“అమ్మా! అమ్మా! నేను అందంగా అమర్చిన బొమ్మలన్నీ ఎవరు తీసేశారు? నా చిన్నప్పటి నుండి ఇవన్నీ ఇలాగే పెడుతున్నాను కదా?”అని అడిగింది సుదీప. కొంచెం ఏడుపు కొంచెం కోపం మిళితమైన గొంతుతో.
అప్పుడే అక్కడికి వచ్చిన సుదీప తల్లి వసుంధర జవాబు చెప్పేంతలో, సుదీప అన్న సుధీర్ అక్కడికి వచ్చాడు.
“అవి మీ వదిన సర్దింది. అయినా తను ఈ ఇంట్లోకి వచ్చాక తన ఇష్టం ఉన్నట్లు తను పెట్టుకుంటుంది. నువ్వు నీ పెళ్లయ్యాక నీ ఇష్టం ఉన్నట్లు మీ ఇంట్లో సర్దుకో”అన్నాడు వ్యంగ్యంగా సుధీర్ .
ఈ సమాధానం ఊహించని సుదీప , వసుంధర ఇద్దరూ నివ్వె రపోయారు.
“అదేంటి అన్నయ్యా! వదిన తన ఇష్టం ఉన్నట్లుగా సర్దుకుంటానంటే నేను మాత్రం వద్దంటానా? చిన్నప్పటినుండి నాకు బొమ్మలంటే చాలా ఇష్టం కదా! నా పదేళ్ల వయసు నుండి ఒక్కొక్కటి కొని అన్నిటినీ ఇలా సర్దాను. ఇంట్లో అందరికీ నచ్చింది కూడా! నాన్న అయితే మరీ మెచ్చుకున్నాడు. నువ్వు కూడా ఎన్నోసార్లు బాగుందన్నావు కదా! అన్నయ్య”అన్నది మెల్లగా సుదీప.
“అయితే ఏమంటావు? అప్పుడు బాగుందని, ఇప్పుడు మీ వదినకి నచ్చిన బొమ్మలు పెట్టుకుంటానంటే వద్దంటావా?” అన్నాడు కోపంగా సుధీర్.
జవాబు చెప్పాలనుకుని సుదీప నోరు తెరిచినంతనే వసుంధర “దీపా ఎందుకీ అనవసరపు వాదన. నీ పెళ్ళయ్యాక మీ ఇంట్లో నీకు నచ్చినట్లు నువ్వు సర్దుకుందువుగానిలే. లోపలికి వచ్చేయ్”అన్నది.
అసలు ఏమీ అర్థం కాని సుదీప మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది.
అంతకుముందే వచ్చి బయట నిలబడ్డ సుదీప తండ్రి రాజేందర్ నీరు నిండిన కళ్ళతో నిలబడ్డాడు.
తనేవి విననట్లుగానే లోపలికి వచ్చాడు.
సుదీపకు చిన్నప్పటినుండి ఇంటి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎన్నో బొమ్మలని సమకూర్చి, వాటిని చక్కగా ఇంట్లో ఏవి ఎక్కడ పెట్టాలో ఆలోచించి పెట్టేది .అలా చిన్నప్పటినుండి కొన్న బొమ్మలన్నీ కలిపి చాలానే ఉంటాయి. ప్రతి సంవత్సరం దీపావళికి బొమ్మల కొలువు పెట్టి అందరిని పిలిచేది వసుంధర.
చదువులో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటూ, అందరి మెప్పులు పొందేది సుదీప.
ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సుదీపకు ఈ మధ్యనే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కూడా వచ్చింది.
సంవత్సరం క్రితమే సుధీ ర్ పెళ్లి జరిగింది. వదిన వస్తే ఎంతో చక్కగా కలిసి ఉండొచ్చు అని ఎన్నో ఊహించుకుంది సుదీప.
కానీ సుధీర్ భార్య సౌమ్య అసలు ఎవరితోనూ కలిసి ఉండేది కాదు. ఎన్నోసార్లు మాట్లాడలనీ ప్రయత్నించింది సుదీప. నిజానికి సుదీప మనస్తత్వం చాలా నిష్కల్మషమైనది. ఎవరినీ నొప్పించే తత్వం కాదు.
ఒకరోజు కాలేజ్ ఫంక్షన్ జరుగుతుండడంతో తన చీరలేవి అంత బాగా లేదనిపించి వదినను అడగడానికి వెళ్ళింది.
“వదినా! రేపు నాకు కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర ఏదైనా కట్టుకొని వెళతాను. మనం ఇద్దరం ఒకే వెయిట్ లో ఉంటాము. కాబట్టి, మీ బ్లౌజ్ కూడా నాకు సరిపోతుంది”అని అడిగింది వదిన పక్కనే కూర్చుంటూ.
“ఏంటి, నా చీర నువ్వు కట్టుకొని వెళ్తావా? అందులో బ్లౌజ్ కూడా వేసుకుంటావా? ఛీ ఛీ నాకు ఒకరు వేసుకున్న బట్టలు నచ్చవు. నా బట్టలు నేనెవరికీ ఇవ్వను” అన్నది నిక్కచ్చిగా.
“పోనీ బ్లౌజ్ నాది వేసుకుంటాను. చీర నీది కట్టుకొని వెళ్తాను. సరేనా”అని అడిగింది అమాయకంగా సుదీప.
“ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇలా అడుక్కొని కట్టుకోవడం దేనికి? నీకున్నవే కట్టుకొని వెళ్ళు”అన్నది కఠినంగా.
అప్పుడు కానీ అర్థం కాలేదు సుదీపకు ,వదిన నిజంగానే అంటుందని.
కళ్ళనీళ్ళతో బయటకు వచ్చింది. ఆ విషయం తల్లితో కూడా చెప్పలేదు. కానీ విషయం గ్రహించిన వసుంధర , వెళ్లి దగ్గర్లో ఉన్న షాపులో ఒక చీర దానికి సంబంధించిన ఫాల్ కొనుక్కొని వచ్చింది.
“అమ్మా! ఎక్కడికి వెళ్లావు? నీకోసం అప్పటినుండి వెతుకుతున్నాను .రేపు కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర ఏదైనా ఉంటే కట్టుకొని వెళ్తాను”అన్నది సుదీప.
“నా చీరలు నీకేం బాగుంటాయి తల్లి. అప్పుడెప్పుడో ఫంక్షన్ ఉంటుంది అని నువ్వు అన్నావు కదా! అది గుర్తొచ్చి ఇక్కడ షాప్ లో చీరలు బాగున్నాయంటే వెళ్లి తీసుకొచ్చాను. చూడు బాగుందా”అని తాను తెచ్చిన చీర చూపించింది వసుంధర.
చిలకపచ్చ రంగు చీరకి, గులాబీ రంగు అంచు, అక్కడక్కడా జరిగి బూటాతో చీర ఎంతో అందంగా ఉంది.
“చాలా బాగుందమ్మా, అయినా, అలా ఎలా తెచ్చావ్ ?పోనీ నన్నైనా పిలవలేదు”అన్నది సుదీప చీరను పట్టుకొని సంతోషంగా చూస్తూ.
“నీకు నచ్చకుంటే వెళ్లి మార్చుకొని వద్దాము. ఇంకా సమయం ఐదు గంటలే అయింది కదా? షాప్ మూయరు” అన్నది వసుంధర.
“మార్చడం ఏమీ వద్దమ్మా, నాకు చాలా నచ్చింది. ఇదే కట్టుకొని వెళ్తాను. కానీ దీనికి బ్లౌజ్ ఎలా?”అన్నది సుదీప.
ఇప్పటికిప్పుడు కుట్టిచ్చాలంటే కష్టమే కద మ్మ, నీపట్టు పరికిణి మీది జాకెట్టు దీనికి సరిగ్గా సరిపోతుంది .ఒకసారి పెట్టి చూడు”అన్నది వసుంధర.
ఆ చీర కు కరెక్టుగా మ్యాచ్ అవ్వడంతో ఆ రాత్రికి ఫాలు కుట్టేసింది వసుంధర.
తెల్లవారి కాలేజీకి కట్టుకొని వెళ్తే అందరూ ఎంతో బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అందులో చక్కనైన సుదీపకు ఆ చీర ఇంకా బాగా నప్పింది.
అలా ఇంట్లో వదిన దేనికి తనతో కలిసి ఉండేది కాదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని తొందరగా వెళ్ళిపోతే బాగుండు అన్నట్లుగా చూసేది.
ఇది మాది నువ్వు పెళ్లి అయ్యాక కొనుక్కో ఇలాగే మాట్లాడేది.
ఎంతో బాధపడేది సుదీప.
ఇక్కడే పుట్టి పెరిగినా నేను పరాయిదాన్ని అయ్యానా? అంటే ఈ ఇంట్లో నాకు స్థానం ఏమీ లేదా?”ఇలా ఎంతో బాధపడేది సుదీప.
తల్లి మాత్రం పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోమని చెప్పేది.
కానీ ఇదంతా చూస్తున్న తండ్రికి మాత్రం చాలా బాధగా ఉండేది. బుడిబుడి అడుగులతో నడిచిన బంగారు తల్లి పెరిగి పెద్దదై ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతుంటే ఇప్పుడు తనను పరాయిది అంటారేంటి? అలాగని కోడల్ని తక్కువ చేసి చూడలేదుకదా? కోడల్ని కూడా కూతురు లాగానే చూసుకుంటున్నాము కదా! ఇంకా సుదీప్ అయితే వదినను ఎంతో ప్రాణంగా చూసుకుంటుంది. ఏది కొన్నా వదిన కోసం ముందుగా తెస్తుంది. ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? కొడుకు సుదీర్ లో కూడా మార్పు వచ్చింది. రేపు పెళ్లి అయిన తర్వాత అయినా సుదీప అత్త వారు మంచిగా చూసుకునే వాళ్ళు వస్తే చాలు” అని ఎన్నోసార్లు బాధపడేవాడు.
చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన సుదీప కు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు తల్లిదండ్రులు. అనుకున్నట్లుగానే ఎన్నో సంబంధాలు చూసి అందులో సుదీపకు కూడా నచ్చిన వరుడి తో పెళ్లి జరిపించారు.
ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. సుదీప వదినకి పెళ్లి జరుగుతుందన్న సంతోషం కన్నా సుదీప ఇంట్లో నుండి వెళ్తుంది అని ఆనందమే ఎక్కువ కనిపించింది.
పెళ్లయి అత్తవారింటికి భర్తతో వెళ్లింది సుదీప. పెళ్లిరోజు రాత్రి పది గంటలు దాటింది. అప్పటికే అందరూ ఎవరి పడక గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. “కొత్త పెళ్లికూతురు వచ్చింది” అని ఎవరు బయటకు రాలేదు. లోపలికి వెళ్లి సూట్ కేసు లోపల పెట్టి, బట్టలు మార్చుకొని హాల్లోకి వచ్చింది సుదీప.
బయటకు వచ్చిన సుదీపను అత్తగారు ఒక చూపు చూసి”నువ్వు శ్రీకర్ అన్నం పెట్టుకొని తినండి. మేమందరం భోజనం చేసాము. గిన్నెలన్నీ సర్ది బయట వేసి స్టవ్ గట్టు అన్ని తుడిచిపెట్టి వెళ్లి పడుకోండి”అని చెప్పింది ఎప్పుడూ ఇంట్లో ఉండే మనిషికి చెప్పినట్లే చెప్పింది.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదినని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో? సుదీపకు గుర్తొచ్చింది. అందరూ కలిసి స్వాగతం పలికి వదినను కూర్చోబెట్టి అన్ని సపర్యాలు చేశారు. తల్లి వడ్డించి కొసరి కొసరి భోజనం వడ్డించింది.
సుధీర్ కి కూడా చెప్పింది “తను మొహమాట పడకుండా చూసుకునే బాధ్యత నీదేనని.”
ఎన్నో రోజుల వరకు ఏ చిన్న పని కూడా చేయనిచ్చేది కాదు వసుంధర. కానీ వీళ్లు చూపించిన ప్రేమలో తను రెండు శాతం కూడా తనకు ప్రేమ ఉన్నట్లు ప్రవర్తించేది కాదు సుదీప వదిన.
ఆలోచనలో నుండి బయటకు వచ్చిన సుదీప
“అలాగే అత్తయ్యా!” అని నెమ్మదిగా సమాధానం ఇచ్చింది.
ఇంతలో స్నానం చేసి వచ్చిన శ్రీకర్
“ఏంటి నిలబడ్డావ్? భోజనం చేద్దాం పద”అన్నాడు.
మెల్లగా శ్రీకర్ తో పాటు వంటింట్లోకి నడిచింది.
డైనింగ్ టేబుల్ నిండా ఎంగిలికంచాలు అలాగే పడి ఉన్నాయి. వంట పదార్థాలు ఉన్న గిన్నెల మీద మూతలు కూడా సరిగా లేవు. వంటిల్లు అంతా చిందరవందర గా ఉంది. ఒక్కసారి అద్దంలాంటి తన పుట్టిల్లు గుర్తొచ్చింది .కానీ అదేది బయటపడకుండా మౌనంగా ఆ కంచాలన్ని తీసి బయటపెట్టి భర్తకి, తనకు కంచాలు పెట్టుకొని గిన్నెలు మూతలు తీసి చూసింది. అడుగుబొడుకు కూరలు మాత్రమే ఉన్నాయి. అన్నం అడుగంటి పోయింది. మెల్లగా పైపై అన్నం పెట్టేసి ఉన్న కూ రలు సర్దేసింది.
ఇదేమి పట్టనట్లు శ్రీకర్ గబగబా తినేస్తున్నాడు. సుదీపకు అసలు ఆ కూరలేవీ సహించలేదు. అందులో మిగిలిన కూరలు పాడైపోయే స్థితిలో ఉన్నాయి.” కొత్తగా కోడలు ఇంట్లోకి అడుగు పెడుతుంటే కాస్త మంచి భోజనం కూడా తయారు చేయలేరా” అని అనుకొని అన్నంలో మజ్జిగ పోసుకొని తినేసింది.
ఉదయమే లేచిన సుదీప హాల్లో వస్తువులని సర్ది పెట్టింది.శెల్ఫ్ లో అటు ఇటు పడి ఉన్న బొమ్మలను కాస్త అందంగా సర్దింది.
అప్పుడే బయటకు వచ్చిన సుదీప మరదలు దీక్ష
“అప్పుడే అధికారం చేతిలోకి తీసుకున్నావా? ఆ బొమ్మలు అలా పెట్టకూడదు. నువ్వెందుకు సర్దావ్ అసలు? ఇదేం నీ పుట్టిల్లు కాదు ఇష్టం ఉన్నట్లు చేయడానికి?” అన్నది.
ఒక్కసారి ఆశ్చర్యపోయింది సుదీప్.
అక్కడ పుట్టింట్లో వదిన ఇంట్లోకి రాగానే “నీ ఇల్లు ఇది కాదు నీ ఇంట్లో సర్దుకో” అన్నది ఇక్కడ మరదలు “ఇది నీ పుట్టిల్లు కాదు” అంది అసలు నాకంటూ ఒక ఇల్లు ఉందా?”అని బాధపడుతూ నిలబడింది సుదీప.
కథలు
“రాజీవ్, అనిక కోసం మనం తగినంత చేస్తున్నామని నీకు అనిపిస్తోందా?” ప్రియ అడిగింది. అలా అంటున్న సమయంలో ఆమె కంఠం ఆందోళనతో నిండిపోయింది. ప్రతి రోజూ ఉదయం ఇద్దరూ కలిసి కాఫీ తాగే సమయంలో ఆ దంపతులు కుటుంబం గురించి, ముఖ్యంగా వాళ్ళ ప్రేమ ఫలం ఐనటువంటి చిన్నారి అనిక భవిష్యత్తు గురించి ఆలోచించడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు. ఉదయం సూర్యుడు వంటగది కిటికీ గుండా తొంగి చూస్తూ, సొగసైన కౌంటర్టాప్పై వెచ్చని తన చూపులు ప్రసరిస్తున్నాడు.
హాల్ లో అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకుంటున్న రాజీవ్, తన భార్య వైపు చూస్తూ,”మనం మన వంతు కృషి చేస్తున్నాం ప్రియా. మనిద్దరం కష్టపడి పని చేస్తున్నాం, తనకు కావలసినవన్నీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం కదా! ఇంకా నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు?” అనునయంగా భార్యను అడిగాడు రాజీవ్.
“నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు మనం పాపకు తగినంత సమయం ఇవ్వడం లేదని నాకు అనిపిస్తుంది. తను మంచి గ్రేడ్లతో మాత్రమే కాకుండా మంచి విలువలతో ఎదగాలని నేను కోరుకుంటున్నాను,” ప్రియఘ ఘ తన కాఫీ సిప్ చేసుకుంటూ కౌంటర్ వైపు వాలింది.
రాజీవ్ నిట్టూరుస్తూ ఆమె భుజం మీద చేయి వేసి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. “నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. ఇకపై నేను ప్రతి సాయంత్రం, ఇంకా వారాంతాల్లో కూడా తన కోసం సమయాన్ని వెచ్చిస్తాను. ఇంకా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ కూడా ఊర్లో ఒక్కతే ఉంది కదా, తనని కూడా ఇక్కడికి రమ్మన్నాను. మనం బిజీగా ఉన్న టైంలో అనికని కనిపెట్టుకొని ఉంటుంది. పాపతో ఉండడం వల్ల అమ్మ కూడా తన ఒంటరితనం నుంచి కాస్త కోలుకుంటుంది, ఏమంటావు?”
“నేనేమంటాను అనేది నువ్వు అమ్మని పిలవక ముందు చెప్పాలి. అత్తయ్య వచ్చి మనతో ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ కాస్త ముందుగా చెబితే పాపని మెంటల్ గా ప్రిపేర్ చేసేవాళ్లం. నీకు తెలుసు కదా ఈ కాలం పిల్లలు వాళ్ల ప్రైవసీ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.”
అప్పుడే అనిక కిచెన్లోకి దూసుకొచ్చింది. ఆమె భుజంపై స్కూల్ బ్యాగ్ వేళ్ళాడుతోంది. “అమ్మా, నాన్నా, నాకు సైన్స్ ప్రాజెక్ట్లో మీ సహాయం కావాలి!”
ప్రియ నవ్వుతూ కూతురి స్థాయికి మోకరిల్లింది. “అఫ్ కోర్స్, బంగారం, ఏదీ, నీ ప్రాజెక్ట్ కోసం ఏం చేయాలో చూద్దాం.”
వారు ప్రాజెక్ట్లోకి ప్రవేశించే ముందు, డోర్బెల్ మోగింది. అది రాజీవ్ తల్లి శాంత. ఆమె వారితో కలిసి గడిపేందుకు వచ్చింది,
“అమ్మా, స్వాగతం!” రాజీవ్ ఆమె బ్యాగులు తీసుకుని ఆప్యాయంగా పలకరించాడు.
“హలో రాజీవ్. హలో ప్రియా, హలో అనికా బంగారం,” అంటూ సంతోషంగా పలకరించింది. ఏడు సంవత్సరాల వయసు ఉన్న అనిక ఒక రకమైన దినచర్యకు అలవాటు పడింది. తన తల్లిదండ్రుల అవిభక్త శ్రద్ధ, ప్రేమ మొత్తం తానే పొందేందుకు అలవాటు పడిన ఆమెను నానమ్మ రాక కలవరపరచింది. ఇప్పుడు తండ్రి తన సమయంలో కొద్దిగా నానమ్మతో గడపడం జీర్ణించుకోలేకపోయింది. ఆమె మర్యాదగా ఉంది కానీ దూరంగా ఉంది, అదీకాక, ఇతరులతో ఎలా సంభాషించాలో ఆమెకు తెలియదు. శాంత, అనిక సంకోచాన్ని గమనించి బాధపడ్డా,బంధాన్ని ఏర్పరచుకునేందుకు కొంత సమయం పడుతుందని అర్థం చేసుకుంది.
శాంత రోజూ ఉదయాన్నే లేచి వంటగదిలో ప్రియకు సాయం చేసేది. అది ప్రియకు సంతోషం కలిగించినా, రాజీవ్ వంటగదిలో ఏదైనా పని చేస్తుంటే వెంటనే ఆవిడ కలుగజేసుకుని, “ఇది ఆడవాళ్ళ పని, నువ్వు వెళ్లి హాల్లో కూర్చో రాజీవ్,” అని చెప్తూ ఉండడం, ఆవిడ అలా అన్నప్పుడు అనిక ఆమె వంక వింతగా చూడడం ప్రియ దృష్టిని దాటిపోలేదు.
దాంతో ఒకరోజు అత్తగారితో, “అత్తయ్యా మరోలా భావించకండి. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు మన పిల్లల మనసుపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ కాలంలో భార్యాభర్తలిద్దరూ సమానమైన ఉద్యోగాలు చేస్తూ కుటుంబ జీవనం సమతుల్యంగా నడపాలంటే ఇద్దరూ అన్ని పనులూ చేసుకోక తప్పదు. మీరు పాప ఎదురుగా ఆడపని మగ పని అంటూ మాట్లాడకండి. తర్వాతి తరానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. అర్థం చేసుకుంటారని అనుకుంటాను,” అంటూ సుతి మెత్తగా చెప్పింది. ఆలోచనలో పడింది శాంత.
ఒక సాయంత్రం, అలసిన పని రోజు తర్వాత, రాజీవ్, ప్రియా ఇంటికి తిరిగి వచ్చారు. శాంత మనవరాలికి హోంవర్క్లో సహాయం చేస్తున్న దృశ్యాన్ని చూసి ఆనందించారు. శాంత చేసిన సంప్రదాయ వంటల సువాసన అపార్ట్మెంట్ అంతా వ్యాపించింది.
“అమ్మా, అనిక ఈరోజు ఎలా ఉంది?” సోఫాలో కూలబడుతూ అడిగాడు రాజీవ్.
అలసిపోయిన కొడుకుని చూసి మృదువుగా నవ్వింది శాంత. “తను మంచిది. కానీ ఆ టాబ్లెట్తో ఎక్కువ సమయం గడుపుతోంది. నేను ఒక పుస్తకం చదవమని చెప్పాను, కానీ ఆమె తన స్నేహితులందరూ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది.”
ప్రియ, తన హ్యాండ్బ్యాగ్ని దింపి, నిట్టూర్చింది. “అమ్మా, ఈరోజుల్లో పిల్లలు ఆ విధంగానే స్నేహం చేస్తున్నారు. మేము ఆమెను సాంకేతికతకు దూరంగా ఉంచలేము. అంతేకాకుండా, తన అసైన్మెంట్లు కూడా ఆన్లైన్లోనే ఉంటాయి.”
శాంత చిన్నగా ముఖం చిట్లించింది కానీ నవ్వింది. “కాలం మారిందని నేను అర్థం చేసుకున్నాను, కానీ సమతుల్యత ఉండాలి. మీరు చిన్నతనంలో, ఆరు బయట ఆడేవారు, పుస్తకాలు చదివేవారు ఇంకా ఇంటి పనులలో సాయం చేసేవారు,ఔనా?”
రాజీవ్ కణతలు రుద్దుకుంటూ. “మాకు తెలుసు అమ్మా. మేము ప్రతిదీ కరెక్ట్ గా చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఏం చేస్తాం?. ప్రపంచం మరింత పోటీగా ఉంది మరి అనిక దాని కోసం సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.”
శాంత, తన కొడుకు గొంతులోని అలసటను పసిగట్టింది, ఈ విషయాన్ని మర్నాటి వరకు వదిలేయాలని నిర్ణయించుకుంది. “నేను డిన్నర్ కి టేబుల్ సెట్ చేస్తాను. మీరిద్దరూ ఫ్రెష్ అప్ అవ్వండి.”
డిన్నర్ చేసేప్పుడు రాబోయే వారాంతపు ప్రణాళికల గురించిన సంభాషణలకు టైం . అనిక ఉత్సాహంగా తన సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతోంటే శాంత ఒకింత గర్వంగానూ, మరో కాస్త ఆశ్చర్యంతోనూ వింది. రాత్రి భోజనం తర్వాత, అనిక మళ్ళీ తన టాబ్లెట్ పట్టుకుంది. రాజీవ్, ఇమెయిల్స్ చెక్ చేసుకుంటూ వాళ్ల గదిలోకి వెళ్ళిపోయాడు. అది చూస్తూ ప్రియ ఆలోచించింది.
