Home ఇంట‌ర్వ్యూలు బ్రహ్మశ్రీ మోతుకూరి నరహరి గారితో ముఖాముఖీ

బ్రహ్మశ్రీ మోతుకూరి నరహరి గారితో ముఖాముఖీ

శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక ముఖాముఖిలో భాగంగా ప్రముఖ పండితులు, సాహిత్యానికి సామాజిక ప్రయోజనమే లక్ష్యమని నమ్మే సాహితీ మేరునగం బ్రహ్మశ్రీ మోతుకూరు నరహరి గారితో రంగరాజు పద్మజ ఈనాటి ముఖాముఖి….

ఏదేని సాహిత్యరచనలోని తప్పొప్పులు గమనించి చెప్పేది విమర్శ. అయితే అలా విమర్శ చేయాలంటే సాహిత్యంలో గొప్ప నిష్ణాతులై ఉండి, విద్వాంసులై ఉండి,ప్రాచీన వాఙ్మయంపై నిత్యం అధ్యయనం చేసేవారు మాత్రమే చక్కని విమర్శ చేయగలరు. దీనికి జ్ఞాపక శక్తితో పాటు, పునశ్చరణ ఉండాలి! ఇవన్నీ కలిసి చేసే విమర్శతో సారస్వత పరమార్ధం తెలుస్తుంది.
కవి ప్రవృత్తి జోలికి పోకుండా, కావ్యాన్ని మాత్రమే స్వచ్ఛమైన విమర్శ చేస్తూ, రచనలు ప్రోత్సహిస్తేనే నిజమైన విమర్శ అనిపించుకుంటుంది.
ఇటువంటి సద్విమర్శలు చేసే మాన్య మహోదయులు బ్రహ్మశ్రీ మోత్కూరు నరహరి గారు ఒక విమర్శకులే కాదు, ఏ విషయమైనా అనర్గళంగా ఉపన్యసించే మంచి వక్తలు… సాహితీవేత్తలు… వ్యాకర్తలు… సామాజిక స్పృహ కలిగిన మానవతామూర్తులు!ఉద్యమ సంఘాలను ముందుండి నడిపించగల నాయకులు…
ఏదేని విషయం అడగగానే ఆ నిర్దిష్ట విషయం ఏదైనా సరే వ్యుత్పత్తి అర్ధాలతో, వ్యాకరణ వివరణలతో వివరించగల విచక్షణులు.
అటువంటి కవి, పండిత, విమర్శకులైన మాన్యులు నరహరి గారితో సంభాషించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం!
మీ రంగరాజు పద్మజ.

రంగరాజు పద్మజ :– నమస్కారమండి!

మోతుకూరి నరహరి గారు:- శుభం అమ్మా!

పద్మజ:– కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో మయూఖ పత్రిక మీతో ముఖాముఖి చేసి ఎన్నో విషయాలు పాఠకులకందించాలని అభిలాష!
మీరు అంగీకరించడం మీతో మాట్లాడే అరుదైన అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది.

నరహరి గారు :– చాలా సంతోషమమ్మా! నీహారిణి నాకు పది సంవత్సరాలుగా పరిచయమే! ఆమె Phd చేస్తున్నప్పుడు, తన గైడ్ నిత్యానంద రావుగారిని వ్యాకరణ, సంస్కృత శ్లోకాల గురించి అడిగితే… నన్ను కలవమని చెప్పగా తను వచ్చింది.
కొండపల్లి శేషగిరి రావు గారి కోడలుగా సరే! కానీ వాళ్ళ నాన్నగారు సుప్రసిద్ధ కమ్యూనిస్టు, 52లో ఎంపీగా గెలిచాడు. అది కూడా కాళోజి గారి మీద. ఆయనంటే నాకు చాలా గౌరవం. నీహారిణిని నేను చెల్లెలిలాగ భావిస్తాను. ఆమె భర్త వేణుగోపాల్ తో కూడా సన్నిహితంగా ఉంటాను.

పద్మజ:– మీ కుటుంబ నేపథ్యం చెప్పండి?

నరహరి గారు :– మా స్వంత ఊరు మోతుకూరు పక్కనే బుజిలాపురం. ఇంటిపేరు కూడా మోత్కూరే! మన ఇండ్ల పేర్లు ఊళ్ళ పేర్లు అయినప్పుడు వలస అని అనుకోవాలి! నేను పుట్టింది 11-4-1944 అని రాసారు. తెలుగు పంచాంగం ప్రకారం బహుశా తారణ నామ సంవత్సర ఆషాడ శుద్ధ ఏకాదశి అయి ఉంటుంది. దానికి ఎలిబీ లేదు.
పక్కనే ఇక్కుర్తి అని ఒక ఊరు ఉన్నది. ఆ ఊర్లో మా అమ్మమ్మ గారు ఉండేవారు.
నేను మొట్టమొదటి సంతానాన్ని కాబట్టి అక్కడే పుట్టాను. 11 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మమ్మగారింట్లోనే పెరిగి, అక్కడే చదువుకున్నాను. తర్వాత మోత్కూర్ కు వచ్చినాను. హై స్కూల్ వరకు చదువుకున్నాను. 62లో హైస్కూల్ చదువు అయిపోయింది. మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యులు కూడా! ఆ రోజుల్లో కమ్యూనిస్టు కానివారు లేరు. ఎందుకంటే తెలంగాణ పోరాటం 1956 లో ప్రారంభమైంది. పోరాటాన్ని నేను చూడలేదు కానీ పోరాటం తర్వాత పోలీస్ యాక్షన్ పోలీసుల దాడులు, కమ్యూనిస్టులను చిత్రహింసలు పెట్టడం చూశాను.
1964 లో పార్టీ చీలిపోయేంత వరకు అంతా కలిసే ఉన్నారు కాబట్టి, నాన్న కూడా అందులో చురుగ్గా పనిచేసేవారు. మా మేనమామలు కూడా పౌరోహిత్యం చేసుకుంటున్నా సరే! కమ్యూనిస్టు సానుభూతిపరులుగా ఉండేవారు. కమ్యూనిస్టులు రాత్రిపూట వచ్చి “అమ్మా! మీకేమైనా ఇబ్బంది వస్తే మేము వస్తాము” అని చెప్పేవాళ్ళు.
మా అమ్మమ్మ వాళ్ళు అవ్వారు వాళ్ళు. నేను పుట్టేటప్పటికీ మా తాతయ్య రామకృష్ణయ్య గారు మరణించారు. మా పెద్దమ్మ మడికొండ పల్లా దుర్గయ్య గారి వదిన నరసమ్మ గారు వెంకటయ్య గారి భార్య. రెండవ వారు మా అమ్మ. త్రిపురారి వెంకట్రామయ్య గారి భార్య అహల్యగారు మూడు వీరంతా పేరుకు అగ్రవర్ణమే! కానీ ఏమీ చదువుకోలేదు. కానీ కార్తీకమాసంలోనూ, రోజూ విధివిధానంగా ఆచారాలు పాటించే వాళ్ళు. వాళ్లు పాడే పాటలు విని విని పాటల మీద, పద్యాల మీద, శ్లోకాల మీద ఒక రకమైన ఆసక్తి కలిగింది.
పద్మజ :– మీ అభిరుచులలో అటు కమ్యూనిస్టు భావాలు- ఇటు సంప్రదాయ రచనలు, ప్రాచీన వాఙ్మయం, సాహిత్యానికి ఆకర్షింపబడటం, అందులో రాణించగలగడం ఇలా పరస్పర వైరుధ్యాలు ఎలా సాధ్యమైంది?

నరహరి గారు :– ఇది ఒక అపోహ మాత్రమే! సంప్రదాయంలో పుట్టిన వారికి వామపక్ష భావాలు ఉండడం అసహజమనుకుంటారు కానీ, కమ్యూనిజం ఏం చెబుతుంది?

ఒక మనిషిని వేరొక మనిషి; ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై చెల్లదు అని కదా!

శ్రీశ్రీ చెప్పిందే మార్క్స్ చెప్పాడు. మార్క్స్ చెప్పింది ఏమిటి కమ్యూనిస్టు మేనిఫెస్టోలో మొట్టమొదటి వాక్యం ఏమిటి అంటే
ఇదివరకు జరిగిన చరిత్ర అంతా కూడా వర్గాల మధ్య జరిగిన పోరాటమే! అనే వాక్యం మొదటిది.
మన భారతీయ సంప్రదాయంలో నేను హిందూ అనడం లేదు! వైదిక అంటున్నాను… భారతీయ సంప్రదాయం కానివ్వండి, అద్వైతం కానివ్వండి, విశిష్టాద్వైతం ఏదైనా సరే కోరుకునేది ఏమిటి?

సర్వే భవంతు సుఖినః
సర్వేసంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్
(మా కశ్చిద్ – దుఃఖ- భాగ – భవేత్)

ఎవరికీ దుఃఖం కలుగకుండు గాక! అందరూ సమానంగా ఉందురు గాక !
అనే కదా! కోరుకునేది మరి కమ్యూనిజం కోరుకునేది కూడా అదే కదా? ఎందుకో కమ్యూనిష్టులను దుర్మార్గులు, దుష్టులు అని ఒక ముద్ర వేసారు. అలా ఏమీ లేదు. ఒక పీడనం ఉందా? లేదా? ఇవాళ దోపిడీ ఉందా? లేదా? ఈ దోపిడీని అంతం చేయాలంటే ఏం చేయాలి ?ఒక్క ముక్కలో చెప్పాలంటే వైదిక సంప్రదాయం అనేది సిద్ధాంతం చెబుతుంది… సూత్రీకరిస్తుంది… విషదీకరిస్తుంది.
మార్క్సిజం దాన్ని ఆచరణలో చూపెడుతుంది. అందువల్ల ఈ రెండింటి మధ్య ఏమాత్రం వైరుధ్యం లేదు.
ఎందుకంటే? నేను ప్రసంగించినప్పుడు రామానుజాచార్యుల వారిని కోట్ చేసి చెప్తాను.
“రామానుజాచార్యుల వారి గురువుగారు
మంత్రోపదేశం చేసి ఎవరికీ చెప్పకండి” అని అంటే…
“చెప్తే ఏమవుతుంద”ని? రామానుజులు అడిగారట. “చెప్తే నీకు నరకం వస్తుంది” అన్నారట గురువుగారు.
“విన్న వారికి ఏమొస్తుంది”? అని రామానుజులు అడిగారట.
“స్వర్గం వస్తుంది”! అన్నారట గురువుగారు. “అయితే నాకు నరకం వచ్చినా పర్వాలేదు” అని రామానుజులు గిరిశిఖరం ఎక్కి అందరికీ మంత్రం చెప్తాను” అని అందరికీ స్వర్గం వస్తుంది… నాకు నరకం వచ్చినా పర్వాలేదు! అని అన్నారట. రామానుజులవారు.
అలాగే శంకరాచార్యులవారు వస్తుంటే ఎదురుగా కల్లుముంత పట్టుకొని చండాలుడు వస్తూ ఉంటే… ఆయన శిష్యులు అందరూ అతనితో అపసర అపసర అంటే పక్కకు తప్పుకో! పక్కకు తప్పుకో! అని అన్నారట!
ఆ చండాలుడు అన్నాడట ఎవరు తప్పుకోవాలి?
ఆత్మనా? పరమాత్మ నా? అని అడిగాడట. అది విని,
చండాలోస్తూ స తు ద్విజోస్తు గురురిత్యేషా
మనీషా! మమ!! ( మనీషా= బుద్ధి)(జ్ఞానం)
ఆ చండాలుడి ముందు సాష్టాంగ పడ్డారట ఆది శంకరులు.
మనసు ఆలోచిస్తుంది- బుద్ధి వివేచన చేస్తుంది. కాబట్టి గురువు- గురువే!
చండాల అస్తు ద్విజః అస్తు
బ్రాహ్మణుడు కావచ్చు! చండాలుడు కావచ్చు! కాబట్టి ఇక్కడ ద్వైతాద్వైతా విశిష్టాద్వైత ఏమి చూసినా సరే కులం పేరుతో మతం పేరుతో వివక్ష చూపించడం అనేది ఎక్కడా లేదు!
తర్వాత కాలాల్లో వచ్చినవి ఇవన్నీ. అందువల్ల భారతీయ సంప్రదాయానికి ఏ విధమైన వైరుధ్యము లేదు! ఇందాక నేను చెప్పినట్టుగా మన విశ్వాసాలు మన సిద్ధాంతాలు! మన సూత్రాలన్నీ ఆకాంక్షలు. ఇవే మార్క్సిజం అనేది ఆచరణ.
మొన్న దాశరధి గారి గురించి జూమ్ మీటింగులో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ దాశరధి గారు ఆ రోజుల్లో అన్నాడు
రానున్నది ఏది నిజం?
అదే సోషలిజం కలపండోయ్ భుజం భుజం
కదలండోయ్ గజంగజం!!
అన్నాడు. కానీ సోషలిజం వచ్చిన రష్యాలోనే కమ్యూనిజం పోయింది.. అన్నారు.
నేను వెంటనే స్పందించి సోదరా! మీరు చెప్పింది వాస్తవమే! రష్యాలో పోయినంతమాత్రం చేత ప్రపంచంలో అంతా పోయిందని కాదు! ఇవాళ ఉత్తర కొరియా గాని, వియత్నం గాని, క్యూబా కాని, మన పక్కన శ్రీలంకలో ఈ మధ్యనే లూరా, డేనీ లాంటి వాళ్ళు, వెనిజులా లాంటి వాళ్ళు వచ్చారు. ఎక్కడ పీడన ఉంటుందో? అక్కడ మార్క్సిజం ఉంటుంది!
రష్యన్ కవి ఇలా అంటాడు
“ఎక్కడ బాధ ఉందో అక్కడల్లా నేను ఉన్నాను”!
కారిన ప్రతి కన్నీటి కణంలో నన్ను నేను శిలువ వేసుకున్నాను” అని అన్నాడు.
దాన్ని శ్రీశ్రీ అనువాదం చేశాడు.
అలాగే రామాయణంలో కూడా
యత్రయత్ర రఘునాథ కీర్తనమ్
తత్త్ర తత్ర నతమస్తకాంజలిమ్
భాష్ప వారి పరిపూర్ణ లోచనమ్
మారుతిమ్ నమత రాక్షసాంతకమ్!
అని వాల్మీకి అంటాడు.
ఎక్కడెక్కడ పీడన ఉంటుందో? అక్కడక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఈ రెండింటికి వైరుధ్యం లేదు! మనం కోరుకునేది అందరూ బాగుండాలని, ప్రవచన కారులు ఇదే విషయం పదేపదే చెబుతున్నారు. కొద్దిమంది వింటున్నారు. కానీ ఆచరణలో పెట్టడం లేదు. అందుకే సమాజంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని నా బాధ!
అందువల్ల రెండింటికి సమన్వయం చేసుకోవాలి! తప్ప వైదిక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం, మార్క్సిజం అనేవి పరస్పర పూరకాలు… పోషకాలే… తప్ప పరస్పర వైరుధ్యమైనవి కావు!
పద్మజ:— మీరు ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో ఎందుకు చేరాలనుకున్నారు?

నరహరి గారు :—- నేను 1962లో హైస్కూలు పాస్ అయ్యి రెండు సంవత్సరాలు ఉద్యోగం కోసం ప్రయత్నించాను. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. అప్పుడప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది కనుక హైస్కూల్ చదువుతోనే ఉద్యోగం వచ్చేది. అప్పుడు నాకు అనారోగ్యంగా ఉండడంతో ఉద్యోగంలో జాయిన్ కాలేకపోయాను.
1964 ఆగస్టులో హైదరాబాద్ వచ్చాను. అక్టోబర్లో వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖాధి కార్యాలయంలో ఎల్డీసీగా ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో ఒక రెవెన్యూ , మరొకటి విద్యకు రెండు విభాగాలు ఉండేవి. తర్వాత వాటిని ఒకదానిలో మరొకటి కలిపారు. ప్రమోషన్ లు త్వరగా రావని 1965 లో హైదరాబాద్ వచ్చాను. ఉపాధ్యాయుడుగా చేయాలనుకున్నాను. అక్కడ ఒక మిత్రుడు కలిస్తే సాయంకాల కాలేజీలో చేరాలనుకుంటున్నాను. ఎక్కడ చేరాలి? అని అడిగితే, నల్లకుంటలో ప్రాచ్య కళాశాల ఉంది. ఖండవల్లి లక్ష్మీ నిరంజనం గారు దాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు ఉంటుందంటే 1965లో దానిలో చేరాను. డిప్లమా ఓరియంటల్ 1970లో వరంగల్లో ట్రైనింగ్ చేసాను, 1973లో ఎం ఏ, 1974లో లెక్చరర్ గా చేరాను. మా శ్రీమతి కూడా ఓరియంటల్ కాలేజీలో చేరింది. బి ఓ ఎల్; డీవొయల్ చేసింది. 1972లో ట్రైనింగ్ చేసి ఉద్యోగంలో చేరింది. నేను రావడంతో నా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి చదువుకుని అందరూ స్థిరపడ్డారు. ఒక వైదిక సంప్రదాయంలో పెరిగాను కాబట్టి అమ్మమ్మ నేర్పించిన మంత్రాలతో పౌరోహిత్యం చేయించేది. చిన్నప్పటి నుండి అవన్నీ వింటున్నాను.కాబట్టి ఓరియంటల్ కాలేజీ అనగానే సంస్కృతం ఉంటుందని ఆసక్తి కలిగింది. నమక చమకాలు; శ్రీ, భూ సూక్తాలు ఇవన్నీ విని నేర్చుకున్నాను. కానీ అది సంస్కృతం అని, దానిలో కవులు ఉన్నారు, సాహిత్యం ఉందని తెలియదు! DOL లో చేరాక కాళిదాసు అనే కవి , కాదంబరి రాసిన బాణబట్టు కవులున్నారని తెలిసింది.
మా గురువుగారు చేగుంట శివునూరి విశ్వనాథ శర్మ గారు సంస్కృతం, వ్యాకరణం, కాదంబరి వంటి కావ్యాలు చెప్పారు. ఇన్నేళ్లయిన వారు చెప్పిన పాఠాలు మర్చిపోలేదు. ఆ ఒరవడిలోనే నేను నా విద్యార్థులకు బాల వ్యాకరణం, ఇతర కావ్యాలు చెప్పాను. నరహరి సార్ అంటే బాల వ్యాకరణం అనే గుర్తింపు వచ్చింది.
పద్మజ:—- మీరు మూడు తరాల గురువులను చూసారు కదా! మీరు, మీగురువుగారు ఎలా ఉండేవారు? నేటి గురువుల పరిస్థితి ఏమిటి?

