‘అల్మారా’ మూడక్షరాల పదం. అతి సామాన్యుడికైనా, అపర కుబేరుడికైనా అత్యంత ముఖ్యమైన వస్తువు. స్థాయిని బట్టి నిర్మాణపరమైన తేడాలుండ వచ్చేమోగానీ అవసరంలో మాత్రం అందరిదీ.
కవి దాసరి మోహన్ గారు ‘దండెం ‘ మీద ఆరేసిన బట్టల్ని మడత వేసి ‘అల్మారా ‘ లో సర్దినట్టున్నారు. రండి, ఒకసారి తెరిచి చూద్దాం.
భరించడానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన అమ్మ పోర్టుఫోలియో లన్నిటిని చక్కబెట్టుకుంటూ త్యాగాల తోరణాలను గుమ్మానికి కట్టి, బొట్టుపెట్టెలో కన్నీటి బొట్లను దాచుకొని, తనివి తీరా ఏడవడానికి ప్రైవసీ కోరుకుంటుందంటూ కవితా సంపుటిని అమ్మతోనే ప్రారంభించారు.
తండ్రిని బాధ్యతల భూగోళం మోసే హెర్కులస్ అనీ, అతని అడుగుజాడలే జీవిత పాఠాలనీ, చెమట బిందువులు గంగాజలమంత పవిత్రమైనవని అంటూనే శక్తి సన్నగిల్లిన అతని దేహాన్ని పాలు పితకలేని పొదుగు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు.
గుండె కింది పాయకు ఆనకట్ట కట్టి,కొవ్వొత్తిలా కరిగిపోతూ ఇంటిని బృందావనంలా, సప్తవర్ణ సింగిడిలా మార్చే ఇల్లాలి ఔన్నత్యానికి, ఔచిత్యానికి మెచ్చి బతుకు చుక్కాని అని అంటూ కితాబిస్తారు.
అడవి ఆనంద తాండవం జింకలకు ప్రాణహాని లేదిక/
గంగ యమున నదులన్నీ
స్వచ్ఛ రాగాల నృత్య హేల/
అంటూ పర్యావరణాన్ని దెబ్బతీసే మానవ తప్పిదాలపై ధ్వజమెత్తారు.
ఎండోమెంట్ ఎరుగని పేద దేవుళ్లను స్తుతిస్తూ, పాదుల వేదికలపై పక్షులతో పాట కచేరీలు నిర్వహిస్తారు. రాలిన పూలలో రంగోలిని, కొమ్మల్లో కూచిపూడి ముద్రల్ని చూసి ప్రకృతికి పట్టాభిషేకం చేస్తారు.
పాత జ్ఞాపకాల్ని తోడటానికి గుప్పెడంత గుండెబావిలోకి పాతాళగరిగె వేస్తారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు అది సింధువును ఇముడ్చుకున్న బిందువని వారికి తెలుసు.
ఎంత ఆడితే అంత/ ఇంటిల్లి పాదికి తమాషా/ శిలువ మాత్రం నీ పైనే హమేషా/
అంటూ
గాలిపటం ఎంత ఎత్తులో ఎగిరినప్పటికీ, దానికి ఆధారమైన దారం మరొకరి చేతిలో ఉన్నట్లుగానే, కుటుంబ భారాన్నంతా మోసే మనిషి బంధాలకు బానిసైన తీరును ‘పతంగి బతుకు ‘ అంటూ తన చిత్రాన్ని తానే గీసుకుంటారు.
ఎదలో గుచ్చిన ముల్లు వేయి క్యూసెక్కుల ప్రవాహమై స్రవిస్తూనే ఉంటుందని మాటను తూటాగా ప్రయోగించే మనుషులపై ఘాటుగా స్పందిస్తారు.
మువ్వల పట్టీల్ని సందుకలో పెట్టి తాళం వేసినా, గెరిల్లా వీరుల్ని అల్మారాలో బంధించినా అది వారికే చెల్లు.
గుండె ఆగిన రోజు గడప లోపల ఎంత తొందరో /
అంటూ మనిషి జీవితం ప్రకృతితో మమేకమైన తీరును స్పష్టంగా వివరిస్తారు.
కీమోథెరపీ కొలిమి/ దేహమి ప్పుడు ఆకులు రాలుతున్న వృక్షం/ నన్ను నేరుగా చూసే ధైర్యం చాలడం లేదు/
క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీతో మనిషి శరీరంలో కనిపించే మార్పులను హృద్యంగా వర్ణించారు.
కట్టప్ప వచ్చి కత్తితో పొడిచినా బాగుండు/ ఈ పాటకి శుభం కార్డు పడేది/
అంటూ క్యాన్సర్ వ్యాధితో విలవిల్లాడే రోగి దైన్యాన్ని తెలుపుతూనే,
లోకమంతా నన్ను మొదటిసారి పొగిడేది/
మనిషి బ్రతికున్నంత వరకు విలువను గుర్తించని సమాజం(కొంతమంది) ప్రాణాలు గాల్లో కలిశాకగానీ అనుకూలతలను ఏకరువు పెట్టదంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తారు.
మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలక బోసుకునే మనస్తత్వాలకు(ఇంకాస్త) చురక లంటిస్తారు.
కళ్ళెదుట ఎన్ని వసతులున్నా, మరెన్ని వనరులున్నా వాటన్నిటినీ సద్వినియోగ పరుచుకొని తన్ను తాను నిరూపించు కోవడంలోనే విజయరహస్యం (ఏదో) దాగుంటుందని చక్కని సందేశాన్నందించారు.
సామాజిక మాధ్యమాల సాలెగూటిలో చిక్కి విలవిల్లాడే మనుషులను తప్పులో తలో చెయ్యేసి కర్మ పాట పాడే కనికట్టు లోకమంటూ నిరసిస్తూనే, నిలువునా ముంచే నీలిచిత్రాల బారి నుండి ఆడపిల్లను అర్జెంటుగా దాచి పెట్టండంటూ హెచ్చరిస్తున్నారు.
ఎదిగిన తొవ్వెనక, ఎగరేసిన జెండా కింద ఊతమై, ఊపిరై నిలిచిన వారెందరో ఉంటారనీ, వారందించిన స్ఫూర్తిని ఏ స్థితిలోనూ మరవకూడదనీ హితవును బోధించారు.
తెలుగు ద(ధ)నాన్ని హరించి వేస్తున్న ఆధునికతకు వగచి మల్లెతీగను మన్నించమని వేడుకుంటారు.
నాగరిక మోజులో వాడిపోయే పచ్చందాలను కరోనా అద్దంలో కళ్ళకు కడుతూ, పల్లెతల్లి ఒడిలోని లాలనను జ్ఞప్తికి తెస్తారు.
ఊరి తొవ్వలో వాయిలి చెట్ల వయోలిన్ రాగాలు వింటూ మూలికల్లో ముక్కోటి దేవతలను కొలుస్తారు.
టెన్షన్ చొరబడని కోటగోడల్లో వారికి వారే రాజై,మంత్రై కలం,కాగితం పట్టుకుని మరో కవితా సంపుటికి వ్యూహరచన చేయాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..