మరుసటి రోజు ఉదయం, కాఫీ తాగుతూ ప్రియ రాజీవ్ తో, “అత్తయ్య చెప్పింది నిజమే! మనం గ్యాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల అనిక కూడా అలాగే అలవాటు పడుతోంది. మనం దీని నుంచి తన దృష్టి కాస్తయినా మార్చగలగాలి. దీని గురించి ఆలోచించు,” అని చెప్పింది.
కోడలి మాటలు విన్న శాంత సంభాషణకు ఇది సరైన సమయం అని నిర్ణయించుకుంది.
“రాజీవ్, ప్రియా, మీరు పాపని బాగా పెంచేందుకు మీ వంతు కృషి చేస్తున్నారని నాకు తెలుసు. మీరు కష్టపడి పని చేస్తున్నారు. తను కోరినవన్నీ అనిక కోసం అందిస్తున్నారు. కానీ అనిక నేర్చుకోవలసిన విలువల గురించి నేను ఆలోచిస్తున్నాను. సాంకేతికత ఇంకా విద్య ముఖ్యమైనవి, కానీ కుటుంబం, గౌరవం, బంధాలు కూడా అంతే ముఖ్యమైనవి.
ఆలోచనలో ఉన్న ప్రియ తల ఊపింది. “అత్తమ్మా, మీ ఆందోళన మాకు అర్థమైంది. మేము తనకు ఆ విలువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ మా బిజీ షెడ్యూల్లతో ఇది సవాలుగా ఉంది. నేను ఒక పరిష్కారం ఆలోచించాను. కానీ దాని అమలులో మీ సహాయం కావాలి.”
“తప్పకుండా ప్రియా, నా పూర్తి సహకారం ఉంటుంది.”
ప్రియ ఒక్క క్షణం ఆలోచించింది.
“చిన్నగా ప్రారంభిద్దాం. ఎలాంటి గాడ్జెట్లు (స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు)లేకుండా, మనం అందరం వారానికి ఒక రోజు ఉంటే? కలిసి సమయాన్ని గడపొచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, కథలు చెప్పుకోవచ్చు ఇంకా మన సంప్రదాయాల గురించి అనికాకు నేర్పించొచ్చు.”
రాజీవ్ దీనిని పరిగణనలోకి తీసుకున్నాడు. “ఇది బాగుంది.ఈ ఆదివారం అందరం గాడ్జెట్ లేని రోజుగా పాటిద్దాం. అంతా సరిగా ఉంటే ప్రతివారం అలాగే చేయొచ్చు,” తన అంగీకారం తెలిపాడు.
ప్రియ నవ్వింది, మార్పు కనుచూపుమేరలో ఉందని తేలిపోయింది. “అనిక కు ఇది నచ్చితే మనం ప్రతి వారం అలాగే చేయచ్చు.”
మరుసటి ఆదివారం, కుటుంబమంతా వారి మొదటి గాడ్జెట్ రహిత రోజును ప్రారంభించింది. శాంత పెసరట్టు ఉప్మా, అల్లం పచ్చడి సిద్ధం చేసింది. అందరూ కలిసి కూర్చున్నారు. అది తింటూ రాజీవ్, ప్రియ తమ బాల్యానికి చెందిన కథలను పంచుకున్నారు. అవి తల్చుకుంటూ ఇటువంటి అందమైన క్షణాలను ఎంతగా కోల్పోయారో గ్రహించారు. వారి బిజీ జీవితాల హడావిడిలో ఈ ఆనందాలను కోల్పోయారు. మొదట్లో ప్రతిఘటించింది అనిక. తన ఆన్లైన్ గేమ్లు, స్నేహితులను కోల్పోతానని ఫిర్యాదు చేసింది. శాంత, తన అనంతమైన సహనంతో, తన మనవరాలిని నిమగ్నం చేయడానికి మార్గాలను కనుగొంది. ఆమె అనికాను సాంప్రదాయ బోర్డ్ గేమ్లకు పరిచయం చేసింది. కుటుంబం అందరూ కలిసి అష్టా చమ్మా, వైకుంఠ పాళీ లాంటి ఆటలు ఆడుకోవడంతో అనిక సంబరపడింది. పురాణాల నుండి ఇంకా ఆమె చిన్ననాటి నుండి మనోహరమైన కథలను మనవరాలికి చెప్పింది శాంత. అలా రోజంతా తల్లీ తండ్రీ తనతోనే గడపడం అంతులేని ఆనందాన్ని ఇచ్చింది అనికకి.
వారు బోర్డ్ గేమ్స్ ఆడుతూ, పార్క్లో వాకింగ్ చేస్తూ, అనికాకు సాధారణ ఇంటి పనులను నేర్పిస్తూ రోజంతా గడిపారు. శాంత అనికాకు రంగోలిని ఎలా వేయాలో చూపించింది, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ, ఒకరి చేతులతో అందమైనదాన్ని సృష్టించడంలోని ఆనందాన్ని వివరించింది. మొదట్లో సంకోచించిన అనిక త్వరగానే ముగ్గు వేయడం నేర్చుకుంది. ఆమె వేళ్లు ప్రతి చుక్కను, గీతను జాగ్రత్తగా వేయడంలో నిమగ్నం అయిపోయాయి.
వారాలు గడిచేకొద్దీ, గాడ్జెట్ లేని ఆదివారాలు వాళ్ళ కుటుంబ సంప్రదాయంగా మారాయి. అనిక ఆ రోజు కోసం ఎదురుచూడడం ప్రారంభించింది, కథలు, ఆటలతో పాటు తనకు నానమ్మతో ఏర్పడుతున్న ప్రత్యేక బంధాన్ని ఆస్వాదించింది. రాజీవ్ ఇంకా ప్రియ కూడా తమ కుమార్తెలో సానుకూల మార్పును గమనించారు-ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంపై మరింత దృష్టి, గౌరవంతో వ్యవహరిస్తోంది. ఆమె ఇప్పుడు పుస్తక పఠనం కూడా చేస్తోంది.
ఒక ఆదివారం, వాళ్ళంతా కలిసి కూర్చున్నప్పుడు, అనిక తన చిన్ననాటి గురించి మరింత చెప్పమని నానమ్మను కోరింది. శాంత కళ్ళు వెలిగిపోయాయి. ఆమె తన సమయంలో పిల్లల పెంపకం, పండుగలు, సమాజ సమావేశాలు గురించి చెప్పింది. ఆ కథలలో ఎక్కడా టీవీ, ఫోన్ వంటివి లేకపోవడం అనికను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. “అవన్నీ లేకుండా మీరు ఎలా ఉండేవారు నానమ్మా?” తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక అడిగేసింది.
నవ్వింది శాంత. “మీ అమ్మానాన్నను అడుగు,” అనడంతో వాళ్లకేసి చూసింది అనిక.
ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిన రాజీవ్, ప్రియ, “నిజమే పాపా! మా చిన్నతనంలో టీవీ ఉంది కానీ ఇటువంటి స్మార్ట్ ఫోన్లు లేవు. మేం కాస్త పెద్దవాళ్లమయ్యాకే అవి వచ్చాయి. కానీ అవి ఇప్పుడు మన జీవితాల్ని పూర్తిగా ఆక్రమించేశాయి,” అని చెప్పారు.
నెలరోజుల తర్వాత, ఒక కుటుంబ సమావేశంలో, రాజీవ్ మాట్లాడటానికి లేచి నిలబడ్డాడు. “థాంక్యూ అమ్మా! నీ సహకారంతో ప్రియ ఆలోచనకు కార్య రూపం ఇవ్వగలిగాము. సంప్రదాయం, ఆధునికత సహజీవనం చేయగలవని మనం నిరూపించాం. ఆ రెండింటి బ్యాలెన్స్ని మేము కనుగొన్నాము. అనిక కూడా ఇప్పుడు ఎంతో మారింది. పైగా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ దీని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటోందిట. వాళ్ళ క్లాస్ టీచర్ నిన్న మమ్మల్ని పిలిచి మరీ దీని గురించి వివరాలు కనుక్కున్నారు. వీలైతే ఈసారి పేరెంట్ టీచర్ మీట్ లో మిగిలిన పేరెంట్స్ అందరికీ కూడా దీని గురించి చెప్పి, వీలైతే ఆచరించమని సూచిస్తాను అని చెప్పారు. ఈసారి పరీక్షల్లో అనిక క్లాస్ టాపర్ గా నిలిచింది. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది.”
శాంత కళ్ళు సంతోషంతో మెరిశాయి. “నాకు మీ ఇద్దరి గురించీ గర్వంగా ఉంది రాజీవ్. మీరు ఇద్దరూ మంచి పేరెంట్స్ గా ఉన్నారు. పిల్లల పెంపకం ఎంత బాధ్యతతో కూడుకున్నదో గ్రహించి, తదనుగుణంగా నడుచుకుంటున్న మీకు హాట్సాఫ్. నిజానికి మా సమయంలో పిల్లల కోసం మేము ఇంతగా చేయలేదని ఒప్పుకోవాలి.తండ్రి అంటే సంపాదించి తెచ్చేవాడు, తల్లి పిల్లలకు వేళకు ఆహారం అందించడం, అప్పుడప్పుడు వాళ్ళ చదువుపై దృష్టి పెట్టడం మినహా పిల్లలతో ఇంత స్నేహపూర్వకంగా ఉండాలి అనే విషయం మేము గ్రహించలేదనే చెప్పాలి. మీ తరం వారు ఈ విషయంలో మాకు ఆదర్శంగా నిలిచారు. నిజానికి అప్పుడు మాకన్నా ఇప్పుడు మీరు ఇద్దరూ ఉద్యోగాలతో ఎంతో బిజీ. అయినప్పటికీ మంచి పేరెంటింగ్ యొక్క సారాంశం సంప్రదాయం ఇంకా ఆధునికత మధ్య ఎంచుకోవడంలో కాకుండా రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన వాటిని మిళితం చేయడంలో ఉందని మీరు తెలుసుకున్నారు. మన ఇల్లు పాత విలువలు మరియు కొత్త ఆలోచనలు సహజీవనం చేసే అందమైన ప్రదేశంగా మారింది. అనిక మంచి చెడుల గుర్తింపు, గౌరవం మరియు ప్రేమతో పెరిగేలా చేసింది. మీరు నేటి తరం తల్లిదండ్రులకు ప్రతినిధులు.”
తపస్వి మనోహరం పత్రిక మరియు
శసాంగ్- అనుశ్రీ మెండు మరియు సేవా ఫౌండేషన్ వారి భాగస్వామ్యం తో నిర్వహించిన ‘ఈ తరం అమ్మానాన్నలు’ అంశం పై కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ
బైకును స్లో చేసి చెట్టు క్రింద ఆపి అటువైపు చూసాడు కార్తీక్. సందేహం లేదు… సమీరే!
రోడ్డు కవతల కోట గుమ్మం లాంటి జైలు తలుపులకు వున్న చిన్న డోర్ లోంచి బయటికి వచ్చి, సెక్యూరిటీ గార్డ్ తో ఏదో మాట్లాడుతోంది.
అతడు నవ్వుతూ ఏదో అంటున్నాడు. అంతలోనే భుజానికి వేసుకున్న బ్యాగ్ సర్దుకుంటూ వచ్చి బైక్ పార్క్ చేసుకున్న స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది.
హెల్మెట్ పెట్టుకుని వున్న తనను గమనించలేదేమో అనుకున్నాడు కార్తీక్.
ఇది మూడో ఆదివారం సమీరను అలా… జైల్లోంచి బయటకు వస్తూండగా చూడడం. యాదృచ్ఛికమే ఐనా తను జిమ్కు వెళ్ళి వచ్చే టైమ్లోనే ఆమె జైలులోంచి బయటకు రావడం జరుగుతోంది.
కారణం ఏమిటో అడుగుదామని మొబైల్ మీదకు చెయ్యి పోనిచ్చిన వాడల్లా, ఒక్క, క్షణం ఆగాడు.
‘ఏం చెబుతుంది? అసలు… నిజం చెబుతుందా? తను కలిసింది నేరస్థుడినో, తీవ్రవాదినో, హంతకుడినో అని చెపుతుందా? లేకపోతే డిగ్రీ చదివే రోజుల్లోనే అతన్ని ప్రేమించాననీ, ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్లనే, నీతో పెళ్ళికి ఒప్పుకున్నాననీ చెబితే తను భరించగలడా?
తల్లిదండ్రులకు తను ఒక్కడినే కొడుకుననీ, ఎమ్.టెక్. చదివి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిజేసే తనకు ఉమ్మడి కుటుంబంలో వుండి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలనీ అడిగినప్పుడు సమీర సంతోషంగా ఒప్పుకుందే! తను కూడా ఏదో కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరొచ్చునందే! ఇదేమిటి మరి? వాళ్ళ పేరెంట్స్కు తెలుసో… లేదో!
ఆలోచనలతో అసహనంగా మారడు కార్తీక్. వడివడిగా జైలువైపు నడిచాడు. వెళ్ళిన ఐదునిమిషాల్లోనే బయటికి వచ్చాడు.
‘క్షమించు సమీరా! జైలులో డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఖైదీలకు వాలంటరీగా ఇంగ్లీషు టీచ్ చేయడానికి వెళ్తున్న నిన్ను అనుమానించి మగాడిననిపించాను. నీకు అంతా విడమర్చి సారీ చెప్తేగానీ, నా మనస్సు తేరుకోదు!’ అనుకున్నాక అతని హృదయం తేలికైంది.
“రత్తాలూ!ఓ రత్తాలక్కా !సీరలేమైనా.ఉన్నాయేందే” అంటూ గుడిసె ముందున్న సిమెంటు తొట్టి లో నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటూ కేకేసింది పోచమ్మ.
“అవు వున్నయిగనీ మూట ఇప్పలేదు అక్కా!ఉతకలే,ఇస్తిరీ సేయలా!రెండు రోజులసందె జొరం.”
అంటూ మూలిగింది రత్తాలు.
“అయ్యో సెప్పకపోతీవి.జరంతలోమంచిగా పప్పుసారు బువ్వ తెస్తా.కుసింతబువ్వతిని డోలో ఏసుకో తగ్గుద్ది. పొద్దుగాలే రోడ్లట్టకు తిరగాలాయే.ఛీ! రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయెపో!” ఆప్యాయంగా అంటూ తన రేకుల షెడ్డు వైపు వడివడిగా అడుగులువేసింది పోచమ్మ.
ఆ బస్తీలో అన్నీ రేకులషెడ్డులే కాలవకి ఆనుకొని.అక్కడ ఆడమగా అందరూ ఏదో చిన్నాచితకా కూలిపనులు చేసుకుని పొట్ట పోసుకునే వారే.అందరూ ఒకరి కష్టం ఒకరు తెలుసుకుని ఒకరికొకరు ఆదుకునేవారే.అదే ఆ బస్తీ ప్రత్యేకత.
★★★
రత్తాలు చాలా తెలివైనది.కొడుకు రెండేళ్ళవాడని కనికరం లేకుండా యాదయ్య రత్తాలుని వదిలేసి ఓటక్కులాడిని చేసుకొని పోయాడు.ఇదంతా సర్వసాధారణం ఆ బస్తీలో.
యాదయ్య వెళ్లి పోతానన్నప్పుడు గుండెలు బాదుకొని ఏడవలేదు, గొడవపడలేదు రత్తాలు. పంచాయితీ అన్నారు బస్తీలో కొందరు.వద్దన్నది రత్తాలు.తనంటే ఇష్టం లేని మొగోనితొ కాపరం చేసినా చేయకపోనా ఒక్కటే అని మౌనంగా ఉంది.
“రెండేళ్ళపిల్లోడిని సదివించాల.మంచికొలువులో ఎట్టాల.ఈ మురికికాలవకి దూరం పోవాల”ఇదే పగలూరాత్రి నల్లపోచమ్మ గుడిలో కూచొని ఆ తల్లికళ్ళలోకి చూస్తూ మౌనంగా మాట్లాడేది రత్తాలు.
ఆసంకల్పంతో భర్త వెళ్ళాక ఇల్లంతా వెతికి అక్కడ ఇక్కడ దాచిన ఒక వెయ్యి పోగేసింది.పోచమ్మని తీసుకుని స్టీలు ఫేక్టరీకి పోయి స్టీలుసామాన్లు కొంది.మరుసటిరోజు ఒక గంపలో స్టీలు సామాన్లు సర్దుకొని.పిల్లవాడిని జోలెలో కూర్చోపెట్టుకొని,”పాత సీరలకు స్టీలు సామాన్లు ఇస్తామమ్మా”, అని అరచుకుంటూ అంటూ వీధి వీధి ఎండనక వాననక తిరిగేది.
మొదట్లో ఎవరోపిలిచి పాతచీరలిస్తే దానికి తగ్గ సామానిచ్చేది.రాను రాను గృహిణులకి రత్తాలు బాగా. అలవాటైంది.జోలెలోని పిల్లడు కూడా కొంత కారణం.పాతచీరలు నాలుగైదుండగానే రత్తాలు దగ్గిర సామాన్లు కొనే వాళ్ళు.కొంతమంది అయితే “ఒసే! రత్తాలు ఈసారి పులిహార పళ్ళెంతేవే అనో లేకపోతే బియ్యం పోసుకునే డబ్బా తెచ్చిపెట్టు” అంటూ డిమాండ్ చేసేవారు.వాళ్ళ డిమాండ్ కి తగ్గట్టు స్టీలు సామాన్లు తెచ్చేది.ఆ ఇళ్ళవాళ్ళు వాళ్ళ పాతబట్టలకి ఏదో ఒకటి వస్తోందని పెద్ద పట్టించుకునేవాళ్ళుకాదు.పైపెచ్చు రత్తమ్మ డిమాండ్ చేసినంత క్యాష్ పెద్దవస్తువులకి ముట్టచెప్పేవారు. అంతేకాదు నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటూ బిగుతైన ప్యాంట్లు, చిన్నపిల్లల బట్టలు పడేసేవారు.
“ఓ!అమ్మో! సీరలకైతేనే సామానిత్తా. ఈ పాంటులకి,పిల్లోళ్ళ బట్టలకి నేనేమివ్వా.” అంటూ ఖరాఖండిగా చెప్పేది రత్తాలు .
” ఏదోఒకటి చేసుకోవే!ఇవన్నీ పెట్టే స్థళంలేదుఅన్నీ బిగుతైనవే మా వాళ్ళకి” అంటూ పడేసేవారు రత్తాలుకి.
అప్పడప్పుడూ షెడ్మీద సొరతీగకి కాసిన సొరకాయలు,తొట్టిదగ్గర మల్లెచెట్టుకి పూసిన మల్లెలు ఆఇళ్ళవాళ్ళకి బహుమానంగా ఇచ్చి,వాళ్ళపనిమనిషి రాకపోతె బాసాన్లు తోమి ఆ ఇళ్ళవాళ్ళకి సన్నిహితురాలయిందిరత్తాలు.
సామాన్ల బదులు వచ్చిన చీరలన్నీ తీసి అందులో ఫాల్ ఊడినవి,జరీ చీరలు,కొంచెం చిరిగిన చీరలు విడి విడిగా చేసి బస్తీలో మిషను కుట్టే సీతమ్మ చేత రిపేరు చేయించి వాటిని ఉతికి ఇస్త్రీ చేయించేది.ఆ చీరలు అమ్మకానికి పెట్టేది రత్తాలు.పిల్లల బట్టలు బస్తీలో పిల్లలకి ఉచితంగా ఇచ్చేది. జీన్స్ ప్యాంట్లు కుర్రకారుకి చవకగా ఇచ్చేది.ఈ విధంగా రత్తమ్మ బస్తీలో మంచిపేరు తెచ్చుకుంది. చీరలమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకుని మిగిలిన దంతా స్టీలు సామాన్లు కని ఖర్చు పెట్టేది.
. ★★★
ఇలా రెండు సంవత్సరాలు కాలంలో కలసి పోయాయి.రత్తాలు కొడుకు సురేసు నాలుగేళ్ళ వాడయ్యాడు.రత్తమ్మకి అసలు కష్టం ఇప్పుడు మొదలైంది.పిల్లవాణ్ణి ఇంట్లో వదలలేదు తను ముందు లాగా పిల్లవాణ్ణి జోలెలో కూర్చోపెట్టుకొని నెత్తి మీద బుట్ట, బట్టల మూటతో మోయాలంటే చేతకావటంలేదు.పోచమ్మ గుడి ముందు కూర్చొని మౌనంగా కష్టం విన్నవించుకునేది.
ఒకరోజు ఒక పెద్ద. గేటుముందాగి “పాతబట్టలకి స్టీలు సామాన్లు ఇస్తా “అంటు గట్టిగా అరచింది రత్తాలు.
లోపలనించీ ఒక నడివయసు ఆయన వచ్చి.” ఇది అనాధాశ్రమం.మేమే వాళ్ళూవీళ్ళు ఇచ్చిన డబ్బు బట్టలు గిన్నెలు తీసుకుంటాం”అంటూ గేటు మూసేసాడు.
మరొకసారి రత్తాలు తిరిగి వస్తుంటే అదే గేటు నుండి చాలామంది పిల్లల సందడి వినిపించి నెమ్మదిగా గేటు తీసుకొని వెళ్ళింది.అక్కడ ఒక ఆజాను బాహుడయిన నలభై ఏళ్ళ వ్యక్తి ముప్పైఐదేళ్ళ స్త్రీ ఆరుబయట పిల్లలని చుట్టూర కూర్చోపెట్టుకునిచదువు చెప్పటం చూసింది.
“అమ్మా ‘అంటూ పిలిచిందిరత్తాలు నెత్తిమీద గంపనేలమీద పెడుతూ.
“ఎవరమ్మా!చెప్పు. ఏంకావాలి? అంటూ ఆప్యాయంగా అడిగింది ఆ స్త్రీ.
“అమ్మా ఈడ అమ్మా అయ్యా లేనోళ్ళేనా నాబోటోళ్ళ పిల్లలుకూడా ఉన్నారా?”అని అడిగింది రత్తాలు.
“నీకు భర్త ఉన్నాడా?ఉంటే ఏం చేస్తున్నాడు”అంటూ అడిగింది ఆస్త్రీ.
‘”లేడమ్మా!ఈ పిల్లగాడు రెండేళ్ళ సందె వదిలేసి ఏరే ఆమెను కట్టుకున్నాడు. ఈపిల్లగాని జోలెలో ఏసుకొని ఈ గంపనెత్తినెట్టుకొని గల్లీలంట తిరుగాడతూ స్టీలుసామాన్ల యాపారం సేసుకుంటున్నా.పోరడు నాలుగేండ్లు అయినాయి. ఎత్తుకోలేను.ఈడా నడసలేడు.మీరు దయెట్టి నా పోరడ్నికూడా ఈపిల్లగాళ్ళతో ఉంచుకుంటే నే సాయంమాపు పిల్లగాన్ని తోలుకు పోతా”అంటూ ఆశగా చూసింది రత్తాలు.
“రత్తాలు!నాపేరు శాంతి.ఈ సార్ నా భర్త.ఈ ఆశ్రమం కేవలం అనాధలకే కాదు. పిల్లలని పోషించుకోలేని ఆశ్రయం లేని మీలాంటి పేదలకి కూడా.ఇక్కడ రైల్వే స్టేషన్లలోనూ వీధుల్లో దిక్కులేక అడుక్కునే పిల్లలని పోలీసులు మాదగ్గర వదిలి పెడతారు.మేము వారికి భోజనం పెట్టి గవర్ననమెంటు స్కూలులో చదివిస్తాము. వాళ్ళు 12వక్లాసు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుని బయటకు వెళ్ళిపోవాల్సిందే”. అంటూ చెప్పింది శాంతి.
అమ్మా శాంతమ్మా! నా బుడ్డోడిని జరంత పయోజకుణ్ణి సేయమ్మా బాంచను మీ కాళ్ళుమొక్కుతా” అంటూ ఎంతో దీనంగా శాంతి శాంతి భర్తకాళ్ళు పట్టుకుంది రత్తాలు.
