Home వ్యాసాలు సాహితీ వనంలో విరబూసిన సుగంధ కుసుమాలు

సాహితీ వనంలో విరబూసిన సుగంధ కుసుమాలు

by Padmasri Chennojwala

“రవి గాంచని చోటు కవి గాంచున్”
“కత్తి కంటే కలం గొప్పది”
సాహితీ రంగానికి సంబంధించి తరుచుగా వినిపించే రెండు సూక్తులు.

వస్తువు ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కవులకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ (రవి……. గాంచన్)నానుడి పుట్టి ఉండవచ్చు.

“కత్తి కంటే కలం గొప్పది”
కత్తి శరీరాన్ని గాయపరిస్తే, కలం ఆలోచనను రేకెత్తిస్తుందన్న భావన ఈ సూక్తిలో మనకు కనిపిస్తుంది. [గాయపరచడం మాత్రమే కాదు, శస్త్రచికిత్సలోనూ తనదైన పాత్ర పోషించి, వ్యాధి పీడితులకు స్వస్థత చేకూర్చడంలో బలమైన పనిముట్టుగా ఉపయోగపడుతుందనేది (ప్రస్తుతానికి అనవసరమైనా) అందరూ ఆమోదించాల్సిన మరో కోణం].
కలం అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. ఆలోచనను రేకెత్తించి, మార్పు వైపు నడిపిస్తుంది. ఆ మార్పు మనిషిలోని మాలిన్యాన్ని కడిగేసేదైనా కావచ్చు, అభివృద్ధి బాట పట్టించేదైనా అయి ఉండవచ్చు.
మేము సైతం అంటూ కలాన్ని చేతబట్టి, తమకంటూ ఒక గుర్తింపును సంతరించుకున్న 19వ శతాబ్దపు ఈ సరస్వతీ పుత్రికలను కెమెరాలో బంధించిన ఆనాటి అపూర్వ ఘట్టం, తీయని జ్ఞాపకమై నేడు నెట్టింట వైరల్ గా మారుతోంది. వారు వెదజల్లిన పరిమళాలను ఆఘ్రాణిస్తూ, ఈ చిరు అక్షర నీరాజనం.

రంగనాయకమ్మగారు
సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రిగా, విమర్శకురాలిగా, మార్క్సిస్ట్(శ్రామిక వర్గ ప్రయోజనాలను సమర్ధించే వ్యక్తి) గా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజాస్వామిక విలువలు, కుల వ్యతిరేకత, సమానత్వం, భారతీయ పురాణాలు వంటి అంశాలపై రచనలు చేశారు. 1955లో రచనా వ్యాసంగం ప్రారంభించిన వీరు 15 నవలలు, 70 కథలు,వ్యాసాలు మాత్రమే కాకుండా భారత కమ్యూనిస్టు ఉద్యమం, మావోయిజంపై కలాన్ని సంధించారు.
కలం పట్టిన తొలినాళ్లలో దద్దనాల (తండ్రి ఇంటి పేరు) రంగనాయకమ్మగా, వివాహానంతరం ముప్పాళ్ళ రంగనాయకమ్మగా పాఠకులకు చిరపరిచితులు.
1965 లో ‘ బలిపీఠం’ నవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మార్క్సిస్ట్ దృక్పథంతో రాసిన ‘రామాయణ విషవృక్షం’ బ్రాహ్మణ వ్యతిరేకిగా, స్త్రీవాద రచనలు చేయడం వల్ల పురుష వ్యతిరేకంగా ముద్ర పడింది.
జానకి విముక్తి, కళ్ళు తెరిచిన సీత, కృష్ణవేణి, బలిపీఠం, రచయిత్రి, కళ ఎందుకు, ప్రేమకి ముగింపు ఎప్పుడు?, వాళ్ళిద్దరూ అంతేనా?, రామాయణ విషవృక్షం,ఇదండీ మహాభారతం వంటి రచనలు చేసి, సాహిత్య రంగంలో పలు సంచలనాలు సృష్టించారు.

