”మానవతా జన్మప్రదాత మాన్య గురువర్యుడు”
రచన : మహామహోపాధ్యాయ డా. పుల్లెల రామచంద్రుడు
ప్రచురణ : పావని సేవాసమితి ఎస్.ఆర్.టి. 270
సనత్ నగర్, హైదరాబాదు-500018, ఫోన్ : 23702898
ఈ పుస్తకానికి అట్ట చివర ఉన్న అమృత గుళికలు ఆస్వాదించండి.
”ఉపాధ్యాయుడు – విద్యార్థి గురువు – శిష్యుడు
ఆచార్యుడు – అంతేవాసి
ఇలాంటి మహత్తర పదజాలానికి అర్థమే లేకుండా పోతున్న ఈ సంకుల సమర సంధి యుగంలో ఆ పదాలకు గల అసలైన లోతులను, ఆ పదవులకు గల బాధ్యతలను, ఆ ప్రవృత్తులకు గల ఫలితాంశాలను… సమగ్రంగా, సప్రమాణంగా… మహామహోపాధ్యాయ సుగ్రహీత నామధేయుడైన పుల్లెల రామచంద్రుడి గారి లేఖిని చిందించిన అమృతపు జల్లులే ఈ పుస్తకంలో మీకు ముత్యాల గుళికలై దొరుతుతాయి…”
పుస్తకం యొక్క పేజీల సంఖ్యను బట్టి చెప్పాలంటే ఈ గ్రంథంలో మొత్తం పేజీలు పద్దెనిమిది (18) కంటే అతి చిన్న పుస్తకం. కాని విషయ సంపదలో ఇది మహోన్నత గ్రంథం. చెప్పిన విషయాలు గాని చెప్పబడిన విధంగాని ప్రతి మాట ఒక వజ్రాల మూట. అందుకే ఇలాంటి గ్రంథాన్ని అందరూ చదవాలన్న ఉద్దేశ్యంతో ఈ గ్రంథాన్ని పాఠకుల ముందు ఉంచుతున్నాను.
ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలను క్లుప్తంగా, విషయ లోపం రాకుండా అందించడానికి ప్రయత్నిస్తాను. మానవుడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎన్నుకొన్న మార్గాలలో శబ్ద శక్తి ప్రధానమైనది. అందుకే దండి అనే మహాకవి – శబ్దం, అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేసే ఒక మహా తేజస్సు అని అని అది లేకపోయినట్లయితే మూడు లోకాలు అజ్ఞాన తిమిరంలో మునిగిపోయి ఉండేవి అని అంటాడు.
”ఇది మన్ధం జగత్ కృత్స్నం జాయేత భువన త్రయమ్
యది శబ్దాహ్వయం జ్యోతిః అసంసారం న దీప్యతే” – కావ్యదర్శం.
భారతీయ తత్త్వ శాస్త్ర ప్రకారం జ్ఞానమే భగవంతుడు (బ్రహ్మ), భగవంతుడే జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని ప్రజలకు, అంటే విద్యార్థులకు అందించే గురువులు జ్ఞానప్రదాతలు. అట్టి గురువులను గూర్చి గురుశిష్య సంబంధాన్ని గూర్చి ఈ గ్రంథం ముఖ్యంగా వివరిస్తున్నది.
తహతహలాడుతూ, తాను సంపాదించిన జ్ఞానాన్ని అందుకోవడానికి సత్ప్రవర్తన గల విద్యార్థులు తమ వద్దకు రావాలని ప్రార్థిస్తూ గురువులు ఈ క్రింది విధంగా మంత్రాలు చదువుతూ అగ్నితో హోమాలు చేసేవారని తైత్తరీయోపనిషత్తు చెప్తున్నదని పుల్లెల వారు తెల్పారు.
అ మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా
వి మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా
ప్ర మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా
ద మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా (తై.ఉ. 7.4)
చిత్త దోషాలు లేకుండా, ఇంద్రియ నిగ్రహం గల్గి మేధాశక్తి మొదలైన సద్గుణాలు గల విద్యార్థులు పలు దేశాల నుండి వచ్చి అనేక సత్ఫలితాలనిచ్చే విద్యలను నావద్ద నేర్చుకొందురు గాక అని గురువు ఉత్తమ విద్యార్థుల కొరకు భగవంతుని ప్రార్థించడం వల్ల జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తున్నది.
గురువు – ఆచార్యుడు
గురువు : విద్య నేర్పించేవారు రెండు రకాలు. ఒకరు గురువు. ఇతడు తను నేర్పించవలసిన శాస్త్రజ్ఞానాన్ని విద్యార్థులకు కక్షుణ్ణంగా నేర్పి, వారిని ఆ శాస్త్రంలో సుశిక్షితులను చేస్తాడు. ఇతడు ఉత్తమ గురువు లేక ఉపాధ్యాయుడు.
ఆచార్యుడు : విద్యార్థులకు తాను బోధించాల్సిన శాస్త్రాన్ని మాత్రమే గా సందర్భానుసారంగా అనేక మంచి జ్ఞాన సంబంధితమైన విషయాలను కూడా బోధిస్తూ, అంతటితో ఆగక తాను ఒక నిర్దుష్ట జీవన విధానాన్ని గడుపుతూ, ఆ విధానం ద్వారా విద్యార్థుల మనస్సులలో గొప్ప క్రమబద్ధమైన, సంస్కార వంతమైన భావనలు కల్గించి, వారు సన్మార్గంలో నడిచేలా కృషి చేసేవారిని ‘ఆచార్యుడు’ అంటారు.
ఇక మూడవరకం ఉపాధ్యాయులను గూర్చి పుల్లెల రామచంద్రుడు గారు వివరించారు. సమ సామయికమ్ కివే గ్రంథంలో గల ఒక శ్లోకాన్ని ఉటంకించారు.
”మూర్ఖః సృజేదుపాధ్యాయః మూర్ఖ శిష్యు పరమ్పరామ్.
యోగ్యా ఏవ స్యురా చార్యాః దేశ శ్రేయోయదీపి”
మూర్ఖుడైన ఉపాధ్యాయుడు ఎంతోమంది మూర్ఖ శిష్యులను తయారుచేస్తాడు. కాబట్టి దేశ శ్రేయస్సు కోరేవారు యోగ్యులైన ఉపాధ్యాయులనే నియమించాలి. విద్యను గూర్చి వివేకానందుడు చెప్పిన దానిని తన రచనలో పొందుపరిచి, విద్యావిధానం ఎలా ఉండాలో సూచించారు. అధిక సుఖాల కోసం సంపాదన కోసం ఉపయోగించే విద్య ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉన్నా కొంతకాలానికి అది చాలా నీచమైన స్థితికి దిగజారుతుందని, అసూయ, ద్వేషాలు, శుక్లాగ్ని కీలల వలె విజృంభిస్తాయని వివేకానందులు బోధించారు.
2005వ సంవత్సరంలో జాతీయ విద్యా విధానానికి సంబంధించిన యథాతథ పత్రం (పొజిషన్ పేపర్) లోని సారంశమిది. ”పరాకాష్ఠకు చేరిన స్వార్థం” అనే ఛేదించరానిపాశంలో విద్య చిక్కుకొని ఉందని సర్వోన్నతిని సాధించాలనే తపనతో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న బంధం దెబ్బతిన్నదని, పిల్లలకు తలిదండ్రుల బెదిరింపులు, ఉపాధ్యాయుల హేళనలు- వీటివల్ల పిల్లలలో ఆందోళన, ఆత్మహత్యతలు సాహస ప్రవృత్తి పెరిగిపోయి విద్య యొక్క లక్ష్యం, విలువ దిగజారిపోయిందని తెల్పింది. అతి స్పర్థ అన్ని అనర్థాలకు కారణాలని తీర్మానించింది.
గురువు యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్తూ ఒక చక్కని ఉదాహరణ పుల్లెల వారు ఒక శ్లోకం నుండి చూపించారు.
