Aruna Dhulipala
– బి.ఎస్. రాములు
ప్రసిద్ధ కథకులు, నవలాకారులు, సాహిత్య విమర్శకులు, సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు గారి 75 వ జన్మదిన వజ్రోత్సవ సందర్భంగా ‘మయూఖ’ ప్రతినిధి బి.ఎస్.రాములుగారితో ప్రత్యేక ముఖాముఖి
నమస్కారం సార్!
1. సార్ ! మీ గురించి ఎన్నో రచనలు వ్యాసాలు , పరిశోధనలు వెలువడ్డాయి.
1998 ఆగస్టులో యాభయ్యవ జన్మదిన స్వర్ణోత్సవం సందర్భంగా “ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు” అనే సావనీర్ ను ఆహ్వాన సంఘం వెలువరించి 25 ఏళ్లయింది. ఈ 25 ఏళ్లలో మరెన్నో అనుభవాలు సంతరించుకున్నారు. ఎన్నో రచనలు చేసారు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమికలు అందించారు. తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు. 2003 నుండి ఉస్మానియా యూనివర్సిటీ పక్కన విశాల సాహిత్య అకాడెమీ కార్యాలయం నిర్వహించారు. ఒక రచయిత, ఇలా తెలంగాణ ఉద్యమానికి, రచయితలకు , ఉద్యమ కారులకు ఒక కేంద్రంగా , థింక్ టాంకుగా, ప్రచురణల కేంద్రంగా వందలాది ఉద్యమ కారులకు అడ్డాగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 2007 లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాలు రూపొందించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఒకసారి, గూడ అంజయ్య, పాశం యాదగిరి, గద్దర్ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యతో ఒకసారి, కెసిఆర్ టిఆర్ఎస్ తో మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం వెనక మీరే వ్యూహ కర్తగా నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ప్రతి నెలా ఒక పుస్తకం ప్రచురిస్తానని ప్రకటించి ఆ పుస్తకాలను ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాల్లో పంచారు. టిఆర్ ఎస్. తెలంగాణ భవన్ తో పాటు ప్రతి సభలో పుస్తకాలు, కరపత్రాలు పంచడం ద్వారా విశేష కృషి చేసారు. అదే సమయంలో అంతకన్నా ముందు 1992నుండి దరకమే ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల గొంతుకగా సిద్ధాంతకర్తగా చేస్తున్న కృషిని అంతే ప్రాధాన్యతతో కొనసాగించారు. ఎన్నో రచనలు వెలువరించారు. ప్రసంగాలు చేసారు. మరోవైపు రచయితగా తెలంగాణ ఉద్యమం గురించి బీసీ ఎస్సీ ఎస్టీల జీవితం సంస్కృతి గురించి కథలు నవలలు రాసారు. కథా రచనకు కథకుడి పాఠాలు, స్వాతంత్య్రానంతరం 60 ఏళ్ల తాత్విక, సామాజిక పరిణామాలు వివరిస్తూ యువ రచయితలకు మార్గనిర్దేశం చేసారు.
1990 లో స్థాపించిన విశాల సాహితి అకాడెమీ ద్వారా 190 పుస్తకాలు ప్రచురించారు. అనేక సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేశారు. వందలాది రచయితలకు విశాలసాహితి పురస్కారాలను అందించారు. డా. సినారె, దాశరథి, ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలకపల్లి రవి, ఎస్వీ సత్యనారాయణ , రవ్వా శ్రీహరి, ఆచార్య కె. జయశంకర్ తదితరులు చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. కథా వర్క్ షాపులు నిర్వహించారు.
1996లో ‘ప్రవహించేపాట -ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు’ అనే సంకలనం ప్రచురించారు. 2004 లో విశాల సాహితి బీసీ ఎస్సీ ఎస్టీల పాటలు, సామాజిక చైతన్య పాటలు, సంకలనాలు వెలువరించారు. 1997 నుండి కరీంనగర్ జిల్లా కథలు నాలుగు సంపుటాలు వెలువరించి 2003లో ‘భారతీయ సాహిత్యం తెలుగు కథలు’ అనే గొప్ప సంకలనాన్ని ప్రచురించారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి రూప కల్పన తోపాటు, డబుల్ బెడ్ రూం పథకం, గురుకుల పాఠశాలల రూపకల్పనలో క్రియాశీల పాత్ర నిర్వహించారు. కుటుంబాన్ని కూడా తీర్చిదిద్దారు. నలుగురు పిల్లలు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక బీసీ కమిషన్ తొలి చైర్మన్ గా చరిత్ర సృష్టించారు. ఇన్ని పనులు ఏకకాలంలో ఎలా చేయగలిగారు? అసలు మీ సామాజిక జీవితం, రచనా జీవితం ఎలా ప్రారంభం అయిందో యువతరానికి తెలపాలని కోరుతున్నాను.
బి ఎస్ రాములు: మా చిన్నప్పుడు అమ్మ అనేక కథలు చెప్పేది. నిద్ర పోవడానికి, ఆకలి మరిచి పోవడానికి కథలు చెప్పేది. జానపద కళాకారులు శారదకాండ్రు, బుర్ర కథ వాళ్లు ఇంటింటికి తిరిగి కథలు చెప్పేవారు. అలా చిన్నప్పటినుండి కథలంటే చాలా ఇష్టం. అమ్మ చెప్పిన కథలను నాకు తోచినట్టు మరికొంత కల్పించి నా బాల్య స్నేహితులకు చెప్పేవాడిని. అలా కథలు వినడం, కథలు చెప్పడం ఏకకాలంలో ప్రారంభమైంది.

మా సామాజిక జీవితంతో పాఠశాల జీవితంతో మొదలైంది. మా కాలంలో మా పాఠశాల జీవితం ఒక సోషలిస్టు సమాజ నిర్మాణంలో భాగంగా సాగింది. అందరం ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకునే వాళ్లు. ఎవరు బాగా మార్కులు తెచ్చుకుంటారో వారికే గౌరవం. కులాలు, ధనవంతులు, తహసీల్దార్ కొడుకు అందరం, అన్ని కులాలవారు, ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు కునే వాళ్లం సమానమే. ఎవరు బాగా మార్కులు తెచ్చుకుంటారో, ఎవరు బాగా ఆటలు ఆడతారో వాళ్లకు గౌరవం. అది తొలి సోషలిస్టు సమాజ నిర్మాణం. మా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ముద్దు రామకిష్టయ్యగారు ప్రపంచ దేశాలు తిరిగి చదువుకున్న అనుభవంతో నూతన పద్ధతులలో మా జగిత్యాల పాఠశాల విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో మహోన్నత పాత్ర నిర్వహించారు. ఆ కాలంలో అనగా 1960 లో మా మల్టీ పర్పస్ హైస్కూలులో 2 వేల మంది విద్యార్థులుండే వారు. తెలంగాణలోనే అత్యధిక విద్యార్థులున్న పాఠశాల. శ్రమపట్ల గౌరవం పెంచడానికి స్వయంగా సంపాదించుకోవడం నేర్పడానికి స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తూ, కంకర కొట్టి సంపాదించడానికి ఏర్పాటు చేశారు. కొత్త కొత్త ఆటలు రూపొందించారు. ప్రతిసంవత్సరం విద్యార్థులకు ఆలిండియా టూర్ విజ్ఞాన యాత్రలు నిర్వహించారు. ఆయన జీవితాన్ని, జీతాన్ని విద్యార్థుల కోసమే ఖర్చు పెట్టేవారు. అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో మా చదువులు, వ్యక్తి వికాసం సాగినాయి. పాఠశాల జీవితమే మా తొలి సామాజిక జీవితం.
2. మీ జననం, బాల్యం గురించి చెప్పండి.
జ :- నేను 23 ఆగస్ట్, 1949 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చేనేత కుటుంబంలో జన్మించాను. మా నాన్న మిట్టపల్లి నారాయణ, మా అమ్మ బేతి లక్ష్మిరాజు. ఆ కాలంలో మేము పేదలం కాము. మా నాన్న చేనేత కార్మికుడు. బొంబాయిలో మిల్లు కార్మికుడుగా పనిచేశారు. కుటుంబాన్ని తీసుకుపోలేక జగిత్యాలకు వచ్చారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఆహారం పడక నాన్నకు హెర్నియా వచ్చింది. అప్పుడు వైద్య సదుపాయాలు లేవు. 1955 లో మా నాన్న చనిపోయే నాటికి నాకు ఆరేళ్ళ వయస్సు. మా తమ్ముడు పాలు కూడా మరవలేదు. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను నడిపోన్ని.
మా అమ్మ బీడీలు చేసి మమ్మల్ని పెంచి పోషించింది. మా తాతయ్యకు మా నాన్న మేనల్లుడు. మా చుట్టూ మా మేనమామ, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య ఉండడం వల్ల మా అమ్మకు ఒంటరితనం తెలియదు. ఆరోజుల్లో పిల్లలను కొడితేనే చదువు వస్తుందనే దుర్భావన ఉండేది. మా అన్న దెబ్బల బాధ తట్టుకోలేక చదువు మానేసిండు. మా అమ్మ కిరాణా షాపులో జీతం ఉంచింది. తొమ్మిదేండ్ల వయసు పిల్లవాడు కావడంవల్ల షాపులో ఉండలేక పోయాడు. ఇంట్లో అందరూ తిడుతుంటే, కొడుతుంటే దేవుని కోసం ముడుపు కట్టిన గురిగి పగులగొట్టి ఆ డబ్బులతో బొంబాయి పారిపోయాడు. మా ప్రాంతం నుండి చాలామంది బొంబాయికి వెళ్ళి పనిచేసేవాళ్ళు.
3. ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉండగా మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది?
జ :- నేను చిన్నప్పటి నుండీ చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండేవాడిని. మా అన్న రాజ నర్సయ్య ఉపాధ్యాయుల పట్ల ఉన్న భయంతో నన్ను కూడా బడికి వెళ్ళొద్దనేవాడు. నేను బాలశిక్ష సాతాని అయ్యోరు పంతులు దగ్గర చదువుకున్నాను. ప్రాథమిక విద్య మర్కజి ప్రైమరీ స్కూల్, జగిత్యాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాను. దాన్ని సెంట్రల్ ప్రైమరీ స్కూల్ అంటారు. తరువాత మల్టీ పర్పస్ హైస్కూల్ లో 6వ తరగతులు చేరాను. ఆ పాఠశాలలో 12వ తరగతి వరకు ఉండేది. 6వ తరగతి నుండి మల్టీపర్పస్ హైస్కూల్ లో చదివాను. 1967 మార్చిలో 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రథమశ్రేణిలో పాసయ్యాను. 9వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినవారిని 10వ తరగతి ఆప్షనల్స్ లో ఎమ్ పి సి, బి పి సి గ్రూపులో చేర్చేవారు. తక్కువ మార్కులు వచ్చినవారిని ఆర్ట్స్ గ్రూపులో పెట్టేవారు. నేను ల్యాబ్ ఫీజు 15 రూపాయలు కట్టలేదు. అమ్మనడిగితే చదువు బంద్ చేయుమన్నది. దాంతో సిఇసి తీసుకున్నాను. 7 సంవత్సరాల కాలంలో నేనొక్కడినే ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను.
4. మీ ఉద్యోగజీవితం ఎలా ప్రారంభమైంది?
జ :- అప్పటి రోజుల్లో ఫస్ట్ క్లాస్ లో పాసయిన వాళ్ళకు. పోస్టాఫీసులో ఉద్యోగం వచ్చేది. అందుకని డిగ్రీ చేయలేదు. నాకున్న మార్కులను బట్టి ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో జగిత్యాలలో టీచర్ ట్రైనింగ్ ఉన్నప్పటికీ జాయిన్ కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో టీచర్లకు 96 రూపాయల జీతం ఉంటే పోస్ట్ ఆఫీసులో 240 రూపాయలు ఉండేది. పోస్టల్ ఉద్యోగం రాలేదు. మూడేళ్లు చూసి ధర్మపురిలో ఈవెనింగ్ కాలేజీలో జాయినయ్యాను. పొద్దుటి సమయమంతా న్యూస్ పేపర్ ఏజెంటుగా ఉంటూ, బీడీల కంపెనీలో పని చేసుకుంటూ చదువుకున్నాను. 1970-74 మధ్య ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో డి ఓ ఎల్, బి ఓ ఎల్ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల వల్ల నాలుగేళ్ళ కోర్సు అయిదేళ్లు కొనసాగింది. 1973లో ఆదిలాబాద్ జిల్లా డిఎస్సీలో డి ఓ ఎల్ అర్హతతో తెలుగు పండిట్ పోస్టుకు ఎంపికయ్యాను. పోస్టింగ్ ఆర్డర్ రాలేదు. పైరవీ చేసి డబ్బులు ఇస్తే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారని అన్నారు. సరేనని ఒకరికి డబ్బులు ఇచ్చాను. ఆయన ఆ ప్రయత్నం చేశాడో లేదో కానీ నాకు ఉద్యోగం రాలేదు. ఆ సెలక్షన్ లెటర్ చూసి నేను పనిచేస్తున్న బీడీ కంపెనీ యజమానురాలు మిట్టపల్లి ఈశ్వరమ్మ మా అక్క కూతురు శ్యామల ఉందని చెప్పి నన్ను ఒప్పించారు. 1973 మే 17వ తేదీన శ్యామలతో పైడిమడుగు లలో పెండ్లి జరిగింది. ఎమర్జెన్సీ విధించిన తరువాత 5 నెలలకు 1975 డిసెంబర్ లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎలుగందలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగం వచ్చింది.
5. ఆర్.ఎస్.ఎస్ పట్ల మీరు ఆకర్షితులవడానికి ప్రేరణ ఏమిటి?
జ :- మా ఇంటిముందే ఆర్ ఎస్ ఎస్ శాఖ నడిచేది. 9 వ తరగతి నుండి శాఖకు వెళ్ళేవాళ్ళం. చెంచు లక్ష్మయ్య, శ్రీధర్ జీ, కళ్ళెపు విద్యాసాగర్ జీ మొదలైన వాళ్ళు ఇతర ప్రాంతాల నుండి వచ్చి శాఖను నడుపుతుండేవారు. మా ఇంటి చుట్టూ మా క్లాస్ మేట్స్, బ్యాచ్ మేట్స్ పల్లెటూళ్ళ నుండి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ కిరాయికి ఉండేవాళ్ళు. అందరమూ ఆ శాఖకు వెళ్ళేవాళ్ళం. 1967 నుండి 1970 దాకా నేనే ముఖ్య శిక్షక్ గా శాఖను నడిపేవాడిని. ధర్మపురికి పోయినాక 1972 దాకా అక్కడ కూడా శాఖను నడిపేవాడిని. మేము మతం కన్నా దేశభక్తి గురించి ఆకర్షితులమైనాము.
6. మీ దృష్టి సాహిత్యం వైపు ఎప్పుడు మళ్ళింది?
జ :- నాకు చిన్నప్పటి నుండి సాహిత్యం పట్ల ఆసక్తి. మా ఇంటి సమీపంలోనే శాఖా గ్రంథాలయానికి వెళ్లి పత్రికలు, పుస్తకాలు తెగ చదివేవాళ్లం. 9వ తరగతి నుండి కథలు, పాటలు, పద్యాలు రాసేవాణ్ణి. భాస్కర్ రెడ్డి సార్, కమలాకర్ రావు సార్ బాగా ప్రోత్సహించారు. అట్లా స్కూల్లో వ్యాసరచన పోటీల్లో, ఉపన్యాస పోటీల్లో ముందుండేవాడిని. అనేక బహుమతులు గెలుచుకునే వాడిని. 9వ తరగతి నుండి నేను మాతోటి విద్యార్థులకు త్రైమాసిక, షాన్మాదిక, వార్షిక పరీక్షల జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసేవాడిని. 300 మంది విద్యార్థులలో ఆ అవకాశం నాకు వచ్చింది. తద్వారా నాకు ఎంతో అవగాహన పెరిగి, తోటి విద్యార్థుల స్థాయి ఏమిటో తెలిసేది.
నేను జగిత్యాలలో డిగ్రీ చదవకపోయినా దివాకర్ల వేంకటావధాని గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, సి. నారాయణరెడ్డి గారు వచ్చినపుడు నా స్నేహితులతో పాటు కాలేజీకి వెళ్ళి వాళ్ళ ప్రసంగాలు వినేవాడిని. ధర్మపురిలో కూడా మేము కవిసమ్మేళనాలు జరిపే వాళ్ళం. ముత్యాల విశ్వనాథం, జయధీర్ తిరుమల రావు, మంచాల గంగాధర్, సంగనభట్ల నర్సయ్య ఇట్లా స్థానికులు ఎంతోమంది 20, 25 మంది దాకా కవిసమ్మేళనంలో పాల్గొనేవాళ్ళం. ప్రసంగాలు, ఉపన్యాసాలు నిర్వహించుకునే వాళ్ళం. కార్తీకపౌర్ణమి గోదావరీ తీరాన ఇసుక తిన్నెల్లో ఆటలు పాటలు ఉండేవి. నిరుద్యోగం, నిరాశ, ఇంకోవైపు ఉత్సాహం. నేను దిన, వార, మాస పత్రికలతో పాటు యువభారతి ప్రచురణలను, ఎమెస్కో ప్రచురణలన్నింటినీ తెప్పించేవాడిని. నేను న్యూస్ పేపర్ ఏజెంటును కాబట్టి నాలుగు పుస్తకాలు తెప్పిస్తే ఒక పుస్తకం కమిషన్ గా మిగిలేది. అట్లా నా గ్రంథాలయం తయారైంది. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ పుస్తకాలు మొదలైన ఎన్నో పుస్తకాలు చదివాను. సాహిత్యమంటే ఇదీ అదీ అని కాకుండా అన్ని పుస్తకాలు చదివేవాడిని.
7. మీరు నిర్వహించిన బాధ్యతల గురించి చెప్పండి.
జ :- నేను ఏపని చేసినా అంకితభావంతో చేశాను. అయిదేళ్ల పాటు 1972 దాకా ఆర్ ఎస్ ఎస్ ముఖ్య శిక్షక్ గా పనిచేసి 50 సంవత్సరాలు గడిచినా ఆర్ ఎస్ ఎస్ గురువులు గానీ, నా నుండి శిక్షణ పొందినవారు గానీ, సహచరులు గానీ ఇప్పటికీ స్నేహంగా ఉంటారు.
ఉద్యోగం వచ్చాక ఉద్యోగ సంఘాలను నిర్మాణం చేశాను. ‘సంఘమిత్ర’ అనే పేరుతో పత్రిక నిర్వహించాను. హాస్టల్ వార్డెన్ గా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 20 సూత్రాల పథకం కింద 25 మంది ఉండే హాస్టళ్లలో 100 సీట్లకు పెంచుమని ఆదేశాలు జారీ చేసింది. సైకిల్ మీద ఒక స్టాఫ్ ని తీసుకొని మానేరు డ్యామ్ కి అటు ఇటు ఉన్న గ్రామాలన్నీ తిరిగి 100 మందిని చేర్పించాను. సుమారు 40,50 గ్రామాలు తిరిగాము. దానివల్ల నాకు దళిత వాడల్లో వాళ్ళ జీవితాల గురించి తెలిసివచ్చింది. మానేరు డ్యామ్ కడుతున్నందువల్ల బలి ఇస్తారని ప్రచారం చేశారు. హాస్టళ్లలో పురుగుల అన్నం పెడతారనే అపవాదును తొలగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక విద్యార్థి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. అతడే ఘంటా చక్రపాణి. అట్లా ఎంతోమందిని చదువు వైపు మరల్చాను. అప్పుడే ‘గ్రామాలకు తరలిరండి’ అనే నినాదంతో విద్యార్థులు ఉద్యమం చేశారు. విప్లవోద్యమాలు ప్రారంభం అయినాయి.
8. మీ మొట్టమొదటి కథ ఏది?
జ:- నేను 1964 నుండి అనేక కవితలు, పాటలు బాల సాహిత్యగేయాలు, పత్రికలకు ఉత్తరాలు రాసేవాడిని. ఆనాటి పత్రికల్లో కొన్ని అచ్చు అయ్యాయి. స్కూల్ మ్యాగజైన్ ‘స్రవంతి’లో 1966లో ప్రకృతి వర్ణన గురించిన పద్యాలు వచ్చాయి. 1968 జనవరిలో బాలమిత్రలో నేను రాసిన కథ ‘జగిత్యాల కథ’ అనే పేరుతో వచ్చింది. అంతకుముందే డిటెక్టివ్ నవలలు, కథలు చదువుతూ ఉండడం వల్ల రాయడం అలవాటయింది. ప్రత్యేకంగా యువతరాన్ని ప్రోత్సహించే వాతావరణం అప్పటికి పత్రికల్లో లేదు. 1979 లో విరసంలో చేరాక కథలు రాసేవాళ్ళు తక్కువున్నారని కథలు రాయాలనుకొని రాయడం మొదలుపెట్టాను. పాటలు, వచన కవిత్వం తగ్గించాను. అట్లా 1979 లో ఆధునిక కథలు రాయడం మొదలైంది. బాలమిత్రలో కథ వచ్చిన తరువాత తొమ్మిదేళ్లకు ‘ఇంటర్వ్యూ’ అనే పేరుతో పత్రికల్లో కథ అచ్చయింది. దాన్నే ‘బతుకు నేర్పిన పాఠం’ గా పుస్తకంలో వేశాను. ఈ కథను విహారి గారు అత్యుత్తమ కథగా పేర్కొన్నారు. కాకతీయ కెనాల్ పనుల్లో చేయిస్తున్న వెట్టిచాకిరీ గురించి రాసిన ‘తిరుగుబాటు కథ’ సృజనలో వచ్చింది. అట్లా విప్లవకథలు రాశాను. ఆ తర్వాత 1990 నుండి బిసి, ఎస్సీ, ఎస్టీల కథలు నవలలు రాస్తూ వస్తున్నాను. 1982లో ‘బతుకు పోరు’ నవల వెలువడింది. అయిదు ముద్రణలు వెలువడ్డాయి. దానిపై 40 వ్యాసాలు, రెండు ఎమ్ ఫిల్స్ ప్రచురించబడ్డాయి. ఈ నవలతో నన్ను ఆంధ్ర గోర్కీ, ఆంధ్ర లూసన్ అని ప్రశంసించారు. 2013లో చూపు నవల 2017లో ‘జీవనయానం’ నవల వెలువడ్డాయి. 175 కథలు రాసినప్పటికీ కొన్ని మాత్రమే దొరికాయి. కొన్ని అచ్చు కాకుండానే పోయాయి. 15 కథల సంపుటాలు అచ్చు వేశాను. 3 కథల సంపుటాలు ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. ‘బతుకుపోరు’ నవల ఇంగ్లీషులో వచ్చింది. నేను రాసిన 8 నవలల్లో 3 మాత్రమే అచ్చయ్యాయి. కొన్ని పోగొట్టుకున్నాను.
9. తెలుగు సాహిత్యంలో ఇన్ని ప్రక్రియల్లో, తాత్విక రంగంలో దృష్టి సారించడానికి కారణం ఏదైనా ఉందా?
జ :- ఉంది. చరిత్ర పరిణామమే ఆ కారణం. అది చరిత్ర ఇచ్చిన అవకాశం, అనివార్యత.
10. తెలంగాణ సాహిత్యకారునిగా మీరు ఎదుర్కున్న వివక్షతలేమిటి?
జ :- చాలా వివక్షతలు ఎదుర్కొన్నాము. తెలుగు వాళ్లంతా ఒకటి తెలుగు భాష ఒకటి అని 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటినుండి మా కష్టాలు మొదలయ్యాయి. భాష ఒకటే అన్నవాళ్ళు మా భాష అర్థం కావడం లేదన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు మాసపత్రిక, స్రవంతి, గోలకొండ పత్రికలలో ఆంధ్ర ప్రాంత రచనలు కూడా అచ్చు వేసేవారు. ఎప్పుడైతే ఆంధ్రప్రాంతం నుండి సంపాదకులు, ఉప సంపాదకులు, సాహితీపరులు వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారో వాళ్లకు ఒక రకమైన గర్వం పెరిగి తెలంగాణ భాషను భాష కాదన్నారు. రాష్ట్రం ఏర్పడిన 4, 5 ఏళ్ళకే మన భాషను తెలంగి, బేడంగి అని అవహేళన చేయడం మొదలుపెట్టారు. తత్వశాస్త్రం పట్ల నాకు చిన్నప్పటి నుండి ఆసక్తి. మా నాన్నతో పాటు బొంబాయిలో బట్టలమిల్లు కార్మికునిగా పనిచేసిన మా మేనమామ ఇంట్లో గృహ గ్రంథాలయం ఉండేది. పురాణాలు, వైద్య గ్రంథాలు, ఉపనిషత్తులు మొదలైనవి తీసుకొని చదివేవాడిని. మా పెదనాన్న అచలతత్వంగా ప్రాచుర్యం పొందిన అద్వైత శాఖకు 50 ఏండ్ల పాటు గురువుగా కొనసాగారు. అయిదారుగురు స్నేహితులం పోటీపడి వందల వేల పుస్తకాలను చదివేవాళ్లం. డిటెక్టివ్ నవలలను కూడా తెగ చదివేవాళ్లం. రవీంద్రనాథ్ ఠాగూర్, మున్షీ ప్రేమ్ చంద్, శరత్ బాబు, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఉమర్ ఖయ్యామ్ తదితరుల రచనలను బాగా చదివేవాళ్లం. అలా కథలు, నవలలు, కవిత్వం, సాహిత్య విమర్శ , అర్థశాస్త్రాల మీద ఆసక్తి కలిగింది. చందమామ, బాలమిత్రల్లోని బాల సాహిత్యం మా వ్యక్తిత్వాలను తీర్చి దిద్దాయి. 10వ తరగతిలో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ చదువుకోవడం వల్ల ఈ శాస్త్రాలపై విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆసక్తి పెరిగింది. అలా సాహిత్యం, భావజాల పరిణామం ఎన్ని మలుపులు తిరిగిందో అన్ని మలుపుల్లోనూ వీటన్నిటి గురించి మారిన అవగాహనననుసరించి రాస్తూ వచ్చాను. అలా నా రచనలు, భావాలు, వైవిధ్యభరితంగా పరిణామం చెందుతూ వచ్చాయి.

9. మీ ‘కథలబడి’ పుస్తకాన్ని సాహిత్య అలంకార శాస్త్రంగా పేర్కొనడానికి కారణం ఏమిటి?
జ :- అలా పేరు పెట్టినందుకు డా. సి. నారాయణ రెడ్డి గారు, రావూరి భరద్వాజ గారు ఎంతగానో సంతోషించారు. సినారె గారు దాన్ని ఆవిష్కరించారు. రావూరి భరద్వాజ గారు ముందుమాట రాశారు. ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ప్రశంసలు పొందిన పుస్తకం ఇది. నేను డి ఓ ఎల్, బి ఓ ఎల్ పాఠ్యాంశాలుగా కావ్యాలంకార సంగ్రహం, ప్రతాపరుద్ర యశోభూషణం, ఆనంద వర్ధనుడు, భరతుడు, ధ్వని, రస, వక్రోక్తి సిద్ధాంతాలు చదువుకున్నాను. నవరసాలతో పాటు అనంతరసాలు, స్థాయి భావాలతో రససృష్టి గురించి అధ్యయనం చేశాను. ఆధునిక ప్రక్రియలలో వీటిని సాధించడం, సమర్థవంతంగా, ప్రతిభావంతంగా చిత్రించడం కోసం ‘కథలబడి’ సాహిత్య అలంకార గ్రంథం రాయడం జరిగింది.
విప్లవోద్యమంలో పనిచేసినప్పుడు కథలు ఎట్లా రాయాల్నో తెలిపి చాలా మందితో కథలు రాయించాను. 1984 నుండి 1990 వరకు పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తూ దేశమంతటా పర్యటన చేశాను. 1990 ఏప్రిల్ లో బహిరంగ జీవితంలోకి వచ్చాక బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీల సామాజిక అభివృద్ది కోసం భారత రాజ్యాంగ పరిధిలో కృషి చేయడం ప్రారంభించాను. అట్లా 1992లో “దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక” ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా రాష్ట్రమంతటా సభలు, సమావేశాలు నిర్వహించాం. యువతరాన్ని సాహిత్యకారులుగా తీర్చడానికి కథ, పాట, ప్రసంగం, వ్యాసరచన తదితర ప్రక్రియల్లో శిక్షణా తరగతులు నిర్వహించాం. శిక్షణా తరగతులకు ఒక పాఠ్య ప్రణాళిక ఉండాలని ‘కథలబడి’ రాయడం జరిగింది. అలాగే పాటల గురించి, పాట పుట్టుక గురించి రాయడం జరిగింది. వాటితో వందలాదిమంది యువకులు ఎదుగుతూ వచ్చారు. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, దేశ, భాష వివక్షతలను, అసమానతలను నిర్మూలించడానికి ‘దరకమే’ ఐక్య వేదిక సాహిత్య సామాజిక సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తుందని ప్రకటించాము. అప్పటిదాకా వచ్చిన కథలు వాటి శైలీ శిల్పం, కథా వస్తువుకు భిన్నంగా మాదైన కథా వస్తువు, శైలీ శిల్పం రూపొందించుకోవాల్సి వచ్చింది. అలా కథా ప్రారంభం, పాత్రలు, సంఘటనలు, కథ ముగింపు మొదలైనవన్నీ ఉత్పత్తి కులాలైన, సేవా కులాలైన శూద్ర, అతి శూద్రుల జీవితం, సంస్కృతి, భాష వారి ఆశలు చిత్రించడం, జీవితం పట్ల ఆశ, విశ్వాసం, ‘we can win’ అనే దృష్టి కోణాన్ని ఇవ్వడం అవసరం. అంతకుముందు సాహిత్యంలో వీరంతా బలిపశువులైనట్లు విషాదాలు, అణచివేత మాత్రమే చిత్రించేవారు. దాన్ని అధిగమించి జీవితాన్ని ఎట్లా గెలుచుకోవాలో చెప్పడం అవసరం. అందువల్ల దరకమే ఐక్య వేదిక ఏర్పడ్డాక మొత్తం సాహిత్యరంగంలో ఒక మార్పు మొదలయింది. అందుకు అలంకార శాస్త్రంగా ‘కథలబడి’ పాఠ్యగ్రంథంగా ఉపయోగపడింది.
10. మీ “గతి తర్క తత్వ దర్శన భూమిక’ రచన ప్రత్యేకత, విశిష్టత, దాని ప్రభావం గురించి తెల్పండి.
జ :- 1977 నుండి 1989 దాకా విప్లవోద్యమంలో పని చేశాను. అప్పుడు విరసంతో సహా మార్క్సిజమ్, లెనినిజం, మావో ఆలోచనా విధానాల గురించి చెప్పేవారు. ఆ ప్రభావంతో 1977-90 దాకా ఉద్యమంలో పని చేశాను. ప్రజల మధ్య పని చేస్తున్న క్రమంలో ప్రజల పట్ల నిర్బంధాలు పెరిగాయి. ఉద్యమం పెరుగుతున్నట్టు కనబడుతూ క్రమంగా కుదించుకు పోవడం జరిగింది. అఖిల భారత పర్యటనలో వరవరరావు, గద్దర్, సంజీవ్, డప్పు రమేశ్, డోలకిస్టు రాజుతో కలిసి 12 రాష్ట్రాలు పర్యటించాము. ఎందరో రచయితలు, కళాకారులు, సాహితీ వేత్తలు, ఉద్యమ కారులు, పౌరహక్కుల సంఘాల వాళ్ళు, జర్నలిస్టులు, పత్రికా సంపాదకులు, ప్రొఫెసర్లు ఎందరో కలిసారు. ప్రపంచ విప్లవోద్యమం గురించి, భారతీయ విప్లవోద్యమం గురించి వాటిలోని ఒడి దుడుకులను గురించి, ఎదురవుతున్న కష్ట నష్టాలు, సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో నక్సలైట్ నాయకుడు కేరళ వేణు, నక్సలైట్ పత్రిక మాస్ లైన్ సంపాదకుల ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఆ చర్చలో పాల్గొన్నాం. అర్థ భూస్వామ్య వ్యవస్థ, అర్థ వలస వ్యవస్థ అనే దృష్టితో చేసిన ఉద్యమాలన్నీ ఆగిపోయినాయి. అందువల్ల మేము పునరాలోచనలో పడ్డాము. నయా వలసవాదానికి వ్యతిరేకంగా అనగా నేటి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జాతుల ఉద్యమాలు నిర్వహించాలి అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమానికి ప్రతి చోట కుల సమస్య ఎదురైందని, ఉద్యమాలు స్తంభనకు గురయ్యాయని చెప్పారు. ఇంకొకవైపు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రాజ్ నం ద్ గామ్ లో శంకర్ గుహ నియోగి ఒక విశిష్టమైన, సమగ్రమైన, సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని ప్రత్యక్షంగా చూసాము. ఉద్యమ నాయకత్వమే హాస్పిటల్స్ ను, స్కూళ్లను కమ్యూనిటీ హాళ్లను నిర్మింపచేసింది. మద్యపాన నిషేధాన్ని అమలు జరిపింది. భిలాయి ఉక్కు గని కార్మికులను సంఘటిత పరిచింది. వారి జీత భత్యాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి కృషిచేసింది. మహిళల పట్ల వివక్షను నిర్మూలించడానికి మహిళా కమిటీలను వేసింది. ఇలా నిర్దిష్ట ప్రాంతంలో వర్గ సామాజిక విప్లవాన్ని, సమగ్ర సామాజిక వికాసాన్ని ఒక ఉద్యమంగా కొనసాగిస్తున్నారు. అది నన్ను బాగా ఆకర్షించింది. అలా అఖిల భారత పర్యటనతో బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు జ్ఞానోదయమైంది. అప్పటినుండి సమస్త వర్గ కుల లింగ జాతి మత భాష వివక్షతలు, అసమానతలు దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా సమగ్ర సామాజిక వికాసమే సమగ్ర సామాజిక విప్లవంగా కొనసాగించాలని అవగాహనకు వచ్చాను. ఈ అవగాహనతో మార్క్సిజమ్, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో పాటు వాటి వ్యూహం ఎత్తుగడలు కార్యక్రమాలన్నింటిలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని గమనించాను. వాటిని మార్క్స్, ఏంజిల్స్ లాగానే తత్వశాస్త్రంలో భాగంగా చర్చించడం అవసరమనిపించింది. దాంతో మార్క్సిస్టు తత్త్వ శాస్త్రాలను పున రధ్యయనం చేశాను. సిపిఐ, సిపిఎం విప్లవకారులంతా గతి తార్కిక ఆర్థిక వాదము, గతి తార్కిక భౌతిక వాదము, గతి తార్కిక చారిత్రక వాదము, ఇట్లా ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన విషయాలతో పాటు ప్రపంచ పరిస్థితులను గురించి మాట్లాడుతారు. రష్యా, చైనాల్లో లాగా మనదేశ ప్రజలు ఒక వర్గానికి చెందినవారు కారు. ఇక్కడ కుల మత వ్యవస్థలున్నాయి. మరి మనుషులంతా సమానమేనని చెప్పడానికి ఈ ఉద్యమంలో ఏముంది? ఆర్థికం మారితే అన్నీ మారతాయని వాళ్ళ సిద్ధాంతం. మనదేశం ఆర్థికంగా, సాంఘికంగా ఒక్కటేనని చెప్పుకున్నా కులమనేది మూలసూత్రంగా ఉంటుంది. మనిషి హావభావాలు, వేషధారణ, భాష, ప్రవర్తన కూడా కుల సంస్కృతిని సూచిస్తాయి. ఇవన్నీ అణచివేతకు గురవుతున్నాయి. విప్లవం పేదలనుండే వస్తుంది కానీ నాయకత్వం దగ్గర వివక్ష ఏర్పడుతుంది. దీన్ని బట్టి సిద్ధాంత లోపం ఉన్నట్లే కదా! 70 , 80 ఏళ్లనుండి బిసిలు,ఎస్సీ, ఎస్టీలు జెండాలు మోసేవాళ్లుగా, లాఠీ దెబ్బలు తినేవాళ్లుగానే మిగిలి పోతున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయం. అందువల్ల తత్వశాస్త్రంలో వ్యూహం, ఎత్తుగడల్లో లోపం ఉందని గమనించాను. మార్క్స్ వద్ద ఆగిపోకుండా ప్లేటో, అరిస్టాటిల్, బుద్ధుడు, నాగార్జునుడు, కాంట్, హెగెల్ తత్వశాస్త్ర అధ్యయనం చేయడం జరిగింది. అలా గతి తర్కం యొక్క మౌలిక సూత్రాలను విస్తారంగా చర్చించడం జరిగింది. నేను చదివిన మేరకు ప్రపంచంలో ఈ కోణంలో చర్చించిన మొదటి పుస్తకం ఇదే. ఈ పుస్తకం వచ్చిన తరువాత అన్ని పార్టీలు, సాహిత్య ఉద్యమాలు తమను సవరించుకున్నాయి. మార్చుకున్నాయి.
11. తెలంగాణ ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర చాలామందికి తెలియదు. అంతర్గతంగా మీరు నిర్వహించిన పాత్ర ఎటువంటిది?
జ :- మలి తెలంగాణోద్యమం 1995 నుండి ప్రారంభమైంది. 1996 నుండి తెలంగాణోద్యమంలో ముందుగా భాష, సంస్కృతులను తీసుకున్నాం. తర్వాత ఉద్యోగాలు, పదవులు, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం మొదలైనవి తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించాం. బిసి, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం లేదన్నది ప్రధానంగా తీసుకున్నాం. 1969లో తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం మన ఉద్యోగాలు మనకు రావడం లేదని. అందుకే ‘ఆంధ్రా గో బ్యాక్’ అన్నారు. 40 ఏళ్ళలో 40,50 కార్పొరేషన్లు పెట్టి వాళ్లే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళను వెనక్కి పంపితే గానీ ఇక్కడ ఖాళీలు ఏర్పడవు. అందువల్ల వారిని శాంతియుత పద్ధతిలో ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడే ఖాళీల్లోకి బదిలీ చేయాలి. వీళ్ళు వెళ్లాలంటే సీనియారిటీ పోతుంది. వాళ్లకు పే ప్రొటెక్షన్, ప్రమోషన్ ప్రొటెక్షన్ ఇస్తూ ఆర్డర్ ఇస్తే ఇక్కడ పోస్టులు క్రియేట్ అవుతాయి.తద్వారా మనకు న్యాయం జరుగుతుంది. అని చెప్పడం జరిగింది. రచయితలుగా, కళాకారులుగా మేమంతా దాన్ని ప్రతిపాదించాం. చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆధునిక విద్యను అందుబాటులోకి తేవడం, ఇక్కడ కాలేజీలను పెంచడం ఇవన్నీ ఎజెండా. నీళ్ళలో వాటా, ఉచిత కరెంటు నినాదాలు కూడా ముందుకు వచ్చాయి. దళిత బహుజన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే దిశగా ఉద్యమం సాగింది. అధిక శాతం ప్రజలు వీళ్ళే కాబట్టి విద్య, వైద్యం, ఉద్యోగం, ఆ తరువాత గృహవసతి. తాగునీటి సమస్య వ్యవసాయ భూమి ఉన్నవాళ్ల సమస్య. వాళ్ళు”నీళ్లు, నిధులు, నియామకాలు”, అనే నినాదం, దుబాయి, బొంబాయి, సింగరేణికి కూలీలుగా వెళ్ళే వలసలు ఆగాలని ” “దుబాయ్, బొంబాయ్, బొగ్గుబాయ్” అనే నినాదం ముందుకు వచ్చింది. 1996 నుండి 2001 వరకు రాష్ట్రసాధన కొరకు 42 సంఘాలు ఏర్పాటు అయ్యాయి. గద్దర్, పాశం యాదగిరి, గూడఅంజయ్య, గోరేటి వెంకన్న, అందెశ్రీ, మొదలైన వాళ్ళతో కలిసి ముందుకు సాగాము.
2001వ సంవత్సరంలో టిఆర్ ఎస్ ఆవిర్భావం జరిగింది. ఉద్యమం రాజకీయ ప్రయోజనం ప్రాతిపదికగా మారింది. అయినా మేము ఊరుకోకుండా బిసి, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టడం మొదలైన వాటి గురించి కృషి చేశాం. ప్రతీ నెల ఒక పుస్తకం తీసుకు రావాలనుకున్నాను. ప్రజల్లో చైతన్యం రావాలన్నది ప్రధానంగా పనిచేశాం. 1969 లాంటి ఉద్యమం మళ్ళీ జరగాలన్నదే మా ధ్యేయం. అదీ శాంతియుతంగానే. ఎప్పటికప్పుడు ఉద్యమ తీరులను సమీక్షించుకుంటూ, క్రియాశీలక మార్పులను చేసుకుంటూ ముందుకు నడిచాం. మన తెలంగాణ సాహిత్యం, ఉద్యమ సిద్ధాంతాలను తెల్పుతూ ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చాం.
12. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ చైతన్యం కొరకు మీరు రాసిన ‘కొత్తచరిత్ర’ పుస్తకంలో కీలకమైన అంశాలేవి?
జ :- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని వందల వ్యాసాలను రాయడం జరిగింది. అంటే ఈ కొత్త విజన్ ఎలా ఉండాలో, దానికి సంబంధించి నూతన ప్రణాళికలను గురించి మేము చర్చించిన విషయాలను, కేసీఆర్ చేయాలనుకున్న నూతన మార్పులను అన్నింటినీ అయిదు పుస్తకాలుగా వేయడం జరిగింది. అందులో మొదటి పుస్తకం ‘కొత్త చరిత్ర’ రెండవది ‘బంగారు తెలంగాణ’, మూడవది ‘తెలంగాణ విజన్ దేశానికి దిక్సూచి’, నాల్గవది ‘కొత్త సిలబస్’, ఐదవది ‘ఇండియాలో ఫెడరలిజమ్’..కొత్తరాష్ట్రంలో కొత్త విజన్ తో ముందుకు సాగి సమర్థవంతంగా ఆచరణ చేయ గలిగితే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనేది వాటి అంతస్సారం. తెలంగాణ ప్రభుత్వం 416 దాకా ప్రణాళికలను ప్రవేశపెట్టింది. అందులో కొన్నయినా అమలు అవుతాయన్న ఆశ. అయితే ప్రవేశపెట్టడం మాత్రమే జరిగింది. కానీ అమలు చేయలేదు. పైగా అవినీతి, ఆస్తులు పెంచుకోవడం మొదలైన స్వార్థ ప్రయోజనాలను ఎప్పుడైతే ఆశించారో 50 ఏళ్ళ ఉద్యమ ఫలితాలు ప్రజలకు అందలేదు. అట్లాంటి వాటన్నిటినీ చూపిస్తూ ఈ పుస్తకాల్లో విమర్శలు కూడా రాశాను. మంచి జరగలేదని అనను. కానీ ఉద్యమ ఫలితమైతే పూర్తి స్థాయిలో అందలేదు. ఉద్యమకారులకు సరైన న్యాయం జరుగలేదు. కేవలం రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూరింది. అస్సాం వంటి ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు, యువకులు, లెక్చరర్లే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ ఆ అవకాశం కొద్దిమందికే దక్కింది.
13. ఇప్పటి వరకు మీ లేఖిని నుండి వెలువడిన పుస్తకాలెన్ని?
జ :- నా రచనలు మొత్తం 120 పుస్తకాలుగా వెలువడ్డాయి. వాటిలో కథలు, నవలలు 21,తత్త్వ శాస్త్రానికి సంబంధించినవి 17, రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసానికి చెందినవి 14, అలంకారశాస్త్రాలు, బిసిల గురించి రాసినవి 9, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు, చరిత్ర, సంస్కృతికి, రాష్ట్రసాధనకు సంబంధించినవి 42 ఉన్నాయి. మూడు వందలకు పైగా పుస్తకాలకు పీఠికలు రాశాను. సాహిత్య చరిత్రను కొత్తమలుపుతో ఎలా చూడాలని తెలంగాణ దృష్టితో, బిసిల దృష్టితో, తెలంగాణ సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ కథ, అస్తిత్వం మీద రాయమని సి. నారాయణ రెడ్డిగారు అడిగారు. తెలంగాణ కథల్లో, నవలల్లో తెలంగాణ అస్తిత్వం ఎలా ఉందో దాని గురించి పుస్తకం వేశాను. ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకొని అర్థశాస్త్రం మీద రాశాను. స్వీయచరిత్ర కూడా 5 భాగాలుగా రాశాను. 1982 డిసెంబర్, అంటే ఎన్టీ రామారావు ఎన్నికల ప్రచారం చేస్తున్నంతవరకు స్వీయచరిత్ర పూర్తయింది. ఇప్పటికే 1200 పేజీలు అయింది (నవ్వుతూ). మిగతాది పుస్తకరూపంలో రావాల్సి ఉంది. ఉపన్యాసాలివ్వడం, సామాజిక ఉద్యమాలను ఆర్గనైజ్ చేయడం, విప్లవోద్యమంలో పాల్గొనడం, ఇట్లా నా జీవితమంతా పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి సామాజిక కార్యకలాపాలతోనే సహవాసం చేశాను. అందువల్ల నేను రాయదలచుకున్న దాంట్లో పదిశాతమే రాయగలిగాననుకుంటున్నా. శరత్ బాబు, ఠాగూర్, మున్షీ ప్రేమ్ చంద్ వీళ్ళలాగా నిరంతరం రాయాలి. కానీ సమాజం, చరిత్ర, ఉద్యమాలు నాకా అవకాశం ఇవ్వలేదు. అన్యాయాన్ని, వివక్షతను ఎదిరించే క్రమంలోనే సమయమంతా గడిచిపోయింది. అందువల్ల తపన ఉన్నా రాయలేకపోయాను.

14. సాహిత్య చరిత్రలో మార్పు తేవాలనుకున్నారు కదా! తీసుకురాగలిగారా?
జ :- కచ్చితంగా వచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా సాహిత్య చరిత్రను మలుపు తిప్పాలనుకున్నాను. తిప్పాను కూడా. సామాజిక, తాత్విక, సాంస్కృతిక రంగాలలో నూతన కోణాలను ముందుకు తేవడం జరిగింది. మొత్తం సమాజం ఆమోదించింది. 1970 దశాబ్దం విరసం దశాబ్దం.1980-90 వరకు మహిళా దశాబ్దం. 1990 నుండి దళిత బహుజన దశాబ్దం. భారతదేశంలో కులమనేది ఒక వాస్తవం. ఆ కుల సంస్కృతులు పుట్టుక నుండే అలవడుతాయి. అందుకే నేను అలంకారశాస్త్రం రాశాను. ఒక కుటుంబం గురించి కథ రాసినా, నవల రాసినా, సినిమా తీసినా అది తప్పక ఏదో ఒక కులానికి చెందినదై ఉంటుంది. అలాగే దళితులు రాసినటువంటి రచనలు వాళ్ళ కులవృత్తులకు, వారి సంస్కృతులకు సంబంధించినవే ఉంటాయి. ఎప్పటివరకైతే కులం అనేది ఉంటుందో అప్పటివరకు కుల సంస్కృతులు, భాష, ఆహార్యం, జీవనవిధానం ఇవన్నీ ఉంటాయి. చైతన్యం పెరగకపోతే అదే సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడినా పాత సంస్కృతిలో మార్పు రాకపోగా విస్తరించింది. దాన్ని మార్చాలి. ఆ దిశగా చైతన్యులను చేయాలి. అందుకే ఆర్థిక విప్లవం కన్నా భావజాల విప్లవం కోసం కృషి చేశాను. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, భాష వివక్షతలకు, అసమానతలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం కోసం సామాజిక, సాహిత్య , తాత్విక రంగాల్లో కృషి చేస్తున్నాను. భారత రాజ్యాంగ మౌలిక లక్షణం కూడా అదే కదా! మనం ప్రపంచ సాహిత్యాన్ని చదువుతున్నాం. మన భారతీయ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని వాళ్ళెందుకు చదవడం లేదు? అందుకే నేను కొన్ని అనువాదాలు చేయించాను. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు ఎన్నో పుస్తకాలు చదివాను. అక్కడి జీవితాన్ని కళ్ళారా చూశాను. మన సాహిత్యం వాళ్లకు అంటదని అర్థమైంది. వాళ్లు ఉమ్మడి కుటుంబాల జీవితాలను వదిలేసి వందేళ్ళ పైన అయింది. వాళ్ళకు కులాలు, కుల వృత్తులు లేవు. అందుకే మన పరిస్థితుల కనుగుణంగానే సిద్ధాంతం తయారవ్వాలి. లక్ష్యాలు ఏర్పడాలి. అందుకే అటువంటి సాహిత్యం రాయాల్సి వచ్చింది.
15. ‘విశాల సాహిత్య అకాడెమీ’ ద్వారా మీరు చేస్తున్న కృషి మరికొంత వివరించండి.
జ :- మేము విప్లవ రచయితల సంఘంలో పని చేసినప్పుడు మా పుస్తకాలను అచ్చు వేసుకోవడం కోసం ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ స్ఫూర్తితో కరీంనగర్ బుక్ ట్రస్ట్ పేరు పెట్టి ‘నా బతుకు పోరు’ నవలని, అల్లం రాజయ్య ‘భూమి’ కథల సంపుటిని అచ్చు వేయడం జరిగింది. సింగరేణి కార్మికుల ‘సింగరేణి కథలు’ అచ్చు వేశాం. ‘అడవిలో వెన్నెల’ పేరుతో గిరిజనుల కథలను కూడా అచ్చు వేశాం. నేను అజ్ఞాతంలోకి వెళ్ళాక దాన్ని ఎవరూ ముందుకు తీసుకు వెళ్ళలేదు. 1990 లో నేను బయటకు వచ్చాక ‘విశాల సాహిత్య అకాడెమీ’ పేరుతో తిరిగి ప్రచురణలు ప్రారంభించాను. నా పుస్తకాలతో పాటు 75 ఇతరుల పుస్తకాలు కూడా వేశాం. ప్రతీ ఏటా విశాల సాహితీ పురస్కారాలు కూడా ఇస్తున్నాం. వందలాది మంది వాటిని అందుకున్నారు. మా కాలంలో మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని శిక్షణా తరగతులు, చర్చలు, సదస్సులు నిర్వహించాం. వారి రచనలను సవరించి చక్కగా ముద్రించి ప్రోత్సహిస్తూ వస్తున్నాం.
16. ‘నడుస్తున్న గ్రంథాలయం’ గా మిమ్మల్ని అభివర్ణించిన గొల్లపూడి మారుతీరావు సాహిత్య సంచికలో మీ ‘బతుకు పయనం’ కథ ఎంపిక కావడం పట్ల ఎలాంటి అనుభూతి చెందారు?
జ :- హెచ్ ఎమ్ టి వి లో ప్రసారమైన ‘నూరేళ్ళ కథ’ అనే శీర్షికను గొల్లపూడి వారు నిర్వహించారు. నేను ఏ కథ ఇవ్వాలా? అని ఆలోచించాను. విభిన్న తరహాలో ప్రత్యేకంగా ఉన్న దానిని తీసుకోవాలి అనుకున్నాను. ‘బతుకుపయనం’ ఒక బట్టలు నేసే పద్మశాలీ సామాజిక వర్గం నుండి ఒక యువకుడు బిటెక్ చేసి, అమెరికాకు ఎట్లా పోగలిగాడో చెప్పే ఒక పరిణామాన్ని
ఆవిష్కరించిన కథ బాగుంటుందనుకున్నాను. . అత్యంత పేదరికం నుండి అత్యున్నతస్థాయి ఉద్యోగం చేసే విధంగా అతని బతుకుపయనం ఎట్లా సాగిందో వివరించే కథ. అందులో బిసిల సంస్కృతి, ఆలోచనలు, పెళ్ళిచూపులు, పెట్టుబడులు మొదలగు ఎన్నో విషయాలుంటాయి.
విశాలాంధ్ర వారి ‘నూరేళ్ళ తెలంగాణ కథ’ పుస్తకంలో నేను రాసిన ‘దక్షయజ్ఞం’ కథ చేర్చారు. దీన్ని నేను ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా విభిన్నంగా ఉండడమే. ఇందులో పీడితుల గురించి రాశాను. అంటే ఈ రెండూ కూడా వైవిధ్యంగా ఉన్న కథలు. ఒక చైతన్య స్ఫూర్తితో ఈ రెండింటిని ఎంపిక చేశాను. గొల్లపూడి మారుతీరావు గారు మా ఇంటికే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి దాన్ని ప్రసారం చేశారు.
అసలు గొల్లపూడి నన్ను ఇంటర్వ్యూ చేయరనుకున్నాను. మేము తెలంగాణ తల్లి గురించి కొట్లాడుతున్న రోజులు. ఆయనేమో తెలంగాణ తల్లి ఉంటుందా? అంటూ విమర్శ వ్యాసం రాసిన వ్యక్తి (నవ్వుతూ). కలిసి మాట్లాడిన తర్వాత ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. నా ఆలోచనా దృక్పథం ఆయనకు అర్థమైంది. “ఈ పుస్తకాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. సహకరిస్తారా? అని కూడా అడిగారు. ఎంతో సంతోషం కలిగింది. ‘వందేళ్ల కథ’ గొప్ప పేరు తెచ్చుకుంది. గొప్ప క్లాసిక్ అది. అటువంటి వాటిల్లో చరిత్ర, సాహిత్యం, సంస్కృతి ఉంటాయి. ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు వేసిన ఇట్లాంటి పుస్తకం మరొకటి కూడా గొప్ప పేరును పొందింది. అలాగే వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకత్వంలో 1990 నుండి వెలువరించిన కథా సంకలనాలను రెండు సంపుటాలుగా పునర్ముద్రించారు. అందులో మెరుగు అనే కథ చేర్చుకున్నారు. చీకోలు సుందరయ్యగారు ‘నిచ్చెన’ కథాసంకలనంలో పాలు కథ తీసుకున్నారు. దళిత కథలు ఎనిమిది సంకలనాలు తెచ్చిన డా. కె. లక్ష్మి నారాయణ ‘బందీ’ కథ మొదలుకొని అనేక కథలను సంకలనంలో చేర్చారు. నేను, వనమాల చంద్ర శేఖర్ సంపాదకత్వంలో వెలువరించిన కరీంనగర్ జిల్లా కథలు నాలుగు సంపుటాల్లోను ‘భారతీయ సాహిత్యం- తెలుగు కథలు’ అనే సంకలనం లోను మరికొన్ని కథలను చేర్చడం జరిగింది. ఇలా ఆయా సంకలనాల్లో సామాజిక చరిత్ర పరిణామాలను విస్తృతంగా ప్రతిఫలించే కథలను సూచించడం జరిగింది. ఇంకా అనేక సంకలనాల్లో కథలు చేర్చుకోబడ్డాయి. ‘కథాసాగర్’ సంకలనంలో ‘సదువు’ కథను చేర్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంకలనంలో ‘అడవిలో వెన్నెల’ కథ చేర్చారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అచ్చువేసిన కథా సంకలనాల్లో ‘అడవిలో వెన్నెల’ కథ మొదటిసారిగా అచ్చు వేశారు. తర్వాత అనేక సంకలనాల్లో దీన్ని చేర్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున ప్రచురించే ఇండియన్ లిటరేచర్ అనే పత్రికలో ‘రియల్ ఎస్టేట్’ అనే కథను ఎంపిక చేసి ప్రచురించారు.
17. మీ కథా వస్తువు శైలీ శిల్పం లోని ప్రత్యేకతను, పరిణామ క్రమాన్ని వివరించండి.
జ :- నా కథా వస్తువులో కాలానుగుణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నా కథలపై 6 ఎమ్ ఫిల్స్, 2 పి హెచ్ డి లు వచ్చాయి. దాంట్లో కథల గురించే కాక కాలక్రమానుగతమైన దశల గురించి, శిల్పంలో క్రమేణా వచ్చిన దశల గురించి వివరించారు. అట్లాగే నా సాహిత్యం మీద ఒక సెమినార్ జరిగింది. వాటన్నిటి సారాంశం ….ఇలా చెప్పుకోవచ్చు.
1.1977 నుండి ప్రారంభదశ, 2. 1980- 1990 విప్లవ సాహిత్యం 3.1990-1995 బహుజన సాహిత్యం 4. 1996-2000 మానవ సమాజ పరిణామం 5. 2001-2005 తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యత 2006 నుండి పై అన్ని దశల పరిణామాలు, విశ్లేషణ, సామాజిక పరివర్తన చిత్రణ.
ఇలా కథల వస్తువుల్లో శైలీశిల్పంలో అనేక మార్పులు జరిగాయి. మొదటగా జీవితంలో కష్టాలు, కన్నీళ్ళ గురించి రాశాను. 1980-90 వరకు రాసిన కథలన్నీ విప్లవానికి సంబంధించినవి. అన్యాయానికి, అణచివేతకు గురవుతున్న వారి గురించి రాశాను. విప్లవ సంఘాలు, నక్సలైట్లు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘాలు, బిసి,ఎస్సీ,ఎస్టీలు ఇలా అనేక విభాగాలకు సంబంధించిన వారి గురించి రాశాను. విప్లవ కథలతో 1991లో ‘పాలు’ కథల సంపుటి వెలువడింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఎమ్ ఏ విద్యార్థులకు పాఠ్య గ్రంథం. ఆతర్వాత మరికొన్ని కథలు కలిపి ‘ఇతర కథలు’ సంపుటి తెచ్చాను. అలాగే విప్లవ కథలతో 2004 లో ‘తేనెటీగలు’ కథల సంపుటి వేశాను. ఆతర్వాత 2013లో అంతదాకా దొరకని కథలు సేకరించి ‘అడవిలో వెన్నెల’ కథా సంపుటి వేయడం జరిగింది. ఇందులో మారుతున్న విప్లవం పట్ల మారిన నా భిన్నమైన అభిప్రాయాలతో ముందుమాట రాశాను. ‘ఉద్యమం ఉద్యమం కోసం కాదు. జీవితం గెలవడం కోసం’ అని కథలు రాశాను. విద్య యొక్క ప్రాధాన్యత, విద్యావ్యవస్థ తీరు, కుటుంబ వ్యవస్థ పరిణామాలు, ప్రాజెక్టులు తెచ్చిన పరిణామాలు, అభివృద్ధి తెచ్చిన పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, వాటి పరిణామాలు మొదలైనవి కథల్లో నవలల్లో చిత్రించాను. కథల్లో జీవితంలో గెలుచుకున్న విధానాన్ని చూపించాలి కానీ ఓడినట్లు చూపించొద్దని నా అభిప్రాయం. మొదటినుండీ వివక్ష ఎలా ఉంది? దానిని ఏ విధంగా దూరం చేయాలి? సమసమాజ నిర్మాణానికి ఏం చేయాలి? ఇదీ కథల్లో చూపించాల్సింది. దీన్ని ‘సోషలిస్టు వాస్తవికత’ అంటారు. అనగా జీవితం ఎలా వుందో చెప్పడంతో పాటు, ఎలా ఉంటే బాగుంటుందో కూడా చిత్రించాలి. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ పరిణామం ఎందుకు అనివార్యమైంది? అనే విషయాలు అన్ని కథల్లో చిత్రించగలిగితే ఆ కథా వస్తువు శైలీ శిల్పం ప్రారంభం, ముగింపు చక్కగా కుదిరితే అది గొప్ప కథ. ఇలాంటి కథలు క్లాసిక్స్ గా ప్రతిభాషలో ప్రపంచ సాహిత్యం లో కలకాలం నిలిచిపోతాయు. ఇదే విషయాన్ని ‘కథలబడి’ కథా సాహిత్యాలంకారంలో విశ్లేషించాను. నా కథల్లో వీలైన మేరకు వీటిని చిత్రించాను. ఆపిల్ ను కోసి ఎంత చిన్న ముక్క చేసినా దాని రుచి మారదు. అలాగే జీవితంలోంచి ఏ చిన్న అంశం తీసుకున్నా మొత్తం సామాజిక స్వరూప స్వభావాలు ఆపిల్ ముక్కలో ఉండే రుచిని చెప్పగలిగేటట్లు ఉండాలి. ఇదే విషయాన్ని నిర్వచించడానికి ‘సమగ్ర సామాజిక కథ’ అని పేరు పెట్టడం జరిగింది. ‘సమగ్ర సామాజిక కథ 50 ఏళ్ల తెలుగు కథ తీరుతెన్నులు’ పుస్తకాన్ని 2003 లో వెలువరించాను. 2004లో ‘సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగ రాయాలి’ అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఇలా నేను కథల్లో, నవల అంత కథావస్తువును ఒక శైలీ శిల్పంతో కథలుగా మలిచాను. ఇదే మాటను విపుల, చతుర సంపాదకులు చలసాని ప్రసాద రావుగారు అడిగారు. మా తెలంగాణ కథలు, నవలలు అచ్చు వేయడానికి వివక్షతకు గురవుతున్నాయి. నిరంతర ఉద్యమాలతో చురుకైన పాత్ర నిర్వహించడం వల్ల సమయం సరిపోవడం లేదు. ఒకపేజీ కథ రాసుకొని రెండు గంటల సినిమా తీస్తున్నారు. వంద ఏపిసోళ్ల టివి సీరియల్ తీస్తున్నారు. ఈ నాలుగు కారణాల వల్ల కథ వస్తువు ఇతివృత్తం ఎంత విశాలమైనదైనప్పటికీ కథలుగా, కథానికలు గా మలిచాను. ఇదే నా కథలోని కథా వస్తువు, శైలీ శిల్పం, ప్రెజెంటేషన్ ప్రత్యేకత. యువ రచయితలు పరిణతి పొందే క్రమంలో ఈ దశకు తప్పనిసరిగా ఎదగాలి. 1968 లో అచ్చయిన ‘జగిత్యాల కథ’ కూడా ఒక మొత్తం సమాజ పరిణామాన్ని కుటుంబ సంబంధాలను ఉమ్మడి కుటుంబం, వ్యక్తి కుటుంబసలుగా విడిపోతున్న తీరును చిత్రించిన కథే. అందుకే అలాంటి మార్పు కోసం నా కథలను కూడా దశలవారీగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటూ చైతన్యాన్ని కలిగించేలా రాశాను.
18. మీ కథా కథనాన్ని విశ్లేషిస్తూ విహారి గారు రచించిన ‘నవ్య కథాశిల్పి- బిఎస్ రాములు’ పుస్తకంలోని విశేషాలు ఏవి?
జ :- కథా వస్తువు ఎవరిది? ఆ పాత్రలు, సంఘటనలు ఎవరివి? ఎవరి జీవితం గురించి రాశారు? వీటిని వివరిస్తూ ‘నవ్య కథా శిల్పి-బిఎస్ రాములు’ అని సుప్రసిద్ధ సాహితీ వేత్త విహారి గారు ఎంతో ప్రేమతో ఆ పుస్తకం రాశారు. కాలం తెచ్చిన మార్పు, గెలుచుకున్న జీవితం, చికాగోలో నానమ్మ అనే మూడు కథా సంపుటాలను తమ పరిశీలనకు తీసుకున్నారు. ఆ కథల్లో ఏ ఏ వృత్తులున్నాయో వాటిని చిత్రించారు. మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, బిసి ల పట్ల, చేతి వృత్తుల పట్ల సహానుభూతితో జీవితాలను, సంస్కృతిని చిత్రించారని ప్రతి కథ గురించి చక్కగా విశ్లేషించారు. అది ఒక రకంగా ఎమ్ ఫిల్, పి హెచ్ డి సిద్ధాంత గ్రంథంతో సమానమైనది. వారు విశ్లేషించిన తీరు, పరిణతి అనితరసాధ్యం . కథలు రాయడం నేర్చుకున్న తర్వాత మంచి కథలు రాయడానికి, గొప్ప కథలు రాయడానికి ఈ పుస్తకం తప్పక చదవాలి. అసలు అలాంటి వారికోసమే ఈ పుస్తకం విహారి గారు రాసినట్టున్నారు. నేను ‘కథలబడి’ లో కథారచనకు కథకుడి పాఠాలు అనే అలంకార శాస్త్రాలలో చెప్పిన అంశాలు, విశ్లేషణలు వీటి తరువాత ఇంకేం చెప్పాలో? ఇంకేం చదవాలో? అనే పరిశీలనా విశ్లేషణ విహారి గారు అందించారు.
19. సామాజిక తత్వవేత్తగా, రచయితగా, సాహితీ విమర్శకులుగా ప్రసిద్ధి పొందిన మీరు దేన్ని ఎక్కువ ఇష్టపడతారు? ఎందుకు?
జ :- మొట్టమొదట కథలు అచ్చులో చూసుకోవాలని కథలు రాయడం ప్రారంభించాను. తర్వాత ఎదిగిన క్రమంలో సిద్ధాంతాలను అధ్యయనం చేసి సమాజం, దేశం బాగుపడాలని ఆర్ ఎస్ ఎస్ లో చేరాను. మత ప్రాధాన్యత పెరగడం చూసి, బయటకు వచ్చాను. పేద ప్రజలకు మేలుచేయడం, సామాజిక న్యాయం కోసం విప్లవోద్యమంలోకి వచ్చాను. దాంట్లో తీరుతెన్నులు మారడంతో ఇలా కాదని బయటకు వచ్చాను. బిసి,ఎస్సీ, ఎస్టీలు అధికారంలోకి రావాలనుకున్నాను. దాని కంటే ముందు తెలంగాణ రావాలనుకొని తెలంగాణ రాష్ట్రోద్యమంలో ప్రవేశించాను. అన్యాయమైన మన ప్రాంతం గురించి ఆలోచన. అంటే నా భావజాలంలో మార్పు వచ్చింది కదా! దానికి ఎంత సంఘర్షణ జరిగి ఉండాలి? ఎంత సంఘర్షణ జరిగితే ఒక ఆస్తికుడు నాస్తికునిగా మారతాడు? ఎంత భావజాలంలో మార్పు వస్తే పురుషాధిక్యత నుండి స్త్రీ వాదాన్ని కొత్త కోణంలో అందించా గలుగుతాడు. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను, జాతీయోద్యమాన్ని, కాంగ్రెసును, ఆర్థిక శాస్త్రాన్ని, అంబేద్కరిజాన్ని అన్నింటినీ అధ్యయనం చేశాను. 1977 నుండి బౌద్ధ అధ్యయనం మొదలుపెట్టాను. సాంప్రదాయిక, వైదిక సాహిత్యం ఆర్ ఎస్ ఎస్ నుండి మొదలుకొని మొన్నటి విప్లవ సిద్ధాంతాల వరకు చేసిన అధ్యయనంతో తాత్వికత ఏర్పడింది. మా పెదనాన్న మిట్టపల్లి రాజయ్య 50 ఏళ్ళ పాటు అచలతత్వ గురువు. ఆయనకు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో వేలాదిమంది శిష్యులుండేవాళ్ళు. బాల్యంలో ఆ ప్రభావం నామీద పడింది. “బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేడ్కరిజం ప్రతీత్య సముపాద్య” అనే పుస్తకంలో రెండున్నర వేల ఏళ్లుగా సాగుతూ వస్తున్న సోషలిస్టు భావ పరిణామాన్ని, నిర్మాణాలను, అవగాహనలను వివరించాను. 11 వ శతాబ్ది వరకు బౌద్ధమే సోషలిజాన్ని ఏవిధంగా చూపించిందో రాస్తూ, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సమసమాజాన్ని, లౌకిక తత్వాన్ని, శాంతియుత పరివర్తన, సామాజికన్యాయం గురించి ఏమని చెప్పాడో క్రోడీకరించాను. మార్క్సిజం వెలికి తెచ్చిన అంశాలను వివరించాను. భావజాల పరిణామం లేకుండా మార్పు జరగదు. తాత్వికరంగంలోనే మొదట మార్పు రావాల్సి ఉంటుంది. అందువల్ల ఆ రంగంలో ఎక్కువ కృషి చేశాను. అది చదివిన వారు ఎదిగారు. వారి కథల్లో, నవలల్లో మార్పులు తెచ్చుకున్నారు. నా రచనల్లో తాత్వికత ఎక్కువ. అంతర్లీనంగా అన్నిచోట్లా అది కనిపిస్తుంది. అందుకు కారణం తాత్విక రచనలు చేయడమే. ఏక కాలంలో ఫిలాసఫీతో పాటు ఫిక్షన్ రాయడం అవసరమైంది. జీన్- పాల్ స్రాత్రే కూడా అలాగే రెండురాయాల్సి వచ్చింది. రెంటిలోను మేము విజయమే సాధించామని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
20. మీ జీవితంలో విభిన్న పార్శ్వాల్లో ఉన్న అంతస్సూత్రం ఏమిటి?
జ :- అనేక కోణాల్లో నేను కూడా ఈ ప్రశ్నను అనేక సందర్భాల్లో వేసుకున్నాను. ఈ పరిణామాల అంతస్సూత్రం, ఏక సూత్రత ఏమిటి? అని. మిత్రులు, సాహితీ వేత్తలు, నేను చర్చించుకున్నాం. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు సాధించడం, అసమానతలు తొలగిపోయి వివక్ష వెలివేతలు నిర్మూలించబడి, సమస్త వర్ణ వర్గ కుల మత భాష వివక్షతలన్నీ తొలగిపోయి మనుషులందరు సమానమే. మానవులంతా ఒక్కటే. అనే మానవీయ దృష్టి ఈ పరిణామాలన్నింటిలోను కొనసాగిన అంతస్సూత్రం. అలా బౌద్ధ, హిందూత్వ, మార్క్సిజం, అంబేడ్కరిజం, బహుజన వాదం, స్త్రీ వాదం, మానవతా వాదం వీటి యొక్క సంశ్లేషణయే వీటన్నిటిలో కొనసాగిన పార్శ్వాలు. అభివృద్ధి చెందిన వారికి, అధికారాలు అందిన వారికి, అభివృద్ధి, అధికారం అందని వారికి, అందుకోలేనివారికి, అందుకోవాలనే విషయం కూడా తెలియని వారికి నిరంతరం అసమానతలుంటాయి. వాటిని పరిష్కరించు కుంటూ పోవడమే సోషలిజం. సమసమాజ నిర్మాణం, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అందరికీ సమాన హక్కులు, అవి అందుకోలేని వారికి ప్రత్యేక ప్రాతినిథ్య ఏర్పాట్లు రిజర్వేషన్లు మొదలైనవి. భారత రాజ్యాంగం ఈ మౌలిక అంశాలకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగం ప్రవేశికలోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బహుళ పార్టీ వ్యవస్థలో శాంతియుతంగా ఈ లక్ష్యాలను సాధించుకోవడమే భారత రాజ్యాంగం ఉద్దేశించబడింది. అందువల్ల రాజ్యాంగ పరిధిలో సాధించుకోవాల్సిన అన్నిటినీ ఎలా సాధించుకోవాలో చెప్పడం, నాయకత్వం వహించడం కర్తవ్యంగా స్వీకరించిన వారే ఈ దేశానికి నిజమైన నాయకులు, గురువులు. ప్రతీ మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు అనే తాత్వికతకు సంబంధించిన తత్వశాస్త్రం ఇంకా పుట్టలేదు. ‘గతి తర్క తత్వ దర్శన భూమిక’, ‘బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేడ్కరిజం’, ‘బహుజన తత్వం’, ‘అంబేడ్కరిజం-సోషలిజం’ మొదలైన తాత్విక రచనలు ఈ ప్రయత్నంలో వెలువడినవే. సామాజిక తాత్విక సాహిత్య రంగాలలో ఏక కాలంలో కృషి చేశాను. అందుకే ఈ మూడు రంగాలు నాకిష్టమైనవే. నా జీవితమంతా వీటి చుట్టూతా పెనవేసుకొని సాగింది.
21. బిసి కమిషన్ చైర్మన్ గా మీరు ప్రజల కోసం ఏ విధమైన పనులు చేపట్టారు?
జ :- బిసి కమిషన్ చైర్మన్ గా పని చేయడం జీవితంలో మరచిపోలేని ఒక మహత్తర అధ్యాయం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసి పని చేసిన క్రమంలో నేను కేసీఆర్ ఎదురెదురుగా మూడవ వ్యక్తి లేకుండా వందల, వేల గంటలు కొన్ని సంవత్సరాల పాటు చర్చించుకున్నాము. మేము చర్చించని విషయమంటూ లేదు. “సాహచర్యంలో 6 నెలల్లో వారు వీరవుతారు. వీరు వారవుతారు” అని సామెత ఉండనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను అనుకున్నదానికన్నా ఎన్నోరెట్లు ఉత్తమమైన బాధ్యతను అప్పగించారు. 3కోట్ల డెబ్భై లక్షల జనాభాలో రెండు కోట్ల 20 లక్షలు బిసిలే. బిసి కమిషన్ చైర్మన్ గా సగం ముఖ్యమంత్రితో సమానం అని కేసీఆర్ ప్రశంసించారు. బాధ్యత అప్పగించారు. బిసి కమిషన్ ఛైర్మన్ గా పదవీ స్వీకారం చేశాక చాలా విషయాలు కొత్తగా అర్థమైనాయి. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చాలా దగ్గరగా, సన్నిహితంగా చూడడం జరిగింది. ఛైర్మన్ అయిన తరువాత భాష మారింది భావ వ్యక్తీకరణ మారింది. సామాజికోద్యమాల్లో మాట్లాడినప్పుడు నా భాష వేరు. ప్రశ్నించడం, ఎదిరించడం ఉత్తేజపరచడం ఆనాటి పద్ధతి. బిసి కమిషన్ చైర్మన్ గా అప్పుడు వేటినైతే ఎదిరించానో దాన్ని పరిష్కరించే బాధ్యత ఏర్పడింది. అందువల్ల భాష కూడా మారుతుంది. కథల్లో, నవలల్లో, విమర్శలో, వ్యాసాలలో ఈ మార్పు గమనించవచ్చు. భారత రాజ్యాంగ విలువ తెలిసింది. ‘భారత రాజ్యాంగ ముఖ్యాంశాలు’ అనే పుస్తకం కూడా రాశాను. ఇతర రాష్ట్రాల బిసి కమిషన్ నివేదికలను అనువాదం చేసి ముద్రించడం జరిగింది. మండల కమిషన్, ఎమ్ ఎస్ జనార్దనం కమిషన్, అనంతరామన్ కమిషన్, మురళీధరరావు కమిషన్ మొదలైన వాటిని తెలుగు చేసి ప్రచురించడం జరిగింది. ‘భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు’ పుస్తకంలో రాశాను. ఇంకా ఏం చేయాలి ముందు మాటలో రాశాను. వీటన్నింటినీ చూస్తే విప్లవంలో జరుగుతున్న లోపాలు మరిన్ని తెలిశాయి. విప్లవోద్యమాలు చేసేవాళ్లు ప్రతి ఒక్కరు కనీసం భారత రాజ్యాంగం గురించి వేసిన బుక్ చదివితే ఒక చక్కటి అవగాహన కలుగుతుంది. కమిషన్ ఛైర్మన్ గా అవగాహన, పరిణతి పెరిగి పరిభాష మారింది. ఏది రాసినా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను అనుసరించి రాయడం జరిగింది. అంతకుముందు ఛైర్మన్ గా పని చేసిన వాళ్ళను గురించి చదవడం, రాజ్యాంగాన్ని అధ్యయనం చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సాధికారికంగా ప్రజల దగ్గరకు వెళ్ళి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాను. వాటికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అత్యంత పేదరికంలో ఉన్న 17 కులాలను గుర్తించి 14 కులాలను బిసి(ఎ) లో, 3 కులాలను బిసి(బి) లో చేర్పించడం జరిగింది. అన్ని రంగాలలో వారికి అవకాశాలకు అర్హత కల్పించాము. కొంతమంది మతం మార్చుకున్నప్పటికీ కులవృత్తులు మారలేదు. అటువంటి బిసి (ఇ) గ్రూపులో ని 14 కులాల వారికి రిజర్వేషన్ శాతం పెంచాలని ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. దాన్ని మంత్రిమండలి ఆమోదించి కేంద్రానికి పంపింది. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు, నేను అనేక చర్చలు చేశాము. దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శవంతంగా ఉండేలాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పథకం గురించి చర్చించాము. అందులో రెండు బర్రెలను, ఇంటి వెనుక 100 వనరాజ, గిరిరాజ కోళ్లను పెంచుకుంటే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆ దృష్టి తో చర్చించాము. బలహీన వర్గ విద్యార్థులకు హాస్టళ్లకు బదులుగా రెసిడెన్సీ స్కూళ్ళు ఏర్పాటు చేయాలనేది నా 35 ఏళ్ళ కల. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆ కల నెరవేరింది. ఇప్పుడు 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలతో ఐదున్నర లక్షల మంది బాలబాలికలు చక్కని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందుకుంటున్నారు. వారికి రెసిడెన్సీ స్కూల్లో చేరగానే రెండు నెలల పాటు ఇంగ్లీషు మీడియంలో ఇంగ్లీషులో మాట్లాడే ఉచ్చారణ హాండ్ రైటింగ్ అందంగా కుదిరేలా రాయడం నేర్పుతారు. 9వ తరగతికి వచ్చేసరికల్లా పిల్లలు ప్రపంచ జ్ఞానాన్ని అందుకొని చక్కని వక్తలుగా ఎదుగుతున్నారు. ఇది ఒక గొప్ప కాంట్రిబ్యూషన్. తెలంగాణ తల్లి’ అస్తిత్వం ఉండాలని 8 నెలలు కష్టపడి అనేక రూపాలనుండి తెలంగాణ తల్లిని ప్రస్తుత రూపానికి తీసుకురావడం జరిగింది. ఉద్యమంలో ఉన్నప్పుడు చేయాలనుకున్నవి కొన్ని ప్రభుత్వంలోకి వచ్చాక సాధికారికంగా చేయడం జరిగింది. ప్రభుత్వంలో ప్రోటోకాల్స్ ద్వారా అత్యున్నత గౌరవాలు అందుకున్నప్పుడు కలిగే ఆనందం, పెరిగే బాధ్యత మనిషిని ఉన్నతీకరిస్తుంది. అలా గవర్నర్, ముఖ్యమంత్రి , మంత్రులు, ఐ ఏ ఎస్ అధికారులు వందలాదిమందిని కలుసుకొని చర్చించడం జరిగింది. పలు కుల సంఘాల నాయకులకు ఆయా రాష్ట్రాల బిసి కమిషన్ నివేదికల అనువాదాలను పంచి, ఉచితంగా వచ్చే సౌకర్యాలను వివరించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బిసి కమిషన్ ప్రతిష్ఠను, ప్రాచుర్యాన్ని కలిగించడంతో పాటు గొప్ప స్ఫూర్తిని నింపింది. ఇలా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు సాన్నిహిత్యం చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బిసి ఉద్యోగులు, వారి శాతం, బిసిల కోసం పెట్టే నూతన పథకాల అవకాశాలు , ఉద్యోగాల ఖాళీలను ఎలా నింపుతున్నారు తెలుసుకోవడం జరిగింది. పారిశ్రామికీకరణ వల్ల యంత్రాల వినియోగం వల్ల లక్షలాదిమందికి ఉపాధి లేకుండా పోయింది. సుమారుగా 45 శాతం ప్రజలు ఉపాధి కోల్పోయి ఇతరుల మీద ఆధారపడి బతకడం జరుగుతున్నది. ఉన్న ఊరు వదిలి, ఇళ్లను వదిలి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు skilled, un skilled labour గా వలస బతుకులు బతకాల్సి వస్తున్నది. వీరికి జిల్లా పరిధిలో ఉపాధి కల్పించే అవకాశాలు పెంచడం ఎలా? ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని 97 డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులను, ప్రిన్సిపాల్ సెక్రెటరీలను పిలిచి మాట్లాడడం జరిగింది. అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లను బిసి కమిషన్ కార్యాలయానికి పిలిచి విద్యార్థులలో బిసిలు, ఉద్యోగులలో బిసిలు,ఖాళీలు, ఉపాధికల్పనకు సంబంధించిన విషయాలను చర్చించడం జరిగింది. బిసి రిజర్వేషన్ కోటాను పాటించని వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయా వ్యక్తులకు, సామాజిక వర్గాలకు సంబంధించిన విజ్ఞప్తులు వచ్చినప్పుడు వాటిని పరిశీలించి పరిష్కరించేలా కృషి చేశాము. ఆసరా పథకం, కళ్యాణలక్ష్మి, బీడీ కార్మికులకు ఆసరా, ఆర్ టి సి కార్మికుల సమస్యలు మొదలైనవెన్నో మా దృష్టికి వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. బిసిల చైతన్యం పెంచడంలో బిసి కమిషన్ నిర్వహించిన పాత్ర మహత్తరమైనది. అలా మూడేళ్లు బిసి కమిషన్ ఛైర్మన్ పదవీ కాలం జీవితంలో మరచిపోలేని అధ్యాయం.
22. సీనియర్ సాహితీ వేత్తలైన మీరు మా మయూఖ పత్రిక ద్వారా నేటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ :- నా సూచన ఏమిటంటే బాగా చదవాలి. ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా పరిశీలించాలి. రాజకీయాలతో, ప్రభుత్వ నిర్ణయాలతో, సామాజిక ఉద్యమాలతో సైన్స్ అండ్ టెక్నాలజీతో, ప్రపంచీకరణ ప్రయివేటీకరణతో, ప్రచార, ప్రసార దృశ్య మాధ్యమాలతో, మానవ జీవితంలో, కుటుంబ సంబంధాల్లో సంస్కృతిలో , ఆలోచనల్లో , ఆశయాల్లో వస్తున్న మార్పులను పసిగట్ట గలగాలి. వాటిని కథల్లో నవలల్లో దృశ్య మీడియాలలో చిత్రించగలగాలి. బాధితుల, పీడితుల వైపు నిలబడి వారికి మద్దతుగా వారి ఆత్మవిశ్వాసం పెంచే విధంగా రచనలు చేయాలి. ఆత్మహత్యలు ఆగిపోయి, ఆ కష్టాలను అధిగమించి, జీవితాన్ని గెలుచుకోగలం అనే విశ్వాసాన్ని కలిగించాలి. నిరాశా నిస్పృహలు కలిగించే సాహిత్యం, భయపెట్టే సాహిత్యం, పిరికివారిని చేసే సాహిత్యం మంచి సాహిత్యం కాదు. వేల సంవత్సరాలుగా శూద్రులు, అతి శూద్రులు ఆదివాసులే సమస్త సంపదల సృష్టికర్తలు. సమస్త నైపుణ్యాలు వారు అభివృద్ధి పరచినవే. ఖనిజాలు, లోహాలు వెలికి తీశారు. కత్తులు, ఆయుధాలు, కోటలు ,దుర్గాలు దేవాలయాలను నిర్మించారు. సంగీతం, కళలు సామూహిక ప్రదర్శనలు వారు సృజించిందే. ఆధునిక పారిశ్రామిక అభివృద్ధి 1810 నుండి విస్తరించి వీరందరూ ఉపాధి కోల్పోతూ వస్తున్నారు. ఈ సమాజ సంపద సృష్టికర్తలు ఇవాళ వెనుకబడిన తరగతిలో వర్గీకరించబడ్డారు. వీరంతా దేశ జనాభాలో 70 శాతానికి పైగా ఉంటారు. వారికి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఉన్నత జీవన ప్రమాణాలు నూతన నైపుణ్యాలు అందించడం ప్రభుత్వంతో పాటు అందరి బాధ్యత. ఇవి ఏ మేరకు అందుతున్నాయో, అందలేక పోతున్నాయో కథల్లో, నవలల్లో చిత్రించినపుడే అవి సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఇంగ్లీషు కథలు, నవలలు చదవాలి. మంచి సినిమాలు చూడాలి. ఇప్పుడు నవలలకు ప్రాధాన్యత పెరిగింది. పాశ్చాత్య సాహిత్యంలో వాళ్ళు ఎలా రాస్తున్నారో తెలుసుకోవాలి. వాళ్ళవి ఎదిగిన జీవితాలు. అయినా శైలీ శిల్పం, జీవితాలను పరిశీలించే తీరు ఇవన్నీ గమనించాలి. రచయితలు ఒక కుటుంబానికి పరిమితం కాకుండా ప్రభుత్వాలు, పథకాలు, వాటి అమలు, చట్టం, న్యాయం, రాజకీయ పరిణామాలు, ఉద్యమాలను అవి మలువుతున్న తీరును రాయాలి. రచయితలు సామాజిక శాస్త్రాలను, ఆర్థిక శాస్త్రాలను చదవాలి. ప్రతి ఏటా కథలకు, నవలలకు ఎన్నో సంస్థలు బహుమతులు ఇస్తుంటాయి. అలాంటి భారతీయ రచనలను అంతర్జాతీయంగా ఇస్తున్న ‘బుకర్ ప్రైజ్’ గెలుచుకున్న రచనలను చదవాలి. సోవియట్ రష్యా, అమెరికా, యూరప్ సాహిత్యం చాలా గొప్పవి. ‘మొపాసా’ అనే ఫ్రెంచ్ రచయిత 150 ఏళ్ళ క్రింద రాసిన సాహిత్యం చదివితేనే ఇంత గొప్పగా ఎలా రాయగలిగారు? అనిపిస్తుంది. మరి మనం ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? ఇతర దేశాల్లో వ్యక్తి కుటుంబాలు ఉంటాయి. మన దగ్గర సమిష్టి కుటుంబాలు, కులాలు ఇవన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. రచనల్లో ఆ ప్రభావం తప్పక ఉంటుంది. వాస్తవిక చిత్రణల్లో రచన చేయగలగాలి. డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే అద్భుతమైన నవలను రాశాడు. అది చదివినప్పుడు పందుల వెంట మనమే వెళ్తున్న భావన కలుగుతుంది. అంత చక్కగా పాఠకులను పాత్రలోకి సంలీనం చేయగలిగారు. ‘వేట’ కథ రాసిన అల్లం శేషగిరావు క్రూర మృగాలను గురించి వాస్తవాలు చిత్రించాడు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? అనివార్యం ఎందుకైంది? ఆ అనివార్యం ఎందుకైందో చెప్పడమే తాత్వికత. పాఠకులు పాత్రలతో మమేకమై పోవాలి. అందుకే ఆ స్థాయి రచనల కోసం మనం ప్రయత్నించాలి. ప్రపంచ భాషల సాహిత్యాన్ని మనం చదువుతున్నాం. “తెలుగు సాహిత్యాన్ని చదవాలి” అని ప్రపంచ దేశాలు వారి భాషల్లోనికి అనువదించుకొని చదవాలి. అనే ఆసక్తి కలిగినప్పుడు మన తెలుగు సాహిత్యం ప్రపంచస్థాయికి ఎదిగినట్టు లెక్క.
మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీ భావజాలాన్ని, మీరు సమాజం కోసం పడిన తపనను, సాహిత్యం కోసం చేసిన కృషిని గురించి ఓపికగా సమాధానాలు చెప్పినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున మరీ మరీ ధన్యవాదాలు.
ప్రసిద్ధ కథకులు, కవి, రచయిత, విమర్శకులు, వక్త, నాటకకర్త విహారి గారితో మయూఖ ప్రతినిధి అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి
*******************************************
నమస్కారం సార్. మా మయూఖ పాఠకులకు మీ సాహితీ ప్రస్థానాన్ని పరిచయం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది.
మీ జననం, బాల్యం, కుటుంబాన్ని, విద్యాభ్యాసాన్ని గురించి చెప్పండి.
జ: నమస్కారం అమ్మా! నేను అక్టోబర్ 15, 1941వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాను. మా అమ్మగారు జొన్నలగడ్డ శ్రీదేవి, మా నాన్నగారు జొన్నలగడ్డ మేధా దక్షిణామూర్తిగారు. ఆయన ఆ రోజుల్లో గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఉన్న ఒకే ఒక్క ఇంగ్లీష్ అకౌంటెంట్. నాకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య, నలుగురు చెల్లెళ్ళు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా అన్నయ్యను ప్రభల రామబ్రహ్మం గారికి దత్తత ఇచ్చారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తమ ‘ఏకవీర’ నవలను అంకితం ఇచ్చింది ఆ రామబ్రహ్మం గారికే. మా నాన్నగారు మాటకు బాగా విలువ ఇచ్చేవారు. ఆయనకున్న వృత్తి పట్ల ఉన్ననిబద్ధత, ముక్కుసూటిదనంతో ఉన్న పళాన ఉద్యోగం వదిలేశారు. అంతటి ఆత్మాభిమానం కలవారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు, నాన్న అనారోగ్యంతో చిన్నతనంలోనే కష్టాలను అనుభవించాను. 1955 లో నా ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయింది. చదువు కొనసాగలేదు. ఈలోపు మా నాన్నగారి మరణంతో కుటుంబ బాధ్యత మీద పడింది. అందువల్ల ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తూ సమయాన్ని బట్టి, ఎమ్.ఎ., ఇన్సూరెన్స్ ఫెలోషిప్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, జర్నలిజం వంటి వాటిల్లో డిప్లొమాలు చేశాను.
ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఇంతటి సాహిత్యానురక్తులు కావడానికి నేపథ్యం ఏమిటి?
జ: నేను చిన్నప్పటి నుండీ పద్యాలు, శతకాలు, పాటలు, భగవద్గీత శ్లోక పఠనం, వక్తృత్వం, వంటి అనేక పోటీ పరీక్షల్లో ముందుండే వాడిని. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. దానివల్ల పుస్తకాల పురుగునైపోయాను. పఠనాసక్తి కలిగిన వాడిని కావడం వల్ల అక్కడ ఉన్న శాఖా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను. లైబ్రేరియన్ గా ఉన్న వెలగం వెంకట్రామయ్య గారు “ఏమయ్యా! ఇంకో గ్రంథాలయం చూసుకోరాదూ!” అన్నారు నవ్వుతూ.ఆవిధంగా ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో ఉన్న పుస్తకాలన్నీ చదివాను. ప్రాచీన కావ్యాలన్నీ భారతీ గ్రంథకర్తలు కీ.శే. హరిసాంబశివరావు శాస్త్రి గారి వద్ద, మా పెద్దమ్మ కొడుకు ఉభయ భాషా ప్రవీణ చల్లా శంకరయ్య గారి వద్ద చదువుకున్నాను. మా గోఖలే ( మాధవపెద్ది గోపాలకృష్ణ ), చా.సో, కరుణశ్రీ వంటి సాహితీ దిగ్గజాలెందరూ నాకు స్ఫూర్తి దాతలు. ఉద్యోగరీత్యా మచిలీపట్నం చేరిన తర్వాత నా సాహిత్యాభినివేశం రెట్టింపు అయింది.

మీ ఉద్యోగ జీవితాన్ని ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారు?
జ: నేను మీకు ముందు చెప్పినట్లు మా నాన్నగారు పరమపదించిన తర్వాత నేను కుటుంబ పోషణ బాధ్యత మోయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చదువు మానేసి ఉద్యోగానికి వెళ్ళాను. ఆ ఉద్యోగం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే పంచవర్ష ప్రణాళికల కింద ప్రారంభించారు. మాలకొండయ్య గారని IAS ప్లానింగ్ ఆఫీసర్. ఆయనను ఒకరి ద్వారా కలుసుకున్నాను. ఆయన కూడా నావంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారవడం వల్ల నన్ను ఆదరించి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. ఆ కాలంలో సివిల్ ఇంజినీర్ టెస్టులు ఉండేవి. ఇప్పుడు తీసేశారు. అవి పాసయితే డిప్లొమా, డిప్లొమా పాసయితే డ్రాఫ్టింగ్, సూపర్ వైజర్ గా వెళ్ళొచ్చు. అలాగే డిగ్రీ చేసుకోవచ్చు. నేను దాన్ని అతితక్కువ సమయంలో, అత్యుత్తమ స్థాయిలో పూర్తి చేశాను. LDC క్యాడర్ రూ.67/- ఉండేది. నాకు రూ.84/- ఫిక్స్ చేసి ప్రమోషన్ ఇచ్చారు. పదహారు పేపర్లు పూర్తి చేయాల్సి ఉంటే నేను ఎనిమిది పేపర్లు పూర్తి చేయగానే ప్రమోషన్ ఇవ్వడం గొప్ప విషయం ఆ రోజుల్లో.
LIC లో మీ ప్రవేశం ఎలా జరిగింది? తర్వాత మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?
నేను ఎల్.ఐ.సి లో ప్రవేశించడం యాదృచ్చికంగా జరిగింది. బాపట్లలో మాకు దూరపు బంధువు కొండయ్యగారు అందులో పని చేస్తుండేవారు. కొండయ్య గారి తండ్రి గురు గోవింద స్వామి శిష్యుడు. ఆయన ‘కపిల గోసంవాదం’ అని భారతంలోని కథాంశాన్ని తీసుకొని ఆధ్యాత్మిక కావ్యం రాశారు. నా జాబుకి సంబంధించిన అప్లికేషను పంపించారు. అప్పట్లో 55% మార్కులు ఉంటే ఎల్.ఐ. సి. అసిస్టెంట్ అర్హత ఉండేది. నాలుగు సౌత్ స్టేట్స్ కలిపి కాంపిటేషన్ టెస్ట్ నిర్వహించేవారు. ఒక్క మచిలీపట్నంలోనే దాదాపు 2వేల 3 వందల మంది రాశారు. అట్లా పరీక్ష రాసిన లక్షా 28 వేల మందిలో ఎస్.ఎస్.ఎల్.సి.వాడిని నేనొక్కణ్ణే. అటువంటిది ఆ పరీక్ష పాసవడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడం కూడా జరిగింది. ఆ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం 1961 మచిలీపట్నం నుండి ప్రారంభమైంది. కుటుంబాన్ని తీసుకొనివెళ్ళాను. ఆ తర్వాత పి.యు.సి. పాసయినాను. ఎల్.ఐ.సి లో ప్రొఫెషనల్ పరీక్షలుండేవి. నేను లైసెన్సుయేట్ నుండి అసోసియేట్ స్థాయికి వచ్చాను. అక్కడ ఆరు పేపర్లు రాయవలసి ఉంటుంది. అది ఒక్కసారి అయినా రెండుసార్లు అయినా పూర్తి చేసుకునే అవకాశం ఉండేది. నేను ఒకేసారి 6 పేపర్లకు కట్టాను. అందులో Actuarial science అని మేథమేటిక్స్ బేసిస్ పేపర్ ఉంటుంది. ప్రపంచంలో రెండే రెండు ప్రొఫెషన్స్ ఈనాటికీ గొప్పవిగా భావించబడుతున్నాయి. అందులో ఒకటి ఆర్చురీ, రెండవది చార్టెడ్ అకౌంట్. ఆర్చురీ లండన్ లో ఉంటుంది. చాలా కష్టమైనది. మేథమేటిక్స్ బేసిక్ లేనివాళ్ళకు మరీ కష్టం. నేను ఆరు పేపర్లు ఒకేసారి పాసయ్యాను. మా ఫెడరేషన్ లో ఒక రికార్డు అది. 150 మంది ఉన్న మా డిపార్టుమెంటులో సీనియర్ గా ఉన్న వ్యక్తి రిజల్ట్ తీసుకొచ్చి నన్ను పిలిచి అందరి ముందు నన్ను బెంచీపై నిలబడమని నిలబెట్టి ఆ విషయాన్ని గొప్పగా చెప్పడం మర్చిపోలేను. తర్వాత బి.ఏ, ఎమ్.ఏ లు, ఫెలోషిప్ కూడా పాసయ్యాను. ఆరు పేపర్లు ఒకేసారి పాసయినందుకు సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. నా తర్వాతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి తో అర్హత తీసేసి కనీస అర్హతగా డిగ్రీ ఉండాలని నిర్ణయించారు (పెద్దగా నవ్వుతూ). ఆ తర్వాత HGA (Higher grade assistant) గా చేశాను. 15 సంవత్సరాలు చేశాను కానీ ప్రమోషన్ల విధానం కోర్టు కేసులతో నడిచి చివరకు 1979 లో ధార్వాడకు సూపరింటెండెంట్ గా వేశారు. తర్వాత కడపలో తొమ్మిదన్నర ఏళ్ళు చేశాను. బొంబాయిలో సంవత్సరం, అటునుండి 1990- 94 వరకు హైదరాబాద్ లో మొదటిసారి చేశాను. మళ్ళీ బెంగుళూరు రెండేళ్ళు, తిరిగి బొంబాయిలో చివరగా హౌసింగ్ ఫైనాన్స్ కి డిప్యూటీగా వేశారు. ఆలిండియా క్యాడర్ లో 101 ఆఫీసులకు హెడ్ గా ఉన్నాను. ఏడేళ్ళు పనిచేసి 2001 వ సంవత్సరం చివర్లో రిటైర్ అయ్యాను. తీసుకోగలిగే పదవి అయినా నేను నా జీవితంలో అవినీతి పనులకు పాల్పడింది ఎప్పుడూ లేదు. “నా బ్యాంక్ పాస్ బుక్, నా జీవితం పాస్ బుక్ ఎప్పుడూ ఓపెన్” అనేది నా స్టేట్ మెంట్. అందులో ఎలాంటి సీక్రెట్ లేదు ( నవ్వుతూ ). నా పిల్లల్ని కూడా అలాగే పెంచాను.
‘ఆంధ్ర సారస్వత సమితి’ స్థాపనకు దారి తీసిన పరిస్థితులేవి?
ఇంతకుముందే మచిలీపట్నంలో ఉద్యోగం ప్రారంభించానని చెప్పాను కదా! అక్కడికి వెళ్ళగానే నేనొక భావోద్వేగానికి గురయ్యాను. కారణం విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళి కాటూరి కవులు, ముట్నూరు కృష్ణారావు గారు, పట్టాభి సీతారామయ్య గారు వంటి వాళ్ళ పేర్లు వింటేనే ఒడలు పులకరిస్తుంది. అటువంటి వాళ్ళు ఉన్న నేల అది. “ఇచట పుట్టిన చివురు కొమ్మయిన చేవ” అని గుర్తుకు వచ్చింది. ఎంత గొప్ప ప్రదేశం? ఆ మట్టి ఆ గాలి కూడా అంతే. ఆ పరిస్థితుల్లో సాయంత్రం పూట పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్లు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ఆదివిష్ణు, రావూరి సత్యనారాయణ గారు వంటి ప్రముఖులు ఇలా చాలామంది కలుస్తుండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు ఒకసారి “ఏమయ్యా విహారీ! మనం ఎలాగూ అందరం కలుస్తున్నాం కదా! ఒక సంస్థ పెడితే బాగుంటుంది కదా!” అన్నారు. నేను సరేనన్నాను. ఏడుగురం కలిసి రిజిస్ట్రేషన్ చేయించాం. అందులో తొలి సంతకం అద్దేపల్లి వారిదైతే రెండవది నాది. మొట్టమొదటి సభ 11 మందితో టౌన్ హాల్లో పెట్టాము. వేదాల తిరు వెంగళాచార్యులు గారని, అలంకారశాస్త్రంలో దిట్ట. ఆయనను ప్రసంగానికి పిలిచాం. పదకొండు మందిలో కూడా ఏడుగురే వచ్చారు. అదీ పరిస్థితి. కానీ నేను దాన్నుండి బయటకు వచ్చేనాటికి చివరి సభకు లోపలే కాకుండా బయట 300 కుర్చీలు వేయిస్తే ఆ మూడువందల కుర్చీలలో మొత్తం ఆడవాళ్ళు కూర్చోవడం విశేషం. ప్రహరీ గోడ మీద కూర్చొని, నిలుచొని కూడా కొంతమంది విన్నారు. ఆ స్థాయికి దాన్ని తీసుకొచ్చాం.
ఆ సంస్థ ద్వారా మీరు చేసిన కార్యక్రమాలు ఏవి?
ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు. ఒకటి మా మెంబర్స్ ప్రతీనెలలో పదిహేను రోజులకు ఒకసారి ఒక తేదీన గోష్ఠి నిర్వహించుకునేవారం. రెండవది సభ ఏర్పాటు చేయడం. అందువల్ల ఊళ్ళో ఒక విధమైన చైతన్యం వచ్చింది. దాదాపు తెలుగునాట ఉన్న ప్రముఖులందరినీ ప్రసంగాలకు పిలిచాము. ఎంతోమంది ఆర్థిక సహకారం అందించారు. త్రివేణి వక్కపొడి ఓనర్ వెంకట సుబ్బారావు అయితే “మీరు ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇంకా కావాల్సిన మొత్తాన్ని నేను ఇస్తాను” అని అనేవారు. నేను గొప్ప సమన్వయ వాదిని అని పేరు నాకు. ఎందుకంటే అన్ని విధాలైన భావ జాలాలను కలుపుకు పోతాను. ప్రాచీన సాహిత్యం లో శ్రీశ్రీ సాహిత్యాన్ని అభిమానించే extrimists ఉండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు శ్రీశ్రీ మీద మొట్టమొదటి విమర్శ పుస్తకం రాశారు. ఆ కారణంగా ఆ ఊళ్ళో మా సంస్థ ద్వారా ఎంతో చైతన్యం వచ్చింది.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చివరి సభకు సినారె గారు ప్రధాన వక్త. ఎమ్. వి. ఎల్., కావిలిపాటి విజయలక్ష్మి, మధురాంతకం రాజారావు వీళ్లంతా వేదిక మీద ఉన్నారు. ఎస్.పి గారిని అధ్యక్షునిగా పిలిచాము. అది ఎమర్జెన్సీ పూర్తయిన కాలం. సమయానికి ఎస్.పి.గారికి అర్జెంట్ పని ఉండడం వల్ల రావడం లేదని చెప్పాడు. రామచంద్ర రాజు గారు జిల్లా జడ్జి. ఆయనను పిలిచాము. గతంలో బుచ్చిబాబు నవల మీద లైబ్రరీలో నేను ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఈయనే అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ ఆత్మీయతతో అంగీకరించారు. అప్పుడు నారాయణరెడ్డి గారు మాట్లాడిన మొదటి వాక్యం “చట్టం గద్దె దిగింది న్యాయం గద్దె నెక్కింది” అని ఎమర్జెన్సీని ఉద్దేశించి అనడంతో జనమంతా చప్పట్ల హోరు. అదే సభలో కొడాలి ఆంజనేయులు గారూ ఉన్నారు ముందు వరుసలోనే. రెండు నిమిషాలు మాట్లాడతానని వేదిక మీదకు వచ్చారు0 (విశ్వనాథ వారు ఈయన కలిసి సత్యాంజనేయులు అనే పేరుతో అవధానాలు నిర్వహించారు). “నేను పుట్టిన ఈ బందరులో మూడే మూడు సభల్లో ఇంతమంది జనం ఉండడం చూశాను. ఒకటి నీలం సంజీవరెడ్డి గారు వచ్చినప్పుడు, రెండవది అతుల్య ఘోష్, సుచేతా కృపలానీ వచ్చినప్పుడు, మూడవది ఇదే సభ. మొదటి రెండూ రాజకీయ సభలు కాబట్టి జనం రావచ్చు. కానీ ఒక సాహితీసభను గోడలెక్కి చూడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మేము చేస్తున్న కృషిని అభినందించారు.
అదేవిధంగా ‘స్పందన’ సాహితీ సమాఖ్యను గురించి తెలపండి.
నేను ఆంధ్ర సారస్వత సమితి తరఫున 1972 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీకి ఎన్నుకోబడ్డాను. అక్కడ అందరికంటే నేను వయసులో చిన్నవాడిని. పావలా సభ్యత్వంతో 300 మంది సభ్యులున్నారు దాంట్లో. రూపాయి సభ్యత్వం కోసం మీటింగులలో ప్రయత్నాలు మొదలయ్యాయి. పావలా ఇవ్వడానికే వెనుకాడేవారు రూపాయి ఎలా ఇవ్వగలరు? అప్పటికే సభలకు చందాలు వసూలు చేస్తున్నారు. ఉన్న సభ్యులు కూడా పోతే ఎలా? అందుకే అది అమలు కాలేదు. 11 ఏళ్ళు నేను సంస్థకు అధ్యక్షునిగా చేశాను. ఇక్కడ శివారెడ్డి, కుందుర్తి, శీలా వీర్రాజు గార్లతో పనిచేసిన గుత్తికొండ సుబ్బారావు సంస్థలోకి వచ్చి చేరాడు. ఎప్పుడు సభలు చేయాలంటే మా ఇద్దరి పేర్లే వచ్చేవి. నాకు ఎంతోమంది పరిచయం ఉండడం వల్ల నేను పిలిస్తే వచ్చేవాళ్ళు. ఒకసారి సినారె గారు సభలో “విహారి పిలవడం వల్ల వచ్చాను. కానీ మద్రాసు నుండి ఊరికే ఎవరైనా వస్తారా?” అన్నారు. అలాగే ఎమ్.వి.ఎల్. కూడా. ఎవ్వరైనా సభల్లో ఆ విషయం చెప్పేవారు. దానిని ‘వ్యక్తి పూజ’ అనుకోవడానికి లేదు కదా! వ్యక్తి లేకుండా సంస్థ ఏముంది? అయితే ఈ కారణంగా ఒక పదిహేను మంది అసంతృప్తి వర్గం తయారయింది. అందులో బోయి వెంకటేశ్వర్లు అనే ఆయన అధ్యక్షునిగా కాదలచుకున్నాడు. నాతో పోటీలో గెలవలేనని తెలుసు కాబట్టి ఉపాధ్యక్షునిగా ఉంటానన్నాడు. అప్పటివరకు ఎన్నికలు లేవు. ఆయన మాట మాత్రంగా చెప్పాడే కానీ నామినేషన్ వేయలేదు. ఈలోగా సరస్వతి అనే ఆవిడ నామినేషన్ వేసింది. ఆయన వచ్చి గొడవ చేశాడు. కనీసం వేస్తానని ఆయన మాకెవ్వరికీ చెప్పలేదు. విత్ డ్రా చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. పెద్ద గొడవే జరిగింది. ఆ సమయంలో మేము ఒక ఏడుగురం బయటకు వచ్చి ‘స్పందన సమాఖ్య’ కు రిజిస్ట్రేషన్ చేయించాము.
ఇందులో మేము పుస్తక ప్రచురణను కూడా ఒక భాగంగా చేసుకున్నాం. దాని తరఫున నేను ధార్వాడ వెళ్ళే లోపు 120 పుస్తకాలు వేశాము. అందులో చాలా పుస్తకాలు యూనివర్సిటీలో రెఫరెన్సు పుస్తకాలుగా ఉన్నాయి. కుందుర్తి పీఠికలు లాంటి స్టాండర్డ్ పుస్తకాలు వేశాము. కథలు, నవలలు వేశాము. దాశరథి దగ్గర నుండి తెలుగుదేశంలో ఉన్న కవులందరినీ కలిపి ‘కవిత’ అనే పుస్తకం వేశాము. ఇదేకాక ‘స్పందన’ అనే మ్యాగజైన్ వేశాము. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్ హసన్ శ్రీశ్రీ ముఖచిత్రం ఉన్న ఆ మ్యాగజైన్ పట్టుకొని తిరుగుతుంటాడు ( నవ్వుతూ ). నేను ధార్వాడకు వెళ్ళడం ఆ సంస్థకు తీరని లోటు. ఎంత ప్రయత్నించినా దాన్ని కొనసాగించడం ఎవరివల్లా కాలేదు. అప్పులు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకుంటూ ఉంటాం.