నరహరిగారు :– గురువులంటే హైస్కూల్లో అమృత పాఠశాలలో ఉన్నప్పుడు మాకు ఆత్మకూరు ప్రాంతంలో చాడ అనే ఒక ఊరు ఉంది. అక్కడ తిరునగరి శ్రీనివాసులు గారు మా గురువు. ఆయన మాకు తెలుగు నేర్పేవారు ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు గాని, 15 ఆగస్టు నాడు గాని తప్పకుండా ఒక దేశ భక్తి కవిత చదివించేవారు. ఆయన ప్రోత్సాహం వల్ల షేక్స్పియర్ నాటకాన్ని అనువాదం చేసాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ దినపత్రిక వచ్చేది. పల్లా దుర్గయ్య గారి గంగిరెద్దు, దాశరధి కవితలు మొదలైనవి చదవడం వల్ల భాష మీద పట్టు ఏర్పడింది. కాలేజీకి వచ్చిన తర్వాత విశ్వనాధ శర్మ గారు సంస్కృతం నేర్పడం, రామారావు గారు, ఆంజనేయ శాస్త్రి గారు మొదలైన వారంతా మాకు తెలుగు- సంస్కృతం నేర్పించారు.
పాతకాలం గురువులకు ఏ వ్యాపకాలు లేవు!
యజుర్వేద – తైత్తరీయ సంహితలో శీక్షావల్లి అని అనువాకం ఉంది. దాన్లో ఇలా చెప్తారు.

స్వాధ్యాయ ప్రవచనాత్ ప్రమధితవ్యమ్

స్వాధ్యాయం అంటే యజ్ఞం అని ఒక అర్థం. స్వయం శిక్షణ అని మరో అర్థం. మనం విద్యార్థులకు బోధించే ముందుచదువుకొని తయారై విద్యార్థులకు బోధించాలి అని దాని భావం.
పూర్వకాలపు ఆశ్రమాలలో గురువులు అనుష్టానం చేసుకోవడం ; చదువు చెప్పడం తప్ప మరో వ్యాపకం లేదు.
మా గురువుల తరంలోనూ ఫోన్లు వగైరాలు లేవు. నిత్య నైమిత్తిక కర్మలు చేసుకోవడం, చదువుకోవడం, పాఠాలు చెప్పడం వాళ్ళ కర్తవ్యంగా ఉండేది.
మా దగ్గరికి వచ్చేసరికి 1967 లోనూ, 1972లో ఆలియాలో పనిచేసే నాటికీ, 1974లో లెక్చరర్ గా చేరినప్పటికీ ఈ మొబైల్స్ రాలేదు! ఒక్క టీవీ ఉండేది. అందుకే మా చదువంతా పుస్తకాలు, పత్రికలతోనే నడిచింది. మాకు కోయిల్ కందాడై రంగనాథాచార్యులు మాకు ప్రిన్సిపాల్ గా ఉండే వారు.
తరగతిలో చాలామంది ఉపాధ్యాయులు గద్యమో, నాటకమో? ఇంకా ఏదో చెప్తామనేవారు. అలంకార శాస్త్రం ఛందస్సు చెప్పే వాళ్ళు విమర్శ చెప్పే వాళ్ళు కావాలి. అలంకార సంగ్రహం, ప్రతాప రుద్రీయము చెప్పాలి బాల- వ్యాకరణం ప్రౌఢ్యాకరణాలు చెప్పాలి. ఆంధ్ర శబ్ద చింతామణి కూడా చెప్పే వాళ్ళు కావాలి. వాళ్ళు దొరకడం లేదు అని అన్నారాయన. నేను తెలుగు ఉపాధ్యాయుడిని కనుక
నాకు వాటిమీద ఆసక్తి ఉంది. సిద్ధమే చెప్తాను సార్ అని నేను అన్నాను. సాయంకాల కళాశాల కాబట్టి పగలంతా సమయం దొరికేది అప్పటికే విద్యార్థి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఐకమత్యం కోసం ఉద్యమాల్లో పాల్గొంటున్నా కూడా ఎక్కువ చదివే వాడిని. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి రమణీయం మొదలైనవి చదువుకొని తరగతికి వెళ్లేవాడిని. అలంకార శాస్త్రంలో మొదట సంస్కృతంలో శ్లోకం చెప్పి దానికి పద్యం చెప్పాలి.
శ్లోకాన్ని కూడా చెప్పగలగాలి! పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఏమంటారంటే?
” యజ్ఞతి బహు నాధీశే తధాపీ పఠ పుత్ర వ్యాకరణమ్!
స్వజనః స్వజనో ఆభూత్ సకలం‐- శకలం; సకృత్- శకృత్ అని చెప్తుండేవారు.
కొడుకుతో ఒరేయ్ అబ్బాయీ! నువ్వు ఎంత చదువుకున్నా సరే! వ్యాకరణం చదువుకో లేకపోతే ఏ పదాలకు ఏం అర్థమో తెలియదు. కాబట్టి వ్యాకరణం చదువుకో!
ఎందుకంటే స్వజనః= మన వాళ్ళు; శ్వజనః= కుక్కల గుంపు; *సకలం= మొత్తం ; శకలం=ముక్క అని సకృత్ = అరుదుగా ; శకృత్= పేడ అని అర్ధం.

దీన్ని నేను ప్రయోగంలో ఇలా చెప్పేవాణ్ణి. ఉపనయనం చేసేటప్పుడు వెంట్రుకలు కత్తిరించే సమయంలో…
పూర్వతోపతి; దక్షిణతోపతి,కృత్తాన్, కేశాన్ పిండే దధాయ
అని మంత్రం చెప్పి అర్ధం చెప్పితే చక్కగా అర్ధమౌతుంది. నా పద్ధతి ఏమిటంటే? ఒక పదం చెప్పితే అర్ధంతో పాటు అలా ప్రయోగం కూడా చెప్తాను.
ఉదాహరణకు ఇటీవల కాలంలో కాంతారా సినిమా వచ్చింది. కాంతారా అంటే అర్థం ఏమిటని చాలామంది నన్ను అడిగారు. కాంతారా అంటే అడవి దానికి సంబంధించిన చరిత్ర అని అర్థం. అలా పదం దానికి అర్థం చెప్తే సరిపోదు ప్రయోగం చెప్పాలని…
వారికి శ్యామలా దండకంలో
కాంతార వాసప్రియే! కృత్తి వాసఃప్రియే సర్వలోక ప్రియే! సర్వమంత్రాత్మకే….

