ప్రతీ ప్రళయం తరువాత జగాలన్నీ లయమైన తర్వాత తిరిగి పునః సృష్టి చేసేటప్పుడు బ్రహ్మకు సృజనాత్మకత ఇచ్చేది బ్రాహ్మి. ఈమె సృజన ఆలోచించగానే సృష్టి జరుగుతుందని, ఈ మొత్తం కార్యం బ్రహ్మం ఆదేశం ప్రకారం జరుగుతుందని భగవద్గీతలో చెప్పబడింది.
సృజనాత్మకత ఏ యుగానికైనా స్ఫూర్తి ఆధారంగా నడిచింది. మానవ కళ్యాణానికి, అభివృద్ధికి, ఆధ్యాత్మి విద్య, విజ్ఞాన శాస్త్రాలు రెండూ అవసరమే!
మానవ ఔన్నత్యం కోసం విద్య ఎంతో అవసరం.
ఆ విద్య రావాలంటే విద్యలకు దేవత ఐన సరస్వతీ కటాక్షం ఎంతో అవసరం.
ఈ కటాక్షాన్ని సంపాదించాలంటే విజ్ఞానం, ఆత్మ క్రమశిక్షణ ( అలసత్వం లేకుండా ఉండడం- అలాగే తుచ్ఛ విషయాలను కోరకుండా ఉండడం) ఉన్నప్పుడే విజ్ఞానమూ, కళలూ మన స్వంతమవుతాయి.
సరస్వతీ దేవి అనగానే మన కంటి ముందు ఒక రూపం వీణా పుస్తక ధారిణి కదలాడుతుంది.
అమ్మ దయ లేకుంటే మన నోటి వెంట మాటే రాదు! ప్రపంచం అంతా మాటతోనే ఒకరికొకరి మధ్య సంబంధం ఉంటుంది. అటువంటి మాటకు దేవత శబ్దాదిష్టాన దేవత రూపంగా మనం కొలుస్తాము.
జీవితం ఒక సృజన శీలమైన యాత్ర!
చీకటి నుండి వెలుగులోనికి పయనించే దీర్ఘమైన ప్రయాసలతో కూడిన ఈ మన ప్రయాణం చక్కగా జరగాలంటే జ్ఞానం అవసరం.
అందుకే మన ఋషులేనాడో అంటే 2 శతాబ్ది లోనే సరస్వతి దేవి స్తోత్రాలు, ప్రస్తావన, ఫలశ్రుతులు చెప్పారు. సరస్వతీ రహస్యోపనిషత్తు మధ్య యుగంలోనే చెప్పారు.మన దార్శనికులు. వేదంలో రుక్కుల వలె కీర్తించి, అమ్మవారి ఆరాధన తర్వాత శ్లోకాలలో రాసారు.
మయి మేధాం మయి ప్రజాం మయీన్ద్ర ఇంద్రియం దధాతు
మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు
ఓం హంస హంసాయ విద్మహే
పరమ హంసాయ ధీమహీ! తన్నోహంసః ప్రచోదయా” త్॥
ఇలా సరస్వతి దేవిని స్తుతిస్తుంది ఈ సూక్తం.
పలుకులమ్మ అనుగ్రహం కలగాలంటే నేర్చుకున్న విద్య జ్ఞాపకం ఉండాలంటే ఈ మేధా సూక్తాన్ని రోజు పఠిస్తారు. జ్ఞానదేవత జ్ఞానాన్నిస్తుంది కనుక నిత్యం పఠించవలసిందీ శ్లోకం.
హంస శ్వాస యొక్క ఉచ్ఛ్వాస- నిశ్వాసాలను చక్కగా వచ్చేలా చేయమని ప్రార్ధించారంటే శక్తి ఒక్కటే! ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, సుపర్ణుడు (గరత్మంతుడు), యముడు, వాయువు మొదలైన పేర్లతో భావన చేస్తుంటారు. కానీ జ్ఞానప్రదాత సరస్వతీ మాతగాను, హంసగాను స్తుతిస్తారు! జ్ఞానానికి ప్రతీక హంస! అందుకే
యా దేవి సర్వభూతేషు బుద్ధి రుపేణ సంస్థితా
ఎన్ని రూపాలలో ఉన్న శక్తి మాత్రం ఒకటే! సరస్వతీ దేవి విద్యా దేవత! ఈమనే జ్ఞానాన్ని ఇచ్చి మంచి పనులు చేయిస్తుంది. అని ఋషులు చెప్పిన మాట!
వాగ్దేవతే — బుద్ధి దేవత!
మన మాటను నియంత్రించుకుంటూ, స్వచ్ఛంగా ఉంచుకుంటే మనం వివేకవంతులమౌతాము. ఆ వివేకంతో శాంతి- సంతోషాలు మన స్వంత మౌతాయని ఆది శంకరాచార్యులు వివేకచూడామణిలో…
యోగస్య ప్రథమం ద్వారం వాఙ్నిరోధః (శ్లో.367)
యోగానికి మొదటి మెట్టు వాక్ సంయమనము- అని అన్నారు.
మనశ్శాంతి కావాలంటే ఇతరులలో తప్పులు వెదకకుండా ఉంటే దానంతట అదే వస్తుంది. మేలు చేయాలనే ఆలోచన వస్తుంది. పరోపకారం తలపెడతాము! ఈ హృదయ వైశాల్యం వల్ల ప్రపంచమంతా తన ఇల్లే ఔతుంది!
సరస్వతీ దేవి విద్యా దేవత నే కాకుండా మనం వాగ్దేవిగా కొలిచే సరస్వతీ దేవి మనం మాట్లాడడానికి – మనలోని భావాన్ని వ్యక్తం చేయడానికి – శక్తినిస్తుంది. మనం ఏదైతే చూస్తున్నామో? దానిని ఎదుటి వారికి చెప్పగలుగుతున్నామంటే అమ్మ దయవలనే కానీ మరొకటి కాదు!
చదివిన దాన్ని మాటగా మార్చి, భావం చెడకుండా కూర్చగలిగి, మాట్లాడగలగడం వాగ్దేవి దయనే! అలా అమ్మ దయగల వారు మాత్రమే మంచి ఉపన్యాసకులుగాను, రచయితగానూ, కళాకారులుగాను రాణిస్తున్నారు.
ఇది ఒక క్రమ ప్రకారం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రజ్ఞతో ఒక విషయాన్ని తయారు చేసి, దాన్ని మాట ద్వారా చక్కగా చెప్పగలగడం– ఈ మూడింటికి వాక్కుగా సత్య రూపిణి, ఉక్తి సౌందర్య రూపిణి , సూక్తి శివ రూపిణి గా కవులు భావిస్తారు.
అందుకేనేమో? కాళిదాసు తన శ్యామలా దండకంలో…
మాణిక్య వీణాముపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్రద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి అని అన్నారు.
భావమేమంటే?…
రత్నాల వీణను వాయిస్తూ… మృదువైన మధురమైన మాటటలతో కూడిన ఇంద్రనీలమముల వలె ప్రకాశించే కోమలమైన శరీరం కల మాతంగా కూతురా! ( శ్యామలా దేవి)
ఇక్కడ సౌందర్యంతో పాటు వాక్చాతుర్యాన్ని తెలుపుతున్నదీ స్తోత్రం.
ఈ వాక్చాతుర్యం కూడా మనకు అలవడేది పలుకులమ్మ దయవలెనే!సరస్వతీ దేవిని శబ్దానికి దేవతగానూ కొలిచారు!
శ్లో॥ భవాంభోజ నేత్రజ సంపూజ్య మానాంలసన్మంద
హాస ప్రభా భక్త చిహ్నం౹
చలచ్చంచలా చారు తాటంక కర్ణాం భజే
శారదాంబా మజస్రంమదంబామ్॥
అని మల్లినాథ సూరి వేడుకున్నాడంటే ఈ ప్రపంచం మొత్తం సరస్వతీ శక్తి ఆధారంగానే జీవిస్తున్నదని, ఆమె పాదాలు పట్టుకుని శరణు వేడుతున్నానంటాడు మహామహోపాధ్యాయుడు.
అంతే కాదు ! సంగీత స్వరాల రూపు సరస్వతి!
ఒక అక్షరం – మరొక అక్షరంతో కలిసి, కొన్ని అక్షరాలతో పదమై, ఆ పదాలు కొన్ని కలిసి, వాక్యమై, అలా కొన్ని వాక్యాలు కలిసి కావ్య రూపమై రావడానికి మూలం – పలుకులమ్మ! ఆ అమ్మ ను గురించి చెప్పడానికి నా కు తెలిసిన ఈ కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు, కొన్నివాక్యాలు సరిపోతాయా? సరిపోవు! గాక సరిపోవు! కనుకనే అమ్మా సరస్వతీ దేవీ! నీవు నన్ను అనుగ్రహించి, నిన్ను తెలుసుకునే జ్ఞానాన్ని ఇమ్మని వేడుకుంటూ….
అలా తనను నమ్మి, కొలిచిన ఎందరికో విద్యా ప్రాప్తిగా దీవించే అనంత సాగరి సరస్వతీమాత భక్తులకు కొంగు బంగారమే!
కోరిన వరాలిచ్చే మాత! సరస్వతీ మాత !
