“చూడు దేవకి…వాసు నీ ఒక్కదానికే కాదు నాకూ కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలనేది నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. సౌమ్య…
నీ అన్నకూతురు అనే ఒక్కఅంశం తప్ప ఎందులో వాసుగాడికి సరిపోతుంది చెప్పు? నీ మాట కాదన్నా నని తప్పుగా అనుకోకు. నాకు వాసుభవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు నీ మనోభావాలు అంటేఅంత గౌరవం. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నీమాట ఏమిటో చెప్పు. నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది.” అన్నాడు భార్గవ. భర్త మాటలకు చిరాగ్గా తలతిప్పుకోబోయి గుమ్మందగ్గర ఏదో అలికిడి అవటంతో అటు తిరిగి చూసింది దేవకి.
ప్రొఫెసర్ రాధాదేవిని చూసి అలానే చేష్టలుడిగిపోయి సర్పద్రష్టలా నిలబడి పోయింది దేవకి.
అది గమనించిన భార్గవ, అవాక్కయి,ఆపై గుండెల్లో సన్నని మెలితిరుగుతూ నొప్పిరాగా, ” దేవకి….” అంటూ నేలకొరిగిపోయాడు.
★★★
ప్రొఫెసర్ రాధాదేవి గంభీరంగా లోపలికివచ్చి “దేవకి!మంచినీళ్ళు తీసుకురా!” అంది.
మరబొమ్మలా మంచినీళ్ళగ్లాసు తీసుకొచ్చిన దేవకి చేతిలోంచి రాధాదేవి గ్లాసుతీసుకుని వాసుని భార్గవని వడిలోకి తీసుకోమని , భార్గవ మొహాన నీళ్ళు చిలకరించింది. రాధాదేవి.
ఏమాత్రం ఊహించనిది. ఈవిధంగా మళ్ళీ రాధాదేవిని చూస్తాను,కలుస్తాను,అదీ తమఇంటిలో అని కలలో కూడా ఊహించలేదు దేవకి, భార్గవలు.
అంతా సవ్యంగా జరిగితే. వాసు పెళ్ళిచేసి సంఘంలో ఒక మంచితండ్రిగా నిలబడదామనుకున్నాడు. విధి ఆడిన వింతనాటకంలో ఇప్పుడే తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని అదీ వాసువల్ల సంపాదించుకున్నాడు. ఫలితం చేతికందే సమయానికి ప్రొఫెసర్ రాధాదేవిరాక దేవకి, భార్గవలకి పచ్చి వెలగపండు గొంతులో పడ్డట్టయింది.
★★★
భార్గవ డా||వి.ఎస్.కృష్ణ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉండేవాడు. ప్రొఫెసర్ రాధాదేవి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. వృత్తిపరంగా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పుడూ భార్గవని, దేవకిని ఇంటికి టీకి పిలిచేది రాధాదేవి. కాలేజీ పిక్నిక్స్ కి కుటుంబాలతో వెళ్ళటంతో దేవకి రాధాదేవి తో చనువు ఏర్పడింది.
ఎంతో చలాకీగాఉండే దేవకి అప్పుడప్పుడూ దిగులుగా, పరధ్యానంగా ఉండటంచూసి, “ఎందుకు దేవకి? హఠాత్తుగా ఏదో కోల్పోయిన దానిలా ఉంటావు.” అంటూ గుచ్చి గుచ్చి అడిగింది రాధాదేవి.
“ఏమీ లేదండీ! అన్నీ ఉన్నాయి కాని ఆడదానిగా నాకు భగవంతుడు తల్లినయ్యే యోగ్యత ఇవ్వలేదు. ఎన్నోపరీక్షలు చేయించుకున్నా కానీ ‘అనోవ్యులేషన్’ అంటే అండాశయం విఫలం కారణంగా నాకు పిల్లలుపుట్టే అవకాశం లేదన్నారు. దానితో నాకు విడాకులిచ్చి మళ్ళీపెళ్ళి చేసుకోమని భార్గవ వైపు వారు బలవంతం చేస్తున్నారు.” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దేవకి.
ఈవిధంగా తన బాధను పంచుకుని మరింత సన్నిహితురాలయింది దేవకి రాధాదేవికి.
★★★
చదువుకునే రోజుల్లో మాధవ్ అంటే ఎంతో ఇష్టపడింది రాధాదేవి. రాధాదేవి శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో ఐదుగురు సంతానంలో పెద్దాడపిల్ల.
మాధవ్ ఒక్కగానొక్క కొడుకు. కులంవేరు.
రాధాదేవి తల్లిదండ్రులకి మాధవ్ కులం అభ్యంతరం అయితే, మాధవ్ తల్లిదండ్రులకి రాధాదేవి అంతస్తు అభ్యంతరమైంది.
ఇరువురు ఇరుకుటుంబాలకి నచ్చచెప్ప ప్రయత్నించారు.
“ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి. ఇద్దరు మగపిల్లల్ని చదివించాలి. ఇంటికి పెద్ద ఆడపిల్లవి నువ్వే తప్పటడుగు వేస్తే, నీ బాటలోనే అందరూ వెళ్తారు. చెల్లెళ్ళకు సంబంధాలు రావు. మత్స్యమాంసాదులు తినే అతనితో కాపురం సజావుగా ఉండదు. ఏ ఆలూమగలకైనా ఎంత ప్రేమ ఉన్నా భోజనం సరిగ్గా లేకపోతే ఆ మగాడు కేవలం ప్రేమని ఆస్వాదిస్తూ బ్రతుక లేడు. అలా అని నువ్వు అవి వండిపెట్టగలవా!” అంటూ రాధాదేవికి అనునయంతో తండ్రి ప్రభాకరశాస్త్రిగారు అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ప్రేమపెళ్ళిళ్ళు సాధారణంగా విఫలమవటానికి ముఖ్యంగా ఆహారవ్యవహారాలేనని ఎన్నో ఉదాహరణలు తెలిపారు.
అటు మాధవ్ తల్లిదండ్రులు మాధవ్ ను వారికి అనుకూలంగా నయాన్న భయాన్న లొంగదీసుకున్నారు.
చదువు పూర్తికాలేదు.ఉద్యోగం వస్తుందన్న ఆశలేదు..
జీవితం సినిమా కాదని ప్రస్తుతానికి తల్లిదండ్రులమాటవిని తనకాళ్ళమీద తాను నిలబడ్డాక రాధాదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు మాధవ్.
తండ్రి చెప్పిన మాటలు విన్న రాధాదేవి,”నాన్నా! మీరు నా చదువుకి అడ్డం చెప్పకుండా నేను చదువుకోవాలని అనుకున్నంతవరకూ చదివించండి.” అని ప్రాధేయపడింది.
దానికి ప్రభాకరశాస్త్రి రాధాదేవి తల నిమిరాడు ‘సరే’ అన్నట్లు.
ప్రభాకరశాస్త్రి కి మనస్సులో “అయ్యో ఏమీ అడగని నా చిట్టితల్లి అడిగినది కాదన్నానే!” అన్నబాధ, ఏదో తప్పుచేసానన్న భావన దహించి వేయసాగింది.
రాధాదేవి ఎమ్.ఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రభాకరశాస్త్రి భయపడుతూనే రాధాదేవి తో పెళ్ళి విషయం ప్రస్తావించాడు. తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఖచ్చితంగా చెప్పటంతో చేసేదిలేక రాధాదేవి చెల్లెళ్ళిద్దరికీ వివాహం చేసాడు.
మగపిల్లలిద్దరికి శాస్త్రోక్తంగా వడుగులు, పెళ్ళిళ్ళు చేసాడు.
తండ్రిగా పెద్దకూతురుకి అన్యాయం చేసానన్న బాధతో అనుక్షణం ఆలోచించి మాసివ్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. భర్త చాటు భార్య అయిన సుశీలమ్మ భర్తమరణంతో అయోమయ స్థితిలోకి వెళ్ళింది. పెట్టింది తినడం శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం,ఉలుకూ పలుకూ లేదు.
రాధాదేవి తమ్ముళ్ళిద్దరూ ఒకరు ఢిల్లీలో ఇంకొకరు కేరళాలో ఉద్యోగరీత్యా ఉన్నారు. తల్లిని తమతో ఉంచుకోవాలన్న ఆలోచన ఏమాత్రమూ లేదు.
పైగా పెళ్ళిపెటాకులు లేకుండా ఉన్నఅక్క చూసుకుంటుందిలే అన్న ధీమా.
జీవనస్రవంతిలో మరో మలుపు చోటుచేసుకుంది వారి కుటుంబంలో.
అందరికంటే చిన్నది అయిన చిన్న చెల్లెలు ప్రసవానికివచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బిడ్డని చూడటానికి వస్తున్న వాణి భర్త, విధివంచితుడై రోడ్ ఏక్సిడెంట్ లో అసువులుబాసాడు. ఆవార్తవిన్నపురిటాలు వాణి షాక్ లో కోమాలోకి వెళ్ళింది. వాణి భర్త ఒక్కడే సంతానం వారి తల్లిదండ్రులకు. కొడుకే పోయాక తమకు వారికి ఏసంబంధం లేదని వాణి అత్తమామలు చెప్పటంతో రాధాదేవికి ఏంచేయాలో పాలు పోలేదు. పెద్దచెల్లెలుని, తమ్ముళ్ళను బ్రతిమాలింది. ఎవరూ తాత్కాలికంగా కూడా బిడ్డ బాధ్యత తీసుకునేందుకు సిధ్ధంగా లేకపోయారు.
ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో దేవకి, భార్గవలు గుర్తుకొచ్చారు. దేవకి, భార్గవలను పిలిచి విషయం వివరించి “పిల్లవాడిని పెంచుకుంటారా!” అని అడిగింది రాధాదేవి.
అడగకుండానే వరాలిచ్చినంత సంతోషపడ్డారు దేవకి,భార్గవలు.తడుముకోకుండా వెంటనే అంగీకారం తెలిపారు.
పిల్లవాడికి ఆయే ఖర్చు తానేభరిస్తానని, పిల్లవాడి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తనకు తెలియకుండా తీసుకోవడానికి వీలులేదని ఒప్పందం కుదుర్చుకుంది రాధాదేవి. పసివాడికి తానే వాసుదేవ్ అని నామకరణం చేసింది రాధాదేవి.
★★★
రాధాదేవి ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ
కుటుంబంలో అనుకోని పరిణామాలకు మానసికంగా దెబ్బతిన్న రాధాదేవి మార్పుకోరింది. తల్లి కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు తను చెల్లి వాణి.
ఒకరాయివేద్దాం ఏమవుతుందో చూద్దాం మన్నట్టు కెలిఫోర్నియా యూనివర్సిటీకి పి.హెచ్.డి కి అప్లై చేసింది. వెంటనే పి.హెచ్.డి లో సీటు వచ్చింది. చెల్లెలు వాణిని కేరళాలో పెద్దతమ్ముడు వద్ద కేరళా వైద్యానికి ఉంచి తాను కెలిఫోర్నియాకి బయలుదేరింది రాధాదేవి.
వెళ్ళేముందు భార్గవని కలిసి పిల్లవాడికి ఎటువంటి లోపం రాకుండా ఒక ఇరవై లక్షలు బ్యాంకులో పిల్లవాడి పేరును డిపాజిట్ చేసి వాడిని బాగా చదివించాలని, డబ్బుకి వెనుకాడవద్ధని,తనతో కాంటాక్ట్ లో ఉండమని,వాడిని హయ్యర్ స్టడీస్ కి తనతో అమెరికా తీసుకెళ్తానని, వాడితో
తల్లిదండ్రులుగా వారు రావచ్చని చెప్పి కెలిఫోర్నియాకు ప్రయాణమైంది రాధాదేవి.
★★★
వాసురాకతో మోడుబారిన దేవకి, భార్గవల జీవితం కొత్తచిగురులు తొడిగింది. వారిజీవితంలో చైతన్యం వెల్లివిరిసింది. దేవకి ఎంతో అపురూపంగా పసివాడి ఆలనా పాలనా చూడసాగింది. కానీపిల్లవాడికి బాటిల్ పాలు పట్టినప్పుడు దేవకి మాతృహృదయం తల్లడిల్లేది. వారి జీవితం వాసు రాకతో పరిపూర్ణత్వం సంతరించుకుంది.
రాధాదేవి ప్రతీ ఆదివారం వీడియోకాల్లో వాడి ఎదుగుదల చేష్టలు చూసి మురిసిపోయేది. వాసు ఐదవ పుట్టినరోజుకి రాధాదేవి ఇండియాకి వచ్చినప్పుడు వాసు కొత్త లేకుండా రాధాదేవి దగ్గరకు వెళ్ళాడు. అమ్మక్క అంటూ ఆవిడిచ్చిన బొమ్మలు, డ్రెస్సులతో వాసుకి రాధాదేవంటే మరింత ఇష్టం ఏర్పడింది. రాధాదేవి వెళ్తుంటే వెక్కివెక్కి ఏడ్చాడు తీసుకెళ్ళమని. వాడిని సముదాయించలేక దేవకి సతమతమయ్యింది. రాను రాను వీడియో కాల్ చేసినప్పుడల్లా అమ్మక్క అంటూ కబుర్లు చెప్పటం.దా!దా! అనిపిలవడం దేవకి మనస్సులో రాధాదేవి అంటే ఈర్ష్య, ద్వేషం, భయం ఉత్పన్నం కాసాగింది. అదేవిషయం భర్త భార్గవతో అంది. భార్గవకి గూడా బిడ్డని తాము పెంచుతున్నా రాధాదేవి సూచనలు విసుగ్గా ఉండేది.
రానురాను రాధాదేవి వీడియో కాల్ చేసినప్పుడు ఎత్తకపోవటం, లేదంటే బయట ఉన్నాం తరువాత చేస్తామనటం, పిల్లవాడు పడుకున్నాడని కుంటిసాకులతో, పదిసార్లు చేస్తే ఒక్కసారి మాట్లాడుతూ మరో రెండేళ్లు గడిచాయి.
వాసుకి ఏడేళ్ళు వచ్చాయి. అన్నీ అర్ధమయ్యే వయసు. ఈవయసులో వాడికి రాధాదేవి కానీ వాడి జన్మమూలం కాని తెలియనివ్వకూడదనుకున్నారు దేవకి, భార్గవలు. వాసు వారికి భగవంతుడిచ్చిన మహాప్రసాదం.అది జారవిడుచుకునే ఆలోచన ఏమాత్రం లేదు.
★★★
ముందు ప్రణాళికగా భార్గవ కాలేజికి రిజైన్ చేసాడు. లేని తల్లికి అనారోగ్యం, ఊళ్ళో తోటలు చూసుకోవాలన్న కారణం చెప్పి స్నేహితులని నమ్మించాడు.
తరవాత ఫోనునంబరు మార్చి కొత్తసిమ్ కొత్తఫోను తీసుకున్నాడు.
ఆతరువాత విశాఖపట్నం నించీ హైదరాబాదుకి మకాం మార్చి ఊరిలో కొంతతోట అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఒకవిల్లా కొన్నాడు.
భార్గవ ఎక్స్పీరియన్స్ కి చైతన్యగ్రూప్ఆఫ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాసుని ‘ఐ.జి.సి.ఎస్.ఇ’ సిలబస్ లో జాయిన్ చేసాడు.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
జన్మతః తెలివిగలవాడు అవటంతోను,భార్గవ
మార్గదర్శకత్వంతో ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు.
బిట్స్ పిలాని విద్యా విహార్ పిలాని రాజస్తాన్ లో సీటు వచ్చింది. దానితో వాసు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది.
కాలం చిన్నప్పటి అమ్మక్కని మరుగున పడేసింది.వాసుదేవ్ కి లోకమంతా తల్లి దేవకి, తండ్రి భార్గవ. బాగా చదువుకో వాలి, పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే పట్టుదలతో చదువుకో సాగాడు.
★★★
రాధాదేవి గత పన్నెండేళ్ళనించీ భార్గవ ఆచూకికోసం ప్రయత్నిస్తూనే ఉంది.ఒక సందర్భంలో పోలీసు కంప్లైంటు ఇద్దామనుకుంది. సహాయం చేసిన భార్గవగురించి తప్పుగా ఆలోచించటానికి మనస్కరించలేదు. దేవకి, భార్గవల మీద రాధాదేవికి ఎంతో నమ్మకం.పొరపాటునకూడా వారి మీద వ్యతిరేక భావన చూఛాయగా కూడా రాలేదు. ఎంతకీ భార్గవ ఏకష్టంలో ఉన్నాడో అనిఆందోళన చెందేది. అలాఅని ఊరుకోకుండా తనకు తెలిసిన మార్గాల ద్వారా భార్గవ్ ఆచూకి తీస్తూనే ఉంది.
తమ్ముళ్ళు, పెద్దచెల్లెలు రాధాదేవిని తప్పుపట్టారు.
” పెళ్ళిపెటాకులు లేవు. తల్లిహృదయం ఏం తెలుస్తుంది? ముక్కుమొహం తెలియని వాడికి ఏదో వస్తువు అప్పచెప్పినట్లు పసిగుడ్డుని ధారాదత్తం చేసింది. ఆమాత్రం ఎవరమైనా పెంచలేక పోయేవాళ్ళమా!” అంటూంటే, ఈ మనుషులేనా ‘మా అత్తవారు ఒప్పుకోరు’ అని పెద్ద చెల్లెలు , ‘మీ మరదళ్ళ వల్లకాదు.’ అని తమ్ముళ్ళు అనటం వల్లనే కదా తాను అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వారి మాటలు శూలాల్లాతగిలి బాధపడింది రాధాదేవి.
రాధాదేవి మనస్సుకి ఎప్పటికైనా వాసు అజ్ఞాతవాసం నించీ తనకళ్ళబడతాడని బలమైన నమ్మకంతో ఉంది.
కెలిఫోర్నియా యూనివర్సిటీలో “క్వాంటమ్ కంప్యూటింగ్” మీద పి.హెచ్.డి లో గోల్డ్ మెడల్ సాధించింది రాధాదేవి.అదే యూనివర్సిటీలో పేరున్న ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నా నీలినీడలా వాసు కళ్ళముందు కనపడుతూ కంటికి కునుకు కరువైంది రాధాదేవికి. ‘ తనేం అనుకుంది? ఏంజరిగింది? జీవితంలో మధురిమని ఏ చెల్లెళ్ళు తమ్ముళ్ళగురించి త్యాగం చేసిందో వారే తనని దోషిగా నిలబెట్టారు.’ అని మధనపడని రోజులేదు.
★★★
భగవంతుడు దయామయుడు.మనంచేసే ప్రతీపని వెనుక ఆయన హస్తం ఉంటుంది. ఆయన దృష్టిని ఎవరూ దాటిపోలేదు.
ఆరోజు కాఫీత్రాగుతూ లాప్టాప్ లో హిందూ పేపర్ చదువుతోంది రాధాదేవి. హఠాత్తుగా ఒక న్యూస్ కాలమ్ రాధాదేవిని ఆకర్షించింది.
“వాసుదేవ్ భాగవతుల ఈస్ టాప్ ఇన్ ఏస్ట్రోఫిజిక్స్ అండ్ కాస్మాలజీ ఎట్ బిట్స్ పిలాని. హి ఈస్ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ బిట్స్ పిలాని అండ్ ప్రౌడ్ సన్ ఆఫ్
భార్గవ్ భాగవతుల అండ్ దేవకి. మిస్టర్ భార్గవ ఫాదర్ ఆఫ్ వాసుదేవ్ భాగవతుల ఈస్ రెండరింగ్ హిస్ సర్వీసెస్ ఫర్ చైతన్యాకాలేజ్ ఏస్ ఫాకల్టీ ఇన్ ఫిజిక్స్.హార్టీ కంగ్రాట్యులేషన్స్.”
రాధాదేవి కళ్ళల్లోంచి కన్నీరు జలజలా కారింది. అది ఒక అద్వైత అనుభూతి.
తప్పిపోయిన బిడ్డ దొరికిన ఆనందం…….
పోగొట్టుకున్నానుకున్న పెన్నిధి దొరికిందనిసంతోషం..
వాసు ప్రయోజకుడయ్యాడన్న గర్వం…,
అమ్మక్క రక్తం వాడిలో ప్రవహిస్తోందన్న తృప్తి….
అంతలోనే ఆ ఆనందబాష్పాల ప్రకృతి మారిపోయి విషాదం నెలకొంది.
భార్గవ ఎందుకిలా చేసాడు?
ఎంతో నమ్మకంతో ఒక ప్రాణం లేని వస్తువుని కాదు, ఒక పెంపుడు జంతువునికాదు, తమ ఇంటి ప్రాణాన్ని తన చెల్లెలు బిడ్డని, తనకే హక్కు లేదు అయినా అనివార్య పరిస్థితిలో నమ్మి తాత్కాలికంగా పెంపకానికి ఇచ్చినందుకు ఇంత మోసం చేస్తాడా!
అంతలోనే రాధాదేవి వివేకం విచక్షణతో ఆలోచించసాగింది.
‘ఔను భార్గవకు తాను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పరాయి బిడ్డను తనదిగా చేసుకోవటమే కాక విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలపెట్టినందుకు తాను భార్గవకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు. పురిటిగుడ్డుని భార్గవ చేతిలో పెట్టిన తనకే ఇంత మమకారముంటే, పెంచి పెద్దచేసిన భార్గవ,దేవకిలకి ఇంకెంత ఉంటుంది. అనుకోకుండా దొరికిన అదృష్టం. చేయి జారిపోతుందేమోనన్న భయాందోళనతో తన ఉనికిని మరుగునపెట్టాడు.గవర్నమెంటు ఉద్యోగానికి రాజీనామా చేసి అజ్ఞాతవాసంలో పిల్లవాడిని ఈ స్థాయికి తేవడం ఒక్కొక్కసారి కన్నతల్లితండ్రులకే సాధ్యంకాదు.’
ఆలోచనలకి విరామచిహ్నంపెట్టి వెంటనే రాజస్థాన్ పిలానికు ఫ్లైట్ బుక్ చేసుకుంది రాధాదేవి.
★★★
యూనివర్సిటీలో అడుగుపెట్టిన రాధాదేవి వాసుదేవ్ భాగవతుల గురించి అడిగింది. తాను వాసుదేవ్ కి పెదతల్లినని గర్వంగా చెప్పుకుంది.
“కూర్చోండి మేడమ్..” అంటూ రాధాదేవికి లాంజ్ చూపించాడు.ఇప్పుడే కబురు పెడతాను అంటూ బాయ్ ని పంపాడు.
గెస్ట్స్ లాంజ్ లో అడుగుపెడుతూనే, ‘ఎవరై ఉంటారు తనగురించి ఇక్కడికి వచ్చేవారు? అమ్మా నాన్నా అయితే కాదు.’ అనుకుంటూ అడుగుపెట్టిన వాసుకి జ్ఞాపకాల పొరలో అట్టడుగున నీడలాంటి ఒక ఆకారం స్ఫురించింది.
అస్పష్టంగా, ‘ అ….మ్మ …క్కా….’ అన్నాడు.
కట్టలుత్రెంచుకొచ్చిన దుఃఖాతిశయంతో నిలువెత్తు వాసుని సంకోచించకుండా కావలించుకుని వాసు గుండెలమీద సేద తీర్చుకుంది రాధాదేవి.
“ఇన్నాళ్ళు ఏమయ్యావు అమ్మక్కా? నీ గురించి అమ్మనాన్నని అడిగితే తెలియదన్నారు.
ఇండియాలో లేవన్నారు. క్రమేపి నేనుకూడా నిన్ను జ్ఞాపకాల అడుగు పొరల్లో ఖననం చేసాను.న అమ్మక్కా!” అన్నాడు వాసు.
“వాసు నేను డైరక్ట్ గా ఎయిర్పోర్ట్ నించీ ఇక్కడికి వచ్చా ఇక్కడ దగ్గరలో హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా! రూముకివెళ్ళిఫ్రష్ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. పన్నెండేళ్ళు గా ఒంటరిగా నేననుభవిస్తున్న మానసిక క్షోభ నీకు చెప్పుకుని నా హృదయం భారాన్ని తగ్గించుకోవాలిరా కన్నా!”
అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాధాదేవి.
వాసుకి అంతా అయోమయంగా ఉంది. ‘ఎందుకు అమ్మక్క ఇంత ఉద్వేగంగా మాట్లాడుతోంది? ఇన్నేళ్ళ తరువాత….’
” సరే అమ్మక్కా! నేను రేపు హైదరాబాద్ వెళ్ళటానికి హాస్టల్ రూము ఖాళీ చేద్దామనుకున్నా. రూము లాక్ చేసి వస్తా.”అంటూ వెళ్ళాడు.
★★★
బ్రేక్ఫాస్ట్ అయ్యాక నెమ్మదిగా, ” వాసూ నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి.నేను చెప్పే విషయాన్ని అన్ని కోణాల్నించి ఆలోచించగల వ్యక్తిత్వం నీకుందని తెలుసు. ఇందులో నాతప్పుంటే నాకు నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి సిధ్ధంగా ఉన్నా తండ్రీ!” అంది రాధాదేవి.
“అదేమిటి అమ్మక్కా! పెద్దదానివి నిన్ను శిక్షించటమేమిటి?”అంటూ రాధాదేవి చేయిపట్టుకున్నాడు.
రాధాదేవి పూసగుచ్చినట్లు వాసు పుట్టటం,అప్పటి పరిస్థితుల్లో తనకు మంచిదనిపించిన నిర్ణయం తీసుకోవటం,తరువాత దేవకి, భార్గవలు ఏవిధంగా తనతో సంప్రదింపులు కోల్పోయారో చెప్పింది. ఒకానొక సందర్భంలో పోలీసు కేసుపెట్టి ఎంక్వయిరీ చేయిద్దామనుకొని వారిని బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నట్లు చెప్పింది.
ఈ పన్నెండేళ్ళు బంధువులతో తాను పడ్డమాటలు వాసుతో చెప్పి ఊపిరి పీల్చుకుంది రాధాదేవి.
ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత గభాల్న వాసు రాధాదేవి కాళ్ళదగ్గర కూర్చొని వళ్ళోతల పెట్టుకుని తనివి తీరా ఏడ్చాడు.
“అమ్మ ఎలావుంటుంది? అమ్మ ఇప్పుడెలా ఉంది. నువ్వు ఆ సాహసం చేయకపోతే నేనెలా ఉండేవాడినో! నేనెంత అదృష్టవంతుడివి.అందరికీ ఒక అమ్మ అయితే నాకు ముగురమ్మలు.అమ్మక్కా!ముందు అమ్మని చూడాలి.తర్వాత హైదరాబాద్ వెళ్దాం అంటూ కేరళాకు టిక్కట్లు బుక్ చేసాడు వాసుదేవ్.
★★★
తల్లి,తండ్రితప్ప బంధువులుఎవరూలేరని ఉదాసీనంగా గడిపిన వాసు మనసు అందరినీ కలవాలని ఉవ్వీళ్ళూరింది.
‘మొదటి సారి తనను నవమాసాలు మోసికన్న కన్నతల్లిని చూడబోతున్నాడు.తల్లిని కనిపెట్టుకుని ఉన్న మేనమామని కలువ బోతున్నాను.’ ఆ ఆలోచనే ఎంతో ఉద్వేగంగా ఉంది అనుకున్నాడు వాసు.
గుమ్మంలో అడుగుపెట్టిన వాసు విరబూసిన మల్లె కుదుళ్ళమధ్య పసిపిల్లలాంటి అమాయకమైన మల్లెపూవులాంటి స్వచ్ఛమైన కన్నతల్లిని చూసాడు.
“అమ్మా!”అంటూ కాళ్ళకి నమస్కరించాడు వాసు.
నిర్వికారంగా నిశ్చలంగా ఉన్న వాణి లో ఏదో చలనం. వాసు వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
“నేనమ్మా!నీ బిడ్డని.” అంటూ వడిలో తల పెట్టుకున్నాడు వాసు.
అప్రయత్నంగా తలమీద చేయుంచింది వాణి.
అ దృశ్యం ‘శతమానం భవతి ‘ అని తల్లి వేద ఆశీర్వచనం చేస్తున్నట్లుంది.
మేనమామ కృష్ణమోహన్ కధనం ప్రకారం తన పనులు తాను చేసుకునే స్థాయికి తేగలిచారు గాని మెదడుకు తగిలిన షాక్ నించీ ఇంకా కోలుకోలేదని,ఎవరూ గుర్తులేరని తెలిపాడు.ఆమె లోకం ఆమెది. ఆకలిదప్పులు ఏమీ తెలియవని,తామేమైనా తినమని ఇస్తే తింటుంది. లేకపోతే లేదని కృష్ణమోహన్ వాసుకి రాధాదేవికి చెప్పాడు.
ప్రస్తుతం వాణి ఎమ్నీషీయాలో ఉందని డాక్టర్లు నిర్ధారించారని తెలిపాడు కృష్ణమోహన్.
“మావయ్యా ‘ఎమెన్షియా’, ‘డిమెన్షియా అంత ప్రమాదకరమైనది కాదు. నాకెందుకో అమ్మని కొంతవరకూ మామూలు పరిస్థితికి తేవచ్చుననిపిస్తోంది.”అన్నాడు వాసు.
“వాసు చెప్పింది నిజమే రా! నువ్వు కష్టపడి దాన్ని ఈ స్థాయికి తెచ్చావు. నేను చెల్లాయిని నాతో పాటే అమెరికా తీసికెళ్ళి వైద్యం చేయిస్తా.అన్నట్లు వాసు ఇంతవాడవటానికి కారణమైన దేవకి భార్గవలకి మనమెంతో ఋణపడి ఉన్నాం. ముందు మనం హైదరాబాదు వెళ్దామని ముగ్గురూ కలిసి హైదరాబాదు వచ్చారు.
. . ★★★
ముందుగా ప్రొఫెసర్ రాధాదేవిని, ప్రక్కనేవాసు, కృష్ణమోహన్ లను చూసిన దేవకి సర్పద్రష్టలా నిలబడిపోయింది.
అది గమనించిన భార్గవ అవాక్కయి సన్నగా గుండె నొప్పితో నేలకొరిగాడు.
“నాన్నా!” అంటూ ఒక్కో ఉదుటున వాసు భార్గవని పొదివి పట్టుకోగా, రాధాదేవి మొహంమీద నీళ్ళు చిలకరించింది.
కళ్ళు తెరిచిన భార్గవ రాధాదెవి కళ్ళలో కళ్ళుపెట్టి చూడలేక దోషిగా తలవంచుకున్నాడు.
ఆపరిస్థితులల్లో దేవకి, భార్గవి ని చూసిన రాధాదేవి వాసుకి కనుసైగ చేసింది. వెంటనే ఒక్క ఉదుటున తల్లిని(దేవకిని) పట్టి ఊపుతూ, “అమ్మా నాకు గోల్డ్ మెడల్ వచ్చిందమ్మా.ఇదంతా మీ ఆశీర్వాదం.” అంటూ దేవకి, భార్గవ కాళ్ళకి నమస్కరించాడు. న్యూస్ పేపర్లో వారిద్దరి పేర్లు చూపించాడు.
“ఎప్పటికీ నేను మీ వాసునే నాన్నా! అందరికీ ఒకే తల్లి.నాకు ముగ్గురు తల్లులు. ఒకరు కన్నతల్లి అయితే ఇంకొకరు మమతానురాగాలు తో పెంచిన తల్లి.మరొకరు నా దశదిశ నిర్దేశించిన తల్లి. ఇంతటి అదృష్టం ఎవరికుంటుంది?” అన్నాడువాసు కంఠం భావోద్వేగంతో పూడుకుపోగా.
భార్గవ మీభయం నాకర్ధం అయ్యింది. మీరు అమితమైన ప్రేమతో చేసిన తప్పు మిమ్మల్ని దోషిని చేయదు.మీరు వాసుని ఇంతటి ప్రయోజకుడిగా చేయటానికి వెనుక మీ ఆలుమగల కృషి అభినందనీయం. మీరు వాసుని ఎంతప్రేమిస్తున్నారన్నది మీరు గవర్నమెంట్ కాలేజీకి రాజీనామా చేయటంలో తెలుస్తోంది.” అంటూ భార్గవని భయం నించీ బయటకుతేవటానికి ప్రయత్నించింది రాధాదేవి.
“కన్నతల్లి కన్నబిడ్డను గుర్తించలేని దుస్థితిలో ఉన్నప్పుడు మీరెందుకు భయపడతారు భార్గవ గారు.” అన్నాడు కృష్ణమోహన్ నిర్లిప్తంగా.
దేవకి అందరికీ కాఫీ కలుపుకొని తెచ్చింది.వాసు అందరికీ కాఫీ ఇచ్చాడు.
“రాధాదేవి గారు మీది ఎంతో విశాలహృదయం. ఎంతో సంస్కార వంతులు కాబట్టి నా తప్పుని నిలదీసి అడగాల్సిన సందర్భంలో సహితం నాకు మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీరు గొప్ప మనస్సుతో క్షమించినా, అది అందుకునే అర్హత నాకు లేదని నా అంతరంగం చెపుతోంది.
వాసు మీవైపు మొగ్గు తున్నాడని, మీరు వీడియోకాల్ చేసినప్పుడు వాడి కళ్ళలో ఆనందం చూసి ఈర్ష్య పడ్డాం.మీకాల్ గురించి వాడు ఎదురు చూడటం,ఆతరువాత వాడు నీగురించి పేచీ పెట్టటంతో వాడు మాకు దూరమౌతున్నాడన్న భయంతో ఈ విధంగా ఫోన్ నెంబరు మార్చటం. మా ఉనికిని గోప్యంగా ఉంచడానికి ఇలా ఇక్కడ సెటిల్ అయ్యాం. కానీ సూర్యుడిని అరచేతితో మూయలేమని ఇప్పుడే తెలుసుకున్నాం.ఇన్నాళ్ళు బిడ్డలు లేని మాకు మాతృత్వపు, పితృత్వపు మధురిమలు ఆస్వాదించడానికి అవకాశం కల్పించిన ఆ భగవంతునికి అవకాశమిచ్చిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.దేవకి కి జన్మించిన కృష్ణుడు యశోదతనయుడుగా నందయశోదలకు ప్రేమ అనే అమృతాన్ని పంచాడు. కానీ శాశ్వతంగాలేడుఅలాగే ఈ వాసుదేవ్ ఈ నందయశోదలకు తన అమృతం తుల్యమైన ప్రేమను పంచి మమ్మల్ని సమ్మోహితుల్ని చేసాడు.దానికి మాకు గర్వంగా ఉంది.ఇక ముందు ప్రయాణానికి రాధాదేవిగారికి సంతోషంగా అప్ప చెప్తున్నాం.” అంటూ వాసు చేతిని రాధాదేవి చేతిలో పెట్టిన నమస్కరించారు దేవకి,భార్గవలు.
రాధాదేవి తో కన్నతల్లి వాణిని తీసుకుని పై చదువులకి అమెరికాకి ప్రయాణమయ్యాడు వాసుదేవ్.
గుండెలనిండా ప్రేమతో మనస్పూర్తిగా ఆశీర్వదించారు వాసుని దేవకి, భార్గవలు.
★★★
“దేవకీ! దేవకీ!” అంటూ హడావుడిగా వంటింట్లోకి వచ్చాడు భార్గవ.
“ఏమిటండీ ఆ గావుకేకలు!” అని కసురుకుంది.రాధ.
“కేకలేంటి మైకు పెట్టుకుని అరుస్తా! మన వాసు భార్గవ. ఎమ్.ఎస్ పూర్తి అయింది.కెలిఫోర్నియా యూనివర్సిటీలోనే టాపర్. అమెరికన్ గవర్నమెంటు వారి స్వంత ఖర్చుతో వాడికి సర్దార్ ఎడ్యుకేషన్ కి బాధ్యతవహిస్తోంది.
మనల్ని గ్రాడ్యుయేషన్ డేకి రమ్మని ప్రయాణానికి కావలసిన ఫ్లైట్ టికట్టుతో కావలసిన డాక్యుమెంట్స్ పంపించాడు మన వాసు.” అంటూ దేవకిని గిరగిరాతిప్పి ఆనందభాష్బాలు రాల్చాడు భార్గవ.
వాసు మ…న… బి…డ్డే…నండీ అంటూ అస్పష్టంగా గొణిగింది దేవకి.
శుభం.
.సమాప్తం
Devulapalli Vijayalaxmi
Devulapalli Vijayalaxmi
దేవులపల్లి విజయ లక్ష్మి విద్యార్హత. Bsc.B Ed వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka) వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.
గబగబా మెట్లుదిగి వెహికల్ పార్కింగ్ దగ్గరకు అడుగులేసింది శారద. హెల్మైట్ పెట్టుకుంటూ ఆకాశంవంక చూసింది వర్షంపడే సూచనలున్నాయేమోనని. ఆతరువాత చుట్టూచూసింది అపరాజిత గురించి.ఫ్రెండ్సతో క్లాప్స్ కొట్టుకుంటూ ఆడుకుంటోంది.
“అప్పూ!”అని కేకేసింది శారద.
“ఆఁ అమ్మా!” అంటూ స్కేటింగ్చేస్తున్నట్లు వచ్చి ఆగింది హోండాఏక్టివ్ దగ్గర అపరాజిత.
“అప్పూ! ఎన్నిసార్లు చెప్పానమ్మా స్కూల్ బెల్ అవంగానే వెహికల్ దగ్గరకు వచ్చి నుంచోమని.అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది.” అంది శారద.
“అమ్మా! ఇవాళ ఉన్న ఒక్క గేమ్స్ పీరిడ్ నువ్వే ఎక్స్ట్రా క్లాసు తీసుకున్నావు.అందుకే కాస్త రిలాక్సేషన్. ” కళ్ళు గుండ్రంగా తిప్పుతూ కాళ్ళతో స్టెప్సు వేస్తూ అంది అపరాజిత.
“సరే డేన్స్ ఆపి బండెక్కు.”అంటూ బండి స్టేండ్ తీసింది శారద.
అందరినీ దాటుకుంటూ స్కూల్ గేటు నించీ బయటకు రావడానికి ఐదు నిమిషాలు పట్టింది.
‘అపర్ణ కాలేజీకి వెళ్ళడానికి పది నిమిషాలు, అక్కడనించీ మ్యూజిక్ క్లాసుకి పదినిమిషాలు,క్లాసు గంట,తరవాత ఇంటి ప్రయాణం ఎంతలేదన్నా అరగంట.ఇంటికి చేరేసరికి గంటన్నర.’ అంటూ మనసులో టైము కేలిక్యులేట్ చేసుకుంది శారద.
‘సాయంత్రం ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు. పనిమనిషి రాలేదు.ఇంటినించీ ఆదరా బాదరాగా స్కూలు కెళ్ళటంతో ఇల్లంతా చిందరవందరగా ఉంది. యూనిట్ రిపోర్ట్స్ తయారుచేయాలి.’అనుకుంటూ తను చేయవలసిన పనుల లిస్టు మననంచేసుకుంది శారద.
ఆలోచనల్లో కాలేజ్ కి వచ్చిన సంగతే గమనించలేదు శారద.గేటుదగ్గర అపర్ణ సిధ్ధంగా ఉంది.
పిల్లలిద్దరినీ మ్యూజిక్ క్లాసులో వదిలి దగ్గరే ఉన్న కూరగాయల షాపుకెళ్ళ కూరలు తీసుకుంది.
మ్యూజిక్ క్లాసు అవుతున్నంతసేపు పేరెంట్స్ పూలమొక్కలదగ్గర బయట కుర్చీల్లో కూర్చొని ఖబుర్లు చెప్పుకుంటారు.శారద వింటున్నట్లు తలపంకిస్తూ తోటకూర శుభ్రచేసి చిక్కళ్ళువలిచి, మెరపకాయలు తొడిమలు తీసింది.
‘హమ్మయ్య రేపటికి కూర రెడీ.’అనుకుంది మనసులో శారద.
ఈలోపు పిల్లలు మ్యూజిక్ క్లాసు అయింది.పిల్లని ఎక్కించుకున్న వెంటనే ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టింది.కాదు పెట్టిస్తారు పిల్లలు.క్లాస్ రూమ్ ఖబుర్లతో,గిల్లికజ్జాలతో,ఎక్కిరింతలతో,వారి చేష్టలు శారద మనస్పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఇల్లు దగ్గర పడుతోందంటే వాళ్ళ అల్లరి తారాపధం చేరతుంది. శారదకి బండి బేలన్స్ చేయటమే కష్టమవుతుంది.
“అమ్మా!హాట్హాట్ బజ్జీ స్నాక్స్ ఆకలేస్తోంది.” అంది అపరాజిత.
“చాల్లే అప్పూ!జాండీస్ తగ్గి వన్మంత్ కాలేదు ఆయిలీ ఫుడ్.” అంటూ కసిరింది అపర్ణ.
“అమ్మా ! బేకరీలో దిల్పసంద్ తీసుకో మళ్ళీ ఏ ప్రిపరేషన్ వద్దు .”అంది అపర్ణ.
ఇద్దరికీ సమాధానం చెప్పకుంండా ఇంటిదగ్గరకి వచ్చి ఆపింది శారద.పోర్టికోలో బండి ఆపి తాళం తీయంగానే చిన్నారిసింధూ తోకాడిస్తూ మీదకొచ్చింది.
“అప్పూ!స్నూపిని వాకింగ్ తీసికెళ్ళు.” అంటూ కాళ్ళకడుక్కొని వంటింట్లోకి వెళ్ళి గ్లాసుల్లో ప్రొటీనెక్స్, ప్లేట్లల్లో బొప్పాస ముక్కలతో వచ్చింది శారద.
“పిల్లలూ! పప్పాయ్యాతిని పాలు తాగి ఇల్లు సర్దండి.ఇవాళ డాడీ ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు.” అంటూ ఒకకప్ టీ సిప్ చేసి పాతచీర కట్టిగిన్నెలుతోమ ఉపక్రమించింది శారద.
బొప్పాసముక్కలు పాలు చూడంగానే పిల్లల మొఖాలు మాడిపోయాయి.అయినా తల్లి. హడావుడి చూసి నోరు మెదపలేదు బంగారుతల్లులు.మెదలకుండా పండుతిని పాలుతాగి వాళ్ళగదిలోకెళ్ళి చదువుకోసాగారు.
నెమ్మదిగా వంట పూర్తిచేసి తనుకూడా ఫ్రష్ అయి కూర్చొంది శారద.
‘రిపోర్ట్ వర్క్ ఉంది వాళ్ళు వచ్చి వెళ్ళాకగానీ ఆ పని చేయలేను.’అనుకుంది శారద.
‘ఛీ ! ఏమిటో ఆడదాని జీవితం.ఎంత చదువుకున్నా గిన్నెలు,బట్టలు వంట,పిల్లలని కనటం,వాళ్ళ పెంపకం అంతా ఆడదాని మొహానే రాసాడు భగవంతుడు.ఏదైనా తేడావస్తే ‘ఆతల్లి పెంపకం’ అంటూ సమాజం తల్లినే వేలెత్తి చూపుతుంది .తాతయ్య అన్నట్టు ‘బి.ఏ.’చదివినా బియ్యం కడగక తప్పదే శారదా అనేవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే.”
ఆలోచనలలో వాకిట్లో కార్ హారన్ వినపడలేదు శారదకి.సింధూ గేటుదగ్గరకెళ్ళి ఒబీడియంటుగా తోక ఊపుతూ డాడీ ని స్వాగతిస్తోంది.శారదవెళ్ళి గేటు తీసింది.
కారుపార్కు చేసి”పిల్లలేరి శారదా?అన్నిసార్లు హారన్ కొట్టినా రాలేదు.”అన్నాడు వంశీకృష్ణ.
“చదువు కుంటున్నారు వాళ్ళగదిలో!”అంటూ అనుమానంతో గదిలోకి వెళ్ళింది శారద.
‘పుస్తకం హస్తభూషణం’ అన్నట్లు చేతిలో పుస్తకంతో కునికి పాట్లు పడుతున్నారు పిల్లలు.
శారద మాతృహృదయం తల్లడిల్లింది.’పిచ్చితల్లులు నాలుగింటికి లేచి అలసిపోయారు.స్కూలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇల్లు. స్వంతఇంటిని అనుభవించాలని ఉండటమేకాని దేనికీ దగ్గరకాదు.”అనుకుంది శారద.
వంశీ !టీ పెట్టనా!”అడిగింది.
“తప్పకుండా! ఇవాళ ఆడిటింగ్ కాదుగానీ పిచ్చెత్తిపోయింది. డిన్నరుకు వాళ్ళు ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో వస్తానన్నారు.”అంటూ ఫ్రష్ అవటానికి వెళ్ళాడు.
“తల్లులూ రండి డిన్నరుకు చేసి పడుకోండి రేపెటూ సెలవేకదా చదువుకుందురుగాని.”అంటూ కేకేసింది శారద.
“డాడీ వచ్చారా?అమ్మా!”అన్నారు ముక్తకంఠంతో.
“వచ్చారు.కారు హారన్ కి మీరు లేవలేదు మీ చెల్లెలు రిసీవ్ చేసుకుంది. క్రెడిట్సన్నీ దానికే.”అంటూ నవ్వింది శారద.
“ఆయ్!”అంటూ ఇద్దరూ స్నూపి వెంట పడ్డారు.అది వంశీ కాళ్ళసందులోదూరి అరవసాగింది.
సారీ డాడీ అంటూ తండ్రికిరుపక్కలా గారంగా. చేరారు.
కంచాలదగ్గరకి ఈదురో అంటూ వచ్చిన అప్పూ అపర్ణలు” వావ్!” అంటూ ‘హైఫై’ ఇచ్చుకున్నారు.
బాదంపౌడరు స్పెషల్టచ్ సేమియాపాయసం, ఆనియన్ పకోడీ ,చోళే బటూరా,దధ్ధోజనం.
“అమ్మా!ఇవి గెస్ట్స్ కని చేసావా మాగురించా.” అంటూ తల్లిని వాటేసుకున్నారు.
★★★
వంశీకృష్ణ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్.ఇవాళ చాలా చికాకుగా ఉంది.వంట్లో నలతగా ఉంది.
“ఇన్సపెక్షన్ కి సైట్ కి వెళ్ళాలి.అమ్మకి వంట్లోబాగాలేదన్నమెసేజ్ ఒకమూల కలవర పెడుతోంది.దసరా సెలవలకి శారద పిల్లలు పుట్టింటికి వెళ్ళారు.ఇంటికెళ్ళి చెయ్యకాల్చుకోవాలి.పిల్లలకి టర్మ్ ఫీజుకట్టాలి హౌసింగ్ లోను హౌస్టాక్స్, వగైరా వగైరాపోనూ ఇంటి ఖర్చుకి బొటాబొటి ఇరవై ఇరవై ఐదు మధ్యలో మిగులుతుంది ఇంటిఖర్చుకి. మధ్యలో మెడికల్ ఖర్చు లేకపోతే.
ఇదిలా ఉండగా హెడ్ఆఫీస్ నించీ టార్గెట్ రీచ్ అవలేదని షంటింగ్.”ఎవరిమీదో ఎందుకో అర్ధం కాని కోపం చికాకుగాఉంది వంశీకి.
వంశీకృష్ణకి ఛీర్ఫుల్ అండ్ అండర్స్టాండింగ్ పర్శనాలిటీ అని సబ్స్టాఫ్ నించీ హెడాఫీస్ వరకూ పేరుంది.అంతేకాదు సిన్సియర్ అండ్ హైలీ డిసిప్లైన్డ్ అని కూడా భయపడతారు.
వంశీకృష్ణ చికాకుకి అసలు కారణం ఒక ప్రాజెక్ట్ కి కోటిన్నర సాంక్షన్ చేయమని ప్రషర్.కావాలంటే కమీషను తీసుకోమని.ఒక్క కాగితమూ సరిగ్గాలేదు.ఆల్రడీ ముఫ్ఫై లక్షలు సాంక్షన్చేసి సైట్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీలేదు.ఆ పార్టీ దర్జాగా ఖరీదైన కారులో బ్యాంకుకు వచ్చి సొల్లు ఖబుర్లు చెప్తాడు.ఆమినిస్టరు ఈ ఏక్టరు తన బంధువులంటూ.వళ్ళుమండిపోయి ఉన్నదున్నట్లు రిపోర్టు పంపినందుకు హెడాఫీస్నించీ దొబ్బులు. ఉద్యోగం రిజైన్ చేసి పారేద్దామనిఉంది వంశీకృష్ణకి.
‘ఛ! వెధవ బ్రతుకు. ఎన్ని అవాంతరాలొచ్చినా ఉద్యోగం చేయక తప్పదు.అదే ఆడది కావాలంటే ఉద్యోగం చేయకపోయినా భర్త తెచ్చింది తిని హాయిగా ఇంటిపట్టున ఉన్నా ఎవరూ ఎద్దేవా చేయరు.అదే మగవాడైతేఎన్నెన్ని మాటలంటారు.”ఆడంగివెధవ.పెళ్ళాం సంపాదిస్తే తిని కూర్చుంటున్నాడు.ఉద్యోగం పురుషలక్షణం అని కూడా తెలియదు.”అని ఎద్దేవా హేళన చేస్తారు.జీవితంలో అన్ని కష్టాలకంటే ఆర్ధికంగా సంసారాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపేందుకు ఎంతో మానసికమైన వత్తిడికిమగవాడు గురౌతాడన్నది ఎవరికీ తెలియదు. వాడికేం మగ మహరాజు ఇంటికెళ్ళేసరికి హారతి పళ్ళెంలో వండి వార్చిపెడుతుంది పెళ్ళాం. అంటారు.ఆ వండి వార్చటానికి కావలసిన ముడిసరుకుకు మగవాడు పడే తిప్పలు ఎవరైనా ఆలోచిస్తారా? ఛీ! ఈ మగవాడిగా పుట్టడం కన్నా అడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అనుకున్నాడు వంశీకృష్ణ.
★★★
అర్ధరాత్రి రెండున్నర వరకూ కూర్చున్నా క్వార్టర్లీ పేపర్ కరక్షన్లు పూర్తికాలేదు.ఇంకాఒక్కరోజుంది స్కూలు రిఓపెనింగ్ కి.ఎవరి క్లాసుమార్కలిస్టు వాళ్ల కి అందచేయాలి.సెలవలకి నాలుగురోజులు ఊరెళ్ళేసరికి వర్కంతా డిలే అయింది. పిచ్చెక్కినట్లుంది శారదకి.
“శారదా!ఆ లైట్ ఆపేయి.ప్రొద్దున్నించీ గొడ్డుచాకిరి చేసి రాత్రికాస్సేపు ప్రశాంతంగా పడుకుందామంటే ఆ వెలుతురు బెడ్రూం వరకూ వస్తోంది.”ఆసహనంగా అరిచాడు వంశీ.
“ఎక్జామినేషన్ పేపర్స్ కరక్షన్ చేసుకుంటున్నా వంశీ.సారీ బెడ్రూం తలుపేసుకోండి.”ఎంతో సౌమ్యంగా జవాబిచ్చింది శారద.
“బోడి ఉద్యోగం.ఏదో పెద్ద ఉద్యోగం వెలగపెడుతున్నట్లు అర్ధరాత్రి ఏంపని?గుడ్డిగుఱ్ఱానికి దానా ఎక్కువన్నట్లు సంపాదన తక్కువకానీ ఉద్యోగం చేస్తున్నానన్న పోజెక్కువ.”అన్నాడు చిరాగ్గా వంశీ.
శారద అహం దెబ్బతింది.”అవును బోడి ఉద్యోగమే.గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని మీకు వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలా ఉందామని ఈ ఉద్యోగం చేస్తున్నా.ప్రొద్దున్న నాలిగింటికి లేచి పిల్లలని చదివించాలి.పనిమనిషి రాకపోతే గిన్నెలుతోమడం,బట్టలుతకడం,ఇల్లూడవడం వండి కేరీర్లుకట్టడం ఇవన్నీ కూడా బోడిపనులే.నా ప్రాణానికి ఇద్దరూ ఆడపిల్లలువాళ్ళకి జడలువేసి మీతో పాటు వాళ్ళని పంపి.నేను ఇల్లుచక్కపెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ స్కూలుకెళ్ళేసరికి ఏరోజు ఆఖరి నిమిషం లేదా లేటు.
సాయంత్రం మ్యూజిక్ క్లాస్,కూరలు,వెచ్చాలు కొనటం కూడా బోడి పనులే.బండి నేర్చుకుని తప్పుచేసా ఆడపని మగపని చేస్తుంటే మీకేం తెలియటంలేదు.ప్రొద్దునే టిప్టాప్ గా రెడీ ఆయి కారులో ఎంచక్కా బ్యాంక్ కి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి అలసిపోతారు.ప్రొద్దున్నించీ స్కూల్లో పిల్లలతో వాగివాగి అదెంత అలసి పోతోందో అని ఎప్పుడైనా ఆలోచించారా!పైగా బోడి ఉద్యోగమట బోడి ఉద్యోగం అంటారా! ఆ బోడి టీచర్లు పాఠాలు చెపితేనే మీరింతవారయ్యారని మరవకండి. ఛీ!వెధవ ఆడజన్మ.ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానునైపుట్టినా బాగుండేది.”అంటూ ముక్కుచీదుకుంది శారద.
★★★
పనిమనిషి రాదని మూడుగంటలవరకూ నిద్రపోని శారద ,నాలుగు గంటలకల్లా లేచింది. చలిలో గిన్నెలు తోముతున్న శారదనిచూసివంశీకృష్ణ గుండె తరుక్కు పోయింది.బ్యాంకు గొడవలతో చికాకుగాఉండి
ఎక్కవగానే కసిరాననుకున్నాడు.
“శారదా! నాకుసారీచెప్పటం ఇష్టముండదు.నేను ఆడది హాయిగా ఉంటుంది. మగవాడే కష్టపడతాడనిపించి అలామాట్లాడాను.” అంటూ సింక్ లొ గిన్నెలు కడుగుతున్న భార్యబుజంమీద అనునయంగా చేయివేసాడువంశీ.
సరేలెండి మీటెన్షను అర్ధంచేసుకున్నా.అందరూ డబ్బుకోసం ఉద్యోగంచేస్తే మీది డబ్బతోనే ఉద్యోగమయ్యే.ఏంతేడాచ్చినా జేబులోంచి కట్టుకోవాలి. కాకపోతే నన్నూ నా ఉద్యోగాన్ని ఏమన్నా ఊరుకోను.”అంది పూర్తిగా భర్తకి లొంగకుండా.
★★★
దుప్పట్లోంచి లేవకుండా సైలంట్ గా అమ్మానాన్నల సంభాషణ విని. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని నవ్వుకున్నారు పిల్లలు.రాత్రి తల్లిదండ్రుల హాట్ డిస్కషన్ విని వాల్కెనో ఎరప్షన్ అనుకున్న అపర్ణ అపరాజితలు.
★★★
‘ఏమైనా ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానై పుట్టినా బాగుండేది.’ అందిశారద కాఫీ సిప్చేస్తూ.
‘ఔనౌను!మగవాడిగా పుట్టడంకన్నా ఆడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అన్నాడు వంశీ క్రీగంట శారదని చూస్తూ.
“డాడ్! బోత్ ఆర్ ట్రీస్ అండ్ దె గివ్ షెల్టర్ టు అదర్స్.”అంది అప్పూ దొంగలాగ తండ్రి వెనకచేరి.
“అమ్మా!నువ్వలా మాట్లాడితే మాకు భయంగా ఉందమ్మా! మేము నీలా ఆడపిల్లలం కదమ్మా!” అంది అపర్ణ.
శారద వంశీలు తమ తప్పు తెలుసుకున్నారు.
సంసారమనే రథానికి భార్యాభర్తలిద్దరూ చక్రాల్లాంటివారు.అందులో ఏచక్రం గొప్పదని చెప్పగలం. ఏ చక్రం లేకపోయినా బండి సజావుగా నడవదు.రెండుచక్రాలమీద భారం సమానంగా ఉంటేనే సంసారరథం సాఫీగా సాగుతుందని
తెలిసినప్పటికి స్త్రీ పురుషులు తాత్కాలికమైన శారిరక,మానసిక,ఆర్ధిక వత్తిడి లో ఎవరికి వారే వారే సంసారభారాన్ని మోస్తున్నామనుకోవటం పరిపాటి కొంచెం విచక్షణతో ఆలోచిస్తే ఎవరి కష్టం వారిదన్న సత్యం స్ఫురిస్తుంది.
సర్వేజనా సుఖినో భవంతు.
కడుపు సేతెట్టుకుని,కూలి సేసుకుని
కుసింతగ గెంజి నీళ్ళు తాయి,
పది పరక మిగిల్సి
అమ్మ అయ్య బువ్వకి పంపిస్తూ
సల్లంగ ఉందేమని
పొరుగు రాష్టానికి బోయిన మమ్మలీని
మాయదారి రోగాలొచ్చి ముంచినాది
దేవుడో ! దేవుడా!
కూలి బందాయెనని ఓళ్ళూ.. చెరువు పూడ్చినామని ఓళ్ళూ… గుడిసెలెక్కబీకినారు,
కూలి లేక,గుడిసే లేక తిన మెదుకు లేదాయె పో!
తాగ బుక్కెడు గెంజి లేగపాయె!
సొంతూరు బోవ సేతీలో పైసాలు లేక
రైలుకు పైసలు లేక,బొస్సు కూ లేక,బండీ లేక
మా బతుగులు బండలాయె గదరా
దేవుడో ! దేవుడా!
సావో బదుగో ఉన్నూరు బోవాల
అమ్మని నాయన్ని సూడాలని
మూట ముల్లె సరదుకొని నెత్తినెట్టుకొని
కడుపున్న ఆలిని,ఒక సేతట్టుకొని,
సంటిదాన్ని సంకనెట్టుకొని,
సెప్పుల్లేని కాళ్ళతో ఎండలో,ఆనలో
జఱ్ఱి గొడ్డులాటి తారు రోడ్డు మీద
నడుత్తుంటే ఎంతకీ దూరం తరగకబాయె,
రోజులు వారాలాయె వారాలు నెలలాయె,
కాళ్ళు బండలాయె
సంటిది శోసొచ్చి
ఎండకొట్టి,ఆనకి తడిసి సచ్చిపోనాది
ఏడుద్దామంటే గొంతు బెగలక బాయె
ఆనాటి రోజులే కన్నులకు కట్టె…
కల్ల నీల్లు రావాయె
దేవుడో! దేవుడా!
ఒక బరువు తగ్గినాదని సంతోషమాయె
గందా మరి మోయతాలికి నాకేడకట్టం?
బండలు పిండి సేసిన కండలాయె నాయి,
గాని బిడ్డ ఆకలంటే. నాతావేంటుంది?
మట్టి బీడులో కట్టెతో గుంత తవ్వి
గుండె రాయి సేసుకొని బిడ్డను పూడ్సా!!!
ఆనాటి రోజులే మళ్ళీ మళ్ళీ వత్తాండె ..
దేవుడో!ఓరి దేవుడో!
మా బదుకులిట్టా బుగ్గి సేయబోకు
దేవుడో!ఓరి దేవుడో!
పోయిన బిడ్డను సూసి మాట మరిసి
కడుపులో బిడ్డతో నా యాడది
కష్టపడతాంటె ఆదుకోడానికి
సేతకాని మొగోన్ని నేను.
