నవలా సమీక్ష. జీవన స్రవంతినవల ఈ నవలా రచయిత అంధులైన శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డిగారు.
దృష్టి లేక పోవడం ఒక శాపం కాదు!
తన లక్ష్యాన్ని సాధించే ఒక సహాయకారైన సామర్థ్యం అని నిరూపించారు! జీవన స్రవంతి నవలా రచయిత దివ్యాంగులైన శ్రీ టేకులపల్లి గోపాల రెడ్డి గారు.
వీరికి దృష్టిలోపం ఉన్నా దాన్ని అధిగమించి, చీకటి దారిని వెలుగులమయం చేసుకున్నారు.
చూపులేని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు; ఆరాట- పోరాటాలు; మనసు లోపలి పొరల్లోని భావా వేషాలు; సంఘర్షణలు; పరిస్థితుల బేరీజులు; ఆత్మగత సందేశాలతో సాగిన ఆత్మకథ నవల జీవన స్రవంతి.
ఇటీవలే ఒక సాహిత్య సమూహంలో వారు పరిచయమైనప్పుడు…. వారు 1200 పేజీలలో మూడు భాగాలతో ట్రయాలజీ తమ జీవిత కథ ను రాశారని విన్నప్పుడు, అంగవైకల్యమున్న వ్యక్తిలో ఇంత నైపుణ్యమున్నదా? అని ఆశ్చర్యపోయాను.
ప్రపంచంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన అంధ రచయితలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాచీన గ్రీకు కవి హోమర్ గురించి విన్నాము.
మరో ఇంగ్లీష్ అంధ కవి జాన్ మిల్టన్ ఎన్నో రచనలు చేశాడని అందరికీ తెలిసిన విషయమే!
అలాగే హెలెన్ కిల్లర్ కూడా గొప్ప రచయిత్రి. ఈమెకూడా దివ్యాంగురాలే! జార్జ్ లూయిస్ బోర్డెస్ వంటి అంధ రచయితల సరసన నిలువ గలిగిన తెలంగాణ రచయిత శ్రీ గోపాల్ రెడ్డి గారు.
వీరు రాసిన జీవన స్రవంతి నవల చదువుతుంటే మనసు భారం అవడమే కాకుండా, కళ్ళు చెమర్చుతాయి. ధారగా సాగే ఆ పఠనంలో బాధాకెరటం వీచినా, కన్ను మసకబారినా, గొంతు గద్గదించినా ఆగకుండా సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే? పాత్రలు, కథా సంభాషణలు మాత్రమే కాదు! మనసులో భావోద్రేకాలతో సాగుతుందీ నవల.
అంతే కాదు ఇందులో తెలంగాణ ప్రాంతపు ఆచారాలు- సంప్రదాయాలు తెలుస్తాయి. నా మటుకు నాకు అనిపించేది ఆంగ్లంలో అంధుల రచనలు ఉంటే ఉండవచ్చు! కానీ తెలుగు సాహిత్యంలో ఇదే మొదటి నవల అనిపించింది.
దీన్ని బ్రెయిలీలిపిలో తాను రాసిన తర్వాత దాన్ని చెబుతుంటే విని, రచయిత్రి, సమీక్షకురాలైన అరుణా ధూళిపాళ గారు తెలుగు లిపిలో రాసారు.
రచయిత తన నవలను నదీ ప్రవాహంతో పోలుస్తూ రాసిన నవల. ఎందుకంటే జీవితంలో ఒక్కోసారి వేగంగా సంఘటనలు జరుగుతాయి! ఒక్కోసారి మందకొడిగా సాగవచ్చు అచ్చంగా నదీ ప్రవాహం వలె అని కాబోలు !
కంటి చూపు లేని వారిని నిరాశగా బతక వద్దు! ఉత్సాహంగా బతుకుతూ తాను అనుకున్న లక్ష్యాలను చేరాలని అన్యాపదేశ సందేశం ఈ నవల పొడుగునా మనకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చూపు లేకుండా చేసిన భగవంతుడే జీవన గమ్యాలను చేరుస్తాడన్న విశ్వాసం కూడా కావచ్చు ! కానీ ఆద్యంతం ఆసాంతం చక్కగా చదివించే గుణమున్న ఈ నవల గురించి విహంగ వీక్షణం చేద్దాం!!!
