– డా.కాలువ మల్లయ్య
వెయ్యికి పైగా కథలు, పద్ధెనిమిది నవలలు, వందలాది వ్యాసాలు రచించిన ప్రసిద్ధ కథకులు, నవలాకారులు డా. కాలువమల్లయ్య గారితో మయూఖ ముఖాముఖి – అరుణ ధూళిపాళ
కథా రచయితగా , నవలా రచయితగా ప్రసిద్ధిపొంది స్త్రీ, దళితవాద అభ్యున్నతి కోసం తెలంగాణ అస్తిత్వ చైతన్యం కోసం నిరంతరం తపించే అభ్యుదయ రచయిత కాలువ మల్లయ్యగారి జీవిత విశేషాలను, ఆయన కథ, నవలా పరిణామాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్,
1ప్ర:- మీ రచనల ద్వారా అనేకులను చైతన్యపరుస్తూ వస్తున్న మీ బాల్య విద్యా విశేషాలను మా పాఠకులకు తెలపండి.
జ:- నమస్కారం. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నేటి పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలో జనవరి 12, 1952లో గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టాను. అది పారిశ్రామిక నాగరితకు దూరంగా ప్రకృతి సౌందర్యంతో అలరారే ఊరు. నా జీవన నేపథ్యం కూడా కష్టాలలో కూడుకున్నది. మాతండ్రి ఆ కాలంలో నాలుగవ తరగతి చదువుకున్నవాడు. నన్ను బాగా చదివించాలన్న కోరిక ఆయనకు, మా అమ్మకుండేది. ప్రత్యేకంగా ఒక స్కూల్ అంటూ మా ఊరికి లేదు. ఏదో ప్రయివేటుగా బడిలాగా ఉండేది. నేను చదువుతున్న క్రమంలో అది హైస్కూల్ గా మారింది. నేను చదువుకోవాలంటే ఆ ఊరి దొరను పర్మిషన్ అడగాలి. మా నాన్న నన్ను తీసుకొని పోయిండు. అప్పుడా దొర “చదువుకుంటే చెడిపోతరు. మీకు ఎట్లా ఎల్తది? వ్యవసాయం, గొర్లు ఉన్నయి కదా! చూసుకోమను” అనడం నేను విన్నాను. బాగా కోపం వచ్చింది. పిలగాన్ని నేనేం చేయగలను? అయితే మా నాన్న ఆ మాటలను ఖాతరు చేయకుండా నన్ను స్కూల్లో చేర్పించాడు. 9వతరగతి దాకా ఆ ఊళ్ళో చదువుకున్నా. అన్నిటిలో ఫస్ట్ ఉండేవాణ్ణి. నేను నాలుగవ తరగతిలో ఉన్నప్పుడే
ఫస్ట్ రావడం చూసి నన్ను స్కూల్ కి పంపొద్దు అన్న దొర
నన్ను ఇంటికి పిలిపించుకొని తన ఇంట్లో ఉండి చదువుకోమన్నాడు. ఆయన కొడుకు పురుషోత్తం నా క్లాస్ మేట్. వాళ్ళు కరణాలు. అయినా నన్ను బాగా ప్రోత్సహించాడు. హై స్కూల్ ఎలిగేడులో చదువుకున్నా.
పియుసి కరీంనగర్ లో చేశాను. 86.5% మార్కులతో మెరిటోరియస్ రావడంతో ఫస్ట్ లిస్టు లోనే ఓయూలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. నేను వద్దన్నా వినకుండా పురుషోత్తం ఇద్దరం కలిసి చదువుకుందామని నా సర్టిఫికెట్లను తీసుకొని పోయి అప్లై చేశాడు. దొర కూతురు అమెరికాలో ఉండేది. ఇద్దర్నీ అమెరికాకు పంపుతామన్నాడు. మా నాన్న కూడా పొలం అమ్మి డబ్బులు ఇస్తానన్నాడు. అక్కడికి వెళితే సుఖం వస్తుంది. కానీ సంతృప్తి రాదు కదా! స్వదేశం నుండి వెళ్లిపోవడం నాకు ఇష్టం లేకుండే. నా సుఖం కంటే నావాళ్ళతో కలిసి ఉండడమే మంచిదని భావించాను. బిఎస్సీ లో జాయిన్ అయిన. లిటరేచర్ లో అప్పటికే ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ వయసులోనే పద్యాలు రాసేవాడిని. బిఎస్సీ తరువాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన. తరువాత పిజి, డిపిఆర్ చేసిన. ఎమ్ ఏ తెలుగు, పిహెచ్ డి చేసిన. అప్పటికి గానీ నా చదువు దాహం తీరలేదు.
2ప్ర:- మొదట సైన్స్ స్టూడెంటుగా ఉండి, విద్యాధికులైన మీకు సాహిత్యం పట్ల కాంక్ష పెరగడానికి కారణం ఏమిటి?
జ:- మా నాన్న తాను చదువుకున్నది కొంతవరకే అయినా పురాణ కథలు, రామాయణం మొదలుకొని డిటెక్టివ్ నవలల వరకు చదివేవాడు. మా పంచాయతీ లైబ్రరీలో శరత్ సాహిత్యం వంటి అనేక పుస్తకాలు ఉండేవి. అవి ఆయన తెచ్చేవాడు. కరీంనగర్ కు వెళ్లినప్పుడల్లా పేపర్ తెచ్చేవాడు. రామాయణ, మహా భారతాలు, భట్టి విక్రమార్క కథలు మాకందరికీ చెప్పేవాడు. నేను నాల్గవ తరగతికి వచ్చిన తరువాత నాతో చదివించి భావం తాను చెప్పేవాడు. మా ఇంటిముందే జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఊళ్ళో రకరకాల వృత్తుల వారిని చూశాను. సాధనా శూరులు, శారదకాండ్రు, గంగిరెద్దుల వాళ్ళు, కాటి కాపరులు, గుడ్డేలుగులోళ్లు, చిందుభాగోతులు, బుర్రకథలు చెప్పేటోళ్లు, నాటకాలు ఆడేటోళ్ళు ఇట్లా రకరకాల వృత్తులవారు ఆటాపాటలతో కథలు చెప్పేవారు. అట్లా కథల మీద, పాటల మీద ఆసక్తి ఏర్పడింది. ఊళ్ళో ఎన్నో సంఘటనలు, దోపిడీలు చూస్తున్నప్పుడు వీటి మీద ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆరవతరగతిలో
ఉన్నప్పుడే ద్విపదలో పద్యాలు అయిదారు పేజీలు రాసి మా తెలుగు సార్ కు చూపెట్టిన. ఆయన ఇవన్నీ ఇప్పుడే వద్దని, కవిత్వం ఎవరుపడితే వాళ్ళు రాసేది కాదని, ఋషి అంశ ఉన్నవాళ్లే రాయాలని మంచిగా చదువుకోమని వాటిని చింపేశాడు. దాంతో కసి పెరిగి అయితే కవే కావాలి అనుకున్నా. పట్టుదల పెరిగి పద్యాలు రాసి కాపీలో భద్రపరచుకునేవాణ్ణి. మా స్కూల్ లైబ్రరీలో, పంచాయతీ లైబ్రరీలో నేను చదవని పుస్తకం లేదు. డిగ్రీకి వచ్చాక రెండు మూడు కథలు రాశాను. భువనపల్లి వెంకట రామారావు, మలయశ్రీ, అంపశయ్య నవీన్ లతో పరిచయం ఏర్పడింది. 1971లో ‘విధివ్రాలా?’ అని నవల రాసి అప్పుడు ఎలిగేడులో ఉపాధ్యాయునిగా ఉన్న మలయశ్రీకి చూపెడితే పోగొట్టాడు. బ్రహ్మరాతను బట్టికాక మనం చేసే పనులవల్ల మన భవిష్యత్తు, అభివృద్ధి ఉంటాయని అందులో రాశాను. కథ గుర్తుంది కాబట్టి మళ్లీ అదే నవలను రాశాను. అదే నా మొదటి నవల అని కూడా చెప్పొచ్చు.
3ప్ర:- సినారె గారితో మంచి పరిచయం ఉందని మీరే స్వయంగా చెప్పుకున్నారు. మీపైన ఆయన ప్రభావం ఏవిధంగా ఉందో చెప్పండి.
