డాక్టర్. చిటికెన కిరణ్ కుమార్ గారి “ఎర్ర సూరీడు” కథకు సమీక్ష.
మనిషికి శిరస్సు ఎంత అవసరమో కథకు, శీర్షిక అంత విలువనిస్తుంది.
“ఎర్ర సూరీడు” అన్న పేరు కథకు తగినట్లు ఉంది. వేడి కిరణాలతో ఎర్రబారిన సూర్యునితో పోల్చి సుహాన్ అనే పిల్లవాని పాత్ర ఇందులో ముఖ్య పాత్ర కావడం గమనించాల్సిన విషయం!
ఈ కాలం కుటుంబాలలో జరిగే ఒక విషాదకరమైన విషయానికి ఈ కథ ప్రతిబింబం అని చెప్పవచ్చు.
తన చదువులు వివాహాలు అయ్యేంతవరకు పెద్దరికాన్ని పెద్దలకిచ్చి ఒక్కసారిగా ఆ పెద్దలను వారి వృద్ధాప్యంలో అందరూ ఉన్నా, ఎవరూ లేని పేదవారిగా మార్చడం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దీనిని కథా వస్తువుగా తీసుకొని తనదైన శైలి లో ఒక పరిష్కార మార్గం దిశగా కథను నడిపించిన కిరణ్ కుమార్ గారు చక్కటి విషయానికి విత్తు నాటారు!!!
నేడు అపార్ట్మెంట్లలోని పరిస్థితిని చక్కగా చూపించి పరిష్కార మార్గం చెప్పారు. పక్కఅపార్ట్మెంట్లో ఏం జరిగినా మనకు తెలియదు, మనం పట్టించుకోము – ఇది నేటి పరిస్థితి. దీనికి చరమగీతం పాడమని చెప్తూ కథకు చక్కటి ముగింపు ఇచ్చారు.
వీటన్నిటికన్నా ముఖ్యమైనది:
“పిల్లల మనస్తత్వం పెద్దలు గ్రహించాలి” అన్న అతి ముఖ్యమైన మానవత్వానికి సంబంధించిన గొప్ప విషయం ఈ కథలో మనం గమనించాల్సిన మొదటి విషయం.
కిరణ్ కుమార్ గారు ఈ కథలో నిజంగా చెప్పాలంటే ఒక 10 ఏళ్లకుర్రాడుగా మారిపోయారు. ఈ కథలో హీరో ఓ 10 ఏళ్ల కుర్రాడు – అతడి పేరు సుహాన్.
సుహాన్ తండ్రి అరవింద్, తల్లి సంధ్య. కథ నడవడానికి కారకుడు సీతారత్నం.
సీతారత్నం అరవింద్ తండ్రి, సుహాన్ కు తాత, సంధ్యకు మామగారు.
వృద్ధులు పిల్లలు ఒకే రకం మనస్తత్వం కలిగి ఉంటారు అన్నది పెద్దల మాట. అందుకే సుహాన్ కు తాతయ్యంటే ఎంతో ఇష్టం. కానీ పెద్దల వాసన దగ్గర కూడా ఉండకూడదన్న ఈ నాగరికత ప్రపంచంలో సీతారత్నం గారి కోడలు సంధ్య, మామగారిని ఇంటికి దూరం చేసి వృద్ధాశ్రమానికి దగ్గర చేసింది. కానీ సుహాన్ మనసుకు మాత్రం వాడి తాతయ్యను దూరం చేయలేక పోయింది. ఇక ఇక్కడినుంచి కథ మొదలు!!!
ఈ కథ పేరు “ఎర్ర సూరీడు”. ఇది “నేటి నిజం” దినపత్రికలో ప్రచురింపబడింది.
“డాడీ, తాతయ్య ఎప్పుడు వస్తాడు?” అంటూ సుహాన్ ప్రశ్నించడంతో కథ ప్రారంభం.
దానికి ఆ పిల్లాడి తల్లి జవాబు –
“నీవైతే ఆయనను మళ్లీ తీసుకొచ్చావనుకో నా యొక్క అసలు రూపం చూపిస్తా…” అని భర్తను బెదిరించి, పిల్లాడిని చెవులు పెట్టి లాగుతూ –
“మరోసారి తాతయ్య తొండం అంటూ వెధవ వేషాలు వేసావ్ అనుకో, తోలు తీస్తా రా!” అంటూ సంధ్య పిల్లవాడిని తీసుకెళ్తుంది.
ఆ తల్లికి కొడుకు మీద కోపమో, మామగారి మీద అసహ్యమో ద్వేషమో – రెండూ ఈ సంభాషణలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది కొన్ని ఇళ్లలో జరిగే సర్వసామాన్యమైన సంఘటన.
దీనికి కారణం కొంతవరకు బయట నుంచి వచ్చిన కోడలు స్థానంలో ఉన్న స్త్రీలే! వారికి వంత పలుకుతున్న వారి భర్తలు. కానీ అటు భార్యలను కాదనలేక ఇటు తల్లిదండ్రులను వదులుకోలేక మగవాళ్ళు నలిగిపోతున్నారన్న సత్యాన్ని కిరణ్ కుమార్ గారు కథాంతంలో సూచించారు.
సీతారత్నంలాంటి వారెందరో ఈనాడు తాము కట్టుకున్న సొంత ఇంట్లోనే స్థానం లేక వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా కొంత మెలకువగా తెలివితేటలతో తమ వృద్ధాప్యం గురించి జాగ్రత్త పడాలి. పిల్లల మీద ఆధారపడడం గాలిలో పెట్టిన దీపం లాంటిది. లేదా వారి దగ్గర ఉండాలి అనుకుంటే తమ ఆలోచనను, అధికారాలను, ఆశయాలను అన్నిటిని మూటగట్టి పక్కన పెట్టి పిల్లలను నూటికి నూరుపాళ్ళు అనుసరిస్తూ ఉండాలి!
ఈ కథలోని సుహాన్ లాంటి పిల్లలు కూడా ఇప్పుడు అరుదుగా ఉన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు వీటి ప్రభావం వల్ల పిల్లలు వృద్ధుల పట్ల శ్రద్ధ చూపించడం లేదు. అలాగే పక్కింటి గొడవ పట్టించుకునే నాధుడే లేరు.
ఇలాంటి పరిస్థితులను బాగా గమనించిన కిరణ్ గారు కథకు తగ్గట్టుగా సంభాషణలను, సంఘటనలను రూపొందించి రక్తికట్టించారు. “ఎర్ర సూరీడు” అన్న పేరు పిల్లవాడికి, తాతగారికి తగినట్టుగానే ఉంది.
ఎర్ర సూర్యుడు అనేదానికి సంకేతంగా ప్రత్యేకంగా ఎర్ర వస్త్రాన్ని చూపించారు కిరణ్ కుమార్ గారు.
ఒక కథకు ఆయువు పట్లు వర్ణనలు, మచ్చుకు కొన్ని చూద్దాం:
“తండ్రి సీతారత్నమును తీసుకుని కారులో ఎక్కించుకొని తిరుగు ప్రయాణానికి బయలుదేరాడు అరవింద్. తిరుగు ప్రయాణంలో సూర్యుడు వెనక వైపు ఉండగా పక్కన తన తండ్రి సీతారత్నం వెలిగిపోతున్నాడు. పండు వారిన ఆ మడతల చర్మంతో ముఖంలో ఏదో ఆనందం…”
“పంజరం నుండి పక్షి బయటకు ఎగిరిపోయినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీసి తాతయ్య బుజాలను ఎక్కాడు సుహాన్!”
సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు మనిషి ముఖం కొంత లేత ఎరుపులోకి రావడం సహజం.
సీతారత్నం గారికి మనవడిని చూడగానే ముఖంలో కొద్దిగా తేలిపోతూ ఎర్రని… ఎంతో ఆనందంతో తేలిపోయాడు… ఎర్ర సూరీడులా వెలుగుతున్న ముఖంతో!!!
సుహాన్ కు కోపం వచ్చినప్పుడు వాడు చేసిన పనులు – టీవీని, ఫ్రిడ్జ్ ని పగలగొట్టడం, పెద్దగా అరుస్తూ “నాకు తాతయ్య కావాలి, ఇప్పుడే కావాలి!” అంటూ కోపంతో చేసిన పనుల వర్ణనలు కథా వస్తువుకు బలాన్ని ఇచ్చాయి.
కొడుకు కోపం వాడి బాధ మొదట్లో తల్లిదండ్రులకు చికాకు కలిగించి, చుట్టుపక్కల వారిని “మీకేం పనులు లేవా? మీ ఇంట్లో మీరు తగలడండి…” అంటూ సంధ్య ఆవేశంగా మాట్లాడినప్పటికీ, సుహాన్ తండ్రి అరవింద్ లో మార్పు వచ్చి, కొన్ని నిష్టుర వాక్యాలు సంధ్యతో పలకడంతో –
మనుషుల్లో మానవత్వం కొన్ని సంఘటనల వల్ల మేల్కొంటుంది అన్న సత్యాన్ని నిరూపించారు.
పదిమంది రావడం, ఆ దంపతులను చివాట్లు పెట్టడం – ఇవన్నీ ఏ ఇంట్లో అయినా పెద్దలను నిరాదరణ చేసినప్పుడు నిజంగా జరిగితే, ఆ పెద్దలు ఎంతో గొప్ప సంతోషాన్ని, మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది.
ఈ కథ ఈనాటి సంఘంలో జరిగే సంఘటనకు దర్పణం లాంటిది. పిల్లలలో సూర్యుని వలె చురుకుదనం, స్వచ్ఛమైన మనసు ఉంటే ఆ సంసారంలో పెద్దవారికి పెద్దపీట వేయొచ్చని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సరిదిద్దడానికి పిల్లలే పూనుకోవాలని చెప్పే మంచి కథ.
ఇరుగుపొరుగు వారు కూడా అనాలోచితంగా ఆవేశంలో ఉన్న వ్యక్తులను లాలించి, దండించి మంచి మార్గంలో పెట్టాలని… ఈనాడు తాము ఆచరిస్తున్నదే రేపు తమ పిల్లలు ఆచరిస్తారని భార్యాభర్తలు తెలుసుకోవాలని…
ఈ కథలో రచయిత కిరణ్ కుమార్ గారు గట్టిగా స్పష్టంగా చెప్పడం వల్ల పాఠకులకు మంచి సందేశం అందించారు.
ఉమ్మడి కుటుంబం బరువు కాదని, కలిసి ఉంటే సంతోషాలను కోల్పోవడం జరగదని సత్యం చాటి చెప్పే కథ “ఎర్ర సూరీడు”.
రచయిత డా. చిటికెన కిరణ్ కుమార్ గారికి అభినందనలు!!!

5 comments
https://shorturl.fm/RwDqx
https://shorturl.fm/s2Lob
https://shorturl.fm/KguO3
https://shorturl.fm/UqWc7
https://shorturl.fm/ZgKGY