(మయూఖ 2026 జనవరి పత్రిక ఎడిటోరియల్)
సంపాదకీయం
( 2025 నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం)
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ పత్రిక ఎడిటర్
కొత్త బంగారులోకం, నా బంగారు కొండా, బంగారమసొంటి గుణం, ఆ ముచ్చట్లు వివరంగా చెప్తే నీ బంగారమేం పోయింది, బంగారం వంటి జీవితం తాగి తాగి నాశనం చేసుకున్నారు – ఇటువంటి మాటలు ఎందుకు వచ్చాయి? ఆ వివరాల్లోకి వెళ్తే…
బంగారం అనే లోహం అన్ని లోహాలలో చాలా చాలా విలువైన లోహం. ఒక భారమైన మూలకం. ఎక్కువ స్థితిస్థాపక గుణం కలిగి ఉండే ఖనిజం. బంగారం కాఠిన్యత ను పరిగణలోకి తీసుకుంటారు.
Au అనే చిహ్నంతో శాస్త్రీయంగా పిలువబడే బంగారం ఒక విలువైన లోహం. శాస్త్ర ఆవర్తన పట్టికలో 11వ సమూహానికి చెందిన మూలకం. బ్యాటింగ్ లో Aurun అంటారు కాబట్టి Au అనే పేరుతో రసాయనికంగా పిలిచే ఈ లోహం మూలవర్తన లోహం. ఈ లోహం మెత్తగా ఉంటుంది ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.
ఆమ్లాలకు విడిపోయి ఏ చర్యకు గురికానటువంటి కరగనటువంటి బంగారం కాబట్టే ఇంత విలువ.
అయితే ఇటువంటి విలువైన ఈ బంగారం అనే లోహం పాదరసంలో హైడ్రోక్లోరిక్ నైట్రిక్ ఆమ్లాలతో కలిపిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది. బంగారం, పాదరసం కలిసిన ధాతు మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. మేలిమి బంగారం అంటే పసుపు పచ్చని వర్ణంతో ఎక్కువ సాంద్రతతో ఉండే మెత్తని లోహం. ఇది అత్యంత విలువైన లోహాల లో ఒకటి.
ఇతర ఆమ్లాల చర్యలకు రసాయనిక మార్పుచెందని లోహం కాబట్టే బంగారం అంటే ఇంత మోజు కలగడానికి కారణమేమో. ఒక హౌస్ బంగారం నుండి దాదాపు 50 మైళ్ల పొడవైన తీగను తయారు చేయవచ్చు రేకుగా సాగదీయవచ్చు , కడ్డీల రూపంలో, బిస్కెట్ల రూపంలో నిలువ చేయవచ్చు. సాధారణంగా బంగారాన్ని karats , కారెట్స్ లలో తూకం వేస్తారు. బంగారం స్వచ్ఛత అనేది ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఫైన్నెస్
fineness ఎంత ఉంది తెలుసుకోవాలని చూడడానికి ఉపయోగిస్తారు. గ్రాములు, కిలోలు కారెట్ల కొలతల్లో చెబుతారు. చాలావరకు 24 కారెట్ ఉంది అంటే అది కల్తీ లేని బంగారమని అర్థం. కాని, దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. అందుకే ఎటు అంటే అటు మలిగి, గట్టిగా ఉండడానికి బంగారానికి రాగి గాని వెండి గాని ఏదైనా లోహాన్ని ఓ 2 భాగాలు కలిపి 22 కారెట్ల కు సిద్ధం చేసి వస్తువులు తయారు చేస్తారు. భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయాల నేల పొరలలో తక్కువ ప్రమాణంలో నిక్షిప్తమై ఉండే బంగారు నిధులు ముఖ్యంగా ప్రధమ శ్రేణి ద్వితీయ శ్రేణి నిలువలుగా చెబుతారు. భూమి లో ఉండే ‘ మాగ్మా ‘ లో బంగారం ఉంటుందని ద్రవ రూపంలో ఉన్న బంగారం అవక్షేప శిలలలో నిలుస్తుందని , రాతి పొరలలోను చేరి ఉంటుందని చెప్పడం చూస్తాం.
ఈ మెత్తటి లోహంలో వేరే లోహాలను కలిపి దృఢంగా చేసి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
పూర్వకాలం నుండి బంగారాన్ని వాడుకలో కి తెచ్చుకున్నారు ప్రజలు. శిలాజాలను తవ్వి బంగారాన్ని నిల్వ చేసుకునే వాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తు మారక ద్రవ్యంగా కూడా ఉపయోగించేవాళ్ళు. ముఖ్యంగా వ్యాపారానికే కాకుండా రాజవంశీయులు వాళ్ళ సింహాసనాలను, అలంకరణ వస్తువులను ఎంతో శ్రద్ధగా నిలువ చేసుకునేవాళ్ళు. రాజుల రాణుల సమాధులపై రాజ వంశీయుల సమాధులపై బంగారాన్ని అలంకరణగా పెట్టే అలవాటు ఉన్నవాళ్లంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రముఖంగా ఈజిప్టులోని పురాతన దేవాలయాలలో బంగారాన్ని విరివిగా వాడే వారట.
ఈజిప్ట్ లోని నైలునది ప్రాంతంలో, నోబియన్ ఎడారి ప్రాంతంలో, రెడ్ సి అంటే ఎర్ర సముద్రం ప్రాంతంలో గనులు బాగా ఉన్నట్టు చెబుతారు. ఏమన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా ప్రాంతాలలో బంగారు గనులను త్రవ్వి న చరిత్ర ఉన్నది. ఇకపోతే అమెరికా, కెనడా, రష్యా, జర్మనీ, స్విజర్లాండ్ జపాన్, ఫ్రాన్స్, ,ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, నెదర్లాండ్స్ వంటి దేశాలలో బంగారు నిల్వలు చాలా ఉన్నాయి . అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు ఇవి. ప్రపంచంలో అత్యధిక నిల్వలు ఉన్నాయనే పేరు తెచ్చుకోవడానికి పోటీలుపడి టన్నులు టన్నులుగా నిలువ చేసి పెడతారు.
దేశాల ముఖ్య వ్యాపార లావాదేవీలు ప్రముఖ దేశాల మధ్య జరిగినప్పుడు బంగారం నిలువల ప్రస్తావన వస్తుంది. బంగారం ధర వ్యాపారాలను శాసిస్తుంది. సెన్సెక్స్ లెక్కలు అధికమయ్యాయా? పడిపోయాయా? అనే చర్చల ద్వారా పసిడి ధరలు పెంచాల్సిందే.
అత్యధిక బంగారు నిల్వలు ఉన్న అమెరికా దేశస్తులు ఒంటి మీద నగలుగా ఎక్కువ ధరించరు. అక్కడ 18 క్యారెట్స్ బంగారాన్నే నగలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాస్త చూడటానికి తెల్ల తెల్లగా కనిపిస్తాయి నగలు.
అయితే బంగారు జీవితం అంటే బాగా బంగారు ఆభరణాలు ధరించడం కాదు. వాళ్ల జీవితం పసిడి కాంతులతో కళకళలాడుతుంది అంటే అందరూ బంగారం తో అలంకరించుకోవడం, ఇంట్లో అంతా బంగారు వస్తువులతో నింపడం కాదు.
ఆరోగ్యకరమైన , సంస్కారవంతమైన జీవితం ఉంటే బంగారు బతుకు అంటారు. బంగారం అంటే పసిడి అనీ కనకము అని కదా అర్థాలు. ” కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట శుభ లగ్నమునన్” మనకో పద్యం కూడా ఉన్నది కదూ..
” పసిడికి తావి అబ్బినట్టు ” అనేది ఓ సామెత. తావి అంటే సువాసన. అతనికి గానీ ఆమెకు గాని చక్కని అందం తో పాటు మంచి గుణాలు ఉంటే ఈ సామెత ను ఉపయోగిస్తాం. ” కల్ల పసిడికి కాంతి మెండు” అంటే, False gold is very bright అదే… All is not gold that glitters అంటారు . కల్ల పయిడికి గరుకులు మెండు False gold is very rough అని , కూడా ఓ సామెత ఉన్నది. సామెత లు ఎందుకు ఆమెతలు అంటారో ఇలాంటివి చదివితే తెలుస్తుంది. ఇవి అసలు బంగారు జీవితానికి వ్యాఖ్యానాలు. పసిడి మనసులు అంటాం. సాధారణంగా చిన్నారులను చూస్తే!!! కదా! ఏ సంఘర్షణ లు లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు తెలియని పిల్లలు కాబట్టి.
ఇక ప్రస్తుతానికి వస్తే, ఎవరు ప్రమాదపు అంచుల్లో ఉన్నారు? ఎందుకు ? ఈ ప్రశ్న లు చాలా విలువైనవి. బంగారంలా విలువైనవి. బంగారం కన్నా విలువైనవి.
బంగారం ధర బాగా పెరగడం వల్ల దొంగతనాలు దోపిడీ లు ఎక్కువయ్యాయి. ముందు ఇంతగా దొంగిలించేవాళ్ళు కాదు. కానీ,
ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారు నగల వ్యాపార ప్రకటన లకు సంబంధించిన ఫోటో లు పెట్టడం వల్ల సమాజానికి చేరువవడంతో అందరు ఆకర్షితులవుతున్నారు . అంత షో చేయడం, ప్రాపగాండా చేసుకోవడం . ఇవన్నీ అవసరమా? అసలే నేరప్రవృత్తి బాగా పెచ్చుమీరుతున్న రోజులు ఇవి. అసలే ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం సగటు జీవుల బ్రతుకు లను అతలాకుతలం చేస్తున్నాయి. దారిద్ర్యం రేఖ కు మరీ దిగువనున్న సామాన్యులు ఉన్నారు. ఎటునుంచి ఎటు మారుతారో తెలియదు. ప్రమాదం అంచుల్లో ఉన్నది సమస్త మానవ జాతి. అందుకే తస్మాత్ జాగ్రత్త!!
_____*****_____
సెప్టెంబర్ మయూఖ పత్రిక ఎడిటోరియల్
గుడ్డి దీపం కింద కూర్చొని చదువుకున్నాను అని చదివిన జీవిత చరిత్రలు నిజంగానే గొప్ప ప్రభావం చూపాయి ఆనాడు. తర్వాత స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాను అని వచ్చిన మోనోగ్రాఫ్స్ కూడా అంతే ప్రభావం చూపాయి. ఆ గుడ్డి దీపానికి ఈ స్ట్రీట్ లైట్ కు మధ్యన అంతరం ఏంటో తెలియనివాళ్ళం కాదు. వీధి దీపాలు ఇంటి వెలుగు దీపాలైన తర్వాత శాస్త్ర విజ్ఞానాలు అభివృద్ధి చెందాయి. సాంకేతిక విజ్ఞాన విశేషాలు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు, సర్వర్లు, డొమైన్లు ఇవే వింటున్నాం. రకరకాల కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివే కంటున్నాం. నవీన పరికరాల ఎన్నో ఉపయోగిస్తూ నెట్వర్క్ అనుసంధానంతో కమ్యూనికేషన్ చేయడమనేది చాలా సహజమైపోయింది.
ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. విజ్ఞానం వికాస దశలో ఉన్నది. చంద్ర మండలాన్ని శాసించే స్థాయికి వెళ్లారు. ఊహించని సాంకేతిక పరిణామాలు ప్రపంచం మొత్తం శాసిస్తూ ఉన్న సమయంలో ఇంటర్నెట్ ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. తెలుగులో దీన్ని అంతర్జాలం అని అంటున్నాం. అంతర్జాలం అంటే చాలా విస్తృత అర్థమే ఉన్నది. విమానాలు ఆకాశంలో ప్రయాణం చేసి, వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. వీటికి మన కంటికి కనిపించని రహదారులు వేసి ఉంటాయంటున్నారు . నేల మీద వాహనాలు వెళ్లడానికి ఉన్న దారుల ఎట్లా ఉన్నాయో అట్లాగే విమానాలు వెళ్లడానికి కూడా దారులు ఉన్నాయన్నట్టు! ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించే వల ఎలా ఉంటుందో అలా విస్తరించి ఉంటాయి. అలాగే ఈ సాంకేతిక పరికరాలు ఉపయోగించడానికి వాడుతున్న అంతర్జాల వలలూ ఉంటాయి. ఒక ప్రధాన నగరం నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి గ్రామాలకు గ్రామాలలో కూడా వీధుల్లోకి దారులు ఉంటాయి, బాటలు ఉంటాయి. మళ్లీ వీధుల్లో కూడా ఒక ఇంటికి ఒక ఇంటికి వెళ్లడానికి కాస్తంత చిన్న దారి ఉంటుంది. అలాగే సాంకేతిక దారులు కూడా ఉంటాయి.
అవిగనుక కంటికే కనిపిస్తే, మన కళ్ళతో చూస్తే, బహుశా అల్లిబిల్లిగా అల్లుకున్న ఇనుప తెరలాగా ఉంటుందేమో! ఈ శాటిలైట్ మాయాజాలం తెచ్చింది ఎవరు మనిషి విజ్ఞాన జిజ్ఞాసనే కదా!
ముసలి వాళ్ళ నుండి చిన్న పాపాయిల వరకు ఫోన్ వాడకానికి అలవాటైన ఈ కాలాన్ని సమీక్షించుకోవాలంటే సమగ్ర విశ్లేషణ చేసుకోవాలంటే టెక్నాలజీ సంబంధిత విషయాలు ఎలా తెలియాలో మనుషుల లోభాలూ, ప్రలోభాల విపరీతాలు తెలియాలి. మనిషి వ్యాపార వస్తువైన వైనమూ తెలియాలి.
కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఎంతో ముఖ్యమై ప్రపంచాన్నే పరిపాలిస్తున్నది. కోట్ల మందిని అనుసంధానం చేయడానికి కోట్ల కంప్యూటర్లను వాడుతున్నారు. శాటిలైట్ లకి రకరకాల మిషన్లను అమర్చి సర్వర్లు కంప్యూటర్లు వంటి సాఫ్ట్వేర్ పరికరాలతో ప్రోగ్రామ్స్ ను అందజేస్తూ టెక్నాలజీ గుప్పట్లోకి మనిషి వెళ్ళిపోయి చాలా ఏళ్లవుతోంది.ట్రాన్స్మిషన్స్ తో కంట్రోల్ చేస్తూ ఏ సాంకేతికతకు ఎటువంటి నియమాలు ఉన్నవో ఆ నియమాలను అనుసరిస్తూ అనుసంధానం చేసే విధానాన్ని ఇంటర్నెట్ విధానం అంటాం. ఫోన్ లుచేయడం ఈమెయిల్ చేయడం చాటింగ్ చేయడం రకరకాల వీడియో కాన్ఫరెన్స్ చేయడంతో సంభాషించడము, ముఖ్య సందేశాలను పంపించడం జరుగుతున్నది. అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు నెట్వర్క్ ఈ ఇంటర్నెట్. ప్రతి ఇంటర్నెట్ కు సంబంధించిన విజ్ఞానానికి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఇవన్నీ నియంత్రణలోనే ఉంటాయి. ఎక్కడైతే ఎప్పుడైతే వేరే మార్గాల్లోకి వెళ్తున్నాయో అది పసిగట్టగలిగే నేర్పు కూడా ఈ ఇంటర్నెట్ వాడుకంలో ఉంది. కాబట్టి ఇంటర్నెట్ లేకుండా మనిషికి జీవనం లేదు అనే సత్యాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు నిఘా కళ్ళతో చూస్తూ కంట్రోల్ చేయవలసిన అవసరం కాస్త ఇప్పుడు అగత్యమై కూర్చున్నది. భద్రతా విభాగాలు ఎక్కువ చేసి, ఎక్కడెక్కడ అయితే చెడు ప్రవేశిస్తున్నదో అక్కడ ప్రత్యక్షమై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ ద్వారా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీన్నే, ఈ సంస్థనే ARPA అంటున్నారు. ఈ ‘ ఆర్పా ‘ నడపడానికి సరిపోయిన నిధులను ఏర్పరచి ప్రపంచాన్ని కాపాడుకోవాలి. మనవైన ఆనందాలకూ మనవైన దుఃఖాలకూ తోడూనీడైనప్పుడు హృదయ రహస్య కుహరం లోకీ ప్రవేశించి నప్పడూ సంరక్షణ పథకాలు తప్పనిసరవవూ? అవుతాయి. ఈ అడిక్షన్ కంట్రోల్ చేయడం ఎవరితరం కావడం లేదు.
ప్రభుత్వ సేవలకైనా అంటే బిల్లు లు కట్టడం బట్వాడా చేయడం, ప్రైవేట్ విధానాలలో గాని షాపింగ్ చేసే దాంట్లోనూ బ్యాంకింగ్ విధానాలలోను ఆన్లైన్ సేవలు ఊరూరా అందుకున్నాయి. మీడియా అనే పదం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి నోటు వినిపిస్తున్న మాట. మానవ సంఘానికి దశ దిశ ఇంటర్నెట్టే జీవం అయిపోయి కూర్చుంది. ఎప్పుడో దాదాపు 70 దశాబ్దాల క్రిందనే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ ఇంటర్నెట్ మాతృక మొదలైంది. అప్పటినుంచి కొన్ని దేశాలలో కొన్ని పట్టణాలకే పరిమితమైన ఈ సౌలభ్యం భూమి ధృవ ప్రాంతాలకు కూడా చేరుకున్నది పల్లె పల్లెను ఏకం చేసింది.
అసలు ఈ ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కు మధ్యన సూక్ష్మ అంతరం ఉన్నది. కానీ సాధారణంగా ఒకటే పదాన్ని వాడుతూ ఉంటారు.
ఒకప్పుడు ఫోన్ వాడకం కేవలం సమాచారం తెలుసుకోవడానికి ఒకరినొకరు పలకరించుకోవడంతో సరిపోయేది. అటువంటి ఫోన్ అనే పరికరంలోకి మొత్తం సాంకేతికత చేరిపోయి ఇంటర్నెట్ పైననే జీవితాలు ఆధారపడిపోయేలా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పైననే బ్రతుకులు గడిచేలా శాసించిన పరిస్థితులు ఇవి. నువ్వెక్కడుంటే అక్కడ నేను … నువ్వెక్కడికెళ్తే అక్కడికి నేను … అంటూ మన వెనుకే వస్తూ మనవెంటే వస్తూ వాకిట్లోనుండి వెళ్ళిన వైర్లు ఇంట్లోకి వచ్చాయి. వరండా లోగిలి దాటి, హాల్ ను అలంకరించి ఆనందాలు పంచే, నయనానందాలూ పెంచే టీ వి గా మారింది. ఈ రూం ఆ రూం అని లేకుండా గుండె గదిలోకి , సమస్త జన జ్ఞానం లోకి, మనుషుల మనసుల్లోకి చేరింది ఇంటర్నెట్!!
ఇక ఇంటర్నెట్ ఆధారం తో ప్రపంచం గుప్పిట్లో కి వచ్చే అల్ట్రా మాడర్న్ టెక్నాలజీ కి చిరునామా ‘ ఫోన్ యంత్రం’ అయ్యాక పరిణామాలు చాలా విస్తృత మయ్యాయి. నయనాలూ హస్తాలూ మెదడు వారధులై, సారధులై నయా జమానానే నడిపిస్తున్నాయి. ఈ అంతర్వలయానికి చిక్కని ఈ వరల్డ్ వైడ్ వెబ్ మాయాజాలం లో పడని మనిషులే లేరనేంతగా అయిపోయాం. ఆలోచనా ధారలన్నీ వెబ్ సైట్ లో చేరిపోవడం, ముఖం పత్రాలు ముఖ్యమైపోవడం ఇది ప్రస్తుత జీవన చిత్రం. ఇట్లా సాంకేతిక చుక్కలను పేర్చుకుంటూ పోతున్న మనిషి బ్రతుకులో కన్నీటి చుక్క లనూ కొనుక్కుని మనవైన డొమైన్స్ లలో నిక్షిప్తం చేసుకోవాల్సిన పరిస్థితులు ఇవి. ఇక ఇంటి చిరునామా లెందుకు? అంతర్జాల విలాసం ఇస్తున్నాం!
ఇంటర్నెట్ ఎప్పుడు సౌకర్యం కాదు అవసరం అయింది. ఈ అవసరాలలో లాభాలు ఉన్నాయి నష్టాలున్నాయి.
క్షణాలలో లెక్కలు కట్టి జవాబులు చెప్పగలిగిన గణితశాస్త్రం మన గుప్పిట్లో ఉండేది. అద్వితీయమైన ధారణా శక్తితో మెదడునే కంప్యూటర్లలా ఉపయోగించేవాళ్ళు. దత్తాంశాలను ,డేటాలకూ ఇప్పుడంతా గణన యంత్రాలే వాడుతున్నారు! అంతటి జ్ఞాపక శక్తిని హరించి వేస్తున్నది అంతర్జాలం. అనవసరమైన విషయాలను చూస్తూ, అమూల్యమైన సమయం వృధా చేయడం, లేత హృదయాలపై ముదురు నీడలు పడవేస్తూ ఎంత నష్టం చేస్తుందో తెలియని సమాజం కాదు ఇది. అన్ని సమాచారాలనూ నిక్షేపించగలిగే విద్యుత్ ఉపకరణమైన కంప్యూటర్ల ఉపయోగాలు ఎక్కువై కరెంట్ ఉత్పత్తి భారాలు విపరీతంగా పడుతున్నాయి. ఇవన్నీ ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ఇదీ ఆలోచించాల్సిన విషయమే. ఇక అన్నింటినీ మించినవి ఇంటర్నెట్ మోసాలు! బాంక్ లో దాచుకున్న డబ్బు ఎప్పుడు ఎవరు ఎలా హాక్ చేసి కాజేస్తారో తెలియని కష్టాలు వచ్చిపడ్డాయి.సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారు. అన్నీ ఫోన్ కు లింక్ చేయడం వల్ల పెద్ద కష్టమైపోతున్నది. పదిమంది ఉద్యోగులు చేసే పనిని ఒకరిద్దరి తో కానిచ్చేస్తూ నిరుద్యోగులనూ బాధపెడుతున్న వైనమూ తెలుసు.ఏవైనా ‘పెరుగుట విరుగుట కొరకే !’అనే మాటను ఎప్పుడైనా నమ్మాల్సిందే.
Internet తో లాభాలు లేవా?ఉన్నాయి. ప్రపంచ జ్ఞానం పెరిగింది. హాస్పిటల్లో చేర్చాలనుకునేవాళ్ళకు , ఆరోగ్యం ఎలాఉన్నదో తెలుసుకోవాలన్నా, చేర్పించాలన్నా ఇంట్లోనుండే పేరు నమోదుసుకోవచ్చు. ఒకటా రెండా? ఇలాంటివి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వివిధ భాషల్లో వెబ్సైట్ నిర్మించారు అందులో మన తెలుగు భాష కూడా ఉన్నది. Positive thoughts మంచిది కాబట్టి, మన మాతృభాష లో అంతర్జాల మనుగడ సాగిస్తూ, పురోగతిని సాధిద్దాం! హృదయాలను రచించుకుందాం! అంతరంగాలను పంచుకుందాం!!
_____****___
– డాక్టర్ కొండపల్లి నీహారిణి,
మయూఖ ఎడిటర్ ( జూలై మయూఖ పత్రిక సంపాదకీయం) _____________
కవిత్వం రాస్తున్నారా? వ్యాసరచన చేస్తున్నారా? పుస్తకాలు ముద్రించుకుంటున్నారా? వేసుకోండి. వేసుకోవాలి. లేకుంటే ఎలా? లేకుంటే మనవైన భావనలు అక్షరాలలో తొంగి చూస్తూ వెక్కిరించవూ! పుస్తక రూపంలో కి తెచ్చుకోకుంటె, నన్ను అలా వదేలేస్తావా … పట్టించుకోవూ అని సాహిత్యం దిగాలుగా అడుగుతున్నట్టే అనిపిస్తుంది కదూ! ఈ భావనలు, ఈ ఎదురుచూపులు,ఈ ఆవేదనలు భవిష్యత్తులో కోకొల్లలు గా చరిత్ర రికార్డు చేసి పెట్టే రోజులు రానున్నవి. తస్మాత్ జాగ్రత్త! మాతృభాష తెలుగు కోసం పరితపిస్తున్న వాళ్ళ ఆరాటం వెనక ఏముంటుందో ఒకసారి పరిశీలిద్దాం.
భాష నా భవ బంధనం
భాష నా భావ బంధురం
యాసా బాసా నా రెండు కన్నులు
నా రెండు చేతులు రెండు కాళ్ళు!
ఒక్క గుండె కు పద గుంఫన ఫలాలు
ఒక్కో అడుగుకు నవ చేతన బలగాలు!!
ఇది కవులందరి హృదయ శ్వాస హృదయ ఘోష. కాదంటారా? మరెలా రాబోయే కాలంలో ” తెలుగు చచ్చిపోతుంది” అంటే వింటూ ఊరుకుందామా?
ప్రాచీన సాహిత్య చరిత్ర అంతా బాగా వంట పట్టించుకున్న పండితుల కాలం నుండి, భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం అలవాటైన ఆధునిక కాలం వరకు తెలుగు భాషకు ప్రమాదం ఉంచుకొస్తుంది అన్న ఊహ కూడా ఎవ్వరూ చేయలేదు . బహుశా ఆ నాటి క్షీణ యుగంలో ఏ ఆదరణలేక బీరిపోయి పండిత కవులు భావించి ఉంటారు, ఊహించే ఉంటారు. కానీ, కవిత్వం వచన కవిత్వంగా ఉదృతంగా ప్రవహించినప్పుడు, కథలు వ్యాసాలు పరిశోధనలు పుస్తకాలుగా గ్రంథాలుగా వెల్లివిరిసినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. పూర్వకవుల కవిత్వ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ విశ్లేషించిన కవులు ఉండేవాళ్లు. తర్వాత కాలంలో ఆధునిక సాహిత్య వికాసానికి తోడ్పడిన సాహిత్య విమర్శకులు ఉండేవారు. వాళ్లు కవిత పండితులు. వాళ్ళు చెప్పిన వాక్య సొబగులను తలకెత్తుకొని పుస్తకాలుగా విరిసిన సాహిత్యాభిలాషులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాయి. ఈ యజ్ఞం లో మనమందరము ఉన్నాము కాబట్టి, మనమందరము చదివాము, మనమందరము రాసాము కాబట్టి. మరి ఇప్పుడు ? గుట్టలు గుట్టలుగా పుస్తకాలు పేరుకొని పోతాయి కానీ రేపటి రోజు ల్లో చదివే వారు ఉండరు అనే బాధ.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పరనింద ఆత్మ స్తుతి పొంగిపొర్లుతూ పక్క వాళ్ళ కవిత్వాన్ని పట్టించుకోని దుస్థితి వస్తుందని ఎవ్వరంటే ఎవ్వరు ఊహించి ఉండరు.
అరచేతిలో భూతల స్వర్గం ఇమిడిన వింతపోకడల కాలంలో కవిత్వం పలుచబడి , పోటీ తత్వం, భజన పరత్వం అలవడి, అభినందనల కోసం అవార్డుల కోసం అర్రులు చాస్తూ మేధావులను ఆలోచనలో పడేస్తున్నదీ చూస్తున్నాం. సరే ఏదో ఒకటి అక్షరాలనయితే కుమ్మరిస్తున్నారు కదా అని సరిపెట్టుకోవాలా అక్షరాలలో సత్తువ తగ్గిందని బాధపడాలా అర్థంగాని స్థితి.
కవిత్వ సంపద కొరవడితే కొరవడింది గాని భావాలయితే బాగానే ఉన్నాయి. ఏదో విధంగా తెలుగు వెలుగుతున్నదని మిన్నకుంటున్న దుస్థితి.
విరసి తెలుగు భాషకు ఏదో తెగులు పుట్టుకొస్తున్నది అని మాత్రం సమస్త జనావళికి అర్థం అయిపోతున్నది.
ఇక అర్థం కావలసిన సమస్య ఏంటంటే, ఇంతమంది కవులు, రచయితలు, సాహిత్య విమర్శకులు, సినీ జగత్తులో విహరిస్తున్న పాటల తేజోవిలాసమూ, పది రోజులకో పత్రిక పుట్టుకొస్తున్న పత్రికా రంగమూ తెలుసుకోవాల్సిన విషయం సావధానంగా చర్చించుకోవాలి. ఇవన్నీ ఎక్కువ కాలం మన్నికగా నిలవాలంటే తెలుగు భాష అనేది బ్రతికి ఉండాలి కదా!
రేపు మన సాహిత్యాన్ని తలకెత్తుకునే వాళ్ళు ఎవరు? తలకెత్తుకోకుండా సరే బతికించే వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఇంగ్లీషులో చదువుకొని డిగ్రీలు సంపాదించి ఉద్యోగాల్లో డబ్బులు గడించొద్దని ఎవ్వరు
అనడం లేదు, కోరుకోవడం లేదు. తప్పదు కాలానుగుణంగా ఆధునిక విజ్ఞానం వెల్లి విరుస్తున్న ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఇంగ్లీష్ లో చదవాలి, పట్టాలు పొందాలి, పరుగులు పెట్టాలి. ఏమి వద్దనడం లేదు కానీ ఇంత కష్టమైనటువంటి చదువును చదవగల విద్యార్థులకు తనదైన మాతృభాషలో ఒక తరగతి కి ఒక తెలుగు పీరియడ్ ఉంటే చదవలేరు అనే ఆలోచన ఎందుకు వస్తున్నది? అబ్బో కష్టం తెలుగు చదివి మార్కులు తెచ్చుకోవడం అని ఎందుకు అంటున్నారు? పిల్లలు అవలీలగా చదవగలరు చిన్నప్పటినుంచి ఒక క్లాసులో ఒక సబ్జెక్టు గా తెలుగును నేర్చుకుంటే!
ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన సాగుతూ, కేజీ నుండి పీజీ వరకు ఒక విషయం(సబ్జెక్టు) తెలుగు భాష వాళ్ళ వాళ్ళ తరగతి స్థాయిని అనుసరిస్తూ పెంచుతూ పోతుంటే తెలుగు భాష నేర్చుకుంటారు. కనుమరుగు కాదు. ఇలా భాష నేర్చుకునే వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ ప్రక్రియపై ఆసక్తి ఉంటే వాళ్ళు ఆ ప్రక్రియలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని చదివి భవిష్యత్తులో కవులుగా, రచయితలుగా, సాహిత్య విమర్శకులుగా, పాటల రచయితలుగా ఎదుగుతారు. తెలుగు భాష బోధన లో ఉన్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉద్యోగాలు పోవు. రాబోయే కాలంలో కొత్త వాళ్లకు ఈ ఉద్యోగాలు వస్తాయి. అసలు భాష నే కనుమరుగైతే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?
జానపద సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన తర్వాత కదా వెలుగులోకి వచ్చింది. వాళ్లదైన సొంత తెలుగు తీయదనమంతా జనపదుల పాటల్లో కథల్లో దాగి ఉన్నది మొత్తం గుత్తంగా గ్రంథరూపంలో తెచ్చారు కాబట్టే పట్టణంలో మనకు చేరింది.ఆధునిక మాధ్యమాలైన టి.వి., సినిమా, యూట్యూబ్ లలోకి వచ్చిన తర్వాతే ప్రపంచానికి అందింది. అందుతున్నది. ఇందుకోసమైనా తెలుగు రావాలి కదా!
ఇప్పుడు అసలే అత్యంత ఆధునికమైన ఏ. ఐ. వచ్చింది. ఈ కృత్రిమ విజ్ఞానం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ వల్ల తెలుగు బ్రతుకుతున్నది అని అనుకుందామా తెలుగును సమూలంగా నాశనం చేయడానికి ఇది ఒక కారకం అవ్వబోతుంది అని అనుకుందామా అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఇలా వచ్చిన తెలుగు నైనా చదవగలిగే శక్తి మునుముందు మన పిల్లలకు ఉంటుందా అనేదే ఒక పెద్ద ప్రశ్న!
ఆ రోజుల్లో మనము మన తర్వాతి రెండు మూడు తరం వాళ్లమంతా ఇప్పటివరకు తెలుగు భాషలో ఇంతో అంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాం కాబట్టే ఇప్పుడు రచనలు చేయగలుగుతున్నాం. ఇది ఎన్నటికీ మరవద్దు!
తెలుగు ప్రాంతంలో ఉన్న ఒక డాక్టర్ కి పేషెంట్స్ అందరూ ఇంగ్లీష్ వాళ్లే, ఇంగ్లీష్ అర్థం అయ్యే వాళ్లే వస్తారా? చదివిన శాస్త్ర విజ్ఞానమంతా ఇంగ్లీషులోనే ఉండవచ్చు, మెడిసిన్స్ ఇవ్వవచ్చు, ఆపరేషన్స్ చేయవచ్చు కానీ రోగి బంధుమిత్రులతో , అయిన వాళ్లతో దగ్గర వాళ్లతో అనునయించి మాట్లాడడానికి వాళ్లదైన భాష తెలుగులో నాలుగు మాటలు మాట్లాడి అనునయిస్తే ఆ భయం పోతుంది , కొంత ఊరట చెందుతారు. ఒక లాయర్ వాదోపవాదనలు అయిపోయిన తర్వాత గెలుపు ఓటముల సందర్భంలో తెలుగు వాళ్లతో తెలుగులో మాట్లాడితే తొందరగా అర్థం అవుతుంది, బాగుంటుంది కదా! ఒక పోలీసు, ఒక బ్యాంకు ఎంప్లాయ్, వ్యాపారస్తులు, విద్యావేత్తలు అందరూ ఎవ్వరైనా తెలుగు ప్రాంతంలో ఉన్నంతవరకు తెలుగులో మాట్లాడితే తెలుగు ప్రజలు ఆనందిస్తారు. ఈ సాన్నిహిత్యానికి వారధి తెలుగు వాళ్ళకి తెలుగు భాష నే! ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఇది సత్య దూరం కాదు!!
“విద్య యశస్సు ,భోగ కరి, విద్య గురుండు విదేశీ బంధుడు…” కదా! “చదవని వాడజ్ఞుండు..” కదా! మరి…”తేనె జుంటియల తెలుగు …” మన పిల్లలకు రావద్దా? రావాలి! ఎట్లా? మనోవికాసానికి చైతన్యానికి మనదైన మాతృ భాష వచ్చుండాలి కదా! మరి ఏం చేద్దాం ఎట్లా??
ఇప్పుడు కవులకు రచయితలకు ఇది ఒక పెద్ద సవాల్ గా పరిణమించింది. మరి ఏం చేద్దాం? ఏదో కొంత కృషి చేయవలసిందే! ఏవో కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందే!! ఇళ్లల్లో కొడుకు లు కూతుళ్లు తెలుగు పుస్తకాన్ని పట్టుకోవడం లేదు మనం రాసిన మన కవితల పుస్తకాలు మన రచనలు ఒక్క పేజీ కూడా చదవలేరు. ఈ దుస్థితి దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉన్నది. ఈ సమస్యని ఎదుర్కోవాలంటే కొంత సమయం మనంది కావాలి కొంత సహనాన్ని వెచ్చించాలి.ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఓపిక తెచ్చుకుని తెలుగును చదివే లాగా నచ్చ చెప్పాలి. బ్రతిమిలాడి తెలుగును వినేలాగా తెలుగు చూసేలాగా ప్రయత్నించాలి.
అయితే ఇలా ఎంత చేసినా బడిలోంచి వచ్చే తెలివితేటలు వేరు! ఒక్క కొడుకునో ఒక్క కూతురునో కూర్చోపెట్టి పాఠం చెప్పుకోలేని, తెలుగు ను నేర్పించలేని చదువును 50 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ అవలీలగా నేర్పగలరు. ఈ క్రమశిక్షణ, ఈ భయమూ బడి వాతావరణం లో ఉంటుంది. కాబట్టి, ఈ నిజాన్ని అందరూ ఒప్పుకొని పాఠశాల చదువులో తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పకుండా ఉండేలా ఉద్యమం చేయాలని కంకణం కట్టుకొని కవులందరూ బయలుదేరాలి. పోరాటాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న రక్తం మనలో ప్రవహిస్తున్నది. మన తాత ముత్తాతల పౌరుషం మనకు తప్పకుండా స్ఫూర్తినిస్తుంది. ఇది నిజం కాదంటారా?
మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం
- డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్
మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే సంకేతాన్ని తెలియజేయడానికి, ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి చరవాణిలో పంపిన మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి. అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం. అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా? అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్ దగ్గరలో. ఒక కుటుంబంలోని పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”
జనవరి మయూఖ పత్రిక సంపాదకీయం
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
అందమైన జీవితాన్ని ఎవరు ఆశించరు? ఆనందమైన బ్రతుకు పయనాన్ని ఎవరు కోరుకోరు? తరతమ బేధాలలో శాతాలుగా విభజించుకొని నైతికతను తినేస్తున్నది ఇప్పటి సభ్య సమాజం. దీన్ని ఎవరికి వాళ్లు వాళ్లలోకి వాళ్లు చూడడానికి నిరాకరించుకుంటున్నారు.
“బూడా గోడా లాల్ లగామ్”ముసలి గుర్రానికి షో కైన కళ్లెం” కాదు జీవితమంటే.లౌక్యం వేరు లోకజ్ఞత వేరు. అసలే ఒకే తరహా రాజకీయ పద్ధతిని చూస్తున్నాం. అదెంతా వికారమో తెలుసు. ప్రజాస్వామ్యం ఎట్లున్నది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడెలా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పార్లమెంటరీ పాలనా విధానాలు అనేవేవీలేవు. వందరెట్ల నిరంకుశతత్వాన్నే చూస్తున్నాం. పార్టీలు కాదు గెలిచేది పైసలు గెలుస్తున్నాయి అన్నట్టున్నవి పరిస్థితులు. ధైర్యం అనేది కొనుక్కుంటే వచ్చేదా? ఇది అన్యాయం అన్నప్పుడు నిరసనను ఏ విధంగానైనా తెలియజేయాలి కదా !కేవలం నిందలు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా అంతర్లీనంగా ఒకటి నడుస్తున్నది. ప్రత్యామ్నాయ శక్తి లేకుండా పోతున్న రోజులు . అది ఏ పార్టీ గాని అది ఏ ప్రాంతం కానీ ఇదే పరిస్థితి. ఈ రాజకీయాలు విద్యావ్యవస్థలోనూ జొరబడ్డాయి.
సమాజము, ప్రజలు ,విలువలు అనేవి ఏవి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ….ఇవి మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఈ భావ దారిద్ర్యం ప్రజల పట్ల ఒకే సారాంశంతో సంచరిస్తున్నది. Political గా అస్తిత్వం అనే భావన కనుమరుగవుతున్న రోజులు.
ఇవన్నీ పాఠశాలలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నవి. కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయికి వెళ్లిన తర్వాత
వంటబట్టాల్సిన రాజకీయాలు, ఉన్నత ప్రాథమిక పాఠశాల నుండే కుటుంబ పరంగా, కుల పరంగా వాళ్ల మెదడులలో దూర్చి పిల్లల చైతన్యవంతమైన ఆలోచనలను శాసించి చైతన్య హీనంగా చేస్తున్నవి. మార్కులు, ర్యాంకులు మరో విధమైన చెలగాటం ఆడుతున్న విద్యార్థులతో …దీనివల్ల తల్లిదండ్రులు, కుటుంబం, బడి ,చదువు ,టీచర్ అనే వాతావరణం నుండి మరింకేదో వాతావరణం కోరుకుంటున్నది ఈ తరం. అది కాస్త వికృత రూపం దాలుస్తున్నది. వీటి నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం… పుస్తకాలను చదివించడం. బవంతంగా నైనా చదివించడం…. ఇష్టపడేలా చేసి చదివించడం… ఎలా? రెండు వైవిద్యమైన భావాలు ఒక్కచోట చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నాయి.దీనిలోని మంచి చెడులను గ్రహించి తల్లిదండ్రులు టీచర్లు కలిసి పిల్లల ముందు చర్చించుకోకుండా వాళ్ళ లేత మనసులు గాయపడకుండా జాగ్రత్తగా ఒక ప్రణాళికను ఏర్పరచుకొని చేయాలనుకుంటే…
సారస్వత క్షేత్రంలో బంగారు పంటలు పండించిన ఇతిహాసాలు మనకున్నాయి. కావ్య యుగంలో రసవత్తరమైన రచనలు వెలువడిన సాహిత్య చరిత్ర మనకు ఉన్నది. విద్వత్ కవుల అద్భుత రచనలు అక్షర దీపాలుగా ప్రజ్వలిల్లిన వాజ్మయ చరిత్ర మనకున్నది. శాస్త్ర సాంకేతిక విద్య సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యసన, తాత్వికచింతన ఉన్న మన దేశం విలువలను ప్రస్ఫుటించే పుస్తకాలెన్నో ఉన్నాయి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఉన్నాయి. అటువంటివన్నీ అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త తరం వాళ్లకు నేర్పించాలి. లేకుంటే చెప్పలేనంత సాచ్యురేషన్ అనేది వచ్చి అన్నీ పోతాయి . ఎక్కడికి పోతాయి? ఆ గ్రంథాలు అలాగే ఉంటాయి భాండాగారాలలో!! ఆ జ్ఞానసంపద అంతా అలా నిక్షిప్తమైపోయి ఉంటుందే కానీ ఏ సమాజానికైతే అవసరమో భావి పౌరుల జీవన్ మార్గానికి తోడుగా ఉంటాయో అవి ఏవి వాళ్లకు అందకుంటే అవన్నీ అక్కడ భద్రపరిచి ఉన్నా లేనట్టే!
అయితే అవన్నీ ఈ కాలం పిల్లలు చదవలేరు అనుకుంటే వాళ్లకు అర్ధమయ్యే రీతిలో వాళ్ళ వాళ్ళ మాతృభాషలో నే కాకుండా ఇప్పుడు వాళ్లు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో నైనా
చిన్న చిన్న వాక్యాలతో ఆ పెద్ద భావాన్ని ప్రోది చేస్తూ కొత్తగానైనా పుస్తకాలు రాయాలి. రాయించాలి. ఇటువంటి పుస్తకాలు యూనిక్ గా ఉండి సమాజ యోగ్యమైనవి రచింపజేస్తే పిల్లలకు రురించి అవి మాత్రమే నిలుస్తాయి.
గ్రూపులు కట్టడాలు, నిందలు వేయడాలు…. తీవ్రమైన లొసుగులు తో నడుస్తున్నవి రోజులు.అవినీతి చాలా పెరిగిపోయి పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగా చూస్తున్నారు. విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను పావులుగా వాడుకుంటున్నారు.
“జై సాకరోగే వైసా బరోగే” “మనం ఎట్లా చేస్తే ఫలితం అట్లా వస్తుంది”
పాఠశాలల ఉపాధ్యాయులు శ్రద్ధగా పాఠాలు చెప్పకుంటే పిల్లలు చదువరు. పిల్లల స్థాయికి తగినట్టుగా చదువు చెప్పే వాళ్ళు లేకుంటే విద్య నిలువదు. చాలా వరకు తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం వాళ్లకు బోధనలో ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అంతటా కాకుండా గ్రామీణ ప్రాంత బళ్ళలో ఇదే జరుగుతుందని వినికిడి. టీచర్స్ కే రాకుంటే పిల్లలకి ఏం చెప్తారు? భాష పై పట్టు ఉండి, భాషా సౌందర్యాన్ని విడమర్చి చెప్పగలిగే శక్తి ఉండి గ్రామర్ మిస్టేక్స్ పిల్లలు ఎక్కడ చేస్తున్నారో పట్టుకొని నేర్పించగలిగే యుక్తి ఉంటేగాని విద్యార్థులకు సరైన ఇంగ్లీష్ వస్తుంది , న్యాయం జరుగుతుంది. అసలే smart phone మాయాజాలంలో అంతా బూటకపు వార్తల ప్రపంచంలో సమాజం . ఎన్నో మంచి విలువైన విశేషాలు ఉన్నా కూడా ఫోన్ ను miss use చేస్తూ పిల్లలు వాళ్ళ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయంపై అంతుపట్టడం లేదు. చదువుతున్నారు… ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి.. అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ, తమ పిల్లలపై ఇన్ని రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి… ఈ ఆవరణలో నుంచి బయటికి రాలేకపోతున్నారు మా పిల్లలు అని గ్రహించలేకపోతున్నారు.ఏం చేయాలో వాళ్ళ కూ అర్థం కావడం లేదు. మొక్కలలోనూ divinity ఉన్నదని చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం … అటువంటిది మనుషులలో ఎందుకు లోపిస్తుంది ? లోపించదు. వెలికి తీయాలి. అన్ని మతాలలోనూ నిత్య నూతనమైన సనాతనమూ ఉన్నది. నిలువెత్తు ధర్మాన్ని ఆపాదించుకున్న సంస్కృతి మనకున్నది. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న
భారతదేశం ఇది. ఈ ఉన్నత విలువలను జారవిడుచుకుంటే భవిష్యత్తు అంతా అంధకారమే. సనాతన ధర్మము అంటే, సంస్కృతి అంటే, ఆచారాలు అంటే ఏవో తప్పు మాటలు అనే భావాన్ని కొత్త జనరేషన్ కు నేర్పిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఇవన్నీ పాటిస్తుంటారు. మరి మన దేశానికి ఏమైంది? మనుషులం… మనం ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇవన్నీ తప్పకుండా అందరూ గ్రహించాలి. ఒక సమయమనంతో సాగాలి.
ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధాసక్తులతో పాఠ్య బోధన చేసేవాళ్లు. ఆనాటి టీచర్స్ ను గుర్తు చేసుకుంటే down to Earth అని చాలామంది అంటారే… ఆ విధమైన మనస్తత్వాలతో సమాజ నిర్మాణం వాళ్ల చేతుల్లోనే ఉన్నది అనే గొప్ప భావనతో పాఠ్య బోధన చేసేవాళ్ళు. ఇది మళ్ళీ పునరావృతం కాకుంటే…
రాబోయే తరాలకు జవాబుదారీగా నిలవాల్సింది ఎవరు? మేధావులు ఇలా మౌనం వహించడం మంచిది కాదు. ఈ మౌనం దేశ సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాలను ఎదగకుండా చేస్తుంది. కౌన్సిలింగ్ క్లాసెస్ టీచర్స్ కి కూడా పెట్టి వాళ్లలో దాగి ఉన్న మంచితనాన్ని , తెలివినీ, కృషి తత్వాన్ని, ఋషి తత్వాన్నీ మేలుకొలిపి మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చేలా … ఎ గుడ్ టీచర్ మేక్స్ ఎ గుడ్ సొసైటీ అనే నినాదాన్ని ఎలుగెత్తి చెప్పాలి.
“పట్టుపట్టగ రాదు పట్టి విడువగ రాదు
పట్టెనేని బిగియపట్టు పట్టవలయు….” అన్నారు పెద్దలు . ఈ మాటలకున్న అర్ధాన్ని అందిపుచ్చుకొని మరణం అంచుల్లో పడిపోకుండా నిలపాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరిదీ. చాలాచోట్ల మంచి ఉద్దేశంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు లేకపోలేదు. వాళ్ల కృషిని గ్రహించి వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఇంకా ఇంకా న్యాయమైన పద్ధతిలో నిజాయితీగా సేవలు చేసే దిశగా పెద్దలు మాట్లాడాలి.
మన మెప్పులో వేయి సౌదామినుల మెరుపు ఉండాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా … గుండె లోతుల్లోనుంచి మెచ్చుకుంటామో ఈ ఫలితాలు వస్తాయి.
అన్ని సమయాలలో మౌనం మంచిది కాదు!!
____***____
నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్
నువ్వు ఏదైనా చెబితే నేను మరిచిపోతాను. నువ్వు ఏదైనా నేర్పిస్తే నేను గుర్తు పెట్టుకుంటాను
నువ్వు నన్ను పనిలో భాగం చేస్తే నేను నేర్చుకుంటాను
ఎంత సత్య వచనాలు!! నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అంటాం కదా? ఇప్పటి యువతరాన్ని చూస్తే వీటిలో ఏది నమ్ముతున్నారు అర్థం కావడం లేదు ఆలోచించాల్సి వస్తోంది. వాళ్లు వాళ్ల సమయాన్ని కోరుతున్నారు వాళ్ళదైనా సమయాన్ని మాత్రమే కోరుతున్నారు. ఈ సమయాన్ని కప్పిపుచ్చుతున్నదంతా స్వార్థం. స్వార్థం అవసరమే కొంతవరకు కానీ మితిమీరిన స్వార్థం ప్రమాదకరం. ఈ మాట స్వేచ్ఛ అనే పదంతో కూడా జోడించుకోవచ్చు మనం ఇటు స్వేచ్ఛ అటు స్వార్థం రెండూ కలగసి ఇప్పటివరకు సరైన నిర్ణయాలు తీసుకొని ఇవ్వడం లేదు. వాళ్లు వైపు మొత్తుకుంటున్నారు మాకు మా కుటుంబం అంటే ఇష్టం అమ్మ నాన్న అంటే ఇష్టం అని. తల్లిదండ్రులు వాళ్లకు టైం ను కేటాయించడం లేదు టైం స్పెండ్ చేయడం లేదు మాతోని అంటూ కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు.
