Home ధారావాహిక నవల బంగారు కల

బంగారు కల

by Chillara Bhavanidevi

7
నవరాత్రి పండగ వేడుకలతో హంపీ పట్టణమంతా కోలాహలంగా
ఉంది. రాయలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పండుగనాడు హంపీ విజయనగరం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. నగరాన్ని రంగురంగుల రంగవల్లికలతో ఫలపుష్ప సమూహాలతో అలంకరించారు. స్త్రీ పురుషులంతా ఆకర్షణీయమైన వస్త్రాభరణాలతో పూలమాలలు, గంధం, కస్తూరి అగరులతో శోభిల్లుతున్నారు. వీరవరుల పౌరుష విన్యాసాలైన ఖడ్గం, బల్లెం, అశ్వారోహణం, గజారోహణం మొదలైన విద్యలన్నీ రాజ సముఖంలో ప్రదర్శనకు సిద్ధమైనాయి. విజయనగరంలో రత్నాల వర్తకులంతా మరిన్ని మేలిమి రత్నాలను రాసులుగాపోసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. వివిధ రత్నాభరణాల భూషణాలు ధరించిన స్త్రీ పురుషులు ఆనందాతిరేకంతో నృత్యాలు చేస్తున్నారు.
క్రీడామైదానంలో వివిధ క్రీడాకారుల పాటవ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కూచిపూడి మొదలైన నృత్య సమారాధనలతో రాజ్య జనాభా అంతా విజయనగరం చేరిందా అన్నట్లున్నది. పదిలక్షల సైన్యం కవాతు చేస్తూ విజయనగర కీర్తితోరణాన్ని వెలిగిస్తున్నది.
తోలుబొమ్మల కళాప్రదర్శనలు, యక్షగానాలు, కోలాటాలు ఒకటేమిటి, విజయనగరమే ఒక సుందర కళావేదికగా మారిపోయింది.
‘విజయమందిరం’ సర్వాంగ సుందరంగా అలంకరించబడిరది. ఈ వేదికను ‘సింహాసనవేదిక’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాచీన విజయనగర రాజుల వైభవాన్ని చాటటానికి ఆదర్శప్రాయమైన వేదిక. మూడునాలుగు నెలల ప్రయాణం చేయవలసినంత దూరప్రాంతాల నుండి, రాజ్యాలనుండి సామంతరాజ ప్రభువులు అక్కడ సమావేశం కావాలని విజయనగరాధీశుని ఆజ్ఞ. విజయనగరానికి వచ్చే దారులన్నీ సముద్రాన్ని చేరే నదీప్రవాహాల్లా ఉన్నాయి. మేఘాల్లా గర్జిస్తూ అంబారీలతో అలంకరించబడి ఏనుగులమీద గారడీ విద్యలవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పైనుండి సుగంధ పరిమళాల జల్లుల్ని కురిపిస్తూ తమవెంట వేల ఏనుగుల్ని తీసుకొస్తున్నారు. ఆ ఏనుగులన్నింటికి చెవులు, నొసట, తొండంమీద వివిధరంగులతో అతి విచిత్ర సుందరమైన చిత్రాలను చిత్రించారు. అవి చూసేవారికి ఆసక్తికరంగా ముగ్ధుల్ని చేస్తున్నాయి.
‘విజయమందిరం’ అని పిలిచే దసరాదిబ్బ మందిరం ముందు తొమ్మిది అంతస్తుల శిలాస్తంభాలతో కూడిన భవనాలున్నాయి. మహారాజు సింహాసనం తొమ్మిదవ అంతస్తుల్లో విరాజిల్లుతున్నది. విదేశీ రాయబారులు, యాత్రికులకు ఏడవ అంతస్తు కేటాయించబడిరది.
ఈ భవనానికి విజయభవనానికి మధ్యలో ఉన్న విశాల మైదానంలో కథకులు, గాయకులు తగినంత అభ్యాసం చేసుకోవటానికి వీలుంది. గాయకులలో చాలామంది యువతులే ఉన్నారు. ఆ రోజు చంద్రప్ప గానం ప్రత్యేక ఆకర్షణ అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గాయకులంతా మహారాజు ఎదురుగా ఒక జలతారు తెర వెనుక ఆసీనులై ఉన్నారు. రెండువైపులా ఉన్న తెర తొలగించినప్పుడు బంగారంతో తాపడం చేసిన అమూల్య రత్నఖచిత సింహాసనంపైన కూర్చుని
ఉన్న ప్రభువు వీరిని చూడటం జరుగుతుంది.
వైభవోపేత విజయభవనం ముందుభాగంలో గోపురంతో ఉన్న ప్రవేశ ధ్వారముంది. దీని బయట రాజమందిరం చుట్టూ చాలా ఎత్తయిన ప్రహరీగోడ ఉంది. సింహద్వారంలో సాయుధులైన భటులు కాపలా కాస్తున్నారు.
దీని తర్వాత కొంతదూరంలో మరోద్వారముంది. ఆ దారిలో ప్రవేశిస్తే విశాలమైన ఆరుబయలు ప్రాంతం. దాని పక్కన ఒక పెద్దమండపముంది. అక్కడ ముఖ్యమైన అధికారులు, నగర ప్రముఖులు కూర్చుని వినోదాలు చూస్తున్నారు. ఈ ఆరుబయలు ప్రాంతానికి ఉత్తరంగా మరో పెద్ద పలు అంతస్తుల భవనం కన్పిస్తోంది.
ఏనుగు, గుర్రం వంటి ఆకారాలతో ఎత్తైన స్తంభాల మీద ఈ కట్టడాలు కట్టారు కాబట్టి విశాలంగా ఉండి పైకి ఎక్కటానికి రాతిమెట్లు కన్పిస్తున్నాయి.
ద్వారానికెదురుగా రెండు వృత్తాకార రంగస్థలాలున్నాయి. వాటిలో నాట్యగత్తెలు రత్నఖచిత సువర్ణాభరణ భూషితలై నృత్యాలు చేస్తున్నారు.
ఈ రంగస్థలాలకెదురుగా సింహద్వారానికి తూర్పున విజయ భవనం లాంటి మరో రెండు మందిరాలున్నాయి. వాటిలో ఒకటి మధ్యలో, ఇంకొకటి చివరిలో ఉన్నాయి. ఇవి అమూల్యవస్త్రాలచే అలంకరింపబడి ఉన్నాయి. ఆ వస్త్రాలమీద ఆసక్తికరంగా వివిధ చిత్రాలు కన్పిస్తున్నాయి. ఈ భవనాలలో రాజకుమారులు తమ అభిరుచుల కనుగుణమైన విందులు ఆరగిస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చూస్తున్నారు.
నవరాత్రి విజయోత్సవ ప్రారంభసూచికగా ధర్మఘంటారావం విన్పించింది. అది నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు. శ్రీకృష్ణదేవరాయలు విజయమందిరానికి విచ్చేశారు. అక్కడే నిర్మితమై ఉన్న దేవమందిరంలోకి ప్రవేశించారు.
బలమైన అవయవ సౌష్టవంతో మంచి ముఖవర్చస్సు గల్గిన శ్రీకృష్ణదేవరాయల వదనంలో ప్రత్యేకత అందరినీ ఆకర్షిస్తోంది. పట్టుపంచ, అంగరఖా, ఉత్తరీయం ధరించి తులలేని నవరత్నఖచిత ఆభరణాలతో, కిరీట భుజకీర్తులతో రాచకరవాలంతో నిలువెత్తు వీరత్వానికి ప్రతీకగా భాసిల్లుతున్న రాయలు దేవమందిరంలోని విగ్రహాన్ని పూజించారు. బయట ఉత్సవం కోలాహలంగా జరుగుతున్నది. ప్రభువు బంధువులు, ఆప్తులు, కళాకారులు అంతా నృత్యగాన విశేషాదుల్ని ఆనందిస్తున్నారు. బయట మండపాల్లో దండనాథులు,
ఉన్నతాధికారులు, పౌర ప్రముఖులు ఉత్సవాన్ని దర్శించాలని వచ్చి వేచిచూస్తున్నారు.
కింద ఆరుబయలు ప్రాంగణంలో నానావిధాలుగా పుష్పాది సుగంధ ద్రవ్యాలతో అలంకరింపబడిన పదకొండు అశ్వాలు, నాలుగు పట్టపుటేనుగులు వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయ ప్రభువు లోపలినుండి సద్బ్రాహ్మణసమేతుడై అక్కడికి వచ్చారు. బ్రాహ్మణులు గజాశ్వాలను వైదిక సంస్కార ప్రకారం మంత్రజలంతో ప్రోక్షణ చేసి పూలమాలలతో వాటిని అలంకరించారు. ఆ తర్వాత జాజ్వల్యమాన వజ్ర ఖచిత కనక సింహాసనం మీద విజయనగర సామ్రాజ్యధీశుడైన శ్రీశ్రీశ్రీ కృష్ణదేవరాయల ప్రభువు ఆసీనుడయ్యారు.
ఆనవాయితీ ప్రకారం కొన్ని పొట్టేళ్ళు, దున్నపోతుల్ని బలి ఇవ్వటం పూర్తయింది. మహారాజు బ్రాహ్మణుల వేదమంత్రయుక్త ఆశీర్వాదం అందుకుని మరలా తొమ్మిదవ అంతస్తుకు వెళ్ళి కిరీటం తీసి దేవుని ఎదుట ఉంచి దేవునికి సాష్టాంగ ప్రణామం చేసి లోనికి వెళ్ళిపోయాడు.
ఇక్కడ రంగస్థలాలపై చాలాసేపు నృత్యప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. నవరాత్రుల తొమ్మిదిరోజులు ఇదేవిధమైన కార్యక్రమం ఏర్పాటు చేయబడిరది.
సాయంత్రంవేళ అవుతున్నది. మర్తాండుడు ప్రతాపం చాలించి లోకం మీద తన వేడికిరణాలను ఉపసంహరించుకొని పశ్చిమాద్రికి ప్రయాణమవుతున్నాడు.
ప్రజలు, ఉద్యోగులు, అతిథులు అంతా విజయభవన ప్రాంగణానికి విచ్చేశారు. మల్లురు, జెట్టీలు, నృత్యగాన కళాకారులు అలంకృత అశ్వాలతో ఊరేగింపుగా బయలుదేరారు. బ్రాహ్మణులు, రాకుమారులు, రాజబంధువులు, వారి వారి మిత్రులు, పరవారం మహారాజుని అనుసరించారు.
ఈ ఉత్సవాల విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అడుగడుగునా శక్తివంతమైన గూఢచారి వ్యవస్థతో మహామంత్రి తిమ్మరుసే స్వయంగా పర్యవేక్షిస్తూ తగు సూచనలు, ఆజ్ఞలు ఇస్తున్నారు.
మహారాజు విజయభవన వేదికపై సింహాసనాన్ని అధిరోహించారు. ప్రజలు అధికారగణం లేచి నిలుచుండి విజయాభివందనం చేశారు. కొందరు ఆప్తులు మహారాజు దగ్గరగా కూర్చున్నారు. దేవేరులు మహారాజు సమీపంలో తెరల మాటున వీక్షిస్తున్నారు. తాంబూల సేవనం మహారాజు సమక్షంలో నిషిద్ధమని అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ ఆ పని చేయటం లేదు.
అప్పటిదాకా బయట నిరీక్షిస్తున్న సేనాధికారులు ఒక్కొక్కరు వరుసలో వచ్చి రాజుకు జోహారులు సమర్పించి మండపంలో తమతమ స్థానాలలో కూర్చున్నారు. అనంతరం నత్య ప్రదర్శన జరిగింది.
నాడు మంజరి చేసిన ‘నవమోహిని’ నృత్యం సరికొత్త భావానుభూతిని మిగిల్చింది. క్షీరసాగరమధనంలో హాలాహలాన్ని పరమశివుడు భరించాడు. తర్వాత పుట్టిన అమృతాన్ని దేవదానవులకు పంచే విధానంలో శ్రీ మహావిష్ణువు మోహినీరూపంలో అవతరించి దానవులను సమ్మోహనపరచిన విధానాన్ని మంజరి అభినయ నర్తనంగా అందించిన ప్రావీణ్యతకు కళాహృదయాలన్నీ పులకించాయి.
మంజరి నవమోహినీ రూపం చంద్రప్ప మనసులో గిలిగింతలు పెట్టింది. ఈ దసరా నవరాత్రులలోనే విజయదశమినాడు ఆ ఇద్దరికీ పరిణయం జరుగనుంది. ఆ తలపే చంద్రప్పను వివశుడ్ని చేస్తున్నది.