మీ రచనల్లో కథా సాహిత్యం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమైనా ఉందా?
ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తరువాత గ్రంథాలయంలో పుస్తకాలు చదివేవాణ్ణి అని చెప్పాను కదా! అందులో నన్ను చాలా ప్రభావితం చేసినవి మధురాంతకం రాజారావు, గోపీచంద్ పుస్తకాలు. దాంతో మిగిలిన వాటికంటే కథా సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అసలు నేను ప్రాథమికంగా పద్య సాహిత్యం, ప్రాచీన సాహిత్యాల పట్ల గట్టి పట్టున్నవాణ్ణి. హరి సాంబశివరావు గారు మా గురువు గారు. నేను ఆయన దగ్గర కావ్యాలన్నీ చదువుకున్నాను. అంతకుముందే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి అని ఆయన మా అమ్మకు కజిన్ అవుతారు. శాస్త్రిగారికున్న ఏకైక చెల్లెలు మా మేనమామకు భార్య. అందుకే పట్టు సాధించగలిగాను. అలాంటివాణ్ణి ఆధునిక సాహిత్యంలోకి వచ్చి ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో కథలు, నవలలు, విమర్శలు చదివాను. ఇదిలా ఉండగా బందరు ఉద్యోగం లోకి వచ్చిన తరువాత నాతో పాటు శాలివాహన ( త్రిపురారి భొట్ల నారాయణ మూర్తి ), నేను కలిసి పనిచేశాము. మా ఇంటి వెనుక పిట్ట గోడ ఉండేది. ఆయన ఇల్లు అటువైపు ఉండేది. అప్పుడేదో సందర్భంలో కథల ప్రస్తావన వచ్చింది. ఆయన అప్పటికే కథలు రాస్తున్నాడు. అయితే నేను కూడా రాద్దామనుకున్నాను. ఇద్దరం కలిసి రాయాలనుకున్నాము. అప్పటికే ఆయన శాలివాహన పేరుతో రాస్తున్నాడు. నేను విహారి అనే పేరుతో ఏవో పద్యాలు, వ్యాసాలు సందర్భోచితంగా రాస్తుండేవాడిని. ఆంధ్రజ్యోతి సాహిత్యానుబంధంలో కూడా రాసేవాడిని. ఇక ఆయన నేను ఇద్దరమూ కలిసి 1977 వరకు ముమ్మరంగా కథలు రాశాము. 1977 లో నేను ధార్వాడ వెళ్ళాను. అప్పటినుండీ సెపరేట్ గా రాయడం ప్రారంభించాము. 1977 – 79 మధ్య ధార్వాడలో ఒక్క రచన కూడా చేయలేదు. 1979లో కడపకు వచ్చాను. అక్కడినుండి మళ్ళీ నా రచనా వ్యాసంగం మొదలైంది. ఒక రకంగా రెండవ సాహితీ జీవనమని చెప్పవచ్చు.
మీరు రాసిన ‘చలనం’ అనే కథ ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నదని విన్నాం. అదేంటో చెప్తారా?
మంచి ప్రశ్న. ‘చలనం’ కథలో ఉన్నది ఏంటంటే Existentialism. మనం అస్తిత్వవాదం అని అంటుంటాం కదా! మన తెలంగాణ, ఆంధ్ర అలాంటి అస్తిత్వ వాదం కాదు. సాహిత్యంలో Existentialism అనే దానికి అస్తిత్వవాదం అని పేరు పెట్టిన వారు మొదట గోపీచంద్ అయితే దాన్ని తెలుగు సాహిత్యలోకానికి పరిచయం చేసింది బుచ్చిబాబు. గోపీచందుని ‘అసమర్థుని జీవయాత్ర’లో, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో దాన్ని వాళ్ళు అప్లై చేశారు. నా కథల్లో Existentialism అనేది ఆకుచాటు పిందె లాగా కనబడుతుంది. అంటే అంతర్లీనంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ ‘చలనం’ కథలో శ్రీనివాస్ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అతను సంప్రదాయ కుటుంబీకుడు. అయినా ఒక్కోసారి వరుసగా 3 రోజులు స్నానం చేయకుండా ఉండడం, ఒక్కోసారి 4 రోజులు నదీ స్నానం చేయడం, బూట్లు, చెప్పులు వేసుకొని పడుకోవడం ఇట్లా. అంటే Chaotic (అస్తవ్యస్తమైన ) person అంటాము. Existentialism ఏం చెబుతుందంటే “A man is a useless person” అనేది అందులో ఒక థియరీ. ఉదా:- ఒక వ్యక్తి మీద అభిమానం కలుగుతుందనుకోండి. అవసరాన్ని బట్టి మారొచ్చు. అతని మీద ద్వేషమూ కలగొచ్చు. రెండవ సూత్రం ఏంటంటే “Exist because you think”. అంటే నేనున్నాను అంటే ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నానంటే నేనున్నాను. నువ్వు చేస్తున్నవన్నీ నీ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. నువ్వు సాధిస్తున్నది కాదు. దానంతట అదే జరుగుతున్నది. దీన్ని ఆధారంగా చేసుకొని రాశాను. ఆ పాత్ర లైఫ్ చిన్నగా, విభిన్నంగా సాగుతుంది. ఆ అస్తవ్యస్తపు వ్యక్తి మతాంతర వివాహం చేసుకుంటాడు. తల్లి, చెల్లి బాధపడతారు. ఇతరుల దృష్టిలో పనికిరాని జీవితాన్ని గడుపుతాడు. పెళ్ళి చేసుకున్న అమ్మాయి మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఇందులో నువ్వు దేన్ని ఆపగలిగావు? కాబట్టి మనచేతుల్లో ఏదీ లేదు. చివరకు ఒక సినిమా పాటలో “ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే ఆట” అన్నట్లు పశ్చాత్తాప పడతాడు. ఆంధ్ర పత్రిక వాళ్ళు ఆ అంతరార్థాన్ని పట్టుకొని పత్రికలో వేశారు.
మీ ‘కథాకృతి’ సంకలనాల ఉద్దేశ్యం ఏమిటి?
కథ రాసేవాళ్ళకి సాహితీ సహృదయత ఉండాలి. సాహితీ సంస్కారం ఉండాలి. నేను 350 మంది కవుల కథలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాశాను. అవన్నీ ‘కథాకృతి’ పేర నాలుగు సంపుటాలుగా వచ్చాయి. అందులో చిన్న, పెద్ద, ప్రాంతీయత లాంటి భేదాలు లేకుండా కథ బాగుంటే రాశాను. అందులో దాదాపు 200 మంది ఇవ్వాళ్ళటికీ నాకు తెలియదు. అల్లూరి గౌరీలక్ష్మి అనే ఆవిడ ‘డబ్బింగ్’ అని అద్భుతమైన కథ రాసింది. ఆ కథతోనే మొదలుపెట్టాను. ఒక మీటింగులో ‘నేనేనండీ ఆ కథ రాసింది’ అని పరిచయం చేసుకొంది. “ఎందుకయ్యా వాళ్ళందరికీ కిరీటాలు పెడతావు” అని ఒక పెద్దాయన అన్నారు. కిరీటాలు పెట్టడం కాదు. ఇప్పటివాళ్ళు కూడా రాస్తున్నారు, రాయగలుగుతున్నారని పదిమందికీ తెలియాలి కదా! ఆంధ్రభూమి ఎడిటర్ నేను ఒకావిడ కథను గురించి రాస్తే “అలాంటావిడ కథ ఎలా రాస్తారు?”అన్నారు. “మీరాకథ చదవండి ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుస్తుంది” అన్నాను. ఆయనే నా ‘మహావిజేత’ నవలను అడిగి తీసుకొని ఆంధ్రభూమిలో వేశాడు. “బాలగంగాధర్ తిలక్ రాసిన ‘దొంగ’ అనే కథను ఎవరో కాపీ చేసి టైటిల్ కూడా మార్చకుండా పంపితే ఈయన చూసుకోకుండా పత్రికలో వేశాడు. అది పెద్ద సంచలనం అయింది. అందుకే సూటిగా ఆయనతో ఎడిటర్ అన్నాక అన్నీ చూసుకోవాలని చెప్పాను. ఆయనే ఒక సందర్భంలో పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’ లాంటి కథ వస్తే కనుక నేను వేసేవాడిని కాను అన్నాడు. భారతీయ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చినవి రెండే రచనలు. అందులో మొదటిది రవీంద్రుని ‘గీతాంజలి’. రెండవది పద్మరాజు గారి ‘గాలివాన’ కథానిక. అలాంటి కథను వేసేవాడిని కాను అనడంతో “అది మీ స్థాయిని తెలియజేస్తుంది” అన్నాను (నవ్వుతూ ). అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే దాంట్లోని విలువలు తెలుసుకోవాలని. అందుకే అటువంటి వాటిని తీసుకొని సంకలనంగా వేశాను.
ఆధునిక పంచకావ్యాల్లో ఒకటిగా పేరొందిన ‘శ్రీ శివభారతం’ రచించిన గడియారం వేంకట శేషశాస్త్రి గారి పేరు మీద మీరిచ్చే అవార్డు గురించి చెప్పండి.
1981లో గడియారం వేంకట శేషశాస్త్రి గారు మరణించారు. అప్పుడు నేను కడపలో ఉన్నానమ్మా! ఆయన రాసిన ‘శివభారతం’ ఎంతో ఆత్మీయంగా అనేక సందర్భాల్లో చదివాను. మా పెద్దమ్మ కొడుకు, నా రెండవ గురువు గారు చల్లా శంకరయ్య గారని చెప్పాను కదా! ఆయన, నేను కలిసి చదివేవాళ్ళం. అందుకే గడియారం వారంటే నాకు ఎంతో అభిమానం. నాతో పాటు నా ముగ్గురు మిత్రులు మేము ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు కలుసుకునేవాళ్ళం. ఎన్నో సాహితీ చర్చలు చేసేవాళ్ళం. గడియారం వారి మరణవార్త విని ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపించింది. అది వాళ్లకు చెప్పగానే వెంటనే అంగీకరించారు. కేవలం దానికోసమే సంస్థ పెట్టాము. పద్యకవికి మాత్రమే ఇచ్చే నియమం పెట్టుకున్నాము. భూతపురి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారని ఆయన రచించిన ‘శ్రీ మదాంధ్ర చరిత్ర’ శ్రీకృష్ణ దేవరాయల కావ్యానికి ఇచ్చాము. అప్పటినుండీ మొన్ననే 42 వ అవార్డు ఇచ్చాము. ఆంధ్ర, తెలంగాణాల్లో ఉన్న ప్రసిద్ధులైన కవులందరికీ ఇచ్చాము. ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి గారు, కరుణశ్రీ గారు, ఉత్పల సత్యనారాయణ శాస్త్రి గారు, వేముగంటి నరసింహాచార్యులు గారు, రావికంటి విశ్వనాథం గారు, అనుమాండ్ల భూమయ్య గారు మొదలైన వాళ్ళందరికీ ఇచ్చాము. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. నేను కడప నుండి వచ్చేటప్పుడు 15 వేల రూపాయలు ఖర్చుల కోసం బ్యాంకులో పెట్టి వచ్చాను. మొదట రెండువేలు, తర్వాత అయిదు వేలు, ఆ తర్వాత పదివేలు ఇలా ఆ అవార్డుకు నగదు బహుమతి ఇచ్చాము. మేము పెట్టిన నలుగురిలో ఇద్దరు చనిపోయారు. నేనే ఇస్తున్నాను. శేషశాస్త్రి గారి మనుమలు పొద్దుటూరులో ఉన్నారు. “40 ఏళ్ళుగా ఇస్తున్నారు కదా! మేము కూడా ఇప్పటినుండి భాగస్వాములం అవుతాం” అన్నారు. ఈ రెండు మూడు సంవత్సరాల నుండి వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి వాళ్ళకు వస్తే నేనే వాళ్ళను పొద్దుటూరుకు తీసుకువెళ్తాను. అట్లా పద్యకవులకు గడియారం వారి అవార్డు ఇస్తున్నాము.
ఎంతోమంది ప్రముఖుల ప్రశంసాపాత్రమైన మీ ‘శ్రీ పదచిత్ర రామాయణం’ గురించి చెప్పండి.
మానవాళికి అనుసరణీయము, ఆచరణీయము, ఆవశ్యకము అయిన మానవ సంబంధాలను వివరించే మహాకావ్యం రామాయణం. వ్యక్తిని ఉన్నతంగా నిలిపే సార్వజనీన సూత్రాలు, వ్యక్తుల ద్వారా సమాజాన్ని సమతుల్యతతో నిలిపే విశిష్టమైన, శాశ్వతమైన విలువలు కలిగినది. అందుకే సర్వ కాలాల్లో పఠనీయమైన కావ్యమని నా అభిప్రాయం. అందుకే దానిని 6500 పద్యాలతో “శ్రీపద చిత్ర రామాయణం” అనే పేరుతో రాశాను. రామాయణం వంటి మహత్తర కావ్యాన్ని పద్యాల్లో రాయడం వల్ల ఒక ఔన్నత్యం, ఔచిత్యం కలుగుతాయన్న భావనతో పద్యాల్లో రాయడం జరిగింది. పద్యాల మీద నాకున్న పట్టు ‘తీరని దాహం’ కావచ్చు (గట్టిగా నవ్వుతూ).
ప్రసిద్ధ ఆలంకారికుడు జగన్నాథ పండితరాయల మీద నవల రాయాలనుకోవడానికి కారణం ఏమైనా ఉందా?
ఉంది. నేను సినారె గారు రచించిన కర్పూర వసంతరాయలు కావ్యాన్ని నా చిన్నప్పుడు గుంటూరులో ఆయన చెబుతుండగా విన్నాను. అంతకుముందు నేను ప్రాచీన కావ్యాలు గురుముఖత విని ఉన్నాను. దానితో పద్యం మక్కువ ఏర్పడింది. ఈ కావ్యం విన్న తరువాత గేయకావ్యంలో ఇంత మాధుర్యం ఉందా అనిపించింది. కర్పూర వసంత రాయలు ఎవరో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నాకు చరిత్ర అంటే ఇష్టం. కర్పూర వసంతరాయల (కుమారగిరి) చిన్నాన్న అనవేమారెడ్డి. ఆయన అసలు వసంతరాయలు. ఆయన పేరు మీదనే ఉత్సవాలు జరిగేవి. వసంతరాయల గురించి నవల రాద్దామనిపించింది. పరిశోధన చేశాను. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వద్దకు వెళ్ళి ఆయన రాసిన పుస్తకాలతో పాటు మరికొన్ని రెడ్డిరాజుల చరిత్ర పుస్తకాలు మొత్తం వంద పుస్తకాలు చదివాను. ఆ ప్రభావంతో అనవేమారెడ్డి నవల రాశాను. అచ్చులో 170 పేజీల పుస్తకం వచ్చింది (1972). దాన్ని చూసి నోరి నరసింహ శాస్త్రి గారు సాహిత్య అకాడెమీకి ఈ పుస్తకానికి నేను ఓటు వేస్తాను అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం రెకమండ్ చేస్తానని. అప్పటినుండి గేయకావ్యం ఒకటి రాయాలని కోరిక కలిగింది. దాంతో స్పందన సాహితీ సమాఖ్యలో ‘రాబోవు ప్రచురణలు’ అని మొదటిది ఎమ్.వి.ఎల్ గారి సినిమా పాటల్లో సాహిత్యం, రెండవది విహారి గారి జగన్నాథ పండితరాయలు (గేయకావ్యం) అని ప్రకటించాము. 1972 నుండి అది అలాగే ఉంది. ఉద్యోగరీత్యా నాకు రాయడం కుదరలేదు. దాని మీద మనసు పోయింది. ఆ తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా జగన్నాథుని రసగంగాధరం మొదలగు కావ్యాలను చదువుతూ నోట్స్ రాసుకునేవాడిని. గేయకావ్యంగా 40 పేజీలు రాశాను కానీ సంఘటనలు, పాత్రల మధ్య అనుసంధానం చేయడం కష్టమవుతున్నదని నవల రాశాను. అలా రాయాలని కోరిక కలగడానికి కారణం ‘లవంగి’ తో ఆయనకు కలిగిన అపప్రథ. దాన్ని రూఢి చేస్తూ కొంతమంది రచనలు చేశారు. అందులో ప్రధానంగా కె. రామలక్ష్మి గారు ‘లవంగి’ పేరుతో రాసిన నవల ‘యువ’ పత్రికలో దీపావళి సంచికలో అనుబంధ నవలగా వచ్చింది. అందులో లవంగికి, ఆయనకున్న సంబంధాన్ని చెబుతూ కొన్ని శ్లోకాలను కూడా కోడ్ చేస్తూ రాసింది. అది చదివిన తరువాత దాన్ని ఎలాగైనా కాదని నిరూపించాలి అనుకున్నాను. అంతేకాదు జగన్నాథ పండితరాయల గేయకావ్యం రాయడానికి కూడా ప్రధానమైన భావన అదే. అంతటి గొప్ప పండితుడు, తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన ఆయనపై ఇలాంటి నిందలు వేయడం నాకు నచ్చలేదు. అందుకే ఆధారసహితంగా దాన్ని తప్పు అని నిరూపించడానికి ఈ నవల రాశాను.
మీ పద్యకృతులను గురించి చెప్పండి.
మొట్టమొదటిది రామాయణమే. నేను అంతకుముందు రెండు చిన్నకావ్యాలు రాశాను చిన్నప్పుడు. ఒకటి సోరాబ్ రుస్తుం 50, 60 పద్యాలు ఉంటాయి దాంట్లో. రెండవది పన్నా అని ఒక కథను రాశాను. విడివిడిగా కాశీని గురించి వ్యాసకాశి అని. అవేవీ ఇప్పుడు లేవు. మొదటగా వెలుగులోకి వచ్చింది శ్రీ పద చిత్ర రామాయణమే. ‘యోగ వాసిష్ఠ సారం’ అని 400 పద్యాలతో తర్వాత రాశాను. సుమంత్రుని గురించి రాశాను. భూమయ్య గారు నవ్వుతుంటారు “రామాయణాన్ని విడిచిపెట్టరా!” అని. సుమంత్రుడు విశ్వాసపాత్రుడైన మంత్రి. మరియు ఆంతరంగికుడు. ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎటువంటి చిత్తక్షోభను అనుభవించాల్సి వస్తుందో సామాజిక పరిస్థితిని అప్లై చేసి రాశాను. ఇది కాక రామాయణంలోని పాత్రల గురించి ‘భక్తి’ పత్రిక వాళ్ళు 16 వ్యాసాలు రాయించారు. అవి, ఇంకో రెండు వ్యాసాలు కలిపి ‘అంతా రామమయం’ అనే వ్యాస సంకలనాన్ని తెచ్చాను. తర్వాత మా బావగారు (ఇప్పుడు లేరు) మాకు పద్యాలు అర్థం కావు గానీ ఒక్క సుందరకాండ అయినా వచనంలో రాసిపెట్టు అన్నారు. ఆయన కోసం 100 పేజీల పుస్తకం రాశాను. భూమయ్య గారన్నట్టు నా మనస్సులోంచి రామాయణం పోవడం లేదు( గట్టిగా నవ్వుతూ ). అందుకే ఇటీవల ‘రామాయణ సూక్తి సుధ’ అని 200 పద్యాలు కేవలం రామాయణంలోని సూక్తులను తీసుకొని రాశాను. అది అచ్చులో ఉంది. ఇంకో విషయం చెప్పాలి. విజయవాడలో ఒకాయన రామాయణంలో 100 బొమ్మలను వేయించాడు. ఆయన పబ్లిషర్ కూడా. అందుకే ఆ బొమ్మలకు అర్థం వచ్చేటట్లు వచనం రాయించాలనుకొని ఒకరిద్దరితో రాయించాడు కానీ ఆయనకు నచ్చలేదు. ఒకసారి ఏదో సందర్భంలో జి. వి. పూర్ణచందర్ రావు దగ్గరికి వెళ్ళినపుడు ఆయన కూడా కలిసి ఈ విషయం చెప్పాడు. అప్పుడు పూర్ణ చందర్ “మా గురువు గారు రాస్తారు” అన్నాడు. వెంటనే ఆయన మొత్తం పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళాడు. నేను కేవలం ఆ బొమ్మ అర్థం కాకుండా దాని ముందు వెనుక ఉన్న కథాంశాన్ని కూడా కూర్చి మొత్తం రామాయణం వచ్చేటట్లుగా రాశాను. ఆయనకు బాగా నచ్చి తీసుకువెళ్ళారు. మీ గురువుగారికి 5 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పండి అన్నాడట. డబ్బు విషయం పక్కకు పెడితే దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోయారు. ఆ పుస్తకం అచ్చు వేయడం కోసం కుటుంబ సభ్యులను అడిగితే తెలియదన్నారు. ఇది జరిగి 8 సంవత్సరాలు అయింది. వెతుకులాటలో మొన్న కొన్ని దొరికాయి. అన్నీ కలిపి వేస్తున్నాము.
మీ రచనలు మొత్తం ఎన్ని పుస్తకాలుగా వచ్చాయి? ఆంగ్ల భాషలో ఏవైనా రచనలు చేశారా?
జ: ఇప్పటివరకు నా రచనలలో కథా సంపుటాలు 19, వ్యాస సంపుటాలు 17, రామాయణాలు 11, నవలలు 7, మోనోగ్రాఫులు 2, పద్య సంకలనాలు 4, దీర్ఘ కవితలు 2, రచయితల సమీక్షలు 5, నవీన 1, సప్తపదులు 1, అచ్చులో ఇంకా ఉన్నవి 3…మొత్తం 72 పుస్తకాలు. ఆంగ్లభాషలో రచనలు ఏవీ చేయలేదు. అన్నీ అనువాదాలే. అంతా లిటరేచర్ సంబంధించినవి. ప్రొఫెషనల్ కి సంబంధించిన షేర్ మార్కెట్లు మొదలైనవి మాత్రమే.

‘అజో విభో కందాళం’ ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం పొందిన అనుభూతి ఎటువంటిది?
అప్పా జోస్యుల వారు ఇచ్చే ఈ పురస్కారం చాలా గొప్పది. తెలుగులో జ్ఞానపీఠ అని ప్రసిద్ధి దానికి. నాకు వచ్చిన పురస్కారాల్లో ఎంతో సంతృప్తిని కలిగించిన పురస్కారం అది. డబ్బు దృష్ట్యా కాదు. ఆయన ఎవరిని ఎలా ఎన్నుకుంటారో, ఆయన దృష్టికి ఎవరు ఎలా వస్తారో తెలియదు. ఈ అవార్డు ఇవ్వడానికి ముందు ఆయన నన్ను ఒకసారి చీరాలకు పిలిచారు. ‘శ్రీరామతత్త్వం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వమన్నారు. రెండురోజులు వాళ్ళింట్లోనే ఆతిధ్యం ఇచ్చారు. రామాయణంలో మీకు నచ్చిన కొన్ని ఘట్టాలను చదవండి అన్నారు. అహల్య ఘట్టంలో చాలామంది ఆమె ఇంద్రునికి కొంగు పరచినట్లుగా రాశారు. అది నాకు మనస్కరించలేదు. ఆధ్యాత్మిక పరంగా వేరే అర్థాలున్నాయి. అదే చదువుతూ వివరించబోయాను. ఆయన నవ్వి వివరణ వద్దు చదవండి అన్నారు. అంటే అంత పట్టు ఉంది ఆయనకి. ఆయన రాసిన పంచభూతాత్మక తారావళుల్లో ‘అంతరిక్ష తారావళి’ ఇటీవలే వచ్చింది. దానికి ముందుమాట నా చేత రాయించారు. 24 పేజీలు వచ్చిందది. గొప్ప పండితులు, సహృదయులు ఆయన.
మీకు వచ్చిన ఇతర పురస్కారాలేవి?
నాకు వచ్చిన పురస్కారాలు అన్నీ కూడా నాకు తెలియకుండా నన్ను వరించి వచ్చినవి. ఏ ఒక్కటి కూడా ఇది వస్తే బాగుండునని అనుకోలేదు. ఒక మరపురాని సంఘటన చెప్పాలి. 1977 లో నా కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత దాని బ్యాక్ గ్రౌండ్ తెలిసింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో దాశరథి రంగాచార్యుల వారి సభకు ప్రేక్షకునిగా వెళ్ళాను. ఆయన కారెక్కబోతుంటే బి.ఎస్.రాములు అనుకుంటా నన్ను ‘విహారి’ అని ఆయనకు పరిచయం చేశాడు. ” ఓయ్ నువ్వా విహారి అంటే! నీ సంగతి నాకు తెలుసునయ్యా!” అంటూ ఆగి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డుకు నీ పుస్తకం వచ్చినప్పుడు జడ్జీల మధ్య నిర్ణయం వాయిదా పడింది. బెజవాడ గోపాలరెడ్డి గారు నాకు నీపుస్తకం ఇచ్చి చూడమన్నారు. నీ పుస్తకానికే ఇవ్వమని చెప్పాను. ఆయన “ఇతను చిన్నవాడు కదా! ముందు అవకాశం ఉంది కదా!” అన్నాడు. అప్పుడు నేను నువ్వు మనిషిని చూసి అవార్డు ఇస్తావా? పుస్తకం చూసి ఇస్తావా? అని అడిగాను. అప్పుడది నీకు ఇచ్చారు” అన్నారు. ఇన్ని ఏళ్ళ తర్వాత రంగాచార్యుల నోట ఈ విషయాన్ని విని ఎంతో ఆశ్చర్యపోయాను. విజయవాడలో ఒకసారి రామాయణం చెబుతుంటే ఇద్దరు వ్యక్తులు మధ్యలో లేచి వెళ్ళిపోయారు. సభ పూర్తయ్యే ముందు ఒక బుట్టతో వచ్చారు. అయిపోయాక నాకు ఒక ధోవతి, ఉత్తరీయం ఇచ్చి, శాలువా కప్పి గులాబీపూల గజమాలతో సత్కరించారు. ఆ ఇద్దరిలో ఒకవ్యక్తి జానపద బ్రహ్మ లాంటి ఎన్నో పేర్లు కలిగి, వివిధ జానపద కళల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన కర్ణాట లక్ష్మీ నర్సయ్యగారు. మరో వ్యక్తి నాగేశ్వరరావు గారు అని మంగళగిరిలో గొప్ప సంపన్నుడట. ఆ విషయం తర్వాత తెలిసింది. ఆ తరువాత నాగేశ్వరరావు గారికి అప్పటికి భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆమె పేరు మీద ఆయన నాటకరంగంలో ప్రతిభ కలిగినవారికి అవార్డు ఇస్తున్నారు. ఇప్పటి నుండీ నాటకాలకు కాకుండా సాహితీ వేత్తలకు ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారు. ఆ అవార్డు సభను విజయవాడ నుండి గుంటూరుకు వెళ్ళే రహదారిలో ఓపెన్ థియేటర్ లో ఏర్పాటు చేశారు. నా ఫొటోతో పెద్ద ఫ్లెక్సీ వేయించి, స్వాగతించి గొప్ప సన్మానం చేశారు. మరోసారి కడపలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్న సభలో నేను మాట్లాడుతుండగా ఒకాయన మధ్యలో లేచి వెళ్ళిపోయి పట్టుబట్టలు తీసుకువచ్చి సన్మానం చేశాడు. నేను వీటికోసమే వెళ్ళాను. ఏమీ అనుకోవద్దని సంజాయిషీ చెప్పుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన ప్రమేయం లేకుండా జరిగేవి మనకు ఎక్కువ ఆనందాన్నిస్తాయి. అమృతలత గారు ఇచ్చే పురస్కారాలు ఎప్పుడూ మగవాళ్ళకు ఇవ్వలేదు. రచయితలకు ఇవ్వలేదు. మీతోనే మొదలు పెడుతున్నాను అని అమృతలత జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. ఆమెవరో అప్పటికి నాకు తెలియదు. అవార్డులు ఎప్పుడైనానమ్మా! వాటంతట అవే రావాలి. అదే సంతృప్తి. నాకు దాదాపుగా 40 అవార్డుల దాకా వచ్చాయి.
మీరు రాసిన కథల్లో మీకు నచ్చిన కథ ఏది?
నేను రాసిన కథల్లో నాకు నచ్చిన కథ ‘స్పృహ’. ఎవరడిగినా అదే చెప్తాను. ‘నవ్య నీరాజనం’ అని నవ్య పత్రికలో వచ్చింది. ఇంటర్వ్యూ కూడా వేశారు. ఈ కథ దాదాపు అనేక పత్రికల్లోనూ, సంకలనాల్లోనూ 8 సార్లు రీ ప్రింట్ అయింది. దాంట్లో నా లైఫ్ ఫిలాసఫీలో అత్యంత ముఖ్యమైన వాక్యాలున్నాయి. “అవి రాలేదని, ఇది కాలేదని జుట్టు పీక్కోకు. నీకు ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది” ఇలాంటివి. ఇది లైఫ్ బేస్ డ్ కథ. నా కథలన్నింటిలో తాత్త్వికత ఉంటుంది. ఏలె విజయలక్ష్మి గారు నా రామాయణం మీద నాగార్జున యూనివర్సిటీ లో పి హెచ్ డి చేసింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ యూనివర్సిటీలో. మద్రాసు యూనివర్సిటీలో ఒకతను కథల మీద చేశాడు. ఆంధ్రా యూనివర్సిటీలో కథల మీద విజయేశ్వరావు పి హెచ్ డి చేశాడు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎమ్.ఫిల్ చేసినవారున్నారు.
మీ అసలు పేరుతో కాకుండా విహారి పేరుతో రచనలు చేయడానికి కారణం?
నేను చిన్నప్పుడు భాగవతం చదివేవాడిని. మా పెద్దమ్మ కొడుకు గొప్ప పండితుడని చెప్పాను కదా! మా ఇంట్లో ఆ వాతావరణం ఉండింది. కాబట్టి శ్లోకాలు అవన్నీ చిన్నప్పుడే బాగా వచ్చేవి. అయితే భాగవతం చదువుతున్నప్పుడు షష్ఠ్యంత్యాల్లో ” హారికి నంద గోకుల విహారికి…” అనే పద్యం ఉంది కదా! అది రోజూ చదువుతూ ఉంటే విహారి అనే పేరు బాగా నచ్చింది. అందుకే నేను పద్యాలు రాసే మొదట్లోనే ఆ పేరుతో ప్రారంభించాను. నా అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి పేరుతో గొప్ప పండితుడున్నాడు. జకార త్రయంగా తెలుగుదేశంలో జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, జమ్మలమడుగు మాధవశర్మ , జటావల్లభుల పురుషోత్తం అని ముగ్గురు గొప్ప వక్తలు ఉండేవారు. వాళ్ళని మించిన వాళ్ళు కవులలో కూడా ఎవరూ లేరు. సత్యనారాయణ మూర్తి గారు ఆంధ్రా యూనివర్సిటీలో మొదటి ప్రొఫెసర్. ఆంధ్రదేశం నుండి రష్యా వెళ్ళిన మొదటివాడు. అంతటి గొప్పవాడు అని నాకు తెలుసు. ఆ పేరుతో రాస్తే అపభ్రంశంగా ఉంటుందనిపించింది (నవ్వేస్తూ). నా పేరు అదే అయినా ఆయన పేరు చెడగొట్టడం ఎందుకని విహారిగా రాయడం మొదలుపెట్టాను.
సుధామ గారి సృజన ‘సప్తపదుల’ పై కూడా పుస్తకం రాశారు. మీ ఇరువురి అనుబంధాన్ని వివరించండి.
సుధామ గారు మలక్ పేటలో ఉన్నప్పుడు నేను మా అమ్మాయి వాళ్ళింట్లో ఉండేవాడిని. అక్కడే 16 ఏళ్ళు ఉన్నాము. ఆయనతో అక్కడే అనుబంధం ఏర్పడింది. అంతకుముందు విజయవాడ రేడియో స్టేషన్లో పనిచేసినప్పుడు రెండుసార్లు చూశాను. మలక్ పేట నుండి ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయిన తరువాత మేమూ ఇక్కడికి షిఫ్ట్ అయినాము. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి రావడం, అలాగే మమ్మల్ని ఇక్కడికే రమ్మని కోరడం వల్ల అనుకోకుండా మళ్ళీ ఒక్కదగ్గరికి చేరాము. మా ఇద్దరికీ అట్లా సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆయన సృష్టించిన ‘సప్తపదులు’ ప్రక్రియ చాలా వేగంగా విస్తరించింది. అది మొదలైన కొద్దిరోజులకే నేను పుస్తకం రాశాను.
ప్రాంతీయ భాషా అందాలను ప్రస్ఫుటం చేసే మాండలికాలను రచనల్లో వాడితే ఎలా ఉంటుంది? ఈ విషయంలో మీ అనుభవాలను చెప్పండి.
చాలా బాగుంటుంది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. మాండలికాలను మెచ్చుకునే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వాడిని. మాండలికం అనే కాదు. ఏ భాషలోనైనా ఒక జవం, జీవం అక్కడి మాట మాట్లాడితేనే వస్తుంది. అది ప్రజల భాష కదా! కథల్లో మాండలికం వాడిన వాళ్లలో మా గోఖలే మొట్టమొదటి వాడు. నేను చదివిన ఆయన కథల్లో మొత్తం మాండలికమే ఉంటుంది. తెలంగాణా వాళ్ళు ఆ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. ఏదో న్యూనతా భావం ఉండింది కానీ ఇప్పుడు బాగానే రాస్తున్నారు. నేను కూడా గుంటూరులో పుట్టి కృష్ణాలో 16 ఏళ్ళు ఉన్నవాడిని. మా ఆవిడది బందరు. అయితే నా పలుకుబడి నా రచనల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. చిల్లర భవానీ దేవిగారు ‘నా విగతం’ అనే కథా సంపుటిలో ఒక కథలో ఆ ప్రాంతపు పలుకుబడులు, సామెతలను ఉటంకిస్తూ రాసింది. అందువల్ల మాండలికాలు జీవద్భాష కాబట్టి అవి ఉండాలి. ఉన్నచోట ప్రోత్సహించాలి. నేనెప్పుడో చిన్నప్పటినుండి రాస్తున్నాను. మరి మా గోఖలే ఇంకా ముందు తరం వాడు కదా! ఆయనే ఆ కాలంలో మాండలికాలు ఉపయోగించాడు. కాబట్టి రచయితలు వాటి సౌందర్యాన్ని తరువాతి తరాలకు తెలియజేయాలి.
కథలు రాయడంలో ఏ విధానం పాఠకులను ఆకర్షింపజేస్తుంది?
కథలో ఏది చెప్పాడనేది వస్తువు. ఎలా చెప్పాడన్నది శిల్పం. మూడవది శైలి. శైలిలో మీరన్న మాండలికాలు అన్నీ వస్తాయి. కొంతమంది శిల్పాన్ని ఉత్తమ, ప్రథమ పురుషల్లో రాస్తారు. అయితే ఇవి కథలో ఏది కేంద్రమో దాన్ని ఆధారంగా చేసుకొని వస్తాయి. వస్తువును బట్టి శిల్పం. ఉదా:- ఒక వ్యక్తి స్వానుభవాన్ని చెబుతున్నప్పుడు అది ఉత్తమ పురుషలో రావాలి. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఏ భాషైనా ఉత్తమ పురుషలో రాసిన వాటికి ప్రాధాన్యత ఉంటుంది.
ఇప్పుడొస్తున్న సాహిత్యం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
ఇప్పుడు అన్ని ప్రక్రియల్లో వస్తున్నటువంటి సాహిత్యం గత కాలం వచ్చిన సాహిత్యాల కంటే మెరుగ్గా ఉందనే చెబుతాను. రచయితలు కొత్త జీవితానికి అలవాటు పడడం, జీవితంలో సంక్లిష్టతలను, సంకీర్ణమైన మానవ సంబంధాల విశేషాలను కూడా సాహిత్యంలో ప్రతిఫలింప జేయగలుగుతున్నారు. దీనివల్ల సాహిత్యంలో కృషి చేస్తున్న వారందరూ కూడా వివిధ వర్గాలకు, కులాలకు , వృత్తులకు చెందినవారు, వివిధ జీవన నేపథ్యం కలిగినవారు. దానివల్ల వారి స్వానుభవాలు గాఢంగాను, సాంద్రంగాను ప్రతిఫలిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన అంశం. ఈనాటి సాహిత్యం ఉన్నతమైన స్థానంలో ఉందనే నేను చెబుతాను.
నేటి రచయితలకు మీరిచ్చే సూచనలు ఏవి?
నేటి రచయితలకు నేనిచ్చే సూచనలు ఏమీ లేవు. వాళ్ళంతా కూడా ‘సెల్ఫ్ మేడ్’ సాహితీపరులు. ఆ కారణంగా ఇతరులు సూచనలు ఇవ్వాల్సిన స్థితిలో లేరు. కాకపోతే ముఖ్యమైన విషయం. ఈనాటి రచయితలకు అనుభవం ఉన్నది కానీ అధ్యయన పటిమ లేదు. మన వారసత్వం గానీ, సాహిత్యంలో గతం జరిగినటువంటి ప్రాధాన్యతలు గానీ ఏవీ తెలియవు. అది గనుక తెలుసుకున్నట్లయితే వారు ఆ పునాది మీద లేవ గలిగితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని నా సూచన.
చాలా సంతోషం సార్. మీ వంటి వారి పరిచయం మా పాఠకులకు ఒక చైతన్యదీపం. మీకున్న సమయంలో ఇంత ఓపికగా చాలా సేపటినుండి అడిగిన విధంగా మీ జీవితంలోని సాహితీ సుగంధాన్ని మాకు కూడా పంచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున ధన్యవాదాలు. సెలవు
తెలుగు వాఙ్మయంలో శతక ప్రక్రియకున్న స్థానం విశిష్టమైనది. పాల్కురికి సోమన మొట్టమొదటి “వృషాధిపశతకం” నుండి నేటివరకు జనుల జిహ్వాగ్రముల నుండి శతక పద్యాలు నిరంతరవాహినులుగా జాలువారుతూనే ఉన్నాయి. ఆధునిక కాలంలో శతకరచనలు చేస్తున్న కవులు అనేకులు పద్య రసవాహినిలో అందరినీ అలరిస్తున్నారు. శతకాలు భక్తి, వైరాగ్య, శృంగార, నీతి ప్రధానాలుగా ప్రజల జీవితాల్లో మమేకమైపోయాయి.

అటువంటివారిలో తనకొక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కవి శంభునికుమార్ గారు. ఇంతకుమునుపే తండ్రి పట్ల అనురాగంతో ఒక స్మృతి కావ్యాన్ని, ఆంజనేయ స్వామిపై భక్తితో ద్విశతిని, మరికొన్ని చిలిపిపద్యాలను రాసిన వీరు తను పుట్టిన సూరారం ఊరి దైవం అనంతపద్మనాభ స్వామి ప్రేరణతో ఒక శతకాన్ని రాసి ఆయనకు అక్షర నైవేద్యంగా సమర్పించారు. అదే “శ్రీ అనంత పద్మనాభ శతకం”.
“పలికెడిది భాగవతమట” అన్న పోతన, “చెప్పుమని రామచంద్రుడు” అన్న మొల్ల బాటలో “పంటపొత్తము గొని వండిన రీతిగా/ పద్యపాకము గూర్చు పాట్లు నావి” అంటూ తనకేదీ తెలియదని, చదువరులకు మెచ్చునట్లు కృతిని సాగనిమ్మని శతక ప్రారంభంలోనే ఆ జగన్నాథుని వేడుకుంటారు కుమార్ గారు.
“నే కుచేలుడను గాను” అనే పద్యంలో నేను నీకు ఏమీ కానని నన్ను విడిచిపెట్టొద్దు అని మొర పెట్టుకుంటారు..”అన్నదాతల మోమునందున” అను పద్యంలో జగతిలో సుఖశాంతులు కలిగి ఉండేలా వరమివ్వుమని, ఆ చిన్ని ఆశ తీర్పమని లోకక్షేమాన్ని కాంక్షిస్తారు. “కన్నవారిని వీడి ఉన్న ఊరిని వదిలి” అనే పద్యంలో మన వీరజవానుల త్యాగాన్ని మంచుకొండల్లో మెరిపిస్తారు.
“గంగా జలమనగ- కప్ప, చేపల ఎంగిలి” అనే పద్యం బాలమురళీ కృష్ణ గారి “ఏమీ సేతురా లింగా” అనే తత్వాన్ని స్ఫురింపచేస్తూ, మనం నిమిత్తమాత్రులమనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
“మూడు కాళ్ళను పొందు ముసలి గాక మునుపె” అని ” శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ”న్నట్లు ఈ శరీరం పూర్తిగా అధీనం తప్పకముందే మురారి నామస్మరణ కవచమై కాపాడుతుందని ఉద్భోధిస్తారు. “లాలిపాటలలేవి? లాలింపులవి యేవి?” అంటూ నేటి బాల్యం పూర్తిగా అదుపు తప్పిందని వాపోతారు.

