Home కథలు భువిలో స్వర్గం

భువిలో స్వర్గం

by Kattekola Vidyullata

హిమాంశ్ – మణిపూర్‌లో పనిచేస్తున్న ఒక యువ ఇంజినీర్.

సుష్మిత – తమిళనాడులో పుట్టి పెరిగి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.

ఒక వివాహ పరిచయ వేదిక ద్వారా కలుసుకున్న వీరు, ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు పూర్తైంది. ఒకరికొకరు తగిన సహచరులుగా నిరూపించుకున్న  ఈ దంపతులు, తమ జీవితంలో మొదటి మూడు సంవత్సరాలు నిత్యజీవన పోరాటాలలో గడిపేశారు.

ఉద్యోగాలలో స్థిరత్వం వచ్చేసరికి, కొంత సమయం తమకోసం గడపాలనిపించింది. “నువ్వెప్పుడూ చెబుతూ ఉంటావుగా కాశ్మీర్ గురించి… స్వర్గమేనంటూ,” అన్నాడు హిమాంశ్.

ఆ మాటకు మురిసిపోయింది సుష్మిత. బాల్యంలో పుస్తకాల్లో చూసిన దాల్ సరస్సు, టులిప్ తోటలు, మంచుతో కప్పిన పర్వతాలు—తన కలల ప్రపంచం కళ్ళ ముందు కదలాడింది.

విమానం కాశ్మీర్ మీదుగా వచ్చినప్పుడు, వారిద్దరూ కిటికీ పక్కన కూర్చొని చూసిన దృశ్యం జీవితంలో మరువలేనిది. ఎత్తయిన పర్వతాలపై కురిసిన మంచు కప్పు, గగనాన్ని తాకే చిలిపి మేఘాలు, తాను ఊహించుకున్న రకాల రకాల పూల పరిమళం అప్పుడే తన నాసికను తాకిన అనుభూతి కలిగింది సుస్మిత కు.

“ఇది నిజంగా మన భారత్ లోనిదేనా?” అని ఆశ్చర్య పోయారు ఇద్దరూ.

శ్రీనగర్ చేరుకున్న మరుసటి రోజు వారిద్దరూ దాల్ సరస్సు సందర్శించేందుకు బయలుదేరారు. అలసిపోయిన మనసుకు అది ఒక శాంతి నిలయం. ఓ బోట్ హౌస్‌లోకి ఎక్కి, ఆ ప్రశాంతత మధ్య ప్రేమతో మాటలు చెప్పుకుంటూ సాగిపోయారు.

చుట్టూ దర్పణంలా మెరుస్తున్న నీళ్లు, వాటిలో ప్రతిబింబించే పర్వత శిఖరాలు, బోటు మీద కొలువైన కాష్మీరీ కళాకృతులు ఇవన్నీ ఒక గంధర్వ లోకాన్ని తలపించాయి. అక్కడే ఓ పూల బోటులో అమ్మాయిలు వదిలిన టులిప్ పూలు, ఆర్చిడ్ల పరిమళాలు శ్వాసలో నింపుకున్నారు.

“ఇదేనా మన కలల ప్రపంచం?” అని ఆశ్చర్యంగా అన్నాడు హిమాంశ్.

ఏప్రిల్ నెల. తక్కువ గాలి, మంచు ఇంకా కాస్త బాగానే ఉంది. శ్రీనగర్ చేరుకున్న రోజు నుంచే వాళ్లను అబ్బురపరిచిన పర్వతాలు, పూల తోటలు, దాల్చిన చెట్లు, చలిగాలి ఒకరిపై ఒకరికి మరింత అనురాగాన్ని పెంచుతున్నాయి. ఈ ప్రయాణానికి తన అత్తమామలను కూడా రమ్మని ఎంతగానో కోరింది సుస్మిత. వీరికి ఏకాంతం కలిగించేందుకో, లేక నిజంగానే చెప్పారో, “ నా ఆరోగ్యానికి అంత చల్లని వాతావరణం సరిపడదమ్మా, మీరు వెళ్ళండి. మరేదైనా తీర్థయాత్రకు అందరం కలసి వెళదాం,”  అంటూ తన మాట తోసి పుచ్చిన అత్తగారితో తన మనసులోని భావాలు పంచుకునేందుకు ఫోన్ చేసింది.

“అత్తయ్యా! మీరు చూడాలి ఈ పువ్వుల తోటల్ని… మన జీవితంలో ఒక్కసారైనా రావాలి ఇక్కడకి. భూమి మీద స్వర్గం అంటే ఇదే అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది,” అంటూ ఫోన్‌లో ఉద్వేగంతో చెప్పింది సుష్మిత.

“చాలా సంతోషం తల్లీ, నువ్వు ఎంతగా ఆనందిస్తున్నావో నీ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. హాయిగా ఎంజాయ్ చేయండి. నాకూ, మీ అమ్మకూ మంచి షాల్స్ తీసుకురండి. సంతోషంగా తిరిగి రండి,” నిండుగా ఆశీర్వదించారు పార్వతి గారు.

తరువాత శ్రీనగర్ లోని ఓ ప్రముఖ ఆర్కిడ్ తోట. వివిధ రంగుల్లో విరజిమ్ముతున్న పూలు. వేలాది రంగుల పుష్పాల మధ్య నడవడం అంటే భూమిపై ఆకాశంలో నడిచినట్టే. సుష్మిత అబ్బురపడింది.

“ఒక్కో పువ్వు ఒక్కో భాషలో ప్రేమను పలికిస్తున్నాయనిపిస్తోంది,” అంది. హిమాంశ్ త‌న ఫోన్లో వాటి ఫోటోలు తీస్తూ నవ్వాడు. “నీ ముఖంలో ఆనందాన్ని చూసేందుకే ఈ ట్రిప్‌,” అన్నాడు ప్రేమగా.

అక్కడ నీలీ, పచ్చ, నారింజ రంగుల ఆర్కిడ్స్ తో పాటు, చాలా అరుదైన పుష్పాలు కూడా ఉన్నాయి. వాటిపై పడే మంచు తుంపర్లు, హాయిగా వీస్తున్న వసంతగాలులు — మదిని మంత్రముగ్ధం చేశాయి.

“ఇక్కడే ఓ చిన్న ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుండు,” అంటూ తన భర్త చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని మైమరపుగా అన్నది సుష్మిత.

బోట్ హౌస్ లో ఆ రాత్రి, చలిగాలి తాకుతూ ఉన్నా, సుష్మిత తన డైరీ తీసుకుని కాసేపు ఏదో రాసింది.

“ఏమిటది?” అడిగాడు హిమాంశ్.

“నీ కోసం. ఈ కాశ్మీర్ నాకు నిన్ను కొత్తగా పరిచయం చేసింది,” అంది. “ఏదీ, దేవిగారేం రాశారో మేం తెలుసుకోవచ్చా?” గోముగా అడిగిన హిమాంశ్ ను చూస్తూ తన పేరు లాగానే వెన్నెలలా హాయిగా నవ్వింది సుస్మిత.

ఈ మంచు చల్లదనం కంటే నీ పలుకులు మృదువైనవి,

ఈ సరస్సు ప్రశాంతతకంటే నీ మౌనం లాలిత్యమైనది.

ఈ పర్వత శిఖరాలను మించినవి

మనం ఆశగా అల్లుకున్న జీవన శిఖరాలు!

పూల తోటల మధ్య విహరిస్తున్నా,

నీ శ్వాసే నాకు గొప్ప పరిమళం.

ఇక్కడి వర్ణాలు, వాయువులు, నీటి ప్రతిబింబాలు

అన్నీ నాకు నీవైపే చూపిస్తున్నాయి.

ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే

నిన్ను చూస్తే చాలనిపిస్తోంది.

నీవుంటే – ఈ పయనం పూర్ణం,

నీవే లేకపోతే – కాశ్మీర్ కూడా రంగులేని శూన్యం.

హిమాంశ్ నిశ్శబ్దంగా ఆమె కవితను విన్నాడు. ఆమె కళ్ళలో తనకోసం మెరిసిన ప్రేమలోతులు అర్థమయ్యాయి. ఆ క్షణం బోట్ హౌస్‌లో కాకుండా, వాళ్లు ప్రేమ అనే మరొక లోకంలో విహరించారు.

*************************

ఓ స్థానిక టూర్ గైడ్‌తో కలిసి మరికొంతమంది పర్యాటకులను కలసుకుని పహల్గామ్ చూడాలని నిర్ణయించుకున్నారు. చుట్టూ మంచు పర్వతాలు, నదుల ప్రవాహం. అక్కడే కొత్తగా పరిచయమైన బెంగుళూరుకు చెందిన నవవివాహిత దంపతులు – అనీష్, నీతా. వాళ్లతో కలసి సాయంత్రం హడావుడిగా గడిపారు.

“ఓ… నీతా ఎంత బాగుంది నువ్వు కట్టుకున్న దుపట్టా. మా ఆడపడుచుకి కూడా ఇలాంటిదే  తీసుకుంటాను,” అని సుష్మిత చిరునవ్వుతో చెప్పింది.

తర్వాతి రోజు పహల్గామ్‌కు బయలుదేరారు. పర్వతాల మధ్య నెమ్మదిగా ప్రయాణించి ఒక చిన్న మైదానం దగ్గర బస్ ఆగింది. పర్యాటకులంతా దిగారు. కొందరు ఫొటోలు తీస్తుంటే, కొందరు ఆ ప్రాంతం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మరికొందరు ఎడ్వెంచర్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వీరిద్దరూ తమ తల్లిదండ్రుల కోసం కశ్మీరీ శాలువాలు కొనాలనుకుని కొండ దిగువ దుకాణం వద్దకు వెళ్లారు.

కొంతసేపటికి టపటపా గాలిలో తూటాల మోత. పర్వత మార్గం అంతా గర్జనలతో, అరుపులతో మారుమోగింది. ప్రజలు పరుగులు, ఏడుస్తూన్న పిల్లలు, రక్తపు మడుగులో పర్యాటకులు, భీకరమైన మానవ సృష్ట దుశ్ఛర్య.

కొంత సేపటి తర్వాత సైన్యం వచ్చి పరిస్థితిని నియంత్రించగలిగారు. కానీ అప్పటికే… అనేక ప్రాణాలు మట్టిలో కలిశాయి.

హిమాంశ్ సుష్మిత అక్కడే ఉండాల్సింది. వారు షాల్ దుకాణానికి వెళ్లడం వాళ్ళ ప్రాణాలకు రక్షణగా మారింది. అదే సమయంలో తమ పెద్దవారి కోసం శాల్స్ కొనేందుకు వెళ్ళడం, వారి ఆశీర్వాదమేనేమో! కానీ, వారి కళ్ళముందు బాధాకరమైన దృశ్యం. అనీష్‌ను, నీతా భర్తను కాల్చి చంపారు ఆ ఉన్మాదులు. తల్లడిల్లిన నీతా, భర్త శవాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తుంటే, అక్కడ ఉన్న వారి హృదయాలు బద్దలయ్యాయి.

“ఇక్కడ మనిషిగా జీవించడం ఎంత కష్టం అన్నది ఇప్పుడు అర్థమయింది,” అంది సుస్మిత. ఆమె మాటల్లో ఉలిక్కిపాటు లేదు, ఉత్కంఠ లేదు — ఒక తీవ్రమైన మనోవేదన ఉంది. ఆ క్షణం వరకూ స్వర్గాన్ని తలపించిన ఆ ప్రాంతంలో మృత్యువు కరాళ నృత్యం చేయడం కళ్ళారా చూడడంతో ఆమె షాక్ కు గురయింది.

ఆ 26 మంది అమాయక హిందూ పర్యాటకులు, తమ కుటుంబాలతో కశ్మీర్ లోని పహల్గాం, గల్గస్, సోనమార్గ్ లాంటి అందమైన ప్రాంతాలు చూసేందుకు వచ్చినవారే. కానీ మతాన్ని అడిగి, ‘నువ్వు హిందువా? ముస్లింవా?’ అని ప్రశ్నించి, ‘హిందువు’ అని చెప్తేనే మృత్యుదండన విధించిన ఉగ్రవాదుల చర్య యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది.

ఈ వార్త కశ్మీర్ లోని స్థానిక చానెల్ లో వెలువడగానే, దేశవ్యాప్తంగా మీడియా దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేయసాగింది. “పహల్గామ్ లో ఉగ్రవాదుల పైశాచికత్వం. మతం అడిగి మరీ 26 మంది అమాయక హిందూ పర్యాటకుల హత్య.” దేశమంతా ఉలిక్కిపడింది.

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద యువతతోపాటు పెద్దలూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ముంబైలో, బెంగుళూరులో, హైదరాబాద్‌లో, కోల్‌కతాలో నిరసనలు ఎగిసిపడ్డాయి. సోషల్ మీడియాలో –

#JusticeFor26, #StopTerrorin Kashmir, #HindusAreNotSafe అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

పోలీసులు, సైన్యం తీవ్రంగా అలర్ట్ అయ్యాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి.

ప్రధానమంత్రి తక్షణమే విదేశీ పర్యటన రద్దు చేసుకుని తిరిగి వచ్చారు. టీవీ చానెళ్ల ద్వారా దేశ ప్రజలతో ప్రత్యక్ష ప్రసంగం చేశారు. “ఈ ఉన్మాద చర్య మన దేశ గౌరవాన్ని విచ్ఛిన్నం చేయడమే కాదు, ఇది మానవత్వం పై దాడి. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తాం. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రమే కాదు, వారికి మద్దతుగా నిలిచిన వారికి కూడా తగిన గుణపాఠం నేర్పుతాం,” అని ప్రకటించారు.

ఆ తర్వాత ప్రయాణం ఆగిపోయింది. మరుసటిరోజు తిరుగు ప్రయాణం అయ్యే లోగా తమ బంధువులంతా తమ యోగక్షేమాల గురించి వాకబు చేస్తుండడంతో వారికి తమ క్షేమ సమాచారాన్ని మెసేజ్ ద్వారా తెలిపారు వారిద్దరూ.

భారమైన హృదయంతో తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు జీవితంపై వారి దృక్పథం మారింది. వాళ్లు హోటల్ నుంచి ఇంటికి ఫోన్ చేసినప్పుడు, “ఇక్కడి ప్రజలకు ఈపాటికే మనసులు విరిగి పోయి ఉండాలి. అయినా సరే, చిరునవ్వుతో మనల్ని స్వాగతిస్తున్నారు,వారికి ధన్యవాదాలు,” చెప్పింది సుష్మిత తన తల్లితో.

హైదరాబాద్ చేరుకున్న తర్వాత, సుష్మిత తన ఉద్యోగంలోకి వెళ్లే ముందు చిన్న మెసేజ్ వ్రాసి టేబుల్ మీద పెట్టింది.

“ప్రతి ఉదయం నా కళ్లెదుట నువ్వు ఉండటం ఒక అద్భుతం. ప్రతిరోజూ మనం మనసు విప్పి మాట్లాడుకోగలిగితే – అదే నిజమైన స్వర్గం. కాశ్మీర్ ఇది నేర్పింది.”

ఆ ప్రయాణం వారిద్దరిలో మార్పు తీసుకొచ్చింది — సహజమైన అందం పట్ల ప్రేమను, మానవీయత పట్ల మమకారాన్ని, ఒకరి జీవితంలో మరొకరి విలువను మరింత లోతుగా అర్థం చేసుకునే సాధనగా మారింది.

ప్రకృతి ఎంత అందమైనదైనా, మనిషి హృదయం కన్నా పెద్ద స్వర్గం లేదు. మనం ప్రేమతో, శాంతితో జీవించగలిగితే, ఏకంగా ఒక కాశ్మీర్ మన హృదయంలోనే నెలకొంటుంది.

You may also like

4 comments

Esperanza2101 May 29, 2025 - 7:38 pm Reply
Elinor818 May 30, 2025 - 3:17 am Reply
Kaleb3481 May 30, 2025 - 11:44 am Reply
Marcel4195 May 30, 2025 - 7:25 pm Reply

Leave a Comment