Home ఇంట‌ర్వ్యూలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే వ్యాసాలు రావాలి

వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే వ్యాసాలు రావాలి

by Aruna Dhulipala

నమస్కారం సార్!

మా మయూఖ పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేసే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

జ:–  నమస్కారమండీ! నా జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం. నేను అక్టోబర్ 20వ తేదీ 1941లో జన్మించాను. నా తల్లిదండ్రులు అన్నదానం శేషమ్మగారు, వెంకటేశ్వర్లు గారు. నా అయిదవ ఏట ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన చిమ్మపూడి సుబ్బమ్మగారు నన్ను పెంపకానికి తీసుకోవడంతో ఇంటిపేరు చిమ్మపూడి అయింది. నా పెంపుడు తండ్రి వెంకటప్పయ్యగారు అప్పటికి చాలా కాలం క్రితమే మరణించారు. ఆమె నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా ఆదరించి, పోషించింది. అక్కడి ప్రాథమిక పాఠశాలలో నేను నాలుగవ తరగతి వరకు చదువుకున్నాను. అక్కడే మా పెదనాన్న కుమారుడు సుబ్రహ్మణ్యం గారి అండదండలతో ఆయన ప్రశిక్షణలో హిందీ ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశారద పరీక్షలన్నీ పాసయ్యాను. తల్లంపాడుకు సమీపంలో ఉన్నటువంటి గోకినేపల్లి గ్రామంలో స్వయంగా వండుకుంటూ, ఒక మాష్టారు గారికి వండిపెడుతూ చదువుకుంటూ హెచ్ ఎస్ సి పూర్తి చేశాను. ఖమ్మం ఎస్.ఆర్ కాలేజీలో పి.యు.సి. ఒక సంవత్సరం చదివాను. హెచ్ ఎస్ సి లో ఉండగానే నాకు వివాహమైంది. మా అన్నయ్య గారి సలహా మేరకు చంచల్ గూడ ‘హిందీ ప్రచార సభ’ లో ఒకే సంవత్సరంలో ప్రవీణ్, ప్రచారక్ ట్రైనింగ్ కోర్సులో చేరి పూర్తి చేసుకున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పుడు బిఏ, హిందీ ఎమ్.ఏ, బిఇడి, సంస్కృత కోవిద్ చేశాను.

జ:– నాకు చిన్నప్పటినుండే అంటే ఎనిమిదవ తరగతి నుండే ఏదో రాయాలన్న తపన ఉండేది. పాటలు నేర్చుకోవడం, పాటలు పాడడం వల్ల రాగాల పట్ల, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి ఏర్పడింది. పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ, పాటల పోటీలో పాల్గొని విజేతగా అనేక బహుమతులు పొందేవాడిని. భగవద్గీత పఠన పోటీల్లో కూడా బహుమతులు వచ్చేవి. ఆటల్లో కూడా చురుకుగా ఉండేవాడిని. వంశానుగతంగా మా పూర్వీకులలో సాహిత్యాభినివేశం ఎవరికీ లేదు. నాలో ఆ ఆసక్తికి కారణం మా ఉపాధ్యాయులే అని చెప్పాలి. వాళ్ళు అంకితభావంతో చేసే కృషి, మాకు అన్ని విషయాల్లో అందించే ప్రోత్సాహం వల్ల నాకు సాహిత్యరంగంలో ఆసక్తిని ఏర్పరిచింది. నన్ను విద్యా విషయంలో ముందుకు నడిపించిన మా అన్నయ్య సుబ్రహ్మణ్యం గారు మంచి గాయకులు. బహుశా ఆ ప్రభావం నామీద ఉండి ఉండవచ్చు.

జ:– నేను నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు టెక్స్ట్ లో ఉన్న ‘కృష్ణ-సుదాముడు’ అనే నాటికను మాతో వేయించారు. అందులో నా చేత కృష్ణుని పాత్ర వేయించారు. ఆ తరువాత ఉన్నత విద్యార్థి దశలో మా ఉపాధ్యాయులు, మాకంటే పెద్దవాళ్ళు డ్రామాలు వేస్తుంటే వాళ్ళతో పాటు పాల్గొనేవాడిని. పౌరాణిక నాటకాల్లో అర్జునుడు, కృష్ణుడు, సహదేవుడు పాత్రలను వేసేవాడిని. సాంఘిక నాటకాలు, ఏకపాత్రాభినయాలు కూడా మంచి శిక్షణ ఇచ్చి మా చేత వేయించేవారు. వారి శిక్షణ వల్లనే నాకు నాటకాల పట్ల ఆసక్తి పెరిగింది. అట్లా దాదాపు వంద నాటకాలు వేశాను.

జ:– ప్రవీణ్ ప్రచారక్ ట్రైనింగ్ అయిపోయిన తరువాత నాలుగు నెలలు ఉద్యోగం లేకుండా ఉన్నాను. ఆ సమయంలో మా బాబాయి తేరాల సూర్య నారాయణ శర్మ గారు నాకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఈ లోపు మా అన్నయ్య హైదరాబాద్ హిందీ విద్యాలయంలో 150 రూపాయలతో ప్రయివేటు ఉద్యోగం ఇప్పించాడు.  సూర్యాపేట జిల్లా సిరికొండ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మా బాబాయి పనిచేస్తుండేవారు. అక్కడ హిందీ టీచరు లేనందువల్ల ప్రయత్నం చేసి నాకు ఉద్యోగం ఇప్పించాడు. అప్పుడు నా జీతం 68 రూపాయలు. అట్లా సిరికొండలో నా ఉద్యోగ ప్రస్థానం మొదలయింది. వరుసగా ప్రమోషన్స్ తో గ్రేడ్ 2, గ్రేడ్ 1, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉద్యోగం చేసి చివరగా మంచిర్యాల కాలేజీలో రిటైర్ అయ్యాను. తరువాత 1999 లో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను.

రామ్మూర్తిగారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

జ:–  నేను రిటైర్మెంట్ తీసుకున్న తరువాతనే పుస్తకాలు రాశాను. అప్పటికే పాటలు, పద్యాలు, కవిత్వం రాస్తున్నప్పటికీ కాగితాలలో మాత్రమే ఉండేవి. హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఇక్కడ కవులను, సాహిత్య సభలను చూస్తూ ప్రభావితుడనయ్యాను. ఇప్పటివరకు నేను ఇరవై పుస్తకాలు రాశాను. ఇంకా ముద్రణ కావల్సినవి ఉన్నాయి. మా గురువు గారు డా. సి. నారాయణ రెడ్డిగారు. రెండు మూడు పుస్తకాలు తప్ప నా పుస్తకాలన్నీ ఆయనే ఆవిష్కరించారు. మొదటగా ‘రవ్వలు’ అనే పేరుతో మినీ కవితలు రాశాను. రెండు లలిత గేయాల పుస్తకాలు రాసి ఒకటి ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారికి, ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారికి, మరొక గేయ సంపుటి డా.సి. నారాయణరెడ్డి గారికి అంకితం ఇచ్చాను. ‘ఒక కొత్త శ్వాస కోసం’ అనే దీర్ఘ కవిత రాసి అది కూడా అక్కినేని గారికి అంకితం ఇచ్చాను. ఇందులో మానవీయ విలువలు, సమాజం గురించి రాశాను. సమాజానికి కేంద్రం మానవుడు, మానవునికి కేంద్రం మానవీయత. ఈ అంశాలను వివరిస్తూ, పదిమందికి పంచాలని రాశాను. నానీలు రాశాను. వచన కవితలు, మినీ కవితలు, మినీ హాస్య కవితలు సుమారు ఎనిమిది వందలకు పైగా రాశాను. అది ‘పంచ్- విపంచి’ పుస్తకంగా వచ్చింది. మూడు వేలకు పైగా కొంటె ప్రశ్నలు-కొంటె జవాబులు రాశాను. ‘నవ్వే బంగారం’ అనే పేరుతో హాస్యం గురించి పరిశోధనాత్మక పుస్తకం రాశాను. “నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును/నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు…” అన్న జాషువా పద్యాన్ని ఉటంకిస్తూ పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న హాస్య ప్రధానమైన విషయాలను, కవులు, పండితుల హాస్య సంభాషణలు …ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘నవ్వుల నక్షత్రాలు’ రాశాను. “తల్లీ నిన్ను దలంచి” అనే మాతృ శతకం రాశాను. ఇవన్నీ రాసినప్పటికీ నాకు ముందు నుండీ పద్యాలు, పాటలు చాలా ఇష్టం. ‘అంతా బాగున్నారా?’ అనే పుస్తకం ముద్రణలో ఉంది.

