Home బాల‌సాహిత్యం సన్నాయి మహిమ

నరసింహపురం అనే గ్రామంలో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ గ్రామం గత మూడు సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు కాటకాలతో సతమతమైంది. ఆ సంవత్సరం ఆ శరభయ్య పొలం కూడా వర్షం లేక పైరు ఎండిపోయింది. అతడు దాన్ని చూసి బాధపడుతున్న సమయంలో అక్కడి నుండి ఒక సన్యాసి పోతూ ఆ రైతును పిలిచి ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించాడు . ఆ రైతు తన పొలం ఎండిపోయిందని,తాను ఎలా బ్రతికేదని బదులిచ్చాడు . అప్పుడు ఆ సన్యాసి ఒక సన్నాయిని తన సంచిలో నుండి తీసి బిగ్గరగా ఊదాడు . వెంటనే ఆ పొలం పచ్చగా నిగనిగలాడింది.
ఆ రైతు ఎంతో సంతోషించి ” మహాత్మా! ఒక్క నా పొలం పచ్చగా ఉంటే సరిపోదు. మా ప్రజలందరి కడుపులు నిండాలంటే మీరు మా గ్రామంలో గల అన్ని పంటచేలను పచ్చగా చేయాలి” అని కోరాడు. ఆ రైతు పరోపకార బుద్ధికి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆ సన్నాయిని ఇస్తూ ” ఓ. ఉపకారీ! ఈ సన్నాయి నేను ఊదితే ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అడిగిన వారి కోరికను తీరుస్తుంది. కానీ ఇప్పుడు అది ఇక నా చేతిలో పనిచేయదు. అందువల్ల దీనిని నీకు ఇస్తున్నాను. తీసుకో! దీనిని నీవు ఊదితే అది మూడు సార్లు నీ కోరికలను తీరుస్తుంది. కానీ ఒక్క షరతు. నీవు ఇప్పుడు కోరినట్లే ఇతరులకు ఉపయోగపడే కోరికలను మాత్రమే కోరాలి. స్వార్థంతో నీవు ఏ కోరిక కోరినా ఇది పనిచేయదు” అని దానిని ఆ రైతుకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ రైతు సంతోషంగా దాన్ని తీసుకొని తమ తోటి రైతుల పొలాలన్ని పచ్చగా ఉండాలని, పంట బాగా పండాలని కోరి దానిని ఊదాడు. వెంటనే మిగతా రైతుల పొలాలన్ని పచ్చదనంతో నిగనిగలాడాయి. ఒక కోరిక ఆ విధంగా నెరవేరింది. తర్వాత ఎండాకాలం తమ గ్రామంలోని చెరువులన్నీ ఎండిపోవడం చూసాడు. మూగజీవాలకు నీటి కటకటను గమనించాడు. తమ గ్రామంలోని చెరువులన్నీ నిండాలని తన కోరికగా కోరి తిరిగి ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ గ్రామంలో గల చెరువులన్నీ ఆశ్చర్యంగా నిండిపోయాయి. ఆ తర్వాత మూడవ కోరికగా అడవిలోని, గ్రామంలోని ఎండిపోతున్న చెట్లన్నీ ఆకుపచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలని ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ అడవిలో,గ్రామంలో ఉండే చెట్లన్నీ ఆకుపచ్చదనంతో నిగనిగలాడాయి. మూడు కోరికలు పూర్తి కావడంతో ఆ సన్నాయి తన మహిమను కోల్పోయింది. ఆ చెట్ల వల్ల భారీ వర్షాలు పడి ఆ గ్రామంలో పంటలు చాలా పండాయి. దానితో ఆ గ్రామం కరువు కాటకాలు తీరిపోయాయి. తమ గ్రామ కరవుకాటకాలు పోగొట్టిన ఆ రైతును గ్రామస్థులు అందరూ అభినందించారు.

You may also like

Leave a Comment