Home వ్యాసాలు ఒట్టి చాపలులో జీవనచైతన్యం

ఒట్టి చాపలులో జీవనచైతన్యం

by Dr. Kachapuram Durgadevi

కొన్ని దశాబ్దాల క్రితం ప్రజల అభిరుచులను బట్టి నీతి, ప్రేమ, కార్మికులు, సంస్కరణ ఈ విధంగా కథా వస్తువు కాలక్రమం లో మారుతూ ఉండేది. ఇప్పుడు సామాజిక అవసరమే అత్యంత .ఆవశ్యకమైన కథావస్తువుగా మారింది. నేడు దళితుల ఆత్మగౌరవం, చైతన్యం, సంఘటిత పోరాటాలు, తిరుగుబాటు, తిరస్కారాలు కథా వస్తువులై తెలుగు కథా వస్తువు పరిధిని పెంచాయి. 1920 ప్రాంతం నుండి దళితుల జీవితాలను సానుభూతితో చిత్రించిన రచనలు నేడు సహానుభూతిని కలిగి ఉంటున్నాయి.

“ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరి చేయవచ్చుగాని జీవితం తెలియకపోతే సరిచేయడం ఎవరి వల్లా కాదు… శిల్పమూ భాషా రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అయితే అవి కథారచనకు మూల పరికరాలు. ముడి పదార్థం జీవితం” అంటారు కొడవటిగంటి. సాహిత్యకారుల జీవన గవనంలోని ప్రతి సంఘటన సృజన వైపు మళ్లకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలోని తీవ్రత అది కలిగించే ఒత్తిడి కవిగానో రచయితగానో నిలబెడతాయి. “ఒట్టి చాపలు” కథలు పరిశీలించి రాసినవి కావు. డా మండల స్వామి జీవితంలోంచి అనుభవాల నుండి ఆవిష్కృతమైనవే అని అనిపిస్తుంది. రచయిత వృత్తిపరంగా ఉపాధ్యాయులు వారి జీవన నేపథ్యానికి అనుగుణంగా ఈ సంపుటిలో కొన్ని విద్యాపరమైన పాఠశాలలకు సంబంధించిన కథలు ఉన్నాయి ఈ వైవిధ్యంలోనూ కథల ఇతివృత్తాలు పాత్రలు ఎక్కువగా దళిత జీవితాన్ని, చైతన్యాన్ని చిత్రించినవే కావడం వల్ల “ఒట్టి చాపలు” ను దళితవాద కథా సంపుటి గానే గుర్తించాలి.

ప్రభుత్వ ఉపాధ్యాయుడయినా కులం కారణంగా కిరాయికి ఇల్లు దొరకని పరిస్థితిని చిత్రించిన కథ “ఇల్లు దొరికింది”. “చేతిలో చేయి కలిపిన వెంకటయ్య జై భీములు అనడంతో శీనులో కొత్త ఆలోచన మొదలైంది” అనడంలో రచయిత దళిత సంఘటిత చైతన్య ఆవశ్యకతను స్పష్టం చేసినారు. వెంకటయ్య పాత్ర చేత “ఈ వ్యవస్థ పట్ల, ఈ వ్యవస్థ అందిస్తున్న అవమానాల బహుమతుల పట్ల మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది” అని అనిపిస్తారు. ప్రధాన పాత్ర కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకుంటున్న కొద్ది పాఠకుడు దళితులు పొందుతున్న సామాజిక గౌరవం ఇదేనా అన్న ఘాటు ప్రశ్నను ఎదుర్కొంటాడు.

“సదువుకున్న తెలివి” కథలో ఆత్మగౌరవంతో జీవించడానికి ఆర్థిక స్థోమత అవసరమని తెలిపే పాత్ర ముత్తమ్మది. అసహాయతలో చైతన్యం చెదిరిన తల్లికి ధైర్యాన్ని వ్యక్తిత్వాన్ని ఇచ్చే విద్యావంతుడైన కొడుకు పాండు. క్లిష్టమైన పరిస్థితులలో మానవ ప్రవృత్తులు సమయానుసారంగా ఎన్ని రకాలుగా మారుతాయో కూడా ఈ కథ తెలుపుతుంది. ఏళ్లుగా వివక్షచూపుతూ శ్రమదోపిడీ చేస్తున్న పటేలమ్మ “పాండూ! నువ్వు సదువుకున్నవురా! నీకన్నీ తెల్సురా!…. నేను పటేలమ్మను కాదు. ఓ మనిషి లెక్క అడుగుతున్న ఈ ఒక్క సాయం చెయ్యి బిడ్డా! నీకు దండం బెడ్తా” అంటుంది కథ ముగింపులో. ఆమెలో పరివర్తన తీసుకురావడంలో చదువుకున్న పాండు సఫలుడవుతాడు. కరోనా నేపథ్యంలో పాండు చదువుకున్న తెలివితో కరోనా నెగిటివ్ ని పాజిటివ్ అని చెప్పి తల్లిని శ్రమదోపిడి నుండి తప్పించడం కొసమెరుపు.

దళితులలో రూపొందిన చైతన్యాన్ని చిత్రించిన కథ “కాలం మారింది”.
దళితుడైన యాదగిరి జనరల్ సీటులో స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో సర్పంచ్ అయి నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో పూలు పండ్లు పెట్టుకొని తిరిగి వస్తుండగా యాదగిరి బంధువర్గం ప్రయాణిస్తున్న డీసీఎం ప్రమాదానికి గురవుతుంది. ఆ సందర్భంలో “మన మాల మాదిగోల్లంతా మాటిమాటికి దేవునిగుల్యకు పోతుండ్రంట. అందుకనే ఇట్లయిందని అంటున్నదే! ఈల్ల ఇకమతుల మీద మన్నుబొయ్య!”
వంటి సంభాషణలు గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న వర్గ వైషమ్యాలను, ఆధిపత్య ధోరణులను, రచయితకు గల సామాజిక స్పృహను పట్టి చూపిస్తాయి. కొత్త గుడి గర్భాలయంలో యాదగిరి దంపతులు మొదటి కొబ్బరికాయ కొట్టడంతో కథ పూర్తి అవుతుంది. ఉన్నత విద్య మంచి వ్యక్తిత్వం రాజకీయ ప్రాతినిధ్యంతో సామాజిక గౌరవాన్ని సాధించగలమని నిరూపించిన కథ “కాలం మారింది”.

బాల్య వివాహాలు, లింగ వివక్షత, మూఢ నమ్మకాలు, విద్య ప్రాధాన్యత, శాస్త్రీయ దృష్టి కోణపు ఆవిశ్యకత లను చర్చించిన కథ “ఒట్టి చాపలు”. అండాలు కొడుకు శివ ఎం ఫార్మసీ చదివి ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తొమ్మిదవ తరగతి లోనే చదువు ఆపేయించబడిన కూతురు స్వాతి. చదువుకోవాలని నిగూఢవాంఛ, తనకు జరగబోయే బాల్య వివాహం పట్ల వ్యతిరేకతల వల్ల స్వాతి మానసిక అనారోగ్యానికి గురి అవుతుంది. ఆమెను బాగు చేయించడం కొరకు అండాలు ఆశ్రయించిన పద్ధతులు, మూఢనమ్మకాలు వాటిని వ్యతిరేకించిన కొడుకు, చివరగా తల్లి స్వీయ అనుభవంతో మోసాలను గ్రహించడం “ఒట్టి చాపలు” లోని కథాంశం. శాస్త్రీయ దృక్పథం కొరవడిన కారణంగా ఆర్థికంగా కూడా కొందరు చితికి పోవడాన్ని, తరాల మధ్య అంతరాలను నిలువుటద్దంలో చూపిస్తుందీ కథ.

రచయితగా కథనంలో జోక్యం చేసుకోకుండా పాత్రల మాటలతోనే కథలను నడిపింపచేయడం మండల స్వామి గారి సంభాషణాత్మక శైలి. అనవసరమైన పాత్రలు సంఘటనలు సంపుటిలో ఎక్కడా కనబడవు. గారడీ చేసే శిల్పానికి దూరంగా హంగు ఆర్భాటాలు లేని సహజత్వానికి దగ్గరగా ఉన్న కథలు ఇవి. పాత్రల రూపురేఖల వర్ణనలు ఒక్కచోట కూడా లేకపోవడం, మానవ ప్రవృత్తులకు ప్రాధాన్యత నివ్వడం ఆధునికతగా గమనింపులోకి వస్తాయి. విద్య ఆర్థిక స్థితిగతులలో వెనుకబడిన దిగువ మధ్యతరగతి దళిత బహుజన ప్రజలకు ప్రతీక ఈ ఒట్టి చాపలు. నీతిని తెలిపే ఇతివృత్తాలకు ప్రేమగాథలకు ప్రాధాన్యతనివ్వకుండా మనిషి ముఖ్యం, మనిషి బతుకు గౌరవంగా ఉత్సాహంగా సాగటం ముఖ్యం అనే భావాలను స్పష్టంచేసిన కథా సంపుటి ఒట్టి చాపలు.

You may also like

19 comments

Jasmine4272 July 21, 2025 - 1:47 am Reply
Elias2774 July 21, 2025 - 2:03 pm Reply
Kathy2706 July 21, 2025 - 4:28 pm Reply
Dora4715 July 22, 2025 - 1:59 am Reply
Craig2630 July 23, 2025 - 1:05 am Reply
Briley2434 July 23, 2025 - 3:29 am Reply
Emilie1061 July 23, 2025 - 6:28 am Reply
Kylie2303 July 24, 2025 - 12:00 am Reply
Helena2389 July 24, 2025 - 5:08 am Reply
Benjamin759 July 24, 2025 - 5:04 pm Reply
Junior3826 July 25, 2025 - 12:15 am Reply
Dwight4719 July 25, 2025 - 3:26 am Reply
Cleo139 July 25, 2025 - 6:17 pm Reply
Chandler1990 July 25, 2025 - 6:59 pm Reply
Felix1167 July 26, 2025 - 3:06 pm Reply
Anika1306 July 27, 2025 - 7:05 am Reply
Josie510 July 27, 2025 - 7:29 pm Reply
Hamilton4988 July 27, 2025 - 8:36 pm Reply
Preston475 July 27, 2025 - 8:57 pm Reply

Leave a Reply to Felix1167 Cancel Reply