Home వ్యాసాలు కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

బిట్ల అంజనీ దేవి మనసెందుకో సున్నితం కవిత
కవయిత్రి బిట్ల ఆంజనీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.ఇప్పుడు కూడా ప్రతి రోజు మంచి పుస్తకాలు చదువుతారు. సమాజ అభ్యుదయం కాంక్షించే సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు.చదువు పట్ల మక్కువతో ఎంఏ. బీ.ఈడీ.పూర్తి చేశారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అప్పుడప్పుడు కవితలు,వ్యాసాలు రాయిస్తున్నారు.విద్యార్థుల్లో దాగి వున్న సృజన శక్తికి పదును పెట్టిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజన కొనసాగిస్తున్నారు. కవయిత్రి అంజనీ దేవి కలం నుండి జాలువారిన మనసెందుకో సున్నితం కవితా సంపుటిలోని మనసెందుకో సున్నితం కవిత పై విశ్లేషణా వ్యాసం. ఈ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఈ కవిత మనసు గురించి రాయడం జరిగింది.మనసు గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది.అందరు చదవాల్సిన కవిత.
“మొదటిసారి వేడి తగిలినపుడు
“వేళ్ళు చురుక్కుమన్నాయి/అని అంటున్నారు.
పొయ్యి మీద వంట చేస్తున్నపుడు గిన్నె వేడిగా ఉంటుంది.వంట పూర్తి అయిన తర్వాత పొయ్యి మీద ఉన్న గిన్నెను గుడ్డను రెండు చేతులతో పట్టుకొని భద్రంగా చేతులు కాలకుండా గిన్నెను జాగ్రత్తగా తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. మొదటిసారి చేతికి వేడి తగిలినప్పుడు వేడి గిన్నె చేతికి అంటుకుని వేళ్లకు బాధ కలిగింది అనే చక్కని భావాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.
“వయసు పెరిగే కొద్ధీ
“చర్మం ముదిరిందో
“అలవాటయిందో
“తట్టుకునే శక్తి పెరిగిందో
“ఇప్పుడు అమాంతం
“వేడి గిన్నెను దించగలదు/అని అంటున్నారు.
జీవితం నేర్పిన పాఠాలుగా తోస్తుంది.వయసు పెరిగింది.వయసుతో పాటు చర్మం ముదిరింది.ప్రతి రోజు వంట చేస్తున్నది.వంట చేయడం ఇప్పుడు అలవాటయింది.వేడిని తట్టుకునే శక్తి కూడా పెరిగింది.ఇప్పుడేమో అమాంతం చేతిలో బట్ట లేకుండా పొయ్యి మీద నుండి వేడి గిన్నెను దించుతుంది.వేడి గిన్నెను పొయ్యి మీదనుండి దింపినప్పటికీ చేతులు కాలడం లేదు.వేడి గిన్నెను దించితే చేతులు కాలుతాయని స్పృహ కూడా లేకుండా పోయింది.మనిషి యొక్క అనుభవాలు మనసు సున్నితత్వం నుండి కఠినత్వం వైపు ఎలా తీసుకెళ్లింది.మనిషి మనస్సు ఎంతగా మారి పోయింది.మనిషిలోని మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి అందించిన భావం అద్భుతంగా ఉంది.

