విస్మృత కవి- పండిత- రచయితల శోధకులు యువకవుల ప్రోత్సాహకులు శ్రీరంగ స్వామి గారితో ముఖాముఖి
వరంగల్ లో కవులే లేరు, రచయితలే లేరు, కథలసలే లేవు, కథలున్నా ఉద్యమ సంబంధ కథలు తప్ప సమాజదర్పణ కథలులేవనే ఒక అపవాదు వచ్చేసరికి అది వినివనీ తాను స్వయంగా కవి, తండ్రి రామానుజస్వామి గారు కూడా శతకకవైన వీరికి ఆమాట రుచించక…ఆ అపవాదు తొలగించుకోవాలని ఊరూరా తిరిగి , మరుగున పడిన కవుల, రచయితలను వెలుగులోనికి తెచ్చిన సాహిత్యాభిమాని, ఆ సాహిత్య సేకరణలకోసం నిరంతరం శ్రమించిన సహృదయ సాహితీ శ్రామికులు శ్రీ తిరుకోవలూరు శ్రీరంగస్వామి గారు. అది చెప్పినంత తేలికైన విషయం కాదు! ఆ శ్రమేమిటో? దాని ఫలితమేమిటో తెలుసుకోవడానికి వారిని పలుకరించి, వారి మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం!
పద్మజ:- నమస్కారమండి శ్రీరంగ స్వామి గారూ! మీ నేపథ్యం నిజం చెప్పండి!
టి. శ్రీరంగస్వామి:– నమస్కారం పద్మజ గారు!
నేను 16 -7 -1950 రోజున పర్లపల్లి, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లాలో, తెలుగు పంచాంగం ప్రకారం విరోధి- శ్రావణ శుద్ధ పాడ్యమి, రోజున జన్మించాను. కానీ వరంగల్ లోనే పెరిగాను.
మా తల్లిదండ్రులు శ్రీ టీ. రామానుజ స్వామి- శ్రీమతి. తాయమ్మ .మాది దిగువ మధ్య తరగతి శ్రీ వైష్ణవ కుటుంబం.
పద్మజ :– మీ విద్యాభ్యాసము, మీ వృత్తి, ప్రవృత్తి గురించి వివరించండి!
శ్రీరంగ :– నేను ఒకటో తరగతి నుండి హెచ్ ఎస్ సి ; పి యు సి అన్నీ వరంగల్ లోనే చదివాను. తరువాత బీకాం, తర్వాత ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే ఎంఏ ఎక్స్టర్నల్ రాశాను. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల వారి పర్యవేక్షణలో విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు అనే అంశంతో పిహెచ్డి కూడా ప్రైవేట్ గానే చేశాను.
1987 బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాను. అంతకు ముందు ప్రైవేట్ కంపెనీలో పని చేశాను. రిటైర్ అయ్యేవరకు అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఆఫీసు సూపరిండెంట్ గా రిటైర్ అయ్యాను. అంబేద్కర్ యూనివర్సిటీలోనూ, కాకతీయ యూనివర్సిటీలోనూ కౌన్సిలర్ గా అంటే లెక్చరర్ గా, ఆర్ ఓ ఆర్ లో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశాను.

పద్మజ :– శ్రీలేఖ సాహితీ సంస్థ స్థాపించాలనే ఆలోచన ఎందుకు కలిగింది? ఎప్పుడు స్థాపించారు? దానికి ప్రేరణ ఏమిటి?
శ్రీరంగ :— నేను 1967 లో యువభారతి సభ్యుడిగా చేరాను. సికింద్రాబాద్ లో ఉన్న ఆ సంస్థలో సభ్యుడిగా చాలా ఉత్సాహంగా పాల్గొనే వాడిని. అందులో 79 లో ఉషోదయం అని ఒక కవితా సంకలనం తీశారు. ఆ సంకలనానికి రచనల సేకరణ కోసం రచయితలనెందరినో కలవడం, ఆ పుస్తకం రావడం నాకు ప్రేరణ నిచ్చింది. దాంతో హైదరాబాదు నుండి వరంగల్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే ఇక్కడ శ్రీలేఖ సాహితి సంస్థ ను స్థాపించాను. యువ కవులను ప్రోత్సహించాలని, వారి రచనలను ముద్రించాలని నా లక్ష్యం. ఎందుకంటే అప్పుడు వరంగల్లో ఒక్క మిత్ర మండలి సంస్థ తప్ప మరే సంస్థలు లేవు. సాహిత్యాన్ని ప్రోత్సహించేవారు లేక తెలుగు భాష సన్నగిల్లిందని ఆలోచనతో… దాని పరిధి పెంచాలని స్థాపించాను. కొన్ని బాలారిష్టాలు ఎదురైనాయి. విజయవాడ సాంస్కృతి సమాఖ్య శాఖ ఇక్కడికి రావడంతో…. కొంచెం కార్యక్రమాలు తక్కువైనాయి. కానీ అక్కడక్కడ సమావేశాలు నిర్వహిస్తూ, 84 నుండి పుస్తక ప్రచురణలు ప్రారంభించాము.
వరంగల్ చైతన్య సాహితికి నేను కార్యదర్శిగా (80) ఉన్నప్పుడు చైతన్య కవితా సంకలనం కూడా యువభారతి వారి వలెనే పరస్పర సహకారంతో వెలువరించాము. అది మా మొదటి పుస్తకం. దానికి వేరే వాళ్ళు కూడా కృషి చేశారు. పూర్తి అన్ని పనులు నేనే చూసుకున్నాను.
తర్వాత శ్రీలేఖ సాహితిలో ఏవో సమావేశాలు తప్ప ఎక్కువ సాహితీ సేవలు జరగలేదు. 1984లో మా నాన్నగారి శ్రీరామా వందనము అనే శతకం అచ్చు వేసాము. అప్పుడే సంస్కృత సమాఖ్య ద్వారా కొన్ని పనులు జరిగాయి. రాష్ట్రస్థాయి మహాసభలు రెండు రోజులు ఏర్పాటు చేశాము. ఇవి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో, తర్వాత రెండు నెలలకు ఒకసారి సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసాము. జిల్లా గ్రంధాలయ సంస్థలో సెక్రెటరీగారు మాకు అన్ని విధాల సహకరించే వారు. అలాగే మిత్రుడు కృష్ణారెడ్డి మయూరి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఆయన ఆహ్వాన పత్రికలు ఉచితంగా అచ్చు వేయించి ఇచ్చేవారు. అలా కార్యక్రమాలు చక్కగా నడిచాయి. దాని తర్వాత విజయవాడ బ్రాంచ్ వారు కొన్ని కార్యక్రమాలు చేయడంతో కాస్త ఇబ్బంది ఏర్పడి , దాని నుండి వైదొలగి
వరంగల్లు సాహితీ సమితి స్థాపించాము. దానికి నమలికొండ బాలకిషన్ రావు గారు అధ్యక్షులు, నేను కార్యదర్శిని. దాదాపు మేమిద్దరిమే కృషి చేసాము. సంస్కృతి సమాఖ్య తో పాటు దాన్ని నిర్వహించాము. మేము ఏ కార్యక్రమం చేసినా యువ రచయితలకే ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళం. వారి రచనలు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, వారితో ప్రసంగాలు చేయించే వాళ్ళం. వారి కవితలు సంకలనాలుగా తెచ్చాము. అందుకే వరంగల్లో రచయితలకు మా సంస్థ అండగా ఉంటుందని పేరు వచ్చింది. ఈ సంస్థలను నడిపించడానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ అన్నిటిని ఎదుర్కొన్నాము! తర్వాత సాహితీ సమితి, శ్రీలేఖ రెండింటిద్వారా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాము. దాని ద్వారా ఆరు పుస్తకాలను వెలువరించాము. శ్రీలేఖ ద్వారా కూడా ఎన్నో పుస్తకాలు వెలువరించాము. నేను ఎం.ఏలో చేరడంతో కొంతకాలం సంస్థలలో సమయం కేటాయించలేక పోయాను. సాహితీ సమితి కార్యక్రమాలు కొద్దిగా తగ్గాయి. దాంతో ఆ సంస్థ మూత పడింది. తర్వాత యువరచయితల కోసం ఏ కార్యక్రమాలనైనా శ్రీలేఖ సాహితీ సంస్థ నుండే జరుగుతున్నాయి.
