భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది.
వివాహమంటేనే ఒక పవిత్ర బంధం, రెండు కుటుంబాల కలయిక, అనుబంధాల పెనవేత. అప్పటిదాకా అపరిచితులుగా ఉన్న రెండు ప్రత్యేక వ్యక్తిత్వాలు తమ జీవన మనుగడ కోసం.. కష్టసుఖాలలో పాలుపంచుకునే తోడు కోసం నమ్మకమనే సూత్రంతో మనసులను పెనవేసుకుని ఆదర్శ జీవనం కోసం వేసే తొలి అడుగులు ఆ ఏడు అడుగులు
ఈ చిత్రంలో మన సమాజంలో పెళ్లి అనే పవిత్ర బంధం ప్రారంభం అవడం, చివరికి అది విడాకుల వరకు ఎలా చేరడాన్ని చూపుతోంది.
ఎన్నో కలలతో ఆశలతో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడుతున్న వధువు/ వరుడి మనసులో వరుడు/ వధువు. తన జీవిత సామ్రాజ్యానికి రారాజు/రారాణి. మంగళసూత్రం తమ ఇద్దరినీ ప్రేమతో బంధించే పవిత్ర మంత్రం.
అయితే అందరూ ఈ బంధంలో విజయవంతంగా కొనసాగుతున్నారా..!? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. భిన్నాభిప్రాయాలు, ఆర్థిక సమస్యలు, అహంకారాలు, కుటుంబాన్ని దెబ్బతీసే వ్యాసనాలు.. ఇవన్నీ కలసి లేదా ఏదో ఒక్కటి భార్యాభర్తల బంధాన్ని ముళ్ల దారిలో నిలబెడుతున్నాయి.
చిరునవ్వులతో, చిరుకోపాలతో మొదలైన విభేదాలు క్రమంగా మనసులను వేరు చేసుకునేదాకా వస్తోంది. ఈ రోజుల్లో అయితే మరీ వేగంగా వివాహాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఇందులో ఏ ఒక్కరినీ బాధ్యులుగా చేయలేము. వారి వారి కుటుంబ నేపథ్యాలు, ప్రవర్తన కూడా ఒక కారణమే..
ఇప్పుడు జరుగుతున్నవి ఒకప్పటిలా బాల్యవివాహాలు కాదు. పూర్తి మెచ్యూరిటీతో మసులుకోగల వయసు వచ్చినాకే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయినా ఒకప్పటిలా నిలవడం లేదు.
ఎన్నో ఆశలు, కలలతో ఎంతో ఆర్భాటంగా, వైభవంగా లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్న పెళ్లిళ్లు ప్రణాళికలు వేసుకున్నంతకాలమైనా నిలవడం లేదు. ప్రేమ, అనురాగం, నమ్మకం, కొరవడిన జంటలు తీవ్ర తర్జనభర్జనల అనంతరం న్యాయస్థానాల ముందు నిలబడటం విచారించవలసిన విషయం. కానీ ఇది ఇప్పుడు పెరుగుతున్న వాస్తవం. నేటి కాలంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా విరిగిపోతున్నాయి
పెళ్లి కేవలం వేడుక కాదు, ఒక సుదీర్ఘ ప్రయాణం.. ఒకరికొకరు ఇచ్చుకునే భరోసా.. అదే నేడు కరువై.. బంధం బరువై అర్ధాంతరంగా వదిలి వేసే పరిస్థితి.
కుటుంబ విలువలు, సర్దుకుపోయే స్వభావం..ప్రేమలో నిజాయితీ, బాధ్యతలో నిబద్ధత, ఒకరి పట్ల ఒకరికి ప్రేమా గౌరవం ఇవి ఇరువురికి సమానంగా ఉన్నప్పుడే వివాహం నూరేళ్ల ఉత్సవమై వెలుగుతుంది. తుది శ్వాస దాకా నిజమైన తోడై వెంట నడుస్తుంది.
అనూశ్రీ గౌరోజు

1 comment
https://shorturl.fm/hnBxr