జ:- మాది కరీంనగర్ జిల్లా కాబట్టి ఆయనంటే నాకు చాలా అభిమానం ఉండేది. నన్ను కూడా ఆయన బాగా ప్రేమగా చూసేవాడు. 1974లో ఒకసారి ఆయన ఉస్మానియాలో పనిచేస్తున్నప్పుడు పిజి సీట్ కోసం అశోక్ నగర్ లో ఉండే ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన కూతురు గంగ తలుపు తీసింది. సి నారాయణరెడ్డి గారు ఉన్నారా? అని అడిగాను. ఆయనెవరు అన్నది. ఆశ్చర్యపోయి మళ్ళీ అడిగాను. అప్పుడు సి. నారాయణరెడ్డి ఇల్లు. గారు ఎందుకండీ అన్నది. అంతటి ఉదార స్వభావులు వాళ్ళు. ఆయన అప్పుడు కలవలేదు. ఆ పని కూడా జరగలేదు. నేను నాగ్ పూర్ లో జాయినయ్యాను. కానీ ఆ సంఘటన అట్లా గుర్తుండిపోయింది. ఆయన పాటలు, ఆయన కవిత్వం నాకు బాగా ఇష్టం. నేను మొదట్లో కవిత్వం రాస్తున్నప్పుడు అవి పత్రికల్లో వచ్చేవి. గతం వర్తమానం భవిష్యత్తు అని రాసిన. గతం మీది, వర్తమానం ఘర్షణలది, భవిష్యత్తు మాది. అంటే పీడితులది అని. ఆయన “ఇది మంచి కవిత మల్లయ్యా! ఒకసారి నన్ను కలువు” అని ఉత్తరం రాశాడు. వెళ్లి కలుసుకున్న. అప్పుడాయన సాంస్కృతిక మండలి చైర్మన్ గా ఉండేవాడు. మా మామకు క్లాస్ మేట్ కూడా. నువ్వు
కథలు బాగా రాస్తున్నావు. నేను కవిత్వం రాస్తున్నాను. ఇద్దరం కరీంనగర్ వాళ్ళమే. మనదే రాజ్యం అన్నాడు. అంతటి వ్యక్తి అట్లా అనడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో చెప్పండి. ఆ తరువాత ఎన్నో సందర్భాలు. ఎన్నో జ్ఞాపకాలు. ఈ సందర్భంలో ఇలాంటి ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. నేను డిగ్రీ చేసేటప్పుడు శ్రీశ్రీ, వరవరరావు లాంటి వాళ్ళు కరీంనగర్ కు వచ్చారు. విరసం ఏర్పడ్డ సందర్భమది. దాన్ని ప్రచారం చేయడం కోసం వచ్చారు. మా స్నేహితుడు కోటేశ్వరరావు, ఇంకో ఇద్దరం కలిసి వెళ్ళాం. నేను కవిత్వం రాసుకున్న డైరీ పట్టుకుపోయిన. శ్రీశ్రీని కలిసి మీ అభిమానిని అని చెప్పిన. ఏం చేస్తావు? అని అడిగారు. కవిత్వం రాస్తాను సార్. అని ఆ డైరీ చూపెట్టిన. నా భుజం మీద చేయి వేశాడు. అదొక అభయహస్తం లాగా అనిపించింది. ‘గో ఎ హెడ్’ అన్నారు. ముందు బాగా చదువుకో అన్నారు. అప్పుడు కచ్చితంగా రాయాలని మనసులో స్థిరపడిపోయింది.
4. ‘తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం’ పైన పరిశోధన చేశారు. ఆ కథా సాహిత్యాన్ని ఎక్కడి నుండి ఏ కాలపు పరిధుల వరకు తీసుకున్నారు?
జ:- ఎమ్.ఏ చేసేవరకు అప్పటికే మూడు వందల కథలు రాశాను. అందువల్ల కథాసాహిత్యం మీద పిహెచ్ డి చేయడం వల్ల వేల కథలు చదవొచ్చు. ఎంతోమంది రచనా విధానం తెలుసుకోవచ్చు. నాకు చదువుకోవాలనుకున్న కోరికలో ఇంకా చదవడానికి ఇదే చివర కదా! అందుకే దాని అంతు తేల్చుకోవాలనుకున్నాను (నవ్వుతూ). అసలు ఏమాత్రం చదువురాని కుటుంబం నుండి వచ్చి ఇంతవరకు చదువుకొని వేల పుస్తకాలు చదవడం మామూలు విషయం కాదు కదా! పి హెచ్ డి కోసం రామశాస్త్రి గారి దగ్గరకు వెళ్ళాను. అప్పటికే పత్రికల్లో నా కథలు వస్తున్నాయి. తెలంగాణ మాండలికంలో చేస్తానంటే నువ్వు లింగ్విస్టిక్ కాదు కాబట్టి లిటరేచర్ లో చేయాలి అన్నాడు. అప్పుడు ప్రగతిశీల కథల మీద చేస్తాను అన్నాను. ఈ ప్రగతిశీల అనేది అభ్యుదయ కథగా అంతకుముందు ఉన్నప్పటికీ విరసం ప్రారంభమైన తరువాత విప్లవకథగా మొదలైంది. అంటే ఇది 1970 మాట ఇది. అప్పటినుండి 1990 వరకు ఇరవై ఏండ్ల కథా సాహిత్యాన్ని తీసుకున్నాను. వేయి పైన కథలను, రెండు మూడు వందల పుస్తకాలను సేకరించి నోట్స్ తయారుచేసుకున్నా. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలలోని పుస్తకాలు చదివేవాడిని. వాసిరెడ్డి నవీన్ దగ్గర అనేక పుస్తకాలు, కథలు ఉండేవి. తర్వాత చేకూరి రామారావు గారి దగ్గర పుస్తకాలు ఇవన్నీ చదివి వెయ్యిపేజీల పుస్తకం తయారుచేస్తే దాన్ని కుదించగా ఆరువందల పేజీల పుస్తకమయింది.
5ప్ర. ఉద్యోగజీవితంతో పాటు సాహిత్యరచనను సంబాళించుకుంటూ పూర్తిస్థాయి రచయితగా మారడం ఎప్పుడు, ఏవిధంగా జరిగింది?
జ:- ఉద్యోగం, క్వాలిఫికేషన్ పెంచుకోవడం, సాహిత్యం ఈ మూడింటిని సంబాళించుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండే రాస్తున్న విధివ్రాల, కొన్నికథలు, కొన్ని కవితలు అప్పటికే రాసిన. దాదాపు 1980 నుండి సీరియస్ గా రాయడం మొదలుపెట్టాను. అప్పటికే కొన్ని కథలు రాసినప్పటికీ 1983లో సృజన పత్రికలో ‘వెలి’ కథ మొదటిదిగా అందరూ చెప్తారు. 1986 – 87 సమయంలో విజయ్ కుమార్ నడుపుతున్న ‘జీవగడ్డ’ అనే పత్రికలో ప్రతీ ఆదివారం ఒక భేతాళ కథ రాసేవాడిని. కరీంనగర్ లో చదువుకుంటున్న కాలంలోనే నేను పత్రికలు చదివినప్పుడు అందులో తెలంగాణ కథలు కనిపించకపోయేవి. అప్పుడప్పుడు అంపశయ్య నవీన్ కథలు, నవలలు వచ్చేవి. తాడిగిరి పోతరాజు అని సెటిలర్. ఆయన కథలు ఉండేవి. అప్పుడు మనం ఎందుకు రాయకూడదనిపించింది. ఏం రాయాలన్నది ప్రశ్న? ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడే రాయాలి. అప్పుడు అల్లంరాజయ్య రాసినవే విప్లవ కథలు. తెలంగాణ ఉద్యమం గురించి ఎవరూ రాయడం లేదు. విప్లవాలతో పాటు జీవితం కూడా ఉండాలనుకున్నాను. తెలంగాణ భాష అప్పటి పత్రికల్లో రాలేదు. ‘అవ్వతోడు, గిది తెలంగాణ’ అనే పేరుతో ధైర్యం చేసి వరుసగా యాభై కథలు రాశాను. ఒక పత్రికకు ఇస్తే రెండేండ్లు దగ్గర పెట్టుకొని అవ్వతోడేంది? ఈ భాష ఏంది? అని భాష మారుస్తే వేస్తామన్నారు. వెనక్కి తెచ్చుకున్నా. నాలుగైదు ఏండ్లు అది పత్రికలలో తిరుగుతూనే ఉంది. ఎంత వివక్ష ఉండేదో చూడండి. ఆంధ్రప్రభ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, సివి కృష్ణారావు ఆదివారం అనుబంధం చూసేవాడు. వాళ్లిద్దరూ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలవాళ్ళు. “ఇంత అద్భుతమైన కథలను ఇన్ని రోజులు మాకెందుకు ఇవ్వలేదు?” అన్నారు. అయితే కొన్ని గొట్టు పదాలకు కింద అర్థం రాసివ్వండి అన్నారు. “మరి ఆంధ్రోళ్లు మాండలిక పదాలకు అర్థాలు రాస్తున్నరా సార్?” అన్నాను (గట్టిగా నవ్వేస్తూ). అందరికీ తెలియదు కాబట్టి కొన్నింటికైనా ఇవ్వమన్నారు. సరేనని రాసి ఇచ్చాను. అందులో ఒక్కొక్క కులం భాష ఉంటుంది. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. మన భాష రాస్తే ఆదరణకు తక్కువ లేదని అర్థమైంది. అప్పటినుండి రచయిత భాషను వ్యవహార భాషలో, పాత్రలకు సందర్భాన్ని బట్టి పాత్రోచిత భాషను రాయడం మొదలుపెట్టాను. కొన్నింటిని మొత్తం తెలంగాణలోనే రాశాను.