“లే లే రత్తాలు మేమున్నది మీలాంటి వారిని ఆదుకోవటానికే.” అంటూ మేము గవర్నమెంటు వారి సహకారంతో పిల్లలని చదివిస్తాము.అందుకని కొన్ని వివరాలు నీ వేలి ముద్ర కావాలంటూ ఫారమ్ లు తెచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసింది శాంతి.
గుండెలమీద భారం తీరినట్టయింది రత్తాలుకి.
“రేపు తీసుకొచ్చి వదులుతానమ్మా!” అంటూ కాళ్ళకి మొక్కి బుట్టా, మూటా నెత్తిన పెట్టుకుని పిల్లాడిని నడిపించుకుంటూ ఇంటి బాట పట్టింది రత్తాలు. మధ్యలో పోచమ్మ గుడి దగ్గర కాస్సేపు కళ్ళనీళ్ళ”పోచమ్మ తల్లీ నీవే దిక్కు”అంటూ బాధ వెళ్ళపోసుకుంది.
“గేం రత్తాలు!ఇయాల గింత ఆలీసమైనాది?”అంటూ రావులమ్మ పలకరింపుతో ఆలోచనలతో నడుస్తున్న రత్తాలు కి ఇంటికి చేరువయ్యానని గ్రహించింది.
“గౌ అక్కా”అంటున్న రత్తలుని చూసి అమ్మా ఇద్దరొస్తోంందే,ఆకలౌతోందే అంటూ ఏడుపు లంకించుకున్నాడు.”సురేసు ఎక్కడ తల్లి రావులమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటుందో అని.
“ఉండయ్యా బుక్కెడు బువ్వతిని పండదుగాని” అంటూ వంట కుపక్రమించింది.
★★★
అమావాస్య చీకటిని పారద్రోలుతూ సూరీడు అరుణ కిరణాలు నీలిరంగు ప్లాస్టిక్ పరదాలగుండా రత్తాలు ముఖాన్ని తాకాయి.
“అమ్మో తెల్లారిందే!” అనుకుంటూ రాత్రి చద్ది పిల్లవానికి తినిపించి తానింతతిని బుట్ట సర్దుకొని పిల్లవాని చంకనవేసుకుని ఆశ్రమం బాట పట్టింది.
తోవలో కొడుకుని ప్రేమతో “సురేసా నీకు మంచి రోజులొచ్చినాయి పోచమ్మ తల్లి దయవల్ల.నిన్న పోయినాం సూడు ఆ ఆంటీ తావున ఉండు.నేను సామాన్లు అమ్ముకొని సందేళ వచ్చేటప్పుడు నిన్ను కొండుపోతా!”అంటూ రత్తమ్మ పిల్లవానికి సంజాయించింది.
వాడి చిన్న ప్రాణానికి వీధి వీధి ఎండనక వాననక తిరగాలంటే కాళ్ళు నొప్పులు.”అమ్మ అన్న తావున మస్తుమంది దోస్తులున్నారు.” అనుకున్నాడు సురేసు.
ఒక్కటే సురేసుకు అర్ధం అయింది.తల్లి తో నడవక్కరలేదు..
పెద్ద పేచీ లేకుండానే శాంతి దగ్గరున్నాడు సురేసు (సురేష్)
★★★
పిల్లవాడి భారం తగ్గటంతో రత్తాలుకి కొత్త కొత్త ఆలోచనలు ఉత్సాహం పెరిగింది.పక్కనే బండి మీద గాజులు, క్లిప్పులు అమ్ముకునే రాజయ్యని పిలిచింది ఒక చక్క మీద “చీరలు అమ్మబడును.”SAREES FoR SALE “అని రాయించిందితెల్ల పైంట్ మీద నల్లపైంట్ తో 7వక్లాసు వరకూ గవర్నమెంటు స్కూలులో చదివి చదువాపేసిన రాజయ్యతో.చాలా ఏళ్ళుగా రాయటం అలవాటు లేక బ్రష్ పెయింట్ తో రాయటం చాతకాక ఏదో కొక్కిరిగా రాసాడు.రత్తాలు తెలుగులో రాయమంటే తన ఆంగ్ల పాండిత్యం అంతా చూపించి పాపం sarees for sale అని కూడా రాసితన చదువు అక్కరకి వచ్చినందుకు తెగ మురిసి పోయాడు రాజయ్య.
రెండు కఱ్ఱలు పాతి ఆ కఱ్ఱలకు పెయింట్ చేసిన చక్కను మేకులతో కొట్టించింది. ఆ పని చేసినందుకు వద్దంటున్నా రాజయ్య చేతిలో 100 రూపాయలు పెట్టింది ఎవరి కష్టం ఉంచుకోవడం ఇష్టం లేని రత్తాలు.రాజయ్య పిల్లలకి తన దగ్గరున్న బట్టలు ఇచ్చింది.
శుక్రవారం నాడు ఆ కఱ్ఱలకు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరి కాయ కొట్టింది.
ఇంటిముందు తొట్టిలో నీళ్ళునింపింది.
గుడిసె లో మంచి చాప పరచింది.ఒక అట్టపెట్టెలో ఇస్త్రీ చేసిన మంచి చీరలుపెట్టింది.
పిల్లల బట్టలు ఉతికి మడత పెట్టింది.
అమ్ముకోవడానికి వేళ్ళేటప్పుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ బట్టలన్నీ శాంతికి ఇచ్చి”అమ్మా నేను పేదదానిని కానీ నాకూ మనసుండాది.అయ్య,,అమ్మ లేని ఈ పోరలని సూత్తాఉంటే మనసు. నొచ్చుకుంటోంది. మీరేమనుకోనంటే ఈ డెస్సులన్నీ వ ఓరికి సరిపోతే ఆరికివ్వండమ్మా!” అంటూ చక్కగా మడతపెట్టిన బట్టల అట్టపెట్టె ఇచ్చింది రత్తాలు.
అన్నీ మంచి రెడీమేడ్ డ్రెస్సులు. ఒక్కటీ చినగలేదు.అన్నీ బిగుతై రత్తాలుకి ఇచ్చి నటువంటివి..శాంతి అభ్యంతరం చెప్పకుండా తీసుకుంది.
బీదరికంలోకూడా సహాయం చేయాలనే మానవతా ధృక్పదానికి శాంతి కళ్ళు చెమరించాయి.
మానవత్వం శాంతి రత్తాలుని మంచి స్నేహితుల్ని చేసాయి.సురేష్ శాంతి పర్యవేక్షణలో మంచి భాష,నడవడిక,తెలుగు ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకుంటున్నాడు.
ఒక్కొక్క రోజు శాంతి “సురేష్ ఇవాళ ఇక్కడే పడుకుంటాడని”ఉంచేసేది.
రత్తాలుది పల్లెటూరి అందం.పెద్దపెద్ద కాటుక కళ్ళు సూటైన ముక్కుకి ముక్కెర.మొరటుగా ఉన్నా తీర్చి దిద్దినపెదాలు.మంచి ఎత్తు ఎత్తుకు దగ్గబలమైన శరీరసౌష్టవం.తిన్నా తినకపోయినా మనిషిలో నీరసం ఉండేదికాదు.తల్లి పోలికలు పుణికి పుచ్చుకున్నాడు సురేష్.
రత్తాలు బోర్డు పెట్టిన వేళా విశేషం పాతచీరల అమ్మకం జోరుగా సాగింది.తొట్టె దగ్గర కాళ్ళు కడుక్కుని గాని ఎవరూ లోనికి రాకూడదు.వచ్చిన వాళ్ళు కూర్చున్నాక అట్టపెట్టెలో చీరలు చూపించేది.
రఫ్చేసిన చీరలు మాత్రం బేరమాడనిచ్చేది.యాభై నించీ వంద వరకూ.
మంచి చీరలు రెండువందలు నించీ రెండువందలయాభై.అన్నీ గార్డెన్సిల్క్ లేకపోతే ఫాన్సీ జరీచీరలు.షాపులో పదిహేను రెండువేలు పలికేవి.నూటయాభైకి షాపులో కొత్తచీరదొరికినా పలచగా ఉండటం ఒకనాలుగు ఉతుకులకి జాలీలయ్యేవి.అందుకని బస్తీలో అందరూ రత్తాలు దగ్గిర చీరలు కొనటానికి ఇష్టపడేవారు.అదీకాక డబ్బులు రెండునెలల్లో తీరిస్తేచాలు.
సాయంత్రాలు పెందలాడే వచ్చి చీరల వ్యాపారం చేసేది.
నెమ్మది నెమ్మదిగా సురేష్ శాంతి దగ్గర మాలిమయ్యాడు.ఇప్పుడు టెంత్ కి వచ్చాడు.ఎయిత్ నించీ తల్లితో బస్తీలోకి వెళ్ళటం మానేసాడు ఎప్పుడో తప్పించి.చదువు వాడికి ప్రాణం.తనకు తల్లి ఉంది.అక్కడ తల్లీ తండ్రి లేని వారంటే వాడికి ఎనలేని ప్రేమ.చిన్న పిల్లలకి స్నానం చేయించటం,అన్నం తినిపించటంతోపాటు వాళ్ళచేత హోంవర్క్ చేయించటం లాంటి పనుల్లో శాంతికి శాంతి భర్త ప్రకాష్ కి తలలలో నాలుకయ్యాడు.
★★★
ఒకరోజు శాంతి రత్తాలు వ్యాపారం గురించి తెలుసుకుంది.
“రత్తాలు! ఎన్నాళ్ళిలా రోడ్లు పట్టుకు తిరుగుతావు ఎండనక వాననక ఇంటిదగ్గిరే ఉండి వ్యాపారం చూసుకోకూడదు.”అందిశాంతి.
శాంతి మాటలు వినంగానే రత్తాలు పడీపడీ నవ్వటం
నవ్వుఎంతకీ ఆపక పోయేసరికి ఉక్రోషంతో శాంతికి కోపం వచ్చింది.
“ఎందుకు నవ్వుతావు? నేను నీవైపు ఆలోచిస్తుంటే.” అందికోపంగా శాంతి.
“అమ్మా!నేను చీరల వ్యాపారం చేయట్లేదు పాతబట్టలకి స్టీలు సామాన్ల వ్యాపారం. అలా అని స్టీలుసామాన్ల వ్యాపారం కాదు.స్టీలుసామాన్లు లేకపోతే బట్టలు రావు.బట్టలు అమ్మకపోతే పైసలు రావు.పైసలు రాకపోతే స్టీలుసామాన్లు గెట్లాకొనేది.ఇంట్లో కూర్చునే యాపారం కాదమ్మానాది.”అంటూ శాంతికి కోపం వచ్చిందని గ్రహించి విడమరచి చెప్పింది రత్తాలు.
ఇప్పుడు శాంతివంతైంది పడీపడీనవ్వటం. తలకొట్టుకుని”ఇంత చిన్న లాజిక్ తనేలా మిస్సయింది. అందుకేనేమో చదువుకున్నవానికంటే చాకలివాడు మేలంటారు”అనుకుందిశాంతి.
★★★
ఒకరోజు సాయంత్రం రెండు శుభవార్తలు వినిపించింది శాంతి రత్తాలుకి.
మొదటిది సురేష్ మంచి పర్సెంటేజ్ తో టెన్త్ పాసయ్యాడు.
రెండవది ఒక పెద్ద అట్టపెట్టె నిండా కొత్తచీరలు.అన్నీ 100,150 రూపాయలకి.హోల్సేల్ లో మంచి చీరలు అతి తక్కువ ధరలో శాంతి ఫ్రెండ్ సూరత్ నించీ తెప్పించుకుంటుంటే రత్తాలుకని శాంతి తెప్పించింది.
“రత్తాలు ఇక మీదట పాతబట్టలకు స్టీలు సామాన్లోయ్అంటూ గల్లీ గల్లీ తిరగద్దు.ఇందులో నాస్వార్ధం కొంచెం ఉంది.ప్రొద్దునే ఆశ్రమానికి వచ్చి బాసాన్లుతోమి ఆశ్రమం ఊడ్చి తుడిచి వాషింగ్ మషీన్లో పిల్లల బట్టలుతికి ఆరవేయి.మధ్యాహ్నం వెళ్ళి నీ వ్యాపారం చూసుకో.నీకు ఆరువేలు జీతం.” ఇప్పుడిచ్చిన బట్టలు ఎడ్వాన్స్ అనుకో”అంటూ ఆ బట్టల పెట్టె అందించింది.
“ఏమంటావు రత్తాలు?నీకు ఇష్టమేనా?అడిగింది శాంతి.
“ఏమంటానమ్మా! అడగకుండా వొరాలిస్తున్న దుర్గమ్మతల్లివి.”అంటూ కాళ్ళమీద పడింది.
★★★
బళ్ళు ఓడలు ఓడలు బళ్ళూ. అవుతాయన్నట్లు రత్తాలు రాత మారిపోయింది. పిల్లవాడు స్కాలర్షిప్ తో ఇంటర్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.ఆశ్రమానికే ఆదర్శం అయ్యాడు. శాంతి వాడి పర్శనాలిటీకి పోలీసు ఉఉద్యోగం అయితే బాగుంటుందని రత్తాలుని అడిగింది.
“నాబిడ్డ కాడు వాడు మీ బిడ్డ.వాడి కి ఏది మంచిదైతే అది చేయండి.”అంది రత్తాలు.
“ఏమంటావు సురేష్?”అంటూ ప్రకాష్ సురేష్ ని అడిగేడు.
“అది చాలా కష్టం కద అంకల్.” అన్నాడు సురేష్.
“నువ్వేమీ ఆలోచించకు.నిన్ను పోలీస్ రిక్రూట్మెంటుకి ప్రిపేర్ చేసే బాధ్యత నాది.నేను ఎక్స్ సర్వీస్ మెన్ ని ” గర్వంగా అన్నాడు ప్రకాష్.
పట్టుదల ,సాధన ఉంటే సాధించలేనిది లేదంటూ ప్రకాష్ గైడేన్స్ లో రిక్రూట్మెంటు లో సెలక్ట్ అయి ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని కానిస్టేబుల్ అయ్యాడు సురేష్.
తల్లి కి చీరల వ్యాపారమంటే ఇష్టమని సామాన్యులుండే చోట ముందుషాపు వెనుక ఒకగది కిచెన్ అద్దెకు తీసుకొని చీరల షాపు ఓపెన్ చేయించాడు.
“బోర్డ్ నేనే రాస్తా రత్తాలక్కా!”అన్నాడు రాజయ్య.
“మామా!నీకోదండం.నీబోర్డువంకరటింకర ఒ వానితమ్మడు సొ లా ఉంటుంది”అంటూ ఎక్కిరించాడు సురేష్.
“ఆఁ ! మా సెప్పొచ్చినావు.నేరాసిన బోర్డుతోనే అమ్మ సీరల యాపారం సేసింది.నువ్వుబుడ్డోడుగా ఉన్న సందెనించీ”అంటూ అలిగాడు రాజయ్య.
షాపు ఓపెనింగ్ కి శాంతి ప్రకాష్ దంపతులు వచ్చారు.
రత్తాలు వారికి సురేష్ చేత పూలదండ వేయించింది వారికి బట్టలు పెట్టి కొడుకును “మొక్కరా సురేసు”అంది.
“అమ్మా!సురేసు కాదే సురేష్ అను.గింతమంచి పేరెట్టి గట్ల పిలుస్తవేంటి?”అంటూ తల్లిని కసిరి ముద్దుపెట్టుకున్నాడు.
రత్తాలు షాపుకి
“పోచమ్మ టెక్స్టైల్స్POCHAMMA TEXTILES”
అని పేరు పెట్టింది.
బస్తీని వదిలి షాపులోనే కాపరం పెట్టింది రత్తమ్మ.
పూర్వం రాజుల వైభవ చిహ్నంగా మిగిలిన శిధిలావస్తలో ఉన్నకోటలులా
“చీరలు అమ్మబడును.”SAREES FOR SALE” బోర్డ్ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రత్తాలు ఘన విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.
ఏడాది కొకసారి. బస్తీకెళ్ళి మునుపు తన దగ్గిరకొనే దోస్తులకి పసుపు కుంకం కొత్తచీరలిచ్చి తృప్తి చెందుతుంది .బోనాలెత్తి నల్లపోచమ్మకి కొత్తచీర కట్టిస్తుంది.తను చేసేది పెద్దవ్యాపారం కాకపోయినా గొడ్డుఖారం ఉల్లిపాయ నంజుకుని సద్దన్నంతిన్నరోజులు మరువలేదు.ఈ నాడు ఉడుకుడుకు బువ్వతినగలుగుతోంది.కొడుకుని కొలువులో చూడగలగటం అన్నది పోచమ్మదీవెనని గట్టి నమ్మకం రత్తాలుకి.
“దశ మారినా దిశ మరువలేదు “రత్తాలు, సురేష్.వారిచేతనైనంత సేవ ఆశ్రమానికి అందిస్తూ ఆశ్రమం నడిపించడంలో వారూ సభ్యులయ్యారు.
ఓం శాంతి
దెవులపల్లి విజయలక్ష్మి.
చెయ్యి వెయ్యగానే ముడుచుకుపోయిన ఆమెను జూసి “నేనంటే యిష్టం లేదా?” అడిగాడతను.
“అబ్బే అటువంటిదేమీ లేదు” సర్దుకొని అతని భుజం మీద చెయ్యవేసిందామె. ఎందుకంటే కస్టమరు తన గురించి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే జరగబోయే పరిణామాలు ఆమెలోని అణువణువుకూ తెలుసు. నెత్తురొలికే గాయాలు తనువునీ, మనసునీ కబలించేస్తాయి. తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికితోడు మనసుకయ్యే గాయాలు కప్పిపుచ్చుకోవచ్చు. కాని తనువుకయ్యే గాయాలు అలా కాదు కదా! నొప్పితో విలవిల్లాడుతూ, మేమున్నామంటూ గుర్తుచేస్తూనే ఉంటాయి. దాని బదులు ఇప్పుడిది భరించడమే సులువనుకొని, అయిష్టంగా ముడుచుకుపోబోతున్న కండరాలను మందలించి, మనసుకు సర్దిచెప్పి, అతనికనుగుణంగా కదిలించింది తనువును. తన స్పర్శకు స్పందిస్తున్న ఆమెను అల్లుకుపోతున్నాడతను.
మధ్యలో చేస్తున్న పనినాపి హఠాత్తుగా “నేనందుకు పనికొస్తానా?” ప్రశ్నించాడతను.
కస్టమరుకి ఏది కావాలో అది అందించి, వాళ్లని సంతృప్తి పరిచి పంపించాలిక్కడ. అందుకే “ఎందుకలా అనుకుంటున్నారు? మీకేమి తక్కువ?” అని లేని ఉత్సాహాన్ని గొంతులో నింపుకొని అడిగింది.
“నిజంగానా! నువ్వబద్దం చెప్పడం లేదు కదా!” అని అంటూ, “పర్వాలేదా! నీకేమీ ఇబ్బంది కలగడం లేదు కదా! ఉంటే చెప్పంటూ” ఆమెను పెనవేసుకుంటున్నాడు.
ఇదో కొత్త అనుభవమామెకు. తన తనువుతో ఆడుకునేవాళ్లే గాని, “నీకేమీ ఇబ్బంది లేదు కదా!” అని అడిగిన కష్టమరుని ఇంతవరకు తన సర్వీసులో చూడలేదామె. తొలిసారిగా ఆమె మనసు స్పందిస్తోంది పరస్పర్శకు. ఆమె తనువును తీగగా చేసి మీటుతున్నాడు. తీగ మీటితే నాదము పలికినట్టు, ఆమె మనసు ఆనందనాదాన్ని పలుకుతోంది. పారవశ్యం ఉత్తుంగ తరంగంలా ఇద్దరినీ అల్లుకుపోతుంది.
అలసి, సేదదీరిన అతను “నాలో ఏమీ లోపం లేదు కదా?” ఆమె చెవిలో గుసగుసలాడాడు. అలసి అతని చేతుల్లో సేదతీరుతున్న ఆమె “మీకా అనుమానమెందుకొచ్చిందంది ఆశ్చర్యంగా.
ఆమె స్వరంలోని మాధుర్యమో, మార్దవమో కదిలించిందతనిని. “నేనందుకు పనికిరాని వాడినంటున్నారంతా!” చిన్నపిల్లాడిలా చెప్పాడతను.
“మీమీద మీకా నమ్మకం లేదా?” అని అడిగిన ఆమెతో “ఏమో! నా మీద నాకే నమ్మకం పోయింది” నిట్టూర్చాడతను.
“ఎందుకలా?” అని అడిగిన ఆమెతో “తానిష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకుంటానని, ఇంటినుండి వెళ్లిపోయిన నా మరదలిని తీసుకొచ్చి, పరువుమర్యాదల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటే ఆనందంగానే చేసుకున్నాను. ఎందుకంటే తనంటే చిన్నప్పటినుండి నాకిష్టం కనక. మొదటిరాత్రి ‘యింతకుముందు జరిగిందంతా మర్చిపోదాం. ఇకనుండి ఒకరికొకరమవుదాం’ అని తనను దగ్గరకు తీసుకుంటున్న నాతో, ‘ఛీ! నువ్వసలు మగాడివేనా? చీమూ నెత్తురూ లేదా!’ అని ఛీత్కరించుకొని గదిలోనుండి వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా, నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ప్రేమించాననుకున్నవాడు దక్కలేదన్న బాధతో అలా అందేమోనని సరి పెట్టుకున్నాను. కాని, ఎప్పుడు తనకి దగ్గరవుదామని చూసినా ఆమె ముఖంలో ఒక రకమైన చీదరింపు… ‘నువ్వు మగాడివి కావంటూ….’
నేను మగాడిని కానా అని నామీద నాకే అపనమ్మకమేస్తుంటే …. నాలోనే ఏదో లోపం ఉందేమోనని నామనసుకే అనుమానం వేస్తుంటే… అవునో కాదో తెలుసుకోవడానికి రహస్యంగా యిలా అప్పుడప్పుడూ ఎక్కడెక్కడికో వెళ్ళినా… వాళ్లు నా మీద చెయ్యి వెయ్యగానే నేను చేస్తున్నది తప్పని నా మనసు నన్నే మందలిస్తుంటే… ముడుచుకుపోయి, ఏమి చెయ్యని నన్ను, జాలిగా చూస్తూ… ‘మగతనం లేనప్పుడు ఎవరి దగ్గరైనా అంతే!’ అనేవాళ్లే గాని నీలా మృదువుగా నన్ను దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ అనుమానం” యేమి గుర్తొచ్చిందో కాసేపాగిపోయి….
తాను ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని…. నేను సంసారానికి పనికి రానని, విడాకులు కావాలని నా మరదలు కోర్టుకెక్కితే… వీడు మగవాడు కాదని కొంతమంది జాలిగా… కొంతమంది హేళనగా చూస్తుంటే… కట్టుకున్న భార్యే అవమానాన్ని మిగిల్చి వెళ్లిపోతే ఎందుకీ జీవితమని… బ్రతికి ఎవరినుద్ధరించాలని… ఇంకొకవైపు నా తప్పూ లేదు, నాలో యే లోపమూ లేదు, నేను మగవాడినే… అని అరిచి చెప్పాలని… ఇటువంటి విరుద్ధ భావాలతో, పోయేముందు ఒక్కసారైనా నేను మగవాడినేనని నిరూపించుకోవాలని…. యిదిగో యిప్పుడిలా నీ ముందు…. నీలా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. నువ్వైనా నిజం చెప్పు” అన్న అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా “నీకేమి? నువ్వు బంగారు కొండవి. నిన్ను వద్దనుకున్నవాళ్లే దురదృష్టవంతులు” అతని పెదవులను తన పెదవులతో సన్నగా స్పర్శిస్తూ అందామె.
“నిజంగానా?” అతని మాటల్లో చిన్నపిల్లవాడిలోని ఉత్సుకత. “కాక?” సమాధానాన్ని అతనికే వదిలేసిందామె. తృప్తిగా ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు.
“నన్ను పెళ్లి చేసుకుంటావా?” కౌగిట ఆమెను బంధించి అడిగాడతను. దూరంగా జరిగిందామె.
“చూసావా! పెళ్లి విషయమొచ్చేసరికి నువ్వూ దూరంగా జరిగావు. అంటే నిజంగానే నాలో ఏదో లోపముండి, నా మరదలు నన్ను విడిచి వెళ్లిందన్నమాట” విచారంగా అన్నాడతను.