ఈ ఉదాహరణ చెప్పాను.
సింగం అనే పదానికి తెలుగు ఉదాహరణ ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు వస్తూ ఉంటే ద్రోణాచార్యుడు వచ్చేవాడు ఎవరనుకుంటున్నారు?

వచ్చెడు వాడు ఫల్గుణుడు,
సింగం బాకటితో గుహంతరమునన్ చేడ్పాటుమై…
“కాంతారనివాసఖిన్నమతి అంటే అడవిలో ఇంత కాలం ఉండి, చాలా చిరాకు తో వస్తున్నాడని”
ఇలా వివరించేవాడిని.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గురువులకేమో వారి అనుష్టానం, మాకు చదువు చెప్పడం తప్ప ఇంకోటి లేదు. మా దగ్గరికి వచ్చేసరికి ఉద్యమాలు వచ్చాయి. నాకైతే సాయంకాలం కాలేజీ కాబట్టి మధ్యాహ్నం తీరిక దొరకడంతో ఉద్యమాలు చేస్తూనే చదువుకునే వాళ్ళం. ఎందుకంటే నాకు జీతం ఇస్తున్నది విద్యార్థులకు పాఠం చెప్పమని ఆ బాధ్యత నేను నెరవేర్చాలి. బాధ్యతలు నెరవేరిస్తే హక్కులొస్తాయ్… పాఠం చెప్పడం ముఖ్యం.
ఇప్పటికీ నిరంతరం రాస్తాను- చదువుతాను.
అందరికీ ఇంకొక సందేహం ఉంటుంది. శ్రుతి ఎలా రాయాలి? అని
స్మృతి ఎలా రాయాలని…
శ్రుతి ని శ కు కొమ్ము ఇచ్చి ర వత్తు ఇవ్వాలి.
స్మృతి ఎలా రాయాలంటే ? స కు మ వత్తు ఇచ్చి, వట్రుసుడి పెట్టాలి (రుత్వం)
ఇలానే ఎందుకు రాయాలంటే ?
శ్రుతి అంటే కొమ్ము ఇస్తాం కనుక
కుంతి కొడుకులు కౌంతేయులౌతారు.
బుద్ధుడిని బౌద్ధము ఔతుంది.
కుతూహలం = కౌతుకం ఔతుంది.
ఋషి లోని ఋ వేరు!
ఉ రాస్తే ఆది వృద్ధి వచ్చి ఔ అవుతుంది.
పుత్రుడు = పౌత్రుడు; పౌత్రి అవుతుంది.
పురము = పౌరులు కాబట్టి ఉ రాయాలి.శ రాసి వట్రుసుడి పెడితే రు కు ఆర్ ఆదేశమౌతే శార్త అవుతుంది. అయితే అందంగా ఉండదు

‘శ్రుతి’- సరి అయిన పదం. చాలామంది అనవధానత/ఔదాసీన్యం (Non-Serious ness)వల్ల ‘శ్రుతి-స్మృతి’ పదాలను-వాటి నుంచి ఏర్పడే రూపాలను గురించిన ఆలోచన లేకుండా-ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటారు.
శ్రుతి. =శ్ ర్ ఉ తి.
=శ్ ర్ ఔ తి-సంబంధార్ధంలో ఆది అౘ్చునకు వృద్ధి (ఉ->ఔ).
=శ్రౌతి-శ్రౌత…
‘శ్రౌత,స్మార్త నిత్యానుష్ఠాన..’
శృతి-అని రాస్తే ఏమవుతుంది?
=శ్ ఋ తి.
=శ్ ఆర్ తి/శ్ అర్ తి.
=శార్తి/శర్తి-వంటి అసాధు రూపాలు ఏర్పడుతాయి.
కనుక ‘శ్రుతి’ అనే రాయాలి.
స్మృతి=స్ మ్ ఋ తి.
=స్ మ్ ఆర్ తి/స్ మ్ అర్ తి
=స్మార్తి->స్మార్త…√. …
‘శ్రుతి స్మృతి పురాణానాం, ఆలయం కరుణాలయం..’.
స్మ్రుతి-అని రాస్తే ఏమవుతుంది?
స్ మ్ ర్ ఉ తి.
=స్ మ్ ర్ ఔ తి- సంబంధార్థంలో ఆది అౘ్చునకు వృద్ధి.
=స్మ్రౌతి-అనే అసాధు రూపం సిద్ధిస్తుంది. అందువల్ల ‘స్మృతి’ అని మాత్రమే రాయాలని అవసరమైన చోట్ల విద్యార్థులకు విడమర్చి చెప్పాలి!
మహాభారతంలో యయాతి చరిత్రలో యయాతి క్షత్రియుడు కదా! దేవయాని బ్రాహ్మణ అమ్మాయి కదా! పెళ్లి ఎలా చేసుకున్నాడు? అని ఒక ప్రశ్న వేసారు.
రాజు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలి కదా!
వర్ణధర్మముల్ కాదు సురల నేలిన యయాతి భూసురోత్తమ భార్గవ పుత్రి తానెట్లు దేవిచేసే?

అనే ప్రశ్న వేస్తే ఆ కచదేవయాని కథంతా వస్తుంది. వ్యాకరణలో కూడా అదే కిమ్? అంటాడు.
అంటే ఈ పదాన్ని ఇలానే ఎందుకనాలి? ఇంకొక విధంగా ఎందుకు అనకూడదు? అనే ప్రశ్న వేసి దానికి జవాబు చెప్తాడు.
ప్రశ్న వేయడం అనేది భారతీయ సంప్రదాయంలో వైదిక సంప్రదాయంలో ఉంది.
అసలు నేనెవరిని?
కః అహం?
ఈ కః విసర్గకు ఓత్వం వస్తుంది. అహం అనేదానికి అకారపు శ్లేష పెట్టాలి.
కోహమ్? అనాలి నేనెవరిని?
పరమాత్మ- ఆత్మ – తత్ – త్వం – అసి
తత్ అంటే అది ( పరబ్రహ్మస్వరూపము)
త్వం అంటే నీవు
అసి అంటే క్రియా పదమైతే ఉన్నావు అని అర్థం. అసి నామవాచకమైతే కత్తి అని అర్థం.
ప్రతిదానికి అర్థాలు మారుతూ ఉంటాయి.
ఉదాహరణకు మత్తః అని ఉందనుకోండి!
మత్తః = మత్తుడు
మత్ + తః = నుండి ఇలా అర్ధాలు మారుతాయి. విభిన్నమైన భాషల్లో కూడా ఇలా నానార్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులకు ఇలా గురువు విడమర్చి చెప్పాలి అని…. ఆ విద్యార్ధికి విద్య ఎలా వస్తుందంటే???

ఉదా॥

ఆచార్యః పారమాదత్తే
ఆచార్యుడు చెప్పడం వల్ల ఒక వంతు, విద్యార్థి తన స్వంతంగా ఆలోచించి నేర్చుకోవడం వల్ల సగం వస్తుంది, సహాధ్యాయుల వల్ల ఒక పావు భాగం నేర్చుకుంటాడు. లోకజ్ఞానం వల్ల మరికొంత జ్ఞానం వస్తుంది. అందుకే గురువులను గౌరవిస్తూనే వారి మార్గంలో నడవాలి!
కొడకండ్ల సిద్ధాంతి గారు పరమపదించినప్పుడు నేనొక వ్యాసం రాసాను.
మహాజనో ఏనక సంబంధా అని
ఏన కథా = ఏ మార్గంలో పెద్దవారు నడిచారో అది మన మార్గం. మహాజనహా + ఏ న కథః సబంధాః
మామూలు శీర్షికలు పెట్టవచ్చు! కానీ సంస్కృతం గురించి కుతూహలం కలిగించాలని ఆ శీర్షిక పెట్టాను.
ఉద్యోగ విరమణదేముంది? అయిపోయింది. కానీ నిరంతరం ఇప్పటికీ చింతన చేస్తూ ఉండడం ఆలోచిస్తూ ఉండడం, ఆలోచనఅంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను విద్యార్థులను లక్ష్మీదేవికి ఎంతమంది పిల్లలు? అని ప్రశ్నించాను. లక్ష్మీదేవికి పిల్లలు ఎవరు సార్? అన్నారు విద్యార్థులు…
“మన్మథుడున్నాడు కానీ అతని పుట్టుక మనకు తెలియదు. శరీరం లేకపోయినా ప్రాణం ఉంది.
కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు లక్ష్మీదేవికి” అని నేను అన్నాను.
“ఎక్కడ ఉన్నదని పండితులే” అడిగారు.
శ్రీ సూక్తం చదవండి అన్నాను.

ఆనందః కర్ధమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ౹
ఋషయః తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా॥
కర్తమేన ప్రజాభూతా మయి సంభవ కర్ధమ ౹ శ్రియం వాసయమే కులే మాతరం పద్మ మాలినీమ్॥

కర్థముడా! నీవల్ల అమ్మ తల్లి అయింది. లేకపోతే గొడ్రాలు అంటారు కదా! ఒక బిడ్డకే తల్లి అయితే కదలీ వధ్య అంటారు. అందుకే ముగ్గురున్నారని శ్రీ సూక్తం చదివితే తెలుస్తుంది.
పురుష సూక్తం చదవారా! అన్నాను.
“చదివాము అన్నారు” అందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి చెప్పండి అన్నాను.
1- విరాట్ పురుషుడిని వర్ణిస్తున్నారు.
సహస్ర శీర్షా పురుషః ౹
సహస్రాక్షః సహస్ర పాత్ ౹
అని వర్ణించారు. ఈ మహా విగ్రహానికి ముఖం ఎవరు? చేతులు ఎవరు? పాదాలెవరు? తొడలెవరు? అని ప్రశ్నించాడు!!
ముఖం కిమస్య ? ( ముఖం ఏకవచనం)
కౌ బాహు? ( బహువులు ద్వివచనం)
కౌవూరూ ఉచ్చారణలో కావూరు అవుతుంది.
పాదావుచ్యేతే ఈ నాలుగు ప్రశ్నలు వేశాడు.
నాలుగు ప్రశ్నలకు జవాబు చెప్పాడు.
బ్రాహ్మణః అస్య ముఖం ఆసిత్
ఆసీత్ = ఉన్నాడు ఆ స్థానం వాళ్ళది.
బ్రాహ్మణ ముఖమాసిత్
సర్వేంద్రియానం నయనం ప్రధానం! సర్వస్య గాత్రస్య శిర ప్రధానం( Think Tank)
రాజన్యః కృతః = క్షత్రియులు దేశాన్ని కాపాడాలి! కదా! దానికి బహువుల అండ ఉండాలి.
ఊరూ తదస్య యద్వైశ్యః
కోమట్లు వ్యాపారం చేసేవారనే అనుకుంటారు కానీ భగవద్గీతలో 18 వ అధ్యాయంలో గీతాకారుడు ఏం చెప్పారంటే?
ఒక్కొక్క వర్ణం ఏం చేయాలో చాతుర్వణ్యం అని చెబుతూ కృషి, గోరక్ష, వాణిజ్యం వైశ్య కర్మ స్వభావం అన్నాడు.
అంటే వ్యవసాయం, గోరక్ష ,వ్యాపారం చేయాలి! వ్యవసాయం చేయాలంటే పశువులు కావాలి కదా! అందుకు గోరక్ష చేయాలి. వ్యవసాయం చేస్తే పంట వస్తే తినగా మిగిలిన దాన్ని ఎగుమతి చేయాలి!
నీ దగ్గర లేని దాన్ని దిగుమతి చేసుకోవాలి! ఇది వ్యాపారం.
వ్యవసాయం నుండి వ్యాపారం వచ్చింది
పాదార ఈ భూమి మీద నిలబడాలంటే పాదాలే కదా అవే ముఖ్యము.
ఉపాధ్యాయుడుగా గతంలో ఉన్నవారు మహానుభావులు. మా తరానికి చెందిన ఉపాధ్యాయులు కొంతమంది ఉద్యోగంలో ఉంటూ రకరకాల వ్యాపారాలు చేసేవారు. ఎప్పుడూ అలాంటి వారు ఉంటారు. మేము నిష్టగా ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించాము.
ఇప్పుడు మంచివారు లేరని కాదు! కానీ, సంఖ్య తగ్గుతున్నది. రకరకాల వ్యాపకాలు సంపాదన కోసం పాకులాట ఎక్కువై దానికే సమయం కేటాయిస్తున్నారు. నేనేమంటానంటే ఉదయం తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు పని చేసి, అది కూడా యాంత్రికంగా కాకుండా పాఠాలు చెప్పేలా తాను ముందు చదువుకోవాలి! పిల్లలకు చెప్పాలి!
మా గురువులు ఎలా ఉండేవారు అంటే? కద్రువనాగమాత ఎక్కడుందిరా? అని అడిగేవారు.
జవాబుగా బాలవ్యాకరణం తత్సమ పరిచ్ఛేదం ఫలానా సూత్రం అని చెప్పాలి!
కద్రువ నాగమాత అని ఎందుకన్నాడు? ఏం సూత్రం? అంటే నిపాత సూత్రం.
నిపాతం అనే ఎందుకనాలి? అంటే కద్రువు అనేది సంస్కృతంలో దీర్ఘాంతంగా ఉంటుంది. తెలుగులో కద్రువ అంటున్నాము. సంస్కృతంలో కద్రూ దీర్ఘాంతం తెలుగులోకి వచ్చేసరికి “నామంబులకు దీర్ఘం హ్రస్వంబగు” అని సూత్రం! దాని ప్రకారం
కద్రువ అయింది.
కద్రూ ఏమిటి ? ఉకారాంతం కదా?
ఉకారాంత గో శబ్దములకు అంతట వు వర్ణకంబగు .( సూత్రం) అని రావాలి!
ఉదాహరణకు గురువు, తరువు,మనువు, మొదలైనవి మరి అలా అయితే కద్రువు కావాలి కదా? మరి ప్రయోగంలో కద్రువ అని ఉంది కదా! అందువల్ల కద్రువా అనే శబ్దాన్ని వ్యాకరణ సూత్రాలతో సాధించలేరు!! ఇది ఇలానే ఉంటుందని చెప్పడమే నిపాత సూత్రం .
కద్రువ అని ఇప్పుడు అడిగితే కద్రువ అనే చెప్తారు.
ధాత అనే ఒక పదం ఉంటుంది.
ధాత అంటే బ్రహ్మ
దాత అంటే ఇచ్చువాడు.
రెండింటి మధ్య ఒక ఒత్తు మాత్రమే భేదం …ఒత్తుతో అర్ధం అంతగా మారుతుంది. కాబట్టి ఇలాంటివి నిక్కచ్చిగా చెప్పాలి.
ఈ నాటి గురువులు కూడా ఇలా చక్కగానే చెప్తున్నారు.
కాకపోతే తప్పులు చెప్తే మటుకు వారికి తెలియచేయాలి! అధికారుల పర్యవేక్షణ ఉంటే పాఠాలు చెప్పమని అంటే తప్పక మెరుగుపడుతుంది విద్యా వ్యవస్థ.
M A phd చేసిన నేను శిశు తరగతి పిల్లలకు పాఠాలు చెప్పాలా? అని అనుకోవద్దు!
ఉద్యోగంలో చేరాక అవన్నీ ఆలోచించవద్దు! సెకండ్ గ్రేడ్ టీచర్ గా చేరితే సెకండ్ గ్రేడ్ కు పాఠాలు చెప్పాల్సిందే! మిగతా విషయాలు ఏమున్నా సరే డ్యూటీ మాత్రం సక్రమంగా చేయాలి. 10- 15 సంవత్సరాల క్రితమే నేను నాయకుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లో ఒక నిర్ణయం తీసుకున్నాను. తరగతి గదిలో ఎవరూ మొబైల్ ఉపయోగించకూడదని… మా ఉపాధ్యాయ సభ్యులందరికీ ఇదే విషయం చెప్పాను. ఈమధ్యనే ప్రభుత్వం ఈ ఆర్డర్ ఇచ్చింది. కొంతమంది అత్యవసరంగా ఇంటి నుండి ఫోను వస్తే ఎట్లా? అని అంటారు. కొంప మునుగుతుందా? స్టాప్ రూమ్ లో పెట్టి తరగతికి వెళ్ళాలి! లేదా స్విచ్ ఆఫ్ చేయాలి! విరామ సమయంలో చూసుకోవచ్చు! లేదా ఒక తరగతి నుండి మరో తరగతికి వెళుతున్నప్పుడు మధ్య సమయంలో చూడవచ్చని చెప్పాను.
ఒక వైవిధ్యం ఎక్కడ ఉందంటే? ప్రైవేట్ పాఠశాలల్లో 10, 15 వేలు రూపాయలు జీతం ఇచ్చి విపరీతమైన చాకిరీ చేయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో వేలల్లో జీతం వస్తుంది కదా! ఇక పర్వాలేదు పాఠం చెప్పినా, చెప్పకపోయినా ఏం కాదులే అనుకునేవారున్నారు. కానీ మంచిగా బోధించే ఉపాధ్యాయులు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించాలి.
రాజకీయ నాయకులకు అనుయాయులుగా ఉన్నవారు ఎక్కువగా పాఠశాలకు రారు. అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మా యూనియన్ జోక్యం తీసుకోదు అని అంటాను.
గత కాలముకంటె వచ్చు కాలము మేలు అని నన్నయ్యగారు చెప్పింది నిజమే! కానీ మళ్ళీ పూర్వం గురువుల వలె ఒక వశిష్ఠుడో, వాల్మీకో, సాందీపని వంటి వాళ్లు రారు! కానీ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని, వాళ్ళ మార్గదర్శకంలో నడవాలి కదా! వాళ్లు బోధించిన దాంట్లో 10శాతమో- వంద శాతమో మనమూ బోధించాలి కదా! భగత్ సింగ్ లాంటి వాళ్ళు మహానుభావులు లేరు. వాళ్ళు వస్తారని మనం కూర్చున్నామా? వాళ్లు ఆ రూపంలో వస్తారా? వాళ్ళు చేసిన దాంట్లో మనమేం చేయగలమని ఎవరికి వారే అనుకోవాలి! తప్పనిసరిగా ఒకటే పద్ధతి ఏ దేశమైనా బాగుపడాలంటే ముందు విద్యా వ్యవస్థ బాగుపడాలి… ఉపాధ్యాయులు తమకు తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి!
యజుర్వేద *-తైత్తరీయ ఉపనిషత్తుల్లో శిక్షావల్లిలో
స్వాధ్యాయ ప్రవచ సే చ ప్రమధితవ్యం అధ్యయనం చేయడంలోనూ- అధ్యాపనం చేయడంలోనూ పొరపాటు పడొద్దు!
ధర్మాన్న ప్రమధితవ్యం అంటే ధర్మం నుండి ప్రమిదితవ్యం జారకూడదు అని చెప్తుంది.

ఈ కాలంలో రెండు రకాల అతివాదాలు ఉన్నాయి. ఏమి చదవకుండానే కళ్ళు మూసికొని, చెంపలేసుకుని నమస్కారం చేసుకునేవారు ఒక రకం, ఏమి చదువుకోకుండానే అందులో ఏముందిలే చెత్త అనేవారు మరో రకం కాబట్టి ఈ రెండు అతివాదాలను సాధ్యమైనంత వరకు ఎంతవరకైతే అంతవరకు దులిపేసి మనం చదువుకోవాలి.
సంస్కృతం రాదు అనుకోవద్దు! వాటికి అనువాదాలు ఉన్నాయి. వాటిని చదివి మన వేదాంతాన్ని ,కానీ మన భారతీయ సంస్కృతిని గాని తెలుసుకోవాలి.

లోకాః సమస్తా సుఖినోభవంతు! అన్నాడే కానీ హిందూ భవంతు… అనలేదు కదా! లేదా ముస్లిం భవంతు సుఖినః అనలేదు కదా! కాబట్టి ఈ వాక్యాలు ప్రపంచానికి అంతటికి వర్తిస్తాయి.
అందువల్ల మనం ప్రధానంగా ఈ దేశం బాగుపడాలంటే సాంకేతికంగా కానీ, మరో రకంగా కానీ బాగుపడాలంటే విద్య ముఖ్యం కనుక చక్కగా బోధించాలి.
ఇటీవలి కాలంలో కార్పోరేట్ కాలేజీలన్నీ సంస్కృతం చెప్తున్నాయి. సంస్కృతానికి నేను వ్యతిరేకిని కాను. కానీ మాతృ భాష రాకుంటే ఎలా? విద్యార్ధి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడు. ఇంటర్ లో సంస్కృతం ఉంటుంది. ఆ తర్వాత భాషా బోధనలు ఉండవు.
అగ్రవర్ణమని చెప్పుకునే వాళ్లకు కూడా మా పిల్లలకు తెలుగు రాదండని చెప్తున్నారు ఎంత బాధాకరమైన విషయమో!
మా మనవడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. వాడు తెలుగు అద్భుతంగా మాట్లాడుతాడు కానీ చదవడం రాయడం రాదు. తెలుగు లో నమస్కారం తాతయ్యా! అని రాశాడు. “అమ్మ రాసిందా! ” అని అడిగాను. “నేను గూగుల్లో రాశాను” అని అన్నాడు.
ఏ ఇంజనీరు అయినా వైద్య విద్య అయినా చదవుకోండి. కానీ తెలుగు నేర్చుకోండి ఎందుకంటే విదేశాలకు పోయేది ఒక శాతం రెండు శాతం కానీ మిగతా వారంతా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేయాలి కదా! ప్రజలతో తెలుగు భాష రాకుండా ఉద్యోగం ఎలా చేయగలడు?
నాతో చదివిన ఒక తను కలెక్టర్గా పని చేస్తున్నప్పుడు ఒక ఆమె ఒక కాగితం తీసుకొని వచ్చిందట. “ఇదేదో వచ్చింది చూడు సార్” అని ఆయనకిచ్చిందట. అందులో
you are granted a house site అని ఉంది.
అంటే నీకు ఇంటి భూమి వచ్చిందని చెప్పాడట.
“నాకు ఇంటి జాగా వచ్చిందంటే నాకు తెలవడం లేదు కదా సార్” అని అన్నదట ఆమె.
కలెక్టర్ ఆ రోజు నుండి వెంటనే ప్రజలకు పంపేవాటిటి ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే రాయమని ఆర్డర్ ఇచ్చాడట.
నేను కవిత్వం విషయంలో కూడా ఏమంటానంటే కవికి శ్రోతకు మధ్య ఒక వ్యాఖ్యాత ఉండనవసరం లేదు అంటాను.
ఉదా॥ కవి
పొలాలనన్నీ హలాల దున్ని
ఇలా తలంలో
అనే కవితకు ఒక వ్యాఖ్యాత అవసరమా? కేవలం మార్కుల కోసం కార్పోరేట్ కాలేజీలు పనిచేస్తున్నాయి. సంస్కృతం నేర్చుకోవాలంటే నేర్చుకోండి! కానీ పరీక్షలో కానీ ఎక్కడైనా సరే దేవనాగరలిపిలో రాయండి. మీరు ఇంగ్లీషులో సమాధానాలు రాసి, సంస్కృతం నేర్చుకున్నామంటే ఎలా? అదికాక ఎలా ఐతే తెలుగు ద్వితీయ భాషగా ఉందో ఆ స్థాయిలో సంస్కృతం కూడా ఉండాలి ! నాలుగు శబ్దాలు చెప్పి కంఠస్థం చేసి సంస్కృతం నేర్చుకున్నామంటే ఎలా? అలా ఐతే సంస్కృత భాషకు సేవ చేసినట్టు కాదు! భ్రష్టు పట్టించినట్టే అవుతుంది. సంస్కృతం నేర్చుకోవాల్సిందే! తెలుగు వారికి తెలుగు రాకుండా చేసి సంస్కృతం నేర్పడం హాస్యాస్పదం !
మేము ఒక ఉద్యమం తీసాము
సంస్కృత భాషకు నమస్కరిస్తాం!
అమ్మ భాష ముందు తర్వాతే ఏ భాషైనా అని
ఉద్యమించాం.

You may also like

10 comments

Avery161 May 31, 2025 - 6:11 pm Reply
Declan4194 June 1, 2025 - 3:34 am Reply
Renee1340 June 1, 2025 - 5:12 am Reply
Luca4507 June 1, 2025 - 5:18 am Reply
Cheyenne4401 June 1, 2025 - 6:23 am Reply
Elsa1496 June 1, 2025 - 11:52 am Reply
Elizabeth4938 June 1, 2025 - 3:20 pm Reply
Lola2217 June 2, 2025 - 3:37 am Reply
Arlo353 June 2, 2025 - 8:21 am Reply
Josiah4759 June 2, 2025 - 9:09 am Reply

Leave a Comment