Home వ్యాసాలు కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

గాజోజు నాగభూషణం ప్రాణదీపం కవిత
కవిత్వం ఓ విశ్లేషణా
‌ప్రముఖ కవి,ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, గాజోజు నాగభూషణం కలం నుండి జాలువారిన ప్రాణ దీపం కవితా సంపుటిలోని ప్రాణ దీపం కవితపై విశ్లేషణా వ్యాసం.ప్రాణ దీపం కవిత నాకు చాలా నచ్చింది.వేదనలోంచి కవిత్వం పుడుతుందంటారు. అది అక్షరాలా నిజమనిపిస్తోంది.కవి నాగభూషణం ఆషామాషీగా కవిత్వం రాసే వ్యక్తి కాదు.నిబద్ధత కల వ్యక్తి.ప్రాణ దీపం కవితలో అమ్మతో గడిపిన బాల్యాన్ని ఆమెతో పెనవేసుకున్న బంధానికి అక్షర రూపం ఇచ్చాడు.ప్రాణ దీపం కవిత చదువుతుంటే దుఃఖం వస్తుంది.నాకైతే రెండు మూడు రోజులు సరిగా నిద్ర పట్ట లేదు.కవి నాగభూషణం అమ్మ గురించి కవిత రాశాడు.కవితకు ప్రాణ దీపం పేరు పెట్టాడు.నిజంగా మనం ఒక్కసారి మనసు పెట్టి కవిత చదివితే మనకు అమ్మ ప్రాణ దీపం అన్న సంగతి ఎరుకలోకి వస్తుంది.అమ్మ గురించి ఎందరో కవులు కవితలు,గేయాలు, పద్యాలు రాశారు.ప్రాణ దీపం కవిత హృదయానికి హత్తుకునేలా ఉంది.నేటి సంక్షుభిత సమాజంలో అమ్మలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తమ కన్న పిల్లలను సాకుతున్నారు. అయినప్పటికీ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అమ్మలను మనం మరియు మన సమాజం వృద్ధాప్యంలో సరిగా చూడడం లేదు.అమ్మలను వృద్ధుల ఆశ్రమాల్లో చేర్పిస్తున్నట్లు మనం రోజు వార్తా పత్రికల్లో చదువుతున్నాం.మానవ సంబంధాలన్నీ మసక బారిపోతున్నాయి.మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా కొనసాగుతున్నాయి.జీవితంలో అమ్మ ఎదుర్కొన్న కష్టాలను,కన్నీళ్లను,వేదనలను అక్షరీకరించడం సామాన్యమైన విషయం కాదు.కందుకూరి రమేష్ బాబు అమ్మ గురించి సామాన్య శాస్త్రంలో వేలాది మంది అమ్మల ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శించారు. కందుకూరి రమేష్ బాబు సామాన్య శాస్త్రం గ్యాలరీకి గాజోజు నాగభూషణం అమ్మ చిత్రం కూడా ప్రదర్శనలోకి చేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.ప్రాణదీపం కవిత అమ్మ యొక్క చరిత్ర.అమ్మ చరిత్రను ప్రాణ దీపం కవితలో ఆవిష్కరించడం అద్భుతంగా ఉంది.ప్రముఖ కవి, రచయిత,శ్రీ ఎస్.కె.పిళ్లె అమ్మ స్మృతిలో అమ్మ గేయ కవిత రాశారు.ప్రముఖ కవి జ్వాలాముఖి అమ్మ గేయ కవితకు పీఠిక రాస్తూ “పిళ్లెగారి కావ్య జగత్తులో ఊపిరి పోసుకుని నిలిచి వెలిగిన అమ్మ ఎవరో కాదు: పీడితుల తాడితుల విముక్తి పోరాటంలో అందరికీ వాత్సల్యాన్నందించి విప్లవకారుల సరసన నిలిచిన వీరమాత,గోర్కీ చెప్పిన ‘అమ్మ’ ఆ విశ్వమాతకు విప్లవ తేజానికి జోహార్’ అని చెప్పారు.ప్రముఖ కవి జ్వాలాముఖి పీఠికలో అమ్మ గురించి రాసిన వాక్యాల్లో ఎంతో బలం ఉంది.ప్రాణ దీపం కవితా సంపుటిని అమ్మకు అంకితమిచ్చారు.నాగభూషణంకు అమ్మంటే ప్రాణం అని మనకు తెలుస్తోంది.అమ్మను చివరి వరకు ప్రేమగా చూసుకున్నారు.ప్రాణ దీపం కవితా సంపుటికి ముఖచిత్రం ప్రముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ వేశారు.చాలా చక్కగా ఉంది. ముఖచిత్రం వెనకాల నాగభూషణం కుమారుడు అక్షయ్ కపిల్ నానమ్మ యాదిలో చిత్రం గీశారు. చక్కటి చిత్రాన్ని గీసిన అక్షయ్ కపిల్ ను అభినందిస్తున్నాను.
“చుట్టూ చీకటి కొండలు/పల్లేర్లు పరుచుకున్న దారులు/అడుగు తీసి అడుగు వేస్తే/పాదాలకు చుట్టుకొనే పగల పాములు/దూరమెంతో…. చేరే తీరమెక్కడో/అంతు చిక్కని అనంత పయనం/ అంటున్నారు.ఇవి ప్రాణ దీపం కవితలో మొదటి చరణాలు.కవి నాగభూషణం చుట్టూ చీకటి కొండలు ఉన్నాయంటున్నారు.


“పల్లేర్లు పరుచుకున్న దారులు/అంటున్నారు.పల్లెల్లో చేనులు,చెల్కల్లోని దారుల్లో పల్లేర్లు ఉంటాయి. చేనులు చెల్కల్లో నడుస్తున్నప్పుడు పల్లేర్లు గుచ్చుకుంటాయి.పాదాలకు గాయాలు అవుతాయి. పల్లేర్లు గుచ్చుకోవడం వల్ల రక్త మోడుతుంది.పల్లేర్లు
గుచ్చుకున్న పాదాల అవస్థ చెప్పతరం కాదు.
‘అడుగు తీసి అడుగు వేస్తే/పాదాలకు చుట్టుకొనే పగల పాములు/అంటున్నారు.చేనులు చెల్కల్లో ప్రయాణిస్తున్న అమ్మ అడుగు తీసి అడుగు వేస్తే పగల పాములు పాదాలకు చుట్టుకునేవి.కవి నాగభూషణం పగల పాములు అనడం ప్రతీకలా ఉంది.నేటి వ్యవస్థలో మన కుటుంబంలోని కొందరు మన చుట్టూ నివసించే ఇరుగు పొరుగు వారు పగతో పాములా బుసలు కొడుతుంటారు వారు. ఈర్ష్యా,అసూయా ద్వేషాలతో ఏం చేయడానికైనా వెనుకాడరు.ఈర్ష్యా,అసూయా,ద్వేషాల,జాడ్యం ఇప్పుడు అడుగడుగునా కనిపిస్తుంది.ఈర్ష్య, అసూయతో ద్వేషాలతో రగిలేవాళ్లు మంచితనాన్ని ఓర్వ లేరు.మంచిగా పని చేసుకునే వాళ్లను పని చేసుకోనివ్వరు.ఎప్పుడు ఏదో ఆటంకం కలిగిస్తూ ఉంటారు.ఇతరులు బాధ పడుతుంటే చూసి ఆనందంతో పండుగ చేసుకుంటారు.
‘దూరమెంతో… చేరే తీరమెక్కడో/అంతు చిక్కని అనంతపయనం/అంటున్నారు.అమ్మ పయనంలో దూరమెంతో చేరే తీరం ఎక్కడో అంతుచిక్కని అనంతపయనం అన్న పదాలు అక్షరాల నిజమనిపిస్తాయి.అమ్మ జీవన ప్రయాణం అంతు చిక్కని అనంత పయనం.
‘ఏ గాలికి దీపం ఎప్పుడు ఆరుతుందో/ అంటున్నారు.ఒకప్పుడు దీపాల కింద బతికిన రోజులు.గ్యాస్ నూనె పోసి కందీళ దీపం వెలిగించే వారు.రాత్రంతా కందీళ దీపం వెలుగుతుండేది. జడివాన గాలి హోరుకి కందీళ దీపాలు ఆరిపోతుండేవి.తర్వాత,తర్వాత కరెంటు వచ్చింది. కరెంటు లేనప్పుడు మసక చీకటిలోనే జీవనం కొనసాగింది.
‘చిల్లుపడి,నావ ఎక్కడ మునుగుతుందో/ అంటున్నారు.చిల్లుపడితే నావ మునుగుతుందని, గాలికి దీపం ఆరిపోతుందనే విషయం మనకందరికీ తెలుసు.రంధ్రం పడిన నావ ఎక్కడ మునుగుతుందో తెలియని విధంగా జీవితం ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.
‘అంతా తాయి మాయి తండ్లాట/అంటున్నారు. తాయి మాయి తండ్లాట తెలంగాణ పదం.ఏదీ మనసున పట్టుకుంట ఆగమాగం కావడం దీని అర్థం.
‘అయినా నడక సాగాలి/నడకలింకా నేర్వని నాలుగు పసి కెరటాలను/తీరానికి చేర్చే తిమిర సమరంలో’/ ఏకాంత కడలివీ నువ్వే/అలల నెదిరించి నడిచిన నావవూ నువ్వే/అలసటెరుగక నడిపిన సరంగువు నువ్వే/అంటున్నారు.అమ్మ నడక సాగుతూనే ఉంది.అమ్మకు నలుగురు పిల్లలని తెలుస్తుంది. నడకలింకా నేర్వని నాలుగు పసి కెరటాలు వాళ్ళు. నలుగురు పిల్లలకు విద్య వినయం నేర్పాలి. నలుగురు పిల్లలను తీరానికి చేర్చే తిమిర సమరంలో ఏకాంత కడలివి నువ్వే.పెను విషాదంలో ముంచి నాన్న అందనంత దూరానికి వెళ్లిపోవడం వల్ల అమ్మ ఒంటరిదైంది.జీర్ణించుకోలేని నిజం ఇది. అందుకే కవి నాగభూషణం అమ్మను ఏకాంత కడలివి నువ్వే అన్నారు.
‘అలలనెదిరించి నడిచిన నావవూ నువ్వే/
‘అల‌సటెరుగక నడిపిన సరంగువు నువ్వే/
అమ్మ అలల నెదిరించి నావను నడిపింది. అలసటెరుగక నడిపిన సరంగు అమ్మ.అమ్మ జీవిత పోరాటంలో అలుపెరగకుండా సాహసంతో జీవనం కొనసాగించింది.
‘తిమింగలాలను తప్పించి/అమంగళాలను దాటించి/ కాలాన్ని కత్తి మొనపై నిలిపి/కడకు తీరానికి మమ్ము చేర్చి/అంటున్నారు.అందనంత దూరానికి అమ్మ నువ్వెళ్ళి పోయావు.సముద్రంలో నావ నడుస్తూ ఉంటే తిమింగలాలు (ఒక రకమైన పెద్ద చేపలు) నావకు అడ్డుగా వచ్చినప్పుడు వాటిని తప్పించి నావను నడపాలి.అమంగళాలు అంటే అరిష్టము, అశుభము.జీవన పయనంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని అమ్మ ముందుకు నడిచింది.కాలాన్ని కత్తి మొనపై నిలిపి కడకు తీరానికి మమ్ము చేర్చి అందనంత దూరానికి అమ్మ వెళ్ళిపోయింది. ఎవరైనా మిత్రులు కాని బంధువులు కాని కనిపిస్తే అమ్మ బాగా ఉందా అని అడుగుతాం.అమ్మ చనిపోయింది అని ఎవ్వరు చెప్పరు.అమ్మ కాలం చేసింది అని చెప్తారు.ఏదో ఒక రోజు భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి కాలగర్భంలో కలిసి పోవాల్సిందే.నావలో కూర్చున్న మమ్ము తీరానికి చేర్చి అమ్మ అందనంత దూరానికి వెళ్లిపోయిందని చెప్పడం బాగుంది.
‘నువ్వు లేని లోకమిప్పుడు/చుక్కలు రాలిన ఆకాశంలా/మొక్కలు మొలువని ఎడారిలా/
దిక్కులు కానరాని దిగులు ప్రయాణంలా/ దీనమై,హీనమై,శూన్యమై/బ్రతుకు రంపపు కోతై/లోలోన రక్తమోడుతోంది/అంటున్నారు.
అమ్మ లేని లోకం ఇప్పుడు చుక్కలు రాలిన ఆకాశంలా ఉంది.చుక్కలు అంటే నక్షత్రాలు. నక్షత్రాలు ఉంటేనే ఆకాశానికి కాంతి,అందం అని మనందరికీ తెలుసు.మొక్కలు మొలువని ప్రాంతాలు ఎడారులు.ఎడారి ప్రాంతం పచ్చదనం కొరవడి వికారంగా ఉంటుంది.ప్రకృతి అంటే చెట్టు చేమలతో వాటి కదలికలతో ఎంతో సుందరంగా ఉంటుంది.ప్రకృతి సౌందర్యం చెప్పనలవి కాదు. దిక్కులు తోచని దిగులు ప్రయాణం ఎంత ఘోరంగా ఉంటుందో మనమందరం ఎరిగినదే. ‘దీనమై,హీనమై,శూన్యమై/బ్రతుకు రంపపు కోతై/రక్తమోడుతుంది/అంటున్నారు.అమ్మ లేని కుటుంబం పొందే దిగులును మాటల్లో వర్ణించలేం. కవి నాగభూషణం అమ్మ లేని బ్రతుకు రంపపు కోతకు గురి అయి రక్త మోడుతున్నట్లుగా ఉందని కవిత ద్వారా చక్కగా వివరించారు.