“పోరి పోరి అలసిపోయితినిక నాకు/ లావొక్కింతయు లేదు, రంధి హెచ్చె” జీవితమనే పోరాటంలో అలసిపోయానని, బలహీనుడయ్యానని చెప్తూ భాగవత పద్యాన్ని గుర్తుకు తెస్తారు.
“పవి పుష్పంబగు, నగ్ని మంచగు” అని భర్తృహరి అన్నట్లు ” నీ దయ మాకున్న” పద్యంలో మా బ్రతుకు నీదే మాధవా! అంటూ హృదయపుష్పాన్ని సమర్పిస్తారు.
భక్తిభావమే కాకుండా ఈ శతకంలో తల్లిదండ్రులు, గోమాత, స్నేహభావం, శ్రమజీవులు, వ్యసనాలు, క్రీడలు, నైతిక విలువలు …మొదలైన ఎన్నో అంశాలు ప్రస్తావింపబడడం కవికి ఉన్న బలీయమైన సమాజ శ్రేయస్సు కాంక్ష గోచరమవుతున్నది. పురాణేతిహాసాల పట్ల వీరికున్న అపారజ్ఞానం అనేక పద్యాల్లో మనకు ద్యోతకమవుతుంది.
‘శంకు’ నుండి తీర్థంలా ఇంకా ఎన్నో శతక మకరందాలు ఈ కవి కలం నుండి ఆ అనంత పద్మనాభుని అనుగ్రహంగా స్రవించాలని ఆశిద్దాం.
– గన్నమరాజు గిరిజా మనోహర బాబు
సాహితీ విరించి బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, వ్యాఖ్యాత గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారితో మయూఖ ముఖాముఖి……. అరుణ ధూళిపాళ
నమస్కారం సార్ 🙏కవిగా, రచయితగా సాహిత్య రంగంలో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాక రంగస్థల నటులుగా అలరిస్తూ మీ ఆధ్యాత్మిక ప్రసంగాలతో భక్తి తత్పరతను చాటుతున్న మిమ్మల్ని కలుసుకొని మా పాఠకులకు పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
నమస్కారమమ్మా ! మన ప్రశ్నోత్తరాల కార్యక్రమం కంటే ముందుగా మయూఖ పత్రిక గురించి నా అభిప్రాయాన్ని చెబుతాను.
అలాగే సార్..అంతకంటేనా..చెప్పండి.
మయూఖ ద్వైమాసిక పత్రికను డా. కొండపల్లి నీహారిణి గారు ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అంతర్జాలంలో ఉపయోగించుకునే కొద్దీ, కొత్త కొత్త విజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ మార్గంలో రెండునెలల కొక్కసారైనా తెలుగు సాహిత్యాన్ని గురించి, తెలుగు సాహిత్యంలో చాలా పరిశోధన చేసిన ఎంతో మందిని గురించి వాళ్ళ సృజనాత్మక దృష్టిని గురించి చెప్పేటటువంటి గొప్ప పత్రికను స్థాపించారు. పైగా ఆమె ఒద్దిరాజు సోదరుల పైన పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టాను పొందారు. అసాధారణ మేధాసంపన్నులై, ఆనాటికే సాంకేతిక విజ్ఞానాన్ని కూడా వాళ్ళు అద్భుతంగా లోకానికి అందించిన వాళ్ళు. ఒద్దిరాజు సోదరుల గురించి మేము వరంగల్లులో చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. వారి యొక్క మేధకు వారసురాలిగా నీహారిణి గారు ఈ పత్రికను నిర్వహిస్తున్నారేమో అనిపిస్తుంది.
మా పత్రిక నిర్వహణ పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు సార్.
1. మీ జననం, బాల్యానికి సంబంధించిన వివరాలు చెప్పండి. జ : అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఆలంపూర్ లో గన్నమరాజు రామేశ్వర రావు, శకుంతలమ్మ దంపతులకు నేను మూడవ కుమారునిగా జన్మించాను. చిన్నతనం నుండే మా నాన్నగారు నాకు వందల శ్లోకాలను, పద్యాలను నేర్పించారు. వాటి గురించి నిత్యం ఆలోచింపజేస్తూ నన్ను ఒక విధంగా సాహిత్య రంగంలోకి మొదటి అడుగు వేయించిన గురువు. అదే సమయంలో ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో సంస్కృత పాఠశాలను పెట్టడం జరిగింది. పంతంగి వెంకటేశ్వర శాస్త్రి గారు, నరసింహ ఘనాపాఠి అవధాని గారు, మామిడాల సీతారామ శాస్త్రిగారు మొదలైన పెద్దలు పాఠ్యాంశాలు బోధించేవారు. దాంట్లో నన్ను ప్రవేశ పెట్టారు. అక్కడ మేము అమరకోశము, శబ్దమంజరి, పంచకావ్యాలు, అష్టాధ్యాయి, కొంతవరకు వేద పాఠాలు చదువుకున్నాం. నాలుగు సంవత్సరాలు నిరాఘాటంగా సాగిపోయింది. అప్పటికే 90 మందిమి ఉన్నాము. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు అక్కడికి వచ్చేవారు. ఒకవిధంగా అది గురుకుల పాఠశాల. అక్కడే నాకు గట్టి పునాది పడింది. కారణాంతరాల వల్ల అది మూతపడింది.
2. మరి మీ సాధారణ విద్యాభ్యాసం ఎలా కొనసాగించ గలిగారు?
జ : ఆ పాఠశాల మూతబడిన తరువాత సాధారణ విద్యలోకి వచ్చి 6, 7 తరగతులు, హెచ్ ఎస్ సి పూర్తి చేశాను. క్రమంగా నేను పి యు సి లో చేరకుండా అదే మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో ఉన్నటువంటి శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అడుగు పెట్టాను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి విద్యా విధానం ఉండేది. ప్రిన్సిపాల్ తెలకపల్లి విశ్వనాథం గారు, డా. శ్రీ రంగాచార్యగారు, వింజమూరి శేషఫణి శర్మగారు, ములుకుట్ల రామకృష్ణ శాస్త్రి గారు, మాకు చిన్నప్పుడు అష్టాధ్యాయి బోధించిన సీతారామ శర్మ గారు వీళ్లంతా లెక్చరర్లుగా ఉండడం వల్ల అక్కడి విద్యావిధానంతో సాహిత్యరంగంలో పురోగమనం వైపు నేను ముందడుగు వేయడం జరిగింది. అంతేకాదు నేను మరిచిపోయాననుకున్న సంస్కృత పరిజ్ఞానం కొంతవరకు అక్కడ బాగా ఉపయోగపడింది. అదొక భూమికగా నేను మర్చిపోలేనటువంటి జీవితాన్ని ఇచ్చింది. నేను మధ్యలో ఐదేళ్లు చదవకపోయినా దాంట్లో ఉన్న అనేక విషయాల నిరంతర మననం వల్ల నేను ప్రవేశించిన సాహిత్యరంగంలో బాగా తోడ్పడ్డాయి. గురువుల వాత్సల్యం, బోధన వల్ల విశ్వవిద్యాలయంలో ప్రథమునిగా రావడం ఒక గొప్ప విజయంగా భావించాను
3. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీ గురువుల గురించి చెప్పండి.
జ : పాలెంలో డిగ్రీ వరకు చదివాక నాకంటే ముందు కసిరెడ్డి వెంకటరెడ్డిగారు మొదలైన సీనియర్లు ఉండడం, వారిని ఆదర్శంగా తీసుకోవడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన తరువాత దివాకర్ల వేంకటావధాని గారు బాల, ప్రౌఢ వ్యాకరణాలు, అప్ప కవీయం వంటి వ్యాకరణ గ్రంథాలు బోధించారు. అసలు మేము బాల వ్యాకరణం చదివామన్న భావన లేదు. వ్యాకరణాన్ని కూడా కావ్యంగా చెప్పిన గొప్ప మేధావి ఆయన. ఒక ప్రయోగం వస్తే అవధానిగారు దాన్ని ఏఏ కవులు ఎట్లా ప్రయోగించారో ఆ పద్యాలు చెప్పేవారు. దానివల్ల సమగ్ర విషయాలను తెలుసుకున్నాం. ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ప్రత్యేకంగా పద్యభాగం బోధించేవారు. ముఖ్యంగా శ్రీనాథుని శృంగార నైషథం, చేమకూర వేంకట కవి విజయ విలాసం గొప్పగా బోధించి పద్యాన్ని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలో ఒక సమగ్రమైన దృష్టిని నాకు ప్రసాదించారు. “ప్రతి పద్య రచనా చమత్కృతి కలుగంగ చెప్పనేర్తు” అని విజయ విలాస కర్త చెప్పుకున్నాడు. ఆయన గురించి చెప్పినపుడు ప్రతి పద్యంలో ఎలాంటి చమత్కృతి ఉందో చెప్పేవారు. అక్కడే మాకు యశోదారెడ్డి గారు, ఆచార్య నాయని కృష్ణకుమారి గారు, డా. పల్లా దుర్గయ్య గారు వీళ్ళు మాకు బోధకులుగా ఉండి సరియైన మార్గాన్ని చూపించారు. మేము రెండవ సంవత్సరం ఎమ్ ఏ చేసేసరికి అవధానిగారు పదవీ విరమణ చేయడం వల్ల ఆచార్య రామరాజు గారు వచ్చారు. వారు మమ్మల్ని కొన్ని ప్రాంతాలకు తీసుకొనిపోయి ప్రసంగాలు ఇప్పించి ప్రసంగాలలో ఒక విధమైన శిక్షణ ఇచ్చారు. దీంట్లో ఒక చిన్న నేపథ్యం ఉంది. పాలెం కళాశాలలో ఉన్నప్పుడు “తెలుగులో నాకు నచ్చిన కావ్యం” అనే టాపిక్ లో ప్రతీ శనివారం ప్రతీ విద్యార్థి వక్తగా మాట్లాడే నియమం ఉండేది. నాలుగు సంవత్సరాలు అట్లా మాట్లాడేసరికి సభల్లో మాట్లాడడం, ఒక విషయాన్ని ఏ విధంగా విశ్లేషించాలి? శ్రోతల కెట్లా అర్థం కావాలి? ఈ విషయాల్లో మాకు తెలియకుండానే అవగాహన వచ్చింది. ఇక్కడ రామరాజు గారు ప్రత్యేకంగా నన్ను కామారెడ్డి మొదలగు చోట్లకు తీసుకు వెళ్లారు. వారితో పాటు కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మొదట సభల్లో పాల్గొనే మంచి సంప్రదాయంగా, తరువాత మాట్లాడే శక్తి మొదలగు విషయాలను నాకు బోధించినట్లయింది.
4. ఇంతటి సాహితీవేత్త అయిన మీరు పి హెచ్ డి ఎందుకు చేయలేదు?
జ: ముందుగా నేను సంస్కృతం చేశానమ్మా. తర్వాత ఎమర్జెన్సీ రావడం వల్ల దాదాపు 5, 6 నెలలు ప్రభుత్వం నిర్బంధించడం జైలు నుండి వచ్చాక ఉద్యోగంలో చేరడం వీటివల్ల ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. ఉస్మానియాలో ఉన్నప్పుడు వివిధ ప్రాంతాలకు వెళుతుండే వాళ్ళం అని చెప్పాను కదా! అందువల్ల నా పరిధి పెరిగింది. ప్రసంగించే అవకాశాలు ఎక్కువగా రావడం, దానిమీద ఆసక్తి మరింత పెరగడంతో పరిశోధన పక్కకు పోయింది. ప్రతిరోజూ ఏదో ఒక ఊరికి వెళ్లడం, ఎక్కడో ఒకచోట ప్రసంగాలకు పిలవడం, ప్రసంగాలు చేయడం పరిపాటి అయింది. ఇప్పటిదాకా పదిహేను వందల ప్రసంగాలు చేసి ఉంటాను. అప్పటికీ రామరాజు గారు మందలిస్తూనే ఉన్నారు. కానీ దాని మీద దృష్టి పోలేదు. అది అక్కడికే ఆగిపోయింది (నవ్వుతూ).
5. మీరు కారాగార శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయి?
జ : దేశమంతటా ఎమర్జెన్సీ విధింపబడిన రోజులవి. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం మొదలైంది. మేము విద్యార్థులం ఆ ఉద్యమానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాం. అరెస్ట్ వారెంట్ జారీ చేసి ముషీరాబాద్ జైలులో పెట్టారు. కొన్నాళ్ళు గడిచింది. మామీద ఏవో కేసులు పెట్టారు. ఆ కేసులు నిలబడలేదు. కాబట్టి మేమంతా బయటకు వచ్చాం. అయితే విశేషమేమిటంటే దాదాపు ఐదారు వందల మందిమి ఇవే భావాలున్నవాళ్ళం ఉన్నాం. అప్పటికే చాలా మందిని జైళ్లల్లో పెట్టారు. కొంతమందిని ‘MISA’ (Maintenance of Internal Security Act) కింద అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని ‘DIR’ (Defence of India Rules act) కింద అరెస్ట్ చేశారు. మేము డి ఐ ఆర్ కింద అరెస్ట్ అయినవాళ్ళం. మీసా కింద అరెస్ట్ అయిన వాళ్లకు సౌకర్యాలు ఎక్కువుంటాయి. కేసులు ఉండవు. మేమేవో పాంప్లెట్లు పంచి పెడుతున్నామని కేసు పెట్టారు. అయితే అది ప్రూవ్ కాలేదు. దాదాపు 5 నెలలు జైలులో ఉండి బయటకు వచ్చేసాం. ఆగస్ట్ 15 నుండి జనవరి 26 వరకు రోజూ సత్యాగ్రహాలు జరగాలని కమిటీ వాళ్ళు ప్రణాళిక వేశారు. జయప్రకాష్ నారాయణ ఉద్యమంతో పాటు ఆర్ ఎస్ ఎస్, విశ్వ హిందూ పరిషత్, విద్యార్థి పరిషత్ అందరమూ ఉన్నాం దాంట్లో. రోజుకు పదిమంది ఎక్కడో ఒకచోట సత్యాగ్రహం చేయాలి. అందులో ఒక్కరికి తప్ప మిగిలిన వారికి కూడా ఎక్కడ జరుగుతుందో తెలియకూడదు. ఏదో విధంగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవారు. అయితే నాకు కూడా మీరు ఫలానా చోట సత్యాగ్రహంలో పాల్గొనాలని సూచన వచ్చింది. కాకపోతే అంతకుముందే వేరే కేసులో నన్ను అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ కావడం వలన ప్రశ్నించడానికి వీలు లేదు. కానీ ఎవరి మీదా కేసులు ప్రూవ్ కాలేదు. తర్వాత ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వం ఏర్పడింది. ఒక్కో బ్యాచ్ లో 120 మందిమి ఉండేవాళ్ళం. పెద్ద కాంపౌండ్ ఉండేది. అందరం అక్కడే కలిసి ఉండేవాళ్ళం. రాత్రి 7 గంటల తర్వాత లోపలికి వెళ్లేవాళ్ళం. మొదట రెండు, మూడు రోజులు భోజనానికి ఇబ్బందులు పడ్డాం. తర్వాత అలవాటు పడ్డాం. అంతే తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.
6. మీ ఉద్యోగ ప్రస్థానాన్ని తెలపండి.
జ : జైలు నుండి వచ్చాక 1978 జనవరిలో సత్తుపల్లి జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో మొట్టమొదటి సారి ఉద్యోగంలో చేరాను. అక్కడ రాళ్లబండి కవితా ప్రసాద్ నా స్టూడెంట్. అక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఆ కళాశాలలో దూర దూరప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పించేవారు. ఆ రోజుల్లో ప్రయివేటుగా బి.ఏ చేసే అవకాశం ఏ యూనివర్సిటీలోనూ లేదు. ఒక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు. అందువల్ల చదువు మానేసిన చాలామంది ఒంగోలు, మార్కాపురం, కంభం, ఖమ్మం, విజయవాడ, ఏలూరు మొదలగు ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు. ఆ మొదటి బ్యాచ్ లో నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం బాగా ఉండేవి. నేనూ యువకుడినే కాబట్టి వయసు తారతమ్యం పెద్దగా లేకపోవడం వలన వారితో కలిసిపోయేవాడిని. వాళ్ళు చదువులో, నాటకాల్లో ముందుండి నడిచేవాళ్ళు. తర్వాత నాకు ఖమ్మం ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడ ఆరు సంవత్సరాలు పనిచేసి, నేనే ప్రత్యేకంగా కోరుకొని వరంగల్ కు రావడం, అక్కడ మూడేళ్ళు పనిచేసి, చివరి అయిదేళ్ళు హనుమకొండకు వచ్చి అక్కడే కాకతీయ ప్రభుత్వ డిగ్రీ, పి.జి కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా 2009 లో పదవీ విరమణ చేయడం జరిగింది. ముప్ఫై మూడేళ్ళ ఉద్యోగ జీవితం నాది.
7. నాటకరంగంలో మీకు ఆసక్తి ఎలా కలిగింది?
జ : నాకు చిన్నతనం నుండే నాటకాల పట్ల అభిరుచి ఉండేది. హైస్కూలులో ఉన్నప్పుడు చిన్న చిన్న పాత్రలు వేయడం, ఏకపాత్రాభినయం చేయడం అలవాటు. పాలెం వచ్చాక నాటకరంగంలో మేము ప్రతీ సంవత్సరం జాతీయ జ్యోతి, వీరపాండ్య కట్ట బ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, మహానటుడు మొదలైన అనేక నాటకాలు వేశాం. దీనిపట్ల అభిరుచి కలిగిన అధ్యాపకులు ఉన్నారక్కడ. రామకృష్ణ శాస్త్రిగారు, వింజమూరి శేషఫణి శర్మగారు దర్శకత్వం వహించి పెద్ద స్టేజీల మీద మాకు నాటకాలు ఎట్లా వేయాలో నేర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తరువాత ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. అవధాని మొదలైన వారు సాహిత్య రూపకాలు వేసేవారు. అవధాని గారు అల్లసాని పెద్దనగా, ఉత్పల సత్యనారాయణాచార్య గారు పింగళి సూరనగా, జి.వి. సుబ్రహ్మణ్యం గారు తెనాలి రామకృష్ణునిగా ఇట్లా ఉండేవారు. అది చూశాక ఇట్లాంటి రూపకం ఒకటి వేయాలనిపించింది. మా స్వగ్రామమైన ఆలంపురంలో ఇదే నాటకం వేశాము. మాకు ఆలంపురంలో గొప్ప అవకాశం గడియారం రామకృష్ణ శర్మగారు. మా ఇంటి పక్కనే మూడో ఇల్లు వారిది. మా ఊళ్ళో సంస్కృత పాఠశాల పెట్టడానికి వారే కారకులు. అప్పటికే వారు ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాద్ దానికి కార్యదర్శిగా ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్నవారు. ‘భాగ్యనగర్ రేడియో’ అని అప్పట్లో నిజాం ప్రభుత్వ వ్యతిరేకంగా రేడియో స్టేషన్ నడిపారు. సామాజిక , సాంస్కృతిక సంస్కరణలు చేస్తున్న వ్యక్తి. ఆయనతో ఈ నాటక విషయం ప్రస్తావనకు వచ్చింది. మన ఊళ్ళోనే చేద్దాం అన్నారు ఆయన. ఆయన అల్లసాని పెద్దనగా, నేను తెనాలి రామకృష్ణుడుగా ఇంకా కొంతమంది మిత్రులతో కలిసి వేశాము. దానికి చాలా పెద్ద పేరు వచ్చింది. హైదరాబాద్ లో కూడా నాటకాల విషయంలో కొంత కృషి చేశాను. నేను సత్తుపల్లిలో పనిచేసినప్పుడు మా విద్యార్థుల్లో మంచి మంచి నటులు ఉండేవారు. వెంకటేశ్వర రావు అని ఇప్పుడు జడ్జీగా ఉన్నాడు. హనుమంతరావు అని ఖమ్మంలో ఉంటాడు. తరువాత కవితా ప్రసాద్. వీళ్ళతో రెగ్యులర్ గా నాటకాలు వేయించేవాడిని. నేను వరంగల్ కు వచ్చిన తర్వాత నాటకసంస్థను స్థాపించడం, ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో నాటకాలు వేయడం, నాటకోత్సవాలు జరిపించడం చేస్తున్నాము. ఇప్పటికి 25 ఏళ్లుగా నడుపుతున్నాము. అట్లా సాహిత్య రంగంతో పాటు నాటకరంగం కూడా నా జీవితంలో భాగమయ్యాయి.
8. నాటకాల్లో మీకు నచ్చిన పాత్ర ఏది?
జ : నాకు బాగా నచ్చిన పాత్ర అల్లూరి సీతారామరాజు. దాదాపు 40, 50 సార్లు వేసి ఉంటాను. దుర్యోధనుడు, రావణాసురుడి పాత్రలు వేయాలంటే నా రూపం సరిపోదు (గట్టిగా నవ్వుతూనే). కాకపోతే నేర్పించాను. బళ్ళారిలో “రాఘవ నాటక కళారంగం” అని ఉంది. అక్కడ ఇమ్మప్ప అని ఒక మంచి నటుడు ఉండేవాడు. ఆయన శారీరకంగా దృఢంగా ఉండడం వల్ల వీరపాండ్య కట్ట బ్రహ్మన, రావణాసురుడి పాత్రలకు చక్కగా సరిపోయేవాడు. రాయలసీమలో కోయిలకుంట్ల, సంజామల ఇట్లా ఎక్కడెక్కడో తిరిగి నాటకాలు వేశాం. అప్పుడు శరబండరాజు అని ఒకాయన మాయల ఫకీరు అద్భుతంగా వేసేవాడు. పాలెంలో నా క్లాస్ మేట్. వాళ్ళను నేను తయారుచేశాను. ఇప్పటికి కూడా ఆ అభిరుచి వేరే రకంగా కొనసాగుతోంది. సాహిత్య రూపకాల్లో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, పోతన, భావకవి, ఒద్దిరాజు సీతారామారావు వంటి పాత్రలను ధరించాను. దాశరథి పాత్రను దాదాపు 60 సార్లు వేసి ఉంటాను. దాశరథి గారి పాత్రకు నేను చక్కగా సరిపోతానని గొల్లపూడి మారుతీరావు గారు ప్రశంసించేవారు.
9. సాహిత్యపు లోతుల్లోకి ఎలా ప్రవేశించగలిగారు?
జ : నా సాహితీ ప్రస్థానం ఆలంపూర్ పాఠశాల నుండి మొదలయిందని చెప్పాను కదా! అప్పటివరకు సాహిత్యం అంటే ఊరకే చదివాను తప్ప పాలెంకు వచ్చేవరకు దాని విశ్వరూపం తెలియదు. పాలెంలో మా గురువు శ్రీరంగాచార్య గారింట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. వందలాది పుస్తకాలు ఉండేవి. నాకు సీనియర్ విద్యార్ధులు కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, రుక్నొద్దీన్ గారు, మహమ్మద్ హుస్సేన్ గారు, నాగరాజు గారు, యాదగిరి గారు నిరంతరం ఆయన లైబ్రరీని చదివేవారు. వాళ్ళ స్ఫూర్తితో నేను కూడా సాహిత్యాన్ని చదవాలనే కోరికను పెంచుకున్నాను. అధ్యయనం అక్కడే జరిగింది. లోతుల్లోకి ప్రవేశించడం అక్కడే జరిగింది. కసిరెడ్డి గారి లాంటి సీనియర్లు వెళ్లిపోయిన తరువాత నేనింకా రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను కాబట్టి ఎన్నో విషయాలను మా గురువు గారి నుండి నేర్చుకున్నాను. వాళ్ళింటికి ఎన్నో పత్రికలు వచ్చేవి. వాటిని పఠించడం ద్వారా సాహిత్యంలోకి ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం కలిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి రాకముందే దాదాపుగా ప్రసిద్ధమైన వ్యక్తులను గురించి కానీ, ప్రసిద్ధమైన కావ్యాలను గురించి కానీ తెలుసుకున్నాను. గురువు గారికి ఎంతో మంది సాహితీవేత్తలతో పరిచయం ఉండడం వల్ల నిడదవోలు వెంకటరావుగారు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు లాంటి పెద్దలను గురించి వినే అవకాశం కలిగింది. వాళ్ళ పరోక్ష పరిచయం కలిగింది.

10. పాలెం ప్రాచ్య కళాశాలలో ఇంతటి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ఆ కళాశాలలో మిమ్మల్ని మీరు గర్వపడేలా చేసిన మరచిపోలేని అనుభవాన్ని తెలపండి.
జ : ఎంతోమంది సాహితీమూర్తుల పాండిత్యాన్ని ఆ కళాశాలలో తెలుసుకున్నానని ఇంతకు ముందే చెప్పాను కదా! అక్కడ ప్రతీ సంవత్సరం ఒక వక్తృత్వ పోటీ ఉండేది. దాని పేరు చాలా పెద్దదిగా ఉండేది. “వాద రంజిత వాగ్దేవతా వాగ్ధాటి నైపుణ్యాభివర్ధక సభలు” అనే పేరుతో పోటీలు నిర్వహించేవారు. అంటే ఏమిటంటే ఇరవై కిలోల ఒక సరస్వతీ విగ్రహం ఉండేది. రోలింగ్ షీల్డ్ అది. దానికి ‘సంచార వైజయంతికా’ అని మా ప్రిన్సిపాల్ తెలకపల్లి విశ్వనాథ శర్మగారు పేరు పెట్టారు. వివిధ కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొనేవారు. ఎవరు మాట్లాడి పోటీలో నెగ్గుతారో వారి కాలేజీకి దాన్ని ఇస్తారు. శలాక రఘునాథ శర్మగారు దానికి ప్రథమ విజేత. రెండవ సంవత్సరం గౌతమీ విద్యాపీఠానికి అది దక్కింది. మూడవ సంవత్సరం నల్లగొండ గీతా విజ్ఞానాంధ్ర కళాశాలకు, నాల్గవ సంవత్సరం నల్లకుంట ఓరియెంటల్ కాలేజీకి వచ్చింది. ఇక ఐదవ సంవత్సరం నేను విజేతగా నిలిచి మా కళాశాలకు వచ్చింది. “మనం పెట్టిన తర్వాత ఇప్పుడే మనకు వచ్చిందిరా!” అంటూ మా ప్రిన్సిపాల్ గారు చాలా సంతోషపడ్డారు. అదెప్పటికీ మర్చిపోలేను. అప్పుడు జడ్జెస్ గా కోరా శాస్త్రిగారు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు, దివాకర్ల వేంకటావధాని గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు లాంటి మహామహులున్నారు. వాళ్ళ ముందు విజేతగా నిలవడం గొప్ప విషయమే కదా! విశ్వనాథ సత్యనారాయణ గారిని, మాధవరామ శర్మ గారిని అక్కడే చూశాను. దాదాపు పండితులందరినీ ఆ కళాశాలలో చూశాను. వాళ్లంతా మా గురువు గారింట్లో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్లకు సేవలు చేసే బాధ్యత నాకుండేది. అందువల్ల నాకు తెలియకుండానే వాళ్ళందరి నుండి ఒక స్ఫూర్తిని పొందాను.
11. ముత్యాల వంటి అందమైన మీ లేఖన నైపుణ్యాన్ని గురించి విన్నాం. ఆ అనుభూతులు కొన్ని చెప్పండి.
జ : నేను రాసే అక్షరాలు అందంగా ఉంటాయని మా గురువులందరూ మెచ్చుకునేవారు. మా గురువు గారు శ్రీ రంగాచార్య గారు ఆయన వ్యాసాలన్నీ నా చేత శుద్ధ ప్రతి రాయించేవారు. వారప్పటిలోనే తెలుగులో ప్రసిద్ధ పత్రిక అయినటువంటి భారతిలోను, కాకినాడ నుండి ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళ పత్రిక చాలా ప్రతిష్టాత్మకమైనది వస్తుండేది. జయంతి రామయ్య పంతులు లాంటి వాళ్ళు ఉన్న పత్రిక అది. అప్పుడు బండారు తమ్మయ్య గారు, కాకరపర్తి కృష్ణమూర్తి శాస్త్రిగారు వీళ్లంతా ఆ పత్రికను నడిపేవారు. వీటిలో మా గురువు గారు వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల శుద్ధ ప్రతులను నేను తయారుచేసేవాడిని. ఆ తరువాత గురువుగారు సాహిత్య అకాడెమీ గ్రంథాలను పరిష్కరించి దశరథ రాజనందన చరిత్ర, తాళంక నందినీ పరిణయం వీటిని ప్రకటించారు. వాటిని శుద్ధ ప్రతులు తయారుచేయడం, తాళపత్ర ప్రతులను చూసి రాయడం చేసేవాడిని. ఇది కూడా నా సాహితీ అధ్యయన లోతులకు ప్రేరణ అయింది.
12. మీరు చేసిన వివిధ సాహితీసేవల్లో ప్రధానమైన “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ” వ్యవస్థను గురించి చెప్పండి.
జ : నేను ఖమ్మంలో ఉన్నప్పుడు రెండు, మూడు సంస్థలతో అనుబంధం ఉండింది. సత్తుపల్లిలో ఒక సాహిత్య సంస్థ పెట్టి దానిని కొంతవరకు నిర్వహించాం. వరంగల్లుకు వచ్చిన తరువాత ఇక్కడ సాహిత్య, సాంస్కృతిక రంగాలను ఒక వేదిక మీద నుండి నడపడం బాగుంటుందని ఒక ఆలోచన కలిగింది. అప్పటికి రాళ్లబండి కవితాప్రసాద్ జాయింట్ డైరెక్టరుగా సాంఘిక సంక్షేమ శాఖలో పని చేస్తుండేవాడు. ఆయన వరంగల్లుకు వచ్చాడు. “మనం ఒక మంచి ఆర్గనైజేషన్ పెడదాం సార్” అన్నాడు. వనం లక్ష్మీ కాంతరావు గారని మంచి నటులు. అప్పటికే ఆయన రాష్ట్రస్థాయి నటులు. ఆయన, నేను, బి.వి. శేషాచార్య, ఎ.వి. నరసింహారావు గారు మేమంతా కలిసి కవితా ప్రసాద్ ఇంట్లో కూర్చొని ఈ సంస్థకు రూపకల్పన చేశాం. దీనికి “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ” అని కవితా ప్రసాదే పేరు పెట్టాడు. లోగో కూడా తానే తయారుచేశాడు. ఒక అవధానంలో రెండు, మూడు పద్యాలు చెప్పాడు. బాగున్నాయని శతకం వేయమన్నాను. వారం రోజుల్లో రాశాడు. అదే కాదంబిని పేరుతో వచ్చింది. మొట్టమొదట మా సంస్థ తరఫున కవితా ప్రసాద్ పుస్తకమే వేశాము. ఎ.వి. నరసింహారావుగారి వచన కవితా సంకలనం కూడా వేశాము. అప్పటికే వరంగల్లులో లబ్ధ ప్రతిష్ఠులైన ఇద్దరు సాహిత్య దిగ్గజాలు ఉన్నారు. ఒకరు కోవెల సంపత్కుమారాచార్య గారు, సుప్రసన్నాచార్య గారు. వాళ్ళిద్దరి మార్గ దర్శకత్వంలో ఈ సంస్థను ప్రారంభించాం. ఇప్పటికి 26 వసంతాలు గడిచినా దిగ్విజయంగా నడుస్తోంది. కార్యక్రమాల నిర్వహణ కూడా రెండు భాగాలుగా చేసుకొని ఎనిమిది మంది నాటక రంగానికి, ఎనిమిది మంది సాహిత్య రంగానికి ఉండేటట్లు (షోడశ కళలుగా) ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని నిర్మించుకొని నడిపిస్తున్నాం.
13. ఈ సంస్థ ద్వారా మీరు చేసిన ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు ఏవి?
జ : మేము దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాము. మహాభారతం మొత్తం పద్ధెనిమిది పర్వాలకు పద్ధెనిమిది మందితో ప్రసంగాలు ఇప్పించాం. ‘మహాభారత దర్శనం’ అని పేరు పెట్టాం. మైలవరపు శ్రీనివాసరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అనుమాండ్ల భూమయ్యగారు, ఇట్లా దాదాపుగా మా సంస్థకు రాని సాహిత్యవేత్త లేడు. అట్లానే భాగవతం తీసుకొని ‘భాగవత సుధ’ పేరుతో. పన్నెండు స్కంధాలను భారతానికి పిల్చిన వాళ్లనే పిలిచాము. అది ఎంత క్లిక్ అయిందంటే వినడానికి వచ్చిన వాళ్ళు కనీసం వెయ్యికి తక్కువ ఉండరు. మొదట్లో ఖర్చుకు భయపడ్డాం. కానీ “సార్ సభలు ఎప్పుడు పెడతారు? డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి?” అనే పరిస్థితులు వచ్చాయి (గట్టిగా నవ్వుతూ). ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి ‘రామాయణ కల్పవృక్షం’ ఆరు కాండలను పన్నెండు భాగాలుగా చేసి ‘రామకథా పరిమళం’ పేరుతో ప్రసంగాలు ఇప్పించాం. రాజమండ్రి నుండి కేశవప్రగడ సత్యనారాయణ గారు, విశాఖపట్నం నుండి బులుసు వెంకటేశ్వర్లు గారు, కాకినాడ నుండి గరికపాటి వారు మొదలైన వాళ్ళు ప్రసంగించారు. తర్వాత పది ఉపనిషత్తుల మీద పదిరోజులు ఉపన్యాసాలు పెట్టించాము. ‘ఉపనిషచ్చంద్రిక’ అనే పేరుతో నిర్వహించాము. భగవద్గీత పద్ధెనిమిది అధ్యాయాలను పద్ధెనిమిది మందితో మాట్లాడించాం. ఆచార్య లక్ష్మణమూర్తి గారు మొదలైన వాళ్ళు వచ్చారు. సుప్రసన్నాచార్య గారి దర్శకత్వంలో ఇవన్నీ జరిగాయి.
పూర్వీకులు పృథ్వీ సూక్తం, అగ్నిసూక్తం మొదలైన అయిదు సూక్తాలతో పంచభూతాల ఆవశ్యకతను ఎట్లా గుర్తించారో ఆ కోణంలో ‘వేదసూక్త కౌముది’ అనే పేరుతో ప్రసంగాలు ఇప్పించాం. గరికపాటి వారు పురుషసూక్తం, దాని అంతరార్థం గురించి చెప్పారు. సాగి కమలాకార శర్మగారు శ్రీ సూక్తంలో ఉన్న వైజ్ఞానిక విషయాలను చెప్పారు. అంటే కేవలం ప్రవచనం లాగా కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త ధర్మాల ద్వారా ఇవన్నీ కూడా ఉన్నాయని, వాటి ఔన్నత్యాన్ని చెప్పడం కోసం ఏర్పాటు చేశాం. పాలకుర్తి రామమూర్తి గారు మొదలైన వాళ్ళు ప్రసంగాలు ఇచ్చారు. కరోనా వల్ల ఆగిపోయింది. వేద సూక్తాలు ఇంకా మిగిలివున్నాయి. మళ్లీ వాటిని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం.

14. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నిర్వహించిన పోటీల వివరాలను చెప్పండి.
జ : వీలైనంతవరకు విద్యార్థులలో అధ్యయనం పెంచాలనే తాపత్రయంతో హైస్కూలు విద్యార్థులకు ఒక సంవత్సరం సాహిత్యం మీద క్విజ్ పెట్టాం. వందపద్యాలు తప్పనిసరి చేశాం. పిల్లలు చేతులు కట్టుకొని గడగడా చెప్పేస్తుంటే ఆశ్చర్యం కలిగింది. మారుమూల పల్లెల్లో ఉన్న అమ్మాయిలు కూడా మొదటిస్థానంలో ఉండడం ఆనందాన్ని కలిగించింది. ప్రశ్నలు వేయడం, విజేతలను నిర్ణయించడం కష్టమైపోయింది. తర్వాత సంస్కృతీ క్విజ్ అని పెట్టాము. కేవలం భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలే. అది అత్యంత ఆశ్చర్యకరంగా సాగింది. తర్వాత నాటకాలకు సంబంధించిన అంశాలు, ‘మేరా భారత్ మహాన్’ అని భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపై క్విజ్ పెట్టాము. ఎక్కడైనా, ఏ అంశాలకు సంబంధించి అయినా మేము వెనుకాడవలసి వచ్చిందే కానీ పిల్లలు వెనుకాడలేదు. స్కూళ్ళకు వెళ్లి (జిల్లా స్థాయిలో) అక్కడే పోటీలు నిర్వహించాం. ఆ తర్వాత అట్లా తిరగడానికి మాకు మ్యాన్ పవర్ తగ్గింది. ఒక గొప్ప విషయం భార్గవి అనే ఒక అమ్మాయి మేము పెటైన అయిదు క్విజ్ లలో టాప్ గా ఉండింది. ఆమె గ్రూప్స్ లో సెలెక్ట్ అయి ఎ. జి ఆఫీసులో ఆఫీసర్ అయింది. ఈ పోటీలు ఆమెకు ఉపయోగపడడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
15. మీ సంస్థ చేస్తున్న నాటకరంగ సేవ ఎటువంటిది?
జ :- నాటకోత్సవాలలో భాగంగా ప్రతీ శివరాత్రికి మూడు రోజుల ముందు ప్రారంభించి శివరాత్రితో ముగిసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అవి పర్మినెంట్ డేట్స్. మాలో ఎవరైనా ఒకరు ముందే అన్ని చోట్లకు వెళ్లి ఏ నాటకాలు వేయాలో సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా మేము ప్రదర్శించిన నాటకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అటు సాహిత్యరంగాన్ని, ఇటు నాటకరంగాన్ని సమన్వయం చేసుకుంటున్నాం. దాదాపు వెయ్యి మంది సభ్యులున్నారమ్మా. మాకు ప్రతీ సంవత్సరం మూడు నుంచి ఆరు లక్షల ఖర్చు ఉంటుంది. వాటికోసం మేమేమీ కష్టపడకుండా ఎంతోమంది నుండి ఆర్థిక సహకారం లభిస్తూనే ఉంది. మాకు అర్థమైంది ఒక్కటే. పని చేసి ఫలితాన్ని చూపిస్తే సహకారం చేసేందుకు ముందుకు రావడానికి ఎవరూ వెనుకాడరని.
16. సహృదయ సంస్థ తరఫున మీరిచ్చే పురస్కారాలను గురించి చెప్పండి.
జ :- మేము సంవత్సరానికి నాలుగు కార్యక్రమాలు తప్పనిసరి చేశాం. వార్షికోత్సవ సందర్భంగా ఒద్దిరాజు సోదరుల మీద ఒక పురస్కారాన్ని ఇస్తున్నాం. 25 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. వారి కుటుంబీకులే దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో అయిదు ప్రక్రియలు తీసుకున్నాం. మొదటి సంవత్సరం నవల, రెండవ సంవత్సరం కథ, మూడవ సంవత్సరం వచన కవిత, నాల్గవ సంవత్సరం పద్యకవిత, అయిదవ సంవత్సరం సాహిత్య విమర్శ. ఇట్లా అయిదు ఆవృతులైనాయి ఇప్పటికి. అంటే 25 మందికి ఇచ్చాం. గరికపాటి నర్సింహారావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు, అల్లం శేషగిరిరావు గారు, కేశవరెడ్డి గారు, నాళేశ్వరం శంకరం గారు, కాలువ మల్లయ్య గారు, డా. బన్న ఐలయ్య గారు, ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారు ఇట్లా ప్రముఖులకు ఇచ్చాం. జనవరి, ఫిబ్రవరిలో పేపర్ ప్రకటన ఇచ్చి వచ్చిన వాటిని స్క్రూటినీ చేస్తాం. ఇద్దరు న్యాయ నిర్ణేతలను ఎంచుకుంటాం. వారెవరన్నది వాళ్లిద్దరికి కూడా తెలియదు నాకు తప్ప. వార్షికోత్సవ సభకు ఆ న్యాయ నిర్ణేతలను కూడా పిలుస్తాం. ఒకసారి ఎల్లూరి శివారెడ్డి గారికి, ఎస్వీ రామారావు గారికి ఇచ్చాను. వాళ్ళు పక్క పక్కనే కూర్చుంటారు. కానీ వాళ్లకు తెలియదు. సభలో ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోయారు. మాకు చెప్పలేదు అన్నారు (నవ్వేస్తూ). ఇట్లా ఎందుకంటే అవార్డుల విషయంలో కొంత అనుమానం ఉంటుంది. పారదర్శకత కోసం నాకు మాత్రమే తెలిసేలా ఈ పద్ధతి పాటిస్తున్నాం. ఆంధ్రదేశం మూలమూలల నుండి ఎంతోమంది ప్రముఖులను జడ్జీలుగా పెట్టాము. 25 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులు వచ్చినా ఆపలేదు. జి.వి. సుబ్రహ్మణ్యం గారు “మీ ప్రియారిటీస్ ఏముంటాయి?” అన్నారు. అదేమీ లేదు సార్. “మీరు ఏది చెబితే అదే మా ప్రియారిటీ” అన్నాను. ఆయన ఎంతో ఆనందించారు. “కవిత్వానికి ఇస్తారు. సాహిత్య విమర్శకు ఇచ్చేవాళ్లను నేను చూడలేదు” అని ప్రశంసించారు.
17. మీ సంపాదకత్వంలో వెలువడిన రచనలేవి?
జ : కరీంనగర్ లో శ్రీభాష్యం విజయసారథి గారు మహా సంస్కృత విద్వాంసులు. ప్రతి సంవత్సరం మేమక్కడ కార్యక్రమాలు చేస్తుంటాం. 25 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ‘విశ్వారణి’ అని ధర్మాన్ని గురించి, ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఒక సంచిక వేయలనుకున్నాము. పుల్లెల శ్రీరామచంద్రుడు మాకు గురువు. ఆయన, రఘునాథాచార్యులు గారితో వ్యాసాలు తెప్పించి నా సంపాదకత్వంలో అదొక పుస్తకం వేశాను. మా సహృదయ వార్షికోత్సవ సందర్భంగా ఒక పుస్తకం, రజతోత్సవంలో ‘రసహృదయ’ అనే పేరుతో ఒక పుస్తకం వేశాను. సుప్రసన్నాచార్య గారి 80 ఏళ్ల వయస్సులో అసీతి ఉత్సవ సందర్భంగా వారి రచనలను గురించి వేశాను. దహగం సాంబమూర్తి అనే పెద్దమనిషి 80 ఏళ్ల సందర్భంగా పుస్తకం వేద్దామంటే ఆయన వద్దని ‘భారతీయ చింతన’ గురించి వేద్దామన్నారు. అందరినీ ఆహ్వానించి రాయించాను. వేదాలంటే ఏమిటి ? ఉపనిషత్తులంటే ఏమిటి? ఇట్లాంటి వాటికి సంబంధించి 90 వ్యాసాలు వచ్చాయి. ఇటీవలే ‘భారతీయ చింతన’ పేరుతోనే మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ గారు, శ్రీరంగాచార్య గారు ఆవిష్కరించారు. వీలైనంత వరకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించాలనే నా తాపత్రయం. ఓరుగల్లు వైభవం, గడియారం రామకృష్ణ శర్మ గారి శతపత్రము ఇలాంటివన్నీ నా సంపాదకత్వంలో వెలువడ్డాయి.
18. శతక సాహిత్యంపై మీకు ఎక్కువ మక్కువ కలగడానికి కారణం ఏమిటి?
జ :- నాకు తెలుగులో శతక సాహిత్యం మీద ముందు నుండే ఆసక్తి ఎక్కువ. ఏ పద్యానికి ఆ పద్యమే అయినప్పటికీ మానవ విలువలకు మొదటి మెట్టు శతకమే. మా నాయనగారు చిన్నప్పుడు అన్నీ శతక పద్యాలే నేర్పించారు. కాబట్టి శతకాల మీద ఆలోచన చేసే కొద్దీ ధర్మపురి శేషప్ప కవి 17వ శతాబ్దంలో రచించిన “అధిక విద్యావంతులప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి” అన్నట్లు ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే కదా! ఎంత గొప్ప మాట అది. “ఎండిన ఊళ్ల గోడెరిగింపడెవ్వడు, పండిన ఊళ్లకే ప్రభువులంత” అన్న కాళోజీ మాటలకు ఆయన కవిత్వం గురించి ఎంత గొప్పదిగా ఉందని అంటే కాళోజీ గారు “ఇన్ని కాలాలైనా ఇప్పటికీ గొప్పదిగా ఉందంటే, నేనిక్కడ సంతోషపడాల్నో దుఃఖపడాల్నో తెలియదయ్యా! నేను రాసింది బాగుందని సంతోషపడాల్నో, ఇప్పటికీ ఏమీ మారలేదని దుఃఖ పడాల్నో” అన్నారట. శేషప్పకవి ఇప్పుడుంటే అలాగే అనేవాడేమో( పెద్దగా నవ్వుతూ). మానవులకు సరియైన మార్గ నిర్దేశం చేసేది శతకమని నా విశ్వాసం. ఆలిండియా రేడియో వాళ్ళు అప్పట్లో ఒక సిరీస్ గా 20 శతకాలను పరిచయం చేయుమని నన్నడిగారు. దాన్ని తర్వాత ‘శతక సమీరం’ అనే పుస్తకంగా వేశాను. నేను రిటైర్ అయ్యేముందు “తెలుగు శతకాలు – సామాజిక, నైతిక విలువలు” అనే అంశం తీసుకొని కన్నడ శతకాలు, సంస్కృత శతకాలు వీటి మీద మద్రాస్ మరియు ఇతర ప్రాంతాల నుండి పెద్దవాళ్లను పిలిపించి కాలేజీలో సెమినార్ పెట్టాను. ఉదాహరణకు ధూర్జటి “రాజుల్మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు” అంటూ పరిపాలకుల్లో ఉన్న దుర్మార్గాలను ఎండగట్టాడు. ఇట్లాంటివి ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యం. వేణుగోపాల స్వామి శతకం, ఆంధ్రనాయక శతకం, గోగుల పాటి కూర్మనాథకవి సింహాద్రి శతకం మొదలైన వాటిపైన ప్రసంగాలు పెట్టించాను. రాజమండ్రి మొదలైన ప్రాంతాల నుండి ఎంతోమంది వచ్చారు. అవన్నీ కలిపి పుస్తకం వేశాను.
19. మీ రచనా వ్యాసంగం, దృశ్య మాధ్యమాల్లో మీ వ్యాఖ్యానాలు, ప్రసంగాలను గురించి చెప్పండి.
జ : రచనా రంగంలో అనేక పత్రికలకు వ్యాసాలు రాశాను. ఆ కాలంలో భారతి పత్రికకు కూడా రాశాను. ఆంధ్రజ్యోతిలో ‘పరంజ్యోతి’ అనే ఒక శీర్షిక వచ్చేది. ఆధ్యాత్మికమైనది. కరోనాలో దాన్ని ఎత్తివేశారు. కరోనా కాలంలో కొన్ని పేజీలు కూడా తగ్గించారు. అందువల్ల కొన్ని శీర్షికలను తీసివేశారు. తీసివేయడానికి మొట్ట మొదట వారికి కనిపించింది ఆధ్యాత్మిక శీర్షిక. ఏం చేస్తాం? నమస్తే తెలంగాణలో ‘నమస్తే నమః’ అనే శీర్షికలో భగవద్గీత మీద నేను రాశాను. ఇక దృశ్య మాధ్యమాల్లో వేంకటేశ్వర భక్తి ఛానెల్ కంటే ముందు తిరుపతి బ్రహ్మోత్సవాల్లో లైవ్ చెప్పేవాడిని. పద్ధెనిమిది సంవత్సరాలు వ్యాఖ్యానం చెప్పాను. ధర్మపురిలో కేసీఆర్ ప్రారంభించిన గోదావరి పుష్కరాలకు వ్యాఖ్యానం చెప్పాను. కర్నూలులో తుంగభద్ర పుష్కరాలకు చెప్పాను. మేమొక తొమ్మిది మందిమి ఉండేవాళ్ళం. రొటేషన్ లో మూడు నెలలకు ఒకసారి తిరుపతికి వెళ్లి రెండు రోజులు ఉండి స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలకు వ్యాఖ్యానం చెప్పేవాడిని. చేతకాక ఇప్పుడు వెళ్లడం లేదు. టివి లో CVR ఛానల్లో పద్యాలను పరిచయం చేస్తూ పద్య సౌరభం అనే పేరుతో దాదాపు నలభై ఎపిసోడ్లు చేశాను. TV9 లో అంపశయ్య నవీన్ గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని ఇంటర్వ్యూ చేశాను. దూరదర్శన్ వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయల 500 పట్టాభిషేక సందర్భంగా కవిసమ్మేళనం లైవ్ పెట్టినపుడు పాల్గొన్న 25 మందిలో నేనూ ఒకడిని. “మహా కవులకు నీరాజనం” అనే కార్యక్రమంలో సుప్రసన్నాచార్య గారు నన్నెచోడుడుగా, గరికపాటి వారు తెనాలి రామకృష్ణుడుగా, నంది తిమ్మనగా నేను నీరాజన సమర్పణ చేశాం. అదంతా పుస్తకంగా వచ్చింది. సాహిత్య కార్యక్రమాల కోసం దేశమంతటా తిరుగుతూనే ఉంటాను. తీసుకుపోయే వాళ్ళుండాలి అంతే (పెద్దగా నవ్వుతూ). ఇదంతా ఒక రకంగా నా సాహితీ యాత్ర అనుకోండి.
20. ఆంధ్ర సారస్వత పరిషత్తుతో మీకున్న అనుబంధం ఎటువంటిది?
జ : చిన్నప్పటి నుండీ సారస్వత పరిషత్తు నాకు తెలియకుండానే పరిచయం అయింది. మా ఊళ్ళో 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలు జరిగాయి. మా నాన్నగారు దానికి కార్యదర్శి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారు. ఆంధ్రదేశంలో ఉన్న పండితుల్లో ఒక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, వేలూరు శివరామ శాస్త్రిగారు ఆరోగ్యం బాగా లేక తప్ప అందరూ వచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు స్నాతకోపన్యాసం. రాధాకృష్ణన్ గారు ప్రారంభకులు. రాని తెలుగువారు లేరట. వాటికి సంబంధించిన కరపత్రాలు అవన్నీ మాఇంట్లో ఉండడం, మా నాయనగారు, రామకృష్ణ శర్మగారు ఎప్పుడూ దాని గురించి చెబుతూ ఉండడం వల్ల సారస్వత పరిషత్తు మాదే అన్నట్టు ఉండేది. నేను హైదరాబాద్ కు వచ్చిన తరువాత రోజూ పరిషత్తుకు వెళ్ళేవాడిని. ఏవో మీటింగులు జరుగుతూనే ఉండేవి. ఒకసారి రామానుజరావుగారు “మీవాడు ఎమ్.ఏ. చేస్తున్నానంటున్నాడు కానీ ఎప్పుడూ ఇక్కడే కనిపిస్తున్నాడు” అని శర్మ గారితో అన్నారు (నవ్వుతూ). శర్మ గారి కుమారుడు శ్రీవత్స అని పరిషత్తులో లైబ్రేరియన్ గా చేస్తుండేవాడు. నేనెప్పుడూ వానితోనే ఉండేవాడిని. రామానుజరావు గారు ఎప్పుడు వచ్చినా అక్కణ్ణే కనిపించేవాడిని. ఆయన ఎంతో క్రమశిక్షణ కలవారు. ప్రతి నెలా మొదటి ఆదివారం ఒక విషయం మీద ప్రసంగం, చర్చ ఉండేవి. కె.కె. రంగనాథాచార్యులు గారని ఉండేవారు. ఆ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం నుండి అందరినీ తీసుకొచ్చే బాధ్యత నామీద పెట్టారు.
పన్నెండు పన్నెండు చొప్పున ఆ ప్రసంగాలను ఆరు సంవత్సరాలు ఆరు పుస్తకాలుగా వేశారు. ఎంతో విలువైన పుస్తకాలవి. అకాడెమీ మీటింగులు జరిగేవి. దాశరథి గారు వంటి ప్రముఖులు వచ్చేవారు. వాళ్ళందరినీ శర్మగారే నాకు పరిచయం చేశారు. దాన్ని ఎప్పుడూ మా ఇంటి సంస్థ గానే భావించాను.
21. పరిషత్తుతో అంతగా మమేకమైన మీకు దాని రథసారథి దేవులపల్లి రామానుజరావు గారి పురస్కారం పొందడం ఎటువంటి అనుభూతిని ఇచ్చింది?
జ : నేను అమెరికాలో ఉన్నప్పుడు శివారెడ్డి గారు ఫోన్ చేసి దేవులపల్లి రామానుజరావు గారి పురస్కారాన్ని ఈసారి నీకే ఇస్తున్నాం అన్నారు. ‘నాకెందుకు సార్?’ అన్నాను. “లేదు లేదు నీవు రావాల్సిందే!” అన్నారు. మిగతావి ఏవేవో పురస్కారాలు, యూనివర్సిటీ కీర్తి పురస్కారాలు ఏవో వచ్చాయి కానీ వాటి మీద ధ్యాస లేదు. చిన్నప్పటి నుండీ దాంట్లో మమేకమై ఉండడం వల్ల సారస్వత పరిషత్తు నుండి అవార్డు పొందడం గొప్ప అనుభూతి. ఆ సంస్థ 75 ఏళ్ల సంచికలో ‘అక్షరయానం – ఆత్మీయబంధం’ అని రాశాను. 1974 నుండే అది నాతో నడుస్తూనే ఉంది.
22. చివరగా సాహితీ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన మీరు ఇప్పటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ : మీరడిగిన దానికి ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెబుతాను. సినారె గారు ప్రతి రోజూ క్లాస్ కు ప్రిపేర్ అయ్యేవారు. ఒకసారి “ఇన్నేళ్ళుగా చెబుతున్నారు కదా! ఇంకా ఎందుకు ప్రిపేర్ అవుతారు?” అని ఆయనను అడిగాను. “వీళ్ళు మహా కవులు. మన అనుభవం పెరిగే కొలది కొత్తగా దర్శనమిస్తారు” అన్నారాయన. గొప్ప సత్యమది. నిజానికి ఆయన చదవవలసిన పని లేదు. అది ఇప్పుడు నా అనుభవంలోకి వస్తోంది. నేనిప్పుడు చదువుతుంటే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సార్వకాలీనత అనేది ప్రాచీన కవుల్లో ఎందుకున్నదనడానికి ఒక రామాయణం, భారతం, ఇతర కావ్యాలు నిలబడ్డాయంటే దాంట్లో అన్ని కాలాలకు ఉపయోగపడే ధర్మాలున్నాయనే కదా! అంతే కాదు “ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం ఉండదయ్యా! కవిత్వం ఉంటుంది. పాతవాళ్ళు రాస్తే ప్రాచీనం, కొత్తవాళ్ళు రాస్తే ఆధునికం. మనం చేయవలసింది సమన్వయించుకోవడం, కవిత్వం ఏ స్థాయిలో ఉందో చూడగలగడం. ప్రాచీనమైనా, ఆధునికమైనా ఉత్తమ సాహిత్యం నిలబడుతుంది” అని సినారె గారు చెప్పిన మాటలు అందరికీ శిరోధార్యాలు. సాహిత్య విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతీ ఒక్కడూ మహాకవి అయిపోయినాడు. అధ్యయనం పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లకు వాళ్లే గొప్ప. ఎదుటివాళ్ళ గొప్పతనాన్ని గుర్తించే స్థాయి లేదు. ఈ దుస్థితి నుండి బయటపడి మంచి సాహిత్యం రావాలి.
ధన్యవాదాలు సార్. మీ అత్యంత విలువైన సమయాన్ని మా ముఖాముఖి కార్యక్రమానికి వినియోగించి, మీ సాహితీ ప్రయాణాన్ని, ఆధ్యాత్మిక విశేషాలను వివరించినందుకు మా తరఫున మా మయూఖ పాఠకుల తరఫున అభివందనాలు.
తమ జీవితాన్ని పూర్తిగా విశేషమైన సాహితీ సేవకు అంకితం చేసిన ధన్యజీవులు గిరిజా మనోహర్ బాబుగారు. వారు మునుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు🙏🏼
– అక్కిరాజు సుందర రామకృష్ణ
కవితా గాండీవి, నాట్య శ్రీనాథ, పద్యవిద్యామణి మొదలగు బిరుదులు పొందిన ప్రముఖ నటులు, గాయకులు, కవి, రచయిత అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో మయూఖ ముఖాముఖి… – అరుణ ధూళిపాళ
వివిధ రంగాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించి ఆయా ప్రముఖుల ప్రశంసలు పొందిన అక్కిరాజు సుందర రామకృష్ణ గారి జీవిత విశేషాలను వారి మాటల్లో తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏
1. మొట్టమొదటగా మీరు పుట్టి పెరిగిన ఊరు, తల్లిదండ్రులు మొదలగు విషయాలు చెప్పండి.
జ: అమ్మా! నమస్కారం. దేశంలో ‘ఋషి’ శబ్దం చాలా గొప్పది. విశ్వనాథ వారు రెండవ వాల్మీకి అని ఒక పద్యంలో చెప్పినట్టు మా నాన్నగారు కవి పండితుడు కాదు గానీ ఋషి. మంచి శిష్టాచార కుటుంబం. నాకు ఇద్దరక్కయ్యలు, నలుగురు అన్నయ్యలు, నాతో కలిపి మొత్తం ఏడుగురం. ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెప్పి మమ్మల్ని ఇంత యోగ్యులను చేసాడంటే ఆయన ఋషి. మా నాన్నగారి పేరు అక్కిరాజు రామయ్య పంతులు, మా అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ. నేను1949 ఏప్రిల్ 23 చైత్ర బహుళ ఏకాదశి, శనివారం నాడు జన్మించాను. మేష లగ్నం కావడం వల్లనో ఏమో మొదటి నుంచీ మాట పడేవాడిని కాదు.
మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. అది మహాకవులకు, జాతీయ వాదులకు నెలవు. 1930 ప్రాంతంలో మా నాన్నగారు అక్కడికి వచ్చారు. ఆయన తన మంచితనం, గొప్పదనంతో అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. గొప్ప గాయత్రీ ఉపాసకుడు. అదే నాకు కూడా కొంచెం అబ్బింది. ఆయన సుందర కాండ పారాయణం చేసేవారు. తత్ఫలితంగా నేను పుట్టానని సుందర రామకృష్ణ అని పేరు పెట్టారు. మా రెండో అన్నయ్య అక్కిరాజు రమాకాంతరావు గారు. ప్రసిద్ధ రచయిత. మీ అందరికీ తెలిసినదే.
2. నరసరావు పేటలో మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచింది?
జ: నాకు పది, పదిహేనేళ్ళు వచ్చేసరికి మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ‘ఆవారా’. అందులో కూడా అగ్రశ్రేణి ‘ఆవారా’ ( నవ్వుతూ ). చిలిపి పనులు ఎన్నో చేసేవాడిని. “ఆర్తజన గేయ పాతూరి ఆంజనేయ” అనే మకుటంతో నేను రాసిన ‘ఆంజనేయస్వామి శతకం’ లో నా బాల్య చేష్టలను రాసుకున్నాను. నేను అందరికంటే చిన్నవాడిని కావడం వలన మా అమ్మగారు బాగా గారాబం చేసేది. మా ఊరివాళ్ళు ఎకసెక్కాలు చేసేవారు. పదోతరగతి కూడా పాసవుతానని ఎవరూ అనుకోలేదు. నరసరావుపేట హైస్కూలులో లంకా సీతారామ శాస్త్రిగారు సంస్కృత పండితులు. మాకు గురువు. ఆయన రాజ్ భవన్ కి వెళ్లి సంస్కృతం నేర్పేవారు. ఆయన కూడా ఒకసారి మా నాన్నగారితో “మీ చివరి వాడు ఎందుకూ పనికిరాడయ్యా రామయ్య పంతులూ” అన్నాడట. అలా ఉండేవాడిని. స్కూల్ ఎడ్యుకేషన్ లో మూడుసార్లు తప్పాను. మా నాన్నగారు ఆంధ్రా మెట్రిక్యులేషన్ కట్టిస్తే అదీ తప్పాను.
ఆ సమయంలో మా మూడో అన్నయ్య ప్రభాకర్ గారు మెహదీపట్నంలో ఉంటుండేవారు. ఆయన నాకు పద్యాలను బట్టీ కొట్టించినట్లు, లెక్కలు బట్టీ కొట్టించి పరీక్ష రాయించారు. అప్పుడు అత్తెసరు మార్కులతో పాసయ్యాను. నరసరావుపేటలో ఉంటే నాలో మార్పు రాదని 1966 లో హైద్రాబాదుకు తీసుకువచ్చి, న్యూ సైన్సు కాలేజీలో పియుసి లో చేర్పించారు. అక్కడ కూడా నాలో మార్పు రాలేదు. బైపిసి అంటే అది కాస్త బుర్ర ఉన్న వాళ్ళకని నా అభిప్రాయం. అందుకేనేమో బాటనీ లెక్చరర్ భార్యగా లభించింది (నవ్వుతూ). ఆ తరువాత 1967, 68లో వెనక్కి వెళ్లి హిస్టరీ, పొలిటికల్ సైన్సు, స్పెషల్ తెలుగుతో కాలేజీలో చేరాను. చాలా పెద్ద మార్పు వచ్చింది. హిస్టరీలో కాలేజీ ఫస్ట్ వచ్చాను. అంత మార్పును ఎవరూ ఊహించలేదు. అప్పటి నుంచి వెను తిరిగి చూసుకోలేదు.
3. రంగస్థలంపై మీ అరంగేట్రం ఎలా జరిగింది?

