
నాటక కళలు సృజనాత్మకతను, భావోద్వేగాలను పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే సమాజంలోని సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కార సూచికంగా కూడా ఉంటాయి నాటికలు. అదే సమయంలో జన రంజకమై నాటక కళల ద్వారా మానసిక ప్రశాంతత చేరి ఉల్లాసంగా ఉండి, ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయపడతాయి. శ్రమ చేసి, ఆలసిపోయిన శరీరాలకు వినోదం కలిగించి, వారిని ఉత్సాహ పరుస్తాయి. నాటకాలు రాసిన వారికి ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజ స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి బేరీజువేయగల శక్తి వస్తుంది.
అలాగే నాటకం కథను సంభాషణ రూపంగా చెప్పే ప్రక్రియ! అవే సంభాషణలు చదివినప్పటికంటే కూడా నాటక రూపంలో చూస్తే కథలో మమేకమైపోతాం! మనసులో ఒక ముద్ర పడుతుంది. పెద్ద కథలు పెద్ద నాటకాలుగా ప్రదర్శిస్తారు. చిన్న నాటకాలు చిన్న కథలను చెప్తాయి. అయితే ఈనాటి మన ఆతిథి శ్రీమతి తెన్నేటి సుధ గారు ఒక్కో సామెతకు ఒక్కో నాటిక రాసి వాటిని రేడియో ద్వారా శ్రోతలకు వినిపించేలా కృషి చేశారు. లక్ష్యం ఏదైనా కానివ్వండి! నాటిక సినిమా రాకముందు బాగా రాణించింది. పురాణాలు చదవకపోయినా వారికి నాటకాలా ద్వారా కథలు తెలుస్తాయి. అటువంటి నాటక రచన చేసిన నేటి తరుణి అతిథితో ముచ్చటించి మరిన్ని వారి రచనా విశేషాలు తెలుసుకుందాం!
రంగరాజు పద్మజ :— అమ్మా! నమస్కారం. మీ నేపథ్యం వివరించండి.
తెన్నేటి సుధ;– పద్మజ గారు నమస్కారమండీ! ఈరోజు మా ఇంటికి వచ్చి నాతో ముఖాముఖి చేస్తానని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొండపల్లి నిహారిణి చాలా సంవత్సరాలుగా నాకు స్నేహితురాలు. తను కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక నా జన్మ స్థలం వరంగల్. 1952లో పుట్టాను. అమ్మ తెన్నేటి అహల్యాదేవి, మా నాన్న టీవీ సుబ్బారావు గారు.
విద్వాన్ తెన్నేటి పేరుతో ఆయన చాలా పుస్తకాలు రాసారు. ఆయన తెలియని వారు లేరంటే అతిశక్తి కాదు! ఆయన నడుస్తున్న గ్రంథాలయం అంటారందరూ. ఆయన అభిరుచి గణితం. 20 పుస్తకాలు గణితానికి సంబంధించినవే రాసారు. గణితంలో ఆయనకు క్వాలిఫికేషన్ లేదు. ఆయన కేవలం తెలుగులో మాత్రమే M A చేసారు. క్వాలిఫికేషన్ లేకపోయినా తెలుగు అకాడమీ కోసం ఏడు పుస్తకాలు రాసారు. మహావీర గణితం, మాయా చదరాల లాంటివి. నీలికమల్ వారి కోసం 12 పుస్తకాలు గణితంలో రాసారు. ఆ తర్వాత సంస్కృత సూక్తి సౌరభం, తెలుగులో అలంకార వివరణ.. ఇలా ఆయన 32 పుస్తకాలు రాసారు.
అవన్నీ ప్రామాణికమైన గ్రంథాలు. అవి బహుళ ప్రాచుర్యం పొందాయి. కానీ ఆయనకు రావలసినంత పేరు మాత్రం రాలేదు. చాలా గొప్ప మేధావి! చదువుకున్నది తెలుగైనా అన్ని సబ్జెక్టులు అంటే ఎకనామిక్స్, ఫిజిక్స్, లాంటివన్నీ, సంస్కృతం, తెలుగు, ఉర్దూ( కవితా మాధురి) రాసారు. ఉర్దూలో కూడా అపారమైన పాండిత్యం ఉండేది. ఆయన కడుపున పుట్టడం నా అదృష్టం! అలాగే మా అమ్మ అహల్యాదేవి గారు కూడా అంతే! నాన్న ప్రోత్సాహంతో పెళ్ళైయ్యాక చదివింది. మెట్రిక్, బి ఏ(B A) హిందీ పండిట్,(hindi pundit) ట్రైనింగ్ చేసింది. హిందీ పండిట్ గా వరంగల్లో ప్రభుత్వ బాలికల పాఠశాలలో చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసింది. అమ్మకు కూడా సాహిత్యం పట్ల చాలా అభిరుచి ఉండేది. ఆమె అప్పుడు వచ్చే పత్రిక స్వతంత్ర లో హిందీ నుండి తెలుగు అనువాదం రచనలు చేసింది.బాల అనే పత్రికలోనూ కవితలు రాసింది.
మేము ఆరుగురుము తోబుట్టువులం. ముగ్గురు మగ ముగ్గురు ఆడ… నేనే పెద్దదాన్ని. అందరినీ నాన్న కష్టపడి చదివించారు. రాయడంలో అమ్మానాన్న ప్రోత్సహించేవారు. నన్ను నాటికలు రాయమనేది ఎందుకంటే తను పని చేసే పాఠశాలలో అమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రద్ధగా చేయించేది. ఏకపాత్రాభినయం, నాటికలు రాసేదాన్ని! వాటిని పిల్లల చేత వేయించేది. అలా చిన్నప్పటినుండి రాయడం, చదవడం ప్రోత్సహించేవారు. అందుకోసం అన్ని రకాల పుస్తకాలు కొనేవారు. మా నాన్న చిన్నప్పుడు కథలు చెప్పేవారు. తెలుగు పౌరాణిక కథలతో పాటు షెర్లాక్ హోమ్స్ (Sherlock Homes) రచయిత నాన్నకు చాలా ఇష్టం. ఆయనరచనలన్నీ మాకు చదివి చెప్పేవాడు. మాకూ ఆయనే అభిమాన రచయిత! అలా మా చిన్నతనం గడిచింది. హనుమకొండ మర్కజీ పాఠశాలలో ఏడవ తరగతి వరకు, పింగళి ఉమెన్స్ కాలేజీలో పియుసి వరకు చదివాను. తర్వాత డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్( Arts& sinsce )కాలేజీలో వరంగల్ లో చదివాను తర్వాత బీఎడ్ ( B, ed) చేశాను ఎమ్మే( M A) వరంగల్ లోనే చదివాను.

ప్ర :– మీ రచనా వ్యాసంగం ఎప్పటినుండి ప్రారంభించారు? ఏమేమి రాసారు?
జ. 1969లో కథలు రాయడం మొదలుపెట్టాను. తెలుగు పత్రికలకు పంపడం మొదలు పెట్టాను. అమ్మానాన్నలు సంతోషపడేవారు. కవితలు, కథలు ఎక్కువ రాసాను. కుటుంబ నియంత్రణ సంస్థ వారు ప్రచారం కోసం కవి సమ్మేళనాలు చేయించేవారు. వాటిల్లోనూ కవితలు రాసాను.
జీవన రథం అనే కథ 69లో ఆంధ్రప్రభ లో అచ్చయింది. అది మెడ్రాస్ నుండి వెలువడేది. నా కథను పత్రిక లో ప్రింట్ అవడం చూసుకొని మురిసిపోయేదాన్ని. అలా రచన మీద శ్రద్ధ పెరుగుతూ పోయింది. నాకు 75 రూపాయల పారితోషికం కూడా పంపారు.
తెలుగు ఎమ్ఏ (M A ) పూర్తైంది. మా లెక్చరర్స్ చాలా గొప్పవారు. కోవెల సుప్రసన్న చారి గారు, కేతవరపు రామకోటి శాస్త్రి గారు, బిరుదురాజు రామరాజు గారు, మాదిరాజు రంగారావు గారు.
మాడపాటి హన్మంతరావుగారి పేరుమీద నాకు స్వర్ణ పతకం బహుమతి వచ్చింది. 1975 లో నా చదువు కాగానే వంశీ రామరాజు గారితో నా వివాహం జరిగింది. అప్పుడే హైదరాబాద్ వచ్చాను. అంటే పూర్వార్ధం అంతా వరంగల్లోనే గడిచింది- ఉత్తరార్థం నా జీవితమంతా హైదరాబాదులోనే గడిచింది.
మావారు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.1972 లో నటుడు శోభన్ బాబు చేత ప్రారంభించిన వంశీ ఆర్ట్స్ కార్యక్రమాలలో నేను కూడా చురుకుగా పాల్గొంటాను. 54 సంవత్సరాలుగా ఈ సంస్థతో ఆయనకు, నాకు అనుబంధం ఉంది. 1976లో పెద్దబాబు వంశీధర్ పుట్టాడు, తర్వాత వంశీకృష్ణ పుట్టాడు. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. పెద్ద కోడలు తరంగణి- కర్నాటక సంగీతం టీచర్. కచ్చేరీలు ఇస్తుంది.
చిన్న కోడలు సుప్రియ న్యాయవాది. మనమరాలు అనఘా దత్త కూచిపూడి నాఠ్య కళాకారిణి. ఆర్నవ్ దత్త మనవడు. సిసిలిక , స్మేర మనమరాండ్లు.
ప్ర. మీరు ఒక్కొక్క సామెతకు ఒక్కొక్క నాటిక రాసారని విన్నాను. అలా రాయాలని ఆలోచన ఎలా కలిగింది? ఆ నాటికలు ప్రదర్శించారా?
జ:- 1977 లో అమృతవాణి అనే సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లాను. వాళ్లు నన్ను స్క్రిప్ట్ రైటర్ గా సెలెక్ట్ చేశారు. ఉద్యోగ నిర్వహణకు వెళ్లాను. అమృతవాణి అనేది ఒక క్రిస్టియన్ సంస్థ. 60 శాతం వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడం 40 శాతం నీతి విలువలు సుభాషితాలు మొదలైనవి చెప్పడం చేసే వాళ్ళు. అక్కడ నన్ను నాటికలు రాయమని అడిగారు. వాళ్లు ఇచ్చిన సామెతకు నాటిక రాయమని అన్నారు. అలాగే రాస్తాను అని అన్నాను.
మన జీవితంలో ఒక భాగం ప్రతిరోజు సామెతలు వాడుతూనే ఉంటాము. ఆ వాడే సామెతలు మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకి ఎదురుపడతాయి. వాటి నుండి మనం పాఠాలు నేర్చుకుంటాము. వాటి మీద రాయమన్నారు. నేను పనిచేచింది రేడియో విభాగంలో, జాజిరెడ్డి గారు సామెత ఇచ్చేవారు. 4 లేదా 5 పాత్రలతో పది నిమిషాల నిడివితో నాటిక రాయాలి. వాటిని ప్రావర్బ్ స్కిట్స్ ( proverbs skits) అని అంటారు. ఆ పదినిమిషాలలో మన జీవితంలో ఈ సామెత ఒక సందర్భాన్ని తీసుకొని అది ఎలా ప్రయోగించబడింది అని చెప్పాలి. అనేది నిబంధన వేర్ కాస్ట్ ( where cast) అనే చోటుకు పంపేవారు. మనీలా ఫిలిప్పైన్స్ లో రేడియో స్టేషన్ అక్కడ ఇది బ్రాడ్ కాస్ట్ (ప్రచారం ) అయ్యేది. పెద్ద పెద్ద రేడియో ఆర్టిస్టులు అందరూ కూడా నేను రాసిన స్క్రిప్ట్ను రికార్డు చేసేవారు. అందులో పండా శమంతకమణి, పండా విజయలక్ష్మి, ఆశాలతా, కాశీ విశ్వనాథ, విద్యాసాగర్, భరణి మొదలైన వారందరూ అక్కడికి వచ్చి నేను రాసిన నాటికలలో నటించేవారు. అవన్నీ సిడి ల రూపంలో మనీలకు పంపేవారు. ఇలా ఒక సంవత్సరం పాటు నేను పనిచేసాను.
తరువాత తెలుగు అకాడమీలో ఉద్యోగం వచ్చింది. అయినా వారు నాటికలు రాయమని అడగడంతో 16 సంవత్సరాలు నాటకాలు రాసాను. అలా 500 నాటికలు పూర్తి చేసాను. తెలుగు అకాడమీలో నిబద్ధతతో పనిచేసాను. ఉపసంచాలకురాలిగా పదవీ విరమణ పొందాను. 32 సంవత్సరాలలో టెర్మినాలజీ, అనేక నిఘంటువుల కోసం పనిచేసాను. అలాగే తెలుగు త్రైమాసిక వైజ్ఞానిక పత్రికకు 16 సంవత్సరాలు సహ సంపాదకురాలుగా ఉన్నాను.
1995 నుండి 2010 వరకు ఆ పత్రిక బాధ్యత పూర్తిగా నాదే!
ఇంటర్మీడియట్ తెలుగు- ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు బి.ఈడి డిగ్రీ వరకు రెండు భాషల్లో తెలుగు అకాడమీలో ముద్రిస్తారు. ఇందులో నేను ఫిజిక్స్ పుస్తకాల పర్యవేక్షణ చేసే దాన్ని. సమావేశాలు ఏర్పాటు చేయించాలి. ఇంటర్మీడియట్ బోర్డు నుండి సిలబస్ తెప్పించుకొని, ఆ సిలబస్ లో ఉన్న ప్రకారంగా ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా ఇతర యూనివర్సిటీ వారు సంపాదకులుగా ఉండేవారు. ప్రాంతీయంగా ఉన్న నలుగురు రచయితలతో సంపాదకుల సమావేశం ఏర్పాటు చేసి, సిలబస్ ప్రకారం వాళ్లతో రాయించి, ఆ స్క్రిప్టు సమయానికి వచ్చేటట్టు చూసి, ప్రింట్ చేసే వరకు పూర్తి బాధ్యత వహించి అలా అన్ని పుస్తకాలు రావడానికి నేను కోఆర్డినేటర్ గా అంటే సమన్వయకర్తగా ఉన్నాను.
తెలుగు నా అభిమాన భాష కాబట్టి ఎంత పనైనా కష్టం అనిపించలేదు. ఎందరో గొప్ప వారి మధ్య పని చేస్తున్నానని ఆనందంగా ఉండేది. ఉదాహరణకు తాళ్లూరి నాగేశ్వరరావు గారు అకాడమీలో పనిచేసేవారు. రమాకాంత్ రావుగారు, పోరంకి దక్షిణామూర్తి గారు, నీలాజంగయ్య గారు, ఎం.ఎన్ నరసింహారావు గారు, గుమ్మా శంకర్ రావు గారు, బోయి భీమన్న గారి అమ్మాయి విజయ భారతి గారు డైరెక్టర్ గా ఉండేవారు.
సాహిత్య కోశం వంటి పుస్తకాలను అందరం సమైక్యంగా కృషి చేసి వెలువరించాము. జనరంజక గ్రంథాలు అనేకం పారిభాషక పద కోశాలను అన్ని సబ్జెక్టులలో తయారు చేసాము. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఫిజిక్స్ ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలి అనుకున్నప్పుడు ఇందులోని పదాలు వాడుకుంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు కదా! అమ్మా నాన్న దైవం వలన నేను నా భర్త రామరాజు గారిని కూడా అలాగే అనుకుంటాను. నేను పుట్టిన వరంగల్ నాకు దైవం. అలాగే నేను పనిచేసిన తెలుగు అకాడమీ అంటే నాకు గౌరవం- నా అత్తగారిల్లు అయిన భాగ్యనగరానికి నమస్కరించిన రోజు ఉండదు! అంత ప్రేమ మమకారం ఉంటుంది. అవి తలుచుకుంటే నా మనసు ఆర్థ్రం అయిపోతుంది, ఒళ్ళు పులకరించిపోతుంది.
ఇలాగే నా ఉద్యోగ ప్రస్థానం నడుస్తూనే మా వారు నెలకొల్పిన వంశీ సంస్థతో అనుబంధం పెనవేసుకుపోయింది.
రామరాజు గారు చాలా ప్రోత్సహించారు. సృజనాత్మక శక్తిని బయటకు తీశారు. ఆయనకు ఋణపడి ఉన్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను ఇటీవల 50 సంవత్సరాల పెళ్లిరోజు చేసుకున్నాము. నేను వంశీ సంస్థకు అధ్యక్షురాలు అనేక సన్మానపత్రాలు రాసాను. ఆయన నిర్వహించే ప్రతి కార్యక్రమంలో నేను వెనుక ఉంటాను. గొప్ప గొప్ప రచయితలు, రచయిత్రులు మా ఇంటికి వచ్చేవారు. కే. విశ్వనాథ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు వంటి వారితో పరిచయం కావడం మా వారి వల్లనే కదా! కళలకు సంబంధించి ఎవరినైనా మా వారు ప్రోత్సహిస్తారు అంత విశాల హృదయం. పై తరం హీరోయిన్లు భానుమతి గారి నుండి అందరూ, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కూడా వచ్చేవారు.

ప్ర. సమయం లేదు లేకపోతే ఎన్నో చేసేవాళ్ళుమని అంటారు. కానీ మరి మీరు ఇన్ని రంగాలలో కృషి చేసారు వీటన్నిటికీ సమయాన్ని ఎలా మీ గుప్పెట పెట్టుకున్నారు?
జ. సమయం లేదనడం నేను అంగీకరించను! సమయం చాలా ఉంటుంది. దాని వినియోగించుకోవడంలోనే ప్రజ్ఞ ఉంటుంది. ప్రతి నిమిషం చాలా విలువైంది. దాని వృధా చేయకుండా వాడుకోవాలి! బద్దకించి రేపు చేద్దాంలే!అంటుంటే ఏ పనీ కాదు! వంశీ రామరాజు గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను. తాను అలా కచ్చితంగా అనుకున్న సమయానికే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు.అందరూ అలా ఉండాలని అనుకుంటారు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లలను చూసుకోవడం చాలా కష్టమైతే, ఒక బేబీ కేర్ సెంటర్ ను పక్క గల్లీలోనే ఉన్న మాదిరెడ్డి సులోచన గారింట్లోనే ప్రారంభించాము. వారు మాకు మంచి మిత్రులు. అది 25 సంవత్సరాలు నడిచింది. నా పిల్లలను పెంచుకుంటూ, వాళ్ళ చదువు చూసుకుంటూ, నేను ఉద్యోగం చేస్తూ, మా వారు చేసే పెద్ద పెద్ద కార్యక్రమాలు అంటే వంశీ బర్కలి అవార్డుల సభలు నిర్వహించినపుడు నా వంతు సహకారం అందించేదాన్ని.
ప్ర. ఇలా మీ చుట్టూ ఇన్ని బహుమతులు, షీల్డ్ లు, పురస్కారమందుకుంటున్న చిత్రాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది! మీ శ్రమ ఫలాల గురించి వివరించండి!
జ. సి. నారాయణరెడ్డి గారు మాకు ఆత్మబంధువు, వంశీ పుట్టుకను తెలిసిన మేనమామ అని చెప్తున్నాను కదా! వారు సుశీలా నారాయణరెడ్డి అవార్డ్ ప్రదానం చేసారు. డా.అమృతలత గారు వారి కూతురు జ్ఞాపకార్ధం అపురూప అవార్డును బహూకరించారు.
తెలుగు యూనివర్శిటీ వారు ఉత్తమ రచయిత్రి పురస్కారం , వాసిరెడ్డి సీతాదేవి గారి తల్లి గారి పేరు మీద వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు ఇచ్చారు. ఇలా చాలా అవార్డులు వచ్చాయి.

ప్ర. వంశీ రామరాజుగారి విజయం వెనుక మీ సహకారం ఎలా ఉండేది? వారి గురించి చెప్పండి!
జ. ఆయన ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్లి, ఘంటసాల ఆరాధన ఉత్సవాలు చేస్తుంటారు. తన వేగ్నేష్ ఫౌండేషన్ పేరుతో దివ్యాంగుల కోసం ఒక పాఠశాల స్థాపించారు. ఆ స్కూలు 1983 నుండి 2019 కోవిడ్ వచ్చే వరకు నడిచింది.
పోలియో వ్యాధి తగ్గిపోయింది కదా! అందుకని ఆ వ్యాధి గ్రస్తులు చేరకపోవడంతో… మానసిక ఎదుగుదలలేని పిల్లల కోసం ఆ పాఠశాలలో ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసి నడిపిస్తున్నారు. వాటి కోసం విరాళాలు సేకరించారు. మూడు కోవెలలు కట్టారు. లక్ష్మీనరసింహస్వామి, సాయిబాబా గుడి, ఘంటసాల గుడి కట్టారు. అలాగే వంశీ సంస్థ ద్వారా వృద్ధుల ఆశ్రమము హయత్ నగర్ దగ్గర కుంట్లూరులో నడిపిస్తున్నారు. ఉదయం అంతా వీటిని చూసుకొని సాయంత్రం వంశీ ప్రోగ్రామ్స్ చూస్తారు అలా ఇద్దరం ఒక్క నిముషం వృధా చేయము.

ప్ర. వంశీ ప్రచురణలు అని చెప్పారు! అందులో ఎలాంటి పుస్తకాలు ముద్రించారు ? మీరు దానికి ఎలా సహకరించారు?
జ. వంశీ చాలా కాలం క్రితం కొన్ని పుస్తకాలను ప్రచురించింది. మధ్యలో కొంత కాలం ఆపేశారు! మళ్లీ స్వర్ణోత్సవం (50 సం.రాలు) దాటిన తర్వాత చాలా పుస్తకాలు ముద్రించారు. అందులో సినిమాల మీద ముఖ్యంగా జమున గారి, సావిత్రి గారి సినిమాలు వాటి మీద కార్యక్రమాలు చేసి, ఆ ప్రసంగాలన్నీ పుస్తకంగా ప్రచురించాం. దానికి నేను సంపాదకురాలిని. అది కాకుండా వంశీ కథలు దాదాపు 20- 25 పుస్తకాలు నా సంపాదకత్వంలో వెలువడ్డాయి.
తర్వాత వంశీ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు సన్మాన పత్రాలు నాలుగైదు వందల వరకు రాసాను. నాలుగు సార్లు అమెరికాకు వెళ్లి వచ్చాను. వంగూరి ఫౌండేషన్ వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అక్కడ కూడా కార్యక్రమాలు చేసారు. వాళ్ళు పుస్తకాల ప్రచురిస్తారు. వంగూరి చిట్టెం రాజుగారు ఎన్నో కార్యక్రమాలు చేసారు. నెలనెలా వెన్నెల అని ఇప్పటికీ దాదాపు 200 పైగా అంటే 14 సంవత్సరాలుగా వరుసగా నిర్వహించారు.
1998లో అక్కడ ఆయన నిర్వహించిన కార్యక్రమంలో అట్లాంటాలో పాల్గొన్నాను. వంశీ రామరాజు గారు ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్లి ఆ ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహించి, ఆ వచ్చిన డబ్బుతో దివ్యాంగుల సంరక్షణ కోసం వినియోగిస్తారు. అలా ఆ పాఠశాలను అభివృద్ధిచేసారు.
ప్ర. లిటిల్ డిటెక్టివ్ నవల రాసాను అన్నారు కదా! అది ఎందుకు? రాయాలనుకున్నారు. దాని నేపథ్యం చెప్పండి!
జ. నాకు నవల రాయాలని కోరిక ఉండేది. కానీ రాయలేనేమో అని అనుకున్నాను కథలు, కవితలు రాసాను. చిన్నప్పటినుండి మా నాన్న నవలలు చదవడం అలవాటు చేసాడు. అందులో మధుబాబు డిటెక్టివ్ నవలలు కూడా ఉండేవి. ఇలాంటి ఒక నవల రాయాలనుకున్నాను. అప్పుడు షర్లాక్ హోమ్స్ ( Sherlock Homes) నవల చదివి ప్రేరణ పొంది రాసాను. దాన్ని దాసరి నారాయణ రావు గారి సంపాదకత్వంలో నడిచిన ఉదయం పత్రికలో ప్రచురించారు. అది ధారావాహికగా వెలువడింది. చిన్నపిల్లలే డిటెక్టివ్ లు గా సాగిన నవల.

ప్ర. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాటక కళావైదుష్యం అనే పరిశోధనాంశంగా ఎన్నుకోవడానికి కారణం ఏమైనా ఉందా, నాటకాలు రాసారు. కనుక ఆ అంశమే కావాలని ఎన్నుకున్నారా?
జ. బలిజేపల్లి వారి రచన పైననే పరిశోధన చేస్తానని అనుకోలేదు. కానీ ఏ అంశాన్ని ఎన్నుకోవాలనే దానిమీద చాలా తర్జనభజన పడ్డాను. బలిజేపల్లి వారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సత్యహరిశ్చంద్ర నాటకం. అది నాకు ఎంతో ఇష్టం. ఎన్నోసార్లు చూసాను. ఆ పద్యాలు విన్నప్పుడు నాకు స్ఫూర్తి కలిగేది. బలిజేపల్లి రచనల మీద నా సిద్ధాంత గ్రంథం రాస్తే ఎలా ఉంటుందని మా నాన్నని అడిగితే చాలా ప్రోత్సహించారు కానీ వారి రచనలన్నీ దొరకాలి కదా! ఆయన రచనలు…
శివానందలహరి (శతకము )
స్వరాజ్య సమస్య (పద్య కృతి)
బ్రహ్మరథం (నవల )
మణి మంజూష ( నవల )
బుద్ధిమతీ విలాసం (భక్త సిరియాళుని కథ)
ఉత్తర గోగ్రహణం (నాటకం )
సాత్రజితీ పరిణయం ( నాటకం )
ఉత్తర గోగ్రహణం ( అనువాదం )
అందులో సత్యహరిశ్చంద్రీయం బాగా ప్రసిద్ధి పొందింది. బలిజేపల్లి వారు రచయితే కాదు! నటుడు, వాగ్గేయ కారుడు, పాటలు పాడేవారు. నక్షత్రకుడిగా ఎన్నోసార్లు నటించారు. ఆయన రచనలు చదివిన కొద్దీ నాకు ఆసక్తి కలిగింది. గైడ్ గా ఎం వి ఆర్ శాస్త్రి గారు నన్ను చాలా ప్రోత్సహించారు. నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను. బుద్ధిమతీ విలాసం నాటకం, సాత్రజితీ పరిణయం నాటకం దొరకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో లైబ్రరీలకు తిరిగి మొత్తానికి సంపాదించాను. పరిశోధన చేసాను. వారి రచనలపై పరిశోధనగ్రంథం రాయడం నాకు ఆత్మ సంతృప్తినిచ్చింది.
ప్ర , ఆనాటి రచయతల, రచయిత్రుల ప్రభావం మీ మీద ఉందంటారా?
జ. తప్పకుండ ఉంది. ఎందుకంటే వాళ్లే నాకు స్ఫూర్తి ! ముఖ్యంగా తెన్నేటి లత మాకు దూరపు బంధువు కూడా! యద్దన పూడి సులోచనా రాణి నవలలు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె వలె రాయాలని అన్న ఒక కోరిక బలంగా ఉండేది. ఎలా అయినా రాయాలి. పాఠశాల చదువైపోగానే నేను అలా అనుకొనే దాన్ని! నేను ఏదో ఒకటి రాసి మా ఇంట్లో చూపిస్తే చాలా బాగా రాసావే! అని నన్ను అభినందించడం, అలా నేను ముందుకు వెళ్లే అవకాశం కలిగింది.
సులోచన రాణి గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు, యండమూరి వలె రచన చేయాలనుకున్నాను. ఏదైనా నా ముందు సంఘటన జరిగితే దాన్ని మలిస్తే పాఠకులకు చేరే మార్గం తక్కువ. ఆనాడు ఇన్ని మాధ్యమాలు లేవు! ఏవో కొన్ని పత్రికలు మాత్రమే ఉండేవి. వాటి ద్వారా మాత్రమే రచనలు బయటకు వచ్చేవి.

ప్ర. రచయిత్రుల కొత్త కథనం అని ఒక సంకలనం తీసారు కదా? దాని గురించి వివరించండి!
జ. రచయిత- రచయిత్రుల కొత్త కథలన్నీ ప్రచురించాలని వంశీ సంస్థ తలపెట్టింది. అట్లా మొదలుపెట్టినప్పుడు దానికి ఆర్థిక వనరు ఉండాలి కదా! ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి? అని ఆలోచించినప్పుడు అమెరికాలో ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు (హృదయకోశ నిపుణులు) ఆయన సాహిత్యాభిలాషిగా ఆ ప్రచురణలకయ్యే ఖర్చు భరిస్తానని అనడంతో ఆరు కథా సంకలనాలు వెలువరించాము. కొత్త కథల పేరిట అంటే రచయిత్రుల (రచయితల) మొదటిగా రాసిన కథలు. మొదటి సంకలనం కేవలం రచయిత్రుల కథలే 32 కథలతో ముద్రించారు. తర్వాత ఇద్దరివి కలిపి ముద్రింప చేశాం! ఈ కొత్త కథల సంపుటిలకు నేను సంపాదకురాలిగా ఉన్నాను.
ప్ర. పత్రికల మీద మీ అభిప్రాయం చెప్పండి! ఇంకా ఏమైనా సూచనలు చేయండి!
జ. పత్రికలు ఎన్ని వస్తే అంత సాహిత్య సేవ జరుగుతుంది. పాఠకులు చదవడం ముఖ్యం… రాసే వాళ్ళు ఉన్నారు- ప్రచురించడానికి అంతర్జాల పత్రికలు ఎక్కువైనవి. స్వాతి, సాహితీ కిరణం లాంటి పత్రికలు తప్ప చాలావరకు కనుమరుగయ్యాయి. చదివింప చేసినంత కాలం పత్రికలు బాగా నడుస్తాయి. ఊరికే పత్రిక వెలువరిస్తే ఫలిత ఉండదు. ముఖ్యంగా యువత చదవాలి! కానీ చదువుతున్నారా? అంటే సందేహమే! ఎందుకంటే వారు సెల్ఫీలు, యూట్యూబ్లలో రీల్స్ చేయడంలో తలమునకలై ఉన్నారు. కొందరు యూట్యూబ్ లో కథలు వినిపించే ప్రయోగాలు చేస్తున్నారు కొన్ని కథలు శ్రోతలను చేరుతున్నాయి కూడా!
నీహారిణి వంటి వారు అంతర్జాల పత్రికలు నడపడం మంచి పరిణామమే! అలాగే ఇంకా ఎన్నో అంతర్జాల పత్రికలు వస్తున్నాయి. అయితే ఆ యా పత్రిక లలో యువతకు పనికొచ్చే అంశాలను చేర్చాలి! చాలా మార్పు వచ్చింది సమాజంలో… ఆ తరానికి ఈ తరానికి అభిరుచులు మారాయి! కొన్ని విషయాలు మనకు నచ్చినవో-నచ్చనివో ఉండవచ్చు! కానీ ఆ తరానికి చెందిన వాళ్ళమైనా ఈ తరం వాళ్లతో సర్దుకుపోయి, దీని కనుగుణంగా యువతలో మార్పు తెచ్చే అంశాలు ప్రచురించాలి. ఆ బాధ్యత పత్రికాధిపతులతో పాటు, రచయిత- రచయిత్రులకు కూడా ఉండాలి!
రంగరాజు పద్మజ :– అడగగానే కాదు… లేదు! అని తప్పించుకోకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి, అటు సాహితీ రంగానికి, ఇటు సేవారంగానికి సంబంధించిన మీ భార్యాభర్తల కృషి చక్కగా వివరించినందుకు పత్రిక తరపున మీకు కృతజ్ఞతలు. ఈ విషయాలన్నీ రేపటితారానికి స్ఫూర్తిదాయకాలే! అందుకు మీకెంతో ధన్యవాదాలు!
తెన్నేటి సుధ :— ఇంత దూరం వచ్చి, ఇంత సేపు కూర్చుని, పాఠకులను మెప్పించే తీరులో ముఖాముఖి జరిపినందుకు ధన్యవాదములు పద్మజ గారూ! నమస్కారమండీ! కథలో…నవలలో ఎవరికి వారు రాస్తారు. అందులో సందేహం లేదు! కానీ ఇతర రచయిత- రచయిత్రుల రచనలు కష్టనష్టాలకోర్చి సంపుటులుగా ముద్రించడం అన్నది గొప్ప హృదయం ఉంటే కానీ సాధ్యం కానీ పని. అలాగే ద్రవించే హృదయం ఉన్నప్పుడే సేవ చేయాలనిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ అటు బాలబాలికలకు- ఇటు వృద్ధులకు సేవలు అందించడం అంటే మాటలు కాదు! అది చెప్పినంత తేలికాకాదు!
హృదయమున్న రచయిత్రి కలం అంతే ఆర్ద్రతతో – విలువలతో కూడిన రచనలు వస్తాయి! అలా ముప్పేటలుగా సేవా- సాహితీ-ఆతిథ్యాలతో 50 సంవత్సరాలుగా ప్రజల మన్ననలను అందుకుంటున్నారు.
మరిన్ని రచనలు, వారి సేవలు సదా ఇలాగే కొనసాగాలని…. వారికి ఆ దేవదేవుడు అనేక మంగళ శాసనాలు అందించాలని కోరుకుంటూ రచయిత్రి తెన్నేటి సుధ గారిని అభినందిస్తూ….
