అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె గోడపైనున్న పటాలు, గదిలోని ప్లేట్లు కిందపడే వరకు బిగ్గరగా నవ్వేది. చాలా చిన్న విషయాలకు కూడా ఆమె నవ్వేది. ఆమె నవ్వు ఎంత బిగ్గరగా ఉండేదంటే న్యాయస్థానంలో ఉన్న వారందరు, నౌకర్లు, కింద అంతస్తులో ఉన్నవారు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది. వారు మొదటగా వారి చేతివేళ్ళను వాడేవారు, చివరికి చెవిలో దూది పెట్టుకొని పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఎవరికి కూడా రాణి పేరు తెలియదు. ఎందుకంటే ఆమెను అందరూ హర్ మెర్రీ మెజస్టీ అంటే దొరసానిగా పిలిచేవారు. చాన్సలర్ రాజ్యం అప్పులపాలు అవుతుందని ఆమెకు తెలియగానే గిలిగింతలు పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీది నుండి జారిపడి కాలు విరగ్గొట్టుకుంది. భూకంపం వచ్చినపుడు బంగ్లా మొత్తం ధ్వంసం అయ్యింది. అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేవరకు నవ్వింది. పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేతి సైగతో వాళ్ళను రానివ్వలేదు. నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్లల్లో నీళ్లు ముఖంపైకి కారే వరకు నవ్వింది. కానీ నవ్వు జీవితంలో మంచి అలవాటు. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఆమెకు ఇష్టం కానిది, ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవటంతో ఆమె చాన్సలర్ ను చంపేసింది. ఇది ఎంత హాస్యమో…. ఈ సారి ఆమె నవ్వు ఆపుకోలేక నవ్వీ నవ్వీ శ్వాస ఆడక చనిపోయింది. చివరికి దర్బారులోని వారు దేశీయులు కొంత శాంతి, నిశ్శబ్దము, సంతోషంగా అనుభవించగలిగారు. అతి సర్వత్రా వర్జయేత్.
బాలసాహిత్యం
ఒక వెచ్చని గూటినుండి ఐదు పక్షి పిల్లలు పొదిగిన గుడ్ల నుండి బయటికి వచ్చాయి. వాటి తల్లిదండ్రులు అవి ఎదిగేందుకు వాటికి పగలు రాత్రి ఆహారం తెచ్చి తినిపించేవి. కొద్ది రోజుల్లోనే అవి ఎంత ఎదిగాయంటే, ఆ గూడు వాటికి ఇరుగ్గా అయ్యింది. వాటి రెక్కలు బలపడగానే ఎలా ఎగరాలో తల్లి చెప్పింది. మీ తండ్రి, నేను మీ ఐదుగురికి ఆహారం అందించేందుకు బాగా తొందరపడేవాళ్ళం. ఇక మీద మీరు మీ కొరకు ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోవాలి. అందువల్ల ఒకరోజు తల్లి ఆ ఐదు పిల్లలు ఎగిరేందుకు రెడీ స్టడీ గో అంది. కానీ కేవలం వాటిలోని నాలుగు పిల్లలే చెట్ల కింది కొమ్మలపైన వాలాయి. తర్వాత అవి మళ్లీ గూటికి చేరాయి. మళ్ళీ అవి కిందికి వాలాయి, పైకి ఎగిరాయి. ఆ రకంగా అవి కిందికి మీదికి ఎగురసాగాయి సంతోషంగా. కానీ అన్నిటికన్న చిన్నపక్షి తన కండ్లు మూసుకుని భయంకరంగా ఉన్న కిందికి చూడకుండా ఒదిగి గూటిలోనే కూర్చుంటూ ఉండేది.
ఆ రకంగా రోజులు గడుస్తున్నాయి. ఆ చిన్న పక్షి యొక్క అన్నలు, అక్కలు వాటి ఆహారం అవే సంపాదించుకోగలిగాయి. కానీ ఆ చిన్నది మాత్రం కిందకి చూసేందుకే భయపడుతూ గూటిలోనే ముడుచుకొని కూర్చొని ఉండేది. అప్పుడు తండ్రి పక్షికి ఒక ఆలోచన వచ్చింది. పిల్ల పక్షికి కింద కొమ్మపై వాలే భయంకన్న ఇంకా ఎక్కువ భయం కలిగే దృశ్యం చూపించడం మంచిదనుకుంది. అప్పుడు క్రింద చెట్టు వెంబడి ఒక పిల్లి నడుచుకుంటూ వెళ్తుంది. చాలాకాలం వరకు పిల్ల పక్షికి ఆహారం బాగా తినిపించడం వల్ల లావుగా తయారయ్యింది. ఒకరోజు దాన్ని పిల్లి తినేయడం ఏమంత విచిత్రం కాదనుకుంది. తెలివి తక్కువ పిల్ల పక్షి తనను తినేందుకు తను గూటిలో పిల్లి కోసం ఎదురు చూస్తున్నట్లున్నది. కానీ ఆ కింద పోయే పిల్లి దీన్ని చూడలేదు. దాని పదునైన కోరలు, పొడవాటి కాలిగోర్లు, భయం గొలిపే పసుపు పచ్చని కంటిగుడ్లు చూసి భయపడి పిల్లపక్షి గూటి అంచునుండి కిందికి జారింది. కానీ దానికి ఏం జరిగిందో తెలియకముందే, అది దాని ప్రాణాలను కాపాడుకోవడమే కాక కింది చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ కొమ్మపై నుండి ఇంకో పై కొమ్మ మీద వాలింది. ఇలా మూడు నాల్గు సార్లు ఎగురుతూ సంబరపడింది. ఇది గూటిలోనే భయపడి కూర్చునేదానికన్న వెయ్యి రెట్లు మంచిదనుకుంది. ఇన్నాళ్ళు బుద్ధితక్కువగా గూటిలో కూర్చోవడమే, అన్నలు, అక్కల వలె తెలివిగా ఎగరకపోవడం చాలా తప్పు. ప్రయత్నమే ఫలితానికి మూలం.
ఒక ముదుసలి వాసిల్ తను సముద్రములో ఒక మూలకు వేసిన వలలో ఏవైనా చేపలు పడ్డాయో చూద్దామని వెళ్లి చూసాడు. ఆ వలను బయటికి తీసి చూసేసరికి దాంట్లో ఒక బంగారు చేప కనిపించింది. దాన్ని బయటికి తీయబోయేవరకు ‘నన్ను నీళ్ళలోనే వదిలిపెట్టు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా’నంది. నాకు ఏమి కావాలో తెలియదు. నా భార్యను అడిగి చెప్పగలను అని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన సంగతి చెప్పాడు. భార్య నాల్గు చీవాట్లు బెట్టి వెంటనే వెళ్ళి తనకు మంచి దుస్తులు కావాలని అడుగు. నాకు కేవలం ఈ చిరిగి పోయిన పాత జాకెట్ ఒకటే వుంది.
అతను వెళ్ళి కొత్త బట్టలు తేగానే తనకు బంగారు బండి కావాలని చెప్పి వెంటనే చేప వద్దకు పంపించింది భర్తను. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అటువంటి దాంట్లో కూర్చోలేదు. ఆ ముదుసలి వాసిల్ వెంటనే వెళ్ళి బంగారు బండి తెచ్ౘ్ాడు. కానీ ఆ ముసలమ్మకు అది కూడా తృప్తి కాలేదు.