జ: ఇంటిలో ఉన్న వాతావరణం నాకు తెలుగు మీద అభిమానాన్ని కలుగజేసింది. నాకు తెలుగు బోధించిన గురువుల వల్ల తెలుగు భాషా గొప్పదనం అర్థమై, తెలుగు భాషలో పరిణతి సాధించి, తెలుగు మాష్టారిని కావాలని ఒక కోరిక కలిగింది. అప్పుడప్పుడు కళాశాలలో పాడుతుండడం వల్ల గురువులు, తోటివాళ్ళు బాగా పాడతావని ప్రోత్సహించారు. 1968 లో బి.ఏ లో వారణాసి వెంకటేశ్వర్లు గారు మాకు తెలుగు గురువు. ఆ కాలేజీలో ఆయనతో పాటు మదనపల్లి సత్యనారాయణ గారు, జొన్నభట్ల వీరభద్రయ్య గారు భాషలో నిష్ణాతులు. వారణాసి వెంకటేశ్వర్లు గారు నాకోసం ఒక నాటకం రాసారు. శివాజీ పాత్రకు సరిగ్గా నేను సరిపోతానని శివాజీ వేషం వేయించారు. అది మొదలు 1968, 69, 70 మూడేళ్లు నేను కాలేజీలో బెస్ట్ యాక్టర్ ని. అదృష్టవశాత్తు నాలో ఘంటసాల గారి గాత్రధర్మం ఉండడం వల్ల చిన్నప్పటినుండే స్కూల్లో ‘అహో ఆంధ్ర భోజ’, ‘నీల గగన ఘన శ్యామ’, ‘మోహనరూప గోపాలా’ లాంటి పాటలను అప్రయత్నంగానే అందరూ మెచ్చుకునేలా పాడేవాడిని. అయితే కొరిటాల వెంకట కోదండ రామారావు గారు నేను బాగా పాడుతుండడం చూసి ఒక సాంఘిక నాటకంలో సందర్భాన్ని సృష్టించి ‘వీరాభిమన్యు’ సినిమాలో కృష్ణుడిని బెదిరిస్తూ ” బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా ! నను భాగమిమ్మనెదరా, బెదిరింతురా ఏయ్…” (పాడుతూ ) పౌరాణిక రంగస్థల అరంగేట్రానికి ఇది నాంది. దీని తర్వాత పద్య పరంపర మొదలైంది.
4. ఆకాశవాణిలో ఉద్యోగం ఎలా సంపాదించగలిగారు?
జ: నేను నరసరావుపేటలో డిగ్రీ మూడేళ్లు పూర్తి చేసుకొని హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ ఎమ్. ఏ. నిజాం కళాశాలలో చేరాను. ఎన్. వి. రాజగోపాల్ అని ప్రిన్సిపాల్. కోవూరు గోపాల కృష్ణగారు, కులశేఖరరావు గారు, జి. వి. సుబ్రహ్మణ్యంగారు, రవ్వా శ్రీహరి గారు, తంగిరాల నారాయణ శర్మగారు, అమరేశ్వరం రాజేందర్ గారు.. ఇలాంటి హేమాహేమీలు అందరూ ఉండేవారు. అది సాయంకాలం కాలేజీ కాబట్టి డ్రామాలు వేయడానికి కుదిరేది కాదు. నా డ్రామాల తృప్తిని ‘AIR’ లో తీర్చుకున్నాను. రేడియోలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కోరికగా ఉండేది. దానికి కావాల్సిన ఎన్నో సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. ఉత్తమ గాయకుడు, ఉత్తమ నటుడు, తెలుగు ఎమ్.ఏ, వ్యాఖ్యాత ఇవన్నీ ఉన్నాయి. “సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవంత చోటు”, “పేరుకు ప్రజలదె రాజ్యం, పెత్తందార్లదే భోజ్యం” (ఆరుద్ర ) అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేవు.
రేడియోలో అడిషన్స్ కి వెళ్ళాను. పెద్ద అద్దం, దానికో కర్టెన్ కడతారు. నేను అప్లికేషనులో పౌరాణికంలో ప్రవేశం ఉందని రాశాను. ముందు ఒక డైలాగ్ చెప్పి, పౌరాణికంలో ఒక డైలాగ్ చెప్పి, పద్యం గానీ, పాట గానీ పాడమన్నారు. మూడవది రేడియోలో బాగా ప్రయత్నం చేశానన్నావు కదా! వార్తలు ఎలా చదవాలో చెప్పుమన్నారు.
రెండు రౌండ్లు అయ్యాక “బానిసలంచు…..” అనే పద్యం పాడటం మొదలుపెట్టాను. వెంటనే కర్టెన్ తొలగించి ‘వీడెవడు’ అన్న కుతూహలంతో నా వైపు చూశారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదని నా అభిప్రాయం. ఎంతో గర్వకారణంగా అనిపించింది. తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎంతగానో ప్రశంసించారు. అలా రేడియోలో స్థానం సంపాదించాను.
5. రేడియో ఆర్టిస్టుగా మీ సహ ఆర్టిస్టులు, వారితో మీ అనుభవాలను చెప్పండి.
జ : నేను శారదా శ్రీనివాసన్, మద్దూరు విజయలక్ష్మి, మల్లాది విజయలక్ష్మి , మీరా కుమారి మొదలైన ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్టులందరితో నాటకాల్లో వేశాను. సంగీత రూపకాలన్నింటికీ నన్ను పిలిచేవారు. గాయకుడు చిత్తరంజన్ గారు కూడా నామీద ఎంతో అభిమానం చూపించేవారు. రెండు, మూడేళ్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. పాలగుమ్మి విశ్వనాథం గారు, కొండా బలరామశర్మ గారు ( పుట్టు గుడ్డి అతను )..ఇలాంటి గొప్ప ఆర్టిస్టులుండేవారు. రేడియోలో వచ్చే కార్మికుల కార్యక్రమం నిర్వహించే ఆర్టిస్టులు ఏకాంబరం ( వట్టెం సత్యనారాయణ ), చిన్నక్క ( రతన్ ప్రసాద్ )లకు నేనంటే ఎంతో అభిమానం. ఒక్కొక్కప్పుడు వాళ్ళ రికార్డింగులు కూడా పక్కన బెట్టి మా రికార్డింగు వినడానికి వచ్చేవారు. నన్ను ఒక గాయకునిగా, పద్య నటునిగా, ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తిగా ఆకాశవాణి నిలబెట్టింది. హైద్రాబాద్ ఆకాశవాణి ద్వారానే లోకానికి నేను పరిచయమయ్యాను. ఇప్పటికీ కూడా యామినీ పూర్ణ తిలక, బద్దెన సేనాని, వెంకటేశ్వర మాహాత్మ్యం, నరకాసురవధ నాటకాలు రేడియోలో వస్తుంటాయి.
6. రంగస్థలంపై మీ నాటకాలకు లభించిన ప్రోత్సాహం గురించి ఏవైనా రెండు విషయాలు చెప్పండి.

జ: 1980 లో నాకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాతే రంగస్థలం వైపు ఎక్కువ దృష్టి పెట్టాను. ‘యోగివేమన’ నాటకం మార్నింగ్ షో జరిగింది. జె.ఎస్.ఎన్. శాస్త్రి గారని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ లో పనిచేసేవారు. ఆ నాటకంలో ఆయన వేమన. నేను అభిరాముడు. బ్రహ్మాండంగా నాటకం సాగింది. నేను గ్రీన్ రూమ్ లోకి వచ్చి మేకప్ తీసేసుకుంటుండగా వేలూరి సహజానందగారు వచ్చి ఆలింగనం చేసుకొని రేడియోలో ఎంత గొప్పగా పాడావో, స్టేజీ మీద అంతకన్నా గొప్పగా పాడావు నాయనా అని అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ జనరల్, కీర్తిశేషులు, భజంత్రీలు, మనస్తత్వాలు ఇలా ఎన్నో నాటకాల్లో నటించాను. భమిడిపాటి రాధాకృష్ణ, ఆరుద్ర, కొరపాటి గంగాధరరావు మొదలైన వాళ్ళు రాసిన నాటకాల్లో వేసేవాడిని. హైదరాబాద్ లో నాటకాల్లో నన్ను బాగా ప్రోత్సహించిన వ్యక్తి ఎర్రమనేని చంద్రమౌళి గారు. నాకు గురువు ఆయన. ఇక ఆకాశవాణిలో పనిచేసే మద్దూరు విజయలక్ష్మి, ఆమె భర్త సోమేశ్వరరావు గారు ఫోటోగ్రాఫర్. వాళ్ళు ఖైరతాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం. నేను పిల్లవాడినని, చక్కగా ఉంటానని, అవకాశం వస్తే స్టేజీమీదికి ఎక్కించాలని బాగా ప్రోత్సహించేవాళ్ళు. అయ్యదేవర పురుషోత్తమ రావు స్థాపించిన సి.ఎస్.ఆర్.కళామందిర్ అని ఉండేది. దాంట్లో పురుషోత్తమరావు కృష్ణుడి పాత్ర వేసి, అర్జునునిగా నాతో వేయించాడు. అది బాగా రక్తి కట్టింది. కొన్ని వందలసార్లు అర్జునుని పాత్ర వేశాను. అర్జునుడంటే అక్కిరాజు, అక్కిరాజు అంటే అర్జునుడు అనే పేరు తెచ్చుకున్నాను.
7. అటు ఆకాశవాణిలోను, ఇటు నాటకరంగంలోను పూర్తిగా నిమగ్నమైన మీకు వేంకటపార్వతీశ కవుల పైన పిహెచ్ డి చేయడానికి ప్రోత్సహించిందెవరు?
జ: మంచిప్రశ్న. 1985 – 86 కాలంలో ఉధృతంగా నాటకాలు వేస్తున్నాను. ఇరివెంటి కృష్ణమూర్తి గారు విద్యానగర్ లో ఉండేవారు. ఆయన, నేను ఆటోలో వస్తున్నాం. అప్పుడాయన “అరేయ్! ఈ నాటకాలు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి. ఇవి నీకు భగవంతుడు ఇచ్చిన వరం. పి హెచ్ డి చెయ్యరా తొందరగా” అన్నాడు మహానుభావుడు. నేను పట్టించుకొనలేదు. అప్పటికే కాలేజీలో 150 రూపాయలకు ఉద్యోగంలో చేరి కష్టపడుతూ ఉన్నాను. పరాయతనం కృష్ణమూర్తి గారని ఓరియెంటల్ కాలేజీలో చేస్తున్నారు. ఆయన తిలక్ రోడ్ లో ఉండేవారు. “అబ్బాయ్! నీవు అటూ ఇటూ పిల్లిలాగా తిరగకు. అదే కాలేజీలో ఉండు” అన్నారు. జలగం వెంగళరావు గారి పుణ్యమా అని ఎయిడెడ్ కాలేజీలో వచ్చింది. ప్రభుత్వ కాలేజీలతో సమానంగా జీతం ఉండేది. ముందు ఎంఫిల్ చేశాను. నందిని సిధారెడ్డి, అనంతలక్ష్మి, పరిమళ, మృణాళిని వీళ్లంతా నా క్లాస్ మేట్స్. “వేంకటపార్వతీశ కవుల ఏకాంతసేవ” నా ఎంఫిల్ టాపిక్. అది మధురభక్తికి సంబంధించినది. దాన్ని రామరాజుగారు సూచించారు. ఇక్కడ ఒక గమ్మత్తు అయిన విషయం చెప్పాలి. నేను పరీక్ష రాస్తుండగా రవ్వా శ్రీహరిగారు వచ్చి పేపర్లు తీసుకొని పట్టుకొని ఊపారు కాపీ కొడుతున్నానేమోనని. కొంతమంది ముఖాలను చూస్తే అలా అనిపిస్తుందేమో ( పగలబడి నవ్వుతూ ). మొత్తానికి ఎంఫిల్ అయిపోయింది. పి హెచ్ డి కి అప్లికేషను పెట్టుకున్నాను. అప్పుడు బిరుదురాజు రామరాజుగారు
“వేంకటపార్వతీశం కవుల ఏకాంతసేవ” గురించి చేశావు కదా! వారి పద్య రామాయణం, ఇతర కావ్యాల మీద పిహెచ్ డి చేయి” అన్నారు. పక్కనే ఉన్న నారాయణరెడ్డి గారు రంగస్థల నటుల్లో ఇంత మంచి స్వరం ఎవరికీ లేదు అన్నారు. వారి నుండి ఆ మెప్పు పొందడం చాలా సంతోషాన్ని కలిగించింది. నారాయణరెడ్డి గారి పలుకుతీరు చాలా గొప్పది. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇరివెంటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో “వేంకట పార్వతీశ కవులు – రామాయణ పద్య కృతులు” అన్న అంశంపై డాక్టరేట్ పొందాను. పరాయతనం కృష్ణమూర్తి చెప్పినట్లు ఠాగూర్ హామ్ కాలేజీ అని నేను చేసిన కాలేజీ 1974 నుండి 2007 వరకు అదే కాలేజీలో ఏకచ్ఛత్రాధిపత్యంగా అక్కడే ఉన్నాను.
8. మీకు నచ్చిన, మీరు బాగా అభిమానించే నటులు ఎవరు?
జ: అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా అభిమాన నటుడు ఎన్టీరామారావుగారే. ఆయనను బాగా ఇమిటేట్ చేసేవాడిని. ఒకసారి “మామా! కురు సార్వభౌమా! పాండవ దూతనై నీ యొద్దకు” అని మొదలుపెట్టాను. ఆయనకు నామీద కోపం వచ్చింది. పద్యం పాడడం ఘంటసాల వలె. యాక్షన్ ఎన్టీఆర్ లాగా. అయితే ఒక స్థాయిలో ఉన్నవాడు, దేవాలయం కట్టించుకునేంత స్థాయికి ఎదిగినవాడు, గొప్ప నటుడు, కారణజన్ముడు, కలియుగ కృష్ణుడు అని బిరుదు పొందినవాడు బాగా చేస్తున్నావని ప్రోత్సహిస్తే బాగుండేది. కానీ ఆయన సహించకపోవడం బాధ కలిగించింది. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇది ఫాక్ట్. అందుకే కవినైనాను. నండూరి రామకృష్ణాచార్యులు “You are more than NT Ramarao” అన్నారు. ఘంటసాల గారు లేకపోతే ఎన్టీరామారావు గారికి గాత్రం లేదు కదా! అది ఉండడం నాకు ప్లస్ పాయింట్. ఇప్పటికీ నేను చెప్పేది ఎన్ టి ఆర్ తో నేను ఎప్పుడూ సమానం కాలేను. ఎందుకంటే నేను గాయకుడిని కావచ్చు, విద్యాధికుడిని కావచ్చు, కానీ ఎన్టీఆర్ పర్సనాలిటీ ఎవరికీ రాదమ్మా!
ఇప్పుడు యాదగిరిగుట్ట స్పెషల్ ఆఫీసరుగా ఉన్న కిషన్ రావు గారికి నేనంటే వల్లమాలిన ప్రేమ. నాతో ఎన్టీరామారావు గారి ముందు కృష్ణుడి వేషం వేయించాలని ఆయన కోరిక. ఢిల్లీలో నాటకం వేస్తున్నాం.
ఎన్ టి ఆర్ గారు “కిషన్ రావు గారూ! ఇటు రండి” అని పిలిచి ఆడనీయకుండా కర్టెన్ వేయించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన చేతనే నాకు సన్మానం చేయించారు కిషన్ రావు గారు. ఆ సమయంలో ఆయన నన్ను చూసిన చూపు మరచిపోలేనిది. ఆ వేదికపై పివి నరసింహరావుగారు, కుముద్ బెన్ జోషిగారు కూడా ఉన్నారు. అంటే ఒక మనిషిలో మనకు కనపడని మరొక వ్యక్తి కూడా ఉంటాడన్న మాట. అది మనం గ్రహించాల్సింది. ఇది చెప్పడానికే ఈ విషయం చెప్పాను కానీ ఎవరినీ తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఎన్.టి.ఆర్ లాంటి రూపము, అకుంఠిత దీక్ష, అతడు తినేలాంటి భోజనం, ఇవన్నీ చూస్తే అతని లాంటి వాడు ఎవరూ ఉండరు. అతడొక విచిత్రమైన కారణం జన్ముడమ్మా! నాగేశ్వరరావు గారితో కూడా చేశాను. అతను పెద్దగా చదువుకోకపోయినా విప్రనారాయణ, జయభేరి, కాళిదాసు లాంటి పాత్రలు వేసి మెప్పించాడు. నేను రంగారావు, ముక్కామల, సూర్యకాంతం వంటి వాళ్ళతో తప్ప మిగిలిన వాళ్ళందరితో చేశాను. దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంత అనుభవంలో నా అభిమాన నటుడు ఎన్టీరామారావు అనే చెప్తాను. అందుకే ఆయన మీద రెండు శతకాలు రాశాను.
9. జమున గారితో ఎన్నో కృష్ణుని పాత్రలు వేశారని విన్నాం. ఆమెతో మీ నాటకరంగ ప్రస్థానం ఎలా మొదలయ్యింది?
జ : జమునగారు ఒకసారి నన్ను త్యాగరాయ గానసభలో నారద పాత్రలో నన్ను చూసి “నువ్వు నారదుడివి కావు. కృష్ణుడి పాత్రలు వేయాలి” అన్నారు. అంతే. అక్కడినుండి ఒక పదేళ్ల పాటు దేశమంతటా ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రదర్శనలిచ్చాం. గేట్ల ముకుందరెడ్డి (ఎమ్మెల్యే ) ఆధ్వర్యంలో పెద్దపల్లిలో పెద్ద సన్మానం జరిగింది. కడప, షోలాపూర్, సింధలూరు, కర్ణాటక, మహారాష్ట్ర …ఇలా అనేక ప్రాంతాల్లో నాటకాలు వేశాము. ఎన్నో ప్రశంసలందుకున్నాము. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో జమున గారి పక్కన ఎన్టీఆర్ కృష్ణుడిగా వేస్తే, రంగస్థలంపై ఆమె పక్కన నేను కృష్ణుడిగా వేశాను. అయితే ఎన్టీరామారావు గారు నాతో “టీవీలో నీ తులాభారం చూశాను బ్రదర్” అన్నారు. కానీ ఎట్లున్నది చెప్పలేదు (నవ్వుతూ ).

10. జమున గారితో ఉన్న అభిమానంతోనే ‘జమునా రమణా’ పంచ పద్య శతతి రాశారా?
జ: రకరకాల వ్యక్తులు, రకరకాల శక్తులు, రకరకాల యుక్తులు. జమున గారు గొప్ప నటి. అందులో సందేహం లేదు. సత్యభామ పాత్రకు ఆమెను మించిన వారు లేరు. సత్యభామ అంటే ఆమే అన్నంతగా ఉండేది.
“సత్యాపతి పాత్రకు
సత్యము మన యన్టియారె సరియౌ కాదో?
సత్యగ మాత్రము భళిరా
సత్యము నీ సాటి నీవె జమునా రమణా!”
సినిమా రంగంలో ఉండే కుట్రలు, కుతంత్రాలు, చదువులు, సంధ్యలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వీటన్నిటిని గురించి ఐదు వందల పద్యాలు రాశాను. సినిమా యాక్టర్ అయిన ప్రదీప్ వాళ్ళ తండ్రి వెంకటేశ్వర్లు గారికి, నాతోపాటు అర్జునుడి పాత్ర వేసే అయ్యదేవర పురుషోత్తమ రావు గార్లకు ఈ పుస్తకం అంకితం ఇచ్చాను. జమున గారికి ఇచ్చి చదవమన్నాను. చదివారా అని పదే పదే అడిగి గుర్తు చేసాను. ఆమె కనీసం పట్టించుకొనలేదు. చివరకు ఏదీ చెప్పకుండానే స్వర్గస్తురాలయింది. అసూయ ద్వేషాలతోనో, కోపంతోనో చెప్పడం లేదు. బాధతో చెప్తున్నా. ఇంతగా ఆమె గురించి రాసిన నేను ఆమె నుండి ఏమీ ఆశించలేదు. కానీ ఆమె కనీసం గుర్తించకపోవడం బాధ కలిగించింది. నాతో పదేళ్లు సత్యభామగా నటించిన వ్యక్తి మా కృష్ణుడు, మా అక్కిరాజు ఇలా నా మీద పద్యాలు రాశాడని చెప్పకపోవడం చాలా బాధాకరం.
11. సాహిత్యరంగంలో మీ మొదటి కావ్యం ‘అమ్మతోడు’ గురించి చెప్పండి.
జ: 2000 సంవత్సరం నుండి నేను రాయడం మొదలుపెట్టాను. మొట్టమొదటి కావ్యం ‘అమ్మతోడు’. దానికి జ్వాలాముఖి మంచి పీఠిక రాశారు. రాళ్లబండి కవితా ప్రసాద్, ఆచార్య తిరుమల నన్ను ఆశీర్వదించారు. అప్పటినుండీ పరంపరగా సంవత్సరానికి రెండు చొప్పున పుస్తకాలు వేస్తున్నాను. ఇందులో భాష సరిగ్గా రాక ఇష్టం వచ్చినట్లు రాసి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి స్టేజీల మీద గజమాలలు వేసుకునేవారిని ఎండగడుతూ రాశాను. నేనంత సంస్కృత పండితుడిని కాను, తెలుగు భాషా పండితుడినని గర్వంగా చెప్పుకోను. కానీ ఏమీ రాని వారు సత్కారాలు పొందడం చూసి తట్టుకోలేక రాశాను. తీవ్ర సంచలనం రేగింది.
మా ఊళ్ళో భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. స్వామికి ఇరువైపులా వీరభద్రుడు, భద్రకాళి ఉంటారు. ఆ అమ్మవారు అత్యంత సౌందర్యవంతంగా ఉంటుంది. నా 75 ఏళ్ళ వయస్సులో అంత సౌందర్యం ఎక్కడా చూడలేదు నేను. హనుమంతుని గుండెను చీలిస్తే రాముడు కనిపించినట్లు, నా హృదయాన్ని చీలిస్తే ఆ అమ్మవారు ఉంటుంది. ఆమె అంటే అంతటి భక్తి నాకు. ఆమె అనుగ్రహంతోనే నేను ఇవన్నీ రాయగలుగుతున్నాను. ఛందో సంబంధమైన వ్యాకరణాంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఏదో ప్రయోజనం ఆశించి నేను రాయలేదు. ఒక హృదయావేదన నుండి రాసింది. ఆ పుస్తకాన్ని వట్టికోట ఆళ్వారు స్వామికి, దాశరథికి అంకితమిచ్చాను. ఏ పుస్తకాన్నయినా ఇద్దరికి అంకితం ఇవ్వడం నాకలవాటు. వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడ్డారు? నిజానికి రజాకార్ల కాలంలో చచ్చిపోయేవాళ్ళు. ఉద్యమాల్లో వెలుగులోకి రాకుండా ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా! కానీ తెర మీదకు ఎవరినో తీసుకువస్తారు. ఇదిగో ఇలాంటి అంశాలనే ‘అమ్మతోడు’ లో రాశాను. రాజకీయ నాయకులైతేనేమి? అవకాశ వాదులైతేనేమి? ఇలాంటివారు ప్రతీ రంగంలో ఉంటారు. వాళ్ళను గురించి రాశాను. కవి ఎప్పుడూ అవకాశవాది కారాదనేది నా ఉద్దేశ్యం. అలా సాహిత్యరంగంలో ‘అమ్మతోడు’ తో అడుగుపెట్టాను. ఇప్పటికి 54 పుస్తకాలు రాశాను.

12. ఇంతటి సాహిత్య రచన చేసిన మీరు అభిమానించే కవి ఎవరు?
జ: నా అభిమాన కవి దాశరథి. “తెలగాణ కవుల లోపల తలచగ దాశరథి యొకడె” అన్నాను నేను. “మిగతావాళ్ళు కాదా?” అని ప్రశ్నిస్తారు. కాదనడం లేదు. కానీ వ్యక్తిత్వ పరంగా కాదని నా అభిప్రాయం. దాశరథి తన 18 ఏండ్ల వయస్సులో కొడుతుంటే తప్పించుకుంటూ, పొలాల వెంబడి పరుగులెత్తి, బురద గుంటలో పడి, సిమెంటు కలిపిన అన్నం తిని, నోట్లో మూత్రం పోసినా పోయించుకొని భరించాడు. ఇదంతా ఆయనకు ఏమవసరమమ్మా? జాతికోసం భరించాడు. అందుకే నేను “దాశరథీ సత్కవితాశరథీ” అని ఒక పుస్తకం రాశాను. అందులో జ్వాలాముఖి పీఠిక రాశారు. బిరుదురాజు రామరాజు గారు కూడా “బాబూ! ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు” అన్నారు. అంటే నేనేదో మహా పండితుడినని కాదు. “అంత నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా దాశరథి వ్యక్తిత్వాన్ని కళ్ళముందు దృశ్య సాక్షాత్కారంగా చేసింది నువ్వే”. అని ఉత్తరం రాశారు. ఇప్పటికీ ఆ ఉత్తరం ఉంది నా దగ్గర. నాకు దాశరథి గారితో పరిచయం ఏర్పడ్డ తరువాత ఆయన నన్ను చాలా అభిమానించారు. ‘ఒరే అబ్బాయ్!’ అనేవారు. ఒకసారి బమ్మెరలో కవిసమ్మేళనం జరిగినప్పుడు నన్ను తీసుకొని పోయి పద్యాలు పాడించారు. అప్పుడు నేను వాళ్ళకంటే చాలా చిన్నవాడిని. అదీ హృదయమంటే.
13. ‘అధిక్షేప కవితారత్న’ బిరుదు పొందడానికి మీ రచనల్లోని అంశాలు కారణమా? ఎలా?
జ: నాటక రంగంలో చూస్తే అభినవ కృష్ణుడు, అభినవ ఘంటసాల, నాట్య శ్రీనాథ అన్నారు. కానీ సాహిత్యంలో అధిక్షేపకవి అని పేరు పొందాను. ఇప్పటికాలంలో నా దృష్టిలో సాహిత్యానికి, సమాజానికి ఏ విధమైన పక్షపాతం లేకుండా నిష్పక్షపాత ధోరణిలో సేవ చేస్తున్నవారు కె. వి. రమణాచారి గారు. ఆయన గురించి ‘కెవి రమణా’ అనే మకుటంతో శతకం రాశాను కందపద్యాల్లో. అది కూడా అధిక్షేపమే. మీరంటుండవచ్చు. ఇలా రాసి మీరేం సాధించారని? నాతో ఒకాయన అన్నారు. ” నువ్వు ఇలా రాయకుండా ఉంటే ఎన్నో అవకాశాలు వచ్చేవి. అవన్నీ పోగొట్టుకున్నావు” అని. కోవెల సంపత్కుమారాచార్య గారు నాకు ఒక ఉత్తరం రాశారు. ఇన్ లాండ్ లెటర్ అది. ఇప్పటికీ దాచుకున్నాను. “నాయనా! చిన్నవాడవు. చాలా బాహాటంగా పెద్దలైన వ్యక్తుల్ని నీ ధోరణిలో విమర్శిస్తున్నావు. ఉడుకు రక్తం. అది మంచి పద్ధతి కాదు. పైకి రావాల్సినవాడివి”. ఇట్లు…నీ శ్రేయోభిలాషి, కోవెల సంపత్కుమారాచార్య. అని రాశారు. నేను దాశరథి, అలిశెట్టి లాంటి ఆవేశపరుడిని కాను. ప్రశ్నించే తత్వం నాది. ఊరకే ఉండడం నాకు చేతకాదు.

కొండపల్లి శేషగిరిరావు గారు గొప్ప చిత్రకారులు. ఆ కాలంలోనే వారికి ‘పద్మశ్రీ’ రావాలి. ఆయన నన్ను ఎంతో అభిమానించేవారు. కానీ వచ్చిన వారికే మళ్లీ పురస్కారాలు వస్తున్నాయి. అందుకే నా బాధ. అన్ని పుస్తకాలు అధిక్షేపంగా రాశానని కాదు. కానీ అధిక్షేపం లేకుండా రాయను. కీర్తి కోసం రాయడం లేదు. సమాజంలో నచ్చని అంశాన్ని ప్రశ్నిస్తున్నాను.
14. మీ రచనల్లో అధికశాతం శతకాలై ఉండడానికి కారణం వివరిస్తారా?
జ: మకుటం ఉంటుంది కాబట్టి దాన్ని శతకం అనాలే తప్ప శతక లక్షణం ఒక్కటీ ఉండదు. ఉన్న విషయాన్ని సూటిగా సత్యప్రకటన చేయడం నాకలవాటు. చదివిన వారు వాళ్లను గురించే అనుకుంటే నేనేమీ చేయలేను. “సత్యానికి గెలుపన్నది తథ్యమురా మానవుడా” అన్న దాశరథి చివర్లో ఎన్ని కష్టాలు పడ్డదీ అందరికీ తెలుసు. ఆస్థాన కవి పదవి నుండి పక్కకు రావడానికి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. ఇవన్నీ నన్ను బాధిస్తాయి “ఎప్పటి కయ్యెడు ప్రస్తుతమప్పటికా మాటలాడి…..తప్పించుకు తిరుగువాడు ధన్యుడు” అన్న సుమతీ శతకకారుని ఒప్పుకోను నేను. తప్పించుకు తిరిగేవాడు సమాజానికి ఎలాంటి మేలు చేస్తాడు? ఇలాంటి గమ్మత్తైన విషయాలు తీసుకొని సినిమా యాక్టరును అయి ఉండి కూడా సినిమా రంగం గురించి రాశాను. సినిమా రంగం, సాహిత్య రంగం, ఆకాశవాణి అన్నీ చూశాను. ఎన్నో సమస్యలు ఎదుర్కున్నాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. ఆ అనుభవాలను, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవే ఈ శతకాలు. శతకాలే ఎక్కువ రాయడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.
15. మీ ‘రంగ రంగ’ కావ్యం గురించిన విశేషాలు చెప్పండి.
జ : నన్ను హేతువాది అని, నాస్తికుడని అంటారు. కాదు కాదు. నేను మానవతావాదిని. వెంకటేశ్వర స్వామిని గురించి ‘రంగ రంగ!’ అనే మకుటంతో రెండు వందల సీస పద్యాలు రాశాను. నాలాగా ఎవడూ రాయడేమో! ( నవ్వుతూ ) “నీతో ఎవడైనా పెట్టుకుంటే హెలికాఫ్టర్ ఎక్కిస్తావు” అన్నాను. ఇంతింత ఆదాయం వస్తుంటే ఏం చేస్తున్నావని, తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు, వాటన్నిటినీ ఎందుకు పట్టించుకోవని నిలదీసినట్టు రాశాను. కలియుగ దైవమంటారు. మరి నిన్ను చూసీ చూడగానే తోసేస్తారు. ఇదంతా ఏమిటని అడుగుతూ నువ్వొచ్చి ఒక్కసారి క్యూలో నిలబడితే నీకు మా బాధ అర్థమవుతుంది అన్నాను. చమత్కారం జోడించి వ్యంగ్యంగా రాసిన పద్యాలివి. ఇందులో సరళ గ్రాంథికం, వ్యావహారికం, తెలంగాణ మాండలికం కూడా కలిసి ఉంటాయి. హాస్యం, వ్యంగ్యం, చమత్కారం, అధిక్షేపం అన్నీ కలబోసి ఉంటాయి. దీన్ని ‘బాపు-రమణ,’ లకు, వాళ్ళను అత్యధికంగా అభిమానించే డా. సముద్రాల బాబూరావు, డా. టి.ఎన్. చౌదరి, డా. ప్రసాద్ దుగ్గిరాలకు అంకితం ఇచ్చాను.
16. ‘శంకర నారాయణ శతకం’ దేనిని గురించి తెలుపుతుంది?
జ : ‘శంకర నారాయణీయం’ రాశానని తెలిసి హాస్యబ్రహ్మ తురుమెళ్ళ శంకర నారాయణ “అన్నయ్యా నా మీద ఏమైనా రాశావా” అన్నాడు. కాదురా! శంకరుని గురించి వంద పద్యాలు, నారాయణుని గురించి వంద పద్యాలు రాశాను అన్నాను. “హమ్మయ్య హార్ట్ అటాక్ వచ్చినంత పని చేసినావు” అన్నాడు. దాంట్లో కూడా చిత్ర విచిత్రంగా ఉంటుంది. వేదాంతం, సామాజిక స్పృహ, నీతి, ధర్మం అన్నీ ఉంటాయి. నిజానికి సమాజం మంచిగా ఉంటే ధూర్జటి, శేషప్ప లాంటి కవులు ఎందుకు అంతగా మొత్తుకున్నారమ్మా! “అధిక విద్యావంతులు అప్రయోజకులై, పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి” అని శేషప్ప అన్నాడు కదా! ఇప్పుడంతటా అదే కదమ్మా జరుగుతున్నది. ఒకడికి పదవి ఉంటే చుట్టూ తనవాళ్లే ఉంటారు. ఎన్నో చిత్ర విచిత్రమైన భావనలు, గమ్మత్తు అయిన శైలి ఇందులో ఉంటుంది. ‘శంకర నారాయణా!’ అనేది మకుటం కూడా కాదు.
“పళ్ళ బిగింపు పోయి పలు బాధలు నోటికి రాకముందె అల్లుళ్లు, పుత్రికా మణుల రూల్సుకు బానిస కాకముందె మోకాళ్లకు నీరు చేరి నరకమ్మును జూపక ముందె కిడ్నిలో రాళ్ళవి రాకముందె గిరిరాజ సుతాధవ నన్ను బ్రోవరా!” ఇలా ఉంటాయి అందులో పద్యాలు.
17. ఎవరూ దృష్టి కూడా సారించని శనీశ్వరునిపై శతకం రాయాలని ఎందుకనిపించింది?
జ: అమ్మా! నాకిప్పుడు 75 ఏళ్ళ వయస్సు. నేనేదో బ్రహ్మాండమైన సుఖజీవిని కాదు. చాలా చికాకులు ఎదుర్కున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఇంత శని నాకెందుకు పట్టింది? అనిపించింది. వరుసగా అనేక ఇబ్బందులు క్రమంగా పెరగడం మొదలైంది. దీనితో ‘శనీశ్వర శతకం’ రాస్తే పీడా విరగడయి పోతుందనుకున్నాను ( గట్టిగా నవ్వుతూ ). ‘శ్రీ శనీశ్వరా!’ అని మకుటం పెట్టాను. ‘శనైశ్చరా’ అనాలి అన్నారు. నేనలాగే అంటాను అన్నాను. అందుకే నీకు శని పట్టిందన్నారు. అయినా పరవాలేదని మార్చలేదు. దాంట్లో కూడా సమాజం, కుటుంబ వ్యవస్థ, రాజకీయం, సినిమాలు, తాగుడు వీటన్నిటి గురించి 127 పద్యాలు రాశాను. నిజానికి శని దేవుని పైన పది, పదిహేను పద్యాలు తప్ప అంతకుమించి రాసినవాళ్ళు లేరు. తిరుపతి వేంకటకవుల యొక్క వేంకట శాస్త్రి గారి కుమారుడు రోగ గ్రస్తుడై మంచం పట్టినప్పుడు ఆయన ‘శనిగ్రహమా!’ అనే పేరుతో నా కొడుకును ఇట్లా ఎందుకు చేశావని ఓ పదిహేను పద్యాలు రాశాడట.
ఇందులో నేను ధూర్జటిని అనుసరించి,
“దంతములూడి సాంతమవి దౌడలు చిత్ర విచిత్రరీతి,బల్
వింతగ గాకముందె, తన పిల్లలె మాసము కొక్కయింటిలో
వంతుల వారి చూచుకొను భాగ్యము గల్గక ముందె దేవ; నా
తంతు ముగింప వేడెదను; తప్పును బట్టకు శ్రీ శనీశ్వరా!
అంటూ రాశాను. ఈ రోజుల్లో వంతులు వేసుకొని తల్లిదండ్రులను చూసే పిల్లలు మనకు అంతటా కనబడుతున్నారు. ఇలాగే సమాజంలో ఉన్న ఎన్నింటినో సహించక రాస్తూ పోయాను.
18. మీ రచనల్లో మణి ప్రవాళ శైలి ఉండడానికి కారణం ఏమైనా ఉందా?
జ: కారణమంటూ ప్రత్యేకంగా లేదు. నేను 55 ఏళ్లుగా హైదరాబాదులో ఉన్నాను. వరంగల్లు అమ్మాయితో నా వివాహం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం మూలంగా ప్రజలు మాట్లాడే భాష పట్ల అవగాహన ఉంది. నా రచనలు ఏ పండితులనో ఉద్దేశించి రాసినవి కావు. సమాజంలో జరుగుతున్న విషయాలను నిక్కచ్చిగా తెలపడమే నా ఉద్దేశ్యం. అందుకే అందరికీ అవగాహన కోసం తెలుగు, సంస్కృతం, ఆంగ్లం కలిపి కొత్తగా రాయడం మొదలుపెట్టాను. తెలంగాణ అల్లుడిని కూడా కావడం వల్ల మూడు భాషలు కలిపి రాస్తుంటాను. మధ్య మధ్య ఉర్దూ పదాలు కూడా వాడుతూ ఉండడం అలవాటయింది.
19. ఇప్పటికీ నటిస్తున్నారా? మీకింకా చేయాలని మిగిలిన కోరిక ఏదైనా ఉందా?
జ: నాటకరంగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, బిల్వమంగళుడు, భరతుడు ఇలాంటి ఎన్నో పాత్రలు వేశాను. కానీ బిల్వమంగళుని పాత్ర మీద అభిమానం ఎక్కువ. ఇప్పటికే 50 పర్యాయాలు ఆ పాత్ర వేశాను. వంద పర్యాయాలు వేయాలని సంకల్పం. వేస్తాను కూడా. ‘చింతామణి’ అనగానే ఒక వేశ్య పాత్ర అందరి దృష్టిలో మెదులుతుంది. ఒక ఉన్నతకుటుంబంలో జన్మించినవాడు పక్కదారి తొక్కి, ఆచార భ్రష్టుడై సర్వ రంగాలలో అందరిచేత హీనుడు, పనికిరానివాడు అనిపించుకున్నవాడు ఈ ఇద్దరినీ కృష్ణతత్వాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆ శ్రీకృష్ణపరమాత్మ నియోగించుకోవడం ఎంతటి మహద్భాగ్యం? అదే లీలాశుకుడు రాసిన ‘కృష్ణ కర్ణామృతం’. కాలమహిమ ఎంతటి వారినైనా ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. అనే విషయంతో పాటు ఎటువంటివారైనా భగవంతుని కృపకు పాత్రులే అన్న విషయం ఇందులో నిరూపించబడింది.
20. ప్రస్తుత నటనా రంగం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ: నటన అనేది ఒక కళ అనేది అందరికీ తెలిసిందే. మనం ఒక పాత్రను ధరించినప్పుడు ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయాల్సి ఉంటుంది. అక్కడ నటుడు కనిపించకూడదు. కేవలం పాత్ర మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర లక్షణాలు మొత్తం నటునిలో ఇమిడిపోవాలి. అందుకే ఆ కాలం వాళ్ళను ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నాం. రోజుకొకరు పుట్టుకొచ్చే ఈ రోజుల్లో డబ్బు సంపాదించే వ్యామోహం తప్ప, ఒక నిబద్ధత కనిపించదు. నాలుగు రోజులకే ఆ నటుడిని మర్చిపోతున్నాం అంటే ఎటువంటి నటులున్నారో చెప్పనవసరం లేదు. కొంతమంది మాత్రమే దానిని సాధ్యం చేసుకుంటున్నారు. ఏ రంగంలోనైనా సమాజహితవు కోరిక ఉంటేనే సత్ఫలితాలు పొందగలుగుతాం. దేనికైనా అంకితభావం ముఖ్యం. ఈ రోజుల్లో కావలసిన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ఏవీ లేని రోజుల్లోనే తెలుగు సినిమా రంగం ప్రపంచానికి తన ఉనికిని చాటింది. కాబట్టి తీసేవాళ్ళు, వేసేవాళ్ళు అందరూ మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించే విధంగా నడచుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కనబడుతున్నది అభివృద్ధి అని మురిసిపోవడం కాదు. ఎంత ప్రయోజనం చేకూరిందన్నదే ముఖ్యం.
21. కవిగా,రచయితగా నేటి సమాజానికి మీరిచ్చే సందేశం ఏది?
జ: అమ్మా! నాకస్సలు నచ్చని విషయం సముఖంలో పొగడ్త, వెనుకకు వెళ్లి తిట్టడం. నేను ఏదైనా ముఖం ముందే చెప్పేస్తాను. నేనేదో కావాలని, ఎవరినో ఏదో అనాలని చెప్పడం లేదు. సమాజంలో ఉన్న వ్యవస్థనంతా ఒకేసారి మార్చాలని కంకణం కట్టుకోలేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ధోరణిలో నేను రాశాను. నేను రాసిన కొన్ని శతకాలలో భక్తి కనిపించే మకుటం ఉంటుంది. కానీ సమాజ వ్యవస్థ నా కవితావస్తువు. నాలో బాధ కాస్త కవిత్వంగా మారి కలం నుండి వెలువడింది. కవులు, రచయితలు సమాజాన్ని మార్చగలరు. ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించగలరు అని చరిత్ర చెబుతున్నది. ఆ శక్తి ఆ కలానికి ఉన్నప్పుడు సమాజంలో జరిగే అన్యాయాలను ఎదుర్కొనే రచనలు వస్తే బాగుంటుంది. నేనేదో నా మటుకు నేను రాస్తూ పోతాను అనుకోవడం సరి కాదు. నా రచన ఒక మనసునైనా కదిలిస్తే చాలు అనుకొని రాస్తే పరిణామం వేరుగా ఉంటుంది. కలం, గళం రెండూ నేటి వ్యవస్థకు అవసరం.
ధన్యవాదాలు సార్🙏 అడిగిన వెంటనే ప్రతిస్పందించి, మీ జీవిత విశేషాలను తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు. నమస్కారాలు. బిల్వమంగళ పాత్రను వంద పర్యాయాలు ప్రదర్శించాలనుకున్న మీ సంకల్పం తప్పక నెరవేరాలని, దానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సదా మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు.
– ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
ఉపన్యాస కేసరి, ఉపన్యాస కళానిధి, జాతీయ సాహిత్య బిరుదాంచితులు, ప్రముఖ కవి, వక్త, ఆధ్యాత్మిక, తత్త్వవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో మయూఖ ముఖాముఖి* – అరుణ ధూళిపాళ
వ్యవసాయ క్షేత్రంలో నాగలి పట్టి పంటలు పండించిన కర్షకుడు, కలం పట్టి తెలుగు సాహితీ క్షేత్రంలో అక్షర సేద్యం చేసిన కవి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి జీవితాన్ని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్, మా మయూఖ పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయగలిగే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటగా….
1. మీ పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పండి.
జ : నమస్కారమండీ. తెలంగాణ లోని పాలమూరు ఒక ప్రసిద్ధి పొందిన జిల్లా. జనమంతా కూలీల జిల్లా అంటారు. అక్కడినుండి బయలుదేరిన కూలీలంతా ఇటు నాగార్జున సాగరం నిర్మాణం వైపు, అటు భాక్రానంగల్ నిర్మాణం వైపు వరకు కూలీకి వెళ్లారని ప్రతీతి. కాబట్టి కష్టజీవుల జిల్లాగా దానికిపేరు. ఆ జిల్లాలోని పోలేపల్లి మా స్వగ్రామం. ఇప్పుడది రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండలం కిందికి వస్తుంది. ఆ ఊళ్ళో నేను ఆగస్ట్ 3వ తేదీ 1946 వ సంవత్సరంలో జన్మించాను. మా అమ్మగారి పేరు ద్రౌపదమ్మ, నాన్నగారి పేరు కసిరెడ్డి మేఘారెడ్డి గారు. చుట్టూ చెట్టూ చేమలు, గుట్టలు. వ్యవసాయ జీవితం మాది.
2. వ్యావసాయిక కుటుంబంలో, పల్లెటూళ్ళో జన్మించిన మీ బాల్యం ఎలా గడిచింది? మీ విద్యాభ్యాసానికి ఎటువంటి బీజాలు పడ్డాయి?
జ: మా నాన్నగారు వ్యవసాయ దారుడు అయినప్పటికీ ఆయనకు చిన్నప్పటినుండీ పద్యాలు చదవడం. మొల్ల రామాయణం అధ్యయనం చేయడం అలవాటుగా ఉండేది. మహాభాగవతంలో నారాయణ కవచం ఆయనకు కంఠస్థంగా ఉండేది. దాశరథి పద్యాలు కూడా నోటికి వచ్చేవి. రాకమచర్ల వేంకటదాసు యొక్క కీర్తనలు గొంతెత్తి పాడేవారు. ఊళ్లోని ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర భజనలు చేసేవారు. కార్తీకమాసం ముప్పై రోజులు ముప్పై ఇండ్లల్లో రోజూ భజనలు జరిగేవి. మా వాకిలి చాలా పెద్దది. బతుకమ్మ పండుగ సందర్భంగా నూరు నుండి నూటా యాభై వరకు ఆడవాళ్లు మా ఇంటి ముందు బతుకమ్మ ఆడేవారు. ఈ విషయాలన్నీ చిన్నప్పుడు మేము విన్నాం.
మా ఊళ్ళో ఏకోపాధ్యాయ పాఠశాల ఉండేది.ఆ పాఠశాలలో తెలుగు మాట్లాడడం సరిగా రాని వ్యక్తి ముస్లిముల కాలం నాటి ఒక పంతులు గారు ఉండేవారు. నిజాములు వాళ్లకు నచ్చిన ఎవరినో ఒకరిని మౌల్వీసాబ్ గా చేసేవారు. నేను దాదాపుగా 1950 ప్రాంతంలో ఆ పాఠశాలలో చేరాను. పాఠశాల కూడా సరిగా లేదు. మా నాన్నగారు ఒక గుడిసె వేసి (సపారం అంటారు దాన్ని) దాంట్లో నలుగురు చదువుకునేలా ఏర్పాటుచేశారు. అది మా పశువుల కొట్టం పక్కనే ఉండేది. మా తమ్ముడు మోహన్ రెడ్డికి నాకు ఏడాదిన్నర వయసు తేడా ఉన్నప్పటికీ ఇద్దరము కలిసి అదే పాఠశాలలో చదువుకున్నాం. (చదువు అయిపోయాక మా తమ్ముడు మిలిటరీలో చేరాడు) అక్కడినుండి 4, 5 తరగతుల వరకు మా మేనమామ ఊరు మాడుగులలో చదువుకున్నాం. 1946 నుండి 1952 వరకు బాల్యం అనుకుంటే 1952 నుండి 1957 వరకు నా ప్రాథమిక పాఠశాల చదువు కొనసాగింది. నారాయణరెడ్డి సార్, రఘుపతి రెడ్డి సార్ మా మనసులో ఇప్పటికీ నిలిచిపోయిన ఉపాధ్యాయులు. మేము మా మేనమామ గారి ఇంట్లో చదువుతుంటే రఘుపతి రెడ్డి గారు స్వయంగా ఇంటికి వచ్చి ఎట్లా చదువుతున్నారని అడిగే వాళ్ళు. ఆ కాలంలో ఉపాధ్యాయులు అంతటి ప్రేమ కలిగి ఉండేవాళ్ళు.
3. ఆ తరువాత ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది?
జ: అప్పుడు ‘కల్వకుర్తి’ మాకు తాలూకా కేంద్రంగా ఉండేది. అక్కడ ఆరవతరగతి నుండి నేను 1963 వరకు, మా తమ్ముడు 1964 వరకు చదువుకున్నాం. 1963లో నా హెచ్ ఎస్ సి పూర్తి అయింది. మా ఊరి నుండి చెరుకూరు అనే ఊరికి నడిచి వెళ్లేవాళ్ళం. అక్కడికి ఒక సర్వీసు వచ్చేది. దాన్ని ‘అబ్దుల్ ఖాదర్ సర్వీస్’ అనేవాళ్ళు. అది కల్వకుర్తి మీదుగా హైద్రాబాదు కు వెళ్ళేది. ఆ సర్వీసులో వెళ్ళేవాళ్ళం. ఆరుకిలోల బియ్యం, మూడు కిలోల జొన్నలు, కందిపప్పు ఇంకా కొన్ని సరుకులను తీసుకొనిపోయి మా తమ్ముడు, నేను వంట చేసుకొని తినేవాళ్ళం. కల్వకుర్తి బస్టాండుకు దగ్గర్లో ఒక ముస్లింల ఇంట్లో నెలకు మూడు రూపాయల కిరాయితో ఒక గది తీసుకొని ఉన్నాం. అట్లా హెచ్ ఎస్ సి పూర్తి చేశాను.
4. మీ సాహిత్యాభిలాషకు ఇంటి వాతావరణమే ప్రభావం చూపిందనుకోవచ్చా?
జ: కచ్చితంగా మా ఇంటి ప్రభావం ఉంది. మా నాన్నగారు మా చిన్నతనంలోనే నన్ను తొడమీద కూర్చుండ బెట్టుకొని పద్యాలు చెప్తుండేవారు. అట్లా చెప్పిన పద్యాలెన్నో నాకు నోటికి వచ్చేవి.
“రామ రామయన్న రారాదు పాపంబు
రామ రామయన్న రాదు భయము
రామ రామ యన్న రారాదు మృత్యువు
రామ నామమమృత రాశి యగును”
పూర్వపు చదువుల గురించి మా నాన్నగారు
“తేరా పలకా బలపము/ ఈరా అయ్యవారి చేతికిం పొలరంగా/ పోరా భోజన వేళకు/ రారా పద్యాలు చదువ రాజ కుమారా/ ” అంటూ చెప్పేవారని చెప్పారు.