‘‘బాగు బాగు’’ ఆ కర్కోటక స్వరం వీరేంద్రునిదే.
చంద్రప్ప తీక్షణంగా వీరేంద్రుని చూశాడు. వీరేంద్రుని వాక్కులో ప్రశంసకన్నా కుటిలత్వమే విన్పిస్తున్నది.
‘‘నర్తకీమణీ! మీ నృత్యాభినయంతో మేము ముగ్ధులమయ్యాం!’’ అంటూ ప్రభువు తన మెడలోని ముత్యాలహారాన్ని ఆమెకు బహుకరించారు. కృతజ్ఞతతో మంజరి కళ్ళు చెమర్చాయి.
‘‘మంజరీ! నేటినుండి నిన్ను మా ఆస్థాన నర్తకిగా గౌరవిస్తున్నాం.’’ ప్రభువిచ్చిన వెలలేని కానుకలతో ఇల్లుచేరిన మంజరికి తల్లి గుర్తొచ్చింది. కృష్ణసాని ఉంటే ఎంత సంతోషించేదో! ఆమె కళ్ళు తల్లి జ్ఞాపకాలతో చెమర్చాయి.
మర్నాటి కార్యక్రమం మొదలయింది.
రంగస్థలంలో వెయ్యిమంది మల్లయోధులు ఆయుధాలు లేకుండా పోరాడి వివిధరకాల మల్లవిద్యలు ప్రదర్శించారు. వారికందరికీ బహుమతులు అందాయి. కొందరు వలలు విసురుతూ రంగస్థలంలోనివారిని చేపల్లా పట్టే వినోదాన్ని ప్రదర్శించారు.
ఈవిధంగా అనేక ప్రదర్శనల తర్వాత పలువర్ణాల జ్యోతులు వెలిగించారు. బాణాసంచా పేల్చారు.
అనంతరం బారులుతీరిన అలంకృత ఏనుగులు, అశ్వాలు, వృషభాలు రాజు ఎదుట వచ్చి నిలబడ్డాయి. బ్రాహ్మణుడు మంత్ర పుష్పాక్షతలతో వీటిని అర్చించాక మహారాజు పక్కనే ఉన్న చిన్నద్వారం గుండా నిష్క్రమించాయి.
బ్రాహ్మణులు విజయమందిర దేవాలయ విగ్రహాన్ని యథాశక్తి పూజించారు. మహారాజు ఉత్సవాలు జరిగే తొమ్మిదిరోజులు ఉపవాసమున్నారు. ఆయన ముఖకళ రోజురోజుకూ ఇనుమడిస్తూనే ఉండటం విశేషం.
ఈ ఉత్సవాల కాలంలో సామంత నాయకులు రాజమందిరం దగ్గర నవదుర్గాల్లో అమూల్య వస్త్రాభరణాలు, వస్తువులు ఉంచి విజయదశమి మహోత్సవవేళ చక్రవర్తికి రాజచిహ్నాలను అలంకరించి కానుకలు చెల్లించారు. ప్రభువు దేవేరులంతా స్వర్ణాభరణ భూషితులై బంగారుకలశాలతో రాజచంద్రునికి నీరాజనాలు సమర్పించారు. నవరాత్రి దసరాఉత్సవం తొమ్మిదిరోజులు రాజభవనం ఆనందపారవశ్యంలో మునిగితేలుతున్నది.
కురిసిన దెచట వాక్కుల జృంభణములోన
కవిరాజుపైన బంగారువాన
సలిపిన దెచట ధూర్జటి దివ్యలేఖిని
నవ్యవారాంగనా నర్తనంబు
తొడిగిన దెచట నిస్తుల రాజహస్తము
కవిపితామహు కాలి కంకణంబు
విసిరిన దెచట ప్రవీణవాచస్పతి
రామలింగని హాస్య రససమృద్ధి
అది శిలలదిబ్బ దసరాలకైన దిబ్బ
తెలుగు లలితకళాదేవి తీర్చినట్టి
కొలువుకూటపు దిబ్బ వన్నెలకు దిబ్బ
మా మహర్నవవిూశాల మంటపంబు
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
తిమ్మరుసు భవనంలో కుమారుడు గోవిందరాయలతో గంభీరంగా సమావేశమైనాడు.