ప్రభవ, విభవ, ఇలా తెలుగు సంవత్సరాల పేరుతో కవితా సంకల నాలు ప్రారంభించాము. 79లో ఉషోదయం అనే కవితా సంకలనం వేసాము.
అలా 29 సంకలనాలు వేసాము.
2002లో శ్రీలేఖ సాహితీ సమితి రజితోత్సవాల సందర్భంగా పరస్పర సహకారంతో కథా సంకలనాలు వేయడం ప్రారంభించాము. లబ్ధ ప్రతిష్టుల రచనల కన్నా యువకులకే ప్రాధాన్యత నిస్తూ ఎనిమిది సంకలనాలు వేశాము. అలా 10 వ్యాస సంకలనాలు వేశాము. అలా 150 పుస్తకాలు ఈ సంస్థ ద్వారా అచ్చు వేయించాము.
శ్రీలేఖ సాహితీ సంస్థ ద్వారా అనేక సాహితీ సదస్సులు నిర్వహించాము. పోతన భాగవతముపై ఉపన్యాసాలు నిర్వహించి, వాటిని పుస్తకం గా కూడా వెలువరించాము.
ప్రాచీన వాఙ్మయంలో ప్రవేశం ఉన్న వారి చేతనే వ్యాసాలు రాయించి, దాంతో పాటు కొంతమంది మా కార్యవర్గ సభ్యులను, యువతను కూడా ప్రోత్సహించి వారి చేత రాయించి అలా పది సంకలనాలు వేశాము.
రామాయణం మీద రెండు, భాగవత వ్యాసాలు రెండు, మధుర భక్తి అన్నమయ్య మీద రాయించాము. ప్రతి విశ్వవిద్యాలయంలో వాటికి గుర్తింపు వచ్చాయి. శ్రీలేఖ సంస్థ నుండి పరిణితి చెందిన వ్యాస సంకలనాలు వస్తాయని పేరు వచ్చింది. తరువాత ఆ వ్యాసకర్తలు దాదాపు యూనివర్సిటీలో పని చేసిన వారు, కొంతమంది పండితులే! వారికి అంశాన్ని ఇచ్చి రాయించాము.
వంశిమోహనమ్(శ్రీకృష్ణ సర్వస్వం), నేను కృష్ణుని మీద 50 కోణాల్లో రాయించాలని అనుకున్నాము. మొదలు పెట్టాము కాని 30 మాత్రమే వచ్చాయి. అప్పటికే చాలా ఆలస్యమైంది. 35 కోణాల్లో కృష్ణుని వివరించగలిగాము.
మాకు తోచిన సాహితీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. వరంగల్ జిల్లా రచయితల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి, వరంగల్ సాహిత్యం మీద ఆరు పుస్తకాలు వెలువరించాము.
1- వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ సూచిక;
2- వరంగల్ సాహితీ తరంగాలు;
3- వరంగల్ సాహితీమూర్తులు ;
4- ఏకశిలా వైతాళికులు
అడపా దడపా మనకు ముద్రించడానికి వచ్చిన పుస్తకాల్లో వరంగల్ సాహిత్యాన్ని ప్రతిబింబించే వ్యాసాలు ముద్రించాము. అంతేకాదు వారి రచనలను సాహిత్య అకాడమీకి సిఫారసు చేసాము.