సాధారణ మనుషుల జీవితాలే విచిత్రం… అంటే ఇంకా దివ్యాంగుల జీవితాలు మరీ విచిత్రాలు… జీవితంలో ఏమీ సాధించలేమని, ప్రపంచంలోని కష్టాలన్నీ తమకే ఉన్నాయనే నిరాశతో సాగుతాయి జీవితాలు మామూలు వారికి కూడా… కానీ అలా నిరాశగా ఉండొద్దని, మనోధైర్యంతో అంతర్నేత్రం ద్వారా దారిని సుగమం చేసుకోవాలని, చీకటి తెరలను తొలగించుకోవాలనీ వారి అనుభవాలు, జ్ఞాపకాలు, సంఘర్షణలు, సంతోషపుక్షణాలు, అంధుల జీవితాలలోని ప్రత్యేక లక్షణాలు, ఆలోచనలన్నిటినీ గుదిగుచ్చి .. రచయిత అక్షరీకరించారు.
ఆ అక్షరాల అందమైన ప్రవాహమే ఈ జీవన స్రవంతి.
ఈ నవలకు అందమైన ముఖచిత్రం వేసిన చిత్రకారుడు గౌరీభట్ల ప్రవీణ్ కుమార్ ముఖచిత్రం చూడగానే మనకు కనిపించే చిత్రంలో నదీ తీరంలో ఊతకఱ్ఱ సాయంతో ఒక పొడుగాటి మనిషి , సంధ్యా సమయపు కెంజాయ రంగులో వెలుగులీనుతున్న కాంతిలో ప్రవహిస్తున్న నది పైన ఒక కలం -పాళీ వెలుగుచిమ్మిన ఒక చిత్రం! చెప్పకనే లోపలి కథను రేఖామాత్రంగా తమ కుంచెతో రేఖలలో బంధించిన ప్రవీణ్ ప్రతిభ అమోఘం.
కథానాయకుడైన వేణుకు తాను ఊహించని అంధత్వం తననావరించినా, తట్టుకొని నిలబడి, ఆకటిక చీకటి కన్నులకే కానీ .. అంతర్ నేత్రానికి సూర్యకిరణాల్లాంటి వెలుగుల చూపుందని, తన శారీరక అందం ముఖ్యంకాదని, మానసిక అందంతో లోకాన్ని చూసి, కాలం కలిసి రాకపోయినా, పరిస్థితులు ఎదురు తిరిగినా, పట్టుదలతో కాలానికి ఎదురీది జీవన సాఫల్యం సాధించిన మహోన్నత వ్యక్తిత్వం వేణుది.
ఇక నవలా కథానాయకుడైన వేణు వ్యవసాయదారుల కుటుంబంలో పెద్ద కుమారుడుగా పుట్టి, అనుకోని పరిస్థితుల్లో వైద్యం వికటించి, పసి వయసులోనే కంటిచూపు పోగొట్టుకున్నా… తాను అందరివలెనే జీవించాలన్న ఆశయంతో కష్టాన్ని కౌగిలించుకొని, ఱంకెలు వేస్తూ మీదకు వచ్చే సమస్యలనే వన్యమృగాలను మచ్చిక చేసుకుని, తన దారికి మళ్ళించుకొనే మాట నైపుణ్యమున్న బతుకు వేటగాడు.
చదువుకునేందుకు ఎదురైన సమస్యలు, ఇంట్లో ఆధిపత్య ధోరణిలో నలిగిపోయిన వైనం, ఉద్యోగ ప్రయత్నం, ఇవన్నీ అసలే సహకారం లేని తన వారు, స్నేహితుల ఆలంబనతో ఎలా తాను అనుకున్న పని నెరవేర్చుకున్నారనేది ఈ నవల అంతా పరుచుకొని కనపడుతుంది.
ఒక్క చదువు, ఒక ఉద్యోగం లోనే కాదు తన ప్రేమ విఫలతను ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ, తన పెళ్ళికి పెద్దలుకుదిర్చిన అమ్మాయిని అర్థం చేసుకోవడంలోనూ విజేతనే వేణు!
ఒక విశిష్టమైనటువంటి నవల అని ఎందుకంటున్నానంటే ? ఒక అంధుడి జీవితంలోని చీకటి కోణాలను వివరించే అద్భుతమైన నవల! తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఈ చీకటి జీవితాలకు సంబంధించినటువంటి చీకటి కోణాల విషయాలు బహిర్గతం చేసే నవలలు వచ్చినట్టు మనకు తెలియవు.