‘‘మీరేమైనా చెప్పండి నాన్నగారూ… వీరేంద్రుడిరక విజయనగరంలో
ఉండటానికి వీలులేదు’’ గోవిందరాయలు ఆవేశంగా అన్నాడు.
‘‘త్వరపడితే ఎలా గోవిందా! అతను రాజబంధువు. ముల్లును ముల్లుతోనే తీసివేయాలి. అతని కపటబుద్ధి నాకూ తెలుసు. గజపతుల కూతురితో వచ్చి విజయనగరంలో పాగా వేసినప్పటినుంచి అతన్ని కనిపెడుతూనే ఉన్నాను’’ తిమ్మరుసు సాలోచనగా అన్నాడు.
‘‘ఇంక జాప్యం చేయరాదు నాన్నగారూ. కంటకుడు రాజద్రోహులతో మంతనాలు చేస్తున్నాడు. సైన్యాధికారులు, రాజోద్యోగుల మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడు’’ గోవిందరాయలి కోపం తారాస్థాయిలో ఉంది.
తిమ్మరుసు మౌనంగా తల పంకించాడు.
‘‘విజయనగరంలో స్త్రీలను ఎంత గౌరవిస్తామో మీకు తెల్సు. అలాంటిది ఎందరో స్త్రీలు అతనివల్ల బాధపడ్తున్నారు. అధికారులకు లంచాలు నేర్పిస్తున్నాడు’’ ఆవేశంగా మళ్ళీ చెప్పాడు గోవిందరాయలు.
‘‘నిజమే గోవిందా! అన్నపూర్ణాదేవి బంధువు అనే చిన్న కారణమే అతన్ని రక్షిస్తుంది. మన వేగులవల్ల చాలా కొత్త సంగతులు తెలుస్తున్నాయి. నేనున్నాను నీవు కలవరపడకు’’ కుమారుని శాంతపరిచే ప్రయత్నం చేశారు తిమ్మరుసు.
ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు వర్తమానం అందింది. చంద్రప్ప వచ్చేలోపు గోవిందరాయలు లోనికి నిష్క్రమించాడు.
‘‘అభివాదం మంత్రివర్యా’’
‘‘చంద్రప్పా! ఏమి వార్త’’
‘‘మంత్రివర్యా! నవరాత్రి ఉత్సవాల్లో ఒక ప్రమాదం తప్పింది.’’
‘‘ఏమిటది చంద్రప్పా?’’
‘‘ఓఢ్రం నుంచి వచ్చిన నృత్యాంగనల్లో ఒక స్త్రీ దుస్తులమాటున ఛురిక దాచింది. ఆమె రాయలవారికి చాలా చేరువగా వచ్చింది గాని ప్రయత్నించేలోపు మంజరి ఆ రహస్యాన్ని ఛేదించడంతో ఆ నర్తకిని దండనాథులు బందీని చేశారు.’’
‘‘ఆమెను ఓఢ్రం నుంచి పిలువనంపింది మనమేనా?’’ అనుమానంగా అడిగారు తిమ్మరుసు.
‘‘కాదు. వీరేంద్రులవారి వ్యక్తిగత ఆహ్వానం మేరకు వచ్చిందట’’ తటపటాయిస్తూ చెప్పాడు చంద్రప్ప.
‘‘ఊ’’ తిమ్మరుసు గంభీరముద్ర వహించారు.
‘‘అంతేకాదు అమాత్యవర్యా! కవాతు చేసిన మన సైన్యంలో లెక్కకు మించి ఇతర సైన్యం గుర్తించలేనివిధంగా కలిసి ఉందట.’’
‘‘ఇక నీవు వెళ్ళవచ్చు’’ చంద్రప్ప నమస్కరించి వెళ్ళిపోయాడు. మంత్రి తిమ్మరుసు చురుకుగా సేనా నాయకుడికి కబురుపెట్టారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి పున్నమి వెలుగులో వసంతవాటికలో వేచివుంది. కొలనులోని చందమామ చంద్రప్పలా ఉన్నాడు. తమ వివాహానికి ఇంకా మూడు
నాళ్ళున్నది.
ఆ తర్వాత చంద్రప్పతో తమ విహారం శిల్పారామంలోనే! పరవశిస్తూ సంచరిస్తున్నది మంజరి.
విజయనగరమంతా ఎక్కడ చూసినా అద్భుత శిల్పప్రపంచమే కదా! శ్రీరామచంద్రునికి సహాయపడిన వానరోత్తముల రాజ్యం ఇది. ఇపుడు మరో రామరాజ్యమయింది. వరాహస్వామి పతాకచిహ్నంగా ఉన్న ఈ విజయనగరంలో రఘునాథ దేవాలయం బయటి గోడమీద శిల్పకళాకృతులంటే మంజరికి ఎప్పుడూ ఇష్టమే. ఇక్కడే రామచంద్రుడు తమ తండ్రికి పిండప్రధానం చేశాడంటారు. నిజమేనా! ఎప్పటి రాముడు! త్రేతాయుగం నాటి మాట. నమ్మినా నమ్మకపోయినా ఆ పుణ్యస్థలం నేటికీ పవిత్రమైనదే! మంజరి నర్తనశాలలో ప్రవేశించింది. రాత్రివేళ కదా! నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె మనోవీధిలో అక్కడ నృత్యకేళి పరమ మనోహరంగా జరుగుతున్నది. ఇది ఎంతటి ముగ్ధమనోహర ప్రదేశం!
‘‘కాళ్ళ పారాణిచిక్కన నృత్యవేళల
చెమటలో కరిగిపోసినది ‘చార’
చక్రభ్రమణ వేళ జలతారు తలకట్టు
తెగిన ముత్యాలు దిద్దినవి ‘ముగ్గు’
శ్రామకేళికావేళ వాదించి ప
చ్చీసులో నెంచి కచ్చినది ‘పావు’
నృత్యగానపరీక్ష నెరిగి దినాభ్యాస
మునకు ధరించి విప్పినది ‘గజ్జె’
రేగిపోలేదు, చెరగను లేదు, కదలి
పంటగడి తప్పలేదు, సప్తస్వరాల
కనుగుణంబుగ మ్రోయ మానినది లేదు
నేటినికి కిన్నరాంగనా నిచయ మాంధ్ర
రాజకన్యానుసరణ పర్వతమందు
తెలుగు నర్తనశాలలో తిరుగుకతన’’
ఆమె వివశంగా సన్నని గొంతుతో పాడుకుంటున్నది. అకస్మాత్తుగా గోవిందరాయడి రాక ఒకింత విస్మయం కలిగించింది.
‘‘మంజరీ! ఇక్కడ్నించి త్వరగా వెళ్ళిపో! అపాయం’’ హెచ్చరించిన అతను మరుక్షణంలో మాయమయ్యాడు.
ఆమె తేరుకుని వెంటనే పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకుంది. వెనుక కత్తుల శబ్దాలు విన్పిస్తున్నాయి. ఏం జరుగుతుందిక్కడ? విజయనగరం నివురుకప్పిన నిప్పులా ఉంది.
‘‘ఈ నిప్పు జ్వాలగా ఎగయకముందే చల్లార్చు స్వామి!’’ విరూపాక్షుని
ఉద్వేగంగా ప్రార్ధించింది మంజరి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయల మందిరంలో సేనానాయకుడు రామలింగనాయకునితో సమావేశమయ్యారు ప్రభువు.
‘‘ప్రభూ! చిన్న పామునైనా పెద్ద కర్రతోనే…’’ రామలింగనాయకుని ఆత్రుత అది.
‘‘మాకు తెలుసు రామలింగనాయకా! ఇస్మాయిల్‌ ఆదిల్‌ఖాన్‌పై దాడి జరిపి రాయచూర్‌ను మన స్వంతం చేసుకున్నది సముచితమే! అయినా స్వమత కారణంగా గోల్కొండ, అహ్మద్‌నగర్‌, బీదర్‌, బీరార్‌ పాలకులు మనపై కత్తిగట్టారు. ఆదిల్‌ఖాన్‌కు రాయచూర్‌ తిరిగి ఇవ్వాలట. హు!’’ రాయలు సింహంలా జూలు విదిల్చి మళ్ళీ అన్నాడు కోపంగా`
‘‘అదెన్నటికీ జరుగదు. ఆదిల్‌ఖాన్‌ని వచ్చి నా పాదాలను ముద్దుపెట్టుకో మనండి. అలాచేస్తే అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తామని కబురు పంపండి.’’
‘‘కానీ ప్రభూ!’’
‘‘మా ఆజ్ఞ’’ ప్రభువు మందిర అంతర్భాగంలోకి విసవిసా వెళ్ళిపోవటంతో రామలింగనాయకుడు నిస్సహాయంగా చూశాడు.
ప్రాణాలొడ్డి సాధించిన రాయచూర్‌ను తిరిగి ఆదిల్‌ఖాన్‌కు అప్పగించటమా! ఇది విజయనగర ప్రతిష్టకే మాయని మచ్చ. తిమ్మరుసుల వారేమని యోచించారో! ఆదిల్‌ఖాన్‌ రాయల్ని కలవటానికి సిద్ధంగానే ఉన్నాడు. సరిహద్దులోకి రమ్మని కబురంపాలని ప్రభువు ఆజ్ఞ. కానీ అతను వస్తాడా? బెల్గామ్‌ సుల్తాన్‌ లారీ కూడా జిత్తులమారి. నమ్మటానికి లేదు. ఆలోచిస్తూ రామలింగనాయకుడు మందిరం బయటికి వస్తుండగా వీరేంద్రుడు ఎదుటపడ్డాడు.
‘‘రామలింగ నాయకులేదో రాచకార్యం నిర్వర్తించడానికి వచ్చినట్లున్నారే’’ వెటకారంగా ప్రశ్నించాడు.
రామలింగనాయకుడు అతనికేసి తీక్షణంగా చూశాడు.
‘‘మా సైన్యంలోకి దూరిన నక్కల్ని ఏరిపారేయటానికి’’ విసురుగా జవాబిచ్చాడు.
‘‘నక్కలకీ తెలివి ఉంటుంది మిత్రమా!’’ వీరేంద్రుడు వ్యంగ్యంగా అన్నాడు.
‘‘సింహాలముందు ఆ తెలివి పనిచేయదులెండి’’ అంటూ రామలింగ నాయకుడు బయలుదేరాడు.
వీరేంద్రుడు పళ్ళు పటపట కొరికాడు.
‘‘సింహమా! ఎవరో అదీ తేలుస్తానురా! నేనిక్కడ అడుగుపెట్టిందే ఈ విజయనగరాన్ని మట్టి చేయటానికి. మీరెంత సైన్యపాలన చేసినా ఈ వీరేంద్రుని తెలివితేటల ముందు చిల్లపెంకులే. మా అమ్మాయినిచ్చి పెళ్ళిచేశామని లోకువయ్యామేమో! అది పెళ్ళా? శ్మశానానికి దారి. అన్నపూర్ణ వట్టి పిచ్చి పతివ్రత. భర్తే దైవం, జగన్నాథం అనుకుంటున్నది. ఆమెకెంత చెప్పినా తిమ్మరుసుని తండ్రిలా భావిస్తున్నది. తిమ్మరుసుకు రాజుకు మధ్య దూరం పెంచనిదే, స్పర్థ రేకెత్తించనిదే నా పని సులభం కాదు. మహాభారతంలో శకునే నాకు ఆదర్శం’’ అనుకుంటూ కళ్ళెగరేశాడు క్రూరంగా.
స్వపక్షంలోనే ఉంటూ స్వపక్ష వినాశనం ఎలా చేయాలో నేర్పిన గురువు శకునే కదా!
‘‘రాయలు పోర్చుగీసువారితో స్నేహంచేసి పరాయిపాలనకు బీజం వేస్తున్నాడు. ముస్లిం రాజుల ఐక్యతకు దోహదపడ్తున్నాడు. ఇవన్నీ నాకే లాభిస్తాయి. నా లక్ష్యం ఒకటే! విజయనగర పతనం. అంతే! దీనికోసం అన్నపూర్ణ ప్రాణం తీయాల్సివచ్చినా వెనుకాడే ప్రసక్తి లేదు. జగన్నాథ’’
లోపలికి వెళ్తున్న వీరేంద్రుని రహస్యంగా అనుసరిస్తూ పొంచి ఉండి అంతా విన్న చంద్రప్ప కర్తవ్య స్ఫురణతో మెరుపులా తిమ్మరుసు మందిరం వైపు కదిలాడు.

You may also like

Leave a Comment