భావకవిత్వంపైన తిరుగుబాటుగా వచ్చినదే అభ్యుదయ కవిత్వం. ఈ సమాజంలో అసమానతలు ఉన్నవాళ్లు లేనివాళ్ళు ధనవంతులు సామాన్య ప్రజలు యజమానులు శ్రామికులు లాంటి భేదాలు సమసిపోయి అంతా ఒకటిగా కలసిమెలసి జీవించడమే అభ్యుదయం.
సామాన్య మానవుడిని సాహిత్యానికి మకుటధారిగా మలిచింది అభ్యుదయ కవిత్వం.శ్రీ శ్రీ,ఆరుద్ర,అనిశెట్టి, దాశరథి,సోమసుందర్, కాళోజీ మొదలైన కవులు అభ్యుదయ కవులుగా గుర్తింపు పొందారు. శ్రీ శ్రీ మహాప్రస్థానం, ఆరుద్ర త్వమేవాహమ్,సోమసుందర్ వజ్రాయుధం,అనిశెట్టి అగ్నివీణ, దాశరథి అగ్ని ధార, కాళోజీ నాగొడవ కావ్యాలు అభ్యుదయ కావ్యాలుగా ప్రజాదరణ పొందాయి.
గత జులై నెలలో శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న మహాకవి దాశరథి రచించిన తొలి కావ్యం “అగ్ని ధార”ను ప్రచురించిన సంస్థ సాహితీ మేఖల. నల్లగొండ జిల్లాలోని చండూరు లో ఈ సంస్థను కవి రత్న అంబటి పూడి వెంకట రత్నం శాస్త్రి 1934 లో స్థాపించారు. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం తెలుగు భాషా వికాసం కోసం 92 యేళ్లుగా కృషి చేస్తున్న ఈ సంస్ధ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు 150 కి పైగా పుస్తకాలు వెలువరించి తెలుగు జాతికి వెలుగు బాటగా నిలిచింది. అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త, భారత్ భాషాభూషణ్ డాక్టర్ తిరునగరి రచించిన “వానా-వాడు” కవితా సంపుటిని కూడా సాహితీ మేఖల సంస్ధ ప్రచురించడం గమనార్హం.
ఆలేరు ప్రాంతంలో మొదటగా వినిపించే కవి పేరు డాక్టర్ తిరునగరి… వారి తర్వాతే ఇంకెవరైనా. అభ్యుదయ భావాలు, మానవతావాదం కలిగిన ఈ కవి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయస్థాయిలో తమ విశిష్ట రచనలతో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. డాక్టర్ తిరునగరి పూర్తి పేరు తిరునగరి రామానుజయ్య. ‘తిరునగరి’ అన్న ఇంటిపేరుతోనే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అసంఖ్యాక రచనలు చేసి తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులయ్యారు. 30కి పైగా డాక్టర్ తిరునగరి రచనలు పుస్తకాలుగా ముద్రితమై పాఠకుల ఆదరణను పొందాయి. వచనం, పద్యం, గేయం, వ్యాసం, విమర్శ, పాట వంటి ప్రక్రియలో ఆయన అనేక రచనలు చేశారు. డాక్టర్ తిరునగరి సాహిత్యం పై ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పి.హెచ్.డి, ఎం ఫీల్ పరిశోధనలు కూడా జరిగాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటమండలంలోనిబేగంపేట గ్రామానికి చెందిన మనోహర స్వామి,జానకిరామక్క దంపతులకు 1945 సెప్టెంబర్ 24 వ తేదీన జన్మించారు. అధ్యాపక వృత్తి నుండి రిటైర్ అయి 2021 ఏప్రిల్ 25 న పరమపదించారు. తిరునగరి రచనల్లో శృంగార నాయికలు (ఖండ కావ్యం), బాలవీర ( శతకం), కొవ్వొత్తి, అక్షరధార, వసంతం కోసం, ఆహుతి, కాలహేల,తిరునగరీయం, తల్లి పేగు మొదలైన 30 కి మించి రచనలు చేశారు. కవితలే కాకుండా గేయాలు, పద్యాలు, సమీక్షలు,సాహితీ విమర్శనా వ్యాసాలు కూడా రాశారు. తిరునగరి రచించిన కవితలు, లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లలో పలుమార్లు ప్రసారం అయ్యాయి. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
వస్తువుకు ప్రాధాన్యతనిచ్చి చేవగల కవితలు రాయడంలో వీరు నేర్పరులు. ఉత్తమ రచనకు ఉపన్యాసానికి కావలసిన భాషా పరిజ్ఞానాన్ని సంపాదించిన ప్రఖ్యాత కవి. తిరునగరి కవిత్వమే శ్వాసగా ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాహిత్య సృజన చేసి ప్రాచ్య,పాశ్చాత్య కవిత్వ సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న గొప్ప సాహితీ వేత్త. తన రచనల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచి తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మహాకవి డాక్టర్ దాశరధితో ప్రత్యక్ష సాన్నిహిత్యం కలిగిన ఆయనతో కలిసి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్న కవి తిరునగరి. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన దాశరథి పురస్కారాన్ని 2020లో డాక్టర్ తిరునగరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అందుకున్నారు. అభ్యుదయ కవిత్వోద్యమంలో చురుకుగా పాల్గొన్న తిరునగరి గ్రామీణుల మనస్తత్వానికి తన కవితలో నిలువుటద్దం పడతారు. అన్యాయాన్ని దౌర్జన్యాన్ని వర్తమానం నుండి గెంటేసి సమానత్వాన్ని, మానవత్వాన్ని ఈ సమాజం సాధించాలని ఆశిస్తూ అనేక కవితలు రాశారు. డాక్టర్ తిరునగరి తమ “ఆత్మకధ” వృత్తాంతాన్నిలా కవిత్వీకరించారు
‘ఎడారుల్లో సాగిపోతున్నాను
ఒయాసిస్సులనన్వేషిస్తూ
కంటకారణ్యాలలో సాగిపోతున్నాను
పూల దారుల్ని సంభావిస్తూ
దానవత్వంతో పోరాడుతున్నాను
మానవత్వాన్ని ఆహ్వానిస్తూ
నైరాశ్యాల్ని పారద్రోలుతున్నాను
ఆశాగీతాల్నాలాపిస్తూ
కష్టాలను సహిస్తున్నాను
సుఖాల్ని సందేహిస్తూ
అగతానికి స్వాగతం పలుకుతున్నాను
అవనికి కళ్యాణాన్ని కాంక్షిస్తూ
కాలంతో ప్రయాణిస్తున్నాను
వసంతం కోసం నిరీక్షిస్తూ
ఎడారుల్లో సాగిపోతున్నాను
ఒయాసిస్సులనన్వేషిస్తూ’
పద్యం,గద్యం,వచనం వంటి ఈ మూడు ప్రక్రియల్లో డాక్టర్ తిరునగరి తన సాహిత్య సృజనను చాటుకున్నారు. ‘నా కలంలో బలం ఉన్నన్నాళ్ళు కవితలు రాస్తుంటాను’అని మహాకవి దాశరథి అన్నట్లు చివరి క్షణం వరకు తిరునగరి కవిత్వమే ప్రాణంగా బతికారు. ‘రైతుదే తెలంగాణము’, అని దాశరథి అగ్నిధార లో అన్నట్లు తిరునగరి తన ‘వానా-,వాడు’ లో రైతు గురించి బాగా చెప్తారు.స్వాతంత్ర్యం వచ్చి నేడు 78 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు రైతన్న బతుకుతున్నాడని “వాడు వాడే” కవితలో అన్నదాతల కష్టాలను ఏకరువు పెట్టారు.
‘పారిశ్రామిక విప్లవాలు వచ్చినా, ప్రపంచీకరణ జరిగినా వాడు వాడే, పేదవాడుగా పిచ్చివాడుగా ఏమీలేని వాడుగా, ఎముకల గూడుగా వాడు వాడే,వాడి పేరు రైతే ‘అంటూ వాపోయారు.
‘వాన కురిసింది మొదలు
వాడి చేను పచ్చగా నవ్వుతుంది
వాన వాడి ప్రాణం
వాన వాడి జీవితం
వాన వాడి స్వప్నం
వానే లేకుంటే వాడే లేడు’అంటూ వానకు రైతన్నకున్న అనుబంధాన్ని “వానా-వాడు” కవితలో చక్కగా ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన అభ్యుదయ మానవతా కవితా రవి తిరునగరి.
(సెప్టెంబర్ 24 న డాక్టర్ తిరునగరి జయంతి సందర్భంగా…)

2 comments
https://shorturl.fm/YZ19g
https://shorturl.fm/WrLdf