

తెలుగు సాహిత్యంలోని కథాసాహితి ప్రక్రియలో ఆధునిక కాలంలో కృషి చేసిన కథా రచయితలలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని కథారచన చేసినవారు “కథాసుధానిధి” వడలి రాధాకృష్ణ గారు. ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యంతో మమేకమైన “కథాప్రపూర్ణ” వడలి రాధాకృష్ణ గారి కలం నుండి 600 కథలు జాలువారాయి. “కథాబ్రహ్మ”, “కథా విరించి” లేఖిని నుండి కథలే కాకుండా 400 కు పైగా కవితలు వెలువరించబడినాయి. అనేక కథా సంకలనాలకు ప్రధాన సంపాదకత్వం వహించి “భావకవితాభారతి” వడలి రాధాకృష్ణ గారు. సాహీతీవేత్తలకు “సాహితీమిత్ర” గా కవులకు “కవిమిత్ర” గా కథారచయితలకు “కథకరత్న” గా ప్రసిద్ధిచెంది కథాసాహితి కడలి తరంగమైన వడలి రాధాకృష్ణ గారి “మనసు మూలాల్లోకి” మన “అంతర్నేత్రం” దృష్టి సారిస్తే ఆ “మనసు చెప్పిన కథలు”, “వడలి రాధాకృష్ణ కథలు” గా ఆవిష్కృతమవుతాయి. కడలి తరంగమైన వడలి “మంచినీటి సముద్ర” కెరటం. “జీవనది”, “మంచినీటి సముద్రం” తో సంగమిస్తే కడలి కెరటాలు వడలి కథలై కథాసరిత్సాగర మవుతాయి. “చీకటి పున్నమి” కాంతులను మన “దోసలి సందిట” పెట్టుకొని “గూటిపడవ”లో ప్రయాణించి కథాసాహితి కడలి తరంగ ఆవిర్భావ తీరానికి చేరుదాం.
వడలి వెంకట సుబ్బారావు – సూరమ్మ పుణ్యదంపతులకు 1963 సెప్టెంబర్ 5వ తేదీన (సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించిన రోజున) వడలి రాధాకృష్ణ గారు జన్మించారు. తల్లిదండ్రులు రాధాకృష్ణ అని నామకరణం చేయడం వెనుక గల కారణం రాధాకృష్ణన్ గారు పుట్టిన తేదీ, రాధాకృష్ణ గారు పుట్టిన తేదీ సెప్టెంబర్ 5వ తేదీ కావడమే. స్నాతకోత్తరస్థాయిలో (పోస్టు గ్రాడ్యుయేషన్) మూడు పట్టాలు పొందారు. 1) ఎం.ఏ. (ప్రభుత్వ పాలనా శాస్త్రం), 2) ఎం.బి.ఏ., 3) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, పిలానిలో ఎం.ఈ. (మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్). సైన్స్ నుండి యం.ఇ.; ఆర్ట్స్ నుంచి ఎం.ఏ.; కామర్స్ నుంచి ఎం.బి.ఏ. డిగ్రీలు విభిన్నరంగాలలో సాధించిన వడలి రాధాకృష్ణ గారు ప్రస్తుతం చీరాలలోని ఐ.టి.సి.లో ప్రోసెసింగ్ మేనేజర్గా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తి అయిన కథారచనలో మేటిగా నిలిచి నేటి ఆధునిక కథా రచయితలను, సాహితీవేత్తలను గౌరవిస్తూ, వారి గ్రంథాలను ఆవిష్కరిస్తూ, సాహితీసేవలో తరిస్తున్నారు. 2005వ సంవత్సరములో చీరాలలో “సహజ సాహితీ” అనే సాహితీ సంస్థను నెలకొల్పారు. “సహజ సాహితీ”
ఆధ్వర్యములో ప్రసిద్ధ చిత్రకారులు, కవి, గాయకులు, సంగీత దర్శకులు, కథారచయిత అయిన శ్రీ కోన రమణరావు గారు రచించిన “విరిసిన వెన్నెల” కథా సంపుటిని; రెక్కలు ప్రక్రియలో రచనలు చేసిన పోగుల విజయశ్రీ గారి “ఉదయరాగాలు” ను ఆవిష్కరించారు. సాహితీ మిత్రులైన శ్రీనివాసగౌడ్ గారు, పోగుల విజయశ్రీ గారు, వంగర పరమేశ్వరరావు గారు మొదలగు వారితో కలిసి అనేక కవి సమ్మేళనాలు నిర్వహించారు. చీరాలలోని ప్రముఖ సాహితీ సంస్థలైన అప్పాజోస్యుల విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్కు; కళాంజలికి; సాహితీ స్రవంతికి; శ్రుతిభారతికి విశిష్ట సేవలందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ తెలుగు పత్రికలలో వడలి రాధాకృష్ణ గారి రచనలు, కథాసంకలనాలు ప్రచురితమయ్యాయి. రాధాకృష్ణ గారి కథా సంకలనాలలో “జీవనది”; “గూటిపడవ”; “అంతర్నేత్రం”; “మనసు మూలాల్లోకి”, “చీకటి పున్నమి”, “వడలి రాధాకృష్ణ కథలు”; “మంచినీటి సముద్రం”; “దోసిలి సందిట” మొదలగునవి కథా సాహితీ ప్రపంచంలో అటు పాఠకులను, ఇటు పరిశోధకులను అలరిస్తూ ప్రజాదరణ పొందాయి. వడలి రాధాకృష్ణ గారి కథా సంకలనాల మీద విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలో పరిశోధనలు జరిగి, యం.ఫిల్.; పి. హెచ్.డి. డిగ్రీలు పొందిన పరిశోధక విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధక విద్యార్థి పెదలంక సుధాకరబాబు “జీవనది” కథా సంకలనంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన నన్నయ ప్రాంగణములో తెలుగు పరిశోధక విద్యార్థి బొంతా రమేష్ “వడలి రాధాకృష్ణ – కవితానుశీలన” అనే అంశంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయములో తెలుగుశాఖలో పనిచేసిన ఆచార్య తేళ్ళ సత్యవతి గారి పర్యవేక్షణలో శ్రీ యల్. జ్యోతీశ్వర నాయుడు అనే తెలుగు అధ్యాపకులు “వడలి రాధాకృష్ణ రచనలు” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు. బొబ్బిలికి చెందిన శ్రీ కర్రి రాంబాబు అనే తెలుగు పరిశోధక విద్యార్థి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారి పర్యవేక్షణలో “వడలి రాధాకృష్ణ రచనలు-సమాలోచన” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు.
“భావకవితా భారతి” అనే బిరుదును కలిగియున్న వడలి రాధాకృష్ణ గారు “జలఖడ్గం”; “శిశిరచిత్రాలు”, “వట్టివేళ్ళు” (నానీలు) అనే మూడు కవితా సంపుటాలను వెలువరించారు.
కథారచనలు, కవితా సంపుటాలను వెలువరించడమే కాకుండా 30 కి పైగా ఇతర కవుల, రచయితల సంకలనాలకు ముందుమాటలు వ్రాయడం వలన వడలి రాధాకృష్ణ గారు పీఠికా రచయితగా సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. తాను ప్రధాన సంపాదకులుగా ఉండి నాలుగు కథాసంకలనాలకు, రెండు కవితాసంకలనాలకు, రెండు మినీ కథాసంకలనాలకు ప్రధాన సంపాదకత్వ బాధ్యత సమర్థవంతంగా నిర్వహించిన ఘనత కూడా వడలి రాధాకృష్ణ గారికే దక్కుతుంది. వారు ప్రధాన సంపాదకత్వం వహించిన కథా సంకలనాలు – “కథాపురి”, “నాలుగు నాలుగుల పదహారు”, “ఐదు కలాలు ఐదేసి కథలు”; “కథానికా కదంబం”; కవితా సంకలనాలు – “మలిసంధ్య”; “అనేక అడుగులు-ఒక ప్రస్థానం”; మినీ కథా సంకలనాలు – “మినీ కథావసంతం”, “కాలుతున్న కాలం” (కరోనా మినీ కథా సంకలనం).
సాహితీ రంగాలలో విశేష కృషి చేసిన వడలి రాధాకృష్ణ గారిని రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు బిరుదులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. వాటిలో ముఖ్యంగా సెట్ సంస్థ, చీరాల వారు “సాహితీమిత్ర” బిరుదును; పి.యం.కె.ఎఫ్. సంస్థ, ఒంగోలు వారు “కవిమిత్ర” బిరుదును; శ్రీ చైతన్యభారతి సాహితీ సమాఖ్య, మార్కాపురం వారు “కథావిరించి” బిరుదును; భావతరంగిణి మచిలీపట్నం వారు “కథకరత్న” బిరుదును; గుఱ్ఱం జాషువా కళా సమితి, దుగ్గిరాల వారు “కథాప్రపూర్ణ” బిరుదును; కళాలయ సాహితీ సంస్థ, పాలకొల్లు వారు “కథాసుధానిధి” బిరుదును; పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారు “భావ కవితా భారతి” బిరుదును; విశ్వభారతి, ఒంగోలు వారు “కథాబ్రాహ్మి” బిరుదును; సాహితీ స్రవంతి, చీరాల వారు “సాహితీవాచస్పతి” బిరుదును ప్రదానం చేశారు.
“సహజ సాహితి” సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, చీరాల వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలులో కార్యనిర్వాహక సభ్యునిగా విశిష్ట సేవలందిస్తున్న వడలి రాధాకృష్ణ గారికి రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు ఎన్నో పురస్కారాలను ప్రదానం చేశాయి.
రజనీ కుందుర్తి, హైదరాబాద్ సాహితీపురస్కారం; తిక్కన రచయితల సంఘం, నెల్లూరు వారి సాహితీపురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ సాహితీపురస్కారం, డా॥ రావూరి భరద్వాజ స్మారక సాహితీపురస్కారం, “మల్లెతీగ” మాసపత్రిక జాతీయస్థాయి ప్రతిభాపురస్కారం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారిచే ప్రతిభాపురస్కారం, భువనగిరి-తేజ ఆర్ట్స్ జాతీయ సాహితీపురస్కారం, మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి వారు వట్టివేళ్ళు నానీల సంపుటికి యిచ్చిన ప్రతిభాపురస్కారం, డా॥ వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీపురస్కారం – 2007, శ్రీమతి పోగుల వెంకట రత్తమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం – 2008, గూడూరుకు చెందిన శ్రీమతి ఇ. రత్తమ్మ శ్రమశక్తి పురస్కారం -2010, చీరాల – పసుమర్తి పార్థసారథిరావు ప్రతిభాపురస్కారం-2011, నెల్లూరు డా|| నాగభైరవ స్మారక స్ఫూర్తి పురస్కారం – 2013, కడప డా|| కవితా స్మారక సాహితీపురస్కారం-2014, వేద విజ్ఞాన పరిషత్ శ్రీ సేవాశక్తి పీఠం సాహితీపురస్కారం-2017, చీరాల యర్రమిల్లి నరసింహారావు సాహితీపురస్కారం- 2019.
ఆకాశవాణి విజయవాడ, మార్కాపురం కేంద్రాలవారు వడలి రాధాకృష్ణ గారి కథలను, కవితలను ధారావాహికల రూపంలో ప్రసారం చేశాయి. ప్రముఖ హాస్య నటులు శ్రీ యల్.బి. శ్రీరామ్ గారు వడలి రాధాకృష్ణ గారి రచనను “పసుపు కుంకుమ” పేరుతో లఘు చిత్రంగా చిత్రీకరించారు. అనేక అవధానాలలో పృచ్ఛకునిగా పాల్గొన్నారు.
కథారచయితగా, కవితాసంకలనాలకర్తగా, ప్రధాన సంపాదకునిగా, పీఠికారచయితగా, సహజ సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘ కార్యనిర్వాహక సభ్యునిగా, అవధానపృచ్ఛకునిగా, జాతీయ స్థాయి విశిష్ట సాహితీ పురస్కారాల గ్రహీతగా, వక్తగా, సాహితీ సమావేశాల రూపకర్తగా, గ్రంథ ఆవిష్కర్తగా తెలుగు సాహితీ లోకంలో ప్రఖ్యాతి చెందిన వడలి రాధాకృష్ణ గారు నేటి యువ కథారచయితలకు మార్గదర్శకంగా నిలిచి స్ఫూర్తిదాయకమవుతున్నారు.
తెలుగు సాహిత్యంలో శతకానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదని మన పెద్దలు చెప్పి ఎన్నో శతకాలు వెలువరించారు కూడా…భక్తిని తెలిపేందుకు, భక్తి మార్గంలో నడిచేందుకు అంటే భక్తి ప్రచోదనంగా శతక సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది.
శతకము అంటే వంద. ఒకటి పక్కన రెండు సున్నాలు.ఈ వంద సంఖ్య ఆధ్యాత్మిక ప్రపంచంలో ( భక్తి సామ్రాజ్యంలో) ఎంతో వందనీయం. ఎలా అంటే….
ఒకటి సంఖ్య స్థానంలో శ్రీమన్నారాయణుడున్నాడనుకుంటే ఒక సున్న (0) జీవతత్త్వం మరొక సున్న (0) ప్రకృతి తత్త్వం ….ఈమూడు కలిసిన తత్త్వం…
1= శ్రీమన్నారాయణుడు
0= జీవ తత్త్వం
0 = ప్రకృతి తత్త్వం
100 = జీవ తత్త్వం…ఈ తత్త్వం గురువుల దైతే…
ప్రకృతి తత్త్వం అంటే పంచభూతాత్మకమైన శరీరం.
సర్వలోకేశ్వరుడు = ఒకటి (1)అనే అంకెను రెండు సున్నాల (00)ముందు ఒకటి చేరిస్తేనే (1+00) ఆ రెండు సున్నాలకు విలువ ఉంటుంది.
ఇంకా వివరంగా చెప్పాలంటే…
1= దివ్యశక్తి సాకారం. ( ఈ దివ్య శక్తే కదా! జగత్తును నడిపే శక్తి…)
అందుకే వందసార్లు వేడుకుంటూ రచయిత గాదె వేంకటరామారావు గారి “యాదగిరి లక్ష్మీనారసింహ” శతక రచనసాగింది.
మంచి సంప్రదాయ పరులు కావడం వల్ల శరణాగతి చేసారు.
శరణాగతినే ప్రపత్తి అనీ, భరన్యాసమనీ అంటారు. భగవంతుడే రక్షకుడు, మోక్షం కావాలన్నా ఆయనే ఉపాయమనీ ( శరణం) పూర్తి నమ్మకంతో భగవంతుని మనసులో నిలుపుకోవడమే శరణాగతి. మన భారాన్ని భగవంతుని పైన ఉంచడం న్యాసం లేదా శరణాగతి చేయడం…
అలా కాకుండా నన్ను నేను రక్షించుకుంటాననడం వ్యతిరేకమవుతుంది. ఎందుకంటే భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ రక్షించాలనే ఎదురుచూస్తుంటాడు. అది ఆయన స్వభావం. అందుకు వ్యతిరేకంగా: నన్ను నేను రక్షించుకోగలను ” అనే స్వతంత్ర భావన ఉండకూడదు. స్వప్రవృత్తి నివృత్తి అంటే ఇదే! ఇలా ఏ పరిస్థితులలో నైనా భగవంతుని మీద విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండడమే శరణాగతి లేదా ప్రపత్తి.
శరణాగతి చేయడానికి రెండు ప్రధాన లక్షణాలుండాలి. 1. ఆకించన్యము, 2. అనన్యగతి.
సకృదేవ ప్రపన్నాయ అని శ్రీరాముడూ,
సర్వధర్మాన్ పరిత్యజ్య అని శ్రీకృష్ణుడూ శరణాగతే సులభమైన, సుకరమైన మోక్షోపాయమని చెప్పారు.
శరణాగతి ఈ విధంగా ఒక్కసారి చేస్తే చాలు, సదాచార్యుల సమాశ్రయణం శరణాగతి మంత్రాన్ని ప్రసాదిస్తుంది.
శ్రీరామాయణాన్ని శరణాగతి వేదం అనీ,
విభీషణ శరణాగతిని పరిపూర్ణ ప్రపత్తి విధానం అనీ పెద్దలు నిరూపించారు.
రచయిత చెప్పిన భక్తి మార్గంలో నడిస్తే సులువుగా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని ఏకీభవిస్తూ…
శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకము :–
1.శార్దూలము
శ్రీ లక్ష్మీశ, నృసింహ, భక్తజన, సు శ్రేయోభిలాషా,హరీ
నీ లాలిత్యము సూసి నా కవిత సాన్నిధ్యాల సంసేవకై
అలాపంబున బల్కుచున్నది ప్రభూ ఆనందసంధాయివై మేలాసించుము దేవ! యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ !
ప్రతి పదార్థము:–
శ్రీ లక్ష్మీశ= లక్ష్మీదేవి భర్తైన; నృసింహ= నర శ్రేష్ఠుడు,
భక్తజన= భక్తులైన వారి; సు= మంచి; శ్రేయోభిలాషి= హితుడు; హరీ=విష్ణువు; లాలిత్యము = లలితము; సూసి= చూసి; నా= నాయొక్క;
కవిత =కవిత్వం ( శతకరచన) సాన్నిధ్యము=సన్నిధిలో
సంసేవ=పూజ, అర్చన ;
ఆలాపన= పలవరింత ;
పల్కు= మాట్లాడు;
ప్రభూ= ప్రభువా!
ఆనంద=సంతోషము;
సంధానము=సమకూర్చుట;
మేలు= శుభము, (ఉపకారం) ;
ఆసించు= కోరుకొను
దేవ= ఓ దేవుడా! ఇచ్చేవాడా!
యాదగిరి లక్ష్మీ నారసింహ = యాదగిరి గుట్టపై వెలసిన నరసింహా !!!
తాత్పర్యం:– యాదగిరి గుట్టపై వెలసిన ఓ నరసింహా! లక్ష్మీదేవి భర్తగా, నరశ్రేష్ఠుడిగా భక్త జనుల హితము కోరి,అందరికీ సుఖసంతోషాలనిచ్చేదేవుడా! నేను నీ అందమైన రూపం చూసి,నిన్నే పలవరిస్తూ , నీ దగ్గర పూజార్చన వలె నా శతకాన్ని నీకు సమర్పిస్తున్నాను.. స్వీకరించి ఆనందాన్ని కలిగించువయ్యా!
కవినై వచ్చితి జన్మ కర్మ ఫల సత్కారార్హ సౌభాగ్య సం
స్థవ నీయంబగుఁ గీర్తి చంద్రికలమందానంద సందోహలై
అవదానంబున భక్తిభావనల నత్యంతంబు లాలింపగన్
శివ దేవా కరుణించు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥
అర్థము:–
కవి= కవిత్వం చెప్పేవాడు,
జన్మ కర్మ ఫలం= పుట్టుకలచే ప్రారబ్దంతో కలిగిన ఫలితం;
సత్కారార్హ = మంచి పనులు చేయుటకు అర్హత;
సౌభాగ్య= యోగము;
సంస్తవ = చక్కని స్తోత్రం;
కీర్తి చంద్రికలు= వెన్నెల వంటి యశము
అమందానంద = అధికమైన సంతోషం;
సందోహము = సమూహం( మొత్తము)
అవదానంబున= తుంచి వేసి
భక్తి = శ్రద్ధ
భావన= తలంపు
అత్యంత= మిక్కిలి,
లాలింపగ = బుజ్జగించ,
శివ దేవా= శుభాలనిచ్చే వాడా!
తాత్పర్యం:– శుభాలనిచ్చే ! ఓ యాదగిరి లక్ష్మీ నరసింహ!! నాపై దయచూపుము. నేను
ఎన్నో జన్మల నుండి చేస్తున్న కర్మలతో కలిగిన ప్రారబ్ధాన్ని తొలగించుకోవడానికి, మంచి పనులను చేసే అర్హత యోగ్యతను ఇవ్వమంటూ చక్కని స్తోత్రాలతో వెన్నెల వంటి నీ ప్రతాపాన్ని ఎంతో సంతోషంతో, శ్రద్ధాసక్తులతో లలితంగా చెప్పడానికి కవినై వచ్చాను. నన్ను లాలించవయ్యా!
