డిస్కో సంగీతం కన్న పల్లెలో వినిపించే కోయిల కంఠస్వరం తీయగా ఉంటుంది. నల్లా నుంచి వచ్చే నీటికన్న ఏటిలో చెలిమె తోడి నీళ్ళు తాగే అనుభూతి గొప్పది. ‘మాజా’కన్న మామిడిపండును స్వయంగా తీసుకొని రసాన్ని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది! ఆనాడు ఒక్క పైసకే వచ్చే బెల్లాన్ని తింటే కలిగిన ఆనందం ఈనాటి చాక్లెట్ బిస్కట్లతో కలగడం లేదు. చెట్టు కింద కూర్చుని గాలి పీలుస్తుంటే కలిగే సౌఖ్యం ఏసిలతో రావడం లేదు. చిర్ర గోనె ముందు క్రికెట్ బలాదూర్. గుడ్డి దీపం ముందర పదవ తరగతి పరీక్షలకు చదివిన వజ్ర సంకల్పం ముందు భూరి భవనపు ట్యూబ్ కాంతిలో చదివే పట్టా విద్య దిగదుడుపే. వాన వెలిశాక మట్టి వాసన, ఆరుద్ర పురుగుల సర్కస్ ఫీట్లు, పిచ్చుకల మట్టి స్నానాలు, వెన్నెల్లో ఆడిన ఆటలు, ఎండాకాలం బావుల్లో ఈతలు ఈనాడేవి? మన చిన్నతనం మనకు చిన్నతనం కాదు. బాల్యం మళ్ళీ రమ్మంటే వస్తుందా? ‘‘అనుభూతుల్ని పోగొట్టుకున్న గుండె ఎడారి. అనుభూతుల్ని పదిలపరచుకున్న గుండె సతతహరితారణ్యం’’. ఇటువంటి మధురమైన భావాల సుమమాల డా॥నలిమెల భాస్కర్ ‘‘సుద్దముక్క’’.
మట్టిమీద నడవాల్సిన పాదాలు మార్బుల్ మీద నడుస్తున్నందుకు బాధగా ఉంది. మట్టినిలబెడుతుంది. మార్బుల్
పడగొడుతుంది. అమ్మ ఇల్లంతా పేడతో అలికితే, వారానికి సరిపడిన శీతల గంధస్పర్శ. ఆనాడు ఇల్లు, సమస్త కుటుంబ సభ్యులకు ఓ శీతలీకరణ కేంద్రం. అడుగున ఆలంబనగా మట్టినేల, చుట్టూ మట్టిగోడలు, కప్పుపైన మట్టి గూనపెంకులు. మట్టి పొయ్యి మీద మట్టికుండలో మట్టిమనుషులైన కాపు బిడ్డల చెమట చుక్కలు మెతుకుల రూపంలో. చేదబావి మట్టి ఫ్రిజ్. మట్టి వాకిలి, పేడ సాన్పు, సుద్దతో ముగ్గులు గృహ పుస్తకానికి ముచ్చటైన ముందుమాటలు. మట్టికీ ఇంటికీ మనిషికీ గల బంధం భాస్కర్ కవిత్వంలో ఆస్వాదిస్తాం.

భాస్కర్ మనిషిని రెండు కాళ్ళ గేహం అంటాడు. గృహానికీ దేహానికీ అద్భుతమైన పోలికలు చెప్తాడు. కాళ్ళు పిల్లర్లు. మోకాలిచిప్పలు ప్లింత్ బీములు. జీవకణాలు ఇటుకలు. బొక్కలు ఐరన్. మాంసం సిమెంట్. పై తోలు ప్లాస్టరింగ్. పుర్రె స్లాబ్. కళ్ళు కిటికీలు. ముక్కుపుటాలు శ్వాసకోశాలు, వెంటిలేటర్లు. నోరు ప్రధాన ద్వారం. పొట్ట సువిశాలమైన హాలు. గుండె వాటర్ ట్యాంక్. వీటిని కవిత్వీకరించిన తీరు భాస్కర్లాగా మరెవ్వరూ చేయలేరు.
ఇందులో శ్రామికజనజీవన చిత్రణం ఆర్ద్రంగా ఉంటుంది. శ్రామికుల ఋణం మనం తీర్చుకోవాలనిపించేలా చేస్తుంది. తమ బతుకుల్ని బండలకేసి బాదుకుంటూ మన బట్టల్ని గట్టున ఆరేస్తారు రజకులు. మన బట్టల్ని పిండీపిండీ వాళ్ళు తోలుబొమ్మలవుతారు. వాళ్ళు ఉతికిన దుస్తులతో మనం మన లోపలి ముఖాన్నీ మురికినీ చాటు చేసుకొని రోజూ నాగరికులమవుతాం. ఎవరి బట్టల్ని వారికి, తప్పిపోకుండా అందించే అమోఘమైన జ్ఞాపకశక్తి వారిది. ‘‘సమాజ కల్మషాన్ని కడిగివేయడానికి/ కంకణధారులైన వ్యక్తులు సంస్కర్తలయినప్పుడు/ తరతరాలుగా మైలబట్టల్ని/ మల్లెపూలు ఉల్లిపొరలూ చేసేందుకు/ కటి బద్ధులైన వీళ్ళూ సంస్కర్తలే’’.
చెప్పులు కుట్టేవాడురెక్కలూడి విలవిలా కొట్టుకుంటున్న మన పాదరక్షలను ఆప్యాయంగా సేదదీరుస్తాడు. ‘‘తెగిన మన వేళ్ళనీ/ ఊడిన మడమల్నీ/ ఏ సంజీవనితో అతుకుతాడో కాని/ మళ్ళీ మన కాళ్ళు క్షణంలో రెక్కలౌతాయి’’. మడిచిన తన మోకాలిమీద గడ్డం ఆనించి అతనలా తదేక దీక్షతో మన పాదరక్షల్ని కుడుతుంటే ఈ కవికి, బట్టలు తొడుక్కున్న వేమనయోగి భంగిమ గుర్తుకొస్తుంది. బ్రహ్మ కడిగిన పాదమైనా అతనికి బలాదూరే. మగ్గం ముందు చేనేత కార్మికుని ఆకారం ‘‘తన కాళ్ళూ చేతుల్ని/ లయబద్ధంగా కదుపుతూ/ కళ్ళల్లో వత్తులూ పత్తులతో పాటు/ దారాలు వేసుకొని/ వాటిని తన కన్నీళ్ళతో పిండి/ చెమటతో తడిపి/ నెత్తురులద్ది/ మన కళ్ళముందే పడుగూ పేకల్ని కలగలిపి/ ఒక వస్త్రాన్ని తయారు చేస్తుంది. అతని గుండెనిండా లబ్డబ్ శబ్దం బదులుగా లట్కురం పొట్కురం శబ్దమే వినిపిస్తుంది. చేనేత వాళ్ళయినా, చెప్పులు కుట్టేవాళ్ళయినా, రజకులైనా
ఈ కవి వాళ్ళ జీవితాల లోతుల్లోకి వెళ్ళి కవిత్వం రాసినట్టుగా ఉంటుంది.
వాన గురించి ఇందులో ఉన్నది కమ్మని కవిత్వపు సోన. మొగులు మెత్తవడుతది. గాలి ఇసిరిసిరి కొడుతది. మొగులు మీద ఇసుర్రవుతులు తిరుగుతున్నట్టు గుడగుడ మొదలయితది. చినుకు పడుడు ఆలిశెంబూమిలకెల్లి బువ్వ వాసన వస్తది. మేఘాలు నేల మీద చేసే తొలి సంతకం వాన. పడిన ప్రతి చినుకూ కంచంలో మెతుకై పరిణమించడం అసలు సిసలైన వాన. ‘‘రైతులు శెమ్ట వడిపితే/ పొలంలకెల్లి సెంటత్తది
పంటత్తది’’.
నలిమెల భాస్కర్కు ‘‘పుస్తకాల షాపులోనో/ పుస్తక ప్రదర్శనలోనో కాలు పెట్టడమంటే/ పూలతోటలో అలా హాయిగా విహరించి రావడం/ పుస్తకాన్ని ఎత్తిపట్టుకోవడమంటే/ రచయితను మన చేతి పొత్తిళ్ళలో/ ఒడుపుగా ఓలలాడిరచడం లాలించడం’’. అతనికి ప్రతిదీ కవిత్వమే. చెట్లకు నీళ్ళు పోసి వాటి దాహం తీరుస్తుంటే కవిత్వం రాసినంత సంతోషంగా ఉంటుంది. కాపు బిడ్డలు పొలంలో వంగి నాట్లు వేస్తుంటే సామూహిక కవి సమ్మేళనం గుర్తుకు వస్తుంది. పెరట్లో రకరకాల పూలు రంగులతో వికసిస్తుంటే తనకు మల్టీకలర్ పుస్తకం వేసుకున్నంత ఆనందంగా ఉంటుంది. ‘‘రైలు భూమ్మీద ఊయలలూగే నావ/ దేశం పెట్టెలు పెట్టెలుగా కనిపిస్తుంది/ అసలు సిసలు దేశం జనరల్ బోగీలోనే ప్రత్యక్షమవుతుంది/ పట్టాల పాదాలమీంచి దూసుకువస్తోన్న రైలు/ ఒక ద్విపద కావ్యంలా/ అద్భుతమైన దీర్ఘ కవితలా అనిపిస్తుంది’’.
డా॥నలిమెల భాస్కర్ బహుభాషా కోవిదుడు. అనువాదకుడు. ‘‘మా అనువాద కలాలతో ప్రపంచ సాహితీ పరిమళాల్ని మట్టి అంతటా పరుస్తాం. మాది అనువాద కులం/ మేం అనువాదకులం’’ అని సగర్వంగా ప్రకటిస్తాడు. ఈ కవి ఎన్ని ప్రదేశాల్ని తిరిగినా, ఎన్ని సాహిత్యాల్ని చదివినా స్థానికతను మరువడు. బహు భాషకరుల జిల్లా అయిన కరీంనగరంను ‘‘ఇది ఆదిమానవుని/ కాలితో క్యాలితో పునీతమైన పుడమి/ శాతవాహనుల ఏలుబడిలో/ చేవదేరిన శాగవారిన జాగ/ ఒక్క గాథాసప్తశతి చాలు/ ఇది హాలుని నేల/ కథాసరిత్సాగరాలకే కాదు/ కవితా నవలాది సకల సాహిత్య ప్రక్రియలకిది ఆలవాలం’’ అని ప్రశంసిస్తడు. ‘‘మానేరు కవులారా! మీరు కవిత్వం రాయడం మానేరు సుమా!’’ అని వెన్ను తడుతడు.
‘‘నలిమెల కవిత్వంలో కళ్ళు` ‘‘కదులుతున్న శరీరం తోటలో/ ఒకే తీరు సౌష్ఠవం కలిగి/ విరబూసిన సున్నితమైన కలువలు/ ఈ రెండు కళ్ళే ఈరేడు లోకాల వాకిళ్ళు/ ఈ రెండు కళ్ళే ఏడేడు పదునాల్గు భాషాసాహిత్యాల లోగిళ్ళు’’. చెట్లు పెడస్ట్రల్ ఫ్యాన్లు. మట్టికుండలు ఆదిలాబాద్ నుండి తరలివచ్చిన మట్టి గుండెలు. సహజ శుద్ధ శీతల రంజనిలు. ఉగాది కవితలో కొత్తకుండ తనను మట్టి నుండి సృష్టించిన కుమ్మరి గురించి కన్నీరు కుమ్మరిస్తుంది. నీరుమనస్సు నీరునీరౌతుంది. చింతపండు చింత పడుతుంది. బెల్లం ప్రశ్నిస్తుంది.
‘సుద్దముక్క’లో సామాజికత తక్కువేంలేదు. ‘‘ఈ తక్కెడకు/ ఎలానూ వ్యక్తిత్వం లేదు/ ఏ వైపున కొంత ద్రవ్యం పడ్డా/ అటు వేసే మొగ్గు చూపుతుంది/ గత్యంతరం లేక/ వ్యక్తిత్వం లేని తక్కెళ్ళ చేతనే/ అసంఖ్యాక జీవితాలు తూచబడుతున్నాయి’’ అన్నప్పుడు నేటి రాజకీయం, అధికారగణం, అవినీతి స్ఫురిస్తాయి. ‘‘కనీసం కొలిచే వ్యక్తైనా/ తక్కెడ కాకుండా ఉంటే చాలు’’ అనే దాంట్లో మనుషులు నిజాయితీపరులు కావాలనే ఆకాంక్ష ఉంది. ‘‘ముక్కు ఉక్కులా తయారవ్వనంతకాలం/ ఈకల్లో బాకులు మొలవనంతకాలం/ కోడి మెడ/ పిల్లికి సరదా’’ అనే పంక్తుల్లో బాధితులు సాయుధులు కావాలనే సందేశం ఉంది. ‘రూపాయిబిళ్ళ’ కవితలో మానవాళిని ‘మనీ’ గారడివాడు కోతిని ఆడిరచినట్లు ఆడిస్తున్నది. నాణెంలో బొమ్మాబొరుసుల స్థానంలో ప్రాణమున్న మనిషిని, మానవత్వాన్ని నిలబెడదాం రండి అని ఆహ్వానిస్తున్నాడు.