జ:–  2010 వ సంవత్సరంలో ఖమ్మంలో జరిగిన నంది నాటకోత్సవాలకు ప్రభుత్వం వారు నన్ను జడ్జీగా పిలిచినప్పుడు ఆశ్చర్యపోయాను. వెళ్లిన తర్వాత డైరెక్టర్ పార్థసారథి గారు పిలిచి మీ అనుభవాలను చెప్పండి అని అడిగి ఒక పద్యం కూడా పాడమన్నారు. పాడిన తరువాత మరో రాగంలో పాడమన్నారు. అదీ పాడిన తర్వాత వాటి రాగాల పేర్లు చెప్పమన్నారు. అప్పుడు నన్ను ఎంపిక చేసుకున్నారు. నాతో పాటు సురభి కంపెనీ డైరెక్టర్  రామ్మోహన్ రావు గారు, అన్నమయ్య ట్రస్ట్ వాటిల్లో పాటలు రాసిన వ్యాస భట్టాగర్ గారు, నేను ముగ్గురం జడ్జీలుగా ఉన్నాము. పోటీకి ముప్పది ఆరు నాటకాలు వచ్చాయి. సాధారణంగా నాటకాలలో వివిధ అంశాలకు నంది అవార్డులు ఇస్తారని అందరికీ తెలుసు. కానీ మొదటిసారి జడ్జీలకు పురస్కారం ఇవ్వాలనే ఆలోచన వారికి కలగడం యాదృచ్ఛికంగా నాకు ఒక మంచి అవకాశం.

జ:–  ఒకసారి నా ప్రోగ్రాం చొక్కాపు వెంకటరమణ గారు చూసి మీరు “పాటలు, పద్యాలు ఇంత బాగా పాడుతున్నారు. కొత్త ప్రయోగం ఏదైనా విలక్షణంగా చేస్తే బాగుంటుంది.” అన్నారు. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. అరవై నిమిషాల్లో అరవై పాటలు పాడాలని సంకల్పించాను. మొదట పది నిమిషాల్లో పది పాటలు, ఇరవై నిమిషాల్లో ఇరవై పాటలు ఇట్లా సాధన చేశాను. దానితో పాడగలననే ధైర్యంతో వెంకట రమణ గారికి ఫోన్ చేసి, విషయం చెప్పాను. ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు పాడిన రికార్డ్స్ ఉన్నాయి. కానీ పాటల సంఖ్య లేదు. అందులో పాల్గొనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కార్యక్రమాన్ని బృందంగా నిర్వహిస్తారు. ఒక్కరు మాత్రమే పాడిన రికార్డు లేదు. అందువల్ల ఆయన నన్ను ఈ కార్యక్రమం నిర్వహించమని తేదీ కూడా నిర్ధారించారు. ‘నవరాగం-స్వరయాగం’ అనే పేరుతో దీన్ని నిర్వహించాను. కీబోర్డు, తబలా సహవాద్యకారులకు పాటల వరుసక్రమాన్ని రాసి ఇచ్చాను. దీంట్లో మరో ప్రత్యేకం ఏమిటంటే కేవలం సినిమా పాటలు కావు. ఒక సినిమా పాట, ఒక లలిత గీతం, ఒక దేశభక్తి గీతం, ఒక హరికథ కీర్తన, బుర్రకథ కీర్తన, అన్నమయ్య, త్యాగయ్యల కీర్తనలు, ఒక తరంగం, ఒక హిందీ సినిమా పాట ఇట్లా విభిన్న ప్రక్రియల్లో పాడాను. 58 నిమిషాలలోనే పూర్తయింది. ఆరు రికార్డులు సొంతం చేసుకున్నాను. వెంకట రమణ గారి సూచన, ప్రోత్సాహాలతో ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరిగింది. ప్రశంసలు వెల్లువెత్తాయి.

