Home ఇంట‌ర్వ్యూలు నాటకాలను ప్రోత్సహించాల్సింది పత్రికలే

నాటకాలను ప్రోత్సహించాల్సింది పత్రికలే

మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక ప్రతినిధి రంగరాజు పద్మజ జరిపిన ముఖాముఖిలో వనం లక్ష్మీకాంతారావు

*****************************************

పద్మజ:– నమస్కార మండీ!
వనం లక్ష్మీకాంత రావు గారు:– నమస్కారం!

పద్మజ:– మీ కుటుంబ నేపథ్యం వివరించండి!

లక్ష్మీకాంతారావు:– కొండాపురం వాస్తవ్యులు వనం కేశవరావు- రాధమ్మ గారు మా తల్లిదండ్రులు. వారికి నేను ఎనిమిదవ సంతానాన్ని.   కేశవరావు గారి అన్న కుమారుడు వనం నరసింహారావు గారికి సంతానం లేకపోవడంతో నన్ను వారు దత్తత తీసుకున్నారు.  దత్తత తండ్రి నరసింహ రావుగారు. తల్లి రాధమ్మ గారు. పాతింటి రాధమ్మ గారి దత్తపుత్రుడుగానే నేను చలామణి అవుతున్నాను.

పద్మజ:- మీ విద్య- ఉద్యోగం గురించి వివరిస్తారా?
లక్ష్మీకాంతారావు:– ఒకటవ తరగతి నుండి నాలుగవ తరగతి వరకు కొండాపురం గ్రామంలోనే చదివాను. నాలుగవ తరగతి అయిపోయాక నా చదువు ఎక్కడ? అనే సమస్య మా అమ్మకు వచ్చింది. మా అమ్మ చెల్లెలు ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు ఒద్దిరాజు రాఘవ రంగారావు గారి సతీమణి కమలాదేవి దగ్గర ఉండి చదువుకునేలా మాట్లాడి నన్ను అక్కడ చదివించింది. మాచిన్నమ్మ వెంటనే సరే! అంది ఎందుకంటే? పెదనాన్న గారింట్లో అది వరకే వైష్ణవుల పిల్లలు, మా బంధువుల పిల్లలు, దాదాపు 20 మంది చదువుకునే వారు ఇల్లంతా విద్యార్థులతో నిండి ఉండేది. వంట చేయడానికి అయ్యగారు ఉండేవారు. మూడు పూటలు భోజనాలు ఉండేవి.
        అలా ఐదు నుండి ఏడవ తరగతులు ఇనుగుర్తిలో కొనసాగింది. మా పెదనాయన  ఒద్దిరాజు రాఘవ రంగారావు గారి ఇంట్లో తెలంగాణలో ఆ రోజుల్లోనే వారు తెనుగు పత్రిక నడిపి, సాహిత్యం అంటే తెలియని రోజుల్లో… స్వంతంగా ముద్రణాలయం నెలకొల్పి, ఎన్నో పుస్తకాలు ముద్రించినటువంటి బహుళ కృషి చేసినటువంటి వారింట్లో నేను చదవడం నా అదృష్టం.
       తరువాత మా దగ్గర బంధువులు ఈటూరు వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉండి ఎనిమిది నుండి పదకొండవ తరగతి వరకు వారింట్లో ఉండి చదువుకున్నాను.
    హైదరాబాదులో  నేనున్నప్పుడు వారింట్లో విద్యుత్ సదుపాయం ఉండేది కాదు! దాదాపు 1962- 63 ప్రాంతంలో నేను ఉన్న ఇంట్లో గ్యాస్ నూనె దీపాలు, కందిళ్ళు, పెట్టుకొని చదువుకునేవాళ్ళం. వీధిలో పెద్ద విద్యుత్తు లైట్ ఉండేది. మెట్ల మీద కూర్చొని వీధిలైట్ల వెలుగులో చదువుకున్నాను. తర్వాత నా చదువంతా హైదరాబాదులోనే ఉన్నత విద్య అంటే డిగ్రీ వరకు 69 లో బిఎస్సి పూర్తి అయిన తర్వాత మా అమ్మగారి ఆరోగ్యం బాగా లేక మళ్ళీ గ్రామానికి రావడం దాదాపు రెండు సంవత్సరాలు మా అమ్మగారు సేవలు చేస్తూ గడిచిపోయింది.
           అమ్మగారు గతించిపోయాక మళ్ళీ బిఎస్సి పూర్తిచేసుకుని బీఈడీ చదివి తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. బీఈడీ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు మా ఊళ్లో వ్యవసాయం చేశాను. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగంలోనికి రావాల్సి వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూ ఎం,ఏ ఎం.ఈ.డి కూడా చదివాను. ఆ విధంగా 1976లో ఉపాధ్యాయ వృత్తిలో చేరితే 2006 నుండి 2016 వరకు జూనియర్ లెక్చరర్ ఆంగ్ల భాషాధ్యాపకుడిగా పనిచేసాను. ఇలా కొనసాగింది విద్య-ఉద్యోగం.

పద్మజ:— నాటక కళా రంగంపై మీకు ఆసక్తి ఎలా ఏర్పడింది?
లక్ష్మీకాంతారావు:—- నాటక కళా రంగం మీద నాకు ఆసక్తి కలగడానికి ఒక విధంగా మూడు, నాలుగు తరగతులలో మా ఉపాధ్యాయులు సుందరయ్య గారనే చెప్పాలి!   ఆ రోజులలోనే పిల్లల చేత నాటకాలు వేయించాలని వారికి ఆసక్తి ఉండేది. నాతో మూడవ తరగతిలోనే నాటకం వేయించారు. అప్పుడు స్టేజీలు అవీ లేవు కదా!  ఊరిలోని మూడు వీధులు కలిసే కూడలిలో చెక్కబల్లతో స్టేజి తయారు చేసి పెట్రోమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి నాటకం వేయించారు. అలా నాలో నాటక రంగంపై ఆసక్తికి అప్పుడు బీజం పడింది.     బాల్యంలోనే  సాహిత్యం పట్ల, నాటకాల పట్ల ఆసక్తి కలిగిస్తే చివరి వరకు పెంపొందుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఆ ప్రయత్నం జరగడం లేదు! అది నా బాధ!
    చిన్నప్పుడు ఏదైతే మంచి సంస్కారం అబ్బాలనుకున్నా సాహిత్యం పట్ల అనురక్తి కలగాలన్నా, నాటకాలైనా, కళలైనా చిన్నప్పుడే ఆసక్తి కలుగజేయాలి. తల్లితండ్రులు గాని, ఉపాధ్యాయులు కానీ… అది నాకు మొదట్లో జరిగింది.    తర్వాత 5, 6, 7 తరగతులలో ఉన్నప్పుడు ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి మనవడు కిషన్ రావు గారికి నాటకాలన్నా, కళలన్నా చాలా ఆసక్తి ఉండేది. వారు నాటకాలు రాసేవారు, అలాగే వేయించేవారు. చిన్న చిన్న పాటలు రాసి, పాడించడం, డాన్స్ లు నేర్పించి, స్టేజీ మీద చేయించేవారు. 15వ ఆగస్టు, 26వ జనవరి, పాఠశాల వార్షికోత్సవాలు …మొదలైన ఆయా సందర్భాలలో పాఠశాలకు వచ్చి, అక్కడ ఉన్న పిల్లలను ఎన్నుకొని, వారికి నేర్పించి, రిహార్సల్స్ (అభ్యాసం)  చేయించడం, అలా ఎంతో కృషి చేసేవారు. అలా నేను నాటకం వేయడం జరిగింది.
     చిన్నప్పటి నుండి నాకు నాటక ప్రదర్శన పట్ల అభిలాష కలిగింది. మా ఊరిలో సుందరయ్య సార్, ఇనుగుర్తిలో ఒద్దిరాజు కిషన్ రావు గారు ముఖ్యులు. ఈ విధంగా నాటకాలపై ఆసక్తి కలిగి క్రమక్రమంగా  పెరిగింది. ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేను ఎక్కడ పని చేసినా విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ నాటకాలు వేయించేవాడిని. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా చేసేవాడిని. నేను బి.ఈడి ( Bed) చేస్తున్నప్పుడు కూడా బీఈడీ కాలేజీలో నాటకాలు వేసాను. కృష్ణమూర్తిగారని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయన బాగా ప్రోత్సహించేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన స్వస్థలానికి వెళ్లారు.    ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లో *పెండింగ్ ఫైల్* అనే నాటకంలో నేను ఉత్తమ నటుడిగా బహుమతి తీసుకోవడం జరిగింది.   నేను ఎక్కడ పని చేసినా పిల్లలతో నాటకాలు వేయించే ప్రయత్నం బాగా చేసే వాడిని. కొండాపురంలో ఐదు సంవత్సరాలు పని చేసినప్పుడు, ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి విద్యార్థులతోనూ, ఉపాధ్యాయులతోనూ తప్పకుండా నాటకం వేయించేవాడిని. చుట్టుపక్కల గ్రామాల నుండి ఆ నాటకాలు చూడడానికి బండ్లు కట్టుకొని వచ్చేవారు. రాత్రి ఒంటిగంట అయినా నాటకం పూర్తిగా చూసి ఆనందించే వాళ్ళు. ఎందుకంటే  ఆ కాలంలో వేరే ఇతరత్రా వినోద కార్యక్రమాలు ఉండేవి కావు. టీవీలు, రేడియోలు లేని రోజుల్లో ఎక్కడ నాటక ప్రదర్శన ఉన్నా… అక్కడికి వెళ్లి చూడడంతో నాటకాలకు ప్రోత్సాహం ఉండేది.    ఉపాధ్యాయ వృత్తిలోనూ, అధ్యాపకుడిగా పనిచేసినా నాటక రంగానికి తోచిన విధంగా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది.

పద్మజ:– తెలంగాణలో నాటక కళా సంస్థలు గాని సమాజాలు  కానీ లేని సమయంలో … వర్ధన్నపేటలో భారతీయ నాటక కళా సమితి స్థాపించాలని  ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు స్థాపించారు?
లక్ష్మీకాంత రావు:– అవును ఆ రోజుల్లో ఎక్కువగా ఈ నాటకాలకు వేదికలు ఉండేవి కావు! పౌరాణిక నాటకాలు మాత్రం వేసేవారు. పద్య నాటకాలు బాగా ఆడేవి. అవి కూడా టికెట్ కొని మరీ చూసేవారు. కానీ ఒకటే అసౌకర్యం ఏమిటంటే పాత్రధారులు అందరూ ఎక్కడెక్కడ నుండో వచ్చేవారు, వారి పద్యాలు వారు పఠించి నాటకాన్ని కొనసాగించేవారు. అలా నేను ఇనుగుర్తిలో చదువుతున్నప్పుడు కూడా సురభి నాటక సమాజం వారు వచ్చి రెండు మూడు నెలలు ఒకే ఊరిలో ఉండి చుట్టుపక్కల గ్రామాలలో నాటకాలు వేసేవారు. అవి చూసి మాకు నాటకం వేయాలని ప్రేరణ కలిగింది.
   సురభి నాటకాలు ఒద్దిరాజు రాఘవ రంగారావు  పెదనాయన గారి ఇంటి వెనుక పెరడులో డేరాలు కట్టి వేసేవారు. మా పిల్లలందరికీ టికెట్ లేకుండా నాటకం చూడడానికి పంపేవారు. అలా అన్ని నాటకాలు చూసే అవకాశం దొరికేది .
      1976లో నేను ఉద్యోగంలో చేరిన తర్వాత మూడుసంవత్సరాలు నిడిగొండలో పనిచేసి, 1979లో మా స్వగ్రామమైన కొండాపురానికి ఉపాధ్యాయుడుగా బదిలీ అయి వెళ్లాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాటకాలు వేయించడం… ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలిసిపోయింది. అంతకు ముందే 1973లో ఇల్లందు గ్రామంలో భారతీయ నాటక కళాసమతి ఒకటి స్థాపించారు.
ఈ నాటక కళా సమితిని  ఈగ శ్రీహరి గారు, వడ్లకొండ వెంకటయ్య గారు, ఎల్ల గౌడు గారు, బొంపెల్లి పురుషోత్తం రావు గారు కలసి స్థాపించారు. మొదటి అధ్యక్షుడు మండల కిషన్ రావు గారు. వాళ్లు శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు 9 రోజులు తాలూకా స్థాయిలో నాటక పోటీలు నిర్వహించేవారు.అక్కడ రామాలయం ఉండేది. దాని ముందు స్టేజీ వేసి, నాటకం ప్రదర్శించేవారు. అలా 73-74- 75 వరకూ నడిచింది. తరువాత 76 లో వర్ధన్నపేటకు మార్చారు. కొండాపురంలో నేను పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బదిలీపై వచ్చిన తర్వాత 79 లో నన్ను ఆహ్వానించారు. ఇంతకు ముందు చెప్పినట్టు కిషన్రావు గారు ఇనుగుర్తి నుండి ఒక టీమ్ ను తీసుకుని వచ్చి, ఆ పరిషత్తులో పాల్గొనడం జరిగింది. అప్పుడు తాను రాసిన నాటకాన్ని ప్రదర్శించడంలో ఒక కొత్త ప్రక్రియను ప్రవేశ పెట్టారు. అదేమిటంటే నాటకంలో సన్నివేశానికి తగిన సంగీతం ఉండాలని, రేడియోలో కొన్ని సంగీత బిట్లు సేకరించి రికార్డు చేసుకుని ఆయా సన్నివేశాలకు తగినట్లుగా ప్లే చేసేవాడు. అంతవరకూ ఇలా చేయవచ్చని ఎవరికీ ఆలోచన రాలేదు. ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తున్నదని ఆలోచించాము. ఆశ్చర్య పోయాము. ఎందుకంటే అక్కడ ఎలాంటి వాద్య సహకారం లేదు. ఇలా కొత్త ప్రక్రియను ఎంతో శ్రద్ధగా ప్రవేశపెట్టడమే కాకుండా ఆచరణలో పెట్టాడు. అలా ప్రదర్శించిన నాటకానికి బహుమతి లభించింది కూడా!
ఇక నా విషయానికి వస్తే … పాఠశాల వార్షికోత్సవం కొరకు నాటకం వేసి, అదే  శ్రీరామనవమి ఉత్సవాలలో ప్రదర్శించడం జరిగింది. అలా కళా సమితితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఇల్లిందలలో ఉండేది వినాయక చవితి, శ్రీరామనవమి నవరాత్రులలో నాటకాలు వేయడం జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో  పోటీలు నిర్వహించడం మేము నాటకాలు వేస్తున్నాము… అనగానే వారే రావడం, మేము వెళ్లి ఆ నాటకాలను చూసి బాగుంటే రమ్మని పిలిచే వాళ్ళం .అంటే దీనినే స్క్రూట్నీ అంటారు. ఈ సంస్థ స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత నన్ను సభ్యునిగా చేర్చుకున్నారు.
తర్వాత పాఠశాల వార్షికోత్సవంలో నాటకం వేసిన తర్వాత ఈగ శ్రీహరి గారికి నాటక రంగంలో నా కృషి నచ్చి, అధ్యక్షులుగా చేసారు. అంటే ఒక సంవత్సరం పరిచయం ,ఆ తర్వాత సంవత్సరం కళా సమితిలో సభ్యత్వం, ఆ మరసటి సంవత్సరం అధ్యక్షుడిగా నియమింపబడ్డాను. తర్వాత నాటక నిర్వహణకు డబ్బు కావాలి!కదా! అధ్యక్షుడుగా నేను, కార్యదర్శి ఇద్దరం కళల పట్ల అభిరుచిన్న వారి దగ్గరికి వెళ్లి, చందాలతో డబ్బులు సేకరించి, వాటితో నాటక నిర్వహణ చేసాము.   ఈలోపల *నిరూప్ సింక్రూమ్* అనే సంస్థ వారు ప్రథమ బహుమతి ప్రకటించారు.    అలాగే ఐతరాజు వేంకట నరసింహారావు( A V N)  గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం రెండో బహుమతి ప్రకటించారు.    ఈ రెండింటికి శాశ్వత నిధి ఏర్పాటు చేసి దాని మీద వడ్డీతో బహుమతి ప్రదానం ఇప్పటికీ చేస్తున్నారు.
    ఇక భోజనం ఖర్చులు మా అమ్మగారు వనం రాధమ్మ గారి పేరిట ఏర్పాటు చేసాను. ప్రతి సంవత్సరం దానికి కావలసిన సామాన్లు పంపాము. షీల్డ్ లు  ఒకరు, నాటక రంగస్థల నటులకు  పారితోషకాలకు మరో చందాదారులు… ఇలా తలా ఒక చేయి వేసి ఆ సంస్థను నడిపాము! మొదట్లో చెక్కబల్ల ఏర్పాటు చేసేవాళ్ళం.    తర్వాత గ్రామీణ పథకం ద్వారా స్టేడియం నిర్మించాము. ఈ స్కీం నియమాలేమిటంటే ప్రభుత్వానికి స్థలం చూపించి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే… రెండు లక్షలు ప్రభుత్వం తరపున ఇస్తుంది.  ఇలా ఏవైనా మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. అలా ఈ భారతీయ నాటక కళా సమితి  నిర్మించాలనుకున్నప్పుడు శ్రీ మునుగోడు నరసయ్య గారు గొప్ప హృదయంతో లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ గ్రామంలో  స్థలాన్ని కొని ప్రభుత్వానికి చూపించాము. ప్రభుత్వం రెండు లక్షలు మంజూరు చేసింది. అలా ఆడిటోరియం రూపుదిద్దుకున్నది. దానికి *మునుగోటి నరసయ్య కళాభవన్* అని పేరు పెట్టాము. అందులో కార్యక్రమాలు చేసాం. ఇది ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన విషయం. అంతకుముందు నేను ఇదివరకు చెప్పినట్టు మూడు రోడ్ల కూడలిలో చెక్కబల్ల వేసి దానిమీద జంపఖానా వేసి తాత్కాలిక వేదిక తయారు చేసే వాళ్ళం. ఆడిటోరియం  తయారైన తర్వాత నాటక అధ్యక్షుడిగా 25 సంవత్సరాలుకృషి చేశాను.
ఉద్యోగ విరమణ కావడము, హన్మకొండకుకుటుంబంతో రావడము, సహృదయ సాహితీ సంస్థలో నేను సభ్యుణ్ణి కావడం, అక్కడా- ఇక్కడా ప్రయాణం చేయడం కష్టమైంది. అయినా నాటక సమాజాలకు పారితోషికం ముట్టాలనే సదుద్దేశ్యంతో  నాటక పోటీలలో వరుసగా నాలుగు రోజులు ఇక్కడ వేసిన నాటకాలు అక్కడ వేసిన నాటకాలు ఇక్కడ వేయమనేవాళ్ళం.
    పురుష వేషధారులు రాను- పోను వారి ఖర్చులు వారే భరించేవారు. అంతే కాదు నాటకానికి అవసరమయ్యే సెట్టింగ్లు, వస్త్రాలు, మేకప్ మెన్, ఇలా వాటన్నింటినీ ప్రదర్శన జరిగే చోటుకి అద్దె వాహనాల మీద తీసుకుని రావడం ఖర్చుతో కూడిన పని ఎక్కువ కష్టం అయింది.  సంస్థలో లైటింగ్ నాటకానికి అణువుగా ఉండక… అవసరమైన లైటింగ్ ఆయా నాటక సమాజాలే అమర్చుకునేవారు. ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఎంత కష్టమైనా నాటకలను భరిస్తున్నారు.
   ఇక స్త్రీ పాత్రధారులకు రాను పోను ట్రావెల్ ఖర్చులు, భోజనం ఏర్పాటు చేయాలి. వాటికి అదనపు ఖర్చు అయ్యేది. జిల్లా స్థాయికి అలాగే రాష్ట్రస్థాయికి క్రమక్రమంగా అభివృద్ధి చేసి అక్కడ మేము ప్రాయోజన ప్రదర్శన అంటే (Benfit show) *అల్లూరి సీతారామ రాజు* నాటకాన్ని వేయడం, దానికి అప్పుడు ఉన్నటువంటి పరిషత్తు చైర్మన్ గా ఉన్న జమున గారిని ఆహ్వానించడంతో వారు వచ్చారు. ఆంధ్రా నుండి నటులు నాటక పోటీలలో పాల్గొనేవారు. భారతీయ నాటక కళా సమితిలో ప్రదర్శించిన నాటకానికి బహుమతి వచ్చిందంటే? వాళ్లకు ఒక గుర్తింపు వచ్చినట్టు. వర్ధన్నపేట భారతీయ నాటక కళా సమితిలో ప్రథమ బహుమతి వచ్చిందంటే అన్ని సమాజాల వారు వారిని ఆహ్వానించేవారు. అంత పేరు వచ్చింది ఆ సమితికి.
    25 సంవత్సరాలు నేను ప్రతీ సంవత్సరం నాటకాలు వేయడం- వేయించడం వల్ల భారతీయ నాటక కళా సమితికి నాకు సంబంధం ఏర్పడింది. దానికి శాశ్వతంగా కొంత డబ్బును సమకూర్చి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలకు ఎవరిని చేయి చాచకుండా ఆయా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగడానికి ఏర్పాటు చేశాం! ఇలా ఆర్థిక వనరులు కానీ, ఆడిటోరియం నిర్మాణం కోసం కానీ నాకు దొరికే సెలవులన్నీ వర్ధన్నపేట భారత కళా సమితి అభివృద్ధి పనులకే కేటాయించాను. రెండో శని, ఆదివారాలు కానీ  వేసవి సెలవులు కానీ ఏసెలవైనా అక్కడికి వెళ్లడం, కార్యవర్గ సభ్యులను సమావేశపరిచి డబ్బులు చందాల రూపంగా వసూలు చేయడం, వాటితో ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనలే తప్ప మరో ఆలోచన ఉండకపోయేది. 25 సంవత్సరాలు నా క్రీమ్ ఆఫ్ లైఫ్ ( cream of life) అంతా కూడా భారతీయ నాటక కళా సమితికే వెచ్చించాను.

పద్మజ:— హన్మకొండలోని *సహృదయ* *సాహిత్య* *సాంస్కృతిక* *సంస్థ* తో మీకున్న అనుబంధం దాని విశేషాలు చెప్పండి!
లక్ష్మీకాంత రావు :—- భారతీయ నాటకం సమితిలో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడే వరంగల్ జిల్లా కాకతీయుల సామ్రాజ్యం మంచి పేరున్నటువంటి ఈ నేలలో ఒక పరిషత్ ఎందుకు నిర్వహించ కూడదు అనే ఆలోచన వచ్చింది. అప్పుడు సాహిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు రెండూ నడిచే విధంగా ఒక సంస్థను స్థాపించాలని, నేను శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, ఏవీ నరసింహారావు గారు, ధర్భశయనం శేషాచారిగారు, డాక్టర్ ప్రసాద్ గారు, మేమందరం సమావేశమై మాట్లాడిన తర్వాత ఒకటే వేదిక మీద నుండి ఇటు సాంస్కృతిక అటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలనే ఆదర్శంతో 1998లో ప్రారంభించాము.
        పరిషత్తులు నిర్వహించాలంటే ఆ రోజులలో 80,000 ఖర్చు వచ్చేలా ఉంది అంత ధనం సంపాదించలేమని, రెండు నెలలకు ఒక నాటికను ఎవరినైనా పిలిచి వేయించాలనే నిర్ణయించి, అలా రెండు సంవత్సరాలు వేయించాము. పబ్లిక్ గార్డెన్ లో వేదిక ఉండేది. సాంస్కృతిక కార్యదర్శిగా నేనున్నాను. వర్ధన్నపేటలో శివరాత్రి తో ముగించి ఇక్కడ కూడా అదే శివరాత్రి ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించాము.
          పదవీ విరమణ పొందిన తర్వాత కాస్త ఆరోగ్యం సహకరించక వర్ధన్నపేట సంస్థను స్థానికులకు బాధ్యతలను అప్పగించి నేను విరమించుకోవాలని అక్కడ అన్ని వసతులు చేసిన తృప్తితో విరమించుకున్నాను. అలా  2006తో  భారతీయ నాటక కళాసమితితో సంబంధానికి తెరపడింది.      సహృదయను 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పరిషత్తు నిర్వహించడం, సాహిత్య కార్యక్రమాలు ఎన్నో చేశాం. మహాభారతం మీద విశ్లేషణా ప్రసంగాలు కవి పండితుల చేత చేయించాము. ఉపనిషత్తుల మీద ఉపన్యాసాలు, భాగవతం మీద ఉపన్యాసాలు, భగవద్గీత మీద ఉపన్యాసాలు పది రోజుల కార్యక్రమాలు నిర్వహించాము.   ప్రతి సంవత్సరం నాటక పోటీలు సాహిత్య కార్యక్రమాలతో గత 25 సంవత్సరాల నుండి సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహణ జరుగుతున్నది.     ఉగాది పురస్కారాలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈమధ్య దివంగతులైన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి స్మృతి చిన్నంగా ఒక పురస్కారం ఇస్తున్నాము. సహృదయ ప్రారంభించాక రెండు మూడు సంవత్సరాలకు మాకు ఒక ఆలోచన వచ్చింది .
         తెలంగాణ వైతాళికులుగా పేరుపొందినటువంటి ఒద్దిరాజు సోదరులు ఆ రోజుల్లో అంత సాహిత్య కృషి చేసి, ఎన్నో పుస్తకాలు ముద్రణ చేసి, వారి స్వంతంగా ఒక ముద్రణాలయం స్థాపించి, అందులో ఎన్నో ప్రచురణలు చేసి, అంత శ్రమపడిన సోదరులు ఎవరికీ తెలియకుండా ఉన్నారు. ఆ రోజుల్లో అందుకే వారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక పురస్కారం ఇచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో కవి, పండితులకు, రచయితలకు పురస్కారం బహకరిస్తే అందరికీ తెలుస్తుందని అదే సంవత్సరం దాదాపు 98 లో ప్రారంభమైతే  అయిదారు సంవత్సరాలు 2003– 2004లో ఒద్దిరాజు వేణుగోపాల్ రావును సహృదయ సభ్యులుగా చేర్చుకున్నాక, అందరం కలిసి ఇంటికి వెళ్లి వేణుగోపాలరావుతో మా ఆలోచన ఇలా ఉన్నదని చెప్పినాము. సోదరుల పేరిట పురస్కారం ఇవ్వాలని ప్రతి సంవత్సరం 4000 రూపాయల పురస్కారం కింద ఇవ్వాలని ఆలోచన ఉంది. ఆర్థికంగా సహకరించగలుగుతారా? అని అడిగిన వెంటనే పురస్కారం డబ్బులు నేను ఇస్తానని అన్నాడు. మీరు కొనసాగించండి అని అన్నారు. అలా ఇప్పటివరకు  పురస్కారం పదివేల రూపాయలకు పెంచడం జరిగింది. దానిని ఒద్దిరాజు వేణుగోపాలరావు ఉన్నన్ని రోజులు వారి ఇచ్చారు. వారి తర్వాత భార్య విష్ణుప్రియ గారు కూడా కొనసాగిస్తున్నారు.
    ఒద్దిరాజు సోదరులు అంటే తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు! సాహిత్య రంగంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కాని బహుముఖీనంగా  ప్రచారం జరిగింది. ఈ పురస్కారం ద్వారా మేము చేసిన సంతోషకరమైన విషయం అది.   సాహిత్యంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రక్రియకు , పద్యానికి ఒక సంవత్సరం, కథలకు, విమర్శకు, (ఫ్రీవర్స్)  వచన కవిత్వానికి అలా అన్ని ప్రక్రియలకు పురస్కారాలు ఇస్తున్నాము ఇప్పటికీ 25 సంవత్సరాలలో ఐదు ఆవృతాలు అయ్యాయి.

పద్మజ:— నంది నాటకాలకు న్యాయనిర్ణేతలుగా ఉన్నారు కదా! ఆ అవకాశం మీకు ఎలా కలిగింది? వాటి వివరాలు చెప్పండి!
లక్ష్మీకాంత రావు:– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాటకాలను ప్రోత్సహించాలని ఆలోచన వచ్చినప్పుడు నాటక పోటీలు నిర్వహించాలని దానికొక పేరు నంది నాటకోత్సవాలనీ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడు 2004లో వాళ్ళు ఎవరైతే న్యాయానిర్ణేతలుగా బాగుంటారని ఆలోచించారట! ఎందుకంటే మొట్టమొదట నాటకాలను ఎన్నుకోవాలి.  ప్రతి జిల్లాకు వెళ్లి ప్రదర్శనలు చూడాలి. ముందుగా వాళ్ళు ఎంట్రీలు పంపుతారు. అలా 22 జిల్లాల నుండి ఎంట్రీలు వచ్చేవి. మొత్తం ఎంట్రీలను స్క్రూటినీ చేసి 12 నాటకాలు ఎన్నుకోవాలి! దీనికి ఎవరైతే బాగుంటుందని ఆలోచించి నా పేరు అక్కడ సూచించారు. ఎందుకంటే చాలా కాలం నుండి నేను నాటకాలు వేస్తున్నాను కాబట్టి నాకు తోడుగా మరో ఇద్దరిని సెలెక్ట్ చేసి మొట్టమొదటిసారిగా నంది నాటకోత్సవాలు నేను జడ్జిగా వెళ్లాను. దాని తర్వాత ఒకసారి ఫైనల్ జడ్జిగా కూడా వెళ్లాను. మరొకసారి ప్రాథమిక న్యాయనిర్ణేతగా కూడా వెళ్లాను. అలా మూడుసార్లు నంది నాటకోత్సవాలకు న్యాయనిర్ణేతగా పనిచేశాను. ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అందరూ ఆమోదించారు. ఎందుకంటే పారదర్శకంగా ఎన్నుకోవడం జరిగింది.
            ఉమ్మడి రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో నంది నాటకోత్సవాలు అలా మొదలయ్యాయి. ఇప్పుడు కూడా ఆంధ్రలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరగడం లేదు. పది సంవత్సరాలయినా ఆ ఆలోచన లేదు. న్యాయనిర్ణేతగా నేను సన్మానింపబడ్డాను ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థలు నిర్వహించే నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా విజయవాడ, కొలకలూరు, భద్రాచలం, తొర్రూరు, చిలకలూరిపేట మొదలైన సంస్థలకు వెళ్లాను.

