చాణక్యుడు అర్థశాస్త్ర రచయిత . అర్థశాస్త్ర విషయములే కాకుండా పాలనా రీతి ,నీతి పాలనా విషయముల కూలం కుష పరిశీలన చేశాడు .అప్పుడు పరిపాలనలో ఉన్న నందవంశ పాలన (బౌద్ధమత అనియాయి )నిర్మూలింప జేసి గాంధారదేశంలో తిష్టవేసిన విదేశీ దురాక్రమదారుల పీచ మడచడానికై చంద్రగుప్త మౌర్యునితో కలిసి బలమైన పునాది నిర్మించాడు .అది దాదాపు ఒక ఎనిమిది లేదా తొమ్మిది వందల సంవత్సరాల వరకు ప్రత్యేకంగా ఒక దురాక్రమణదారు అనేది లేకుండా చేయగలిగింది .శకులు ,యవనులు ,కుషానులు మున్నగు వారు వచ్చి చిన్నచిన్న రాజ్యాలు ఏర్పరచినా వారు స్థానిక ప్రజలతో మమేకమై దాదాపు స్థానికులుగానే మిగిలిపోయారు .వివిధ కారణాల వల్ల వివిధ పేర్లతో వచ్చిన ఇస్లాం దండ యాత్రలు మొదటి రెండు మూడు వందల సంవత్సరాలు దోచుకుని పోవడానికే వినియోగించుకున్నారు . గుప్త సామ్రాజ్యం శాతవాహన రాజుల కాలాలు హిందూ బౌద్ధ మతావలంబనలకు అనుకూలంగా రాజ్యపాలన కావించి గుంపులు గుంపులుగా వస్తున్న వారిని అటకాయించి ఆపి వారిని స్థానికీకరించారు .ఈ మధ్యలో చిట్టచివరి ఉత్తర భారత సామ్రాజ్యం హర్ష చక్రవర్తిదే . దక్షిణ భారతంలో కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాలు కొంతకాలం తురుష్క దండయాత్రలకు తట్టుకున్న కాలక్రమంగా ఈ రెండు సామ్రాజ్యాలు తురక దండయాత్రలకు గాని పరస్పర యుద్ధాలకు గాని తట్టుకోలేక మొత్తం భారతదేశమంతా ఔరంగాజేబు పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యముగా మారిపోయింది .ఈ క్రమంలో ఈశాన్య భారతదేశంలో పాల సామ్రాజ్యం కొంతవరకు బౌద్ధాన్ని నిలబెట్టగలిగింది .ఇది క్రీస్తుశకం 800 నుండి క్రీస్తుశకము 1200 వరకు మాత్రమే .
క్రీస్తు శకం 8 00 నుండి క్రీ.శ. 1200 వరకు దక్షిణ భారతదేశము నుండి ఒడియనులు తెలుగువారు మరియు తమిళులు నౌక మార్గము ద్వారా ఇండోనేషియా ,జావా సుమత్రాలలో హిందూ బౌద్ధ రాజ్యాన్ని ఏర్పరిచినారు .
తక్షశిల, నలంద ,విక్రమశిల , నాగార్జున మున్నగు విశ్వవిద్యాలయముల నేర్పరచి ఆ కాలంలోనే భారతదేశం ప్రపంచ దేశాలకు విజ్ఞాన భిక్ష పెట్టింది . ప్రపంచంలో అన్ని మూలలనుండి విద్యార్థులు భూ,జల మార్గాల ద్వారా వచ్చి చదువుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం ఆ కాలంలోనే భారతదేశ వైభవం తెలుపుతుంది. ఈ విధంగా భూ జల మార్గాల ద్వారా వర్తక మరియు రవాణా జరిగాయని ఇవి వేలయేళ్ళ కొనసాగింపని తెలుస్తుంది. కాలక్రమంలో భారత దేశంలో బౌద్ధం మరియు మిగతా మతాలలో అనేక శాఖలు ఏర్పడి మతపరమైన ఘర్షణలు గందరగోళాలు ఏర్పడసాగాయి .పటిష్టమైన తర్కంతో హేతువాద భూమికతో యున్న బౌద్ధ మతము ఆరామాలు మఠములు ఆర్థిక తోడ్పాటుతో నైతికపతనం ప్రారంభమైంది . బౌద్ధంలో వజ్రయానం అనే శాఖ ద్వారా తాంత్రికం బయలుదేరి బుద్ధుడు ఏ విషయాలయితే చెడుగా చెప్పి జీవితంలో నుంచి బహిష్కరించాడో వాటికే పెద్ద పీట వేసి పతనం వైపుకు చేరుకుంది . ఈ మధ్యకాలంలో వైదిక మతము పంచ మకారాలను నిష్కర్షగా నిషేధించి సనాతన మతరూపంలో బౌద్ధ జైన శాఖలలోని అహింస హేతుబద్ధతల్ని కొంతవరకు జీవితానికి అనువయింపజేసే వీలు వసతి కల్పిస్తూ అద్వైత తత్వానికి దారులు వేసింది సరిగ్గా ఈ సమయంలోనే ఆదిశంకరుడు కాలడిలో జన్మించి చిన్నతనంలోనే ఏకసంథాగ్రహణంతో విద్యలన్నీ నేర్చుకొని నర్మదా తీరంలోని గోవిందాచార్యుల శిష్యరికంతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి అద్వైత మత ప్రస్థానం మొదలు పెట్టాడు .బౌద్ధ తత్వంలోని శూన్యవాదాన్ని తన మాయావాదంతో ఎదుర్కొని అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశ మంతట వేళ్ళూనుకునేటట్లు బలపడి పై చేయి సాధించేటట్లు చేయగలిగాడు .అయితే ఈ క్రమంలో బుద్ధుని భగవంతుని అవతారంలో ఒకరిగా చేర్చి బౌద్ధ సూక్తులు అన్నిటిని తీసుకున్నా డు . ఆ విధంగా అప్పటి బౌద్ధంలో వైదికల్లో ఉన్న చెడుపోకడలని నాశనం చేసి నిజమైన బౌద్ధ సనాతన ధర్మాన్ని ప్రతిష్టించాల్సిన అది శంకరుడు ఆ ప్రయత్నం చేశాడు. ఒకరకంగా హేతువాద దృష్టి తగ్గడం వల్ల భారతదేశ ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకుంది . బలమైన వైదిక మతస్తులు మత సంస్కరణ ఇష్టం లేనివారు అంతా కలిసి ఆదిశంకరుని ప్రచ్ఛన్న బౌద్ధునిగా నిరసించి నిందించారు .ఈ విధంగా ఒక సంధి కాలంలో విదేశీ దురాక్రమణం ఎదుర్కొన్న చాణక్యుడు ,మత సంస్కరణతో అన్ని శాఖలను పరస్పరం సమన్వయం చేసి గానపత్యులు ఇంకా నరబలులు జంతుబలులు చేసే వారిని మార్చి ఎదుర్కొని ఓడించి అద్వైత మత స్థాపన చేసిన ఆదిశంకరాచార్యుడు , ఇరువురు ప్రఖ్యాత పురుషులు మరియు ప్రత్యేక స్థలంలో ఉన్నవారైనప్పటికీ లక్ష్యసాధనలో చాణిక్యుడు సఫలం అయ్యాడని చరిత్ర నిరూపించింది . చాణక్యుడు విదేశీ దాడుల్ని దండయాత్రనని అణివేసే పరిస్థితి ఏర్పరిస్తే ఆ కోణంలో ఆదిశంకరుడు విఫలమయ్యాడు .
విగ్రహారాధన లేని ఒకే నిరాకార భగవంతుని విధేయతతో ఇస్లాం మతప్రభావం భారతదేశం పై బలంగా పడింది .దాదాపు ఒక వేయి సంవత్సరాలు ఇస్లాం మతస్తుల మతపరమైన పరిపాలనలో భారతదేశం ఉండిపోయింది .వర్తక వాణిజ్యాలకై వచ్చిన బ్రిటిష్ వారు (తెల్లవారు )1857 నుంచి 1947 వరకు నిరంకుశ పాలన గావించినా ఆధునిక ఇంగ్లీష్ విద్య పరిపాలన సంస్కరణల ద్వారా చదువుకున్న యువత ప్రజాస్వామ్య స్వయంపాలనకై అనేక రకములైన పోరాటాలు చేసింది .1920 నుంచి జాతీయ పోరాట రూపంలో గాంధీ నాయకత్వంలో క్రమక్రమంగా ప్రజా ఉద్యమాలు వెల్లవలా వచ్చాయి .శాంతి , అహింస,నిరాడంబరత మొదలైన మౌలిక విషయాల ద్వారా సత్యాగ్రహ ఉద్యమ రూపంలో ప్రజలు తండోపతండాలుగా ఉద్యమించారు .
ప్రభుత్వ హింసను హింస ద్వారానే ఎదుర్కోవాలనే వాదంతో బయలుదేరిన ఉద్యమాలన్నీ కొంతవరకు సాగి చివరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా జపాను తోడ్పడుతో బ్రిటిష్ ఇండియా విముక్తికై పోరాడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి అమెరికా రష్యా బ్రిటన్ కూటమి విజయం సాధించడం ద్వారా ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది .రష్యా మూడవ ప్రపంచ దేశాల స్వాతంత్రానికి బలంగా నైతిక మద్దతు తెలపడం , అమెరికా కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మద్దతు ప్రకటించడం వల్ల బ్రిటన్ కు మింగుడు పడని పరిస్థితి వచ్చింది. భారతదేశంలోని అన్ని కులాలను వర్గాలను మతాలను ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటంలో మమేకం గావించిన కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ పక్కలో బల్లెంలా తయారయింది. విభజించి పాలించు అనే కూటనీతితో బ్రిటిష్ వారు చివరకు భారత ఉపఖండమును పాకిస్తాన్ మరియు భారతదేశం ,రెండు దేశాలుగా విభజించి వెళ్లారు .విభజన సమయంలో కనీ వినీ ఎరుగని హింస విధ్వంసం చెలరేగాయి .ఎట్టకేలకు ఆగస్టు 14 , 1947నాడు పాకిస్తాన్ ,1947 ఆగస్టు 15 నాడు భారతదేశం (హిందుస్థాన్ ) స్వతంత్ర దేశాలుగా బ్రిటిష్ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినాయి.