మిత్రులను ప్రోత్సహించి వారి పుస్తకాలను కూడా మన సంస్థ ద్వారా వెలువరించాము. వాళ్ళ పుస్తకాలకు ముందు మాటలు రాయడమే కానీ సంస్థ తరఫున ద్రవ్య రూపకంగా సహాయం చేయలేదు. వాళ్లే ముద్రించుకున్నారు. శ్రీలేఖ సాహితి బ్యానర్ మీద ముద్రించుకున్నారు. భద్రాచలం దగ్గర సత్యనారాయణపురం నుండి ఒక తను, గుంటూరు రచయిత , ఒంగోలు రచయిత, ఇలా ఎన్నో ప్రాంతాలనుండి వాళ్ళు శ్రీలేఖ సాహితీ సంస్థ మీది అభిమానంతో వేసుకున్నారు.
కథా సంకలనం వేసినప్పుడు ఒక తండ్రి తన కొడుకు రాసిన కథను ఎలాగైనా ప్రచురించాలని సంకలనంలో వేసి వాడిని ప్రోత్సహించమని అడిగితే ఆ కథను ఎడిటింగ్ చేసి ఆ సంకలనంలో చేర్చాము. అలాగే ఖమ్మంలో మారుమూలన ఉన్న ఒక కిరాణా కొట్టు నడుపుకునే అతను నా కథను మీ సంకలనంలో వేయండి అని అడిగితే దాన్ని కూడా సవరించి వేశాను. ఇలా రచయితలను ప్రోత్సహించే దిశగానే మా కృషి సాగింది.
ప్రతి ఉగాదికి శ్రీలేఖ సాహితీ సంస్థ నుండి తప్పకుండా కవితా సంకలనం వస్తుందని అందరికీ తెలుసు! తర్వాత కార్యవర్గ సభ్యుల కోసమే ప్రత్యేక సంకలనాలు వేశాము. తర్వాత ఒక అంశమిచ్చి కవితలు రాయించి, ముద్రించాము. అలాగే కరుణ రసం మీద ఒక కథా సంకలనం తీసాము. వరంగల్ జిల్లా కథా సర్వస్వం అని 108 కథలు వేసాము. అది 800 పేజీలయ్యేసరికి 1,70,000 రూపాయలు అయింది. అమ్మవారి అనుగ్రహంతో అది కూడా వెలువడింది. ఇంకా 70 మంది కథకుల కథలు ఆ కాలంలో చేర్చాల్సి ఉండే! కానీ సమయానికి వారు పంపించకపోయేసరికి అందులో ముద్రించలేదు. దీంతో వరంగల్లో 200 మంది కథారచయితలు ఉన్నారని తేలింది. 70 మంది కథారచయితలు వారి కథలు పంపకున్నా వారి పేర్లు ఒక జాబితా తయారు చేసి, ముద్రించాముఅదే సంకలనంలో… గ్రంథాలయ వారోత్సవాలలో రెండు మూడు రోజులు మా సంస్థ తరఫున కార్యక్రమాలు చేసాము. ఇందిరా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం చేసేవాళ్లం. కవయిత్రులతో కవి సమ్మేళనాలు నిర్వహించాము. ఒక సంవత్సరం ఏం చేసామంటే కాకతీయ భారతి శీర్షికన వరంగల్ ప్రాంత యువ కవులతో కవితలు రాయించి ఒక పుస్తకం వేసాము. అందులో కవితలు అందని కవయిత్రుల పేర్లు కూడా నమోదు చేశాము. ఎందుకంటే వరంగల్ కవయిత్రులను నమోదు చేయాలనే ఉద్దేశంతో… కాకతీయ భారతీ అనే పేరు అందుకే పెట్టాము.
రెండు రోజుల సభలు లేదా వార్షికోత్సవాలు చేసినప్పుడు కథల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాము. కవితల కోసం మరొక ప్రత్యేక సమావేశం నిర్వహించాము. సాహిత్య సమావేశాలు ప్రత్యేకం…. ఇలా నాలుగు సెషన్లుగా నిర్వహించాము.