పద్మజ:– మీరు ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు కదా! ఆయా సందర్భ విశేషాలు చెప్పండి!
లక్ష్మీకాంత రావు:-  ప్రతి జిల్లా నుండి ఒకనాటికను జిల్లా అధికారులు ఎన్నుకొని పంపితే రవీంద్రభారతిలో *సెక్రటేరియట్ కాంపిటీషన్స్* నిర్వహించేవారు. ప్రతి జిల్లా నుండి జిల్లా అధికారులు ఒక నాటికను పంపితే దానిని అక్కడ ప్రదర్శించేవారు. అలా వరంగల్ నుండి *జాతిస్మరామి* నాటకాన్ని జిల్లా అధికారులు పంపారు.అలా పంపించిన దాన్ని ఐదారు సార్లు ప్రదర్శించాము. ఆ నాటకంలో నాది ప్రొఫెసర్ పాత్ర! నాంపల్లి మధుబాబు గారు డైరెక్టర్! దానికి మంచి పేరు రావడమే కాకుండా రెండో బహుమతి కూడా వచ్చింది. అలాగే ప్రభుత్వ పరంగా రంగస్థలం పురస్కారం అందుకున్నాను. వీరేశలింగం జన్మదినం ఏప్రిల్ 16న జరిగే నాటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో నాటకరంగానికి తెలంగాణా నుండి ఒకరికి, ఆంధ్రా నుండి ఒకరికి రంగస్థల పురస్కారం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించగా నేను అందుకున్నాను.  తెలుగు యూనివర్సిటీ వారు కీర్తి పురస్కారం ఇచ్చారు. అప్పా జోష్యుల వారు (విష్ణుభట్ల-అభో విభో) సంస్థ వారు పురస్కారాన్ని ప్రదానం చేసారు. నిజామాబాద్ శ్రీపాద కళాపరిషత్ వార పురస్కారం ఇచ్చారు.  ఇలా 15 – 20 పురస్కారాలు నాటక కళాకారుడిగా అందుకున్నాను.
            శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ నుండి ఒకరికి పురస్కారం ఇవ్వాలని ఇచ్చారు. ఆ సభకు సి నారాయణరెడ్డి గారు ముఖ్యఅతిథిగా వచ్చారు.

పద్మజ:– మీది బోధనారంగానికి సంబంధించిన వృత్తి , మీ అభిరుచి కళారంగం మీద, ఆచరణలో ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి, కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం మీకు సంతృప్తి నిచ్చిన రంగం ఏది? ఈ రంగాలు ఎవరి మీదనైనా ఎట్లాంటి ప్రభావం చూపుతాయి?
లక్ష్మీకాంత రావు:– నేను స్వతహాగా వ్యవసాయ కుటుంబంలో జన్మించడం వల్ల వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటినుండి పశువులను మేపడం, దగ్గర నుండి నాగలి పట్టడం మోట తోలడం అన్నీ చేసే వాడిని. సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు నౌకర్లతోనే ఉండేవాడిని. అలా సహజంగా వ్యవసాయ రంగంతో అనుబంధం ఉంది.      ప్రతి మనిషికి వృత్తి ఒకటి ఉంటుంది ప్రవృత్తి మరొకటి ఉంటుంది.  నేను కాకతాళియంగా ఈ ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చినా వృత్తి పరంగా నేను న్యాయం చేశాననే చెప్తాను. బోధనా బాధ్యతలు, పాఠశాల నిర్వహణ అన్నీ చూసుకునేవాడిని.    కానీ నాకు చిన్నప్పటినుండి నాటకం గురించి మా గురువులు ఏ బీజావాపన చేశారో? దాని ద్వారా అది క్రమక్రమంగా మొక్కై, చెట్టై, పెరిగి ఊడలు పాతుకుపోయినట్టు… నాటక కళ మీద ఇష్టం పెరిగింది. 50 సంవత్సరాల నుండి కళారంగానికి సేవ చేసే అవకాశం కలిగింది.
     ఇక ఆధ్యాత్మికంగా అన్నప్పుడు ప్రతి మనిషి జీవితంలో  వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి.  ఆశ్రమాలలో ముఖ్యంగా మొదట బాల్యం, బ్రహ్మచర్యం, గృహస్థ, ఆశ్రమం… ఈ కాలంలో సన్యాసం తీసుకునేది లేదు.    కాబట్టి ఎవరికైనా 60 సంవత్సరాలు దాటిన తర్వాత తన గురించి తాను ఆలోచించటం మొదలు కావాలి! చాలా ముఖ్యమైన విషయం మనిషి జన్మ తీసుకున్న తర్వాత తానెవరు? ఈ భూమి మీదికి తాను ఎందుకు వచ్చాడు? తన లక్ష్యం ఏమిటి, అనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి!కేవలం ఒక్క మనిషికి మాత్రమే ఆ వివేకం ఉంటుంది  మిగతా జంతుజాలం అంటే 84 లక్షల జీవరాసులు ఉన్నా కానీ ఏది మంచి? ఏది చెడు? అనే వివేచన ఒక మనిషికి మాత్రమే ఉంటుంది.
    నేనెవరో? నేనెందుకు జన్మించాను? ఎక్కడ నుండి వచ్చాను? తన లక్ష్యం ఏమిటి? అనేది ఆలోచించుకోవాలి. ఏదో కొంతమందికి ఆ ఆలోచన వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళలో ఎంతమంది దాని గురించి సాధన చేస్తారో ఎంతమంది తమ గమ్యాన్ని చేరగలుగుతారనేది తర్వాత విషయం
    ముఖ్యంగా కొంత వయసు వచ్చాక మార్పు రావాలి! క్రమక్రమంగా లౌకిక విషయాల నుండి ఆధ్యాత్మిక వైపు తిరగాల్సి వస్తుంది. అలా వచ్చినప్పుడు తానేంటి? నేనెవర్ని? జీవనం యొక్క ప్రాధాన్యత ఏమిటి? నాలో ఉన్న దివ్య శక్తి ఏమిటి? ఆ దివ్యత్వాన్ని నేను ఎలా పొందగలిగాలి? అని ఆలోచన మనిషికి వచ్చిన తర్వాత క్రమక్రమంగా మార్పు వస్తుంది. అదే ధ్యేయము. 
*ఏ కంసత్ విప్రా బహుదా వదంతి* అంటే ఉన్న పదార్థం ఒకటే! అంతట సర్వే సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే చైతన్య శక్తి ఉందో? అది అన్ని జీవరాసుల్లోనూ ఉంది. మనలో ఉన్న శక్తి తెలుసుకొనే ప్రయత్నం చేయాలి! ఏ చైతన్యం వల్ల మాట్లాడగలుగుతున్నాము? ఏ చైతన్య ఉండడం వల్ల చూడగలుగుతున్నాము? ఏ చైతన్యం వల్ల మనం ఆలోచించగలుగుతున్నాము? అది ఏమిటి? ఎక్కడ ఉంది? దాన్ని ఎలా తెలుసుకోగలం? దాన్ని అనుభవించగలగాలి తెలుసుకోవడమే కాదు అది ఉన్నది. అజ్ఞానం చేత కప్పి వేయబడి ఉంది. అజ్ఞానం తొలగించుకొని చైతన్యాన్ని అనుభవైక వేద్యం అది చెప్పడానికి వీలుకాదు! చూపించలేము! దాని అనుగ్రహంతోనే తెలుసుకుంటాం! జ్ఞాన గేయం అదే చైతన్యం ద్వారానే తెలుసుకోగలుగుతాము. పెద్దల ద్వారా తెలుసుకున్నప్పుడు కొంత ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చెప్పలేను కానీ కొంత ప్రయత్నం అయితే చేస్తున్నాను.

పద్మజ:– మనిషికి ఆధ్యాత్మికత  ప్రశాంతత నిస్తుందా?
లక్ష్మీకాంత రావు:— మనసుకు చాలా ప్రశాంతతని ఇచ్చేది ఆధ్యాత్మికత మాత్రమే! లౌకికమైన విషయాలు ఎన్ని పుస్తకాలు చదివినా, రాసినా, ప్రవచనాలు చేసినా అది అంతుపట్టదు. కానీ కేవలం సాధనతో మాత్రమే తనలోనికి వెళ్లి అంటే అంతర్ముఖీనం కావాలి.
   మనం చేసే పనులన్నీ ఇంద్రియాలతోనే చేస్తున్నాం! మనం ఎవరమనే విషయం తెలుసుకొని, సోహం అనేది తెలుసుకొని, కొందరు ఆసోహం దాసోహం ద్వారా తెలుసుకోవచ్చు! అని అంటారు. కొందరు సోహం తెలుసుకోవడానికి ఏ గురువు అవసరం లేదు ! ఎవరికి వారే సాధన చేస్తే తెలుస్తుందంటారు. తెలుసుకొనే ప్రయత్నం తప్పక ప్రతి మనిషి చేయాలి! అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటారు.
*మనుష్యాణం సహస్రేషుకశ్చిత్*
*సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్త్వతః*
           అంటే వేల మందిలో ఏ ఒక్కరో నేనెవరిని? అనే వివేకంతో  ఆలోచించగలుగుతారు… ప్రయత్నం చేస్తారు ! అలాచేసిన వేయి మందిలో  ఒకరు మాత్రమే తెలుసుకొని నన్ను చేరగలుగుతారు! అని చెప్తాడు.    అందుకే కోట్లాది జనం ప్రపంచంలో ఉన్నా గానీ 0.01 కూడా ప్రయత్నం చేయరు! మనిషి జన్మ ఎత్తి కూడా ప్రయత్నం చేయకపోతే *మహాతీ నష్టః* అంటే అంతకన్నా నష్టం లేదు అంటుంది ఉపనిషత్తు.    మళ్ళీ మానవ జన్మ వస్తుందో? లేదో? తెలువదు! ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనిషి జన్మ వచ్చింది… దాన్ని సార్ధకం చేసుకోవాలి! ఎందుకంటే నిద్ర ,ఆహారం, భయం, మైథునం అన్ని ప్రాణులకు సాధారణంగా ఉండేవే… కానీ ఒక్క వివేకం మనిషికి మాత్రమే ఉంటుంది. ఆ వివేకాన్ని ఉపయోగించుకొని చైతన్య స్ఫూర్తితో నేనేమిటి? అని తెలుసుకోవాలి! రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస మొదలైన వారు చెప్పేది అదే!

పద్మజ:– దేవాలయ ధర్మకర్తగా సాంకేతికత ఇంత అభివృద్ధి చెందిన ఈ సమయంలో దేవాలయాల ఆవశ్యకత ఉంటుందని మీరు నిర్వహిస్తున్నారా?
లక్ష్మీకాంత రావు:– మన భారతదేశం వేద సంస్కృతి. ఇందులో భగవంతుడిని ఏ విధంగా  చేరాలనే విషయం చెప్తారు.కానీ భగవంతుడు ఎలా ఉంటాడు? వైకుంఠంలో ఉంటాడా? కైలాసంలో ఉంటాడా? అనే ఊహాగానాలే తప్ప సమగ్రంగా ఎవరూ చెప్పలేదు. ఈ విశ్వాసంతోనే భక్తి నెలకొని ఉంది తప్ప సరియైన ఆధారం ఏమీ లేదు! ఐనా మనకు ఏకాగ్రత కుదరాలంటే… ఇతర విషయాలన్నీ మరిచిపోయి ఏకీకృతంగా ఒకటే ఆలోచన చేయాలంటే మనకు ఏదో ఒక వస్తువు అవసరం.ఆ వస్తువు మీద మాత్రమే ఆసక్తి చూపించి,మనసును కేంద్రకృతం చేసినప్పుడు స్థిరంగా నిలబడుతుంది. మనస్సు స్థిరంగా నిలబడడమే శాంతి! అదే సౌఖ్యం !మనసు స్థిరంగా లేనప్పుడు మనకు ఎన్ని సంపదలు ఉన్నా… ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా… ఎంతమంది బంధువులు ఉన్నా మనకు మనం ప్రశాంతత పొందలేము. మనుసు స్థిరంగా నిలిచినప్పుడు మాత్రమే పూజ చేస్తాము. అలా నిలబడడానికి ఆవశ్యకమైంది ఒక విగ్రహం! మంత్రపూరితంగా ఎంతో శక్తిని ఆవహింప చేసి, బీజాక్షరాలుపయోగించి, తెలుసుకున్న పెద్దలు ఆగమశాస్త్ర విధానంలో పూజలు చేసేవారు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు దేవాలయానికి రావడం, విగ్రహాన్ని దర్శించుకోవడం తన మనసులోని ఆవేదన చెప్పుకోవడంతో ఉపశమనం పొందవచ్చు… అని పెద్ద వాళ్ళు దేవాలయాలు నిర్మించారు. వీటివల్ల పాపం- పుణ్యం -భయం అనేవి  ప్రజలు ఆలోచించగలుగుతారు. దేవాలయ సంస్కృతే కనుక లేకపోతే ఒక కట్టడి ఉండకపోయేది! ఎందుకంటే మనం తప్పు చేస్తే దేవుడికి కోపం వచ్చి శిక్షిస్తాడు… అని అనే తలంపుతోనే మనిషి తప్పు పని చేయడానికి వెనుకాడుతాడు. లేకపోతే ఇంకా ఎన్ని అరాచకాలు జరిగేవో? ఎంత హింస పెరిగేదో?  
   అనూచానంగా వస్తున్న దేవాలయాలు అటు సంస్కృతిని కాపాడడంతో పాటు, పండగల పేరుతో గ్రామస్థులను ఒకచోట చేర్చి సంఘటితంగా మారే అవకాశం, ప్రజలలో విశ్వాసం కలగజేయడం, దేవుడు  మనను కాపాడుతాడు అనుకోవడమే భక్తి. ఇలా పలుకోణాల్లో దేవాలయాలు సమాజానికి హితవు కలిగించేవి కనుకనే మా పూర్వీకులు నిర్మించిన దేవాలయాన్ని కాపాడుకోవాలని, సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని పునరుద్ధరణ చేయడం జరిగింది.
       రాజుల రాజుల కాలంలో ఊరి వారందరినీ ఒక దగ్గర కూర్చుని వాళ్లకు కావాల్సినవి ఏమిటో చర్చించుకుని పాలకులు కానీ ప్రధానాధికారి కానీ విషయాలు తెలుసుకొనేందుకు దేవాలయాలు ఉపయోగపడేవి. పాలకులు వచ్చినప్పుడు వారి గ్రామ సౌకర్యాల గురించి మాట్లాడేవారు అంతేకాక మన సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టుకునేందుకు గ్రామాలలో దేవాలయ నిర్మాణాలు చేసేవారు అని పెద్దలు చెప్తారు.
   దేవాలయాలు నిర్మించడం చాలా తేలిక ! కానీ దాని నిర్వహణ చేయడం చాలా కష్టం. పూర్వపు రోజులలో రాజులు,ధర్మకర్తలు దేవాలయానికి  పంట భూములు కేటాయించేవారు. వీటిని ఇనాం భూములు అనేవారు. దీనిలో పండిన పంటతో దేవాలయ విధులు, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులకు కొంత భూమి ఇచ్చేవారు. పల్లకీలు, వాహన సేవలు మోసే వారికి పద్మశాలీలకు, వాహన ఊరేగింపు ముందు దివిటీ పట్టుకొనే  రజకులకు నైవేద్యం కొరకు సొండెలు అంటే గుగ్గిళ్ళు ఆ ప్రసాదం కొరకు సొండెలు తయారు చేయడానికి శనగలు పండించేందుకు  చెలుకలను, పొలాలను ఇనాముగా ఇచ్చేవారు.
          ఇక సాతాని వారికి కోవెలలో జరిగే కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి చెప్పడము, విస్తర్లు, దొప్పలు ఆకులతో కుట్టడము, గంధం తీయడము, పూలమాలలు సేకరించడం, తులసీ దళాలు కోయడం ఇంకా కొన్ని దైవ సంబంధ పనులు ఎవరైనా గృహస్తులు దేవుడికి భోగానికని వంట సామాగ్రి ఇస్తే అవి తెచ్చి అర్చకుడికి ఇవ్వాలి.
             నిత్య విధి కార్యక్రమాలకు కేటాయించిన భూములు వ్యవసాయం చేసుకోవడం, పండించుకోవడం రోజు ఆరగింపు చేయడం వాళ్ళ బాధ్యత! ఇక విశేష రోజులు అంటే పండగలు, వార్షిక ఉత్సవాలు, అధ్యయన ఉత్సవాలు, కల్యాణంలో మళ్లీ ధర్మకర్తలే అందరూ కలిసి డబ్బులు కానీ వంట సామాగ్రి కానీ వంట చెరుకు దగ్గర నుండి అన్ని తీసుకువెళ్లి కోవెలలో అర్చకుడికి ఇస్తే ఉత్సవాలు జరిగేవి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో  పౌర్ణమి రోజు కళ్యాణం వారం రోజుల పాటు జరుగుతాయి. అందులో భాగంగా బండ్లు తిరగడం ఒకరోజు, మొదట ధ్వజారోహణము అంకురార్పణ, కళ్యాణము , తెల్లవారి సదస్సు ఇలా కార్యక్రమము ఐదు రోజులు చేస్తారు. వీటికి అయ్యే ఖర్చు ధర్మకర్తల కుటుంబాలే భరిస్తాయి. మార్గశిర మాసంలో గోదా కళ్యాణం చేస్తారు. సంక్రాంతికి ముందు తొమ్మిది రోజులు ఆండాళును పెళ్లికూతురును చేస్తారు దీన్నే మంజీల్ ఉత్సవం అంటారు. ఆ వేడుకలకు రోజుకొకరు చొప్పున భోగానికి భోజనశాలకు సామాను తీసుకెళ్లిన సాతాను వారికి అందరికీ సాహిత్యం అంటే వంట సామాను పంపిస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పంపుతారు. ఒకప్పుడు అంటే 50 సంవత్సరాల కింద ఈ వ్యవస్థ ఉండేది.
           25 సంవత్సరాల నుండి వైష్ణవుల కుటుంబాలకు సంవత్సరానికి ఒకరు చొప్పున పంతులు వచ్చేవి అంటే ఆ కుటుంబంలోని వారు ఆ దేవాలయంలో పూజలు చేసేవారు. పాత తరం చేశారు. వాళ్ళ కొడుకులు చదువుకోవడానికి బస్తీలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం కోసం వేరే ఊరికి వెళ్ళిపోయారు. పాత తరం అంతరించిపోయింది రెండవ తరం ఉద్యోగరీత్యా ఊరు విడిచి వెళ్లడం జరిగింది.  దేవాలయంలో అర్చకత్వం చేసేవారు లేరు…. లేకపోయేసరికి ఏం చేయాలనే ఆలోచన చేసి మళ్ళీ అందరూ నియోగులు ఉంటారు. వీరే ధర్మకర్తలు అందరూ కూర్చొని చర్చించితే వైష్ణవ కుటుంబాలు మేము దేవాలయాన్ని నిర్వహించలేము! మీకు తోచిన విధంగా చేయండి! అని వారు అనడంతో భూములు మీ ఇష్టం దేవాలయం మీ ఇష్టం ఏం చేసినా పర్వాలేదని వెళ్ళిపోయారు.
         ధర్మకర్తలు ఏం చేశారంటే? మాన్యపు భూములను రైతులకు కౌలుకు ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో దేవాలయ నిర్వహణ చేయాలని నిశ్చయించారు. వేరే ఊరు నుండి ఒక పూజారిని రప్పించి నియమించారు. నెల నెల జీతం మీద పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాము.
          దేవాలయం చుట్టూ శుభ్రం చేసేందుకు ఒక ఉద్యోగి, పాత్రలను శుభ్రం చేయడానికి ఒక ఉద్యోగిని నియమించాము. పూర్వపు రోజుల్లో అయ్యగార్లే పొలాలను వ్యవసాయం చేసి పంట పండించుకొని, గుడి నిర్వహణ చేసేవారు. ఇప్పుడు జీతం ఇచ్చి ఒక ఎంప్లాయ్ ని ఏర్పాటు చేసి అదే భూముల మీద వచ్చిన ఆదాయంలో డబ్బును వాళ్లకు జీతం రూపంలో ఇస్తున్నాము. ఇదీ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ. ఇప్పుడు దేవాలయంలో జరిగే అన్నిటికీ మా నియోగుల కుటుంబాలే బాధ్యత వహిస్తున్నాయి ఉన్నవాళ్లలో వయస్సు రీత్యా పెద్ద వారిని చైర్మన్ గా ఎన్నుకోవడం, వారు గతించిన తర్వాత మరో  పెద్దమనిషికి బాధ్యత అప్పగించడం అలా దేవాలయ నిర్వహణ ధర్మకర్తగా ఇప్పుడు నేనే నిర్వహణ చేస్తున్నాను. భగవంతుని దయతో ఇప్పటికైతే నడుస్తున్నది చేతనైనంత వరకు చేస్తాను.

పద్మజ  :— మహా మహోపాధ్యాయ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి అనుయాయులుగా వారి ఆలోచనలు భక్తి మార్గాన నడిచే వారికి ఎలా దోహదపడతాయంటారు?
లక్ష్మీకాంత రావు:– కొందరు కారణ జన్ములు ఉంటారు . కేవలం ఏ కార్యక్రమం కోసం వాళ్ళు జన్మిస్తారో ఆ కార్యక్రమానికి అంకితమైపోతారు. మహా మహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారు భక్తి ఉద్యమానికి జన్మించారేమో? అనిపిస్తుంది.  కారణభూతులైన వారు తెలియని వారు లేరు. ముఖ్యంగా వరంగల్ లో మాత్రం వారి సేవలు అమోఘం! వారు  కృష్ణాజిల్లా మోటుపల్లిలో జన్మించి, ఆయన విద్యాభ్యాసం కోసం సీతారాం బాగ్ సంస్కృత పాఠశాలలో చదువుకొని, అక్కడి నుండి వరంగల్ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. వారి మేథా సంపత్తి చాలా పెద్దది. ఏకసంథాగ్రాహి! ఏదైనా విషయం వింటే ఎన్ని సంవత్సరాలైనా దాన్ని ఉటంకించే  (కోట్) వారు. అందుకే వారికి చదివిన కావ్యాలు కానీ ఉపనిషత్తులు కానీ కంఠతా ఉండేవి. వారు చాలా పుస్తకాలు రాసారు. సంస్కృత వ్యాకరణ మీద మంచి పట్టు ఉండేది. రచన విధానం బాగుండేది. వారు దేన్ని కోరకపోయేవారు. డబ్బు విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారు. తన పెన్షన్ మీద వచ్చే ఆదాయంతోనే నిరాడంబరంగా జీవితాన్ని గడిపేవారు. ఎవరు ఇచ్చినా తీసుకోక *అపరి గ్రహం* అనేది వ్రతంగా ఆచరించేవారు. ఎవరైనా కానుకగా సమర్పిస్తే దాని తిరిగి ఏ దేవాలయానికో సమర్పించేవారు. వారి జన్మభూమిలో దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసేవారు. అలా పుట్టిన ఊరిని కానీ, తను ఉద్యోగ నిర్వహణలో గడిపిన స్థలాన్ని కానీ మరిచిపోలేదు!  
       ఎన్నో గ్రంథాలు రాసి-ముద్రించారు. ఆచార్యులు అంటేనే ఆచరించి చూపేవారు అని వ్యుత్ప్యర్థం కదా! ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేసేవారు. అంతేకానీ ఒకటి చెప్పి, మరొకటి చేయకపోయేవారు. అందుకే అందరూ వారిని గౌరవించారు. వారి ఆశయాలు! సాధారణ జీవితం గడపడం, ఎవరి నుండి ఏమి ఆశించకపోవడం. మానవుడికి ఉపయోగ పడే రామాయణ, భారత, భాగవతాలు , ఉపనిషత్తులు మొదలైనవి 360 రోజులు అధ్యయనం చేస్తూ ఉంటే మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుందని… నిత్య పారాయణ చేయమని చెప్పేవారు. అలాగే వాటి అర్ధాలు తెలుసుకొని ఆచరించమనే వారు.  ముఖ్యంగా వారికి ద్రవిడ ప్రబంధాల మీద మంచి పాండిత్యం ఉంది. అద్భుతమైన వ్యాఖ్యానాలు చేసేవారు, ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. సమాజం క్రమశిక్షణతో సక్రమంగా నడవాలంటే ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు భూమి మీది అవతరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

పద్మజ:— నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో  పత్రికల పాత్ర ఎలా ఉండాలి? మీరు పత్రికల అభివృద్ధికి ఏమైనా సూచనలు చేస్తారా?
జ. మయూఖ పత్రిక కొండపల్లి నీహారిణి నడిపిస్తున్నదంటే  చాలా సంతోషంగా ఉంది. ఏదైనా విన్నదానికంటే చూసినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే దృశ్య రూపాలకు ఉన్న ప్రాధాన్యత మరో దానికి అంత ఉండదు. వెనుకటి రోజుల్లో కూడా నాటకాలు , ఆ తర్వాత సినిమాలు, ఇప్పుడు టీవీలు వచ్చాయి. ఏవైనా దృశ్యరూపకంగా మన కళ్ళకు ప్రత్యక్ష రూపంగా కనపడుతున్నాయి. వీటిని చిత్రాలు అంటాం కదా! కానీ సజీవంగా మనిషి ఎదురుగా నిలబడి సంభాషణలు చెబుతుంటే… ఆ ఆనందమే వేరు.
      ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్పినప్పుడు ఏ ప్రభావం ఉంటుందో అటువంటి ప్రభావం విన్నప్పుడు ఉండదు! అయితే ఆ ప్రత్యక్షమైన ప్రభావం పడడానికి ఉపయోగంగా ఉండేవి మొట్టమొదటివి దృశ్యరూపకాలు. వాటిలో చెప్పదలుచుకునే విషయాన్ని పాత్రల ద్వారా ప్రజలకు అందించడం అనేది చాలా ప్రధానమైనది. ప్రజల్లో మార్పు వస్తుందా? రాదా? అనేది కాకుండా విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి! ఎంత మంది దాన్ని ఆలోచిస్తారు? ఆచరిస్తారు? అనేది తర్వాత విషయం.
    సమాజంలోని సమస్యలు కానీ, సంస్కృతిని గానీ, సాహితీ ప్రక్రియలుగాని ఒకరి ద్వారా ఒకరికి తరువాతి తరాలకు వస్తుంటేనే అవి నిలిచి ఉంటాయి.వాటిని  నిలుపుకోవడానికి ఆ క్రమంలో భాగంగా పెద్దలు మనకి ఇచ్చారు. మనం తర్వాత తరాలకు అందించాలి! అది మన బాధ్యత! ఆ సంస్కృతిని అందించాలంటే మంచి నాటకాలు బాగా ఉపయోగపడతాయి. సినిమాలు, సీరియళ్ళు ఏవో కొన్ని తప్ప కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూసేలా లేవు! వాటి నిండా మోసాలు, కుట్రలు, పగలు, ప్రతీకారాలు, ఇలాంటివే ఉంటున్నాయి.
    మంచి చెప్పేవి నాటకాలే కాబట్టి నాటకాలను ప్రోత్సహించాల్సిందీ పత్రికలే! ఎక్కడైనా ఒక నాటక ప్రదర్శన జరిగినప్పుడు ఆ నాటక విశేషాలు, అవి ప్రదర్శించే తేదీలు, సమయమే, కాకుండా సంక్షిప్తంగా నటీనటుల నటన గురించి, వాటి సారాంశాలు తెలిపితే ప్రజలకు తెలుస్తుంది. నాటకానికి ఇంత ప్రాధాన్యత ఉందా? అని అనుకుంటారు…. ఈ తరానికి నాటకాల గురించి ఎక్కువగా తెలియదు! పాఠశాల వార్షికోత్సవాలలోను, జాతీయ పండగల సందర్భంగానూ ఏవో డాన్సులు చేస్తున్నారు తప్ప, నాటకాలు వేయించడంలేదు! వాటిని వేయించాలంటే చాలా శ్రమతో కూడుకున్నది, కాబట్టి ఆ జోలికి ఎవరూ ఆ దిశకు పోవడం లేదు!

   అలాంటప్పుడే పత్రికలకు నాటకాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది!  వాటి ద్వారా ప్రజలకు అభిరుచి కలిగించాలి .ఏది మంచి? ఏది చెడు? అని చెప్పగలిగేవి పత్రికలు మాత్రమే! నాటకాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది… అలాగే పత్రికలది కూడా!
    మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక నిర్వహిస్తున్నటువంటి కొండపల్లి నీహారిణి గారు చాలా శ్రమ తీసుకొని, బహుముఖ ప్రజ్ఞాశాలులైన వారిని లేదా ఇలా ఒక ప్రత్యేకత ఉన్నవారి పరిచయం చేస్తూ,కార్యక్రమాలు నడుపుతూ, ఇటువంటి సాహిత్య పరంగా కృషి చేస్తున్న వారి కృషిని అభినందిస్తూ… ఇలా పత్రికలు సాహిత్యానికి, సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 
           ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా *కావ్యేషు నాటకం రమ్యం* అన్న నానుడిని అక్షరాలా ఆచరిస్తూ… పరిషత్తులను కాపాడుకుంటూ.. వేదికలను సద్వినియోగం చేస్తూ…. నాటక రంగానికి విశేష కృషి చేసిన వనం లక్ష్మీకాంతరావు గారి సేవలు అమోఘం. ఈ ముఖాముఖిలో పత్రిక ల మధ్య-ప్రజల మధ్య మంచి సయోధ్య ఉన్నవి పరిచయ వ్యాసాలు, శీర్షికలుండడం ఎంత ముఖ్యమో ? వాటి గురించి వివరించి, మంచివి సేకరించి, వాటిద్వారా పాఠకులకు ఆయా రంగాలమీద అభిరుచి కలిగించడం అంతే ముఖ్యమని, సాహితీ ప్రియులను ఎప్పటికప్పుడు భాషాభిమానులను తయారు చెయడం అంతే ముఖ్యమనిచెప్పి, తమ విలువైన సమయాన్ని నాటకరంగ ఆవశ్యకత, దాన్ని నిలబెట్టే దిశగా  సాగిన వారి కృషిని, అందులోని సాధక బాధకాలను వివరించి, ముప్పేటలుగా సాగుతున్న వారి జీవన విధానం, అభిరుచి, అభ్యాసానికి అబ్బుర పడుతూ… ఇక ముందు కూడా వారనుకున్న విధంగా సాగాలని ఆకాంక్షిస్తూ….
          ఈ సంవత్సర ఫిబ్రవరి నెలలో కాళోజీ కళాక్షేత్రం లో వారి అభిరుచికి తార్కాణంగా 3 రోజుల పాటు తెలుగు భాషాహ్వాన నాటక పోటీలు 23 – నుండి 26 వరకు జరిపించారు. నేను ప్రత్యక్షంగా చూసాను. మానవ సంబంధాలను పటిష్ట పరిచే *స్వేచ్ఛ* *ఉక్కు సంకెళ్ళు* , *చిగురుమేఘం* లాంటి జీవితాన్ని ప్రతిబింబించే నాటికలలో సామాజిక సమస్యలు- పరిష్కారాలు చెప్తూ… యువతరానికి మేలుకొలుపుగా ఉండేలా  అద్భుతమైన నాటికలు ప్రదర్శింపబడ్డాయి.
            ఇలా సహృదయ సాహిత్య-సాంస్కృతిక సంస్థ వారి సేవలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. నాటక ప్రదర్శనలు చేయించిన నాటక ప్రియులు, రంగస్థల కళాకారులు, సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తుసాక్షి  వనం లక్ష్మీకాంత రావు గారు. వారిని అభినందిస్తూ- ధన్యవాదాలు తెలుపుతూ..
          ఈ కళలలను మనం గౌరవించి కాపాడుకోవాలి! ఇందులో పత్రికలతో పాటు- తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి! పిల్లలకు కళల పట్ల అభిరుచి ఏర్పడేలా చూడాలి!             

You may also like

7 comments

Brett1330 September 23, 2025 - 7:30 am Reply
Lola4919 September 23, 2025 - 3:07 pm Reply
Jaime1672 September 23, 2025 - 7:27 pm Reply
Leon3105 September 23, 2025 - 11:38 pm Reply
Shelby1462 September 24, 2025 - 1:47 am Reply
Kyra2582 September 24, 2025 - 3:01 pm Reply

Leave a Reply to Brett1330 Cancel Reply