లోకం పోకడ

by Radhika Suri

సంఘజీవియైన కవికి సామాజికాంశాలపై సునిశిత దృష్టి ఉండాలి , ఎరుకతో ఉంటూ విజ్ఞత ప్రదర్శించాలి. ముఖ్యంగా సూక్ష్మగ్రాహిగా ఉంటూ జనం గొంతుకై నినదీస్తూ కలాన్ని ఆయుధంగా
ఎక్కుపెట్టాలి. సమకాలీన అంశాల్ని కథా వస్తువులుగా చేసుకుని అలతి పదాలతో విషయాన్ని సూటిగా సహజంగా చెప్పాలి.

‘లోకం పోకడ’ పుస్తకంలో సోదరులు యరకల యాదయ్య గారు సామాజిక స్థితిగతులను గమనిస్తూ, జనజీవన వైవిధ్యాలను, వారి మనస్తత్వాలను దగ్గరగా చూస్తూ కవిగా తమ భావాలను వర్ణరంజితంగా మలిచి చక్కగా రాసుకున్న అక్షరసత్యాలు.

పేరు పెట్టని కవితలే అన్నీ ,
బతుకు పోరాటంలోని ఆరాటాల్ని , సంఘర్షణలను అద్దంలో
చూపెట్టారు.

ముందుగా కాలే కడుపుల కడగండ్లను కళ్ళ ముందుంచుతూ …
‘మలమల లాడి
ఎండిన డొక్కలు
కష్టాన్ని ఎత్తుకుంటాయి…
అంటూ ఆకలి పోరాటంలోని ఆర్తిని, అవసరాన్ని చిన్న వాక్యాల్లో తేటతెల్లం చేసిన తీరు బాగుంది.

మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్తూ’ గల్లీలో లొళ్ళైతే పిలిచిన పోరు
పక్కనుండి చెవులకు పని చెపుతరు… అంటూ
మనిషికి పక్కింట్లోకి తొంగి చూడడంలోని ఆసక్తిని ,ఆతృతను ఎత్తి చూపెడతారు.

ముసుగు వేసుకున్న మనుషుల ప్రవర్తన ,అవసరం తీరిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తూ…”అవసరమనుకుంటే అంగలారుస్తరు
ఆపద తీరగానే
ముఖం చాటేస్తరు”అంటూ స్వార్థం నిండిన మనుషులు ఎలా ఉంటారో చెప్తారొకచోట.

ఓటు విలువ, ఎన్నికల తంతు ఎంతలా దిగజారిపోయాయో చెప్తూ…
“ఓటు ప్రతి పౌరుడి హక్కు బిచ్చగాడిలా అడుక్కుతింటావేందుకు “అంటూ
ఓటరును అమ్ముడుపోవద్దంటూ మందలిస్తూ చిరుకోపం ప్రదర్శిస్తారు.

నగరీకరణతో పల్లెలు కళతప్పి రసాయన కర్మగారాలుగా రూపాంతరం చెందుతూ ఉంటే ఆవేదన వెళ్ళగక్కుతూ… “రసవాయువులు కొన్ని ఊపిరితిత్తులను
దిగ్బంధించి శాసిస్తే
ఎన్నోఅస్వస్త జీవితాలకు ఊపిరులు పోస్తవి”
అని బాధను వ్యక్తపరుస్తారు.

ఉత్పత్తిదారులను నిర్వీర్యం చేస్తున్న పెత్తందారీ వ్యవస్థను
ఎత్తి చూపిస్తూ…
“ఉత్పత్తి గొప్పేమి కాదంట
రాజ్యాలను ముంచి తేల్చిన
వర్తక పటిమనేనట”
అంటూ చురకలంటిస్తారు.

నాది నేననే భావనతో తప్పుడు దారిలో కూడబెట్టడం తగదంటూ, అశాశ్వతమైన జీవితంలో చివరికి ఏదీ మనతో రాదని తత్వబోధ చేసి శ్రమ దోపిడి మానుకోండని హితోపదేశం చేస్తారు.

రాజకీయ ఊసరవెల్లి రంగులు మార్చుతూ, కొండచిలువలా భూమిని భక్షిస్తుందంటూ ఆవేదన వ్యక్త పరుస్తారు . మౌనానికి మించిన ఆభరణం లేదని
వివేకవంతుడు సముచిత భాషణంతో భాసిస్తాడంటారు.

చివరగా ‘నా నగరం తెలంగాణ మణిహారం’ అంటూ యాభై యేండ్లలలో హైదరాబాద్ షహర్ ఎన్ని మార్పులు చేర్పులతో విశ్వనగరంగా ఎదిగిన పరిణామక్రమాన్ని చక్కగా వివరించారు.

యరకల యాదయ్య గారు ఒక సభలో కనిపించి రాధికమ్మా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ తమ ‘ లోకం పోకడ’ పుస్తకం నాకందించారు. చదివిన తదనంతరం నా మనోభావాలను పేపర్ పై పెట్టాలని అనిపించింది. పుస్తకం సమతామానవతా విలువల కలబోతలతో సమాజం ఎలా ఉందో, మనం ఎలా ఉండాలో చెప్తూ, చిందే చెమట చుక్కలలోని అందాన్ని ,ఆత్మానందాన్ని చక్కగా వివరించిన యాదయ్యగారిని అభినందిస్తూ…

You may also like

9 comments

Adam276 May 31, 2025 - 6:11 pm Reply
Meagan3466 June 1, 2025 - 3:35 am Reply
Gerald2635 June 1, 2025 - 5:12 am Reply
Hadley2019 June 1, 2025 - 5:19 am Reply
Derrick4300 June 1, 2025 - 6:24 am Reply
Sydney1496 June 1, 2025 - 3:21 pm Reply
Bryan3893 June 2, 2025 - 3:37 am Reply
Olivia4058 June 2, 2025 - 8:22 am Reply
Archie3003 June 2, 2025 - 9:10 am Reply

Leave a Comment