మొట్టమొదటిసారి శ్రీ గోపాల్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన జీవన ప్రయాణంలో వారు ఎదుర్కొన్నవి, చూసినవి, విన్నవి, అనుభవించినవి, అనుభూతులుగా పొందినవన్నీ కూడా తన జీవన స్రవంతి నవల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎంతో కష్టపడి రాసిన నవల ఇది. దీన్నే ఆత్మ కథాత్మక నవల అని అంటాము. అంటే కొంత జీవిత చరిత్ర కు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పనాశక్తితో నవరసాత్మకమైన సన్నివేశాలను కల్పించి ఆత్మ కథాత్మక నవలగా తీర్చిదిద్దారు. ఇది ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి ట్రయాలజీ అనే సంప్రదాయాన్ననుసరించి, ఒక జీవితాన్ని- జీవితంలోని దశలను మూడు భాగాలుగా రాయబడిన కొత్త ప్రయోగం. తెలుగులో ఇంచుమించుగా ఇలాంటి నవల ఇంతకు ముందు శ్రీ అంపశయ్య నవీన్ గారు రాసారు. ఇటువంటి రచనలు తక్కువగా వచ్చాయనే చెప్పవచ్చు.
ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నది ఈ జీవన స్రవంతి నవల. ప్రత్యేకత అంటే రచయిత, విమర్శకులు ఐన శ్రీ బెల్లంకొండ సంపత్ గారు చెప్పినట్టుగా దీంట్లో ఆంగ్ల సాహిత్య సంప్రదాయమైనటువంటి సమగ్రతాశైలి కనపడుతుంది. అంటే కేవలం ఒక విషయాన్ని మాత్రమే వర్ణించడం కాకుండా ఒక సామాజికాంశము, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు, వాటితో ఏర్పడిన చీకటి జీవితపు సంఘర్షణలు ఇలా వ్యక్తికి సంబంధించిన అంశాలే కాకుండా, సామాజిక సమస్యలను చిత్రించిన నవల కాబట్టి సమగ్ర సాహిత్యమంటారు.
తెలుగులో సమగ్రతా శైలితో రచించిన నవలలు చాలా తక్కువ. అందులో ఉదా॥ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు రాసిన మాలపల్లి, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు వంటి నవలలు చెప్పుకోతగ్గవి. ఎందుకంటే సుదీర్ఘమైన కాలం- నిర్ధిష్టమైన కాలంలో రాయబడిన సామాజిక పరిణామాలన్నింటినీ వర్ణిస్తేనే సమగ్రతా శైలి అని నిర్వచిస్తారు. ఇందులో ఒక కథాంశం వివరించడమే కాకుండా రచయిత బోధనారంగంలో ఉండడంవల్లనేమో? వారిలో సాహిత్యాభిలాష ఉండడం వల్ల రచనలో భావుకత ఉంటుంది. ఈ భావుకత వల్ల పాఠకులను ఆకర్శించిందీ నవల. అంతేకాకుండా అందులోని విషయాలను అవగాహన చేసుకోవాలనే అంశాలుగా మారుతాయి. కాబట్టి ఈ జీవన స్రవంతి చదివేవారికి ఉత్కంఠతో పాటు ఆసక్తిని కూడా కలిగిస్తుంది.
ఈ విధంగా ఎందరి మెప్పులు పొందిన ఈ నవలలో అనేక అంశాలను చర్చించిన కొంత జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పన శక్తితో నవరసాత్మకమైనటువంటి సన్నివేశాలు కల్పిస్తూ… దాంతో ఆత్మ కథాత్మక నవలగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా దీనిలో అంధుడు తమ సోమా జ్యోతిర్గమయా అన్న ఉపనిషత్తు వాక్య ప్రకారం చీకటినుండి వెలుగులోనికి ప్రయాణం చేయడం నవల యొక్క ముఖ్య లక్షణం అనిపిస్తుంది.
కనుచూపు లేని చీకట్లో ఉన్న వాళ్ళు ఆ చీకట్లోనే మగ్గిపోకుండా, చీకటి నుండి వెలుగులోనికి ఎట్లా ప్రయాణం చేయాలని? అలా ప్రయాణించినప్పుడు ఎన్నెన్ని ఆటంకాలు ఉంటాయో? వాటిని ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నాడనీ, ఆ అంశాలు ముఖ్యంగా వాటినన్నిటినీ ధైర్య-స్థైర్యాలతో , ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నారో అన్నీ వర్ణింపబడ్డాయి.
అంతేకాదు ఇందులో ఒక సిద్ధాంతం నవల నిండా కనబడుతుంది … అదేమిటంటే? అవయవ నష్టపరిహార సిద్ధాంతం అంటే శరీరంలో ఒక అవయవం లోపిస్తే… లోపించినటువంటి అవయవం ఏ పనులైతే చేస్తుందో… ఆ లోటు పూరించడానికి మిగిలిన అవయవాలు పనిచేస్తాయని ప్రధాన సిద్ధాంతం! కనుక ఇందులో ఒక చూపు లేకపోవడం వల్ల దాన్ని పూరించడానికి వినికిడిశక్తి, స్పర్శ, ఇతర అవయవాలకు సంబంధించిన పనులన్నీ క్రియాశీలకంగా మారి ఒక చూపులేని లోటును పూరించడం ఉంది… అని ప్రఖ్యాత వక్త వీక్షణం వేణుగోపాల్ గారన్నారు.
కనుక ఈ నవల నిండా కూడా ఆ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. ఇదో ప్రత్యేకత!
ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే రచయిత తన రచనలు నదితో పోల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నది యొక్క మలుపులు ఏ విధంగా ఉంటాయో జీవితపు మలుపులు కూడా అదే విధంగా ఉంటాయని ఉపమానంతో నిరూపించడం ఇందులో ముఖ్యమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణిస్తేనే జీవితం ప్రవహిస్తేనే నది అని ప్రఖ్యాత తెలంగాణ రచయిత కవి అయిన శ్రీ నందిని సిధారెడ్డి గారు ఈ నవల ఆవిష్కరణ సమయంలో అన్నారు. ఆ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. కనుక జీవితం కూడా ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. అలాగే నది కూడా నీటి ప్రవాహంతో ప్రవహించినప్పుడే నది అని అనుకుంటాం! వారన్నట్టుగా కూడా ఈ నవలను నిర్వచించుకోవచ్చు కూడా!
ఇలా అనేక ప్రత్యేకతలున్న నవలని కెనడా దేశంలోని టొరొంటో వేదికగా తెలుగు భాషకెంతో సేవలందించిన కీ.శే. నెల్లుట్ల నవీన్ చంద్ర గారు ఈ జీవన స్రవంతి ఒక ఎన్స్లైక్లో పీడియా (ENCYCLOPEDIA) అన్నారు.అంటే విజ్ఞాన సర్వస్వం అని. ఇది ఎలా అయితే అన్నివిషయాలను పొందుపరిచి మనకందిస్తుందో? ఈ జీవన స్రవంతి నవల కూడా అన్ని విషయాలలోనూ అవగాహన పెంచుతుందని అన్నారు. అలా ఉపయోగపడుతుంది.
రెండవ భాగం ఆవిష్కరణ సందర్భంలో N. వేణుగోపాల్ ఒకే ఒక్క మాటన్నారు.ఈ నవల మన జీవితాలలోని లోతుపాతులను చూసుకునేందుకుపయోగపడే దర్పణం వంటిది అని, అంటే అద్దంలో చూస్తూ మన ముఖంలోని లోపాలను ఎలా అయితే సవరించుకుంటామో, అలాగే ఈ జీవన స్రవంతి నవలను చదివితే కంటిచూపున్నవారు తమకు చూడగలిగే శక్తి ఉందనే గర్వాన్ని విడిచిపెట్టి తమలో ఏ యే లోపాలున్నాయో ఈ నవల చదివిన తర్వాత సరిదిద్దుకునే అవకావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మాట నవలను చదివాక యథార్థమనిపించింది. అందుకే ప్రత్యేక మైనదని అంటున్నాను. అలాగే ఈ నవలలో చర్చించని విషయం లేదు. బయటి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి.
బయట ప్రపంచ సమాజంలోని లోపాలు, కుటుంబంలోని లోపాలు, ఆర్థిక వ్యత్యాసాలు, బలహీనులను ఏ విధంగా సమాజం చిన్నచూపు చూస్తుందో చెప్తూ వారికి న్యూనతా భావం ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో, ఆ ప్రయత్నాల వల్ల ఎన్ని విజయాలు సాధిస్తారో? న్యూనతాభావం మనిషిని తక్కువ స్థాయికి దిగజార్చుతుంది. ఆ తక్కువ స్థాయి నుండి తాము కూడా అందరితో సమానమనే భావాన్ని వ్యక్తీకరించడానికి నవల చదివితే ఎంతో ఉపయోగపడుతుందని వేణుగోపాల్ గారు అన్నారు.
