Home ఇంద్రధనుస్సు సుయజ్ఞోపాఖ్యానము

సుయజ్ఞోపాఖ్యానము

by Devaraju Revathi

వేదాలను విభాగం చేసి పంచమ వేదంగా మహాభారతం వ్రాసినప్పటికీ అసంతృప్తి తో వేదన చెందుతాడు బాదరాయణుడు. కారణమేమిటో విచారించిన నారద మహర్షి భగవన్నామ సంకీర్తన లేని కావ్యం అంతగా సంతృప్తి కలిగించిందని చెప్పి పురాణ రచనకు ప్రోత్సహిస్తాడు. అందులో తొలి పురాణంగా వ్యాసుడు వ్రాసింది భాగవత పురాణమే.దానిలో భక్తి,గమ్యం,వైరాగ్యం,తత్త్వం,ముక్తి ఐదు అంశాలను సమపాళ్ళలో నింపి ఇతిహాసాల స్థాయితో తీర్చిదిద్దాడు.విష్ణుమూర్తి తో మూడుజన్మల వైరం కోరుకున్న హిరణ్యాక్షుడిని యజ్ఞావరాహస్వామి అవతారంలో కేశవుడు
సంహరిస్తాడు అసందర్భంగా అంత్యక్రియలు చేయటానికి పూనుకున్న హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన తల్లి దితికి జీవితము కర్మఫలాల గురించి వివరించిన అంశాలలో సప్తమ స్కంధములో సుయజ్ఞోపాఖ్యానం చేర్చాడు.

సుయజ్ఞుడు ఉశీ నగరానికి రాజు.తెలివిగలవాడు,యుద్ధ విద్యలలో నైపుణ్యం గలవాడు.కీర్తి ప్రతిష్టలు కలవాడు.రాజులకు యుద్ధాలు,గెలుపు ఓటములు సహజములు.ఎన్నో సంగ్రామాలలో విజయం సాధించినప్పటికీ ఒక బలహీన క్షణాన యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.దేహము తునాతునకలై పోతుంది.రత్నకిరీటం ముక్కలౌతుంది.ఆభరణాలు అక్కడక్కడా పడిపోతాయి.కనుగడ్లు పైకి వస్తాయి.చెవులు తెగిపోతాయి.పెదవులు రక్తసిక్తమైపోతాయి.అందమైన ముఖం అనామకమై చిన్నాభిన్నమై వికారమై భయంకరమై చూడలేకుండా పోతుంది.ఈవిషయం తెలిసి భార్యలు చెప్పలేనంతగా ఏడుస్తుంటారు.వాళ్ళ విలాపానికి బండలు కూడా కరుగుతాయా అనిపిస్తుంది.అతడు బ్రతికిన కాలంలో చేసిన మంచి పనులను వేనోళ్ళ పొగుడుతుంటారు.రాజ్యంలోని ప్రజలు దురదృష్టవంతులని మంచి మహారాజును కోల్పోయారని సానుభూతి వచనాలు వినపడుతాయి.
ఇదంతా గమనించి
యమధర్మరాజు చిన్నపిల్లవాని రూపంలో వచ్చి ఆత్మజ్ఞానం బోధించి
వైరాగ్యం వల్ల కలిగే ఆత్మ శాంతిని వివరించటమే ఈ కథలో ముఖ్యవిషయం.

కథగురించి విచారిస్తే హిరణ్యకశిపుడి ద్వార తల్లి దితికి పదహారు శ్లోకాలలో
ఆత్మజ్ఞానం బోధిస్తూ యమధర్మరాజు నోట
ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్భౌతిక మీయతే గృహమ్ యథౌదకైఃపార్థివ తైజసైర్జనః కాలేనజాతో వికృతో వినశ్యతి
అంటూ ఇరవై మూడు శ్లోకాలో శరీరానికి ఆత్మకు మధ్య ఉండే సంబంధాన్ని వేదవ్యాసమహర్షి సంస్కృత మహాభాగవతం లో వివరిస్తారు.ఇదే అంశాన్ని తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు

నీరాగారనివిష్టపాంథులక్రియన్ అంటూ నలభై పద్యాల్లో సుయజ్ఞోపాఖ్యానంలో ఆత్మజ్ఞానం వివరించారు.దీనిలో తొలుత హిరణ్యకశిపుడు తల్లి దితికి , తర్వాత బాలుని రూపంలో యమధర్మరాజు సుయజ్ఞుని భార్యలకు చెప్పిన పరోక్ష కథనాలద్వారా ఆత్మజ్ఞానం వివరణ కన్పిస్తుంది.

హిరణ్యకశిపుడు తల్లి దితితో
అమ్మా!బాటసారులు దారిలో స్నేహం చేసి గమ్యం చేరగానే విడిపోతారు.జీవిత గమనమంతే.కర్మానుసారంగా పుట్టుక,మరణంతో కాయం మాయమవుతుంది.కాని ఆత్మ
వాసాంసిజీర్ణాని యథావిహాయ అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు తనువు వీడి మరో ఉపాధి లో ప్రవేశిస్తుంది.ఆత్మకు మరణంలేదు.శరీరములో ఉన్నంత వరకే సుఖదుఃఖాలు పొందుతుంది.నీరు కదలికలో మన ప్రతిబింబం తిరిగినట్లనిపిస్తుంది.కాని తిరుగదు.అట్లే విషయ వాసనల వలన తిరిగినదని భ్రమిస్తాము అదే ఆత్మ జ్ఞానం అంటు సుయజ్ఞునికథ చెబుతాడు.
సుయజ్ఞుని భార్యలు పరివారం ఏడుస్తున్న వేళ
దండధరుడు బాలుని రూపములో వస్తాడు.
చచ్చిన వాని కేడ్చెదరు చావున కొల్లక డాగ వచ్చునే యెచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్ అంటూ జననము,మరణము రాగ బంధాల నుండి విముక్తుడై మోక్షమార్గం మునకు తరలిపోయే ఆత్మ గురించి ఓపికతో వివరిస్తాడు.
సీసము పాంచ భౌతికమైన భవనంబు దేహంబు పురుషుడు దీనిలో బూర్వ కర్మ వశమున నొక వేళ వర్తించు దీపించు దఱియైన నొకవేళ దలగి పోవు జెడెనేని దేహంబు సెడుగాని పురుషుండు సెడ డాతనికినిం సేటు లేదు పురుషునికిని దేహ పుంజమునకు వేఱుగాని యేకత్వంబు గానరాదు ఆటవెలది దారువుల వెలుంగు దహనుని కైవడి గాయముల చరించు గాలి భంగి నాళలీనమైన నభము చాడ్పున వేఱు తెలియ వలయు దేహి దేహములకు ( పోతన భాగవతం సప్తమ స్కంధం 51 వ పద్యం)
అంటూ శరీరానికి ఆత్మకు దోస పండుకు తీగకు ఉన్నటువంటి బంధంగా విశ్లేషిస్తారు.తల్లిగర్భములోనున్నపుడు కాపాడింది భగవంతుడే.వాడేజీవులన్నింటినీ కాపాడుతాడు.తనలీల కొరకే సృష్టి,స్థితి,లయము చేస్తాడు‌.ఇది అతని బొమ్మలాట.కర్మ వలన జనన మరణములు కలుగును.ఆత్మకు అంటవు.దేహము,మట్టి,నీరు,తేజస్సు అనేవి పరిణామక్రమము.ఆత్మకు ఆకార వికారములు లేవు.ఆత్మ శరీరము వేరు.సుయజ్ఞుని కళేబరము మీ ముందరే ఉన్నది.అందులో ఉండాల్సిన వాడు లేడు.ఇంకా ఏడ్చు టేల?దేహము లోని ఇంద్రియా లన్నిటికి ప్రాణమే హేతువు.అది ఉంటేనే మాట్లాడుట,వినుట,కనుట.ప్రాణమే లేనిది ఇవేవీ సాధ్యము కాదు.ఆత్మ సర్వవ్యాపకము.ఆత్మశరీరమును త్యజించి పోతుంది.మాయా మోహములకు కష్ట నష్టములకు కర్మ బంధములే కారణము.అందుకే అశాశ్వతమైన శరీరము కొరకు ఏడ్చుట అజ్ఞానము. అంటూ యమ ధర్మరాజొక కథ చెబుతాడు.
ఒక అడవిలో బోయ వాడొకడు పక్షులకు యముని లాంటి వాడు.పిట్టల జంటకు ఎరపెట్టి వల పన్నుతాడు.ఆడపిట్ట వలలో చిక్కుకుంటుంది. దాన్ని విడిపించే శక్తి లేక మగపక్షి విలవిలలాడుతుంది.
పసి కూనలైన పిల్లల రక్షణ బాధ్యత తనకు గుర్తు వస్తుంది. ఈ విచారంలో జాగరుకత కోల్పోయిన మగపిట్టను బోయవాడు బాణంతో చంపుతాడు.భార్య గురించి విచారిస్తూ తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు.అందువల్ల సుయజ్ఞుని గురించి మీరెన్నేళ్ళు ఏడ్చినా తిరిగిరాడని బాలుడైన యముడు సముదాయించటంతో భార్యలు,పిల్లలు జ్ఞానులై సుయజ్ఞునికి కర్మకాండలు జరిపిస్తారు.గతంలో జరిగిన ఈ కథ తన కొడుకు హిరణ్యకశిపుని ద్వారా విన్న దితి,హిరణ్యాక్షుని భార్యలకు ఆత్మజ్ఞానం కలుగుతుంది.దుఃఖము నియంత్రించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.అందుకోసమే జ్ఞానంతో ఉన్నప్పుడే మానవత్వంతో జీవరాశికి సేవ,హరినామ స్మరణతో మోక్ష మార్గములో పయనించాలని మహా భాగవతములోని సుయజ్ఞోపాఖ్యానం లోకానికి మార్గదర్శనం చేస్తున్నది.

ఉపయుక్తగ్రంథసూచి:
1.వేదవ్యాసమహర్షి రచించిన శ్రీ మహాభాగవతం( సంస్కృతం-తెలుగులిపీ)గీతం ప్రెస్ గోరఖ్ పూర్ వారి ప్రచురణ
2.శ్రీమదాంధ్రమహాభాగవతము( బమ్మెరపోతనామాత్యప్రణీతము)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
3.డాక్టర్ దాశరథి రంగాచార్య రచన
భాగవతవ్యాఖ్యానం
1977ముద్రణ

You may also like

Leave a Comment