”దృష్టాన్తో నైవ దృష్టస్త్రి భువన జఠరే….” అనే శత శ్లోకిలోని ఈ సారాంశం. పరుసవేది ఇనప ముక్కను బంగారుగా మారుస్తుంది. కాని బంగారుగా మారిన ఆ ఇనుప ముక్క మరొక ఇనుప ముక్కను బంగారుగా మార్చలేదు. కాని ఒక గురువు వద్ద జ్ఞానం పొందిన శిష్యుడు తాను మరికొంత మందిని శిష్యులను తయారు చెయ్యగలడు. అందుకే గురువుకు సాటి ప్రపంచంలో మరేదీ లేదు” అని ఆ శ్లోకార్థం.
అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటుంది భారతం.
”జ్ఞానము కేవల కృషన, జ్ఞానికి నుపదేశ విధి ప్రకాశము సేయం
గానది సకల ధరిత్రీ దానంబున కంటె నధిక
తర ఫలదమగున్” (భారతం-శాంతి.ప. 4-255)
ఈ భూమినంతా దానం చేసిన దానికంటే విద్యాదానం గొప్పది అని అర్థం.
కొన్ని మంచి సాంప్రదాయాలను ఈనాడు మూఢనమ్మకాలు అంటూ కొట్టిపారెయ్యడం ఫాషన్ అయిందని చెబుతూ పుల్లెల వారు ”There is superstition in avaoiding superstitions (ప్రతిదీ మూఢనమ్మకమే అని గోల చెయ్యడం ఒక పెద్ద మూఢ నమ్మకం) అనే ఒక ఆంగ్ల మేధావి మాట గుర్తు వస్తుంది’ అన్నారు. బాగా ఆలోచిస్తే ఈ ఆధునిక యుగంలో ఎన్నో వైజ్ఞానిక, (సైంటిఫిక్) మానసిక, రాజకీయ మొదలైన మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయి అంటారు పుల్లెల వారు.
పిల్లలకు మితిమీరిన స్వాతంత్య్రం ఇవ్వడం, అత్యంత ప్రమాదకరం అంటాడు రామచంద్రుడు గారు. పిల్లలను దండించడం కొట్టడం మంచిది కాదని ఒక వాదం ఉంది. అది మంచిదే కాని క్రమశిక్షణ నేర్పడం తల్లిదండ్రుల, గురువుల బాధ్యత. ఆ సందర్భంగా దండించవలసి వస్తే అప్పుడు కొట్టే దెబ్బ అమృతం పూసిన చేతితో వేసే దెబ్బే కాని విషం పూసిన దెబ్బ కాదని ”సామృతైః పాణిభి” అనే శ్లోకం చెప్పిన విషయం పుల్లెల వారు తెలిపారు. సన్నతాడుతో తిన్నగా కొట్టాలని, సున్నితంగా దండించడం వల్ల పిల్లలలో ఎన్నో సద్గుణాలు పెరుగుతాయని గుర్తు చేశారు. కఠినంగా శిక్షించే గురువులను రాజు దండించాలని తెల్పారు.
”శిష్యోపాధ్యాయికా…..” అనే సంస్కృత భారతంలోని శ్లోకం గురు శిష్యుల మధ్య సత్సంబంధాలు నెలకొని నిరంతరం విద్యాభ్యాసం జరిగి దేశమే సంపన్న దేశమని తెల్పింది. వివిధ శాస్త్ర పరిచయం వల్ల విద్య వికసిస్తుంది.
”ప్రజ్ఞా వివేకం లభతే…” (వాక్యపదీయమ్ – 2-484)
చివరగా, గురువు – శిష్యుడు వీరి మధ్య ఉండవలసిన బంధం గురించి ఒక శిష్యుడు ఏ విధంగా తలుస్తాడో తెలిపే ప్రసిద్ధ శ్లోకంతో తన రచనకు పరిపూర్ణత్వం సిద్ధింపజేశారు ఆచార్యుల వారు. అదే, మహామహోపాధ్యాయ, ఆచార్య డా. పుల్లెల రామచంద్రుడు గారు.
సహనావవతు, సహనౌ భునక్తుః సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు, మావిద్విషావహై
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః” – ”నన్ను, నా గురువును విద్య రక్షించు గాక. మాకిరువురికి విద్యాఫలము చేకూరేటట్లు బ్రహ్మ చేయుగాక. మేము ఎప్పుడూ ఒకరికొకరం ద్వేషించుకోకుండా ఉందుము గాక….”
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః
