” మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె ” ఓ పల్లె కథల దృశ్యచిత్రం. మనిషి మనిషి అంతర్నినాదం.
ప్రతి ఊరు తనకంటూ ఒక చరిత్ర కలిగి ఉంటుంది. కానీ, మంగలిపల్లె చరిత్ర మాత్రం బతుకు కూకటివేళ్లలో దాగిన ఓ దుఃఖగాధను ప్రతిబింబిస్తుంది. బొగ్గు బాయిల కడలి కడుపు నుంచి ఉద్భవించిన ఆ ఊరు, ఇప్పుడు జ్ఞాపకాలలో మాత్రమే మిగిలివుంది. ‘ఊరంటే మనుగడ.. ఓ మమకారం’ అని చాటిచెప్పే కథకుడు నరేష్కుమార్ సూఫీ. ఈ పుస్తకంలో ఆ మనుగడ అంతరిస్తున్న తీరును ధ్వనిపూర్వకంగా ప్రస్తావించాడు. అతని అక్షరాక్షరంలో ఆ మట్టివాసన ఇంకా పరిమళిస్తూనే ఉంది.

“మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె” ను చదువుతుంటే అది ఓ కథల సంకలనంగా అనిపించదు. ఒక మట్టిచరిత్ర జీవన గ్రంథంగా అనిపిస్తుంది.
‘ఓపెన్ కాస్ట్ మైనింగ్’ అనే ‘ఆధునిక నాగరికత బుల్డోజర్’ పల్లె ఊపిరిని ఎలా పిండి, పీల్చి, పిప్పి చేస్తుందో తెలియజేసే ఓ కథాకథనం. ఆ ధూళి కణాల్లో విలవిల్లాడుతూ కొట్టుమిట్టాడుతున్న జీవుల బతుకుల్ని అక్షరాలధ్వనితో సూఫీ కళ్లకు కట్టిస్తాడు.
ప్రతి కథ వెనక ఒక ముఖం దాగి ఉంటుంది. రాయమల్లు, రాజేశం, ఎంకటేశం, సమక్క చెట్టు, బొగ్గు బాయి… కేవలం ఒక గ్రామమే కాదు. ఒక భావనాత్మక ప్రకృతి దృశ్యచిత్రం. వాళ్ళు బతికిన ఊరు కూలిపోయింది కానీ, ఆ విషాథకథలు మాత్రం ‘మెమొరీస్’ రూపంలో సజీవంగా నిలిచిపోయాయి.
ఈ పుస్తకంలో వాడిన భాషకు ఒక ప్రత్యేకత ఉంది. అది పల్లెభాష. ఓ గ్రామీణ పిలుపు. ఖండ్రిక సాంస్కృతిక నేపథ్య బాధ. చదువుతుంటే అక్షరాలు కాదు, మనసే మనిషిలోకి తొంగిచూసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది.

అలా చదివిన ప్రతి పేజీలోనూ ఓ ‘మంగలిపల్లె’ మెదులుతుంది. మన ఊరు, జ్ఞాపకాలు, భూమి.. ఏదీ కాలానికి అతీతం కాదనిపిస్తుంది.
సూఫీ కలంలో బొగ్గుధూళిని కాదు, మనుషుల చెమటను ప్రేమస్పర్శతో నింపుకున్నాడు. పీల్చుకొని బతుకుతున్నాడు. ఆ వాక్యాల్లో తొంగి చూసే కంటతడి ఉద్వేగంతో మౌనంగా బాధిస్తాయి. అదే సమయంలో మనసును తడిమనసుతో ఆరబెడుతుంది. మృదువైన తాకిడితో స్పృశిస్తుంది. ఎందుకంటే అవి సత్యదూరానికి చేరువగా నిలుస్తాయి.
ఈ “మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె” చదవడం పూర్తయ్యాక చివరికి అది మనలో ఓ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ ఊరు నాశనం మన అభివృద్ధికి ధ్రువపత్రమా? లేక అమానుషత్వానికి మరణ శాసనమా? అని అనిపించక మాత్రం మానదు.