ఈ పుస్తకంలో ఇవన్నీ ఒక ఎత్తు. ఉపాధ్యాయుని గురించి, సుద్దముక్క గురించి రాసిన ఆరు కవితలు మరో ఎత్తు. ఆరు కవితలలో నలిమెల భాస్కర్ ఉపాధ్యాయున్ని ప్రపంచాన అగ్రభాగాన నిలిపాడు. అధ్యాపకునికి అక్షరాభిషేకం చేశాడు. ‘‘అతడు కాలు మోపడం తోటే అణువణువూ అక్షరమవుతుంది/ అతని మాటల రెక్కల మీద/ పిల్లలు అత్యంత సురక్షితంగా/ జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు’’ అని ఉపాధ్యాయుడి ఔన్నత్యాన్నీ, ‘‘క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారీ/ అతని కుడిచేతికి ఆరో వేలు/ అదనంగా మొలుస్తుంది/ అది ఖచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని సుద్దముక్కే’’ అని చాక్పీస్ ప్రాధాన్యాన్ని వెల్లడిస్తాడు. అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరీ. పాఠం చెబుతుంటే జ్ఞాన కచేరీ. పాఠం చెప్పీ చెప్పీ అతని ఊపిరితిత్తులు ఉత్త ఉలిపిరి తిత్తులవుతున్నా విద్యార్థులకు జ్ఞాన జ్యోతులు పంచుతాడు. విద్యార్థులకు అతడు బోధవృక్షం. సంచార బృహద్గ్రంథం. టీవీ పాఠాలు అతనికి ప్రత్యామ్నాయం కాదు. అతడు రక్తమాంసాలతో అపార ప్రేమాభిమానాలతో పిల్లల ముందు కదలాడుతున్న తల్లి, తండ్రి, మిత్రుడు, వేదాంతి. అతని దృష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడమంత పవిత్రమైన కార్యం మరొకటి లేదు. అతడొక కాంతి నక్షత్రం. ఈ దీపం వెలుతురులో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తయారయ్యారు.
సుద్దముక్క సూర్యగోళం నుండి కోసుకొచ్చిన రశ్మి శకలం. చందమామ నుండి తీసుకొచ్చిన వెన్నెల గడ్డ, అన్నప్పుడు భాస్కర్ కవిత్వం తారాస్థాయికి చేరుతుంది. సౌందర్యోపేతం అవుతుంది. చాక్పీస్ విద్యార్థులకు ‘‘సమస్తమైన దిక్కుల్ని నిర్దేశించగల చుక్కాని/ తరగతికి వెళ్ళే ఉపాధ్యాయునికి ఊపిరి గుళిక/ ఉపన్యాసకులకు ఊతకర్ర’’.
సహజంగా, సులువుగా, ఆత్మీయంగా, త్యాగమయంగా ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నపుడు ఊగే పిల్లల ముఖాలు చూడాలి. పూవుకు తావిలా, పిల్లలకు చదువు సంస్కారాలు అబ్బినపుడే విద్యకు సార్థకత. పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పినప్పుడే సార్థకత. భాస్కర్ దృష్టిలో ‘‘ఈ భూమండలం మీద ఏకైక లోకైక దర్శనీయ స్థలం బడి’’.
‘సుద్దముక్క’ తెలుగు కవిత్వంలో ఓ వజ్రపు తునక. ఇందులో అడుగడుగునా కవిత్వం. అణువణువునా నవత్వం. ప్రతివాక్యం ఆస్వాదయోగ్యం. అనుభవైకవేద్యం. డా॥నలిమెల భాస్కర్ ఈ పుస్తకాన్ని చదివిన పాఠకులను జ్ఞానపీఠం మీద కూర్చోబెడతాడు.
ప్రతులకు :
డా॥నలిమెల భాస్కర్
97043 74081
1 comment
https://shorturl.fm/A5ni8