చాలా రోజులుగా ఋష్యమూక పర్వతంపై సీతమ్మ ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న శ్రీరాముడికి హనుమంతుడు తీసుకొచ్చిన వార్త ఉపశమనాన్ని కలిగించింది. హనుమంతుడు సీతమ్మవారు ఇచ్చిన చూడామణిని అందించి ఆమె క్షేమ సమాచారమును తెలియజేశాడు. చూడామణిని చూసిన శ్రీరాముడు కంటతడి పెట్టుకుని, వెంటనే సుగ్రీవునితో లంకపై దండయాత్రకు సైన్యాన్ని సిద్ధం చేయమనడంతో, కోట్ల సంఖ్యలో వానరులు రామ కార్యం నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. శ్రీరాముడు ఆ విశాలమైన వానర సైన్యమును తీసుకొని లంకా నగరంపై దండయాత్రకు బయలుదేరి సముద్రతీరానికి చేరుకున్నాడు.
విశాలమైన సముద్ర తీరానికి చేరుకున్న రాముని సైన్యం, సముద్రాన్ని ఎలా దాటాలనే సమస్య ఎదురైంది. శ్రీరాముడు వరుణుడైన సముద్ర దేవత సహాయం పొందాలని నిర్ణయించుకుని, మూడు రోజులు ప్రార్థించినా సముద్రం నిశ్శబ్దంగా ఉండటంతో, ఆ కరుణామూర్తి అయిన రామచంద్రుడు ఉగ్రరూపుడై సముద్రాన్ని ఆవిరి చేయాలని విల్లుపై బాణాన్ని ఎక్కు పెట్టగానే, వరుణుడు భయంతో కంపించి క్షమించమని ప్రార్థించాడు. తన స్వభావాన్ని మార్చలేనని, కానీ ఒక పరిష్కారాన్ని సూచించగలనని చెప్పి, వారి సైన్యంలో వంతెనను నిర్మించే సామర్థ్యం కలిగిన నలుడి సహాయంతో సముద్రంపై వంతెనను నిర్మించమని చెప్పాడు.
వానరులు అత్యంత ఉత్సాహంతో పరుగు పరుగున సముద్రం మీదకు పెద్ద పెద్ద రాళ్ళను విసరడం ప్రారంభించారు. అయితే, ఆ రాళ్ళు సముద్రంలో వేయగానే మునిగిపోవడంతో వానరులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అది గమనించిన హనుమంతుడు మనస్సులో శ్రీరాముడిని ధ్యానించి, ఒక రాయిపై ‘జై శ్రీరామ్’ అని వ్రాసి సముద్రంలో వేయగానే అది అద్భుతంగా తేలసాగింది. అది చూసిన వానరులు రెట్టింపు ఉత్సాహంతో రాళ్లపై ‘జై శ్రీరామ్’ అని రాయడం, సముద్రంపై వేయగానే అవి తేలడం ప్రారంభించడంతో ఆ సముద్ర తీరాన ‘రామ్ నామ ధ్వని’ వినిపించసాగింది.
రామలక్ష్మణులు వారిని మరింత ఉత్సాహపరుస్తూ, “వానరులారా, మనం లంకా నగరం చేరడానికి ఎక్కువ సమయం లేదు. రావణుని వధించి మీ సీతమ్మ ను తెచ్చుకోవాలి” అంటూ ఆ వానరులను ప్రోత్సహిస్తుంటే, వారు రెట్టింపు వేగంతో వారధిని కట్టసాగారు.
అతి వేగంగా వానరులు సముద్రంపై నిర్మిస్తున్న వారధిని చూసిన రావణుడి గూఢచారులు, అత్యంత వేగంగా రావణుడి వద్దకు ఆందోళనగా వచ్చి ఇలా విన్నవించారు: “ప్రభూ! మీరు అనుకున్నదంతా తారుమారు అయింది. వానర సైన్యం విశాలమైన సముద్రాన్ని దాటి లంకకు చేరడం అసంభవం అని మీరు భావించారు. కానీ వారు బండరాళ్ళతో వారధిని నిర్మిస్తున్నారు.”
అది విన్న రావణుడు నిర్ఘాంతపోయి, కోపంతో ఊగిపోతూ ఇలా అన్నాడు: “అసంభవం! రాళ్ళతో వారధిని కట్టడమా? అది అసాధ్యం. మీరు మైకంలో ఏదో చూసి నాకు అసత్యం చెబుతున్నారు.”
అందుకు గూఢచారులు, “లేదు ప్రభూ, మేము అసత్యం చెప్పడం లేదు. నిజంగానే అక్కడ వానరులు రాళ్ళ మీద ‘జై శ్రీరామ్’ అని రాసి సముద్రంలో వేయగానే అవి తేలుతున్నాయి. దాదాపుగా వారధి నిర్మాణం పూర్తయింది” అని విన్నవించగా, రావణుడి హృదయం భయంతో కంపించింది.
ఆ వార్త కార్చిచ్చులా లంక వాసులలో వ్యాపించడంతో, వారు భయభ్రాంతులకు గురై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. “రామ నామం లిఖించిన రాళ్ళు సముద్రంలో వేయగానే తేలుతున్నాయట! శ్రీరాముడు సామాన్యమైన నరుడు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన నామంలోనే అంతటి మహిమ ఉంటే, ఆయన సామర్థ్యాన్ని ఊహించవచ్చు. ఇక ఆ శ్రీరాముడు లంకను చేరి దశగ్రీవుడిని ఓడించడం తథ్యం. బ్రహ్మ ఆయనకు ఇచ్చిన వరం ప్రకారం, తుచ్ఛమైన మానవుల చేత తప్ప మరెవరి చేతనూ అతనికి మృత్యువు సంభవించదు అనేది నిజం కానుంది. కాబట్టి, మనతో పాటు ఈ స్వర్ణ లంక యొక్క వినాశనాన్ని ఎవరూ తప్పించలేరు,” అంటూ విలపించారు.
లంక ప్రజలు చర్చించుకుంటున్నది తెలుసుకున్న దశకంఠుడు, వారికి తనపై విశ్వాసము పునరుద్ధరించడానికి మరియు తన సామర్థ్యమును నిరూపించడానికి మరుసటి రోజు అందరినీ సముద్ర తీరానికి రమ్మని చాటింపు వేయించాడు. తెల్లవారేసరికి ప్రజలంతా సముద్ర తీరానికి చేరుకున్నారు. రావణుడు కూడా గర్వంగా సముద్ర తీరానికి వచ్చి ఒక రాయి మీద “జై రావణ” అని రాసి, దానికి ఏదో మెల్లగా చెప్పి, సముద్రంలోకి విసిరాడు. రాక్షసులు చూస్తూ ఉండగా మహా అద్భుతం జరిగింది. “జై రావణ” అని రాసిన రాయి నీటిలో తేలింది. రావణుని సామర్థ్యం చూసిన ప్రజలు అత్యంత ఆనందం పొంది “జై రావణ” అని జయఘోష చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
రావణుని భార్య, పట్టమహిషి అయిన మండోదరి తన భవన గవాక్షం నుండి జరుగుతున్న సంఘటనను చూసి, చెలికత్తెల ద్వారా విషయం తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యింది. రావణుడు ఆమె అంతఃపురానికి రాగానే, ఆమె వినయంగా “స్వామి, మీరు అన్యథా భావించకుంటే ఒక విషయం అడుగుతాను”. దానికి రావణుడు “మండోదరి, నీవు లంకకు మహారాణివి, నిస్సంకోచంగా అడుగు” అనడంతో ఆమె “నేను విన్నది, చూసింది నిజమేనా? మీ నామం లిఖించిన రాయి సముద్రంలో తేలటం నిజమా? అది మీ రాక్షస మాయా లేక నామ మహిమా? నాకు తెలుసుకోవాలని ఉంది, చెప్పండి” అని ఆతృతగా అడిగింది.
దానికి రావణుడు బిగ్గరగా నవ్వి, “మండోదరి, నీవు చూసింది నిజమే. అది మాయ కాదు, నామ మహిమ, అది కూడా శ్రీరామ నామ మహిమ” అని ఆశ్చర్యంగా చూస్తున్న మండోదరితో రావణుడు ఇలా అన్నాడు, “నా పేరు రాసి సముద్రంలో వేస్తే అది మునిగిపోతుందని ఖచ్చితంగా తెలుసు. అందుకే రాయి మీద నా పేరు లిఖించి సముద్రంలో వేసే ముందు దానితో మెల్లగా ఇలా అన్నాను, ‘నీవు కానీ తేలకపోతే రామునిపై ఆన’ అంటూ రామునిపై ఒట్టు వేసి సముద్రంలోకి విసిరాను. అందువలన ఆ రాయి కట్టుబడి తేలక తప్పలేదు. ఈ విధంగా నేను ప్రజల విశ్వాసం తిరిగి పొందగలిగాను” అని గర్వంగా పలికాడు.
దానికి మండోదరి, రామ నామంలోనే ఇంతటి మహత్యం ఉంటే రాముని సామర్థ్యం ఊహించ శక్యం కానిదని గ్రహించింది. రావణుని మూర్ఖత్వానికి ఆమె మనస్సులో నవ్వుకుని, శ్రీరాముని రూపంలో ఉన్న వైకుంఠనాథుడికి మనసులోనే నమస్కరించి, తన భర్తకు సన్మార్గం చూపమని ప్రార్థించింది.
రావణుడు ఇంత జరిగినా, అతనికి రాముని సామర్థ్యము తెలిసినా, అహంకారముతో, బల గర్వముతో, మూర్ఖత్వము వదలక రాముని చేతిలో వధింపబడి రాక్షస కుల వినాశకుడయ్యాడు.
***