పైన చెప్పిన రెండు వాస్తవాలే కానీ… స్వేచ్ఛ స్వార్థం రెండూ వాళ్ళ తెలివిని ఆలోచన నిర్వీర్యం చేస్తున్నాయి అన్నది సత్యమే తల్లిదండ్రులు సరైన సమయాన్ని పిల్లల మీద పెట్టలేకపోతున్నారు అనేది సత్యమే. మీ రెండు తప్పవు ఓవైపు బాగా చదువుకోవాలి లేదా గొప్ప ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి డబ్బు పేరు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు యువత ఒకవైపు. ఇదే యువతకు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్లు కూడా డబ్బు సంపాదించాలి అనే కాకుండా ఉద్యోగ ధర్మం కదా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కదా అంటూ జీవితాన్నే పరిగెత్తిస్తున్నారు.
ఓ 20 ఏళ్ల క్రితం వాళ్లు పడ్డ కష్టనష్టాలు తమ సంతానం పడవద్దు అనే ఆలోచనతోనే తమ పిల్లలకు కావలసిన వాటికంటే ఎక్కువ సదుపాయాలను సమకూరుస్తున్నారు. వాళ్ళు అప్పుడు పొదుపుగా ఉన్నారు నోరు కట్టుకొని మరీ బ్రతికారు పైసా పైసా కూడ పెట్టి పిల్లల అవసరాల కోసం ఖర్చుచేసారు.మగ పిల్లాడైతే అందరిలో నా కొడుకు బాగుండాలి…. అని, నాకన్నా బాగుండాలి అని అనుకుంటున్నారు అమ్మాయైతే కొడుకులతో సమానంగా కూతుర్లను పెంచారు.ఆడపిల్లలు బాగా చదువుతున్న ఈ కాలంలో కూతురు ఎందుకు ఉద్యోగం చేయవద్దు తను తన కాళ్ళ మీద తాను నిలబడాలి అంటే ఉద్యోగం చేయాలి అని గట్టిగా నమ్మి అదే బాటలో నడిచేలా చేస్తున్నారు. తప్పదు కదా అస్తిత్వ పోరాటాలలో ప్రథమ స్థానం ఇదే కదా. ఆర్థిక స్వావలంబన అవసరం కాబట్టి ఇక్కడి వరకు బాగానే జరుగుతున్నది కానీ, మరి వీటికి ప్రతిఫలంగా ఇదే సంతానం కుటుంబానికి ఏమిస్తుంది?
సాధించాలనుకున్న గమ్యానికి తమదైన ప్రతిభతో ఒక గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తున్న వీళ్ళు ఇళ్లల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. అసలు పనులు చేయడానికి ఇష్టపడడం లేదు. ఉదాహరణగా చెప్పాలంటే… ఇంట్లో చెత్త డబ్బా తీసుకువెళ్లి చెత్త తీసుకువెళ్లే వాళ్లకు ఇవ్వాలి అనే స్పృహ ఉండడం లేదు. అదేదో మన పని కాదు అన్నట్టే ఉంటున్నారు కానీ ఎంతకని అమ్మ మాత్రమే చేస్తుంది ఎంతకని నాన్న మాత్రమే చేస్తాడు అని ఆలోచన ఉండడం లేదు. వంట ఎలా వస్తుంది టేబుల్ మీదికి అనే ధ్యాస లేని పిల్లలకు చెత్త డబ్బా గురించి ఏం చెప్తాం? అది మరీ పెద్ద విషయం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చేసేది ఎవరు? పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తేనే ఇల్లు శుభ్రం కావడం లేదంటే అట్లాగే ఉంటుంది లేదా అమ్మ చేస్తుంది ఎంతకని? ఎంతకాలం ఈ ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటుందో!
వంటలో సాయం చేయడం, ఇల్లు శుభ్రంగా .. నీట్ గా పెట్టడం అందరి పని అనుకోవడం ఇలా… ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోని యువత రేపటి రోజున ఎవరికి ఆదర్శమవుతారు? ఎలా ఆదర్శమవుతారు?
There is no elevator to success you have to take the stairs … ఈ మెట్లు ఏవి అంటే ఇదిగో ఇవే…. చిన్న చిన్న ఆనందాలు దొరుకుతాయి ఇంటి పనుల్లో భాగస్వాములైతే! ఇది నిజం గా నిజం. చక్కని జ్ఞాపకాలు వెంట వస్తాయి. అమ్మా నాన్న ల కష్ట సుఖాల్లో మేం ఉండాలి అని అనుకున్న వాళ్ళు గొప్ప స్థితికి చేరుకుంటారు.
పాపం ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు అస్సలు పని నేర్పుకుంటారు. బహుశా విధి విధానాలు వేరుకావచ్చు. అంతేకానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లలు సోమరులు అవ్వాలనో దుర్మార్గాలు తొక్కాలనో అనుకోరు.
The greatest gifts we can give our children are the roots of responsibility and the wings of independence అంటాం కదా! స్వేచ్ఛ తో పాటు బాధ్యత లను నేర్పించాలి. పదహారేళ్ళు వచ్చాక కూడా బుద్ధి రాకుంటే ఎట్లా? చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బయటి వాళ్ళు చెప్పేవి…. మీ జీవితం బలి కాకుండా చూసుకోవాలి.
సెప్టెంబర్ 2024 మయూఖ పత్రిక సంపాదకీయం
ఈ భూమి మీద ఆవరించి ఉన్న అనంతమైన శక్తి ని అందిపుచ్చుకున్న ఏకైక జీవి మనిషి. సర్వ ప్రాణి కోటిలో ఉత్కృష్టమైన జీవి మనిషి అని పేరు వచ్చిన కారణం ఏమిటి అని యోచిస్తే, భావవ్యక్తీకరణ కు భాషను సాధనం చేసుకున్నందుకే, బుద్ధి ని వికసింపచేసుకొని విజ్ఞానానికి మళ్ళించినందుకే, మనసు మాట విని చెప్పగలిగే యుక్తి ఉన్నందుకే అంటూ ఇలా కొన్ని విశేషాలు విశేషణాలు ఉదాహరించవచ్చు.ఈ గొప్పతనాన్ని మరింత గొప్ప చేసుకోవాలి. దీనికి మంచి చెడు అనేవి రెండు పార్శ్వాలు గా ఉంటాయి. సరళసౌమ్యంగా మాట్లాడే మనుషులు ఉంటారు.దుర్భాషలాడేవాళ్ళూ ఉంటారు. మాట కు భాష ప్రధానమైనది కాబట్టి భాష రావాలి. భాషలెన్నో ఉన్నాయి. ఎవరి మాతృభాష వాళ్ళకుంటుంది. ఎవరికి నచ్చిన భాష వాళ్ళకుంటుంది.ప్రభావితం చేసే భాష , లేదు… రుద్దబడే భాష లేదూ…మనసుపడే భాష , ఇవన్నీ భాష గొప్పతనాన్ని చూపేవే!
మనసు నిండా మాలిన్యం ఉన్న వాళ్ళ మాట ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. ఈర్ష్య, వ్యతిరిక్తత, వ్యంగ్యం వంటి భావాలు వాక్యాలు వాక్యాలు గా వాళ్ళ నోటివెంట వస్తూనే ఉంటాయి.మాట రాలేని పక్షంలో నోటితో నవ్వుతూ నుదిటి తో వెక్కిరిస్తారు.
ప్రస్తుతం ఈ విషయంలో తెలుగు భాష ప్రయోగం చేసే క్రమాన్ని చర్చించుకోవడం లో ద్రావిడ కుటుంబ భాష నేనా కాదా అనే, ద్రావిడ భాష 500 సంవత్సరాల క్రితం భాషేనా కాదా అనే , అది సింధులోయ నాగరికత ప్రాంతంలో మాట్లాడిన భాష కాదా అనో ఈ చర్చ కాదు.
ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలేవి? ఏది ముందు ఏది వెనక,? ఓల్గా నుండి గంగ వరకు నడుచుకుంటూ వచ్చిన భాషనా? గంగనుండి ఓల్గాకు నడుచుకుంటూ వెళ్లిన భాషనా అనే చర్చకాదు. కొన్ని నిరూపించబడతాయి కొన్ని నిరూపించబడవు. సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు ఉండవు. తాళపత్ర గ్రంథాలలో ఉన్నవే ముఖ్యమైన వనో , శిలా శాసనాల మీద ఉన్న భాషనే ముఖ్యమైన ది అని కాదు.
లేదు ….పల్లె ప్రాంతాల్లో ప్రజల నాలుక పైన మాట్యమాడే భాష ప్రధానం అనో కాదు! భాషా శాస్త్రజ్ఞులు చెప్పే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ విషయ చర్చ కూడా కాదు.
ఎవరి భాష అయినా వాళ్లకు ప్రీతికరమైన భాష నే!
అయితే ఇతరులకు నచ్చేలా మన భాష ను మనం ప్రయోగిస్తున్నామా లేదా అనే విషయాన్ని చర్చించుకోవడం.
మంచి మాటలు మాట్లాడడం రాకుంటే చెడు మాట్లాడకుండా ఉంటే చాలు మేలు చేసిన వాళ్ళు అవుతారు.
పెద్దలు ఏది మాట్లాడితే పిల్లలు అదే నేర్చుకుంటారు అంటే చాలామంది ఒప్పుకోరు కానీ ఇది సత్యం. ఏ పనులు చేస్తున్న ఎక్కడ ఉన్నా పిల్లలు పెద్దవాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా చక్కని సంభాషణ చేయడం అలవర్చుకోవాలి.
బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఒక ఆఫీసర్లు, దేశ నాయకులు, సంఘ నాయకులు ఎలాంటి పదాలను ప్రయోగిస్తుంటే ఉచ్ఛరిస్తుంటే అవే మాటలను సబార్డినేట్స్, వాళ్ళ కింద స్థాయి వాళ్ళు అలవర్చుకుంటారు.
నలుగురికి పని చెబుతున్నాము అంటే నాలుగు ప్రపంచాలు మనని గమనిస్తున్నట్టే లెఖ్ఖ!
రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు అంటూ” యధా రాజా తథా ప్రజా ” అని చెప్పిన మన పూర్వీకుల మాటను స్మరించుకుంటే, ఇంట్లో పెద్దవాళ్లు ఏది మాట్లాడితే పిల్లలు వాటినే అనుసరిస్తారు. అసలే చుట్టుపక్కల సమాజం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో వాళ్ళు కూడా దుర్భాషలాడము, చెడ్డ మాటలను ఉపయోగించడం చేస్తూ ఉంటే ఆ ఇళ్లల్లో పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు?
రాజకీయ నాయకులు ముఖ్యంగా సభ వేదికలపై ఉపయోగించే పదజాలం అసభ్యకరంగా ఉన్నప్పుడు సభ్య సమాజం ఏమి స్పందించకుండా ఉండడం విచారకరం.వ్యక్తిగతంగా
ఏవైనా కోపాలుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ నలుగురి ముందు మాట్లాడే హక్కు వాళ్లకు ఉండకూడదు .ఈ నియంత్రణ అనేది పాలనలో తప్పకుండా రావాల్సి ఉంది. ఒకళ్ళు మాట్లాడారు కదా అని ఇంకొకళ్ళు మాట్లాడడం ,వాళ్ళతో పోలుస్తూ చెప్పడం వాళ్ళు చెప్పిందే మేము చెబుతున్నా అనే ఉదాహరిస్తూ చెప్పడం ఒక అలవాటుగా మారిన కాలంలో మనం ఉన్నాం .ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో గమనిస్తున్నాం. ఇది ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయవలసిందే! దీనికి దేశంలోనే అత్యున్నత స్థానమైన న్యాయస్థానం ముందుకు రావాలి. అసభ్య పదాలను ఉపన్యాసాలలో ఉపయోగిస్తూ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకొని చూపించాలి. అప్పుడే తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడరు .లేకుంటే భావితరాలకు ఏ సమాజాన్ని అందించిన వాళ్ళం అవుతాం?
ఒక ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన క్రింద పనిచేసే ఇతర హోదాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు, మర్యాదపూర్వకమైనటువంటి భాషతో భావంతో మెలుగుతూ తాము తీసుకున్న నిర్ణయాలు అందరికీ అందజేస్తారు. నాయకులైన అంతే.ఉదాహరణకు వివిధ రకాల సంఘాలు ఉంటాయి ఆ సంఘాలకు నాయకులు ఉంటారు వాళ్ళ మనసులో ఎలాంటి కోపతాపాలున్నా కూడా సంఘానికి సంబంధించిన మీటింగ్ సభను పెట్టుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. పిల్లలు తల్లి తండ్రి తమకు నచ్చని అంశాలు కనిపించిన పిల్లలతో సభ్యత ఉట్టిపడే స్వరంతోనే భాషతోనే మాట్లాడుతారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని తాము ఆశించినటువంటి సంస్కరణలే కాని, అభివృద్ధి పథకాలే కానీ మంచి విషయాలే కానీ చెప్పేందుకు ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతిలోనే మాట్లాడుతారు , వాళ్లకు చేరవేయగలుగుతారు,అప్పుడే అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో కాకుండా కార్యాలయాలలోనూ లేదా సంస్థ లాభనష్టాల విషయం చర్చించేప్పుడైనా ఒద్దికైనా మాటలతోనే తమ నిర్ణయాలను వెలిగిచ్చుతారు. అంతేకానీ కోపం వచ్చిందని ఇష్టమున్నట్టు మాట్లాడితే తమ అనుకున్నవి సాధించలేరు.
రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికి ఇది క్రింద మీద అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థులను తిడితే కానీ దుర్భాషలాడితే కానీ ఒక హల్ చల్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాజకీయాలనేవి ఈనాటివి కావు వందల సంవత్సరాలుగా నడుస్తున్నాయి ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇది గర్హనీయం. ఈ పరిస్థితులు మారాలి.
ప్రత్యేకంగా మన తెలుగు భాషకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇతర భాషల కన్నా మిన్న అయిన భాష మనది. సరళంగా సౌమ్యంగా మాట్లాడడం చేతకాకుంటే శిక్షణ తీసుకోవాలి కోపోద్రి క్తులను చేసేలా పదజాలం
వాడితో మాట్లాడితే ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. ఉపన్యాసాలలో చెడు
ఉంటే కలిగే నష్టం ఎవరికి ? కింది వర్గాల వారికి ! మా సారు ఇలాగే మాట్లాడాడు కాబట్టి మేము ఇలాగే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎవరికి మంచిది కాదు. ఈ పద్ధతి పోగొట్టాలంటే,రాజకీయ పాఠశాలలను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా నిబంధనలను తీసుకువస్తే గాని మార్పు వస్తుంది. భాష సభ్యత ను ఇస్తుంది. భాష భవితను ఇస్తుంది. ఇది గ్రహించి మెసలుకోవడం ఓ బాధ్యత!
2024 మయూఖ పత్రిక జూలై సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, సంపాదకులు
ఈ ఆధునిక ప్రపంచంలో నిత్య సత్యాలకు విలువనిచ్చే సందర్భాలను తరచి చూడాల్సిన పరిస్థితులున్నవి. ఇదంతా stage of publicity నడుస్తున్న కాలం. ఈ ప్రచార పటాటోపాలు లేకుండా వాళ్ళ జీవితమంతా పోరాటాలకు ధారపోసి వెలుగులోకి వచ్చిన కొందరు మహనీయులను స్మరించుకోవడం కొరకనే శత జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉంటాం.
మహాప్రళయంగా ఉద్యమించిన సముద్ర ఆటుపోటుల వంటి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాలకు ఎందరో వీరులు బలయ్యారు. బరిలోకి దిగి ఉద్యమించిన నేతలందరూ నిస్వార్థ జీవితాలే గడిపారానాడు. సాహిత్యం అనే కత్తిని చేతపట్టి సమాజమనే యుద్ధభూమిలో రాజునెదిరించిన విప్లవకణిక దాశరథి కృష్ణమాచార్య.
ఏ నైసర్గిక సాధన కోసం ఆనాడు గళమెత్తాడు దాశరథి? ఏ అస్తిత్వం కోసం జెండా నెత్తాడు దాశరథి?? సామాన్యుల కోసం! సంఘం కోసం!!
“ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో …” అంటూ కష్టజీవి పక్షాన కలమెత్తిన కవి. ” మా నిజాం రాజు జన్మజన్మాల బూజు …”అంటూ ప్రభుత్వ పనులను ఎదిరించి స్వాతంత్ర్యం కోసం తలయెత్తిన కవి. అలసత్వాలపై, అధికారపు పెత్తనాలపై కవిత్వ నిప్పులు చిమ్ముతూ కవిత్వం రచించినా , కరుణ రసాత్మకంగా పేదవాడి పక్షాన కవిత్వం రచించినా దాశరథి దాశరథే! ఇకమరో కవి ఉండడు అన్నంత గొప్ప కవి.
అది కవిత్వం కావచ్చు అది పాట కావచ్చు బడుగు జీవుల బాధల గాథలు దాశరథి కవిత్వంలో కవిత్వమై కన్నీరు తెప్పించాయి. కవి ధర్మం, కవిత్వ ధర్మం రెండు ఒక్కటి గా కనిపించిన దాశరథి సాహిత్యం ఇప్పుడు ఈ కాలంలోనూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొన్న వ్యక్తిగా, పద్యాల చురకత్తులు విసిరిన శక్తిగా దాశరధి ఎట్లా నిలబడగలిగారు? ఎట్లా సినీ జగత్తులో అక్షర దివ్వె గా వెలగలిగారు? ఇవి తెలుసుకోవాలి.
ఎంతసేపు పరనింద,ఆత్మ స్తుతి తో బ్రతుకుతున్న మనుషులకు మార్గదర్శకత్వంగా దాశరథి వంటి కవుల కవిత్వాన్ని చూపించాల్సిన బాధ్యత ఈనాటి సాహితీవేత్తలది, పత్రికారంగానిది, ప్రభుత్వానిది. అతిగా పెరిగిన లంచగొండిలపై కంచు గొంతు ఎగరాలి. అడుగడుగునా అవినీతి అవతారాలు కనిపిస్తున్న కసాయి లోకానికి కనువిప్పు కలిగించే దాశరథి కవిత్వం కావాలి.
ఎంతసేపు వాగాడంబరమూర్తుల ఉపన్యాసాలు వినీ వినీ యువత నిస్తేజం లో పడిపోతున్నది. అభ్యుదయ భావకాంక్షతో సత్కవిలోకానికే సంభ్రమాశ్చర్యాలు కలగజేసిన దాశరథి పద్య శక్తి ని తెలుపాలి.
సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం అనే మాట దాశరధి నోట వచ్చిన పాట, పద్యాలు పెద్ద రుజువు.
ఋతు బద్ధంగా వికసన చెందే పంట చేను,ఎండి కడుపు ఆకలి మంటను చల్లార్చే పంట దాశరథి సాహిత్యం. కవుల గురించి రచించినా , పీఠికలు రాసినా, సభనుద్దేశించి మాట్లాడినా జవం జీవం ముప్పిరిగొని పాఠకులకు శ్రోతలకు ఆనందాన్ని ఆలోచనలని కలిగించినవి.
నాటి ఖమ్మం జిల్లా మానుకోట తాలూకా లోని చిన్న ఊరు గూడూరు లో 1925 సంవత్సరంలో జూలై నెలలో జన్మించాడు దాశరథి. పల్లెటూరి చదువు నుండి పట్నం చదువులకు ఎదిగిన ఈ పట్టభద్రుడు పాటను పట్టుకొని చిత్రసీమలోకి అడుగు పెట్టే వరకు దాటిన మైలురాళ్ళు ప్రతి అడుగులో దాశరథికి కొత్త పాఠాలు నేర్పించాయి. తిమిరంతో సమరం జరిపినా ,రుద్రవీణలు మోగించినా, అగ్ని ధారలు కురిపించినా, నవ మంజరులు మ్రోగించినా,కవితా పుష్పకం వికసింపజేసినా, పునర్నవం తో కవితా ప్రక్రియని పరిపుష్టం చేసినా దాశరథి దాశరథే!!
” ఇట వసంతము లేదు, సహింపరాని
గ్రీష్మ హేమంత కాల కాళికలె గాని
ఇట ఉషస్సులు లేవు,భరింపరాని
అంబువాహన సందోహ నివాళిగాని…..”
భాషా పాండిత్యాల విలువ ఏమిటి అంటే , దాశరథి గారి ఇటువంటి కవిత్వం చదివితే తెలుస్తుంది.
” అది తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ
అది నిజాము నృపాలుని అండదండ
చూసుకొని నిక్కినట్టి పిశాచహేల…”
తప్పు చేసే ప్రభువును ఎదిరించే ధైర్యం అంటే ఇటు ఉండాలి అనేది దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను
కదం తొక్కి పదం పాడే ఇదే మాట అనే స్తాను….”అంటూ వాస్తవికతకు అద్దం పడుతూ కృతకంగా లేకుండా స్వచ్ఛమైన కవిత్వాన్ని రాయడం అంటే ఏమిటో దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” అంబర చుంబి సౌధములు కాయవు పోసెడి నీ శ్రమ ప్రభా
వంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పళ్ళెరాలలో
అంబలి పోసి త్రాగు సమయంబులు దగ్గరెలెమ్ము! నీ నవా
స్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టు పెట్టు మా! ” అంటూ పీడిత పక్షాన ఎలా గొంతెత్తాలో దాశరథి గారి ఇటువంటి పద్య రచనా పాటవాన్ని చూస్తే తెలుస్తుంది.
జైలులోను తమ నిరసన గళాన్ని పద్యమై బొగ్గుతో రాసే వినిపించినా,
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి సాహితీ చైతన్యాన్ని రగిలించినా, అద్భుతమైన ఉపన్యాసాలతో సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చినా కవిగా ఉద్యమ తేజంగా దాశరథి ఓ పెద్ద ఉదాహరణ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసినా ఎందరో కవులకు దాశరథి మార్గదర్శి అయ్యాడు.
“నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవని రా” అంటూ మచ్చలేని ప్రేమ, మలినం కాని ప్రేమ విలువేమిటో తెలిపాడు.
“గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది,చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది” అంటూ పల్లె పట్టున గంతులేసే యవ్వన కాలాన్ని ప్రాసాలంకారాల పాటల్లో పలికించాడు.
” మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా”అన్నా,” రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్య” అని వేడుకొనమన్నా,
” నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ ఆనాటి దురాగతాలను ఎదిరించే రుద్రవీణను మోగించిన దాశరథి అంటే అక్షర విప్లవం.
చదువు అంటే బద్ధకం,పనిచేయడం పైన నిరాసక్తత, ఏదో సాధించాలన్న తపన లేని తనం, అయిన వాళ్ళను కూడా ఆదరించలేని యువతరం ఇప్పుడు మన ముందుంది. ఒక నిబద్ధతతో ఒక విశ్వాసంతో ఆనాడున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను ఎదిరించినా,స్వాతంత్ర్య అందిన తర్వాత ధీటుగా నిలబడినా దాశరథి గారు ఇప్పటికీ ఆదర్శవంతులే. స్వదేశాభిమానమైనా సంప్రదాయ వాదమైనా దాశరథికి ఇష్టమైనవి. ప్రకృతికి మనుషులకు పారస్పరిక బాంధవ్యాన్ని ఆకాంక్షించాడు, వ్యక్తికి సమాజానికి మధ్య సాన్నిహిత్యాన్ని చాటి చెప్పాడు, సాహిత్యం సంఘానికి చేసే మేలును తన రచనలలో చూపాడు.
” రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్?
బుర్రలు పగులకపోతే లేదా సొల్యూషన్?
హింసా యుద్ధం అవుట్ డేటెడ్ అని నేనంటాను!
శాంతి ఒక్కటే మానవజాతికి సరియగు సాల్వేషన్!!” అంటూ ఈ కవిత్వమేదో నిన్న మొన్న రాసినట్టున్నదే అనే ఆలోచనలో పడవేసే దాశరథి అంటే మోడరన్ థింకింగ్ కు నిలువెత్తు నిదర్శనం.
దాశరథి గారి కవిత్వం సార్వకాలికమైంది సర్వజనీనమైనది.
“గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల” అని చెప్పిన మాటలు దాశరథి శతవత్సరాల కవితా శరధి అంటున్నాయి. నూరేళ్ళ వారి జీవితమే స్ఫూర్తి దాయకం.
( మే నెల మయూఖ పత్రిక సంపాదకీయం)
డాక్టర్ కొండపల్లి నీహారిణి , మయూఖ పత్రిక సంపాదకులు
జాతి మొత్తం ఏకతాటి మీద నడవాలి అనుకోవడం వెనుక ఆంతర్యం ఏముంటుందంటే, ప్రజల సుఖశాంతుల ప్రయోజనాలకే. ప్రయోజనాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు? తెల్లవారుజామున నిద్రలేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు…., మనిషి పుట్టుక నుంచి చావు వరకు అడుగడుగునా క్షణక్షణాన మనుషులు లాభాపేక్ష తోనే జీవిస్తుంటారు. మంచి తిండి, మంచి బట్ట, మంచి ఇల్లు వంటి కోరికలు ఏవీ లేని వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు.వాళ్లని సర్వ సంగ పరి త్యాగులు అంటాం.వీళ్ళు మహానుభావులు. అతి తక్కువ శాతం లో ఇటువంటి వ్యక్తులు ఉంటారు.
సాధారణంగా ఆచరణ యోగ్యాలేవి,ఆచరణ యోగ్యం కానివేవి అనే తర్క సహితమైన ఆలోచనలు లేనివాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా… అనుకోకుండానే చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు.ఇందులో పరిశుభ్రత అనే విషయాన్ని తీసుకుంటే, మంచినీళ్లు త్రాగడం అనే ఒక్క విషయాన్ని ఉదాహరించవచ్చు. ఆదిమానవుని నుండైనా మనుషులు స్వచ్ఛమైన నీరు…. ఏదైతే తాగడానికి అనువైనదో ఆ నీళ్లనే త్రాగారు. అదే పరంపరను పాటిస్తున్నారు ఇప్పటికీ ….ఈ ఆధునిక మానవులు.అంటే, తమ క్షేమానికి,తమ ఆరోగ్యానికి పెద్ద పీట వేసి ,కార్యరంగంలో అడుగులు వేస్తారు మనుషులు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
దాహమైనప్పుడే బావిని తవ్వుకోవద్దన్న నిజాన్ని గ్రహించే అన్నేసి నిర్మాణాలను మంచి నీళ్ళ కోసం కట్టుకున్నారు ఆధునికులు. దీనితోనే యోగ్యమైనవేవి, అయోగ్యమైనవి ఏవి అని వివేచనతోనే మనుగడ సాగిస్తారు అన్నది తెలుస్తుంది. ఆచరణ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది దీంట్లోనే సామాజిక ప్రయోజనం కలసిపోయి ఉంటుంది ఈ మంచినీటి విషయాన్నే మానవ స్వధర్మానికి,సధర్మానికీ అన్వయించుకున్నప్పుడు….” స్వధర్మే నిధనఃశ్రేయమ్, పర ధర్మోభయావః” అని మంచి మాట పుట్టుకు వచ్చింది. ఈ వాక్యం జీవిత సత్యం. ఈ వాక్యం అనల్పమైన వాక్యం. ఇందులోంచి “శ్రేయస్సు”అనే ఒక్క పదం చాలు! మనుషులకు ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది అనడానికి !!అందుకే ఏదో దేశాన్ని చూసో, ఏవో సౌకర్యాలను ఆశించో, సంపదలను చూసో మనకు మనం ఆపాదించుకోవడమైనా… మనంగా కోరుకోవడమైనా….అన్నిచోట్ల సాధ్యం కాకపోవచ్చు. దేశకాల పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం అని యోచించి నిర్ణయించుకోవాలి, కోరుకోవాలి, ఆశపడాలి.
ప్రయోజనాలలో శిశువులకు ఒక రకమైనవి, వృద్ధులకు ఒక రకమైనవి, యువకులకు ఒక రకమైనవి,మధ్య వయస్కులకు ఒక రకమైనవి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినవి,విద్యకు సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి,సామాజిక అంశాలకు సంబంధించినవి బ్రతుకుతెరువుకు సంబంధించినవి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. నడక, నడత, తిండి,చదువు, ఉద్యోగం, పదవి విరమణ, ఇన్సూరెన్స్ లు వంటివి కానీ అన్నింటికన్నా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
జీవమున్నప్పుడు శరీరానికి, మరణం తరువాత శవానికి …. ఈ వ్యవస్థలో ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు, పరిచయాలు పెంచుకుంటుంటారు.
వీటిలో మంచి చెడులను చెప్పేవాళ్ళు, uses and losses ఏమిటో చెప్పేవాళ్ళు ఉండాలి. శరీరంలోని కణజాలాల లాగా,ఉప కళా కణజాలాల లాగా,శరీరంలోని భాగాల లాగా, భాగాలు పనిచేసే తీరు లాగా మానవ ప్రయోజనాలు ఉండాలి. ఏది సరైనది ఏది సరైనది కాదు అనే విచక్షణ ఉంటే అన్నీ సవ్యంగా నడుస్తాయి.
మానవ పరిణామ క్రమంలో వచ్చిందే కాకుండా….బుద్ధి పరిణామ క్రమం కూడా పెరగాలి. భాష, భావం సరిగ్గా ఉంటే నాలుగు కాలాలపాటు నలుగురితో సరిగ్గా ఉండగలరు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది?సరళ రేఖ లా,సాలీడు గూడులా, పరమత సహనం లా ,పాదరసం లా పరిమితమైన అపరిమితమైన ప్రయోజనాలు ఉంటాయి. సహజమైన ఎంపిక, సత్య మైన ఎంపిక నిలబెడుతుంది, నిలబడుతుంది.
ఇవే బ్రతుకు ప్రయోజనాలు!!
