Home ధారావాహిక నవల శుభ ముహూర్తం-1

శుభ ముహూర్తం-1

by Maji Bharathi

మనం చిన్నప్పటినుండి విన్న కథలలో మొదటి కథ ఎప్పుడూ, అనగనగా ఒక రాజు… అంటూనే మొదలవుతుంది. అటు పౌరాణికమైనా, యిటు చారిత్రికమైనా రాజులు, రాణుల గురించిన కథలు మనల్నెప్పుడూ ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. మరలా మరలా చదవాలనిపించేలా ఆ పాత్రల ఔచిత్యాలుంటాయి. అలనాటి ఆ కథాగమనంలో భాగస్వాములమై, అటువంటి పాత్రల్లో ఊహించుకోవడం ఎవరికైనా తీయని అనుభూతినిచ్చేదే.
       అటువంటి కథలు మృగ్యమవుతున్న నేటి కాలంలో, ఒక కాల్పనిక చరిత్రను మన ముందుకు తెస్తున్నారు ప్రొఫెసర్ భారతి. నిండు గోదారిలా ఉరకలెత్తే కథాగమనంతో, చక్కని కథాశిల్పంతో, అబ్బురపరచే రచనా కావ్యంతో, కనుల ముందు కనిపించేలా అన్ని పాత్రలనూ ప్రతిసృష్టి చేసి, మనలను అలరించడానికి “శుభ ముహూర్తం” చూసుకుని మరీ, ధారావాహిక నవలగా మనకందించడానికి మన ముందుకు వస్తున్నారు. మరెందుకాలస్యం… ఆ “శుభముహూర్తం”లో, కళ్లకు కట్టినట్టు కనిపించబోయే రాజప్రసాదాలను అవలోకిస్తూ, మాధవీలత లల్లుకున్న వనాలలో విహరిస్తూ, యుద్ధతంత్రాలతో అచ్చెరువొందుతూ, మనకందించబోయే, అపురూపమైన ప్రేమకథా విందుకు మీకిదే మా ఆహ్వానం.
సంపాదకవర్గం, తరుణి

రచయిత్రి పరిచయం
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి గారు, మన తరుణి పాఠకులకు సుపరిచితులే. భారతీయం పేరుతో కాలమ్ నిర్వహించారు. “విధి నిర్వహణలో నా అనుభవాలు” అంటూ, వైద్యవృత్తిలోని తన అనుభవాలను, మైక్రోబయాలజిస్టుగా వ్యాధులు గురించిన వ్యాసాలను మనకందించారు. “ఆలోచనా తరంగాలు”, “వేకువ” అనే రెండు కథా సంపుటాలను వెలువరించి, మూడవ కథాసంపుటి “జీవనగానం”ను త్వరలో విడుదల చేయబోతున్నారు.
“కళింగ కథాజాడ”లో నాలుగు తరాల రచయితలలో వీరూ ఒకరు కావడం అభినందించదగ్గ విషయం. దగ్గరగా 80 పై చిలుకు కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఒక్క ఈనాడు ఆదివారం అనుబంధంలోనే ఎనిమిది కథలు ప్రచురింపబడ్డాయంటే, ఆమె కలానికున్న పదును తెలుస్తుంది.
వృత్తిపరంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ప్రవృత్తిపరంగా రచనా వ్యాసంగంలో ఉన్న, ప్రొఫెసర్ మజ్జి భారతిగారి కలం నుండి వెలువడుతున్న ధారావాహిక నవల “శుభ ముహూర్తం”, మన పాఠకుల కోసం…సంపాదకవర్గం తరుణి

మగధ దేశపు మహారాజు విక్రమసింహ మనసు గాలిలో తేలిపోతున్నది. కోరుకున్న కన్య, వలచి చేపట్టిన సుగుణాల రాశి, అందాల ప్రోవు విదర్భ దేశపు రాకుమారి ప్రమీలాదేవితో ఈరోజు తన జీవితం పండబోతుంది. ఎంత గంభీరంగా ఉందామనుకున్నా, విశాలమైన కళ్ళు వెలుగులను వెదజల్లుతున్నాయి. పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటున్నాయి. అసలే సమ్మోహనాకారం. దానికి తోడు మనసులోని ఆనందం మోముపై ప్రతిఫలించగా, మగవారి మనసులను కూడా కొల్లగొట్టేంత సమ్మోహనంగా కనిపిస్తున్నాడు విక్రమసింహ.