6ప్ర. “నేను సాహిత్యకారుడిని కాకపోయి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాణ్ణి” అనగలిగేంత కష్టాలను ఎట్లా అనుభవించారు?
జ:- ఆ మాట నిజమే. నలభై ఏండ్ల క్రితం నేనన్న మాట. నా జీవితంలో ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహలు, ఆర్థిక పరమైన, మరే ఇతర సమస్యలు వచ్చినప్పుడల్లా సాహిత్యమే తోడ్పడింది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేనేదైనా పుస్తకం తీసుకొని లోపలికి పోయేది. మంచి సాహిత్యం మనిషిని తీర్చిదిద్దుతుంది. సమస్యకు పరిష్కారం చూపెడుతుంది. జీవితం వడ్డించిన విస్తరి కాదు కదా! ఏ రోజైనా నేను రాయకుండానో, చడవకుండానో ఉంటానో, సంవత్సరం పాటు నా రచన, నా పేరు ఏ పత్రికల్లో రాకుండా ఉంటుందో అప్పుడు నేను చచ్చి పోయినట్లు లెక్క అనుకుంటాను. నేను స్కూలుకు వెళ్తున్నప్పటి నుండి ఏ రోజైనా కనీసం చదవకుండా, రాయకుండా ఉన్నరోజు లేదు. “కవిత్వం ఒక తీరని దాహం” అని శ్రీ శ్రీ అన్నట్టు రాస్తూ రాస్తూ చనిపోవాలన్నది, చనిపోయేవరకు రాస్తూ ఉండాలి అని నా కోరిక. సాహిత్యమంటే నాకు పంచప్రాణాలు. ఆరోప్రాణం కూడా.
7ప్ర. బుద్ధుని వంటి తాత్త్వికుల ప్రభావం మీ పైన ఎట్లా ఉంది?
జ:- నాకు మొదటినుంచీ బుద్ధుడు అంటే ఇష్టం. ఆయన అహింసా సిద్ధాంతం, సత్యప్రవర్తన, దుఃఖ నివారణ మార్గాలు, సత్సంగతి, అష్టాంగమార్గాలు ఇవన్నీ ఇష్టం. బడి అంటే నాకు ఒక విజ్ఞాన కేంద్రంగా ఎంతో ఇష్టంగా ఉండేది. సెలవు రోజులో కూడా ఏదైనా పుస్తకం తీసుకొని వెళ్ళేవాడిని. క్లాస్ రూమ్ లు ఓపెన్ గా ఉండేవి. అక్కడ కూర్చొని చదువుకునేవాడిని. ఒకసారి సోషల్ సార్ బుద్ధుని కథ పాఠం చెబుతూ బాణం తగిలిన ఒక పక్షిని బుద్ధుడు కాపాడిన విధం చెప్పాడు. అది నా మీద బాగా ప్రభావం చూపింది. అప్పటినుండి బుద్ధుడే నాకు హీరో. బుద్ధిజమ్ తీసుకోవాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. త్వరలో తీసుకుంటాను కూడా. దాదాపు బౌద్ధమార్గంలోనే నడుస్తున్నా. ఆ పాఠం విన్నాక ఇంటికి పోయి మొగురాల మీద, దూలాల మీద సత్యమునే పలుకవలెను. హింస చేయరాదు. అని చాక్ పీస్ తో రాశాను. ఇంకోసారి మద్యపానం వల్ల అనర్థాలు పాఠం సార్ చెప్పగా విని మా నాన్నతో చుట్ట తాగడం మానిపించిన. కల్లు తాగడం ఆ రోజుల్లో సాధారణం. ఆరోగ్యం కోసం, అలసట తీరడం కోసం తాగేవాళ్ళు వ్యసనంగా కాదు. కుటుంబంలో అందరూ తాగేవాళ్ళు. మా నాన్న నన్ను తాగుమని బలవంతపెడితే వ్యతిరేకించేవాణ్ణి. ఈ విధంగా బుద్ధుడు, ఆయన ఆదర్శం నాకు ఆచరణీయాలు అయ్యాయి.

8ప్ర. అంబేద్కర్ భావజాలం కూడా మీకు ప్రేరణ అయిందని మీరు చెప్పుకున్నారు. అది ఏవిధంగా జరిగింది?
జ:- నేను చదువుకుంటున్న సమయంలోనే అంబేద్కర్ సంఘాలు ఊళ్ళోకి రావడం, రాజ్యాంగం గురించి తెలియడం, ఓటు హక్కుకు కారణం ఆయన కావడం, ప్రతీ ఒక్కరికి విద్య, అవకాశాలు సమానం కావాలని చెప్పడం, ఊళ్ళల్లో అంబేద్కర్ విగ్రహాలు స్థాపించడం, లైబ్రరీలు కట్టడం ఇవన్నీ నాకు ప్రేరణ నిచ్చాయి. నక్సలిజం, అంబేద్కరిజమ్ ఆరోజుల్లో ప్యారలల్ గా నడిచాయి. హింసను కోరుకొని సాయుధ పోరాటాన్ని సమర్థించిన వారు అటువైపు వెళ్ళారు. నేను సమానత్వాన్ని, సోషలిజాన్ని కోరుకున్నప్పటికీ హింసను ఒప్పుకోలేదు. సాయుధ పోరాటం పరిష్కారం కాదని కూడా వ్యాసాలు రాసేవాణ్ణి. ‘స్టేట్స్ సోషలిజమ్’ అని రాజ్యాంగ నియమాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అన్న అంబేద్కర్ భావాలకు ఆకర్షితుడనయ్యాను. చంపడం, చావడం ద్వారా ఇవి పరిష్కారం కావు. స్కూల్లో అంబేద్కర్ గురించి చదువుకున్న పాఠాలు, ప్రాక్టికల్ గా అంబేద్కర్ సంఘాలు చెబుతున్న విషయాలు, ప్రత్యక్షంగా దళితుల సమస్యలను చూడడం వల్ల ఏం జరుగుతున్నదో అర్థమైంది. అంబేద్కరిజమ్ కూడా బుద్ధిజమ్ నుండి వచ్చిందే. బుద్ధునికి అంబేద్కర్ పరోక్ష శిష్యుడు. ఇక మహాత్మా జ్యోతీరావ్ పూలేది జ్ఞాన సమాజం. చదువుకుంటేనే విచక్షణ ఏర్పడి సమస్యలు పరిష్కారమవుతాయన్నది ఆయన భావన. బ్రిటిష్ వారి కాలంలోనే దళితులకు పాఠశాలలు పెట్టి చదువు నేర్పించిన వాడాయన. ఆయన భార్య సావిత్రీబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయిని. కాబట్టి బుద్ధుడు, జ్యోతీరావ్ పూలే, అంబేద్కర్ వీళ్ళు ముగ్గురూ నాకు పరోక్ష గురువులు. ఈ మూడు సిద్ధాంతాలను జోడిస్తే భారతదేశంలోని సమస్యలే కాదు ప్రపంచంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అందుకే విశ్వమంటే బోధిసత్వుడే, దేశమంటే అంబేద్కరుడే అని పుస్తకాలు రాశాను. ఈ ముగ్గురి మార్గంలో నడవడం నా సాహిత్య లక్షణం.
9ప్ర. అధికార భాషాసంఘ సభ్యులుగా మీరు చేసిన కృషిఎటువంటిది?
జ:- నిజంగా అధికార భాషాసంఘంలో ఉండడం ఒక మంచి పరిణామం. అవకాశం రావడం విచిత్రంగా జరిగింది. భాష మీద స్పష్టమైన అవగాహన రావడానికి మంచి వేదిక. అప్పటికే రచనలు చేస్తున్న నాకు అధికారికంగా గవర్నమెంట్ ద్వారా భాషకు ఎంత సేవ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. నేను పనిచేస్తున్న రామగుండం ఫర్టిలైజర్ సిటీ మూతపడిన తరువాత అందులో ఉద్యోగం పోయిన నేను ఏం చేయాలో తోచనప్పుడు ఈ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ పడింది. 2005 సంగతి ఇది. అప్పటివరకు సెక్రటేరియట్ ఎంట్రన్స్ కూడా నాకు తెలియదు. అప్లికేషన్ తీసుకొని గేటు ముందు వెళ్లి నిల్చున్నాను. నా కథలు చదివిన ఒకాయన వచ్చి ఇక్కడ నిలబడ్డారెందుకు? అని లోపలికి తీసుకుపోయాడు. రామచందర్ రావు సిఎం రాజశేఖర్ రెడ్డి గారికి సలహాదారు. ఆయన దగ్గరికి వెళ్లి అప్లికేషన్ ఇచ్చాను. ఆయన నవ్వుతూ మీ రచనలు కొన్ని చదివాను. ముఖ్యమంత్రి సంతకం పెడితే అయిపోతుందన్నాడు. వారం రోజుల్లో ఫోన్ వచ్చింది. అప్పటికే ఎబికె ప్రసాద్ ఛైర్మన్ గా ఎంపిక అయినట్టు, నన్ను సభ్యునిగా తీసుకున్నట్టు చెప్పారు. అప్పుడు అధికార భాషా సంఘం రూల్స్ అన్నీ తెలుసుకున్నాను. తెలుగులో రాయడం, తెలుగు మాధ్యమంలో చదవడం, స్కూల్ ఎడ్యుకేషన్ వరకు, డిస్ట్రిక్ట్ కోర్ట్ వరకు తీర్పులు అన్నీ తెలుగులో ఉండాలని ఇట్లాంటివి భాషకు ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం కూడా సర్క్యూలర్ లన్నీ తెలుగులోనే ఉండాలి. కానీ చూసేటప్పటికి ఒక్కటి కూడా తెలుగులో లేదు. మాకు ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇంగ్లీషులో ఇచ్చారు. నేను ఆ కార్డ్ విసిరేశాను. తెలుగు అధికార భాషా సంఘం పేరున తెలుగు అమలు కోసం మన నలుగురిని పెట్టినప్పుడు మనమే దాన్ని పాటించకపోతే ఎట్లా? అన్నాను. మరుసటి రోజు వాటిని తెలుగులో మార్చి ఇచ్చారు. పాస్ లన్నీ కూడా తెలుగులో చేశారు. ముప్పై నినాదాలు రాయించాం. పాత సెక్రటేరియట్ లో అవన్నీ ఉంటాయి. బస్సుల్లో రాయించాం. మీరు చూసి ఉంటారు. రెండేళ్లు నా సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఇరవై మూడు జిల్లాలు తిరిగి తెలుగు అమలు చేయించిన. ఒక తెలుగు మీడియం దగ్గరకు వచ్చేటప్పటికి వ్యతిరే కతలు వచ్చాయి. అప్పుడు ఎవరికి వీలయిన దాంట్లో వాళ్ళు చేరేలా రెండు మీడియమ్ లు పెట్టాలని చెప్పాను. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పోరేట్ స్కూల్స్ కి కూడా వెళ్ళాను. అట్లా అనేక పాఠశాలలు తిరిగితే నెల్లూరు, నిజామాబాద్, కరీంనగర్ మూడు జిల్లాల్లో వందశాతం తెలుగు అమలయింది. దీన్నిబట్టి భాషకు చేయాల్సింది చాలా ఉందని అర్థమైంది. రెండు సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. తెలంగాణలో పర్యటనలు చేస్తున్నప్పుడు నేను సాయంత్రాలు ఆ మీటింగులలో పాల్గొనేవాడిని. తెలంగాణ వచ్చి తీరాలని ఉపన్యాసాలు ఇచ్చేవాడిని (గట్టిగా నవ్వుతూ). అందుకే ఇవ్వలేదు.
10ప్ర. జాషువా పరిశోధనా కేంద్రంలో మీరు చేపట్టిన బాధ్యతాయుతమైన కార్యక్రమాలు ఏవి?
జ:- ఇందాకే చెప్పిన కదా ఫెర్టిలైజర్ సిటీ మూతపడిన తరువాత ప్రయివేటు ఉద్యోగాలు వెతుక్కునే క్రమంలో తెలుగు అకాడమీకి సంచాలకులుగా ఉన్న ఆచార్య యాదగిరి గారిని కలిశాను. మొదట దినసరి వేతనం ఇచ్చే విధంగా జాషువా పరిశోధనా కేంద్ర బాధ్యతలు అప్పగించారు. పదమూడు నెలల తర్వాత గౌరవవేతనంతో పనిచేశాను. జాషువా అంటే నాకు చాలా అభిమానం. అంతకుముందు జాషువాను చదివాను. కానీ అంత లోతుగా చూడలేదు. ఆయన రచనల గొప్పదనానికి ఒక్క ‘గబ్బిలం’ చాలు. అది భారతదేశంలో అస్పృశ్యత మీద వచ్చిన ఐదు గొప్ప పుస్తకాయాలలో ఒక్కటిగా చెప్పవచ్చు. కరుణశ్రీ, జాషువా, దాశరథి ఈ ముగ్గురూ పద్యాన్ని ఆధునిక భావజాలంతో ప్రోగ్రెసివ్ ఆలోచనలతో రాసినవారు. ఒకవైపు అకాడెమీకి పనులు చేస్తూనే జాషువా పుస్తకాలన్నీ చదివి అన్ని యూనివర్సిటీలలోసెమినార్లు పెట్టించి పుస్తకాలు వేశాం. పదమూడు పుస్తకాలు వేయించాం. అందులో రెండు నేనే రాశాను. 2014లో రాష్ట్రవిభజన జరిగిన తర్వాత సాహిత్యంలో కూడా రాజకీయాలు చోటు చేసుకొని అకాడెమీకి ఫండ్స్ ఇవ్వలేదు. అందుకే ఆ సంస్థ మూతబడి పోయింది. జాషువాను జాతీయ కవిగా గుర్తించాలన్న తపన నాది. అదే సమయంలో నాలుగవ తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ పుస్తకాలు, తెలంగాణ రచయితల పుస్తకాలు యాభైకి పైగా రావడానికి కారకుడినయ్యాను. తెలుగు అకాడెమీ నా ఆత్మ, నా పుట్టిల్లు అన్నట్టుగా చేశాను. తెలుగు అకాడెమీ ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి పాఠ్య పుస్తకాలను అంతర్జాతీయ స్థాయిలో అందించడానికి ఎంతో చేయవచ్చు. కానీ నాకు ఆ అవకాశం అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ కాంట్రాక్టును పొడిగించలేదు.
11ప్ర. ‘మాదిగ విజయం’ నవలా నేపథ్యం గురించి చెప్పండి.
జ:- ముఖ్యంగా నేను దళితుల మీద చాలా పుస్తకాలు రాశాను. నా ఉద్దేశ్యం రచయిత అనేవాడు తప్పనిసరిగా అణగారిన జీవితాలను చూసిన వాడు అయివుండాలి. వాళ్ళను గురించి పట్టించుకోవాలి. “కవి కష్టజీవికి ఇరువైపులా ఉండాలి” అని శ్రీశ్రీ చెప్పినట్లు కవి కష్టజీవి కష్టాలను చూడాలి. మా నాన్న ఆకాలంలోనే ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలవాడు. మాతాతకు నేను మొదటి వారసుడిని కావడం వల్ల నన్ను బాగా గారాబం చేసేవాడు. నన్ను భుజాలపై ఎక్కించుకొని వాడలు తిప్పేవాడు. అయితే చేంతాడులు, పశువులకు కట్టే పగ్గాల వంటివి తెచ్చుకోవడానికి మాదిగ వాడకు పోయినప్పుడు కాలికి చిన్న కాగితం ముక్క కూడా తగలనిచ్చేవాడు కాదు. నన్ను కింద దించకపోయేది. మా తాత చాలా మంచోడు కానీ అప్పట్లో ఈ పట్టింపులు ఎక్కువ కదా! ఊళ్ళో అన్ని పనులు అంటే కాష్టం కాలవడం, బొందలు తీయడం, బరువులను తలపై ఎత్తుకొని మోయడం, వెట్టి చేయడం వంటి పనులన్నీ వాళ్లే చేసేవారు. కానీ వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్షలు ఉండేవి. ఇవన్నీ ఏంటి అని ఆలోచించి వాళ్ళ మీద కలిగిన అభిమానంతో ‘పాలేరు’ అనే కథ రాసిన. వందలాది కథలు రాసిన. ‘మాదిగ విజయం’ అనేది 1997 లోనే రాసిన. ఇందులో అయిదు తరాల జీవితం తీసుకున్నాను. ఊళ్లోని ఒక కుటుంబాన్ని దగ్గరగా చూసి రాసింది. మొదటితరం వ్యక్తి రామయ్య వెట్టి చేస్తుంటాడు. ఆయన కొడుకు చెప్పులు కుడతాడు. మూడవతరం వ్యక్తి పాలేరు అవుతాడు. ఆ తరువాతి వాడు భూమి కొంటాడు. అది దొరలకు నచ్చదు. అతను వలస పోతాడు. ఇంత కష్టపడ్డ నేను నా కొడుకుకు ఇటువంటి కష్టం రాకుండా చదివించాలనుకుంటాడు. అప్పుడే ఆ ఊళ్ళో అంబేద్కర్ సంఘాలు రావడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాణ్ణి బడికి పంపుతాడు. అతని పేరు ఎల్లయ్య. అందరూ ఆ పేరును ఎగతాళి చేస్తుంటే కాలేజీకి పోయిన తర్వాత ఆనందరావుగా పేరు మార్చుకుంటాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుతాడు. తన పిల్లలను కూడా విదేశాలకు పంపుతాడు. అంటే ఒక తరం నుండి మరొక తరానికి జరిగిన పరిణామ క్రమం ఎట్లా ఉందో తెలుపుతూ వాళ్ళ భాష, వాళ్ళ కష్టాలు అవన్నీ రాశాను. 2014 లో ఆంధ్రప్రదేశ్ వారు పెట్టిన నవలల పోటీలో బహుమతి వచ్చింది. మొదట వేయిపడగలు నవలకు బహుమతి వస్తే నలభై ఏండ్ల తర్వాత మళ్ళీ నా నవలకు వచ్చిందని న్యాయనిర్ణేతలు ఫోన్ చేసి చెప్పారు. అది బ్రాహ్మణ వ్యవస్థను చిత్రించేది అయితే ఇది దళిత జీవన మేనిఫెస్టో అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే డిక్లేర్ చేశారు. 2015లో విజయవాడలో ఈ బహుమతి తీసుకున్నాను. దీన్ని కొలకలూరి ఇనాక్ గారు ఆనాటి ‘మాలపల్లి’ వంటిదని ప్రశంసించారు.
12ప్ర. మీ కథల గురించి, నవలల గురించి ఎన్ని విషయాలైనా అడగొచ్చు. అయితే ‘అస్పృశ్య కోయిల’ అనే నవల మీ రచనల ప్రత్యేకతల్లో ఒకటి అని విన్నాం. దాని గురించి చెప్పండి.
జ:- అవును. ఒక దళిత స్త్రీ గ్రామాల్లో పడుతున్న ఆవేదన గురించి రాసిన. ఆ కష్టాల్లో ఒకటి సెక్సువల్ గా ఎదుర్కొనే సమస్య కూడా. ఆమె అన్నిటినీ ఎదుర్కొని దొర కొడుకునే బామ్మర్దీ అని పిలుస్తుంది. అంతేకాదు దొర ఇంట్లోనే ఉంటుంది. అయినా ఎన్నో బాధలకు గురి అవుతుంది. చిన్నప్పటినుండీ ఆమె జానపద పాటలు పాడుకునేది. అందువల్ల తరువాత కరీంనగర్ కు పోయి సింగర్ అవుతుంది. అట్లా ప్రజా గాయనిగా, అంబేద్కరిస్టుగా మారడమే ఆ కథ. ఇది నిజంగా జరిగిన సంఘటన. అది దృష్టిలో పెట్టుకొని మొదట్లో ‘బామ్మర్దీ’ అనే కథ రాసిన. దాన్నే ‘అస్పృశ్య కోయిల’ అనే నవలగా మార్చాను.
13ప్ర. కవిత్వం కంటే కథలను ఎక్కువగా ఇష్టపడ్డ మీరు కవితా సంకలనాలు కూడా వెలువరించారు కదా ఈ రెండింటిలో ప్రజలకు సన్నిహితంగా ఉండేది ఏది? ఎట్లా?
జ:- ఒక పెద్దాయన చెప్పారు. కవిత అనేది స్వప్నసుందరి, కథ అనేది సహధర్మచారిణి అని (నవ్వుతూ). అంటే అది ఊహ. ఇది నిజం. కవిత్వం అందరూ చెప్పలేరు. కానీ కథ అందరూ చెప్పగలరు. ఒక సంఘటనను ఎదుటివాళ్లకు వివరిస్తున్నప్పుడు అది కథ వంటిదే కదా! మనమందరం కూడా పుస్తకాల్లో చదివేకంటే ముందు కథలు వింటూ పెరిగినవాళ్ళమే కదా! కవిత ఆవేశాత్మకం, కథ ఆలోచనాత్మకం. కథ మానవ జీవితానికి దగ్గరగా ఉంటూ ప్రభావితం చేస్తుంది. వాస్తవ జీవిత కథలు ప్రజలతో మమేకమై వాళ్లకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సందేశాన్నిస్తాయి. సమస్యలకు పరిష్కారాలను అంతర్లీనంగా చూపుతాయి.
14. మొదట్లో నవల రాయడానికి చాలా కష్టపడ్డాను అన్నారు కదా! ఒక నవల రూపాన్ని సంతరించుకోవడం అంత క్లిష్టమా? పాఠకులను అలరించే నవల ఎట్లా ఉండాలి?
జ:- విద్యార్థి దశలో ‘విధివ్రాల’ నవల నాటి సంగతి కష్టపడడం అన్నమాట. ఒక ఆంగ్ల రచయిత చెప్తాడు. కథలు రాయాలంటే జీవితం చూడకపోయినా వయసుతో నిమిత్తం లేకుండా ఏదేని ఒక అంశంపై రాయొచ్చు. కానీ నవల రాయడం అంత సులభం కాదని. ఒక స్పందనో, ఆవేశమో కలిగినప్పుడు కవిత్వం ఒక పది వాక్యాలు రాయొచ్చు. దాన్ని తక్కువ చేయడం కాదు. ఎవరైనా రచన ప్రారంభం కవిత్వం నుండే చేస్తారు. నేను కూడా కవిత్వం నుండే ప్రారంభించాను. చెప్పదలచుకొన్న విషయాన్ని చాలా వివరంగా చెప్పాలంటే కవిత్వమో కథో సరిపోదు. పది కవితలు రాసేచోట ఒక నవల రాయొచ్చు. ఓ ఇరవై కథలు రాసేచోట ఒక నవల రాయొచ్చు. అంటే ఈ కథలన్నీ కలిపితే నవల అవుతుందని కాదు. నవల స్వరూపం వేరు. రెండు వందల కథలు రాసిన తర్వాత కూడా నాకు తృప్తి అనిపించలేదు. ఇంకా ఏదో చెప్పాలని, ఏదో మిగిలిపోయిందని అనిపించింది. కథ అనేది ఒక జీవన శకలాన్ని చెబితే నవల జీవితం మొత్తాన్ని చెబుతుంది. ఇట్లా చెప్పాలంటే కూడా వాళ్ళ జీవితాన్ని నిశితంగా పరిశీలించాలి. ‘ఊరంటే’ నవల 1983లో రాసిన. అది ఇంతవరకు ఏ పత్రికకు పంపలేదు. కొన్నేళ్లు మరే నవల రాయలేదు. తరువాత నవలలు మొదలు పెట్టిన. ‘భూమిపుత్రుడు’ అనే నవల రైతు జీవితాన్ని గురించి రాశాను. మంచి స్పందన లభించింది. అప్పటివరకూ తెలంగాణా రైతుల మీద రాలేదు. ఒకరైతు పన్నెండు నెలల జీవితాన్ని ఉగాది నుండి ఉగాది వరకు డైరీగా చేసుకొని నేపథ్యం, జీవితం, బాకీలు, వలసలు వీటన్నిటి గురించి రాశాను. శాతవాహన విశ్వవిద్యాలయ ఎమ్.ఏ విద్యార్థులకు ఇది పాఠ్యపుస్తకంగా పెట్టారు. ఆ తరువాత ‘సాంబయ్య చదువు’ అని నా జీవితాన్నే తీసుకొని ఆత్మకథాత్మకంగా రాశాను. చాలామంది ఇప్పటికీ ఆ నవలలో మా జీవితాన్ని చూసుకున్నాం అంటారు. అది చతురలో వచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎమ్.ఏ. విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టారు.
15ప్ర. ఆచార్య బన్న అయిలయ్యగారు మీపైనే ఒక పుస్తకం రాయడానికి మీ సాహిత్యం ఆయనకు ఏవిధమైన ప్రేరణ నిచ్చినట్లుగా భావించవచ్చు?
జ:- 2000 సంవత్సరం వరకు కూడా బన్న అయిలయ్య ఎవరో నాకు తెలియదు. ఆయన గత శతాబ్ది 90ల్లో ఒకసారి “నేను సాహితీ సంస్థల మీద పిహెచ్ డి చేస్తున్నానని, కరీంనగర్ జిల్లాలో ఏవైనా సాహిత్య సంస్థలు ఉంటే వాటి గురించిన వివరాలు తెలుపుమ”ని నాకు ఉత్తరం రాశాడు. నేను కొన్ని వివరాలు పంపిన. అయితే ఆయన వేరే టాపిక్ మీద చేశారు. అది వేరే సంగతి. అయితే కొద్దిరోజుల తర్వాత మల్లికార్జున్ అనే అబ్బాయి నా దగ్గరకు వచ్చి బన్న అయిలయ్య సార్ చెప్పగా “మీ నవలల మీద పిహెచ్ డి చేస్తున్నానని, కొన్ని నవలలు చదివానని, కొంత రాశాన”ని చెప్పాడు. ఆయనకు నేను సహాయం చేశాను. ఆయన పిహెచ్ డి కూడా అయిపోయింది. కొన్ని ఏండ్ల తర్వాత అయిలయ్య ఫోన్ చేసి “మీమీద పుస్తకం రాస్తున్నానని కొన్ని వివరాలు కావాలి” అన్నాడు. ఫోన్ల ద్వారానే చెప్పాను. పుస్తకావిష్కరణకు నన్ను పిలిచాడు. అప్పుడే మొదటిసారి ఆయనను చూశాను. నాకు తెలియకుండానే నామీద పిహెచ్ డి చేయించాడు. నామీద పుస్తకం రాశాడు ఆయన. “నేనే జడ్జి అయి ఉంటే నోబుల్ ప్రైజ్ ఇచ్చేవాణ్ణి” అన్నాడు. అట్టడుగు వర్గాల గురించి నేను రాసిన రచనలు ఆయనను బాగా ఆకర్షించి ప్రభావితం చేశాయి. మాడభూషి వాళ్ళు ఇచ్చే పురస్కారం కోసం “ఈ కాలపు మేటి కథలు” అనే అంశంపై నా కథల గురించి మరో వందపేజీల పుస్తకం రాశాడు. సునీత అనే అమ్మాయితో నేను రాసిన ఎనిమిది వందల కథల మీద పిహెచ్ డి చేయించాడు. ఆరువందల పేజీల పుస్తకమది. నా సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశాడు.

16ప్ర. సాహిత్యం యొక్క ప్రయోజనాన్ని రచయితలు ఏ దృక్కోణంలో అర్థం చేసుకోవాలి?
జ:- ప్రాచీన కాలం నుండీ పెద్దవాళ్ళు చెప్పిన విషయం సాహిత్యం ఆనందాన్ని కలిగించేదైనా ఉండాలి. ప్రయోజనాన్ని కూర్చేదైనా ఉండాలి. ఈ రెండూ ఉండాలని చెప్పినవాళ్ళు కూడా ఉన్నారు. ఆధునిక సాహిత్యానికి ప్రయోజనం ఉండాలి. లేకుంటే అటువంటి సాహిత్యం వృధా. ఈ భావనతోనే రచనలు చేస్తున్నాను. సమాజాన్ని పట్టించుకోకపోతే రచనలు ఎందుకు? రచన మనకు తెలియకుండానే సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నాకు తెలియకుండానే నా కథలను చదివి ఎంతోమంది ఎన్నోచోట్ల వాటిని ఉపయోగించుకున్నారు. రాజకీయ నాయకులు, సినిమావాళ్ళు కూడా తీసుకున్నారు. ఆనందం కోసం సినిమా, టివి, నాటకాల వంటి ఎన్నో సాధనాలున్నాయి. కాబట్టి సాహిత్యం ప్రయోజనకారి కావాలి. నేను రాసిన కథల గురించి ఒకప్పుడు ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. ఇప్పుడు ఫోన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళను ఆలోచింపజేస్తున్నాయనేదే కదా! ‘బతుకమ్మ’ సినిమా గురించి కొంత మార్పు చేసి తీశారు. ఒకాయన తీస్తానని నాదగ్గరికి వచ్చి, నాతో చర్చించి డెబ్భై రెండు ఎపిసోడ్స్ రాయించి, కొన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గరే పెట్టుకొని, కాపీ చేసుకొని ఏమీ లేకుండానే వాపస్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘ఆంబోతు’ అనే కథను ఆర్.నారాయణమూర్తి సినిమాగా తీస్తానని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చాడు. ‘అరణ్యం’ అనే సినిమాలో వాడుకున్నాడు చెప్పలేదు. ప్రవీణ్ కుమార్ అనే అతడు నాతో చర్చించి కథ తీసుకొని సినిమా తీశాడు. అది కూడా తెలియదు. బతుకమ్మ సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజకు కంప్లైంట్ చేస్తే “తెలంగాణలో సినిమాలు వచ్చుడే ఎక్కువ. వచ్చినదాన్ని గురించి ఎందుకు? రిసీవ్ చేసుకోవాలి. వదిలేయండి” అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రయోజనం ఉండడం వల్లనే కదా ఇంతమంది నా కథలను తీసుకున్నారు. అందువల్ల మనం ఏది రాసినా ఆనందం ఉన్నప్పటికీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మధ్యయుగంలో సాహిత్యాన్ని ప్రయోజనకరంగా రాసినవాడు వేమన.
17ప్ర. పురస్కారాలు, బిరుదులు రచయిత రచనా సామర్థ్యానికి గీటురాయిగా భావించవచ్చా?
జ:- పురస్కారాలు, బిరుదులు రచయిత బాధ్యతను పెంచుతాయి. నేను మటుకు వాటికోసం తండ్లాడలేదు. నాకు తెలియకుండానే ఎన్నో వచ్చాయి. పోయిన నెలలో తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ‘గువ్వలచెన్న’ నవలకు పురస్కారం వచ్చింది. మీరు కూడా చూశారు కదా! నిజానికి పురస్కారాలు గీటురాయి అని అనడం సరికాదు. సామర్థ్యం ఉన్నవాళ్ళందరికీ రావు కదా! పురస్కారాలు రాని గొప్పకవులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు. శ్రీశ్రీ, రావిశాస్త్రిలకు వచ్చిందా? ‘జ్ఞానపీఠ్’ వచ్చే స్థాయి ఉన్నవాళ్లు ఎంతోమంది ఉంటారు. సంవత్సరానికి ఇరవై రెండు భాషల్లో ఒక్కసారి ఇచ్చే పురస్కారాలు ఎంతమందికి వస్తాయి? ఒకవేళ గీటురాయిగా భావిస్తే మటుకు రచయిత ఇంకా సమాజంలో తన బాధ్యత పెరిగినట్లుగా భావించి సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలి.
18ప్ర. అవును సార్! ఇటీవలే తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఉత్తమ నవలా రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆ విశేషాలు చెప్పండి.
జ:- ఫెర్టిలైజర్ సిటీలో పనిచేస్తున్నప్పుడే ‘గువ్వలచెన్న’ నవల ప్రారంభించి తరువాత పూర్తి చేశాను. తెలంగాణ చేనేత కార్మికుల, పద్మశాలీల జీవిత నేపథ్యంతో రాసింది. తెలుగులో పద్మశాలీ జీవితాల మీద వచ్చిన మొదటి నవల పోరంకి దక్షిణామూర్తి రాసినది అయితే తెలంగాణలో వచ్చిన మొదటి నవల ‘గువ్వలచెన్న’. స్వాతంత్ర్యానంతరం జీవితాలను గెల్చుకున్న క్రమాన్ని ఇందులో ఆర్ద్రంగా చెప్పాను. ఇది 2004లో చతురలో అనుబంధ నవలగా ప్రచురితమైంది. తెలంగాణ సారస్వత పరిషత్తు దీన్ని గుర్తించి ఉత్తమ నవలా పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.
19ప్ర. తెలంగాణ భాషకు పట్టం కడుతూ, తెలంగాణా ఉద్యమానికి ఊతమిచ్చిన మీరు తెలంగాణా సాధించిన తర్వాత మీరు కాంక్షించిన అభివృద్ధిని భాషాపరంగా చూడగలిగారా?
జ:- నా జీవితమంతా తెలంగాణ భాష మీద, తెలంగాణ జీవితం మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ లోని ఉద్యమాల మీద, తెలంగాణ ప్రజలతో నడిచింది. ఎవ్వరూ అనడానికి ధైర్యం చేయని సమయంలో “అవ్వతోడు గిది తెలంగాణ” అనగలిగాను. తెలంగాణ భాషలో రాశాను. ఇదేం భాష? అన్నారు. భయపడలేదు. తెలంగాణ భాషకు సాహిత్య గౌరవం కల్పించడానికి కృషి చేసిన వాళ్లలో నేనూ ఒకడిని. ఒకరకంగా ప్రధానమైనవాడిని కూడా. తెలంగాణ భాషకు అద్భుతమైన లయ, సౌందర్యం ఉన్నాయి. అయినా పాఠ్య పుస్తకాల్లో అక్షరరూపం ఎక్కలేదు. 1991లో నా ‘భూమిపుత్రుడు’ నవలకు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం ఇచ్చింది. అప్పుడు కీర్తి అవార్డులు వచ్చిన పధ్నాలుగు మందిలో నేను చిన్నవాడిని. సభలో అంతమంది మాట్లాడడం కుదరదు కాబట్టి వయస్సులో పెద్దవారు ఒకరు, చిన్నవారు ఒకరు మాట్లాడాలని సినారె గారు అన్నారు. అట్లా నాకు అవకాశం వచ్చి నేను అన్ని విషయాలు ప్రస్తావన చేస్తూ మాట్లాడుతూ సినిమారంగంలో భాష వివక్షతకు గురవుతున్నదని చెప్పాను. అక్కడున్న సినిమా వాళ్ళు మేం మీ కథలు సినిమా తీస్తాం అన్నారు. తర్వాత ఎవ్వరూ రాలేదు(నవ్వుతూ). 1969లో నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉద్యమం ప్రారంభమైంది. నేను ‘బతుకమ్మ’ అనే కవిత రాశాను. రెండోసారి ఉద్యమ సమయంలో ఆక్టివిస్ట్ గా పనిచేస్తూనే రచనలు చేశాను. ‘సింగిడి’ అని కథల సంపుటి రాశాను. ‘గుమ్మి’ అనే డిక్షనరీ తీసిన. వ్యాసాలు రాశాను. ‘నువ్వద్ది’ అనే కాలమ్ రాశాను. ‘తెలంగాణ మట్టికథలు’ నూటా పదిహేను కథలు రాశాను. ‘తెలంగాణ తాత కథలు’ రాశాను. ఇవన్నింటిలో తెలంగాణ జీవితం ప్రతిబింబిస్తుంది. ఆ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ కాలువ మల్లయ్య కాలిగోటికి సరిపోని వాళ్ళు పద్మశ్రీలు పొందుతున్నారు. మనవాళ్లకు పొగరెక్కువ. మన దగ్గరికి రారు. అన్నాడని మిత్రులు చెప్పారు. అయినా నేను పోలేదు. పివి నరసింహారావు హయాంలో కూడా ఆయన నాపేరు తీశాడు. అప్పుడూ నేను వెళ్ళలేదు. ఆయన చివరిదశలో కలిసినప్పుడు ఒకసారి రమ్మన్నారు. వెళ్ళలేదు. కొంతకాలానికే ఆయన చనిపోయారు. ఎన్నో అవార్డులు రావలసినవి రాలేదు. మూడుసార్లు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు ఒకసారి మధురాంతకం రాజారావు, ఇంకోసారి కాళీపట్నం రామారావు, మరోసారి పాపినేని శివశంకర్ వల్ల ఆగిపోయింది. ఇంత జరిగినా తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు అకాడెమీలో నేను పనిచేశాను. పాఠాలు కూడా రాయించారు. ఇంతకాలం భాష వివక్షకు గురైంది కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ మాండలిక భాషా పాఠాలు పెట్టాలి అన్నాను. పట్టించుకోలేదు. కేసీఆర్ అయితే ఈ విషయాన్ని కొట్టి పారేశాడని తెలిసింది. ఏ భాషతోని అధికారంలోకి వచ్చాడో, ఏ భాష మాట్లాడి సభలను అలరించాడో ఆ భాషనే తృణీకరించాడు. తెలంగాణకు ఒక భాషా విధానం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జరగలేదు. కనీసం నా వంటివారు అక్కడ ఉన్నా కొంత ప్రయోజనం జరిగేది. అంటే అన్ని విషయాలతో పాటు భాష ఇప్పటికీ కూడా నిర్లక్ష్యానికి గురవుతుందనే చెప్పవచ్చు.
20ప్ర. వర్తమానకాలంలో వస్తున్న రచనలు సామాజిక చైతన్యాన్ని కలిగించే దిశగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా?
జ:- నేను తెలుగు యూనివర్సిటీ అవార్డు కమిటీలో అప్పుడప్పుడు జడ్జిగా వెళ్తాను కదా? చాలమంచి పుస్తకాలు వస్తున్నాయి. అటువంటి వాళ్లకు అవార్డులు కూడా వస్తున్నాయి. నేను ఇరవై, ముప్ఫై ఏండ్ల నుండి చేస్తున్నాను. సమాజానికి ఉపయోగపడే రచనలనే
ఎంపిక చేస్తున్నాను. వాటికే వస్తాయని కాదు. వేరే జడ్జీలు కూడా ఉంటారు కదా! ఇక భాష అనేది పాఠ్యపుస్తకాల్లో ఉన్నప్పుడు, వాడుక భాషలో అది ఉపాధినిచ్చే భాషగా ఉన్నప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది. ప్రభుత్వ పాలనా భాషగా నైనా ఉండాలి. లేదంటే మృతభాష అవుతుంది. అందుకే రచయితలు భాషను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి.
21ప్ర. వెయ్యికి పైగా కథలతో పాటు నవలలు, కవితలు, పరిశోధన, విమర్శ, ఇరవై అయిదు, ముప్ఫయి వేల పేజీల సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించిన తెలుగు రచయితలు రెండు రాష్ట్రాల్లోనూ లేరనుకుంటాను. మీకింత సాహిత్య వస్తువు ఎట్లా లభించింది? మీరు రాసిన వందలాది పుస్తకాల్లో కొన్ని ముఖ్యమైన వాటిని పేర్కొనండి. మీకు వచ్చిన అవార్డులను, విశేషాలను, మీ అంతిమ లక్ష్యాన్ని తెలపండి.
జ:- నేను FCI రామగుండంలో పనిచేస్తున్నప్పుడు అందులో జీతం తక్కువ కాబట్టి దానితో పాటు ట్యూషన్లు చెప్పడం, బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కౌన్సిలర్ గా పని చేయడం, వయోజనులకు పుస్తకాలు రాయడం లాంటి పనులు చేశాను. ఉద్యోగం పోయిన తరువాత హైదరాబాద్ లో కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్, అధికార భాషా సంఘ సభ్యునిగా, SRC, ఆంధ్రమహిళాసభలో పనిచేయడం, హైదరాబాద్ మిర్రర్ పత్రికకు సబ్ ఎడిటర్ గా చేయడం, తెలుగు అకాడెమీలో విషయ నిపుణునిగా చేయడం, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడెమీలో ప్రాజెక్టు చేయడం లాంటివి చేశాను. ఏ పని చేసినా సాహిత్యానికి రిలేటెడ్ గా ఉన్నవాటిని స్వల్ప ఆదాయమైనా ఎన్నుకున్నాను.
సాహిత్యానికి వస్తువు దొరకదన్న సమస్యే లేదు. సముద్రమెంత విశాలమైందో జీవితమంత వైవిధ్య పూరితమైంది. నాకు సాహిత్యం జీవిత వృక్షానికి పూసే పువ్వు వంటిదన్న కొడవటిగంటి కుటుంబరావు మాటలు ఇష్టం. మనిషిని, జీవితాన్ని కథా వస్తువుగా, సాహిత్య వస్తువుగా తీసుకున్నప్పుడు వస్తువుకు కరువులేదు. చిన్నప్పటినుండీ నేను ఎక్కడికి వెళ్లినా జేబులో పెన్ను, కాగితం పెట్టుకొని వెళ్ళేవాడిని. ఇప్పటికీ అంతే. ఏ సంఘటన, సంభాషణ, వస్తువు కనిపించినా నోట్ చేసుకుంటాను. అట్లా నాకు ఇరవై డైరీల నిండా నోట్స్ ఉంది. నా జీవితకాలమంతా రాసినా వస్తువుకు కొరతలేదు. అవ్వతోడు గిది తెలంగాణ, మా కథలు, ఘర్మజలానికి…..?, కాలువమల్లయ్య కథలు, నేలతల్లి, కాలువ మల్లయ్య నవలలు, బతుకు పుస్తకం, అస్పృశ్య కోయిల, మాదిగ విజయం, తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం, అస్పృశ్య యోధుడు, విశ్వమంటే బోధిసత్వుడే, మెతుకుపుస్తకం, Book Culture, Social Transformation, కులరహిత భారతం, తెలంగాణ మట్టికథలు, తెలంగాణ మన్ను కథలు, గుమ్మి, బహుజన రాజ్యం, తెలంగాణ కథ-తెలుగు కథ, ఊరు మేల్కొన్నది, ఏది సుఖం- ఏది దుఃఖం, గువ్వలచెన్న, తెలంగాణ దేవదాసు, కులకస్పి, ఆకాశంలో సగం, తెలంగాణ తాతలు చెప్పిన కథలు, జననీ జన్మ భూమిశ్చ, మౌనవసంతం, పైలం బిడ్డా…ఇందులోని కొన్ని పుస్తకాలు మాత్రమే. సత్యాన్వేషణ గ్రంథమాల రాస్తున్నాను. ప్రపంచ దుఃఖ నివారణోషధి గ్రంథం రాయడం నా అంతిమ లక్ష్యం. ప్రపంచ దుఃఖ నివారణ సూక్తులు రాస్తున్నాను. ఆటా, తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ అవార్డు, గురజాడ కథా పురస్కారం, గిడుగు, జాషువా దళిత సాహిత్య పురస్కారం, రావి శాస్త్రి అవార్డు లాంటి జాతీయ , అంతర్జాతీయ అవార్డులు వంద వరకు వచ్చాయి. నా కథలు, పుస్తకాలు వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలు. నలభై మంది పరిశోధక విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎమ్ ఫిల్, పి హెచ్ డి లు చేశారు. 60, 70 కథ, వ్యాస సంకలనాల్లో నా రచనలకు స్థానం లభించింది. నా రచనల వల్ల ప్రపంచ మానవాళి యుద్ధభయం, టెర్రరిజం, ప్రకృతి విధ్వంసం లేని మానవీయ సమాజం వైపు పయనించాలని కోరుకుంటున్నాను. అదే నా జీవిత, సాహిత్య అంతిమ లక్ష్యం. చివరిదశలో నేను పుట్టిన ఊరు తెలుకుంటలో గృహనిర్మాణం చేసుకొని శేషజీవితం గడపాలనుకుంటున్నా.
22ప్ర. రచనా శిల్పంలో ఎంతో అనుభవజ్ఞులై ఒక ప్రత్యేకతను నిలుపుకొన్న మీరు కథలు గానీ నవలలు గానీ ఎట్లా ఉండాలో ఈ తరం వారికి ఏవైనా సూచనలు
చేయండి.
జ:- రచనలు ఎట్లా ఉండాలన్నది తీసుకునే అంశాన్ని బట్టి ఉంటుంది. మనం ఎందుకోసం, ఎవరి కోసం, దేనికోసం రాస్తున్నామో స్పష్టత ఉండాలి. అంటే రచయితకు స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉండాలి. సమాజ గమనం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి? సమస్యలు ఎక్కడ ఉన్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? అనేది ఉండాలి. పరిష్కారాన్ని ప్రత్యక్షంగా చూపించకపోయినా ధ్వనింపజేయాలి. సమస్యను చెబుతూనే పరోక్షంగా పరిష్కారాన్ని సూచించాలి. ముఖ్యంగా ఈ తరం వాళ్ళు అధ్యయనం చేయాలి. అది తక్కువైంది. బాగా అధ్యయనం చేసేవారు జీవితంలోని సమస్యలను సరిదిద్దుకోగలరు. ఇంకొకటి సమాజం ‘మేము’ నుండి ‘నేను’ లోకి వెళ్ళిపోతున్నది. ఇవన్నీ పరిష్కారం కావాలంటే మంచి సాహిత్యం ఇంకా రావాలి. రచన మీద స్పష్టమైన దృక్పథం ఉండాలన్నదే నా అభిమతం. సాహిత్యం పురోగామి సమాజానికి దిక్సూచి గా ఉండి తీరాలి. సాహిత్యం కేవలం టైమ్ పాస్ కోసం చదివేది కాకూడదు. ప్రయోజనం లేని సాహిత్యం వృథా అని ఇప్పటికీ, ఎప్పటికీ నమ్ముతాను. సమాజాన్ని వెనుకకు తీసుకెళ్లే సాహిత్యం రాయడం కన్నా రాయకుండా ఉండడమే మంచిది.
ధన్యవాదాలు సార్. మీ విలువైన సమయాన్ని వెచ్చించి సుదీర్ఘమైన మీ రచనా జీవితాన్ని, ఒడిదుడుకులను మీ తపనను వివరించినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు సెలవు🙏🏼

9 comments
https://shorturl.fm/oEjI1
https://shorturl.fm/KIKGO
https://shorturl.fm/J6NFo
https://shorturl.fm/qyF3E
https://shorturl.fm/blrlj
https://shorturl.fm/2UfU9
https://shorturl.fm/2yNIN
https://shorturl.fm/VMmIA
కాలువ మల్లయ్య గారి జీవన ప్రస్థానం,సాహిత్యానికి ఆయన చేసిన సేవ అనితరసాధ్యం. చక్కని ప్రశ్నలడిగి విలువైన సమాధానాలు రాబట్టారు అరుణ.
ఇద్దరికీ అభినందనలు.