జ:–  రేడియో లైట్ మ్యూజిక్ లో నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నో లలితగీతాలు పాడాను కూడా. ఆకాశవాణి హైదరాబాద్ వారు ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఆడిషన్స్ కమిటీలో జడ్జీగా వేశారు. కేవలం పాటలు, లలితగీతాలే కాక పద్యపఠనం, ప్రసంగాలు, హిందీ కవితలు, హిందీ నుండి తెలుగులోకి తెలుగు నుండి హిందీలోకి అనువాద కవితలు, నాటికలు ఇట్లా అనేక ప్రక్రియలలో చేశాను. హిందీ పాఠాలు కూడా చెప్పాను. ఉదయం 6గంటలకు ‘భావన’ అనే కార్యక్రమం వచ్చేది. 5 నిమిషాల ప్రసంగం ఉంటుంది. టాపిక్స్ కూడా నన్నే ఎంపిక చేసుకోమన్నారు. ఇప్పటికి 200 ప్రసంగాలు చేశాను. ఈ విధంగా రేడియోతో నాకు ఎంతో అనుబంధం ఉంది.
        మీరడిగిన ‘టోరీ’ అనేది తెలుగు -1 రేడియోలో ఒక భాగం. ఇరవై నాలుగు గంటలూ గంట గంటకు ఒక వ్యాఖ్యాత వివిధ అంశాలపై మాట్లాడుతుంటారు. పులివర్తి కృష్ణమూర్తి గారు నాకు మిత్రులు. ఆయన టోర్నీలో వ్యాఖ్యానం చేసేవారు. ఒకసారి మాటల సందర్భంలో “మీరు కూడా మీకు ఇష్టమైన ప్రక్రియలో వ్యాఖ్యాతగా చేరొచ్చు కదా!” అన్నారు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. అందుకని కొన్ని రోజులు వరుసగా ఆ కార్యక్రమాలను విన్నాను. దానితో నాకూ ఆసక్తి పెరిగింది. అట్లా వింటున్నప్పుడు ఒక సాధారణ శ్రోతగా వ్యాఖ్యాతలతో మాట్లాడేవాడిని. ఆవిధంగా రెండు నెలలు గడిచాక నేను మాట్లాడే విధానం, విషయ పరిజ్ఞానం వాళ్లకు అర్థమై పద్య ప్రక్రియలో  వ్యాఖ్యాతగా చేయమన్నారు. సరేనని అప్పటి నుండి ఎనిమిది సంవత్సరాలుగా నిరాటంకంగా చేస్తూనే ఉన్నాను. ప్రతీ శనివారం ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు నాకు స్లాట్ ఇచ్చారు. ఆ సమయంలో నేనొక పద్యం పాడి వివరిస్తాను. శ్రోతలు కూడా కొంతమంది శతకాలలోని, కావ్యాలలోని పద్యాలు చెప్తారు. ఒకసారి చెప్పిన పద్యాన్ని మరోసారి చెప్పను. ఇతిహాసాలు, కావ్యాలు, శతకాలు ఇవేకాక కొంతమంది నాకు ఇచ్చిన పుస్తకాల్లోని పద్యాలు, అప్పుడప్పుడు నేను సొంతంగా రాసిన పద్యాలు చదువుతుంటాను. రేపటి తరానికి పద్యమంటే ఏమిటి? దాని సొబగులు, వన్నెలు, సౌందర్యం ఇవన్నీ తెలపాలని నా తాపత్రయం. తెలుగు భాష, పద్యం పట్ల ఆసక్తిని కలుగ జేయడంతో పాటు పద్యం యొక్క ప్రాథమిక నిబంధనలు, ఛాయ, పోకడ ఎలా ఉంటుందో సరళంగా, సుబోధకంగా చెప్పడం నా ఉద్దేశ్యం. ఎక్కడెక్కడో ఉన్న వారిని ఫోను సంభాషణ ద్వారా లైవ్ గా ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నాను. శ్రోతలు కూడా వారిని పద్యాలు అడుగుతుంటారు. మంచి స్పందన వస్తోంది. పద్యాన్ని అందరూ ఆదరిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగువారికి పద్యం ఆస్తి. పద్యం లేకపోతే తెలుగు భాష నాస్తి. అందువల్ల ఇది ఇంకా ఇట్లాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను కూడా.

జ:–   నేను సాహిత్య సభలు, చర్చలు, పాట కచేరీలు, హరికథలు, బుర్రకథలు, రంగస్థల నాటకాలు ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతున్నా వెళ్లి ఆసాంతం వినేవాడిని.  నాలుగైదు సంవత్సరాలు చూసిన తరువాత నాకొక ఆలోచన వచ్చింది. ఇన్ని ప్రక్రియలను గంట, గంటన్నర వ్యవధిలో నేనొక్కణ్ణే పాడి ఎందుకు ప్రదర్శించకూడదు? అనిపించింది. ఇది నా మనస్సులో రాగావధానానికి పడిన సందర్భబీజం. ఈ ప్రక్రియలన్నీ ఒక కార్యక్రమంలాగా పాడి వినిపించాలి. ప్రయత్నం ప్రారంభించాను. అవధానం కాబట్టి పృచ్ఛకులు ఉండాలి. వాళ్ళు కూడా సంగీత పరిజ్ఞానం కలిగి ఉండాలి. నాకు ఇరువైపులా ఎనిమిది మంది పృచ్ఛకులు, ఒక సమన్వయ కర్త (వ్యాఖ్యాత) ఉంటాడు. ఒక పృచ్ఛకుడు లేదా పృచ్ఛకురాలు ఒక లలిత గీతం పాడి, దీనిని వేరే రాగంలో పాడమని అడుగుతారు. మొదట వాళ్ళు అడిగిన రాగాన్ని ఆలాపన చేయాలి. ఉదాహరణగా ఆ రాగంలో ఉన్నటువంటి ప్రసిద్ధ గీతం కానీ, తెలుగు లేదా హిందీ సినిమా పాట గానీ పల్లవి గానీ వినిపించి అప్పుడు వాళ్ళు అడిగిన రాగంలో ఆ లలితగీతాన్ని పాడాలి. ముందుగా ఎటువంటి రిహార్సల్స్ ఉండవు. లైవ్ గా పాడాలి. ఎనిమిది మంది రెండు రౌండ్ల చొప్పున పదహారు పాటలు వినిపించాలి. రాళ్లబండి కవితా ప్రసాద్ గారు, సినారె గారు, మాధవపెద్ది సురేశ్ గారు, సురేఖామూర్తి వంటి వారు శ్రోతలుగా పాల్గొన్నారు. ప్రముఖులైన వాళ్ళు పృచ్ఛకులుగా కూడా పాల్గొన్న సందర్భాలున్నాయి. వినూత్నంగా చాలా బాగుందని ఎంతోమంది ప్రశంసించారు. రాగ పరిమళాన్ని పరివ్యాప్తం చేయాలన్నది నా కోరిక. దీనివల్ల సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవారికి రాగాల గురించి ఒక అవగాహన కలుగుతుంది.

జ:– నేను ఇప్పటికి ఈ వినూత్న ప్రక్రియలో 57 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. గుంటూరు, విజయవాడ, విజయనగరం, తెనాలి, సూర్యాపేట, ఖమ్మం మొదలైన చోట్ల ప్రదర్శించాను. హైదరాబాద్ లోని అన్ని వేదికల మీద ఇచ్చాను. బొంబాయిలో ప్రదర్శన ఇస్తే వాళ్లకు నచ్చి, మరో రెండు ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఒకసారి ఒక తమాషా జరిగింది. ఒక జర్నలిస్టు ఒక పేపర్ కటింగ్ ఇచ్చి ఆ వార్తని మోహన రాగంలో పాడమన్నాడు. వచనంలో ఉన్నదాన్ని రాగంలో పాడడం సాధ్యమా? అయినా పాడాను. అది ఒక అనుభవం. అంటే మనం ప్రతీది సాధన చేసి ఉండాలి. లైవ్ కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా అన్నింటి లోనూ అవగాహన ఉండాలి. ప్రయత్నమే ప్రథమ విజయం కదా! ఈ రకంగా రాగావధానాన్ని దిగ్విజయంగా చేశాను. నేను, పొనకంటి దక్షిణామూర్తి అనే మిత్రుడు ఇద్దరం కలిసి ‘యుగళ రాగావధానం’ చేశాం. ఎలాగంటే ఒక పద్యాన్ని ఒక పంక్తి నేను పాడితే రెండవది ఆయన, మూడవది నేను, నాలుగవది ఆయన పాడాలి. అట్లాగే ఒక రాగాన్ని నేను కొంత పాడితే మరికొంత ఆయన, దానికి కొనసాగింపుగా నేను, మళ్లీ ఆయన ఇట్లా ఇద్దరం కలిసి చేశాం. రాగావధానం పట్ల ఆసక్తితో నేర్చుకొని ఇద్దరు, ముగ్గురు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఋగ్వేదం పద్మశ్రీ అనే అమ్మాయి బిటెక్ పూర్తి చేసి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. ఆ అమ్మాయికి రాగావధానంలో ప్రశిక్షణ ఇచ్చాను. సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉన్న అమ్మాయి. నెల రోజులు సాధన చేసి ప్రదర్శన ఇచ్చింది. జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొరకు బింగి నరేందర్ గారి ఆధ్వర్యవంలో ఈ కార్యక్రమం జరిగింది. 90 నిమిషాల్లో ఆమె అవధానాన్ని పూర్తి చేసింది. ఇట్లా ఎంతోమంది ముందుకు వస్తున్నారు. పిల్లలను చాలా మందిని ఈ ప్రక్రియలో తయారు చేయాలన్నది నా కోరిక. చేస్తాను కూడా.