అది చూసి “మన్మధుడే స్వయంగా వచ్చి పూల బాణాలు వేసినా, మరులు గొనరని పేరు గాంచిన మీరు, ఈరోజు యిలా అయిపోయారేమిటి మహారాజా! పున్నమి చంద్రుడు నీ మోమును ఆవహించాడా ఏమి? ప్రేమానురాగాల వెన్నెల సోనలు కురిపిస్తున్నాయి మీ కళ్ళు. మహారాణి వారు ఏం మాయ చేశారో?” అని హాస్యం ఆడనే ఆడాడు చిన్ననాటి నుండి స్నేహితుడు, ప్రస్తుతం ఈ దేశ సర్వ సేనాధిపతి, అనంతుడు.

ఆ మాట గుర్తొచ్చి ఒళ్లంతా పులకాంకితం కాగా, రాకుమారి ప్రమీలాదేవితో సమాగమానికి మనసు ఉరకలు వేసింది. ఇన్నినాళ్ళ తన తపఃఫలం ఈరోజు ఫలించబోతుంది. ఈరోజు కోసం ఎంత వేచి చూశాడో! ఎంతమందిని చూసినా చలించని తన మనస్సు, రాకుమారి ఆలోచన రాగానే అలా అయిపోతుందేమిటి? పురుషుడ్ని… నాకే యిలా ఉంటే మరి రాకుమారి? ఆమె కూడా తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారేమోనన్న ఆలోచన రాగానే, అంతఃపుర శయనమందిరం వైపు అడుగులు గబగబా పడ్డాయి. ప్రమీలాదేవిని చూడగానే మనసు ఆనందంతో ఉరకలేసింది.

పరిమళాలు వెదజల్లే పూమాలలతో అలంకరించిన అందమైన శయన మందిరంలో, విశాలమైన పాన్పుకు ఒక చివర, మేలి ముసుగులో, సిగ్గుతో తలదించుకొని రాకుమారి. పరాక్రమంలో పురుషులనెంత ఎదిరించినా, స్త్రీలకు సిగ్గే అలంకారమేమో! యుక్తవయసు వచ్చాక ఏ స్త్రీని ఇంత దగ్గరగా చూడాలని కూడా అనిపించని విక్రమసింహ మనసుకు, ఆమెను చూడగానే ఏమవుతుందో మరి? పరవశించిపోతుంది. ఇందుకేనా! మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు మన పెద్దలు. ఇంకా జాగు చేసి రాకుమారి మనసు నొప్పించకూడదు. ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారో, మా కోసం! ఈ ఆలోచన వచ్చిన తడవే, ఆమెను సమీపించి, “రాకుమారీ. ఈ శుభదినం కోసం మేము ఎన్నినాళ్ళ నుండి వేచి చూస్తున్నామో! యిన్నినాళ్ళకు మా కల ఫలించింది” అని ఆమె కరస్పర్శకు చేయి చాచాడు.

విక్రమసింహ కరస్పర్శ కాగానే, రవికిరణాలు సోకిన కలువలా, ఆమె ముడుచుకుపోయింది. సిగ్గుతోనేమో అనుకుని, “రాకుమారీ! అగ్నిసాక్షిగా మిము వివాహమాడిన వారము. మా దగ్గర మీకీ బిడియమేల! నేటి నుండి మనమిరువరమూ ఒకరమే. తనువులే వేరుగాని, హృదయమొక్కటే” లాలనగా ఆమె చుబుకాన్ని ఎత్తి మేలిముసుగు తీయబోయాడు. పర పురుషుని స్పర్శ తగిలిన దానిలా అడుగు వెనుకకు వేసి, మరింత తలదించుకుంది. అది గ్రహించుకునే స్థితిలో లేడు. ఆనందంతో మబ్బుల్లో విహరిస్తున్నాడు. అందుకే, ఊహించని ఆమె చర్యకు “రాకుమారి! మేము, మిమ్ము వలచిన విక్రమ సింహులం. మా దగ్గర మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు” అని అనునయంగా చెప్పాడు.