అష్టావధాన సప్తాహాలు 1996లో ఒకటి 2002లో ఒకటి నిర్వహించాము. రోజుకో అష్టావధాన సభను ఏర్పాటు చేశాము.
2006లో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఏర్పాటు చేసాం (శతాధిక కవి సమ్మేళనం) అందులో 130 మంది కవులు పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కవి సమ్మేళనం ప్రారంభిస్తే రాత్రి 9 గంటల వరకు సమావేశాలు సాగినాయి. ఈ సభల్లో ఇతర కవుల పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఏ సమావేశానికా సమావేశానికి వేదిక మీద వక్తలను ఆహ్వానించి చేసాముశతప్ప ప్రతీ సభకూ నేనే అధ్యక్షుడిగా ఉండాలని ఏనాడు అనుకోలేదు!
మాకు తోచినంత సాహితీ సేవ చేస్తున్నాము. 2008 తర్వాత కవితా సంకలనాలు, కథా సంకలనాలు ఆపాము. ఎందుకంటే నేను పదవి నుండి విరమణ పొందాను! ఇక ఆర్థిక భారం మోయలేనని విరమించుకున్నాను. అంతేకాదు సంకలనం కోసం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. కానీ వ్యాస సంకలనాలు మాత్రం చాలానే పాఠకులకు అందించాము.
వరంగల్ కవులను ఇతర ప్రాంతాలకు ఆహ్వానిస్తే వారిని అక్కడికి తీసుకొని వెళ్లడం, వారికి అవకాశాలు కూడా ఇచ్చాము.
సంపత్ కుమార్ గారు మరణించినప్పుడు ఒక ప్రత్యేక సంచిక కనుమరుగైన చంద్ర శిఖరము అనే పేరుతో వెలువరించాము. వారి 13వ రోజు కార్యక్రమంలో కవులకు అందించాము.
తర్వాత ఆశావాద ప్రకాశరావు గారికి పద్మభూషణ అవార్డు వచ్చిన సందర్భంగా పద్మభూషణుడు ఆశావాది ప్రకాశరావు అనే చిన్న బుక్లెట్ వేసాము. ఇలా ఆయా సందర్భాలను బట్టి ప్రత్యేక పుస్తకాలు కూడా వెలువరించాము. ఇలా మా వంతు సాహితీ సేవలు చేస్తున్నాము.
నేను పీహెచ్డీ చేసినప్పుడు నాకు పద్యం రాయడం రాదు! కనుక విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం మీద పరిశోధన చేస్తే పద్యం రాయడం రాదు అంటే ఎలా? అని ఆయన సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారని ప్రశ్న వస్తుంది కదా! అందుకే కొంత కృషి చేశాను .
నా దృష్టి ఎంతసేపు వరంగల్ కవుల; రచయితల సాహిత్యాన్ని వెలుగులోనికి తీసుకురావాలన్న తపనే ఎక్కువగా ఉండేది. అందుకే వరంగల్ పత్రికల మీద చాలా కృషి చేశాను. గ్రంథాలయ ఉద్యమాల మీద కృషి చేశాను. వరంగల్ లో పరిశోధన చేసి పట్టా పుచ్చుకోవాలంటే మాత్రం శ్రీలేఖ సాహితీ సంస్థ పుస్తకాలే ఆధారమవుతాయి.
ఈ కథా సంకలనాలలోని కథలను తీసుకుంటే 80 దశకంలో వరంగల్లో కవులే లేరు రచయితలే లేరు కథలే లేవు అన్న ఒక అపవాదు తొలగించుకోవాలని మూల మూలల తిరిగి వారి రచన ప్రతిభను గుర్తించి 400 మంది కవులను, రచయితలను పరిచయం చేశాను.( ప్రతాపరుద్రుని కాలం నుండి సమకాలీన రచయితల వరకు) అది పెద్ద శ్రమతో కూడిన పని! ఎడిట్ చేయడము మిగతా పనులన్నీ నేనే చేసేవాడిని. ప్రసారిక పత్రిక వెనుక నా కృషి ఎందరో గుర్తించారు ఆ పత్రికను మేము నడిపినప్పుడు అందులో వచ్చిన వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు గుర్తింపును తెచ్చి పెట్టింది ఆ స్థాయికి పత్రికను నడిపాము.
పద్మజ:– మీరు రచనల వివరాలు మరియు మీ శ్రీలేఖ సాహితీ సంస్థ నుండి వెలువడిన పుస్తకాల వివరాలు తెలుపుతారా?
శ్రీరంగ :– 1-మధుర; 2- శిఖరం ; 3-మానస సంచరరే ; 4- నిరంతరం ; 5- సరేయోవా నుండి ఏకశిలకు (అనుసృజన) (బోస్నియా హెర్జగోవినా దేశంలోని సరేయోవా కవయిత్రి అజాసా జహీరోవిచ్ ఆంగ్ల కవితల అనుసృజన) 6- నీల మోహనాష్టకము; (వచన పద్యాలు) వచన ప్రక్రియలో తొలి అష్టకము, ఎనిమిది పంక్తులతో ఒకటి; ఎనిమిది పద్యాలు; ప్రస్తావన; ఉపసంహరము;( నాలుగేసి పంక్తులలో); 7-సమజ్ఞ; 8-డిసెంబర్ 11- పరిశోధన.
ఇక శ్రీలేఖ సంస్థ నుండి వచ్చిన రచనలు:–
1- వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ జీవిత సూచిక.
2- కోవెల సుప్రసన్నాచార్యుల వాఙ్మయ జీవిత సూచిక.
3- దేవులపల్లి రామానుజరావు ఒక రేఖ చిత్రం.
4- విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు.
5- వరంగల్ జిల్లా కథా సర్వస్వం.
6- మన కాంతిపుంజాలు (స్ఫూర్తి మూర్తుల జీవన రేఖలు)
వ్యాస -సంపుటాలు:-
1- విపంచి.
2- సాహితీ గవాక్షం
3- శ్రీ వ్యాసం.
4-సమూ.
5- మంచి మాట.
6- విశ్వనాథ రామకృష్ణ.
7- పొనుక.
8-విష్ణుపాద
9- పలుకు జెలి.
10- కావ్యాలోకనం (విహారి శ్రీపద చిత్ర రామాయణం.)
11- వెలుగుల గుత్తి.
కథా సంపుటాలు;—
1-సజీవ చిత్రాలు.
2- షుగర్లెస్ కాఫీ.
3- మా కిట్టమ్మ పెద్దాయి.
సుమారు 80 పుస్తకాలకు ముందుమాటలు;
సంపాదకత్వాలు-
వ్యాస సంకలనాలు:– 1-
1. నెమలికొండ బాలకిషన్ రావు కవితా దర్పణం;
2- ఏకశిలా వైతాళికులు;
3- కాలం వెంట నడిచి వస్తున్న…( న బారా
అభినందన సంచిక)
4- వరంగల్లు సాహితీ మూర్తులు;
5- తెలంగాణ సాహిత్య రూపాలు;
6- నిగమాంత సార సంగ్రహము (తాళపత్ర
గ్రంథము) పరిష్కరణ;
7- భాగవత దర్శనము ( జాతీయ సదస్సు
ప్రసంగాల సంకలనం)
8- అన్నమయ్య పద వైభవం ( జాతీయ సదస్సు (ప్రసంగాల సంకలనం.)
9- స్వయంభావకుడు ( పల్లేరు వీరాస్వామి అభినందన సంచిక )
10- రామాయణ వైభవం ;
11- సాహిత్యంలో మధురభక్తి;
12- వంశిమోహనమ్ శ్రీకృష్ణ సర్వస్వం
ఫిబ్రవరి వరకు శ్రీలేఖ సంస్థ నుండి150 పుస్తకాలు వెలువడ్డాయి.