ఇప్పుడు ఆమె కోరిక సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా, చుట్టూ మంచి మంచి చెట్లు, తోటలు మరియు గుంపెడు నౌకర్లు కావాలని కోరింది. కానీ అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు. చివర్లో ఆమెకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆమె ఆ బంగారు చేప వచ్చి తనకు సేవలు చేయాలని తలచింది. ఈ విషయం తెలియగానే ఆ చేపకు కోపం వచ్చింది. వెంటనే ఇచ్చినవన్నీ గుంజుకున్నది. అప్పుడు ఆ ముసలమ్మ తన గుడిసె ముందు చిరిగిన బట్టలతోనే వల అల్లుకుంటూ నిలబడింది. తెలిసిందా ఇప్పుడు? ఒకవేళ నువ్వు అతి ఆశకు పోతే నీవు ఏమీ లేకుండా అయితావు.
అతి ఆశ కొంపకు చేటు.
Long long ago cheetahs and lizards were friends. One day a cheetah was talking to his friend lizard about a magical rocket ship and do you know who heard this? Tiger Of course!The big creature. Who is very rude and mean. When cheetah saw Tiger she stopped talking. But lizard kept on talking. The next day, when the astronauts went to the rocket ship, tiger was going to launch it. So the astronauts put a plan they were going to capture the tiger and put him in the zoo. So they called the cheetah, lizard, Lion, and the zookeepers. First the lion scared the tiger out of their rocket ship, then the cheetah chased the tiger towards the lizard. Who distracted him, while the zookeepers got
him. Now all the animals can be safe.
the end
కష్టపడితేనే ఫలితం
నరసింహపురం లో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించేవాడు . అతనికి రవి అనే ఒక కొడుకు ఉండేవాడు. అతన్ని చదివించి గొప్ప వానిగా చేయాలని శరభయ్య ఆశ.
రవి మొదట చదువు మీద ఆసక్తి చూపినా అటు తర్వాత మిత్రులవల్ల అతనికి చదువు మీద ఆసక్తి సన్నగిల్లింది. అతడు పదవ తరగతి పూర్తి చేసిన పిదప అతనిని శరభయ్య డబ్బు కట్టి ఒక పేరు మోసిన కళాశాలలో చేర్పించాడు . కానీ రవి చదువు మీద శ్రద్ధ చూపకుండా ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకోసాగాడు. శరభయ్య కు ఆ కళాశాల వారు రవి చదవడం లేదని మార్కులు చాలా తక్కువగా వస్తున్నాయని కబురు అందించారు. ఈ విషయం విని శరభయ్య చాలా బాధపడ్డాడు .
ఒకసారి దసరా సెలవులకు రవి ఇంటికి వచ్చాడు. శరభయ్య తన వెంట రవిని వ్యవసాయ పనికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతన్ని తనతో పాటు పని చేయమన్నాడు . కానీ రవికి ఆ పని ఎంత కష్టమో తెలిసి వచ్చింది. అయినా తండ్రి మాట కాదనలేక అతడు చెప్పిన పనల్లా చేసాడు.
అలా వారం రోజులు గడిచాయి . రవికి ఈ వ్యవసాయం కన్నా తాను చదువుకోవడమే ఉత్తమంగా అనిపించింది. చదువు మీద తనకు కూడా ఆసక్తి ఉంది. కానీ అనవసరంగా తాను ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకొని చదువును నిర్లక్ష్యం చేస్తున్నానని అతనికి అనిపించింది. తండ్రి కష్టం చూసిన తర్వాత తన పద్దతిని మార్చుకోవాలని రవి భావించాడు.
శరభయ్య కుమారునిలో వచ్చిన మార్పును గమనించాడు. అతడు రవితో “ఒరేయ్ ! మేము అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాం . పంట ఒకసారి వస్తున్నది. మరోసారి రావడం లేదు. చివరికి ఎప్పుడైనా దేవుడు ఆదుకోకపోతాడా అని వ్యవసాయం వృత్తిగా భావించి జీవిస్తున్నాం . నలుగురికి కడుపు నింపుతున్నామన్న సంతృప్తి మాలో ఉంది. నీవు మందమతివి కూడా కావు. మరి నీకు వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగితే అదే చెయ్యి. అదేం తక్కువ కాదు. రేపు భార్యాపిల్లలను పోషించాలంటే నీవు ఏదో ఒక పని చేయాలి కదా !”అని అన్నాడు.
అది విన్న రవి ” నాన్నా! నాకు వ్యవసాయం చేయడం కన్నా చదవడమే ఉత్తమంగా అనిపిస్తున్నది . కష్టపడనిది ఏదీ సాధించలేమని నాకు అర్థమైంది . అందుకే రేపటినుండి కష్టపడి చదివి ఈ వ్యవసాయంలో పరిశోధనలు చేసి కొత్త కొత్త పద్ధతులు కనిపెడతాను” అని అన్నాడు. ఆ మాటలకు తండ్రి ఎంతో సంతోషించాడు.
ఆ తర్వాత కళాశాలకు వెళ్లిన రవి బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తర్వాత అతను వ్యవసాయ శాస్త్రాన్ని చదివి కొత్త కొత్త పద్ధతులు వ్యవసాయంలో తెలుసుకొని రైతులకు దిగుబడి ఎక్కువ వచ్చే మార్గాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రితో పాటు ఇతర రైతులకు వ్యవసాయం లోని కొత్త కొత్త పద్దతులను తెలిపాడు. చదువు అంటే ఆసక్తి లేని తన మిత్రులకు రవి వ్యవసాయం చేయమని ప్రోత్సహించాడు. తన కొడుకు ప్రయోజకుడు అయినందుకు ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత కొన్ని రోజులలోనే అతను ఒక మంచి కొలువును కూడా సంపాదించాడు. అందుకే పిల్లలూ! ఎందులో నైనా కష్టపడనిదే ఫలితం రాదని గ్రహించాలి.
“సహిత్యస్య భావ:” అంటే అర్థవంతమైన జ్ఞానముతో హితము చేకూర్చేది సాహిత్యం. సృజనాత్మక జ్ఞానాన్ని, భవిష్యత్ తరాలకు అందజేసే సాధనము సాహత్యం. సాహిత్యం వయసును బట్టి పలురకాలుగా బాల, వయోజన, ఫ్రౌడ, వృద్ధ సాహిత్యం ఉంది. పదిహేను సంవత్సరముల లోపు పిల్లల కోసం బాలసాహిత్యం నైతిక విలువలు, మానసిక వికాసము, భాషాభివృద్ధితో వారి స్థాయికి తగినట్లుగా ఉంటుంది.
బాల సాహిత్యం ప్రత్యేకంగా ఎందుకు?
పెద్దల సాహిత్యం కన్నా బాల సాహిత్యం ఎన్నో రెట్లు ముఖ్యం. పిల్లల అవగాహన, ఆలోచన, భాష, పెద్దల అవగాహన, ఆలోచన, భాష వేరుగా ఉంటాయి. పిల్లల మెదడు వికసించే దశలో విలువలు, భాష, సాధించాýన్న తపన ఒకసారి ముద్ర పడితే జీవితాంతం ఉంటుంది.
ఉత్తమ సాహిత్యం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ మార్చే శక్తి బాల సాహిత్యానికి ఉంది. ప్రశ్నించడం సాహిత్యం ద్వారా అలవడుతుంది.