“ఆమె మిమ్మల్ని విడిచి యెందుకు వెళ్లిందో తెలియదు గాని, మీలో యే లోపమూ లేదు” అతని చెయ్యిమీద చెయ్యివేసి చెప్పిందామె.
“నన్ను పెళ్లి చేసుకోమంటే, దూరంగా జరిగావెందుకు?” సూటిగా చూస్తూ ఆమెనడిగాడతను.
“నా సంగతి తెలిసే అడుగుతున్నారా?” దిగులుగా అడిగిందామె.
“నీకేమి? నీలాంటి మంచిమనిషిని నేనింతవరకూ చూడలేదు.”
“నా మంచితనాన్ని మీరేమీ చూసారు?” అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందామె.
“ఇంకొకరి బలహీనతను అలుసుగా తీసుకోకపోవడమే అసలైన మంచితనం. చావు అంచుల దగ్గర వేల్లాడుతున్న నన్ను, వొడ్డున పడేసావు. మోడైపోయిన చెట్టు వసంతంలో విరబూసినట్టు, మగవాడినేనన్న ధైర్యాన్ని నాలో విరబూయించావు. ఒక రకంగా నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణమెలా తీర్చుకోగలను? నిన్ను పువ్వుల్లో పెట్టి నీ రుణం తీర్చుకోవాలని వుంది. నన్ను పెళ్లి చేసుకొని, నా జీవితానికొక అర్ధాన్ని కల్పించవా?” అభ్యర్థించాడతను.
ముసుగు వేసుకున్న ఆమె మనసు, లోపలి పొరలను తాకుతున్నాయతని మాటలు. కాని ఆ మాటలు నమ్మొచ్చా! లేదా! ఆమె మనసు తేల్చుకోలేక పోతుంది. నాలుగేళ్ల క్రింద ఇటువంటి మాటలే విని గడప దాటింది. ఏమైంది? జీవితమే చిధ్రమైపోయింది. ఎన్ని కలలో… ఎన్ని ఆశలో…. అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. నిజమేనని నమ్మింది. తనలాంటి వాళ్ళను మోసం చెయ్యడమే అతని వృత్తని తెలుసుకోలేకపోయింది. తెలిశాక ఏమి చెయ్యగలిగింది? కొన్నాళ్లు పోరాడింది బయటపడాలని. కానీ వోడిపోయింది. ప్రాణం తీసుకునే ధైర్యం చెయ్యలేక, ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతుంది. అలాగని యిప్పుడితని మాటలు అబద్ధమని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదు. ఒకవేళ యితని మనసే నిజమైతే…? జీవితంలో కోల్పోయిన వసంతమే తిరిగి వస్తానంటుంటే… కాని, మరొక్కసారి మోసపోవడానికి మనసు అంగీకరించడం లేదు. ఆశపడి, భంగపడడానికి మనసు సిద్ధపడడం లేదు. అయినా భంగపడడానికి ఏమి మిగిలిందని తనకు జీవితంలో?
కాదంటే, జీవితంలో మరల ఇటువంటి అవకాశం తనకొస్తుందా? ఒకవేళ ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటే…. అది తనకూ పునర్జన్మే అవుతుంది. కానీ తానతనిని పెళ్లి చేసుకుంటే అతని పరిస్థితెలా ఉంటుంది? ఇప్పటికే అతనెన్నో అవమానాలను మూట కట్టుకున్నాడు. ఇప్పుడు తనను పెళ్లి చేసుకుంటే, మరింత అవమానించి, అవహేళన చెయ్యదా లోకం? తన నుండి ఆయన మరిన్ని అవహేళనలకు గురికావాలా? ఒప్పుకుంటే… ఏమవుతుంది? ఒప్పుకోకపోతే అతనెలా స్పందిస్తాడు? ఏమి చెయ్యాలో తోచడం లేదు. విరుద్ధ భావాల మధ్య ఊగిసలాడుతుంది ఆమె మనసు.
***
“రమణగాడు పెళ్లి చేసుకున్నాడట”.
“వాడి సంగతి తెలిసి ముందుకొచ్చిన అభాగ్యురాలెవ్వరో?”
“నీకీ సంగతి తెలుసా! వాడు చేసుకున్న ఆడది ఆ టైపట”
“అంతేలే! లేకపోతే వీడి సంగతి తెలిసి ఎవరు ముందుకొస్తారు? వాడికున్న ఆస్తి పీల్చేశాక, ఛీ! నువ్వు మగాడివే కాదు పొమ్మంటుంది”
“మగవాడిననిపించు కోవడానికి బజారుదాన్ని పెళ్లి చేసుకోవాలా? ఛీ! ఇంతకన్నా చావే మేలు”
“వీడి చాటుగా దుకాణం తెరుస్తుందంటావా?” అది అనుమానమో! లేక అలా అవ్వాలన్న కోరికో!
“రామ! రామ! ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడో! పదిమందికి పక్క వేసిన దానిని పెళ్ళాడాడా? దాని బదులు కొజ్జా అనిపించుకోవడమే మేలు”
“మమ్మల్నడిగితే మేము మంచి సంబంధం కుదర్చమా! లోకంలో ఆడపిల్లలే గొడ్డు పోయారా? ఇదేమి పనని, లేని పెద్దరికాన్ని నెత్తినేసుకొని మందలిస్తూ కొందరు…
“అదెన్నాళ్ళుంటుందిలే? ఆరునెలల్లో వీడిని తన్నితగిలెయ్యకపోతే, మీసం గొరిగించుకుంటానని ఒకడి శపథం. మనిషి ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నట్టుంది. వీడెలాగూ అందుకు పనికిరాడు. ఎన్నాళ్ళు మడికట్టుక్కూర్చుంటుంది. ట్రై చేస్తే పడిపోతుందని ఇంకొకడి దురాలోచన.
రకరకాల వ్యాఖ్యానాలు. మనసును తూట్లు పొడిసేలా మాటల తూటాలు. గుండె గాయమయ్యేలా అసహ్యకరమైన చూపులు…… కుతూహలం ఆపుకోలేక కొందరు… దురుద్దేశాలు మనసుల్లో పెట్టుకొని కొందరు…. రకరకాల ఉద్దేశాలతో రమణ ఇంటి గడప తొక్కుతూనే వున్నారు.
వేటినీ లెక్కించలేదు రమణ. చాలా నిబ్బరంగా ఉన్నాడు. పూర్వాశ్రమంలో ఆమె పేరేమిటో? అడగనే లేదు. వసంత అని పిలుస్తున్నాడు. ఎందుకా పేరని ఆమె అడిగితే నా జీవితంలో తిరిగి వచ్చిన వసంతానివి నువ్వన్నాడు. ఆమె రమణ నమ్మకాన్ని నిలబెడుతూ, యెవరు యెటువంటి వ్యాఖ్యానాలు చేసినా చలించకుండా, రాయిలా రమణ వెన్నంటే స్థిరంగా నిలబడింది.
***
రమణ పెళ్ళై యెన్నాళ్ళో గడవలేదు. రమణ పెళ్ళాం నెల తప్పిందని యిరుగుపొరుగుల గుసగుసలు.
“కారణం రమణేనంటావా?” ఒకమ్మ అనుమానం. “ఆవిడికే తెలియాలి” ఒకరి సమాధానం.
“ఆవిడకైనా తెలుసంటావా?” ఇంకొకరి సందేహం. “నిజమేలే! ఎంతమందో!” ఇంకొకరి కనుబొమ్మల ఎగురవేత.
“ఛీ! ఊరుకోండే. కడుపుతో వున్న పిల్లని గురించి అవేం మాటలు” మందలించింది ఒక పెద్దామె.
“మనకెరుక లేని ఆ పిల్ల గతం గురించి మనమెందుకు మాట్లాడుకోవడం? నాలుగునెలల నుండీ చూస్తూనే వున్నాం కదా! వంక పెట్టడానికి వీల్లేని పిల్ల. మీరేమంటే అనండి గాని, ఆ పిల్లని పెళ్లి చేసుకొని రమణ మంచిపనే చేశాడు” వత్తాసు పలికింది ఒకామె.
“మనకెందుకులేమ్మా! ఆవిడ గురించిన తగువులు” ఒకరి నిష్టూరపు మాటలు. నీలాటిరేవు దగ్గర మాటలిలా వుంటే, రచ్చబండ దగ్గర మాటలెలా వున్నాయంటే….
“ఆవిడ నెల తప్పిందట కదా!” కళ్లెగరేసాడొకడు.
“మనోడి ప్రతాపమేనంటావా?” అదోరకంగా చూస్తూ ఒకడు.
“ఏమో! ఎవడికి తెలుసు? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక” పెదవి విరిచాడొకడు.
“మీరేమంటే అనండి గాని, మనందరిలోకెల్లా అదృష్టవంతుడు వాడే” అన్నాడొకడు.
“నిజమేరా! ఈ పిల్లను పెళ్లి చేసుకొని సుఖపడ్డాడు. గతానిదేముంది? ఇప్పుడెలా వుందో చూడాలి గాని!” వత్తాసు పలికాడు ఇంకో స్నేహితుడు.
“ఏరా! మీకేమైనా మత్తు జల్లిందా! వెనకేసుకొస్తున్నారు” ఒకడి వెటకారం. “చూస్తుంటే తెలుస్తోంది కదా!” ఇంకొకడి వేళాకోళం.
“ఛీ! మీరు మారరురా!” ఛీత్కరించి అక్కడ నుండి లేచిపోయారు, రమణ అదృష్టాన్ని పొగిడిన ఆ ఇద్దరు స్నేహితులు.
“రమణను వాళ్ళావిడ గౌరవించినట్టు, మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తున్నారా? గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండిరా! పోకిరి కబుర్లు చెప్పడం కాదు. ఆవిడ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే, మీ అందరి జాతకాలూ బయట పెట్టీగలను” భుజంమీద తువ్వాలు దులిపి వార్నింగిచ్చాడు, అక్కడ కూర్చున్నవాళ్ళలో ఒకడు.
అక్కడున్న ఎంతోమందికి అనుభవమే. రమణ భార్య నిప్పులాంటి మనిషని, ముట్టుకోబోతే కాలుతుందని. దానికి తోడు రమణను ఆమె యెంత అపురూపంగా చూసుకుంటుందో, అక్కడ వున్న అందరూ చూస్తూనే వున్నారు. అందుకే నోరు మెదపలేదు యే ఒక్కడూ.
***
అప్పటినుండీ చర్చల్లో అగ్రస్థానం రమణ గురించే, పుట్టబోయే బిడ్డ గురించే… ఎవరి పోలికలొస్తాయా అని. వీళ్లందరి చర్చలకు తెరదించుతూ అచ్చు గుద్ధినట్టు రమణ పోలికలతో పుట్టి, రమణ లలితలను ఆనంద డోలికలలో ముంచేస్తూ, వాళ్ల జీవితాల్లో వచ్చిన వసంతాన్ని మరింత వర్ణమయం చేశాడు రమణ, లలితలకు పుట్టిన మగబిడ్డ.
***
రచ్చబండ దగ్గర చేరిన జనాలందరూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడు తున్నారు. “ఏం రోగం, ఉన్నచోట ఉండకుండా తెల్లవారు ఝామున తోటలోకి ఎందుకెళ్ళాలట.” రంగమ్మగారు ఈసడింపుగా అంది.
“రోజూ వెళుతుంది కదా ఈ వేళ ఏమైనా కొత్తా. చిన్నప్పటినుండి వాళ్ళ నాన్న మాలకారి రాఘవ శాస్త్రి గారికి సహాయం చేయటానికి తోటలో కెళ్ళి పూలుకోసుకొస్తుంది కదా ఈ పిల్లా… మరి ఉదయమే దేవుడికి వాళ్ళ నాన్న మాలలు ఇవ్వాలికదా. తప్పదాయే.” తాయమ్మ జవాబిచ్చింది. రోజూ దేవుడి అలంకరణకోసం పూల మాలలు గుచ్చి పోద్దున్నే గుడిలో ఇవ్వటం రాఘవశాస్త్రి గారి ఉద్యోగం. అందుకని అంతా ఆయన్ని ‘మాలకారి’ అంటారు. అంటే మాలలు చేసేవాడు. అంతేకాక మంచి మనసున్న వైధ్యం తెలిసిన వాడు. ఊరి జనాలంతా ఆయన దగ్గరికే మందుల కోసం వెళతారు.
“ఏదేమైనా ఈడొచ్చిన పిల్ల. అన్ని రోజులు ఒక్కలా ఉంటాయా.. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంతకాలం నేను చాలా విషయాలు రాయాలనుకుంటున్నాను ఎక్కడంటే అక్కడ తిరగటం పరవాలేదు. ఇప్పుడు జాగర్తగా ఉండాలని నీవైనా చెప్పాలికదా జానకమ్మా. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో” రాధమ్మ తనకు తోచిన విధంగా జానకమ్మని ఓదార్చుతుంది.
“ఊరుకోండి, జానకమ్మను ఊరడించాల్సింది పోయి ఎవరికి తోచింది వారు మాట్లాడుతారా..కాసేపు గమ్మునుండండి. ఆమె పెంపకం గురించి ఇవేళ కొత్తగా తెలిసొచ్చిందా. ఎంతో మర్యాద తెలిసిన పిల్ల. ధైర్యస్థురాలు. ఎవరికి కష్టమొచ్చినా నేనున్నానంటూ వచ్చే పిల్ల. ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పమ్మా. మీరు మీ పెంపకం గురించి చూసుకున్నాక పార్వతమ్మ గురించి మాట్లాడండి.” అంటూ కసురుకుంది ఆండాళు. రాదమ్మ ఇంకో మాట అనకుండా చేసింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించానని ఊర్లోంచి వెళ్ళి పోయింది. వయసులో పెద్దది, నిర్మొహమాటంగా మాట్లాడే ఆండాళు అంటే అందరికి హడలు. ఎంతవారినైనా తప్పు చేస్తే వదిలి పెట్టదు. జానకమ్మ ఏడ్చి ఏడ్చి రచ్చబండకి కాస్త దూరంలో ఉన్న రావి చెట్టుకింద, కూతురు పార్వతి పక్కనే కూచుండి పోయింది.
రాఘవ శాస్త్రి గారు జానకమ్మలు, ఒక్కతే కూతురని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అయినా చక్కటి సంస్కారం, తెలివిని నేర్పాడు తండ్రి. ఇంటిపనులు, వంటపనులలో కూడా ఆరితేరింది. తండ్రి, బావకు నేర్పిస్తుంటే తనుకూడా కొద్దిగా వైద్యం, సంస్కృతం నేర్చుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మేనల్లుడు శంకరాన్ని, చెల్లెలు సీతమ్మను తన దగ్గరే ఉంచుకున్నాడు. పార్వతి, చిన్నప్పటినుండీ బావతోనే లోకంగా పెరిగింది. శరీరాలు వేరైనా మనసులు ఒకటేలా ఉంటారని ఊరంతా అనుకునేవారు. రాఘవశాస్త్రి గారు, పక్క ఊళ్ళో శంకరం హైస్కూల్ చదువు అయిపోగానే పై చదువులకై మేనల్లుడిని దగ్గరలో ఉన్న, చెన్నపట్నం పంపాడు. తరువాత ‘లా‘ చదువుతానంటే ఊళ్ళోని పొలం అమ్మి చదివించాడు. శంకరం, చదువుతో పాటు చెన్నపట్నంలో జరుగుతున్న స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవాడు. మంచి చెడుల వివరణ పట్ల ఉండే సంస్కారాన్ని చిన్నప్పటి నుండి మేనమామ దగ్గర నేర్చుకున్నాడు. సమాజ శ్రేయస్సు పట్లా, రాజకీయాల పట్లా అవగాహన కలిగిన యువకుడిలా మారాడు. ఈ సంవత్సరం పరీక్షలవంగానే, పార్వతితో పెళ్ళి జరిపించేద్దా మనుకున్నారు ఇంటివాళ్ళు.
పార్వతి తండ్రి దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకుని అతనితో పాటు ఊళ్ళో అందరికి తన సేవలందిస్తుంది. దేవుడి మాలకట్టడంలో తండ్రికి సహాయ పడ్డం, తల్లికి ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండడం. లక్ష్మి, సీత, కళ్యాణి లతో కలిపి ఊర్లో వారికి ఏ సహాయం కావాలన్నా, ఎవరైనా జబ్బు పడినా నేనున్నానంటూ వెళ్ళడం, ఆమె రోజూ దినచర్య. సెలవులకు బావ వస్తే క్షణం వదలకుండా శంకరం తోనే గడపేది.
పార్వతి ఈలోకంలో లేనట్టుగా ఎటో చూస్తూంది. ఆమెని తీసుకొచ్చి చెట్టు దగ్గర కూచోబెట్టి నప్పటునుండి అలాగే జారిగిలపడి కూచునుంది. నల్లని ఓణీ పమిటను, తల్లి భుజం చుట్టూ కప్పినా కూడా చిరిగిన నల్లని జాకెట్టు చేయి సన్నటి ఓణీ లోంచి కనబడుతూనే ఉంది. బారెడు జడ ఊడి పోయి వీపంత పరచుకున్న వెంట్రుకలతో, పాలిపోయిన తెల్లటి ముఖాన గీరుకుపయిన గాయాల్లోంచి రక్తం కారి గడ్డ కట్టి కపోలాలు వాచి, ఎర్రబడ్డాయి. చేతులు కూడా రక్కుకు పోయి రక్తం మరకలు కనబడుతున్నాయి. ఏంజరిగిందో చెప్పకనే చెబుతున్నాయి ఆమె కనబడుతున్న తీరు.
“ఏవరు ఈ దురాఘాతానికి ఒడిగట్టారో చెప్పమ్మా.. నీవు నోరు తెరువక పోతే మా కెలా తెలుస్తుంది.” అంటూ ఊరు పెద్ద పరందామయ్యగారు అనునయంగా అడిగారు. పార్వతికి మాటలు వినబడుతున్నాయో లేదో ఆమె దగ్గరనుంచి ఏ జవాబు లేదు. పక్కనే ఉన్న జానకమ్మ కూడా కూతురుని పదే పదే పిలుస్తున్నా లాభం లేక పోయింది. “లక్ష్మీ, ఎప్పుడూ పార్వతితో వెళ్తావు కదా నీకు తెలియదా” ఆమె ద్వారా నన్నా విషయం తెలుసుకుందామని అడిగాడు. “లేదు బాబాయ్, ఈ రోజు నేను వెళ్ళలేదు. తాను ఒక్కతే వెళ్ళింది.” లక్ష్మి జవాబిచ్చింది. స్నేహితురాలి దీనావస్థచూసి ఏడుస్తుంది.
“పోనీ, ఇంతకు ముందు ఎవరైనా మిమ్మల్ని వెంటబడి ఏడిపించేవారా? వాళ్ళే ఈ దురాగతానికి పాల్పడ్డారేమో…ఏ మైనా జ్ఞాపకముందా..” ‘‘లేదు. ఎవరూ మమ్మల్ని అలా చేయలేదు”. లక్ష్మి అంది.
“అసలు ముందుగా ఎవరు చూసారు?” అందరిని ఉద్దేశించి అడిగారు పరంధామయ్య. “నేను బాబుగారు, ఆరు గంటలేళ శాస్త్రిగారు నాతో, అమ్మాయి గారు వెళ్ళి ఇంకా రాలేదు. మాలకట్టటానికి సమయం మించి పోతుందని తోట కెళ్ళి చూసి రమ్మన్నారు. నేను వెళ్ళే సరికి తోటలో ఎక్కడా కనబడ లేదు. అప్పుడే వచ్చిన గోవిందు, అమ్మాయిగారు పూలు కోసుకుండగా తాను గోశాల కెళ్ళానని చెప్పాడు. ఒక్కో సారి అమ్మాయిగారు వెనకాల తోట బావి దగ్గర ఉన్న గులాబీల కోసం వెళ్తారు. అందుకని అటు వేపు కూడా చూడమని గోవిందు చబితే వెళ్ళాను. అక్కడ ముళ్ళ పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న అమ్మాయిగార్ని సూసి గుండె గుబేల్ మందండి. వెంటనే తోటమాలి గోవిందుని కేకేసి ఇద్దరం మంచం మీద పడుకో బెట్టి శాస్త్రి గారింటికి పట్టుకొచ్చామండి. అప్పుడే మీరూ వచ్చారు కదండి” అన్నాడు రాఘవ శాస్త్రి గారి పాలేరు రంగయ్య.
“మరి గోవిందూ, నీవేమి చూడలేదా? నీకు పార్వతి తప్ప ఎవరూ కనబడలేదా?”
“లేదు బాబుగారు, అమ్మాయిగారు పూలు కోసుకుని తులసి దవనం, గులాబీలు కోసుకుంటానని వెనకాతల వేపు కెళ్ళారండి. నేనేమో, గో మందల్ని మేతకి తోలడానికి గోశాలకి వెళ్లానండి. అమ్మాయిగారు ఎప్పటిలాగా గులాబీలు కోసుకుని వెళ్ళి పోతారని నేనూ అక్కడ్నుంచి నా పనిమీద వెళ్ళి పోయానండి.” గోవిందు జవాబిచ్చాడు.
“నీవు అమ్మాయి గారితో తోట వెనకాలకు వెళ్ళలేదా? పోనీ, అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నట్టు కనిపించిందా?”
“లేదండి, ఎప్పుడూ పార్వతమ్మకి అలవాటే తోట అంతా తిరిగి పూలు కోసుకోవటం అందుకని నేను అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడూ పార్వతమ్మ, లక్ష్మమ్మ తప్ప ఎవరూ రారు. చాలా చీకటిగా ఉంది. నాకెవరూ ఉన్నట్టు కనబడలేదయ్యా”. గోవిందు బాధగా అన్నాడు. తను కొంచెం జాగర్తగా ఆమె వెంటే ఉంటే బాగుండే దేమో, ఇంత ఘోరం జరిగేది కాదేమో …అంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధ పడుతున్నాడు.
పరంధామయ్యగారికి ఎలా దోషిని పట్టుకోవాలి అగమ్యగోచరంగా అనిపించింది. ఎవరైనా ఆ సంఘటన చూసిన వాళ్ళన్నా చెప్పాలి లేదా బాధితురాలైనా చెప్పాలి. అప్పటికే ఉదంతం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్దగా ఏ ఆధారాలు దొరకలేదు. ఎవరో మట్టి కాళ్ళతో తోట వెనక గోడమీదకి ఎక్కి అటువేపు దూకినట్టుగా మరకలున్నాయి. అలాగే గోడ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అంటే ఆ దుర్మార్గుడి కాలు గాయపడి ఉండాలి. ఆ ఒక్క కాలి గాయం ఆధారంగా దోషిని పట్టుకోలేము. లాభం లేదు. ఎలా అయినా పార్వతికి స్పృహలోకి రావాలి అప్పుడేగాని దోషి బయట పడడు.
అక్కడే ఉన్న ఆండాళుని పిలిచి, పార్వతిని మాట్లాడించ్చేట్టు ప్రయత్నించమన్నాడు. అప్పటికే ఆ పనిలోనే ఉంది తను. ముఖాన కాసిని నీళ్ళు చల్లింది. తన పమిట చెంగుతో తుడిచి. “పార్వతీ..పార్వతీ..ఇటు చూడు తల్లి..మాట్లాడు పార్వతి..ఇంత ఘోరం ఎవరు చేసారో చెప్పు. వాడికి తగిన శాస్తి చేద్దాం నీవేం భయపడకు. పరందామయ్య ఉన్నారుగా. మాట్లాడమ్మా.” అంటూ మంచినీళ్ళు తాగించే ప్రయత్నం చేసింది. అప్పటి వరకూ స్పందించని పార్వతి గట గటా నీళ్ళు తాగింది. కొంచెం తేరుకో గానే తన పరిస్థితి అర్థమైంది. వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది. తల్లి జానకమ్మ కూతుని కౌగలించుకుని ఏడుస్తుంటే అక్కడున్నవారంతా కన్నీళ్ళు ఆపుకోలేక పోయారు. చెంగు చెంగున ఆ ఊరు ఊరంత లేడి పిల్లలా తిరిగే పార్వతి ఇలా దీనంగా, హృదయవిదారకంగా ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. ఆండాళు వాళ్ళిద్దరిని ఓదార్చుతూ “పార్వతీ, అలా ఏడిస్తే కాదు. జరిగింది ఘోరమే.. కాని మనం ఇప్పుడు ఆ దుర్మార్గుడిని పట్టుకొని శిక్షించాలి. నీకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి. ఇలాంటి ఘోరం మరోసారి ఈ ఊర్లో మరెవరికి జరగకుండా చూడాలికదా.” అంది.
పరందామయ్య మాట్లాడుతూ..”చూడు తల్లీ! నీవు ధైర్యస్థురాలివి… నాకు తెలుసు. బేలగా బాధపడి ఏడ్చి బలహీన పడకు. నాకు తెలుసు నీవు ఎటువంటి కష్టంలో నైనా పోరాడగలవని. ఏడవకు. నిన్ను నీవు సమాధాన పరచుకో.. జ్ఞాపకం చేసుకో ఎవరు నీపై అఘాయిత్యం చేసింది. చెప్పు తల్లి.” పార్వతి స్వభావాన్ని, ధైర్యాన్ని ఆమెకే గుర్తు చేస్తూ బాధ నుంచి బయటపడేయాలని అనునయంగా చెప్పాడు. ఆ ఊరు ఊరంతా అక్కడే ఉన్నారు. అప్పటివరకూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్న వాళ్ళు, అంతా నిశ్శబ్దం అయిపోయారు. పార్వతి, ఏం చెబుతుందోనని, ఆ దుర్మార్గుడు ఎవరని చెబుతుందోనని అందరూ, చెవులు రిక్కించి వింటున్నారు.
పార్వతి ఏడుపు ఉదృతం కొంచెం తగ్గింది. అయినా వెక్కిళ్ళు పడుతూనే ఉంది. “ఎవరో నాకు తెలియదు. చాలా చీకటిగా ఉంది. ముఖాన్నంతా కప్పేసుకున్నాడు. ఎవరో గుర్తించలేక పోయాను. అనుకోని సంఘటనకి నాకు స్పృహ తప్పినట్టైంది. తేరుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేసా..బతిమిలాడాను…పెనుగులాడాను. చివరికి అతని ముసుగు తీయాలని చూసాను. కాని బాగా కొట్టాడు. హింసించాడు….” ఏడుపు ఎక్కిళ్ళ మధ్య చెప్పింది. ఆమె దీనావస్థకి అందరూ కలత పడ్డారు. పెళ్ళీడు కొచ్చిన పిల్ల బతుకు ఇలా అన్యాయమై పోవటం అందరిని కలచి వేస్తుంది. కానీ, పార్వతి కూడా ఆ మనిషిని గుర్తించలేక పోవటం నిరాశే ఎదురైంది. ఆమె వల్లనైనా దోషి ఎవరని తెలుసుకో వచ్చననుకునే ఆశ కూడా పోయింది.
అదో మప్పై నలబై కడపలున్న, మారు మూల కుగ్రామం. స్వతంత్రం రాక పూర్వం, సనాతన ఆచారాలతో నియమ నిష్టలతో కూడుకున్న బ్రాహ్మణ అగ్రహారం కావటం వల్ల ఆ పల్లెటూళ్ళో పోలీసులు కంప్లేంట్స్ ఇవ్వడాల్లాంటివి లేవు. అన్ని సమస్యలను గ్రామ పెద్దలే పరిష్కరించుకుంటారు. అందుకని డిఎన్ఏ ద్వారా లేదా వేరే పద్దతుల ద్వారా ఆ అగంతకుడిని పట్టుకునే ఆస్కారం ఆరోజుల్లో, ఆ గ్రామం లో లేదు.
పరందామయ్యగారు ఆలోచనలో పడ్డారు.. అక్కడ గుమి కూడిన జనాల్లోకి చూసారు. వాళ్ళలో నిలుచున్న యువకులందరిని తేరిపారా చూసారు. వాళ్ళ కాళ్ళ వేపు చూసారు. ఎవరికైనా కాళ్ళకి గాయాలున్నాయాని. ఆలోచనలో పడిపోయారు.
ఆ గ్రామంలోని వయసులో పెద్దైన, అనుభవజ్ఞులైన అయిదుమంది పెద్దలతో ఆ న్యాయపీఠం ఏర్పడింది. వాళ్ళలోని గంగాధరంగారు “పరందామయ్యా, ఇప్పుడు ఏమిటి దారి. బాధితురాలు ద్వారా తప్ప దోషిని పట్టుకునే అవకాశం లేదనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆశ లేదు. పార్వతి, అతనెవరో తెలియదంటుంది. ఎవరా వ్యక్తని తెలుసు కోలేక పోయాం..ఏ అవకాశమూ కనబడటం లేదు. ఏం చేద్దాం.” అనడిగారు.
ఇంకో సభ్యుడు మాధవయ్య “సరే, ఇప్పుడెలాగూ దోషిని కనిపెట్టే ఆస్కారం లేదు కాబట్టి…అతనిని పార్వతి కనిపెట్టినప్పుడు శిక్ష విషయం ఆలోచిద్దాం. ఇహ ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలు కానిద్దాం. పార్వతి వల్ల ఆ కుటుంభం అపవిత్రం అయిపోయింది కాబట్టి మాలకారి దేవుడి కైంకర్యానికి రాఘవ శాస్త్రి అయోగ్యుడు. ఇకనుంచి సుందరానికి ఈ పనిని అప్పగిద్దాం.‘‘ ఎప్పటినుంచో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మాధవయ్య ఇప్పుడు వదులుకో దలచుకోలేదు. తన బావ మరిది సుందరం చాలా బాగా కొత్త కొత్త పద్దతుల్లో పూల మాలలు కడతాడు. కానీ, అతనికి సరియైన ఉపాది లేదు. పోని ఇక్కడ దేవుడి కొలువు దొరకటానికి రాఘవయ్య అడ్డుగా ఉన్నాడు. తరతరాల నుంచి అతని వంశం వారే ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటనని మాధవయ్య ఉపయోగించుకో చూసాడు.
అతని మాటలు జగన్నాధాచారికి అభ్యంతరకరంగా తోచింది. ‘‘ఇది సబబుగా తోచడం లేదు. ఎప్పటినుంచో దేవుడి సేవలో ఉన్న శ్రీమాన్ పరాంకుశంగారి వంశజుల మునిమనుమడైన రాఘవశాస్త్రి గారిని పనిని మాన్పించటం తప్పు. ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన మీ మేనత్త ఎవరితోనో లేచిపోయినప్పుడు మీ నాయన గారిని, దేవుడి రామానుజకూటం వంట పనులు నుండి ఈ కమిటీ దూరం చేయలేదు కదా. చిన్న ప్రాయశ్చిత్తంతో ఆకుటుంభాన్ని వదిలేశారుకదా. గుర్తులేదా. ‘‘ అంటూ కొంచెం ఘాటుగానే అన్నాడు.
జగన్నాధాచారి గారి మాటలు మాధవయ్యని చురుక్కుమనిపించాయి. అయినా ‘‘ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందు మాట. ఇప్పుడు మరీ గుర్తుచేసుకుని చెప్పక్కర్లేదు. కాలం మారలేదూ? అయినా ఆ విషయం ఈవిషయం ఒకటేనా ఏమిటి? మరీ చెప్పుకొచ్చారు!‘‘ అంటూ సాగదీశాడు. ‘‘సరే! జరిగిన సంగతులు ఇప్పుడెందుకు గానీ, ఎంతైనా దేవుడి పని కదా, ఏదో ప్రాయశ్చిత్తంతో రాఘవ శాస్త్రి గారిని విధులకు అంతరాయం లేకుండా చేద్దాం. పార్వతికి ఆమె తల్లి తండ్రికి పుణ్యావాచనం, ప్రాయశ్చిత్తం నిర్దారించండి.‘‘ అన్నాడు గోపాలంగారు.
ఆ నలుగురు న్యాయపీఠం సభ్యులు చెప్పిన దాన్ని విని పరంధామయ్య ఆలోచనలో పడ్డాడు. దూరంగా ఉన్న ఆండాళు, వయసుతో వచ్చిన వడిలిన శరీరానికి, ఊతకర్ర సహాయం చేసుకుని నెమ్మదిగా రచ్చబండ మీద కూచున్న పెద్దల దగ్గరగా వచ్చింది. ‘‘ఏమయ్యా, పెద్దమనుషులు, ఏం మాట్లాడుతున్నారు? ఇదేమయినా న్యాయంగా ఉందా? తప్పెవరు చేశారూ, శిక్ష ఎవరికి వేస్తున్నారు? దోషి పట్టుబడనంత మాత్రాన వాణ్ణి వదిలేసి ఇప్పటికే జరిగిన ఘోరానికి బాధ పడుతున్న వారికా ప్రాయశ్చిత్తము గురించి మాట్లాడుతున్నారు.‘‘ అంటూ అందరిని కడిగేసింది. ఆమె ధాటికి కొద్దిగా జంకారు ఆ నలుగురు.
‘‘మరి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇంత దుశ్శహాసానికి పాల్పడ్డవాడు దొరికితే బాగుండేది.‘‘ అయోమయంగా అన్నాడు గంగాధరం. ‘‘పెద్దమ్మా, నీవెళ్ళి కూచో. మేమున్నాం కదా. న్యాయంగానే పరిష్కరిద్దాం‘ అంటూ గోపాలం గారు ఆవిడకు సర్ది చెప్పారు. సణుక్కుంటూ అక్కడే ఓ పక్కగా కూర్చుండి పోయింది ఆండాళు.
చుట్టూ ఉన్న వాళ్ళల్లో గుసగుసలు మొదలయ్యాయి. గట్టి చర్యలు తీసుకోక పోతే, గ్రామంలో ఇలాంటి అరాచకాలు ఎక్కువ కావా. ఆడపిల్లల్ని అడ్డూ అదుపు లేక బయటకు వెళ్ళనిచ్చే తల్లితండ్రులకు బుద్ది రావాలిగా… అంటూ తలా ఒకరకంగా మాట్లాడుతున్నారు. మాధవయ్య జనాల్లో ఉన్న ఆయన మేనల్లుడు భాస్కర్కి కనుసైగ చేసాడు. ‘‘అవునవును.. ఊరంతా నియమం నిష్టలు లేక పిల్లలంతా బరితెగించి పోతారు. ఇంతవరకూ మన అంబాపురానికున్న మంచి పేరు పోతుంది. తగిన శిక్షలు వేయాల్సిందే. మన ఊరి ఇలవేల్పు భ్రమరాంభికాదేవి ఇలాంటి ఘాతుకాన్ని సహించదు‘‘. అంటూ అందర్నీ రెచ్చగొట్టాడు. జనాలంతా అవునవును అంటూ వంత పాడారు.
‘‘అందరూ అలాంటి అభిప్రాయంలో ఉంటే మనకు గత్యంతరం లేదు మరి. మీరేమంటారు‘‘ అంటూ మాధవయ్య గంగాధరం వేపు చూస్తూ అన్నాడు. ‘‘తప్పదుగా ప్రజలు మాటే మనమాట‘‘ అంటూ గంగాధరం తలూపాడు. ఆ అయిదుగు సభ్యుల్లో ముగ్గురూ అవునవునంటూ వంత పాడారు.
పరంధామయ్యకీ, జగన్నాధం గార్కి వాళ్ళమాటలు అంతగా నచ్చలేదు. ‘‘మీరంతా కాస్త నిశ్శంబ్దంగా ఉంటే సరియైన నిర్ణయం తీసుకునే వీలవుతుంది. అందరి గురించి ఆలోచించే న్యాయ బద్దంగా తీర్పు చెప్పబడుతుంది.‘‘ అక్కడున్న వారితో అన్నారు.
‘‘ఇంకా ఏం నిర్ణయం తీసుకోవటం ఏమిటీ, ముందు నుంచీ ఉన్నదేగా. బలత్కరించిన వాడు దొరికితే, పార్వతి వివాహం జరిపించడం తప్పదుగా. ఆపిల్ల జీవితం చక్కదిద్దాలంటే, ఓ దారి చూపించాలంటే అతడే పార్వతిని పెళ్ళి చేసుకుని తీరాలి. గత్యంతరం కూడా లేదు. ఒకవేళ వాడు పట్టుబడక పోతే, రాఘవ శాస్త్రి వంశపారంపర్యంగా వస్తున్న మాలకారీ కొలువును వదులుకుని కుటుంభ సహితంగా గ్రామం వదిలి వెళ్ళాలి. తీసేయకూడదన్నారుగాని. దేవుడి కైంకర్యమాయే, మరి అతడు ఎలా నిర్వహిస్తాడు. మరో మార్గం అంటే, ఆయన కుటుంభానికి ప్రాయశ్చిత్తం చేసి దోష నివారణ చేసి, ధనదండ శిక్ష వేయాలి. కానీ పార్వతి బతుకేమిటి? ఏ మంటారు‘‘ అని సబ్యులను అడిగాడు మాధవయ్య. ‘‘‘సబబుగా లేదనిపిస్తుంది‘‘ అన్యమనస్కంగా అన్నారు గంగాధరం. ‘‘ అదెలా, ఏ నిర్ణయమైనా దోషి దొరికితేనే కదా తీసుకోగలం.‘‘ జగన్నాధం అడ్డుపడ్డాడు.
‘‘నిజమే కాని అప్పటి వరకూ రాఘవ శాస్త్రిగారి పని ఆపలేం కదా. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదీ కాక వాడు ఎప్పుడు దొరుకుతాడో తెలియడం లేదు. అందుకని మిగిలిన కార్యక్రమాలు కానిచ్చి సభను ముగిస్తే సరి. అంతకంటే వేరేదారి కనపడ్డం లేదు.‘‘ గంగాధరం జవాబిచ్చాడు.‘‘‘అవునవును‘‘ అంటూ అక్కడున్న వారిలో సగం మంది ఆయనతో ఏకీభవించారు. వారి మాటలు వింటూ పార్వతి భవిష్యత్తు ఘోరంగా కనబడుతుంటే మనసులోనే రోదిస్తున్నాడు రాఘవశాస్త్రి. జానకమ్మ ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లే స్థితిలో ఉంది.
పార్వతి నెమ్మది నెమ్మదిగా పరిస్థితిని గ్రహిస్తుంది. ఆలోచించటం మొదలు పెట్టింది. ‘ఎవరు ఈఘోరం చేసింది. ఏమాత్రం గుర్తుకు రావటం లేదు. సూచనా మాత్రంగా కూడా ఆవ్యక్తిని పోల్చుకునే ఆధారం దొరకటం లేదు. ఎలా కనిపెట్టాలి‘ అనుకుంటూ తన భవిష్యత్తు ఏమిటి? ఎంతగానో ప్రేమించిన బావతో, త్వరలో వివాహం చేయాలనుకునే తల్లీతండ్రీ, అత్తయ్య ఎంత బాధ పడతారో. బావకి ఇలా జరిగిందని తెలిస్తే…. తనను క్షమించి మన్నించగలడా? తన తప్పు లేదని నమ్ముతాడా? అయినా ఎవరో దుర్మార్గుడు వల్ల తను శిక్ష అనుభవించాల్సి రావటం ఏమిటనే ఊక్రోషంతో ముఖం ఎరుపెక్కింది. ఇలా అందరి ముందూ తానే తప్పు చేసిన దానిలాగా నిలబడాల్సి వస్తుంది. తనవల్ల అమ్మా నాన్న కూడా అవమానాన్ని ఎదుర్కుంటున్నారు. ఇంతకింత పగ తీర్చుకుంటాను వాడు కానీ దొరికితే‘ అని బాధ పడుతున్న పార్వతి రచ్చబండ దగ్గర జరుగుతున్న చర్చ వినబడటం లేదు.
‘‘అయితే మరి పరంధామయ్య గారు, పుణ్యావచనం, ప్రాయశ్చిత్త హోమం చేసి, గంగ తీర్త స్నానాధికాలతో కార్యక్రమం పూర్తి చేద్దాం. ఏమంటారు‘‘ అంటూ అడిగాడు గంగాధరం. అందరు పెద్దలు అతని మాటకు సరే నన్నారు. ‘‘అలాగే తండ్రిగా ‘ధన దండన శిక్ష‘ కూడా రాఘవశాస్త్రికి తప్పదు.‘‘ అంటూ మాధవయ్య జోడించాడు. ‘‘అతను ఎక్కువ ఇచ్చుకోలేడు కనక, ఏదో చిన్న మొత్తాన్ని దేవాలయ హుండీలో వేయమని చెబుదాం‘‘. అంటూ గోపాలం సూచించాడు. ఆ మాటలు నచ్చకున్నా ఎక్కువ ఏమి అనలేక పోయాడు మాధవయ్య. పరంధామయ్యకు జరుగుతున్న చర్చా, శిక్షల నిర్ణయాలు ఏమాత్రం నచ్చటం లేదు. ‘‘చూడండి. ఇలా మాట్లాడటం ధర్మం కాదు. తప్పు చేసింది ఎవరో. మనం అపరాధం చేసిన వారికి కాక శిక్షలు వేస్తున్నది బాధితులకు. ఇదెక్కడి న్యాయం. ఆలోచించండి.‘‘ అంటూ తన అభిప్రాయం చెప్పాడు.
‘‘అవును, నీవన్నది సమంజసంగానే ఉన్నది. కానీ ఇక్కడ శాస్త్రి గారు దేవుడి సేవకు అపవిత్రంగా వెళ్ళలేడు కదా. అందుకని అయినా, ఆ కుటుంభానికి పుణ్యావచనం తప్పదు. ఇక కొద్ది మొత్తం దండనగా దేవుడికి సమర్పించటం వల్ల దోషం కూడా పోతుందని నా భావన.‘‘ గోపాలం గారు వివరించారు. దానికి పరందామయ్య ఏమీ అనలేక, మనసుకు కష్టంగా ఉన్నా, న్యాయపీఠం సభ్యుల నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చింది.
అక్కడున్న యువకులంతా హోమానికి సిద్దం చేశారు. ముందుగా పుణ్యావచనం కార్యక్రమం కోసం బ్రాహ్మణులు అన్నీ సిద్దం చేసారు. పార్వతిని శాస్త్రి గారిని జానకమ్మని బావి దగ్గర తలమించి నీళ్ళు పోసుకుని హోమం దగ్గరికి రమ్మని చెప్పాడు పూజారి ఆంజనేయశాస్త్రి. బావి దగ్గర నాలుగు బొక్కెనల నీళ్ళు తల మీద గుమ్మరించుకుని రాఘవశాస్త్రి వెళ్ళగానే తల్లీ కూతుర్లు కూడా తలమించి స్నానం చేశారు. ఆండాళు ఒక శాలువా తెప్పించి పార్వతికి కప్పింది. ఆ కార్యక్రమాన్ని పూజారి తదితరులు ప్రారంభించి హోమగుండంలో మంత్రోశ్చారణుల మధ్య అగ్నిని ప్రజ్వలింప చేసారు. తలవంచుకుని తప్పు చేసిన వాడిలా నడుస్తున్న రాఘవ శాస్త్రి గారితో కలిసి తల్లీ కూతుర్లు తడి బట్టలతో అక్కడికి వచ్చారు. ఆండాళు పార్వతికి సహాయంగా పక్కనే నిలబడింది.
హోమం దగ్గర పూజారికి సహాయంగా నిలబడ్డ ధనుంజయుడు ఒక్కసారిగా మండుతున్న హోమ గుండలో పడ్డాడు. శరీరం పడకుండా చేతులతో ఆపటానికి ప్రయత్నించాడు. హోమం కోసం ఆజ్యపు గిన్నెని పట్టుకున్న అతని చేతులు అగ్ని ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలో ఆజ్యంతో పాటు పడ్డాయి. ఇంకేం అగ్నికి ఆజ్యం తోడైనట్టు, నెయ్యిలో మునిగిన అతని చేతులు హోమం మంటతో సహా మండడం మొదలెట్టాయి. ఆ మంటకు దిక్కులు పెక్కుటిల్లేట్టు అరుస్తున్నాడు. చేతులు పైకి తీసేసరికే రెండు అరచేతులూ అగ్నికీలలతో ఎగిసి పడుతున్నాయి. అనుకోని ఈ అవాంతరానికి దిక్కుతోచని పూజారి కలశంలోని నీటిని అతని చేతులపై పోయబోయాడు. అక్కడే ఉన్న మాధవయ్య పరుగున వచ్చి కొడుకు ధనుంజయని పట్టుకున్నాడు. ‘‘ఏ పార్వతీ కలశం తీసుకుంటావేమిటి వీడి చేతులు కాలి పోతున్నాయి. దాంలోని నీటిని చేతులమీద పోయ్యి. త్వరగా‘‘ అంటూ అరుస్తున్నాడు. అప్పటికే పార్వతి పూజారి చేతిలో నుంచి కలశం లాక్కుంది. ఆమె ముఖం ఖణ ఖణ మండే అగ్ని గోళంలా రగులుతుంది.
‘‘కాలనీ, బూడిదవనీ, చేసిన పాపం ఊరికే పోతుందా. నా బతుకుమీద మాయని మచ్చ వేసాడు. పశువులా నన్ను హింసించాడు. నన్ను తాకిన చేతులు మండిపోనీ, వాడికీ జీవితమంతా గుర్తుండే మచ్చపడని. అవిటివాడవని. ఆ భ్రమరాంభికాదేవి శిక్ష వేయకుండా ఉంటుందా‘‘ కోపంతో రొప్పుతూ అరుస్తుంది.
‘‘ఏమైందమ్మా, అమ్మ శిక్ష వేసిందా! ఎందుకు?‘‘ అంటూ గోపాలంగారు మిగిలిన పెద్దలూ అక్కడికి వచ్చారు.
‘‘అవును, ఆ పాపాత్ముడు వీడే. నన్ను నా జీవితాన్ని నాశనం చేసింది ఇతడే‘‘ అంటూ కోపంతో కన్నీళ్ళతో ఏడుస్తూ అంటోంది. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ పార్వతి మతిగాని పోయిందా? నాకొడుకు నీ మీద అఘాయిత్యం చేసాడా? వాడు అమాయకుడు అనవసరంగా మాట్లాడకు‘‘ అంటూ కోపంతో అరుస్తూ, తన మేనల్లుడు భాస్కర్ తెచ్చిన గంగాళంలోని నీటిలో కొడుకు కాలుతున్న చేతులను పెట్టాడు. మంటకు తాళలేక ఏడుస్తున్నాడు ధనుంజయుడు.
‘‘ఏమయింది పార్వతీ, ఇంతవరకూ ఎవరో తెలియ దన్నావు. ఇప్పుడు ఇతడే అంటున్నావు. ఎలా? ఏ ఆధారాలతో చెబుతున్నావు?‘‘ అంటూ పరంధామయ్యగారు ఆమె దగ్గరగా వెళ్ళి అడిగాడు.
ఆమె ధనుంజయ దగ్గరగా వెళ్ళింది. భయంగా చూసాడు ఆమె వైపు. వంగి మండుతున్న చేతులను నీటిలో ఉంచి నిలుచున్న అతని పైన అంగవస్త్రం కింద పడిపోయింది. నగ్నంగా ఉన్న అతని ఛాతీ అంతా రక్తపు గీరికలు. బయటపడ్డ యజ్ఞోపవీతానికి తగులుకుని మెరుస్తున్న పార్వతి బంగారు ఉంగరం వేలాడుతుంది. ఆమె ఉంగరాన్ని ఊరు ఊరంత గుర్తుపడతారు. చాలా ప్రత్యేకంగా కనబడేది. పొడుగు దోసపలుకు ఆకారంలో ఉన్న కెంపు తొడిగిన బంగారు ఉంగరం అది. ఆమె వేలు సగ భాగాన్ని కప్పివేసేది. ఆమె నానమ్మగారు అవసాన దశలో తన ఉంగరాన్ని తీసి పార్వతికి వేలుకి ఆమె బావ శంకరంతో తొడిగించింది. ఇద్దరికి పెళ్ళి చేసేట్టు కూతురు సీతమ్మ, కొడుకు రాఘవ శాస్త్రి గారి దగ్గర వాగ్దానం చేయించుకుంది. ఈ సంగతి ఊరంతా తెలుసు.
అంతకుముందు, స్నానంచేసి హోమగుండం దగ్గరికి వచ్చిన పార్వతికి అక్కడే నిలుచున్న ధనుంజయ ఉత్తరీయం కిందుగా వచ్చిన యగ్నోపవీతం, దానికి చిక్కుకున్న ఆ ఉంగరాన్ని చూసింది. ఆ ఉత్తరీయంతో తన పై భాగాన్నంతా కప్పేసుకున్నాడు. అతడే ఈ ఘాతుకానికి బాధ్యుడని తెలిసిపోయింది. పట్టరాని కోపంతో అతన్ని హోమగుండలోకి తోసింది. అదంతా పక్కనే ఉన్న ఆండాళు చూస్తూనే ఉంది. వాడిని అలా శిక్షించే హక్కు పార్వతికి మాత్రమే ఉందని బలంగా నమ్మింది. చెప్పకనే అందరికీ అర్థమై పోయింది. తప్పు దొరికి పోయినందుకు తన దగ్గరికి వచ్చిన పార్వతిని భయంగా చూస్తూ నిటారుగా నిలబడిపోయాడు. ధనుంజయ చెంపలు బలంగా వాయించింది. రాఘవశాస్త్రి ఆమెని ఆపుతూ శాంతింప చేస్తున్నాడు.
‘‘ఏంటి, అలా కొడుతున్నావు. నీవు అతన్నే వివాహం చేసుకోవాలి. నీకు మరో గత్యంతరం లేదు. లేదంటే కులటలా ఈ ఊరు విడిచి నువ్వు నీ కుటుంభం బయటకు నడవాల్సి వస్తుంది. నీ దూకుడు తగ్గించు కోవటం మంచిది.‘‘ అంటూ మాధవయ్య కోపంగా చూశాడు పార్వతి వైపు. ఆమె అపర కాళిలా ఊగిపోతుంది. ‘‘ఎవడ్ని చేసుకునేది? ఈ దుర్మార్గుడినా? ఎందుకు చేసుకోవాలి.‘‘
గోపాలంగారు పార్వతిని శాంతపరుస్తూ ‘‘చూడమ్మా, నీ జీవితం పాడై పోతుంది. నిన్ను ఎవరు చేసుకుంటారు. మీ తండ్రి గారు నీ బాధ్యత తీర్చుకోవాలికదా. నీ బతుకుని పాడుచేసినందుకు అతను నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోరాదు. అది అతనికి శిక్ష. పెళ్ళి చేసుకోక పోయినా శిక్ష పడుతుంది. అలా కాదంటే నీ తల్లితండ్రులతో పాటు గ్రామ బహిష్కరణ తప్పదు.‘‘
‘‘అతనికి శిక్షా, నాకా? నేనేపాపమూ చేయకుండా నా తప్పు లేకుండా అన్యాయంగా బలైన నాకెందుకు శిక్ష మరి. ఆడవాళ్ళ పట్ల గౌరవం లేని ఈ పశువుకన్నా హీనమైన వీణ్ణి, నీతి లేనివాణ్ణి చేసుకుని నేను నా జీవితాంతం వీణ్ణెందుకు భరించాలి. పశువు కూడా బలవంతంగా జతకట్టవు. వీడిని పశువుతో పోల్చినా తప్పే. నేనెందుకు చేసుకోవాలి. ఏ ధర్మ శాస్త్రం లో చెప్పబడింది. నేను వీడిని చంపి, ఈ అగ్నిగుండంలో దూకనైనా దూకుతాను కానీ వీడిని చేసుకోను.‘‘ ఆమె కోపం పట్టలేక పోతుంది.
‘‘అవును, నీవు ధనుంజయని పెళ్ళి చేసుకోవలసిందే. ఈ గ్రామ కట్టుబాట్లను కాదనడానికి వీల్లేదు. మేమంతా చూస్తూ ఊరుకోము. ఈ ఊర్లో ఇలాంటి అఘాయిత్యాలు ఇంకోసారి జరగకూడదు. ఇక్కడ నీ ఇష్టాయిష్టాలతో పనిలేదు.‘‘ అంటూ భాస్కరం కల్పించుకుంటూ కోపంగా అన్నాడు.
‘‘ఎందుకు పనిలేదు? తనే ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా అర్హురాలు. ఎందుకంటే తానే బాధితురాలు కాబట్టి. తానే ఎక్కువ నష్టపోయింది కాబట్టి. పార్వతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె శరీరాన్ని, మనసుని గాయపరచి, అవమానించినందుకు ఆమే వాడికి ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అతన్ని శిక్షనుంచి విముక్తుణ్ణి చేయటానికి మాధవయ్య మామయ్య చాలానే ప్రయత్నిస్తున్నారు. పార్వతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమెకో జీవితాన్ని ఇవ్వటానికి, ఆమె కాపురాన్ని నిలబెట్టాలని చూడాలని ధనుంజయని దోషిని చేయకుండా, వివాహం చేయటం ధర్మ మనుకుంటుంన్నారు. మరో దారి లేదని దానికో ముద్ర వేస్తున్నారు. తరతరాలుగా ఈ సంఘంలో జరుగుతున్న పురుషహంకార అరాచకమిది. ఏతప్పు జరిగినా ఆమెని కళంకిని, అపవిత్రురాలు, పతిత అనే ముద్రలు వేసి ఆడదాన్నే దోషిగా చేయటమనే జాడ్యం జీర్ణించుకుపోయింది. కానీ, ఒక ఆడపిల్లని పైశాచికంగా బలత్కరించి, శారీరక మానసికంగా హింసించిన వాడితో పెళ్ళి చేసుకోవటమంత ఘోరం మరోటి ఉందా ఆ అమ్మాయికి? జీవితాంతం ఈ జరిగిన సంఘటన తలుచుకుంటూ చిత్రవధ అనుభవించే జీవితశిక్ష ఆమెకెందుకివ్వాలి? ఆమె బాధితురాలా? దోషా? శిక్ష ఎవరికి‘‘
ఎక్కుపెట్టిన బాణాల్లాంటి మాటలు అంటున్నదెవరా నని అందరూ వెనక్కి తిరిగి చూసారు. శంకరం నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి మాధవయ్య ఉలిక్కి పడ్డాడు. అయినా ధైర్యం కూడదీసుకుని ‘‘చాల్లే కుర్రకుంకవి, ఏదో పెద్దచదువులు చదివానని, మామీదే నీ ప్రతాపం చూపించకు. ఎప్పటినుండో వస్తున్న మా ఊరి సనాతన ధర్మాలను కాదనటానికి నువ్వెవరు? అంబాపురం ధర్మ పీఠం, వారి న్యాయ నిర్ణయాలంటే చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో దడ. అలాంటిది మా నిర్ణయాన్నే తప్పుపడతావా?‘‘ అంటూ హూంకరించాడు.
‘‘బాబాయ్, ఇక చాలు, నా చదువు సంస్కారం, మంచేదో చెడేదో నాకు నేర్పింది. ఆ జ్ఞానమే ఈ వివరణ ఇచ్చింది. ఇది కాక చాలా విషయాలు చెప్పగలను నీగురించి. నీ పెంపకాన్ని, నీ ధర్మపీఠం అధికారాన్ని ఆసరా చేసుకుని ఎంతమందో అమ్మాయిల జీవితాలను నాశనం చేసి బయటపడకుండా వాళ్ళని గంగలోకి తోసారు. పోలీసుల జోక్యం లేదుకాబట్టి పట్టుపడలేదు నీ కొడుకు, నీ మేనల్లుడు. కానీ ఎప్పటికైనా పాపం పండక పోదు. అవన్ని బయట ఊళ్ళల్లో చేసారు కాబట్టి ఈ ఊరివరకు రాలేదు. చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇక పోతే, నీ గురించి. మా మామయ్య మాలకారి పనిని నీ బావమరిదికి ఇప్పించే కుట్రే ఈనాటి సంఘటన. పార్వతిని అడ్డుపెట్టుకుని, కోడల్ని చేసుకుంటే మెల్లిగా మామయ్య మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అతన్నించి ఆ కైకంర్యాన్ని నీ చేతుల్లోకి తీసుకునే కార్యక్రమే ఇది. ఒకవేళ పార్వతి పెళ్ళికి నిరాకరిస్తే ఆ కుటుంభాన్ని గ్రామ బహిష్కరణ చేయించినా ఆ కొలువు మీదే కదా. ఈ మొత్తం గ్రంథం నీ కొడుకు, నీ మేనల్లుడు తో కలిసి రచించావు. అంతే కాదు, నీవు చెన్నపట్నం లోని బ్రిటిష్ అధికారిని కలిసి ఇక్కడిభూములు, వారికి ధారాదత్తం చేయాలనే నీ దురాలోచన కూడా నేను ఆధరాలతో సహా తీసుకొచ్చాను. చాలా? నీవి, నీ పిల్లల అరాచకాలను గురించి ఇంకా చెప్పాలా?‘‘ ఊరందరి ముందు మాధవయ్య బాగోతం వినిపించాడు శంకరం.
తాను ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నం ఇలా ఊరందరి ముందు బయటపడిపోవటం మాధవయ్యకి, ధనుంజయకి, భాస్కరానికి మతులుపోగొట్టాయి. ఏం మాట్లాడి తనని తాను సమర్థించుకోవాలో అర్థం కాలేదు మాధవయ్యకి. అయినా ‘‘ఏం టబ్బాయ్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా, న్యాయపీఠం సభ్యుడనని కూడా చూడకుండా అవాకులు చెవాకులూ పేలుతున్నావ్. ఇదేం బాగాలేదు. మాట్లాడరేం గంగాధరం గారు, గోపాలం గారు. జనార్దనం గారు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు‘‘ అని పీఠం సభ్యులందరిని అడిగాడు తనను సమర్థిస్కారేమోనని.
‘‘నీవు కాసేపు మాట్లాడకు మాధవయ్యా, నీవిపుడు సభ్యుడివి కాదు. ముద్దాయి తండ్రివి. మమ్మల్ని నీ కొడుకుతో మాట్లాడనీ.‘‘ అంటూ జనార్ధనం అతని నోరు మూయించాడు.
‘‘ధనుంజయ్, ఇప్పుడు చెప్పు, తనని ఈ రోజు తెల్లవారు ఝామున అమ్మవారి తులసి తోటలో తనను నీవు అమానుషంగా బలత్కరించావవి నీ మీద అభియోగం మోపింది పార్వతి. దానికి సాక్షంగా నీ యగ్నోపవీతానికి ఆమె ఉంగరం తగులుకొని ఉండటం, నీ చిటికెనవేలు చిట్లి రక్తం రావటం, నీ చేతులు, వంటిమీద పార్వతి గోర్ల గుర్తులుండటం ఆమే నిన్ను దోషి అనటానికి సాక్షాలుగా కనబడుతున్నాయి.‘‘ దీనిమీద నీవు చెప్పాల్సింది ఏమైనా ఉందా?‘‘ అని గోపాలంగారు అడిగారు.
రెండుచేతులు బొబ్బెలెక్కగా, విపరీతమైన మంటతో మాట్లాడలేక పోతున్నాడు ధనుంజయుడు. ‘‘నేను చాలా తప్పు చేసాను. క్షమించుమని అడిగలేనంత పెద్ద తప్పే చేసాను. నేను మారిపోయాను. నన్ను నమ్మండి, మీరంతా అనుమతిస్తే పార్వతిని వివాహం చేసుకుంటాను. నా వల్ల ఆమె జీవితం బలవకుండా కాపాడుతాను. నాకిక ఏ శిక్షా వేయకండి. అమ్మవారే నాకు సరైన శిక్ష వేసింది. నన్ను క్షమించి నాకు ఒక్క అవకాశ మివ్వు పార్వతి‘‘. ఏడుస్తూ అంటున్న ధనుంజయుడ్ని చూసి మాధవయ్య లోలోన మెచ్చుకుంటున్నాడు. తను అనుకున్నట్టుగా తన కొడుకు చేస్తున్నాడని, అంతా సవ్యంగానే జరుగుతుందని, ధర్మపీఠం వాడి మాట నమ్మి వివాహం జరిపించటం, తన గుప్పిట్లోకి రాఘవయ్య కుటుంభం చిక్కుతుందని, శంకరాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చననే ఆలోచనలతో ఉన్నాడు.
పార్వతి శంకరానికి తన ముఖాన్నిచూపించలేక చేతుల్తో ముఖం దాచుకుని కింద కూలబడి పోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ధనుంజయుడు క్షమించమని అడుగుతూ ఆమె దగ్గరికి రావటం తో, కోపాన్ని ఆపుకుంటూ అతని చెంపలు వాయించింది. ‘‘నువ్వు నన్ను కాపాడుతావా? నీవే ఒక వేటగాడివి. నీ వల్ల పాడై పోయిన ఎంతమంది అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటావు. ఛీ.. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఫో అవతలకి. ఇంకా నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు.‘‘ అంటూ వెక్కి వెక్కి ఏడవ సాగింది.
ఆండాళు, పార్వతి దగ్గరికి వచ్చి ‘‘నిజమే నమ్మా, వీడు ఊళ్ళో ఉండదగిన వాడు కాదు. నీవు చేసుకోవాల్సిన అవసరమూ లేదు‘‘ అంటూ ఓదార్చింది. పరుగున దగ్గికి వచ్చి అక్కున చేర్చుకున్నాడు శంకరం. ‘ఏడవకు పార్వతి, నీవే తప్పు చేయలేదు. నీకు నేనున్నాను.‘‘ అంటూ ఆమెను ఊరడించాడు.
‘‘మామయ్యా, నిన్ననే పరీక్షలయిపోయాయని ఇక్కడికి బయలుదేరుదామని అమ్మా నేను అనుకుంటున్నాము. ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. జరిగిన విషయాలని మనసులో పెట్టుకుని బాధ పడకండి మామయ్యా. అతనికి తగిన శాస్తి జరిగిందికదా. అతన్ని ఏంచేయాలో బాబాయి వాళ్ళు తీర్పు చెబుతారు.‘‘ రాఘవశాస్త్రిగారితో అన్నాడు.
వెనుకనే ఉన్న శంకరం తల్లి, శాస్త్రి గారి చెల్లెలు సీతమ్మ,‘‘అన్నయ్యా, జరిగినదాన్ని పీడకలని మరచి పొండి. పార్వతిని నా కూతురుగా చూసుకుంటాను. నీవు దిగులు పడకు. మంచి ముహుర్తం చూసి పెళ్ళి కానిచ్చేద్దాం‘‘ అన్న చెల్లెలి మాటతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు. సీతమ్మ, ఏడుస్తున్న జానకమ్మను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఆమె ముఖం దుఃఖం, అవమానంతో దిగులుగా ఉంది.
పరందామయ్య మిగిలిన ముగ్గురూ ఆ ఊరికి వయసుకి పెద్దదైన ఆండాళు కలిసి చర్చించుకుని తమ ధర్మ పీఠం తీర్పును చెప్పారు. ధనుంజయ హోమగుండంలో పడిన విషయం పరందామయ్యకి, కమిటీ వాళ్ళకి వివరించి వాడి శిక్ష ఏవిధంగా వేయాలనే నిర్ణయాధికారం, బాధితురాలిగా పార్వతికి ఉందని, ఆమె ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని కమిటీ గుర్తించాలని కరాకండీగా చెప్పింది. అందరూ ఆమె వాదన సమంజసమని వప్పుకుంటూ, ఆ ధర్మపీఠం తీర్పును తీర్మానించింది.
‘‘ఇంతవరకు ఇక్కడ గ్రామ ప్రజలందరి సమక్షంలో జరిగిన విషయాలకు మీరంతా ప్రత్యక్ష సాక్షులు. మేము అందరం కలిసి న్యాయమైన తీర్పును నిరిణయించాం. పార్వతిని అమానుషంగా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ధనుంజయ బలత్కరించాడు కాబట్టి అతన్ని, అతని కుటుంభాన్ని దోషులుగా పరిగణిస్తూ గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తున్నాము. అపరాధి ఎప్పుడూ తప్పించుకోలేడు. ఎప్పుడో ఒకప్పుడు దొరికి పోతాడు, తన తప్పుకు శిక్షను తప్పకుండా అనుభవిస్తాడనే రుజువుని ఆదిశక్తి పార్వతీదేవి చూపించింది. అతన్ని బ్రమరాంభికా అమ్మవారు చేసిన తప్పుకు శిక్షను వెంటనే అనుభవింపచేసింది. అయినా శంకరం మాకు అందించిన సమాచారం, ఆధారిత సాక్ష్యాలు పరీక్షించిన మీదట ఈఊరు ప్రజల క్షేమం దృష్ట్యా ఆకుటుంభం అంతా తక్షణమే ఊరువిడిచి వెళ్ళ వలసిందిగా ఊరుమ్మడిగా తీర్మానించాము. రాఘవశాస్త్రి గారి కుటుంభం నిరపరాదులు, వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం లేదు. అమ్మవారే ప్రాయశ్చిత్తం కార్యక్రమాన్ని ఆపివేస్తూ విఘ్నాన్ని కలిగించారు. వారు పుణ్యావాచనం వారి గృహంలో చేసుకుని తమ మాలకారి విధులను నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. ఇక పార్వతి, బాధితురాలు. దోషికాదు. ఆమె తన ఇష్ట ప్రకారం తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకి ఉంది. ఆమెని వివాహం చేసుకోవటానికి తమ ఇష్టాన్ని వ్యక్తపరచిన రాఘవశాస్త్రి మేనల్లుడు శంకరం, అతని తల్లిగారు సీతమ్మగారి మంచి మనసును ఈ ఊరంతా అభినందనలు తెలుపుతుంది.‘‘ అంటూ పరందామయ్య గారు చెప్పిన తీర్పుకు గ్రామ ప్రజలంతా హర్షాతి రేకాలతో చప్పట్లు చరితారు.
“వొదినే! ఓ ఒదినే! ఏం సగ వెడ్తున్నవ్! అన్న డూటీకి వొయ్యి శాన సేపాయే! ఇంకేం పనమ్మా!” అనుకుంటూ వచ్చింది మాధవి.
” యే! పనయ్యింది వొదినే! పొద్దు గాల్ల చాయ్ ఉడుకు జేస్తుంటే గిన్నె మాడింది.. గీపీసు వెట్టి రుద్దుతున్న, ఏమో గిట్లోచ్చినవ్ పొద్దు గాల్ల..అన్న ముచ్చట జెప్పనీకా” అన్నది వసంత నవ్వుకుంటూ.
” నీకు ఊకే గాముచ్చటనే! గట్ల గాదు గనీ, ఆషాఢ మాసం గదా, మస్త్ ఆఫర్ లు నడుస్తున్నయి, పోదామా! బట్టల దుకాణంకి ” అన్నది మాధవి.
“అమ్మో! మీయన్న తిడ్తడు, అయినా పైసలు యాడియి”? అన్నది వసంత.
” గట్ల మాట్లాడ్తవ్ వోదినే, నేను లేనా? నిన్ననే శిట్టి ఎత్తిన. ఇస్తపా” అన్నది మాధవి.
” జల్దీ చీర కట్కోని వొస్త.. కూసో. గా కోపుల శాయ్ వట్టు ఉన్నది ఉడుకు జేస్కొని తాగు”అని లోపలికి పోయింది వసంత.
” సరే దబ్బున రా” అంటూ వంటింట్లోకి పోయి చాయ్ వేడి చేసుకుని కుర్చీలో కూర్చొని తాగుతుంది మాధవి.
ఇద్దరు తొందరగా బయటకు వచ్చి షేర్ ఆటో మాట్లాడుకుని వందన బ్రదర్స్ కి వెళ్లారు..
షాప్ నిండా రకరకాల ఆఫర్స్ రెండు కొంటే ఒక చీర ఉచితం, నాలుగు కొంటే మిక్సీ ఉచితం, ఇలా రకరకాల ఉచితాల ప్రదర్శన జరుగుతుంది.
మాధవి మరియు వసంతలకు కళ్ళు తిరిగిపోయాయి. ఇక చీరలు వెతకడం మొదలుపెట్టారు.
వేటి మీద అయితే ఉచితాలు ఉన్నాయో వాటిని వెతికి వెతికి బాగుల నిండా నింపుకున్నారు…
” మంచి గున్నయి కదా వొదినే!” అన్నది మాధవి.
“మంచిగనే ఉన్నాయ్ గాని ఈ చీరలన్ని చూసి మీయన్న ఏమంటడో?” అన్నది వసంత.
“ఏమనడు తీ, ఊకె బుగులు వట్టకు, జెర్ర గట్టిగుండాలే” అన్నది మాధవి.
బ్యాగుల నిండా కొన్ని చీరలు, ఉచితాలుగా వచ్చిన కొన్ని చీరలు, ఆఫర్లుగా వచ్చిన మిక్సీలు, గోడ గడియారాలు అన్నిటిని బ్యాగుల నిండా నింపుకొని చాంతాడంత ఉన్న కౌంటర్లో నిలబడ్డారు.
ఓరెండు గంటల తర్వాత బిల్లు చెల్లించి ఇద్దరు బయటపడ్డారు..
“వొదినే! పోల్లగాండ్లు వచ్చేవరకు మస్త్ టైముంది. కొమురెల్లి దాకా పొయ్యోత్తాం. మీ పిల్లలు మా పిల్లలు పెద్దోల్లే, ఆల్షం అయిన ఏంగాదు” అన్నది వసంత.
“అబ్బో! నువ్వేనా? గట్లనేది. పోదాం పా. గీ సంచులు గీడ మా దొస్తింట్ల వెట్టి పోదాం” అన్నది మాధవి.
ఇద్దరూ ఆ సంచులను మాధవి స్నేహితురాలు ఇంట్లో పెట్టి బస్ స్టాప్ లో నిలబడ్డారు.
“బస్సు కిరాయ ఎక్వనా?” అన్నది వసంత.
“బస్సు ఫ్రీ నే కదా యాది మర్షినవా”? అన్నది మాధవి.
“అవుగదా! నేను ఈ నడుమ ఏ ఊరికి వోలే. గందికే మర్షి పోయిన” అన్నది వసంత.
ఇద్దరూ బస్సు ఎక్కి కూర్చున్నారు. విపరీతమైన జనం ఉన్నారు. అందరూ ఆడవాళ్లు ఉచిత బస్సు కాబట్టి పని ఉన్నా లేకున్నా తిరుగుతూనే ఉన్నారు.
ఒక్క సీటులో ఐదు, ఆరు మంది కుక్కుకొని కూర్చుంటున్నారు. నిలబడ్డ వాళ్ళు లెక్కకేలేరు..
పక్కకు చిన్న అమ్మాయిని పలకరించింది మాధవి.
“ఏడికి వోతున్నవ్ శెల్లే” అన్నది మాధవి.
“ఏడికి లేదు అక్క ఇంట్లో కరెంట్ పోయింది. రిపేర్ చేసేదానికి రెండు రోజులు పడతదట. టీవీ వస్తలేదు పొద్దు పోతలేదు.. ఊకెనే గా ప్రజ్ఞాపురం కాడ మక్క బుట్టలు కొనుక్కొని వేరే బస్సు ఎక్కొస్త” అన్నది ఆ అమ్మాయి.
“మనకన్నా జరంత ఎక్కువనే ఉన్నది” అన్నది మాధవి పక్కన ఉన్న వసంతతో.
అటుపక్కన మరో మహిళను పలకరించింది వసంత.
“నువ్వు ఏడికీ వోతున్నవ్ అక్కా” అన్నది వసంత.
“గీడు నామన్మడు. ఇంట్ల ఉంటే గాయి గాయి జేస్తున్నడు. అన్నం దింటలేడు. గాశామీర్ పేట కాడి దాకా వొయ్యే వరకు బుక్కెడు దింటడు. ఆడ దిగి మా శెల్లే ఇంటికాడ గింత శావట్టు దాగి మల్ల బస్సెక్కుత. గింతట్ల నా బిడ్డ కొలువు నించి వొస్తది” అన్నది ఆ మహిళ.
ఇదంతా వింటున్న కండక్టర్ కి బుర్ర తిరిగి పోయింది. “ఉచితాలు జెయ్యంగ మాకు తల్కాయ నొప్పి. పనున్నోడు, లేనొడు బస్సుల ఉర్కుడే. గిప్పుడే దేవుడు, సుట్టాలు యాదికొస్తరు” అనుకుంటూ ముందుకు వెళ్లాడు.
ఇంటికి వచ్చిన మాధవికి హాల్లో 10 కిలోల గోధుమపిండి కనిపించింది.
