Home వ్యాసాలు అన్నిరంగాల్లో రాణించిన ప్రజ్ఞాపారీణుడు ప్రయాగ నరసింహశాస్త్రి

అన్నిరంగాల్లో రాణించిన ప్రజ్ఞాపారీణుడు ప్రయాగ నరసింహశాస్త్రి

by Achyutuni Rajasri

( ఆయనను గూర్చిన సమాచారం అందించిన వారు కుమార్తె వేదవతి గారికి కృతజ్ఞతలతో)

20నవంబర్ 1909లో విశాఖపట్నం సమీపంలోని పెదగాడిలో పుట్టారు.6_7ఏళ్ల పిల్లాడిగా గొంతెత్తి పాడి అందర్నీ ముగ్ధుల్ని చేసిన ప్రయాగవారు 11సెప్టెంబర్ 1983లో హృద్రోగంతో పరమపదించారు.ఐదో ఏటనుంచి ఆటపాటలతో మొదలైన ఆయన జీవితం74 వ ఏటకూడా కష్టాల్ని పక్కకు నెట్టి స్వాతంత్య్రోద్యమం పాటలతో పెరిగి ఆంధ్ర బాలానందసంఘంలో మొద్దబ్బాయి గా ఎదిగారు.తన కంచుకంఠంతో బుర్రకథ హరికథ పిట్టకథ బావగారి కబుర్లతో ఆకాశవాణిలో వెలిగారు.మైకులేకున్నా సంగీతం నేర్వకున్నా ధన్యాసి, తోడి వంటి రాగాల్లో తనదైన ముద్ర వేశారు.పల్లెపదాలు జానపదాలు ఆయన గొంతులో ఊపిరిపోసుకున్నాయి.1969లో ఆకాశవాణిలో రిటైరైనాక పెన్షన్ లేని కాలం కాబట్టి సంపాదన కోసం మద్రాసు వెళ్లారు.సినీరంగంలో రాణించారు.1971_76దాకా ఫీల్డ్ పబ్లిసిటీ ప్రోగ్రాంలలో హరికథ బుర్రకథలద్వారా జనాల్లో చైతన్యం కల్గించారు.తిరుమల తిరుపతి కళాపీఠం నెలకొల్పినపుడు జానపదకళారూపాల ప్రయోక్త గా చెక్క భజనలు, సంప్రదాయ భక్తిగీతాలు నేర్పారు.1977లో మద్రాస్ ఆకాశవాణి ఈయనని సన్మానించింది పుంభావసరస్వతి అని కొనియాడింది.1975లో ప్రపంచ తెలుగుమహాసభ గౌరవించింది.చింతా దీక్షితులు గారు ప్రశంసిస్తూ లేఖరాశారు”నాయనా! నీనయగరాజలపాతం వాగ్ధాటికి జోహార్లు”.
విజయవాడలో ఇళ్లు కాలిబూడిదైతే ప్రభుత్వం డబ్బుసాయం చేసింది.కానీపంపిణీచేసేవారు అక్రమంగా డబ్బునొక్కేస్తుంటే వినోదాలవీరయ్యగా ఆగుట్టంతా బైట పెట్టారు ప్రయాగవారు.కలెక్టర్ ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకోవటం జరిగింది.
శ్రీప్రయాగవారు1939_56వరకు మద్రాస్ ఆకాశవాణిలో పనిచేశారు.1956లో విజయవాడ గ్రామస్థుల కార్యక్రమ ప్రయోక్త గా ఆయన చేసిన ప్రోగ్రాంలు జనాల గుండెల్ని తట్టిలేపాయి.
ఆయన సినిమారంగంలో కూడా రాణించారు.చిత్తూరు నాగయ్య సినిమా త్యాగయ్య లో ప్రథమశిష్యుడు గణపతివేషం వేశారు.1970_74మధ్య అందాల రాముడు,చీకటి చీకటివెలుగులు, డబ్బుకులోకం దాసోహం ,ఒకే కుటుంబం,కొత్త కాపురం,కొత్త దేవదాసు చిత్రాల్లో నటించారు.మద్రాస్ ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో ఆనాటి సినిమాలకు అనుగుణమైన జానపదగేయాలు ,సినిమా బ్యాక్ గ్రౌండ్ గా బుర్ర కథలు రాసి పాడారు.ముగ్గురు మరాఠీలు బాలరాజు,బాలనాగమ్మ, శ్రీలక్ష్మమ్మ, మనోహర మొదలైన సినిమాలకు పాటలు రాసి పాడి నటించిన ఆల్ రౌండర్ ప్రయాగవారు.70_80బుర్రకథలు రాశారు.హెచ్.ఎం.వి.గ్రాంఫోన్ కంపెనీవారు 36డిస్కులు రిలీజ్ చేశారు.శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారి స్ఫూర్తి ప్రోత్సాహంతో ఆయన సంగీత సాహిత్యాలలోకి అడుగుపెట్టారు. యక్షగానాల్లో సూత్ర ధారిగా ఆయన వాచికం నభూతో నభవిష్యతి. ఆయన పాడిన పాటలు” మేలుకొనుడీ భరతపుత్రుడా,మాకొద్దీ తెల్లదొర తనం,కల్లు మానండోయ్” మొదలైన పాటలు ఇంటింట పాడుకునేలాచేశారు.అంధభిక్షువుగా తెల్లగుడ్డు మాత్రమే కనిపించేలా ఆయన చేసిన నటన నభూతో నభవిష్యతి. 1939లో రేడియోలో ఆయన కి లభించింది కేవలం 5రూపాయలు మాత్రమే!బావగారి కబుర్లు రేడియోలో వస్తుంటే ఆనాడు ప్రతిపార్కులో వినపడి జనం చెవియొగ్గి వినేవారు. ఎస్.వరలక్ష్మి టంగుటూరి సూర్య కుమారి మొదలైన వారికి పాటలు నేర్పిన ఘనాపాటి!
1977లోమద్రాస్ ఆకాశవాణి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారిని,ప్రయాగ నరసింహశాస్త్రి గారిని,ఆనాటి స్టేషన్ డైరెక్టర్ని సన్మానించటం ఓవిశేషం ప్రత్యేకత గూడా!
శ్రీప్రయాగ నర్సింహ్మ శాస్త్రిగారి తల్లి దండ్రులు శ్రీమతి సత్యనారాయణమ్మ శ్రీ వెంకట రమణయ్య గార్లు .కలెక్టర్ ఆఫీసులో తండ్రి పనిచేశారు.దురదృష్టవశాత్తు 35వ ఏటనే రమణయ్య గారు చనిపోయేటప్పటికి ప్రయాగ వారికి 14 ఏళ్లు.ఏకైక కుమారునిగా ఆయన తల్లిశిక్షణలో పెరిగి బి.ఎ.పాసైనారు.రేడియో కళాకారునిగా ఆయన జీవితం ధన్యం !!

You may also like

Leave a Comment