Home వ్యాసాలు రచయిత్రి మనోఫలకంపై చేసుకున్న ‘జ్ఞాపకాల సంతకం ‘

రచయిత్రి మనోఫలకంపై చేసుకున్న ‘జ్ఞాపకాల సంతకం ‘

by Radhika Suri

స్వచ్ఛమైన నవ్వు , భేషజమెరుగని చక్కటి పలకరింపు సోదరి అరుణ ధూళిపాళ సొంతం. సోమవారం కవి కుటుంబంలో తనతో నా తొలి పరిచయం . తన పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి చేతిలో పుస్తకంతో ఇల్లు చేరిన నాకు, పుస్తకం తిరగేయాలంటేనే మనసు మౌనం దాల్చేది , ఎన్నిసార్లు తిరగేయాలని పట్టుకున్నా కళ్ళు ఎలాంటి భావాలు ఒలకబోస్తాయోనన్న బెంగతో చదవడం మానేసిన సందర్భాలున్నాయి.

స్పందించే మనసున్న కవిలో భావాలు తరంగాలై లేచినపుడు అక్షరాలు ఆరాటంతో జట్టు కట్టి ఆకారం దాలుస్తాయి. భావుకురాలైన అరుణ తన మదిలో అనునిత్యం మెదిలే జ్ఞాపకాలను 53 సంతకాలుగా అక్షరబద్ధం చేసింది. ‘కన్నీటి తరంగం’తో మొదటి సంతకం పెట్టి ‘శిఖర పతాకం’గా ఈ పుస్తకంలో చివరి సంతకం చేసింది.

మూగవేదనలో ఎన్నో సమస్యలు , సంఘర్షణలుంటాయి. జ్ఞాపకాల సంతకాలు కొన్ని కన్నీటి సుడులమధ్య, మరికొన్ని ఉద్వేగాలకు లోనైనపుడు ,ఇంకొన్ని నిస్తేజం ఆవహించినపుడు ఇలా వివిధ భావాల కలగలుపుతో చేసిన జ్ఞాపకాల సంతకాలన్నీ మదిపొత్తంలో భద్రపరిచినవే .

తన మొదటి కవితలో ‘బాల్యం అందమైన ఒక స్వప్నం’/….’బాధ్యతలెరుగని జీవనయానం/ అది ఒక అద్భుత దృశ్య కావ్యం/’ ..అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది.

నిజానికి బాల్యం అందరికీ తీపి గుర్తులనేం మిగల్చదు. కొందరికి మినహాయింపులు ఉంటాయి. చిన్ననాడే దూరమైన నాన్న ఆమె తలపుల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాడు . ‘సంగీత సమ్రాజ్ఞిగా /చూడాలనుకున్న తపన/ కరిగిపోయింది నక్షత్రాల్లో/’అంటూ తీరని కోరికతో దూర తీరాలు చేరిన తండ్రిని తలుచుకుంటూ దుఃఖిస్తుంది . అరుణను వెంటాడే మొట్టమొదటి జ్ఞాపకమది.

విధివికటాట్టహాసం చేస్తే జీవితం ఇలా కూడా ఉంటుంది అనడానికి
మరో సాక్ష్యం ‘తాళి కట్టిన బంధం తెగిపోయినా/ ప్రేమపాశాన్ని తెంచుకోలేక /’…అంటూ వాపోతుంది.సప్తపదితో ఒక్కటైన మనోరథుడు అర్ధాంతరంగా చిటికెన వేలు వదిలేసి కనుమరుగైతే! కళ్ళముందు ప్రేమ గుర్తులు ప్రశ్నలా మిగిలినప్పుడు అపురూపంగా పొదివిపట్టుకుని రక్షణ కవచంలా మారాలంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయో మనసున్న వారందరికీ తెలిసిన విషయమే !

‘అన్న ‘హృదయం అన్నీ తానై/నేనే తనకు అన్నీఅయినట్లుగా/పంచి ఇచ్చింది ఆత్మీయతానురాగాలు’/అని గతాన్ని గుర్తుచేసుకుంటుంది. అన్నిట్లో అండగా నిలిచిన సహోదరున్ని ఆత్మీయంగా మనసు పొరల్లో భద్రంగా దాచుకుంది.

కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పిస్తుంది అనే జీవిత సత్యాన్ని జీర్ణించుకుని ఆత్మవిశ్వాసం నింపుకుంటూ ముందుకు సాగడం నేర్చుకున్నానంటూ ‘ విషాద గీతాన్ని నేను/ నైరాశపు రాగాన్ని నేను ‘అంటూ తొలి కవితతోనే జీవిత చిత్రాన్ని కళ్ళ ముందుంచుతుంది.

సుఖదుఃఖాల సారమే జీవితం , పుట్టింది మొదలు గిట్టే వరకు ఎన్నో అనుభవాలు కొన్ని రంగుల మయమైతే, నిరాశ మిగిల్చేవి ఇంకెన్నో ! మదిగదిలో వసివాడని జ్ఞాపకాలే అన్నీ!
గెలుపోటములను
సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తుంది సెలవంటూ వెళ్ళిన బాంధవుడి కోసం కళ్ళు ఇంకా ఆరాటంగా వెతుకుతూనే ఉన్నాయని ఆవేదనతో చెప్తుంది.
బంధాలు ,అనుబంధాల మాయల వలయంలో చిక్కినప్పుడు ఊపిరాడని సందర్భాలుంటాయి, విలువలెరుగని ‘చిన్న మనసుల’ మాటలు ,చేతలు సమ్మెట పోట్లై బాధిస్తున్నప్పుడు జ్ఞాపకంగా మిగిలిన సఖున్ని కలల లోగిలిలో కలిసి మంతనాలాడుతుంది, పోట్లాడుతుంది . అలిగి కన్నీళ్లు కారుస్తుంది .అపసవ్యంగా సాగే బతుకుబాటలో జవాబు దొరకని ప్రశ్నలతో నైరాశ్యం కమ్మేసినపుడు ఏకాంతం బాధిస్తుంటే రేపటి ఆశ కోసం కొత్తదారి వెతుక్కుంటూ ‘అక్షర సమరం చేయడానికి /అంతరంగంలోనికి అడుగెట్టా’/నంటూ ‘సిరా సంతకాలు చేయడానికి’ స్వేచ్ఛగా ముందడుగేస్తుంది.

కాలంతో పాటు బతుకు నడక సాగాలి ఎన్నో మజిలీలను దాటుతూ, ఎగుడు దిగుళ్లను సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలని , జీవితాన్ని ఏమరుపాటుతనం తలకిందులు చేసేస్తుందని హెచ్చరిక చేస్తుంది. మానవీయ విలువలు మంట గలిసిపోతున్నాయని ఆవేదన చెందుతూ, ప్రశ్నిస్తూనే ఉంటానని నొక్కి చెప్తుంది .

పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది, కానీ ఒంటరి మహిళగా ఒత్తిళ్ళను తట్టుకుంటూ వాళ్ళను పెంచే క్రమంలో తన మనసునే ఇష్టసఖిగా చేసుకొని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఊరట పొందుతుంది.

ఇంటెడు చాకిరీ చేస్తూ అందరికీ తలలో నాలుకైన ఇల్లాలిని వంటింటి కుందేలును చేసిన సమాజమే వేదికలెక్కగానే గృహలక్ష్మి, ధృవతారఅంటూ కీర్తిస్తుందని అసహనం వ్యక్తం చేస్తుంది. స్త్రీ శక్తి స్వరూపిణి , సహనశీలకు అగ్నిపరీక్షలా అంటూ ఆవేశం వెళ్ళగక్కుతుంది .

వాలుకుర్చీని గూర్చి చెప్తుందొక చోట ముప్ఫై నలభై ఏండ్ల క్రిందటి వరకు వాలుకుర్చీలో కూర్చుని సేదదీరని ఇంటి పెద్దలు లేరంటే అతిశయోక్తి కాదు. గుమ్మంవారగా వేసుకొని హాయిగా కునుకుతీస్తూ గతం తాలూకు విషయాలను తలుచుకుంటూ సేదదీరిన వారు ఎందరో కదా! ‘ఒద్దికగా కూర్చుంటుంది ఓ మూల/…మడత పెడితే /గోడకు అతుక్కుంటుంది మౌనంగా/’ అంటూ వాలుకుర్చీని గుర్తు చేస్తుంది. ‘ఒక్క మాటలో చెప్పాలంటే అది/ జ్ఞాపకాలన్నింటినీ/ రాసులుగా పోసి/ దొంతరలుగా పేర్చి/ అరల్లో భద్రంగా దాచిన గుండెతడి /అంటూ కితాబిస్తుంది.

మనిషి జీవితంలో తలగడది ప్రధాన పాత్ర . గుండె తపనలను చల్లారుస్తుంటుందని , గుట్టు విప్పదు /గురుతు తెలియనివ్వదని నర్మగర్భంగా చెప్తుంది.
నిజానికి దిండు అలసినవారి తలకింద ఒదిగిపోయి హాయినిగొలిపే సుతిమెత్తని ఉపధానం. భావోద్వేగాలను, సుఖదుఃఖాలను సమానంగా పంచుకునే ఒరుగుబిళ్ళై బాధలలో ఓదార్పునిస్తుంటుంది .గోపనాన్ని గుమ్మం దాటనీయని నేర్పరి.

నిన్నటి ఓటమిని నేటి అనుభవంగా మార్చుకుని తెలివిగా ఒడిసిపట్టే ప్రయత్నంలో ఎదురయ్యే అవాంతరాలకు బెదరక ముందుకు సాగిపోతే విజయం మీ సొంతమవుతుందంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది.

దేశ రక్షణను తన భుజస్కందాలపై మోసే వీర జవాన్ల త్యాగనిరతిని కీర్తిస్తుంది. సామాజిక రుగ్మతలపై మండిపడి అక్షరాయుధాలతో సరికొత్త సంగ్రామం చేస్తానని గొంతెత్తి నినదిస్తుంది . పల్లె తీరుకు ముగ్ధురాలై అరుగు ముచ్చట్లను అవలోకనం చేసుకుంటుంది .’గుమ్మం ముందు అరుగులు/ నవ్వుల ఆవాసాలుగా నోళ్ళువిప్పి/క్షేమాలను అరుసుకుంటాయి’ అంటూ అరుగు ముచ్చట్లను ఏకరువు పెడుతూ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుని సంబర పడుతుంది. మేధామథనానికి అచ్చెరువొంది , పెద్దరికాలను బద్ధలుకొట్టి /విదేశీ కిరీటాలను/ భరతమాత పాదాల చెంతకు చేర్చిన /అరుదైన అంతరిక్ష కావ్యం అంటూ శ్లాఘిస్తుంది. దేశ కీర్తి పతాకాన్ని/ ప్రపంచ శిఖరంపై/..ఎగరేయాలని ఉవ్విళ్ళూరే యువ శక్తిని జాతిరత్నాలు అంటూ కొనియాడుతుంది .

సోదరి అరుణ కలంపట్టి కదులుతున్న వైనానికి ఆశ్చర్యం కలుగుతుంది. పాత జ్ఞాపకాలను గుండె బరిణలో దాచుకుని నూతన చైతన్యంతో మనసు దారిని మళ్ళించి కవనబాటలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ _

You may also like

Leave a Comment