పాకాల యశోదా రెడ్డి
తెలంగాణ భాష,యాసలతో కూడిన రచనలు చేసిన వీరు తమలోని ప్రతిభకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ప్రాచీన తెలుగు సాహిత్యంపై వీరు చేసిన ప్రసంగాలు పలువురి మన్నన లందుకున్నాయి. ఆకాశవాణిలో తెలంగాణ మండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయిత్రిగా వినుతి కె క్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, లలితకళా అకాడమీ,సంగీత అకాడమీ సభ్యురాలిగా కొనసాగారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో వీరికి విడదీయరాని అనుబంధం ఉంది. ధర్మశాల, ఎచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు, భారతీయ చిత్రకళ, ద్విపద వాంగ్మయం, ప్రబంధ వాంగ్మయం, భావిక వంటి రచనలు, పలు విమర్శనాత్మక గ్రంథాలు రచించారు.

కాసు రాఘవమ్మ గారు
గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితురాలై, జాతీయ ఖాదీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటలో కాసు రాఘవమ్మ – బ్రహ్మానందరెడ్డి పేరుమీద 1972 లో జూనియర్ కళాశాల,1974 లో డిగ్రీ కళాశాలలు(25 ఎకరాల విస్తీర్ణంలో) స్థాపించబడినవి.

ఈ రెండు కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో వెలువడే ‘ప్రతిభ’
అనే వార్షిక పత్రిక విద్యార్థుల్లో దాగిన సాహితీ విలువలకు అద్దం పడుతూ ఉండేది.

భానుమతీ రామకృష్ణ
అటు చలనచిత్ర రంగం, ఇటు సాహితీ రంగం. రెండింటిని సమన్వయ పరచుకున్న తీరు అద్భుతం. నటిగా, గాయనిగా, స్టూడియో అధినేత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా అన్ని పాత్రల్లో ఒ దిగిపోయి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. శ్రోతలను మురిపించి, మరిపించిన కంఠస్వరం ఆమె వరం. హాస్యంతో కూడిన రచనలు, చక్కని వాగ్దాటితో కట్టిపడేసే ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణలు. ఆత్మవిశ్వాసం పాలు ఒకింత ఎక్కువై గర్విష్టి(కొంతమంది దృష్టిలో)గా ముద్రపడినా, వారిలోని భక్తి తత్పరత, స్నేహశీలతల కారణంగా అందరి మనసుల్ని చూరగొనేవారు.
తమిళనాడులోని సంగీత కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా సేవలందించారు. వీణ వా ద్యంలోనూ ప్రావీణ్యం గడించారు. వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడాన్ని బాగా ఇష్టపడేవారు. తమిళం పై పట్టు సాధించినప్పటికీ,తెలుగు భాషపై ఉన్న అభిమానంతో అచ్చమైన తెలుగులో మాట్లాడేవారు. తప్పనిసరైతే తప్ప సంభాషణల్లో ఆంగ్ల పదాలను వాడేవారు కాదు.
ప్రతీ వాక్యంలో హాస్యాన్ని గుప్పిస్తూ, సులభ శైలిలో రచించిన ‘అత్తగారి కథలు’ అనే రచన పేరు ప్రఖ్యాతల్ని మాత్రమే కాకుండా, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. వ్యక్తిగత జీవితంలోని పార్శ్వాలను, చలనచిత్ర ప్రస్థానాన్ని ఉటంకిస్తూ వ్రాసిన ‘నాలో నేను ‘ అనే స్వీయ రచన 1994లో జాతీయ బహుమతిని అందించింది.
చలనచిత్రాలకు దర్శకత్వం వహించడం వారిలోని ఆత్మవిశ్వాసానికి, సాహసానికి ప్రతీకగా పరిగణించవచ్చు. ప్రతీ చిత్రంలోను ఒక త్యాగరాయ కీర్తన, ఒక జావళి ఉండటాన్ని ఇష్టపడేవారు. చలన చిత్రాల్లో స్త్రీకి సముచిత స్థానం కల్పించేవారు.
1953లో నిర్మించిన ‘చండీరాణి ‘తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన తొలి తెలుగు మహిళా దర్శకురాలి చలనచిత్రంగా రికార్డుల కెక్కింది.
తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ ఐన వీరిని1996లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్ వరించింది.

ఇల్లిందుల సరస్వతి
ప్రముఖ తెలుగు కథా రచయిత్రిగా వాసికెక్కిన వీరు స్వయంకృషితో హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు సాధించి, జర్నలిజంలో డిప్లమా పొందారు. 250 కథలు, 5 నవలలు,5 వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, రేడియో నాటకాలు రచించారు. వివిధ భాషల్లోంచి అనువాదాలు చేసి, కథాసంకలనాలు వెలువరించారు. బాల సాహిత్యంలో రచనలు చేసి, చక్కటి గుర్తింపును పొందారు.
ముత్యాల మనసు, కల్యాణ కల్పవల్లి, మనం – మన ఆహారం (అనువాదం), రాజహంసలు స్వర్ణకమలాలు, భారతనారి – నాడూ నేడూ వంటి విశిష్ట రచనలు చేశారు.
1934లో హైదరాబాద్ మహానగరంలో ఎల్లాప్రగడ సీతాకుమారి గారితో కలిసి ‘ఆంధ్ర యువతి మండలి’ని స్థాపించి, దానికి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకుగాను మూడు సంవత్సరాల పాటు జైలు విజిటర్ గా సేవలందించారు. కేంద్ర రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రిగా రికార్డుల కెక్కారు. ‘స్వర్ణకమలాలు’ కథా సంకలనానికిగాను 1982లో ఈ అవార్డు వీరిని వరించింది.
1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి నలంకరించారు.

తురగా జానకీరాణి
ప్రముఖ తెలుగు రచయిత్రి, సంఘ సేవకురాలైన వీరు 1975 లో ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినది మొదలు పలు సవాళ్లు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో అలుపెరుగని పోరు సలిపారు. వీరు ఉద్యోగంలో చేరే నాటికి దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నది. ఆ గడ్డుకాలంలో ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను ప్రజలకు చేరవేయడాన్ని, వారిని చైతన్య పరచడాన్ని సవాలుగా స్వీకరించారు. వారిలోని అంకితభావం, నిబద్దతలపై స్పష్టమైన అవగాహన ఉన్న పై అధికారులు, వారి నిర్ణయాలను ఆమోదించి, వాటిని అమలు పరిచే విధానంలో పూర్తి స్వేచ్చ నిచ్చేవారు. ప్రణాళిక, నిర్వహణ, ప్రదర్శన అనే ఈ మూడు అంశాలు దృఢంగా ఉంటే ఏ కార్యక్రమంలోనైనా చక్కగా రాణించవచ్చని చెబుతారు.
100 పైగా కథలు (3 సంపుటాలు),3 నవలలు, 5 బాల సాహిత్య గ్రంథాలు, 3 అనువాద రచనలు చేశారు. రేడియో పాటలు, నాటికలు, రూపకాలు రచించి, వాటిని పిల్లలతో ప్రదర్శింపజేసి, రేడియో అక్కయ్యగా అందరి ప్రేమను చూరగొన్నారు. సభా ప్రసంగాలు, సాధారణంగా మైక్ పట్ల ఉండే జంకును పోగొట్టి, చక్కని వక్తలుగా మలచడానికి ‘బాలానందం’కార్యక్రమాన్ని బలమైన వేదికగా ఎంచుకున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలోనే వీరిలోని సంఘసంస్కర్త మేల్కొన్నారు. బాలల హక్కులు, బాలల సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. UNICEF, NCRT, బాల జాగృతి (బాజా), ప్రభుత్వ శాఖల సమన్వయంతో 670 వీథి ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఇది నా సమస్య’ అనే స్త్రీల కార్యక్రమాన్ని, వృద్ధులకు సంబంధించి ‘స్రవంతి’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వాటి ద్వారా వారి సాదకబాధకాలను తెలుసుకుని, పరిష్కరించేవారు. పంచాయితీలలోని మహిళలను సంఘటిత పరిచి, ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ద్వారా వారికి విద్యనందించడమే గా కుండా, వారిలోనే రచనా శక్తిని జాగృత పరిచేవారు.’మా చేతి పంపు – మా బిందె నింపు’ అనే సామాజిక అవగాహనా కార్యక్రమానికి చక్కని స్పందన లభించింది.
వీరి వెలలేని సేవలకు గాను గృహలక్ష్మి స్వర్ణ కంకణం, బాల సాహిత్య రత్న, బాలబంధు, ఈనాడు, ఆంధ్ర సారస్వత పరిషత్ లో పరిణిత వాణి, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (2 సార్లు), రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వరించాయి. 1994లో IBPS సహాయ దర్శకురాలి (అసిస్టెంట్ డైరెక్టర్) గా పదవీ విరమణ చేశారు.

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు
రచయిత్రిగా, పండితురాలిగా, పరిశోధకురాలిగా, ఉపన్యాసకురాలిగా ప్రఖ్యాతి గాంచిన వీరు, కృష్ణకుమారి అనే పేరుతో ‘భారతి ‘ మాస పత్రికలో రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. వ్యాసం, గేయం, వచన కవిత, ఖండకావ్యం, చారిత్రక పరిశోధన వంటి పలు ప్రక్రియల్లో పాండిత్యం గడించారు. 10 సంవత్సరాల వయసులోనే వేదికలెక్కి ఉపన్యసిస్తూ, ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను ప్రేరేపించేవారు. 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి కవిత్వం, నృత్యం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటి కళల్లో నైపుణ్యం సంపాదించారు. విజయవాడ, మద్రాసు రేడియో కేంద్రాలలో వీరి రచనలు, ప్రసంగాలు తరచుగా ప్రసారమవుతూ ఉండేది. 18 వ. ఏట ‘ఉభయ భాషా ప్రవీణ ‘పట్టా పొందారు.
కోరల మధ్యన కోటి స్వర్గాలు, లజ్జ కిరీట ధారిణి, చీకటిరాజ్యం, దేవి స్తవతారావళి, మన సాహితి – మధుర భారతి, కనకమ్మ నివాళి, మహిళా విక్రమ సూక్తము, ఆంధ్ర కవయిత్రులు వంటి రచనలు అఖిల భారత కవయిత్రిగా గుర్తింపు నిచ్చాయి. చంద్రమతి కథ, యుగళ సిరి అనేవి వీరి అముద్రిత రచనలు. వాగ్గేయకారులు, పదాలు, జావళీలు,తత్వాలు, సంకీర్తనలపై సునిశిత పరిశీలనాశక్తితో ‘ఆంధ్ర కీర్తన వాంగ్మయ సేవ ‘ అనే గ్రంథాన్ని రచించారు. ఆకాశవాణిలో లలిత, భక్తి గీతాల ప్రసారంలో గణనీయమైన పాత్ర పోషించారు. 1968లో ‘కథామందారం ‘ అనే సంకలనాన్ని ప్రచురించారు. తెలుగు మొలక, విద్వత్కవయిత్రి, ఆంధ్ర విదుషీ కుమారి, ఆంధ్రసరస్వతి, కవయిత్రీతిలక, సాహితీరుద్రమ, కళాప్రపూర్ణ వంటి పలు బిరుదులను పొందారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణం అవార్డు పొందారు. కనకాభిషేకం, పౌర సన్మానం, గజారోహణం వంటి ఘన సన్మానాలు పొందిన ఆధునిక తెలుగు కవయిత్రిగా వాసికెక్కారు.

తెన్నేటి హేమలతగారు
రెండు పదులు కూడా నిండని వయసులోనే రచనకు శ్రీకారం చుట్టిన జానకి రమాకృష్ణవేణి వివాహానంతరం తెన్నేటి హేమలతగా పేరు మార్చుకుని పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.5 వ. తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చదివినప్పటికీ, జిజ్ఞాస కారణంగా తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషలపై పట్టు సాధించారు.70,80 దశకాల్లో వీరి రచనలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
1955లో విజయవాడ ఆకాశవాణి కేంద్ర అనౌన్సర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వీరు, పలు రేడియో నాటకాలు, సినిమాల్లో నటించి, మాటలు వ్రాయడం మొదలుపెట్టారు. ‘శిలా హృదయం’పేరుతో వీరు రచించిన మొదటి రేడియో నాటకం 1952లో డక్కన్ రేడియోలో ప్రసారమైంది. సంగీతాన్ని అమితంగా ఆరాధించే వీరు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిపై ఉన్న అభిమానంతో వారు స్వరపరచిన కొన్ని రాగాలకు చక్కని సాహిత్యాన్ని అందించారు.
100 కథలు,105 నవలలు, 700 రేడియో నాటకాలు, 10 రంగస్థల నాటకాలు,5 సాహిత్య వ్యాసంపుటాలు, 2 సాహిత్య విమర్శనా సంపుటాలు, ‘లత వ్యాసాలు’ పేరుతో సంపుటి, ‘చరిత్ర కందని ప్రేమ కథలు’ అనే కవితా సంపుటుల వెలువరించారు.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన ‘రామాయణ విషవృక్షం’ నవలను విమర్శిస్తూ ‘రామాయణ విషవృక్ష ఖండన’ రచించారు. హైదరాబాద్ 6 వ. నిజాం నవాబైన మీర్మఖ్బూల్ అలీఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ప్రియతముడు ‘ అనే నవలను రచించారు. పాంచాలి,ఎడారి పువ్వులు, మహానగరంలో స్త్రీ, రక్తపంకం, మోహనవంశీ, గాలి పడగలు – నీటి బుడగలు, అంతరంగ చిత్రం వంటి రచనలు చేశారు. ‘గాలి పడగలు – నీటి బుడగలు’ నవలలో వేశ్యల దుర్భర జీవితాలను చిత్రీకరించడంతో పలు విమర్శలు ఎదురైనప్పటికీ, ఏమాత్రం జడవకుండా ‘రక్తపంకం’ లో వారి దైన్యాన్ని మరింత లోతుగా అక్షరబద్ధం చేశారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించాననీ, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సందర్భాలు లేకపోలేదని చెబుతారు. మోహనవంశీ, అంతరంగ చిత్రం నవలల్లో వీరికి జీవితానికి సంబంధించిన పలు విషయాలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఘట్టి ఆంజనేయ శర్మగారు ‘సాహితీలత’ అనే పేరుతో వీరి జీవిత చరిత్రను వ్రాశారు.
1963 లో గృహలక్ష్మి స్వర్ణకంకణం, 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలక్షణ మహిళా పురస్కారం వీరిని వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 20 సంవత్సరాల పాటు వీరు తమ విశిష్ట సేవలను అందించారు.
సామాజిక చైతన్యానికి ఆయువుపట్టైన రచనా వ్యాసంగాన్ని కొనసాగించే కవులు, రచయితలు అప్పుడూ,ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటారు. వారు తమ రచనల ద్వారా గొప్ప కార్యక్రమాలకు పునాదులు వేయకపోయినా, దృఢమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టక పోయినా పరవాలేదు. ఎక్కడో, ఏ మారుమూలో ఒక నిస్సహాయుడి కంటి వెలుగై, ఒక నిరుపేద ఇంట చిరుదీపం వెలిగించ గలిగితే చాలు. ఆ రచన సార్థకం. ఆ రచయిత జన్మ ధన్యం.

You may also like

Leave a Comment