జ:– నేను చాలా కాలంగా రాసుకున్న లలితగీతాలు వందలకొద్దీ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకొని సినారె గారి దగ్గరకు వెళ్లి చూపించాను. వాటిని పుస్తకంగా వేస్తున్నానని, ఆయనను పేరు సూచించమని, అంకితం కూడా ఆయనే తీసుకోవాలని అభ్యర్థించాను. సహృదయంతో అంగీకరించారు. ‘పాట పల్లవించిన వేళ’ అని పేరు సూచించారు. దీనికి ముందుమాట ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం గారితో రాయించాను. పదహారు రోజులలోనే రాసిచ్చారు. వంశీ రామరాజు గారు ఆ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ గాయనీ గాయకులతో నా ‘లలిత సంగీత విభావరి’ కూడా జరిగింది. నా గీతాలకు స్వయంగా నేనే ట్యూన్ చేసుకున్నాను. ఆ రాగాలనే వారు ఆలపించారు. తరువాత ఎన్నో గీతాలు రాశాను. మరికొన్ని గీతాలతో ‘పాట పరిమళించిన వేళ’ అనే పుస్తకం వేశాను. దానిని ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇవ్వాలని అనుకున్నాను. నేను, ఆకృతి సుధాకర్ గారు సారథి స్టూడియోలో ఉన్న బాలు గారిని కలిసి అంకితం తీసుకోమని కోరాను. నాపై ఆయనకున్న అభిమానంతో ఒప్పుకొని తనకు కుదిరే తేదీని చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అంకితోత్సవ సభ జరిగింది. అదే సమయంలో దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కూడా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసి ఆవిష్కరణకు ఆయనను పిలవాలని సుధాకర్ గారితో వెళ్ళాను. ‘అంకితం ఎవరికిస్తున్నారు?’ అన్నారు. ‘బాలు’ గారికి అనగానే ‘ఇంకేం? మా వాడే కదా! వస్తాను’ అన్నారు వెంటనే. ఇద్దరు దిగ్దంతులు ఒకరు ఆవిష్కరించడం, ఒకరు అంకితం తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ పుస్తకంలోని సుమారు అరవై పాటలను రేడియో, దూరదర్శన్ వాళ్ళు వేరే ట్యూన్ కంపోజిషన్ చేసి ప్రముఖ గాయనీ గాయకులతో పాడించారు.
          పాటల సందర్భం వచ్చింది కాబట్టి మీకో విషయం చెప్తాను. 1987వ సంవత్సరంలో నాకు ‘ఆడబొమ్మ’ సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. మద్రాసుకు వెళ్లాను. ‘నందామయా గురుడ నందామయా’ వంటి నాలుగు పాటలు రాశాను. మనో గారు, వాణీ జయరాం గారు, జానకి గారు ఆ పాటలను పాడారు. ‘ఆదిపరాశక్తి’ మొదలైన నాలుగు టీవీ సీరియల్స్ కి నాలుగు టైటిల్ సాంగ్స్ రాశాను. బాలు గారు మూడు పాటలు, నిత్య సంతోషిణి గారు ఒక పాట పాడారు.

జ:– ఎంతోమంది ప్రముఖులను గుర్తిస్తూ సన్మాన సత్కారాలు చేస్తున్న ఎన్నో సాహిత్య సాంస్కృతిక సంస్థలను నేను చూశాను. కానీ ఎవరూ పిల్లలకు ప్రోత్సాహకరంగా, ఉత్సాహకరంగా ఉండే పనులను చేయడం లేదెందుకు? అనే ఆలోచన వచ్చింది. పిల్లలకు ఏదైనా చేయించాలనే కోరికతో స్థాపించిన సంస్థ ‘చిమ్మపూడి ఫౌండేషన్’. నా ఆలోచనలకు తగిన కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా చేర్చుకొని సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ నెలా మేము బ్యాంకులో కొంత కార్పస్ ఫండ్ డిపాజిట్ చేస్తాం. విరాళాలు ఇచ్చిన వారికి పారదర్శకంగా ఉండేలా తప్పనిసరిగా రశీదులు ఇవ్వడం చేస్తాం. ఈ సంస్థ 2019 అక్టోబర్ 20వ తేదీన ప్రారంభమైంది. గౌరవ సలహాదారుగా ఉండేందుకు కె. వి. రమణాచారి గారిని అడిగితే ఆయన అంగీకరించారు. పిల్లల చేత రకరకాల కార్యక్రమాలు చేయించడం, పెద్దవాళ్లను పిలిచి సత్కరించడం, ప్రముఖులలో ఒకరికి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం, సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ ఈ సంస్థ ద్వారా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 36 చోట్ల కన్వీనర్లను పెట్టుకున్నాం. స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, సాహిత్యానికి పురాణాలకు సంబంధించిన పజిల్స్, క్విజ్ లను ఏర్పాటు చేసి తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించేలా చేస్తున్నాం. పోటీలో విజేతలైన వారి పేర్లు, స్కూల్ పేరు, ప్రిన్సిపాల్, నిర్వాహకుల పేర్లతో సహా సావనీర్ లో ప్రింటు చేయిస్తున్నాం. ఇప్పటికి ఐదు సావనీర్లు వచ్చాయి. ఆరవది ఈ అక్టోబరులో వెలువడనుంది. దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమాలకు వెళ్లి వారికి కావలసిన అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. నగదు రూపంలో ఏదీ ఇవ్వం. ఆయా అవసరాలను బట్టి వస్తువులు కానీ ఆహార పదార్థాలు గానీ ఇస్తాం. ఇట్లా భాష, సాహిత్య, సాంస్కృతిక, కళ, విద్య, సామాజిక సేవలను అందిస్తున్నాం. జిల్లా కన్వీనర్ల సేవలను గుర్తించి, ఆహ్వానించి సత్కరించుకుంటున్నాం. యువ కవిసమ్మేళనాలతో యువతను ప్రోత్సహిస్తున్నాం.