“క్షమించాలి. మేము మిమ్ములను అలా తలచలేము. మా మనసు అన్యాక్రాంతం” హీనస్వరంతో చెప్పింది.

అప్పటికి ఈ లోకంలోకి వచ్చాడు. ఐనా, తాను వింటున్నది నిజమేనా! లేక పొరపడుతున్నాడా! మమ్ము వివాహం చేసుకొని, వారలా ఎందుకంటారు? ఎక్కడో పొరపాటు జరిగింది. “రాకుమారీ! మేము మగధ దేశాధీశులం. మిమ్ము అగ్నిసాక్షిగా వివాహమాడిన వారం. మా చెంత మీరు బిడియపడనవసరం లేదు” మరింత అనునయంగా చెప్పాడు.

“క్షమించాలి. మా మనసు అన్యాక్రాంతం” ఈసారీ నెమ్మదిగానే, ఐనా పొరపాటుకు ఆస్కారం లేని విధంగా, చాలా స్పష్టంగా చెప్పింది.

ఆ మాట వీనులకు సోకగానే, శరాఘాతం తగిలినట్లు, పాతాళానికి కృంగిపోతున్నట్టు అనిపించింది. అంతటి మహారాజూ ఆ క్షణంలో మామూలు మనిషైపోయాడు. గడియపాటు ఏమనాలో తోచలేదు. ఎన్నో యుద్ధాలలో అలవోకగా నెగ్గిన ఆ ప్రభువుకు, నిలదొక్కుకోవడానికి కొద్దిసేపు పట్టింది. తాను ఊహించినదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఇన్ని దినముల నుండి, క్షణాలు లెక్కపెట్టుకుంటూ, వేచి చూస్తున్నది, యిందుకొరకా? ఈ మాట వినడానికేనా తామిన్నాళ్లూ నిరీక్షించింది? తామొక్కరేనా, వారిని వలచినది? వారికి తమయందు అటువంటి అభిప్రాయం యెన్నడూ కలగలేదా? అటువంటప్పుడు వారు తమనెందుకు వివాహం చేసుకున్నారు? తమనెందుకు ఆశల పల్లకిలో విహరింప చేశారు?

రాకుమారి వైపు చూశాడు. తన ఆలోచనలతో సంబంధం లేనట్టు, ఎదురుగా శిల్పంలా… అంతే! తనదనుకున్న కన్య మనసు, వేరేవాళ్ల మీద లగ్నమై ఉందన్న విషయం గ్రహింపుకు రాగానే, ఆవేశం ముంచుకొచ్చింది. అంతవరకు కళకళలాడిన ముఖం, పొద్దు గ్రుంకుతున్న సూర్యునిలా ఎర్రబారింది. కళ్ళల్లో రక్తమే పొంగి వస్తున్నట్టు… కళ్ళు మరింత విశాలమయ్యాయి. నాసికాపుటాలు అదురుతున్నాయి. వీటితో తనకేమీ సంబంధం లేనట్టు రాకుమారి, శిల్పంలా అలాగే నిలుచున్నారు.

“మరి మమ్ము ఎలా వివాహం చేసుకున్నారు?” కోపంతో ప్రశ్నించాడు విక్రమసింహ.

“మేము చేసుకోలేదు. మీరే చేసుకున్నారు. పెండ్లి కోసం మీరు రాయబారం పంపినప్పుడు, మా తండ్రిగారు మీతో ఉద్వాహం చేయలేనని విన్నవించుకున్నారు. ఎందుకలా చెప్పారా అని, ఆనాడే మీరు ఆలోచించి ఉండాల్సింది? అనాలోచితంగా మాపై యుద్ధాన్ని ప్రకటించి, మా రాజ్యాన్ని గెలుచుకున్నారు. మాది చిన్న రాజ్యమని మీకు తెలుసు. యుద్ధంలో మీతో నెగ్గలేమనీ తెలుసు. రాజ్యం కోసం మా తండ్రిగారు నన్ను మీకిచ్చి వివాహం చేయడానికి అంగీకరించారు. మా తండ్రిగారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత, ఒక పుత్రికగా నాపై ఉంది. అందుకే మీతో వివాహానికి అంగీకరించాను. నా మనసు వేరే వారిమీద లగ్నమై వున్నా కూడా, కుమార్తెగా నా బాధ్యత నిర్వర్తించాను.”

ఆ మాటలు విన్న విక్రమసింహ, నిజమే! మీ కన్యను మా రాజ్య పట్టమహిషిగా చెయ్యమని, రాజమాత శుభపత్రిక పంపించినప్పుడు, వారు నిరాకరించారు. తామే ఈ నిజాన్ని గ్రహించుకోలేకపోయారు. కనీసం వివాహానికి ముందైనా రాకుమారి తన అభిప్రాయం చెప్పి ఉండాల్సింది అనుకుంటూ “మీకు యిష్టం లేనప్పుడు, ఈ వివాహానికి అంగీకరించకుండా ఉండాల్సింది మీరు” అన్నాడు.

“ఓడిపోయిన రాజు, రాజ్యంతో పాటు వారి కన్యలు కూడా విజయుడైన రాజు సొత్తన్న విషయం మీకు తెలియనిది కాదు. ఆ ధర్మాన్ని అనుసరించి, మీతో వివాహానికి అంగీకరించాను. వివాహం చేసుకోని పక్షంలో, నాకున్న ఇంకో మార్గం ఆత్మార్పణ చేసుకోవటం. ఆత్మార్పణ చేసుకుని, నా తల్లిదండ్రులను క్షోభ పెట్టి, నరకానికి పోలేను. అందుకే ఈ వివాహానికి అంగీకరించాల్సి వచ్చింది.” వేదన నిండిన స్వరంతో సమాధానమిచ్చి తలదించుకుంది.

తల దించుకున్న ప్రమీలాదేవిని చూశాడు. ఆమె ముఖంలో విపరీతమైన బాధ గోచరిస్తుంది. ఆ బాధ చూడగానే విక్రమసింహ కోపం, నీరు తాకిన పాలపొంగులా చల్లారిపోయింది. వివేకం మేలుకుంది. అవును! ఆమెను ప్రాణాధికంగా ప్రేమించాడు. కాని, ఆమె మనస్సు, తనమీద వుందో లేదో గ్రహించుకోకుండా రాయబారం చేశాడు. ఆమె తండ్రిగారు వివాహానికి అంగీకరించలేదు. యోగ్యుడైన తనతో, వారి కుమార్తె వివాహానికి వారెందుకు అంగీకరించలేదోనని, అప్పుడే తాను ఆలోచించవలసింది? తన తల్లిగారి మరణానికి ఆమే కారణమని, తొందరపడి యుద్ధం ప్రకటించాడు. తన రాజ్యంతో పోలిస్తే, విదర్భ దేశం చాలా చిన్న రాజ్యం. గెలవడం తనకు నల్లేరు మీద నడక. రాచమర్యాద నిలుపుకోవడం కోసం కుమార్తెకు యిష్టం లేకపోయినా తనతో వివాహం జరిపించేటప్పుడు ఆమె తండ్రిగారు ఎంత క్షోభ అనుభవించి వుంటారో, ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది.

తన తొందరపాటుతనానికి ప్రమీలాదేవి బలి అయిపోయింది. ఆమె మనసును చూరగొన్న ఆ భాగ్యవంతుడు ఎవరో? ఎంత అదృష్టవంతుడో? కాని, ఆ ఊహ రాగానే మనసు మరల బాధతో నిండిపోయింది. తనకు దక్కని అదృష్టం ఎవరికో దక్కినందుకు మనసు కృంగిపోయింది. రాజుననే విషయం మర్చిపోయాడు. తనమీద తనకే జాలి వేసింది. ఎందరో మహారాజులు వారి కన్యలను వివాహం చేసుకోమని రాయబారం నడిపారు. కానీ, తన మనసంతా ప్రమీలాదేవి మీదే లగ్నమై ఉండడం చేత, వారందరికీ సామరస్య పూర్వకంగా, కాదు అని బదులు చెప్పగలిగాడు.

ఈరోజు దేశమంతా రాజుగారి వివాహ వేడుకలలో మునిగివుంది. కాని, ఈ అంతఃపురంలో తన మనసు, తన ఎదురుగా ఉన్న ప్రమీలాదేవి మనసు విచారంలో మునిగి ఉన్నాయి. ఇంకా ఆమెను ప్రతిరోజూ చూస్తూ, ఈ క్షోభ భరించడం తన వల్లకాదు. ఆమెను, ఆమె తండ్రిగారి దగ్గరికి పంపించడం ఉత్తమం. ఇలా నిర్ణయించుకున్న విక్రమసింహుడు, “రాకుమారి! జరిగిన దానిని మేము వెనుకకు తీసుకురాలేం. కాని, మీ మనసుకు కష్టం కలిగించేలా, యిక్కడ మిమ్మల్ని ఉంచడం భావ్యం కాదు. మిమ్మల్ని మీ తండ్రిగారి దగ్గరకు పంపించి వేస్తాను. సిద్ధం కండి” అని  వెనుదిరిగాడు.

“క్షమించండి. ఈ పరిస్థితులలో, నేను మరలా మా రాజ్యానికి వెళ్ళలేను. ఒకసారి వివాహం అయ్యాక, ఆ కన్యకను భరించవలసినది ఉద్వాహం చేసుకున్న వారే. వివాహం అయిన వెంటనే కొమరిత, భర్తను విడిచి పుట్టింటికి చేరుకుందంటే, దాని పర్యవసానాలు మీకు తెలిసే ఉంటాయి. ఒకసారి వివాహం అయ్యాక, నేనిక విదర్భ రాజ్య రాకుమార్తెను కాదు. మగధ రాజ్యపు పట్టపురాణినే. ఆ మర్యాదను నేను కాపాడతాను” తలవంచుకొని నెమ్మదిగా బదులిచ్చింది ప్రమీలాదేవి.

“మనసు ఎవరికో అంకితం చేస్తూ, ఇక్కడ తన దేశపు పట్టపురాణిగా ఉంటానని, ఆమె అనడం చాలా అన్యాయమని మనసు ఆక్రోశించింది. తాను ప్రాణాధికంగా ప్రేమించిన స్త్రీమూర్తి, వేరే వాళ్లను మనసులో నిలుపుకుని, అనుక్షణం తన ఎదురుగా ఉంటానంటే ఎలా భరించేది?” ఆమె కోరికను మన్నించవద్దని విక్రమసింహ మనసు చెప్తుంది. కాని, వేరు మార్గం లేదు. ఎందరో రాజుల కొమరితలను తిరస్కరించి, వివాహం చేసుకున్న కన్యక, వివాహం కాగానే పుట్టింటికి వెళ్ళిపోతే, ఆమె రాజ్యం సంగతేమో కాని, తన రాజ్యప్రతిష్ట ఏమవుతుందో  ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది విక్రమసింహకు.

మనసుకు ఇష్టం లేకపోయినా, “సరే” అన్నమాట బయటకు వచ్చింది. “సరే” అని చెప్పి వెళ్ళిపోతున్న విక్రమసింహను, “ఇంకొక విషయం” అన్న ప్రమీలాదేవి మాట ఆపింది. వెనుదిరగకుండానే “చెప్పండి” అన్నాడు.

“మీరు మా రాజ్యాన్ని గెలవడానికి కారణం, మాది చిన్నరాజ్యం అనేకాదు, వారసుడు లేకపోవడం కూడా ఒక కారణం. నేనే పురుషున్ని అయి, మీతో సమానంగా యుద్ధ విద్యలలో, శౌర్య పరాక్రమాలలో ఆరితేరిన దానినయి ఉంటే, మీతో యుద్ధం చేసి గెలిచేదాననేమో!”

ఆమె మాట ముగియలేదు. నేనే పురుషున్ని అయితే అన్న ఆమె మాటకు, ఒక్కసారి ప్రమీలాదేవిని… ఈ అందాల లావణ్యరాశి, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న సుకుమారిని, దృఢమైన శరీరంతో, వీరోచితంగా పోరాడే ఒక పురుషునిగా ఊహించుకుని, ఫక్కున నవ్వాడు విక్రమసింహ.

“మా బాధ, మీకు హాస్యాస్పదంగా ఉందా?” తలెత్తకుండానే అడిగింది ప్రమీలాదేవి.

“క్షమించాలి. నా ఉద్దేశం అదికాదు. మీరు పురుషుడై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. అంతే.” సున్నితంగా బదులిచ్చాడు విక్రమసింహ.

తనను తాను పురుషునిగా ఊహించుకున్న, ప్రమీలాదేవికి కూడా పెదవులపై నవ్వు పారాడింది. అది బయటపడకుండా తల మరింత దించుకుంది ఆమె. పెదవులపై చిరునవ్వును బయటకు రాకుండా  కన్నులలోనే అదమగా, అది మోమంతా పరుచుకొని, ఆమె వదనం చంద్రకిరణాలు సోకిన కలువలా వికసించింది. మోము మరింత అందంతో కాంతులను వెదజల్లింది. అందంతో ఇనుమడించిన ఆమె మోముని చూసి ఒక్కసారిగా మైమరిచిపోయాడు విక్రమసింహ. అలా ఎంత కాలం గడిచిందో తెలియదు.

“ఇంకొక మనవి” అడగలేక అడిగిన, ప్రమీలాదేవి మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. “మన, ఈ రహస్యం ఎవరూ గ్రహించకుండా ఉండాలంటే, అంతఃపురం పూర్తిగా మా అధీనంలో ఉండాలి.”

అంతఃపురం వారి అధీనంలో అంటే… ప్రస్తుతం ఆమె ఈ దేశపు మహారాణి కాదు. శత్రుదేశపు రాకుమారి. వారి అధీనంలో అంతఃపురం ఉంచడమంటే నిప్పుతో చెలగాటమే! అలాగని, ఆమెను చూస్తూ కాదనలేడు. వలచిన వనిత కోరికను కాదనలేని తన నిస్సహాయతకు, వగచక తప్పలేదు విక్రమసింహకు. “సరే” అన్నాడు.

“మరొక్క మనవి. క్షమించాలి. మీతో ఎలా చెప్పాలో! కానీ మా తండ్రిగారికి మేము యుద్ధంలో ఏ విధమైన సహాయం చేయలేక పోయినందుకు మేము ఓడిపోయాం. అందుకని … ” అంటూ సందిగ్ధంలో ఆగిపోయింది ప్రమీలాదేవి.

“ఫరవాలేదు. చెప్పండి.” ఇంతవరకూ వచ్చాక, ఏమైనా జరగనీ, అనే నిశ్చయానికి వచ్చాడు విక్రమసింహ.

“మాకు యుక్తవయసు వచ్చినవరకు,  మమ్ములను మగబిడ్డగానే పెంచారు మా తండ్రిగారు. మేము అన్ని యుద్ధవిద్యలూ నేర్చుకున్నాం. కాని, మాకు యుక్తవయసు రాగానే మమ్ములను అంతఃపురానికే పరిమితం చేశారు. అందుకని నేను యుద్ధ విద్యలలో ఆరితేర లేకపోయాను. నాకు ఇప్పుడవన్నీ నేర్చుకోవాలని ఉంది. ఎవరైనా నా మీదకు దాడికి వస్తే ఎదురొడ్డి గెలవాలని ఉంది. నాకు, నా చెలికత్తెలకు యుద్ధవిద్యలు నేర్పించే బాధ్యత మీరు తీసుకోవలసినదని సవినయంగా వేడుకుంటున్నాను” అంటూ చేతులు జోడించింది ప్రమీలాదేవి.

నవ్వొచ్చింది విక్రమసింహకు. ప్రేమించి, యుద్ధంలో గెలిచి  వివాహం చేసుకున్న స్త్రీమూర్తి, నా మనసు వేరే వారికి అంకితం, మీ రాజ్యంలో ఉంటాను గాని, మీకు సంబంధించిన వ్యక్తిని కాను. రేపు అవసరమొస్తే మీతో యుద్ధం చేయటానికి యుద్ధవిద్యలలో నేను ఆరితేరాలి. అందుకు మీరే నాకు సహాయం చేయాలి అని అడుగుతున్నందుకు. ప్రమీలాదేవి ముఖం చూస్తూ కాదని చెప్పలేకపోయాడు. “మీ అభిమతం. అలాగే కానివ్వండి” అని చెప్పి వడివడిగా ముందుకు అడుగులు వేశాడు విక్రమసింహ.

*

చిన్ననాటి నుండి ప్రాణస్నేహితుడు, ఈ దేశపు మహారాజు, కోరుకున్న సఖితో వివాహం జరిగి ఆనందపు అంచులు చూస్తూ ఉండి వుంటాడు. మహారాజు  ప్రేమ సామ్రాజ్యంలో ఆనందం ఆవలి అంచులను తాకే వరకు, దేశ భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై ఉంది. మహారాజు ఆనందానికి ఎవరూ అడ్డురాకుండా, రాజ్యవ్యవహారాలను చూసుకోవలసిన బాధ్యత కూడా  స్నేహితుడిగా తనమీద ఉంది, మనసులో ఇలా అనుకుంటూ, వెనక్కి తిరిగి అంతఃపురాన్ని అవలోకించాడు అనంతుడు. దీపాల కాంతుల్లో ధగధగలాడుతుంది అంతఃపురం. తన మహారాజు వదనంలాగే… మహారాజు తలపుకు రాగానే ప్రఫుల్లమయింది అనంతుని మనసు.

నెల రోజుల నుండి మహారాజు పరిణయ మహోత్సవ సందర్భంగా పేదవారికి దానధర్మాలు, ప్రముఖులకు కానుకలు, దేవాలయాలకు మడులు మాన్యాలూ అందజేయబడ్డాయి. పేద ధనిక అన్న తేడా లేకుండా పుర ప్రజలంతా ఈ సంబరాన్ని గొప్పగా జరుపుకుంటున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఇంటింటినీ, వాడవాడనూ అలంకరించారు. మహారాజంటే, ప్రజలకున్న అభిమానం అటువంటిది. అంతటి మహారాజును, అంతఃపురం వరకూ తోడ్కొని వచ్చి సింహద్వారం దగ్గరే ఆగిపోయి “మీ ముఖంలో ఆనందం ఎప్పుడూ ఇలాగే కలకాలం ఉండాలి” అని ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పాడు.

అంతఃపురం నుండి వెను తిరుగుతుంటే, అంతకు ముందు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. “ఎప్పుడూ గంభీరంగా, సూర్యుని ప్రతాపంతో నిండి ఉందా అనిపించేలా ఉన్న మా మహారాజుల ముఖం, ఈనాడు పున్నమి చంద్రునిలా ప్రేమానురాగాల సోనలు కురిపిస్తుంది. ఏలనో! ఎవరేమి మాయ చేసారో”నని తాను హాస్యమాడగానే, “అలాగే చూస్తూ ఉండు, అనంతా! శత్రువుల పట్ల కర్కశుడని పేరొందిన ఈ దేశ సర్వసేనాధిపతిని, తమ ప్రేమానురాగాల ధారలతో ముంచెత్తి, ముట్టుకుంటే కరిగిపోయే హిమఖండంలా మార్చటానికి, యెవరో యెక్కడో యెదురు చూస్తూనే ఉన్నారు. ఆ శుభ ఘడియలు రానీ! అప్పుడు చూద్దాం. నీ మోము యే సోనలు కురిపిస్తుందో!” అని బదులిచ్చాడు ప్రాణ స్నేహితుడు విక్రమసింహ. అది గుర్తుకు రాగానే అనంతుని ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది.

నిద్రించిన సమయంలో తప్ప, యింతవరకు ఎప్పుడూ విక్రమసింహను విడిచిపెట్టింది లేదు. ఇప్పుడు ఆ అలవాటు మార్చుకోవాలి. తనలో తానే అనుకుంటూ అంతఃపురం భటులను మరొక్కమారు హెచ్చరించి, తన మందిరం వైపు నడుస్తున్న అనంతుడు, దూరంగా చీకటి ముసుగులో మహారాజ మందిరం వైపు, గబగబా వెళ్తున్న వ్యక్తిని చూశాడు. ఇంత రాత్రివేళ మహారాజ మందిరం వైపు… మనసొక్కసారిగా త్రుళ్ళి పడింది… త్రుళ్ళి పడడమే కాదు, భయాందోళనలకు లోనయింది.  ఏమి జరుగుతుంది? ఆలోచనలతో తలబ్రద్దలై పోతుంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. అడుగు ముందుకు పడడం లేదు. మనసు కీడును శంకిస్తుంది. శిలలా బిగుసుకుపోయాడు అనంతుడు.

*

తర్వాత భాగం మలి సంచికలో…..

You may also like

3 comments

Ayla2630 May 30, 2025 - 3:15 am Reply
Trevor2843 May 30, 2025 - 11:42 am Reply
Gabriel2825 May 30, 2025 - 7:22 pm Reply

Leave a Comment