“గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండు ఉండేవి. ఒక గూటిలోన రామచిలుక ఉంది, ఒక గూటిలోన కోయిల ఉంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది అయిన రెంటికీ జత కుదిరింది” ఈ పాట ప్రతి ఉదయం “ఆత్మీయ నిలయం”లో సుప్రభాతంలా వినపడ్తూనే ఉంటుంది. అక్కడ ఉండే వారందరూ బంధువులు కారు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. కొందరు కన్నా బిడ్డలు వదిలిచ్చుకున్నవారు. మరికొందరు కూడు, గూడు లేనివారు. అందరూ అక్కడ ఒకరికి ఒకరు ఆత్మీయులే అక్కడ అందరి మతం మానవత్వమే ఒకరికి ఒకరుగా వయో బేధం లింగ వివక్ష లేని నిలయం. ఆరోగ్య ప్రధమైన ఆలయం అనవచ్చు. ఆత్మీయ నిలయంకు అంకురార్పణ చేసింది రామయ్య, అతనికి ఒక కుమారుడు, బాగా చదువుకొని విదేశాల్లో స్థిర పడ్డాడు. కొంత కాలం క్రితమే రామయ్య భార్య సీతమ్మ దేవుడి దగ్గరకు పోయింది. రామయ్యకు రంగయ్య ప్రాణ స్నేహితుడు. రంగయ్య నిలువెత్తు ఫోటో ఆత్మీయ నిలయంలో అడుగు పెట్టగానే ఎదురుగా కనిపిస్తుంది. రంగయ్య ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు ఆ విగ్రహం కూడా పూల తోట మధ్యలో మనకు కనిపిస్తుంది. పచ్చని చెట్లు, పండ్లు, కూరగాయలతో పూల పరిమళాలు వెదజల్లుతూ నిత్య వసంతంగా ఆత్మీయ అనురాగాలతో ఆనంద నిలయంగా కళకళగా ఉంటుంది.
అర్థరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. గేటు బయట కట్టిన గంట అదే పనిగా మొగుతుంది. ఎవరో ఆశ్రమం కోసం వచ్చారనుకొని రామయ్య వెళ్ళి గేటు తీసాడు అంతే, ఓ అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి తూలుతు కనిపించాడు. రామయ్య పడిపోకుండా ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఆపలేకపోయాడు. ఆలింగనం చేసుకున్నాడు పోదిమి పట్టుకున్నట్లుగా ఆ స్పర్శ ….. ఆ స్పర్శ రామయ్యలో ఏదో భావోద్వేగాన్ని కల్గించింది. మనసు తనువు పులకించింది. నెమ్మదిగా లోపలికి తీసుకువచ్చి వేడి నీటితో స్నానం చేయించి మంచి బట్టలు వేసి, ఆహారం తినిపించి, మంచంపై పడుకోబెట్టాడు. ఆ వ్యక్తిని పోల్చుకోలేనంతగా మారిపోయాడు కాని శరీర పరిష్వంగణలో చిన్ననాటి ప్రాణ స్నేహం చెదరలేదు. అతడే రంగయ్య, రామయ్య ప్రాణ బంధం. రంగయ్య నిద్రలోకి జారుకున్నాడు. రామయ్య పక్కనే కూర్చొని ఆలోచనలోకి జారుకున్నాడు. ”రంగయ్య ఒకప్పుడు శ్రీ కృష్ణుడైతే తాను కుచేలుడు అలాంటి గుణవంతుడు, ధనవంతుడు, స్నేహ శీలి, అందరి కష్టాలు వాడివిగా భావించి సహాయం చేసే ధర్మదాత. నేడు ఈ పరిస్థితిలోకి ఎలా వచ్చాడు. గత కొంత కాలంగా అందరికీ దూరంగా ఉన్నాడు. కనీస వివరాలు గానీ, ఫోన్ నంబర్ కూడా లేదు. కానీ రామయ్య మాత్రం రంగయ్య జ్ఞాపకాలతోనే కాలం గడుపుతున్నాడు. నేడు ఇలా …… చూస్తుంటేనే గుండెల్లో బాధ మెలిపెడుతుంది. అలానే నిద్రలోకి వెళ్ళిపోయాడు.
వరంగల్ దగ్గర ఒక పల్లె, అక్కడ యజమాని-నౌకరు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్యతో పనులు చేసుకునేవారు. వారికి ఇద్దరు కొడుకులు, వారి పేరే రంగయ్య, రామయ్య. చిన్న తనం నుండి కలిసి మెలిసి ఉండేవారు. గడ్డివాముల్లో కూర్చొని చదువుకునేవారు. రంగయ్య తల్లి కూడా రామయ్యను తన కొడుకుతో సమానంగా చూసుకునేది. హెచ్చు తగ్గులు బాల్యానికి అవరోధం కాకూడదు. పసి మనసులకు తారతమ్యం ఉండకూడదు అనే మంచి మనసు ఆ తల్లిది. రాము, రంగ అంటూ ముద్దుగా పిలిచేది. ఇద్దరు రూపంలో రంగుల్లో వేరైనా మాట, బాట, నిజాయితీ ఒకటిగా పెరిగారు. చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారికి వారే పోటీ. కొన్ని సార్లు రాము ఓడి రంగను గెలిపిస్తే, మరోసారి రంగా ఓడి రామును గెలిపించేవాడు. పాఠశాల వార్షికోత్సవము లో బహుమతులన్నీ వాళ్ళవే. వారి స్నేహం ఆ గ్రామానికే కాక అందరికీ ఆదర్శం. రంగయ్య పై చదువులకు పట్నం వెళ్ళాడు. రాము చేతి వృత్తుల విద్యతో పాటూ వ్యవసాయం నేర్చుకొని ఉన్న ఊర్లోనే ఉండిపోయాడు. సెలవుల్లో కలుసుకొని యోగ క్షేమాలు తెలిసుకోనేవారు. రంగ పట్నంనుండి రాము కోసం మంచి మంచి పుస్తకాలు, బట్టలు తెచ్చేవాడు. వృత్తికి వ్యవసాయానికి సరైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. రాము రంగ దగ్గరికి వెళ్ళినపుడు పల్లె రుచునలను, పల్లె తల్లి ఇచ్చిన సంపదలను కానుకగా తీసుకెళ్ళేవాడు. కొంత కాలం గడిచాక రాముకు, రంగకు తగిన అమ్మాయిలను చూసి పెళ్లిళ్లు చేశారు వారి తల్లిదండ్రులు. రాముకు దగ్గరి బంధువుల అమ్మాయి మామూలుగా చదువుకున్నది. రంగకు బాగా చదువుకున్న అందమైన, ఆస్తి గల కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. రాము, రంగ భార్యల స్వభావం విభిన్న దృవాలైన తమ భర్తల స్నేహం ముందు తల వంచారు. స్నేహ మాధుర్యాన్ని తమ మనసులో ఆస్వాధిస్తూ వారి మధ్య కూడా సఖ్యత, ఆప్యాయతలు నెలకొన్నాయి. కాల చక్రం అయిదు సంవత్సరాలు తిరిగే సరికి రాము, రంగ ఇద్దరు తండ్రులైనారు వారికి చెరొక కొడుకు చాలనుకున్నారు. కాలానుగుణంగా మార్పులు సహజంగా వచ్చాయి. రంగ, రాము ఇద్దరు వారి పిల్లలను బాగా చదివించి అమెరికాకు పంపించాలన్న సంకల్పం చేసుకున్నారు. రాము పల్లెలోని పొలం కౌలుకు ఇచ్చి తన వ్యాపారంను పట్నంలో సాగిస్తూ ఇద్దరు మిత్రులు ఒకే ఊరిలో జీవనం సాగిస్తున్నారు. అనుకున్నట్లుగానే రాము వ్యాపారం బాగా వృద్దిలోకి వచ్చింది. రంగ ఉద్యోగంలోనూ, ఆస్తులలోనూ చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇద్దరి మధ్య స్నేహ వారధి ఇంకా బలపడసాగింది. పిల్లల చదువులు ముగిశాయి. పై చదువులకు అమెరికా వెళ్లాలని రంగ కొడుకు, జర్మనీ వెళ్తానని రాము కొడుకు నిర్ణయించుకున్నారు. వారి అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగానే రాము, రంగ ఏర్పాటుచేసి విమానాశ్రమానికి వెళ్ళి, విమానం ఎక్కించి వచ్చాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో రంగ కొడుకు అమెరికా నుండి ఫోన్ చేశాడు “తానే స్వంతంగా ఒక కంపెనీ పెడుతున్నానని ఇక్కడి అమ్మాయి పరిచయం వల్ల నాకీ అవకాశం వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను”. అంటూ ఫోటోలు పంపించాడు. ఏమీ చేయలేని స్థితిలో రంగ దంపతులు సోఫాలో కూలబడిపోయాడు. రాము దంపతులు రంగను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. మనసులో మాత్రం తన కొడుకు ఏమి చేస్తాడో అన్నదిగులు ఉండేది రాము దంపతులకు. కాని రాము కొడుకు తల్లిదండ్రుల ఇష్టంతోనే ప్రేమించిన అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఉద్యోగాలుచేస్తూ వారి ఖర్చులకు పోనూ మిగిలిన డబ్బులను తండ్రికి పంపించేవాడు. వాటితో రాము ఆస్తులను కొని కొడుకు, కోడలు పేరున ఉంచేవాడు.
రంగ కొడుకు వ్యాపారంలో మెళకువలు నేర్చుకొని బాగా సంపాదిస్తూ ఖరీదైన స్నేహాలు, అలవాట్లతో పొదుపు చేయలేకపోయాడు. అతని భార్య కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది కావడం వలన విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. రంగయ్య కొడుకును ఎప్పుడు ఏమీ అనేవాడు కాదు. సంతోషంగా ఉంటేచాలు అనుకునేవాడు. రంగయ్య దంపతులను కొడుకు అమెరికా పిలుచుకున్నాడు. అక్కడి అందమైన ప్రదేశాలు చూపించాడు. తన కంపెనీ ఎలా నడుస్తుందో చెప్పాడు. స్నేహితులను పరిచయం చేశాడు. దాదాపు రెండు నెలల కాలం కొడుకు, కోడలు, మనవళ్లతో గడిపాడు. ఈ ఆనందం చాలు ఇంకా ఏ దిగులు లేదనుకున్నాడు. ఇద్దరు ఇండియా కు ప్రయాణం అవుతున్నారు. సరిగ్గా అదేసమయంలో కోడలు దగ్గరకు వచ్చి “మావయ్య మీ అబ్బాయి బిజినెస్ ను ఇంకా డెవెలప్ చేయాలనుకుంటున్నాడు”… అంటూ ఆగిపోయింది నేలచూపులు చూస్తూ, చెప్పు తల్లీ నువ్వు నా బిడ్డవే అన్నాడు రంగ.”అదే మామయ్య పట్నంలో ఉన్న ఆస్తులు కొన్ని అమ్మి మాకు డబ్బులు సర్దుబాటు చేస్తే బాగుంటుంది”. ఆ మాటలకు ఓ క్షణం తటపటాయించి ఇంటికి వెళ్ళి కబురు చేస్తా, వాటికి ఎంత ధర వస్తుందో తెలుసుకోవాలిగా అన్నాడు. సరే మామయ్య అంటూ సాగనంపారు. ఇండియాకు వచ్చి కోడలు అడిగినట్లుగానే ఆస్తులు అమ్మి కొడుకు అకౌంటుకు బదిలీ చేయించాడు. రాము వారించినా వినలేదు. మనం సంపాధించింది వాళ్ళకే కదా అంటూ రాము మాటలను తోసిపుచ్చాడు. మరో రెండు సంవత్సరాలకు ఇంకొంత ఆస్తి అమెరికా చేరింది. వయసు తెచ్చిన ప్రభావమో, దిగులో తెలియదు రంగ భార్యకు అనారోగ్యం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. విషయం తెలుసుకున్న రంగ కొడుకు మిగిలిన ఆస్తులను అమ్మి అమ్మను తీసుకొని మా దగ్గరకు రండి ఇక్కడ మెరుగైన వైద్యం చేయించవచ్చు అన్నాడు. భార్యను బ్రతికిచ్చుకోవాలి అన్న ఆరాటంతో ఆస్తులను సొమ్ముగా మార్చుకొని భార్యను తీసుకొని కొడుకు దగ్గరకు వెళ్ళాడు. ఇంతకుముందు వెళ్ళినపుడు కొడుకు కోడలు బాగా చూసుకున్నారు కదా ఇప్పుడు అలాగే అనుకున్నాడు. కాని అక్కడకు వెళ్ళిన కొద్ది రోజులకు తెలిసింది. ఆస్తులు కావాలి కాని కన్నవారి అవసరం కాదని ఏదో మొక్కుబడిగా వైద్యం సాగుతుంది. కాస్త మెరుగైంది అనుకునే పరిస్థితిలోనే రంగ భార్య చనిపోయింది. ఆ తర్వాత రంగ నుండి ఫోన్లు ఏమీ రాలేదు……
రంగ లేచి కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న రాముని లేపి అమాంతంగా కౌగిలించుకున్నాడు. “స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం” అనే పాట వినిపిస్తుంది ఇద్దరి మనసుల్లోనూ. అప్పుడు అడిగాడు రాము, రంగను ఇన్నాళ్ళు ఎక్కడకు వెళ్లావు? నేను గుర్తుకు రాలేదా? అంటూ …. రంగ కళ్ళు జలపాతంగా మారాయి. రాము తన కండువతో కన్నీటిని తుడిచి ఏంటి రా చిన్నపిల్లాడిలా! అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ముందు కాఫీ తాగు అంటూ మొక్కల మధ్య ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహం దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. చూడరా నీకు ఇష్టమైన దైవం నీ గుర్తుగా ఇక్కడ పెట్టించాను. అదిగో అక్కడు చూడు నీ ఫోటో ఉంది అంటూ చూపించాడు. రంగ రాము చాలా ఆనందంగా చిన్నపిల్లలై పోయారు.
ఇప్పుడు చెప్పరా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని రాము రంగ ను మళ్ళీ మళ్ళీ అడిగాడు. “ఏముందిరా చెప్పడానికి వాళ్ళు పథకం ప్రకారం నా ఆస్తులన్ని స్వంతం చేసుకొన్నారు. తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు చూశాను, ఇండియాకు రావాలనుకున్నాను. కాని ఆవిడ చనిపోవడంతో కొంత కాలం ఉండాల్సి వచ్చింది. నిన్ను చూడాలని మన పల్లెలో బ్రతకాలని మనసు ఆరాట పడింది. ఆ విషయమే కొడుకుకు చెప్పాను. వాడు విమానం మాత్రం ఎక్కించాడు. చేతిలో చిన్ని గవ్వలేదు. పట్నం రాలేక ఎక్కడెక్కడో చిన్నచిన్న పనులు చేసుకుంటూ చివరకు ఇలా నీ దగ్గరకు చేరాను” అని చెప్పాడు.
ఆత్మీయ నిలయం ఏంటి రా ఎందుకు పెట్టావు అని రంగ రాముని అడిగాడు. నా కొడుకు పంపిన డబ్బులతో ఆస్తులను కూడబెట్టాను. వాడు రమ్మన్నా నేను పోలేదు, వాళ్ళే అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతారు. ఇక్కడ అన్నీ లెక్కలు చూసుకుంటారు. మన ఊళ్ళో ఉన్న మన వయసు వాళ్ళందరూ ఒంటరి వాళ్ళు అయ్యారు. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, అందుకే కొడుకు, కోడలు, నేను కలిసి తీసుకున్న నిర్ణయం మన స్నేహానికి గుర్తుగా మన లాంటి వారి కోసం ఏర్పాటుచేసిన నిలయమే ఈ ఆత్మీయ నిలయంరా అంటూ ఒకరినొకరు కౌగిలించుకొని ఇద్దరి ఆత్మలు ఒకటిగా అడుగులు వేయసాగారు. “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా …. కడ దాకా నీడ లాగా నిను వీడిపోదురా … పాట సాక్షిగా రాము రంగ స్నేహానికి చిరునామా అయ్యారు.”
కథలు
బెంచీల మీదనుంచి లేచి వెళ్ళిపోయిన జంటల వెచ్చదనం ఇంకా అలాగే ఉంది. పొదలు తమ పక్కనే కూచుని మాట్లాడుకున్న ప్రేమికుల గుసగుసలు మననం చేసుకుంటున్నవి. పచ్చిక తన మీద నడచిన సున్నితమైన పాదాల స్పర్శను ఇంకా అనుభవిస్తూనే ఉంది.
చిల్లు బడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులా చీకటి క్రమక్రమంగా వ్యాపిస్తున్నది. మసక వెలుతురులో బూరు మిఠాయి చుట్టిన కర్రల్లా కనిపించసాగాయి చెట్లు.
‘ఇంక వెళ్దామా?’ అన్నాడు ఐదడుగుల పది అంగుళాల పొడవైన బలమైన శరీరమూ, రింగుల జుట్టూ సన్నటి మీసం, వెడల్పాటి నుదురు ఓనర్.
‘అప్పుడేనా?’ అన్నది అతని కంటే నాలుగు ఇంచీలు పొడవు తక్కువ సున్నితమైన బంగారు రంగు దేహమూ, సన్నటి ముక్కు, అక్వేరియంలో కదిలే చేపల్లాంటి కళ్లు ధనుస్సులా తీర్చి దిద్దినట్టున్న పెదాల స్వంతదారు.
పోలీసు వ్యాన్ సైరన్ శబ్దానికి పారిపోయిన దొంగల్లా మాయమై పోయేయి నక్షత్రాలు. ఉన్నట్టుండి ఆకాశంలోకి తొండాలు ఎత్తి పట్టుకున్న ఏనుగుల గుంపు ఒకటి వచ్చి చేరింది.
‘లే…. లే… పార్కు మొత్తం ఖాళీ అయింది మనమే ఉన్నట్టున్నాం’ అన్నాడతను తన చేయి ఆమెకు అందిస్తూ.
అతని చేయి అందుకుని పైకి లేచింది ఆమె. ఇద్దరూ పార్కు గేటు దాటారు. వీళ్ళు పార్కుకు రావడం మొదలు పెట్టి రెండేళ్ళాయింది అనుకుంది. గేటు పక్కన ఉన్నా బోగన్ విల్లా కాసిని ఎర్రపూలు ఆమె తలమీద రాలుస్తూ.
పార్క్ చేసిన బైక్ దగ్గరికి నడిచాడతను. ఆమె పరుగెత్తింది. ఇద్దరూ ఎక్కాక బైక్ చక్రాలు పరుగెత్తేయి.
* * *
గోడమీద గడియారంలో జంట ముళ్ళు తిరుగుతున్నాయి. దానికింద జంటగా ఓ టేబిలూ కుర్చీ ఉన్నాయి. కుర్చీలో ఎందరినో జంటలుగా కలిపిన సుదీర్ఘమైన అనుభవం వల్ల ఒక్క వెంట్రుకా మిగలక మైదానంగా మారిన బట్ట తల మోస్తున్న రిజిస్ట్రార్ ఉన్నాడు.