జ:– అది కేవలం నా వ్యక్తిగతం కాదు. సమాజానికి ఉపయోగపడే వివిధ అంశాలను తెలియజేసే ఉద్దేశ్యంతో 2023 ఆగస్ట్ 10వ తేదీ వినాయక చవితి రోజున ఈ మీడియాను ప్రారంభించాను. ప్రశ్నకు జవాబుగా ఒక కథతో ఇది ప్రారంభమైంది. ఇప్పుడు నిరంతరాయంగా అనేకమంది కథలు, ప్రసంగాలు పంపిస్తున్నారు. రామాయణంలో చాలామందికి తెలియని అనేక విషయాలను చెబుతూ ‘రామాయణ రహస్యాలు’ అనే పేరున ఇప్పటికి సుమారు ఇరవై ఐదు ప్రసంగాలు ధారావాహికగా వచ్చాయి. ‘పెళ్లి ముచ్చట్లు’ అనే శీర్షికతో పది భాగాలుగా ఒక ధారావాహిక చేశాను. పెళ్లిలో జరిగే తంతులో ఉన్న రహస్యాలు చాలామందికి తెలియవు. వాటిని వివరిస్తూ ఒక్కో విషయానికున్న ప్రాధాన్యతను ఇందులో తెలిపాను. ‘మనసా కవ్వించకే’ అనే పేరుతో మరో ధారావాహిక చేశాను. నా మిత్రులు నారుమంచి వారు, నేను మా ఆలోచనలతో దీనిని నిర్వహించాం. మనిషి ప్రవర్తన, ఖ్యాతి, అపఖ్యాతి అంతా మనసు మీదే ఆధారపడి ఉంది. మనసు మనిషిని ఎక్కడ సవ్యంగా నడుపుతుందో, ఎక్కడ దారి తప్పుతుందో చిన్న చిన్న కథలు, సంఘటనల  ద్వారా తెలపడం జరిగింది. ఇవేగాక అభిరుచి, ఆసక్తి, ఉత్కంఠ కలిగించే కథలను కొన్నింటిని ఎంపిక చేసుకొని వాటిని చక్కగా చడవగలిగే వారితో చదివిస్తాను. నాకు సన్నిహితులైన వారు మన ప్రాంతంలోనే కాక కాలిఫోర్నియా ఆస్ట్రేలియా, మెల్ బోర్న్ ఇట్లా విదేశాలనుండి కూడా వాటిని చదివి వాటిని రికార్డు చేసి పంపిస్తారు. ఈ మీడియా ద్వారా వాటిని అందిస్తున్నాను. కవిసమ్మేళనాలు, ఏకాపాత్రాభినయాలు, పరీక్షార్థులకు చిట్కాలు, వేద సందేశాలు, రంగస్థల పద్యాలు, ప్రఖ్యాత తీర్థ క్షేత్ర విషయాలు…ఇట్లా దాదాపుగా ఇరవై ఐదు అంశాలను ఇందులో పొందుపరుస్తున్నాను.

జ:– నేను ‘భువన విజయం’ రూపకాన్ని ఎన్నో చోట్ల చూశాను. ‘భువన విజయం’లో పదిహేనేళ్లుగా నేను కూడా వివిధ కవుల పాత్రలను ధరిస్తూ వస్తున్నాను.  అయితే ఇందులో పాల్గొనే కొంతమంది పద్యాన్ని భావయుక్తంగా చదువుతున్నారు కానీ శ్రుతి శుద్ధంగా, రాగ యుక్తంగా పాడడం లేదు. పిల్లలతో అందునా అమ్మాయిలతో వేయిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ప్రగడరాజు నర్సరాజు, మొల్లమాంబలతో కలిపి అష్టదిగ్గజకవులు, మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయలు, ఒక ప్రయోక్త, ఒక భటుడు మొత్తం పధ్నాలుగు మందిని సంగీత పరిజ్ఞానం ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసుకున్నాను. వాళ్ళల్లో బిఏ, బిటెక్, ఎమ్ బిఏ, ఎమ్ సీఏ, బి ఫార్మసీలలో విద్యాభ్యాసం చేస్తున్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళను వెతికి ఎంపిక చేసుకోవడం, సమీకరించడం చాలా కష్టమైంది. వాళ్ళను నేను, నన్ను వాళ్ళు చూసింది లేదు. అంతా ఫోను ద్వారానే. జూమ్ సమావేశం ద్వారా రిహార్సల్స్ నిర్వహించేవాడిని. వివిధ రకాల విద్యాభ్యాసాల విద్యార్థినుల వాళ్ళు కాబట్టి సమయానికి అనేక అవాంతరాలు ఉండేవి. పూర్తిగా పధ్నాలుగు మంది అటెండ్ అయిన జూమ్ మీటింగ్ ఒక్కటి కూడా లేదు. ఎన్ని అవరోధాలు వచ్చినా పట్టుదలతో ప్రశిక్షణ ఇచ్చాను. ఒక్కొక్కరికి రెండు పద్యాల చొప్పున విభిన్న రాగాలు నేర్పించాను. స్క్రిప్టు తయారుచేసి చిన్న చిన్న డైలాగ్స్ పంపించాను. ఆయా కవుల వేషధారణలు ఎట్లా ఉండాలో అవగాహన చేయించాను. వారి తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందించారు. ఇప్పటికి హైదరాబాద్ వేదికల మీద మూడు, దూరదర్శన్ లో ఒకటి మొత్తం నాలుగు ప్రదర్శనలు ఇచ్చాం. ఎస్ వి బి ఛానల్ వారి నుండి ప్రదర్శన కోసం ఆహ్వానం వచ్చింది. అనితరసాధ్యమైన ఈ కార్యక్రమ రూపకల్పన నేను సాధించిన అచీవ్ మెంట్లలో ఒకటిగా భావిస్తాను.