‘ఇయ్యాల అమ్మల దినమంట/తాతలైన వాళ్లైనా, తండ్రులైన వాళ్లైనా/పావురంగా,గావురంగా/అమ్మ ఒడిలో పసిపిల్లలై/ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్నారు/నన్నెందుకమ్మా అమ్మ లేనివాన్ని చేసావు/ అంటున్నారు.పాశ్చాత్య దేశాల్లో మొదలైన మదర్స్ డే వేడుకలు.ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు.మదర్స్ డేను ఒక పండుగగా జరుపుకుంటున్నారు.నవ మాసాలు మోసి కంటుంది అమ్మ.తన పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది.ఎన్ని కష్టాలైనా భరిస్తుంది.పిల్లలను చూసి ముసి ముసి నవ్వులతో మురిసి పోతుంది.పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తుంది.పిల్లలను పాడిస్తుంది.నన్నెందుకమ్మా అమ్మలేని వాన్ని చేసావు అనే వాక్యాలు చదువుతుంటే కళ్ళల్లో దుఃఖం పెల్లుబికి వస్తుంది. అమ్మకు సాటి ఎవ్వరు రారు.అందుకే అమ్మను మాతృదేవోభవ అన్నారు.కనిపించే దేవత అమ్మ. అమ్మ కనిపించకుండా పోతే ఎంతో దిగులుగా ఉంటుంది.ఆ కుటుంబానికి కలిగిన బాధను ఎవరు తీర్చలేరు.అమ్మ స్థానంలో మరెవరు ఆ ప్రేమను, అనురాగాన్ని పూరించలేరు.ఇవాళ వృద్ధాప్యంలో అమ్మను సరిగా చూడడంలేదు.ఈనాడు అమ్మ తన ఇంట్లో బోసిపోయి పిల్లలు ఉండి కూడా వాళ్ళ ఆదరణ కరువై దుఃఖంతో దిగులుతో దీనంగా ఉంటుంది.కానీ,కవి నాగభూషణం అమ్మను చక్కగా చూసుకున్నారు.అమ్మల దినం రోజు అమ్మ నువ్వు ఎందుకు వెళ్ళిపోయావని బాధా తప్త హృదయంతో ఆవేదన చెందుతున్నారు. ‘పొద్దు పొడుపు కంటే ముందు/పొద్దుగాల్ల లేసి నీ మొకమే జూసెటోన్ని/ఇప్పుడు ఏ దిక్కు చూసినా/ శూన్యమే దిక్కైంది/అంటున్నారు.మనమందరం రాత్రి పడుకుంటాం.మళ్లీ ఉదయాన్నే లేస్తాం. పొద్దున లేవగానే అమ్మ మొకమే చూసే సంస్కారం ఎందరికీ ఉంటుంది.అమ్మ అందనంత దూరం వెళ్లిపోయినంక అమ్మను పొద్దు పొడుపు కంటే ముందు పొద్దుగాల్ల లేసి అమ్మ ముఖం చూడడం ఎవ్వరికి సాధ్యం కాదు.ఇప్పుడు ఏ దిక్కు చూసినా అమ్మ లేకుంటే శూన్యమే దిక్కైంది అన్నది అక్షరాలా నిజమనిపిస్తుంది.
“ఇంద్ర లోకమో…చంద్ర లోకమో/నాకైతే తెల్వదు గానీ/చంద్రబింబం లాంటి నీ మొకం మీద/ముద్దు పెట్టుకొనుటానికి/అన్ని లోకాలు దాటి నీ/కన్న పేగు కోసం ఒక్కసారి కదిలి రామ్మా/అంటున్నారు.అమ్మ చని పోయిన తర్వాత ఎక్కడకు వెళుతుందో ఎవ్వరికి తెలియదు.మన పురాణాలు చెప్పినట్లు ఇంద్రలోకం,చంద్ర లోకం ఇంకా మరెన్నో లోకాలు ఉన్నాయి.స్వర్గం,నరకం అని ఏవేవో మనం అనుకుంటాం.కానీ,అవి అన్ని మన ఊహకు అందనివి.ఇంద్ర లోకమో చంద్ర లోకమో నాకైతే తెల్వదు గాని చంద్రబింబం లాంటి నీ మొకం మీద ముద్దు పెట్టుకొనుటానికి అన్ని లోకాలు దాటి ఒక్కసారి కదిలి రామ్మా అనడం ఎంతో బాగుంది.