ఆయనకు ఎదురుగా కొత్త జంటలో ఒకడవ బోతున్న శంకర్ ఉన్నాడు. అతనికి ఎదురుగా పంచదార బొమ్మలాంటి రమ్య ఉంది. శంకర్ రమ్యల రిజిస్ట్రేషన్ పెళ్ళికి పదిమంది మిత్రులొచ్చారు. వాళ్ళల్లో ముగ్గురు అమ్మాయిలూ ఉన్నారు. జెయింట్ సైజు బౌండు రిజిష్టర్లో తెర్చుకున్న పేజీ వుంది. ఆ పేజీలో శంకర్ సంతకం చేశాడు. రమ్య సంతకం చేసింది. సాక్షులు సంతకం చేశారు. రెండు జతల సంతకాలతో ఒక జత జత అయింది. ఇద్దరూ మార్చుకున్న దండల్లో చిక్కుకున్న పూలు పరిమళాలు వెదజల్తాయి. స్నేహితులు అభినందించారు.
* * *
పార్కులో కల్సుకునే శంకర్ రమ్యలు అద్దె యింట్లో అడుగుపెట్టారు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అనే వారు లేకపోయేరు. రెండు కుడి కాళ్ళు ముందుపెట్టి ఇద్దరూ అద్దె స్వర్గసీమలో అడుగుపెట్టారు. హాల్లో వెలిగిన ట్యూబ్ లైట్ వాళ్ళకు స్వాగతం పలికింది. వాళ్లు కన్న కలల్ని నిజం చెయ్యడానికి జీరోబల్బు వెలిగింది.
* * *
ప్రభాకరరావు ఒక బిజినెస్ మాగ్నెట్. ఆస్తీ అంతస్తూ డబ్బూ అన్నీ ఎక్కువే కనుక ఆయనకు మమకారం కన్నా అహంకారం ఎక్కవ. ఈ అహానికి అతని గొప్ప కులం కూడా ఓ కారణమే. ప్రభాకరరావుకి ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు. కూతుర్లలో ఒకరి పేరు రమ్య.
రమ్య తక్కువ కులంవాడిని ఇష్టపడ్డం రహస్యంగా పెళ్ళాడ్డం తన దారి తను చూసుకోవడంతో ప్రభాకరరావు పరువు ప్రతిష్ట ప్రమాదంలో పడ్డవి. ఆస్తీ అంతస్తూ అడ్రసూ లేనివాడు అల్లుడవడం భరించలేకపోయేడు. చీలిన పాము నాలుకల్లా ఎగసి పడుతున్న ఆగ్రహజ్వాలలు తనని దహిస్తుంటే ప్రతీకారం కోసం నిరీక్షణలో ఉన్నాడు. ఇంట్లోనే పట్టు చీరల షోరూము, జూయల్రీ షాపు ఉన్న తల్లి తల ఎక్కడ పెట్టుకోవాలా, నలుగురికీ మేం సమాధానం చెప్పుకోవాలా అని నిత్యం విచారించసాగింది.
* * *
శంకర్ తప్ప తనకు లోకంలో ఇంకెవ్వరూ లేరు అనుకుంది రమ్య. మొట్టమొదటిసారి శంకర్ ను చూసినప్పుడు ఆమె గుండ యిదివరకటి లయను వదిలేసి కొత్త రిథమ్ ను అందుకుంది. అది శంకర్ నే కోరుకుంది. ఆమెకు అతని మాట తీరు నచ్చింది. అభిప్రాయాలూ ఆలోచన్లూ బాగున్నాయనుకుంది. అతని సెన్నాఫ్ హ్యూమర్ కు ఫిదా అయింది. అతనిలోని ప్రేమికుడు అయస్కాంతంలా ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. అప్పుడామెకు ఆస్తీ అంతస్తూ కులమూ ఏవీ గుర్తుకు రాలేదు. పరువు కోసమే బ్రతికే తండ్రి మాటే మర్చిపోయింది. తను తన ఇంట్లో అనుభవించిన సుఖాల్ని, రిచ్ లైఫ్ ని ఆమె ప్రేమ కోసం త్యాగం చెయ్యవచ్చు ననుకుంది.
ఇప్పుడు రమ్యకు జీవితం అంటే యిదే అనిపిస్తున్నది. ఒకటీ ఒకటీ కలిస్తే రెండు కాదు ఒకటే అనుకుంది. తన కాళ్ళకి బంగారు పట్టీల కంటే శంకర్ ఇష్టపడే గజ్జెల వెండి పట్టేలే విలువైన వనుకుంది. తన తండ్రి ఇంట్లో తోటలోని రకరకాల రంగురంగుల పూలకంటే కిటికీ అవతల పూలకుండీలోని పూలే అందంగా ఉన్నాయని ఫిక్సయిపోయింది.
శంకర్ రమ్యలు నెలల్ని రోజులుగా రోజుల్ని గంటలుగా గంటల్ని మధుర క్షణాలుగా ఒకరికి ఒకరుగా ఒకరి కళ్ళల్లో మరొకర్ని చూసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫులం అనుకుంటున్నారు.
కొడుకు తమకు చెప్పకపోతేనేం పట్నంలో ఉద్యోగం చేస్తూ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం శంకర్ తల్లీ దండ్రులకు సంతోషాన్నే కలిగించింది.
కొడుకు సంసారాన్ని చూడటానికి సిటీకి వచ్చారిద్దరూ. వాళ్లను చూశాక కానీ రమ్యకు శంకర్ కులం గుర్తుకు రాలేదు. అతని కుటుంబ స్థాయి అర్థం కాలేదు. వాళ్లు వచ్చిననాడు రాత్రి తండ్రి కోసం ‘మందు’ అందులోకి చికెనూ తీసుకువచ్చాడు శంకర్. అప్పుడు తెలిసి వచ్చింది రమ్యకు శంకర్ ‘నాన్ వెజ్జీ’ అని మందు రుచి తెల్సినవాడని ఇన్నాళ్ళూ తన కోసం అదేమిటో ఎరుగని వాడిలా ఉన్నాడని.
గదిలో శంకర్ తల్లీ తండ్రీతో ఉన్న సమయంలో రమ్య బయట హాల్లో నుదుటి మీద మొలుచుకు వస్తున్న మూడవ కంటితో అసహనంగా కూచుంది. ఈ అసహనం, కోపం రమ్యలో అత్తామామ ఉన్నంతకాలమూ పెరుగుతూ పోయి వాళ్ళు వెల్ళిపోయాక ‘కంటిన్యూ’ అయింది.
ఇదివరకు శంకర్లో కనిపించని చెడ్డ లక్షణాలన్నీ ఇప్పుడు రమ్యకు ఒక్కటొక్కటిగా కనిపించసాగాయి. అతను మాట్లాడే భాషలో, తిండి తినే పద్ధతిలో శుచీ శుభ్రత పాటించే తీరులో తేడాలు ఆమెకు తన కళ్ళకు బిగించుకున్న భూతద్దంలో చాలా పెద్ద సైజులో కనిపించసాగాయి.
ఇద్దరూ కల్సి బయటకు వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చు చేసేప్పుడు అతనిలో పిసినారి కనిపించాడు. తను ఔనన్నది కాదనడంలో అతనిలోని అజ్ఞాని దర్శనమిచ్చాడు. తక్కువ మార్కులతో డిగ్రీ పాసయినా అతనికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి రిజర్వేషన్ తప్ప మెరిట్ కారణం కాదని ఆమె అనుకోసాగింది.
కాలం గడుస్తున్న కొద్దీ ఆమెలో ప్రేమ గ్లోబల్ వార్మింగ్కి కరగి నీరైపోతున్న హిమాలయంగా మారింది. వెట్రోల్ కి మ్యాచ్ బాక్స్ మేచ్ అయినట్టు ఒకటి రెండు సార్లు శంకర్ ఫ్రెండ్స్ తో డ్రింక్ చేసి రావడంవల్ల జరిగిన వేడి వాదోపవాదాల కారణంగా ఆమెను తను శంకర్ ని చూడ్డానికి ముందు ఉన్న రమ్య క్రమక్రమంగా ఆక్రమించసాగింది.
* * *
ఒక సాయంత్రం శంకర్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చింది రమ్య. అమావాస్యనాడు పొరపాటున చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడే అనుకున్నాడు శంకర్. కాఫీ అందిస్తూ దేవతలకు అమృతం పంచిన మోహినిలా కనిపించింది.
ఇక నుండి తను జాగ్రత్తగా ఉండాలని రమ్యకు కోపం తెప్పించకూడదని అనుకున్నాడు శంకర్.
ఇద్దరూ భోజనం చేస్తున్నప్పుడు అంది రమ్య.
‘మా అక్కయ్య ఫోన్ చేసింది’ ఉలిక్కి పడ్డాడు శంకర్. ఉలిక్కి పడ్డ శంకర్ మాట్లాడకుండా రమ్యవైపు చూశాడు.
‘అమ్మ కూడా మాట్లాడింది’
అవునా అన్నట్టు చూశాడు కళ్ళు ఎత్తి మనసులో రకరకాల ఆలోచన్లు ముళ్ళల్లా గుచ్చుకుంటుటే.
‘తమ్ముడి పెళ్లి వారం రోజుల్లో మనిద్దర్నీ రమ్మన్నారు. వాళ్లకు మన మీద కోపం పోయినట్టుంది. డాడీ కూడా చెప్పమన్నారట. వెళ్దాం ప్లీజ్ అంది రమ్య చేతిలో ఉన్న అన్నం ముద్దని అలాగే పట్టుకుని తాము పార్కులో కలిసే రోజుల్లో అతనివైపు చూసిన చూపుల్ని రిపీట్ చేస్తూ అంత సడన్ గా ఆమె చెప్పింది వినడానికి అతను సిద్ధంగా లేడు. కానీ ఆమె అడిగింది కాదన లేడు. కాసేపు సీలింగ్ ఫ్యాన్ కేసి చూశాడు. అది తనలోపల జొరబడి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లకు వాళ్లు ఫోన్ చెయ్యడం ఏమిటో అర్థం కాలేదు. కులం కన్నా కూతురు ముఖ్యం అనుకున్నారేమో. ఆస్తికన్నా అమ్మాయి మీది ప్రేమ ఎక్కువనిపించిందేమో అనుకున్నాడు.
‘నీకు వెళ్లాలని ఉందా?’ అన్నాడు చివరికి కంచం అంచుమీద చేయి ఆనించి.
‘చెప్పాను కదా. వాళ్ళ కోపం పోయింది. మనల్ని తమ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకంటే కావల్సిందేముంది’ అందామె ఎడమచేతిని సుతారంగా అతని భుజం మీద వేస్తూ.
ఆ వేళ్ళ కొసలు భుజంలోకి ట్రాన్స్ ఫామ్ చేస్తున్న విద్యుత్ షాక్ ను తట్టుకుంటూ
సరే! నీ ఇష్టం వెళ్ళాలనుకుంటే నువ్వు రేపే వెళ్ళు. నన్ను రమ్మని ఫోర్స్ చెయ్యకు అన్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయం మీద సుహృద్భావ చర్చ జరిగింది. రమ్య తను వెళ్తానని ముందు ముందు అతనూ రావల్సి ఉంటుందని అన్నది.
* * *
తమ్ముడి పెళ్ళికి వారం రోజుల ముందే తను దాటిపోయిన గడపలోకి మళ్ళీ వచ్చింది రమ్య. అక్కడ ఎవ్వరిలోనూ ఏదో జరిగి పోయిందనే భావన కనిపించలేదు. ఎప్పటి లాగానే మాట్లాడారందరు. తండ్రి ఎదుట పడలేదు కానీ చిన్నాన్న మాటి మాటికీ ఎదుట పడసాగాడు. కొందరు యే విషయాన్నైనా సరదాగా ప్రస్తావిస్తారు. గుచ్చినట్టు తెలీకుండానే సూది గుచ్చేస్తారు. అలాంటి వాడే రమ్య చిన్నాన్న. రమ్యకు తెలీకుండానే ఆమె బ్రెయిన్ వాష్ చేసే పని మొదలు పెట్టాడు. అనుకోకుండా అన్నట్టుగా వివిధ కులాల మనుషుల మనస్తత్వం మ్యాపుగీశాడు. కులాంతర వివాహాల వల్ల వచ్చే కష్టనష్టాల్ని తూకం వేసి చెప్పాడు. ఒకసారి దేశంలో పెరుగుతున్న పరువు హత్యల గురించి, మరోసారి రాష్ట్రంలో జరుగుతున్న దుస్సంఘటనల గురించి వివరించాడు.
అసలు డబ్బు ఉన్న వాళ్లందరిదీ కులరహిత సమాజమని డబ్బు మాత్రమే కులాల ఎక్కువతక్కువల్ని బ్యాలెన్సు చేసే మహామంత్రమని సెలవిచ్చాడు. విన్నా వినకపోయినా చెబుతూనే వుంటాడని చిన్నాన్న మనస్తత్త్వం తెల్సిన రమ్య కొన్నిసార్లు విన్నది. కొన్నిమార్లు విన్నట్టు నటించింది. ఏది ఏమైనా చిన్నాన్న మాటల్లో కొన్ని రమ్య మెదడు అడుగు భాగం దాకా వెళ్లి పోయేయి.
పొగ త్రాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో పోలిక కూడా అంత హానికరమైనదే. అది రమ్య తన ఇంటికి వచ్చిన రెండవ నాటి నుంచే చాపకింద నీరులా మొదలైంది. గదిలో కప్ బోర్డులో తన దుస్తులు, బాక్స్ లో తండ్రి తన కోసం అపురూపంగా చేయించిన నగలు చూస్తున్నప్పుడు ఆమె మనోసముద్రంలో వాయుగుండం ఏర్పడింది. తమ్ముడి పెళ్లి సందర్భంగా జరుగుతున్న సెలిబ్రేషన్స్, విందు వినోదాల వల్ల, పడవ కారులో వెళ్లి తను చేస్తున్న షాపింగ్ల వల్ల అది మరింత బలపడింది. రమ్య తను శంకర్ తో గడుపుతున్న జీవితాన్ని ఇక్కడి జీవితాన్ని పోల్చి చూసుకోవడంతో తుపానుగా మారింది. ఎన్ని సంవత్సరాలయినా తాము ఇలాంటి జీవనం గడపలేము అని అనుకుంది. మొట్టమొదటిసారి తను లోతు తెలియని నీటిలో దిగేశానా అని ‘బ్లైండ్ ఎండ్’ ఉన్న రోడ్డులో నడిచానా అని అనుకుంది.
పెళ్లికి వచ్చిన చుట్టాల్లో మేనత్త కూతురు నళిని రమ్యకు పెళ్లి పట్ల ఉన్న నిబద్ధత వెన్ను విరిచేసింది. ప్రేమించిన వాడితో వెళ్లిపోయి ఈ మధ్యే ఇంటికి తిరిగి వచ్చి తమ స్టేటస్ కు తగినవాణ్ణి మళ్లీ పెళ్లి చేసుకున్న నళిని భర్తతో కలసి పెళ్ళికి వచ్చింది. తండ్రి తలుచుకుంటే షాపులో ఖరీదయిన బొమ్మని కొనిచ్చినట్టు తనకు ఓ కుర్రాణ్ణి కొనియివ్వగలడు అన్న వేరు పురుగు ఆమె ఒంట్లో ప్రవేశించింది.
* * *
పెళ్లి అయిన మర్నాడు రమ్యకు ఫోన్ చేశాడు శంకర్. ఇన్నాళ్ళూ ఆమె బిజీగా ఉంటుందని గొంతుక విన వస్తుందని అనుకున్నాడు, చెవులు రిక్కించాడు కాని ఆమె ఫోన్ ఎత్త లేదు. మరో గంట ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి కూడా అతని చెవి నిరాశ పడాల్సి వచ్చింది. రమ్య ఫోన్ స్పిచ్ ఆఫ్ అని తెల్సింది.
రెండు గంటల తర్వాత మరో నాలుగు సార్లు ఫోన్ చేసిన తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోవడంతో దిగులు పడ్డాడు. ఏం జరిగిందోనని భయపడ్డాడు.
పెళ్లి హడావిడి తగ్గాక రమ్య గదిలోకి వచ్చి తల్లీ దండ్రీ చాలాసేపు మాట్లాడారు. తండ్రి అంత ప్రేమగా మాటాడ్డం రమ్యకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది. వాళ్ళు గదిలోంచి వెళ్ళిపోయాక రమ్య సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డు కిటికీలోంచి బయటకు విసిరేయబడింది.
మళ్లీ మళ్లీ ఫోన్ చేశాడు శంకర్. ఈ నంబర్ తో యే ఫోనూ పనిచేయడం లేదు అని అనేకసార్లు విన్నాక ఒక నిశ్చయానికి వచ్చాడు శంకర్.
* * *
సెక్యూరిటీ వాళ్లు అరగంట గేటు దగ్గర ఆపి లోపలికి పంపించారు శంకర్ ని. ఇంటి ముందు లాన్ లో కూర్చోమన్నారెవరో.
ఏ వైపు నించైనా రమ్య కనిపిస్తుందేమో నన్న ఆశతో భవనం వైపు చూస్తూ కూచోవడం వల్ల తన ఎదురుగ్గా వచ్చి కూచున్న మనిషిని చూడలేదు శంకర్.
తను రమ్య చిన్నాన్నానని పరిచయం చేసుకున్నాడు ప్రకాశ్ రావు. రమ్య నాన్నగారు బిజీగా ఉండటంవల్ల తను రావాల్సి వచ్చింది అన్నాడు. ఆయనకు కాస్త దూరంలో నలుగురు బౌన్సర్లు నిలబడి ఉండటం గమనించాడు శంకర్.
శంకర్ ముఖం కొద్దిగా ఎర్రబడింది. ప్రకాశ్ రావు చిరునవ్వు విసిరాడు.
అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. కులం తక్కువవాడివైనా మా స్థాయికి యే మాత్రం సరిపోనివాడివైనా అన్నయ్య మంచివాడు కనక నిన్ను క్షమించాడు…. లేకపోతే… వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు ప్రకాశరావు.
శంకర్ కు కోపం లోపల్నించి తన్నుకు వస్తున్నది. రమ్య ఒక్కసారి బయటకు వస్తే బాగుండేది. ఏమైనా చేసి ఉండేవాడిని అనుకున్నాడు.
ఆ మాటే అన్నాడు.
‘ఒకసారి రమ్యను పిలుస్తారా మాట్లాడాలి’
రమ్య నీతో మాట్లాడదు. నువ్వు జరిగిందంతా మరచిపోవటం మంచిది.
‘మాకు ఇలాంటివి కొత్తేం కాదు. మా పరువునీ, ప్రతిష్టనీ ఎలా నిలబెట్టుకోవాలో మాకు తెలుసు’ అంటూ వెనక్కి తిరిగి ఇంటివైపు నడిచాడు ప్రకాశంరావు.
మొదలు నరికిన చెట్టులా కూలి పోయాడు శంకర్.
శంకర్ దీనస్థితిని చూడలేక ఆకాశంలో నక్షత్రాలు కనపడకుండా పోయాయి.
చిల్లు పడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులాంటి చీకటి శంకర్ ముఖాన్ని కప్పేసింది.
వానాకాలపు సాయంత్రం మలిసంజపొద్దు పడమట కొండల మాటున జారుకుంటుంది. మస్క మసకగా చీకటి ముసురుకుంటుంది. చెట్టు, పుట్ట, గట్టు, కొండలు గుట్టలు అనక ఊరు, వాడ నల్లని కాటుకమల్లే చీకటి దుప్పటి కప్పుకుంటున్నాయి అప్చిపటికే చినుకులు రాలి రోడ్డంతా తడిసిముద్పోదగయిపోయి చిత్తడి చిత్తడిగా మారింది. అటు పడమటి దాపున సరిహద్దుగా ఎత్తైన కొండల శిఖరాలుగా కాపురాలు గుట్ట అంచు వెంబడి దూరంగా విసిరేసినట్టున్న నల్లగొండలోని జీవివారిగూడెం రోడ్డు బాటంతా వచ్చిపోయేవారితో రద్దీగా ఉంది ఆ బస్టాపు మూలమలుపు తిరిగితే నల్లతాసులా పరుచుకునే వారిగూడానికి బాట చాపుతుంది
అసుంట ఆంజనేయస్వామి గుడి బాటకు ఇటు అటుగా ఇద్దరు ముగ్గురు లంబాడ లచ్చువమ్మలు బాటకు పక్కెంట కట్టెలు పొయ్యిలు రాజేసుకుంటు పొయ్యి ముందు సేదతీరిండ్రు పొయ్యిలో మంట రాజుకుంటుంది పొయ్యి మీద పెంక వేడెక్కుతుంది పొయ్యి చుట్టూత రక్షణ కవచంలా నాపరాళ్ళు మూడువైపులా అమర్చి ఉన్నాయి పొయ్యి ముందు ఆమెకు ఒకవైపు ఎండు కట్టెలు కొన్ని, చేతులో ఊదురుగొట్టంతో ఊపిరి బిగబట్టి ఊదుతూ నిప్పు రాజేస్తుంది ఇటుముందు తాంబాలంలా ( బేషన్ గిన్నే ) ఇంకో పక్క కాల్చిన రొట్టెలు వేడి చల్లారకుండా ఉండేందుకు హాట్ బాక్స్. బేషన్లో పిసికి ముద్ద చేసిన పిండి
పక్కెంట జగ్గులో నీళ్ళు , కలపని పొడిపిండి, పొడిపిండిని పీటపై చల్లుతూ పిసికిన పిండి ముద్ద తీసుకొని ఒకచేత పట్టి మరోచేత ఒత్తుతూ అద్దుతూ పీట నిండారగా చేతితో రొట్టెను సాగదీస్తూ నిండు సందమామలా రొట్టెకు రూపమిస్తుంది
యథాలాపంగా వేడివేడి రొట్టెలకోసంనేను ఆమె దగ్గరికి సమీపించాను ఆమె నా వైపు ఇంతలేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ” ఎన్ని రొట్టెలు కావాలి సారు” అని తిన్నగా అన్దినది. నేను ఆమె వైపు చూస్తూ ” రెండు జొన్న రొట్టెలు ఇవ్వమ్మా” అని అన్నాను. నేను అన్న మాటను అందుకుని పీటపై అప్పటికే పచ్చి రొట్టెగా చేసిన రొట్టెను చేత తీసుకొని పొయ్యి పై మంటకు వేడెక్కుతున్న పెంక పై వేసింది. కుడి చేతిని నీటిలో ముంచి పెంకపై కాలుతున్న రొట్టెను తడి చేస్తూ ఉంది , నాలాగే రొట్టెలకు వచ్చినవారు నాకు పక్కగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆమె దగ్వగరకు వచ్చిన గిరాకి మళ్ళి పోకుండా మంటని పెద్దది చేస్తూ త్వరగా రొట్టెను కాల్చేలా తిప్పి తిప్పి పెంకమీద వేస్తూ ఉంది , వేడికి రొట్టె అక్కడక్కడ ఉబ్బుతుంది అక్కడక్కడ కాలి నల్లగా మారిపోతూ ఉంది . ఆమె తిప్పి తిప్పి కాలుస్తూనే ఉంది. అటు ఇటు చూస్తే బజారు వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయి అక్కడక్కడ గతుకులు పడిన రోడ్డు కురిసిన వర్షానికి రంగు మారిన నీళ్ళు బురదరూపు సంతరించుకున్నాయి. పొయ్యి మంట బగబగమని మండుతూ ఉంటే ఆమె మొఖము ఆ వెలుగులో దగదగ మెరిసిపోతోంది . ఇంత పిండి ముద్ద మరొకటి తీసుకొని అప్పడంలా సాగదీస్తూ రొట్టెను చేస్తావుంది కానీ ఏదో పోగొట్టుకున్న దానిలా మొఖమంతా పాలిపోయి విచారంతో నిండిపోయింది ఆమె పక్కన ఆమెను చూస్తూ కూర్చున్న కూతురు ఆమె పనికి ఆటంకం కలిగిస్తూ ఉంది.
” ఏమే పిల్ల జరట్లుండు విసిగించకూ ” అని కసురుకుంటూ అన్నదామె
” నీయమ్మ నేన్జేస్తనే ” అని బిడ్డ విసిగిస్తూ అనసాగింది.
” జర్రాగే మమ్మగాని సతాయించకు” అని బతిమాలుతున్నట్టు అన్నది.
” నీయమ్మ నేన్జేస్తేందమ్మ నన్నొదంటవు నాకు చెయ్యరాదా ఎట్ల “
“జర్రాగు రొట్టె పిండి ముద్ద సరిగ చెయ్యరాదు నీకు పీటమీద కొడితే అప్పలాగ పల్సగ రావాలి ముందు చూడు తర్వాత చేద్దువు చిత్తడిల ఎందుకొచ్చినవే మళ్ళీ వానొస్తే నేన్తడుస్త నువ్ తడుస్తవ్ , వానకు తడిస్తే సర్ది అయితది రూమ్ దగ్గర ఉండి చదువుకోపో “
“ఊకే సదువు సదువు అంటవ్ నేన్ సదవన్ పో ఈయాల సెలవు సెలవు నాడు సదవాలా “
“ఒశే పిల్ల జోలి బాగుందిగా బలె గమ్మతి చేస్తుందేంరో మాకే సదువు లేక రోడ్ల మీద కుసోని రొట్టెలమ్ముకుంటున్నం నువ్వన్న గింత సద్వుకుంటవంటే” అని గుల్గ సాగింది.
మాటలవడి పెంకమీద రొట్టె నల్లగా మాడింది ” అయ్యో అయ్యో జర్రాగు సారు రొట్టే నల్లగ అయ్యింది ఇంకోటి చేస్తా “అని
లబోదిబోమంటు కూతురి వైపు గుడ్లురిమి చూసింది చూస్తూనే పీటపై తొందరతొందరగా రొట్టెను సాగదీయసాగింది సాగదీస్తుంటే రొట్టె పర్రెలు పర్రెలు గా ఇచ్చుకుంటుంది సరిచేస్తూ సాగదీస్తుంది
” ఏమ్మా నీ కూతురా” అని నేను అనగానే
” అవును సారు , చదువుతుంది సారు , నాకొడుకు వాటర్ ఫిల్టర్ మీద ఉండు వాడు సదువు సద్వురా అంటే… సదువుకు పంగనామాలు బెట్టిండు. ” అని అంటుండగా
” ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్” మంటూ ఆమె రొమ్ములో దాగివున్న సెల్ పోన్ మోగింది. గుండెల్లో పిడుగు పడ్డట్టు ఉలికిపడి తిన్నగా తడిచేత తీసుకుంది. ఒకవైపు అసహనంతో కూడిన ఆందోళన చెందుతూనే జీరబోయిన గొంతుకతో “అలో అలో” అంటూ తడబడుతూనే పలికింది. ఆమె మాటలో వనుకు స్పష్టంగా కనిపిస్తూవుంది. మొఖంపై చెమట కమ్మింది. తను మండుతున్న పొయ్యి ని తదేకంగా చూస్తానే పెంకపై జొన్నరొట్టె ను తిరిగేయబోయింది అంతలోనే చేయికి సురుక్కున వేడితగిలి అలాగే రొట్టెను విడిచింది రొట్టె పోయ్యిలో పడి బగబగ మండుతూ నల్లగా మాడింది “ అయ్యో వోరి దేవుడా … ఇయ్యాల లేసి ఎవరి మొఖం చూస్తినిరా శని చుట్టుకున్నట్టు వున్నది అని తనను తానే నిందించుకుంటూ జర్రాగు సారు ఇంకోటి చేసి ఇస్తాను అని ఒకచేత పిండి తీసుకొని పిసుకుతూనే మరోచేత “ అలో అలో ఎవరూ? “ అని అన్నది.
“ హలో నేను “ అంటూ అవతలి గొంతు పలికింది.
“ ఆ చెప్పుండ్రి “ అని బదులు పలికింది.
“ అదేనమ్మా నీ కూతురు గురించి నేను చెప్పిన విషయం గురించి ఏమి అనుకుంటున్నారు” అంటూ అతను సావదానంగా పలికిండు.
“ యాడియే …మీరే చెప్పుండ్రి . నేనా ఆడిమన్సిని నాకంటే మీకే బాగా తెలుసు , పిల్లల గురించి అంతా మీకు ఎర్కేనాయే మీరే ఏదో ఒకటి చెప్పుండ్రి ఏమి చేద్దామో?” అంటూ గబగబా పలికింది . పీటపై రొట్టె చేస్తూనే
“ అంతా నాకు తెలుసు అంటే ఎలాగమ్మా? మనం సావదానంగా ఒక నిర్ణయానికి వద్దాం ఏమంటవూ?” అని అతను అనగానే
“ అదేనయా నేనా ఆడపిల్ల తల్లిని. ఏదెర్కలేనిదాన్ని. నాకా సదువు గిదువు తెల్వని దాన్ని . జర్రంత మీరే నజర్ పెట్టి నా బిడ్డ బతుకు ఆగం గాకుండా సూడాలి జల్దిన లగ్గం జేస్తే సరి” అని కట్టెవిరిచినట్టు అన్నది.
“ అట్లా అంటే ఎట్లమ్మా? పెండ్లి పెండ్లి అని ఒకటే తొందర పెడుతున్నవ్. అట్లా గబగబ ఉర్కులాడితే ఎట్లా? ఉర్కి ఉర్కి పసుల కాస్తే కుదురుతుందా చెప్పు. ఇదిగో నేను ముందే చెప్పిన మా ఇంటికాడ పప్పన్నం తిందాం. మీ ఇంటికాడ ఎంగేజ్మెంట్
చేద్దాం. అలాగే మీ ఇంటి దగ్గరనే పిల్ల, పిలగానికి లగ్గం పెట్టుకొని లగ్నపత్రిక రాయిద్దాం . మన్చిరోజు చూసుకొని మీ ఇంటిదగ్గరనే పెండ్లి చేద్దాం సరేనా, లగ్గం మీ యింటి దగ్గర చేస్తే అది మీకే మంచిది” అంటూ నింపాదిగ పలికిండు అతను
“ సరే అట్లనే కానిద్దాం “ అని ఆమె అన్నది….
“ కానీ ఏందమ్మా, ఇంకా నేనే ఒకమెట్టు దిగివస్తే “ అంటూ కాస్తా కటువుగా పలికిండు అతడు.
“ అదికాదు బయ్యా.. పిల్లా, పిలగానికి పెండ్లి మీ యింటి దగ్గర జరుపుండ్రి. నేనా ఏదెర్కలేని ఆడిమన్సిని, అటసూత్తే పెండ్లి అన్ని ఇగురంగ చెయ్యగలనా? నాకేమన్న సదువా సాత్రమా, అసలే మగదిక్కు లేనిదాన్ని , నువు కూడ నన్నే చేసియమంటున్నవు. నీదేంబోయింది రేపు నలుగురు నన్నంటరు అడదాని పెత్తనం తమ్మల్ల దొరతనం అని వూకెనే అనలే , ఏది గింత సరిగ కుదురకున్నా వచ్చిన జనం నన్నాడిపోస్కుంటరు బయ్యా.. జర గది నువ్వే ముంగట నడ్సి పుణ్యం గట్టుకోండ్రి.” అని దీనంగా వేడుకుంటి. అయిన వుండి “ అలాగంటే ఏట్లనమ్మా , యిద్దరం కల్సి ఒకపని చేద్దాం . ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం , దసరా, దీపావళి లగ్గాలప్పుడన్న , కుదరకుంటే మళ్లి మాఘమాసం లగ్గాలప్పుడు పెండ్లికి వాయిదా వేద్దాం. అప్పుడు అందరం ప్రీగా వుంటాం కదా, ఇగపోతే నువు పిలగానికి ఇస్తానన్న కట్నం డబ్బులు యిప్పుడే ముందుగా యిస్తే అబ్బాయి ఏదేవొక యాపారం చేసుకుంటడు. వచ్చే ఎండాకాలం లగ్గాల నాటికి
“ ఆ.. ఏందమ్మా వినిపించనట్టు మాట్లాడుతవు. “ అని అతను అన్నడు
“ అట పతిదానికి తప్పులు తీస్తవేందయా యినవడ్డది కాని ముంగల ముంగల ఎట్ట ఇయ్యను పైసలతో పని” అని అన్ననోలేదో “ సూడమ్మా నువు ఇప్పుడు పైసలు ఇచ్చి సరేనంటే మనకు మంచిది. లేకుంటే పిలగాడు ఏదో ఒకటి చేసి కుదుర్కున్నంకనే పెండ్లి ఏమంటవు సరేనా? “ అని అనే.
“ ఆ… ఓరిదేవుడా ఎట్టా సచ్చేది గాళ్ళ మన్సుల మర్మం ఏందోగని అంతు చిక్కుతలేదు “ అని లోలోన గొనుగుతూ బాదతో కండ్లు పిండసాగింది. చేతులున్న పోను నేల జారింది. నేలచూపులు చూస్తూ నే కొంగు మొఖానికి పెట్టుకొని బోరుమంటూ ఏడుపందుకుంది. “ ఏమయిందమ్మా” అంటూ కూతురు కాసింత ఆందోళన చెందుతూ ఆత్రుతగా అడిగింది
….
” ఏందమ్మా ఏమైంది ఏడుస్తున్నవ్” అని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నేను అడిగిన.
ఇగో సారు నా పేరు తీత్రిబాయి
నాకు ఒక్కగానొక్క ఆడబిడ్డె , పేరు సామియా. మాది మీరంగాని తండా గా ముచ్చట ఇనుర్రి కొడుకును ఆపి పిల్లను డిగ్రీ దాక సదివిచ్చిన కాలేజు పోరల సోపతిల అది ఒక పిలగాన్ని ఇష్టపడింది మేము లంబాడ. గాళ్ళు సూదర్లట సరే పిల్ల మన్సు పడింది గదా గా ముచ్చట నా కండ్ల పడింది గాళ్ళను ఇడదీస్తందుకు నాకు మనసొప్పలే , గాళ్లను కలపాలని చూస్తున్న గా పిలగాన్ని అడిగితే ఇద్దరం ప్రేమించుకుంటున్నం పెళ్ళి చేస్కుంటం అని అన్నడు నా బిడ్డె కుద్దుగ అదే మాట పలికింది కని గా పిల్లగ్గాన్ని అయ్య గింత తేడు పెడుతుండు కిందికంటే మీదికేస్తడు మీదికంటే కిందికేస్తడు ఒక్కతీరు మనిషికాదు ఒకపాలి ఏమో “నాకు ఇష్టం లేదు గుడిల దండలు మార్చి చేపిచ్చుకో అంటడు. లేకుంటే రీస్టరు పెండ్లి చెపియ్యి అంటడు, ఇంకోపాలి పప్పన్నం తిందాము అంటడు సరే దారిలకు వచ్చిండని , పిల్లను గార్వంగ సాదుకుంటి ఉత్తగ ఎట్ల పట్టియ్యను దాన్ని ఎవరినో ఒకయ్యను జూసి పెండ్లిచేసి నాల్గిత్తులు నెత్తిన సల్లితే నా బర్వు దిగుద్ది అనుకుంటి గట్లనే మన్సుల అనుకుని పిల్లకు ఇంత ఒంటిమీదికి నల్లపూసలదంండను చేపిచ్చిన నా మెడల గుండ్లను సెడగొట్టి నా చెవుల గెంటీలు చెడగొట్టి పిల్లకు దిద్దులు బుట్టాలు చేపించిన రెక్కలు ముక్కలు చేసుకుని పైసపైస కూడబెట్టి సందేళ్ళ మాపు గీడ కూకొని జొన్న రొట్టెలు చేసి అమ్ముకుని పూట ఎల్లదీస్కుంట ఊస్నూరు పాస్నూరు చేసుకుని జర్రంత నలుగురిల నజరు గొడితట్టు తలెత్తి బతికేటట్టుగ ఉండాలని నేను చూస్తున్న , కాని నన్ను పగ్గుతూ ఇబ్బంది పెడుతుండ్రు గాళ్ళు పిల్ల ఒంటిమీదికి బంగారం పెడితే నీ పిల్లకు పెట్టుకుంటున్నవ్ అనే, సరే పిలగానికి లగ్గం కర్సులకు గిన్ని పైసలు జూస్త తియ్య అంటే నా పిలగానికి కట్నం ఇయ్యమనే, మళ్ళీ అయన ఆడిబిడ్డ కట్నం ఇయ్యమనే ఆ పిల్లగానికి ఏదో యాపారానికి నన్నే ఎగనూకమనే సరే అదులో బదులో చేసి దులుపుకుందాం అంటే ఆ ఇచ్చే డబ్బులు ముంగల ముంగల ఇయ్యమంటుండు లగ్గం తర్వాత అంటుండు. ఎట్టజెయ్య సారు …ఆయిన అత్తగారి సొమ్ము అయినట్టు ఇయ్యమంటే ఎట్లియ్యాలే సారు అదికూడ ముంగల ముంగలంటే లోకంల ఎవలన్న ఇస్తరా. నేనయుతే సూడలే సారు గిదేంపజ్జతి గతిలేని సంసారానికి గంజినీళ్ళే పాన్కం అని మేం బతుకుతుంటే ఆయిన సంపాయించి పెట్టిన ముల్లెలు వున్నట్టు ముంగల ముంగల ఇయ్యాలంట నాకు అరికాలిమంట నెత్తికెక్కింది వొచ్చిన కోపానికి కొర్కాసు వాత పెట్టాలన్నంత కోపం వుంది గని పిల్ల మొఖం సూడాల్సి వచ్చే. పిల్లను గార్వంగ సాదుకుంటి ఎట్ట జెయ్యాలే సారు… యిగ్గో
మొంచోడు మంచోడనుకుంటే మంచం కరాబు సేసిండట అట్టుంది గాయిన వాలకం , ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదంటరా . నమ్మితిరా సిద్దా అంటే ముంచితి బిడ్డా అన్నట్టుగుంది గాళ్ళ యిలవరస,
మిరాశి హక్కు వున్నట్లు పీస దీస్కుంట అడిగిండు
పిల్ల బతుకు ఆగం గావొద్దని సుట్టాల దాపుకు జేరుదామంటే
సెడి చెల్లెలు యింటికి అలిగి అత్తగారింటికి పోగుడదాయే ఎట్ట జెయను సారు
” అంటూ ఎగదన్నుకొచ్చే దుఃఖాన్ని పైటకొంగుతో తూడ్సుకోసాగింది.
“అమ్మా మరేం గాబరా పడకు నీ కూతురిపై నీకు మమకారం ఉంటది సహజం , విషయం సాగతీత మంచిది కాదు దీని పరిష్కారానికి వెంటనే వెళ్ళి పోలీసులను కలువు ” అని నేను అనగానే అలా అన్నానో లేదో సరసర అక్కడ పని పక్కన పెట్టి పిల్లను వెంటబెట్టుకొని ” దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించే దారి చూపు” అని ఆమె మతిలో ప్రార్ధించింది శుభ సూచకంగా దూరాన వున్న గుడి లో గంట మోగిన సప్పుడు వినిపించింది . ఆమె తన కూతురు ను తోడు గా వెంటబెట్టుకొని ముందుకు సాగిపోయింది తెగిన గాలి పటంలా…! దిక్క దాపు ఆసరా కోసం.నేను వారినే చూస్తూ కొయ్య బారిన వాడిలా నిశ్చేష్టుడయ్యాను. అలా క్షణకాలం రెప్ప వేయకుండా చూస్తోవుండిపోయా. కానున్నది కాకమానదు ఎమైనా కానియ్యి బంధం ముడి పడి వుంటుందా? తెగుతుందా, సమస్య జటిలమే కానీ బుర్ర లో అలోచనలు పరిపరి విధాలుగా గింగిరాలు కొడుతున్నాయి. అటుగా చిరుగాలి వీచింది, మనసు కాసింత తేలికగా అనిపించింది.గుండెలో బరువు తగ్గి చినుకుల చిరుజల్లు ఆశ మిణుగురు లా మినుకు మినుకు మంటూ చిరుదివ్వే వెలిగింది.
……..
భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతూ, ఎండలు చుర్రుమంటున్నాయి. ఎక్కండి! ఎక్కండి! ఎల్లిపోదాం అని కేకలేస్తూ ప్రయాణీకులను బస్సు లోపలికి కూరుతున్నాడు క్లీనర్ కన్నబాబు. ఈ మాటలు నువ్వు గంటసేపటి నుండీ చెపుతున్నావు తెలుసా! అసలు ఎక్కడికెళ్ళారయ్యా మీ డ్రైవరూ కండక్టరూ? అని తమ అసహనం ప్రదర్శించారు ప్రయాణీకులు.
బస్సుపైనా, లోపలా కూడా లగేజీతో నిండిపోయింది. వాటిల్లో మూటలు, కోళ్ళ గంపలున్నాయి. ఒక కుర్రాడైతే రెండు మేకల కాళ్ళకు బంధంవేసి, తాడును గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. బస్సులో సీట్ల కోసం ఆడంగుల తగాదా మొదలైయ్యింది. మగరాయుళ్ళు మటుకూ వేరుశనక్కాయలు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. తిన్న వేరుశెనగ తొక్కలను బస్సు లోపలే వేస్తున్నారు.
ఎవరయ్యా! దారికడ్డంగా ఇలా చేపల బుట్టలను బస్సులో ఏసింది? మరి మీరు మేకలను, కోళ్ళను ఎక్కించలేదా? బస్సు నీ ఒక్కడిదే కాదు బాబూ మరి మన అందరిదీ! అంటూ చమత్కరించాడు చేపల చిన్నయ్య.
మీ మేకలు చూడవయ్యా, ఒంటేలు, రెండు చేసి ఎలా పాడుచేశాయో అని ఒకడంటే, నీ చేపల బుట్టల్లోంచి నీచువాసన నీళ్ళు ఎలా కారతన్నాయో చూడు! అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా బస్సు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.
మొత్తానికి డ్రైవర్ వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ప్రయాణీకులందరీని ఒకసారి విమానం పైలట్లా చూసి, వెంటనే సిగరెట్ వెలిగించి, సినిమా పాటలు పెట్టాడు. ఇదుగో అందరూ టికెట్ సరిపడా డబ్బులు ఇచ్చి బేగా టికెట్ తీసుకోండి. టికెట్! టికెట్! అంటూ చిటికెలేస్తూ టికెట్లు కొడుతున్నాడు కండక్టర్.
ఇంతలో ఒక ప్యాసింజర్ బీడీ వెలిగించాడు. అసలే బస్సులో ఒకటే ఉక్కపోతగా ఉంది. దానికి తోడు ఈ సిగరెట్ల బీడీల పొగతోడైంద అని తిట్టేసరికి గబగబా మూడు దమ్ములులాగి బీడీని పడేశాడు అతను.
అప్పటికే కికిరిసిన బస్సులోకి స్కూలు పిల్లలూ, కూరగాయలవాళ్లు, చిన్నా చితకా వ్యాపారులు ఇంకా ఎక్కుతున్నారు.
అందుకే సత్తిరాజు ముందుగానే బస్సెక్కి హాయిగా పేపర్ చదువుకుంటున్నాడు. సత్తిరాజు ఆ చుట్టుప్రక్కల నాలుగు గ్రామాలకి ఒకే ఒక మెడికల్ స్పెషలిస్ట్, అదే ఆర్.యం.పి. డాక్టర్, వారాని ఒకసారి టౌనుకెళ్ళి ఒక సినిమా చూసి, పేషంట్లకి ఇవ్వవలసిన మందులు, ఇంజక్షన్లు కొని తెచ్చుకుంటాడు.
ఇదుగో డబ్బులు తీసుకో! టౌనుకి ఆరు టిక్కెట్లు ఇవ్వమన్నాడు ఓ ప్యాసింజర్. మరి ఆరుగురినీ చూపించమన్నాడు కండక్టర్. మేము ముగ్గురం మగ మనసులం. ఇంకా ముగ్గురు ఆడ టికెట్లు.ఇప్పుడే బాత్రూమ్కెళ్ళారని చెపుతుండగానే వాళ్ళు ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కేశారు.
ఈ గందరగోళంలో, డాక్టర్గారూ ఒకసారి పేపరు ఇస్తారా! అని డాక్టర్ సత్తిరాజు చేతుల్లో నుండీ విసురుగా దినపత్రికను లాగేసుకున్నాడు వెనకసీటు స్కూలు మాస్టారు.
కండక్టర్ రైట్! రైట్! అని చెప్పటంతో బస్సుస్టార్ట్ అయ్యింది. బస్సు కదిలిందిగా! ఇక ఉక్కపోత ఉండదు, హాయిగా గాలేస్తోంది లే! అంటున్నారు ప్రయాణికులు. బస్సు ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేలోపే బస్సులోకి నల్లని దట్టమైన పొగ కమ్ము కొచ్చింది. పొగతోపాటు కిరసనాయిల్ వాసనతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంజన్ని రైజ్ చేశాడు డ్రైవర్. అంతే! బస్సు ఆగిపోయింది.
తుమ్ముతున్నవాళ్ళు కొందరైతే, మరికొందరు వాంతులు కూడా బస్సులోనే చేసుకున్నారు. ఇదేం బస్సురా నాయనా! టాపునిండా చిల్లులే! ఇక కింద నుండి రోడ్డు కన్పిస్తోంది. ఇంజను సౌండూలో ఒకరి మాటలు ఇంకొకరికి వినిపించటంలేదు. కళ్లు మండటంతో ప్రయాణీకులు బస్సు దిగిపోతున్నారు.
డ్రైవరూ, క్లీనరూ కలసి ఏదో రిపేరింగు చేస్తున్నారు. స్టార్ట్ అవుతోంది, మళ్ళీ ఆగిపోతోంది. కానీ డాక్టర్ సత్తిరాజు, స్కూలు మాష్టర్ మటుకూ బస్సులోనే కూర్చుండిపోయారు. ఒకవేళ తాము కిందకు దిగితే మళ్ళీ సీటు దొరకదేమోనని.
డాక్టర్గారూ! ఈ పేపర్లో రాసిన దినఫలాలు నిజంగా జరుగుతాయంటారా? అని అదోలా అడిగాడు స్కూలు మాష్టారు. చూడండి మాష్టారు అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దినఫలంలో మీకు ఏం రాసుందేమిటి? అని ఉత్కంఠగా అడిగాడు డాక్టర్ సత్తిరాజు. మీరు వస్తువులు కోల్పోతారు జాగ్రత్త! ప్రయాణాలలో అటంకాలు ఎదురౌతాయి అని రాసుంది. అయినా నా దగ్గరేముండిపోవటానికి? ఈ బ్యాగు ఒక్కటేగా? ఇది నా చేతిలోనే ఉంటుందిగా! అని చెప్పి కిందకి దిగాడు. కళ్లు మండటంతో సత్తిరాజు కూడా బస్సుదిగక తప్పలేదు.
దాదాపు రెండు గంటలు రిపేరింగు చేసినా బస్సు స్టార్ట్ అవలేదు. ప్రయాణీకులు కాస్తా, ఆందోళనకారులుగా మారిపోయారు. అసలు ఇలాంటి డొక్కు ప్రయివేటు బస్సుకి లైసెన్సు ఇచ్చిందెవరు? దీన్ని కాల్చిపారేయాలి అని రెచ్చిపోతున్నారు. దాన్ని మనం కాల్చక్కర్లేదు నాయనా! అదిగో పొగ ఇంకా ఎక్కువగా వస్తోందిగా! అదే కాలిపోతుందిలే! అని అంటూ డాక్టర్ సత్తిరాజు ఇంటికి తిరుగు ముఖం పెట్టాడు. అలాగే తిట్టుకుంటూ కండక్టర్ దగ్గర టికెట్ డబ్బులు తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్యాసింజర్లు.
స్కూలు పిల్లలకి మాత్రం బస్సు ఇలా పాడైపోవటం ఆనందంగానే ఉంది. ఆడుతూ పాడుతూ ఇంటికెళ్ళిపోయారు. మాష్టారు స్కూలుకు ఆలస్యంగా చేరుకున్నాడు. మొఖానికి పట్టిన చెమట తుడుచుకుందామని తన చిన్న టర్కీటవల్ని బ్యాగ్లోంచి తీయబోయాడు. ‘‘అరే! ఆ టవల్ను బస్సీటుమీద వేసుకొని కూర్చున్నాను.’’ అది కాస్తా బస్సులోనే మర్చిపోయాను. అయితే పేపర్లో రాసిన దినఫలం రైట్! రైట్ అనుకున్నాడు.
‘‘కండక్టర్ రైట్! రైట్! అన్నా బస్సు మాత్రం అక్కడే ఉంది.’’
అదేంటీ పోలీసు కస్టడీలో వినాయకుడా………??? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఇది కలా నిజమా లేక నేనేమైనా జోకు జోకాననుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే! ఇదస్సలు జోకు కాదు, వైష్ణవ మాయా కాదు.ఇది అక్షరాలా నూటికి నూరుపాళ్ళు నిజం. నమ్మలేరా…..?
అయితే మనస్సు ఉగ్గపట్టుకుని , నిర్భయంగా ముందుకు సాగి పొండి. చదవండి చివరిదాక!!!
అసలయినా ప్రపంచమంతా ఈ మాయదారి కరోనా…చాపక్రింద నీరులా ప్రాకి , యావత్ ప్రపంచాన్నీ ఓ కుదుపు కుదిపేస్తుంటే, కాలచక్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఫలితంగా రావలసిన పండగలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. మనం అనుకుంటున్నట్లుగానే ఈ సారి వినాయక చవితి కూడ వచ్చేసింది.
ఇక చూసుకోండి నా సామిరంగా, దేశంలో అందరిలోనూ ఒకటే కలకలం……ఈ సందర్భంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేసేసి , పెద్ద ఎత్తున ఆర్భాటంగా పండగ చేసుకోవాలా వద్దా అన్న మీమాంస అందరిలోనూ తలెత్తింది.
ప్రభుత్వాలు మాత్రం, ఈ కరోనా కారణంగా , మునుపటిలాగా పండుగ ఉత్సవాలుగా చేయవద్దనీ, ఎక్కడైనా సరే జనం గుంపులు గుంపులుగా పోగయే వ్యవహారాలేవీ పెట్టుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. అందరూ పూజలు ఇంటివరకే పరిమితం చేయాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
కానీ మన ఈ పామర జనం ఊరుకుంటారా? అసలు ఎవరి మాటైనా వినే అలవాటు మన ప్రజలకు ఉంటే , మన దేశం ఇలా ఎందుకుంటుంది? ఎప్పుడో బాగు పడి ఉండేది కదా!!!
అది సరే ముందు విషయం చెప్పండి……ఉపోద్ఘాతాలు వద్దు అంటారా…..? అదే అక్కడికే వస్తున్నా…….కాస్త ఓపిక పట్టండి మరి….!
అనగనగా ఒక మహానగరంలోని ఒకానొక గేటెడ్ కమ్యూనిటీ అయిన సొసైటీ. అందులో యదార్థంగా జరిగిన కథ ఇది. ఇంకా ఈ జాగేలనో అని మీలో మీరు హమ్ చేస్తున్నారా? ఇదిగో చెప్తున్నా…..చెప్పేస్తున్నా……కాచుకోండి! ఆ సొసైటీలో రీసెంట్గా మ్యానేజింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయండీ!
అందులో గెలిచిన వాళ్ళకు , ఉన్నమాట చెప్పొద్దూ…..ఈ సొసైటీని పరిపాలించడంలో అస్సలు అనుభవం లేదంటే నమ్మండీ! ఆ గెలుపుకూడ చాలా కుట్రలు పన్ని సంపాదించిందే కానీ, న్యాయబద్ధమైన గెలుపు కాదు.
విపక్షాలను దెబ్బకొట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న దురుద్దేశంతో చేసిందే కానీ మరోటి కాదు. ఆ సంగతి అలా ప్రక్కన పెట్టి మనం అసలు కథకి వద్దాము.
ఈ గెలిచిన కమిటీ అధికారంలోకి వచ్చి రెండు నెలలుకూడకాలేదు వినాయక చవితి రానే వచ్చింది. ఇక చూసుకోండీ వీళ్ళ ఉత్సాహానికి అంతులేదు. ఓ ప్రక్క పూర్వంలానే వినాయకుడ్ని ప్రతిష్ఠించాలి….అంటూ ఈ పాత మేనేజ్మెంట్ పుణ్యమా అని రెండేళ్ళనుంచీ ఒక పండగాలేదు….పబ్బమూ లేదు….ఎందుకని అడిగితే ఈ కరోనా ఉన్నంతవరకూ, ఈ పండుగలూ, గిండుగలూ జాన్తా నై అని చెప్తారా…..ఇప్పుడు చూడండి మా తఢాకా …….అని కొత్త కమిటీ వాళ్ళందరూ ఒకటై సొసైటీలో ఉన్న రెసిడెంట్స్ ఎవరినీ సంప్రదించకుండానే వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసేసుకుని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయసాగారు.
ఇదంతా గమనిస్తున్న ఫ్లాట్ ఓనర్స్ మండిపడి ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ అని కమిటీ వాళ్ళని నిలదీసారు! అసలే కరోనా భయంతో ఓప్రక్క వణికి చస్తుంటే మళ్ళీ ఇదో ఆపద తెచ్చి పెట్టారేంటని ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. కానీ మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లు , వీళ్ళు ఇలా గర్జిస్తునే ఉన్నారు…..కమిటీ మాత్రం మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం, కంగారు పడకండి అంటూ, గణేసుని కూడ తెచ్చి ప్రతిష్ఠించేసారు. ఇదంతా గమనిస్తున్న ప్రతి పక్షాలు గట్టిగా హెచ్చరించాయి. ఏమైనా జరగకూడనిది జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అల్టిమేటమ్ ఇచ్చారు.
దాంతో భయపడ్డ ఈ కొత్త కమిటీ వాళ్ళు వినాయకుడి దగ్గరకు ఎవరూ వెళ్ళకుండా బ్యారికేడ్స్ కట్టేసి, పిల్లలెవరూకూడ దగ్గరకు వెళ్ళకుండా ఇద్దరు సిక్యూరిటీ వాళ్ళని కాపలా ఉంచి, ఎవరూ అక్కడ గుమి గూడకుండా చూస్తూ ఉండమని ఆదేశాలు జారీ చేసారు. అది కాక ఉదయం సాయంత్రం యధావిధిగా పూజ కావించి , పూజారి వెళ్ళి పోవడానికి కుదుర్చుకున్నారు. అంతే కాదు పోలీస్ పెట్రోలింగ్ కూడ అరేంజ్ చేసారు.
ఇంతకీ మన గణనాధుడు మాత్రం, భక్తులులేక గిజ గిజలాడుతున్నట్లుగా అనిపించింది.భక్తులతో కళకళలాడే మంటపాలలో ప్రతిష్ఠించబడి , రోజూ నైవేద్యాలూ ప్రసాదాలతో , మరెన్నో సాంస్కృతిక కార్యకలాపాలతో అందరినీ అలరించాల్సిన గణపతి బిక్కు బిక్కుమంటూ గడపసాగాడు పోలీసు కస్టడీలో…….! అది చూసిన ఫ్లాట్స్లో నివసించే జనాలకు చాలా బాధ, జాలీ రెండు కలిగాయి.ఇక ఆ వినాయకుడ్ని దేవుడే కాపాడుగాక అనుకుని చేసేదేమీలేక పాపం గణేశుడు అని మనస్సులో అనుకుంటూ మౌనంగా ఉండి పోయారు.అయినా దేవతలకే తప్పటంలేదు కష్టాలు మరి మానవమాత్రులమైన మనమెంత అని అనిపించడం లేదూ ఈ కథ చదివాక!!!
అంకితం
————-
అన్ని విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి ఈ చిట్టి కథ అంకితం.
మాధవ పెద్ది ఉష
ఈ రోజు నేను ఆవకాయ గురించి వ్రాయబోతున్నాను. ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారు ఉంటారా అసలు? ఆ మిథునం సినిమా పాట ఎంతో సమయోచితంగాను, తెలుగువారికి ఓ కితాబు ఇచ్చినట్లే ఉంటుంది. ఆ పాట విన్నప్పట్నుంచి మనందరికీ ఆవకాయమీద ప్రేమాభిమానాలు పొంగి పొర్లాయంటే ఒప్పుకుంటారా? అసలైనా తినబోతూ రుచిలెందుకు లెండి! నేను ఇప్పుడు రాయబోయే మా ఇంట్లో ప్రతి ఏడాది జరిగే ఆవకాయ ప్రహసనం చదివారంటే, మన భానుమతి అత్తగారి కథలు బలాదూర్ అనుకొని నాకు కూడా ఒక స్పెషల్ బిరుదు ఇచ్చేస్తారు తెలుసా!
సరే, అసలు విషయానికి వద్దాం. పోయిన సమ్మర్ లో మాకూ కరోనా రావడంవల్ల నేను ఊరగాయలు ఓ మాదిరిగ పెట్టాను. ఇంతకీ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేటంటే మాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒకళ్ళు U.S అయితే ఇంకొకరు ఎవరూ అంతగా పట్టించుకోని కానీ world అంతా మెచ్చుకొనే బుల్లి దేశం ఉందే…. అదే న్యూజిలాండ్ అండీ…. పోయి పోయి అక్కడ సెటిలైంది. పైగా అక్కడ వాతావరణం సీనిక్ బ్యూటి అంతా నాకు నచ్చాయి పో. (అంటే మా అల్లుడుగారికి కూడా లెండి) అని ఒక్క అక్షరంలో తేల్చిపారేసింది. ఇంకా ముఖ్యమైన కారణం అక్కడ ఇండియాలో లాగా దోమలుండవట (మా అమ్మాయికి దోమల ఎలర్జీ ఉంది లెండి). అందుకని అక్కడకి వెళ్ళాక అది సుఖసంతోషాలతో వర్థిల్లుతోంది. మనకి, అంటే తల్లిదండ్రులకి కూడా కావల్సిందదేగదండి!
ఇకపోతే అప్పట్నుంచి నేను ప్రతి ఏడాది కిలోలకి కిలోలు ఊరగాయలు ఇటు అటు ఎడాపెడా పెట్టేసి, వాళ్ళకి కొరియర్లో పంపించటం అలవాటైపోయింది. (మా వాళ్ళకి, అల్లుళ్లకీ, మనవళ్లకి ఆవకాయన్నా, దానితోపాటొచ్చే రకరకాల పచ్చళ్ళన్నీ కూడా చాలా ఇష్టమండీ). పంపించాక వాళ్లకి అందడం పెద్ద process అన్నమాట.
కానీ U.S.వాళ్లు ఏవన్నా అనండి, చాలా మంచివాళ్ళు కరెక్టుగా మూడు, నాల్గు రోజులలో చేరిపోతాయి. కానీ ఈ న్యూజిలాండ్ కస్టమ్స్ వాళ్ళేమో పరమ దుర్మార్గులండీ! మన పికిల్స్ చేరడం చేరతాయి. కాని వాళ్ళ చేతుల్లో పడ్డాయంటే చాలు. ఇక మనం రామనామ జపం చేయాల్సిందే లేక ఆ క్షణ క్షణంలో సినిమాలో లాగా ‘దేవుడా! దేవుడా!’ అంటూ కూర్చోవాల్సిందే. మొన్నైతే మేము న్యూజిలాండ్ కు పికిల్స్ పంపినపుడు ఓ వారం రోజుల ఎదురు చూపుల అనంతరం మా అమ్మాయి దగ్గరనుండి ఒక ఫన్నీ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ‘అభిమన్యు హాజ్ రీచ్ డ్ కురుక్షేత్ర బాటిల్ ఫీల్డ్” అని వచ్చింది. మేము ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది. కష్టమ్ వాళ్ళమో కురుక్షేత్ర్ యుద్ధభూమి, పద్మవ్యూహంలో చేరిన అభిమన్యుడేమో ఆవకాయ. ఇక వాటిని పరిక్షించేందుకు కస్టమ్స్ అధికారులు మొదలుపెడతారని దాని సారాంశం. అది విని మాకు నవ్వాగలేదు. అసలు మహాభారతంలో, అభిమన్యుడు చనిపోతాడు కదూ. కానీ మా చిన్నమ్మాయి భారతంలో మాత్రం చావడు. ఏదో కొన్ని రోజులు హోరా హోరీ కష్టమ్స్ ఆఫీసర్సతో యుద్ధం చేశాక విజయుడై ఇంటికి చేరతాడన్నమాట.
ఇక ఊరగాయల పార్సెల్ దగ్గర్నుంచి ఊరగాయలన్నీ బయటికి తీసాక వాటిని బాటిల్స్లో పెట్టాక వాటిని కూడా ఫోటో తీసి మాకు వాట్సప్ లో పెట్తారన్నమాట. అవి చూసుకని మేము ఆనందంతో తబ్బిబ్బై ఇక డాన్స్ చేయడమే తరువాయి.
మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈసారి నన్ను అందరూ బెల్లం ఆవకాయ గూర్చి అడగడం, దాని రెసిపీ చెప్పడంతో నేను కూడా బెల్లం ఆవకాయ పెడదామని ఉబలాటపడ్డాను. ఒకరైతే బెల్లం పాకం పట్టాలి వగైరా – వగైరా అని చెప్పారు. ఆ సింగినాదం – జీలక్రర అదేం అక్కర్లేదండీ, మన రెగ్యులర్ ఆవకాయలోనే బెల్లం కలపండి, అదే బెల్లం ఆవకాయ అంటే అంతే ఇంకేం లేదు మరొకరూ చెప్పారు. ఇంకేం, అంతే కదా వెరీసింపుల్ అనుకుంటూ కొంచెం ఆవకాయ జాడిలోంచి విడిగా తీసి అందులో తగినంత మోతాదులో బెల్లం కలిపేసి, బెల్లం ఆవకాయ జిందాబాద్ అనుకుని నన్ను నేనే అభినందించుకున్నాను. తీరా పిల్లలకి పంపేందుకు వాళ్లనడిగితే ‘వామ్మో అదేంటి ఎప్పుడూ వినలేదే. బెల్లం మాగాయ విన్నాంగాని బెల్లం ఆవకాయ గురించి వినలేదు. తినలేదు. అయినా మేము రిస్క్ తీసుకోదల్చుకోలేదు. మా కొద్దంటే మాకొద్దని ఇద్దరూ ముక్తకంఠతో సెలవిచ్చారు. దాంతో నా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయడం అంత ఆవకాయలో బెల్లం కలిపానే అదంతా ఎవరు తింటారు? ఇంతలో నాకొక బ్రిలియంట్ ఐడియా తట్టింది. అది వినే ముందు తెనాలి రామకృష్ణులవారి కథ తెలుసుండాలి.
ఒకసారి రాయలవారు వారి తల్లిగారి ఆబ్దికమప్పుడు భోక్తలకు ఒక బంగారు మామిడిపండు తలా ఒకటి చొప్పున ఇద్దామనుకున్నారు. కారణం వారి తల్లిగారు చనిపోతూ మామిడిపండు తినాలన్న తన కోరికను వెలిబుచ్చారట. కాని ఆ కోరిక తీరకుండానే కాలం చేశారు. రాయలవారందుకు చాలా వ్యథ చెంది ఆబ్ధికం రోజున తల్లిగారి ఆత్మశాంతి కోసము అందరికీ బంగారు మామిడి పండ్లు దానమిస్తున్నారు. కాని అక్కడ కొంత మోసము జరగనారంభించింది. భోక్తలందరూ పేరాశతో రెండోసారి కూడా తీసుకొనడం మొదలుపెట్టారు. అది గమనించి రామకృష్ణులవారు ఇలాగైతే ఖజానా ఖాళీ అవుతుందని భయపడి వీరికి గుణపాఠం చెప్పాలని ఒక ట్రిక్ చేస్తారు. వెంటనే ఏమని ఎనౌన్స్ చేశారంటే, రామక్రిష్ణులవారి తల్లిగారు చనిపోయే ముందు తనకు వాతలు పెట్టమని కోరుకున్నారట. (బహుశా ఆ రోజుల్లో అదో రకం వైద్యం అయి ఉండవచ్చు). కానీ చూస్తూ చూస్తూ తల్లికి వాతలు పెట్టే బాధాకరమైన పని చేయనంటే చేయనని భీష్మించుకు కూర్చున్నారట. దాంతో ఆవిడ కోరిక తీరకనే పరమపదించారట. కానీ ఎవరూ వాతలు పెట్టించుకోవడానికి ఒప్పుకోరు కనక తన తల్లి కోరిక తీర్చుటకిదే తగిన సందర్బం అని తలచి ఒక బంగారు మామిడి పండుకి ఒక వాత తీసుకోవాల్సిందిగా ఒక నిబంధన పెట్టారు. దాంతో కొంతమంది పెట్టించుకున్నారు. కానీ అందరూ సాహసించలేకపోయారు. దాంతో ఖజానా ఖాళీ అయిపోతుందన్న రామకృష్ణులవారి భయానికి చెక్ పడింది.
సో, ఆ కథ లాగ నేను కూడా మా పిల్లలకి నేను పెట్టిన పికిల్స్ కావాలంటే బెల్లం ఆవకాయ కూడా ఒక్కో కిలో చప్పున తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టాను. దాంతో పిల్లలు తప్పనిసరి ఒప్పుకోవల్సి వచ్చంది.
తరువాత ఆ రుచిలేని బెల్లం ఆవకాయ తీసుకున్నారేగాని దాన్నలాగే ఉంచి మిగతావి లాగించడం మొదలెట్టారు. కానీ నేను ఊరుకోక రోజూ బెల్లం ఆవకాయ తిన్నారా? లేదా? అని ఫోన్ లో సతాయించే దాన్ని – అది భరించలేక వారం వారం గెష్ట్లలని భోజనానికి పిల్చి ఆ బెల్లం ఆవకాయ వాళ్లకి వేసి ఖర్చు చేశారు. అప్పట్నుండి ఆ బెల్లం ఆవకాయ బాధితులెవరూ వారింటిపై కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేదు. నేను కూడా బెల్లం ఆవకాయ మాట కలలో కూడా తలచడం మానేసాను.
ఇంతకీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు నాకు ఏం బిరుదునిస్తున్నారు? చెప్పరూ।।
అన్నపూర్ణ హోటల్ యజమాని విజయభాస్కర్కు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి సృజన్ డిగ్రీ చదువుతూ కూడా తండ్రికి చేదోడువాదోడుగా హోటల్ పనులు చేస్తున్నాడు. కానీ చిన్నబ్బాయి సుధీర్ మాత్రం అలా కాదు. తన స్వంత హోటల్లో పనిచేయటానికి కూడా నామోషీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు చూచినా టిప్టాప్గా టక్ చేసుకొని, టై కట్టుకొని మరీ స్నేహితులతో అల్లరిచిల్లరగా తిరగటమే అతని పని.
ఒకప్పుడు చిన్న షెడ్డులో ప్రారంభమైన కాఫీ హోటల్, అంచలంచలుగా వృద్ధి చెందుతూ ఇప్పుడూ పెద్ద హోటలై పోయింది. ఒరేయ్ సుధీర్ మన స్వంత పనులు చేసుకోవటానికి సిగ్గు పడకూడదురా! వీలు కుదిరినపుడు నువ్వు కూడా అన్నయ్యలాగా ఏదో ఒక పనిచేయరా! ఎందుకంటే మన జీవనాధారం ఈ హోటలే కాబట్టి. దీనివల్లే కదా మీరిద్దరూ డిగ్రీలవరకూ చదువుతూ వచ్చారు అని అమ్మ అన్నపూర్ణ అంటుంటే, వద్దమ్మా! ‘‘తమ్ముడికి పనిచెప్పకండి, వాడిని బాగా చదువుకోనివ్వండి’’ అంటూ సృజన్ తమ్ముణ్ణి పెద్దరికంగా సమర్థించాడు.
దాంతో సుధీర్ ఆగడాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఒకవేళ ఎప్పుడైనా క్యాష్కౌంటర్లో కూర్చుంటే, కొంత డబ్బు కొట్టేసేవాడు. అలాగే స్నేహితులందరికీ టిఫిన్లు, కాఫీలు ఫ్రీగా ఇచ్చి, ఏదో పెద్ద ఘనకార్యం చేసిన వాడిలా కాలర్ ఎగరేసి మరీ ఫోజులు కొట్టేవాడు.
అన్నపూర్ణ హోటల్ రుచికరమైన టిఫిన్లకూ, అభిరుచిగల భోజూజనానికి మారుపేరుగా మారింది. అందుకే హోటల్ నిరంతరం జనంతో కిటకిటలాడుతోంది. హోటల్ నిర్వాహణలో భార్య అన్నపూర్ణ పాత్ర, నిరంతర శ్రమ ఎంతో ఉంది. అదంతా తన శ్రీమతి సమర్థవంతమైన ప్లానింగ్ మహిమేనని విజయభాస్కర్ విజయగర్వంగా అందరికీ చెపూతు ఉంటాడు.
కొడుకులిద్దరికీ ఘనంగా వివాహాలు జరిగాయి. ఇద్దరు కోడళ్ళు నలుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడిరది. తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు కాలగమనంలో కలసిపోయారు. నాన్న చెప్పిన అనుభవసారాన్ని నెమరువేసుకుంటూ క్రమశిక్షణతో హోటల్ను నడుపుతున్నాడు సృజన్. కానీ తల్లిదండ్రుల కోసం గుండెనిండా బెంగ పెట్టుకున్నాడు.
ఇప్పుడు తమ్ముడి పరిస్థితి అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే రౌడీలా తయారయ్యాడు. సృజన్ చెమటోడ్చి సంపాదించిన డబ్బును దుబారాగా ఖర్చు చేస్తున్నాడు. ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదని, ఒకటికి రెండుసార్లు సున్నితంగానే తమ్ముణ్ణి మందలించాడు. దాంతో ఇంకా రెచ్చిపోయి, అన్నయ్యను దుర్భాషలాడాడు.
సరిjైున సమయం దొరికింది కదా అని ఒక కొత్త పన్నాగాన్ని ప్రయోగించాడు సుధీర్. అయినా నాపై నీ పెత్తనం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నన్ను కమాండ్ చేయాలని చూడకు. ‘‘నువ్వు పెద్దవాడివే అవ్వచ్చు, కానీ నీ హద్దుల్లో నువ్వుండు’’ అని ఆవేశంగా తిట్టేసరికి సృజన్కి కోపం తారాస్థాయికి చేరింది. అదీ కాస్తా కొట్లాటకు దారితీసింది.
అంటే ఏమంటావ్? అని సృజన్ తమ్ముణ్ణి నిలదీశాడు. నీకు దమ్ముంటే ఆస్తిలో నీ వాటాను నాకు పంచేయ్! అని అన్నయ్యను రెచ్చగొట్టాడు సుధీర్. ఇది చాలదు అన్నట్లు తోడికోడళ్ళు ఇద్దరూ రంగంలోకి దిగి, అక్కడ భయంకరమైన దృశ్యాన్ని సృష్టించారు. ఆ సమయంలో నాన్న చెప్పిన అమృతవాక్కులను గుర్తు చేసుకున్నాడు సృజన్. నీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు ఎదురైనా సహనాన్ని పాటించు. అప్పుడు నీ యొక్క సహనమే నీ సమస్యలకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది ` నాన్న.
నీవు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో గొడవ జరిగిన వారం తరువాత సామరస్య వాతావరణం నెలకొంది. అనేక గందరగోళ ఆలోచనలతో సృజన్కు నిద్రలేకుండా పోయింది. ఇప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటంలేదు. ఇక చేసేది లేక ఆస్థిని రెండు భాగాలుగా పంచుకున్నారు అన్నదమ్ములు.
ఎవరికివారు సపరేటుగా హోటళ్లు పెట్టుకున్నారు. అమ్మ నాన్నకు సహకరించినట్లే, సహధర్మచారిణి హిమజ కూడా సృజన్తో కలసి అన్ని పనులూ ఓపికగా చేస్తోంది.
కానీ సుధీర్కు భార్య సునంద సహకారం అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అతి తెలివితేటలు ఎక్కువ. ఆచరణ తక్కువ. చేస్తున్న వంటల్లో శుచి, శుభ్రత పాటించేవాళ్ళు కాదు. దీనివల్ల చేసిన వంటకాలు తొందరగా పాడైపోయేవి. దానికి తోడు కష్టమర్లు ఎక్కువగా తినకుండా ఉండటానికి అన్నంలో సున్నం కలిపేవాళ్ళు. పైకి ఘుమఘుమల వాసనలు బాగా వచ్చేవి. తీరా తిందామనుకునేవారు తినలేకపోయేవారు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా దాహం తీర్చుకోలేని పరిస్థితిలా ఉండేది వారి దుస్థితి.
కూరలు, సాంబారుల్లో గూబగుయ్యిమనిపించే కారం వేసి, పట్టపగలే నక్షత్రాలు కన్పించే బిల్లు చేతికిచ్చేవారు. పాపం గొడ్డుకారం తట్టుకోలేక కష్టమర్లు బెంబేలెత్తి పారిపోయేవారు.
ఇదేంటండీ? మీరు గొడ్డుకారం వంటకాలు వడ్డిస్తే మేము మాత్రం ఎలా తింటామనుకుంటున్నారు? అని జనం నీలదీసి అడిగేసరికి ‘‘మీరు తింటే తినండి లేకపోతే బయటకుపొండి’’ అంటూ సునంద తిట్ల దండకం మొదలుపెట్టింది.
చూడండి! అక్కడ మీ అన్నయ్యగారి హోటల్లో టిఫిన్లతోపాటు భోజనాలు కూడా ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. అక్కడ భోజనంలోకి అరటిపండో, మామిడిపండో వడ్డిస్తున్నారు. అవి లేకుంటే ఏదైనా స్వీటుని స్పెషల్గా ఇస్తున్నారు. అంతేకాదండీ! ఆ హోటల్లో భోజనంచేసిన తరువాత వక్కపొడి, సోంపు, పాన్లు కూడా ఇస్తున్నారు అని ఒక వ్యక్తి ధైర్యంగా సుధీర్ని క్లాస్ తీసుకున్నాడు.
అప్పుడు మళ్ళీ సునంద కళ్ళెర్రజేసి, అతని మీదకు విరుచుకుపడిరది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ‘‘మా హోటల్లో నచ్చితే తినండి, లేకపోతే బయటకుపొండి’’, మా హోటల్లో తిన్నవారికి పట్టు చీరలివ్వటం, పేరంటటాలు చేయటం, తాంబూలాలివ్వటం లాంటి చెత్త మర్యాదలు చెయ్యటం మావల్ల కాదు. వంటల్లో కల్తీ వంటనూనెలు వాడటం, నిల్వ ఉంచిన కూరలు, సాంబర్లు వడ్డీంచడం, ఎక్కువగా జరగడంతో జనం ప్రభుత్వానికి కంప్లయింట్ ఇచ్చారు. దాంతో ఫుడ్ఇనస్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసి కేసు బుక్ చేశాడు. అలాగే 5వేల రూపాయలు జరిమానా విధించారు. ఇది మొదటిసారి కాబట్టి కేవలం వార్నింగ్ ఇచ్చామని, లేకుంటే జైలుశిక్ష కూడా విధించే అవకాశముందని కోర్టులో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
ఇంత జరిగినా తమ తప్పులను వీరిద్దరు సరిదిద్దుకోలేకపోయారు.
రోజు రోజజుకీ ఆమె కొట్లాటలు మితిమీరిపోయాయి. హోటల్ దివాలా స్థాయికి చేరుకొంది. ఆ కారణంగానే సుధీర్కి సహనం, అశాంతి బాగా పెరిగిపోయాయి. అవి తట్టుకోలేకే చిటికీమాటికీ సునందను తిట్టటం, మొదలుపెట్టాడు. ఒకరోజు ఉక్రోషంతో ఆమెను చావబాదాడు.
సునంద అహం దెబ్బతిన్నది. అసలు మీకు బిజినెస్ చేయటం చేతకాక నన్ను కొట్టటం ఏమిటి? అని భర్త సుధీర్ని ఆవేశంతో చెంపదెబ్బకొట్టింది. ఇంట్లో జరిగిన ఈ గొడవతో పిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంట్లో అందరూ కలసి భోజనం చేసి ఎన్నో రోజులైయ్యింది. పాపం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు.
సుధీర్ ఇద్దరమ్మాయిలూ బిక్క ముఖంతో పెదనాన్నింటికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ చెప్పిన విషయాలు విని పెద్దమ్మ, పెదనాన్న ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ తరువాత కొంత సమయానికి తేరుకొని పిల్లలతో కలసి భోంచేశారు.
పెదనాన్న మీరే ఎలాగైనా మా అమ్మకు, నాన్నకు సహాయం చేయాలి. ప్రస్తుతానికి అమ్మా నాన్నల దగ్గర డబ్బులు అసలే లేనే లేవు అని చెపుతూ బోరున ఏడ్చేశారు ఇద్దరమ్మాయిలూ.
సృజన్ పేరుకు తగ్గట్టు చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి. తను చెబితే తమ్ముడూ, మరదలూ వినకపోవచ్చని భార్య హిమజను సుధీర్ ఇంటికి పంపించాడు. మళ్లీ అందరూ కలిసుండటానికి సుధీర్, సునంద ససేమీరా ఒప్పుకోలేదు. అప్పుడు సృజన్ రంగంలోకి దిగి హోటల్ బిజినెస్ నష్టాల్లో మునిగిపోయిన తమ్ముణ్ణి ఓదార్చాడు.
మొత్తానికి అన్నయ్య, వదినల ప్రేమా ఆప్యాయతలకి సుధీర్, సునందలు కరిగిపోయారు. నన్ను క్షమించు అన్నయ్య అని అంటూ, ఇంతకీ నీ హోటల్ బిజినెస్కి ఎక్కువగా లాభాలు రావటానికి గల రహస్యాలేమిటి? అని వినయంగా అడిగాడు.
తమ్ముడి పశ్చాత్తాపంతో అడిగిన మాటలకు సృజన్ కళ్ళు చమర్చాయి. ఆ రోజుల్లో నాన్న చెప్పిన మాటలు సృజన్ గుర్తుచేసుకొని చెపుతున్నాడు.
ప్రతీ వ్యాపారంలో లాభనష్టాలు చాలా సహజమైనవి. ప్రతి బిజినెస్లోనూ కష్టమర్లు ఉంటారు. కానీ మన హోటల్ కూడా ఒక బిజినెస్సే అని అందరూ అనుకుంటారు. ఈ హోటల్ వ్యవస్థలో వ్యాపారం కన్నా సేవాభావం చాలా ముఖ్యమైనది.
హోటల్ కొచ్చేవారంతా అన్నార్థులే. అందుకనే మనకు లాభం రాకపోయినా, రుచికరమైన, నాణ్యమైన ఫలహారాలను, భోజనాన్ని అతిథులకు వడ్డించాలి. మనంగానీ మంచి రుచికరమైన వంటకాలు వండి వడ్డిస్తే హోటల్ బిజినెస్లో నష్టం రానే రాదు. ఒకవేళ అధిక లాభాలు రాకపోయినా, నష్టాలు మాత్రం రానే రావు.
అందుకనే హోటల్కి వచ్చే వాళ్ళందరూ అతిథి దేవుళ్ళే, కష్టమర్లు కానేకాదు అని నాన్నగారు ఆనాడు చెప్పిన మాటలను సృజన్ చెపుతూ ఉంటే అందరూ శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత అందరూ కలసి విందు భోజనం చేశారు.
మళ్లీ అన్నపూర్ణ హోటల్ అతిథిదేవుళ్ళతో కళకళలాడుతోంది.
అతిథి దేవోభవ
అప్పు అనే పదం వింటేనే చిరాకు పడే చిన్నారావు కి అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది .
అదీ అర్జెంట్ గా చేయవలసిన సందర్భం ఎదురయింది.
చేసేదేమీ లేక తన బాస్ పరాంకుశం గారి దగ్గరికి వెళ్ళాడు !
“రావోయ్ చిన్నారావు ! ఏంటి విషయం? అలా దిగాలుగా వున్నావేం”ఆప్యాయంగా అడిగాడు.
“సార్ అదీ..అదీ..” అంటున్నాడే కాని విషయం చెప్పలేక తల వాల్చేశాడు.
“సిగ్గు పడ్డది చాల్లే సంగతేంటో చెప్పు ” అన్నాడు చనువుగా.
పెళ్ళై రెండు నెలలే అవడంతో కుర్రాడికి సెలవేమైనా కావాలేమో ఇచ్చేద్దాం అనుకున్నాడు పరాంకుశం..అలియాస్ జి.ఎం అంకుశం !
అసలైతే ఆయన దగ్గర నిలబడాలంటే కాళ్ళు వణికి పోతాయి ..
చిన్నారావు కే కాదు మిగిలిన స్టాఫ్ అందరికీ !
అలాంటిది ..ఆయన ప్రమోషన్ వచ్చిన ఊపులో ఉత్సాహంగా ఉండడం తో ..
ధైర్యంగా ఆయన వద్దకు వెళ్ళాడు చిన్నారావు పనెలాగైనా అవుతుందనే నమ్మకం తో !
“సార్ అది..అదీ..”
“ఏంటది..”
“…”
“ఏంటోయ్..ఆది?”
“సార్ నాకో లక్ష అప్పు కావాలి?” గబుక్కున అడిగాడు.
“ఏంటి?లక్ష..నేను ఇటీవలే ఇల్లుకట్టాకదా? నా దగ్గర డబ్బుల్లేవు..పైగా నేనే అప్పుల్లో ఉన్నాను ” నిర్మొహమాటంగా చెప్పాడు ఆయన.
దిగాలుగా బయటకు వచ్చిన చిన్నారావు వైపు అందరూ జాలిగా చూస్తున్నారు.
బాస్ సంగతి తెలిసి చివాట్లేమైనా పెట్టాడేమో ..
తమకెందుకు వచ్చిన చిక్కులే అనుకుంటూ అందరూ మౌనంగా ఉన్నారు .
“రేయ్! రామ్మోహన్ నువ్వే నన్ను ఈ సమస్య నుండి గట్టెక్కించాలి రా ..”
అంటూ స్నేహితుడి చేతులు పట్టుకున్నాడు అవే కాళ్ళనుకోమంటూ ..
“రేయ్ ! ఊరుకోరా..కాళ్ళని పట్టుకుని చేతులంటున్నావు..నీకు మతి గాని పోయిందా?” అంటూ పైకి లేపాడు రామ్మోహన్.
“అర్రే..సారీరా” అంటూ గబుక్కున లేచి .. చేతులని పట్టుకున్నాడు ప్రాధేయ పూర్వకంగా బ్రతిమిలాడు తూ !
“ఇంతకీ నీకు కావలసిన సహాయం ఏంటో చెప్పరా ముందు” అడిగాడతను ఆందోళనగా .
ఆలస్యం చేయకుండా వెంటనే అడిగాడు..
“నాకో లక్ష అప్పు గా కావాలి రా?”అన్నాడు చిన్నారావు.
“ముందు చేతులు వదలరా?”
“ఆహా వదలను ..”
“వదులుతావా లేదా?”
“వదిలితే నువ్వు తప్పించుకుంటావు”
“వదలకపోయినా తప్పించుకుంటాను ” చేతులు విడిపించుకుని పారిపోయాడు రామ్మోహన్ .
‘అయినా ..తాను ఎప్పుడూ ఎవరికీ అప్పు ఇవ్వలేదు .
ఎవరి దగ్గర తీసుకోలేదు .అందుకే అప్పు అడిగే పద్దతేంటో తెలియడం లేదు ‘ అనుకున్నాడు .
ఆరోజు తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు.
పనవ్వలేదు.
వచ్చే జీతం ఇరవై వేలు ..డిగ్రీ చదివాడు చిన్నారావు !
ఓ చిన్న ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు !
తనకి ఇద్దరు చెల్లెళ్లు !
ఒకరికి పెళ్ళయి రెండేళ్ళవుతుంది.
మరో చెల్లికి ఇటీవలే సంబంధం కుదిరింది .
పెళ్ళివాళ్ళు కట్నం భారీగా అడగకపోయినా పెళ్లి మాత్రం ఘనంగా చేయాలని షరతు పెట్టారు ..
తన వద్ద వున్న డబ్బులకి తోడుగా కనీసం ఒక లక్ష అయినా కావాలి ..
అలాగైతేనే చెల్లి పెళ్లి అవుతుంది .
ఆలోచిస్తుంటే మనసంతా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి !
రాత్రి పడుకోబోయే ముందు ..అన్యమనస్కంగా ఉన్న భర్తతో ..
“ఏంటండి అలా వున్నారు !?” అడిగింది జానకి .
నిరాశగా నవ్వి ఊరుకున్నాడు సమాధానం చెప్పలేదు .
భర్త అలా మౌనంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు జానకి కి !
అతడే చెబుతాడు లే అనుకుని ఊరుకుండిపోయింది.
* * *
రెండు రోజులు గడిచాయి .
“నేను ఊరు వెళ్ళి రెండు రోజుల్లో వస్తాను ” అన్నాడు భార్య తో ..
“సరే” అంది భర్త మాటలు విని .
సూరయ్య మామయ్య ఏమైనా డబ్బులు సర్దుతాడేమోనని సంబరంగా ఊరు వెళ్ళాడు చిన్నారావు.
అతడి చిన్నతనంలోనే తండ్రి దూరం కాగా తల్లి చేసిన కష్టం..తన చిన్ని సంపాదనతో ఇంతకాలం అప్పు చేయకుండా ఇల్లు ఎలాగోలా నెట్టుకొచ్చాడు !
ఇప్పుడు మాత్రం ఇక అప్పు చేయకుండా పెళ్లి అసాధ్యం ..నిర్ణయానికి వచ్చాడు !
సూరయ్య మామయ్య హ్యాండ్ ఇవ్వడంతో ..నిరాశగా వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు.
భార్య ఎంత అడుగుతున్నా తన సమస్య మాత్రం చెప్పలేదు.
“ఏంటండి!? వారం రోజులుగా అదోలా వున్నారు ?నాకు కూడా చెప్పలేనంత సీకేట్ సమస్యా ?” అడిగింది జానకి అనునయంగా .
జరిగిందంతా సింపుల్ గా వివరించాడు.
“ఓ నాకు అర్థమయింది మీ సమస్య .మీకు ఒక లక్ష రూపాయలు కావాలి .అది అర్జెంటుగా !
మరి నాకు ఈ సమస్య ముందుగా చెప్పినట్లయితే నేనే పరిష్కరించే దాన్ని కదా?”
“ఏంటి నువ్వంటుంది?”
“మీరు వింటున్నది నిజమే !”
భార్య వైపు చూశాడు విస్మయంగా .
“నేను మీకు ఇదివరకే చెప్పాను కదా .పెళ్ళికి ముందు నేను ఉద్యోగం చేశానని .
అప్పట్లో నేను సంపాదించిన డబ్బులు మా నాన్న వాళ్ళు నా దగ్గర నుండి తీసుకోకుండా పెళ్లి చేశారు.
ఆ డబ్బులు నా దగ్గర అలాగే వున్నాయి. అవి తీసుకుని ముందు అవసరం గడవనీయండి.
తరువాత మనం ఎలాగూ డబ్బులు సంపాదించుకోవచ్చు .
అడపడుచు ఆనందంగా ఉంటే మనకు అంతా మంచే జరుగుతుందని నా నమ్మకం “
అంది భర్తతో.
జానకి మాటలు వింటుంటే అతడి మది సంబరం తో నిండిపోయింది.
“శ్రీవారు ! నేను చెబుతున్న ఈ మాటలు గుర్తుపెట్టుకోండి.అవసరానికి డబ్బులు అప్పు చేయవచ్చు.
అదేం తప్పు కాదు .నేరం అంతకంటే కాదు.కానీ మనం కూడా ఎవరైనా అవసరం అని అడిగితే ఇవ్వాలి ..తీసుకుంటుండాలి !
ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తత ఎంత అవసరమో ఇలాంటి సంఘటనలే నిదర్శనాలు ..
డిగ్రీ చదువు కున్నాను కదా.. ఖాళీగా ఇంటి దగ్గర ఏం కూర్చుంటాను !?
దగ్గరలో ఉన్న స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవుతాను .
ఏదో వేడి నీళ్లకు చన్నీళ్లు గా నా సంపాదన కూడా కలిసి వస్తుంది కదా!?”
అడుగుతున్న శ్రీమతి వైపు సంతోషంగా చూశాడు !
చిరునవ్వు నవ్వింది జానకి.
తెలివైన భార్య తోడుగా వున్న తన జీవితం పూలబాట కాబోతుందన్న నమ్మకం తో ..
హాయిగా నవ్వుతూ “అలాగే ” అన్నాడు చిన్నారావు !
ల్యాండ్ లైన్ ఫోను రిసీవర్ అప్పటికి పావుగంట నుంచీ రాజేశ్వరి చెవిని అంటిపెట్టుకునే ఉంది. ఈ మధ్య ఈ ఫోనుని వాడడం బాగా తగ్గిపోయింది. ఎప్పుడో తప్ప కాల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే హిమబిందు కి ఆశ్చర్యంగా ఉంది.
తల్లి వంకే చూస్తోంది. ఆవిడ ముఖంలో మారే రంగులు, భావాలు అర్థం కాక, సైగలతో అడిగింది బిందు, ‘ఎవరు అవతలి వైపు?’ అని.
కానీ, ఏకపక్షంగా సాగుతున్న ఆ సంభాషణలో, రాజేశ్వరి వినటంలోనే నిమగ్నమయి పోయి ఉంది. ‘ అయ్యో ‘, ‘ అవునా ‘ ,’ నిజమా ‘లాంటి ఆశ్చర్యార్థకాలు తప్ప మరో మాట లేదు రాజేశ్వరి వైపు నుంచీ.
ఎట్టకేలకు ఫోను పెట్టేసింది రాజేశ్వరి. నీరసంగా వచ్చి సోఫాలో కూలబడింది.
“ ఎవరమ్మా? బాగా వాయించేశారుగా!”
“ఏదో లే! రాంగ్ నంబరు”
“రాంగ్ నంబరుతో అరగంట మాట్లాడావా? చెప్పమ్మా ఎవరూ?”
” ఏం లేదన్నాగా!” కూతురి వంక చూడకుండా, లేచి వంట గది లోకి వెళ్లి పోయింది రాజేశ్వరి.
సాయంత్రం అయిదున్నర అవుతుండగా చక్కగా తయారయ్యి బయల్దేరింది హిమబిందు.
“ఎక్కడికీ?”
“మర్చిపోయావా అమ్మా…? కేదార్, నీ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడుగా…! ఇద్దరం అలా షికారు వెళ్ళొస్తామమ్మా…!”
“వద్దొద్దు….!”
అర్థం కాలేదు బిందు కి. కాబోయే భర్త తో కాస్త మాట్లాడు కోవడానికి ప్రైవసీ కావాలని తెలియనంత అమాయకురాలు, చాదస్తురాలు కాదే అమ్మ! సరిగ్గా వారం క్రితమే నిశ్చితార్థం అయింది. వచ్చే నెలలోనే పెళ్ళి. నిన్న సరే అని ఇప్పుడొద్దంటుందేంటి?
“అదేంటమ్మా…నిన్న వస్తానని చెప్పి, ఇవాళ ‘ రాను ‘ అంటే, అతనేమనుకుంటాడు? ఏమయ్యిందమ్మా?”
“ ఒద్దన్నాను. ఒద్దంతే! రావట్లేదు అని చెప్పేయి. నాతో వాదించకు.”
“ అది కాదమ్మా….ప్లీజ్…అతను నా కోసం ఎదురు…..”
“నువ్వు చెప్తావా…నన్ను చెప్పమంటావా….!” కోపంగా అంది రాజేశ్వరి.
కళ్ళల్లో నీరు గిర్రున తిరిగాయి బిందూకి. లోపలికెళ్లిపోయింది.
***
“ఏవండీ…. ఇవాళ మధాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటినుండి నా మనసు మనసులో లేదు.” మధ్యాహ్నం నుండీ కొంగున కట్టుకున్న నిప్పు కణిక ను విప్పింది రాజేశ్వరి.
చంద్రమౌళి కి కూడా అనుమానంగానే అనిపించింది ఇంట్లో ఉన్న అసహజ వాతావరణం. ఎప్పటిలాగా, బిందు నవ్వుతూ ఎదురు రాలేదు. తన గదిలోనే ఉండి పోయింది.
“ ఎక్కడి నుంచీ…?”
“చెప్తాను! బిందు పడుకుందో లేదో చూసొస్తానుండండి.”
“అక్కర్లేదులే….! చూసే వచ్చాను. నిద్ర పోతూంటే నేనే దుప్పటి కప్పి వచ్చాను. “
“ ఎవరోనండీ…సుందరిట! అరగంట పాటు చెప్తూనే ఉంది. చాలా చెప్పింది. మన బిందుకి కాబోయే భర్త కేదార్ గురించి చెప్పింది.” కంగారు ఆమె గొంతులో.
“ అంటే, బాడ్ క్యారెక్టర్ అనా?”
“దాదాపు అంతే! వాళ్ళ అమ్మాయితో ఎనిమిది నెలల క్రితం ఈ కేదార్ నాథ్ తో నిశ్చితార్థం జరిగిందట. ఈవిడ వద్దన్నా వినకుండా అతను ఆ పిల్లని షికార్లకీ సినిమాలకీ తీసుకెళ్ళాడట ముందుగానే రెండు లక్షలు కట్నం కూడా తీసుకున్నారట. సరిగ్గా వారం రోజుల్లో పెళ్ళి అనగా ‘మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది, మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నారట కేదార్ తల్లి, తండ్రి.’ ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదట. పాపం చాలా రోజులు పట్టిందట వీళ్ళకి ఆ బాధ నుంచీ బయట పడడానికి.”
షాక్ తిన్నాడు చంద్రమౌళి.
సాధారణ మధ్య తరగతి కుటుంబీకుడికి ఇది పెద్ద కష్టమే! రెండేళ్ల క్రితం పెద్దమ్మాయికి పెళ్ళి చేసి అమెరికా పంపాడు. రెండో అమ్మాయిని కూడా ఓ ఇంటిదాన్ని చేస్తే, తన బాధ్యత అయిపోతుందని అనుకుంటే ఈ వార్తతో ఆయన గుండె గుభేలుమంది. ప్రెస్ నుంచీ శుభలేఖలు కూడా వచ్చాయి . పెళ్ళి హాలు, వంట వాళ్ళూ, అన్నీ బుక్ చేయడం ఐపోయింది. పిలుపులే మిగిలాయి.
“ కానీ రాజీ…ఆవిడకి మన ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? బిందూకి అతనితో కుదిరిందని ఎవరు చెప్పి ఉంటారు? అసలు ఆవిడకేం సంబంధం మనతో? మన మంచి కోరడానికి ఆవిడకి మన గురించి ఎలా తెలుసని అడగాల్సింది “
“అడిగానండీ! తోటి ఆడపిల్ల తల్లిని కనుక మన మంచి కోసం తెలుసుకుని చెప్తున్నాను అంది. వాళ్ళ అమ్మాయిని వద్దన్నాక వీళ్ళు ఎంక్వయిరీ చేస్తే తెలిసిందట, అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయిట. ఆ ఫ్యామిలీనే అలాంటిదట. ‘మీ శ్రేయోభిలాషి గా చెప్తున్నాను. మరో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అని, చాలా కష్టపడి మీ నెంబర్ కనుక్కున్నాను అని’ ఏమేమో చెప్పిందండీ. అప్పటినుండీ నాకు మనసు మనసు లో లేదు.”
భర్త చెవిన వేశాక, రాజేశ్వరి గుండె బరువు కొంత తగ్గింది. చంద్రమౌళి కాసేపు ఏమీ మాట్లాడలేదు.
“కానీయ్! ఈ విషయాలేవీ బిందూ కి తెలియనీయద్దు. చిన్నపిల్ల. బాధపడుతుంది. ఇందులో నిజమెంతో నేను కూడా ఎంక్వయిరీ చేస్తాను. నువ్వు తొందర పడకు!” భార్యతో చెప్పి, భోజనం పూర్తి కాకుండానే లేచాడు చంద్రమౌళి.
తన గది గుమ్మం దగ్గరే కర్టెన్ వెనుక నిల్చుని అన్నీ విన్నది హిమబిందు.
“నాన్నా…! అమ్మ ఎందుకింత డల్ గా ఉందో నాకిప్పుడర్థమైంది. నేనేం చిన్నపిల్లను కాదు. చూస్తూ, చూస్తూ ఒక వంచకుడితో జీవితాన్ని పంచుకుంటానా? కేదార్తో నేనే ముఖాముఖీ మాట్లాడుతాను. ఏది ఏమైనా నేనేం భయపడి, బెంబెలుపడను. మీరు మనసు పాడు చేసుకోవద్దు. అమ్మా! నాకు నువ్వు ఏదీ దాచకుండా విన్నది విన్నట్లు చెప్పాలి. భోజనం చేసి రా!” గబగబ అని గిరుక్కున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది.
భార్యాభర్తలిద్దరూ అవాక్కయ్యారు.
**
నేషనల్ హై వే మీద మెత్తగా దూసుకు పోతోంది ఇన్నోవా కారు.
“నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమే! ప్లాన్ చేసిన నిన్నటి ప్రోగ్రాం కాన్సిల్ చేశావు. ఈ రోజు నీ అంతట నువ్వే కాల్ చేసి లీవ్ పెట్టి మరీ రమ్మన్నావు. ‘ క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్….’ ” నవ్వుతూ అన్నాడు కేదార్.
నవ్వలేదు బిందు.
“ఏమిటీ మూగనోము? మేడమ్ గారికి అలకా?”
“కారాపండి. ఎక్కడయినా కూర్చుని మాట్లాడుకుందాం.” ముక్తసరిగా అన్న బిందు మాటలకి కాస్త ఖంగు తిన్నాడు కేదార్.
భుజం మీద చెయ్యి వేసి, “ఎనీ థింగ్ సీరియస్?”
“ఎస్” చెయ్యి తీసి దూరం జరిగింది బిందు.
కొద్ది దూరంలో హై వే ప్రక్కగా ఉన్న వేప చెట్టు దగ్గరగా కారాపాడు కేదార్. ఇద్దరూ అక్కడే ఉన్న సిమెంటు చప్టా మీద కూర్చొన్నారు.
“రేఖ ఎవరు?” ఏ ఉపోద్ఘాతము లేకుండా అడిగింది బిందు.
“ఏ రేఖ?”
“ఎందరు రేఖలు తెలుసేం? ప్రస్తుతానికి ఒక్క రేఖ చాలు. చెప్పండి. మీ పూర్వ ఫియాన్సీ . ఎంగేజ్మెంట్ అయ్యాక, మీరు వదులుకున్న శశిరేఖ .”
“నీకు…తన గురించి ఎలా తెలుసు?” ఆశ్చర్య పోయాడు కేదార్. నిజానికి బిందు అతను తత్తరపడి అవాక్కవుతాడనుకుంది.
“ ఆ విషయం తర్వాత. ముందిది చెప్పండి. ఆ అమ్మాయిని కాదన్నదెందుకు? నన్ను కావాలనుకున్నదెందుకు? మాకు ఈ విషయం తెలియకుండా దాచారెందుకు? ఎవరిని మోసం చేయాలని?” కోపం, దు:ఖం కలగలిసి ఆమె కళ్ళెరుపెక్కాయి.
“కమాన్…బిందూ….చెప్పకూడదనేమీ లేదు. నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. నువ్వనుకునే అంత సీరియస్ కాదు కాబట్టి చెప్పాలనిపించలేదు. దట్సాల్ .”
చాలా కోపం వచ్చింది బిందూకి.
“ఎంత సీరియస్ కాకపొతే వాళ్ళు, మా ఫోన్ నెంబర్ తెలుసుకుని మరీ మీ చరిత్ర తెలియజేస్తారు? ఒక ఆడపిల్లని అలా మోసం చేసి మరో అమ్మాయికి తాళి కట్టేందుకు సిద్ధమయ్యారే …! మై గాడ్…’చదువుకున్నారు. మంచి జాబ్ చేస్తున్నారు’ అని పొరపడ్డారు మా వాళ్ళు..రియల్లీ అయాం సేవ్ డ్.” ఆమె ముక్కు పుటాలు ఆదరుతున్నాయి.
“మోసమా…?నేనా…?ఎవరిని చేశాను? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? నాకు అర్థమయ్యేలా చెప్పు హిమబిందూ!”
“ఏం చెప్పాలి? అప్పుడు రేఖని, ఇప్పుడు నన్ను! రేపెవరినో? ఎంత మందిని మోసం చేస్తారిలా ?”
“నాకు కాస్త స్పష్టం చెప్పగలవా బిందూ….! నీకెవరెవరు ఏమేమి చెప్పారో…!.నేనెవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి మోసపోయింది మా కుటుంబం. ముందు నువ్వు చెప్పాక, నేను చెప్తాను.”
జరిగిన విషయం అంతా చెప్పింది హిమబిందు కేదార్ కి.
కాసేపు మౌనంగా ఉండి పోయాడు కేదార్.
“హిమబిందూ ! ఇలా జరగడం చాలా మంచిదయ్యింది. ఔను. నీకు తెలియడమే మంచిది. అవసరం కూడా అనిపిస్తోంది ఇప్పుడు. విను. నాకు రేఖతో నిశ్చితార్థం జరగడం నిజం. అది విఫలం అవడం ఇంకా నిజం. తనూ నా లాగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నాలాగే క్రికెట్ పిచ్చి తనకి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసం మూడు సార్లు బయట తిరిగాం. బాగా షాపింగ్ చేసింది తను. పెళ్ళి చీరలు, డ్రెస్సులు వగైరాలన్నీ నా చేత కొనిపించుకుంది. ఇక వారంలో పెళ్ళి. మా ఇంట్లో దగ్గర బంధువులున్నారు. చాలా హడావిడిగా ఉన్న సమయంలో రేఖ ఫోన్ చేసింది. మాట్లాడాలి రమ్మని పిలిచింది. వెళ్ళాను. నా చేతులు పట్టుకుని కన్నీళ్ళతో షాకింగ్ వార్త చెప్పింది. ‘తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతను దినకర్ అని, తామిద్దరికీ ఎప్పటి నుంచీనో నెట్ స్నేహం ఉందనీ , అతడినే తను పెళ్ళి చేసుకుంటాను’ అని. . మరి ముందుగానే నాకు గానీ మా వాళ్లకి గానీ ఎందుకు చెప్పలేదు అని అడిగితే, యు ఎస్ లో ఉన్న అతడు రెండు నెలల తర్వాత ఇండియా వస్తాను అన్నాడనీ, అతను రాకపోతే, ఇక తన గతి ఇంతే అని నాతో జీవితం పంచుకుందాం అనుకున్నానని, ఈ విషయం తన పేరెంట్స్ తో చెప్పే ధైర్యం లేకపోయిందని అంది. కానీ, ఇప్పుడు అతడు ముందుగానే తన కోసం భారతదేశం వచ్చాడని చెప్పింది. అంటే స్టాండ్ బై గా నన్ను ఉంచుకుందన్నమాట. చాలా బాధపడ్డాను. అప్పటికే తనకి మేము ఇద్దామనుకున్న బంగారు ఆభరణాల కోసం డబ్బు కూడా ఇచ్చేశాం. ఇంత వరకూ వచ్చాక పెళ్ళి రద్దు అయితే పరువు పోతుందని, దినకర్ని మరచిపోమని ప్రాధేయ పడ్డాను. కానీ రేఖ కన్నీళ్ళతో వేడుకుంది. మనసు ఒకరితో, మనువు మరొకరితో పంచుకోలేనంది. ఆది చాలనట్లు నా నెత్తి మీద మరో భారం వేసింది.”
“ఏమిటది?” అడిగింది బిందు .
“రేఖకి తల్లితండ్రుల దగ్గర తమ కులం కాని వాడిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పే ధైర్యం లేదు. ఇంత దాకా వచ్చాక వాళ్ళు తనని ఎట్టి పరిస్థితులలోనూ బయిటికి రానివ్వరు, బలవంతంగా నాతోనే పెళ్ళి చేస్తారు కనుక, నన్ను బ్రతిమిలాడింది ‘ దయచేసి, మీరే ఏదో ఒకటి చెప్పండి. నేను మీకు నచ్చలేదని చెప్పెయ్యండి. పెళ్ళి కాన్సిల్ చేయండి.’ అంటూ ఏడ్చింది. కాళ్ళా వేళ్ళా పడింది. ఆలోచించాను. మనసు లేని పెళ్ళి నేనూ చేసుకోలేను కదా! అందుకే, తను చెప్పినట్లే చేశాను. వాళ్ళ వాళ్లకి నామీద చాల కోపం వచ్చింది. బాగా గొడవలయ్యాయి. మేమిచ్చిన సోమ్ములేవీ మేం అడగలేదు. వాళ్ళివ్వ లేదు. ఆడపిల్ల జీవితం అల్లరి పాలు కాకూడదని నా తల్లితండ్రులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియనీయలేదు. నాకూ ఓ చెల్లెలుంది బిందూ! మీకు ఎవరు ఏమేం చెప్పారో నాకు అనవసరం. నమ్మితే ముందుకు వెళ్దాం. లేకపోతే, ఇక్కడితో వదిలెయ్యి. ఫ్రెండ్స్ గా ఉందాం!“ నిజాయితీ ఉంది అతని స్వరంలో.
“ఇది నిజమని నమ్మేదెలా?” ఇంకా అనుమానంగానే ఉంది బిందుకి .
“నమ్మించేదెలా? ఆగు. నా దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది. “ అంటూనే డయల్ చేశాడు కేదార్.
“హాయ్ కేదార్! హవ్వార్యూ? ఎంత హ్యాపీ గా ఉందో నువ్వు కాల్ చేస్తే! బట్, నాకు తెలుసు ఎప్పటికయినా నువ్వు నా కాంటాక్ట్ లోకి వస్తావని. యూ ఆర్ మై మ్యాన్. “ రేఖ స్వరం మొబైల్ ఫోన్ స్పీకర్ లో నుంచీ బిందుకి స్పష్టంగా విన్పిస్తోంది.
“జస్ట్ ఏ కర్టెసీ కాల్….ఎలా ఉన్నావు రేఖా? ఎలా ఉంది లైఫ్? నువ్వూ, దినకర్…. యు ఎస్ లోనేనా?”
“ఓ ! అయాం సో అన్ లక్కీ కేదార్! వాడొట్టి చీట్. పెద్ద ఫ్రాడ్. అన్ని కబుర్లు చెప్పాడా…! ఇండియా వచ్చాడా! నన్ను చూసాడా! వాడేదో ప్రిన్స్ లాగా ఉన్నట్లు ఫీలింగ్ ఒకటి! ‘నువ్వింకా చాలా అందంగా ఉంటావనుకున్నాను. అయినా సరే, ఏదో అడ్జస్ట్ అవుతాను. యాభై లక్షలు కట్నం తెమ్మన్నాడు. ఎక్కడినుంచి తెస్తాను? అందుకే ఇంకేం చేస్తాను? బ్రేకప్ చెప్పి బయట పడ్డాను. నిన్ను మిస్ చేసినందుకు నేను ఎంత ఫీల్ అవుతున్నానో…! రియల్లీ ఐ రిపెంట్” బాధగా అంది రేఖ.
“ సో స్యాడ్ రేఖా…! ఒక్కో సారి అంతే! అనుకున్నట్లు జరగదు. బీ బ్రేవ్!” చెప్పాడు కేదార్.
“కేదార్! ఒక మాట చెప్పనా….!నాకు ముందు నుంచీ నువ్వంటే నాకిష్టం. నీతో క్రికెట్ మ్యాచెస్ చూస్తూ లైఫ్ మొత్తం వన్డే మాచ్ లాగా జరిగిపోవాలి. ఎస్…,నువ్వు నన్ను నమ్మాలి. మరెందుకు ఎలా చేశావ్ అని అడగొచ్చు నువ్వు. వాట్ టు డు ? ఆ దినకర్ నీకన్నా క్వాలిఫైడ్. ఫారిన్ లో మంచి జీతం. అందుకే అప్పుడటు మొగ్గాను. అంతా ఉల్టా అయ్యింది. ప్చ్! కేదార్ డియర్… ప్లీజ్! లెటజ్ గెట్ మారీడ్! మా అమ్మతో అదే చెప్పాను. ప్లీజ్, కేదార్, ఒక్క సారి మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకు తెలుసు నువ్వు ‘ కాదు’ అనవని. లవ్యూ కేదార్….”ఇంకా ఏదో చెప్తూనే ఉంది రేఖ.
హిమబిందు, కేదార్ చేతిలో ఉన్న మొబైల్ ఫోనుని తీసుకుంది.
“మిస్ రేఖా…! నేనేవరా అని ఆశ్చర్య పోతున్నట్లున్నావు కదూ…. నా పేరు హిమబిందు. కొద్ది రోజుల్లోనే మిసెస్ కేదార్ నాథ్ ని . పాపం. మా ఫోన్ నెంబర్ వెతికి మరీ మమ్మల్ని తప్పిద్దానుకున్నారు. చాలు మీరాడిన జూదం. చూడూ …పెళ్ళికి కావాల్సినది ప్రేమ. నమ్మకం. ఆస్తి, అంతస్తు కాదు. నువ్వు, మీ అమ్మా మీ తెలివితేటలని కాస్త మంచి పనులకి వాడుకోండి. మంచిమనిషిని వంచించడానికి కాదు. ఏదేమైనా నా జీవిత భాగస్వామి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాను. వివాహబంధాన్ని వ్యాపారంగా మార్చేసే మీలాంటి వాళ్ళ వల్లే సమాజంలో ఆడవాళ్ళ పట్ల గౌరవభావం తగ్గుతోంది. బై !“
ఫోనుని తిరిగి కేదార్ చేతికిచ్చి, ఆ చేతిని గట్టిగా పట్టుకుంది హిమబిందు.
అనుమానపు తెరలు తొలిగిన ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న అభిమానాన్ని చూశాడు కేదార్.
“థాంక్యూ “ అతని కళ్ళు చెప్పాయి ఆమెకి. కారు వైపుగా ఇద్దరి అడుగులో సాగాయి.
ఆనందు తీసుకున్న నిర్ణయం అతని తల్లికి ఏమాత్రం మింగుడుపడడంలేదు. అతని భార్య సరోజ అతని నిర్నయాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతుంది. అతని అబిప్రాయంతో ఏకీబవించకుండా కాసేపు మౌనవ్రతం దాల్చింది ఆమె. అతని తల్లి కోడలికి బాసటగా నిల్సి ‘‘ఒరే ఆనందు ఏందిరా నువు సేసేది, ఈడ బతికేది బతుకు కాదా,నువ్వు మమ్ముల ఇడిసి దూరంగా పోతంటే ఎట్టా, సర్కారు నౌకరి వొచ్చిందంటే సంబురపడ్డాం గని మిలటరీ నౌకరంటే ఒప్పుతాంరా అయ్యా, ఉన్నొక్కనివి ఇడ్సిపోతే ఎట్టరా ఆనందూ, మయ్యగాని నెత్తినోరుకొట్కోని చెబుతున్న ఇనరా అయ్యా, నారెక్కలిర్గలే రెక్కలిర్గిందాంక సాకుతా , అటెంక ఏదన్న పనిసూసుకో బిడ్డా కోడలుపిల్ల వుత్తమనిషి కూడా కాదాయె, ఈ సమయముల్ల పిల్లకు నువు తోడుగుండాలే. అసలే పెద్దింటిపిల్ల ప్రేమించి మరి పెండ్లాడ్త్వి,ఇప్పుడు పచ్చిని చేసి ఇడ్సిపోతె ఎట్టా. దానిబతుకేంగాను, పిల్ల బాగోగులెవరు సూస్తరు.’’ అంటూ కంతలబోయిన కండ్ల నీళ్ళు రాలుస్తూ అరవసాగింది.అప్పటికే ఆమె మూడుకాళ్ళ ముదిమికొచ్చింది.
దుఖ్ఖాన్ని కళ్ళలో అదిమిపట్టిన సరోజ మౌనంతో సూటిగా ఆనందు కళ్ళలోకి చూసింది. అతను తన బట్టలను బ్యాగులోకి సర్దుకొంటూ ‘‘సరూ మనకోసమే నేను ఈ పని చేస్తున్నా. ఈరోజుల్లో గవర్నమెంట్ జాబ్ దొరకడం అంత ఈజీ కాదని నీకు తెల్సు, మనం హయిగ బతకాలంటే ఏదోపని చేయాల్సిందే, ఆప్ట్రాల్ ప్యూన్ పోస్ట్కు పి.ఎచ్.డి చేసిన వారు అప్లై చేస్తున్నారు. మనమెంత పైగా ఒకే ప్రయత్నంలోనే మిలటరీలో జాబ్ వచ్చింది. ఆనందించాల్సింది పోయి అమ్మ, నువ్వు నాపై అక్కసు ఎల్లగక్కితే ఎలా, నా ఆశయం దేశసేవ చేయడం. అందివచ్చిన అవకాశం వదులుకోలేను.’’ అంటూ తడుముకోకుండా పలాకాడు ఆనంద్.
‘‘ఆనంద్ సేవే పరమావది అయితే ఈ దేశంలో, మన రాష్ట్రంలో వివిధ రంగాలలో జాబ్ చేసేవారిది సేవకాదా.’’అంటూ గాటుగానే బదులు పలికింది సరోజ అతనివైపు కటినంగా కోపంతో చూస్తూ
‘‘చూడు మైడియర్ సరూ అలా ఉరుమురిమి చూడకు, నేను తట్టుకోలేను ప్రేమామృత ధారలు కురిపించే నీకళ్ళు నిప్పులవాన కురిపించి నన్ను దహించివేయకు’’అంటూనే దీనవదనంతో ప్రాదేయపడుతున్నట్టుగా ఆమెవైపు లీలగా చూస్తూ తన చేతితో ఆమె గదుమను తడిమాడు.
‘‘ఓయబ్బో లేనిప్రేమవొలికించకు, ఆనంద్ నిన్ను నేను ఎంత ఆరాదించానో అది నీకు తెలుసు, ఐనా బాడర్ లో జవాన్ జాబ్ మంచిదే కాని నీ తెలివికి ఇక్కడే ఏ ప్రయివేట్లో చూసుకున్నా చాలినంత జీతమిస్తారు, నువ్వే ఓ నెట్సెంటర్ పెడితే నలుగురికి ఉపాదికల్పిస్తావు. ి ఆనంద్ నీవు బాడర్లో అష్టకష్టాలు పడటం నాకు సుతారమూ ఇష్టంలేదు. ఇప్పటి పరిస్థితుల్లో నువ్వు వెళ్లితే నన్నేవరూ చూసుకుంటారు. మీ అమ్మ అసలే మతిమరుపు మనిషి, నేనో వుత్తమనిషిని కాను నెలలు నిండిన గర్బినిని, నీ తొందరపాటు నిర్ణయాలతో విసిగించకురా..’’అంటూ తన పొట్టపై చేయితో నిమురుకొంటూ అతనివైపు దీనాతిదీనంగా చూసింది.
‘‘సరూ అన్ని ఏర్పాట్లు చేస్తా, నువ్ ఫికర్ చేయకు కొన్ని రోజులు ఓపిక పట్టు అంతా సర్దుకుంటుంది. నేను ఈ నేలపై పుట్టినందుకు దేశ సేవ చేసేబాగ్యం నాకు లభించింది. ఆనందపడు, ఎందరికొస్తుంది ఈ అవకాశం. తినడంకోసమే అయితే ఏదోపనిచేసి బతకొచ్చు. మనిషన్నాక ఏదో సాధించాలి. అందరిలా మనముంటే ఎలా కాస్తా భిన్నంగుండాలి,నేనలావుండడం నీకిష్టంలేదా. నీకు గుర్తుందా సరూ నువ్వే అనేదానివి మనం అందరికంటే డిపరెంట్గా ఆలోచించాలి అని అందుకే సైన్యంలో చేరా.’’ అంటూ సరూ తలనిమురుతూ మాటలతో మరిపించాడు.
‘‘ఏమో బాబు మీరెన్నైనా చెబుతారు. సరే మళ్ళి తమరి రాక ఎప్పుడో’’ జీరబోయిన గొతుంకతో అడిగింది.
‘‘పోన్ చేస్తుంటా,కుదిరితే లెటర్ రాస్తా’’అంటూ ఆమెను చివరగా ఆలింగనం చేసుకొని నుదురుపై ముద్దుపెట్టి అటునుంచి కదిలాడు. ఆక్షణంలో అతనికి తెలియకుండానే కన్నుల్లో నిద్రానమైన కడలి ఉద్వేగంతో పొంగి కంటిరెప్పలనుండి తన్నుకొచ్చి కన్నీటి వరద పారింది. అతను కళ్ళు తుడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతనినే చూస్తూ నిలబడిపోయింది సరోజ.
ఆమె మతి యాదుల్లోకి మల్లింది ‘‘ఈ నేలపై తలుకుబెలుకు కాంతులీనె నవజాతశిశువు పుడమీన పాదం మోపె గడియ కోసం ఎదురుచూస్తాను, నీ మది తలపులు తెరచుకొని నీ గుండె గది పడకలో నీ పక్కనే నేను కొలువు దిరుగుతాను ఆనందు కలతపడకు కలలు కను వీరుని కల కను దేశభక్తుల గాదలు విను అవి నాకు నీ జాబుతో సంతకం చేసి పంపు నేను వాటిని చదువుతున్నప్పుడు నాలో నూతనత్తేజం నిండాలి. నీకుమల్లె నేను మాతృభూమిపైన మమకారం పెంచుకోవాలి.’’ అని తనలో తాను అనుకోసాగింది. అతను దూరమౌతున్నకొద్ది అతనిపై ఆమె చూపు దుర్బినిలా నిలబెట్టి చూడసాగింది. అతను మాయమయ్యాడు…. ఆమె కళ్ళలో అతని రూపు నిలిచిపోయింది.
అతను సరిహద్దులో కాపలా కాస్తున్నప్పుడు కోడెతాచుల బుసలుకొట్టె చీకటిలో కంచె ఆవలి కాలాంతకుని పసిగట్టె పనిలో అతని కనురెప్పలు మూయక తెరచుకొని ఉంటాయి. శత్రువు నిశ్శబ్ద పాదాల అలికిడి పసిగడుతూ కారుచీకటి కమురువాసనలో కనురెప్పలు తెరిచి రెటినా దుర్బినిగా మారుస్తాడు. అతని చెవిలో కర్నబేరి రిక్కపొడుచుకొని అగంతకుని అలికిడి సవ్వడిని వినసాగుతుంది. భూతలస్వర్గం కాశ్మీరపు అందచందాలలో హిమపాతపు మంచులోయలో ముసురులా ఎడతెరుగక మంచు కురుస్తుంది. కర్కశత్వం నిండిన కఠినశిలా హృదయంలో డమరుక నాథం దేశభక్తి గేయాలాపన. లోయలో జలపాతం సడిచేస్తూ సైనికుల కవాత్తును కీర్తిస్తూ గానం చేస్తుంది. డేరాలలో కొందరు యోదులు విశ్రమిస్తుంటారు అలసిసొలసి. కార్పెట్ బూట్ల పహారా కాస్తూ అతను, ఆనందు లాంటి యోదులు ఎందరో. ఇక్కడ సూర్యోదయాలు, చంద్రోదయాలు, అమావాస్య నిశి చీకటి రాత్రులు వారికి ఒక్కతీరే, వారి మనసులో సంతోషపు ఆనందగడియల్ని వెదికేందుకు క్షణం తీరిక ఉండదు. వారి కవాత్తు, మార్చ్ ఫస్ట్ మంచులోయలో దూకే జలపాతంలా సాగుతుంది. గగన సీమలో సాగిపోతున్న వలసపక్షుల క్రమశిక్షణకు ఏ మాత్రం తీసిపోని తీరున వారు సరిహద్దు కంచె ముందు సాగుతారు, కఠోర సాధనతో సాయుదులై అకస్మిక యుద్దంలో ముందుకు దూకుతారు. కంచె ఆవల మాటువేసే శత్రువు దుశ్చర్యను పసిగడతారు, తిప్పికొడతారు. వారు భారత సైనికులు, కార్గిల్ వీరులు. అయినా వారు అప్పుడప్పుడు అంతర్గత శత్రువు నుండి ,అలాగే సరిహద్దు కంచెదాటిన శత్రువు చేతులో ఎదురుదెబ్బలు తింటుంటారు. అవి పటాన్కోట్, యూరిసెక్టార్ లాంటివి. కాని వారి మనోధైర్యం ఈసమంత చెదరదు వారి గుండె నిబ్బరం శత్రువు ఎదురుదెబ్బలతో రెట్టింపు చేస్తాయి. తూర్పున సూర్యుడు ఉదయించి పడమర అస్తమించడం మళ్ళీ ఉదయించడం ఎంత వాస్తవమో భారతమాత స్వేచ్చగా ఉండాలని తపన పడుతూ ఎదురొడ్డి పోరాడి సడలని అచెంచల ఆత్మ విశ్వాసంతో అసేతు హిమాచలం కాపలా కాయడం అంతే వాస్తవం.
‘‘హలో ఆనంద్ ఎలా ఉన్నావు నీకోసం నీరాకకోసం కళ్ళ ఒత్తులు పెట్టుకొని నేను, మీ అమ్మ, మన బిడ్డ ఎదురుచూస్తున్నాం వేయి కళ్ళతో నీవు ఎప్పుడొస్తావా నన్ను మళ్ళీ తన్మయత్వంతో ఆలింగనం చేస్కుంటావా అని ఎదురుచూస్తున్నా’’ అంటు ఆతృతతో పలకరించింది సరోజ.
‘‘సరూ మాకు విజయాలు, అపజయాలు మామూలే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కంటికి రెప్ప వాల్చకుండ, కునుకు తీయకుండ గస్తీ కాయడం మా డ్యూటీ. ఇది ఒకరోజుతో ముగిసేది కాదు ఏటి ప్రవాహంలా నిరంతర నిఘా ఆదమరిస్తిమా శత్రువు చేతికి మేం చిక్కినట్టె గస్తీ పెంచితిమా వాడు మాకు చిక్కినట్టే ఇక్కడ మాకు మరణం వీరత్వం వెన్నుచూపడం పిరికితనం చావడమో చంపడమో ఇదే మా డ్యూటీ నిరంతర నిఘాలో అలుపులేకుంటా ఉన్నా నువెలా ఉన్నావు.’’ అంటూ ఉద్వేగంతో ప్రవాహంలా అతని పలకరింపు సాగింది.
భయాందోళనకు గురైన సరోజ అతనితో మాట్లాడుతూ ‘‘నేను రోజు పూజలు చేస్తూనే ఉన్నా కన్పించిన చెట్టును, పుట్టను, కొండను, కోనను మొక్కుతూనే ఉన్నా ,నువ్వు క్షేమంగా ఉండాలని మా దరి చేరాలని’’ అంటూ ఆమె గద్గద స్వరంతో పలకరిస్తుంటె అతనూ నిట్టూర్చాడు ఇద్దరూ ఫోన్లో పిచ్చాపాటి కబుర్లాడుకున్నారు. అమ్మ గురించి, అమ్మగల్లాడుతున్న చిన్నోడి గురించి ఆమె చెబుతావుంటే అతను మురిసిపోయాడు.
మురిసిపోతూనే ‘‘సరూ సరిహద్దు కంచెలు మా చరిత్ర చెప్పడమే కాదు మా గురించి స్వర్ణాక్షరాలతో లిఖిస్తాయి. యావత్ భారతదేశానికి మా కీర్తిని, మా త్యాగాలను వివరిస్తాయి. దేశానికే కాదు ప్రపంచానికి చాటుతాయి. ఇంతటి గొప్ప గణకీర్తి ఏ పౌరునికి, ఏ ఉద్యోగికి లబిస్తుంది’’ అంటూ అతను వారి ఉన్నతిని స్తుతిస్తుంటే సరోజ ఒంటిలో ఒకవైపు ఒనుకు పుడుతూనే, మరో వైపు తన పెనిమిటిలోని పౌరుషత్త్వము ఆమెలో రాజుకుంది. కాని ఆమెలో తెలీని ఆందోళన జరగకూడనిది ఏదైన జరుగుతుందేమోనని మదిలో ఆందోళన ‘‘ఏమండీ జాగ్రత నేను రోజు పేపరు తిరగేస్తూనే ఉన్నా సరిహద్దులో జరుగుతున్న సంఘటనలను చదువుతూనే ఉన్నా. సినిమాల్లో మాదిరి కసాయి ముష్కరలు మీ పట్ల కర్కశత్వం ప్రదర్శిస్తారట కదా అదే నా బెంగ అది వింటుంటే, చదువుతుంటే ఒళ్లు గగ్గురు పొడుస్తుంది జాగర్త సుమా.’’ అంటూ దీనంగా విలపించ సాగింది సరోజ. కళ్ళలో సుడులు తిరిగిన కన్నీటిని తుడుచుకొంటూ…
‘‘సరూ యుద్దంలోకి దిగాక విజయమో వీరమరణమో మిగతావాటి గురించి ఆలోచిస్తామా’’ అంటూ గర్వంతో పలికాడు ఆనంద్. అలా చెబుతూనే ‘‘సరూ సరిహద్దుల్లో ఈ మద్య మాలో ఒక జవాన్ దారితప్పి కసాయి ముష్కర మూకకు చిక్కాడు దేహమంతా విషం నింపుకున్న కసాయి ఉగ్రమూక అతడి దేహానికున్న శిరస్సును ఖండిరచి మొండాన్ని గరుడలకు ఆహారంగా పారవేసి తలతో బంతులాడుకున్నారట. అంతకుముందు వీర సైనికుని కాల్లుచేతులు కట్టివేసి హింసిస్తూ ఈడ్చుకెళ్లి ఆనందపడసాగారు. దేహంనుంచి కారుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టును చూసి పకపకనవ్వుతూ ఈలలు వేసారు చేతులలో గుండుసూదులు గుచ్చారు. చేతిగోర్లు పీకి కాటాలు గుచ్చారు కీల్లు విరగొట్టి మేకులు దించారు. పళ్లూడగొట్టి కనుగుడ్లు పెరికి వేశారు. దేహమంతా రగతాలు కారుతుంటే ఎరట్రి కారాన్ని దేహమంతా పులిమి అతడు ఆహాకారాలు చేస్తుంటే వారు ఆనందతాండవం చేశారు వారి ఉన్మాద వికృత క్రీడకు చచ్చి పడున్న దేహం మౌన సాక్షిగా నిలుస్తుంది అయినా వారి కసి తీరదు ఎక్కడో గుర్తుతెలియని చోట మొండం ఒకచోట, తలొకచోట మంచులోయలో రాబందులకు ఆహారంగా విసిరేసి రాక్షసానందం పొందుతారు అయితేనేం అతను అమరుడు అతని కీర్తి అజరామరం మువ్వన్నెల జెండై రెపరెపలాడుతుంది’’ అంటూ అతను చెపుతావుంటే సరళ వెన్నుల్లో ఒనుకు పుట్టింది. గుండె వేగం పెరిగింది అతని మాటలు వింటున్నంత సేపు ఆమెలో ఉద్ద్వేగం కట్టలు తెంచుకుంది కసితో ఆమె మతి రగిలింది ‘‘ఆనంద్ అలాంటి కసాయి ముష్కరుల మట్టికర్పించు నీకండగా నేనే కాదు ఈ దేశమంతా వెన్నంటే ఉంది’’ అంటూ భావోద్వేగంతో పలకగానే ఆనంద్ మది ఆనందతాండవం చేసింది ఆమె మాటలకు. ‘‘సరూ ఈ భూతల స్వర్గంలో కొన్ని రోజుల్లో మేం కొత్తచోటుకు వెళ్తున్నాం’’ అంటూ చివరి మాటగా పలుకుతూ ‘‘మన బాబుకు, నీకు నా ముద్దులు’’అని పోన్ పెట్టేశాడు. నెలలు గడుస్తున్నాయి, తన బాబుగూర్చిన ఆనందగడియలను అప్పుడప్పుడు ఆనందు, సరోజలు పోనులో మాటలాడుకుంటూనేవున్నరు, ఒకరినొకరు పలకరించుకొంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూనేవున్నరు, వారి బాబు వచ్చిరాని మాటలతో ఆనందును పలకరిస్తుంలే అతనిలో సంతోషం వికసించి విప్పారేది.
ఒకనాటి సాయంత్రం టీవి ముందు వాలి టివి ఆన్ చేసింది. అన్ని న్యూయస్ చానల్లలో స్క్రోలింగ్ హెడ్లైన్లతో కాశ్మీర్లోయ రక్తసిక్తం, పుల్వామా సెక్టార్లో నలబైమంది జవాన్లు ఉగ్రదాడిలో వీరమరణం పొంది అమరులైయ్యారు. ఆ వార్త దావానంలా భారతావని వ్యాపించింది. టీవీలముందు కూర్చున్నవారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. సరోజలో వణుకు మొదలైంది, గుండె వేగంగా కొట్టుకోసాగింది, ఆమెలో ఏదో తెలియని ఆందోళన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. తనదేహం తన ఆదీనంలో లేకుండా పోయింది. ‘‘ఆనంద్, ఆనంద్ ’’అంటూ కలవరిస్తూ తదేకంగా రెప్పవాల్చకుండా ఆ ఘటననే చూడసాగింది. టీవిలో వచ్చె దృశ్యాలు చూపరుల గుండెల్నిపిండెసేలావున్నాయి, ఆదృశ్యం భీతావాహ భయానకం సైనికుల బస్సు తుక్కుతుక్కైంది,ఆబస్సులో వున్న అరవైమందిలో నలబైమంది అక్కడికక్కడే వీరమరణం పొందారు.సైనికుల శరీరాలు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి,ఉగ్రవాది ఒక్కడు ముందుగా బస్సును డీకొట్టి ఆపై తనను తాను పేల్చేసుకొని సృష్టించిన విద్వంసం అది. అప్పుడే వీరమరణం పొందిన సైనికుల పొటోలు టివీలో రాసాగాయి,అందులో ఆనందు పొటో వుండడంతో సరోజ తట్టుకోలేక స్పృహకోల్పోయింది,ఆ ఘటన చూపరులకు ఊరిజనాలకు ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది, రోమాలు నిక్కపొడుచుకుంటున్నయి. జనం నరనరాల్లో ఆవేశం కట్టలుతెంచుకొని , మరుగుతున్న రక్తాన్ని అనుచుకోలేక దాయాది దేశంపై తలోతీర్గ దుమ్మెత్తిపోయసాగారు. దిక్కులుపిక్కటిల్లేలా ‘‘ఆనందూ అమర్రహే’’అంటూనే అంతకంతకూ ప్రతీకారం బదలా తీర్చుకోవాలని ముక్తకంఠంతో చాటుతున్నారు…
ఆయల్ల పనికెళ్లిన బాలమ్మ పనిముగిసింది. పొద్దుకూకింది, సందలవడ్డది, ఊరపసులు ఇంటిబాట పట్టినయ్.వాటి ఎనకాలె పనికెళ్లిన కూలీలందరూ కొండ ఆవలిగట్టునుంచి కొండెక్కిదిగి ఎగుడుదిగుడు గుంతల బెట్టెరాళ్ల బాటలో నడిచినడిచి వారికాళ్లు అలిసిఅలిసి మెత్తబడ్డాయి అయినా తిన్నగా అడుగులోఅడుగేస్తూ ఇంటిబాటపట్టారు. పొద్దుమునిగి చీకటిపరుచుకొంటుంది ‘‘ఇంటికెళ్లి గింత చాయసుక్క కడుపులేసుకుంటే కడుపులాకలి సల్లబడుద్ది’’అని తనమదిలో అనుకొంటూ ఇంటినిసమీపించింది. ఇంటిముందు జనం గుమ్మిగూడివున్నరు, ఇసుకపోస్తే రాలనట్టుగ. ‘‘ఏందల్లా ఏంది మా ఇంటిముంగల గుమ్మిగూడిరడ్రు,కశ సందిడువుర్రి ఇంట్లకుపోవాలే, ఏందే సరోజా ఏంది జనం’’అంటూ అందరివైపు ఎగాదిగా చూసింది సరోజా టీవిముంగల కూలవడివోయింది పోరడు తల్లిమీన తారాడ్తుండు జనం వార్తలు ఇనసాగిండ్రు. సరోజ ఏడుస్తుంది, ఎన్నడూ కడవాడకట్టుకు రాని జనం ఇంటిముంగల గుమ్మిగూడటం చూసి ‘‘ఏంజరిగిందర్రా ఏంది సంగతి’’ అంటూనే వారివైపు ఎగాదిగాచూసింది. ‘‘ఓ బాలమ్మా గుండేదైర్నం చేసుకో అటకూలవడు,నీ కొడుకు ఆనందు…. ఆనందూ’’ అని గుంపులో ఓవ్యక్తి అనేలోపే ‘‘ఏమయిందయా నా ఆనందుకూ…’’అని సూటిగా వారివైపుచూస్తూ అడిగింది. అమ్మా ఇంకెక్కడి ఆనందూ నీకొడుకు ఉగ్రదాడిలో వీరమరణం పొందిండు, సైన్యంలో వుండి దేశానికి సేవచేస్తూ, అసువులుబాసి అమరుడైండు తల్లి నీ ఎంట ఊరుంది, ఊరెకాదు ఈ దేశమే మీయెంటవుంది.’’ అనేసరికి ‘‘అయ్యో ఓరి దేవుడో ఎంతపనిచేశావురో, నాఇల్లు ముంచితివా.. నా ఆనందూ ఓయమ్మా, ఓ దేవుడా.. ఎట్టబతికేది సరోజా.. నా తల్లి ఏమి శెరలొచ్చెరా బగవంతా, ఎవనికేం పాపంచేస్తిమి సామి నాయిల్లు ముంచితివీ, మమ్ముల మగదిక్కులేనోళ్ల జేస్త్వి ఓయమ్మా…ఓ అయ్యా… నా ఆనందూ ఏడకానొస్తడే, మల్లెప్పుడొస్తడే, అమ్మో,అయ్యో, మా తండ్రి.. ఆనందా..’’ అంటూ తలబాదుకుంటూ, జుట్టుపీకుంటూ వల్లవల్ల ఏడుస్తూ కూలవడిపోయింది టీవిముందు. ఆమెకు కొడుకు లేడన్న వాస్తవం జీర్ణించుకోలేకపొయింది. ఆమెలో ఆవేశం దుఖ్ఖమై ఉప్పొంగింది,కంతలవోయిన కండ్లలో ఇంకిన కన్నీరు ఊటలా ఉబికి వరదలైపారుతూ చెంపలపై జాలువారుతూ కొంగుతడిసి ముద్దయ్యింది చీకటి ఆ ఇంటిని కాలసర్పమై మింగింది. నిశిచీకటి కమ్మింది ఊరిపెద్ద ఒకరు ఆ యింటిలో క్యాండిల్ జ్యోతులను వెలిగించాడు, బైట జనం అమర జవానుకు జేజేలు పలుకుతూ ఆ ఊరంతా జ్యోతులతో దిక్కులు పిక్కటిల్లేలా జోహార్లు అర్పిస్తూ ర్యాలితీసి ఊరంతా ఆ ఇంటికి బాసటగా నిలిచిండ్రు….
భూతం ముత్యాలు, కథారచయిత
9490437978