జ:– నా పరిశీలనలో చాలా చోట్ల వివిధ రంగాలలో ఉన్నవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటే బాగా ఆవేదనకు గురయ్యాను. ప్రసార, ప్రచార, సినిమా రంగాల గురించి చెప్పనవసరం లేదు. భాషోచ్చారణ, మాట, శైలి, వక్తృత్వం, ప్రసంగం, కథా కథనం, నాటక సంభాషణ ఇట్లా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడే విధానంలో అనేకరకాలుంటాయి. సమయం, సందర్భం కూడా చూడవలసి ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే మాట మీద రాయాలన్న సంకల్ప బీజం నాలో నాటుకుంది. అసలు మాట ఎట్లా పుట్టింది? ఎట్లా మాట్లాడాలి? మంత్ర రూపంగా, శ్లోక రూపంగా మాటకున్న విలువ ఏమిటి? ఇవన్నీ వివరిస్తూ ‘మాట కచేరీ’ పేరుతో పుస్తకం వేశాను. రాస్తున్నప్పుడే  దీనిని  మాట విలువను గుర్తించి ప్రతీ సందర్భంలోఅద్భుతంగా మాట్లాడే మాజీ ఉపరాష్ట్రపతి డా. వెంకయ్యనాయుడు చేత ఆవిష్కరింపజేయాలని సంకల్పం పెట్టుకున్నాను. పుస్తకం పూర్తి అయిన తరువాత వారి పిఏ తో మాట్లాడి, పుస్తకం పంపించి, నా అభ్యర్థన తెలిపాను. పంపిన మూడు రోజులకే నాకు అక్కడి నుండి మూడు రోజులలో అపాయింట్మెంట్ తేదీని ఖరారు చేస్తూ కబురు వచ్చింది. అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకడం నా అదృష్టం. అంతటి గొప్ప సహృదయులు వారు. మా ఫౌండేషన్ మెంబర్స్ ని మాత్రమే ఆవిష్కరణకు రమ్మన్నారు. పుస్తకాన్ని గురించి పది నిమిషాలు చర్చించారు. ‘చాలా బాగా రాశారు’ అన్నారు. అది నా జీవితానికొక గొప్ప ధ్రువపత్రం, ప్రమాణపత్రం. ఈ పుస్తకాన్ని ఉన్నత సంస్కారి, సహృదయులు, మితభాషి, హితభాషి, స్మిత భాషి అయిన కె. వి.రమణాచారి గారికి అంకితం ఇచ్చారు. అంకితోత్సవ సభ అక్టోబర్ 4వ తేదీన త్యాగరాయ గాన సభలో జరిగింది.

ధన్యవాదాలు సార్! మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి, మీ సంగీత, సాహిత్య,

సామాజిక సేవలను గురించి తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేకానేక కృతజ్ఞతలు. నమస్కారం. సెలవు.

You may also like

9 comments

Carrie3323 December 7, 2025 - 1:51 am Reply
Lauryn346 December 15, 2025 - 11:30 am Reply
Krista3253 December 21, 2025 - 6:34 pm Reply
Betty1117 December 29, 2025 - 2:52 pm Reply
Lana3321 December 29, 2025 - 3:04 pm Reply
Ellie1626 December 31, 2025 - 1:26 am Reply
Max1437 January 20, 2026 - 5:14 pm

Fast indexing of website pages and backlinks on Google https://is.gd/r7kPlC

Reply
Edna3638 January 20, 2026 - 6:50 pm

Fast indexing of website pages and backlinks on Google https://is.gd/r7kPlC

Reply
Griffin3928 January 21, 2026 - 7:08 am

Fast indexing of website pages and backlinks on Google https://is.gd/r7kPlC

Reply

Leave a Reply to Lauryn346 Cancel Reply