మనం ఇల్లు కట్టేటప్పుడు పునాదిపై ఎంత శ్రద్ధ పెడతామో బాల సాహిత్యంపై అంతే శ్రద్ధ పెట్టాలి. పిల్లల కోసం రాయడం అంటే భవిష్యత్తు కోసం రాయటమే.
బాల సాహిత్య ముఖ్య లక్షణాలు
బాల సాహత్యం పిల్లల వయసుకు తగినట్లు ఉండాలి. మరీ చిన్న పిల్లలకు అమ్మ పాడే జోలపాట నుండి బొమ్మలతో కూడిన పదాలు, శబ్దాలు, ఒకటి రెండు వాక్యాలు ఉండాలి –
ఆరు నుండి పది సంవత్సరాల పిల్లలకు తమాషాగా, సాహసంగా, స్నేహితులతో కూడిన బాల సాహిత్యం ఉండాలి.
పది నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకు సమస్యలు పరిష్కారం ఉంటే ఇష్టపడతారు. ఇవి ఏ ప్రక్రియలోనైనా ఈ లక్షణాలతో ఉండాలి.
చిన్న పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా వారికి అర్ధమయ్యే భాషలో రాసిన రచనలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించడం, సంస్కృతిని నేర్పడం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉండాలి.
కథలు, గేయాలు, నీతి కథలు, పిట్ట కథలు, పద్యాలు, చిన్నచిన్న వాటికలు, నవలలు బాల సాహత్యంలో భాగమే.
పిల్లల మానసిక స్థాయి, వయసుకు తగినట్లుగా కథలు, గేయాలు, పద్యాలు మొదలగు వాటిలో సరళత, వాక్యాలు చిన్నవిగా, కుతూహలం, ఊహాశక్తి పెంచే విధంగా, ఆనందంగా, భయపడకుండా, దృశ్యాత్మకంగా, పెద్ద అక్షరాలతో స్ఫూర్తిదాయకంగా, కల్పనాశక్తిని పెంపొందించేవిధంగా, నీతివంతంగా ఉన్నప్పుడే వారిలో నైతిక విలువలు, భాషా నైపుణ్యాలు పెంపొందుతాయి.
బాల సాహిత్యము ఎప్పుడు ప్రారంభమైంది?
బాల సాహత్యం కొత్తగా ప్రారంభమైనది ఏమీ కాదు. 17వ శతాబ్దంలో మొట్టమొదటి బాలల పుస్తకం లాటిన్ భాషలో వచ్చింది.
తెలుగులో బాల సాహత్యం మౌఖికంగా వేల సంవత్సరాల నుండే అమ్మమ్మ కథలు, జానపద గేయాలు, పంచతంత్ర కథలు చెప్పేవారు. అవి రాతలలో లేవు.
ప్రత్యేకముగా బాల సాహిత్యము అని లేకపోయినప్పటికీ బసవ పురాణములో బాల్యము వర్ణనను బాల సాహిత్యముగా చెప్పవచ్చును. నాచన సోమనాధుడు, శ్రీనాధుడు తమ రచనలలో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు.
సుమతీ, వేమన శతకాలలో కూడా బాల్యపు ఛాయలు కనిపిస్తాయి. మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలలో బాల సాహిత్యం కనిపిస్తుంది.
19వ శతాబ్దం నుండి తెలుగులో పిల్లల కోసం నీతి కథలు, వర్ణమాల, బాలశిక్ష లాంటివి ముద్రించారు.
ఆధునిక బాలసాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు ఈ కోవకు చెందినవే. బాల సాహత్య పురోగతి ప్రారంభమైంది. బాల సాహిత్యంలో ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నాయి. గేయ, పద్య, గద్య, కథల, నాటికల, నవలల రూపంలో బాల సాహత్యం కనిపిస్తుంది.
చిన్నయసూరి నీతిచంద్రికలో కథలుగా, కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం, పార్వతీశ కవులు బాల సాహిత్యాన్ని రచించారు. ఆధునిక కాలంలో మర్యాద రామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు మొదలగు కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
అన్నమయ్య రచించిన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’, ‘చందమామ రావే’ వంటి లాలి పాటలు ఇప్పటికీ పిల్లలను ఆనంద పారవశ్యంలో ముంచుతూనే ఉన్నాయి.
పెద్దల కోసం పరుగెత్తిన కలం పిల్లలకూ జోల పాట పాడింది. ఆ కలం, గళం తెలంగాణ బాలగేయాల చక్రవర్తి దాశరధి కృష్ణమాచార్య గారిది. తెలంగాణా మాండలికంలో పాపాయి పాటలు తేలికైన పదాలతో, లయతో ఊయల పాటలుగా మారాయి.
దాశరథి గేయాలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
వర్తమానంలో బాలసాహత్యం
19వ శతాబ్దం నుంచి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న బాలసాహత్యం మరిన్ని ప్రక్రియలతో ముందుకు వచ్చింది. ఒకప్పుడు ఒకప్పుడు ‘అనగనగా…’ అంటూ కథలు వచ్చేవి. పంచతంత్ర కథలు, నీతి కథలు ఉండేవి. ప్రస్తుతం స్కూలు, స్నేహాలు, పర్యావరణం, గ్రహాలు, మొబైల్ గురించిన కథలు వస్తున్నాయి. వాడుక భాషలో తేలికగా పిల్లలకు అర్ధమయ్యే విధంగా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా, నవ్వించే విధంగా ఉంటున్నాయి.
ప్రపంచమే కుగ్రామంగా మారటంతో సాహిత్యం బాగుంటే క్షణాల్లో వైరల్ అవుతుంది. అనువాద సాహిత్యం విస్తరిస్తోంది. ఏఐ ద్వారా సాహిత్యం అందుతోంది. బాల సాహిత్యం మరింత పెరిగింది. కానీ ఫోనుకు అప్డేట్ అయ్యింది.
బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతం నుండి, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచార్య, బోయ జంగయ్య, వాసాల నరసయ్య వంటి ప్రముఖుల వరకూ పిల్లలకోసం ఎన్నో నీతిదాయకమైన కథలు, గేయాలు అందించారు. పిల్లలు వాటిని ఇప్పటికీ ఇష్టపడుతున్నారు.
బాల సాహితీవేత్తలు
నాటి నుండి నేటివరకు ఎందరో బాల సాహితీవేత్తలు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలలోను పిల్లలకోసం తెలుగులో రాశారు. రాస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రేఖామాత్రంగా కొందరు తెలంగాణ బాల సాహితీవేత్తల గురించి తెలుసుకుందాం.
ఉభయ తెలుగు రాష్ట్రాల బాల సాహితీవేత్తల దిక్సూచి, తెలంగాణ సారస్వత పరిషత్లో బాల సాహిత్యం కోసం ప్రధాన పాత్ర పోషిస్తున్న కవి, నిగర్వి, నిరాడంబరుడు గరిపల్లి అశోక్ గారు. చదువుతున్న కాలం నుండే సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తెచ్చి, తదుపరి కాలంలో బాల సాహిత్యంపై ఎన్నో పుస్తకాలు రాయటమే కాదు, విద్యార్థులతో రాయించారు. ‘కీర్తి’ పురస్కారంతో సహా ఎన్నో అవార్డులు పొందారు. బాల సాహిత్యం కోసం ఎన్నో కార్యశాలల నిర్వహించారు. వీరి కథలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. వీరి సేవలను గుర్తించి తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులుగా నియమించారు.
సంగనభట్ల చిన్న కృష్ణయ్య, పుప్పాల కృష్ణమూర్తి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వడ్డేపల్లి వెంకటేష్, డాక్టర్ అమరవాది నీరజ, ముక్కామల జనకీరామ్, ఉండ్రాళ్ళ రాజేశం, బైతి దుర్గయ్య, బూర్ల నటేశ్వరరావు, డాక్టర్ వి.ఆర్. శర్మ, డాక్టర్ సమ్మెట విజయ, సమ్మెట ఉమాదేవి, సిద్ధాంతం ప్రభాకరాచార్యులు, కన్నెగంటి వెంకటయ్య, యడవల్లి శైలజ, వురిమళ్ల సునంద, ఎస్కె షఫీ, పోతగాని సత్యనారాయణ, డాక్టర్ సిరి, కందుకూరి భాస్కర్, దేశముఖ్ ప్రవీణ్ శర్మ, డాక్టర్ కాసర్ల స్వర్ణ మమత, అమ్మిన శ్రీనివాస రాజు, మీసాల సుధాకర్, డాక్టర్ యు. పద్మ, కొమ్మవరపు కృష్ణయ్య, డాక్టర్ సాగర్ల సత్తయ్య, అంజన్రెడ్డి, కాల్వ రాజయ్య, నిర్మల, ఈ వ్యాస రచయిత్రి బండి ఉష వీరంతా పిల్లల కోసం సాహిత్యాన్ని అద్భుతంగా సృజిస్తున్నవారే. కొందరు పిల్లలను కాదుకాదు దాదాపుగా పిల్లలను ప్రోత్సహిస్తూ అనేక సంకలనాలు తీసుకొచ్చినవారే.
తెలంగాణలో ఇంకా ఎందరో బాల సాహితీవేత్తలు ఉన్నారు, ముందు ముందు నా విస్తృత వ్యాసంలో బాల సాహితీ వేత్తలు ఎక్కడ ఉన్నా అందరి గురించి రాసే ప్రయత్నం చేస్తాను. చివరగా డాక్టర్ పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత. బాలల తాతా బాపూజీ గేయ కథకు ఈ అవార్డు పొందారు.
ఆయన పిల్లల కోసం అనేక పుస్తకాలు రాశారు. ఇతర భాషల కథలను, పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగంలో సంపాదకులుగా పనిచేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆయన చేసిన అనువాద పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అవిష్కరించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ భారత ప్రభుత్వంలో దక్షిణ భారత ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
వాసాల నరసయ్యగారు, డాక్టర్ భూపాల్ గారు, డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు తెలంగాణ బాల సాహితీవేత్తలు. వీరు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు అందుకున్నారు.
పైడిమర్రి రామకృష్ణ, ముక్కామల జానకీరామ్, వాసరవేణి పర్శరాములు, భీంపలి శ్రీకాంత, సబ్బని సుమిత్రా దేవి ఇలా బాలసాహిత్యంలో ఎందరో ఆరితేలినవారు ఉన్నారు.
రాబోయే నా విస్తృత వ్యాసంలో అందరినీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
బాల సాహిత్యంలో పత్రికలు
మొదటి బాలల పత్రిక 1923లో న్యాయపతి రాఘవరావు ప్రారంభించారు. 1947లో చందమామ వచ్చింది. తరువాత కాలంలో విస్తరించి బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నారి, బాలబాట వంటి పుస్తకాలతోపాటు వేదకుమార్ గారి బాల చెలిమి, వేదాంతం సూరి గారి మొలక, వివిధ పత్రికలలో, పేపర్లలో చిన్నారి సాహిత్యానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు.
దాశరథి, సినారె గారు బాలల కోసం రాసిన గేయాలు ఇప్పటికీ నవనవోన్మేషంగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ‘కొమ్మా ఉయ్యాల” పాట ప్రతి ఒక్కరి హృదయంలో చోటు చేసుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
డిజిటల్ బూమ్ వచ్చింది. కథ చెప్పవా అమ్మమ్మ లాంటివి పిల్లలు చూస్తున్నారు. రేడియో, దూరదర్శన్లో బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
బాలసాహిత్యం కోసం వివిధ కార్యక్రమాలు – పురస్కారాలు
తెలంగాణ సాహిత్య అకాడెమీ 33 జిల్లాలలో 33 పుస్తకాలను ప్రచురించింది.
తెలంగాణ సారస్వత పరిషత్ 11 పుస్తకాలను, వేదకుమార్ గారు 48 పుస్తకాలను ప్రచురించారు.
2022 మార్చి 4న ఒకే సమయం, ఒకే అంశంపై ఐదు లక్షల మంది విద్యార్థులు రాశారు.
2026 సంవత్సరంలో విద్యార్థులు 36 పుస్తకాలను రాశారు.
పురస్కారాలు : బాల సాహిత్యాన్ని ప్రోత్సహించే దిశగా అనేక మంది పురస్కారాలను అందిస్తున్నారు. చింతోజు బ్రహ్మయ్య డాక్టరు అమరవాది నీరజ గారు సాహిత్య అకాడెమీ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి తండ్రి గారి పేరు మీదుగా పురస్కారం, వురిమళ్ల ఫౌండేషన్, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, తెలంగాణ సాహిత్య అకాడెమీ పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారాలు, డెందోట బాల సాహిత్య పీఠం వారి పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ ` తెలంగాణ శాఖ పురస్కారం అందిస్తున్నారు. సేవా దృక్పథంతో ఇంకా అనేక ప్రైవేట్, సాహిత్య సంస్థలు పురస్కారాలను అందజేస్తున్నాయి.
భవిష్యత్లో బాల సాహిత్యం
ఎఐ బాగా విస్తరిస్తోంది. ఛాట్ జిపిటి, జెమిని అడిగినవన్నీ ఇస్తోంది. పిల్లల్లో ఆలోచనా శక్తి తగ్గుతుంది. ప్రతి విద్యార్థి సాహిత్యాన్ని రాస్తాడు. కానీ స్వయంగా కాదు. టెక్నాలజీని ఉపయోగించి. ఆస్వాదించటం తగ్గిపోతుంది.
చందమామ నుండి చంద్రయాన్ వరకు వచ్చాము కానీ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. దీనికి కారణం ఆంగ్ల మాధ్యమంలో బోధన.
ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రణాళికల వద్దే ఆగిపోతుంది. విద్యార్థులలో మానసిక వికాసము కలగాలంటే కొంత వరకు మాతృ భాషలో బోధన జరగాలి. సాహిత్య సృజన పాఠ్యాంశంలో భాగము కావాలి. పోటీలు నిర్వహించి వాటి ఆధారంగా ఉన్నత చదువులలో ప్రత్యేక అవకాశం కల్పించాలి.
పిల్లలు పడుకొనే ముందు కథ వినేలా చేయాలి. పిల్లల అభిరుచుల మేరకు సాహిత్య సృజన జరగాలి. అప్పుడే భాష బతుకుతుంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. రచయితలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి. అప్పుడే బాల సాహత్యం శాఖోపశాఖలుగా మరింత విస్తరిస్తుంది.
Once upon a time there was a little girl and boy. They were both brother and sister. In summer, they would have a bike race. But the brother always would win. So, one time the sister went off to find the fastest vehicle on Earth. She saw a bus, it was fast.
So, she asked the bus, “Bus…Bus, are you the fastest vehicle on Earth?”
The bus said,”I am fast… but not the fastest. The car is faster than me”. So, the girl asked the car. She said, car… car… are you the fastest vehicle on Earth?”
The car said, “I am very fast faster than a bus. But the train is faster than me”.So, the girl marched over to the train. She asked “Train… Train are you the fastest vehicle on Earth?”
The train said, “I am the fastest land vehicle on Earth. But, the airplane is faster than me”.
So the girl put her jetpack on and flew to the airplane. She asked airplane , “Are you the fastest vehicle on Earth ?” .
The airplane says, “I’m close to the fastest. But, I think rocket is the fastest so the Earth. Girl flew to the rocket. She asked rocket , Rocket….Rocket .. are you the fastest vehicle on Earth?”
Rocket said, I’m the fastest vehicle on Earth”. The girl was so happy . She went back to her bike and put on rocket boosters and she raced that day. And she won and she figured out that fun is the key to winning !!
****The End****
గ్రహణం
కాకతీయు ప్రధాన గూఢచారి త్రినేత్రుడు ప్రతిభావంతుడే. కాని, తొందర ఎక్కువ. ఒక్కోసారి తన తొందరపాటుకు తాను ఇబ్బందుల్లో పడడమే కాక ఇతరులను కూడ ఇబ్బందుల్లో పడేస్తాడు. శత్రుదేశపు సామంతరాజు తన గూఢచారులను దట్టమైన అటవీ మార్గాల ద్వారా కాకతీయ సామ్రాజ్యంలోకి పంపుతున్నాడు. వారిలో కొందరు మాత్రమే అరకొర సమాచారంతో తిరిగి వస్తున్నారు. మరికొందరు పట్టుబడి బందీలవుతున్నారు. ఇక తక్కినవారు సుభిక్షంగా వున్న కాకతీయ సామ్రాజ్యం విడువలేక అక్కడే ఉండిపోతున్నారు. వీరిలో అవివాహితులు, కాయకష్టం చేసి బతికేవారు ఎక్కువ. ఇట్లాంటివారు అక్కడి అమ్మాయిలనే పెండ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు.
త్రినేత్రుడు శత్రు రాజు లాగా తాను కూడా దట్టమైన అటవీ మార్గం ద్వారా శత్రురాజ్యంలో ప్రవేశించి అక్కడి సైన్య రహస్యాలను తెలుసుకొని తమ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టు వెంటనే మహామంత్రి యుగంధరుణ్ణి కలిసి విషయం తెలిపి మారువేషంలో శత్రురాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరాడు. ఎప్పుడూ వందలకొద్ది రాజ్య సమస్యలతో సతమతమవుతూ క్షణం తీరిక లేని యుగంధరుడు
“సరే! హద్దు మీరి ప్రవర్తించకు. జాగ్రత్త” అన్నాడు.
త్రినేత్రునికి ‘సరే!’ అన్నమాట మాత్రమే వినిపించింది. ఆ తర్వాత వాక్యం వినిపించలేదు!
ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి నమ్మిన బంటు పింగళుణ్ణి పిలిపించి చర్చించాడు. ‘కోయల వేషంలో అటవీ మూలికలు, పలుకులు, జుంటి తేనె తీసుకొని అక్కడి ప్రవేశ ద్వారంలో ఉండే కాపలా సైనికులకు ఉచితంగా ఇచ్చేస్తే, సులభంగా నగర ప్రవేశం చేయవచ్చునని’, పింగళుడు అన్నాడు.
ఇద్దరూ సరంజామాతో శత్రురాజ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశ ద్వారం వద్ద తమ విలువైన దినుసులను కాపలా సైనికులకు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరువేరుగా – “మందులోయమ్మ మందులూ, అడవి దినుసులూ” అంటూ వీధుల్లో తిరుగసాగారు. అసలు కోయవాళ్ళు అమ్మే ధరకన్నా తక్కువకే అమ్ముతూ మొదటి నాలుగైదు దినాల్లో కొన్ని రాజ్య రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
రాజధానిలోని ప్రసిద్ధ వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ఇచ్చే సలహాలను అక్కడి – ప్రధాన గూఢచారి సకలాక్షుడు విని పాటిస్తుంటాడని తెలుసుకొని ఒకరోజు రాత్రి అర్చకుని ఇంటికివెళ్ళి పది బంగారు మాడలు దక్షిణగా సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి-
“ఏదో ఉడుతాభక్తి. దయచేసి స్వీకరించండి. వెంకటేశ్వరుడు కరుణిస్తే ఇంకా సమర్పించు కుంటా”నని చెప్పి నిష్క్రమించాడు.
ఎవడో సాటికులం వాడు కులం కట్టుతప్పి, అటవీ దినుసులు అమ్ముతున్నాడని, అసలు కోయలకు తెలిసింది. నిఘా వేసి త్రినేత్రుణ్ణి పట్టుకున్నారు. అతని మాట తీరే వారికి అనుమానాస్పదంగా ఉంది. అసలతడు కోయకాడని అక్కడున్న గస్తీ సైనికునికి అప్పగించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, అట్లాంటివారిని రహస్యంగా సమీప గూఢచారి అధికారికి అప్పగించాలని వారికి ఆదేశాలున్నాయి. పెద్దగా రచ్చ చేయకుండా ఆ సైనికుడు గూఢచారులకు అప్పగించాడు. చాటు నుండి ఇదంతా చూసిన పింగళుడు తన దగ్గర మిగిలిన సరుకులను ప్రవేశద్వారం దగ్గరున్న గస్తీ సైనికులకు పంచేసి, కాకతీయ రాజ్యం ప్రవేశించాడు. వెంటనే విషయాన్ని యుగంధరుని దృష్టికి తెచ్చాడు.
యుగంధరుడు వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నాడు. త్రినేత్రుని పోలికలు బాగా ఉన్న అతని కవల తమ్ముడు నేత్రపర్వుణ్ణి, అతని భార్యను ప్రధాన గూఢచారి నివాసంలోకి మార్చాడు. ఇప్పుడు నేత్రపర్వుడే ప్రధాన గూఢచారి వేషభాషల్లో రథం మీద చక్రవర్తి కొలువు కూటానికి పోయి వస్తున్నాడు. త్రినేత్రుని భార్యను వెంటనే అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. తాను మెరికల్లాంటి పదిమంది సైనికులను తీసుకొని మారువేషాలలో శత్రుదేశం చేరుకున్నాడు. అంచె వేగుల ద్వారా ఏరోజు వార్త ఆరోజు ప్రతాప రుద్ర చక్రవర్తికి తెలియజేస్తున్నాడు.
శత్రుదేశపు గూఢచారులు త్రినేత్రుణ్ణి రహస్య స్థావరంలో ఉంచి విచారణ సాగిస్తున్నారు. అతణ్ణి అదుపులోకి తీసుకున్న విషయం బయటకు పొక్కనీయలేదు. తనది గుంటూరని ఒకసారి, రాజమహేంద్రవరం అని ఒకసారి, ఒరిస్సా అని ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పుతూ వచ్చాడు. వేధింపులు ఎక్కువ అయ్యాయి. దాంతో తనది ఓరుగల్లు అని, కోయవాణ్ణేనని కాని చాలాకాలంగా తెలుగువాళ్ళ మధ్య ఉంటుండటం వల్ల కోయభాష మరిచిపోయానని చెప్పాడు. ఆ విచారణకు సంబంధించిన పరిణామాలన్నీ పింగళుని ద్వారా యుగంధరునికి, యుగంధరుని ద్వారా చక్రవర్తి ప్రతాపునికి తెలుస్తున్నాయి.
ఒకరోజు శత్రు రాజ్య ప్రధాన గూఢచారి సకలాక్షుడు స్వయంగా వచ్చి విచారణ చేపట్టాడు.
“నీకు కాకతీయుల ప్రధాన గూఢచారి తెలుసా?” అని అడిగాడు.
“త్రినేత్రుడు గారు తెలియకేం. ఆయనకు పుట్టతేనె చాలా ఇష్టం. వారికి సరిపడా తేనెను నేనే సరఫరా చేస్తుంటాను” అన్నాడు.
“మరి వారి భార్య సంగతి?”
“ఆమెకు వజ్రాలు పొదిగిన ఆభరణాలంటే యెక్కడ లేని మోజు” అన్నాడు.
ఈ సమాధానాలు నిజమేనని తమ వేగుల ద్వారా రూఢి చేసుకున్నాడు.
కోయవాడి విషయంలో ఏం చెయ్యాలో చెప్పగలిగే సూక్ష్మ బుద్ధి ఉన్నవాడెవడూ అక్కడ లేడు తమ శత్రుదేశంలో ఉంటున్నానని ఒప్పుకున్నాడు కనుక ఉరితీయటమే మంచిదని న్యాయకోవిదులు తెలియజేశారు. రాజూ, మంత్రీ అదే అభిప్రాయానికి వచ్చి సకలాక్షునికే ఉరి బాధ్యతను అప్పగించారు.
వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు తమ తమ్ముడు లక్ష్మీనరసింహా చార్యులను వెంటబెట్టుకొని ప్రధాన గూఢచారి ఇంటికి వచ్చాడు. తనకు పాదాభివందనం చేయగానే మంత్రసహితంగా ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశాడు. ఆ తర్వాత తన సమస్య మనవి చేసుకున్నాడు.
“అయ్యా! మా అమ్మాయికి అనారోగ్యం చేసింది. నన్ను కలువరిస్తున్నదని ఇదిగో ఈ తమ్ముడు వార్త తెచ్చాడు” అంటూ పెద్దపిలక, జంధ్యం, మడి వస్త్రధారణ, నామాలతో తేజోమూర్తిగా కనిపిస్తున్న నడీడువాణ్ణి పరిచయం చేశాడు.
“అయ్యా వీడు మా తమ్ముడు లక్ష్మీనరసింహాచార్యులు. పెద్ద ఘనాపాటి. మా గోదావరి ప్రాంతంలో ఈయన పెట్టిన ముహూర్తానికే కార్యాలు జరుగుతుంటాయి. నేను నెలరోజులు సెలవు మీద వెళ్ళిపోతాను. నా స్థానంలో నా తమ్ముడు ప్రధానార్చకుడిగా ఉంటాడు. అనుమతించండి” అన్నాడు.
“సరే. ఇది చిన్న విషయం మీరు రేపే వెళ్ళిపోవచ్చు. అయితే మాకో సలహా కావాలి. మేం ఒక నేరస్తుణ్ణి ఉరి తీయాలి. ఆ పనికి ఏది అనుకూలమైన రోజో చెప్పండి” అడిగాడు ప్రధాన గూఢచారి.
అప్పుడు ఇద్దరూ వేళ్ళమీద లెక్కించుకొని, ఒక నిర్ణయానికి వచ్చారు.
“నాల్గురోజుల తర్వాత వచ్చే శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం మధ్యాహ్నం రెండుగంటలకు నరకలోక ద్వారాలు పూర్తి తెరచి వుంటాయి. ఆ సమయంలో ఉరి తీస్తే నేరస్తునికి నరకం. వాడి రాజుకు అరిష్టం ప్రాప్తిస్తాయి” అన్నాడు రామానుజాచార్యులు. దాన్ని కమ్మ మీద రాసిచ్చాడు. ప్రధాన గూఢచారి అంగీకరించాడు. వాళ్ళు సెలవు తీసుకొని వచ్చేశారు.
ఉరితీతకు అన్ని ఏర్పాట్లు రహస్యంగా జరిగాయి. త్రినేత్రుణ్ణి చివరి కోరిక ఏమిటో అడిగారు. అతడు –
“వెంకటేశ్వర స్వామి దైవ ప్రసాదాన్ని తన ఉరికి ముందు అక్కడున్న వాళ్ళంతా స్వీకరించి ఆరగిస్తే, చూసి సంతృప్తితో ఉరికి వేలాడుతా. దైవ కృపతో నాకు నరకం తప్పవచ్చు. ఇదే నా చివరి కోరిక” అన్నాడు. ప్రసాదం విషయమై వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకునికి ఆదేశాలు వెళ్ళాయి.
శనివారం రోజు సంపూర్ణ సూర్యగ్రహణానికి పావుగంట ముందే త్రినేత్రుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి నలుగురు బలిష్ఠులైన సైనికులు విచ్చుకత్తులు ధరించి ఉరితీసే వేదికపైకి తీసుకు వచ్చారు. త్రినేత్రుణ్ణి తలారికి అప్పగించి కిందికి వచ్చి క్రమశిక్షణతో నిలబడ్డారు.
తలారి ఉరితాడును పరీక్షించి చూసుకొని సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వెంకటేశ్వరాలయం ప్రస్తుత ప్రధాన అర్చకుడు లక్ష్మీనరసింహాచార్యులు మరో పూజారితో పాటు ప్రసాదం తీసుకువచ్చి కింద తమ అశ్వాల పక్కన నిలబడి ఉన్న న్యాయమూర్తికి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధిపతికి, విచ్చుకత్తుల సైనికులకు మంత్రోక్తంగా ఇచ్చి –
“ఉరితీతకు సమయం లేదు ప్రసాదం వెంటనే ఆరగించండి” అన్నాడు వారంతా వెంటనే సభక్తికంగా ఆరగించారు. బలి వేదిక మీదికి వెళ్ళి తలారికి ఇచ్చాడు. అతడూ దాన్ని నోట్లో వేసుకొని త్రినేత్రుని వైపు తిరిగి –
“అయ్యా! మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. మనిద్దరి మధ్య పగ, ద్వేషం లేవు. మా మహారాజు గారి ఆజ్ఞ మేరకు మిమ్ములను ఉరి తీస్తున్నాను. దేవుడు క్షమించుగాక” అని అంటుండగా సంపూర్ణ సూర్యగ్రహణం మొదలయింది.
చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. చీకటయిందని భ్రమించి పక్షులు అరుస్తున్నాయి. ఆకాశంలో చుక్కలు కనిపించసాగాయి. వేదిక కింద ఉన్న నలుగురు సైనికులు, న్యాయమూర్తి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆ ప్రసాదం మత్తులో నేలకు ఒరిగిపోయారు. పైన తలారి కూడా ఆ మత్తుకు తట్టుకోలేక ఒరిగిపోయాడు. ప్రధాన అర్చకుని వేషంలో ఉన్న యుగంధరుడు అర్చక వేషం వదలేసి సైనికుని దుస్తులు వేసుకున్నాడు. రెండు నిమిషాలలో వారు అక్కడి వాళ్ల అశ్వాలు అధిరోహించి వాయు వేగంతో తమ రాజ్యం వైపు వాటిని పరుగులు తీయించారు. అదివరకే పింగళుని అటవీ దినుసులు ఆరగించి అక్కడి గస్తీ సైనికులు మత్తులో మునిగిపోయారు.
అరగంట దాటీ దాటగానే ఆ చీకటిలో వీళ్ళంతా శత్రు రాజ్య సరిహద్దులను దాటేశారు. అప్పటికి సంపూర్ణ సూర్యగ్రహణం వీడి పాక్షిక గ్రహణంగా మారింది. సన్నని కిరణాలు భూమిని తాకుతుండగా అందరి మత్తు క్రమంగా వదిలింది.
సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ, మత్తుమందును ప్రయోగించి ప్రతాప యుగంధరులు వేసిన ఎత్తును తెలుసుకొని శత్రు రాజ్యం రాజు, మంత్రి, ప్రధాన గూఢచారి సంభ్రమాశ్చర్యాల మత్తులో మునిగిపోయారు.
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కొలువుకూటం ఆనందోత్సాహాలతో కోలాహలంగా ఉంది. చక్రవర్తి, మంత్రి ప్రముఖులు ఉరిశిక్షను తప్పించుకొని ప్రాణాలతో తిరిగి వచ్చిన త్రినేత్రుణ్ణి అక్కున చేర్చుకొని అభినందిస్తున్నారు.
ఆ రణగొణ ధ్వనులను చీల్చుతూ-
“ఇంతకూ బంగారుమాడ ఎవరికి బహుకరించాలి” అని అడిగాడు మేఘ గంభీర స్వరంతో చక్రవర్తి, ఆ మాడను ప్రదర్శిస్తూ.
“దాన్ని లక్ష్మీనరసింహాచార్యుల వేషధారి మన మహామంత్రి యుగంధరుల వారికివ్వటం న్యాయం” అన్నాడు త్రినేత్రుడు.
“ఆ అవతారం శత్రురాజ్యంలోనే సమాప్తమయింది. కనుక మనకు పూర్తిగా సహకరించిన వారి అన్నగారు రామానుజాచార్యుల వారికి బహూకరిస్తే బాగుంటుందని నా విన్నపం” అన్నాడు యుగంధరుడు.
“మరి వారు గోదావరి తీరానికి వెళ్ళిపోయారు గదా!” అన్నాడు ఒక సామంతరాజు.
“ఆ గోదావరి తీరం ఇక్కడ కూడా ఉంది. వారిని ప్రవేశ పెట్టండి” అని ఆదేశించాడు ప్రతాప రుద్ర చక్రవర్తి.
సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న రామానుజాచార్యులు వెంకటేశ్వర స్తోత్రం చదువుకుంటూ ప్రవేశించి బంగారు మాడను స్వీకరించి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని చక్రవర్తికి అందజేశాడు. దాన్ని స్వీకరించి –
“ఈ ప్రసాదం ఆ ప్రసాదం కాదు గదా!” అన్న చక్రవర్తి ఛలోక్తితో కొలువుకూటంలో నవ్వులు విరబూశాయి.
అయితే, అక్కడ శత్రు రాజ్యంలో ఇంకా గ్రహణం వీడలేదు.
(కల్పితం)
పిల్లల పొరపాట్లు
నరసింహపురం అనే గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు బాలురు ఉండేవారు. వారిద్దరూ మంచి మిత్రులు. వారు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు.
ఒకసారి వారిద్దరికి పొరుగూరుకు వెళ్లవలసిన అవసరం కలిగింది. వెంటనే వారు ఇంటిలో చెప్పకుండా కాలినడకన అక్కడికి ప్రయాణం ప్రారంభించారు. వారు ఎన్నడూ ఆ దారిలో అంత దూరం నడిచి ఎరుగరు . వారికి చాలా ఆకలి అయింది . దారిలో వారికి దోసకాయలు కనిపించాయి. వారు ఆకలితో ఆ రెండు దోసకాయలు తెంపుకొని తిని తిరిగి బయలుదేరారు. మరికొద్ది దూరం వెళ్లేసరికి వారికి మళ్ళీ ఆకలైంది . వెంటనే వారు దారిలో కనిపించిన మొక్కలకు ఉన్న టమాటాలను తీసుకొని తిన్నారు . ఆ తర్వాత వారు తిరిగి ప్రయాణం సాగించారు.
ఇంకా కొంత దూరం వెళ్లేసరికి వారికి తిరిగి ఆకలి అయింది. ఒక గ్రామ సమీపంలో వారు మళ్ళీ ఒక తీగకున్న రెండు కాయలను చూసి వాటిని కోసుకొని తిన్నారు. ఆ తర్వాత వారు వాంతులు చేసుకున్నారు. వెంటనే ఒక బాటసారి వారిని చూసి ఆ గ్రామంలో గల వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళాడు . ఆ వైద్యుడు వారిని ఏమి తిన్నారని ప్రశ్నించాడు . వారు దోసకాయలు, టమాటాల పేర్లు చెప్పారు. తర్వాత వైద్యుడు వారిని ఇంకా ఏమి తిన్నారని ప్రశ్నించాడు. అప్పుడు వారు మూడవసారి తిన్న కాయల పేర్లు తమకు తెలియదని అన్నారు.
అప్పుడు వైద్యుడు వారిని మందలించి “ఓ పిల్లలూ! మీరు ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పకుండా రావడం మీ మొదటి తప్పు. మీరు ఎవరిని అడగకుండా దొంగతనంగా ఆ కాయలను తినడం మీ రెండవ తప్పు. ఆ కాయలు విషతుల్యమైనవి. సమయానికి మీ అదృష్టం కొద్దీ ఈ బాటసారి తీసుకొని రావడం వల్ల మీకు మంచి జరిగింది. అంతేకాకుండా సమయానికి నేను చికిత్స చేయడం వల్ల మీరు బ్రతికారు. మీరు ఎవరిని అడగకుండా ఆ విషపు కాయల మంచి చెడులు తెలుసుకోకుండా తినడం మీ మూడవ తప్పు. నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి. మీ మంచి కోరే నేను ఈ మాటలను అంటున్నాను. మరొకసారి ఇలా దొంగతనంగా ఆ విషపు కాయలను తెంపి తినకండి. అది మీకే నష్టం”అని మందలించాడు.
వారు సరేనని అప్పటినుండి తాము తినబోయే కాయల గురించి ఇతరులను అడిగి తెలుసుకుని అవి కోసుకొని తినడం ప్రారంభించారు. అందుకే పిల్లలూ! మనకు కనబడిన ప్రతి కాయను, పండును తినకూడదు. ఆ తెలియని కాయలను, పండ్ల గురించి ఇతరులను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు.
శ్లో. ఆచార్యాత్ పాదమాదత్తే
పాదం శిష్యః స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణ చ
జ్ఞానమనేది నాలుగో వంతు గురువు గారి ద్వారా,మరో నాలుగో వంతు విద్యార్థి తన సొంత మేధస్సు ద్వారా,మరో నాలుగోవంతు తోటి మిత్రుల ద్వారా మరో నాలుగో వంతు లోకపరిశీలన ద్వారా లభిస్తుంది.అందుకు విజ్ఞాన విహారయాత్రలు దోహదం చేస్తాయి.చారిత్రక, ఆధ్యాత్మిక, విజ్ఞాన ప్రదేశాలను ప్రత్యక్షంగా దర్శించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. పాఠశాల లో పుస్తకాలలో చదివిన విషయాలను ప్రత్యక్షంగా చూడడం అనుభవించడం ద్వారా అనేక విషయాలు బాగా అవగతమౌతాయి. ఆనాటి చారిత్రక,సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. అందులో భాగంగనే 8 వ తరగతి తెలుగు పాఠ్యాంశం సముద్ర ప్రయాణం లో భాగంగా మా విద్యార్థుల చేత వారి విజ్ఞాన విహారయాత్రలు,వ్యక్తిగతంగా వివిధ ప్రదేశాల సందర్శన విశేషాలను రాయించడం జరిగింది.ఈ విజ్ఞాన విహారయాత్రలు పిల్లల కు విజ్ఞానంతో పాటు వినోదాన్ని ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది.
వీటిని చదివి మా విద్యార్థులకు అభినందనలు ఆశీస్సులు,సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను
జి.లింగేశ్వర శర్మ
SA తెలుగు
జి.ప.ఉ.పాఠశాల రేగులపల్లి
చరవాణి.9603389441
సిద్దిపేట
నా ప్రయాణ అనుభవాలు
మేము అందరం రాత్రి పాఠశాలకు వచ్చాము. అంత లోపు టీచర్లు బస్సు తీసుకొని వచ్చారు. సామగ్రి సదిరి బస్సు ఎక్కించారు. అందరం పడుకున్నాము. మా బస్సు బయలు దేరింది. ఉదయం లేచేసరికి భద్రాచలం చేరుకున్నాము.భద్రాచలంలో ఆలయ మెట్లు ఎక్కి సీతారాముల దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత బస్సు ఎక్కి పాపికొండలకు వెళ్లి పడవ ఎక్కినాము పడవ ఎక్కిన తర్వాత పాటలు పెట్టారు.ఆటలు ఆడించారు. సరదాగా అల్లరి చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ప్రాచీన శివాలయం ఉంది.కాలువలో కాళ్లు కడుక్కొని శివాలయంలో శివుడిని దర్శనం చేసుకుని పడవ ఎక్కాం. పడవలో ఆహారం పెట్టారు. తర్వాత పడవ ప్రయాణం మొదలైంది పాపికొండలు వచ్చాయి. అందరికీ కొండలు చూపించారు. తిరిగి ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం ఒకరోజు పట్టింది. బస్సు ఎక్కి మేడారం వచ్చాము. మేడారంలో సమ్మక్క సారలమ్మ ల దర్శనం చేసుకొనేసరికి రాత్రి అయింది. మళ్ళీ బస్సులో రేగులపల్లికి బయలుదేరాము అర్ధరాత్రి పాఠశాలకు చేరుకున్నాం. మా సామగ్రినంత సర్దుకున్నాము.టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు.వారు వచ్చి మమ్మల్ని ఇండ్లకు తీసుకొని వెళ్లారు.
యం.రమేష్
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
గ్రా.రేగులపల్లి
మండలం బెజ్జంకి
మాభాగ్యనగర ప్రయాణ అనుభవాలు
మేము వేసవి సెలవుల్లో హైదరాబాద్ వెళ్ళాము ఆరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి అన్నం తిని రేగులపల్లి నుంచి బయలుదేరాము. బస్టాండ్లో నిలుచున్నాము. పక్కన దుకాణంలో చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాము. బస్సు రానే వచ్చింది. బస్సు ఎక్కినాము సీట్లు ఖాళీ లేవు.నిలుచున్నాము.బస్సులో ఎక్కువమంది సిద్దిపేటలో దిగేవాళ్లే. మాకు దేవుని దయవల్ల సిద్దిపేట లో సీట్లు దొరికినాయి. మధ్యాహ్నం మూడు గంటల 35 నిమిషాలకు హైదరాబాదులో దిగాము. ఇక్కడ ఆటో ఎక్కి మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ అన్నం తినుకుంటూ సినిమా చూశాము. అక్కడ పది రోజులు ఉన్నాము. దాని తర్వాత దమ్మాయిగూడ వెళ్లాం. అక్కడ మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ బజ్జీలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక మూడు రోజులు ఉన్నాము. తర్వాత చార్మినార్ వెళ్ళాం. అక్కడ మొత్తం తిరిగాను. అక్కడ నేను చెప్పులు కొనుక్కున్నాను. ఆ తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఐదు రోజులు ఉన్నాము. ఆ తర్వాత ఆదివారం రోజున మా ఇంటికి బయలుదేరా అక్కడ బస్సు ఎక్కిన బస్సులో మక్క కంకి అమ్మే వాళ్ళు వచ్చారు. కంకి కొనుక్కొని తినుకుంటూ ప్రయాణం అయ్యాము. సిద్దిపేటలో దిగినాము.అక్కడ మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆటో ఎక్కి మా ఇంటికి చేరుకున్నాం. బి ప్రకాష్
8వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగులపల్లి
మండలం. బెజ్జంకి
హామీపత్రం .ఈ కథనం మా విద్యార్థి స్వీయరచన
ప్రయాణ అనుభవాలు
ఉదయం 3 గంటల 30 నిమిషములకు మా మామయ్య కారులో వచ్చాడు. మేము తయారు అయ్యాం. తయారైన తర్వాత బట్టలు సర్దుకున్నాం. బట్టలు సదురుకొని కారులో ఎక్కి బయలుదేరాము. కరీంనగర్లో ఆగాము. అక్కడ మా కారులో వచ్చిన కొందరు . కరీంనగర్లో దిగినారు వాళ్ళు దిగిన తర్వాత మేము కారుకు సిఎన్జీ కోసం తిరిగాము అక్కడ ఒక పెట్రోలు బంకులో సిఎన్జి ఉంది కానీ అక్కడ పనిచేసే వారు ఇంకా లేవలేదు. ఇంకొక పెట్రోల్ బంకులో సిఎన్జి ఉంది అక్కడ కూడా పనిచేసేవారు ఇంకా లేవలేదు. ఇంకొక పెట్రోల్ బంక్ లో సీఎన్జీ ఉంది వాళ్ళు ఒక అర్ధగంట ఆగి రమ్మన్నారు అంతలోపు మేము చాయ్ తాగి పెట్రోల్ బంకుకు వెళ్ళాం వాళ్ళు లేవలేదు వాళ్లను లేపి సీఎన్జీ కొట్టించాం. తర్వాత అక్కడి నుండి బయలుదేరిన తర్వాత కరెక్టుగా గంటన్నరకు గోదావరిఖనికి చేరుకున్నాం. అక్కడి నుంచి శ్రీరాంపూర్ వెళ్లేసరికి అర్థగంట అయింది. అక్కడి నుంచి భీమారం చేరే వరకు ఉదయం 6:00 అయింది అక్కడ పాల ప్యాకెట్లు, టిఫిన్ కొనుక్కొని వెళ్ళాము అక్కడి నుండి మా డాడీ కారు నడిపాడు. అక్కడ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినంక బ్రెష్ వేసుకొని ముఖం కడుక్కొని చాయ్ తాగిన తర్వాత రోజు పోచమ్మకు కోడి కోసాము. కోడిని కోసి వండుకొని తిన్నాం. తర్వాత రోజు సంఘంల పైసలు కట్టి మళ్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా తాత బండి నడిపాడు. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం.మా మామ తోని వాళ్ళ ఇంటికి వెళ్లాను. తర్వాత రోజు మా తల్లిదండ్రులు వచ్చారు. ఇంటికి చేరుకున్నాం ఇలా మా ప్రయాణం జరిగింది
యన్.అన్వేష్
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగులపల్లి మండలం బెజ్జంకి