“బతుకు నాకిచ్చి నువ్వెళ్ళి పోయినంక/ఇప్పుడు బతుకమ్మ పండుగచ్చింది/ఏ వరుసలో ఏ పువ్వు పేర్చిన/నీ నవ్వు మొకమే కనిపిస్తుంది/అంటున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో పెద్ద వేడుకగా జరుపుకుంటారు.ఇంటిముందు బతుకమ్మ పేర్చి స్త్రీలందరు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుతూ ఆడతారు.స్త్రీలందరికీ బతుకమ్మ పండుగ అదొక వేడుక.ఆడపిల్లలు తమ తల్లుల ఇంటికి వెళతారు.బతుకమ్మ పండుగకు ఇంట్లో తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు.ఏ వరుసలో ఏ పువ్వు పేర్చిన నీ నవ్వు మొకమే కనిపిస్తుంది అంటున్నాడు.అమ్మ ఉన్నప్పుడు ఆనందంగా బతుకమ్మను పేర్చేది.
“నువ్వు లేవన్న నిజం/నిలువెల్లా నిప్పులా కాలుస్తుంది/అంటున్నారు.బతుకమ్మ పండుగ రోజు నువ్వు లేవన్న నిజం నిలువెల్లా నిప్పులా కాలుస్తుంది అని కవి నాగభూషణం తల్లి లేక పోవడం వల్ల కలిగిన బాధను వ్యక్తం చేస్తున్నాడు.

“కనులు మూసినా తెరిచినా/కాలాన్నెదిరించిన నీ కన్నీటి యాత్రే గుర్తొస్తుందమ్మా/అంటున్నారు.కనులు మూసినా తెరిచినా అమ్మ గుర్తుకు వస్తుంది. అమ్మతో ఆనందంగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి.అమ్మ ప్రత్యక్ష దైవం.కనిపించని దేవుడు ఉన్నాడో లేడో మనం ఎరుగం.కనిపించే అమ్మ దైవం కాదన లేని సత్యం.అమ్మ కుటుంబం కొరకు తన పిల్లల కొరకు తన సంసారాన్ని నిలుపుకోవడానికి ఎంతో పోరాటం చేస్తుంది.ఆ పోరాటంలో అమ్మ విజయం సాధిస్తుంది.ఓటమి ఎదురైనా అమ్మ కుంగిపోదు.అమ్మ విజయం కొరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి విజయాన్ని సాధించి కుటుంబాన్ని గట్టెక్కిస్తుంది.
కాలాన్నెదిరించిన నీ కన్నీటి యాత్రే గుర్తొస్తుందమ్మా. ప్రాణం విడిచిన అమ్మను చావు డప్పులతో సాగనంపుతాం.పాడె పై శవాన్ని స్మశానానికి తరలించడానికి అందరు సహకరిస్తారు.ఇరుగు పొరుగు బంధువులు,మిత్రులు,స్నేహితులు ఆ శవయాత్రలో అందరు పాల్గొంటారు. ఇప్పుడైతే వైకుంఠధామానికి శవాన్ని తరలిస్తున్నారు. చనిపోయిన తర్వాత శవానికి స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు కడతారు.పాడె మీద ఎక్కించికొని డప్పులతో తరలిస్తారు.దింపుడు కళ్లెం చేస్తారు. చివరికి కట్టెలు పేర్చి అమ్మ శవాన్ని దహానం చేస్తారు.మంటల్లో అమ్మ శరీరం బూడిదగా మారి పోయింది.కాలాన్నెదిరించిన నీ కన్నీటి యాత్ర గుర్తొస్తుందమ్మా అని ఆవేదనతో కవి నాగభూషణం బాధపడుతున్నారు.
“నెత్తిమీద నిండు వడ్ల బస్తా/ఒక చేతిలో నేను/ఇంకో చేతిలో సాయానికో కట్టె/గంగలో దిగి/ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు/ఒక్కో బస్తా నువ్వు జార గొడుతుంటే/నీ దుక్కంలో కారిన కన్నీళ్ళతో/కలిసి పారినట్లే అనిపించింది గంగ/అంటున్నారు.
అమ్మ నెత్తి మీద నిండు వడ్ల బస్తా ఎత్తుకొని నడుస్తోంది.ఒక చేతిలో కవి నాగభూషణం తల్లి చేతులు పట్టుకొని గంగలో నడుస్తున్నాడు.ఇంకో చేతిలో సాయానికో కట్టె.అమ్మ గంగలో వట్టిగ నడవడం లేదు.నెత్తి మీద నిండు వడ్ల బస్తా ఎత్తుకొని నడుస్తోంది.ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేవు.ఇప్పటిలాగా బస్సులు,ఆటోలు ఏవి ఉండేవి కావు.ఎక్కడికి ఏ ఊరుకు వెళ్ళాలన్న కాలి నడకన వెళ్ళే వాళ్ళు.కొన్ని ఊర్లకు వెళ్లాలంటే గంగ దాటి వెళ్ళాలి.అమ్మ గంగలో దాటి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు ఒక్కో బస్తా జార గొడుతుంటే ఆమె దుక్కంతో కారిన కన్నీళ్ళతో కలిసి పారినట్లు అనిపించింది గంగ.అమ్మ అలసట అన్నది ఎరుగకుండ గంగలో నడిచింది. గంగలో నీళ్ళు ఎప్పడు పారుతుంటాయి.అమ్మ దుక్కంలో కారిన కన్నీళ్ళతో కలిసి గంగ పారినట్లు అనిపించింది అన్న వాక్యాలు చదివితే మనకు కళ్ళపొంటి కన్నీళ్ళు ఉబికి వస్తాయి.గంగ దాటడం అంటే ఎంతో ప్రయాసతో కూడిన పని.నెత్తి మీద నిండు వడ్ల బస్తా చేతిలో కొడుకు నాగభూషణం మరో చేతిలో సాయానికో కట్టె అన్న వాక్యాలతో అమ్మ గంగ దాటుతున్న తీరును కళ్ళకు కట్టినట్లుగా కవి నాగభూషణం వెల్లడించాడు.
“తాత ఇచ్చిన నాలుగు వడ్ల బస్తాల సాయం కోసం/ సాహసోపేతంగా నడిచిన నీ అడుగులు/నా బతుకు పయనంలో/భరోసా నింపిన పాద ముద్రలు/ అంటున్నారు.తాత ఇచ్చిన నాలుగు వడ్ల బస్తాల సాయం కోసం అమ్మ సాహసోపేతంగా గంగలో నడిచి వడ్లను తీసుకు వచ్చి కుటుంబాన్ని కాపాడింది.అమ్మతో పాటు ప్రయాణం చేసిన కవి నాగభూషణం భరోసాతో బతుకు పయనం కొనసాగించాడు.
“ఇంటిని కాజేయాలని/కాచుకున్న గుంట నక్కలను/ గడ్డపారతో అడ్డంగా నిల్చొని ఎదిరించిన/నీ గుండె నిబ్బరమే కాదె/నా గుండెల్లో గుట్టంత దైర్యాన్ని నింపింది/అంటున్నారు.ఇంటిని కాజేయాలని కాచుకున్న గుంటనక్కలను అమ్మ ఎంతో ధైర్యంతో గడ్డపారతో ఎదిరించింది.తన కుటుంబానికి తన నలుగురు పిల్లలకు ఆ ఇల్లు బాసటగా ఉంటుందని ఈ సాహసం చేసింది.అమ్మ అలా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తడం వల్లనే ఆ ఇల్లు మాకు దక్కిందని కవి నాగభూషణం అంటున్నాడు.అమ్మ నా గుండెల్లో గుట్టంత ధైర్యాన్ని నింపింది.అమ్మ తీసుకున్న చర్య కుటుంబానికి రక్షగా ఉంది.అమ్మ ఇల్లును కాపాడుకుంది.ఎందరు మహిళలు ఈనాడు సాహసంగా పోరాడుతున్నారు?అమ్మ ఆనాడు సరియైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న చర్య అభినందనీయం.అమ్మ ఆనాడు తీసుకున్న చర్య ఈనాటి మహిళలకి ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది.
“లేమితనంలో నువ్వు/ఒక్కో గడపాఎక్కి దిగుతుంటే/నీ వేలు పట్టుకొని నడిచిన నన్ను/తెలిసీ తెలియని వయసులోనే/తొలిచిన ప్రశ్న/ఇంతగా పేరుకున్న అంతరాలు/అంతమయ్యే దెట్లా/ అంటున్నారు.అమ్మ లేమితనంలో ఒక్కో గడపా ఎక్కి దిగుతుంటే నాగభూషణం అమ్మ వేలు పట్టుకుని నడిచినాడు.ఏమీ తెలియని వయసులోనే ఇంతగా అంతరాలు ఎందుకు ఉన్నాయి?అంతరాలు అంతమయ్యే దెట్లా?అనే ఆలోచన కవికి కలిగింది.
“ఆనాటి అలజడులే కదమ్మా/నాకు కొత్త దారుల్ని పరిచయం చేసింది/అంటున్నారు.అమ్మ ఎదుర్కొన్న ఆనాటి అలజడులు తనకు కొత్తదారుల్ని పరిచయం చేసింది అని కవి నాగభూషణం అంటున్నారు.
“రోజంతా ఉపాసమున్న మాకు/పెరట్లో అట్టిగనే కాసిన అనిగెపు కాయలను/ఉడికించి ఆ పూట ఆకలి దీర్చి/అంటున్నారు.పేదరికం శాపం లాంటిది. తిండికి కూడ ఉండదు.ఉపాసముండి బతకాల్సి వస్తుంది.రోజంతా ఉపాసమున్న మాకు పెరట్లో కాసిన అనిగపు(సొర) కాయలను ఉడికించి అమ్మ ఆ పూట ఆకలి తీర్చింది.అమ్మ తన పిల్లలను ఉపాసముంచదు.అనిగెపు కాయలను ఉడికించి పిల్లల ఆకలి తీర్చిన అమ్మ ప్రేమను దేనితో కొలవగలం?
“పిడికెడు బియ్యమైనా దొరకని పరీక్షా కాలాన/ఎట్టికి తెచ్చిన తౌడును రొట్టెలుగా కాల్చి/తినిపిచ్చి తీరొక్క శోకం దీసిన/అంటున్నారు.ఆ కాలంలో పిడికెడు బియ్యం కూడా దొరకని రోజులు ఉన్నాయనే వాస్తవాన్ని మనకు తెలియ జేశాడు.అమ్మ తౌడును రొట్టెలుగా కాల్చి పిల్లలకు తినిపించింది.తీరొక్క శోకం దీసింది.అమ్మ గడ్డు రోజులను తల్చుకుని ఏడ్చింది.వ్యవసాయదారులు పశువులకు తౌడు కలిపి పెడుతారు.పశువులు తినే తౌడును రొట్టెలుగా తయారు చేసి పిల్లలకు తినిపించింది.ఒరిస్సాలోని కలహండి ప్రాంతంలో గడ్డి గడ్డలను తిన్నట్లు మనం చదువుకున్నాం.ప్రాణదీపం కవిత చదువుతుంటే కన్నీళ్లు ఉబికి వస్తాయి భగవంతుడు అమ్మకు ఎన్ని బాధలు కల్పించాడు.ఆ బాధలను అమ్మతో పాటు పిల్లలు కూడా అనుభవించారు.ఇవ్వాళ కరువు దినాలు పోయి సరైన ఆహారం తింటున్నాం.ఆ రోజుల్లో తినడానికి ఏమీ దొరికేది కాదు.కరువులు, కాటకాలు పేదరికం పెను శాపంగా ఉండేది.
“దుక్కంలోంచే కదమ్మా నేను/దూసిన కత్తినై మెరిసింది/అంటున్నారు.అమ్మతో పాటు కవి నాగభూషణం దుక్కాన్ని అనుభవించాడు.అందుకే అంటున్నాడు దుక్కం లోంచే కదమ్మా దూసిన కత్తినై మెరిసింది నేను అని.
“దీపంతో పాటు నువ్వు కాలిపోతూ/ఎన్ని రాత్రులనో కరగదీసి/బీడీలు చుట్టి, ఊపిరితిత్తుల్ని/పొగ జూరిన ఉత్తి తిత్తులుగా మార్చుకున్న/నీ వేదనలోంచే కదా నాలో వేల శోధనలు వెల్లు వెత్తింది/అంటున్నారు. దీపం తాను కాలిపోతూ వెలుగును పంచుతుంది. దీపంతో పాటు అమ్మ ఎన్ని రాత్రులనో కరగదీసి వట్టిగ ఉండలేదు.అమ్మ బతకడం కొరకు కుటుంబం పోషణ చేయడం కొరకు బీడీలు చుట్టే వృత్తిని ఎన్నుకొంది.పొద్దున లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే దాకా బీడీలు చుట్టేది.బీడీలు చుట్టే వాళ్ళ శ్రమకు వచ్చేది అరకొర కూలీ డబ్బులు మాత్రమే. అయినప్పటికీ అమ్మ ఎంతో శ్రమకోర్చి బీడీలు చుట్టి ఊపిరితిత్తుల్ని పొగ జూరిన ఉత్తి తిత్తులుగా మార్చుకున్న తీరును చూస్తే మనకు ఎంతో బాధ కలుగుతుంది.అమ్మ అనుభవించిన వేదనలోంచే కవి నాగభూషణంలో వేల శోధనలు వెలువెత్తి గొప్ప కవిగా మరియు గాయకుడిగా రూపుదిద్దుకున్నాడు.
“ఇప్పటిదాకా ముళ్ళ గాయాలను నువ్వు మోసి/ పూల వాసనలు మాకు పంచావు/అంటున్నారు. అమ్మను పూల చెట్లతో పోలుస్తున్నాడు.గులాబీ చెట్టుకు ముళ్ళు ఉంటాయి.అయినప్పటికీ మనం ముళ్ళు ఉన్న గులాబీ చెట్టును మన ఇంట్లో పెంచుతాం.గులాబీ పువ్వులు దేవుని పటాలకు అలంకరిస్తాం.గులాబీ పువ్వు కమ్మని వాసన కలిగి ఉంటుంది.స్త్రీలు తమ సిగలో గులాబీ పూలు అలంకరించుకుంటారు.ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా ప్రియురాలుకు గులాబీ పువ్వు బహుకరిస్తారు.అమ్మ గురించి గులాబీ చెట్టులాగా ముళ్ళ గాయాలను మోసి పూల వాసనలు మాకు పంచావు అని కవి నాగభూషణం తల్లిని గూర్చి గొప్పగా చెప్పినాడు. “నన్ను పూలు లేని కొమ్మను చేసి/గాలికి మలిగిన వత్తివై నువ్వారి పోయావు/అంటున్నారు.కవి నాగభూషణం ఎంతో వేదనతో నన్ను పూలు లేని కొమ్మను చేసి గాలికి మలిగిన వత్తివై నువ్వారి పోయావు అని అమ్మను గూర్చి అంటున్నారు.మనం పూలు లేని కొమ్మను ఆదరించం.గాలికి వెలిగిన దీపం ఆరిపోవడం సహజమని భావగర్బితంగా చెప్పిన వాక్యాలు ఇవి.
“ఇప్పుడు నాకంటూ మిగిలిందల్లా/ తడియారకుండా ఉన్న/నీ తలపుల తవ్విపోతలే/ అంటున్నారు.అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఉండేవి అమ్మ మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే. అప్పుడప్పుడు అమ్మ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాం.మనకు ఇష్టమైన అమ్మ జ్ఞాపకాలను ఇతరులతో పంచుకుంటాం.కవి నాగభూషణం ఇప్పుడు నాకంటూ మిగిలిందల్లా తడి ఆరకుండా ఉన్న నీ తలపుల తవ్విపోతలే అనడం ఎంతో బాగుంది.
“నడిచే దారుల్లో/నీ విలువల విత్తనాల్ని నాటుకోవడమే/పొడిచే పొద్దు/నీ ముద్దు మోమేనని మురిసిపోవడమే/అంటున్నారు.అమ్మ అందరాని లోకాలకు వెళ్ళిపోయింది.అయినప్పటికీ అమ్మ వెళ్లిపోయిన తర్వాత మన జీవితానికి కొనసాగింపు ఉంటుంది.అమ్మ వెళ్లిపోయిన తర్వాత మనం నడిచే దారుల్లో అమ్మ అందించిన విలువల విత్తనాల్ని నాటుకోవడం,పొడిచే పొద్దులో అమ్మ ముద్దు మోమును చూసి మురిసి పోవడం తన దినచర్యగా మారిందని కవి వ్యక్తం చేయడం గొప్పగా ఉంది.
“మాలో వెలుగుతున్న/మమ్మల్ని వెలిగిస్తున్న/ప్రాణ దీపం నువ్వే కదమ్మా/ అంటున్నారు.అమ్మ మనల్ని నవ మాసాలు మోసి కన్నది.అమ్మ ప్రేమతో పెంచి పెద్ద చేసింది.అమ్మ చేయినందుకుని పెరిగాం. అమ్మనే మనకు వెలుగును ఇచ్చింది.అమ్మా! మమ్ము వెలిగిస్తున్న ప్రాణ దీపం నువ్వే కదమ్మా అనడం అక్షరాలా నిజం.అమ్మ ప్రాణ దీపం వెలుగులు కవి నాగభూషణంకు అందాలని మనసారా కోరుకుంటున్నాను.విశ్వంలో ఉన్న ప్రతి తల్లి ప్రాణదీపమై తన సంతానానికి వెలుగులు పంచాలని ఆశిస్తున్నాను.కవి గాజోజు నాగభూషణం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కాంక్షిస్తున్నాను.

You may also like

3 comments

Megan2328 September 22, 2025 - 6:59 am Reply
Kendra4251 September 22, 2025 - 2:53 pm Reply
Jacqueline3377 September 22, 2025 - 2:54 pm Reply

Leave a Comment