలకు నమ్మకం పోతుందని మాట తప్పడం వాళ్ళకు సహజమైపోయిందని కవి వాపోతూ “వేదికలపై నినాదాలు, హామీలు అసంపూర్ణ వాక్యాలే” (అసంపూర్ణ వాక్యం) అంటూ పాలకులకు చురకలంటిస్తాడు”.ఉదయానికి అస్తమయానికి మధ్య ఎప్పుడూ ఒక సంపూర్ణ ప్రణాళిక దర్శనం కాదు /మళ్ళీ ఉదయం కాకుండానే అర్ధరాత్రి చంపబడుతుంది”అంటూ వారు ఏ విధంగా ప్రణాళికలను మధ్యలోనే వదిలేస్తారో ఎండగడతాడు. అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ .చూడాలే గానీ ప్రతి వస్తువులో కూడా కవికి కవిత్వం కనిపిస్తుంది.”మేడలు శుభ్రంగా ఉన్నాయి /మేడలోని చెత్తతో /నగరమంతా /చెత్త నగరం అయిపోయింది(చెత్త నగరం)అని చెత్త పై కవిత రాస్తూనే మనం చెత్తను నిర్లక్ష్యం చేసే తీరును కళ్ళ ముందుంచుతాడు. అలాగే” దిండు “పై కవిత రాస్తూ “ఈ దిండు/ఆమె సహస్ర శోకాలను దాచేస్తూ/ ఎన్ని కన్నీటి నదులను పీల్చిందో!/నాని నాని పిడుచగట్టుకపోయింది” నిజానికి ఆడవాళ్ళకి దిండే సాంత్వన చేకూర్చే మిత్రురాలిగా మారినట్టు అద్భుతమైన ఊహ చేశాడు.అదే కవిత చివరిలో ఇలా అంటాడు “ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ దుఃఖం ఎవరికీ తెలియదు/ఒక్క దిండుకు తప్ప”.
మన దేశంలో నక్సలిజం ఇంకా పూర్తిగా అంతం కాలేదు ఇప్పటికీ అక్కడక్కడ అడవుల్లో, కొండా కోనల్లో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరివైతేనేమి ప్రాణాలు ప్రాణాలే కదా! ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబానికి వారు దూరమైనట్టే కదా!ఎవరికైనా కడుపుకోత ఉంటుంది కదా!”అడవిలో కోయిలలు కూయడం లేదు/ తుపాకులు కూస్తున్నాయి రక్తరుతువంటూ( కోయరాని కోయిల) ఆ కవితలోనే “అడవి నిండా పూల తీగలు కాదు /యమపాశాలు వేలాడుతున్నాయి”.అని అక్కడి పరిస్థితిని హృద్యంగా చూపెడతాడు. టెక్నాలజీ ఇంత పెరిగినా వరకట్న సమస్య ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ వరకట్న భూతానికి మహిళలు ఇంకా చిత్రహింసలకు గురౌతూనే ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో స్త్రీ బలి అవుతునే ఉంది. “స్త్రీని వధించడానికి ఈ కట్న వ్యవస్థకు నూగారు చీర సైతం దుష్ట ఆయుధమే /నిరపరాధి చీర అపరాధిగా వేలాడుతోంది/ చీర తాడై ఆమె కట్టె అయిపోయింది/ ఇప్పుడు షోకేస్ లోని చీరలన్నీ నాకు తాళ్ళుగా కనిపిస్తున్నాయి” (చీరతాడు)అంటూ వాస్తవ స్థితిని మన ముందుంచి కంటతడి పెట్టిస్తాడు.
నేటి బాలలే రేపటి పౌరులు.పౌరులందరూ చదువుకొని ప్రయోజకులైతేనే కదా దేశం బాగుపడేది. నేటి కాలంలో చదువు నిర్బంధం చేసారు కానీ దానికి పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లలు హోటల్లలోనూ, దుకాణాలలోనూ ఎక్కడపడితే అక్కడ పనిచేస్తూ కనపడేవారు. వారిని చూసి కవి” బాల భాస్కరులు బతుకు కాలి బాల కార్మికులవుతున్నారు/చిచ్చరపిడుగులు చిచ్చుబుడ్డులై/ గుప్పున ఆరిపోతున్నారు”.( భాస్వరంలో బాల్యం) అంటూ వారి దీనస్థితికి చలించి పోతాడు.వర్ణనా నైపుణ్యం కలవాడు కవి అనేది పెద్దలు చెప్పిన మాట. అలాంటి వర్ణనా నైపుణ్యం పుష్కలంగా కలవారు కందాళైగారు “ఈ చలి ఏ మేడలోకి పోదు/అనాథలపైకి వృద్ధుల పైకి మాత్రం పోతుంది/ ఈ చలి రాత్రి/రేపటి ఉదయానికి చావు కబుర్లు అందిస్తుంది/ పాపం! సూర్యుడు వచ్చి అంత్యక్రియలను చూసి/పడమర అరేబియాలో సముద్ర స్నానం చేసి/ కిరణాలను పిండుకొని పోతాడు!!(చలిరాత్రి). ఎంత గొప్ప ఊహో కదా ఇది. ఇలాంటిదే మరో కవిత “ఒక్క సుఖ స్వప్నం కోసం ఎన్ని రాత్రులను మోసానో/ రెప్పలు ఉబ్బి ఉబ్బి సూర్యోదయాలైనాయి/ ఒక ఆనందభాష్పం కోసం/ ఎన్ని దుఃఖ జలపాతాల్లో తడిచానో/ వసంతం రాకముందే/ శిశిరం ఒంటినంతా మడత పెట్టింది/ఎడారిని పాదాలకు కట్టుకొని/ వీపుపై లోకాన్ని మోస్తున్నాను “(లోక బాధ).
అమ్మ మీద, నాన్న మీద,ఊరు మీద ,చెరువు మీద కవిత్వం వ్రాయకుండాఏ కవి జీవితం కూడా పూర్తికాదు. అందుకు కందాళై వారు కూడా మినహాయింపు ఏమీ కాదు. అమ్మ గురించి కవిత్వం రాస్తూ వారు అన్న” అమ్మ నాలో జీవనదిగా ప్రవహిస్తుంది” (అమ్మ నాలో జీవనది)అనే వాక్యం అమ్మ పట్ల తనకున్న ప్రేమను పట్టి చూపుతుంది. అలాగే నాన్న గురించి రాస్తూ”ఎవరెస్టు శిఖరంలా కనిపించే ప్రతి నాన్నలో /ధ్రువంగా దుఃఖ సముద్రాలు గడ్డకట్టి ఉంటాయి”(నాన్న ఏడ్చాడు)అనే వాక్యాల్లో నాన్న పైకి ఎంత గంభీరంగా ఉన్నా కూడా లోపల సముద్రమంత దుఃఖముంటుందనే విషయాన్ని స్పష్టపరిచాడు. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంటే గాని నాన్నకు దుఃఖం రాదు.
ఏ కవినైనా సంఘటనలు ఇట్టే కుదిపేస్తాయి , కవితా వస్తువులౌతాయి. లాతూర్ భూకంపం ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. ఊరూవాడా అన్నింటినీ ఊడ్చిపెట్టుకుపోయింది. దానిపై కందాళైగారు ” పంట పండించినవాడి కడుపులోకి పోలేదు/పండించిన వాడు భూమి కడుపులోకి పోయాడు/ ఇవి ఆకలి చావులా! కావు- నేలతల్లి ఉన్మాద హత్యలు/కలలుకనే రెప్పలు తెరుచుకోలేదు/భూమి తెరుచుకుని కలలను మూసివేసింది/ రెప్ప కింద ఇప్పుడు కలలు సమాధి/ రేప్పపై ఇల్లు సమాధి/ శ్మశానం ప్రత్యేకంగా లేదు/ ఊరి చివర స్మశానం ఏడుస్తుంది” అంటూ భూకంపం నాటి హృదయవిదారక దృశ్యాలను మన కళ్ళముందు నిలుపుతాడు.
ఈ సంపుటిలో ఉన్న కవితలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి.ఎంతో ఆవేదనతో రాసినవి. అధ్యయనం అభ్యాసం, తన కవితా సూత్రాలుగా జీవనం కొనసాగిస్తున్న కందాళై గారు73 సంవత్సరాల వయస్సులోనూ ఇప్పటికీ యువకులతో పోటీపడుతున్నారంటే కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమ మరియు నిబద్ధతే కారణం. ఇవి అందరూ అలవర్చుకోదగిన సుగుణాలు. ఇది అందరూ చదవదగ్గ పుస్తకం.