నందిని సిధా రెడ్డి గారు ఏమంటారంటే ఈ నవల కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొనే వారికి ఒక దిక్సూచి వంటిదన్నారు. ఎందుకంటే జీవితమంటేనే చిన్నవో- పెద్దవో కష్టాలుంటూనే ఉంటాయి. దుఃఖమొచ్చినప్పుడు బాధ పడకుండా ఎదురించడానికి ఎలా ప్రయత్నించాలని, దాన్నుండి బయటపడే మార్గంచూపుతుందీ నవల.
అన్నింటికన్నా ముఖ్యం మానసిక సంఘర్షణ అనేది మనిషిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందుకే కురుక్షేత్ర యుద్ధానితో సమానం మనిషి హృదయం అని అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో ఏవైతే మంచీ-చెడుల మధ్య సంఘర్షణ జరిగిందో అలానే జీవన స్రవంతి నవలలో కూడా రచయిత పాత్రల ద్వారా- కథానాయకుడైన వేణు ద్వారా మానసిక సంఘర్షణాత్మక అంశాలను వివరిస్తూ ఆ సంఘర్షణల వల్ల చెడును తొలగించి మంచి జయించడమనే ఒక తత్త్వాన్ని వివరిస్తుందీ నవల.
ఇంకా చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో ఆశావాద తత్త్వం కనబడుతుంది. అదేమిటంటే మనం నైరాశ్యంలోకి వెళ్ళినప్పుడు నాకు ఇక ఏ దారీ లేదనుకున్నప్పుడు మనకనిపించేది ఏమిటంటే? ఒక చెట్టు మొత్తం ఆకులు రాలిపోయి మోడు వారినప్పుడు తనను తాను బతికించుకోవడానికి అలాగే నిలబడుతుంది. తిరిగి వసంత ఋతువు వస్తుంది అప్పుడు చిగురులు తొడిగి, పుష్పాలను పూస్తుంది ఫలాలను పండిస్తుంది అలాగే మనిషి జీవితం కూడా అలా పునర్నిర్మించుకోవాలనీ, మంచి రోజులు వస్తాయనీ, జీవన స్రవంతి నవల ఎప్పుడూ నైరాశ్య భావనను దగ్గరికి రానివ్వద్దని గొప్ప సందేశం నవల పొడుగునా అంతర్లీనంగా చెప్తూనే ఉంటుంది. కనుక ఎందరో మెచ్చుకున్న ఈ నవల చదవవలసిన అవసరం ఎంతో ఉంది!
వేణుకు వచ్చిన ఇన్ని కష్టాలలో ఒకే ఒక ఊరట రేడియో వినడం. రేడియో ద్వారానే ఎంతో విజ్ఞానాన్ని పొంది, తన వయసు వారికన్నా ఎక్కువ స్థాయిలో నిలబడడమే కాదు! ఆకాశవాణికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చించబడ్డాయి. ముఖ్యంగా ఒక రేడియో ఒక మనిషిని ఎలా బతికిస్తుందో ఒక
నిర్జీవమైనటువంటి ఆకాశవాణి మనిషి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ? అతనిలో ఎన్ని ఆశా తత్త్వాలను మొలకెత్తించిందో వాటితో అతడు భవిష్యత్తు వైపు నడవడానికి ఎంత ఉపయోగపడిందోనన్న విషయాన్ని ఈ నవలలో ఎన్నోసార్లు చెప్పారు.
ప్రఖ్యాత నాటక నటి శారదా శ్రీనివాసన్ యొక్క ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తుంది. ఆమె అందించినటువంటి మాటలు- ఆమె మధుర కంఠస్వరం యొక్క అమృతం ఒక అంధుడైన కథానాయకుని ఎలా బతికించిందో ఇందులో చిత్రీకరింపబడింది. కనుక రేడియోలో నవలాస్రవంతి ద్వారా – జీవనస్రవంతిని ప్రసారం చేస్తే ఈ నవల సార్ధకత చరితార్థం అవుతుందని ఈ జీవన స్రవంతి నవలపై సమీక్షా ప్రసంగం చేస్తున్నాను. జీవిత సత్యాలను సమగ్రంగా వివరించే ఈ నవలను ప్రతి ఒక్కరూ చదవాలి! ముఖ్యంగా అంధులు చదవాలని సూచిస్తూ.