పద్మజ :- మీ రచనల మీద ఎవరైనా పరిశోధనలు చేశారా?
శ్రీరంగ :— 2017లో మధురై యూనివర్సిటీలో మాధవి అనే విద్యార్థిని నా సాహిత్యం మీద ఎంఫిల్ చేసింది.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఒక పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం వచ్చింది. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనే శ్రీలేఖ సాహితీ ముద్రించిన కథా సంకలనాల మీద పిహెచ్డి సిద్ధాంత గ్రంథం వెలువడింది. ఇవే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సురేష్ నా జీవితం– సాహిత్యం మీద శ్రీ నిత్యానందరావుగారి దగ్గర పరిశోధన చేస్తున్నాడు.
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో విజయలక్ష్మి అనే అమ్మాయి కథా సంకలనాల మీద పీహెచ్డీ చేసింది. తిరుపతి యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు ఉన్నారు. అంతే కాదు నేను పరిశోధన చేస్తానని ముందుకు వచ్చిన కొంతమంది విద్యార్థులకు నేను వారి అంశం కోసం ఎంతో చేయూతనిచ్చాను. కామారెడ్డి నుండి ఒక అమ్మాయి వరంగల్ సాహిత్య పత్రికల సేవ అనే అంశం మీద పరిశోధన చేయాలనుకుని నా సలహా సంప్రదింపులను కోరింది దానికి వరంగల్ జిల్లా పత్రికారంగం అని నేను రాసిన వ్యాసం ఆమెకు చాలా ఉపయోగపడింది, అప్పటి పత్రికల గురించి నేను చెప్పితే ఆమె మరికొన్ని పత్రికల గురించి తెలుసుకొని వంద పత్రికల మీద పరిశోధన గ్రంథం రాసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది.
శతక సాహిత్యం మీద పరిశోధనా పత్రం కోసం ఒక విద్యార్థి వస్తే 400 శతకాలను నేను ఇచ్చాను. ఆయన 100 శతకాలతో వరంగల్ శతక సాహిత్యం మీద పరిశోధన చేశాడు. పరిశోధన కొరకు ఒక విద్యార్థి వస్తే ఆయన కోసం తగిన సహకారం అందించాను.
1980లో బాలకిషన్ రావు నేను కలిసి ప్రసారిక అనే ఒక పత్రికను స్థాపించాలనుకున్నాము. నేను పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నాను కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ఇతర పనులు చేయొద్దని ఒక నిబంధన ఉండేది. అందుకే బాలకిషన్ రావును సంపాదకుడిగా నియమించి, పత్రికను ప్రారంభించాను. పని అంతా అతనే చూసుకునే వాడు. నేను గౌరవ సంపాదకుడిగా ఉండి పత్రికను ఎడిట్ చేయడం, మిగతా పనులన్నీ నేను చేసేవాడిని. అలా 40 సంవత్సరాల పాటు నడిపించాము. ప్రసారిక పత్రిక వెనుక నా కృషి ఎందరో గుర్తించారు. ఆ పత్రికలో వచ్చిన వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ స్థాయికి పత్రికను నడిపాము.
పద్మజ :— పత్రికల మీద మీ అభిప్రాయం ఏమిటి?
శ్రీరంగ:— పత్రికలు లేనిది రచయితలు; కవులు; ఇతర కళాకారులు ఉండరు. వారి గుర్తింపును పత్రికల ద్వారానే తెచ్చుకుంటారు. పత్రికల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చును. సామాన్య పాఠకులకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అటు రచయితకు వెన్నుదన్నుగా ఉంటూనే, ఇటు పాఠకులను విజ్ఞానవంతులుగా చేస్తాయి పత్రికలు. ఒకవేళ మన రచనలు వేయకున్నా ఆ యా పత్రికలు మనకు శత్రువులు కారు!
వార్తయందు జగము వర్ధిల్లుచున్నది అని పంచమ వేదం చెప్పినట్టు పత్రికల వల్ల దేశకాల పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, సాహిత్య పత్రికలతో ఎంతో లాభపడేవారు ఉన్నారు. ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్న పత్రికలే మనకు ఆధారం.
శ్రీమతి కొండపల్లి నీహారిణి ఎంతో శ్రమ పడుతున్నది. పత్రికల ద్వారా ఎందరినో పరిచయం చేస్తున్నది. వారి మాటల్లో ఎన్నో విషయాలు పాఠకులకు తెలుస్తున్నాయి. ఈ విషయంలో ఆమెను ఎంత అభినందించినా తక్కువే!
పత్రిక స్థాయిని బట్టి అందులోని అంశాలను నవీకరించాలి! కొన్ని పత్రికలు కేవలం వ్యాపారాత్మకంగానే నడుస్తాయి. కొన్ని వార్తలకే ప్రాధాన్యతనిస్తాయి. కొన్ని సాహిత్యానికి ప్రాధాన్యత నిస్తాయి.
ఉదా॥ ఈనాడు పత్రిక ఒక శాతం సాహితి పాఠకుల కోసం ఎందుకు శ్రమించాలని సాహిత్య అంశాలను ప్రచురించదు. తెలుగు వెలుగు అనే ప్రత్యేకంగా సాహిత్యనికే కేటాయించారు. వేరే పత్రికలలో ప్రతి ఆదివారం ఒక ప్రత్యేక పేజీ కేటాయిస్తాయి. అది వారి వారి అభిరుచిని బట్టి నడుపుతారు. ప్రస్తుతం సాహిత్య పత్రికలకు కొరతైతే ఉంది. పత్రికలు ఉండడం వల్ల కవుల ఉనికి భద్రంగా ఉంటుంది. ఇప్పుడైతే అనేక మాధ్యమాలున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం పత్రికలే ఆధారం కదా? ఐనా ఎన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాలున్నా సాహితీ పంపిణీ జరుగుతుందేమో కానీ పత్రిక పట్టుకుని చదివిన సంతృప్తి కలగదు!
పద్మజగా నాలో నేను … వరంగల్లు సాహిత్య- జీవితంలో నిలిచిన టి. శ్రీరంగ స్వామి గారు ఎన్నో ఒడిదొడుకుల నెదుర్కొని, అక్షరాన్ని బతికించుకోవలే తపనతో బహుముఖీన సాహితీసేవలందిస్తున్న సాహిత్యాభిమానుల సేవలు ఎనలేనివి.
తెలంగాణ సాహితీ ప్రక్రియలు వసివాడి పోకూడదనే సదుద్ద్యేశ్యంతో సమాజంలో మరుగున పడిన మాణిక్యాల వెలుగులు మరోసారి విరజిమ్మచేసారు. లేకపోతే తాళ పత్రగ్రంథాలన్నీ ఎక్కడో పాతాళానికి పడిపోయాయి… వాటిని పైకి తెచ్చిన ఘనత?దక్కించుకున్నారు.
ఎప్పుడైనా సాహిత్య చింతన ఉన్నవారు తనకోసం-సమాజం కోసం ఆలోచిస్తారు కదా? దానికోసం పాటుపడిన శ్రీరంగస్వామి అభినందనీయులు…
మయూఖ ద్వైమాసిక పత్రిక ద్వారా వారిని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ…
అలుపెరుగని సాహితీ కృషీవలుడు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలనీ, మరింత మంది యువకవులను రాణింపులోనికి తెస్తూ సారస్వత పూజ చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ …
పరిపృచ్ఛ చేసే అవకాశం కల్పించిన మయూఖ సంపాదకురాలైన శ్రీమతి కొండపల్లి నీహారిణి గారికి మనఃపూర్వకమైన ధన్యవాదములతో…