Dr. Kasarla Rangarao
Dr. Kasarla Rangarao
అనేక పత్రికలలో వ్యాసాలు, కవితలు రచించే వీరు ప్రచురించిన కవితాసంపుటులు- భాష్పాంజలి సాహిత్య కదంబం (1996), తెలుగు వెలుగులు (2021), మార్పు (2002), సత్యశోధన (2011), అక్షర సత్యాలు( 2015)
వడ్డెర చండీదాస్
1937 నవంబర్ 30న పెరిచేపల్లి గ్రామము వ్యవసాయదారుల కుటుంబాల్లో జన్మించారు ఇది పామర్రు మండలం కృష్ణాజిల్లా కిందకు వస్తుంది వీరి పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు. పేద వృత్తి శ్రామికుల వడ్డెర ప్రజల నుండి వడ్డెరను 15వ శతాబ్దపు ఓ విప్లమాత్మక శాక్తేయ బెంగాలీ పేరు చండీదాసు తీసుకొని దగ్గర చేర్చి వడ్డెర చండీదాసుగా తన కలం పేరు చేసుకున్నాడు వీరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు వడ్డెర చండీదాస్ గారి రచనలలో నవలలు కథలు లేఖలు తత్వశాస్త్రము ఉన్నాయి .

హిమజ్వాల అనుక్షణికం నవలలు చీకట్లోంచి చీకట్లోకి అనేది సంపుటి డిజైర్ అండ్ లిబరేషన్ తాత్వికం ప్రేమతో అనేది లేఖా సాహిత్యం . 2007లో గ్రంధ రూపం లేఖా సాహిత్యం . జనవరి 1984 నుండి 21 డిసెంబర్ 1991 వరకు చండీదాస్ గారు శ్రీ అడ్లూరి రఘురామరాజుకు రాసిన లేఖలు . వీరి రచనలన్నీ చైతన్య స్రవంతి కథని నడిచేవే మనో విశ్లేషణ చేస్తే చాలా పెద్ద థీసిస్ లే అవుతాయి. ఈయన వ్రాసిన సాహిత్యం దాదాపు 2000 పేజీలపైగా ఉంటుంది. 67 ఏళ్లు జీవించిన ఈ తాత్విక తపస్వి జనవరి 30, 2005న విజయవాడలో కన్నుమూశాడు దాదాపు 15 ఏళ్ల పాటు మౌనంగా నాలుగు గోడల మధ్య ఉండి పోయాడు ఆయన ఒకచోట తన గురించి వ్రాసుకున్న సుదీర్ఘ వ్యాఖ్యము “యాశ్వద కార్తీక కవోష్ణంలోంచి పుట్టుకొచ్చి కృష్ణ వరి పైరుల్లో సుషుప్తించి నిజామాబాద్ ప్రాంతపు పచ్చిక మైదానాల్లోంచి ఎదిగి హైదరాబాద్ వెన్నెల్లో తడిసి తిరుపతి వేడిలో కాగుతూ సంస్పందనాకాశంలో ఎగిరి, మూర్ఖత్వపు పంజరంలో పొడి, నిర్లిప్తనిరీక్షణావడిలోకి విముక్తమై అనురాగరసరాగ సౌందర్యంలో పునర్జన్మించాను కానీ అంతలోనే ఆ సౌందర్య అనురాగపు నా ఊపిరి శిలా వాల్మీకమైపోతే అందులో సమాధి అయి ఏకాంతిస్తున్నాను “వడ్డెర చండీదాస్ గారి రెండు నవలలు . హిమజ్వాల మరియు అనుక్షణికం ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికలుగా వచ్చాయి . హిమజ్వాల నవలను తెలుగు తనపు కూపం లో ఇమడలేక అభాసుపాలైన కళాతపస్వి బుచ్చిబాబు గారికి అంకితం చేశాడు . హిమ జ్వాల అనుక్షణికం నవలలను సీరియలించ్చి కీర్తిని అపకీర్తిని మూటగట్టుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మకు అంకితం చేశాడు వడ్డెర చండీదాస్ వ్రాసిన కథలన్నీ విజయ అనుబంధం చీకట్లోంచి చీకట్లోకి గా విజయ అనుబంధమాలికగా వెలువడ్డాయి. ఇది విజయం అనుబంధ 24వ నవలగా వచ్చింది. ఇది ఫిబ్రవరి 1978లో వచ్చింది దీనిని ఆమెః ఆమరణ నిర్బంధమాలిని ,మాతృభాల మలిన మందార ధార జగద్ధార మూలాధార నయన జ్వాలకు యివతలగా ,తన చీకటి కడుపున దాచిన , కాంతి నిస్వనపు సవ్వడి —-ఆమెకుఅంకిత మిచ్చారు .
ఇందులో ఏకథకు ఆ కథ గా ఉంటుంది .కానీ అన్ని కథలకు అంత సూత్రం అంటే గొలుసుకథగా ఉంటుంది. దీని గురించి ఈ విజయం అనుబంధంలోనే “సమర్పణ” పేరుతో దాదాపు 15 పేజీల సమీక్షాత్మక వివరణ విశ్లేషణ శ్రీ గుత్తికొండ నాగేశ్వరరావు వ్రాశాడు . డిసెంబర్ 1977గా అందులోనేప్రచురింపబడింది.
వీరి సాహిత్య వ్యాసంగాన్ని నిష్టతో నిష్పాక్షికంగా అధ్యయనం చేసిన వారు వైట్ హెడ్ సాత్రే జంగ్ లాంటి స్వతంత్ర ఇతివృత్తాలతో ” గమనాన్ని యానాన్ని ప్రవాహాన్ని అక్షరాలలో చిత్రించి ఉండే గొలుసు పొరలు చిరగకుండా ఒక్కొక్కటి విప్పి ఏదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కెతో రాసిన అతని వైజ్ఞానిక చైతన్య స్రవంతులు ,రచనా పటిమకు ” అబ్బురపడ్డారు హిమజ్వాల నవల రెండు ప్రధాన పాత్రల అంతరంగ బహి ప్రయాణ చైతన్య స్రవంతి మార్గ నిర్ధారణ ఇది ఒక మనో వైజ్ఞానిక నవల. కృష్ణ చైతన్య గీతాదేవి, ఈ రెండు ప్రధాన పాత్రలతో పాటు కృష్ణ చైతన్య తండ్రి , స్నేహితుడు శశాంక్ , గీతాదేవి భర్త శివరాం , అనారోగ్యపరుడైన చిదంబరం భార్య మాధురి దేవి మరియు కృష్ణ చైతన్య బంధువులు. తెలియకుండా మనసును మనిషిని కోసేసే జ్వలన ధ్వనితమైన జ్వలన జ్వలితమైన ప్రత్యేక జీవుల ఆ రెండు పాత్రలు హిమ జ్వాల నవల. సాంద్రత గాఢ వాక్యాలు . “తడిసి ముద్దయిపోయిన ప్రకృతి ఆమె శరీరంలోంచి ఎగిసే ఆవిరికి తేరుకుంటోంది .”
“మాటాడే తీరులో, సెలయేటివేగం , స్పటత ఉన్నాయి. ” ” పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగ కొద్దీ కాల్చి , అక్కడికి కసి తీరక దోససిల్ళ్ళతో మసి ఎత్తి గాల్లోకి తెగ పోసి వెళ్లిపోయాడు సూర్యుడు.”
ఈ నవలలో అధ్యాయాల పేర్లు వెలుగు మరక , మూగబోయిన వీణ , ఉప్పొంగిపోనాది గోదారి , అనుభూతి సిగ్గెరుగదట, ప్రేమ వెర్రిబాగులదట , మరీచి కాన్వేషణ , సశేషం జీవితం . ఈ పేర్ల ద్వారా ఆయాభాగాల్లో వచ్చే కథను క్లుప్తంగా చూపించాడు రచయిత నవల చివరన అర్ధాను స్వారంలో రచయిత తన భావాలను వెల్లడించారు.
వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం నవల క్లుప్తంగా శ్రీపతి , స్వప్న రాగలీన, అనంతరెడ్డి , గాయత్రి, మోహన్ రెడ్డి, గంగి ,రవి ,సీత ,కనకదుర్గ, విజయకుమార్, నళిని ,అంకినీడు, జయంతి, వెంకటావధాని ,రంగారెడ్డి ఇవన్నీ ప్రధాన పాత్రలుగా తార, రామారావు , స్రవంతి ,విమల ,ప్రసాద్ ,రాములు చారుమతి తండ్రి , చారుమతి , రమణి ,రంగారెడ్డి సూర్యప్రకాష్ ,రామ్మూర్తి ,సుబ్రహ్మణ్యం ,వేదవతి దురదృష్టవంతురాలు సీత , నిరంజన్ రావు , ప్రత్యేక పాత్ర వందన ,వరాహ శాస్త్రి ఇంకా ఉస్మానియా కిచిడి మిక్సర్ పాత్రలు .ఒక తరం నుండి ఇంకొక తరానికి నాటి సబ్జెక్టు విషయ సామాజిక మానసిక ఆర్థిక నేపద్యాల పది సంవత్సరాల గమనాన్ని రాజకీయ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ విశ్లేషణాలన్నీ మేళ నుంచి ఏ పాత్ర ఎదుగుదల గమనం నిష్క్రమణం దానిదే ఇంతటి సంక్లిష్ట సందిగ్ధం భీభత్స వేళా విశేష రచన ఇప్పటిదాకా తెలుగులో రాలేదు ఏదో ఒక ఇజం సంబందించిందో కాకుండా చారిత్రకతపై సామాజిక గమనంపై ఎక్కడ రచయిత అనవసర జోక్యం లేకుండా దేని వలయం విస్తరణ నిర్వాణం దానికదేగా నిర్వహించడం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప అరుదైన సందర్భం. ఇది ఒక 10 సామాజిక శాస్త్రాల అవగాహనను కలిగించగల ఏకైక నవల .ఉస్మానియా నేపథ్యంలో తెలుగు నైసర్గిక ప్రాతిపదిక విశ్లేషణలతో కూడిన వడ్డెర చండీదాస్ విశేష నవల .
వివిధ ఆంధ్రజ్యోతి సోమవారం 26 నవంబర్ 2018 నాటి తన వ్యాసంలో శ్రీ వల్లూరి రాఘవరావు గారు “అతీత వాద సాహితీ జలపాతం” శీర్షికతో వడ్డెర చండీదాస్ గారి సాహిత్య సమీక్ష చేశారు. ” ఓం వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ “అని పేర్కొంటూ శ్రీ కొడవళ్ళ హనుమంతరావు గారు విపులమైన సాహితీ సమీక్ష చేశారు.
http://eemata.com/ em/ issues/200507/ 177.html
“తెలుగు సాహితి వినీలాకాశంలో ఓ ధ్రువతార అనుక్షణికం” డి. రామచంద్ర రాజు., సంచిక -ఏప్రిల్ ఒకటి 2018.
“విరసాన్ని బోనెక్కించిన అనుక్షణికం ” ఫేస్బుక్ పోస్ట్ 22 ఫిబ్రవరి 2022.
రచన శృంగవరపు గారి ఫేస్బుక్ పోస్ట్ నాలుగు ఆగస్టు 2023 నుండి “చండీదాసు గారు -గొప్ప రచయితే కానీ!”ఇతర సమకాలీన రచనలతో పోల్చి తన అభిప్రాయం తెలుపుతారు .
