Home వ్యాసాలు పుంభావ సరస్వతి :శంకరంబాడి సుందరాచారి

పుంభావ సరస్వతి :శంకరంబాడి సుందరాచారి

by Radhika Suri

ప్రముఖ తెలుగు కవి ,రచయిత, సంగీతజ్ఞుడు, ఆంధ్ర ప్రదేశ్ ‘రాష్ట్ర గీత’ కర్త ఐన శ్రీ శంకరం బాడి సుందరాచారి గారు తిరుపతిలో ఆగస్టు 10న,1914లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కమలమ్మ, రాజగోపాలా చారి గార్లు.
వీరి సహధర్మచారిణి శ్రీమతి వేదమ్మాళ్ గారు.

తమిళులైనా తెలుగు భాషపై మక్కువతో ఎన్నో రచనలు చేశారు. థియోసాఫికల్ సొసైటీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ,చిన్నచితకా ఉద్యోగాలు చేసిన వీరు ఉద్యోగార్థమై మద్రాస్ ‘ఆంధ్ర పత్రిక’ ఆఫీసుకు వెళ్ళినప్పుడు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ‘మీకు తెలుగు వచ్చా’? అని అడిగినప్పుడు ‘మీకు తెలుగు రాదా’ అని ఎదురు ప్రశ్న వేయడంతో పంతులుగారు అవాక్కయ్యారట .ఈ పత్రికలో ఉన్నప్పుడు ఒక ప్రముఖునిపై పద్యం రాయమన్నపుడు తాను వ్యక్తులపై రాయలేనని ఉద్యోగం వదులుకున్న ఆత్మాభిమాని.

ప్రేమ వివాహం చేసుకున్న వీరి శ్రీమతి వేదమ్మాళ్ గారు
మనోవ్యాధితో గతించడం, ఐదేండ్ల కూతురు కూడా మరణించడం వారి జీవితంలో బాధించే అంశాలు. పద్య కవిత్వం అంటే ఎంతో ఇష్టం వీరికి ,అందులోను ఛందోబద్ధమైన తేటగీతి పద్యాలు మరీఇష్టమంటారు.
ఒక సందర్భంలో, నా పేరు కూడా తేటగీతిలో ఇమిడిపోయిందంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలోనే రాసారాయన.

మహాత్మా గాంధీ హత్యోదంతం పై కలతచెంది’ బలిదానం’ కావ్యం రాశారు. ‘సుందర రామాయణం’ ‘సుందర భారతం’ పేరుతో రెండు కావ్యాల్ని, తిరుపతి వేంటేశ్వర స్వామి మకుటంతో ‘ శ్రీనివాస శతకాన్ని’ , ‘బుద్దగీతి’ పేరుతో బుద్ధుని చరిత్రను, ఠాగూర్ ‘గీతాంజలి’ లోని మూలభావాన్ని తీసుకొని చేసిన స్వతంత్రానువాదం ఎన్నో ప్రశంసలు పొందింది. భావగీతాలు, జానపద గీతాలు, సినిమా పాటలు రాశారు. 1942లో ‘దీనబంధు’ సినిమా కోసం రాసిన పాట ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ కారణాంతరాల వల్ల సినిమాలో చేర్చలేదట.
ఈ పాట శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన తర్వాత అత్యంత ప్రజాదరణ పొందింది అంటారు. ‘బుద్ధ చరిత్ర’ లోని కొన్ని పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి నెహ్రూ గారి మన్ననలు పొందారట .

ఈ కవి శ్రేష్ఠునిపై కొందరు ప్రముఖ కవి దిగ్గజాల అభిప్రాయాలు :

శ్రీపాద కృష్ణమూర్తి గారు: మృదువైన పదాల శైలి, కల్పనాచాతుర్యంతో కవిత్వాన్ని అత్యంత ఆదరణీయంగా మలిచారంటారు.

కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు :
సంస్కృత పదాలను వీడి , సరళమైన తెలుగులో పలుకుబడులు, కవితాత్మలకు సౌకుమార్యం కలగలిసి వీరి కవిత్వం
ఆదరణ పొందింది అంటారు.

గడియారం వేంకట శాస్త్రి గారు : ఎత్తుగడలు ,అలంకార, చమత్కారాల మేళవింపులతో సరళ భాషలో ,సహజ
భావ శృతులలో సాగే కవితాధార అంటారు .

రాయప్రోలు సుబ్బారావు గారు : వీరిశైలి తేటతెలుగులో సాగుతూ సుదూరంగా ధ్వనిస్తుంటుంది అంటారు .

రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు : తెలుగుదనపు తీపి రుచుల ఊట వీరి తేటగీతి కవిత్వం అంటూ శ్లాఘిస్తూనే, ఒకానొక సందర్భంలో భయంకర రూపంలో ఉండే ‘తాటకి’ మీ తేటగీతిలో ఇముడుతుందా అని ప్రశ్నిస్తే ,
నల్లకొండల నుగ్గుగా నలగ కొట్టి నడుగులు పిడుగులగుచు… అరుదెంచె అంటూ తాటకిని తేటతెలుగలో వర్ణించినపుడు శర్మగారు అచ్చెరువొందారట.
ఇలా చెప్తూపోతే వారి సాహితీ స్రవంతి గలగలలై పారుతూ సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న సందర్భాలు కోకొల్లలు.

1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది .చారిగారిని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు’ ప్రసన్న కవి’ బిరుదుతో గౌరవించారు.
ఆయనకు జనబాహుళ్యంలో ‘భావకవి ‘ ‘సుకవి’ ‘ అహంభావకవి’ అని కూడా పేర్లు.

అచ్చ తెలుగులో , తెలుగువారి జీవన విధానాల్లోని సమస్త ఘట్టాలను,సాంప్రదాయాలను
భావసౌందర్య స్ఫోరకంగా, అతి రసవత్తరంగా, మాటలు ,పాటల రూపంలో వివరించి అందరినీ ఆకట్టుకోవడంలో అత్యంత ఘనులు .

నిరాడంబరత ,అసమానతలు ఎరుగని నిక్కచ్చితనం, ఆధ్యాత్మిక చింతన కలిగి ,అనన్య ప్రతిభాపాటవాలుగల ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పేరు కోసం ఎప్పుడూ పాకులాడలేదట .

ఎంత మేధావులైనా మనసు ముందు మోకరిల్లే వారేనని, కష్టాలు కడగండ్లకు అతీతులు కారనడానికి వీరే సాక్ష్యం . చరమాంకంలో ఐనవారు లేక ఒంటరితనంతో నిస్తేజంగా మారిన ఈ సాహితీదిగ్గజానికి ‘ప్రపంచ సాహితీపొత్తం’లో సరైన పుటలేదనే భావన ఎంతోమందిలోఉంది.

సాహితీ సేవలో అలసిసోలిన ఈ కవికోకిల ఏప్రిల్ 8,1977న, తిరుపతిలో ఇష్టదైమైన వెంకన్న పాదాల చెంత శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగు తల్లి మెడలో మల్లెపూదండను అతిఅందంగా కూర్చి అలంకరించిన ఘనుడిగా తెలుగుచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ అసామాన్య కవిశ్రేష్ఠుడికి అక్షర నిరాజనాలతో…

(శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ…)

You may also like

Leave a Comment