అలంకారం :-రూపకాలంకారం
కలలో గాంచితి నీదు రూపమును, సాక్షాత్కార సంపత్తియున్
కలగా వచ్చిన నీకు నా హృదయ సంకల్పంబు సిద్దించగన్
కల నాదంబున పద్య సద్రచన సత్కారంబు గావించెదన్
సెలవా! శ్రీనగవాస యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ॥
అర్థాలు :–
కల = స్వప్నం;
కాంచి= చూసి;
నీదు= నీ యొక్క;
రూపము= ఆకారం;
సాక్షాత్కారము= ప్రత్యక్షం
సంపత్తి= ఐశ్వర్యం
హృదయము= మనసు;
సంకల్పము= మనసులో పని తలపెట్టుట
సిద్ధించుట= లభించు
కల= కలిగిన;
నాదం= ధ్వని ( మోత)
పద్యము= యతి ప్రాసలతో కూడిన రచన
సత్= మంచి;
రచన= కవిత్వం చెప్పడం;
సత్కారము= సమ్మానం;
గావించుట= చేయుట.
శ్రీ= శ్రేష్టమైన;
నగము= కొండ.
తాత్పర్యం:–
పవిత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన యాదగిరి లక్ష్మీ నరసింహా! నా ఎదుట కనిపించగానే, నీ యొక్క సామర్థ్యాన్ని, ఐశ్వర్యాన్ని చూసిన నా మనసు నిన్ను సమ్మానించాలనే తలపుతో నా ఆత్మ మనసును, మనసు వహ్నిని, వహ్ని వాయువును ప్రేరేపించగా వాయువు బ్రహ్మ గ్రంథి యైన మూలాధారం నుండి ఊర్ధ్వ ముఖంగా నాభి, హృదయం, కంఠం, శిరస్సు, ముఖం నుండి మంచి పద్యాలను రచించి నిన్ను సన్మానించాలని తలచాను.
4.మత్తేభము
జననంబందినదాది సచ్చరిత సంస్కారంబులం జెందకన్
దినముల్బుచ్చుచు,దీనమానసుడనై దివ్య
ప్రభావంబులన్
గనలేనైతిని మూఢ జన్మునకు సంకల్పాల రాగంబు జే
సిన దేవా శృతినిమ్ము యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥
అర్థాలు:–
జననంబు= పుట్టుక ;
అందినదాది= పుట్టినది మొదలు;
సచ్చరిత= మంచి నడవడి;
సంస్కారంబులు= పంచ సంస్కారములు [ తాప సంస్కారం, పుండ్ర సంస్కారం, నామ సంస్కారం, మంత్ర సంస్కారం, వైష్ణవేష్టి]
చెందక= పొందక;
దినము=రోజులు;
పుచ్చుచు= గడుపుచు;
దీన= భయంతో;
మానసుడు= మనసుకలవాడు;
దివ్య=ప్రకాశించు;
ప్రభావంబులు=మహాత్మ్యము;
కనలేనైతి= చూడలేకపోతిని;
మూఢ= తెలివిలేని;
సంకల్పాలు= బాగా ఆలోచించుట;
రాగంబు= రాగద్వేషాలు
శృతి=వేదాధ్యయనం.
తాత్పర్యం:—
యాదగిరి లక్ష్మీ నరసింహా! పుట్టినది మొదలు మంచి నడవడి లేక , గురువులతో సమాశ్రయణం పొందకుండా, కాలం వృధాగా గడిపుతూ… నా తెలివి తక్కువ తనంతో, నా మనసు రాగద్వేషాలతో నిండిపోయి, ఆలోచించే జ్ఞానంలేక నీ యొక్క మహాత్మ్యం చూడలేక పోతిని! నా వంటి తెలివి లేని వానికి వేదాధ్యయనము చేసే జ్ఞానమునిమ్ము!
5 శార్దూలము
నేముక్తుండనుగాన, నవ్వు ముఖమున్, నిర్దోష భద్రా కృతిన్
ధీమంతోజ్వల విశ్వదర్శన కళాధ్యేయంబు పూర్ణత్వమున్
సామీప్యంబును గాంచినాడగద శ్రీశా భక్త కల్పధ్రుమా
శ్రీ మంతా జయదేవ యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥
అర్థాలు:–
నే= నేను
ముక్తుండ = మోక్షం పొందిన వాడను
నిర్దోష = తప్పు చేయని వాడు
భద్రాకృతి = శుభా కారుడు( శ్రేష్ఠుడు)
ధీమంతము = బుద్ధి గల
ఉజ్వలము = వెలుగునది
విశ్వదర్శన = ప్రపంచాన్ని పారమార్థికంగా చూడడం
కళ = విద్య( శోభ)
ధ్యేయంబు = లక్ష్యము( గురి)
పూర్ణ త్వము = నిండుగా( సంపూర్ణ)
సామీప్యంబు = దగ్గర ( దాపు)
శ్రీశా = లక్ష్మిభర్త ( విష్ణువు)
కల్ప ధ్రుమ = కోరినవి ప్రసాదించే దేవతా వృక్షం
శ్రీమంత = భాగ్యవంతుడు
జయదేవ = గెలుపు( జయము)
తాత్పర్యం:–
యాదగిరి లక్ష్మీ నరసింహ! నీ యొక్క ఎలాంటి దోషాలు లేని నవ్వు ముఖాన్ని, శ్రేష్టమైననీ రూపాన్ని, శోభతో వెలిగి పోయే నీ రూపును పారమార్థిక దృష్టితో చూడాలని లక్ష్యంతో దగ్గరనుండి చూసాను కదా!
లక్ష్మీ వల్లభా కోరిన కోరికలు తీర్చే భాగ్యవంతుడా! నేను మోక్షం పొందడానికి అర్హుడను కానా? నీకు జయం కలుగుగాక!
6.శార్దూలము
చేమంతుల్ విరజాజి కేతకులు సచ్ఛీలాల మందారముల్
మీ మేలుందలబోయ, యక్షతలు సామీప్యాల సంధింపగన్
నోమున్నోమెద గంధహారతుల నెన్నో గూర్చి సర్వాత్మకా
శ్రీమంతా సెలవిమ్ము యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ॥
అర్థములు:–
చేమంతులు = చామంతి పువ్వులు
విరజాజి = నవ మాలిక పువ్వులు( జాజిపూలు)
కేతకులు = మొగిలి పువ్వులు.
సచ్ఛీలాల = సువాసన గలిగిన
మందారాలు = మందార పువ్వు
మేలు = ఉపకారం
అక్షతలు = ఆశీర్వదించేందుకు పసుపు కలిపిన విరగని బియ్యం( అక్షంతలు)
సామీప్యము = దగ్గరలే
సంధింప = కూర్చు (కలుపు)
నోము = వ్రతము
గంధ హారతులు = చందనము, కర్పూర ఆరతి
ఎన్నో కూర్చి = ఎన్నో చేర్చి
సర్వాత్మకా = అంతటా వ్యాపించిన
శ్రీమంతా = భాగ్యవంతుడా
సెలవిమ్ము = ఆజ్ఞ ఇవ్వు
తాత్పర్యం:–
ఓ!యాదగిరి నరసింహా! మాకు నువ్వు చేసిన ఉపకారాన్ని తలుచుకుంటూ కృతజ్ఞతగా, నీ దగ్గరే ఉంటూ, చేమంతులు, విరజాజులు, మొగిలి పువ్వులు, మందారాలు, అక్షంతలు, మంచి వాసన కలిగిన చందనం, కర్పూర హారతులతో నీ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాము… ఓ భాగ్యవంతుడా
ఆజ్ఞ ఇవ్వు!
7.మత్తేభము
సురధీప్తిన్ లిఖితారక్షరంబుల వలెన్ సూచించు సాహిత్య సం
బర లేఖాకృతి గ్రంథజాతములు, దుష్ప్రాప్తానబోర్లాడు చున్
దరిజేర్పుండని మ్రొక్కుచున్నవి కరద్వంద్వాల బైకెత్తి రా
సిరి నాకుంగలిగించు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ!
అర్థములు :—
సురధీప్తిన్ = అధిక కాంతితో
లిఖిత = రాయబడిన;
అక్షరంబులు = (క్షరముకానివి) ఓనమాలు
సూచించు = తెలియజేయు
సాహిత్య = హితముతో కూడిన
సంబర = ఉత్సవము( పండుగ)
లేఖాకృతి = ఉత్తరంవలె
గ్రంథ జాతములు = కావ్యా సమూహం
దుష్ప్రాప్త = పరితపించేలా చేయునవి
బోర్లాడు = ముఖం నేలకు ఆనేలా పడిపోవు
దరిచేర్పుండని = తీరం చేర్చమని
ద్వంద్వము = రెండు
కరము = చేతులతో
పైకెత్తి = తల మీదకు చేర్చి
మొక్కుచు = నమస్కరించుచు
సిరి = శోభ
నాకు కలిగించు = నాకు ఇవ్వు
తాత్పర్యం:—
ఓ లక్ష్మీ నరసింహా! ముత్యాలవలె రాసిన అక్షరాలతో రాసిన లేఖలు మంచి హితవు కోరే కావ్యాలను పరితపింపచేస్తాయి. మంచి హితవు కోరిన కావ్యాలు అడుగున పడిపోతాయి అలా కాకుండా నాకు మంచి విద్యనిమ్మనిరెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను !!
8.శార్దూలము:-
వింటిన్ వేద పురాణ భారత కథావిర్భూత భావంబులన్
గంటిన్ భాగవత ప్రబంధ చయ సత్కావ్యార్థ ఛందంబులన్
కుంటైపోతిని నీదు మాయ గన లేకుంటిన్ వృషీకేశవా
యింటింటన్ గలవాడ యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ!
అర్ధములు:–
వేద పురాణ భారత కథావిర్భూత= వేదాల, పురాణాల ,భారత కథల నుండి
భావంబుల = అభిప్రాయాల
వింటిని = విన్నాను
కంటిన్ = తెలుసుకున్నాను
ప్రబంధ = ప్రబంధాల యొక్క
చయ = సంగ్రహాలు
సత్కావ్య = ఉత్తమమైన కావ్యాలు
అర్ధ = అర్థాలు
ఛందంబులన్ = అభిప్రాయాలను
కుంటినై = అవిటి వాడినై
నీదు = నీ యొక్క
మాయగన = గారడీని తెలుసుకో
లేకుంటి = లేకపోతి
వృషీకేశవా = విష్ణువు
యింటింట = ప్రతీ యింటిలో
తాత్పర్యం :–
ఓ యాదగిరి లక్ష్మీ నరసింహప్రభూ!
వేదాలలోని ,పురాణాలలోని మరియు భారత కథలలోని భావాలను విన్నాను. ప్రబంధాలలోని మంచి విషయాలను చూశాను.ప్రతి ఇంట్లో ఉన్న వృషీకేశవా ! నీ మాయను వైకల్యంతో తెలుసుకోలేక పోయాను!
9.శార్దూలము:
మెట్లెక్కాలని యెక్కుచుంటి నలకల్మీదారిలోనున్నదా
కట్లం జూసెగ బోతబోసుకుని, దీక్షంబూర్తిగావించి రా
కట్లం దాటితి నేను నీవు దయతో గైవల్య లోకానికిం
కెట్లో నం దరిజేర్చు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ ॥
అర్ధాలు :–
మెట్లు = తంతెలు ( సోపానములు)
ఎక్కడం = అధిరోహించడం
కల్మి = కలిమి( సంపద)
దారి = తోవ ( బాట )
ఉన్న = వాస్తవం
తాకట్లు = చాడీలు ( కొట్లాట)
పోతపోసుకొని = అచ్చు పోసినట్టు( ఉన్నది ఉన్నట్టు)
దీక్ష = పట్టుదల
కట్లు = తాడుతో కట్టడం
కైవల్యము = మోక్షం
లోకము = ప్రపంచం
దరిచేర్చు = గట్టు చేర్చు.
తాత్పర్యం :—
ఓ యాదగిరి లక్ష్మీ నారసింహ ప్రభూ !
నేను మెట్లు ఎక్కాలని ఎక్కుతున్నాను.. కానీ అవి వంకరటింకరగా ఉండి, అచ్చంగా తగవుపెట్టి అడ్డుపడేలా ఉన్నాయి. ఎలాగో పట్టుదలగా ఆ మెలికలను దాటాను. నువ్వు దయతో స్వర్గ లోకానికి చేర్చు!
విశేషార్థం:– సాధకుడు మోక్షగామియై దీక్షబూని, యజ్ఞం, యాగం, తపస్సు, దానం మంచి నడవడితో ధర్మబద్ధంగా జీవించడం మొదలైన ఎన్నో సాధనలు చేస్తున్నాడు. కానీ ఆసాధనకు ఎన్నో అంతరాయాలు ఏర్పడినా, పట్టుదలతో సక్రమంగా నెరవేర్చి స్వర్గ సోపానాలన్నీఎక్కే ప్రయత్నంలో ఓ!యాదగిరీశా!!
దయతో నన్ను ఆ మోక్షలోకానికి తీసుకుని వెళ్ళు
అని మోక్ష గామిగా కవి హృదయం ఆవిష్కరించారు.
10 శార్దూలము
స్వామీ! నీకు నమస్కృతుల్సలిపి యీషా! భావమున్ గల్గి ఢ
క్కామొక్కీలను లెక్కసేయకను ,సంకల్పంబు సిద్ధింప గన్
ప్రేమానంద మరంద కందళిత, సంప్రీతిన్
యశః కామినై
మీముందాగితినయ్య! యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ
అర్ధాలు :–
స్వామి = యజమాని
నమస్కృతులు = నమస్కారాలు
సల్పి = చేసి
ఈషా = ప్రభువా!
భావము కలిగి = అభిమానంతో
ఢక్కాముక్కీలు = ఇబ్బందులు( కష్టనష్టాలు)
లెక్కచేయక = లక్ష్యపెట్టక
సంకల్పంబు = ఒక పని చేయాలనే ఆలోచన
సిద్ధింపగా = నెరవేరగా( సమకూరగా)
ప్రేమానంద మరంద కందళిత= మొగ్గ తొడిగిన తేనె వంటి తీయనైన పరవళ్ళు తొక్కే ఆనందంతో కూడిన ప్రేమ
సంప్రీతి = ప్రేమ
యశఃకామిని = కీర్తి కాంత
మీ ముందు = నీ ఎదుట
ఆగితిని = నిలిచాను
భావము:– యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభూ!! నువ్వే నాకు ప్రభువని తలచి,నీకు నమస్కారాలు చేసి, కష్టనష్టాలను లెక్కచేయకుండా నన్ను కీర్తికాంత వరించాలనే కోరికతో హుషారుగా పరవళ్ళు తొక్కే సంతోషంతో నీపై ప్రేమతో మీ ముందు నిలిచానయ్యా!
వ్యాకరణ విశేషం
అలంకారం :-రూపకాలంకారం
వీరభద్రాసనము
చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి.
కాళ్ళ మధ్య కాస్త దూరం ఉంచి తరువాత రెండు అరచేతులు నేలవైపు చూస్తున్నట్లు చేతులను భుజాలకు సమాంతరంగా చాచి కుడివైపుకు తిరుగుతూ కుడిమోకాలును 90 డిగ్రిలకు మడచి నడుమును ముందుకు ఛాతీని వెనక్కి విరుస్తూ తలను పైకెత్తాలి. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకని మరలా యథాస్థితికి వచ్చి ఇదేవిధంగా ఎడమవైపు చేయాలి.

ఉపయోగాలు:
2. విపరీత వీరభద్రాసనము :
తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు చేతులు పైకెత్తి కుడికాలు ముందుకు ఎడమకాలు వెనక్కి చాచాలి. కుడికాలిని వెనక్కి వంచుతూ కుడిచేతిని కుడి మోకాలిపై వేస్తూ ఎడమకాలిని 90 డిగ్రిలకు మడిచి ఉంచి పైనున్న ఎడమ చేతిని చూస్తూ ఉండాలి. నాలుగైదు శ్వాసల అనంతరం యథాస్థితికి వచ్చి మరోవైపు చేయాలి.
ఉపయోగాలు : కాలికండరాలు, పిక్కలు, భుజాలు శక్తివంతం అవుతాయి.

౩. నమస్కార వీరభద్రాసనము
చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచి కుడికాలును బాగా వెనక్కి తీసుకెళ్ళాలి. ఎడమ మోకాలిని 90 డిగ్రిలకు మడిచి నడుమును ముందు ఛాతీని వెనక్కి విరుస్తూ తలపైకెత్తి నమస్కారాన్ని చూడాలి. నాలుగైదు శ్వాసల అనంతరం యధాస్థితికి వచ్చి మరొకవైపు చేయాలి.
ఉపయోగాలు
` కాలికండరాలు, భుజాలతోపాటు వెన్నెముక శక్తివంతం అవుతుంది.
4. పాదహస్తాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి.
మోకాళ్ళను వంచకుండా నడుము నుండి నెమ్మదిగా ముందుకు వంగి రెండు అరచేతులను రెండు పాదాల పక్కన ఉంచాలి. తలను సాధ్యమైన ముందుకు వంచుతూ మోకాళ్ళపై ఆనుకొనేలా చేయాలి.
ఉపయోగాలు:
సూచన: నడుము నొప్పి ఉన్నవారు ముందుకు వంగే ఆసనాలు వేయరాదు.
5. విలోమ పాదహస్తానము
చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు చేతులను మెడవెనుక కలిపి ఉంచి రెండు కాళ్ళను కత్తెర మాదిరిగా, వ్యతిరేక దిశలో పాదాలు ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ రెండు అరచేతులను పాదాల కిరువైపులా నేలపై ఉంచాలి. 5,6 శ్వాసల అనంతరంపైకి లేవాలి. ఇదే మాదిరిగా పాదాలను మార్చి మరోసారి చేయాలి.
ఉపయోగాలు :
6. ఏకపాద హస్తాసనము:

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. కుడికాలిని మడిచి కుడిపాదం ను ఎడమ తొడపై ఉంచి, రెండు చేతుల్ని పైకెత్తాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ రెండు అరచేతులను ఎడమపాదంకు, ఇరువైపులా ఉంచాలి. 5,6 శ్వాసల అనంతరం యధాస్థితికి వచ్చి ఇదే మాదిరిగా ఎడమకాలిని మడిచి కుడిపాదం ప్రక్కగా రెండు అరచేతులు ఉండేటట్లు చేయాలి.
ఉపయోగాలు :
7. ఏకపాద అంగుష్టానము
చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు కాళ్ళను కాస్త దూరం జరిపి రెండు చేతులను నడుముపై ఉంచాలి. కుడికాలును ముందుకు చాచి కుడిచేత్తో కుడి బొటనవేలును పట్టుకొని కాలుని వంపు లేకుండా సాగదీయాలి. నాలుగైదు శ్వాసల అనంతరం సమస్థితికి వచ్చి మరో కాలుతో ఇదేవిధంగా చేయాలి.
ఉపయోగాలు :
8. అర్థచంద్రాసనము
చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు కాళ్ళను వీలయినంత దూరం జరిపి కుడిపాదంను కుడివైపుకు తిప్పి రెండు చేతులు పైకెత్తాలి. నెమ్మదిగా కుడివైపుకు వంగుతూ కుడిచేతిని కుడిపాదం పక్కన ఉంచి ఎడమకాలిని పైకెత్తాలి. నాలుగైదు శ్వాసల తరువాత యధాస్థితికి వచ్చి మరలా ఎడమవైపు ఇదేవిధంగా చేయాలి.
ఉపయోగాలు :
9. పవిత్ర అర్థచంద్రాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు కాళ్ళను వీలయినంత దూరం జరిపి కుడిపాదంను కుడివైపుకు తిప్పి రెండు చేతులు పైకెత్తాలి. నెమ్మదిగా కుడివైపుకు వంగుతూ ఎడమచేతిని కుడిపాదం పక్కన ఉంచి ఎడమకాలిని పైకెత్తాలి. నాలుగైదు శ్వాసల తర్వాత యధాస్థితికి వచ్చి మరలా ఎడమవైపు ఇదేవిధంగా చేయాలి.
ఉపయోగాలు :

10. పార్శ్వకోణాసనము
చేయు విధానము: తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. కాళ్ళ మధ్య వీలయినంత దూరం ఉంచి కుడిపాదంను కుడివైపుకు తిప్పుతూ మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమ చెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని తరువాత శ్వాసను తీసుకుంటూ యధాస్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమవైపు చేయాలి.
ఉపయోగాలు

11. పరివృత్త పార్శ్వకోణాసనము
చేయువిధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. కాళ్ళ మధ్య వీలయినంత దూరం ఉంచి కుడిపాదంను కుడివైపుకు తిప్పుతూ మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. కుడిచేతిని పైకెత్తి ఎడమ అరచేతిని కుడిపాదం ముందు నేలపై ఆనించాలి. నాలుగైదు శ్వాసల అనంతరం యధాస్థితికి వచ్చి మరోవైపు చేయాలి.
ఉపయోగాలు :
12. పరిఘాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. శ్వాస విడుస్తూ రెండు కాళ్ళను వీలయినంత దూరం జరిపి, అరచేతులు నేలను చూస్తున్నట్లు భుజాల పక్కకు చేతులను సమాంతరంగా చాచాలి. నెమ్మదిగా ఎడమకాలిని మడిచి కుడికాలును పూర్తిగా చాచాలి.
శ్వాస తీసుకుంటూ రెండు చేతులను నమస్కార ముద్రలో ఉంచి, మరలా నెమ్మదిగా శ్వాస విడుస్తూ రెండు చేతుల మధ్య నుండి తలను మోకాళ్ళకు ఆనించాలి.
ఈ స్థితిలో నాలుగైదు, శ్వాసలు తీసుకున్న తరువాత యధాస్థితికి వచ్చి, తరువాత మరొకవైపు చేయాలి.
ఉపయోగాలు :

పూలతోటలెన్నో ఉంటయి.పూలెన్నో పూస్తయి.అందులో వర్ధిల్లేవి ఎన్ని.పరిమళాలు వెదజల్లేవి ఎన్ని.నందివర్ధనం కనబడడం అరుదు,అందునా నెలనెలా నెలవంకలా కనబడడం ఆశ్చర్యం,అద్భుతం.
వివేకవంతులైన వివేక సర్వీస్ సొసైటీ ,అప్పాజోస్యుల ఛారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ‘ నెలా నెలా నందివర్ధనం ‘ సభా కార్యక్రమములో ఈ రోజు 84 వ నందివర్ధనము గా తానూ ఒక సుగంధ ద్రవ్యమైన ఒక విశిష్ట వ్యక్తి, ,తెలుగు చదువును,తెలుగు రాతను చరిత్ర కావ్యంగా మలచిన శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి చరిత్రను శోధించి సాధించి సభలో సంధించిన ప్రముఖ రచయిత,సంపాదకురాలు డా : కొండపల్లి నీహారిణి గారికి అభినందనలు.

ఒకరి చరిత్ర గురించి ఒక నిండు సభలో మీరు వచ్చి చెప్పాలన్న సాహిత్యాభిమానుల కోరికను కాదనలేక వందల కిలోమీటర్ల దూరం పయనించడానికి సిద్ధమైన నీహారిణి గారి వెంబడి నేను , నా భార్య జ్యోతి రథానికి జోడు గుఱ్ఱాల లాగా హైద్రాబాదు అల్మాస్ గూడా శ్రీ శ్రీ హోమ్స్ లోని శ్రీ కొండపల్లి శేషగిరిరావు ఆర్ట్ గ్యాలరీ నుండి పొద్దున నాలుగు గంటలకు బాపట్ల కు బయలుదేరినం.యుద్ధం చేసేది ఎంత వీరుడైనా రధ సారధి సమయస్ఫూర్తి కలవాడు కాకపోతే చాలా కష్టం.మా రథ సారధి డ్రయివర్ ప్రభాకర్ అనుభవం ,అతని కవితా పిపాస తోడుగా బయలుదేరి బంకులో కారుకు కడుపునిండా మేత తినిపించుకున్నాం . సూర్యాపేట దగ్గరలో గల Hotel 7 లో ఇడ్లీ వడ తిని చాయ తాగి బాపట్ల కు బయలుదేరినం.నిజంగా Hotel 7 అదొక Heaven.చాలా శుభ్రంగా వున్నది.అక్కడ సినిమా నటులు కూడా ఆగి తిని పోతరు అని విన్నది నిజమేననడానికి మా ముందు Table దగ్గర కూర్చుని టిఫిన్ చేసిన సినీ నటుడు రాజా రవీంద్ర గారు నిజం చేసినరు.ఆయనను చూడడం కొత్త అనుభూతిని నింపింది.

Hotel 7 దగ్గర సెలవు తీసుకొని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి నిర్ణయించుకున్నాం .దొరికిన ఆ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మేము సిద్ధమై దర్శనం గావించుకుని , దగ్గరలో గల మంగళగిరి పానకాల స్వామిని చూసి పానకం ఆయనకు పోసి మేము తాగి అధ్భుతమైన గోపురం చూసి అమరావతి చేరుకున్నం.
అమరావతిలో అమరలింగేశ్వరుని దర్శించి , మౌనముద్ర లో కూర్చుని నిలువెత్తు ఆదర్శంగా కనిపించిన బుధ్ధుని చూసి అక్కడ ఆర్య వైశ్య హోటల్లో ఒనగాయ ( చింతకాయ ) పచ్చడి తో కూడిన భోజనం చేసి బాపట్లకు బండి కట్టినం.అక్కడ మేము బసచేయడానికి Kavuri Grand లో రూము ఏర్పాటు చేసిండ్రు. ‘ కావూరి వారి సత్రం ‘ (Lodge ) చాలా నీట్ గా వుంది.అక్కడకు మేము చేరుకునేసరికి సభా నిర్వాహకులలో ఒకరైన సాహిత్యాభిమాని శీలం శ్రీనివాస్ గారు సభా సమన్వయకర్త గా సాదర స్వాగతం పలికినరు.
అక్కడ ఒక గంట రెస్ట్ తీసుకుని చాయ తాగి బాపట్ల దగ్గరలో గల ఒక వృద్ధాశ్రమములో నిర్వహించే ‘ నెలనెలా నందివర్ధనం ‘ మినీ సభకు వెదుళ్ళపల్లి మీదుగా శ్రీనివాస్ గారి వెంట పోయి సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణం చేరుకున్నం. ప్రముఖ సాహితీవేత్త అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఎంతో

ఆత్మీయంగా పలకరించారు. అక్కడ నిర్వాహకులు అందించిన చీరాల స్పెషల్ బాదుషా , వేడి వేడి చిన్న సమూసాలు, నెయ్యి వేసిన ఇడ్లీ తిన్నాం.తర్వాత వేడి వేడి టీ తాగి సభికులకు కేటాయంచిన కుర్చీలలో కూర్చున్నం.
సభ ప్రారంభమైంది. ఈ సంస్థ వారు నిర్వహించే వేదిక పైన కేవలం ఆ రోజు ముఖ్యుల గురించే మాట్లాడే వక్త ఒక్కరే కూర్చోవడం జరుగుతుంది.సభలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి గురించి డా : కొండపల్లి నీహారిణి గారు ఇచ్చిన ఉపన్యాసం ఏ ఆయాసము లేకుండా అందరు హాయిగా వినడం జరిగింది. లక్ష్మణరావు గారు తెలుగు భాషా వ్యాప్తికి మరియు ఇతర భాషల కొరకు చేసిన కృషిని సోదాహరణంగా వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది.
చప్పట్లతో అభినందనలు తెలిపారు.
సభ ముగియగానే అందరితో మాట్లాడి, వారు ఇచ్చిన గ్రంథాలను, పుస్తకాలనూ తీసుకొని , సెలవు తీసుకుని బయలుదేరాం.
బాపట్ల లోని ‘ బొమ్మరిల్లు ‘ రెస్టారెంట్ కు పోయి పులుకాలు పన్నీరు కూర్మాతో తిని మాకై కేటాయించిన లాడ్జ్ లో రెస్ట్ తీసుకున్నం.
పొద్దున్నే లేసి దగ్గరలో బీచ్ వున్నది చూద్దాం అని ప్రభాకర్ చెప్పకపోతె ‘ సూర్యలంక ‘ బీచ్ చూసే అదృష్టం కోల్పోతుమనుకుంటా.సముద్రపు అలల అల్లరిని తనివితీరా చూసి ఒక అరగంట దూరంలో వున్న ‘ జిల్లెలమూడి ‘ కి బయలుదేరినం.జిల్లెలమూడి అమ్మ అంటే ఓ కాలాన ఒక వెలుగు వెలిగింది.మా చిన్నప్పుడు మా అమ్మ తోని అక్కడకు పోయినమని మా చిన్నక్కయ్య ( నీహారిణి ) చెప్పింది. జిల్లెల్లమూడి అమ్మ ఇప్పుడు లేకున్నా అక్కడ ఆమె ఆనవాళ్లు చెదిరిపోలేదు. ఇప్పటికి అక్కడ సేవా కార్యక్రమాలు,భజనలు కొనసాగుతూనే వున్నాయి.
అక్కడి నుండి పెదనందిపాడు మీదుగా చిలకలూరిపేటకు చేరినం.అక్కడ టిఫిన్ , టీ కానిచ్చి పిడుగురాళ్ళ , దామరచెర్ల దాటి మిర్యాలగూడ దగ్గరికి వచ్చేసరికి నేను కొన్నేళ్లు జాబ్ చేసిన ఆఫీసు యజమానులు మా Chairman Sir , MD Sir ఊరు గదా అని ఒక్కసారి మనసు పులకించి నా సంతోషాన్ని కారులో వున్న వారితో పంచుకున్న.మధ్యలో ‘ తిప్పర్తి ‘ తగిలింది.మా చిన్నప్పుడు వరంగల్ నుండి వచ్చి అక్కడ దిగి ఎడ్లబంఢిలో మా మేనమామల ఊరు గోపాలపురం చేరేవారం. ఆపాతమధురాల్లాంటి ఆ పాత ముచ్చట్లు ఎన్నో పంచుకున్నాం. ఇక ముందుకు కదిలి నార్కట్ పల్లిలో ‘ వివేరా ‘ హోటల్ దగ్గర ఆగి టీ తాగి ‘ చకినాలు ‘ కొనుక్కొని హైద్రాబాద్ కు చేరినం…




దసరా సెలవుల ముందురోజు పూల వనంలా మారింది బడి. బతుకమ్మ లోని రంగు రంగుల పూలకు సాటిగా రంగు రంగుల బట్టల్లో పువ్వుల్లా కేరింతలు కొట్టే చిన్నారులతో ప్రతీ ఏడాది దసరా సెలవుల ముందు రోజు బతుకమ్మ సందడి సంతరించు కుంటుంది తెలంగాణ బడులల్లో.
కాలంతో పాటు ప్రయాణించాలి కాబట్టి కాలానికనుగుణంగా కట్టూ బొట్టుకు అలవాటు పడిన పిల్లలు చక్కని పరికిణీలు కట్టుకొని వాలుజడలు, వాటి చుట్టూరా పూల దండలు, పాపిట బిళ్ళ లు – చంపసరాలు , వడ్డాణాలు – వంకీలు, గాజులు – గజ్జెలు, కాటుకలు – గోరింటాకు భారతీయ వస్త్రధారణలో ధగ ధగా మెరిసిపోతూ బతుకమ్మలు పట్టుకున్న అమ్మాయిలను కళ్ళనిండుగా చూస్తూ ఉంటే కళ్ళకింపుగా ఉంటుంది.
ప్రతి దానికీ తీన్ మార్ డాన్సులు మాత్రమే తెలిసిన మగపిల్లలు కోలాటం కర్రలు పట్టుకుని పాటలకనుగుణంగా పదం కలపడం భారతీయ సంస్కృతిక వైభవాన్ని గుర్తుచేస్తోంది. పాశ్చాత్య పోకడలు ఎన్ని పెరిగినా భారతీయత మాత్రం లోపల అలాగే భద్రంగా ఉంది అనే సంతోషాన్ని , భరోసాను నింపుతోంది. విద్యాలయాల్లో జరిగే ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పరిచయం చేస్తాయి. మూలాలు మరువకుండా చూస్తాయి.
ఎప్పటిలానే సరిగా అర్థం కాని తీన్ మార్ పాటలు కాకుండా మంచి భావం, సందేశం గల సాహిత్యంతో అచ్చతెలుగు పాటల వల్ల ఈ తరం పిల్లలకు తెలుగు పదాలు పరిచయం అవుతున్నాయి. జస్టిన్ బీబర్, షకీరా పాటలే కాదూ అచ్చతెలుగు పాటలూ అంతే ఉత్సాహాన్ని ఊపునూ ఇస్తాయని పిల్లలకు తెలిసేలా నిరూపిస్తున్నాయి బతుకమ్మ పాటలు.
తెలంగాణ రాష్ట్ర పండగగా గౌరవం దక్కిన తర్వాత కాలం నుండి ఇప్పటి తరానికి అర్థమయ్యే భాషలో చాలా చాలా బతుకమ్మ పాటలు రాయబడుతున్నాయి, ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ప్రత్యేకంగా బాణీలు కట్టబడుతున్నాయి. అయితే వెనుకటి నుండి కూడా ప్రాచుర్యంలో ఉన్న పాటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…, ఒక్కొక్క పువ్వేసి సందమామ…, రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీ రామ ఉయ్యాలో…ఇలాంటి పాటల్లో ప్రజల జీవన విధానం ప్రతిబింబించేలా సుఖ దుఃఖాలు కలగలిసిన బతుకులు అగుబడేలా పాటలు ప్రాచుర్యంలో ఉన్నవి.
నిజానికి తెలంగాణ ఏర్పడక ముందు వరకు ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న బతుకమ్మ పండుగ దక్షిణ తెలంగాణ లోని పాలమూరు జిల్లాలో తెలియదు. ఎక్కడా బతుకమ్మ ఆడే వారు కాదు కానీ ఏరొంక పున్నమి, పీర్ల పండుగలప్పుడు పిల్లలను అమ్మవార్లుగా భావించి మధ్యలో కూచోబెట్టి చుట్టూరా చేరి పాటలు పాడుతూ బొడ్డెమ్మ వేసే వారు. తెలంగాణా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి, సభ్యత చాటిచెప్పే వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఉద్యమనాయకుల ఆదేశం అయ్యిందీ ఇప్పుడదే ఆనవాయితీ అయ్యిందీ.
తెలంగాణ ఏర్పడ్డాక దీనికి రాష్ట్ర పండగ గా గౌరవం కల్పించబడింది. అప్పటినుంచి తెలంగాణా ప్రభుత్వం ఈ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తప్పని సరిగా బతుకమ్మ నిర్వహించేలా ఆదేశాలు చేసింది. ప్రజలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు,కార్యాలయాలు బతుకమ్మను నిర్వహించడానికిగాను అనేక వేదికలు ఏర్పాటు చేసి, పూవులు,విద్యుత్ వెలుగులు, పాటల కోసం మైకులు సమకూర్చి వేడుక చేసుకునేలా సౌలభ్యం కల్పిస్తోంది.
భారతీయులు ప్రాణి కోటి మనుగడకి కారణం అయిన ప్రతి దానినీ అంటే విశ్వంలోని సూర్యచంద్రులు, గ్రహాలు నక్షత్రాలు, గాలి, నీరు, నిప్పు, నేల, రాయి రప్ప, చెట్టు,పుట్ట , కొండ, గుట్ట, పాము,పక్షీ, జంతువు, కాలం, ఇలా ప్రతీది చివరికి జీవనానికి ఉపయోగపడే వస్తువులను కూడా కృతజ్ఞతా భావంతో దేవతల రూపంలో కొలుస్తారు. సామూహికంగా పండగలు, పర్వదినాలు చేస్తారు. భారతీయ పండుగలలో ప్రతి పండగకి ఓ పరమార్థం ఉంటుంది. ప్రతి ఉత్సవానికి ఓ కథ ఉంటుందీ. కాల గమనంలో ఉత్సవాల వెనక కథలు మారుతూ కొత్తవి చేరుతూ పోతున్నా ఉత్సవాల ఉద్దేశం మాత్రం అంతర్లీనంగా అదే ఉంటుంది.
ఇక బతుకమ్మ పండుగ విషయంలో రకరకాల కథలు కథనాలు ప్రచారంలో ఉన్నా జీవులకు మనుగడకి కారణం అయిన ప్రకృతిని గౌరీదేవి పేరుతో కొలుస్తూ ఆమెకు ప్రతిరూపంగా సహజ సంజీవని రోగ నివారణి అయిన పసుపు ముద్దను చేసి ఆ ప్రతిమ చుట్టూరా అందుబాటులో ఉన్న పూలను అలంకరించి అందరూ చుట్టూ చేరి పాటలు పాడుతూ ప్రాణులకు బతుకునిచ్చే దేవతగా బతుకమ్మ పేరుతో కొలుస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురి అయి అంత పెద్దగా జరుపుకోని ఈ బతుకమ్మ పండుగ ఈ నాడు ప్రత్యేక తెలంగాణకు ప్రత్యేక పండగ. రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు – ఊరు, వాడ – వాడా చేరింది. రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా, ఇంత కళగా పుష్కలంగా పువ్వులతో జరుపుకోవడంతో ప్రజలకు వేడుకే కాదు ఆ పువ్వులు పండించే రైతుల మొహాల్లో కూడా నవ్వులు విరుస్తున్నాయి. బతుకమ్మ పుణ్యమా అని పూలు రైతులకు బతుకుదెరువు పెరిగింది. పూల వ్యాపారలకు లాభాలు పెరిగాయి తద్వారా ఆర్థిక మార్పిడి పెరిగింది. అలాగే బతుకమ్మ పాటల రూప కల్పన లో కవులకు , కళాకారులకి, గాయకులకు, సాంకేతిక నిపుణులకు చేతినిండా అవకాశాలు, పని పెరిగినాయి.
పిల్లలు పెద్దలు సంతోషంతో పాటు ఆనంద డోలికల్లో ఊగే సంబరం బతుకమ్మ.
ఆడ మగ తేడా లేకుండా పెద్దలే పిల్లలై, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆటలో లీనమై బాధ్యతలు, వత్తిడులు , సాధక బాధకాలు మరచి, ఈగోలు, స్థాయిలు, పట్టింపులు పక్కకు పెట్టి కాసేపు సంతోషంగా ఆనందంగా గడపటం ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించింది. బాల్యాన్ని గుర్తు చేసింది. ఏడాదికోమారు వచ్చే ఈ సంబరం మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంగా కూడా పెంచుతుంది…
మనస్పర్థలు మరిపించే ఇలాంటి చక్కటి సంబరాన్ని కార్యాలయాల్లో ప్రవేశ పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
శుష్క ప్రాంతం, గుట్టల ప్రాంతమైన తెలంగాణలో బంజరు భూములలో మొలిచే ఔషద మొక్కలు తంగేడు, గునుగు, పోక పూలు, పట్టుకుచ్చు పూలు, ఉప్పు పూలను శంఖు ఆకారంలో పేర్చి విశ్వ గతికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఎంచి ప్రకృతి ఆరాధన చేసే ఈ పూల పండుగ ప్రకృతి స్వభావాన్ని, ఔషద గుణాన్ని, ప్రకృతి విలువను చెబుతుంది, ప్రకృతి పట్ల మనిషి భాధ్యత తెలుపుతుంది. పర్యావరణ హితకారిగా ఉంది.
https://drive.google.com/file/d/1Ivv499DrppiHHK1DDgU0nEnVsbqNAYdK/view?usp=sharing
“ఉప్పెన” సినిమా కోసం “శ్రీమణి” రాసిన
“నీ కన్ను నీలి సముద్రం “.. ఈ ప్రేమ పాట వింటే ..
మనసు పరవశిస్తుంది.. పలవరిస్తుంది..
ప్రేయసికై పరుగులు తీస్తుంది..
అలతి అలతి పదాలతో.. ప్రేమకు ప్రేమను అద్ది
హృద్యంగా ఆవిష్కరించిన తీరు..
ఈ పాటను పదేపదే వినేలా చేసింది.
చిలిపితనం.. కుర్రతనం.. కలగలిపి,
ప్రేమ పాటలలో.. పదికాలాల పాటు నిలిచేలా
ఈ పాటను తీర్చిదిద్దారు.
“నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం..” అంటూ
పల్లవిలోనే అదరగొట్టేశారు.
ప్రేయసి కన్నులను నీలి సముద్రం చేసి
ప్రేమికుడి మనసుని పడవ ప్రయాణం
చేయించారు కవి..
నీలాల కన్నులు అందానికి ప్రతిరూపమే కాదు..
వేలవేల భావాలను పసిగట్టేవి.. పలికించేవి..
నిగూఢతకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచేవి.
అలాంటి కన్నులను నీలి సంద్రం చేసి..
ప్రేమలోని గాఢతను తెలియజేశారు శ్రీమణి
ముత్యం స్వచ్చతకు ప్రతిరూపం..
మరి.. ప్రేయసి పెదాలపై విచ్చుకున్న ఆ స్వచ్చమైన నవ్వు
ప్రేమికుడిలోని కష్టాలను దాచేసి.. దాటివేసి
తీరానికి లాగేటి దారమే కదా..!
“నల్లనైన ముంగురులే
అల్లరేదో రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే ..”
ముసురుకున్న ప్రేయసి ముంగురులు అల్లరేదో రేపి..
ఇంకో లోకాన్ని లేకుండా కప్పాయి అంటూ.. కొంటేతనాన్ని కవిత్వికరించిన శ్రీమణి..
“ఘల్లుమంటే నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే ..”
ప్రేయసి గాజుల గలగలలు గల్లుమంటుంటే..
ప్రియుడి ప్రాణం జల్లుమనకుండ ఉంటుందా..?
వానాజల్లుల అల్లుకుంటుంది.. అలరిస్తుంది ..
అని
చిలిపి తనాన్ని చమత్కరించారు..
అంత్య ప్రాసలతో ఆకట్టుకున్నారు..
“చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ..”
ప్రేమలో నాకే దక్కాలి అనే స్వార్థం ఉంటుంది..
ఆ స్వార్థంలో పసితనంలోని నిష్కల్మశం దాగి ఉంటుంది..
అందుకేనేమో కవి మనలను తిరిగి
పసివాల్లను చేశారు..
ఇసుక గూడు చేసుకుని పేరు రాసి పెట్టడం..
ఎంత హృద్యమైన భావన.. మరెంత గొప్ప వర్ణన..!
ఆ పేరును చేరిపెటి కెరటాలు పుట్టలేదని
తన ప్రేమను ఉన్నతీకరించాడు..
“ఆ గోరువంక పక్కన
రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంటా నువ్వుంటే నా పక్కన..”
ఏ జంటనైనా ఒకరికి ఒకరులా ఉంటే
చిలుక గోరువంకలా ఉన్నారు.. అని అంటాము.
అంతకన్నా చక్కని జంట తమదని చెప్పడం
కవి దార్శనికతకు… ఆదర్శ జంటని చెప్పటానికి
అద్దం పడుతుంది.
“అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ
చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమనీ..”
పాటకే హైలైట్ ఈ వర్డ్స్ ..
శ్రీమణి ఈ పాట రాయడానికి నిజంగానే
కొత్త కొత్త మాటలని అప్పు అడిగే ఉంటారు..
నవ్యత కు.. సృజనకు తన పాటలతో
ప్రాణం పోయడానికి నిత్యం తపన పడే శ్రీమణి
కవి హృదయానికి ఈ చరణం తార్కాణం అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఒక సినిమా పాట రాసేటప్పుడు..
సాహిత్యం రాయాలంటే..గీత రచయిత కు
మంచి సన్నివేశం.. సందర్భం దొరకాలి..
ఆ రెండు దొరికాయేమో రచయితకు
విజృభించాడు..
కమర్షియాలిటీ కూడా ఆలోచించి
టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలి
అనుకున్నారేమో శ్రీమణి..
“నీ అందమెంత ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా”.. అంటూ
“ఉప్పెన” టైటిల్ ని ఉదాహరిస్తూ
సాహిత్యానికి భంగం కలగకుండా
తెలివిగా.. చక్కగా రాసారు..
యవ్వనంలో ఆకర్షణ .. అందం ..
యువతి యువకులకు ..
చాలా పసందుగా ఆనిపిస్తాయి ..
అందుకే..
ఉప్పెనెలా అందం చప్పున ముంచేసిందని
ప్రియుడు మునిగి తేలుతున్న వైనాన్ని..
ప్రేయసి ప్రాయపు పొంగులను..
ఆకర్షణను ఆరబోసారు.. కవి శ్రీమణి..
“చుట్టూ ఎంత చప్పుడొచ్చినా
నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా..”
ప్రేమికుడు ఏకాంతంగా ఉన్నా.. ఎందరిలో ఉన్నా
తన ప్రేయసి సవ్వడిని పసిగట్టగలడు..
ఎంత దాచేసినా..దాయాలని చూసినా
జల్లేడేసి మరీ పట్టుకోగలడు..
శ్రీమణి సాహిత్యంలో కొత్త పోకడలను స్పృశించారు..
“జల్లడేసి” అనే ఆర్డినరీ పదాన్ని చాలా అద్భుతంగా
ఒదిగి పోయేలా రాశారు .. ఇది కవి నేర్పుని సూచిస్తుంది.
ఇలా.. పద ప్రయోగాలు చేస్తూ
ప్రేమ పాటకు జీవం పోయడం
రచయితకు ఆత్మ తృప్తిని ఇస్తుంది..
గీత రచయితగా కీర్తిని తెస్తుంది..
ఈ రెండూ చక్కగా నిర్వర్తించిన
శ్రీమణి అభినందనీయులు..
“నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని..’
అబ్బాయిలు అమ్మాయిలకు వల వేస్తారు..
కానీ..
ఇక్కడ అబ్బాయే అమ్మాయి ప్రేమ వలలో చిక్కుకుని
చేపలా విలవిలలాడుతున్నాడు..
నిజమే కాబోలు..
ప్రేయసి ఊహలను ఊపిరిగా
ఆమె ఊపిరినే ప్రాణంగా
బతుకుతున్న పిచ్చోడు కదా..!
సినిమా పాటలలో.. ప్రేమ పాటలకు
విస్తృతి, పరిధి చాలా ఎక్కువ..
కమర్షియాలిటీ మిస్సవ్వకుండా.. చక్కని సాహిత్యాన్ని అందించి.. కవిత్వాన్ని సూత్రీకరించి..
తన కలానికి ఉన్న పదును
మరోసారి తెలియజేశారు శ్రీమణి.
“శ్రీమణి.. ది బెస్ట్” అనేలా..
సాహిత్యాన్ని అందించిన ఈ పాట
ప్రేమికుల హృదిలో..
తెలుగు భాషాభిమానుల మదిలో..
“ఓ.. మంచి హిట్ పాటగా నిలిచిపోతుంది..
“పెండ్యాల రాఘవరావు అంటే ఆ మాదిగల కలిసినాయన “అని పేరు ను, తీర్మానాన్ని చేసి అదేదో తప్పు పని అన్నట్టు మాట్లాడేవారికి ఎదురు నిలిచి
మా బాపు సమానత్వ భావనల సమరశంఖం పూరించి ,సహపంక్తి భోజనాలు నిర్వహించారు.
1935 ప్రాంతం రోజులవి. మహా గడ్డు కాలం,గుడ్డి లోకం. ఆనాడు దళితులను హరిజనులు, మాదిగలు అనే వాళ్ళు. దూరం పెట్టేవాళ్ళు. ఈ అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని మా బాపు నడుకట్టారు. మేము నాన్న ను బాపు అని అంటాం . మా బాపు చాలా మంచి వారు.
పెండ్యాల రాఘవరావు గారు ( 15. 3.1917 _ 10. 9 . 1987)
వరంగల్ జిల్లా చిన్న పెండ్యాల గ్రామ వాస్తవ్యులు. పెండ్యాల పిరాట్యమ్మ , రామంచందర్ రావు వీరి తల్లిదండ్రులు. భూస్వామ్య, గ్రామ కరణం కుటుంబం. చిన్ననాటి నుండి చదువులో చురుగ్గా ఉండటం తో హన్మకొండ లో చదువు కొరకు పంపించారు. ప్రపంచం, రాజకీయాలు పరిచయమయ్యాయి. గాంధీ స్వాతంత్ర్య పోరాటాలు తెలిసాయి.

నిజాం నిరంకుశ రాజ్యంలో తొలి స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహి గా ఎన్నో పోరాటాలు చేసారు.
హైదరాబాద్ రాజ్యం లో చైతన్యాన్ని రాజేసిన ఆనాటి ఆంధ్ర మహాసభ లో జాతీయపక్ష కార్యకర్తగా పనిచేస్తున్న కాలంలో తనకు తానే స్వతంత్ర వీరునిగా మలుచుకున్నారు. గ్రామాల్లో విద్య అనేదే లేక అంధకారంలో ఉన్న సమాజానికి తామే స్వయంగా సిలబస్ తయారు చేయించి బళ్ళు పెట్టి చైతన్యవంతులను చేసారు. హాస్టల్ పెట్టారు.
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి ఎదిరించినందుకు జైలు పాలయ్యారు. సాంఘిక కట్టుబాట్లను ఖండిస్తూ స్త్రీ ల పక్షాన గొంతెత్తారు. వెట్టిచాకిరి నిర్మూలన కోసం పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి తమ జీవితాన్నే బలి ఇచ్చేందుకు సిద్ధపడిన విశాల హృదయుడు పెండ్యాల రాఘవరావు. దళ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసాడీ అజ్ఞాత వీరుడు . శాసనోల్లంఘనం చేసి నిజాం ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా చేసిన సాయుధ పోరాట యోధుడు. రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పాటుపడిన ఘనుడు. ఎన్నో ఏళ్ళు అడవుల్లో క్యాంపులు నిర్వహించి స్వాతంత్ర్య సమరం చేసిన విప్లవ వీరుడు.కమ్యూనిస్ట్ నాయకుడు.
క్రమశిక్షణ ,సత్ప్రవర్తన,మంచితనం , ఉన్నత భావాలు పోతపోసిన రూపు మా బాపు ధృఢకాయానికి మరింత వన్నె తెచ్చినవని ఆనాటి పెద్దల అభిప్రాయం.
ఔను! అనర్ఘళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారనీ, బాపు మీటింగ్ ఎక్కడున్నా ప్రజల సద్దులు గట్టుకొని బండ్లల్లో వచ్చేవారు అని ఎందరో గుర్తుచేసుకున్న మాటలు నాకు స్ఫూర్తినిస్తాయి . మా బాపు జీవిత చరిత్ర రాయాలని చుట్టుపక్కల గ్రామాల్లో బాపుతో పనిచేసిన కొందరు దళ సభ్యుల్ని,ఇతర ప్రముఖ లీడర్ల ఇంటర్వ్యూచేస్తే ఇలాంటి విషయాలెన్నో చెప్పారు- “ఆయన మాటలే తూటాలు”,”ప్రజలను చూరగొనే వాగ్ధాటి”, ” ఉత్తమ నిర్మాత”,”ప్రజల మనిషి”, “రాఘవ రావే మూమెంట్”, “ప్రజలను అంటిపెట్టుకున్న వీరుడు “, “పట్టుదలగల మనిషి “,” హృదయంలో సాయుధ పోరాటం”, “ధన్యమైన జీవితం “,” మంచి స్నేహితుడు “,”ఆయనే పోరాటం “,”మడమతిప్పని మరో స్వాతంత్ర్య సమరసేనాని”,”ఆదర్శప్రాయమైన జీవితం “,”ఆయన త్యాగధనుడు”,”మెస్మరైజ్ చేసే ఉపన్యాసం”,”సామాజిక విప్లవ వైతాళికుడు””ఆత్మీయుడు”, “సైన్యాధిపతి” అంటూ వారి వారి అభిప్రాయాలను వ్యాసాలలో రాసిచ్చినవీ మా బాపు రాసుకున్న ” నా ప్రజా జీవితం” పుస్తక రూపంలోకి తెచ్చినప్పుడు అవన్నీ వేసి ముద్రించాము. అదొక గొప్ప అనుభూతి. అవును మరి మా బాపు నూనూగు మీసాల నూత్న యవ్వనం లో ఊళ్ళో ‘ఓం జెండా ‘ఎగురవేసి సర్కార్ ను, త్రివర్ణ పతాకాన్ని వరంగల్ కోటపై ఎగురవేసి నైజాం రాజుకు ఎదురొడ్డిన పోరాటాలన్నీ కథలు కథలుగా విన్నదాన్ని ఎలా ఊరుకుంటాను? ” మావి రికార్డు లు లేవు, ఉన్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయె” అనీ
“మేము ఏదో ఆశించి చేయలేదు ఆ పోరాటాలు . అసలు మేం బతుకుతామని అనుకున్నామా?”అని ప్రముఖ వారు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతుంటాయి.ఇప్పుడు ఈ స్వాతంత్ర్య వజ్రోత్సవ సందర్భంగా ఇలా తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆనాటి వీరుల గురించి అక్షరాలలో నిక్షిప్తం చేస్తుంటే ఎంత సముచితమైన కార్యం తలపెట్టారని అభినందనలు చెప్పడం తప్ప ఏం చేస్తాం? స్వాతంత్ర్యం వడ్డించిన విస్తరి అయింది నేటి విచ్చలవిడి సమాజానికి. నిర్లక్ష్యం వహిస్తే గ్రద్ద లా తన్నుకుపోతారీ స్వాతంత్ర్య శాంతి కపోతాన్ని. అప్రమత్తం చేయాలనే నిర్వాహకులు భుజాన వేసుకున్నారనకతప్పదు. ఈ మహా కార్యక్రమం లో ఓ అక్షర మౌతున్నందుకు నాకైతే సంతోషంగా ఉంది. ఈ వీరుని బిడ్డ ను అని చెప్పుకోవడం గర్వం గా నూ ఉంది.
భారత భూమి మనదే కానీ ఫలితము మనకేది ॥2॥
భారతదేశము భాగ్యమదేశం
పై గనగా మనదే
ఆకలితోడ మలమల మాడి
అలమటించుట మనదేగా
పరదేశీయుల్ పాలన చేయగా స్వరాజ్యంబదియేది
ఫలితము మనకేది॥2॥
రత్నగర్భయని నామమొంది
దేశ దేశముల కీర్తి పొంది
ఘనవిఖ్యాత ఖ్యాతి నొందె ఘనతర స్వాతంత్ర్యము లేక ఫలితము మనకేది ॥భారత॥
అంటూ పాటలు రాసి పాడిన మా బాపు ఆనాటి ఆర్య సమాజం లో పనిచేసారు.
“తల్లిని మించిన దైవము వేరే
ధారుణి లేదోయూ ॥2॥
స్వారాజ్యంబె స్వరాజ్యమాయే
మా సేవా బలమాయే
ఈ ధరణీ మాతోయీ ॥ 2॥
అని గేయాన్ని రాసిన మాబాపు ఎంత గొప్ప కవి కదా!
“భారతమాత వందనం
కన్నా తల్లి వందనం
మా కన్నా తల్లీ వందనం ॥భారత॥
మన భూమి హితమే కోరి
మానరా మధుపానమూ
మాని సుఖియించరా॥భారత॥
అని సామాజిక గేయాలు రాసినా,
“త్యాగశీలురకు దేశ సేవకులకు జోహారులిడగా కదలిరారే దేశభక్తులకు దీన బంధువులకు జోహార్లీడగా కదలిరారే ॥ జోహారు॥సత్యమహింసా సర్వభూత దయ మూర్తిభవించి సాక్షాత్కరించిన దేశభక్తులకు దీనబంధువులకు జోహారులిడగా ॥
ధరా సుతులను వర్జించి
ధన ధాన్యంబులు త్యజియించి మాతృభూమిని సేవించుటయే పరమార్ధమని యెంచి
పాటుపడిన భవ్యమూర్తులకు జోహారులిడగా కదలిరారే”
అంటూ ఉత్తేజకరమైన గేయాలు ప్రజలముందు పాడినా మా బాపు స్వాతంత్ర్య కాంక్ష , సాహిత్య అభిలాష తెలిసిపోతుంది.
ఏడవ తరగతి వరకే చదువుకున్నా తెలుగు,ఉర్దూ,హిందీ, ఇంగ్లీష్ భాష లలో పటుత్వాన్ని సాధించుకున్నారు .
అందుకేనేమో ఎం.పి. పదవి తీసుకొమ్మని కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి చేసి శాసనసభ సీట్లు వదులుకొమ్మని ఉంటుంది. పార్లమెంట్ లో గళాన్ని వినిపించాలంటే హిందీ బాగా మాట్లాడగలగాలనే , భాషా నైపుణ్యం ఉన్నవారు కావాలనే కావచ్చు. మా బాపు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు ఆక్షన్ సమయం లో మూడు ఏళ్లు జైలు జీవితం గడిపారు. 1952 లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల లో పోటీ కి జైలు నుండే నామినేషన్ వేసి, పి.డి.ఎఫ్ తరపున పోటీ చేసారు. రెండు ఎం .ఎల్.ఏ. సీట్లు ఒక ఎంపీ సీటు కైవసం చేసుకున్నారు. అత్యధిక సీట్లు ఏక కాలంలో గెలుచుకున్నందుకు మా బాపును , అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రావి నారాయణరెడ్డి గారిని నెహ్రూ గారు పార్లమెంట్ లో అభినందించారు.
1952 నుంచి 57 దాకా తొలి లోక్ సభ లో ఎన్నో సమస్యలపై ప్రజాగళం వినిపించిన వక్త మా బాపు.
“ఆయన ఎవరనుకున్నావ్? ” ,”హి ఈజ్ అవర్ మాన్” అని హృదయపూర్వకంగా తోటి పోరాట వీరులతో ఆనాటి నాయకులతో అనిపించుకున్న పెండ్యాల రాఘవరావు గారు వారు జైలు లో ఉన్నప్పుడు 1949-50 లలో కంట్రోళ్ళ పై
‘‘ నా దేశం- నా భారత దేశం
నా దేశం నా భారత దేశం
మన్ను బంగరౌ మాన్యాలున్నా
సాలెల్ల పారే సెలయేరులున్నా
మడిలో మొక్కకు తడిలేదన్నా”॥ నా దేశం రా॥
అంటూ రాసిన గేయం లో పేద బ్రతుకులను స్పృశిస్తూ, దళారుల మోసాలను , రాజకీయాలను ఎండగట్టారు. ” వలస విధానపు వరమేరయిది/ తెల్లోడు పెట్టిన తెగులేరయిది/
నల్లోడు నేడు నడుపుతున్నాడు/ దోపిడి వర్గాల దాపునున్నాడు” ॥ నా దేశం నా భారత దేశం”
అని రాసినారు.
మా బాపు ధైర్యసాహసాల గురించి ఎన్నైనా చెప్పవచ్చు.ఆయన జీవిత చరిత్ర అంటే ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర, సాయుధ పోరాట చరిత్ర
ప్రత్యేక తెలంగాణ కు ప్రత్యేక పండగ బతుకమ్మ, రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు ఊరు వాడ వాడా చేరింది బతుకమ్మ, రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది బతుకమ్మ. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. మా బడి పిల్లలు బతుకమ్మ సంబరాలను బొమ్మగా గీశారు. చిన్నారుల చిట్టి ప్రయత్నం మెచ్చుకోదగినది.
-రూప

D.హర్ష
ఆదిత్య కుమార్,
M రమేష్,
8th ‘డి’ సెక్షన్
ZPHS శివరాంపల్లి
రాజేంద్ర నగర్ మండలం
రంగారెడ్డి జిల్లా