“ఏందయ్యా! గిది. గింత పిండి ఏడిది” అన్నది మాధవి.
“ఐదు కిలలు కొంటే ఐదు ఫ్రీ. అట గందికే తెచ్చిన” అన్నాడు మాధవి భర్త సుందర్.
“నీఅగడు పాడు గాను. ఫ్రీ వచ్చిందని గింత కొంటవా?” అన్నది మాధవి కోపంగా.
“నువ్వు ఫ్రీ వస్తున్నది అని గన్ని చీరలు కొన్నావ్ నేను గిద్దేస్తే గట్ల అంటవు” అన్నాడు సుందర్..
కుయ్యమనకుండా లోపలికి వెళ్ళిపోయింది మాధవి.
తెల్లవారి ఉదయమే పిండి సంచులు తెరిచి చూసింది. అంతా పురుగే ఉంది. భర్తను ఏమైనా అందామంటే తాను అలాంటి పనే చేసింది కదా!
చీరలు బ్యాగు మిక్సీ రెండు తెరిచి ముందుగా చీరలను విప్పి చూసింది… చూడడానికి బాగానే ఉన్నాయని ఒక చీర కట్టుకుంది .తర్వాత ఆరోజు ఇడ్లీ కోసం నానబెట్టిన మినప్పప్పును మిక్సీలో వేసుకుంది. మిక్సీ ఏమాత్రం నాణ్యత లేకుండా కనిపించింది…
“గిట్ల ఫ్రీ వస్తుందని కొంటే గిట్లే ఉంటది .ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం” అని అనుకొని వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాధవి.
“వొదినే! మోసం జరిగింది మన మిక్సీ మంచిగ పనే చేస్తలేదు” అన్నది వసంతతో.
“సప్పుడు జెయ్యకు. మీ అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికే ఇవి కొన్న అని తిడతా ఉన్నాడు. నా చీరలు నీళ్లలో పెట్టిన పొద్దుగాల. మొత్తం రంగు ఎలిసిపోయింది” అన్నది మెల్లగా వసంత.
“ఓయమ్మనే! మొత్తం మునిగినమే. ఈసారి గిట్ల చేయద్దు, అంత నాదే తప్పు .అన్న లేనప్పుడు వస్తతీ వొదినే” అన్నది మాధవి.
“యే, జర్ర నిలవడు. గా పెరంట్ల దిక్కువా”. అనుకుంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది వసంత మాధవిని.
“గిట్ల ఫ్రీ అని తీసుకుంటే గిట్లాయే” వొదినే అన్నది వసంత.
“గిప్పుడు సమజాయే, ఆల్లు మన కోసం గా ఉచితం పెడ్తరా? ఆల్ల లాభాలు జూసు కుంట
రు” అన్నది మాధవి.
“మీ యన్న వొద్దు అంటడు గిసొంటివి. మనమే సోచాయించి పోయ్యేది ఉండే. అయితేవాయే తీ, ఈపారీ గిట్ల చెయ్యొద్దు. ఇగ వోత వొదినే, పని గాలే” అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది మాధవి.
ఇద్దరు జరిగిన పొరపాటున గుర్తించుకుని, మళ్ళీ ఈసారి అలాంటివి చేయొద్దు అనుకున్నారు.
అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అబ్దుల్ సత్తార్, బీబీఅమినా అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరిది మంచి జోడి అని ఊరు ఊరంతా ప్రశంసించేవారు. ఎందుకంటే అతను, ఆమె ఇద్దరూ అందమైన వారు. ఇద్దరూ భారీ మనుషులే. అయినప్పటికీ బీబీ ఆమినా ఇంకా అందంగా ఉండేది. పెద్ద తలకాయ, తలలో దట్టమైన నల్లని పొడగాటి వెంట్రుకలు, వెడల్పాటి నుదురు, రెండు కలిసి ఉన్న నల్లని కనుబొమ్మలు, గుండ్రటి నల్లని కళ్ళు, కళ్ళల్లో పెట్టుకున్న కాటుక వల్ల ఆమె ముఖం ఇంకా కళకళలాడుతూ, వెలిగిపోతూఉండేది. ఆమె ప్రశాంతమైన ముఖవర్చస్సును చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి సలాం చేయాలనిపిస్తుంది.
అంతకు తగ్గట్టుగా ఆమె ఎంతో సంస్కారవంతురాలు. మంచి తెలివితేటలు గలది. మర్యాద, అణకువ, వివేకత, నైతికత అన్ని ఆమెలో ఉట్టిపడుతూ ఉండేవి. గ్రామంలో అందరూ వాళ్ళిద్దర్నీ ఎంతో గౌరవంగా చూసేవారు. వాళ్ల అదృష్టమేమో గాని ముగ్గురు అమ్మాయిలే వారి సంతానం, మగ పిల్లలు కలగలేదు.
తన భర్తకు ఒక ఎకరం పొలం ఉన్నప్పటికీ బీబీ ఆమినాకు తండ్రి తరఫున ఆస్తి నుండి అల్లాహ్ నిర్దేశించిన వాటా ప్రకారం ఒక ఎకరం పొలం వచ్చింది. ఆ విధంగా వారికి జీవితం సాఫీగా సాగుతోంది.
గౌరవ మర్యాదలగల ఇల్లు కాబట్టి ఎవరు కూడా వారి ముగ్గురు అమ్మాయిలను మరో విధంగా చూసేవారు కాదు. అలా ముగ్గురు అమ్మాయిలు ఎదుగుతూ చదువుతూ మానమర్యాదలతో ఉంటున్నారు.
ముగ్గురు అమ్మాయిలు మంచి అందమైన వారు. కాలేజీ చదువులు పూర్తి చేశారు. హైదరాబాదుకు చెందిన దగ్గరి బంధువులలోని మంచి సంబంధాలను చూసి ఒకరి తరువాత మరొకరికి (నికాహ్) వివాహం చేసి వేశారు.
చూస్తుండగానే కాలం కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంది. అమ్మాయిల వివాహమైన నాలుగైదు సంవత్సరాలకు భర్త అబ్దుల్ సత్తార్ మామూలు జ్వరంతో కొద్ది రోజుల్లోనే పరలోక యజమానిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు.
చావుకు వచ్చినవాళ్లు నాలుగు ఐదు రోజులలో అందరూ వెళ్లిపోయిన తర్వాత బీబీఆమినా ఒంటరిదైపోయింది. తన జీవితం గురించి దీర్ఘాలోచనలో పడింది. మగసంతానం లేదాయే ఇప్పుడు ఇంత చేసి ఆడపిల్లల వద్ద బతకవలసిన పరిస్థితులు వచ్చాయా? ఒకవేళ అలాంటి పరిస్థితిలేవస్తే ఎవరి వద్ద ఉండాలి? ఎవరు బాగా చూసుకుంటారు అని ఆలోచిస్తుంది. అందరూ బాగానే చూసుకుంటారు కానీ పెద్ద కూతురు పెద్దల్లుడు ఇంకా బాగా చూసుకుంటారని నిర్ణయానికి వచ్చింది. అంతలోనే పెద్ద కూతురు సల్మా ఫోన్ వచ్చింది. బీబీ ఆమినా ఫోన్ ఎత్తింది; అటు నుండి సల్మా: అస్సలాము అలైకుమ్ అమ్మీ జాన్ (మీపై శాంతి కురియు గాక) అనగానే వ అలైకుమ్ అస్సలాం బేటా ( మీపై కూడా శాంతి కురియు గాక) అంటూ మహా సంతోషంతో జవాబు ఇస్తూ సల్మా ముందు నువ్వు చెవి పట్టుకో! ఎందుకమ్మా అంది సల్మా. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా నీ ఫోన్ వచ్చింది అందుకే అంటూ బిగ్గరగా నవ్వింది బీబీ ఆమినా. సరేనమ్మా నా మనసులో ఒక మాట ఒకటి చెప్పాలని ఫోన్ చేశాను. ఒక్కదానివే ఊర్లో అంత పెద్ద ఇంట్లో ఉండడం కంటే మా దగ్గరికి వచ్చేయ్ అమ్మిజాన్. నిన్ననే మీ అల్లుడుగారు నేను నీ గురించి మాట్లాడుకున్నాము. అమ్మీజాన్ న్ని ఇక్కడికి పిలుచుకుందామని చెప్పుకున్నాము. ఆయన కూడా సరేనన్నారు. అందువల్ల నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయ్ అమ్మీ అంది సల్మ ప్రేమగా.
సల్మా! నిజానికి నేను ఈ విషయమే ఆలోచిస్తుండగా నీ ఫోన్ వచ్చింది నిజంగా ఇది అల్లాహ్ తరఫునుండి అని నేను అనుకుంటున్నాను అంటూ సరేనమ్మా రెండు మూడు రోజులలో బయలుదేరుతాను అంది తల్లి బీబీ ఆమినా.ఖుదాహాఫీజ్ (అంటే నిన్ను అల్లాహ్ పరం చేశాను అని అర్థం) అంటూ సల్మా ఫోన్ పెట్టేసింది.
బీబీ అమీనా, తమ వీధిలోని లలితమ్మను అనసూయమ్మను సుశీలమ్మను ఫాతిమాబీ లతో పాటు ఊరు వారందరి గడపగడపకు వెళ్లి తను హైదరాబాదు వెళుతున్న విషయం చెప్పింది. అందరూ ఎంతో ఆత్మీయత కనబరుస్తూ ఆమె వెళ్లిపోవడం తమకు వెలితిగా ఉంటుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కానీ తప్పదుగా. ఆధునిక పేరుతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. దుమ్ము ధూళి గలదారులు నున్నటి రోడ్లుగా మారిపోయాయి అదేవిధంగా ఉదయాన్నే సానుపు జల్లి అందంగా ముగ్గులు వేసే వాకిళ్లు కూడా రోడ్ల పుణ్యమా అని రోడ్లుగా మారి పోయాయి. బీబీ ఆమిన ఇంటికి కొద్ది దూరంలోనే బస్ స్టాప్ ఉంది. బీబీ ఆమినాతోపాటు ఊరిలో చాలామంది బస్ స్టాప్ వద్ద ఆమెకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉన్నారు. ఆ గుంపును చూసి డ్రైవరు కండక్టరు ఈరోజు ప్రయాణికుల సందడి బాగానే ఉండేటట్టు ఉందిగా అనుకున్నారు. కానీ ఆమినాతోపాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఎక్కారు అంతమంది బీబీ ఆమె నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారని విని, సందడిని చూసి డ్రైవర్ కండక్టర్ మతసామరస్యమంటే ఇదే, సౌభ్రాతృత్వం అంటే ఇదే, ప్రేమ అభిమానం అంటే ఇదే అంటూ ఎంతో శ్లాగించారు. వారి మాటలు విన్న జనాలు అవును మా ఊరిలో మతసామరస్యం ఉట్టిపడుతుంటుంది. మేమంతా అన్న తమ్ముళ్ల వలె అక్కచెల్లెళ్ల వలె కలిసి మెలసిఉంటాము అని అన్నారు.
బస్సు కదిలింది. దాదాపు మూడు గంటల తర్వాత జూ పార్క్ వద్దగల తాడ్ బన్ స్టేజిపై ఆగింది. అప్పటికే ఆమె పెద్ద కూతురు సల్మా మనవడు మునవ్వర్, మనవరాలు నజ్మ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమె దిగగానే కూతురు ఆలింగనం చేసుకుంది. అమ్మమ్మగా ఆ ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమతో బీబీ ఆమినా రెండు చేతులతో వారిని అదుముకుంది.
ఇల్లు దగ్గరే అయినా ఆటో మాట్లాడుకుని వెళ్లారు. తల్లి వచ్చిన విషయం మిగతా ఇద్దరు కూతుళ్లకు అల్లుళ్లకు మనవళ్ళకు మనవరాళ్లకు తెలిసిందే గనుక మర్నాడు వాళ్లంతా ఇక్కడికి వచ్చేసారు. అందరూ ఒకరినొకరు సలాములు చేసుకొన్నారు. ఇద్దరు అల్లుళ్ళు కూడా ఎంతో వినయంతో కొద్దిగా ముందుకు వంగి కుడి అరచేతిని తమ వైపు తిప్పుకొని అస్సలాము అలైకుమ్ మామి జాన్ (అత్తగారు) అంటూ సలాం చేశారు. అందరూ పొద్దంతా సంతోషంతో గడిపి సాయంత్రానికి వెళ్లిపోయారు.
బీబీఆమీనా జీవితం సాఫీగానే, సంతోషంగానే గడిచిపోతోంది. తన అత్తవారి ఎకరం పొలం, తన తండ్రి ఆస్తి నుండి సంక్రమించిన ఎకరం పొలం కౌలుకు ఇచ్చింది గనుక వాటి ద్వారా వచ్చే సొమ్ము వల్ల ఆమెకు ఎలాంటి చీకు చింత లేకుండా పోయింది.
కాలం ఆగదు తన పని తాను చేసుకుంటూ పోతుంది.ఆ కాలంలో పుట్టే వారెవరో, గిట్టే వారెవరో ఇంకా సజీవంగా ఉండేవారెవరో అది పట్టించుకోదు.
ఎందుకో బీబీ ఆమినాకు కాస్త నలతగా ఉంది. హాస్పిటల్కు తీసుకు వెళితే డాక్టర్ గారు మందులు రాసి మామూలు జ్వరమే ఆందోళన పడవలసిన అవసరం లేదు, ఈ మందులు వాడండి నయమైపోతుంది అన్నాడు.
ఆ తర్వాత నాలుగైదు రోజులకు మస్జిద్ నుండి ఉదయపు నమాజు అజాఁ ఇస్తుండగా ఆమె ప్రశాంతంగా తన యజమాని అయిన అల్లాహ్ ను కలుసుకోవడానికి పరలోకం వెళ్ళిపోయింది.
హైదరాబాదులోని అల్కాపూర్ లో ఉన్న అబ్దుల్ రహీం వ్యాకులతకు గురవుతున్నాడు, అతని మనసు నిలకడగా ఉండలేక పోతుంది ఎందుకో కాళ్లు చేతులు వణికినట్టుగా అనిపిస్తుంది ఏమిటి విచిత్రం ఎందుకు నాకిలా అవుతుంది అని తనను తానే అబ్దుల్ రహీం ప్రశ్నించుకుంటున్నాడు, పరేషాన్ అవుతున్నాడు.
మరోవైపు ఇంటి ముందు టెంట్ వేయబడింది. కుర్చీలు బల్లలు వేయబడ్డాయి. చుట్టాలు పక్కాలు అందరికీ ఫోన్లు చేయబడ్డాయి అలాంటి ఫోను ఒకటి అల్కాపూర్ లోని అబ్దుల్ రహీం గారికి వచ్చింది. వరుసకు మామ అవుతాడు. మాము! అమ్మీకా ఇంత ఖాల్ హో గయా అమ్మ మరణించింది అని అనగానే ఇన్నాలిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్ ప్రతి ప్రాణి మరణం రుచి చూడ వలసిందే అంటూ తన విచారాన్ని వెలిబుచ్చుతూ ఫోన్ పెట్టి వేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది తను ఎందుకు ఆందోళన చెందాడో, ఎందుకు శరీరం వణికిందో,మనసు ఎందుకు నిలకడగా ఉండలేకపోయిందో.
ఎందుకంటే బీబీ ఆమినా చాలా కాలం ముందే కొంత డబ్బు అబ్దుల్ రహీం గారికి ఇస్తూ, నేను చనిపోతే నా డబ్బులతోనే నా చావు ఖర్చులు మీరు చెల్లించాలి. మా అల్లుళ్లకు నా చావు ఖర్చు పెట్టకుండా ఆపాలి. అని చెప్పింది. బీబీఆమీనా మరణ వార్త విన్నాక అతని మనసు కుదుటపడింది. మరోవైపు బీబీ అమీనా ఊరిలో ఉన్న అఫ్జల్ గారి స్థితి కూడా అబ్దుల్ రహీం గారి స్థితిగానే అయింది. అదే ఆందోళన చెందడం, అదే శరీరం వణకడం, అదే మనసు నిలకడగా ఉండకపోవడం స్థితిలో మునిగిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నాకు? అంటూ తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే మొయిన్ అనే యువకుడు అఫ్జల్ గారి వద్దకు వచ్చి బీబీ ఆమినా మరణించిన విషయం చెప్పాడు. అప్పుడు అతనికి అర్థమైంది నా స్థితి ఇలా కావడానికి కారణం ఆమె చావు డబ్బులు నా దగ్గర పెట్టి ఉండడం ఆ డబ్బులు ఆమె చావు ఖర్చులకోసం నేను అందించడం జరగాలి ఎందుకంటే తమ అల్లుళ్లు తను చావు ఖర్చులు భరించకూడదని .అందుకే ఇలా జరిగిందని భావించి అతను వెంటనే బీబీఆమీన పెద్దకూతురు ఇంటికి వచ్చి డబ్బులు సల్మాకు ఇచ్చి వేశాడు. ఈ ఇద్దరు వ్యక్తులకు బీబీ ఆమిన ఆత్మఘోష ఒకే స్థితికి లోను చేసింది. ఆమె ఇద్దరికీ డబ్బులు ఎందుకు ఇచ్చిందంటే ఒకరు కాకపోయినా ఒకరైన తన డబ్బులతో చావు ఖర్చులు చేస్తారని.వాళ్లు ఇద్దరూ చేరుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఆత్మ ఘోష శుభాత్మగా మారిపోయింది.
“మనసెరిగి మసలు కునే వాళ్ళేమన వాళ్ళు.” అప్పటికి లక్షా తొంభై సార్లు… కాదు కాదు కోటీ థొంభై షార్లు… ఇంకా చెప్పాలంటే లెక్కలేనన్ని సార్లు అనుకున్నాడు రంగారావు. కళ్ళల్లో నుంచి నీళ్ళు బయటకు వస్తామూ అని మారాము చేస్తున్నాయి. గొంతు గురఘురా అంటోంది. చీ… తన బతుకెంత అధ్వానం అయిపోయింది? తనేమన్నా చిన్నా చితకా వాడా? ఆకుపచ్చ సంతకాలు చేసిన గెజిటెడ్ ఆఫీసర్! హిప్పుడు చప్రాసీ అయిపోయాడు. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? గత కొన్ని నెలలు గా జరిగిన దానికన్నా ఈరోజు జరిగింది గుండెను మండిస్తోంది. రిటైర్ అవుతే జీవితం ఇంతలా మారిపోతుందా? ఆ రోజు…
తన రిటైర్మెంట్ రోజున, తననూ, కాంతం నూ కూర్చోబెట్టి ఘనసన్మానం చేసారు. సహోద్యోగులందరూ తన గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. పెద్దపెద్ద దండలు వేసారు. శాలువా కప్పారు. హబ్బో ఆ ఫంక్షన్ తెలుచుకుంటేనే వళ్ళు ఉప్పొంగుతుంది. తనకు ఇష్టమైన వాటితో మంచి విందు ఇచ్చారు. ఇంటికొచ్చాక ఎవరికీ జరగనంత గొప్పగా తన రిటైర్మెంట్ పార్టీ జరిగిందని తలుచుకొని మురిసిపోతుంటే “ఆ… అమ్మయ్య మనకు వీడి బాధ తప్పింది, అని అంత పార్టీ ఇచ్చారేమోలే” అని తీసిపారేసింది కాంతం. చుప్పనాతి శూర్ఫణక పోనీలే అని ఊరుకున్నాడు.
మరునాడు రోజులాగే పొద్దున్నే మెలుకువ వచ్చింది. ఆ అప్పుడే లేచి చేసేదేముంది అని కాసేపు అలాగే మంచం మీద అటూఇటూ దొర్లి, ఇక దొర్లలేక లేచాడు. కాంతం ఇచ్చిన కాఫీ తాగి, అప్పుడే వచ్చిన పేపర్ చదివాడు. స్నానం అయ్యాక దండం పెట్టుకోవటమే కానీ రోజూ వారీ జపాలు, పూజ ఎప్పుడూ అలవాటు లేదు. కాసేపు వరండాలో అటూ ఇటూ అచార్లు, పచార్లు చేసి టిఫిన్ తిన్నాక ఇంకేం చేయాలబ్బా అని చించీ…చించీ కేబుల్ వాడికి అప్పనంగా కి బోలెడంత డబ్బుపోస్తున్నాము, ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు ఇక చూద్దాం అని టీ.వీ పెట్టాడు. ఎన్ని ఛానల్సో! ఎన్ని ప్రోగ్రాం లో! రోజంతా, రోజంతా ఏమిటీ రాత్రి దాకా ఛానల్స్ తిప్పీతిప్పి అర్ణబ్ వార్తలు, టీ.వీ వార్తలూ, అత్తకోడళ్ళ సీరియల్లూ హబ్బో అన్నీ చూసీసీ… అలవాటు లేని పని కావటం తో కళ్ళూ, వేళ్ళూ నొప్పులు పుట్టాక టీ.వీ ఆఫ్ చేసి పడుకున్నాడు. అరే ఇదేదో బాగుందే! అందుకే అందరూ టీ.వీ కి అతుక్కుపోతారు అని ఆ ప్రోగ్రాం కే ఫిక్సైపోయాడు. తినటం, టీ.వీ చూడటం, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని, చాయ్, స్నాక్స్ తో సహా టీ.వీ ముందే సెటిల్డ్! ఇలా కొన్ని నెలలు గడిచాయి…
సడన్ గా కాంతం కు ఏమయిందో “ఊరికే మిడిగుడ్లేసుకొని టీ.వీ ముందు కూర్చోకపోతే మార్కెట్ దాకా వెళ్ళి కూరలు తేవచ్చుగా” అని సంచీ విసురుగా వళ్ళో వేసింది. కాంతం సణుగుడు భరించలేక కూరలు తెచ్చి ఇచ్చాడు. సాయంకాలం రామం ఏవో స్వీట్స్ పాకెట్స్ తెస్తే, అవేమిటీ నాకిటివ్వరా అని కొడుకును అడుగుతున్నా వినిపించుకోకుండా కోడలు అంజలి కొంగు చాటుగా పెట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది.
ఇదేమిటీ ఎప్పుడూ లేని అలవాటు అనుకొని హాచర్యపోతూ “కాంతం ఇదేమిటే అడుగుతున్నా పెట్టకుండాతీసుకుపోయింది?” రాత్రి భోజనానికి పిలిచిన కాంతం ను అడిగాడు.
“అన్ని ఆరాలూ కావాలి. అయినా ఇప్పుడు నీ తిండికే లోటు వచ్చింది?” విసుక్కుంటూ కంచంలో రెండు ఫుల్కాలూ, పక్కన ప్లేట్ లో ఏవో కూరగాయముక్కలూ, గ్లాస్ లో మజ్జిగ పెట్టింది.
“ఈ రొట్టెముక్కలు, పచ్చి కూరగాయలు, మజ్జిగ ఏమిటీ? నేనెప్పుడైనా తిన్నానా? ఎన్నడైనా పెరుగు తప్ప మజ్జిగ పోసుకున్నానా?” కోపంగా అరిచాడు.
వినిపించుకోకుండా మనవడికి తినిపించటం లో ఉండిపోయింది.
అదిమొదలు తన తిండి ఖనాఖష్టం అయిపోయింది. స్వీట్స్ తనకు పెట్టకుండా దాచుకోని తినటం, తనకిష్టమైన పూరీలు అవీ కూడా తన ముందే తనకు పెట్టకుండా మనవడికి పెట్టటం ఇలా బోలెడు మార్పులు తన తిండిలో. అప్పటికీ ఉక్రోషం ఆపుకోలేక “నేనేమైనా పశువునా ఈ గడ్డీగాదం తింటానికి?” అని అరిచినా పట్టించుకున్న వాళ్ళే లేరు. సాత్వికులైన కొడుకూ కోడలు మారిపోయారు. “నా కొడుకు అమాయకుడమ్మా, వాడికి కాస్త తిండిపుష్ఠి ఉన్నదని వాడి మనసెరిగి కావలసినవి చేసిపెడుతూ, కాస్త కనిపెట్టుకొని ఉంటావని నీ చేతిలో పెడుతున్నానే కోడలుపిల్లా” అని అమ్మ మేనకోడలికి తనను అప్పగించినప్పటి నుంచీ ఏదో అప్పుడప్పుడు అరవటం తప్ప ముద్దుగా చూసుకుంటున్న కాంతం సూర్యకాంతం పేరును సార్ధకం చేసుకుంటూ ముందే కాస్త గట్టిదేమో ఇప్పుడు మరీ గంపగయ్యాళమ్మ అయిపోయి కొడుకుకు, కోడలికి వంతపాడుతోంది. పైగా “ఎద్దులా కూర్చున్నావు. కాస్త మనవడిని పార్క్ కు తీసుకెళ్ళి ఆడించవచ్చుగా” అని కూడా కసురుకుంటోంది మొగుడన్న మర్యాదలేకుండా! అందుకే మావకూతురిని పెళ్ళి చేసుకోకూడదు. ఇట్లాగే నెత్తినెక్కుతారు. ఇప్పుడనుకొని ఏమి లాభం!