దీనికి నేను 50 ఏండ్ల తరువాత పేరడీ చేసాను (నవ్వుతూ)….
“తేవే పలకా బలపము/ ఈవే అయ్యగారి చేతికింపొన రంగా/ పోవే భోజన వేళకు/ రావే పద్యాలు చదువ రాజకుమారీ/”
“చిన్న చెంబుతోటి శీకాయ ఉదకంబు/ అవ్వ నాకు ఇంత బువ్వ పెట్టు/ బువ్వ లేదు కొడుక బుద్ధిమంతుడవయితె/ చల్ల తాగి పోర చదువుకోర/” ఇది ఆటవెలది పద్యం అని తరువాత తెలిసింది. అక్షరమో, గణమో అటూ ఇటు తప్పొచ్చునేమో కానీ ఇలాంటి పద్యాల ప్రభావం మామీద ఉండేది.
మేము 5, 6 తరగతులు చదువుతుండగా కృష్ణా తీరం నుండి దేశమంతటా తిరుగుతూ గురువులు మా ఇంటికి వచ్చేవారు. మేము వారికి వండుకోవడానికి సాహిత్యం ఇచ్చేవాళ్ళం. వారు మాకు ప్రసాదం పెట్టేవారు. పది పదిహేను రోజులు ఉండేవారు. అందులో పెద్ద గురువుగారు నేర్పిన శ్లోకం ఇప్పటికీ మర్చిపోలేను.
“కక్షే కిం ? మమ పుస్తకం, కిముదకం? కావ్యేషు సారోదకం/
పుచ్ఛఃకిం? విషతాళపత్ర లిఖితం, జీవం? మయా కల్పితం/
గంధఃకిం? ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవం/
ఇక్ష్వాకో సుకులోద్భవస్య చరితం రామాయణం పుస్తకం”
రామాయణ సారాన్ని పూర్తిగా చెప్పిన ఒకే శ్లోకమిది.
పాఠశాలకు వెళ్లిన దానికంటే ఎక్కువ ఇవి నామీద ఎక్కువ ప్రభావం చూపినాయి.
మా నాన్నగారు ‘ వినవయ్య నరనాథ’ అనే నారాయణ కవచం చదవడం, మొల్ల రామాయణాన్ని పారాయణం చేస్తుండడం, నేను పెద్దయింతరువాత నన్ను మొల్ల రామాయణం కొనుక్కురమ్మని తెప్పించడం లాంటివి జరిగాయి. ముఖ్యంగా రాకమచర్ల వేంకటదాసు గారి కీర్తనలు గొంతెత్తి మా నాన్నతో పాటు అందరూ పాడుతూ ఉంటే అట్లా చూస్తూ ఉండిపోయేవాళ్ళం. విజయదశమి సందర్భంగా దేవాలయం నుండి జమ్మిచెట్టు వరకు ఊళ్ళో వాళ్ళందరూ భజనలు చేస్తూ “రండయ్యో రండయ్యో ! పండరీ పోదాం, శ్రీ పాండురంగని సేవించీ వద్దాము” ..”రామం భజే, రామం భజే మన రాముడొస్తున్నాడు రామం భజే, వాడా వాడా తిరిగి రామం భజే మన వాడ కొస్తున్నాడు రామం భజే” ఇప్పుడు కూడా శ్రీరాముని అక్షతలు, పాదుకలు దేశమంతటా తిరుగుతున్న ఈ సమయంలో మన ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగడం, ఈ సందర్భంగా అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకోవడం ఎంతో నాకు ఆనందాన్నిస్తున్నది.
5. మీరు జానపదం పట్ల ఆకర్షితులవడానికి కారణం ఏమిటి?
జ: నేను హెచ్ ఎస్ సి 1963లో పూర్తి చేసేటప్పటికి మా నాన్నగారికి 70 ఏళ్ళ వయస్సు. అందుకే తమ్ముళ్ళిద్దరినీ చదివిస్తూ నేను మాత్రం ఇంటి దగ్గర వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అట్లా 1963 మార్చి నుండి మొదలు 1965 మే వరకు రెండేళ్లు ఇంటి దగ్గర వ్యవసాయం చేశాను. ఎలాగంటే మధ్యరాత్రి లేచి మోటగొట్టడంతో సహా వ్యవసాయంలో తెలియని పని, చేయని పని లేదన్నట్టుగా చేశాను. ఇట్లా వ్యవసాయం చేస్తున్నప్పుడే జానపదులకు బాగా దగ్గరయ్యాను. ఆ విధంగా జానపదుల ప్రభావం నా మీద పడింది. మోటకొట్టే పాటలు, పల్లెల జీవనం, పల్లెల పాటలు అన్నీ తెలిశాయి. అంతేగాక మా ఊళ్ళో ‘చిరుతల రామాయణం’ వేయాలని యువకులు అనుకున్నారు. అందులో నేను రాముని వేషం వేశాను. ఆ తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆచార్య వేణు, మరొకరు ఈ చిరుతల రామాయణం మీద పి హెచ్ డి చేశారు. అందుకే వ్యవసాయం చేస్తున్నప్పుడే జానపదుల సాహిత్యం, పొడుపు కథలు, సామెతలు, గేయాలు, పల్లెల్లో చెప్పుకునే చిన్న చిన్న కథలు వీటన్నిటి ప్రభావం నా మీద ఉంది.
6. వ్యావసాయిక జీవితంలో మీరు కొన్ని రచనలు చేసినట్టు విన్నాం. వాటి గురించి చెప్పండి.
జ: అదొక విచిత్రమైన విషయం. నేను హెచ్ ఎస్ సి లో ఉన్నప్పుడు యాదగిరి అని నా స్నేహితుడు పక్కరూములో ఉండేవాడు. గొప్ప మేధావి. వాళ్ళ ఊరు ఎల్లమ్మ రంగాపురం. అక్కడ ఆ కాలంలో పెద్ద లైబ్రరీ ఉండేది. అక్కడి నుండి పుస్తకాలు పట్టుకొచ్చేవాడు. నేను కూడా ఆ లైబ్రరీకి వెళ్ళేవాడిని. చెప్తే మీరు ఆశ్చర్య పోతారు. ఆ కాలంలో నేను చదివిన పుస్తకాలు డిటెక్టివ్ నవలలు. అందులో మిస్టరీతో కూడుకున్న ‘మాయామహి’ అని పదహారు సంపుటాల నవల, జగజ్జాణ అనే ఇరవై ఒక్క సంపుటాల నవల చదివాము. విశ్వప్రసాద్ అనే రచయిత రాసిన నవలలు..ఈ విధంగా వందలకొద్ది నవలలు చదివాము. ఆ తర్వాత ఇవి ‘డేంజర్ బార్డర్ పాకెట్ సైజు’ నవలలని వీటిని తిరస్కరించాం. ఇవి మనిషిని ఎక్కడికో తీసుకుపోతాయని అందరి భావన. కానీ మాకు మటుకు మానసిక వికాసానికి దోహదపడ్డాయి. అటు తర్వాత సాంఘిక నవలలు చదవడం జరిగింది. యద్ధనపూడి సులోచనా రాణి, ముప్పాళ రంగనాయకమ్మ , అరికెపూడి కౌసల్యాదేవి మొదలైన వారి నవలలు హెచ్ ఎస్ సి వరకే అందుబాటులో ఉన్నాయి కాబట్టి చదివాము. వ్యవసాయం చేస్తున్న సమయంలో రామాయణం (శేష రామాయణం అని గుర్తు) అమనగల్లు లైబ్రరీ నుండి తెచ్చి చదువుకున్నాం. అప్పుడే రచనలు చేయాలన్న ఆసక్తి కలిగింది. మా ఊళ్ళో పట్వారీ ( ఆయన మా దాయాదుల్లో ఒకడు ) వలన కొంత కష్టం, నష్టం అనుభవించిన వారిని గురించి విని కథలు రాసేవాడిని. అలాగే ఊళ్ళో జరిగిన సంఘటనల మీద కథలు, కథానికలు రాసేవాడిని. వ్యవసాయ జీవితంలో 44 రచనలు చేశాను. ఈ రచనల్లో ఇరవై, ముప్పై పేజీల నవలికలు కూడా ఉన్నాయి. భావుకత ఉంది కానీ భాషాజ్ఞానం ఎక్కువ లేకపోవడం వల్ల వాటి భాష అంత బాగుండదు. ఇంట్లో తయారు చేసుకున్న సిరాతో రాసేవాళ్ళం. ఆ రోజుల్లో ఏవీ దొరికేవి కావు. బియ్యాన్ని బాగా మాడబెట్టి దాంట్లో మసి వేసి పొత్రం పట్టి తిప్పితే ఇంకు తయారయ్యేది. మా నాన్నగారు చెప్పిన పద్ధతి ఇది. పాత కాగితాల్లో రాసుకున్నాను. రాసిన రచనలన్నీ అట్టకట్టి పెట్టుకున్నాను. కానీ ఎక్కడా తీయలేదు. అందులో భాష బాగాలేదని, పరిణతి లేని దశలో రాసినవని, డిటెక్టివ్ నవలల ప్రభావం ఉందని అనుకొని, అలనాడు గుణాఢ్యుడు కావ్యహోమం చేశారంటారు కదా! అట్లా నేను 1985 మార్చి 19వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ కావడానికి నాల్గు రోజుల ముందు కామారెడ్డిలో నేనున్న ఇంటిముందు వాటన్నిటినీ పెట్టి కావ్యహోమం చేశాను.
7. ఊళ్ళో వ్యవసాయం చేసిన మీరు తిరిగి చదువుపై ఎందుకు దృష్టి సారించారు?
జ: అదొక బాధాకరమైన సంఘటన. 1965 వ సంవత్సరంలో పంట వేశాము. ఎండాకాలంలో కత్తెర వడ్లు అని అంటారు. మాకు మూడు ఎకరాల్లో వరిచేను ఉంది. మాకు కుంటనీరే ఆధారం. చేను పొట్టకొచ్చింది అంటే గింజ పిండి పడుతుందన్నమాట. కొద్దిరోజులైతే కోత కోయడానికి వీలుగా అవుతుంది. అప్పుడు మా నాన్నగారు నాగు కట్టారు ( పైసలకు మిత్తి లాగా అన్నమాట ). దానివల్ల మేము అప్పు పడ్డాము. నాన్నగారి వయసు రీత్యా నేను , సక్రియా అనే పద్నాలుగేళ్ల పిల్లవాడు కలిసి వ్యవసాయం చేసేవాళ్ళం. మా కుంట పొంగి పొర్లింది. వర్షం వస్తోంది. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంటుంది. మధ్యలో ఉన్న అలుగు తెగ్గొడితే మా పొలం లోకి నీరు పారడం ఆగుతుంది. నేను పలుగు, పార పట్టుకొని వెళ్ళాను. మా అమ్మకు ఈ విషయం తెలిసి సక్రియాకు చెప్పడంతో ఆ అబ్బాయి వెనకాల వస్తున్నాడు. మా నాన్నగారు కొంతమందిని తీసుకొని బయలుదేరాడు. ఇవేవీ నాకు తెలియవు. వడివడిగా నడుస్తున్నాను. నేను వెళ్ళేటప్పటికే మూడెకరాల వరిపొలం మీద తెగిన కుంట నీళ్లు పారుతున్నాయి. దాంతో పాటు ఇసుక కూడా పొలంలో పడుతున్నది. నాకప్పుడు పంతొమ్మిదిన్నర ఏళ్ళు. ఆ బాధ తట్టుకోలేక జీవితం చాలిద్దామనుకొని ఆ కుంటలో దూకబోతుండగా వెనుక నుండి ఆ పిల్లవాడు ‘నేనొస్తా ఉండు’ అంటూ పరుగెత్తుకొని వచ్చాడు. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం పట్టుకొని స్పృహ తప్పిపోయేలా ఏడ్చాము. నేనక్కడే పడిపోయాను. మా నాన్నగారు పదిమందిని తీసుకొని వచ్చారు. కళ్ళముందే మూడెకరాల పంట నాశనం అవుతుంటే ఏ వ్యవసాయదారునికైనా గుండె ఎంత బాధగా ఉంటుందో చెప్పండి ( అప్పటి సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ ఆర్ద్రంగా ). అంటే దాదాపు అయిదారు పుట్ల పంట దెబ్బ తిన్నది. ఇది జరిగిన తర్వాత ఈ వ్యవసాయం వద్దని, పాలెం ఓరియెంటల్ కళాశాలలో చదివితే తెలుగు పండిట్ పోస్ట్ వస్తుందని తెలిసి పోదామని నిర్ణయించుకున్నాను. మా స్నేహితులు యాదగిరి, బి. వెంకట్ రెడ్డి, ఆనంతరాములుతో కలిసి పాలెం చేరుకొని ఫారాలు నింపి ఇచ్చాము. అట్లా అక్కడ డిప్ ఓ ఎల్ లో చేరాము.
8. పాలెంలో మీ చదువు ఏవిధంగా కొనసాగింది? అక్కడి అనుభవాలు ఏవైనా మాకోసం చెప్పండి.
జ: అప్పుడు పాలెం కళాశాలలో తెలకపల్లి విశ్వనాథ శర్మగారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గొప్ప సంస్కృత పండితులు. మొదటి సంవత్సరం మధ్యలో పంతంగి చిన పుల్లయ్యగారని ( హైస్కూలులో తెలుగు పండితునిగా చేసేవారు ) ఆయన వచ్చి మా కళాశాలలో పద్యాలు చెబుతుండేవారు. ఆయన పద్యాలు పాడుతుంటే నేను పరవశించి పోయేవాడిని. మా స్నేహితులు రుక్నొద్దీన్, యాదగిరి, వెంకట్ రెడ్డి, అనంతరాములు మేమంతా ఒకే తాలూకాకు చెందినవాళ్ళం కాబట్టి ఒక జట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత శ్రీ రంగాచార్య గారు మాకు గురువుగా వచ్చారు. ఆయన వచ్చిన తరువాత సాహిత్యం, కవులు, లోకం తెలిసింది. అంతవరకు గురువులు చెప్పింది మనసులోనికి తెచ్చుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎట్లా పుడుతుంది? సాహిత్యం ఎట్లా వికసిస్తుంది అనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకున్నాం. చారిత్రక దృష్టి, సాంస్కృతిక దృష్టి ఆయన వల్లనే ఏర్పడ్డాయి.
డిప్ ఓ ఎల్ చదువుతున్న కాలంలో వారానికి ఒకసారి ఉపన్యాసపోటీలు జరిగేవి. నేను ఒక కావ్యం ప్రిపేరై అరగంట మాట్లాడేవాడిని. దాంతో గొప్ప ఉపన్యాసకుడు వస్తున్నాడని అనుకునే పరిస్థితి ఏర్పడింది ( నవ్వుతూ ). కళాశాల చుట్టూ వర్ధమానపురం అని ఉంటుంది. మా గురువుగారు మమ్మల్ని తీసుకొని శాసనాలు ఎట్లా చదవాలో, ఎట్లా చూడాలో చెప్పారు. సాహస లక్షణాలు మాలో ఎక్కువగా ఉండేవి. దాదాపు మూడు కిలోమీటర్ల చెరువును రెండుసార్లు ఈదాము. స్నేహితులమందరం పాలెం నుండి శ్రీశైలం వరకు భజనలు చేస్తూ నడుచుకుంటూ పోయాము. ఈ సందర్భంలో ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం ఏర్పడింది. సంఘ శాఖలు నడిచేవి. నేనొక్కడినే శాఖలకు వెళ్ళేవాడిని. అక్కడే బావి దగ్గర స్నానం చేసేవాడిని. ఈ సమయంలో భోజనానికి ఇబ్బంది ఏర్పడింది. రెండవ సంవత్సరంలో సుబ్బయ్యగారిని అడిగితే హాస్టల్లో సీటు ఇచ్చారు. పాలెం కళాశాల వెనుక వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఉదయమే లేచి శాఖకు పోయి బావిదగ్గర స్నానం చేసి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడిని. అప్పుడే ‘వెంకటేశ్వరా’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను. దీనికంటే ముందే ‘నవయుగాల బాట! నార్లమాట!’ అనే శతక ప్రభావంతో ‘బిడ్డ మదిని నమ్ము! రెడ్డి మాట!’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను.
పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి మీకు. హాస్టల్ లో అన్ని గదులు లోపలికి ఉంటే నేనుండే గది బయటకు ఉండేది. ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి తలుపు తట్టారు. ఆ టైమ్ లో నేను ‘వేయిపడగలు’ చదువుతున్నాను. అదిచూసి “పరీక్షలు పట్టుమని పదిహేను రోజులు లేవు. వేయిపడగలు చదువుతున్నావా?” అన్నారు. ‘మొత్తం సిలబస్ చదివాను సార్’ అన్నాను. “అయినా సరే మళ్లీ చదువు ఫస్ట్ క్లాస్ రావాలి. మన కళాశాలకు పేరు రావాలి” అన్నారు. వెంకటేశ్వర స్వామి దయ, గురువుల బోధ వల్ల యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇలాంటివెన్నో జ్ఞాపకాలు.
8. పాలెంలో మీ చదువు ఏవిధంగా కొనసాగింది? అక్కడి అనుభవాలు ఏవైనా మాకోసం చెప్పండి.
జ: అప్పుడు పాలెం కళాశాలలో తెలకపల్లి విశ్వనాథ శర్మగారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గొప్ప సంస్కృత పండితులు. మొదటి సంవత్సరం మధ్యలో పంతంగి చిన పుల్లయ్యగారని ( హైస్కూలులో తెలుగు పండితునిగా చేసేవారు ) ఆయన వచ్చి మా కళాశాలలో పద్యాలు చెబుతుండేవారు. ఆయన పద్యాలు పాడుతుంటే నేను పరవశించి పోయేవాడిని. మా స్నేహితులు రుక్నొద్దీన్, యాదగిరి, వెంకట్ రెడ్డి, అనంతరాములు మేమంతా ఒకే తాలూకాకు చెందినవాళ్ళం కాబట్టి ఒక జట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత శ్రీ రంగాచార్య గారు మాకు గురువుగా వచ్చారు. ఆయన వచ్చిన తరువాత సాహిత్యం, కవులు, లోకం తెలిసింది. అంతవరకు గురువులు చెప్పింది మనసులోనికి తెచ్చుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎట్లా పుడుతుంది? సాహిత్యం ఎట్లా వికసిస్తుంది అనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకున్నాం. చారిత్రక దృష్టి, సాంస్కృతిక దృష్టి ఆయన వల్లనే ఏర్పడ్డాయి.
డిప్ ఓ ఎల్ చదువుతున్న కాలంలో వారానికి ఒకసారి ఉపన్యాసపోటీలు జరిగేవి. నేను ఒక కావ్యం ప్రిపేరై అరగంట మాట్లాడేవాడిని. దాంతో గొప్ప ఉపన్యాసకుడు వస్తున్నాడని అనుకునే పరిస్థితి ఏర్పడింది ( నవ్వుతూ ). కళాశాల చుట్టూ వర్ధమానపురం అని ఉంటుంది. మా గురువుగారు మమ్మల్ని తీసుకొని శాసనాలు ఎట్లా చదవాలో, ఎట్లా చూడాలో చెప్పారు. సాహస లక్షణాలు మాలో ఎక్కువగా ఉండేవి. దాదాపు మూడు కిలోమీటర్ల చెరువును రెండుసార్లు ఈదాము. స్నేహితులమందరం పాలెం నుండి శ్రీశైలం వరకు భజనలు చేస్తూ నడుచుకుంటూ పోయాము. ఈ సందర్భంలో ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం ఏర్పడింది. సంఘ శాఖలు నడిచేవి. నేనొక్కడినే శాఖలకు వెళ్ళేవాడిని. అక్కడే బావి దగ్గర స్నానం చేసేవాడిని. ఈ సమయంలో భోజనానికి ఇబ్బంది ఏర్పడింది. రెండవ సంవత్సరంలో సుబ్బయ్యగారిని అడిగితే హాస్టల్లో సీటు ఇచ్చారు. పాలెం కళాశాల వెనుక వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఉదయమే లేచి శాఖకు పోయి బావిదగ్గర స్నానం చేసి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడిని. అప్పుడే ‘వెంకటేశ్వరా’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను. దీనికంటే ముందే ‘నవయుగాల బాట! నార్లమాట!’ అనే శతక ప్రభావంతో ‘బిడ్డ మదిని నమ్ము! రెడ్డి మాట!’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి మీకు. హాస్టల్ లో అన్ని గదులు లోపలికి ఉంటే నేనుండే గది బయటకు ఉండేది. ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి తలుపు తట్టారు. ఆ టైమ్ లో నేను ‘వేయిపడగలు’ చదువుతున్నాను. అదిచూసి “పరీక్షలు పట్టుమని పదిహేను రోజులు లేవు. వేయిపడగలు చదువుతున్నావా?” అన్నారు. ‘మొత్తం సిలబస్ చదివాను సార్’ అన్నాను. “అయినా సరే మళ్లీ చదువు ఫస్ట్ క్లాస్ రావాలి. మన కళాశాలకు పేరు రావాలి” అన్నారు. వెంకటేశ్వర స్వామి దయ, గురువుల బోధ వల్ల యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇలాంటివెన్నో జ్ఞాపకాలు.
9. మీ ఉద్యోగ ప్రస్థానం ఎక్కడినుండి మొదలైంది?
జ: పరీక్షలు అయిపోయి ఇంటికి వచ్చాను. డిప్ ఓ ఎల్ మీద ఉద్యోగం వస్తుందని తెలిసి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మా మిత్రులు బి ఓ ఎల్ చదవడానికి వెళ్లారు. నేను మా మేనమామ ఊరు మాడుగులకు వెళ్ళాను. అక్కడే రిజల్ట్స్ తెలిసి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినట్లు తెలిసింది. అక్కడ హైస్కూలులో హెడ్ మాస్టర్ ‘రామ్ సింగ్’ గారు. ఊరి సర్పంచ్ రామలింగారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. మన ఊరి మేనల్లుడు ఇంత సాధించాడు. “మన ఊళ్లో తెలుగు పండిట్ లేడు కాబట్టి ఇతని సర్టిఫికెట్లు తెప్పించి ఆ ఉద్యోగం ఇద్దాం” అనుకున్నారు. ఆ ఊళ్ళో రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి అప్పట్లో ‘ఆంధ్ర జనతా’ పత్రిక చూస్తున్నాడు. యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ద్వారా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కు చెప్పించి నాకు జూనియర్ తెలుగు పండితునిగా ఏ ట్రైనింగ్ లేకుండానే నియమింప చేశారు. ఆరోజు జూన్ 11, 1967. మరుసటి నుండే పాఠాలు చెప్పుమన్నారు ఆర్డర్స్ రాకుండానే. ఆ తర్వాత 11 రోజులలో ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి నా సర్టిఫికెట్లు తీసుకొని అధికారికంగా జూన్ 21, 1967 నుండి ఉద్యోగంలో చేరాను. నా మొట్టమొదటి జీతం 98 రూ.25 పైసలు. తర్వాత నాలుగైదు నెలల్లోనే పెరిగి 120 రూ. అయింది. ఏడు పీరియడ్లు ఉండేవి రోజూ. 11,12 తరగతులకు హిందీ చెప్పేవాళ్లు లేకపోతే హిందీ కూడా చెప్పాను.
ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ గురించి చెప్పాలి మీకు. నేను ఉద్యోగంలో చేరిన నాలుగైదు నెలలకు పాఠశాల తనిఖీ జరిగింది. కామేశ్వరీ దేవి అని గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. తరువాత డి ఇ ఓ అయినారు.
నేను నాల్గవ తరగతి క్లాసులో పాఠం చెబుతుండగా వచ్చి కూర్చున్నది. నేను ఆమె ముందు నాకున్న శబ్దశక్తి, ప్రౌఢశక్తి అంతా ఉపయోగించి (గట్టిగా నవ్వుతూ)50 నిమిషాలు పాఠం చెప్పాను. అప్పుడామె “నువ్వు పాఠం బాగా చెప్పావు. కానీ పిల్లల బుర్రల్లోకి ఒక్కముక్క కూడా పోలేదు. నువ్వు పాఠం చెప్పింది నాకు కానీ పిల్లలకు కాదు. నువ్వు పిల్లలతో ఆడుతూ పాడుతూ పాఠం చెప్తావని మీ హెడ్ మాస్టర్ చెప్పారు. నీకున్న జ్ఞానం అంతా నాకు తెలవాలని చెప్పావు” అన్నది. “పిల్లల స్థాయికి తగ్గి చెప్పాలా అమ్మా!” అన్నాను వినయంగా. అప్పుడామె “కాదు. ఆ పిల్లలను నీ మీదకు లాక్కొన్నట్లు చెప్పాలి. వినేవాళ్లు ఏ స్థాయి వారో దానికి తగినట్లు ఉండాలి కానీ నీ భాషాజ్ఞానం చూపించడం కాదు” అన్నది. అది ఎప్పటికీ మర్చిపోలేదు. 1967 నుండి 1973 వరకు ఆరు సంవత్సరాలు ఆ పాఠశాలలో పని చేశాను.
10. “తెలుగు పొడుపు కథలు” అనే అంశంపై పరిశోధన చేయాలనుకున్న ఆలోచనకు ప్రేరణ ఏమిటి?
జ: మాడుగుల పాఠశాల తర్వాత సెప్టెంబర్ 1, 1973 నుండి 1985 వరకు దాదాపు 12 సంవత్సరాలు నేను కామారెడ్డి డిగ్రీ కళాశాలలో మొదట జూనియర్ లెక్చరర్ గా, తర్వాత లెక్చరర్ గా పనిచేశాను. ఆ మధ్యకాలంలోనే ‘తెలుగు పొడుపు కథలు’ అనే అంశంపై పరిశోధన చేశాను. అసలు అది చేయాలని అనుకోలేదు. నాకు భారతీయ చరిత్ర మీద బాగా అభిమానం. కాబట్టి ఆ విషయాలను రాసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. అపుడు శాఖాధ్యక్షులు బిరుదురాజు రామరాజు గారు. నేను అంతకుముందు పాఠశాలలో పనిచేసినప్పుడే పిల్లలతో, ఊరివాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతుంటే ఐదారు వందల పొడుపు కథలు సేకరించి పెట్టాను. ఒకవేళ చారిత్రక కావ్యాల మీద పి హెచ్ డి కుదరక పోతే పొడుపుకథల గురించి అడగాలనుకున్నాను. రామరాజు గారికి జానపదం అంటే ఇష్టం. జానపదంలో పొడుపుకథలు ఒక భాగమే కదా! ఫారంలో నేను ‘చారిత్రక కావ్యాలు-సమగ్ర పరిశీలన’ అని రాశాను. రామరాజుగారితో పాటు సినారె లాంటి పెద్దవాళ్ళున్నారు. “చారిత్రక కావ్యాలు అయిపోయింది కదా! నువ్వేం చేస్తావు” అన్నారు. అప్పటికే చారిత్రక కావ్యాల మీద పి హెచ్ డి చేసిన సీతా కళ్యాణి గారు తెలుగు శాఖలోనే ఉన్నారు. ‘వేరే దృక్పథంతో చేస్తాను’ అన్నాను. “ఆమె సమగ్రంగా చేసింది. నువ్వు ఇంకా ఏదైనా చేయి” అన్నారు. నా దగ్గర సిద్ధంగా ఉన్న రెండువందల పొడుపుకథలు చూపించాను. ఎన్ని ఉన్నాయని అడిగారు. ఐదారు వందలు ఉన్నాయన్నాను. వారు సంతృప్తి పడి ‘ఇదే ఇస్తున్నాం’ అన్నారు. అట్లా దానిమీద పరిశోధన చేయడం జరిగింది. అప్పటికే నేను రాసిన భగవద్గీత గేయకృతి, రెడ్డిమాట, గాంధీ తాత అనే పుస్తకాలు కూడా వారికి చూపించాను.
ఇంటర్వ్యూ అయిపోగానే బయటకు వచ్చి నిలుచున్నాను. కాసేపటికి నారాయణరెడ్డి గారు వచ్చి నన్ను పిలిచి “ఇదిగో, నేను వేసుకున్నాను. ఆర్డర్ ఇప్పుడు వస్తుంది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పో” అన్నారు. అట్లా ఆయన నేతృత్వంలో 1982 లో పి హెచ్ డి డిగ్రీ పొందాను. వీటిని తెలుసుకోవడం కోసం దేశమంతటా తిరిగాను. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తిరిగాను. ఆ సమయంలో రామరాజు గారు తెలుగు జానపద సాహిత్యంలో పరిశోధన చేసినప్పుడు తొలి దశలో ఆయనకుఎన్ని అనుభవాలున్నాయో నాకూ అన్ని ఉన్నాయి. దాదాపు ఏడెనిమిది వేల పొడుపుకథలు సేకరించాను.
11. అన్ని పొడుపు కథలను ఎలా సేకరించగలిగారు? వాటి కోసం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు?
జ: కామారెడ్డి బస్ స్టాప్ లో పొడుపు కథలను ‘గుజిలీ’ ప్రతుల మీద ( రఫ్ కాగితాల పైన ) ‘చమత్కారాల్, చమత్కారాల్’ అని అమ్మేవాళ్లు. ఐదారువందలు అట్లా సేకరించాను. తెలంగాణాలో కొన్ని జిల్లాలు తిరిగాను. రాజాపూర్ దగ్గర మల్లేపల్లి అని ఒక ఊరుంది. నా సహోద్యోగి నారాయణాచారి సొంత ఊరది. రాజాపూర్ లో బస్సు దిగి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. బస్టాండ్ లో దిగి నడుస్తున్నాను. ఉంటే నాతో పాటు నలుగురైదుగురు ఆడవాళ్లు, ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు కూడా బస్సు దిగారు. వారు ఊరి నుండి వచ్చే బండికోసం ఎదురుచూస్తూ నేనెవరో ఎందుకొచ్చానో కనుక్కుని “ఊళ్ళోకి వెళ్ళి ఫలానాయన గురించి కనుక్కొని ఆ ఇంటికి వెళ్లి మా కోసం బండి పంపించుమని చెప్పుమన్నా”రు. నేను వెళ్లి వాళ్ళు చెప్పిన చోటికి వెళ్లేసరికి ఆడవాళ్ళ కోసం బండి ఏర్పాటు చేస్తున్నారు. ఊళ్ళో మా స్నేహితుడు లేడు. నేను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అక్కడ ఒక ‘కొలిమి దాటి’ ఉంది. అక్కడ కొంతమంది నాగళ్లు, కర్రు, కుండి ఇలాంటివి చేయించుకోవడం కోసం కూర్చొని ఉన్నారు. అక్కడ ఒకాయన నన్ను చూసి ‘ఎవరు నువ్వు’ అని అడిగాడు. తెలంగాణలో పొడుపు కథలను ‘తట్లు’ అంటారు. కొందరు సమస్యలు, సమీక్షలు అంటారు. పొడుపు కథల సేకరణకు వచ్చానని చెప్పాను. అవి ఎలా ఉంటాయి? అన్నాడు. నేను ఒక రెండు ‘తట్లు’ వేశాను. కొలిమి దగ్గర కూర్చొని ఉన్నాయన మరో రెండు వేశాడు. అక్కడి నుండి వెళ్తున్న పిల్లలను పిలిచాడు. వాళ్ళూ చెప్పారు. అందులో ఒక పిల్లవాడు మా అమ్మకు ఇవి చాలా వస్తాయని ఆమెను తీసుకురావడానికి వెళ్ళాడు. మీరు ఆశ్చర్యపోతారు. ఈ కొద్ది సమయంలో 84 పొడుపు కథలు సేకరించాను. ఈలోపు పోయిన బండి ఆడవాళ్లను తీసుకొని వచ్చింది. వాళ్ళు నేను అక్కడే ఉండడం చూసి ఇంటికి పోయి ఒక అబ్బాయిని పంపించి నన్ను భోజనానికి రమ్మన్నారు. సంతోషంతో వాళ్లింటికి వెళ్ళాను. వాళ్ళు ఒక ఇరవై దాకా చెప్పారు. కొన్ని పదాలను కట్ చేస్తూ చెప్పారు. అశ్లీలాలు కావు కానీ శరీర భాగాలు. అట్లాంటివి కొన్ని ఉంటాయి పొడుపు కథల్లో. ఇదొక అపూర్వ అనుభవం.
అక్కడక్కడ తెలిసిన మిత్రులు ఉంటే నేను వస్తున్నానని ఉత్తరాల ద్వారా తెలిపి, వెళ్లేవాడిని. ఘనపురంలో కొన్ని, మల్లేపల్లిలో ముఖ్యంగా స్కూల్ పిల్లల దగ్గర వాళ్ళ తల్లుల దగ్గర సేకరించినవి, ఇట్లా ఎన్నో. రాయలసీమలో ‘మారు తట్లు’, అంటారు.’మారు కథలు’ అని కూడా వ్యవహారంలో ఉంది. తంగిరాల వేంకట సుబ్బారావు అని తాను సేకరించినవి పంపారు. వీటన్నిటినీ దాదాపు 20 చాప్టర్లుగా విభజించుకున్నాను. మా హైస్కూలు గురువుగారు ముకురాల రామారెడ్డి గారు ‘దేవరకొండ దుర్గం’ అని పరమాద్భుత కావ్యం రాశారు. ఆయన ప్రభావం మాపైన చాలా ఉంది. ఆయన దగ్గరికి వెళ్లి, నేను తయారు చేసుకున్న పొడుపు కథల విశ్లేషణను చూపించాను. అది చూసి ఆయన “ఎప్పుడు కూడా తక్కువ చాప్టర్లలో ఎక్కువ విషయం ఉండాలి” అని చెప్పారు. ఆయన సూచనలను పాటిస్తూ 12 చాప్టర్లకు కుదించుకున్నాను. 850 పుటల పరిశోధనా గ్రంథం అయింది. సుదర్శన్ అని కామారెడ్డిలో నా స్నేహితుడు ఉన్నాడు. ఆయన, మరికొందరి సహాయంతో అచ్చువేశాను. కామరెడ్డిలోనే ఆవిష్కరించి ఆయనకే అంకితం ఇచ్చాను. సుదర్శన్ చాలా గొప్పవ్యక్తి. PWD శాఖలో ఇంజనీరుగా పని చేసేవాడు. దివిసీమలో ఉప్పెన వస్తే, ఆ ఉప్పెనలో మునిగిన దీన్ దయాళ్ పురం అనే ఊరు నిర్మాణానికి సెలవు పెట్టి వెళ్లినవాడు. నేను కూడా ఏడు రోజులు అక్కడికి వెళ్లి ఉన్నాను.

12. జానపద సాహిత్యంపై మీ అధ్యయనం గురించి చెప్పండి.
జ: నేను పొడుపు కథల కోసం తిరుగుతున్న సమయంలో ఒక ఊళ్ళో జానపద గేయాలు పాడారు.
“పోతుంటిరా జాణ పోతుంటిరా/ చార్ కమాను కట్టమీద పోతుంటిరా/ ఒగణ్ణి పండవెట్టి, ఒగణ్ణి ఎండవెట్టి/ ఒగని కోసం నేను పోతుంటిరా…” ఇది ఒక పొడవు కథాగేయం. ఇందులో ఒకరిని పండవెట్టి, ఒకరిని ఎండవెట్టి అన్నప్పుడు ఒక ఉత్కంఠ కలుగుతుంది. పొడుపుకథ ముఖ్య లక్షణమే అది. దీని వెనుక ఉన్న అర్థమేమిటని ఆలోచింపజేస్తుంది. రోకలిని పండబెట్టి, ఒడ్లను ఎండబెట్టి కుదురు కోసం, కుందెన కోసం పోతున్నానని దీని అర్ధం. ఇట్లా పొడుపు కథలే కాకుండా జానపద గేయాలను కూడా సేకరణ చేయడం జరిగింది. అలా సేకరించిన జానపద గేయాలను “పాలమూరు జిల్లా జానపద గేయాలు” అనే పేరిట రెండు సంకలనాలు వేయడం జరిగింది. ఈ పర్యటనలో ఇది నాకు ఉపకరించిన అంశం. దీనివల్ల జానపద సాహిత్యంపై అధ్యయనం చేసే అవకాశం చిక్కింది.
ఖిల్లా గణపురం ఊరికి మా చెల్లెలిని ఇచ్చాం. అందువల్ల ఆ ప్రాంతంలో ఎక్కువ సేకరణ చేయడం జరిగింది. పాలెంకు దగ్గరగా ఉన్న శ్రీపురంలో ‘పాపకల్లు’ అనే ఊరులో సేకరించాను. ఈ ప్రాంతంలో వారు రాసిన పాటలను రాసుకుంటే కొన్ని వ్యవసాయ గీతాలుగా, కొన్ని హాస్య గీతాలుగా లభించాయి. అందులో ఒక స్త్రీ పాడినట్టుగా ఒక వ్యక్తి ఒక పాట పాడాడు.
“నేను వోతున్న పెండ్లికి జివాల రంగ
సిగ బిళ్ళ లేదని మోట బిళ్ళ వెట్టుకొని..!!నేను వోతున్న!!”
జివాలు అంటే గొర్రెలు, మేకలు అంటే చిన్న జీవులు అని అర్థం. పెండ్లికి పోవాలంటే ఆమె దగ్గర సొమ్ములు లేవు.
“గెంటీలు లేవని సొప్ప బెండ్లు వెట్టుకొని, వడ్డాణం లేదని వరి అంటు సుట్టుకొని…!!నేను వోతున్న!!”
చిట్టచివర్లో ముగింపు ఎంత కదిలిస్తుందంటే దీన్నే ఆధునిక కవిత్వంలో ‘హైలైట్’ అంటాము. “సంక పిల్ల లేదని, కుక్కపిల్ల నెత్తుకొని” !!నేను వోతున్న!!
సంతానం లేకపోవడం వలన కుక్కపిల్లను తీసుకొని పోతున్నాననడంలో ఆమె ఆవేదన వ్యక్తమవుతుంది.
దీన్ని ఎంత లోతుగా నైనా వివరించవచ్చు. చివరలో ఒక చురుకు లాంటిది, కొరడా దెబ్బ లాంటిది, సందేశం లాంటిది ఉంటుంది. అంటే ముగింపు అనేది హృదయాన్ని కదిలించాలి.
అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక పెద్దమనిషి నన్ను వాళ్ళ స్కూలులో జరిగిన కార్యక్రమానికి పిలిచారు. అక్కడ ఉపన్యసిస్తూ ఒక జానపద గేయాన్ని ఉదాహరించాను. ఆయన దాన్ని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందని నన్ను అడిగి ఆర్థిక సహాయం చేశారు. ఆ పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇచ్చాను. అట్లా “పాలమూరు జిల్లా జానపద గేయాలు” , ఇద్దరు మిత్రుల సహకారంతో “రంగారెడ్డి జిల్లా జానపద గేయాలు” అచ్చు వేశాను. ఉన్నత పాఠశాలల, కళాశాలల లైబ్రరీలకు కూడా ఇచ్చాను. పొడుపు కథల పరిశోధనలో భాగంగా ఇదొక మంచి అవకాశం దక్కింది నాకు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు నేను ‘నూరు కథలు’ అని పుస్తకం వేశాను. అందులో ఆంజనేయునికి, విభీషణునికి సంబంధించిన కథలు ఉంటాయి. జానపదుల ఆలోచనే వేరు. అపర వాల్మీకులు వాళ్ళు( నవ్వుతూ). అందుకే అంతగా నాతో ఆ సాహిత్యం పెనవేసుకుంది.
13. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా మీరు స్థానం సంపాదించిన విధానం ఎటువంటిది?
జ: 1983 చివర్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పోస్టులు ప్రకటించారు. ఒకటేమో ఖాళీ అయినటువంటిది. ఇంకొకటి నూతన నియామకం. రెండు వేర్వేరుగా పత్రికల్లో వచ్చాయి. రెండింటికీ అప్లై చేశాను. రెండింటి మధ్య తేడా ఎనిమిది నెలలు. కానీ రెండింటికి కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ పెట్టారు. ఒక గమ్మత్తైన సంఘటన చెప్పాలి. నేను బస్సెక్కి నా బ్యాగు పైన పెట్టాను. దిగేటప్పుడు నా బ్యాగుతో పాటు పదిరూపాయల నోటు వచ్చింది. ఎవరిదని అడుగుదామంటే అప్పటికే దిగిపోయారు. నాతో పాటు ఉన్న నా స్నేహితుడు సుదర్శన్ అనుకోకుండా పదిరూపాయలు దొరికింది. నువ్వు ఇంటర్వ్యూలో తప్పక సెలెక్ట్ అవుతావు అన్నాడు (నవ్వుతూ).
ఇంటర్వ్యూలో ఒక దాంట్లో నేను సెలెక్ట్ కాలేదు. ఇంకో పోస్టులో నా పేరు రెండవస్థానంలో ఉంది. అంటే మొదటి వ్యక్తి జాయిన్ కాకపోతే నాకు అవకాశం వస్తుంది. ఇంకా విచిత్రం ఆ మొదటి వ్యక్తి ఎవరో కాదు నా స్నేహితుడు రుక్నొద్దీన్. కానీ ఆ విషయం కూడా నాకు తెలియదు. ఆ సమయంలోనే మేము 20 రోజులు జానపద సెమినార్ నిర్వహిస్తున్నాము. అప్పుడు నేను, రుక్నొద్దీన్ తో ‘మీరు దేనికి సెలెక్ట్ అయ్యారు?’ అన్నాను. ‘దేనికేంటి?’ అన్నారాయన ఆశ్చర్యంగా. రెండు పోస్టులు కదా! ఒకటి రెగ్యులర్, రెండవది ప్లానింగ్ పోస్ట్ అన్నాను. “నాకు రెగ్యులర్ మాత్రమే తెలుసు. దానికే అప్లై చేశాను అన్నారాయన” కానీ ఆయనకు వచ్చింది రెండవ దాంట్లో. అంటే ఆయన దానికి కనీసం అప్లై కూడా చేయలేదు. ఎలా సెలెక్ట్ అవుతాడు? అందులోనే నాది రెండవ పేరు. నేను నేరుగా యూనివర్సిటీ లాయర్ బాబుల్ రెడ్డి గారిని కలిశాను. అక్కడ నారాయణ రెడ్డిగారనే మరో లాయర్ ఉన్నారు. ఆయన పర్వతరావు గారనే మరో లాయర్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆయనకు విషయం వివరించాను. మరుసటి రోజుకల్లా ఆ పోస్టు పైన హైకోర్టు ‘స్టే’ ఇచ్చింది. ఎనిమిది నెలలు కేసు నడిచి నాకనుకూలంగా తీర్పు వచ్చింది. అప్లై చేసుకోని వ్యక్తి సెలెక్ట్ కావడమనేది టెక్నికల్ గా జరిగిన తప్పిదమే తప్ప ఎవరూ దీనికి కారణం కాదు. అట్లా నియమింపబడి 1985 మార్చి 19వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా చేరాను. 2006 వరకు దాదాపు 21 సంవత్సరాలు పని చేశాను. దీంట్లోనే రీడర్ గా, ప్రొఫెసర్ గా, తెలుగు శాఖ అధ్యక్షునిగా, బి ఓ ఎస్ అధ్యక్షునిగా పదవులు నిర్వహించాను.
14. “అండమాన్ లో ఆజన్మాంతం” అన్న రచన ఎవరిని ఉద్దేశించి రాసింది?
జ: నేను హిందీ నుండి తెలుగులోకి చేసిన అనువాదాల్లో ముఖ్యమైనది స్వాతంత్ర్య వీర సావర్కర్ జైలు చరిత్ర . ఆయన జైలులో ఉండి రాసుకున్నది. 1911 లో జైలుకు వెళ్లిన ఆయన 20 సంవత్సరాలు జైలులోనే మగ్గిపోయాడు. ఆ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం మన దాశరథి జైలు గోడలమీద రాయడానికి ప్రేరణ నిచ్చింది. ఆయన జైలు గోడలమీద మరాఠీ భాషలో కవితలు రాసినాడు. జైలు నుండి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కమల, గోమంతక్, సముద్ర్ అనే పేరిట కావ్యాలుగా వచ్చాయి. మరాఠీలో ఆయన అప్పటి బ్రిటిష్ చట్ట ప్రకారం ఆజన్మాంత శిక్ష 50 సంవత్సరాలు. అతనికి రెండు ఆజన్మాంత శిక్షలు విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. వయసు 25 సంవత్సరాలు. అప్పుడాయన అన్నమాట. బ్రిటిష్ వారికి మా పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నట్టుంది అని. ఆయన జైలు జీవితం గురించి అనువాదం చేయడానికి నాకు జాగృతి పత్రిక సంపాదకులు వడ్లమూడి రామ్మోహన్ రావు గారు ప్రేరకులు. జైలులో వీర సావర్కర్ మరాఠీలో రాసుకున్న ‘మాఝీ జన్మ్ ఠేప్’ అనే పుస్తకం “అండమాన్ కా ప్రియ ప్రవాస్” అని హిందీలో 500 పేజీల అనువాదంగా వచ్చింది. దానికి నేను చేసిన తెలుగు అనువాదం ‘అండమాన్ లో ఆజన్మాంతం’ రచనను జాగృతి పత్రికలో వరుసగా రెండు సంవత్సరాలు సీరియల్ గా వేశారు. ఈ పుస్తకం రెండు సార్లు అచ్చయింది. వీర సావర్కర్ కాళ్లకు సంకెళ్లు వేసి బ్రిటిష్ వాళ్ళు ఆయనను పెట్టిన చిత్రహింసలు మామూలువి కావు. ఇలా దేశం కోసం నరకయాతనలు పడిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినపుడు కరుణశ్రీ రాసిన “లాఠీ పోటులు పూల చెండ్లు చెరసాలల్ పెండ్లి వారిండ్లు ఏ/ కాఠిన్యంబైనన్ సుఖానుభవమే గాంధీ కళాశాలలో……” అనే పద్యాన్ని కోడ్ చేస్తుంటాను. అందరికీ దేశం మీద ప్రేమ, భక్తి కలగాలనే తాపత్రయం నాది.
15. మీ అనువాద రచనలను గురించి చెప్పండ
జ: అనువాద గ్రంథాలలో ముఖ్యంగా ‘భగవద్గీత’ ను ముత్యాలసరాలలో అధ్యాపకునిగా ఉన్నప్పుడు అనువాదం చేశాను. తరువాత శంకరాచార్యుల ‘భజగోవిందం’ అనువాదం చేస్తే అది నాలుగుసార్లు అచ్చయింది. ఎక్కడైనా ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఆది శంకరాచార్యుల వారి గురించి చెబుతుంటాను.
“బాలస్తావత్క్రీడా సక్తః
తరుణస్తావత్ తరుణీ సక్తః
వృద్ధస్తావచ్చిన్తా సక్తః
పరే బ్రాహ్మణి కోపి న సక్తః”
పిల్లలు ఆటలు, యువతీ యువకులు పరస్పరాకర్షణ, వృద్దులకు తమకు సంబంధించిన చింత ఉంటే ఆ పరబ్రహ్మాన్ని గురించి దృష్టి పెట్టేదెవరు? దేవుడిని, దేశాన్ని గురించి ఆలోచించేదెవరు? దేశం దైవంతో సమానం. కాబట్టి ఆ దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే అని నా భావన. అది లేకుండా మన అస్తిత్వం లేదు కదా! ఎన్ని దురాగతాలు మన దేశంపై జరిగినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలగడం మన సంస్కృతి గొప్పదనం వల్లే సాధ్యమైంది. అని ఇలా చెబుతూ ఉంటాను.
అలాగే ‘శ్రీరామ రక్షా స్తోత్రం’ గేయ రూపంలో అనువాదం చేశాను. అందులో ఉన్న ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క గేయంగా అనువదించాను. ఇవన్నీ పత్రికలో వచ్చాయి. ఇది ముఖ్యంగా ‘కోవిడ్’ ప్రారంభంలో వచ్చింది. అందరూ పారాయణ చేసి ఆ మహమ్మారిని దూరం చేయాలని చేశాను. హనుమాన్ చాలీసా చౌపాయి ఏ బాణీలో ఉందో అదే బాణీలో అనువాదం చేసి వ్యాఖ్యానం రాశాను. అది ‘శివానంద భారతి’ అనే పత్రికలో నలభై నెలలు వరుసగా వచ్చింది. దీనిని వీరపట్నం (ఇబ్రహీం పట్నం) ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆ ఊరి వాళ్ళు అచ్చు వేశారు. ఇవి గాక వాజ్ పేయి గారు రచించిన హిందీ కవితల్ని కొన్ని గేయలుగా అనువదించాను. హిందీ వచన గ్రంథాల్ని కొన్నింటిని కూడా అనువాదం చేశాను. ‘Who are Aryans they?’ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ శాఖలో పనిచేసే ప్రొఫెసర్ కె.ఎల్.వ్యాస్ గారు హిందీలోకి ‘ఆర్య్ కౌన్ థే?’ అనే పేరుతో అనువదించారు. దానిని నేను ‘ఆర్యులు ఎవరు?’ అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. ఇతిహాస సంకలన సమితి వారు నాలుగైదు సార్లు అచ్చు వేశారు.ఇవి కాకుండా ‘చిటగాంగ్ వీరగాథ’ , ‘దారి తప్పిన పంజాబ్’ అనే వాటిని కూడా హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేశాను.
16. గేయ సాహిత్యంలోని మాత్రా ఛందస్సు గురించి చెప్పండి.
జ: నేను రచించిన గేయ సాహిత్యంలో ‘సింహగర్జన’ అనేది బాగా ప్రసిద్ధి చెందింది. అందులో దేశభక్తితో కూడిన గేయాలుంటాయి. ఎక్కువ ఖండగతిలో నడుస్తుంటాయి. విద్యార్థులకు చెప్పేటప్పుడు సులభంగా నేర్చుకునేలా ఉంటుందని ఖండగతిని గురించి చెప్పేవాడిని. త్రిస్ర గతి అనేది ‘తకిట తకిట తకిట’ అనే విధంగా నడుస్తుంది. దీనికి ఉదాహరణగా “నిన్ను గూర్చి పాడుకొందు/ నన్ను గూర్చి పాడుకొందు/ నిన్న నన్ను గన్న నేల గూర్చి పాడుకొందు” అంటూ నారాయణరెడ్డి గారు రాసిన గేయాన్ని ఉదహరించేవాడిని. చతురస్ర గతికి ‘సీతా రామా రామా సీతా’ ఇది ఎట్లా వేసుకున్నా సరిపోతుంది. దీనికి బసవరాజు అప్పారావు గారు రాసినటువంటి “నీలాలందం మేఘాలందం/ కలువల కన్నుల కాంతలు అందం/ అందాలన్నీ నీలో దాగి/ నాలో నాట్యం చేసేనే…. చివరి అక్షరం ‘నే’ అనేది పాడుతున్నప్పుడు దీర్ఘం తీయడం వల్ల నాలుగు మాత్రలై దానికొక అందం ఇస్తుంది. ఇలాంటివన్నీ పిల్లలకు వివరంగా చెప్పేవాడిని. ఇక మిశ్ర గతిని గురించి చెబితే ముత్యాలసరాలు మొత్తం మిశ్ర గతిలో నడుస్తుంది. ఉదాహరణకు “ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్” ఇందులో ‘ఒట్టి’ అనేది త్రిస్ర, ‘మాటలు’ చతురస్ర, ‘కట్టి’ త్రిస్ర, ‘పెట్టోయ్’ చతురస్ర..
సాహిత్య రచనా శైలి అలవడడానికి వీటిని గురించి బాగా చెప్పేవాళ్ళం. నారాయణరెడ్డి గారు నాగార్జున సాగరం మొదలైనవి ఖండగతిలో ఉంటాయి.
వాటిని గురించి, అలాగే గజ్జెల మల్లారెడ్డి గారి ‘శంఖారావం’ దీనికి ఎక్కువగా నేను ఉదాహరించి చెప్తాను.
“స్వాతంత్ర్య గానాలు, స్వేచ్ఛా ప్రబోధాలు/ కవుల ఊహాలోక కమనీయ దృశ్యాలు……….
కను తెరచి వీక్షించరా….
ఈ నిజము కాదన్న వాడెవడురా”
పైన వాటిలో ఈ ‘రా’ అనేది రెండుసార్లు వచ్చింది. దానివల్ల ఆ రాగం తీయడంలో ఒక అందం ఏర్పడుతుంది. ఇది అయిదు మాత్రలుగా కొనసాగుతుంటుంది.
ఖండగతి అనేది అయిదు మాత్రల కాలం. త్రిస్ర, చతురస్ర, ఇవి రెండూ కలిసి మిశ్రగతి. ఆ తరువాత ఖండగతి. ఇవి కాకుండా గిడుగు సీతాపతి గారు సంకీర్ణ గతి అని చెప్పారు. ఇందులో రెండు ఉండొచ్చు. అయిదు ఉండొచ్చు. అంటే నియమం లేదు. కలగాపులగంగా ఉంటుంది. ఇన్ని గతులు ఉండగా దేనికీ అందక ఒక రాగంలో నడుస్తూ ఉంటుంది. దాన్ని ఏమనాలి అనుకొని ఛందశ్శాస్త్రంలో పని చేసిన మేమంతా దాన్ని స్వరగతి అన్నాం. వేదం ‘స్వరగతి’లో ఉంటుంది. ఈ రాగాలను మనం సంకీర్తనల్లో చూస్తాం. ఆలాపన నడుస్తూనే ఉంటుంది. రఘురామయ్య గారు ఆలాపన చేస్తే చేంతాడంత ఉంటుందంటారు. దానికి ఇక్కడి వరకు అనే నియమం లేదు. సాహిత్య విద్యార్థులలో గేయాలను గురించి ఆలోచించేలా, రచనా శక్తిని ప్రోత్సహించేలా ఈ విషయాలు చెప్పడం జరిగేది. జానపద సాహిత్యంలో కూడా ఇవే గతులు ఉంటాయి
17. “అనువర్తిత జానపద సాహిత్యం” అంటే ఏమిటి?
జ: మంచిప్రశ్న. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా! జానపద సాహిత్యంలో కూడా గతులు ఉంటాయని. కానీ రాగాలు భిన్నంగా ఉంటాయి. వాటిని బాణీలు అంటాం. దాన్ని కూడా ప్రత్యేకంగా ఏం చేశామంటే ఉదాహరణకు “నందామయా గురుడ నందామయా/ ఆనంద దేవికి నందామయా” ఇది పాతబాణీ. దీన్ని అనుసరించి “నందామయా గురుడ నందామయా/ రామ జన్మాభూమి చూద్దామయా” అని ఎవరైనా రాశారనుకోండి. దీనిని ‘అనువర్తిత జానపదం’ అనాలని జానపద సాహిత్య కారులు నిర్ణయించారు. విమర్శకులు దీనిని మొదట ‘నకిలీ జానపదం’ అన్నారు. నకిలీ జానపదం అంటే బాగుండదు కదా! ఎందుకంటే పొదుపు ఉద్యమం, కుటుంబ నియంత్రణ, వ్యాపార సంస్థలు ప్రచారం కోసం పెట్టుకున్నవి, ఇంకా ఎన్నో సమాజ పరమైన అంశాలు ఇవన్నీ జానపదాల్లో వస్తుంటే ఇట్లా అనడం సరికాదని వీటిని అప్లైడ్ ఫోక్ సాంగ్స్, అప్లైడ్ ఫోక్ పోయెట్రీ, అప్లైడ్ ఫోక్ లిటరేచర్ అని పేరు పెట్టారు. తెలుగులో దీనికి జానపద సాహిత్యకారులందరమూ వీటిని అనువర్తిత జానపద పాటలు , అనువర్తిత జానపద కవిత్వం, అనువర్తిత జానపద సాహిత్యం అని పేర్కొన్నాం. నేను కూడా ఈ పద్ధతులో కవిత్వం రాశాను. ప్రత్యేకంగా జానపద సాహిత్యం అని పుస్తకం వేయలేదు కానీ ఆయా సందర్భాలలో రాసినవి 60, 70 గేయాలవరకు ఉంటాయి. ఇట్లా సాహిత్య వికాసంలో పద్యం, గేయం, వచనం ఇవన్నీ వచ్చాయి.
18. ‘గోమాత’ మీద శతకం రాయడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ: ఉంది. మా అమ్మ పేరు ద్రౌపదమ్మ. మమ్మల్ని పెంచి పెద్ద చేసిన నడిపి పెద్దమ్మ శాంతమ్మ. మా తమ్ముని పుట్టుకలో మా పెద్దమ్మ నర్సమ్మ చనిపోయింది. అయితే నేను పుట్టిన సమయంలో చాలా బలహీనంగా ఉండి ‘బతకడు’ అనుకున్నారట. నాకు మూడు నెలల వయస్సులో ఏది తాగినా ఇమిడేది కాదట. అటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు చేసేది ఏమీ లేక గోమాతను నమ్ముకొని ఏది అవుతే అదవుతుందని, ఆవు నుండి అప్పుడే పితికిన చెంబెడు వేడి పాలను నా గొంతులో పోశారట. అది ఔషధంగా పనిచేసి బతికి బట్ట కట్టాను. అందుకే ముందు మా అమ్మ , ఆ తర్వాత గోమాత నాకు అమ్మ. ఆ తర్వాత నాకేదో గండం ఉందని ఎవరో చెప్పారని, సిరిసిన గండ్ల ఊరులో ‘గట్టు జాతర’ అని చేస్తారు. అక్కడ దేవాలయంలో రాముడు మా ఇలవేలుపు. ఆ సందర్భంలో ఆ గండం నుండి బయటపడడానికి నా చేత ‘గండదీపం’ మోయించి చుట్టు తిప్పారట. పెద్దయిన తర్వాత ఈ విషయాలు తెలిసి ‘గోరక్షణ’ శతకం, ‘సిరిసిన గండ్ల రామ’ శతకం రాశాను.
19. వివిధ పత్రికలకు సంపాదకత్వం వహించారు కదా. ఆ సందర్భాలను వివరించండి.
జ. ఇది నా జీవితంలో సుదీర్ఘ ప్రస్థానమని చెప్పొచ్చు. అనేకమైన పత్రికలకు సంపాదకత్వం వహించాను. ఇప్పటికీ విరమించలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు నేను రెండు, మూడు పత్రికలకు సంపాదకత్వం వహించాను. షాద్ నగర్ దగ్గర వెలసిన రామకోటి జపయజ్ఞ ఆశ్రమ నిర్వాహకులు నిత్య శుద్ధానంద గిరి స్వామి. ఆ ఆశ్రమం నుండి ‘గీతాజ్ఞాన యోగ సమాచార్’ అనే పత్రికను 1989 ప్రాంతంలో ప్రారంభించారు. స్వామి వారి ప్రేరణతో నేను 21 సంవత్సరాలు దానికి సంపాదకునిగా ఉన్నాను. అధ్యాపకునిగా ఉన్నప్పుడే ‘విశ్వహిందూ’ మాసపత్రికను చూసేవాడిని. గత 23 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆ పత్రికకు సంపాదకునిగా ఉన్నాను. భాగ్య నగర్ లో గాంధీ ఆసుపత్రి వెనకాల ‘శివానందాశ్రమం’ వారు ‘శివానంద భారతి’ పేరుతో మాసపత్రికను నిర్వహిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది నిరాఘాటంగా సాగుతోంది. దానికి ఇప్పటికీ సంపాదకునిగా కొనసాగుతున్నాను. ఒక్కో సందర్భంలో నాలుగైదు పత్రికలను కూడా చూశాను. ‘పుష్పగిరి భారతి’ అనే పత్రికకు నాలుగేళ్లు సంపాదకునిగా ఉన్నాను. ‘సాధన’ అనే మాస పత్రికకు ఐదేళ్లు సంపాదకునిగా ఉన్నాను. ‘ధర్మ సారథి’ అనే ఆధ్యాత్మిక మాస పత్రికను రెండేళ్లు చూశాను.
20. తిరుమల తిరుపతి దేవస్థానంలో “హిందూ ధర్మ ప్రచార పరిషత్” కార్యదర్శిగా చేసిన విశేషాలు చెప్పండి.
జ: నేను పదవీ విరమణ చేసిన తరువాత రెండు సంవత్సరాలు తిరుపతి దేవస్థానంలో “హిందూ ధర్మ ప్రచార పరిషత్” కార్యదర్శిగా ఉండాల్సివచ్చింది. ఒకసారి ‘రమణీయ రామాయణం’ అనే పేరుతో దేవస్థానం వారు ప్రసంగాలు నిర్వహించారు. నేను, కోవెల సుప్రసన్నాచార్య గారు పాల్గొన్నాము. అంతకు మునుపు పరిషత్తుకు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఈవో ఐ.వై.ఆర్ కృష్ణారావు గారు తేనీటికి పిలుస్తున్నారని మాకు పిలుపు వచ్చింది. నేను, సుప్రసన్నాచార్య గారు వెళ్ళాం. కృష్ణారావు గారు నాతో “కసిరెడ్డి గారూ! పదవీ విరమణ అయ్యాక ఏం చేస్తున్నారు? ఇక్కడ కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది వచ్చేయండి”. అన్నారు. “నేనిక్కడ తట్టుకొని నిలబడగలుగుతానా?” అన్నాను. “మేమంతా ఉండడం లేదా? మనకు అమ్మవారు, అయ్యగారు ఉన్నారు. వాళ్లు చేయమంటున్నారు. మేము చేస్తున్నాం.” అంటూ పద్మావతీ వేంకటేశ్వరుల చిత్రపటాలు చూపించారు. నవ్వుతూ అంగీకరించాను.20 రోజుల తర్వాత ఆర్డర్ పంపించారు. ఆయన కాలంలో ఆరు నెలలు, తర్వాత వచ్చిన ఎల్. వి. సుబ్రహ్మణ్యం గారి కాలంలో ఏడాదిన్నర చేశాను.
అక్కడ ఉన్నప్పుడు ‘శుభప్రదం’ అనే పేరుతో బాలబాలికలకు ఉపయోగపడే పుస్తకం వేశాను. విద్యార్థులను మంచి వైపు నడిపించే శిక్షణ ఇవ్వడానికి ‘సదాచారం’ పేరుతో వేసిన పుస్తకంతో పాటు మొత్తం ఏడు పుస్తకాలు వేశాను. అన్నీ దేవస్థానం వారే వేశారు. ‘యుగయుగాల్లో హిందూ ధర్మం’ అనే దాన్ని మూడు లక్షల కాపీలు వేసి దేవస్థానం వారే అందరికీ పంచిపెట్టారు. అంతేకాక తరిగొండ వెంగమాంబ రచించిన ‘వేంకటాచల మాహాత్మ్యం’ మనందరికీ తెలుసు. పోతన స్థాయిలో ఉన్న అద్భుతమైన పద్యకావ్యమది. దాన్ని చాలా సరళంగా 48 పేజీల్లోకి మార్చి ‘పద్మావతీ శ్రీనివాస కల్యాణం’ అనే పేరుతో రాస్తే దాన్ని ప్రచురించారు. ‘నారాయణ వనం’ లో జరిగే బ్రహ్మోత్సవాలలో 30 వేల కాపీలు అచ్చు వేసి పంచారు. అట్లా మూడు సంవత్సరాలు పంచారు. అక్కడ ఉన్నన్ని రోజులు “జీవితంలో శక్తి తగ్గిపోయింది. రక్తి కొంత ఉంది. భక్తి ఉంది. ఇక్కడికి నన్ను రప్పించి ముక్తి ప్రసాదించావు భగవంతుడా!” అని స్వామికి స్తుతులు చేశాను. అందుకే ‘దాసోహం శ్రీనివాసస్య’ అని రాసుకున్నాను. శ్రీవారి భక్తులు అనే పేరిట 22 మంది భక్తులను వంద పేజీల పుస్తకం రాశాను. ఇట్లాంటి సాహిత్యాన్ని అక్కడ ఉన్నప్పుడే సృజించే అవకాశం లభించింది.
21. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆయా సందర్భాలలో స్వామీజీలతో మీకున్న అనుభవాలతో రచించిన పుస్తకాలను గురించి చెప్పండి.
జ: వ్యాసాశ్రమానికి సంబంధించిన ఒక ఆశ్రమం హైదరాబాద్ షాద్ నగర్ దగ్గర వెలసింది. దాని పేరు “రామకోటి జప యజ్ఞ ఆశ్రమం” దానికి నిత్య శుద్ధానంద గిరి స్వామి నిర్వాహకులుగా ఉన్నారు. వారి ప్రేరణతో అక్కడికి వెళ్ళాను. అప్పుడే ‘గీతా జ్ఞాన యోగ సమాచార్’ పత్రిక సంపాదకునిగా ఉన్నాను. 21 సంవత్సరాలు ఆ పత్రికకు సంపాదకీయాలు రాయడం, స్వామీజీ ఇచ్చిన ఉపన్యాసాలను వివరించి రాయడం ఇవన్నీ కలిపి ఆరేడు పుస్తకాలు వచ్చాయి. అందులో ఒకటి 650 పేజీల పెద్దపుస్తకం. నిజంగా గ్రేట్ వర్క్ అది. శ్రీ విష్ణు సహస్ర నామాలకు వ్యాఖ్యానం స్వామీజీ సూక్ష్మంగా చెప్పిన దానిని విశ్లేషించి రాశాను. అట్లాగే భగవద్గీత వ్యాఖ్యానం. ఆ తర్వాత గజేంద్ర మోక్షణం. ఇవన్నీ స్వామీజీ పేరిట వచ్చినవే. వాటన్నిటిలో నా పీఠిక ఉంటుంది. స్వామీజీ ఉపన్యాసాల్లో ఇవన్నీ కసిరెడ్డి గారే తయారు చేసేవారని చెబుతుండేవారు (నవ్వుతూ). వారి ప్రేమ అట్లాంటిది. ఆయన రెండేళ్ల క్రితం బ్రహ్మలీనమయ్యారు. అంతకు పూర్వమే నేను వారి జీవిత చరిత్రను దాదాపు 300 పేజీలు రాస్తే రెండుసార్లు అచ్చయింది. ఆయన బ్రహ్మలీనమయ్యాక ‘స్వామి నిత్యశుద్ధానంద – ప్రేమమూర్తి’ అనే మకుటంతో రాశాను. వారు ఉపన్యాసాల్లో చెప్పిన వాటిని ‘నిత్యశుద్ధానంద – నీతికథలు’ అనే పేరుతో 20 కథలను పుస్తకంగా వేశాను.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వేదాంత విజ్ఞానాన్ని జన జీవితంలోకి తీసుకొని పోవడానికి బ్రహ్మాండమైన కథలను జోడించి చెప్పినవారు. స్వామి రామానంద తీర్థ. ఆయన వేదాంత తత్త్వంలో ఎన్నో నీతి కథలు వస్తాయి. అట్లాగే నిత్య శుద్ధానంద స్వామి వారు కూడా. ఆయన కూడా పురాణాల్లోనివి కావచ్చు, ఇతిహాసాల్లోనివి కావచ్చు, అంతకు ముందు ఎవరో చెప్పగా మనం విన్నవే కావచ్చు. వాటిని ప్రసంగాలలో చెప్పేవారు. వ్యాసాశ్రమ వ్యవస్థాపకులైన మళయాలస్వామి సాంప్రదాయం అది. మళయాల స్వామి తరువాత విమలానంద స్వామి, విద్యానంద స్వామి. ఈ పరంపరలో ఇప్పుడున్నవారు పరిశుద్ధానంద గిరి స్వామి వారు. వీళ్ళంతా చిన్న చిన్న కథలను ఆధ్యాత్మిక బోధనలో భాగంగా చెబుతూ ఉంటారు. దాంతో గహనమైన ఆధ్యాత్మిక, తాత్త్విక విషయాలు కథల ద్వారా హాయిగా అర్థమవుతాయి. అట్లాగే శ్రీ జ్ఞానేశ్వరానంద గిరి స్వామి వారని ఆయనను అనుసరించినవారే. నేను ఆయన జీవితాన్ని గురించి “స్వామి జ్ఞానేశ్వరానంద – సాధుమూర్తి” అనే పేరుతో రాశాను. ఇట్లా స్వామీజీల ప్రసంగాలలో ఉండే తత్త్వాన్ని అనుసరించి ఉండే సూక్తులతో పుస్తకాలను వెలువరించాను. స్వామి శివానంద గారు హృషీకేశ్ లో మూడువేల ఎకరాల స్థలంలో ‘శివానంద నగర్’ నిర్మాణం చేశారు. అక్కడ ‘శివానందాశ్రమం’ ఉంటుంది. అక్కడ ఆధ్యాత్మికము, ఆది భౌతికము, సైన్సు, యోగ మొదలైన వాటితో బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తారు. స్వామివారికి సంబంధించి ‘ఉపదేశం’, ‘జ్ఞాన గంగాలహరి’ లతో పాటు ఆయన చెప్పిన పిల్లల కథలు 22 కలిపి ‘శివానంద పిల్లల కథలు’ అనే పేరుతో మూడు పుస్తకాలు వేశాను. ఇవే కాకుండా కథా సాహిత్యంలో చిన్నకథ, పెద్ద సందేశాన్ని అందించాలనే సంకల్పంతో నేనప్పుడప్పుడు విన్నవి ‘నూరు చిన్న కథలు’ అనే పుస్తకం వేశాను. ఐదారుసార్లు అది అచ్చయింది. సాహితీ నికేతన్ అనే సంస్థ వాళ్ళు పదివేల పుస్తకాలను అచ్చు వేసి, ప్రైమరీ, హై స్కూల్ పిల్లలందరికీ అందేట్లు చేశారు.
22. చివరగా… మీ సాహితీ యాత్రను ఇంకా కొనసాగిస్తున్నారా?
జ: అమ్మా! నేను చేసిన రచనలన్నీ ఆధ్యాత్మిక అంశాల ద్వారా మానవ జీవితంలో వికాసాన్ని కలిగించడం, సంస్కృతి ద్వారా మానవుని నిర్మింపజేయడం అనే తపనతో చేసినవే. దేని నుండి ఏదీ ఆశించలేదు. ఆ అవసరం కూడా లేదు. అందుకే అటు అధ్యాపకత్వం, రచన, సంపాదకత్వం వీటన్నిటికీ మించి ఉపన్యాసాలకు వెళ్లడం ఎక్కువగా చేశాను చేస్తున్నాను. ఊపిరి ఉండడం ఎంత సహజమో సాహిత్య జీవితం అనేది నాలో అంతగా పెనవేసుకొని నడుస్తున్నది. సాహిత్యం మనిషిని తీర్చిదిద్దుతుంది. శరీరానికి ఏదైనా మలినం అంటుకుంటే గంగతో కడిగి శుభ్రం చేస్తాం. కానీ మనసుకు అంటుకున్న మలినం జ్ఞానగంగతో శుభ్రమవుతుందని నా అభిప్రాయం. ఆ జ్ఞాన గంగయే సాహిత్యమని నా నమ్మకం. నాకు అదే జీవితంగా నడుస్తున్నది. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే. దేశాన్ని ప్రేమించండి. భారతీయ ధర్మాన్ని కాపాడండి. తద్వారా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొనండి.
ధన్యవాదాలు సార్ నమస్కారం. ఎంతో సమయాన్ని కేటాయించి, మీ జీవితాన్ని, మీ సాహిత్య, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సవివరంగా మా పాఠకులకు తెలియ జేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు.
శతాధిక గ్రంథకర్త, ద్విసహస్రాధిక వ్యాసకర్త, అష్ట సహస్రాధికోపన్యాసకర్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి సాహితీ ప్రస్థానం ఇకముందు కూడా నిరంతరంగా ప్రవహించాలని కోరుకుంటూ సెలవు🙏
వెన్ను భాగాన్ని పరచుకున్న జుట్టును
వేళ్ళతో సుతారంగా ముడివేసి
కంటిరెప్పల బరువును
అమాంతం దించుకొని
కాలి అందెల సవ్వడి ప్రణవంగా
మెత్తని అడుగులతో వడివడిగా
ప్రపంచంపై సూరీడు పాకక ముందే
మొదలయ్యే ఉదయం ఆమెతో
తెల్లటి ముగ్గు రేఖలు
వేలి సందుల నుండి జాలువారి
వయ్యారాలు పోతుంటాయి
చేతి రుచుల కమ్మదనాలు
బయటివారిని ఒకింత
నిలువరిస్తాయి ఇంటిముందు
అగరొత్తుల పరిమళాలు
దేవతా దీవెనలై వ్యాపిస్తాయి
ఇంటినిండా..
బద్ధకం కప్పుకున్న దేహాలు
మగతగా దొర్లుతుంటాయి
వారి అవసరాల కోసం ఆమె
శరీరంలో ఇంకిన తేజస్సును
అరువు తెచ్చుకుంటుంది
మళ్లీ మళ్లీ కొత్తగా
త్యాగాల కుంచె ధరించి
ప్రతి క్షణం వారి కోరికలకు
నునువెచ్చని మమకారాల
వన్నెలద్ది
జీవన కాంతిని ప్రసరిస్తూ ఆమె
అడుగడుగున ఆమె పదనర్తనం
వెన్నెల చల్లదనంలా
స్వచ్ఛతకు మారు పేరవుతుంది
తనకు తాను తప్ప
అందరికి మాత్రం ఆమే
ఆమే అలిగిన నాడు….?
ఏ భాషా భావం
విప్పలేదు ఆ శక్తిని
కూర్చలేదు ఆనందాకృతిని !
అరుణ ధూళిపాళ
8-3-2024
(అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా)
మధ్యాహ్నం భోజనం చేసి, పుట్టింట్లో నాలుగు రోజులు గడపడానికి వచ్చిన కూతురు భావన తల్లికి అత్తవారింటి విషయాలు చెబుతోంది. సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటున్నాడు తండ్రి శ్రవణ్. భర్త మంచివాడేనని, అత్తగారు కూడా కలివిడిగానే ఉంటుందని చెబుతూనే ఏవో కంప్లైంట్స్ ఇస్తూ తను ఆమెను ఎంతగానో భరిస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది. తల్లి రేఖ “అలా కాదమ్మా! మీ అత్తగారిని రెండేళ్లుగా చూస్తున్నాం. మంచి మనిషి. అలాంటి అత్తగారు దొరకడం నీ అదృష్టం” అని నచ్చచెప్పడం ఆ అమ్మాయికి నచ్చడం లేదు.
అప్పటిదాకా మౌనంగా వింటున్న శ్రవణ్ “భావనా!” అన్నాడు కొంచెం కఠినంగా. తల్లీ కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి శ్రవణ్ వైపు చూశారు. “భావనా! ఎప్పుడూ ఇతరుల మీద నింద వేయడం సరి కాదు. అల్లుడితో సమానంగా నువ్వూ డ్యూటీకి వెళ్ళిపోతే మీరు వచ్చేవరకు అన్నీ సిద్ధం చేయడం మాట్లాడినంత సులువు అనుకుంటున్నావా? అల్లుడు భరత్ ఒక్కడే కావడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. భర్త లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ మీ సుఖం కోసం ఎప్పుడూ ఆరాటపడే మీ అత్తగారిని అనడానికి నీకు నోరెలా వస్తోంది? ఎంతో మంది ఆడవాళ్లు అత్తవారింట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దానికి మీ అమ్మ నీ ముందు సజీవ సాక్ష్యం. ఆమె ఎదుర్కొన్నవాటిలో నీ అనుభవం ఆవగింజంత కూడా కాదు. నన్ను పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ పడిన అనేకమైన కష్టాల్లో నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక దుస్సంఘటన చెప్తాను. ఇప్పటివరకు నీకవేవీ తెలియవు”. అని కళ్ళు మూసుకొని దాని తాలూకు గతంలోకి జారిపోయాడు శ్రవణ్.
*****
ఆ రోజు…మేడ మీద ఒక గదిలో శ్రవణ్ అసహనంగా అటూఇటూ పచార్లు చేస్తున్నాడు. హైదరాబాద్ నుండి పరీక్షలు ముగించుకొని ఆరోజు మధ్యాహ్నమే పల్లెకు వచ్చాడు. భార్య రేఖ ఎందుకో సంతోషంగా ఉన్నట్టు అనిపించలేదు. ఆమె ముఖంలోని భావాలను చదవడానికి తనకు కళ్ళులేవుగా! రేఖ గదిలోకివస్తే అడగాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ రాత్రివేళ పనంతా ముగించుకొని కానీ ఆమె పైకిరాదు. కుటుంబ కట్టుబాట్లకు ఎక్కడా లోపం రానీయదామె. అత్త, భర్త, మరుదులు, ఆడపడుచులు అందరూ భోజనం చేశాక పనంతా ఆమే చేసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలు కదా! కొంతమందికి అడగకుండానే సంప్రదాయబద్ధంగా కొన్ని బాధ్యతలు వచ్చి చేరతాయి వయసుతో నిమిత్తం లేకుండా..!
గుమ్మం దగ్గర అలికిడి అయింది. అడుగుల సవ్వడినిబట్టి రేఖ అని అర్థమయింది. రెండు నిమిషాలు మౌనం ఇద్దరి మధ్యా… మంచంమీద కూర్చున్నాడు శ్రవణ్. దగ్గరగా వచ్చిన రేఖ అమాంతం అతడిని చుట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఊహించని ఈ పరిణామం అతన్ని అయోమయంలో పడేసింది.
చదువు కోసం శ్రవణ్ హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండడం, పరీక్షలు అయింతర్వాత సెలవులకు ఇంటికి రావడం పరిపాటే. ఇంట్లో అందరి మధ్యలో ఒంటరితనం అనుభవిస్తున్న రేఖ భర్త కున్న అంధత్వం వల్ల తమ భవిష్యత్తు కోసం శ్రవణ్ చదువే ఒక ఆలంబన అనే సత్యాన్ని అతని మాటల ద్వారా గ్రహించింది. అందుకే 16 ఏళ్ళ రేఖ అతనికి దూరంగా ఉండడానికి గొప్ప మనసుతో అంగీకరించింది. అత్తగారి సూటిపోటి మాటలను, తన భర్త నిస్సహాయతవల్ల సంసార బాధ్యతను భుజాల మీద మోస్తున్న మరిది పెద్దరికాన్ని భరిస్తూనే, చిన్నవారైన ఇంకొక మరిది, ఇద్దరు ఆడపడుచుల ఆలనాపాలనా చూసుకుంటోంది. ***
ఏడుస్తున్న రేఖను ఓదార్చడం అసాధ్యమైంది శ్రవణ్ కు. జరగకూడనిది ఏదో జరిగి ఉంటుందని అర్థమైంది. ఆమె దుఃఖం కొంత ఉపశమించేదాకా ఆగి “ఏమైంది రేఖా! ఎందుకేడుస్తున్నావ్? నువ్విలా ఏడవడం నేను చూడలేకపోతున్నాను. జరిగిందేమిటో చెప్పు?” లాలనగా అడిగాడు. వెక్కిళ్ళమధ్య రేఖ చెప్పిన విషయం విని శిలలా బిగుసుకుపోయాడు శ్రవణ్.
దీనికంతటికీ తన అసహాయతే కారణమా? అదే అయితే దానికి రేఖను బలి చేయడం ఎందుకు? నరాలు బిగుసుకున్నాయి.
తననుతాను తమాయించుకొని “రేఖా! మన కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయమే రాగానే నీతో చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను. వచ్చినప్పటినుండీ నీ మౌనం నాలో అలజడులను రేపుతూనే ఉంది. నేను చెప్పే వార్త విని నీ మనస్సులో పొంగే సంతోష తరంగాల సవ్వడులను నా గుండెలో పొదువుకుందామనుకున్నా. ఒక్కసారిగా నా ఆశలు మొదట్లోనే పాతర వేయబడ్డాయి. నాలాంటి అంధుడిని కట్టుకున్నందుకు నాతోపాటు నువ్వూ చిత్రవధ అనుభవిస్తున్నావు. ఊరుకో! నీ ఆవేదనను అర్థం చేసుకోవడమే తప్ప ఏమీ చేయలేని వాణ్ణి. కాలం మనకు మంచిరోజులు ఇస్తుందని నా నమ్మకం అన్నాడు. కానీ రేఖ ఉన్న పరిస్థితిలో భర్త ఓదార్పు, ఆయన చెప్పాలనుకున్న శుభవార్త ఇవేవీ ఆమెకు రుచించలేదు.
పేదవారైన రేఖ తల్లిదండ్రులు గత్యంతరం లేక అంధుడైన శ్రవణ్ తో ఆమె పెళ్లి చేశారు. డబ్బున్న ఆ ఇంట్లో కూతురు సుఖపడుతుందని వారు ఆశించారు. పేదరికంతో పాటు శ్రవణ్ అంధత్వం ఆమె ఆశలకు సంకెళ్లు వేసాయి. ఆమెకు పెళ్లిలో శ్రవణ్ వాళ్ళు చేయించిన బంగారు గొలుసు ఇనప్పెట్టెలో ఉంటుంది. అప్పుడప్పుడు శుభకార్యాలకు అత్తగారే తీసి ఇస్తుంటుంది. పెట్టె తాళపుచెవులు ఆమె దగ్గరే ఉంటాయి. ఈ విషయంలో ఆమె ఎవ్వరినీ నమ్మదు. అలాంటిది ఉన్నట్టుండి ఆ గొలుసు పెట్టెలో నుండి మాయమైంది. కుటుంబమంతా తర్జనభర్జనలు జరిపి పేదింటి అమ్మాయి రేఖకు మాత్రమే తీసే అవసరం ఉందని తేల్చారు.
ఇందులో రేఖ తన గొలుసు తనే ఎందుకు దొంగతనం చేస్తుందన్న ఇంగితజ్ఞానం కూడా ఎవ్వరికీ కలుగలేదు. మన కుటుంబాల్లో చాలామందికి కోడలు పరాయిది. ఎంత ఊడిగం చేయించుకున్నా ఇలాంటి విషయాల్లో ఆమెను దోషిగా నిలబెడతారు. రేఖ నుండి విషయాన్ని రాబట్టడానికి ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నాలు ఎన్నోచేశారు. శ్రవణ్ ఊళ్ళో లేడు కాబట్టి ఇవేవీ అతనికి తెలియవు. మరో దారుణమేంటంటే అజ్ఞానం వెర్రితలలు వేసి మూఢనమ్మకంగా మారి రేపటి రోజున రేఖను దోషిగా నిరూపించడానికి అమ్మలక్కలంతా పథకం తయారుచేసారు. రేఖను శోకదేవతగా మార్చిన సంఘటన ఇదే. *****
సూర్యుడు తన కర్తవ్య పాలనకు ఉపక్రమించాడు. రేఖ ఎప్పటిలాగే చీకటితోనే లేచి యాంత్రికంగా తన పనులు చేసుకోసాగింది. మన దేశంలో చాలమంది మధ్యతరగతి మహిళల బ్రతుకులు ఇట్లాగే తెల్లవారుతాయి కారణాలు ఏవైనా. రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ కళ్ళు ఉబ్బిపోయి ఉన్నా గమనించనట్లే ఉన్నారు ఇంట్లోని వాళ్లందరూ. అదింకా రేఖ మనసును సూటిగా గుచ్చుతోంది. శ్రవణ్ ఆలోచనల నిద్ర లేమితో ఎరుపెక్కిన కళ్ళను నల్లటి కళ్ళద్దాలలో దాస్తున్నాడు. ఇదంతా అన్యాయమని గొంతెత్తి అరవాలని ఉంది. దాని పరిణామాలు తమ భవిష్యత్తు మీద ఎలాంటి ముద్రలు వేస్తాయో తనకు బాగా తెలుసు. తొందరపడటం అన్నిటికీ పరిష్కారం కాదని, తన చదువు ఒక కొలిక్కి వచ్చేంతవరకు ఎన్ని బాధలైనా అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మౌనం వహించాడు. భర్త ఆలోచనలను ఎరిగిన ఇల్లాలిగా ఎంతో సహనం వహించే రేఖ కొన్ని సందర్భాల్లో భర్త నిష్ప్రయోజకుడని నిందిస్తుంది. ఆమె భావనలో తప్పు లేదు. వ్యతిరేకులైన మనుష్యుల మధ్య ఆమెకున్న ఒకే ఒక ఆలంబన శ్రవణ్.
అంధుడని తెలిసినా ఏ నమ్మకంతో జీవన ప్రయాణంలో తోడుగా ఉంటానని వచ్చిందో ఆ మనసుకే తెలుసు.
ఇల్లంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా తనవాళ్లే మొన్నటివరకు. తన కుటుంబమే. కానీ ఈరోజు అందరూ ఉన్న ఏకాకి రేఖ. చేయని నేరానికి అభియోగం మోపబడిన ముద్దాయి. ఆమె కళ్ళు నిండు తటాకాలయ్యాయి. మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి. అమ్మలక్కలు ఒక్కొక్కరుగా ఇంటి వసారాలోకి వచ్చి చేరుతున్నారు. రేఖను దోషిగా నిరూపించే ప్రయత్నాల్లో మొదటి ప్రణాళికకు రంగం ఏర్పాటు చేశారు. ఇంట్లో రేఖ, శ్రవణ్ తప్ప మిగిలిన అందరిలో కుతూహలం చోటు చేసుకుంది. శ్రవణ్ కు కూడా రేఖ నిర్దోషి అని పూర్తి నమ్మకం. అందుకే ఒకచోట ఒంటరిగా కూర్చున్నాడు. విద్యాగంధం లేని ఆ పల్లె టూరులో చదువుకున్న తానొక్కడు ఇవి మూఢ నమ్మకాలని ఎలా రుజువు చేయగలడు? అభిమన్యుడై ఎట్లా పోరాడగలడు? సన్నటి కన్నీటి పొర కనిపించని ఆ కళ్ళల్లో.
మొత్తం ఐదుగురు ఆడవాళ్లు వచ్చారు. అందులో అందరికంటే వయసులో పెద్దావిడ శ్రవణ్ తల్లి రాజమ్మను బియ్యం, పసుపు తెమ్మని పురమాయించింది. వాటిని కలుపుతూ కళ్ళు మూసుకొని పెదాలతో ఏవో అర్థం కాని పదాలను వల్లించింది. అందరూ చోద్యం చూస్తున్నారు. “రేఖమ్మా! మళ్లీ అడుగుతున్నా చెప్పు. గొలుసు నువ్వే తీసినవు కదా”? అడిగింది పెద్దరికం.
“లేదు పెద్దమ్మా! మీరెన్ని సార్లు అడిగినా నేను తీయలేదు అంతే. ఆ అవసరం నాకు లేదని మీకు మళ్లీ మళ్లీ చెప్తున్నా” ఆవేదన, ఆక్రోశంతో దుఃఖాన్ని గొంతుకలో ధ్వనింపచేస్తూ రేఖ జవాబు. “ఇక ఇట్లా కాదులే రాజమ్మా! ఎంత అడిగినా నీ కోడలు నిజం చెప్తలేదు. రేపటికల్లా నిజం బట్ట బయలైతది. ఇదుగో, ఈ మంత్రించిన బియ్యాన్ని నీ కోడలును తినమని చెప్పు. పొద్దటికి కడుపుబ్బి, నిజం కక్కుతది” అన్నది పెద్దరికం పొగరుగా తల ఎగరేస్తూ తానేదో సాధించబోతున్నట్టు.
“సరే వదినా” అంటూ రాజమ్మ రేఖతో వాటిని తినమని చేతిలో పెట్టింది. ధారలుగా కారుతున్న కన్నీటిని కొంగుతో
తుడుచుకుంటూ ఉక్రోషంగా చేతిలోకి తీసుకొని వాటిని కసిదీరా నమిలి మింగేసి పరుగెత్తుకొని లోపలికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె గుండెలోని బాధతో సంబంధం లేని అమ్మలక్కలు తమవంతు పని పూర్తయిందన్న తృప్తితో కాసేపు అదే విషయాన్ని చర్చించుకుని వెనుదిరిగారు.
మరో ఉదయానికి తెర తీస్తూ చంద్రుడు మబ్బుల్లో కనుమరుగయ్యాడు. రేఖ మామూలుగానే లేచి పనుల్లో నిమగ్నమయింది. సమయం గడుస్తున్న కొద్దీ దుఃఖ తీవ్రత తగ్గడం సహజమే కదా! శ్రవణ్ కు కూడా ఏదో జరుగుతుందనే భయం లేదు. రేఖపై అత్యంత విశ్వాసం కలిగి విద్యావంతుడైన భర్త అతను. కళ్ళు లేకపోవడమనే లోపం తప్ప పరిపూర్ణ సుమనస్కుడతడు. ఇంట్లో వాళ్లంతా ఒక్కొక్కరుగా లేచి అనుమానంగా రేఖ వైపు చూడసాగారు. ఎలాంటి తేడా ఆమెలో కనిపించలేదు. గొలుసు దొంగతనం ఆమెనే చేసి ఉంటుందని, ఈ రోజు అది తేటతెల్లమవుతుందని, దాని తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించుకున్న వాళ్లకు ఆశాభంగం కలిగింది.
సూర్యుడు తన తాపాన్ని పెంచుకున్నాడు. నిన్నటి పెద్దరికం ఇంట్లోకి వచ్చింది. రాజమ్మతో గుసగుసలు కాసేపు. ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయింది. మేడ మీద ఉన్న శ్రవణ్ దగ్గరికి వచ్చి రేఖ జరిగిన విషయం చెప్పింది. ఇద్దరిలో అంతులేని ఆలోచనలు. మళ్ళీ ఏ పథకాన్ని తోడుతున్నారోనని భయం. అది తప్పు చేయడం వల్ల వచ్చింది కాదు. చేయని నేరానికి శిక్ష అనుభవించే బలం మనసులకు లేక కలిగే భయం.
సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు అమ్మలక్కలంతా మళ్లీ సమావేశమయ్యారు. చాలాసేపు చర్చించుకున్నారు. రేఖను పిలిపించారు. రేఖతో పాటు శ్రవణ్ కూడా కిందకు వచ్చాడు అసహనంగా. రాజమ్మ చేటలో బియ్యం తెచ్చింది. పసుపుతో వాటిని కలపమని పెద్దావిడ ఆజ్ఞ జారీ చేసింది. కలిపిన పసుపు బియ్యంలో ఒక్కొక్కరిని పిలుస్తూ రెండు చేతులు పెట్టమంది. రేఖను మాత్రమే పిలిస్తే బాగుండదని ముందుగా ఇద్దరు, ముగ్గురిని పిలిచింది. ఏవో చదువుతూ వాళ్ళు పెట్టిన చేతుల మీద తన చేతులు పెట్టింది. ఒకవేళ వారు దోషులైతే ఆమె చేతి కింద ఉన్న చేతులు వాటంతట అవి కదులుతాయి. ఇదీ ఆ ప్రక్రియ సారాంశం. ఎవరి చేతులూ కదలలేదు. రేఖ వంతు వచ్చింది. రేఖ భయం భయంగా చేతులు పెట్టింది. రేఖ చేతులపై పెద్దావిడ చేతులు. “కదులుతున్నాయ్, కదులుతున్నాయ్” ఆమె కళ్ళలో మెరుపు, గొంతులో ఆనందం. బిత్తరపోయిన రేఖ.
అప్పటిదాకా అన్నిటినీ భరిస్తూ వచ్చిన శ్రవణ్ హృదయంలోని బడబానలం ఒక్కసారి విరుచుకుపడింది. “ఆపండి!” అరిచాడు గట్టిగా. పెద్దరికం ఏదో మాట్లాడబోయింది. “ఇప్పటి వరకు చేసింది చాలు. ఎవ్వరూ మాట్లాడొద్దు. ఎవరైనా ప్రయత్నిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత చేతకాని వాడిననుకుంటున్నారా? దోషులను నిర్ణయించే సామర్థ్యం మీకుంటే ఇక పోలీసులు, కోర్టులు ఎందుకు? అసలు రేఖను దోషిగా అనుకోవడానికి మీకు మనసెలా ఒప్పింది? మీ మూఢ నమ్మకాలతో అమాయకులను బలి పెట్టొద్దు. వెళ్లండి అందరూ ఇక్కడినుండి” అన్నాడు పెల్లుబికిన ఆవేశంతో. రాజమ్మతో సహా అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కొడుకులో ఇంత ఆవేశం ఆమె కూడా ఎప్పుడూ ఎరగదు. ఈ చర్యను ఆమె ఊహించలేదు. సైగ చేసింది వాళ్లకు వెళ్ళిపొమ్మని. అందరూ జారుకున్నారు మెల్లగా. శ్రవణ్ తన నిస్సహాయతకు తనను తాను నిందించుకుంటూ మేడ మీదికి వెళ్ళిపోయాడు. రేఖ మనసు వీణలు మీటింది. తనకు సర్వస్వం అయిన శ్రవణ్ తనకోసం అందరినీ ఎదిరించి తన పక్షాన నిలవడం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇక తనకు ఎలాంటి బాధ లేదు అనుకుంది తృప్తిగా. దుఃఖమంతా ఆవిరైపోయినట్టు తోచిందామెకు. మౌనంగా భర్తను అనుసరించింది సంతోషంగా.
*****
ఒక వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. మళ్లీ ఇంట్లో ప్రయత్నాలు మొదలైనట్టు రేఖ ద్వారా అర్థమైంది శ్రవణ్ కు. ఏదైనా భయం లేదనుకున్నాడు. రేఖకు ధైర్యం చెప్పాడు. గొలుసును దొంగిలించింది ఇంకా ఎవరో తేలలేదు కాబట్టి శ్రవణ్ పెద్ద బావ నాలుగూళ్ల అవతల ఎవరో “అంజనం” వేస్తారని దాంట్లో దొంగ బయటపడతాడనే వార్త మోసుకొచ్చాడు. శ్రవణ్ పెద్ద తమ్ముడు, బావ ఇద్దరూ కలిసి ఆ ఊరికి వెళ్లారు. అక్కడ కొమురయ్య అనే వ్యక్తి అంజనం వేస్తాడని తెలిసి అతని ఇంటికి వెళ్లారు. వీళ్ళు చెప్పిన విషయం అంతా విని కొమురయ్య దొంగను పట్టిస్తానని భరోసా ఇచ్చాడు. చేతికి ఏదో లేపనం పూసుకుని కాసేపు మంత్రాలు చదివి, రేఖ దోషి కాదని ఇతరుల వల్లే గొలుసు మాయమైందని తేల్చాడు. రేఖ మీద ఉన్న అభియోగం ఆ రకంగా రూపుమాపబడింది. తర్వాత ఎన్నో ప్రయత్నాలు జరిగి కొన్నాళ్ళకు ఆ ఇంటి పనివాడు తీసాడన్న వాస్తవం తెలియడం, వాడు ఏడుస్తూ రాజమ్మ కాళ్ళ మీద పడి గొలుసును తిరిగి ఇచ్చివేయడం జరిగింది.
రాజమ్మతో సహా ఇంట్లో వాళ్ళందరూ శ్రవణ్ ను తప్పించుకొని తిరుగుతున్నారు. అన్నీ అర్థమైనా ఏదీ జరగనట్టే అందరితో మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రవణ్.
****
నెల రోజులు గడిచాయి. శ్రవణ్ వేసవి సెలవులు అయిపోయాయి. ఆరోజు…..వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోలేదు ఇంకా. రేఖ చేయి పట్టుకొని శ్రవణ్ నడుస్తున్నాడు. వారికి ముందు ఆ ఇంటి నమ్మినబంటు పనివాడు ఒక చేతిలో పెట్టె ఒక చేతిలో బ్యాగు పట్టుకొని నడుస్తున్నాడు. బస్టాండులో వారిని బస్సెక్కించి చేయి ఊపాడు కన్నీళ్ల మధ్య. తన వారికి దూరమవుతున్నానన్న బెంగ కంటే కన్నఊరికి దూరమవుతున్నానన్న బాధ శ్రవణ్ ని ఎక్కువగా పీడించసాగింది. శ్రవణ్ చేతిని పట్టుకున్న రేఖ, బాధల సుడిగుండం నుండి తీరానికి చేరిన నావలా సంతృప్తిగా నిట్టూర్చింది. ఆవలి తీరపు కష్టాన్ని ఆమె ఊహించగలదు. కానీ చదువుకున్న తన భర్త మీద పూర్తి నమ్మకం. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు.
పరీక్షల తర్వాత సెలవులకు ఇంటికి బయలుదేరేముందు మిత్రుడైన భాస్కర్, తానూ కలిసి తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది శ్రవణ్ కు. చదవబోయే పీజీ కోర్సుల నిమిత్తం హాస్టల్ వసతి ఇవ్వడం ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం అటువంటి విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించింది. భాస్కర్ కు కూడా హాస్టల్లో బాగా ఇబ్బంది అవుతోంది. శ్రవణ్ ఇంటి విషయాలు కూడా తనకు బాగా తెలుసు. అందుకని శ్రవణ్ వచ్చేలోపు రూమ్ చూసి పెడతానని, తన చెల్లిని తీసుకువచ్చి ఇక్కడే చదివిస్తానని, రేఖకు కూడా తోడుగా ఉంటుందని చెప్పాడు భాస్కర్.
ఈ విషయమే రాగానే రేఖకు చెప్పి ఆమె ఆనందాన్ని తనదిగా చేసుకోవాలనుకున్నాడు. ఇంతలోనే జరిగిన పరిణామాలు శ్రవణ్ ను అశాంతికి గురి చేసాయి. రోజులు గడచిన కొద్దీ రూము దొరకకపోతే రేఖను వీళ్ళ మధ్య ఎలా వదిలి వెళ్ళాలో శ్రవణ్ కు అర్థం కాలేదు. రేఖకు చెప్పి ఆమె ఉన్న స్థితిలో నిరాశకు గురి చేయడం నచ్చలేదు. మనసు పొరల్లో దిగులు కమ్ముకోసాగింది. హఠాత్తుగా దేవుడు వరం కురిపించినట్టు వారం రోజుల క్రితం భాస్కర్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రూమ్ దొరికిందని, రేఖను తీసుకొని రమ్మని. అప్పుడే రేఖకు చెప్పాడు. ఆ సమయంలో ఆమె అతనికి ఆనందరేఖ అయింది.
అదే రోజు తల్లితో ఆ విషయం చెప్పాడు. ఆమె అవునని, కాదని చెప్పలేదు. మౌనమే ఆమె అంగీకారంగా భావించాడు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు. జరిగిన సంఘటన వల్ల వాళ్లలో కలిగిన న్యూనతా భావమా? శ్రవణ్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తిరుగుండదనే నమ్మకమా? తెలియలేదు. ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు శ్రవణ్. లేకుంటే వారిని ఒప్పించడం చాలా కష్టమయ్యేది.
*****
గతంలోకి వెళ్ళిపోయి జరిగిన ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్న శ్రవణ్ చెప్పడం ఆపి కళ్ళు తెరిచి చూసేసరికి భావన కళ్ళనిండా నీళ్లు. రేఖకు కూడా బాధ తాలూకు గాయం మళ్లీ సలపరించినట్లు కళ్లనుండి నీళ్లు దుమికాయి.
“భావనా! ఆ కాలంలో మూఢవిశ్వాసాలు మనుషులను ఎంతగా బాధించేవో చూడు. ఈ కాలంలో అక్షరాస్యత పెరిగి అవన్నీ దూరమవడం వల్ల మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు. అది మీ అదృష్టం. ఆ సంఘటన తరువాత ఎన్నో కష్టాలను మీ అమ్మ సాహచర్యంలో అధిగమించాను. ఆరోజే నిర్ణయించుకున్నాను భర్తగా రేఖ జీవన రేఖను సంతోష తీరాలపై నిలబెడతానని. ఈరోజు మన ఇంటి సుఖాల వెనుక పట్టరాని దుఃఖపు అగాధాలున్నాయి. అది మర్చిపోకు. మీ తరానికి సహనం లేకపోవడం మనసుల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే కుటుంబ బంధాలు బలపడతాయి తల్లీ!
ఆ తర్వాత నీ ఇష్టం” అన్నాడు ఆవేదనగా.
భావన మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని
“సారీ నాన్నా! నా కళ్ళు తెరిపించారు. మా అత్తగారిని అమ్మలా చూసుకుంటాను. మీ కూతురుగా ఈ తరం వారికి ఆదర్శంగా నిలుస్తాను” అన్నది భావన దృఢంగా.
డా. కూరెళ్ళ విఠలాచార్య
పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ళ విఠలాచార్య గారితో మయూఖ ముఖాముఖి…
అభినవ పోతన, మధురకవి, ఎల్లంకి వేమన్న, నల్లగొండ కాళోజీ, అక్షర సామ్రాట్ బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, సామాజిక వేత్త , భారత ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి నోట “మన్ కీ బాత్” రేడియో ప్రోగ్రాంలో ప్రశంసించబడి, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రంథాలయ వ్యవస్థాపకులు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారి జీవిత విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. – అరుణ ధూళిపాళ
నమస్కారం సార్. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం మా భాగ్యం. మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయడం మహదవకాశంగా భావిస్తున్నాను.
1. మీ జననం, పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, బాల్యం గురించి చెప్పండి.
జ: అమ్మా! నమస్కారం. నేను జూలై 9, 1938 లో నీర్నేముల గ్రామంలో జన్మించాను. మా అమ్మగారి పేరు కూరెళ్ళ లక్ష్మమ్మ, నాన్నగారు కూరెళ్ళ వేంకటరాజయ్య. అప్పటి కాలంలో అన్నీ బాల్య వివాహాలు కావడం వల్ల మా అమ్మ గారికి 15 ఏళ్ళ వయస్సు వున్నప్పుడు నేను పుట్టాను. దురదృష్టవశాత్తు నేను అయిదు నెలల పసివానిగా ఉన్న సమయంలో మా నాన్నగారు మరణించారు. మా చిన్న పెద్దనాయన గారు నన్ను ఎత్తుకొని మా నాన్న చితిని ముట్టిస్తుంటే జనమంతా ఏడ్చారట. అప్పటినుండీ నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వెల్లంకిలో మా పెదనాన్నలెవ్వరూ మమ్మల్ని చేరదీయలేదు. మా మాతామహులు మమ్మల్ని నీర్నేములకు తీసుకుపోయినారు. మా అమ్మమ్మకు నేనంటే అమితమైన ప్రాణం. ఒక్క క్షణం నేను కనబడకపోతే ఆమె ప్రాణం విలవిలలాడేది. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. మా అమ్మగారితో పాటు నేను బంధువుల ఇంటికి ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తే నా పాదాలను జాజులో ముంచి, గోడకు ముద్రించి వాటిని చూస్తూ నేను తిరిగి వచ్చేవరకు గడిపేది. అంతటి ప్రేమమూర్తి ఆమె. ఆ సందర్భాన్ని తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి నాకు ( కన్నీటి పర్యంతమవుతూ). అందుకే వీళ్ళ ఋణం తీర్చుకోవడానికి మా అమ్మమ్మ పేర , తాతయ్య గారి పేర ఏటా బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ పురస్కారాన్ని ఇస్తున్నాను. 7వ తరగతిలో తెలుగు భాషలో ప్రథమశ్రేణి వచ్చినవారికి మాత్రం వాళ్ళు ఫెయిల్ అయినాసరే ఈ పురస్కారాన్ని ఇస్తున్నాను.

2. బాల్యమంతా ఇంత కష్టాన్ని ఎదుర్కొన్న మీ విద్యాభ్యాసం ఎలా గడిచింది?
జ: నేను పుట్టింది 1938లో అయినా విద్యాభ్యాసం మటుకు 1945 లో జరిగింది. ఆ కాలంలో ఊళ్ళల్లో ముస్లింలు చదువు చెప్పేవారు. మసూల్ దార్ సాహెబ్ నీర్నేములలో, వెల్లంకిలో షేక్ అహ్మద్, సిరిపురంలో గాలిబ్ సాబ్, రామన్నపేటలో గులాం రసూల్ అని టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్లకు భాష రాకపోయినా ఏదో నేర్చుకొని చెప్పేవారు. అప్పుడు పాఠశాలలు లేవు. విచిత్రం ఏమిటంటే మసూల్ దార్ సాహెబ్ నాకు పీర్ల కొట్టంలో అక్షరాభ్యాసం చేయించారు. మా అమ్మతో పాటు తిరగాల్సి రావడం వలన నాది వానాకాలం చదువయ్యింది. ఆ పరంపరలో నీర్నేముల, ముని పంపుల, వెలివర్తి, వెల్లంకి ఇలా రకరకాల ఊళ్ళల్లో నా చదువు సాగింది. ఆ తర్వాత 1950 నుండి రామన్నపేటలో నాల్గవ తరగతి నుండి ఒక క్రమపద్ధతిలో నా చదువు కొనసాగింది. అక్కడ ప్రాథమిక పాఠశాలలో కోటిచింతల పురుషోత్తమం గారని పాఠశాల హెడ్ మాస్టర్ వయసు ఎక్కువవుతుందని రికార్డులలో జననం 1940 గా రాయించారు. నీర్నేముల నుండి సద్దిగట్టుకొని రామన్నపేటకు పోయి చదువుకునేది. ఆ కాలంలో కుల వ్యవస్థ కూడా గట్టిగా ఉండేది. అంగీ తగిలినా, సద్దులున్న గోడ తగిలినా సద్దులు పారేసేవాళ్ళు. అట్లా ఏడవతరగతి వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత నాకు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండడంవల్ల భువనగిరిలో విశ్వకర్మ హాస్టల్ నిర్వాహకుల పిలుపు మేరకు మా మేనమామ నన్ను అక్కడ చేర్పించాడు. నిర్వాహకులు ఒక బజారు చూపించి అక్కడ విశ్వకర్మల ఇళ్లల్లో భిక్ష పైసలుగానీ, బియ్యం గానీ తెమ్మని ఆదేశించారు. అదే ప్రకారం వెళ్లి తెచ్చి రూములో వండుకొని తినేవాళ్ళం. చదువు కోసం వారేది చెబితే అది చేశాము. 1954 జూన్ నుండి 1957 వరకు 8,9,10 తరగతులు అక్కడే చదువుకున్నాను. ఆదిరాజు వీరభద్రరావు గారి అల్లుడు ఆంజనేయ శాస్త్రి గారు నాకు గురువు. ఆయన పాఠశాలకు రాని రోజు నన్ను పాఠం చెప్పుమనేవారు. అందువల్ల చిన్నతనం నుండే నాకు తెలుగు భాష పట్ల కొంత పట్టు ఏర్పడింది. ఆయన నేను బాగా చదువుతానని హైద్రాబాదుకు తీసుకువెళ్లి వారాల భోజనం పెట్టిస్తాను చదువుకోమన్నారు. కానీ ఇక ఇంటింటికి తిరిగి భోజనం సంపాదించడం నావల్ల కాదని పదవతరగతి పూర్తవగానే ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను.
3. మరి అప్పుడే ఉద్యోగం సంపాదించగలిగారా? మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?
జ. 1950 ఆ ప్రాంతంలో పదవతరగతి హాల్ టికెట్ చూపిస్తే ఉద్యోగం ఇచ్చేవారు. అలా రామన్నపేట తహశీల్ ఆఫీసులో తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి ఉండేవాడు. ఆయన “కాపీయిస్ట్ పోస్ట్ ఉంది.చేస్తావా?” అని అడిగారు. ఏదైనా చేస్తానన్నాను. ఇంగ్లీషు రాయొచ్చా అని అడిగారు. రాస్తానన్నాను. 20 రూపాయలకు రెవెన్యూలో కాపీయిస్ట్ ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో కో ఆపరేటివ్ బ్యాంకులో సూపర్ వైజర్ గా వచ్చింది. దాంట్లో చేరాను. భువనగిరి కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర రైటర్ గా చేశాను. అప్పుడే సేల్స్ టాక్స్ లో ఉద్యోగం దొరికింది. ఒక దాని తర్వాత ఒకటి ఒక్క నిముషం కూడా ఖాళీ లేకుండా చేశాను. డబ్బులు వచ్చాయి. కానీ లంచాలు తీసుకోవడం, తినడం, తాగడం ఇవన్నీ నాకు నచ్చలేదు. అందుకే ఉద్యోగం విడిచిపెట్టి టీచరు ట్రైనింగ్ చేసి, 1959లో టీచరునయ్యాను. ఉపాధ్యాయ శిక్షణా కాలం నాలో కవితా వ్యాసంగానికి బలమైన పునాది వేసింది. నేను, మా అమ్మ ఎన్నో బాధలు పడి రెండుగదుల పెంకుటిల్లు వెల్లంకిలో కట్టుకున్నాం. ఆ ఒత్తిడిలో జిల్లా విద్యాధికారి కార్యాలయానికి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటి నల్లగొండ జిల్లా విద్యాధికారి రామదాసుగారు దయార్ద్ర హృదయులు. “మహానుభావా! ఇప్పుడు వచ్చావా” అని ప్రేమతో మందలించి ఉద్యోగం ఇచ్చారు. ఆగస్టు 29 1959 నాడు రామన్నపేట తాలుకాలో మునిపంపుల గ్రామంలో సహాయోపాధ్యాయునిగా జాయినయ్యాను. అప్పటినుండి మొదలుకొని నాకు ‘గ్లకోమా’ వ్యాధి వల్ల కంటిచూపు చాలావరకు కోల్పోవడంతో నా ఉద్యోగ జీవితాన్ని 1993లో జూనియర్ లెక్చరర్ గా విరమించవలసి వచ్చింది. చేసినంతకాలం విద్యాలయాల, విద్యార్థుల అభివృద్ధికి శాయా శక్తులా కృషి చేశానన్న తృప్తి ఉంది.
4. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఫిల్ , పి హెచ్ డిలు ఎలా పూర్తి చేయగలిగారు?
జ: నేను పదవతరగతి వరకే క్లాస్ రూములో కూర్చొని చదవడం తప్ప ఎక్కడా తరగతులు వినలేదు. నాకు స్ఫూర్తి బి. ఎన్. శాస్త్రి గారు. ఆయన ఎమ్. ఏ చదువుతుంటే ఎన్ని కష్టాలు పడ్డాడో చూసినవాణ్ణి. నేనూ రవ్వా శ్రీహరి బాల్య స్నేహితులం. నాకంటే చిన్నవాడు. ఆయనకు చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఇద్దరమూ ‘మునిపంపు’ లో పెరిగిన వాళ్ళం. ఇద్దరమూ కలిసి ఆడుకున్నాం. ఉద్యోగం చేస్తూనే నేను ఎమ్ ఏ దాకా ప్రయివేటుగా చదువుకున్నాను. పి హెచ్ డి చేయాలనుకుంటున్నట్లు రవ్వా శ్రీహరితో అన్నాను. ఎమ్ ఏ లో కూడా సెకండ్ క్లాస్ లో పాసయ్యాను. పాటిబండ మాధవశర్మ గారు నన్ను బాగా అభిమానించేవారు. సీటు గురించి రామరాజు గారిని అడగాలంటే అందరికీ భయం. ఆయన చాలా సహృదయులు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లాలంటే భయం. రవ్వా శ్రీహరి గారిని అడిగితే “అమ్మో! నేను వెళ్ళను” అన్నారు (నవ్వుతూ). నేనే అడుగుదామని వెళ్ళాను. అప్పటికి ఒక హైస్కూలు హెడ్ మాష్టరును నేను. పదిన్నరకు ఇంటర్వ్యూ ఉంటే ఎనిమిది గంటలకే వెళ్ళి నమస్కరించి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. “ఎందుకొచ్చావ్? నీ నమస్కారాల సంగతి నాకు తెలుసు. ఇవాళ ఎంఫిల్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా! అప్లై చేసి ఉంటావు. ఆ సీటు కొరకే వచ్చావు . అట్లా రావచ్చునా? పోనీ ఓ పని చెయ్యి. మొత్తం 12 సీట్లు ఉన్నాయి. నీకిస్తాను పంచిపెట్టుకో ” అని కోప్పడ్డారు. ఏమీ మాట్లాడకుండా తిరిగి వస్తుంటే “మాస్టారూ ఇలా రండి” అన్నారు. నా సంస్కారం ఆయన మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. “నువ్వు హైస్కూలు హెడ్ మాస్టర్ వి. వయసులో పెద్ద. రీసెర్చ్ చేసి ఏం సాధిస్తావు?” అన్నారు. చేద్దామనే కోరిక ఉంది సార్! మీరు అనుగ్రహిస్తే చేస్తాను అన్నాను. ‘ఏమైనా రాశావా?’ అప్పటికే దాదాపు రకరకాల ప్రక్రియల మీద నేను వ్యాసాలు రాశాను. సూట్ కేస్ నిండా తీసుకువెళ్ళాను కూడా. “వంద దాకా రాశాను సార్! చూస్తారా?” అన్నాను. వద్దన్నారు. ముందు ఎంత కోప్పడ్డారో అంత అనుగ్రహం చూపారు. ఆయన నాకు చాలా ఇష్టమైన గురువు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1977లో మొట్టమొదటగా ఏర్పడ్డ ఎంఫిల్ పరిశోధకుల్లో నేను ఒకడిని కావడం గర్వకారణం. రవ్వా శ్రీహరి ప్రోత్సాహం, పూజ్య గురువర్యులు బిరుదురాజు రామరాజు గారి బలమైన ఆశీస్సులు నన్ను పరిశోధనారంగంలో ప్రవేశించేటట్టు చేశాయి.
5. ఎంఫిల్ అంశంగా తీసుకున్న “తెలుగులో గొలుసు కట్టు నవలలు” నవలా ప్రక్రియను, మీ అనుభవాలను తెలపండి.
జ : అప్పటి తెలుగు శాఖా అధ్యక్షులు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అప్పటివరకు విమర్శకులు ఎవరూ స్పృశించని వినూత్నమైన, విచిత్రమైన నా పరిశోధనాంశం “తెలుగులో గొలుసుకట్టు నవలలు” అనే దాన్ని పరిశీలించి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో రామరాజుగారు, నారాయణరెడ్డి గారు, నాయని కృష్ణకుమారి గారు, కులశేఖర్ రావు గారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. “అందులో సాహిత్యమే లేదు. అదెలా చేస్తావన్నారు?” అన్నారు. అందుకే చేస్తానన్నాను ( నవ్వుతూ). వారి ప్రశ్నలకు తగినరీతిలో సమాధానాలు చెప్పి వారిని సంతృప్తి పరిచాను. మామూలుగా అయితే ఒక పుస్తకాన్ని ఒకరు రాస్తారు. గొలుసు కట్టు నవల అంటే ఇందులో అనేకమంది రాస్తారు. ఒక రచయిత కథ ప్రారంభం చేస్తాడు. మరొకరు దాన్ని కొనసాగిస్తారు. కథలోని కథా నాయకుడిని ఒకరు సృష్టిస్తే, మరొకరు మిగిలిన కథను రాస్తారు. కథను అనుకూలంగా మార్చడం, ప్రతికూలంగా మార్చడం ఎవరి వారి ఇష్టం. సృష్టించిన కథానాయకుని గొప్పగా చూపించొచ్చు. లేదా చంపవచ్చు. అట్లా ఆనాడు 24 మంది రచయితలు, రచయిత్రులు రాసిన “ముద్దు దిద్దిన కాపురం” నవలను వారికి విడమరిచి చెప్పాను. ‘హాస్యప్రభ’ పత్రికలో సీరియల్ గా వస్తుండేది. రాంబాబు అనే ఆయన వేసేవాడు. మొత్తానికి ఆ టాపిక్ లో చేయడానికి నాకు అనుమతి లభించింది. కానీ దాంట్లో ఏమీ లేదని గైడుగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. మహానుభావుడు ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఒప్పుకున్నారు. ” నేను గురువును కాదు నీవు శిష్యుడవు కావు ఇద్దరం మిత్రులం” అనేవారు. ఇద్దరం చేతులు పట్టుకొని ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పాతపుస్తకాల్లో ఏమైనా దొరుకుతుందేమోనని వెతికేవాళ్ళం. మద్రాసు, తిరుపతి, విజయవాడ, భీమవరం ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. “గొలుసుకట్టు నవల” రచయితలలో పాలగుమ్మి పద్మరాజు, శ్రీ శ్రీ , ఆనందారామం, తురగా జానకీరాణి, నాయని కృష్ణకుమారి, రావూరి భరద్వాజ, కొడవటిగంటి, ఆరుద్ర , పురాణం సుబ్రహ్మణ్య శర్మ , మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ , మాదిరెడ్డి సులోచన లాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేశాను. రంగనాయకమ్మ గారు, ఆరుద్ర గారు లేఖాముఖంగా పంపించారు. వీళ్ళందరి సమాధానాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాలతో విలక్షణమైన నా పరిశోధనలో నవలా వ్యాసంగాన్ని పూర్తిచేశాను. 250 పేజీల సాహిత్యాన్ని సృష్టించాను. ఇప్పుడు 40 మంది, 60 మంది రాసినవి కూడా వస్తున్నాయి. 1980 లో నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాకు ఎంఫిల్ పట్టా లభించింది. తెలుగు పరిశోధనారంగంలో నా సిద్ధాంతగ్రంథం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే రవీంద్ర భారతిలో జరిగిన ‘గొలుసు కట్టు నవల’ ఆవిష్కారానికి నన్ను పిలిచి సన్మానం చేశారు.
6. పి హెచ్ డి అంశంగా “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” మీద తీసుకున్న నవలలేవి?
జ: ఎంఫిల్ పూర్తయిన వెంటనే పిహెచ్ డి సీటు సులభంగానే దొరికింది. రామరాజు గారికి, నారాయణ రెడ్డి గారికి చేస్తాడన్న నమ్మకమూ కుదిరింది. నాకు ఎంఫిల్ పర్యవేక్షకులైన ఇరివెంటి కృష్ణమూర్తి గారు వెంటనే పి హెచ్ డి చేయమని సలహా ఇస్తూ “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” అనే పరిశోధనాంశాన్ని సూచించారు. దాన్ని రామరాజు గారు 1947 వరకు అని సవరించారు. చారిత్రక నవలా చక్రవర్తి డా. ముదిగొండ శివప్రసాద్ పర్యవేక్షణలో నా పరిశోధన సాగింది. దీనికోసం క్షేత్ర పర్యటన చాలానే చేశాను. 1947కు పూర్వం వచ్చిన నవలలు, నవలలు కావు కావ్యాలు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” వేలూరి శివరామశాస్త్రి గారి ‘ఓబయ్య’, విశ్వనాథ వారి ‘వేయి పడగలు’, అడవి బాపిరాజుగారి ‘నారాయణరావు’, ‘కోనంగి’, వాశిష్ఠ గణపతి ముని గారి ‘పూర్ణ’, తల్లాప్రగడ సూర్యనారాయణ గారి ‘హేలావతి’, కేతవరపు వేంకటశాస్త్రి గారి ‘లక్ష్మీ ప్రసాదం’, వేంకట పార్వతీశ్వర కవుల ‘మాతృ మందిరం’, బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’.. ఈ పది నవలలు తీసుకున్నాను. 1947 వరకు ఈ నవలలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఈ సాహిత్యం ఉద్యమానికి, ఉద్యమం సాహిత్యానికి ఎట్లా ఉపయోగపడింది ఇందులో వివరించాను. ఈ పరిశోధన కారణంగా జాతీయోద్యమంలో పాల్గొన్న మహనీయులను ఎంతోమందిని దర్శించుకునే భాగ్యం కలిగింది. దీనికి “Best Informative Thesis” అని పేరు వచ్చింది. చాలా కష్టపడి వడబోసి తయారుచేసిన సిద్ధాంతగ్రంథం. సరి చేయడానికి ఏమీ లేకుండె. శివప్రసాద్ నాకంటే చిన్నవాడు. అందుకే “మొత్తం పూర్తయ్యాక సంతకం కోసమే నా దగ్గరకు రండి” అన్నాడు. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి గారిని, రావి నారాయణరెడ్డి గారిని, ఎన్. జి రంగాగారిని, గడియారం రామకృష్ణ శర్మ లాంటి ఎందరినో ఇంటర్వ్యూ చేసి సమాచారం సేకరించాను. నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో వచ్చిన నవలలు చాలా తక్కువే కానీ నవలా సాహిత్యానికి అది స్వర్ణయుగం. నవలాకారులందరూ మహనీయులు. స్వాతంత్ర్యోద్యమ నుండి ప్రభావితులైనవారు. వారి హృదయం నుండి జాలువారిన ఈ రచనలు జాతిని ఉత్తేజపరిచాయి. ముందుకు నడిపించాయి.
7. సంస్కృత భాష పట్ల మీకు ఆసక్తిని కలిగించినదెవరు?
జ: మొదటి నుండీ నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఉండేది. అయినా సరియైన పరిస్థితులు, వాతావరణం లేక సంస్కృతంలో అనుకున్నంత ప్రావీణ్యం సంపాదించుకోలేకపోయాను. అప్పుడు ఎనిమిదవ తరగతిలో సంస్కృతం ఆప్షనల్ గా ఉండేది. భువనగిరి హైస్కూలులో, సూర్యాపేటలో మొట్టమొదటగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. దానికోసమే నేను భువనగిరి హైస్కూలులో చేరాను. కోవెల సంపత్కుమారాచార్య గారు ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ. మొదటి స్టూడెంటును నేనే. అప్పలాచార్యులు గారు, సంపత్కుమారాచార్య గారు సంస్కృత గురువులు నాకు. నా విషయంలో సంస్కృతం వచ్చు అని చెప్పడం ఎంత అబద్ధమో, రాదని చెప్పడం కూడా అంతే అబద్ధం ( నవ్వుతూ ). ఆ గురువులిద్దరి మూలంగా సంస్కృతం మీద పట్టు ఏర్పడింది.
8. మీ పద్య పఠన పద్ధతికి ఉత్పల సత్యనారాయణాచారి గారి ప్రభావం ఉందంటారు. అది ఎలాగో వివరిస్తారా?
జ : 1958లో నేను మేడ్చల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఉత్పల సత్యనారాయణాచార్యగారు అతిథిగా వచ్చారు. బహుభాషా కవిసమ్మేళనం జరిగింది. తెలుగు భాషకు సంబంధించి ఆయన వచ్చారు. నేను ఆ సభలో ఆయన మీద ఆశువుగా పద్యం ఆయానలాగే చదివాను. ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటినుండీ “మరో ఉత్పల” అనే పేరు వచ్చింది. ఉత్పలగారు చనిపోయే చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు నేనొక పద్యం కార్డు మీద రాసి పంపించాను. ” కమ్మని తేట తెల్గు నుడికారము కల్గిన పద్యమొక్కటిన్, ఇమ్ముగ కోరుకున్న మనకిమ్మహనీయుడొసంగు గొప్ప భాగ్యమ్మున గల్గె ఉత్పల మహాకవి తెల్గునాడులో తమ్ములు రండి రండి కవితామూర్తిని కొలువగా వలెన్” అని పంపాను. ఆయన సంతోషపడి నా మీద మూడు పద్యాలు రాసి పంపించారు.

9. కూరెళ్ళ గ్రంథాలయ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులేవి?
జ: గ్రంథాలయం పెట్టాలనుకోవడంలో నా కష్టాలే నాకు స్ఫూర్తి. నేను చదువుకునేటప్పుడు పుస్తకాలు కొని చదువుకునేంత స్తోమత నాకు లేదు. పుస్తకాలు ఉన్నవాళ్ళ దగ్గర వారు రాత్రి చదువుకోవడం పూర్తయిన తర్వాత పుస్తకాలు అడిగి తీసుకొని రాత్రంతా చదువుకొని ఉదయం నాలుగు గంటలకే వాళ్లకు అప్పగించే ఒప్పందంతో తెచ్చుకునేవాడిని. ఇలాంటి నా కష్టాలు తరువాతి యువతరానికి రావొద్దని లైబ్రరీ పెట్టాను. అది చాలలేదు. 1954 లో వెల్లంకిలో శంభు లింగేశ్వర గ్రంథాలయం అని చిన్న లైబ్రరీ పెట్టాను. నాకు పెద్దలు ఎవరూ సహకరించలేదు. 1962 లో నేను మాఊరికి ప్రధానోపాధ్యాయునిగా వచ్చాను. మా తల్లిదండ్రుల పేరుతో లక్ష్మీ వెంకట రాజయ్య గ్రంథాలయం పెట్టాను. ప్రముఖ నాటక రచయిత ఆకెళ్ల నర్సింహమూర్తి గారు ప్రారంభించారు. 1993లో తెలుగు ఉపన్యాసకునిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. గ్రంథాలయ స్థాపన నా మనసులోంచి పోలేదు. ఎలాగైనా ఈ మారు మూలలో మహా గ్రంథాలయం పెట్టాలని గట్టి నిర్ణయం చేసుకున్నాను. అందుకే నా ఇంటినే దీనికోసం ఇచ్చాను. పెద్దలు దీనికి “కూరెళ్ళ గ్రంథాలయం” అని నామకరణం చేశారు. నా సొంత ఐదువేల పుస్తకాలతో ఫిబ్రవరి 13, 2014 లో ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు రెండు లక్షల గ్రంథాలతో పెద్ద లైబ్రరీ అయింది. మా పిల్లలు, లైబ్రేరియన్ సహకరిస్తున్నారు. శిష్యులు, స్నేహితులు చాలామంది ఉండడం వల్ల సాహితీప్రియులు ఎంతోమంది పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ద్వానా శాస్త్రి గారు తన లైబ్రరీలోని మొత్తం పుస్తకాలను ఇచ్చారు. కోడూరు పుల్లారెడ్డి గారు కూడా వేల పుస్తకాలు ఇచ్చారు. భగవంతుని అనుగ్రహం వల్ల ఎంతోమంది ముందుకు వచ్చారు. తెలియని వాళ్ళు కూడా ఈ అడ్రెస్ తెలుసుకొని మరీ వచ్చి వందలాది పుస్తకాలు ఇవ్వడం నా అదృష్టం. వారందరి సహకారం వల్లనే ఎంతో గొప్ప సాహిత్యాన్ని ఇందులో సమకూర్చగలిగాను. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, వేదాలు, పరిశోధన, చరిత్ర, పద్య గద్య ఇలా అన్ని విభాగాల్లో ప్రక్రియల్లో పుస్తకాలున్నాయి. ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. తలచుకుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని చేయగలిగానా అని.
10. మీ గ్రంథాలయం గురించి 2021 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” లో ప్రశంసింపబడడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ : అది నా జీవితానికి గొప్ప వరం. పల్లెటూళ్ళని వదిలి చాలామంది నగరానికి వెళ్లి పోతున్నారు. అందరూ మళ్లీ పల్లెబాట పట్టాలని గ్రంథాలయం నెలకొల్పాను. నా కోరిక తీరి ఎంతోమంది సద్దులు కట్టుకొని మరీ వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు నా విషయం ప్రధానమంత్రి వరకు ఎలా వెళ్లిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన “మన్ కీ బాత్” లో నన్ను , నా లైబ్రరీని ప్రశంసించారు.

ఈ ప్రభావం వల్ల అస్సామ్ విశ్వవిద్యాలయం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి సందర్శకులు వచ్చారు. అమెరికా లోని ‘తానా’ వారు స్వరమీడియా వారు నాతో ఇంటర్వ్యూలు జరిపారు. అస్సాం యూనివర్శిటీ ప్రొఫెసర్ నారాయణ మూర్తి గారు ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు పంపించారు. నిన్న కూడా హయత్ నగర్ నుండి సర్వేపల్లి సుందరం అని ఒక వ్యక్తి వచ్చి ఆయన రాసిన పుస్తకాలు ఇచ్చి వెళ్లారు. అలా ఎంతోమంది సహకరిస్తున్నారు. నా శ్రమకు ప్రధానిగారు ఊపిరి పోశారు. మోదీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆయన వల్ల నాకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రాష్ట్రపతి నుండి పోయిన ఏప్రిల్ 2023లో ఆహ్వానం వచ్చింది. నాలుగు రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ కర్ గారి చేత సన్మానం అందుకున్నాను. మాకు మూడు రోజులు వసతి కల్పించి అక్కడి విశేషమైన ప్రాంతాలను చూపించారు. పెద్ద సభ కూడా జరిగింది. ఈ నెలలో కూడా గణతంత్ర దినోత్సవాలకు రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోవడం, అధికమైన చలి కారణంగా రాలేనని చెప్పాను.






11. దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన జనగామ రైలు ప్రమాదం గురించి మీరు రాసిన “అధికవృష్టి” పద్యాలను గూర్చి తెలపండి
జ : ఇది 1954లో జరిగింది. అప్పుడు కురిసిన అధికమైన వర్షాలకు “వసంతవాగు” పొంగుతుండడం వల్ల రైలు పట్టాలు తప్పింది. అప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నాను. ఆ దుర్ఘటనకు కదిలిపోయి నేను రాసుకున్న పద్యాలే మొట్టమొదటగా అచ్చులో చూసుకున్న పద్యాలు.
ఉరుములు మెరుపులు నొకసారె ఉద్భవించె
గాలి సుడిగాలి మేఘముల్ గప్పుకొనియె
సరవి ధారగ వర్షంబు కురియుచుండె
అల్ల తెలగాణ రఘునాథ పల్లియందు!
అధిక వర్షంబుచే నంత నయ్యె గాదె
మృత్యుదేవత ఆనాడు నృత్యమాడె
ఇట్టివెప్పుడు రాకుండ నెల్ల వేళ
మనల వేలుపు గాపాడి మనుచు గాత!
ఇలా రాశాను. ఆ పద్యాలు చూసి మా మాస్టార్లు ఆశ్చర్యపోయారు. కోవెల సంపత్కుమారాచార్య గారు “నీకు పద్యం మీద మంచి పట్టు ఉంది” అని ప్రశంసించారు. స్కూల్ వార్షిక సంచిక ‘ఉదయ’ లో కూడా వేశారు. ఆనాటి నుండి నా మిత్రులు తమాషాగా ‘పోతన’ అని పిలిచేవారు.
12. “వెల్లంకి వెలుగు” పేర రాసిన ఎల్లంకి గ్రామ వైభవం ఎటువంటిది?
జ: “వెల్లంకి వెలుగు” నా పల్లెతో నాకున్న అనుబంధాన్ని, గురించి రాసుకున్నది. చాలా చిన్న పుస్తకం. ఆ ఊరుకు ఆ పేరు ఎట్లా వచ్చింది మొదలుకొని నాకు తెలిసినంతవరకు ఆ గ్రామాన్ని గురించి ఆనోటా ఈ నోటా విన్న విషయాలు రాసుకున్నాను. నేను పుట్టింది పెరిగింది పల్లెటూరే. ఇప్పటికీ పల్లెటూళ్ళోనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నిటికీ ప్రధాన భూమిక పల్లెటూరు. అందుకే “విఠ్ఠలేశ్వర శతకం” లో పల్లెను దేవతగా భావిస్తూ..
పల్లియలోనె పుట్టితిని పల్లియయే నను పెంచె
ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టె
పల్లియె ‘అమ్మ’ ఆవనుచు’పల్కులు పల్కగ నేరిపించె నా
పల్లియె నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా!
13. వేమన శతకంతో సమానమని పలువురి ప్రశంసలు అందుకున్న మీ “విఠ్ఠలేశ్వర శతకము” గూర్చి చెప్పండి.
జ : 1991 ఆగస్టు 1న మా ఇంటి గేదెకు వైద్యం చేస్తుండగా అది ఎగిరి నా మీద పడడం వల్ల జరిగిన ప్రమాదంలో నా ఎడమ కాలు విరిగింది. అంతకుముందే నాకు నాలుగు ఆపరేషన్లు జరిగాయి. నేత్ర వ్యాధి ‘గ్లకోమా’ వల్ల కంటి చూపు చాలావరకు తగ్గిపోయింది. ఈ దుర్భర పరిస్థితుల్లో బాధతో అలవోకగా నా గుండె లోంచి ఒక పద్యం వచ్చింది.
“పుట్టుకతోనె కొందరికి పుట్టెడు దుఃఖము వెంటవచ్చు, ఎ
ప్పట్టున నైన కొందరికి పట్టినదెల్ల పసిండియే యగున్
తిట్టు వరంబు కొందరికి దీవెన కొందరి పట్ల తిట్టగున్
ఎట్టెట్టు స్వామి నీ నటన ఎంత విచిత్రము విఠ్ఠలేశ్వరా!”
అలా వరుసగా పద్యాలు రాసుకుంటూ పోయాను. నన్ను పలకరించడానికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, రసజ్ఞులకు వినిపించేవాణ్ణి. అందరూ అభినందించారు. మకుటం బాగుందన్నారు. మా అమ్మగారు నాకు మా నాన్నగారు విఠలేశ్వరుని భక్తులని అందుకే ఆ స్వామి పేరు మీదనే నాకు పేరు పెట్టారని చెప్పారు. అందుకే మా నాన్నగారి ఆకాంక్ష వల్లే ఇది ఉద్భవించిందేమో. నా ఆత్మ వేదనే అయినా ఆ విఠలేశ్వరుని అనుగ్రహంతోనే మంచం మీద ఉన్న మూడు నెలల్లో శతకం పూర్తి చేయగలిగాను. వివిధ సేవా కార్యక్రమాల కారణంగా పుస్తకరూపం చేయాలన్న ఆలోచన రాలేదు. ప్రింట్ కాకపోయినా జనుల నోళ్ళల్లో నానుతుండేవి. నాకు అరవై ఏళ్లు నిండిన తర్వాత 2000 సంవత్సరంలో ఇది రామరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. శతక సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సాధించుకుంది. తెలంగాణ సాహిత్య అకాడెమీ వారు దీనిలోని కొన్ని పద్యాలను హిందీ, ఇంగ్లీషు లోనికి అనువాదం చేయించారు. ఇందులో సమాజంలోని రకరకాల విషయాల పట్ల కలిగిన వేదనతో రాసిన పద్యాలున్నాయి. దీని రెండవ ముద్రణ గవర్నర్ గారిచే ఆవిష్కృతం కానుంది.
14. “శిల్పాచార్యులు” కావ్యం రాయడానికి ప్రేరణ ఎవరు?
జ : నా ఎనిమిదవ ఏట నుండి భువనగిరిలో నా చదువు కొనసాగింది. అక్కడే నా కవిత్వం మొగ్గ తొడిగింది. ఎంతోమంది సహృదయులు మిత్రులయ్యారు. ఇక్కడ నేనొక ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ కవిగా ప్రధానాచార్యుల, ఆచార్యుల పండితుల మన్ననలు పొందాను. అందుకే భువనగిరి కోటను నా హృదయంలో ముద్రించుకున్నాను. ఆ ఋణం కొంతైనా తీర్చుకుందామన్న ఆశయంతో ఈ పట్టణానికి, పట్టణ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రఖ్యాత త్యాగమూర్తులను కొందరిని, ప్రసిద్ధ స్థలాలను కొన్నింటిని తలచుకుంటూ ఆ స్మృతులతో ఈ కావ్యం ద్వారా వారిని మనసారా స్మరించుకుంటున్నాను.
ఆరుట్ల దంపతులను ఉద్దేశించి…
“నాడు నేడైన ఏనాడు నైన/ కొలనుపాకనంగ మదిలొ గుర్తుకొచ్చె….” బి. ఎన్.శాస్త్రి గారిని ఉద్దేశించి..
“ఊళ్ళన్ని వడబోసి రాళ్ళ రాత చదివి/ వేల యేండ్ల చరిత వెలికి తీసె….”
ఇలా స్మరించుకుంటూ పద్యాలు రాశాను. ఈ ప్రాంతం శిల్ప కళకు ప్రసిద్ధి.
“శిలలపై గీత గీసె ఈ శిల్పి వాడు/ తెల్పినాడు నాటి చరిత్ర నిల్పి నేడు..” ఎక్కడో గాని చక్కని చెక్కడాల/ పనిని నేర్పితివి కద! ఓ పరమ శిల్పి!/ బుక్కెడన్నము దొరికెడి దిక్కు లేదు/ నాయనా తమ చక్కదనాల పనికి”
అంటూ శిల్పకారుల కళా నైపుణ్యాన్ని, వారి దీనావస్థను గురించి రాశాను.
“భువనగిరి తెలంగాణ సంపుటములోన / పసిడి వర్ణాలలో చెక్కబడును లెస్స” అని ఆ పట్టణాన్ని గురించి రాసి నమస్కృతులు తెలుపుకున్నాను.

15. మీరు రాసిన ఇతర రచనలేవి?
జ : 1953 లో నేను ఏడవతరగతిలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించే మా మాతామహుడు బేతోజు లక్ష్మీ నారాయణ చనిపోయినప్పుడు ఛందస్సు ఏమీ తెలియకున్నా ఆ దుఃఖాన్ని స్మృతి కావ్యంగా రాశాను. అలా ఎంతోమంది స్మృతులతో “స్మృత్యంజలి” పద్యాలు రాశాను. అవి ముద్రణలోనికి రాలేదు. అదీకాక “చద్దిమూటలు” అనే పేరుతో 5516 కొటేషన్లు ఒక్కచోట చేర్చాను. ఒక్కసారి ఆ పుస్తకం తిరగేస్తే చాలు ఆ ప్రభావం మన మీద పడుతుంది. అది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. పుష్ప విలాపం ఖండికతో ప్రేరణ పొంది “గోవిలాపం” రాశాను. కుడ్య మాసపత్రికలో ప్రచురించబడింది.
” చిక్కగున్నంత కాలం చితుక గొట్టి
చేత చేయించుకొందురు, చేరదీసి
బక్క పడగానె మమ్ముల బాహ్యపరచి
కోత కమ్ముదురయ్య మీ కులము వారు”
ఇట్లా ఉంటాయి ఆ పద్యాలు.
ఛందో నియమాలు ఉన్న పద్య కవిత్వం రాయడానికి యువత ముందుకు రావడం లేదు. అందుకే వారికి సులువుగా ఉండడానికి “దొందూ దొందే” అనే త్రిపదుల కృతిని రాశాను. “దేవుడు లేని గుడి/ దేశికుడు లేని బడి/ దొందూ దొందే”…ఇలా అయితే ఎన్నో పద్యాలు రాశాను కానీ ఎప్పుడూ ఉద్యమాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో తిరగడం వలన అచ్చు వేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు.
16. తెలంగాణా ఉద్యమం వైపు మిమ్మల్ని ఉత్తేజితులను చేసిందెవరు? ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఏమిటి?
జ: నేనెప్పుడూ విశ్రాంతి కోరుకోనమ్మా! ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. చదువుకున్న రోజుల్లో చదువుకున్నాను. తర్వాత సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పాల్గొన్నాను. వాస్తవానికి ఆంధ్ర వ్యతిరేకోద్యమం కె సి ఆర్ పుట్టక.మునుపే 1952 లో ప్రారంభమైంది. “నాన్ ముల్కీ గో బ్యాక్” అనే నినాదంతో ముల్కీ ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను ఆరవ తరగతిలో ఉన్నాను. నాకేమీ తెలియదు. అయినా ఫ్లెక్సీ పట్టుకొని తిరిగిన వాణ్ణి. “ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్”, “గోంగూర పచ్చడి గో బ్యాక్” అనే నినాదాలు అప్పుడు పుట్టినవే. తెలంగాణ తొలి ఉద్యమం, మలి ఉద్యమం రెండింటిలోనూ కవిగా, రచయితగా నా వంతు పాత్ర నిర్వహించాను. తెలంగాణా ఉద్యమంలో ‘ధూంధాం’ కార్యక్రమంలో పాటలతో ఎట్లా ఉర్రూతలూగించారో సభల్లో నేను పద్యాలతో ఉర్రూతలూగించిన వాడిని.
” ఆత్మార్పణము జేసి అమరులైనట్టి మా త్యాగమూర్తుల ప్రసాదంబు గాదె,
పుట్టుకంత తెలంగాణ పోరు కంకితమయ్యె జయశంకరులవారి జయము గాదె
మాట నిలుపుకున్న మహనీయురాలు మా సోనియా ఇచ్చిన వరము గాదె” ఇలా ఎన్నో పద్యాలు..
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని దాశరథి అంటే నా తెలంగాణ కోట్ల రతనాల వీణ” అని పద్యం చెప్పాను. “తెలంగాణలో చదువుకున్న పెద్దవాళ్ళు లేర”ని అంటే “ఎవడ్రా అన్నది?” “మందార మకరంద మాధుర్య మూర్తి మా పోతన్న పుట్టిన పుణ్యభూమి” అంటూ వంద పాదాలతో “తెలుగు కాగడాలు” రాశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజమండ్రిలో విశ్వవిద్యాలయానికి నన్నయ్య పేరు పెట్టినట్లు, కడపలో విశ్వవిద్యాలయానికి యోగి వేమన పేరు పెట్టినట్లు 2007లో నల్లగొండలో మంజూరైన విశ్వవిద్యాలయానికి పోతన పేరు పెట్టాలని ఉద్యమం మొదలుపెట్టాను. చాలామంది పెద్దలు సహకరించారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మా విన్నపాన్ని పట్టించుకోకపోగా మా నోళ్లు మూయించాలని మహాత్మాగాంధీ పేరు పెట్టారు. ఏమీ అనలేక పోయాం. తెలంగాణా మహాకవి పోతన అంటే నేను ఊరుకోను. తెలంగాణాలో పుట్టిన మహాకవి ఆయన. రాజశేఖరరెడ్డిగారు పోతన మీ వాడు కాదు అన్నాడు. అప్పుడు వరంగల్ లో సెమినార్లు జరిగాయి. “పోతన మా వాడు కాదంటే డొక్క చీలుస్తాం” అని వార్నింగ్ ఇచ్చాము. అప్పటినుండీ ఆంధ్రా ప్రాంతం వాళ్ళు రాసిన వ్యాసాలు రావడం ఆగిపోయాయి.
ఇట్లా తెలంగాణోద్యమం, మహాత్మాగాంధీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమం, పోతన నామ సాధక కమిటీ అధ్యక్షునిగా పోతన ఉద్యమం ఇలాంటివి చేశాను. అక్షరాస్యతా ఉద్యమం ప్రభుత్వం ప్రారంభించకముందే నేను ప్రారంభించాను. ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేవాణ్ణి. ఉడాయి గూడెం అనే చిన్న ఊళ్ళో పిల్లలు బడికి వచ్చేవారు కాదు. నేనే పలక, బలపం పట్టుకొని వెళ్లి నేర్పించేది. చచ్చేముందు సంతకం అయినా నేర్చుకోవాలని 80 ఏళ్ల పెద్దమనుషులకు కూడా సంతకం నేర్పాను.
17. మీ సంపాదకత్వంలో వెలువడిన పత్రికలేవి?
జ : పత్రికలు రచనా శక్తిని పెంపొందిస్తాయి. జ్ఞానాన్ని కలిగిస్తాయి. చైతన్య ప్రేరకాలు అవుతాయి. అందుకే నేను ఎక్కడ పని చేసినా స్కూల్లో కానీ, కాలేజీల్లో గానీ అక్కడ పత్రిక పెట్టేవాడిని. స్టాఫ్ ప్రోత్సహించేవారు కాదు. “ఈ పిల్లలకు ఏమొస్తది సార్? ఎందుకు ఈ పేపర్ ఇదంతా?” అని ఉత్సాహాన్ని నీరు కార్చేవారు. అయినా నేను వినేవాణ్ణి కాదు. మనం చేసే పని మనం చేయాలి. ఎవరో వద్దంటే ఊరుకుంటే పనులు ఎలా జరుగుతాయి?
నేను పని చేసిన విశ్వ విద్యాలయాల్లో కూడా కుడ్య పత్రికల ద్వారా విద్యార్థుల్లో రచనాసక్తి, సృజనశక్తి కలిగించడానికి ప్రయత్నం చేశాను. ఇక నడిపిన పత్రికలు…. బాపు భారతి, మన తెలుగుతల్లి, వలి వెలుగు, చిరంజీవి, ప్రియంవద, ముచుకుంద. నాకు చేతనయినంత వరకు చదువుపట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చేశాను.
18. సాహితీ సేవకై మీరు స్థాపించిన వివిధ సంస్థలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా?
జ : పల్లెటూళ్లను చైతన్య పరచడానికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాను. దానికోసం కొన్ని సంస్థలు స్థాపించాను. అక్షర భారతి, మిత్ర భారతి, సాహితీ స్నేహితులు, భువనభారతి, ప్రజా భారతి, మల్లెల భారతి ఇలాంటి సంస్థలే కాక సాంసృతిక సంస్థలను కూడా స్థాపించాను. అందులో ఇంకా ఇప్పటికీ కొన్ని నడుస్తున్నాయి. వీటన్నిటికీ మంచి స్పందన లభించింది. మా సేవలు గుర్తించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు మా సేవలను గుర్తించి, బిరుదులతో, పురస్కారాలతో గౌరవించారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన నా జీవితం ప్రస్తుతం సాహిత్య సేవలో గడిచిపోతోంది. ఆ తృప్తి చాలు. ” జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి” అన్న ఆర్యోక్తి నాకు ఆదర్శం.
19. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం మీకు ‘పద్మశ్రీ’ బిరుదును ఇవ్వడం పట్ల ఎటువంటి అనుభూతి చెందుతున్నారు?
జ: అవార్డు ఇవ్వడం ఆనందమే. కానీ గర్వంగా భావించడం లేదు. ఎందుకంటే నాకు తోచినంతవరకు నలుగురికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం. నేను కీర్తి కాంక్షల కోసం ఈ పనులు చేయడం లేదు. నావల్ల ఒక్కరు బాగుపడ్డా దాన్ని నాకొచ్చిన అవార్డుగా భావిస్తాను. అవార్డు వచ్చిందని తెలిసి ఎంతోమంది స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ఎంతోమంది తమ అభినందనలు తెలిపారు. నా కృషిని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రమ్మని ఆహ్వానం వచ్చినా ఆరోగ్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోయాను.
20. ఇంతటి ఖ్యాతిని ఆర్జించిన మీరు గ్రంథాలయ విషయంలో ఇంకా చేయాలనుకుంటున్న పనులు ఏమైనా ఉన్నాయా?
జ : ఇప్పుడున్న గ్రంథాలయానికి స్థలం సరిపోవడం లేదు. ఇంతకు ముందు చెప్పాను కదా రెండు లక్షల పుస్తకాలకు పైగా ఉన్నాయని. ఇంకా ఎంతోమంది తెచ్చి ఇస్తున్నారు. అందుకే దీని పైన ఇంకో పెద్ద హాలు కట్టించాను. సాహితీ కార్యక్రమాలు కూడా జరుపుకునే లాగా చిన్న వేదిక కూడా ఏర్పాటు చేసాను. వచ్చే నెల ఫిబ్రవరిలో గవర్నర్ తమిళిసై గారి చేతుల మీదుగా అది ప్రారంభం కానున్నది. మీరు కూడా తప్పకుండా రావాలి ఆహ్వానం పంపుతాను ( నవ్వుతూ).

ధన్యవాదాలు సార్! తప్పకుండా వస్తాను. మీలాంటి ఆదర్శమూర్తులను కలుసుకోవడం, మా పాఠకులకు పరిచయం చేయడం మాకు గర్వకారణం. ఆరోగ్యరీత్యా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా మీ జీవిత విశేషాలను ఇంత ఓపికగా చెప్పిన మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు.