వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయ పరచుకుంటూ ముందు కెళ్లిన కవయిత్రి సులోచన గారి భావాల్లోంచి మొలకెత్తిన గింజ నాలుగు పదులకు పైగా కొమ్మలతో మాటల చెట్టై ఎదిగింది. కొమ్మలన్నీ (శాఖలు) కొమ్మ(స్త్రీలు)లై కత్తులు దూస్తూ ఎద లోయల్లోని ఆవేదనలను వెలిబుచ్చిన కవితలు ఎక్కువగా కనిపించాయి. కూతురిగా, ఇల్లాలిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ, మనసు మూలల్లో ఎక్కడో దాగిన అసంతృప్తి కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతే గాకుండా జన చేతనలు, భాషా ఉద్యమాలు, సైనిక వందనాలు వీరి అక్షరాల్లో కనిపిస్తాయి. వీరి సిరా చుక్కల్లో పిచ్చుకలు గూళ్ళు కట్టాయి, పిల్లనగ్రోవులు అలరించాయి. పుటలు తిరగేస్తే…..
నా లేత హృదయ కాన్వాస్ పై పంతులమ్మ చిత్రం గీసి రంగులద్దినది నీవే
ఎప్పటికీ నా హీరో వి నువ్వే (నాన్న – నేను)//
అంటూ తనను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన తన తండ్రే తాను మెచ్చిన కథానాయకుడని (ప్రతీ ఆడపిల్ల జీవితానికి మొట్టమొదటి హీరో ఆమె కన్నతండ్రే అని మానసిక విశ్లేషకులు తరచుగా చెప్పే మాట)చెబుతారు. ఒప్పుగ నను మలచిన ఒజ్జవు నీవమ్మా//
అంటూ అనురాగమూర్తి ఐన అమ్మకు వందనం సమర్పించుకుంటూనే
సంధ్య పొద్దున నేనేమి ఇవ్వగలన మ్మా నీకు నీ సేవలో తరించెద నమ్మా (ప్రేమ బంధం)//
అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాల్జేసే వారిపై చర్నాకోల ఝుళిపించారు.
నా క్షేమం కోరి స్వేచ్ఛను హరిస్తారు (అందమైన పంజరం) //
ఆడపిల్లను అరటాకుగా కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ఒక స్త్రీ మానసిక వేదనకు ఎంతగా కారణమవుతోందన్న విషయాన్ని కళ్ళక కట్టారు.
ఉదయాస్తమయాల నడుమ బొంగరంలా తిరిగే ఒక ఇల్లాలి అంతరంగాన్ని నాలుగు చేతుల దేవత నవ్వుల వెనుక నలిగిన ఆశలు,ఆశయాలను(ఆ నవ్వు వెనుక) అంటూ హృద్యంగా వర్ణించారు.
ప్రేమ మొలక(మిథునం)కు వలపుల పరిమళాల నలది దాంపత్య బంధాన్ని నిర్వచించిన తీరు అద్భుతం.
నీట కరిగే రూపం నుండి నీటిని నిలుపుకునే స్థాయిగా ….. జీవితమూ (పరిణామ పరిణతి)ఇంతే //
జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలే మనిషిని పరిపూర్ణుడని చేస్తాయని చెబుతూనే,
నాగరిక ఉప్పెనలో కొట్టుకుపోయిన మట్టి గంధానికి సమస్త సుగంధ ద్రవ్యాల సారం(మట్టి- మనిషి)అంటూ పట్టం కట్టిన తీరు మహోన్నతం.
కుంచె నా చేతిలోనే ఉన్నది
నా చేయి పట్టుకున్నది ఎవరో
రంగులు నావే అద్దుతున్నది నేనే…..
ఒక్కటంటే ఒక్కటి నాకు తృప్తినివ్వలేదు (జీవన చిత్రం)
ఎన్ని విధాలుగా దూసుకెళ్లినా, ఎంత ఫలప్రదమైన జీవితాన్ని అనుభవించినా మనసు అట్టడుగు పొరల్లో ఘనీభవించి ఉన్న పరాధీనత సెగై స్త్రీ హృదయాన్ని ఎంతగా రగిలిస్తుందో ఆర్తి గా వ్యక్తీకరించారు.
కొరివితోనే మోక్షం అయితే (ప్రశ్నిస్తున్నన్నా)నే పట్టలేనా? పెట్టలేనా!
అంటూ సమాజంలో వేళ్ళు కొనిపోయిన లింగ వివక్షపై అస్త్రాన్ని సంధించారు.
నేలకేసి కొడితే నింగిదాకా ఎగురుతా//
అంటూ
శృతి మించిన అణచివేత తిరుగుబాటుకు పునాది అవుతుందని హెచ్చరించారు.
సమస్యల సుడిగుండంలో చిక్కి విలవిల్లాడే సాటి స్త్రీని (కత్తులు దూస్తున్న కొమ్మలు) అవసరమైతే సంఘటితమై ఛేదించి సాధించాలని చైతన్య పరుస్తున్నారు.
సగంలో వదిలిన రాగాలను శృతి చేసుకుంటూ, కరిగే మంచై, రగిలే నిప్పై, విలువలపై స్వారీ చేస్తూ విశ్వమంతా చుట్టే వజ్ర సంకల్పంతో సాహితీ లోకానికి మరిన్ని సంకలనాలను అందించాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..
