Home ఇంట‌ర్వ్యూలు ప్రముఖ కవి,రచయిత చొప్పదండి సుధాకర్ గారితో ఇంటర్వ్యూ

ప్రముఖ కవి,రచయిత చొప్పదండి సుధాకర్ గారితో ఇంటర్వ్యూ

by Naresh Chary

మీ జననం మరియు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
నేను పుట్టింది1967లో. మాది ఉమ్మడి మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామం. మాది స్వర్ణకారుల కుటుంబం. చిన్నతనంలోనే మా నాన్నగారు పరమపదించడంతో మా కుటుంబం చాలా కష్టాలను అనుభవించింది. మా అమ్మే పూర్తిగా మా ఆలనా పాలనా చూసింది.

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
మా నాన్న చనిపోయిన అనంతరం చాలామంది మా అమ్మతో నన్ను ఏదైనా పనిలో పెట్టమని అన్నారు. కానీ మా అమ్మ చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా నమ్మి నన్ను పాఠశాలలో చేర్పించింది. ఆమె ప్రోద్బలంతోనే నేను చదువు కొనసాగించాను. ఏడవతరగతి వరకు అల్లీపూర్ లోనే చదువుకున్నాను. ఎనిమిది నుండి పదవ తరగతి వరకు సిద్దిపేటలో చదువుకున్నాను.ఇంటర్మీడియట్,డిగ్రీ నిజామాబాద్ లో పూర్తి చేశాను. అనంతరం బి.ఇడి పూర్తి చేశాను.

మీ ఉద్యోగ ప్రస్థానం గురించి చెప్పండి.
1995 లో ఉపాధ్యాయుడిగా నా ఉద్యోగ ప్రస్థానం కల్హేర్ మండల్ లోని మీర్ ఖాన్ పేట్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమైంది. అనంతరం వడ్డేపల్లికి బదిలీ అయ్యాను‌. తరువాత ఇర్కోడుకు వచ్చాను,తదుపరి సికింద్లాపూర్ లో విధులు నిర్వహించి చివరిగా ఓబులాపూర్ లో రిటైరయ్యాను.

మీరు సాహిత్యం వైపు అడుగులు వేయడానికి ప్రేరణ ఎవరు?
మేము ఐదుగురం అన్నదమ్ములం ఒక అక్కయ్య. ఇందులో పెద్దన్నయ్య 18 సంవత్సరాలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించాడు. ఆయన కథకుడు. ఆయన కథలు పత్రికల్లో కూడా అచ్చయ్యాయి. ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. నేను కూడా ఎందుకు కథలు రాయలేను అనే ఆలోచన మా అన్నయ్యను చూసినప్పుడు కలిగింది కానీ అడుగులు ముందు పడలేదు. అయినప్పటికీ రాయాలన్న దృఢ సంకల్పం మాత్రం నాకు అన్నయ్య నుండే వచ్చింది. నాకు ప్రేరణ ఆయనే.

మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి
నేను చదువుకుంటున్న సమయంలో మా ఊరిలో వాణి గ్రంథాలయం ఉండేది అది మా చిన్నాన్న ఆధ్వర్యంలో నడిచేది. అందులో దాదాపు 700 పుస్తకాలు, రకరకాల మ్యాగజైన్లు, వివిధ రకాల పత్రికలు ఉండేవి. నేను రోజు వెళ్లి వాటిని తెచ్చుకుని బాగా చదివే వాడిని.ఎంతగా అంటే అప్పట్లోనే నేను 600 పుస్తకాలవరకు చదివేశా.అలా పుస్తకాలు చదవడం వల్లే నాకు వాక్యనిర్మాణం పైన పట్టు దొరికింది. కథలను, నవలల్ని ఎలా రాయాలో ఏ విధంగా పాత్రలను ప్రవేశపెట్టాలో, డైలాగ్స్ ఏ విధంగా ఉండాలో తెలిసింది. ఆ సమయంలో నన్ను కకుభ గారి “జీవితమంటే ఏమిటి”నవల తీవ్రంగా ప్రభావితం చేసింది.అది చదివి దాన్నుంచి స్పూర్తి పొంది కచ్చితంగా నేనుకూడా నవల రాయాలని అనుకున్నాను.
నేను నిజాంబాద్ లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక కామర్స్ లెక్చరర్ ఉండేవారు.ఆయన పేరు గన్ను కృష్ణమూర్తి.వారు ప్రముఖ కవి.ఆయన ఇటీవలే మరణించారు.వారు విమర్శనాత్మకంగా,చిక్కగా రాసేవారు. ఆ సమయంలో నేను అడపాదడపా కవితలు, కథలు రాసేవాడిని. అవి ఒకసారి వారికి చూపించాను. వారవి చూసి బాగున్నాయి ఇలాగే కొనసాగించు అని చెప్పారు. అప్పటినుంచి ఇంకా బాగా రాయడం పైన దృష్టి పెట్టాను. ఒకసారి కాలేజీలో కవితలు, వ్యాసరచన పోటీలు జరిగాయి. అందులో నేను పాల్గొన్నాను. అందులో ప్రథమ బహుమతి వ్యాసానికి,కవిత్వానికి రెండో బహుమతి వచ్చింది.నేను కవిత్వానికి మొదటి బహుమతి వస్తుందనుకున్నాను దానికి రెండో బహుమతి రావడానికి కారణం ఏంటి అని అడిగాను. అప్పుడు సార్ గారు మీ కవిత నెగటివ్ గా ముగిసింది అలాకాకుండా ఎప్పుడూ పాజిటివ్ గా ముగియాలి అని చెప్పారు. అప్పటి నుంచి కవితలు ,కథలు బ్యాలెన్డ్స్ గా రాయడం మొదలెట్టాను.
నా మొదటి కవిత 1982 లో” ఆంధ్రభూమి “లో అచ్చయింది. అనంతరం చాలా కవితలు కథలు అచ్చయ్యాయి.అప్పట్లో నేను చాలా పత్రికలకు ఉత్తరాలు రాసేవాడిని.అవి ప్రచురితమయ్యేవి కూడా. ఒకసారి నేను రాసిన మొదటి ఉత్తరం ఆంధ్రభూమిలో అచ్చయ్యింది. అప్పుడు నన్ను మా ఊర్లో అందరూ మెచ్చుకున్నారు. అది నాకు ఒక మంచి గుర్తింపునిచ్చింది. నాలో ఆత్మవిశ్వాసం పెంపొందింది.ఉత్తరాలు రాయడం ద్వారా నాకు మంచి రచనా శైలి అలవడింది. రాయడం,రాసినవి ప్రచురితమవడం నాకు ప్రేరకాలుగా ఉండేవి.అలాగే నా మిత్రులు రంగారావు,చంద్రం లాంటి వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు.
శ్రీ శ్రీ గారు చనిపోయిన రెండు సంవత్సరాలకు 1985 లో ఆయన స్మృతిగా ఓ కవిత రాశాను. అది “ఆంధ్రజ్యోతి” లో ప్రచురితమై నాకు మంచి పేరుతో పాటు 30 రూపాయలను తీసుకొచ్చింది. అప్పటినుంచి రాయడంలో నాకు వేగం పెరిగింది. కవితలు రాసే సమయంలోనే కథలు కూడా రాశాను. మొదటగా సినిమా రంగంపై వ్యంగంగా రెండు కథలు రాశాను. అవి “మయూరి” పత్రికలో అచ్చయ్యాయి. అలాగే స్వాతి వీక్లీ లో 8 కథల వరకు అచ్చయ్యాయి. 1994లో ఆంధ్రప్రభ పెట్టిన సంక్రాంతి కథల పోటీలో” వారసత్వం “అనే కథ రాశాను. దానికి చాలా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వారసత్వం సుధాకర్ అని పిలిచేవారు .అది నాకు అమితానందాన్ని ఇచ్చింది. అది గంగిరెద్దుల వాళ్ళ కథ. దీన్ని సినిమా డైరెక్టర్ వంశీ గారు కూడా కట్ చేసి తన ఫైల్ లో పెట్టుకున్నారట. ఇప్పటికి కూడా వంశీ మెచ్చిన కథలు సెకండ్ వాల్యూమ్ లో ఈ కథ ఉంటుంది.దీన్ని బట్టి నేను కూడా ప్రామాణికంగా, బాగా రాయగలుగుతానని నమ్మకం నాకు కలిగింది. నేను ఇప్పటివరకు దాదాపు 100 కథలు,8 నవలలు,3000 కవితలు రాశాను.కానీ అచ్చయినవి మాత్రం ఒక కవితా సంపుటి (శబ్ద ఋతువు),ఒక కథల సంపుటి (వెన్నెల కుప్పలు),ఒక నవల(జీవితం చేసిన సంతకం).

మీ మొదటి కవితా సంపుటి “శబ్ద ఋతువు” గురించి చెప్పండి.
నేను కవితలు రాసిన సమయంలోనే “ఎక్స్ రే”వాళ్ళు రాష్ట్రస్థాయి కవితల పోటీ పెట్టారు. అది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. అందులో నేను పాల్గొన్నాను. దానికి నేను రాసిన “వలస దృశ్యం”కవిత పంపాను. దీనికి నేపథ్యం ఏంటంటే నేను సిరిసిల్లకు వెళ్లినప్పుడు మనవాళ్ళు అక్కడ నుండి బొంబాయి మీదుగా దుబాయ్ వెళ్ళేవాళ్ళు, వారి గాథలు దయనీయంగా ఉండేవి. వాటికి చలించి నేను రాసిన కవితే “వలస దృశ్యం”. ఈ కవితను పంపగా దానికే మొదటి బహుమతి వచ్చింది.1000 రూపాయలను నగదుగా పొందాను.చాలామంది సాహితీ ప్రముఖులు మెచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత నేను రాసిన కవితలను గన్ను కృష్ణ మూర్తి గారికి చూపిస్తే బయట ఎన్ని అవార్డులు తీసుకున్నా, కవితా సంపుటి మాత్రం తప్పకుండా వెలువరించాల్సిందేనని చెప్పారు. అప్పటినుండి నాకు కూడా తప్పకుండా పుస్తకం వేయాలనిపించింది కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా త్వరగా వేయలేకపోయాను.చివరికి మిత్రుల సహకారంతో 2002 లో నా మొదటి కవితా సంపుటి “శబ్ద ఋతువు” తీసుకొచ్చాను.ఆవిష్కరణకు వార్తా సబ్ ఎడిటర్ గుడిపాటి గారు కూడా హాజరయ్యారు.అన్ని ఋతువులు ఉన్నట్టుగానే మనిషికి మాట్లాడే ఋతువు ఒకటి ఉండాలని అప్పుడైనా కాస్త నోరు విప్పడానికి సిద్ధపడతాడని ఆపేరు పెట్టాను.చాలామంది చదివి రాశిలో ఇది చిన్నదైనా వాసిలో పెద్దదని మెచ్చుకున్నారు. అందులోని కవితలు ఇప్పటికి కూడా వర్తిస్తాయని చాలా మంది అప్పుడే చెప్పారు. శివారెడ్డి గారు నా కవిత్వాన్ని చదివి 50 సంవత్సరాల వయస్సులోగల కవికి ఎలాంటి పరిణతి ఉంటుందో అంత పరిణతితో కవితలు రాశావని నన్ను మెచ్చుకున్నారు.కథలు రాసినా ,నవలలు రాసినా కవిత్వాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకు అని చెప్పారు. దాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేని ప్రశంసగా భావిస్తాను.

చొప్పదండి సుధాకర్ తో ముఖాముఖి గ్రహీత నరేశ్

మీ శబ్ద ఋతువు కవిత సంపుటిలో మార్మికత తక్కువగానే ఉంది.దాని గల కారణం?
నేనెప్పుడూ సూటిగా కవిత్వం చెప్పడానికే ఇష్టపడుతాను. మార్మికతతో కూడా కొన్ని కవితలు రాశాను. కానీ ఎక్కువగా దానినే ఆశ్రయించలేదు. ఎందుకంటే అది సాధారణ పాఠకునికి అర్థం కాదు. మార్మికతను,పాండిత్యం తెలివితేటలు ప్రదర్శించడానికి,విషయం క్లిష్టంగా చెప్పడానికి ఉపయోగించవచ్చు. కానీ పూర్తిగా అందులోనే రాస్తే సాధారణ పాఠకుడు కవిత్వానికి దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే నేను విషయం స్పష్టంగా,సూటిగా ఉండే విధంగానే కవిత్వం చెప్పాలనుకున్నాను.చెప్పాను.

కవిగా జీవితం ప్రారంభించి కథా రచయితగా మరో అవతారం ఎందుకు ఎత్తాల్సివచ్చిందో చెప్పండి.
నేను కవిత్వం రాసే సమయంలోనే కొన్ని కొన్ని సంఘటనలు నన్ను కథకునిగా మార్చాయి.కవిత్వంలో చెప్పలేని విషయాలను కథల్లో చెప్పొచ్చు.కథలో కూడా కవిత్వాన్ని చూపించవచ్చు. నేను కథకుడిగా రాణించడానికి గల కారణం నా వాక్యాలు కవితాత్మకంగా ఉండడమే. ఒక పెద్ద విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు మనకు కథ, నవల సహాయపడతాయి. కాబట్టి నేను చూసిన సంఘటనలు,నన్ను కదిలించిన విషయాలు కొన్ని కవిత్వంలో ఇమడలేనివి. అందువల్లే కథలు రాయడం ప్రారంభించాను. నా మొదటి కథ 1989 లో అచ్చయింది. కథాసంపుటి మాత్రం కొన్ని కారణాలవల్ల 2011లో (వెన్నెల కుప్పలు) వెలువరించాను. ఇప్పటికీ నా దగ్గర 10-12 పుస్తకాలకు అచ్చయ్యేంత సాహిత్యం ఉంది. అది మొత్తం బయటికి రావాలంటే చాలా డబ్బు కావాలి. ఈసంవత్సరం మాత్రం ఒక పుస్తకం తీసుకొస్తున్నాను.
నేను ఈ మధ్య ఒక కథ రాసాను. దాని పేరు “తెల్లారే ముంగట సుక్క” ఇందులో విషయమేంటంటే ఒక ఊర్లో మల్లవ్వ అనే మంత్రసాని ఉంటుంది. ఆమె ఊర్లో అందరికీ కాన్పులు చేసింది;కాని ఆమెకు మాత్రం పిల్లలు లేరు. ఆ ఊరిలో రెండు మూడు తరాలు ఆమె చేతులమీదుగా పుట్టిన వాళ్లే. ఒకరోజు ఆమె చనిపోతుంది. ఆమెకు పిల్లలు లేరు కాబట్టి ఆమెకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో,చివరికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రెటరీ కలుగజేసుకొని తానే తలకొరివి పెడతాడు. ఈ సంఘటన ఒక ఊరిలో జరిగింది‌ దీన్ని నేను కవిత్వంలో చెప్పలేక కథలో చెప్పాల్సి వచ్చింది.నేను ఒక చోట “కథ కాలనీ వంటిది నవల నగరం వంటిది” అని చెప్పాను. వస్తువును బట్టి చెప్పాల్సిన విషయసాంద్రత మారుతుందని దాన్నిబట్టి ప్రక్రియ మారుతుందని నా ఉద్దేశం.

మీ “వెన్నెల కుప్పలు” కథా సంపుటిలో ఉన్న కథలన్నీ అద్భుతంగా ఉంటాయి. అందులో “గంటీలమడి” కథ ఎప్పుడో రాసినా దానికి ఇప్పటికీ దానికి ప్రాసంగికత ఉంది.అలా ఎలా రాయగలిగారు?
ఒక కవి లేదా రచయిత కవిత్వమో, కథనో రాయాలంటే తను ఊహించి రాయొచ్చు లేదా ఏదైనా సంఘటన ఆధారంగా రాయవచ్చు .నేను రాసిన” గంటీల మడి” కథ అలాంటిదే. భూమిని అమ్ముకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుకే కొన్ని ప్రాంతాల్లో భూమిని భూతల్లి అని కూడా అంటారు.గంటిల మడి కథ కూడా నా జీవితంలో చూసి రాసిందే. కొంత కల్పన జోడించాలంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంత ఊహించి రాయాలి. అలా రాసాను కాబట్టే దానికి ఇప్పటికీ ప్రాసంగికత ఉన్నదని అనుకుంటున్నాను.అలాగే “పంట పొలాలు” కథ కూడా భూమి ఇది వృత్తం గానే సాగుతుంది. ఆ కథలో ఇద్దరు ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తులు ఒకరు జాబ్ చేసి చివరికి వ్యవసాయం వైపు, ఇంకొక వ్యక్తి ఉన్న పొలాన్ని వదిలి జాబ్ వైపు పయనించాలని చూస్తారు. కానీ అతనిలో మార్పు వచ్చి మళ్లీ పొలం దగ్గరికే వెళతాడు. రైతు కంటే రాజు ఎవరూ ఉండరు కదా! . నా కథా సంపుటిలో నాకు రాష్ట్రస్థాయి బహుమతి తీసుకొచ్చిన కథ “బతుకు వాసన” . ఇందులో గొప్పగా ఎదిగిన వ్యక్తి తన మూలాలు మర్చిపోతాడు.కొంతకాలం తరువాత ఒక గాలివానలో చిక్కుకున్నప్పుడు తనకు తన మూలాలు గుర్తుకువచ్చి మళ్ళీ పేదలవైపు ఆలోచించడం మొదలుపెడతాడు. ఈమధ్య కాలంలో ఈ అంశంతో సినిమా కూడా వచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి.

మీరు కథలు రాసే సమయానికి ఇప్పటికీ సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందని భావిస్తున్నారా?
చాలా వచ్చింది. ఎడ్యుకేషన్ పెరిగింది, సామాజిక పరిస్థితులు మారాయి ,పంటపొలాలన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి, సోషల్ మీడియా జీవితాలపై బాగా ప్రభావం చూపుతుంది.జీవితం కూడా యాంత్రికంగా మారిపోయాయి.

మీ సాహితీ లక్ష్యం నెరవేరిందని మీరు భావిస్తున్నారా?
మంచి సమాజాన్ని నిర్మించడమే సాహిత్యం లక్ష్యం. అందులో నా సాహిత్యం చాలా వరకు వాస్తవ జీవితాలను ప్రతిబింభించేదే కాబట్టి వాటి యొక్క ప్రభావం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను.ఉదాహరణకి నేను బిక్షగాళ్ళపైన ఒక కథ రాశాను. అది చదివినవారు వారికి దానం చేయకపోవచ్చు కానీ అసహ్యించుకోరు. అదేవిధంగా తల్లిదండ్రులపై రాసిన కథలు చదవడం ద్వారా తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి,వాళ్లకి చివరి దశలో ఏం అవసరమో తెలుసుకుంటారు వారి పట్ల దృక్పథాన్ని మార్చుకుంటారు.ఇలా ఒక్కో కథ ఒక్కో ప్రయోజనాన్ని ఆశించి రాసిందే . దాని ప్రభావం ప్రత్యక్షంగానో,పరోక్షంగానో సమాజం పైన ఉంటుందని నా నమ్మకం.

మీరు రాసిన కథల్లో కొన్ని పూర్తి తెలంగాణ మాండలికాల్లో రాశారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? కథా రచనలో భాషా,యాసల ప్రభావం ఎంత ఉంటుంది?
దానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి భాష ప్రవేశిస్తుంది.అలాగే మన యాసలోనే చెప్తే బాగుంటుందని కొన్ని కథలను అలా చెప్పాను. కథలో భాష,యాసలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. యాసలో రాయడం వలన ఆ కథలను ఓన్ చేసుకోగలుగుతారు. అలాగని అన్ని కథలు అలాగే రాయలేము. నగరం ఇతివృత్తంగా గల కథలో యాసను అంతగా వాడలేం. కాబట్టి ఇతివృత్తాన్ని బట్టి భాషను ఎంచుకోవాలి అప్పుడే కదా!చదివేవారికి కథ మనసుకి హత్తుకుంటుంది. కథలో జీవం ఉంటుంది.

కథా రచయిత నుండి మళ్ళీ నవలా రచయితగా మారడానికి గల కారణం?
చెప్పాలనుకున్న విషయమే ఒక కారణం.నేను నవలలు బాగా చదివేవాడిని. వాటిని చదివిన తరువాత నేను కూడా ఎందుకు నవలలు రాయకూడదు అనే ప్రశ్న నాలో ఉదయించింది. అదే నన్ను నవల రాసే విధంగా చేసింది. నేను రాసిన “జీవితం చేసిన సంతకం” నవల 1991లో రాసింది. అది పత్రికలో కూడా సీరియల్ గా వచ్చి దానికి మంచి పేరు కూడా వచ్చింది. మొదటగా ఆ నవల పోటీ కోసం రాసింది; కానీ అది బయటకు రావడానికి చాలా సంవత్సరాల టైం పట్టింది. 2017 లో దాన్ని ప్రచురించాను.సీరియల్ గా రాస్తే వారం వారం ఒక మంచి ముగింపు ఉండాలి. తర్వాత వారం ఎప్పుడు వస్తుందో అనిపించే విధంగా రాయగలగాలి.అలాగే రాశాను కాబట్టి ఆ నవల ఎక్కువమంది పాఠకులకు చేరుకోగలిగింది.ఇది క్రైమ్,రాజకీయాల బ్యాగ్రౌండ్ లో జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నవల ఒక సాధారణ వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశారు అనేది నవలలో అంశం. ఇంతపెద్ద డ్రామా కథలో చెప్పలేను కాబట్టి నవలలో చెప్పాలనిపించింది.

మీ “జీవితం చేసిన సంతకం” నవలలో ఫరీదా పాత్ర కీలకమైంది. అది ఊహించి రాసిన లేదా నిజ జీవితంలో ఎవరినైనా చూసి రాసినదా?
కొంత రియాల్టీ లోంచి రాసింది,కొంత కల్పితాన్ని జోడించి రాసింది.రాజకీయాలు చాలావరకు డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇందులో స్త్రీలు కూడా కొన్ని సందర్భాలలో కీలకంగా మారతారు.అవసరమైతే రాజకీయాలను కూడా శాసిస్తారు.వారు తెగిస్తే ఎలా ఆలోచిస్తారో, పావులు ఎలా కదుపుతారో ఈ నవలలో చూడొచ్చు.

మీ అభిమాన రచయిత ఎవరు ఎందుకు?
నా అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆయన ఫిక్షన్ అయినా నాన్ ఫిక్షన్ అయినా ఆకట్టుకునే విధంగా రాస్తాడు. ఒక తరాన్ని తన నవలా లోకంలో విహరింపజేసిన అద్భుతమైన రచయిత.అలాగే చిక్కగా రాసేవారెవరినైనా నేను ఇష్టపడతాను.

    మీరు పొందిన అవార్డుల గురించి చెప్పండి.
    “కీర్తిచక్ర” సాహితీ పురస్కారం.పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారు అందించారు.
    కవిత్వానికి:
    సాహిత్యంలో అత్యుత్తమ సంస్థ “ఎక్స్ రే”కవిత్వ పోటీలో మొదటి బహుమతి.(1995)
    1996 లో రంజనీ కుందుర్తి అవార్డు.
    GVR పురస్కారం రెండుసార్లు.
    కథలకు
    రంజని కుందుర్తి సంస్థ వారు నిర్వహించిన కథల పోటీలో “మట్టి పండగ” కథకు మొదటి బహుమతి.
    సోమెపల్లి పురస్కారం.(మొదటి బహుమతి)
    గంటీలమడి కథకు జాగృతి పత్రిక వారు అందించిన బహుమతి.
    ఆంధ్రభూమి పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో “బతుకు వాసన ” కథకు బహుమతి.
    “రచన” సంస్థ (USA) వారు నిర్వహించిన కథల పోటీలో “ఉన్నోళ్లు”కథకు ప్రథమ బహుమతి.
    “మైత్రేయి కళాసమితి” (సంగారెడ్డి) వారు నిర్వహించిన కథల పోటీలో “వారసత్వం” కథకు ప్రథమ బహుమతి.
    APTF వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి.
    ఉపాధ్యాయ పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో”రంగు వెలిసిన బతుకులు”కథకు మొదటి బహుమతి.
    “ఆంధ్ర ప్రభ” దినపత్రిక వారు నిర్వహించిన పోటీలో “ద్వానాంతరంగం” పుస్తకం పై రాసిన విమర్శకు గాను మొదటి బహుమతి.

    కొత్తగా రాసేవాళ్ళకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి?
    కొత్తగా రాసే రచయితలు ముందుగా బాగా చదవాలి. ప్రాచీన సాహిత్యాన్ని ,ఆధునిక సాహిత్యాన్ని, ఇప్పుడు వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి .అదేవిధంగా చిక్కగా రాయడం నేర్చుకోవాలి.నిరంతరం రాస్తూ పత్రికలకు పంపించాలి. అప్పుడు మాత్రమే కవైనా, రచయితైనా రాణించగలుగుతాడు. తన భావనా శక్తిని ఇనుమడింపజేసుకుంటారు.భవిష్యత్ తరాలకు గుర్తుండి పోతారు.
    – చొప్పదండి సుధాకర్
    9177348349

    You may also like

    11 comments

    Juan2869 July 27, 2025 - 7:02 am Reply
    Irene1188 July 27, 2025 - 7:26 pm Reply
    April3479 July 27, 2025 - 8:34 pm Reply
    Oliver4159 July 27, 2025 - 8:53 pm Reply
    Mateo893 July 28, 2025 - 6:31 am Reply
    Axel4881 July 28, 2025 - 7:30 am Reply
    Kayla4216 July 28, 2025 - 2:44 pm Reply
    Elena2820 July 28, 2025 - 8:05 pm Reply
    Isabella4114 July 28, 2025 - 11:32 pm Reply
    Eli1279 July 29, 2025 - 2:52 am Reply
    Morgan5000 July 29, 2025 - 10:43 am Reply

    Leave a Reply to Axel4881 Cancel Reply