అంతటితో తన కష్టాలు ఆగలేదు, “ఎప్పుడూ ఆ టీ.వీ ముందు కూర్చొని అత్తాకోడళ్ళ సీరియళ్ళు చూడకపోతే చెట్లకు నీళ్ళుపోసి, తోట పని చూసుకోవచ్చుగా రెండురోజుల నుంచి మాలి రావటం లేదు. పెరట్లో కూరగాయల మడులు, ముందు పూల మొక్కలూ ఎండిపోతున్నాయి. ఏదీ పట్టదు దిష్ఠిబొమ్మలా హాల్ మధ్యలో కూర్చున్నావు” అని చిరాకు పడ్డాడు రామం.
అట్లా ఒక్కొక్కపని తనకు అప్పగించారు. పకోడీల వాసన వస్తుంటే హబ్బా తనకిష్టమైన పకోడీలూ హూ అని వంటింట్లోకి వెళ్ళాడు. మీకిక్కడేమి పని బయటకెళ్ళండి అని తరిమింది అంజలి. హంతే తనకు పౌరుషం వచ్చేసింది. “రామం” భీకరంగా అరిచాడు.
ఆ అరుపుకు అదురుబెదురు లేకుండా గదిలో నుంచి బయటకు వచ్చి “ఏమిటీ” అడిగాడు థాఫీగా.
“ఆ మధ్య నా బాంక్ పాస్ బుక్ తీసుకున్నావు అది ఇటివ్వు. ముద్దకుడుముల్లా నా పెన్షన్ బోలెడు మీ చేతుల్లో పోస్తుంటే నాకుతిండి పెట్టకుండా గొడ్డు చాకిరీ చేయిస్తూ హీనంగా చూస్తున్నారు. ఇంకా ఊరుకునేదిలేదు. నాకన్నా ముందే మీ అమ్మ డబ్బులు తెచ్చేసుకుంటోంది. నా చేతికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేస్తోంది.నా ఎకౌంట్ మీ అమ్మతో జాయింట్ కాకుండా నా పేరు మీదకే మార్చుకుంటాను. నాకు కావలసినవి తెచ్చుకుంటాను. హోటల్ కు వెళ్ళి తింటాను.అప్పుడు కుదురుతుంది మీ తిక్క.నువ్వు పాస్ బుక్ ఇవ్వకపోయినా బాంక్ కు వెళ్ళి మార్చుకోగలను ఏమనుకుంటున్నారో ఖబడ్ధార్” ఆయాసపడిపోయి, ఖళ్ ఖళ్ మని కాస్త దగ్గాడు కూడా!
“ఓయబ్బో మహా వచ్చాడండీ.ఆ పని నువ్వు చేస్తే ఇదో ఈ ఫాన్ కు ఉరేసుకొని చస్తా. దయ్యమై నిన్ను పీడిస్తా” కళ్ళు పెద్దగా చేసి, చేతులు తిప్పుతూ అంది కాంతమ్మ.
ఒక్క క్షణం బిత్తరపోయి, ఇంక ఏమి మాట్లాడలేకవిసురుగా బయటకు వచ్చి మొక్కలల్లో గడ్డిని పీకుతూ కూర్చున్నాడు. పక్కింటి ఛాయమ్మ ఎందుకో బయటకు వచ్చి తనను చూసి “ఇదేంటన్నయ్యగారూ, వేళకాని వేళ గడ్డి పీకుతున్నారు? చాయ్ తాగారా?” అడిగింది.
ఆప్తురాలు దొరికినట్లుగా తన ఘోషను వెళ్ళబోసుకుంటుంటే “ఏమిటో నండి ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్లు” అని సానుభూతిని చూపిస్తున్న ఛాయమ్మను భర్త రమణారావు వచ్చి “నీకెందుకూ లోపలికి రా” అనిగడకర్రలాగాలికి ఊగిపోతూ పిలుస్తూనే ఉన్నాడు లోపలి నుంచి కాంతమ్మ వచ్చింది.
“బజార్ లో పక్కింటోళ్ళతో పంచాయితీ పెట్టిస్తున్నావా?దేభ్యమొహం వేసుకొనిఆడోళ్ళతో నీకేమిటి మాటలు? ఏందమ్మా ఛాయమ్మ నా కాపురంలో నిప్పులు పోస్తావా?” అని అరిచేస్తుంటే ఛాయమ్మ ఊరుకుంటుందా? ఇద్దరూ చేతులు తిప్పుకుంటూ పెద్ద గొంతులేసుకొని అరుచుకుంటుంటే తను ఆ గంపమ్మ కథ చూడలేకఇదో ఇట్లా వచ్చి, పార్క్ లో వేపచెట్టుకింద బెంచీ మీద కూలబడ్డాడు.
అవును ఏ రచయత అన్నాడో కానీ “మనసెరిగి మసలు…కునే వాళ్ళే మన వాళ్ళు.” వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అని మళ్ళీ లెక్కపెట్టలేనన్నోసారి అనేసుకొని, పరిపరి విధాల చింతిస్తూ, ధుఃఖిస్తూన్న రంగారావు నెత్తిన ఠప్ మని ఓ వేపకాయ, ఆ వెనువెంటనే ఓ వేప రెమ్మ వచ్చి నెత్తిన పడ్డాయి. అవి చూడగానే, అప్పుడే కాంతగంపమ్మ ఉరేసుకున్నట్లూ, దయ్యమై తనను ఘట్టిగా పట్టేసుకొని ఖంగాళీ నృత్యం తనతో చేయిస్తున్నట్లూ, మంత్రాల మాంచారయ్య వచ్చి వేపకొమ్మలతో కసాబిసా బాదేస్తున్నట్లూ, గంపమ్మ వికట్టాట్టహ్హాసం చేస్తున్నట్లూ ఊహ వచ్చేసి వణికిపోయాడు రంగారావు. అంతలోనే తెలివి తెచ్చుకొని చుట్టూ చూసాడు. పార్క్ లో అందరూ వెళ్ళిపోయారు. ఆడుకుంటున్న మనవడు కూడా లేడు. వెధవ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా? ఇహ ఇప్పుడేమి గోల ఉందో కొంపలో నిట్టూరుస్తూ, అయినానేనెందుకు వీళ్ళకు భయపడాలి? అసలు ఆ చావేదో నేనే చచ్చి వీళ్ళను పీడిస్తే! మంత్రాల మాంచారయ్య వీళ్ళను చితక బాదాలి.తను భీకరంగా నవ్వాలి. వళ్ళో పడ్డ వేపకాయను నలుస్తూ, కాసేపు ఏ విధంగా చస్తే బాధలేకుండా చావొచ్చా అని ఆలోచించాడు. ఆ ఆలోచనలతోనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు.
“ఇంతసేపటి వరకు ఎక్కడికెళ్ళావు?” గయ్ మంది కాంతమ్మ.
కాంతమ్మను నిర్లిప్తంగా చూసి, లోపలి నుంచి నిద్ర మాత్రల సీసా తెచ్చి చూపిస్తూ “నేనింక నీ కడవళ్ళు భరించలేను. ఈ మాత్రలు మింగి చస్తాను” అని చేతిలోకి సీసా వంపుకొని, మంచి నీళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ, మనవడు, కొడుకు కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద పొగలు చిమ్ముతూ అన్నం, ముక్కుపుటాలను అధిరిస్తూ ఘాటుఘాటు కొత్తావకాయ, కొద్ది దూరం లో చెరుకు రసాలు కనిపించి నోరూరించాయి. అవి తిని చద్దామా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తన పిచ్చికానీ ఈ రాక్షసులు తనను తిననిస్తారా విరక్తిగా అనుకొని వాటి వైపు చూడకుండా మనసును అదుపు చేసుకుంటూ,కళ్ళుమూసుకొని నీళ్ళ గ్లాస్ అందుకున్నాడు.
“బావండీ…”
“డాడీ…”
“మామయ్యగారూ…”
“తాతయ్యా…”
అందరూ గగ్గోలుగా అరిచారు. పక్కింటి నుంచి రమణారావు, ఛాయమ్మ పరిగెట్టుకుంటూ వచ్చారు. రమణారావు, రంగారావు చేతిలోనుంచి మాత్రలు గుంజుకొని “ఏం పనిది” మందలింపుగా అన్నాడు.
“మీకు తెలియదు వీళ్ళు నాకు తిండిపెట్ట కుండా ఎంత హింస పెడుతున్నారో, చాకిరీ చేయిస్తున్నారో” అన్నాడు ఉక్రోషంగా.
“బావండీ నన్ను క్షమించు బావా క్షమించు” రంగారావు చేతులు పట్టుకొని బాధగా అంది కాంతం.
“దీని దుంపతెగ ఇప్పుడూ కాళ్ళు కాకుండా చేతులు పట్టుకుంది హెంత గీర” మనసులో అనుకొని “క్షమించను పో” అన్నాడు రంగారావు మరింత గీరగా!
“నాన్నా అదికాదు, అసలు సంగతేమిటంటే అయిదు నెలల క్రితం నువ్వు టీ. వీ చూస్తుండగా ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకో” రింగులు తిప్పాడు రామారావు.
“ఆ …ఇప్పుడు రింగులు తిప్పి అంత హవస్త ఎందుకు కానీ, బావండీ ఆరోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అట్లా రెండు సార్లు జరిగే సరికి నిన్ను రామం డాక్టర్ కు చూపించాడు. అన్ని టెస్ట్ లూ చేసి, నీకు బీ.పీ బాగా పెరిగిందనీ, షుగర్ బార్డర్ లోకి వచ్చిందనీ, బరువు 200 కిలోలు పెరిగావు, బరువు తగ్గాలనీ జాగ్రత్త పడాలనీ చెప్పాడు గుర్తుందా?కుర్చీలో నుంచి లేవటానికీ, నడవటానికీ ఇబ్బంది పడ్డావు. పైగా ఆ శంఖుమార్క్ లుంగీలు వదలవు. గడ్డం చేసుకోమన్నా చిరాకు పడిపోతూ ఎంతసేపటికీటీ.వీ ముందు నుంచి లేవవు. అక్కడికే రకరకాల రుచులతో స్నాక్స్ కావాలి.ఎంత చెప్పినా నీకు తిండియావ తగ్గదు.”
“వాకింగ్ కు వెళ్ళమంటే వెళ్ళవు.”
“అమ్మాయ్ అంజలీ నువ్వు మీ అత్తయ్యా ఓసారి ఈ సీరియల్ లో లాగా పోట్లాడుకోండి అని సరదా పడిపోయారు.”
ఒకళ్ళ తరువాత ఒకరు చెప్పుకుంటూ పోయారు.
“భారీ ఏనుగులా వళ్ళు పెంచేసావు. తాతయ్య కు బీ.పీ ఎక్కువయ్యి పక్షవాతం వచ్చి ఎన్నాళ్ళో మంచాన తీసుకొని తీసుకొనిపోయాడు. బామ్మా, తాతయ్యషుగర్ ఎక్కువ అయ్యి గుండెపోటుతో పోయారు. నీకు ఆ పరిస్తితి రాకూడదని ఎంతో ఆలోచించి ఈ ప్లాన్ వేసాము. ఇప్పుడు చూడు నువ్వు గున్న ఏనుగులాగా కాదు బుజ్జి ఏనుగుసైజుకు వచ్చావు. నీకోసమే డాడీ ఇదంతా నీ కోసమే” బాధగా పిడికిలి నోటికి సుతారంగా ఆనించుకొని, మొహం బాధగా పెట్టిఅన్నాడు రామారావ్.
“అవును మామయ్యగారు అట్లా మాట్లాడినప్పుడల్లా ఎంత బాధ పడ్డామో తెలుసా” చేతులు నలుపుకుంటూ, కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అంది అంజలి.
“బావండీ నిన్ను చూసినప్పుడల్లా మాయాబజార్ లోని ఘటోత్కచునిలా కనిపించి ఎంత దడుచుకునే దాన్నో తెలుసా? ఉమ్మడి కుటుంబం లో యమధర్మరాజులాగా దున్నపోతెక్కి యముండ అని భీఖరంగా అరుస్తూ యమధర్మరాజు వస్తుంటే నిన్ను కాపాడాలని ఆ సావిత్రిలా నీతో ఈ నిరాహార దీక్ష హెంత నిష్ఠతో చేయించాను” అంటూకాంతం కొంగు నోట్లో కుక్కుకుంటూ ఆపసోపాలు పడుతోంది.
హోరినీ హిదా సంగతి అని రమణారవు, ఛాయాదేవి నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు.
శుభం కార్డ్ పట్టుకొని తన చుట్టూ నిలుచున్న అందరి మొహాలు ఒకటొకటిగా స్లో మోషన్ లో చూసాడు. చిన్నగా నడిచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు…
“అమ్మాయ్ ఆ రెండు చెరుకు రసాలు ఇటందుకో”అంటూకంచం దగ్గరికి జరుపుకున్నాడు…
వేడి అన్నం, ఆవకాయ కంచంలో తోడుకున్నాడు. తెల్లగా మెరిసిపోతున్న వెన్న ముద్దను చేతిలోకి తీసుకొని మొత్తం వేసేసుకున్నాడు…
అన్నం కలిపాడు…
గుండ్రాయంత ముద్దను చేసి, ఆబగా నోటి దగ్గరగా తెస్తుంటే…
“బావండీ…”
“డాడీ…”
“మామయ్యగారూ…”
“తాతయ్యా…”
“రంగారావ్…”
“హన్నయ్యగారు…”
ఆ ఆర్తనాదాలు పట్టించుకోకుండా, చేతిలోని ఆవకాయ ముద్దను మురిపెంగా చూసి, ఘాఠ్ఠిగా వాసన పీల్చి, ఆ ఘాటుకు, ముక్కు, కళ్లు ధారలు కారుతుండగా అందరి వంకా చిద్విలాసంగా చూసి, నోట్లో కూరుతూ, ఆహా ఇది కదా “స్వర్గం అంటే” తన్మయంగా అన్నాడు.
కొత్తగా పెళ్ళిచేసుకుని వచ్చిన మాధురికి అత్తగారిల్లు చూడగానే అయోమయంగా అనిపించింది… ఏదో తిన్నాము అన్నట్లు ఉంటారు… లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోవడం…మామగారు రిటైర్ అయ్యారు… ఆయనకి ఒక రూమ్ అందులో టి వి… అత్తగారు, ఆమె తల్లి మధ్య హాల్లో ఉంటారు… అత్తగారి తల్లి మంచంలోనే ఉంటుంది… అన్నీ చేతికి ఇవ్వాలి…ఇద్దరూ తెలుగు హిందీ సీరియల్స్ కలిపి రాత్రి పది గంటల వరకు చూస్తూనే ఉంటారు…
తమది పెద్దలు కుదిర్చిన వివాహమే.. ప్రశాంత్ ది ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం… పెళ్ళిచూపుల్లోనే చెప్పాడు ఆమె ఉద్యోగం చెయ్యటం తనకు ఇష్టం లేదని…తన ఇంటి పరిస్థితి తెలిసిన ప్రశాంత్ ఆవిషయం చెప్పకుండా తనకే ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదని చెప్పాడు…తనకు ఎప్పుడూ ఒక మంచి గృహిణిగా ఉండాలని కోరిక… అదే మాట ఇలా వినడం నెత్తిన పాలు పోసి నట్లుగా అనిపించి ఒప్పుకుంది…మొదటి రాత్రి తన ఇంటి వ్యవహారం చెప్పాడు… ఈ ఇల్లు అమ్మమ్మది అనీ, అమ్మ ఒక్కతే కూతురనీ, అన్నిటికీ తను సర్దుకు పోవాలని… నీకు వీలైతే ఇంటి వాతావరణం మార్చు అంటూ హింట్ ఇచ్చాడు… బలాదూరుగా తిరిగే మరిది శ్రీకాంత్… ఉద్యోగం లేదు… బి టెక్ చదివినా ఉద్యోగం చెయ్యడు… బయటి వ్యాపకాలు ఎక్కువ…
డిగ్రీ చదివి ఎమ్ బి ఎ పూర్తి చేసిన మాధురి, ఒక గృహిణిగా ఆ ఇంట్లో కాలు పెట్టింది… బ్రేక్ ఫాస్ట్, కూరలు బయటి నుంచి వస్తాయి… అన్నం మాత్రం వండుకుంటారు… టి వి సీరియల్లో వంట చెయ్యని అత్తగారిని మాత్రం, ఇద్దరూ తిట్టుకుంటూ కూర్చుంటారు… వింతగా అనిపించింది తనకు…
ఇలా పనీ పాటా లేకుండా కూర్చోవడం, తనకు నచ్చటం లేదు… ఒక రోజు భర్తని అడిగింది…”ఇక నుంచి రోజూ నేను వంట చేస్తాను..”
“అందరూ పని చెయ్యకుండా సినిమాలూ, షికార్లూ,పార్లర్ల చుట్టూ తిరగడం చేస్తారు… నువ్వేంటి ఇలా ?” అంటూ నవ్వాడు…
“అయినా నీది ఒంటరి పోరాటం అవుతుంది… ఇక్కడ ఎవరూ అంతగా పాటించరు జాగ్రత్త సుమా” అని హెచ్చరించాడు…
“మీరు అవసరం అయిన సహాయం చెయ్యండి చాలు…” అంటూ తన నిర్ణయం చెప్పింది…
“ఓకె “అంటూ తంబ్ చూపించాడు ప్రశాంత్…
మరుసటి రోజు అత్తగారితో చెప్పింది…”ఈ కూరలు ఇలా బయట నుండి వద్దు అత్తయ్యా! నేను వంట చేస్తాను ఈ రోజు నుంచి”
సీరియల్లో మునిగి ఉన్న అత్తగారు మొహం పక్కకి తిప్పి, “ ఇదుగో అమ్మాయ్! నీ ఇష్టం… నాకు మాత్రం పని చెప్పకు…” అని అన్నది…
ఏమనాలో తెలియక, తల ఊపి లోపలికి వెళ్ళింది మాధురి…పనిమనిషిని పిలిచి వంట గది శుభ్రం చేయించింది… రోజూ చేసే పనులు కాకుండా ముందుగా కూరగాయలు తరిగి ఇవ్వాలని చెప్పింది…
అది డూప్లెక్స్ విల్లా… క్రింద ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్… ఫస్ట్ ఫ్లోరులో మూడు బెడ్ రూములు ఉన్నాయి… అందులో ఒక రూమ్ తమది, ఒకటి మామగారిది, ఇంకొకటి ఊర్లో ఉన్న ఆడపడుచు పద్మది… ఆడపడుచు ప్రతి వారం వస్తూనే ఉంటుంది…సెకండ్ ఫ్లోరులో పెంట్ హౌసులా, ఒకే రూమ్ వేసారు… అది మరిది రూము… అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ, ఎవరి లోకం వారిదే అన్నట్టుగా వుంటారు… మామగారికి రాజకీయాలు, అత్తగారు, ఆమె తల్లిగారలకు సీరియల్స్, మరిదికి సినిమాలు… వింత ప్రపంచంలో వున్నట్టుగా వుంది… తను పెరిగిన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకంగా వుంది ఈ ఇంట్లో పరిస్థితి… పాత సినిమాల్లో సావిత్రి బతుకులా ఉంది అనుకుని ప్రక్షాళన మొదలు పెట్టింది మాధురి…
కిచెన్ లో ఒక ప్రక్కన ఉన్న దేవుడి బొమ్మలు అన్నీ శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపారాధన చేసింది… మామగారు రోజూ కాసేపు తోట పని చేస్తారు… ఆ కాస్త జాగాలోనే ఎన్నో పూలు… అవి కోసి పూజ చేసింది… రోజూ అందరూ పాలల్లో బ్రూ కలుపుకుని త్రాగుతారు…. అలా కాదని ఫిల్టర్ వేసి అందరికీ కప్పుల్లో కాఫీ పోసి ట్రేలో పెట్టుకుని, తీసుకు వెళ్ళి ముందు మామ గారికి ఇచ్చి, తరువాత అత్తగారికి, మామ్మగారికి ఇచ్చింది…
“కాఫీ సూపర్” అంటూ అత్తగారు ఈమోజీలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది… “ అమ్మాయి! అచ్చం కొంగు ముడి సీరియల్లోలా తెచ్చావు… బాగుంది…” ఆమె మెచ్చుకున్నది సీరియల్నా, నన్నా, ఒకింత ఆశ్చర్యపడుతూ, ఒక పిచ్చి నవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది…
ఇంకా పిండి అదీ రుబ్బుకోలేదని, గోధుమరవ్వ ఉప్మా అన్ని కూరగాయలు, జీడిపప్పు, బఠాణీలు వేసి చేసింది…ఆ రోజు ప్రశాంత్, శ్రీకాంత్, మామగారు వెంకట్రావు చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిన్నారు… టేబుల్ పైన ఒక గాజు గ్లాసులో నీళ్ళుపోసి రెండు గులాబీలు పెట్టింది… మామగారు ఆ పూలని చూసి ఆమె అభిరుచికి మెచ్చుకున్నారు…
రోజూ ఆఫీసులో తినే ప్రశాంత్ కు ఆనందంగా ఉంది…ఒక ఇంటిని స్వర్గం చేసినా, నరకంగా మార్చినా స్త్రీ చేతిలోనే ఉంటుంది అని అనుకున్నాడు… “ఏమండీ! రేపటి నుండి మీకు లంచ్ బాక్స్ కూడా ఇస్తాను…” అన్నది…
“మాధురీ ఏమైనా కొనాలంటే తీసుకో…” అంటూ కొంత డబ్బు ఇచ్చాడు…
అత్తగారికి, మామ్మ గారికి టిఫిన్ పెట్టి, తరువాత పనిమనిషికి పెట్టి, తను కూడా తిన్నది…
మధ్యాహ్నం వంటలో మామిడికాయ పప్పు, కంది పచ్చడి, బెండకాయ కూర, చారు చేసింది… అత్తగారితో ఆమె సీరియల్స్ భాషలో మాట్లాడుతూ, డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది…
మామ్మగారికి అన్నం పెట్టి, కాసేపు టి వి ఆఫ్ చేసింది… సీరియల్ తరువాత హాట్ స్టార్ లో చూడవచ్చు ప్రశాంతంగా తినమని చెప్పింది…
“అమ్మాయి! నీ కోడలు వంట బాగా చేసింది… ఉదయ రాగం సీరియల్లోలా పనంతా ఒక్కతే చేస్తోంది… కంది పచ్చడి పేరు కూడా మరచి పోయాను…” అని కూతురుతో చెపుతూ, తన వైపు తిరిగి “వంట బాగా చేసావు మాధురీ…” అంటూ మెచ్చుకుంది మామ్మగారు…
సీరియల్స్ చూస్తూ బద్దకంతో కదలని శరీరాలు వాళ్ళని అశక్తులుగా మార్చాయి… అందుకే పని చెయ్యకుండా ఇలా తయారయ్యారు…
అత్తగారికి, మామగారికి, వెండి కంచాలు పెట్టి వడ్డించింది… కొంగుముడి సీరియల్లో కొత్త కోడలులా ఉంటుంది అనుకున్న తనకు ఇంత మంచి కోడలు వచ్చినందుకు మనసులో సంతోషిస్తూ, తృప్తిగా భోజనం చేసింది విజయ…
వాళ్ళలో మార్పు చూసి తను ఇంటిని మార్చగలను అనుకుంది మాధురి…
ఈ రచన నా స్వంతం… ఎక్కడా ప్రచురించలేదు..