“మొదటి అడుగు సున్నితంగా
” ముళ్ళు తగిలినా రాయి తగిలినా
“నొప్పితో తడబడింది/అని అంటున్నారు.
ఎవరికైనా,ఎప్పుడైనా,మొదటి అడుగు సున్నితంగా ఉంటుంది అని మన అందరికి తెలుసు.మొదటిసారి ముళ్ళు తగిలినా,రాయి తగిలినా నొప్పితో తడబడింది.బాధతో విలవిలలాడింది.ముళ్ళు తగిలిన చోట అవస్థను అనుభవించింది.ఎవరికైనా రాయి తగిలిన చోట నొప్పి ఉంటుంది.రాయి తగిలిన చోటనే మళ్లీ దెబ్బ తగిలి శరీరానికి కలిగిన బాధను ఓర్పుతో భరించింది.
“ఎముక ముదిరిందో
“అవసరాల అనివార్యతో
“ఇపుడు ముళ్ళపై నడవగలను
“కంకరపై పడుకోగలను/అని అంటున్నారు.
నిజమే.వయసు పెరిగిన కొద్ది ఎముక ముదిరింది. అవసరాలు మరియు అనివార్య పరిస్థితులు వల్ల ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలను అన్న ధైర్యం పెరిగింది.ముళ్ళపై నడవగలను అనే ధీమా పెరిగింది.ముళ్ల పై నడిస్తే ఏం జరుగుతుంది? కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి.కంకరపై పడుకోగలను అనే ఆత్మ విశ్వాసం సైతం పెరిగింది.కంకర పై పడుకుంటే శరీరానికి కంకర రాళ్లు ఒత్తుకొని ఏ కష్టాన్ని అయినా ఏ సమస్య నైనా ఓర్చుకునే లక్షణం అలవడింది.
“అనుభవం పెరిగే కొద్దీ
“అన్నీ తట్టుకున్న ఈ శరీరంలో
“మనసెందుకో అందుకు భిన్నం/అని అంటున్నారు.
జీవితం నేర్పే పాఠాల వల్ల అనుభవం పెరిగింది.ఈ శరీరం మాత్రం అనుభవం పెరిగిన కొద్ది అన్నిటిని తట్టుకుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. మనసుకు రూపం లేదు.పేరు మాత్రమే ఉంది. దేవుడికి రూపం లేదు.మనసు ఎక్కడ ఉంది?మన లోపల మనసు దాగి ఉంది.మనసు అంటే ఆలోచన అని అర్థం.ఆలోచనల్లో కూడా తేడాలు ఉంటాయి. మనస్సు అనేది ఎవరికి వారి సొంతం.సంకల్పమే మన మనస్సు.ఇతరుల మనసును ఎవ్వరు తెలుసుకోలేరు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని సాధిస్తుంది.శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది మన మనసు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని కోరుకోవాలి.ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి.శరీరం స్వాధీనంలో లేదు.మనసు స్వాధీనంలో లేదు.మనస్సు అంటే అంతరంగం. మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు, విచక్షణ,మొదలైన అంశాలు.మనస్సు ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం.ప్రతి మనిషి యొక్క భావాలు,అనుభూతులు,అభిప్రాయాలు,వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.అందుకే ఎవరి ఆలోచనలు వారివే. మనసు గతి యింతే,మనిషి బ్రతికింతే,మనసున్న మనిషికి సుఖం లేదంతే,చలనచిత్రంలోని పాటను మనం విని ఉన్నాం.మనిషి మనసు ఎవరికి అర్థం కాదు.మనసు అంటే నానార్థాలు హృదయం, మానసం,ఇష్టం,తలపు,వలపు,చిత్రం,మది.మనసు గురించి కవయిత్రి మనసెందుకో భిన్నమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

“అమ్మ తిట్టినపుడు
“ఏడ్చి మర్చిపోయా
“మళ్లీ అమ్మా అన్నాను/అంటున్నారు. మనం ఏమైనా తప్పు చేస్తే అమ్మ తిట్టుతుంది.అమ్మ తిట్టినప్పుడు మనకు దుఃఖం వచ్చి ఏడుస్తాం.అమ్మ కొట్టినా,తిట్టినా తిరిగి అమ్మ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది.అమ్మ ఆలనలో,లాలనలో అమ్మ కొట్టిన సంగతి,తిట్టిన సంగతి మర్చిపోయి మళ్లీ అమ్మ దగ్గరికి చేరుతాం.అమ్మ ఎవరు?అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మను మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి.అమ్మ కనిపించే దైవం.అమ్మ కని పెంచే దైవం.అమ్మ గురించిన భావన అద్భుతం. కవయిత్రి అమ్మను గుర్తుచేసింది,అమ్మ లోకం గురించి,మనలను ఆలోచించేలా చేశారు.
“దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి
“మరిచిపోయాను
“మళ్లీ ఆడుకున్నాను/అంటున్నారు.
స్నేహమేరా జీవితం.స్నేహమేరా శాశ్వతం.సినీ గీతం ఉంది.ఏవో చిలిపి చేష్టలు,ఏదో అల్లరి,దోస్త్ కొట్టినప్పుడు దెబ్బలాడి మరిచిపోయి మళ్లీ ఆడుకున్నాను.స్నేహితులు కొట్లాడుకుంటారు.అన్నీ మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఆడుకుంటారు.స్నేహబంధం విలువైనదిగా చెప్పుకుంటారు.నిజమైన స్నేహితులు జీవితాంతం కలిసి మెలిసి ఉంటారు.స్నేహం యొక్క ఔన్నత్యాన్ని కవయిత్రి చక్కగా వివరించారు.
“సార్ కొట్టినపుడు
“వెక్కి వెక్కి ఏడ్చిన/అంటున్నారు.
సార్ అంటే ఎవరు?ఉపాధ్యాయుడు.ఆచార్య దేవోభవ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆచార్యుడు కూడా దేవునితో సమానం.సార్ ఏదైనా తప్పు పని,అల్లరి చేస్తే మరియు చదువుకోకుంటే మందలిస్తారు.సారు కొట్టినప్పుడు వెక్కివెక్కి ఏడ్చాను.పిల్లలు సారు కొడితే ఏడుస్తారు.పిల్లలను తల్లిలాగే సారు కూడా దగ్గరికి తీస్తాడు.సార్ చక్కగా చదువు చెప్పి మనలో జ్ఞాన దీపం వెలిగిస్తాడు.సార్ మనలను సన్మార్గంలో నడిపిస్తాడు.సార్ కొట్టినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం చక్కగా ఉంది.కవయిత్రి మనలను బాల్యపు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతం.
“ఇప్పుడెందుకో
“గుట్టలుగా పేరుకున్న దుఃఖం
“ఉబికి రానే రాదు
“గుండెలో భారం తగ్గనే తగ్గదు/అంటున్నారు.
జీవితంలో మనిషి ఎన్నో కష్టాలను కడగండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే కష్టాలు ఒక్కటొక్కటిగా మాయమై పోతాయి.కష్టాలను సహనంతో ఓర్చుకుంటే గుట్టలు గుట్టలుగా పేరుకున్న దుఃఖం ఆవిరి అయి పోతుంది. కష్టాల నావను ఈదుతున్నప్పుడు గుండెల్లో భారం ఎలా తగ్గుతుంది?కష్టాలు క్రమేణా తగ్గిపోతే గుండెల్లో భారం తగ్గుతుంది.కవయిత్రి కవితలో దుఃఖం గురించిన భావాన్ని చక్కగా పండించారు.
“మనసు చేతికి దొరికితే బాగుండు/అంటున్నారు.
మనసు చేతికి దొరికే వస్తువు కాదు.మనసు మన ఆలోచనల్లో నిండి నిబిడీకృతమై ఉంటుంది.మనసు చిక్కబట్టిన వాళ్లను మహర్షులు అంటారు.నిత్యం యోగా,ప్రాణాయామాలు చేయడం ద్వారా మనసు స్వాధీనంలోకి వస్తుంది.మనసు స్వాధీనంలోకి తెచ్చుకున్న వాళ్లను స్థితప్రజ్ఞులు అంటారు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుల గురించి వ్రాయబడింది.
“ముండ్లు గుచ్చో
“సెగ తగిలించో
“రాతితో బాదో
“గట్టి పడేసే దాన్ని/అంటున్నారు.
మనసు మనకి అందదు.మనసుకి ముళ్ళు గుచ్చలేం.మనసుకు సెగ తగిలించలేం.మనసును రాతితో బాధి గట్టి పడేయడం సాధ్యం కాదు. మనసును గురించి కవయిత్రి భావన మనలను ఆలోచింపజేస్తుంది.
“వయసు పెరిగే కొద్దీ
“ఈ మనసెందుకో
“మరింత సున్నితమవుతోంది/అంటున్నారు.
వయసు పెరిగే కొద్ది వయసుతోపాటు ఈ మనసు మరింత సున్నితమవుతోందనే భావం అద్భుతంగా ఉంది.మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి భావాల్లో వాస్తవం దాగి ఉంది.
చక్కటి కవిత అందించినందుకు కవయిత్రి బిట్ల అంజనీదేవిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

2 comments

Harlan2825 May 29, 2025 - 9:38 am Reply
Alayna2206 May 29, 2025 - 7:40 pm Reply

Leave a Comment