సుందరవనం అనే అడవిలో ఒకసారి పక్షుల సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో ఒక నెమలి చాలా అద్భుతంగా నాట్యం చేసింది . ఆ నాట్యాన్ని చూసిన పక్షులు అన్నీ దానిని అభినందిస్తూ కరతాళ ధ్వనులను చేశాయి. కానీ ఒక్క కాకి మాత్రం కరతాళ ధ్వనులను చేయలేదు . అది చూసిన దాని ప్రక్కనున్న పక్షులు ” ఓ కాకీ! నీ బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. ఆ నెమలి అంత అద్భుతంగా నాట్యాన్ని చేస్తే నీవు కరతాళ ధ్వనులను కూడా చేయలేదు. నీకు ఇదేం బుద్ధి? నీకు కళాభిమానం కొంచెం కూడా లేదు. నీకు నాట్యం గురించి ఏం తెలుసు గనుక ? నీవు దానివలే నాట్యాన్ని చేయగలవా !”అని ప్రశ్నించాయి.
అప్పుడు ఆ కాకి” నా దృష్టిలో అది నాట్యాన్ని చక్కగా చేయలేదు. అందుకే నేను దాన్ని అభినందించలేదు . ఆ సంగతి నాకు తెలుసు. అది తను చేసే నాట్యంపై ఈరోజు ఏకాగ్రతను ఉంచలేదు. దానిలో చాలా ప్రతిభా పాటవాలు ఉన్నాయి. కానీ వాటిని ఈరోజు మీకు చూపలేదు. నేను ఎలాంటిదాన్నో దానినే మీరు అడగండి. దానికి లేని కోపం మీకెందుకు ?”అని అంది.
అది విన్న నెమలి ” ఔను. ఆ కాకి అన్నది నిజమే . మీరు తొందరపడ్డారు. దాన్ని ఏమీ అనకండి . నేనే పరధ్యానం వల్ల నాట్యం చేసేటప్పుడు కొంత తడబాటు పడ్డాను. దానిని ఇది గుర్తించింది. ఇది నా శ్రేయోభిలాషి . అదే నన్ను ఇటువంటి ఉన్నత స్థాయికి తెచ్చింది. ఈ కాకి చిన్నప్పుడు నా ఆసక్తి గమనించి నన్ను ఒక గొప్ప గురువు వద్దకు తీసుకుని వెళ్లి నాకు ఈ నాట్యాన్ని నేర్పించింది . దానికి నేను ఏమిచ్చినా దాని రుణం తీరదు. అది పైకి అలా ప్రవర్తించినా నేనంటే దానికి వల్లమాలిన అభిమానం . ఎల్లప్పుడూ అది నా బాగోగులు కోరుకుంటుంది. దానికి నాట్యం చేయరాకున్నా నాట్య రీతులన్నీ బాగా తెలుసు. అది ఎంతో మంది గొప్పవాళ్ల నాట్యాలని చూసి చాలా విషయాలను తెలుసుకుంది. నన్ను కూడా గొప్పదానిగా చేయాలన్నదే దాని ధ్యేయం “అని అంది. ఆ మాటలకు పక్షులు ఆశ్చర్యపోయి కాకిని మన్నించమన్నాయి. అందుకే పిల్లలూ! అసలు విషయం తెలుసుకోకుండా తొందరపాటు తో ఇతరులను నిందించరాదు.
తొందరపాటు
previous post