Home వ్యాసాలు కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

నాంపల్లి సుజాత మచ్చిక…! కవిత
ప్రముఖ కవయిత్రి,నాంపల్లి సుజాత కలం నుండి జాలువారిన హోమ్ మేకర్ కవితా సంపుటిలోని “మచ్చిక…! కవిత పై విశ్లేషణా వ్యాసం.మచ్చిక కవితను ఆసక్తితో చదివాను.నాకు చాలా నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.కుక్కను విశ్వాసం గల జంతువు అంటారు.పల్లెల్లో ప్రతి ఇంట కుక్క ఉంటుంది.ఊర కుక్క పిల్లలు పెడితే ప్రేమగా చూడడం తెచ్చి పెంచుకునే సంస్కారం,ఆనాటి పల్లె వాసుల్లో ఉండేది.ఇప్పుడు ఆ సంస్కారం తగ్గిందేమో అనిపిస్తుంది.పల్లెలోని జనాలు వాళ్ళు అన్నం తినేటప్పుడు ఓ ముద్ద కుక్కకు పెడతారు.కుక్కను కాలభైరవుడు,పరమేశ్వరునిగా భావిస్తారు.కాలం మారింది.ఇప్పుడు పట్టణాల్లో ప్రతి ఇంట తమ రక్షణ కోసం కుక్కను పెంచుతున్నారు.కుక్కను గొలుసు పెట్టి కట్టి ఉంచుతారు.కుక్కలు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఎవ్వరైనా భయపడతారు.ఇంటి ముందు గేట్ పైన కుక్క ఉంది జాగ్రత్త,బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డ్ తగిలిస్తారు.కుక్క ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రక్షణ కల్పిస్తుంది అని మనం చెప్ప వచ్చు. పోలీసులు దొంగలను,నేరస్థులను పట్టుకోవడానికి నేరం జరిగిన ప్రదేశానికి శునకంను తీసుకెళ్ళి వదులుతారు.శునకం వాసన చూసి నేరస్థులను పట్టగలదని నమ్మకం ఉంది.పోలీసులు రాత్రివేళలో నగరమంతా తిరుగుతూ పహారా కాయాలి. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పహారా కాస్తూ ఆ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది.మారిన పరిస్థతులు పోలీసులు పహారా కాయడం లేదు.మనం విచారించాల్సిన విషయం.ఊర కుక్కలు రాత్రంతా మేల్కొని నగరంలో తిరుగుతూ వాడ వాడ తిరుగుతూ పహారా కాస్తూ నిర్విరామ సేవలు అందిస్తున్నాయి. కుక్కలు ఏ చిన్న అలికిడి అయిన బౌ బౌ మని మొరుగుతాయి.కుక్కల అరుపులకు దొంగలు పారి పోవాల్సిందే.నేరస్థుల పాలిట సింహా స్వప్నంలా కుక్క నిలుస్తుంది.అలాంటి కుక్కపై మచ్చిక పేరుతో చక్కని కవితను సుజాత మనకు అందించారు.ప్రతి ఒక్కరు ఆ మచ్చిక ఏమిటో దాని మతలబు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది.
“ఓ నాలుగు మిగిలిన/మెతుకులను విదిల్చి/ఇక నీ ప్రపంచమంతా/నా చెంతేనని శాసించడమే మచ్చిక…!/అని అంటున్నారు.కవయిత్రి సుజాత భావనలో ఎంతో నిజాయితీ ఉంది. ఇవ్వాళ లోకంలో కుక్కలు పెంచుతున్న తీరును నాలుగు వాక్యాల్లో భావగర్భితంగా తెలియ జేశారు.ఇక నీ ప్రపంచమంతా నా చెంతేనని శాసించడమే మచ్చిక అనే పదానికి అర్థం మరియు మచ్చిక లోని రహస్యాన్ని లోకానికి వెల్లడించారు.

“ఆది మానవుడి స్వార్థపూరిత పుర్రె లోంచి/ పుట్టుకొచ్చిన వ్యూహాత్మక కుట్రే అది…!/అనే దానిలో వాస్తవం దాగి ఉంది.ఆది మానవుడు తాను మనుగడ సాగించడానికి కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నాడు.అందులో కుక్క కూడా ఉంది.ఆది మానవుడు తన రక్షణ కోసం,తన బాగు కోసమే కుక్కను చేరదీశాడు.మచ్చిక చేసుకున్నాడు.ఆది మానవుడు అడవుల్లో తిరుగుతుంటే ఎన్నో క్రూర మృగాల నుండి రక్షణ కోసం కుక్కను పెంచుకున్నాడు.ఆది మానవుడు సంచార జీవితం గడిపే వాడు.ఆది మానవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కుక్కలు కూడా వెళ్ళేవి.ఆది మానవుడికి కుక్కలు తోడుగా ఉండి కాపాడాయి అని మనం చిన్నతనంలో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.
“బొచ్చు కుక్కకి అంగీ తొడిగి/సంబుర పడుతున్నాడు/ అహ…ఎంతటి దయార్ధ హృదయుడో/నరనరానా జీవ కారుణ్యం/ అనుకుంటాం… కానీ/ఆ మచ్చిక వెనుక ప్రయోజనం/ఎవరికి తెలియదని/షాంపూలు వ్యాక్సిన్స్ బొమ్మ బొమికలు/అతని పరిరక్షణ కోసమే…!/అని అంటున్నారు.మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.నిజంగా జరుగుతున్న విషయాన్ని కవయిత్రి సుజాత మనకు కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తున్నారు.మనమందరం అంగీకరించాల్సిన విషయం.
“కాలకృత్యాలు కాలెత్తడాలు/కనురెప్పల కదలికలు/దాని ఇచ్చానుసారమనుకునేరు/వాడి ఆదేశానుగుణంగానే/అని అంటున్నారు.కుక్కను తీసుకొని వెళ్లి దాని కాలకృత్యాలు తీర్చడం, కాలెత్తడాలు కనురెప్ప కదలికలు దాని ఇచ్చానుసారం కాదు.వాడి ఆదేశానుగుణంగానే కుక్క మెదులుతుందని తెలియజేస్తున్నారు.
“ముందస్తు శిక్షణే కాదు/మూతికి శిక్కం కూడా మన ప్రమేయమే…! అని కవయిత్రి తెలియ జేస్తున్నారు.
“అరిచి ఘీ పెట్టి గింజుకున్న…/కుక్క ఎంత అరిచి బౌ బౌ మని మొరిగిన గింజుకున్న … గొలుసుతో కట్టబడి ఉంటుంది.కుక్క గొలుసుతో బంధింపబడి ఉంది.గొలుసు కట్టు దాటి ఆవలి గట్టు బందు వర్గాన్ని ముట్టరాదు అనే వాస్తవాన్ని కవయిత్రి సుజాత మనకు తెలియజేస్తున్నారు.

“గీసిన గిరి దాటి/అర ఇంచు స్వేచ్ఛ ఉండదు/ బంధించి ఉంచిన కుక్కకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది. గీసిన గిరి ఎలా దాటుతుంది.అర ఇంచు స్వేచ్ఛ ఉండదు అనే నిజాన్ని కవయిత్రి సుజాత తెలియజేస్తున్నారు.
“ఒక్కసారి…/గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో/
కలిసి జీవిస్తున్నట్టు/నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది…!/అని అంటున్నారు.కుక్కను ఒక్కసారి గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో, జీవిస్తున్న వాటికి స్వేచ్ఛ ఉంటుంది.గొర్రెల కాపరి, పశువుల కాపరి వాటిని చక్కగా మేపుతాడు. గొలుసుతో కట్టి వేయబడి ఉన్న కుక్కను నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది.నీ స్వేచ్ఛ ఏమిటో నీకు తెలుస్తుంది అనే నిజాన్ని కవయిత్రి సుజాత చక్కగా తెలియజేశారు.
“మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా/ మనం తప్ప వాటికి గతి లేదా/ ఆలోచించండి…!?/ అని అంటున్నారు.మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా ఆది మానవుడి చరిత్ర చదివితే తెలుస్తుంది.మన రక్షణ కోసమే కుక్కను మచ్చిక చేసుకున్నాం.కుక్కకు మనం తప్ప వాటికి గతి లేదా? ఆలోచించండి అని కవయిత్రి సుజాత మనలో ఆలోచన తరంగాలను రేకెత్తిస్తున్నారు.మనకే కుక్క అవసరం ఉంది.మనమే కుక్కను పెంచుకుంటున్నాం.కుక్క లేకుంటే మనకే గతి లేదు అని తెలియజేయడానికి మనలను కవయిత్రి సుజాత వాటి లోకంలోకి వెళ్లి ఆలోచించమని తెలియజేస్తున్నారు.భావం చక్కగా ఉంది.
“విడ్డూరమంటే ఇదే/సాటి మనిషిని చీదరించుకుని/ వీటిని ఆదరించడం వెనుక అంతర్యం/ఎవరికి తెలియనిది../ ముమ్మాటికిది/ముదిరిన స్వార్థ చింతన…!/అని అంటున్నారు.విడ్డూరం అంటే అర్థం మూర్ఖం.మనిషిని మనిషిగా చూడలేని వాళ్ళు,సాటి మనిషిని ఆదరించని వాళ్ళు,మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు.కుక్కల్ని ఆదరించడం వెనుక ఆంతర్యం తెలియనిది కాదు.ముదిరిన స్వార్థ చింతన అని చక్కగా తెలియజేస్తున్నారు.కుక్కల్ని ఆదరించినట్లే సాటి మనుషులను కూడా ఆదరించాలి.కుక్కల్ని ప్రేమించినట్లే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి అని సందేశాత్మకంగా మచ్చిక కవిత ద్వారా నాంపల్లి సుజాత తెలియజేశారు.కవయిత్రి సుజాతను అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు
విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

Leave a Comment