సునీత గంగవరపు బ్రతుకు పుస్తకం కవిత
ప్రముఖ కవయిత్రి,సునీత గంగవరపు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.కవితలు,కథలు,రాస్తున్నారు.వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులతో కూడా అప్పుడప్పుడు కథలు, కవితలు రాయిస్తూ సాహిత్య సృజన పట్ల మెళుకువలు నేర్పిస్తున్నారు.సునీత గంగవరపు కలం నుండి జాలువారిన “బ్రతుకు పుస్తకం’ కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితను ఆసక్తితో చదివాను. నాకు చాలా నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.బ్రతుకు పుస్తకం ఏదైనా పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.పుస్తకాలకి రెక్కలు ఉండవు.కాని వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది.ఆ రెక్కలు జ్ఞానాన్ని,ఆలోచనా శక్తిని,సృజనాత్మకతా నైపుణ్యాన్ని,లోక పరిశీలనా దృష్టిని కలిగిస్తాయి. ఏది మంచి పుస్తకం.ఏ పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.
“బ్రతుకు పుస్తక పుటల నుండి/ఎన్ని అనుభూతుల రంగులో…/ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…!/ అంటున్నారు.బ్రతుకు అంటే జీవితపు కొనసాగింపు. బ్రతుకు అంటే జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.పుట అనగా పుస్తకంలోని కాగితమునకు ఒకవైపు భాగం.పుట అంటే కాగితం, పేజీ,అర్థాలు.అనుభూతి అంటే స్పర్శ చేత తెలుసుకొను,తాకి తెలుసుకొను,అనుభవం ద్వారా తెలుసుకొనడం..
“ఎన్ని అనుభూతుల రంగులో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అనుభూతులు,బాధ, దుఃఖం,ఆలోచన,ఆవేదన,ప్రేమ,అభిమానం, అనుమానం,స్నేహం లాంటి ఎన్నో రంగులు పులుముకుంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకపు పుటల్లో అనుభవాల పరంపర అంటే అనుభవాల అంతరాయం లేని,కొనసాగింపు అని అర్థమవుతుంది.
“కలలతోనే… కన్నీళ్ళతోనే/నిండిన పేజీలు/ అంటున్నారు.బ్రతుకు పుస్తకపు పుటల్లో కలలతో నిండిన పేజీలు ఉంటాయి.కలలను సాకారం చేసుకునేది ఎందరు అంటే ఇదమిద్దంగా చెప్పలేము. కలలు కల్లలు అయిన వాళ్లు కూడా ఉంటారు. బ్రతుకు పుస్తకం పుటల్లో కన్నీళ్ళతో నిండిన పేజీలు ఉంటాయి.కన్నీళ్లు కావాలని ఎవరు కోరుకోరు. తనకు తాను తెలియక ఆగాధంలో కూరుకు పోవడంతో కన్నీళ్లు వస్తాయి.తెలిసి అగాధంలో పడిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. స్వయంకృతాపరాధాలతో చేసిన కొన్ని పనులు, మనిషిని కన్నీళ్ళకు గురిచేస్తాయి. .

“అక్షరాల కందని దుఃఖ సంకేతాలు/అంటున్నారు.
కొన్ని ఉద్విగ్న క్షణాల్లో తెలిసి తెలియక మోసపోయిన అభాగ్యులు కూడా కొందరు ఉంటారు.జీవితంలో అక్షరాల కందని దుఃఖ సంకేతాలు ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు. “పేజీలన్నీ ఒకేలా ఉండవు/అంటున్నారు. నిజమే…బ్రతుకు పుస్తకం చాలా పెద్దది.బ్రతుకు పుస్తకం పుటల్లో ఎన్నో పేజీలు ఉంటాయి.పుస్తకం లోని పేజీలన్నీ ఒకేలా ఉండవు,వేరు వేరుగా ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“వేటికవి సొంత రంగుల్ని పులుముకుంటాయి/ అంటున్నారు.జీవితం భిన్న స్వభావాల పార్శ్వం. బతుకు పుస్తకపు పుటలు సొంతరంగులని అద్దుకుంటాయి అనడంలో వాస్తవం దాగి ఉంది.
“నిగూఢతను ఆర్ద్రంగా పొదువుకుంటాయి/ అంటున్నారు.నిగూఢత అంటే రహస్యం.ఆర్ద్రం అంటే మెత్తదనం.బ్రతుకు పుస్తకం పుటల్లో రహస్యాలు కూడా మెత్తదనంతో దాచుకుంటాయి అని తెలియజేస్తున్నారు.
“కొన్ని పేజీల్లో మెరుపులు ఉంటాయి/అంటున్నారు.
నిజంగానే బ్రతుకు పుస్తకం పేజీల్లో మెరుపులు ఉండి ప్రకాశిస్తుంటాయి.వర్షించే ముందు ఉరుములు, మెరుపులు,గాలి దుమ్ము, దుమారం,వీస్తుంటాయి. మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్ ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం.విద్యుత్తు ఉన్నదని నిరూపించేది.ఇవి ఎక్కువ ఉరుములతో కూడిన వర్షంలో పడే సమయంలో కనిపిస్తాయి.మెరుపులు అత్యంత వేగంగా పయనిస్తాయి.మెరుపు రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వచ్చే ప్రకాశవంతమైన మెరుపు.
“అవి దిగులు మేఘాలను కరిగించి/పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి/అంటున్నారు.జీవితంలో మెరుపులు ఉండాలి.మెరుపులు ఉంటేనే అవి దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి.పారవశ్యము అంటే ఆత్మ ద్వారా ఒకరి శరీరాన్ని స్వాధీనం చేసుకోవడం, దైవత్వం ద్వారా మానవుని స్వాధీనం చేసుకోవడం. మట్టిని గురించి మనం మాట్లాడుతాం.మట్టిని చూడగానే ఏదో పులకరింత,మరేదో పారవశ్యం అంటాం.జీవితంలో సుఖదుఃఖాలు,శీతోష్ణాలు ఉంటాయి.బ్రతుకు పుస్తకం పుటల్లో వాటిని సమం చేసుకుంటేనే దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని చేరుకుంటాయి.
“అక్కడక్కడ సునామీలు ఉంటాయి/రాయక తప్పని చేదు సారాంశాలుంటాయి/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అక్కడక్కడ సునామీలు తుఫానులు కూడా ఉంటాయి.సునామీ తుఫాను 2004 డిసెంబర్ 26 న హిందూ మహాసముద్రం, సుమత్ర, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామి 14 దేశాల్లో సుమారు
2,30,000 మందిని పొట్టన పెట్టుకుంది.అక్కడక్కడ
ఎదిరింప శక్యం కాని కష్టాలు,కడగండ్లు,సునామీలు
ఉంటాయి.రాయకుండా ఉండలేని,ఆత్మీయులకైన చెప్పుకోలేని,చేదైన సంఘటనల వివరాలుంటాయి. జీవితమన్నప్పుడు ఎలాంటి వారికైనా ఇవి అనుభవానికి రాక తప్పదు.
“ఒక్కో చోట/సూర్యకిరణాల ప్రసరణలుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ఒక్కోచోట సూర్యకిరణాల ప్రసరణలు ఉండి జీవితంలో కాంతిని,క్రాంతిని తెస్తాయి అని కవయిత్రి చక్కగా వివరించారు.
“ఆకాశమంత ఆక్రమించిన/నక్షత్రాల సన్నని గుసగుసలు కొన్ని/పుస్తకాన్ని నిండారా పరిమళభరితం చేస్తుంటాయి/అంటున్నారు.
అనంతమైన ఆకాశం నక్షత్రాలతో కూడి ఉంటుంది. బ్రతుకు పుస్తకం పుటల్లో కూడా ఆకాశమంత ఆక్రమించిన నక్షత్రాల గుసగుసలు కొన్ని పుస్తకాన్ని పరిమళభరితం చేస్తుంటాయని తెలియజేస్తున్నారు.
“ఇంకొన్ని పేజీలు ఏమిటో/ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి/అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో కొన్ని పేజీలు రాయకుండా ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి.నిజంగానే…. బ్రతుకులో శూన్యత, స్తబ్దత ఆవరించినప్పుడు ఎవరికి చెప్పుకోలేని ఖాళీతనం మనసును ఆక్రమించుకుంటుంది.
“ఏమి రాసినా…ఎంత రాసినా/కాగితపు గుండెలపై యిమడలేని/నిర్లిప్తతలోంచి దిగాలుగా జారి పోతుంటాయి/అంటున్నారు.
ఏమి రాశాము…, ఎంత రాశాము అన్నది ముఖ్యం కాదు.మన భావోద్వేగాలను పంచుకోవడానికి ఆప్యాయతలు పెన వేసుకోవడానికి తగిన వాతావరణం లేనపుడు జీవితం నిర్లిప్తతలోకి జారిపోతుందని కవయిత్రి సునీత చక్కగా వ్యక్తీకరించారు.
“ప్రేమ స్పర్శ లేని ప్రేమ లేఖలా/అస్పష్టతను అలుముకుని/దిక్కుతోచక దిక్కులు చూస్తుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ప్రేమ తాలూకు స్పర్శ లాంటి అనుభూతి లేని ప్రేమ లేఖల్లో ఏం ఉంటుంది?ప్రేమలేఖల్లో అస్పష్టతతో నిండి ఉంటుంది.అస్పష్టతతో నిండి ఉన్న జీవితాలు గడిపే వారు ఎల్లప్పుడూ నిరాశ నిస్పృహలతో దిక్కుతోచక దిక్కులు చూస్తుంటారు.జీవన యానంలో అనేకమైన అనుభవాలు ఎదురవుతాయి.దుఃఖం కలిగినప్పుడు దాని ఛాయా నలుపు రంగు.సుఖసంతోషాలతో కూడిన పచ్చదనం.అన్యాయం,అత్యాచారం ఎదుర్కొన్నప్పుడు కలిగిన కోపపు ఎరుపు రంగు. అద్భుతమైన విచిత్ర దృశ్యం కనిపిస్తే విరగబడి నవ్విన తెలుపు రంగు.ఈ విధంగా బ్రతుకు పుస్తకం పేజీల నిండా అనుభవాల రంగులు దర్శనమిస్తాయని కవయిత్రి సునీత వివరించడం చక్కగా ఉంది.సునీత కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను..