Home వ్యాసాలు “సదాశివుడు అంటే అందరికీ ప్రియమైన వాడే”

“సదాశివుడు అంటే అందరికీ ప్రియమైన వాడే”

by Devaraju Revathi

తెలంగాణలో తెలుగు భాషకే వన్నె తెచ్చిన సామల సదాశివ దహెగాం మండలంలో తెనుగు పల్లెలో పుట్టటం యాదృచ్చికమే. కాని అదే కీర్తి కిరీటంలో కలికితురాయి. అందుకే ఆయన “అందరి బంధువయ్యాడు”. మా నాన్న కీIIశేII దేవరాజు సాంబమూర్తి గారితో సహచరునిగా డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పని చేయటంతో మాకు ఆత్మీయ అనుబంధం సదాశివ గారి కుటుంబంతో ఏర్పడింది.

సామల సదాశివ గారి తండ్రి నాగయ్య గారు తాలూకా కేంద్రమైన వాంకిడిలో ఉద్యోగ రీత్యా పని చేసినా అక్కడి ప్రజలతో మమేకమై ఎందరో విద్యార్థులకు గురువుగా ఇరుగు పొరుగులకు పితృ సమతుల్యంగా వాత్సల్యం అందించారు. అప్పుడే “గయోపాఖ్యానం” నాటకం వ్రాసి వేషాలు వేయించి దర్శకత్వం వహించి ప్రదర్శింప జేసారు. ఆ దృశ్యాలన్నీ బాల్యంలో వున్న సదాశివ గారి హృదయ ఫలకంలో సుస్థిర స్థానం పొందాయి. మరాఠీ భాషా ప్రభావం వల్ల పద్యాలు కంఠస్థం చేశారు.

సదాశివ గారి బాల్యం, ప్రాథమిక విద్య వాంకిడి, మిడిల్ విద్య ఆసిఫాబాదులో 7వ తరగతి వరకు సాగింది. అదే తరుణంలో గోండు వీరుడు కుమ్రం భీమ్ గిరిజనుల హక్కుల కోసం పోరాటము చేసి నిజాం ప్రభుత్వ సైనికుల చేతిలో అమరుడయ్యాడు. ఆయన శవంను సదాశివ గారు చదువుతున్న పాఠశాల ముందున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆ సంఘటనతో భీం వీరోచిత పోరాటం, గిరిజనుల కష్టాలు, ప్రభుత్వ మొండి వైఖరి ఆయన మనసుపై సుస్థిర స్థానం పొంది ఆలోచనలకు తెర లేపాయి. మరొక సంఘటన ఒక సోదరి అకాల మరణం. తండ్రి నాగయ్య ఉద్యోగానికి రాజీనామా చేయటం సదాశివ గారి జీవితాన్ని మలుపు తిప్పాయి. అప్పటికే మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై ఉండటంతో ఉద్యోగంలో చేరక తప్పలేదు.

సిర్పూరు కాగజునగర్ మిడిల్ స్కూలులో 1947 జులై 24న గురువుగా గురుతర బాధ్యతలు స్వీకరించి శాశ్వతంగా గురువు స్థానం నిలబెట్టుకున్నారు. కొద్ది రోజులు లక్షెట్టిపేటకు బదిలీపై వెళ్ళినా తిరిగి వచ్చి – 1954 ఆగస్టు వరకు అక్కడే ఉద్యోగం చేస్తూ సేవలందించారు. కోటగిరి నారాయణ గౌడ్ వంటి ఎందరో విద్యార్థులను విజ్ఞాన దీపాలుగా తీర్చి దిద్దారు.

ఆ తరువాత ఆసిఫాబాదులో విద్యా పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. రెండవ దశలో 1959 నుండి రెండేళ్ళ పాటు సిర్పూరులో మూడవ సారి 1976 నుండి 1980 వరకు వాంకిడిలో పని చేసి మాతృభూమితో మక్కువ పెంచుకొని సేవలందించారు. సామల సదాశివ గారి ఎదుగుదలను చూసి వారి తండ్రి నాగయ్య గారు ఎంతో సంతోషించి వారి మిత్రులతో చెప్పి ఆనందించే వారట. కానీ కొడుకును చూస్తే పొగిడేవాడు కాదట. కొడుకును ముందర పొగిడితే ఆయుఃక్షీణ మని భావించేవారట. అంతే గాకుండా తొలి కాన్పులో పుట్టిన పాపను అధిక గారాబం చేయటం వలన జరిగిన నష్టం కారణంగా సదాశివను సాధారణంగా చూసేవారట.

నిష్కల్మషంగా సదాశివ గారితోని ప్రేమ పంచుకునే మరో కుటుంబం జిల్లాలో తొలి గిరిజన పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి గిరిజన శాఖా మంత్రి స్వర్గీయ కొట్నాక భీంరావు గారి కుటుంబం. వాంకిడి మండల కేంద్రానికి సమీపంలో ఉండి గ్రామంలో విద్యార్థి దశ నుండి కలిసి మెలిసి తిరిగిన భీంరావు బంబారా గ్రామ నివాసి. ఈ విషయాలన్నీ సదాశివ గారి “యాది” రచనల్లో తరచూ గమించవచ్చు. మాస్టారు అన్ని రకాలుగా ఎదగడానికి వాంకిడి అందించిన మమతానురాగాలన్నది సదాశివ గారి కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయం. వాంకిడి అవ్యాజ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలతో తడిసి ముద్దెå రుద్రాభిషేకం పొందిన సర్వ విద్యల ఈశానుడు సదాశివుడే.

తండ్రి నాగయ్య గారు వేయించిన గయోపాఖ్యానం నాటకంలో పద్యాలు కంఠస్థం చేయడం సదాశివ గారి మనసును సాహిత్యం వైపు త్రిప్పింది. జీవితంలో కొత్త మజిలీ ఆరంభానికి తొలి అడుగుగా చెప్పవచ్చు. అతడు ఆంధ్ర నామ సంగ్రహం వంటి లక్షణ గ్రంథాలు చదువటం, తండ్రి నాగయ్య గారు ప్రోత్సహించటంతో దైవ స్తుతిగా వాంకిడిలో వున్నపుడే “సాంబశివ శతకం” రచించారు. అదృష్టమేమంటే సాహితీ పోషకులుగా వాంకిడిలోని కళాపిపాసి కర్నె వసంత్ గారి తండ్రి కర్నె వెంకట నర్సు ముద్రణ బాధ్యత వహించారు. వారి పద్యాలు కూడా రసరమ్యంగా వుంటాయి.

వాంకిడి, తెలంగాణలో గిరిజన ప్రాంతాల సాగునీటి కరువున్న ప్రాంతం. నాటికీ నేటికీ ఈ ప్రాంతం అంతే. ఇక్కడ పండే అవిసె గింజల నూనె నిత్యం వినియోగించేవారు. అవిసె పూలు, ఆవాల పూలు నీలి, పసుపు రంగులలో రహదారి కిరువైపులా అలరారడంతో నీలమేఘ శ్యాముని స్తుతిస్తూ “వేంకటేశ్వరా” మకుటంతో “అతసీ కుసుమోపమనీల గోత్ర” అంటూ వృత్తాలు వ్రాశారు. తర్వాత  “వృషభగిరి నివాస వేంకటేశ” మకుటంతో ఆటవెలదులు వ్రాశారు.

“విశ్వామిత్ర” మనే నిరీక్షణ లఘు కావ్యాలు వ్రాయడమే కాకుండా చిత్రాల్ని కూడా స్వయంగా గీసారు. సదాశివ మాస్టారు ప్రియశిష్యులు కాగజునగరు నివాసి స్వర్గీయ కోటగిరి నారాయణ గౌడు సంపాదకత్వంలో “సదాశివ కావ్యసుధ” పేరుతో కాగజునగరు తెలుగు సాహితీ సదస్సు సంస్థ 2008లో పుస్తకావిష్కరణ చేసింది. దీనిలో సాంబశివ శతకం, మంచిమాటలు ఉపదేశ కావ్యం, నిరీక్షణము, ప్రభాతము, విశ్వామిత్రము, లఘుకావ్య సంపుటాలు, నారద గర్వభంగము గేయ కావ్య అనుసృజనలు, ఉర్దూ భావ గీతాలు, సాఖీనామా ఈశ స్తుతి, జలాలుద్దీన్ రుమీ, అమ్జద్ రుబాయిలు, స్తుతి కవితలు, సూక్తి సుధ కవితలు పొందుపర్చారు.

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, లక్ష్మీనర్సమ్మ వంటి ప్రముఖుల సందేశాలున్నాయి. తుమ్మూరి రామ్మోహన్ రావు, రాళ్ళపల్లి మురళీధర్ గారు ముద్రణలో వీలైనంత సహకారం అందించారు. చిన్ననాడు వాంకిడిలో కుమ్రం భీం శవాన్ని చూసిన జ్ఞాపకాలతో ఏడవ తరగతి వాచకంలో పాఠ్యభాగ రచయితగా ఆయన పాఠాన్ని చేర్పించి తెలుగు రాష్ట్రంలో ప్రచారం, కీర్తి పెంచారు. సదాశివ గారు బాల గోపాలుని కోసం వ్రాసిన

“ఘల్లు ఘల్లున గంతిడి రారా నంద కుమారా

జగదే మోహనాకారా గోపకిశోరా! ముఖ్ డా ఉత్తర తెలంగాణ నిండా నేటికీ ప్రచారంలో వుంది.

మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా సామల సదాశివ మాస్టారు మాతృభూమితో మమతాను రాగాలు అల్లుకొని మల్లెల బంధంతో పరీమళాలు నిరంతరం పంచుతూనే ఉన్నారు.

“శ్రీ సామల రాజవర్దన్ గారి రచన “మా అమ్మ” వ్యాసం ఆధారంగా వ్రాసిన వ్యాసం.

You may also like

Leave a Comment