ఇక వడ్డెర చండీదాస్ గారి సాహితీ ప్రయాణం లో అత్యంత ప్రత్యేకమైనది తాత్విక రచనా వెలుగు చూడడం. డిజైర్ అండ్ లిబరేషన్ అనే వీరి సూత్రప్రాయ రచన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని విషయంలో శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు చాలా విపులమైన వివరణ తన ఫేస్బుక్ మాధ్యమం లో వివరించారు. అబ్ధుల్ రాజా హుస్సేన్ గారు కూడా చండీదాస్ గారిపై విపులమైన వివరణలు ఫేస్బుక్ మీడియా ద్వారా దృశ్యమానం చేశారు.
కాశీభట్ల వేణుగోపాల్
వేణుగోపాల్ జనవరి 2 1954లో కర్నూల్ లో జన్మించాడు. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలు. 9 నెలలప్పుడే స్పష్టమైన పలుకులకు ముచ్చటపడి వీరి తల్లి వీరికి కాళిదాసు శ్లోకాలు పద్యాలు అమర కోశం నేర్పించింది. ఆ విధంగా వీరు చిన్నప్పటినుంచే జిజ్ఞాసతో అన్నలు అక్కలతో గ్రంథాలయానికి వెళ్తూ చదవడం అలవాటు చేసుకున్నాడు కాలేజీల చదువు అబద్ధం అని నమ్మి దృవపత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు చాలా చాలా విస్తృతంగా అధ్యయనం చేశాడు శ్రోత్రియ నియమాలను మిగతా అన్ని మానవ నిర్మిత నిబంధనలన్నీ విలువల్ని ఒప్పుకోడు. మొదట మల్లాది బుజ్జిబాబు శ్రీశ్రీల ప్రభావం లో ఉన్న త్వరలోనే బయటపడి సొంత ఒరవడికై కృషి చేశాడు. గుంటూరు శేషేంద్ర శర్మకు మంచి అభిమాని. ఈయన అవివాహితుడు .మంచి పద్యం మద్యం రెండింటికి ప్రీతిపాత్రుడు. హరిప్రసాద్ చౌరాసియాలను బాగా ఇష్టపడతాడు. మూడుసార్లు దేశాటనం చేశాడు . గాఢమైన అనుభూతుల్ని ఒడిసి పట్టుకోవడంలో ఈ పర్యటన వల్ల ,అధ్యయనం వల్ల , అమ్మ చెప్పిన శ్లోకాల వల్ల వచ్చిందంటాడు . జీవితంలోని గందరగోళాన్ని అస్థిరత్వాన్ని రచనలోని ముగింపుకై పాఠకుడిలో ఏర్పడే అవగాహనను చిన్నాభిన్నం చేయడం ద్వారా అనేక ప్రశ్నల్ని గాడతల్ని బరువుల్ని పాఠకుడి పై మోపుతాడు . సమకాలీన జీవన సంఘర్షణ బీభత్సాన్ని వైరుధ్యాలని ఒకింత చిక్కగా ప్రశ్నార్ధకం చేస్తాడు ..ఒక ప్రత్యేకమైన రచనా ఒరవడిని ముంచెత్తి పాఠకుడ్ని ఆశ్చర్యల్లో ముంచెత్తి ఆలోచింప చేస్తాడు . ఈయన నాలుగు కథా సంకలనాలు మూడు కవిత్వం పుస్తకాలు ఎనిమిది నవలలు ఒక నవలిక రచించాడు. దిగంతం ,తపన, నేను చీకటి , మంచు పువ్వు , తెరవని తలుపులు , నిషకం, అసత్యానికి ఆవల , అసంగత నవలలు రంగులు అనే నవలిక . నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశాడు

అసంగతం నవలపై శివా అయ్యల సోమయాజులు పుస్తకం డాట్ నెట్ లో విప్లమైన సమీక్ష వ్రాశాడు. వెంకట సిద్ధారెడ్డి సారంగ సంచిక 15 డిసెంబర్ “వేణుగోపాల్ మరియు ఒక సామాన్యుడు ” శీర్షికగా కాశీ భట్ల వేణుగోపాల్ తపన నవల తనపై ఎంత ప్రభావం చేసిందో చూపిందో విపులంగా వివరిస్తాడు . కాశీభట్ల వేణుగోపాల్ చెప్పిన కవిత యూట్యూబ్లో స్టేట్మెంట్ పేరుతో ఉంది రెండు నిమిషముల 50 సెకండ్లు ఇందులో ఆయనకు సంబంధించిన ఒక కృత్యా ద్యవస్థ వివరిస్తాడు .” కుర్చీ మై చైర్ ఓ పారాభౌతిక భావన ఒక సమ్మోహకర ప్రార్థన కేంద్రం . ముందు నన్ను రూపంగా మార్చి ఈ కుర్చి ఓ పారాభౌతిక భావన .ఎండలో మెరిసే వాన వానలో తడిసే ఎండ నన్ను చీల్చుకు వచ్చే చిగురు కోసం ఎండ వానల్లోని నన్ను మార్చే కుర్చీ సాంతం కాళ్లు చేతులు ఉన్నాయంటూ లేకున్నా ఉన్నాయంటూ మట్టిని కౌగిలించుకోవడానికి మట్టైన నేను (కుర్చీలో) ఇంకో మెరిసే వాన కోసం తడిసి ఎండ కోసం .” ఈ విధంగా చాలా సంక్లిష్టమైన భావనలను ఆలోచనలని పాఠకునిలో రేకెత్తించిమనసులోకి దించి వదిలేస్తాడు కాశీభట్ల వేణుగోపాల్ వేణుగోపాల్.
బాల్యం విద్యాభ్యాసం దత్తత ప్రాథమిక విద్య బంధువుల ఇంట్లో సాగింది తండ్రి చిన్నప్పుడు తనపై కూర్చుండబెట్టుకొని వినిపించిన భారత రామాయణ భాగవతాలు ఆకలింపు చేసుకున్నారు ఏకసంతాగ్రహి సాధారణంగా ప్రశ్నపత్రంలో ఏమైనా ఆరు ప్రశ్నలు యత్నించండి అని ఉంటుంది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసి ఏమైనా ఆరు సమాధానాలు సరి చూసుకోండి అని వ్రాసేవారట ఏ పరీక్షలోనైనా వారు సర్వప్రదముడిగా వచ్చేవారట.
ఆయన ఉస్మానియా విద్యార్థిగా ఉన్నప్పుడు వందేమాతరం ఉద్యమంలో 300 మంది విద్యార్థులతో 1939 లో పాల్గొన్నారు అప్పటి హైదరాబాద్ నిజాం ప్రభుత్వం వీరందరిని చదువు నుంచి ఉద్యోగ అవకాశాల నుండి భర్తరఫ్ చేసింది అప్పుడు పీవీ గారు నాగపూర్ నుండి బీఎస్సీ ఎల్ఎల్బి పూర్తి చేశారు . ఏఐసిసి సభ్యుడుగా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 1948 1948 తెలంగాణ విముక్తి పోరాటానికి తన వంతు దోహదం చేశారు. 1948 నుండి 1952 వరకు శ్రీ పాములపర్తి సదాశివరావు గారితో కలిసి కాకతీయ పత్రిక నడిపారు మంథని ఎమ్మెల్యేగా 1957 నుండి 1977 వరకు రాజకీయ ఎదుగుదల జరిగింది న్యాయ సమాచార శాఖ మంత్రిగా 1962 -64 న్యాయ దేవదాయ శాఖ మంత్రిగా 1964 -67 వైద్య ఆరోగ్య విద్యాశాఖ మంత్రిగా 1967 -71 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా19 71 -73 ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 1975 -76 తెలుగు అకాడమీ చైర్మన్గా 1968 -74 దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ చైర్మన్గా 1972 నుండి. లోక్సభ సభ్యునిగా హనుమకొండ నుండి 1977- 1984 నుండి 1984 -1989 పబ్లిక్ అకౌంట్స్ కమిటీగా 1978- 79 . ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో విదేశాంగ శాఖ ,గృహ మంత్రి, రక్షణ మంత్రి ,మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఇన్ని శాఖల అనుభవం గడించారు .

1989 -91 మధ్యలో రాజకీయాలనుండి విరమించుకొని తన పుస్తకాలు కంప్యూటర్లు హైదరాబాద్ కు తరలించారు రాజీవ్ గాంధీ హత్య వల్ల శ్రీమతి సోనియా గాంధీ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొమ్మిదవ భారత ప్రధానమంత్రిగా 1991 -1996 పనిచేశారు ఆయన నిర్వహించిన ప్రతి పదవిలో శాఖపై జరగని ముద్ర వేశారు విద్యాసంస్కరణలు న్యాయ దక్షత భూసంస్కరణలు ఇందులో ప్రధానమైనవి . ప్రధానంగా ఆయన భూసంస్కరణల పైగట్టిపట్టు పట్టడంతో భూస్వామ్య వర్గాలు బాహాటంగా తిరుగుబాటు చేశాయి జై ఆంధ్ర ఉద్యమం కేవలం ఒక మిశ,సాకు మాత్రమే. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ విధిలేని పరిస్థితిలో పీవీని తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు . ప్రధానమంత్రిగా శ్రీ పివి గారు ఆర్థిక సంస్కరణలు దేశ భవిష్యత్తుపై జరగని ముద్ర వేశాయి ఆర్థిక సంక్షోభంతో దివాలా అందుకు చేరిన దేశాన్ని గట్టెక్కించి ప్రగతి పథంలో అభివృద్ధి పథంలో పట్టాలెక్కించారు .ఆయన తర్వాత 25 ఏళ్లు మరి తర్వాత కూడా ఆర్థిక ప్రగతి రథం ఆయన వేసిన మార్గదర్శనంలోనే నడుస్తుందంటే ఆయన ఎంతటి దార్శనికుడో కూడా అర్థమవుతుంది. ఆయన ఐదేళ్ల పాలన దినదిన గండం నూరేళ్లుగా నడిచింది .ప్రతిపక్ష నాయకుడికి దేశం తరఫున ఐక్యరాజ్యసమితి (శ్రీ వాజపేయి గారికి)బాధ్యతలు ; శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కార్మిక లేదా శ్రామిక నాణ్యతలు పారిశ్రామిక సంబంధాలు క్యాబినెట్ శాఖ ఇచ్చి వారి సేవలను సంపూర్ణంగా వినియోగించుకున్నారు .
వీరిభార్య పేరు సత్తమ్మ. వీరికి ముగ్గురు కుమారులు అయిదుగురు కుమార్తెలు కలరు వీరికి దాదాపు 17 భాషలు తెలుసు అని ప్రతీతి.చాలామంది పీవీ గారిని అష్టభాష కోవిదురని ప్రశంసిస్తారు .వీరి ఆత్మకథాత్మక నవల ద ఇన్సైడర్ గా వచ్చింది .దీనిని కల్లూరి భాస్కరం గారు “లోపల మనిషి”గా అనువదించారు వీరి జీవిత గమనాన్ని ” హాఫ్ లయన్” పేరుతో వినయ సీతాపతి ఇంగ్లీషులో రచించారు ఇందులో ఆయన జీవితంలోని అన్ని పార్శ్వాలను , వ్యాసంగాలను ఆయన ప్రమాణాలతో సహా నిరూపించారు . ఇందుకు వినయ్ సీతాపతి వారి కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన డిజిటల్ డైరీ ని వాడుకున్నారు పివి గారి జీవిత సత్యాలు అన్నింటిని ఆయన ప్రజా బాహుళ్యం ముందుంచారు .ఇది అందరూ చదవదగ్గ పుస్తకం
శ్రీ పివి గారు హిందీ యం.ఏ. సాహిత్య రత్నలో భాగంగా శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలను “సహస్ర ఫణ్ ” పేరుతో హిందీ చేశారు . అలాగే మరాఠీలో హరి నారాయణ ఆప్టే గారి నవల పాన్ లక్షత్ కోన్ ఘటే ను “అబల జీవితం ” గా తెలుగు చేశారు .ఆయన సాహితీ పిపాస జీవితాంతం కొనసాగింది .
ఆయన ముఖ్యమంత్రిగా తీసుకువచ్చిన భూసంస్కరణలు ప్రధానమంత్రిగా తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు చాలా సామాజిక ప్రభావాన్ని ఆర్థిక ప్రగతిని తెచ్చిపెట్టాయి . మానవత్వంతో కూడిన సంస్కరణలు మార్కెట్ ఆధారిత మార్పులు గా చెరగని ముద్ర వేశాయి ఆయన పరిపాలన కాలంలో తీవ్రవాదంతో అట్టుడుకుతున్న పంజాగులో ఎన్నికలు నిర్వహించి చట్టబద్ధ పాలనను గాడిలో పెట్టారు . వి.పీ.సింగ్, చంద్రశేఖర్ హయాంలో దిగజారిన జమ్ము కశ్మీర్ పరిస్థితుల్ని గట్టిగా నియంత్రించి అదుపులోకి తెచ్చి , ఐక్యరాజ్యసమితి మరియు భారత పార్లమెంటు ద్వారా జమ్ముకశ్మీర్ భారత్లో అభిన్న అంగమని ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలుపుకోవడమే మిగిలిందని బలంగా గట్టి సందేశం ఇచ్చారు. ఆయన ప్రధాన ప్రతిపక్షం కూడా ఆయన చూపిన దారిలోనే నడుస్తుండడం విశేషం ఆయన వ్యక్తిత్వ వికాసం లోని ప్రధాన ప్రత్యేక విశేషాలు .
1) ఆయన లోక్సభ సభ్యుడుగా హనుమకొండ ఆంధ్ర ప్రదేశ్ ,రామ్ టెక్ మహారాష్ట్ర, కర్నూలు ఆంధ్ర ప్రదేశ్, బరంపురం ఒరిస్సాల నుండి ప్రతినిధిత్వం వహించారు ఆయన దక్షిణోత్తర భారతం అంటే భారతదేశ ప్రతినిధిత్వం వహించారు .
2) 1983 లో అలీనదేశాల శిఖరాగ్ర సభలో క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో తో స్పానిష్ లో మాట్లాడి ఆయనను అబ్బుర పరచారు .
3)ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని అత్యంత చాకచక్యంతో పూర్తి కాలం నడిపి సమూల మార్పులు రాగల తీసుకువచ్చే దిశగా దేశాన్ని ఎన్నో అవరోధాల మధ్య నడిపించాడు .
4) అయోధ్య రామ మందిరం వివాదాన్ని రాజ్యాంగబద్ధంగా పరిష్కారానికి విశేషమైన కృషి చేశారు . ఆ పరిస్థితుల్లో ఆ విధంగా నడిపించడం వల్లనే 1979 నుండి 2019 వరకు ప్రతిపక్షానికి పూర్తి మెజారిటీ రాకుండా ఉన్న పరిస్థితి నెలకొంది .
అయోధ్య వివాదానికి పీవీ ని బాధ్యుడిని చేస్తూ ఆ తర్వాత ఆయన సాధించిన విజయాల్ని ఏమాత్రం ప్రస్తావించకుండా సాగిన కాంగ్రెసు పార్టీ మనుగడ ఆత్మహత్యా సదృశ్యంగా మారింది . నిస్పాక్షిక విమర్శకులు సమీక్షకులు భారతదేశానికి పీవీ చేసిన సేవ చూపిన దిశా నిర్దేశం ఇంకా ఏ ప్రధాని వల్ల కూడా కాలేదని తేల్చి చెప్తున్నారంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పట్టిష్టమైందో లోకానికి తెలియజెప్పినట్ల యింది . ఒక మామూలు గ్రామ కరణం : ఒక రైల్వే క్యాంటీన్లో చాయ్ అమ్మిన వ్యక్తి ఇలా సామాన్య నేపథ్యం కలవారు అసామాన్య కార్యాలు చేసి అతి తక్కువ సమయంలో భారత్ ను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దగలరని లోకానికి చాటి చెప్పింది భారత ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ . ధన్యవాదములు
(మొదటి భాగం)
మహాకవి గురజాడ స్వర్గంలో సుఖవంతమైన ఈజీ చైర్లో (ఎనుకటి తాతయ్యలు వాడేది) కూర్చుని మధురవాణి ఇంటర్వ్యూలు చదువుతుంటాడు. చుట్టూ చాలా పుస్తకాలు నిలువు గుట్టల్లా ఉంటాయి.
ఊర్వశి : నమస్కారం గురువులకు గురువు గురజాడ గారూ! బాగున్నారా?
గురజాడ : ఆఁ ఈ బిరుదు గురువులకే గురువు అనేది చెళ్ళపిళ్ళ వారికి, ఆ తర్వాత విశ్వనాథకు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీకే నప్పుతుంది, చెల్లుతుంది.
ఉ: అదేమిటి మీ స్ట్రగుల్ తర్వాత దాదాపు ఒక ముప్పయేళ్ళు మీ ప్రభావం తెలియకుండా, బయట పడకుండా చేసిన చెళ్ళపిళ్ళ వారికి, విశ్వనాథ వారికి ఈ బిరుదు చెల్లుతుందన్నారు. ఎందుచేత?
గు: వ్యావహారిక భాషోధ్యమ తీవ్ర ప్రభావం చేతనే చెళ్ళపిళ్ళ వారి పద్యాలు పండితుల నొదిలి పామరుల చెంతకు చేరాయి. అంతే కాకుండా నేను చెప్పిన పై ఆ నలుగురూ సాహిత్య బృందాలను వెంటేసుకు తిరిగారు. కాబట్టి ఆ బిరుదు వారికే వర్తిస్తుంది.
ఉ : ఓహో! అలాగా! మీ చేతిలోకి ఈ మధురవాణి ఇంటర్వ్యూలు ఎలా వచ్చింది?
గు : ఇది మిసిమి రాణి పంపించింది.
ఉ : ఆహా! మధురవాణి, మిసిమిరాణి ఇలా ఎంతమంది తెలుసేం మీకు.
గు: అది నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. అదంతే.
ఉ : సరే కానీ, మీ శిష్య న్యూక్లియర్ బాంబు శ్రీశ్రీ “అడుగు గురజాడది. అది భావికి బాట. మనలో వెధవాయిత్వం మరపించే పాట” అంటూ మన సాహిత్య పరిణామంతో కొత్త రోడ్డు మీరు వేశారని తామంతా అరసం, విరసం ఇత్యాదులు ఆ రోడ్డు వెడల్పు మాత్రమే చేశామని వాక్రుచ్చారు. మీరేమంటారు?
గు: అదేమిటి? వీళ్ళు చేసిన అన్ని అవకతవక పనులకు నేనా బాధ్యున్ని? అంటే కీర్తి కిరీటాలు, అవార్డులు వీరికి, అపఖ్యాతి, నిందా, దుమారాలు నాకా? ఏడి వాడు ఎక్కడున్నాడిప్పుడు?
ఊ : ఆయన ఆర్నెల్లు స్వర్గంలో, ఆర్నెల్లు నరకంలో ఉంటుంటాడు. ఎక్కడున్నా కుదురుగా ఉండడు. ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడూ విప్లవం లేవదీస్తుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు మీకు కలవకపోతాడా! ఒక తడాఖా తీద్దురు గాని లెండు.
గు : సరేగానీ, ఏమిటీ వీడ్ని నా శిష్య న్యూక్లియర్ బాంబు అన్నావూ. ఇదేం ప్రయోగం?
ఊ: : అంటే శిష్య పరమాణువు అనేది సాధారణంగా అందరూ వాడేదే కదా అని. అది కాక శ్రీశ్రీ మరియు ఆయన అనుయాయులంతా మీకు చేసిన సేవ అంతాయింతా కాదు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆపద ప్రయోగం చేశా.
గు : ఉహ్, ఆ సోది పోనిద్దూ. నా తర్వాత వారు నా బాటలు నడిచినవారు కృష్ణశాస్త్రి, చలం, దాశరథి, సుంకర, కాళోజీల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా!
ఊ : నాకు మీపై అవ్యాజమైన ప్రేమ, భక్తి ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ఎడిటోరియల్ బోడొకటి ఏడ్చింది కదా. వారు సూచించిన వారినే, సూచించిన క్రమంలోనే మేము ముఖాముఖి నిర్వహించాలి.
గు : ఒహో! అదొకటుందా మధ్య. సరే, కానీయ్.
ఊ : : శ్రీ కొవ్వలి గోపాలకృష్ణ, శ్రీమతి గురజాడ అరుణ, శ్రీ గురజాడ రవీంద్రుడు అంటే మీ ముని ముని సంతతి అమెరికాలో గురజాడ ఫౌండేషన్ పెట్టి మీరు నడిపి వదిలిన ప్రకాశికను త్రైమాసికంగా అంతర్జాల పత్రికగా నడుపుతున్నారు.
ఎల్ల లోకములొక్క యిల్లె
వర్ణబేధములెల్ల కల్లె
చెట్ట పట్టాల్ పట్టుకు
దేశస్తులంతా నడువ వలెనోయ్
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించకముందు కడుగేయ్
అనే మీ భావజాలానికి అనుగుణంగా నడుపుతున్నారు. ఇందులో గురజాడ అరుణ స్వయానా మీ ముని ముని సంతతే.
గు : అదేమిటీ! ఇప్పుడున్న సాహిత్యకారులూ, సాహిత్యాభిమానులూ, కళాకారులూ, కళాభిమానులంతా నా ముని ముని సంతతే కదా! ఇందులో స్వపర బేధం లేదు నాకు. అయినా ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నావూ?
ఊ : ఎందుకంటే మీ ఆనందగజపతిరాజు సంతతి నుంచి వచ్చిన పి.వి.జి. రాజు గారు కాంగ్రెస్ నాయకులు. అప్పటి జమీందారీల రద్దు నేపథ్యంలో గుడి, గోపురాలు, స్కూళ్ళు, కాలేజీలు యాజమాన్యం పేరు మీద రూ. 50,000 కోట్ల ట్రస్టు ఏర్పరచారు. ఆ సంతతి ఇంకా ఆ దర్జా, హోదా అనుభవిస్తున్నారు. మీ సంతతులు మాత్రం అదే సాహిత్య సేవలో తరిస్తున్నారు. ఈ తేడాలెందుచేత?
గు : అదే, అంతే నాకు ప్రాప్తం అనుకుంటాను. ఈ కొవ్వలి గోపాలకృష్ణ సహస్రాధిక నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహరావు సంతతేనా?
ఊ : : ఔనౌను. అదే సంతతి. కానీ మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దాటవేస్తున్నారు.
గు : రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి దేశంలోకెల్లా అత్యంత విలువైన సంపదను ట్రస్ట్ ద్వారా కాపాడుకున్నారు. కాంగ్రెస్, టిడిపి ఏదైతేనేం వాళ్ళకు సాధ్యమైన తోచిన రాజకీయ, సామాజిక సేవ చేస్తున్నారు. మిగతా వారిలో ఆ తెలివితేటలు, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ఆస్తులన్ని ప్రభుత్వ పరమైనాయి. ఇక మిగతాది ఎ.జి.కె. మూర్తి అడ్వర్టైజింగ్ రంగంలో రాణించాడు కదా. ఎవరైనా స్క్రాచ్ టు రిచ్చెస్ కావలసిందే. ఏ రంగమైనా తెలివితేటలు, ప్రతిభ, పోటీతో రాణించాల్సిందే.
ఊ : కానీ మావోయిస్టులు, రాజ్యాంగం ప్రతిభా, గితిభా జాన్తానై. దళిత, గిరిజనులందర్నీ బహుజనులతో పాటు అధికార పీఠం ఎక్కించాల్సిందే అంటున్నారు కదా! దీనికేమంటారు.
గు : అనడానికేముంది. సామాజిక చట్రంలో బ్రాహ్మణులుపై దొంతరలో ఉన్నారు. వారి క్రింద రెడ్డి, వెలమ, కమ్మలు ఉండి వ్యవసాయం చేయించేవారు. ఆ గ్రామీణ వ్యవస్థలో కులవృత్తులన్నీ పాలుపంచుకునేవి. వాటి క్రింది సంచారజీవులు, సామాజిక బహిష్కరణకు గురైనవాళ్ళు ఉండేది. గిరిజనులు ఒక ప్రత్యేక జీవన పద్ధతి. వారి రక్షణకు, ఎదుగుదలకు రాజ్యాంగం ప్రత్యేక సూచనలిచ్చింది. ఐతే సామాజిక, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు లభించి అందరి ఎదుగుదలకు, సామాజిక ఉద్యమాలు దోహదం చేయాలి.
ఊ : ఐతే నేను శ్రీ పి.వి. నర్సింహారావు మరియు శ్రీ జి. వెంకటస్వామి గార్లపై తులనాత్మక, సామాజిక, రాజకీయ పరిశోధన చేయాలని అనుకుంటున్నాను గురువుగారూ.
గు: నీ జర్నలిజం ఇంటర్వ్యూలేవో నువ్వు చేసుకోక ఇటువంటి సమస్యల తేనెతుట్టి వ్యవహారాల్లో ఎందుకు వేలు పెడతావు. నీ పని నువ్వు చేసుకో చాలు.
ఊ : మీ వీరేశలింగం పంతులు, మీ వరవరరావు తమ సమకాలీన సమాజాన్ని, చెడును చీల్చి చెండాడొచ్చు కానీ మేం పరిశోధనలు చేయకూడదా? మీరు మీ లెక్చరరుద్యోగం చేసుకోక అన్నింట్ల వేలు పెడతారేం! మేం మాత్రం చేయకూడదా?
గు :అందులో రాగల సాధక బాధకాల వల్ల నేనలా చెప్పాను. నీకు ఆ ఓపికా, ఉత్సాహం ఉంటే చెయ్యి. పట్టుదలను ఎవడాపగలడు?
ఊ : ఇదేమిటి, నేను మీ అభిప్రాయాల్ని, ఇంకా చాలా విషయాల్ని అడుగుదామని వచ్చి ఇలా వేరే రూట్లో వెళ్తున్నాను.
గు : అదే చాంచల్యం!
ఊ : ఎందుకో గురువుగారూ మీలాంటి వాళ్ళు దగ్గరకు వస్తే వ్రాసుకున్న ప్రశ్నలకు బదులుగా చాలా ఉప ప్రశ్నలే వస్తుంటాయి.
గు : సరే సరే ఇతర దారుల్లో వెళ్ళకుండా నీ సమయం మించి పోకుండా ప్రశ్నలు వెయ్.
ఊ : కవులలో గుర్రపు స్వారీ వచ్చిన ఆధునిక కవులెవరైనా ఉన్నారా?
గు : అదేమిటి! నీ చూపు గుర్రపు స్వారీ మీదకు పోయింది. కొంపదీసి నా స్థానిక ప్రయాణాలలో వేరే రవాణా సౌకర్యం అందుబాటులో లేక నేను గుర్రపు స్వారీ చేశాను. నన్ను రామప్పంతులును ఒక గాటను కట్టవు గదా!
ఊ : అది కాదు, మీ పాత్రలన్నీ మీ అభిమాన పాత్రలే, సజీవ మూర్తులే. మీరు గుర్రపు స్వారీ ఠణాయించారు. ఆ విధంగా ఎన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు గార్ల జానపదాలకు స్ఫూర్తి కదా!
గు: సంపూర్ణ ఆరోగ్యవంతులైన వారెక్కడ, అర్భకున్ని నేనెక్కడ! నువు భలే సామ్యం చెపుతావులే. ఊరుకో. అయితే ఒక రకంగా ఎన్టీఆర్ అభినయంలో ఆణిముత్యం, మధురవాణి అలియాస్ సావిత్రిల కన్యాశుల్కం
ఉంది కదా!
ఊ : ఆఁ గుర్తొచ్చింది గుర్తొచ్చింది. నష్కల్ రాకుమారుడు తీగారం నాన్న, ఎన్టీఆర్ నెల్లుట్ల నర్సింహ్మారావు అలియాస్ మధుసుధనరావు గారు, నష్కల్ నుంచి హన్మకొండకు యెల్ల గుర్రంపై వచ్చేవారు.
గు : ఇదేం బేహద్బీ. ఉండుండు. గుర్తుచేసుకోనీ. ఆ ఈయన మంచి అందగాడు, స్ఫురద్రూపి, కవి, గేయ రచయిత, గాయకుడు.
ఊ : ఔనౌను. అయితే మన సినీ కథానాయక ఎన్టీఆర్ గారు చదువుకునేటప్పుడు సైకిల్పై తిరిగి పాలు అమ్మేవారు. ఆ కాలంలో ఈ నష్కల్ లేదా తీగారం ఎన్టీఆర్ గారు మక్తేదార్ అంటే ఒక రకమయిన జమీందార్ హోదాలో తెల్ల గుర్రంపై కమాను నిర్వహించేవారు. అయితే కమ్యూనిస్టు పోరాటాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆ మక్తాలు, జమీందారీలు రద్దై తెలంగాణ విముక్తమైంది. ఆ తర్వాత చివరకు చివరి పది పదిహేను సంవత్సరాల కాలంలో ఈ కరణం ఎన్టీఆర్ మహావీర్ హాస్పిటల్లో కేర్కర్గా, కోఆర్డినేటర్గా నెలకు 10 వేల రూపాయలకు పాలు పండ్లు, ఔషధాల పంపకం చూసేవారు. ఒక జీవితంలోనే ఐశ్వర్యం, హోదా, ఎత్తుపల్లాలు, నిమ్నోన్నతాలు ఈ ఇద్దరు ఎన్టీఆర్ జీవితంలో సంభవించాయి. దీనికి మీరేమంటారు?
గు : ఔనౌను, జీవితం బహు విచిత్రమైంది. ఎన్నో మలుపులు తిరుగుతుంది.
ఊ : చరిత్ర ఇది అయితే, మరి దేశ్ముఖ్, దేశ్పాండే, మక్తేదార్ల రద్దు కాంగ్రెస్ ఖాతాలో పడిందేమిటి?
గు : కాంగ్రెసు నైజమే అది. అది స్వతహాగా ఏ ఉద్యమం చేయదు. ప్రతి ఉద్యమాన్ని అది క్యాష్ చేసుకుంటుంది.
ఊ : ఐతే, ఈ కరణం ఎన్టీఆర్ గారు మంచి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఒక అందమైన వైశ్య పతివ్రతా శిరోమణి, 20 కిలోల బంగారంతో లేచిపోదాం వస్తావా అని వెంటపడిందట. మీకేమైనా ఇటువంటి అనుభవాలున్నాయా?
గు : సాహిత్యం, భాషాసేవ, సంస్కరణవాదం, ఉద్యోగ బాధ్యతలు ఇలా నేను నా పనులలోనే నిమగ్నమై ఉన్నాను. అయినా వెంకటరమణయ్య పంతులు గారు వేశ్యల జీవితాలు, తాగుబోతుల అడ్డాలు, సామాజిక సమస్యల్ని నువు నిశితంగా దగ్గరగా పరిశీలించావు. అందుకే సజీవ రక్తమాంసాలతో తొణికిలాడుతున్న అద్వితీయ నాటకాన్ని, కథల్ని, గేయాల్ని రచించావని కితాబునిచ్చారు. అయితే సమాజంలో ఐశ్వర్యవంతులు, అందగాళ్ళకు ఇటువంటి ఉపాఖ్యానాలెన్నో ఉంటాయి. పోనిద్దూ.
ఊ : సరే, సరే గురువుగారూ. ఈ కరణం ఎన్టీఆర్ గారు మన కమ్యూనిస్టు రాఘవరావుగారూ ఉత్తరోత్తరా వియ్యంకులయ్యారు.
గు : మరి అదే కదా! సంఘర్షణ, సంవాదం, సమన్వయం అదే హైందవం (భారతీయం). ఇలానే సామాజిక పరిణామ ప్రగతి నడుస్తుంది.
ఊ : మీరు కొంచెం ఓర్పుతో, సమన్వయంతో ఇంకో 25-30 సంవత్సరాలు మంచి నవల శాస్త్రీయ రచనలు చేస్తే మీ ఆణిముత్యాల్ని మీరే ఆంగ్లీకరిస్తే తెలుగు సాహిత్యానికి అంటే భారతికి రెండవ వాఙ్మయ నోబెల్ బహుమతి వచ్చేది కదా!
గు: ఆలోచించకుండా ఉండటం, విశ్రాంతిగా గడపటం నా స్వభావానికే విరుద్ధం. అందుకే ఎల్లప్పుడూ ఆలోచనలతో ఉద్రేకానికి ఉద్వేగానికి గురయ్యేవాన్ని. అందుకే నా చివరి రోజుల్లో నన్ను కలుద్దామని నా ప్రాణమిత్రుడు గిడుగు పిడుగు వెంకటరామ్మూర్తి పంతులు అనుకొని మా ఊరికి వచ్చి కూడా కలువలేదు. ఏం ఉంటుంది? భాషా సంస్కరణవాదం, సంఘ సంస్కరణ వాటికై ఉద్రేకపడటం అదే కదా! అందుకే పాపం ఆయన రాలేదు. అయితే హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు నోబెల్కి అర్హతలున్నా హంగు చేసుకోలేకపోయాడు.
ఊ : ఔనౌను అదే కదా! ఎవర్ని కలవం వారే గుర్తించాలి అని భీష్మించుకుంటే ఈ రోజులలో కుదరదు కదా! మళ్ళీ మనవాళ్ళలో శేషేంద్ర ఒక్కరే ఆ స్థాయికి ఎదిగారు.
గు : సంప్రదాయ సాహిత్య పరంపర అవగాహనతో షోడశి రామాణ రహస్యాలు మంత్రశాస్త్ర యోగశాస్త్ర నేపథ్యంలో నిరూపించాడు. ఆధునిక సాహిత్య నేపథ్యంలోనూ అద్భుత కృషి సల్పాడు.
ఊ : ఔనౌను, ఇందిరాదేవి ధనరాజ్గర్ సాంగత్యంలో జ్ఞానబాగ్ ప్యాలెస్ కూడలిగా ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీష్ గోష్టిలు జరిగేవి. జర్మన్, లాటిన్, గ్రీక్ ఇత్యాదుల్లో ఆయన కవిత్వం అనువాదమై అనువాదమై, విశ్వవ్యాప్త అభిమానులను ఆయనకు తెచ్చిపెట్టింది. నోబెల్ దాకా పాకగల్గాడు కానీ ఆయనకీ జ్ఞానపీఠం దక్కలేదు, అని అభ్యుదయ సాహిత్యకారులు ఆయన గురించి, శ్రీశ్రీ గురించి వాపోతున్నారు.
గు : అందుకే నేను సాహిత్యం, కళలు రెండూ స్వతంత్ర ప్రతిపత్తితో ఉండి సమాజానికి దిక్సూచిలా కావాలని ప్రతిపాదించాను. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండి, నిజమైన ప్రతిభను గుర్తిస్తే ఇటువంటి విమర్శలు రావు కదా!
ఊ : మరేమో… మరీ… మరీ మీ బయోపిక్ రాద్దామని ఎవరైనా వచ్చారా?
గు : అబ్బా, భూమి గుండ్రంగా ఉంటుందని ప్రతి విషయాన్ని అటుతిప్పి ఇటు తిప్పి నా నెత్తిమీదకు తెస్తావెందుకు? నా కాలంలో నాకు అటువంటివి తటస్థపడలేదు. అయితే ఏం? ఎన్టీఆర్ జీవిత చరిత్ర లక్ష్మీపార్వతి వ్రాస్తే నీకేంటి, నాకేంటి ఆవిడ తెలుగు సంస్కృత భాషాధురీణ, మంచి విద్వాంసురాలు.
ఊ : మీరు, వీరేశలింగం పంతులు గారు ఓ… ఏకపక్షంగా బాగా బౌద్ధాన్ని అభిమానించి హిందూమతాన్ని తూలనాడారు. ఆఁ మీ ఈ విదుషీమణులే విద్వాంసురాల్లే బౌద్ధాన్ని భ్రష్టు పట్టించారు. ఆ అవశేషాల నుంచి అవకతవకల నుంచి అద్వైత భేరీ మ్రోగించి శంకరులవారు ఆ శతాధిక మతాల్ని ఒక్కటి చేశారు.
గు : ఔను, అదంతా చరిత్ర. సరే ఇప్పుడేమంటావు.
ఊ : కారం గారని మహా ముదురు. రెండు సూత్రీకరణలు చేశారు. 1. పిలిచి తిట్టించుకోవడం అంటే ఇప్పుడు బౌద్ధం ఉంది కదా. యజ్ఞయాగాదులు, బలులు, క్రతువులతో ఉన్నప్పుడు దానిని సంస్కరించింది. మరదే బౌద్ధం పతనమైనప్పుడు ఇదే హిందూ బ్రాహ్మణ మతం దాన్ని జీర్ణం చేసుకుంది. అదే బ్రాహ్మణులు సామాజిక మార్పుకై చిత్తశుద్ధితో కృషిచేసి ఇప్పుడు సకల దుర్గుణాలకు, రుగ్మతలకు బ్రాహ్మణులే కారణమని వారు సంస్కరించిన వారితోనే తిట్టించుకోవడం. ఇంగ్లీషువారు ఆధునిక ఆలోచనా, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య భావాలు విద్యావిధానంతో ప్రవేశపెట్టి తమ ముడ్డిక్రిందికి తామే నీళ్ళు తెచ్చుకొన్నారు. ఇట్ల ఇవన్నీ పిలిచి తిట్టించుకోవడంగా చెప్పుకోవచ్చు.
గు :: ఆహా! అయితే ఇంకొకటి ఏమిటి?
ఊ : దే ఆర్ అగ్రీడ్ టు డిసగ్రీ. అంటే ఎవరి భావాలు వారికి ఉండవచ్చు. అందుకే వారు ఎవరి స్వతంత్ర ఆలోచనలు వారికి ఉంచుకొని సమాజంలో స్వయం ప్రతిపత్తితో ఆలోచిస్తూ మనగల వచ్చు. అది ఈ భారతీయ, హిందూ సంస్కృతిలో, సమాజంలో ఎప్పటినించో అంతర్భాగంగా వస్తుంది. ఇది రెండో సూత్రీకరణ.
గు : ఔను, త్రిపురనేని వారిని, జాషువా, అల్లూరి, బోస్, రామానంద తీర్థ, ప్రకాశం, మగ్దూం, రావి, తాపీ వంటి వారిని కులదృష్టితో చూడటం చాలా తప్పు. ఎవరైనా ఏ కులంలో పుట్టినా ఆ కుల బారియర్ దాటి సమాజానికి ఏం చేశారనేది చూడాలి. ఇక్కడ కూడా సంకుచిత దృష్టేనా?
ఊ : మీకూ, వీరేశలింగం గారికి కూడా ఈ తిట్లు తప్పలేదు.
గు : సమాజంలో బేధభావాలు, వివక్షలు పోవాలని, కృషి చేసేవారిని కూడా అపార్థం చేసుకుంటారా? ఇది చాలా తప్పు. తప్పుడు అవగాహన.
ఊ : ఈ విధంగా కారం గారి ఈ రెండు సూత్రీకరణలు నా అవగాహనను పెంచాయి గురువుగారూ. అందుకే ప్రపంచమంతా, దేశస్తులంతా చెట్టపట్టాల్ పట్టుకు నడువవలెనోయ్ అనే మీ మాట శిరోధార్యం.
గు : ఏమిటేమిటి? చిత్రం బహు చిత్రం. విచిత్రం అనేలాగుంది నీ భావన. ఎవడో బోడిగాడు. ఈ కారంగాడు రెండు సూత్రీకరణలు చేశాడట. మహా పొంగిపోతున్నవ్. మళ్ళీ కొత్తగా వీన్నెవర్నో నా నెత్తిమీదికి తెస్తున్నది. ఒక్క గిరీశం గాడితోనే సతమతమౌతున్నా.
ఊ : అది కాదండీ గురువుగారూ. ఇస్లాంలో వేరే ఆలోచనకు, భావనకు చోటుండదు. అట్లే క్రిస్టియన్ దేశాలు క్రిస్టియానిటీ తప్ప వేరేవాటిని అంగీకరించవు. ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి వివిధ భావాలు విరుద్ధ భావాల సహజీవనం భారతీయం, హైందవం. మరి ఈ రెండు గుంపులు భారతదేశానికి సెక్యులరిజం బోధిస్తామని బయల్దేరాయి కదా! ఇది ఎంత వరకు సమంజసం.
గు : బహుశా ఆ కారంగాడి రెండు సూత్రీకరణల ద్వారా నీవీ ప్రశ్న వేస్తున్నావా? మంచిది, మంచిది. ఇంకో ఆలోచనని, సంస్కరణని ఒప్పుకొనని ఎడారి మతాలు ఈ వైవిధ్య, విరుద్ధ భావాల సంకలనం స్వతంత్రం అయిన భారత్కు పాఠాలు బోధిస్తారా అని నీ ధర్మాగ్రహం. సరే, ప్రజాస్వామ్యయుతంగా ఏ గుంపు గద్దెనెక్కితే అవే భావాలకు గుర్తింపు వస్తుంది.
బోయి భీమన్న (19 సెప్టెంబరు 1911-16 డిసెంబర్ 2005) మధ్య జీవించారు. సామాజిక మార్పు కు సామాజిక చైతన్యాన్నాశించి రచనలు చేశారు.అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆశావహ దృక్పథంతో జీవించారు. వీరి “గుడిసెలు కాలిపోతున్నై” అనే రచన ఒక బలమైన సామాజిక సమస్యను చర్చకు పెట్టింది. వీరి సాహిత్యకృషికి ( “గుడిసెలు కాలిపోతు
న్నై” కి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సామాజిక కృషికి ” పద్మభూషణ్” , రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు ,కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ లు లభించాయి. “పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న” గ్రంథం హైమవతి గారు రచించారు. బోయి భీమన్న గారి బహుముఖీన సాహిత్య , సామాజిక దృక్పథానికి ఈ గ్రంథం చుక్కాని వంటిది. జాతీయతతో తాను పుట్టిపెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవం తో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఈ అనుగుణంగా ఉండటమంటే అస్పృశ్యతకు వ్యతిరేకంగా ,కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడటమే. ఈ వాస్తవికాల ద్వారానే ఎదిగి కులనిర్మూలన పంథా రావాలని ,వేయేళ్ళ బానిసత్వానికి కారణమైన మన యీ అనైక్యత పోవాలని బోయి భీమన్న , అంబేద్కర్ ల ఆశయం, ఆకాంక్ష. సామాజిక న్యాయం లభించిన తర్వాత ప్రతిభ ,ప్రజ్ఞ , జిజ్ఞాస కలవారిని మాత్రమే ఎన్నిక చేయాలని కులప్రాతిపదికగా చేయరాదని వారి పోరాటం. ఇదే వారి కులనిర్మూలనోద్యమానికి ప్రాతిపదిక. దాదాపు 15 వరకు కవిత్వ సంపుటులు, 13 నాటకాలు , 8 వచన రచనా సంపుటుల ద్వారా తన అభ్యుదయ , ప్రగతిశీల భావాల్ను బోయి భీమన్న గారు ప్రకటించారు. బోయి భీమన్న సాహిత్య పీఠం ద్వారా ప్రముఖులకు అవార్డు ప్రధానం జరుగుతుంది. ఇది శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వారి ద్వారానే నిర్వహించబడుతుంది. మన బోయి భీమన్న వర్థంతి 16 డిసెంబర్ సందర్భంగా అన్ని రకాల హింసను వ్యతిరేకించి ,సమన్వయ దృక్పథాన్ని ఆచరించిన ఆయన పరిణితిని , పోరాట శీలాన్ని స్మరించుకుంటూ ఆచరిద్దాం.
జ్యోతికి పన్నెండు, పదమూడు సంవత్సరాలు. చాలా చలాకీ పిల్ల. అమెరికా నుండి తల్లిదండ్రులతో సహా ఒక నెలరోజులు గడపటానికి హన్మకొండ వచ్చింది. వాళ్ళ బామ్మ, అమ్మమ్మ, తాతమ్మలతో వారి అనుభవాలను తెలుసుకొని ఒక వ్యాసమో, కథో వ్రాయాలని ఒకటే ఉబలాటం. తాతమ్మ శాంతాదేవి దగ్గర చనువెక్కువ. మీ తరానికి యిప్పటికి పోలికలు, తేడాలు తెలుపమని ఒకటే గొడవ. ముని మనవరాలు పోరు పడలేక శాంతాదేవి ఇలా చెప్పసాగింది. మా అప్పుడు తొమ్మది, పది సంవత్సరాల వయసుకే పెళ్ళిళ్ళు చేసేవారు. నాకు మా అత్తలు ముగ్గురు అక్కచెళ్ళెలు.
ఒకామె ఇగో హన్మకొండ, మీ ముత్తాత గారి తల్లి, ఇంకొకామె దేశముఖుగారి భార్య. మూడవ ఆమె బాలవితంతువు.
జ్యోతి వెంటనే అడిగేసింది : అయ్యో తాతమ్మా! మరి ఆ తాతమ్మకు మళ్లీ పెళ్ళి చేయలేదా?
శాంతాదేవి : ఆ కాలంలో చెయ్యలేదే. మాటికి అడ్డం రాకు. చెప్పేది విను. మా మావగారు కరణం. చాలా నిక్కచ్చి మనిషి. చాలామందికి సహాయం చేసేవారు. ఎంతోమంది ఈ యింట్లో తిని వెళ్ళినవారే. తమ పనులన్నియు చక్క దిద్దుకున్నవారే. మాకు ఐదుగురు ఆడబిడ్డలు. నాకు యిద్దరు యారాండ్లు. భూములు వ్యవహారాల్లో మామగారికి వారి ముగ్గురి కొడుకులకి పొరపొచ్చాలు, గొడవలు, పంచాయతీలు వచ్చినా, మేం ముగ్గురం ఎప్పుడూ గొడవలు పడలేదు.
జ్యోతి : ఓహో! సరే తాతమ్మా, మీరెంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు,
శాంతాదేవి : మా అమ్మకు ఆరుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. అందులో ఒక పిల్లాడేమో పుట్టగానే చనిపోయాడు. ఆ విధంగా నాకు ఐదుగురు అన్నయ్యలు. ముగ్గురక్కలు.
జ్యోతి : ఐతే తాతమ్మా, మీతరం చదువుకోలేదు. అయితే అమ్మమ్మ లందరూ చదువుకున్నారు కదా! అందులో ముగ్గురు కూడా టీచరుద్యోగాలే చేశారు.
శాంతాదేవి: ఔనే. మా తరానికి యీ యింటికి ఏడుగురు కొడుకులు. అందులో నలుగురు ఇక్కడ వున్నారు. ముగ్గురు అమెరికాలో స్థిరపడ్డారు.
జ్యోతి : ఓ తాతమ్మా, అమ్మ, బామ్మ వాళ్ళు, వేయి స్థంభాలగుడికి, భద్రకాళి గుడికి వెళ్ధామంటున్నారు.
శాంతాదేవి : సరే వెళ్ళిరావే. అక్కడి వివరాలు, విశేషాలు వాళ్ళనే అడుగు. ఒక్క నా ఒక్కదాని బుర్రతింటే ఎలా! వాళ్ళను కూడా ప్రయత్నించు.
జ్యోతి : సరే తాతమ్మా! బై.
* * *
ఆ రోజంతా వేయి స్థంభాల గుడి, భద్రకాళి గుడి సందర్శనలతోనే గడిచింది. జ్యోతివాళ్ళ బామ్మ, అమ్మమ్మలకు ఎక్కువ విషయాలు తెలియవు కాబట్టి ఆయా గుళ్ళ శంకుస్థాపన వివరాలు, పురాతత్వ బోర్డులు చూపించి తప్పుకున్నారు. సాయంత్రం ఈ సీమటపాకాయ పేపరు, పెన్నుతో సిద్ధం.
జ్యోతి : తాతమ్మా! ఈ నీరెడి కొమురయ్య వాళ్ళట ఎవరు, వారికి ముత్తాత గారికి చాలా దగ్గరట ఎందుకు?
శాంతాదేవి : నీకీ విషయం ఎవరు చెప్పారే?
జ్యోతి : అదే గుడిలో నీరెడి కొమురయ్య వాళ్ళ వాళ్ళు పెద్దమ్మమ్మను గుర్తుపట్టి మాట్లాడారు.
వాళ్ళ మాటల్లో గ్రహించాను.
శాంతాదేవి : మరి పెద్ద అమ్మ్మనే అక్కడే అడగక పొయ్యావా, తీరిగ్గా గుర్తుపెట్టుకొని అడుగుతున్నావ్.
జ్యోతి : ఆఁవాళ్ళనడిగితే నీకెందుకే ఇవన్నీ పొట్టిబుడంకాయం అన్నారు, తాతమ్మా.
శాంతాదేవి : ఆహాఁ, అలాగా, ప్రతి గ్రామంలో చెరువు నీరు పారకం, బాగోగులు చూడటానికి వుండేవారినే నీరెడివారు అంటారు. నీరు + ఇడి నీరు యిచ్చేవారే నీరెడివారు. కరణం ఆధ్వర్యంలో గ్రామపరిపాలనంతా సాగేది. యెలవాళ్ళు, షేకం సింధీలు కరణం చేతి క్రింది వుండి తోడ్పడేవారు. శిస్తు వసూళ్ళు పై అధికారులు వచ్చినపుడు ఏర్పాట్లు చూసేవారు. మా మామగారు రైతు అనుకూలురుగా మంచి పేరు నిలుపుకున్నారు. అప్పటి నీరెడివారి వయసు, మీ ముత్తాత వయసు ఒకటే సమ వయస్కులవటం వల్ల వారి మధ్య చనువెక్కువ. మీ ముత్తాత గారు పదవతరగతి కాగానే ఉద్యోగంలో చేరిపోయారు. ఆ తర్వాత క్రమక్రమంగా పరీక్షలు ప్యాసై యం.ఎ.బి.ఇడి అయ్యారు. గెజిటెడ్ హెడ్మాస్టర్గా పదవీ విరమణ చేశారు.
జ్యోతి : భద్రకాళి గుడిలో మన ఊరి వారట తాతయ్యతో కలిసి చాలాసేపు, చాలా ఆత్మీయంగా మాట్లాడారు. మీరు పదిహేను సంవత్సరాలు ఆ ఊరిలో ఉన్నారట కదా! ఎందుకు, చాలామంది ఊళ్ళళ్ళ నుంచి హన్మకొండకొస్తే మీరెందుకు ఊరికి వెళ్ళారు తాతమ్మా!
శాంతాదేవి : మీ తాతయ్యనే అడుగక పోయావానే సీమ టపాకాయ్.
జ్యోతి : అది కాదు తాతమ్మా! నీ కొడుకు కొంత చెప్పేసి నీ కెందుకే వివరాలు అని అధరగొడతాడు. నీ దగ్గరున్నంత మాలిమి, చనువు నాకెవ్వరి దగ్గరా లేవు. అందుకే నిన్ను అడుగుతున్నాను.
శాంతాదేవి : సరేనే నా తల్లి. ఆ రోజుల్లో మా మావగారికి మీ ముత్తాతగారికి ఏవో పొరపొచ్చాలు, పట్టింపులు వచ్చి మా మామగారు, మీ ముత్తాతగారిని ఊరి భూముల సేద్యానికి పంపించారు. అక్కడ మీ ముత్తాతగారు అందరితో మంచిగా వుండి మంచి పేరు తెచ్చుకున్నారు. మేము ఊరికి వెళ్లిన తర్వాతే అక్కడ విద్యుత్ సౌకర్యం, తారు రోడ్లు వచ్చాయి.
జ్య్తోతి : మరప్పుడు నీవు గోల చేయలేదా, తాతమ్మా.
శాంతాదేవి : ఆఁ ఆ రోజుల్లో అత్తమామలకీ, భర్త, ఆడబిడ్డలకీ ఎదురు చెప్పలేదు. మా రోజుల్లో పద్ధతులావిధంగా ఉండేవి. మెల్లమెల్లగా మన ఊరు కూడా పట్టణంలో కలిసిపోయింది. అక్కడ కళాశాల, ఇంగ్లీషు మీడియం హైస్కూల్స్ వచ్చాయి. అంతకుముందే ఉన్న ప్రభుత్వ పాఠశాల క్రమక్రమంగా ఉన్నత పాఠశాలయింది.
జ్యోతి : ఓహో, అందుకేనా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళకు ఆ ఊరిలో స్నేహితులున్నారు. ఆ ఊరితో చనువెక్కువన్న మాట.
శాంతాదేవి : ఔనే, క్రమక్రమంగా ఊళ్ళో పిల్లలందరూ చదువుకొని ఉద్యోగరీత్యా అంతటా వ్యాపించారు. మీ ముత్తాత దగ్గర చదువుకున్నవారు చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ రోజుల్లో పండుగలంటే ఊరంతా కలిసిమెలిసి కలిమిడిగా బాగా జరుపుకునేవాళ్లం.
జ్యోతి : ఐతే తాతమ్మా! అక్కడ అమెరికాలో అంటే మా దగ్గర కొంతమంది పిల్లలకు, తల్లో, తండ్రో ఒకరే ఉంటారు. ఇక్కడ ఆ పద్ధతులింకా రాలేదా!
శాంతాదేవి : ఏమోనే, బొంబాయి, హైదరాబాదుల్లో వచ్చినట్లుంది. ఇక్కడ కూడా అక్కడక్కడ ఉందేమో నాకు తెలియదు. ఐనా అటువంటి పద్ధతులు మంచివి కావు. పిల్లలకి తల్లిదండ్రులిద్దరి అవసరం, ఆజమాయిషీ కావాలి.
జ్యోతి : తాతమ్మా! మీ మామగారి నుంచి నీ మనవడి వరకు పరిస్థితులు ఎలా మారాయో, మీ పరిశీలనలేంటో తెల్పండి.
శాంతాదేవి: ఏముందే ఆస్థులు తరిగాయి. అంతస్థులు పెరిగాయి. మా మామగారు ఫ్యూడల్ ప్రజాస్వామ్యవాది. మూడు ఊళ్ళలో ఆస్థులుండేవి. ఎక్కువగా కాలినడకన, ఎప్పుడో కాని రిక్షాలో వెళ్ళేవారు. రెవిన్యూ విషయాలు, కరణీకం, కోర్టు వ్యవహారాలు ఎప్పుడూ వారికి చేతినిడా పని. ఆయన సైకిల్ కూడా వాడలేదు. కానీ పెద్దొర, పెద్దొర అని చాలా పేరు ప్రతిష్టలు ఉండేవి. ఇంక ఆయన కొడుకులు ముగ్గురూ బడిపంతుళ్ళే. ఫ్యూడల్ వాసనలు పోని ప్రజాస్వామ్యవాదులు. ఇంక మీ తాతయ్యలు, అమ్మమ్మలందరూ సోషలిస్టు ప్రభావజాలంతో స్నేహితులతో మెదిలి పెద్ద చదువులు చదివి ఉద్యోగస్థులయ్యారు, ఇంక మీ నాన్నలు విదేశాల్లో స్థిరపడి, మీరు అక్కడే పుట్టారు. మా మావగారి హయాంలో ఎందరో రాజకీయ నాయకులు, కవులు మన ఇంటి దగ్గరికి వస్తుండేవారు. బంధువులు కూడా బాగా వచ్చేవారు. ఐతే ఆ చుట్టరికాలు, కలిమిడులూ, కలుపుగోలు తనాలూ, ఆస్థులూ అన్నీ తగ్గిపోయి, కార్లూ, ఫ్లాట్లూ, ఉద్యోగాలూ, విదేశాలకు వలస వెళ్లటాలూ పెరిగాయి. మీ ముత్తాతలు సైకిలు పైబడులకెళ్లేవారు. మీ తాతల హయాంవరకు బండ్లు వచ్చాయి. మీ నాన్నల కాలానికి కార్లు వచ్చాయి. నీ తరానికి విమానాలూ, హెలికాఫ్టర్లు వచ్చాయే సీమటపాకాయా!
జ్యోతి : హమ్మ! ఎంత మార్పు చెప్పావు తాతమ్మా, మరి మీ కాలంలో మీరు ఎలా వెళ్లగలిగారు?
శాంతాదేవి : మాకు మొద్దుబండ్లు, సవారి కచ్చరాలుండేవి. ఆ తర్వాత టాంగాలు, రిక్షాలుండేవి. బస్సులు, ఆటోలు ఆ తర్వాత వచ్చాయి.
జ్యోతి : మరిప్పుడు తాతమ్మా! మీ మావగారి తరం నుంచి నా వరకు ఎన్ని తరాలయ్యాయి. ఊ…..1,2,3,4,5 తరాలయ్యాయి. ఇంక రెండు తరాలయితే ఏడుతరాలౌతుంది కదా.
శాంతాదేవి : ఆఁ అటు ఏముందీ మా మావగారి తండ్రిగారు గ్రామ కరణం. మా మావగారు పట్నం ఇల్లరికపు టల్లుడు. దాంతో పట్నం కర్ణీకం కూడా మా మావగారికే వచ్చి చేరింది. మా మావగారి తల్లికి అన్నదమ్ములు లేరు. వాళ్లిద్దరూ అక్క చెల్లెలు. అందువల్ల మా మామగారి తల్లి ద్వారా కూడా ఆస్థి సంక్రమించింది.
జ్యోతి : భలే, భలే, తాతమ్మా, మీరూ తాతయ్యలూ మాత్ర సంబంధ ఆస్తి అనుభవించారు. మరి మీ తరానికీ యిప్పటి తరానికీ ఆడవారి విషయాల్లో తేడాలేమిటి?
శాంతాదేవి : ఎందుకు లేవే, హస్తిమశకాంతరం ఉంది. మా అప్పుడు చదువులే లేవు. మీ బామ్మలు, అమ్మమ్మలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేశారు. మీ అమ్మలు, అత్తయ్యలు సరేసరి. ముందంజలో ఉన్నారు. మీరు ఇంకా మంచి పరిస్థితుల్లో ఉన్నారు.
జ్యోతి : తాతమ్మా! చాలా మంచి విషయాలు చెప్పావు. ఇది కథో, వ్యాసమో వ్రాసిం తర్వాత నీకు పంపిస్తా!!!
శాంతాదేవి : సరేనే తల్లీ, జాగ్రత్తగా విశ్లేషిస్తే, ఇది ఏడు తరాల భోగట్టా ఔతుంది. సరే, సరే!! ఇంక అన్నం తిని విశ్రాంతి తీసుకో. మీకు అన్నీ ప్రయాణాలే కదా!!!!
జ్యోతి: పరవాలేదులే, ఇంకా చెప్పవా, మరి తాతమ్మా !! ఇలా మూడు ఊళ్ళ ఆస్థి చేరితే మీ కుటుంబంలో డాక్టర్ , ఇంజనీర్లు , లాయర్లు తయారు కాలేదా
శాంతాదేవి: అప్పట్లో స్వాతంత్ర్యం వచ్చి దేశం అప్పుడప్పుడే కుదుటపడుతోంది. ఆకాలంలో మీ ముత్తాతలు ఆ మాత్రం చదువుకొని ఉద్యోగాలు చేయడమే ఎక్కువ. నేనింతకుముందు చెప్పినట్లు ఆ ప్రజాస్వామ్య భావాలు దేశపరిస్థితుల గురించి ఇంట్లో చిన్నగా చర్చలు జరిగేవి. కమ్యునిస్టు నాయకులు మనింటికి వచ్చేవారు. ఎక్కువగా ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు.మన బంధువులందిరివిషయాలు ఇక్కడే అందరికీ తెలిసేవి. అందుకే అప్పట్లో ఈ ఇంటిని ఆలిండియా రేడియో అనేవారు.ఇల్లు
జల్ జలాటంగా సాగింది. వాళ్ళ నెల వారీ ఖర్చు ఈ ఇంటి చాయనీళ్ళ ఖర్చంత కాదని పేరు పోయింది.
ఇప్పుడేముందే ఉద్యోగాలున్నాయి. ఉద్వేగాలు పెరిగాయి.
రాను రాను సమాజంలో హింస , దౌర్జన్యం పెరిగిపోయాయి. మూర్ఖత్వం , భీభత్సం మూర్తీభవిస్తే ఏ ఉద్యమమైనా ఈ ప్రజాస్వామ్య యుగంలో అణిచి వేయబడుతుందే తల్లీ. ఏదైనా విచక్షణ తో అందర్నీ కలుపుకుపోయేదిగా ఉండాలి.
జ్యోతి : ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు ల్లో చాలా యేళ్ళు పట్టేదట కదా
శాంతాదేవి: ఔనే తల్లీ ! ఇదేమిటే నీ పొట్టనిండా ప్రశ్నలే ఉన్నాయేమే ,నీ పొట్ట ఓ ప్రశ్నల పుట్టయిందే తల్లీ.
జ్యోతి: తాతమ్మా మా స్కూల్లో నేను NTRగారి డైలాగులతో సుయోధన ఏకపాత్రాభినయం చేశాను . తెలుగు రాకున్నా మా బడి పిల్లలంతా నా హావభావాలు ఉచ్ఛారణ , అభినయం బాగున్నాయని మెచ్చుకున్నారు తాతమ్మా.
శాంతాదేవి: ఆహా ! అట్లానా ,నీకు భారత రామాయణాలు ఏం తెలుసే బుడంకాయా ?
జ్యోతి: ఆ( అందులో ఏముంది తాతమ్మా కుటుంబంలో ఐకమత్యత లోపిస్తే అష్టకష్టాలపాలవుతారనీ పాపం వ్యాసవాల్మీకులు ఎంతో ఓపికగా పురాణేతిహాసాలుగా మలచి మనకందించారు. మన దేశంలో కుటుంబ విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని అమెరికా వంటి దేశాలకు చాలా ఆశ్చర్యం తెలుసా.
శాంతాదేవి:ఏమే బుడంకాయ , నువ్వెంత ,నీ వయసెంత అన్నీ పెద్ధ పెద్ద మాటలు మాట్లాడుతున్నావేమే.
జ్యోతి: నీ మనవడు అదే మా నాన్నే విడువకుండా , వదలకుండా రోజూ అరగంటపాటు మన విషయాలన్నీ ఇండియా గురించి చెప్పి నేర్పిస్తున్నాడు తాతమ్మా.
శాంతాదేవి: అసలివన్నీ ఎందుకు చెప్పాడట నీకూ!!!?
జ్యోతి: అదే తాతమ్మా కౌరవ పాండవులు కలిసి మెలిసి ఐకమత్యం గా ఉంటే కర్ణ,శకునిలు , కృష్ణుడు లాంటి వారికి జోక్యం చేసుకునే అవకాశమే రాదనే వారు.
శాంతాదేవి: సరే ఇగ అది అలా జరిగితే భారతమే ఉండేదికాదు. భగవద్గీత, విష్ణుసహస్రనామాలు వచ్ఛేవే కావు ,కానీ సరే జరిగిన దాని గురించి గుణపాఠాలు తెలుసుకుని ప్రతి కుటుంబం ఐకమత్యం తో అభివృద్ధి సాధించాలి.
జ్యోతి : థ్యాంకూ తాతమ్మా, చాలా విషయాలు చెప్పావు. ఆ కాలపు విషయాలను ఈ కాలంలో ముడిపెట్టక తేడాలన్నీ పోయేటట్లు చెయ్యాలని నా ఆలోచన తాతమ్మా! భారతదేశమే ఒక పెద్ద కుటుంబం లాంటిది కదా తాతమ్మా!
తాతమ్మా : ఔనే! మారుతున్న కాలం విలువను ఇద్దరూ మనస్సులో తర్కించుకుంటూ బాగా చెప్పావు.
ఇక పడుకో తల్లీ!!
నిద్రలోకి జారుకున్నారు. రేపటి వెలుగులు స్వాగతిస్తుంటాయని వాళ్లకు తెలుసు!
