ఉత్తరాంధ్ర కవితా వృక్షానికి, ఒక పెద్దశాఖగా శోభను గూర్చిన ప్రముఖ రచయిత శ్రీ గంటేడ గౌరునాయుడు గారు. రచించిన “నదికీ ఒక భాష ఉంది” అన్న కవితా సంపుటిలో, “వాక్యం ఒక విత్తనాల మూట” అనే మొదటి కవితను విశ్లేషిస్తున్నారు ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి.
శ్రీ గంటేడ గౌరునాయుడు గారు 22 పుస్తకాలను ప్రచురించారు. అందులో కథా, వ్యాస, కవితా, పద్య సంపుటులే కాకుండా, ఇంకా ఎన్నో ప్రక్రియలతో కూడిన పుస్తకాలవి. వారు అందుకున్న పురస్కారాలెన్నో! లెక్కలేనన్ని. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే మూడుసార్లు వారిని పురస్కార గ్రహీతగా ఎన్నిక చేసిందంటే వారి ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.
వారు వ్రాసిన-
“పాడుదమా స్వేచ్ఛా గీతం” అనే గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు వాచకం “కుమార భారతి” లో 9వ తరగతికి పాఠ్యాంశంగా,
“కట్టండి ప్రాజెక్టులు” అనే కవితను అంబేద్కర్ యూనివర్సిటీ ఎంఏ మూడవ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధిస్తున్నారంటే, వారి ప్రశస్థి సుప్రసిద్ధమని అర్థమవుతుంది.
“పాడుదమా స్వేచ్ఛా గీతం” గీతాన్ని ఏలూరులో 5000 మంది విద్యార్థినీ విద్యార్థులు ఒకే వేదిక మీద ఆలపించగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయిందంటే అది మన తెలుగువారికే గర్వకారణమని నిర్ద్వందంగా చెప్పుకోవచ్చు.
వీరి సాహిత్యంపై మూడు పీహెచ్డీలు, మూడు ఎంఫిల్ ల కోసం పరిశోధనలు జరుగుతున్నాయంటే, వీరి సాహిత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
అటువంటి శ్రీ గంటేడ గౌరునాయుడు గారు వ్రాసిన “నదికీ ఒక భాష ఉంది” కవితా సంపుటి- పుస్తకం పేరులోనే చాలా లోతైన అర్థముంది. నాగవళి ఒడిలోనే తన బాల్యాన్ని గడిపిన వారు, ఎన్నో కథలలో ఆ నదికి తనకు ఉన్న అనుబంధాన్ని అతిహృద్యంగా వ్యక్తీకరించారు. అక్షరంతో కూర్చిన వాక్యాలకున్న శక్తి ఏమిటో, సౌకుమార్యమేమిటో, వాటి గమనమేమిటో, వారితో పాటుగా మనమూ వీక్షిద్దాము రండి.
అక్షరం ఆయుధమని ఎంతమందో చెప్పారు. గాని “వాక్యం ఒక విత్తనాల మూట”ని ఎవరూ చెప్పలేదు. విత్తనాల మూట- భావికి ఆహారాన్నందించే భాండాగారమది. అందుకే, తాము తిన్నా, తినకపోయినా, విత్తనాల మూటని మాత్రం, ఎంతటి కరువులోనైనా, ఎంతో భద్రంగా, మరెంతో అపురూపంగా దాస్తారు రైతన్నలు. అటువంటి విత్తనాల మూటతో వాక్యాన్ని సరిపోల్చడం వీరికే చెల్లింది. వాక్యం- విత్తనాల మూట, ఈ పోలికను మనం కలలోనైనా ఊహించగలమా! అటువంటి పోలికను తేవడంలోనే వీరి ప్రతిభ మనలను మంత్రముగ్ధులను చేస్తుంది.

వాక్యం ఒక విత్తనాల మూట అని తన కవితకు శీర్షిక పెట్టి, ఈ కవితతో మనలో ఆలోచనల సుడిగుండాలను రేపుతున్నారు కవి. ఈ కవితతో, చదివే పాఠకులకు కూడా వాక్యమనేది కేవలం అక్షరాల సముదాయమే కాదు, మనిషిలో ఉవ్వెత్తున ఎగిసిపడే భావాల వ్యక్తీకరణ అనేది తెలుసుకునేటట్లు చేస్తారు.
వాక్యాల గురించి ఎంత అద్భుతంగా వర్ణించారంటే-
“ఎవరు రాసిన వాక్యాలో?
అద్భుతమైన శక్తివంతమైన వాక్యాలు.
ఎక్కడ, ఎవరు రాసినా, ఏ సిరాతో రాసినా…
వరుసలు వరుసలుగా కవాతు చేసే వాక్యాలు.
కవిత ఎత్తుగడలోనే తన హృదయాన్ని విప్పి చెప్పారు కవి. కవాతు ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? దేశ ప్రజలకు మేమున్నామని భరోసా ఇవ్వవలసిన పరిస్థితులలో, సైన్యం చేస్తుంది కవాతు. మరి ఇక్కడో? వాక్యాలు చేస్తున్నాయట. ఎందుకనో? బాధాతప్త హృదయాలకు, మీకెవరూ లేరనుకుంటున్నారేమో! మేమున్నాం. మీ వైపున నిలబడి మాట్లాడడానికి మేమున్నామంటూ , భరోసానిస్తూ, కవాతు చేస్తున్నాయి ఈ కవితలోని వాక్యాలు. కొన్ని వాక్యాలు నడుస్తుంటే వాటి “అడుగుల్లో పిడుగులు కూడా ధ్వనించే అరుదైన వాక్యాలు ఉన్నాయట”. కవాతు చేయడమే కాదు అవసరమైతే పిడుగుల్లా, శత్రువుల్ని నాశనం చేస్తామనే సంకల్పాన్నీ చెప్తున్నాయి ఈ వాక్యాలు.వాటి కదలికలో పిడుగులు కూడా ధ్వనిస్తాయట. అంటే ఎంత బలమైన భావవ్యక్తీకరణతో ఆ వాక్యగమనం సాగుతుందో ఊహించుకోవచ్చు.
మరికొన్నేమో… “పగిలిన పాదాల కింద మెత్తని పచ్చగడ్డి పరుపుల్లా ఉన్నాయట”. పగిలిన పాదాలతో నడవడం ఎంత దుర్భరమో మనందరికీ నిజజీవితంలో తెలిసిందే. నడుస్తున్నప్పుడు ఏ చిన్న రాయి గుచ్చుకున్నా, బాధతో గుండెలు విలవిల్లాడిపోతాయి. పాదానికి రాయి గుచ్చుకుంటే గుండె బాధ పడుతుందెందుకని? గాని, ఆ పగిలిన పాదాలే పచ్చగడ్డి మీద నడుస్తుంటే పచ్చగడ్డి పరుపై పాదాలకు సేద తీరుస్తుంది. ఈ వాక్యాలు, బాధపడుతున్న గుండెలను కూడా సేద తీరుస్తాయనడంలో సందేహం లేదు.
ఇంకొన్ని వాక్యాలు…
“పిల్లగాలి లాలిపాటలకు అలలు అలలుగా ప్రవహించే నారుమళ్ళ లాంటివట”.
పిల్లగాలి వీచినప్పుడు వినిపించే ధ్వనిని లాలిపాటతో పోల్చడం… ఈ కవికే సాధ్యం. ఎన్ని కలతలున్నా లాలిపాట, మనలను సుషుప్తిలోకి, తద్వారా కమ్మనైన కలలను అనుభవించే స్థితికి తీసుకెళ్తుంది. దేహానికి విశ్రాంతినిస్తుంది. ఈ పిల్లగాలి లాలిపాటకు నారుమళ్లు అలలు అలలుగా ప్రవహిస్తున్నాయట. ఎంత చక్కని భావ సౌందర్యం. నారుమళ్ళతో చక్కని చిక్కని బంధమున్నప్పుడు కదా ఇటువంటి పదాలు పలుకుతాయి. అలలు అలలుగా ప్రవహించే పిల్లగాలి సంగీతానికి తలలూపుతూ దర్శనమిచ్చే నారుమళ్ళను చూసినవారికి తప్పించి, ఆ మాటల్లోని భావం ఊహించుకోవాలంటే సాధ్యం కాదు.
మరికొన్ని…
“వానాకాలపు వరదలప్పుడు ఎగసిపడే నాగావళి కెరటాల్లాంటి వాక్యాలు”
కవి నాగావళి ఒడిలో పెరిగిన వ్యక్తి అని మనకు తెలిసిపోతుంది ఈ వాక్యాల ద్వారా. మామూలు సమయాలలో, నాగావళి గమనం అతి నిశ్శబ్దంగా ఉంటుంది … ప్రవహిస్తుందా లేదా అన్నంత నిశ్శబ్దం. అదే వానాకాలంలో ఐతే, ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాలకు నీరు భారీగా చేరుతుంటే, కెరటాలే ఉండని నదిలో… కెరటాలతో నాగావళి ఎగసిపడుతుందట. అంటే సమయం వచ్చినప్పుడు కొన్ని వాక్యాలు, వాటిలోని అర్థాలు ఎగసిపడుతూ మనలను ఆ ప్రవాహంతో పాటు తీసుకుపోతాయి. వాక్యాలను వర్ణించడం ఇంతకన్నా ఎవరికైనా సాధ్యపడుతుందా? ఈ ఒక్క వాక్యంలో ఎంత భావం నిబిడీకృతమైంది?
అక్షరాల పుట్టుక కుట్ర కాదు
పదాలు ప్రాణ గీతాలు కావడం కుట్ర కాదు
అక్షరాలు పదాల్లో వొదగడం కుట్ర కాదు
పదాలు వాక్యాలు వాక్యాలుగా ప్రవహించడం కుట్ర కానేకాదు
వాక్యరహిత సమాజాన్ని ఊహించడమే అసలు కుట్ర
అంటూ భావవ్యక్తీకరణను సహించని, అక్షరాలను, వాక్యాలను నిర్బంధించాలనుకునే వారికి, అసలైన కుట్ర అంటే ఏమిటో తెలియ చెప్తున్నారు. మన మనసులోని భావాలను తెలియ చెప్పడానికి అక్షరాలు పదాలుగా, అవి వాక్యాలుగా ప్రాణం పోసుకుంటాయి. అక్షరమే లేనప్పుడు నేనంటూ ఒకడిని ఉన్నానని, నాకూ ఆలోచనలుంటాయని, వాటిని అందరితో పంచుకోవాలనుకుంటానని ఎవరికి తెలుస్తుంది? మనిషి ఆలోచనలను పంచుకోనివ్వకపోవడమే అసలైన కుట్ర అంటూ, బయటకు రానివ్వకుండా అక్షరాలను గొంతుల్లోనే నులిమేస్తున్న ఎందరికో సవాలు ఈ వాక్యం.
ఇంకోచోట…
చీకటి గుండెల్లో మండే సూర్యుడై ప్రకాశించాలనే
తపన పడుతుంది ప్రతి సిరాచుక్కా.
అణగారిన బ్రతుకుల్లో మిగిలి ఉండేది చీకటే. ఆ బ్రతుకుల్లోని చీకటిని మాయం చేసి వారి జీవితాల్లో వెలుగును పూయించాలంటే ఏ దీపపు కాంతో సరిపోదు, మండే సూర్యుడే దిగి రావాలి. అందుకని ప్రతి సిరాచుక్కా మండే సూర్యుడై వెలగాలనుకుంటుందట.
వీరి పదాలు కూడా కదం తొక్కుతాయి,
అవే నినాదమై అందరిచే ప్రేమించబడతాయి.