” ఏమయ్యా! కడుపునొస్తోంది ఇంకెట్లనయ్యా అన్న దాని మాటకి తలెత్తిసూసినా!
నా వల్ల కాదని ఆడనే సతికీలా బడినాది నా యాడది.నేనేటి సేతునో
దేవుడో ! ఓరి దేవుడో!
మూటలోని పాతసీర తీస్తి,
బుజాలంట జోలె కట్తి,
నాయాలిని కూకుండెట్టి
నా పయానం సాగించా!
పగోనికీ ఆ కష్టాలు రావద్దు
నా పేరు శి య్య,
ఆ శివయ్య గంగనెత్తి నెత్తుకున్నాడంట
సగం పార్వతిఅయ్యాడంట.
మా ఊరి పంతులు సెప్పిండు.
నాకు సానా సానా. తుప్తిగాఉంది
నేను ఆ శివయ్యకి తీసిపోనని.
నా ఆలిని నా జోలె లో కూకుండెట్టి మోస్తున్నా!
కట్టాలు నీవే ఇత్తావు ఉపాయమూ నీవే సెప్తావు
దేవుడో ! ఓరి దేవుడో!
సితరాల దేవుడో!
.* * *
అడుగులు పరుగులాయె
అల్లంత దూరానఊరాయె!
ఆనాటి కథలన్నీ ఏకరువులేనాయె…
* * *
అదిగయే బవానీ ఊరొచ్చేసినాది
అమ్మతావుకి బోయ
ఏడి ఏడి నీళ్ళోసుకొని
ఉడుకుడుకు బువ్వతిందామె! నులకమంచంలో పెసాంతంగా తొంగుందాం!
దిగయే! పల్లకీలా అమ్మోరు లెక్క కూసున్నావు.
* * *
అంటూ జోలేదింపిన శీవయ్య కి ఉలుకు పలుకు
లేని కట్టె జారిపడింది
నాలుగు నెలల కడుపుతో మొదలు పెట్టిన ప్రయాణం ముగిసింది.
ఎడపిల్ల చావు,సరి అయిన ఆహారమే లేక బిడ్డ కడుపు లో
అడ్డం తిరిగింది కూడా తెలియని స్థితిలో భవాని శివయ్యను వదిలి శివ సాన్నిహిత్యం
చేరింది.
* * *
భోరు భోరుమంటూ గుడిసె దగ్గిరకెళ్ళి తల్లిని
పిలువబోవ పందుల గుంపు గుర్రు గుర్రు మంటూ
మీద పడ్డాయి.
దూరాన గుడిసె లోంచి గవరయ్య,
“శివయ్యా! వచ్చినా వా! శివయ్యా!
ఊరు శశానం అయి పోయినాదిరా!
ఊరిలో సగానికి సగంమందిని ఆనాడు కరోనామహమ్మారి పొట్టనెట్టుకున్నాది ఎవ్వురీకీ ఒక్క అగ్గిపుల్ల ఖర్చెట్టలేదురా శివయ్యా!
ఊరి శివార్లలో ని శివయ్య ఊరుని మరిసాడు
ఆనాటి ఏడుపు మళ్ళ మళ్ళ వచ్చేత్తాంది
* * *
దేవుడో !ఓరి దేవుడో! ఏమి మాయ సేసావురా?
బంగారు తల్లి ని బిడ్డని పోగొట్టుకొని,నా ప్రాణమైన నా బవాని ని పోగొట్టు కొని అమ్మ వడి కని వడి వడిగా వచ్చిన నాకు అమ్మ అయ్య ని అట్టుకెళ్ళినావే
దేవుడో! ఓరి దేవుడో ! నువ్వుండావా? అసలుండావా?
పొట్టకూటికోసం సొంత ఊళ్లకు దూరం అవుతున్న ఎందరో … ఎన్నెన్నో …లెక్కలేనంతమందికి అంకితం.
“రత్తాలూ!ఓ రత్తాలక్కా !సీరలేమైనా.ఉన్నాయేందే” అంటూ గుడిసె ముందున్న సిమెంటు తొట్టి లో నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటూ కేకేసింది పోచమ్మ.
“అవు వున్నయిగనీ మూట ఇప్పలేదు అక్కా!ఉతకలే,ఇస్తిరీ సేయలా!రెండు రోజులసందె జొరం.”
అంటూ మూలిగింది రత్తాలు.
“అయ్యో సెప్పకపోతీవి.జరంతలోమంచిగా పప్పుసారు బువ్వ తెస్తా.కుసింతబువ్వతిని డోలో ఏసుకో తగ్గుద్ది. పొద్దుగాలే రోడ్లట్టకు తిరగాలాయే.ఛీ! రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయెపో!” ఆప్యాయంగా అంటూ తన రేకుల షెడ్డు వైపు వడివడిగా అడుగులువేసింది పోచమ్మ.
ఆ బస్తీలో అన్నీ రేకులషెడ్డులే కాలవకి ఆనుకొని.అక్కడ ఆడమగా అందరూ ఏదో చిన్నాచితకా కూలిపనులు చేసుకుని పొట్ట పోసుకునే వారే.అందరూ ఒకరి కష్టం ఒకరు తెలుసుకుని ఒకరికొకరు ఆదుకునేవారే.అదే ఆ బస్తీ ప్రత్యేకత.
★★★
రత్తాలు చాలా తెలివైనది.కొడుకు రెండేళ్ళవాడని కనికరం లేకుండా యాదయ్య రత్తాలుని వదిలేసి ఓటక్కులాడిని చేసుకొని పోయాడు.ఇదంతా సర్వసాధారణం ఆ బస్తీలో.
యాదయ్య వెళ్లి పోతానన్నప్పుడు గుండెలు బాదుకొని ఏడవలేదు, గొడవపడలేదు రత్తాలు. పంచాయితీ అన్నారు బస్తీలో కొందరు.వద్దన్నది రత్తాలు.తనంటే ఇష్టం లేని మొగోనితొ కాపరం చేసినా చేయకపోనా ఒక్కటే అని మౌనంగా ఉంది.
“రెండేళ్ళపిల్లోడిని సదివించాల.మంచికొలువులో ఎట్టాల.ఈ మురికికాలవకి దూరం పోవాల”ఇదే పగలూరాత్రి నల్లపోచమ్మ గుడిలో కూచొని ఆ తల్లికళ్ళలోకి చూస్తూ మౌనంగా మాట్లాడేది రత్తాలు.
ఆసంకల్పంతో భర్త వెళ్ళాక ఇల్లంతా వెతికి అక్కడ ఇక్కడ దాచిన ఒక వెయ్యి పోగేసింది.పోచమ్మని తీసుకుని స్టీలు ఫేక్టరీకి పోయి స్టీలుసామాన్లు కొంది.మరుసటిరోజు ఒక గంపలో స్టీలు సామాన్లు సర్దుకొని.పిల్లవాడిని జోలెలో కూర్చోపెట్టుకొని,”పాత సీరలకు స్టీలు సామాన్లు ఇస్తామమ్మా”, అని అరచుకుంటూ అంటూ వీధి వీధి ఎండనక వాననక తిరిగేది.
మొదట్లో ఎవరోపిలిచి పాతచీరలిస్తే దానికి తగ్గ సామానిచ్చేది.రాను రాను గృహిణులకి రత్తాలు బాగా. అలవాటైంది.జోలెలోని పిల్లడు కూడా కొంత కారణం.పాతచీరలు నాలుగైదుండగానే రత్తాలు దగ్గిర సామాన్లు కొనే వాళ్ళు.కొంతమంది అయితే “ఒసే! రత్తాలు ఈసారి పులిహార పళ్ళెంతేవే అనో లేకపోతే బియ్యం పోసుకునే డబ్బా తెచ్చిపెట్టు” అంటూ డిమాండ్ చేసేవారు.వాళ్ళ డిమాండ్ కి తగ్గట్టు స్టీలు సామాన్లు తెచ్చేది.ఆ ఇళ్ళవాళ్ళు వాళ్ళ పాతబట్టలకి ఏదో ఒకటి వస్తోందని పెద్ద పట్టించుకునేవాళ్ళుకాదు.పైపెచ్చు రత్తమ్మ డిమాండ్ చేసినంత క్యాష్ పెద్దవస్తువులకి ముట్టచెప్పేవారు. అంతేకాదు నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటూ బిగుతైన ప్యాంట్లు, చిన్నపిల్లల బట్టలు పడేసేవారు.
“ఓ!అమ్మో! సీరలకైతేనే సామానిత్తా. ఈ పాంటులకి,పిల్లోళ్ళ బట్టలకి నేనేమివ్వా.” అంటూ ఖరాఖండిగా చెప్పేది రత్తాలు .
” ఏదోఒకటి చేసుకోవే!ఇవన్నీ పెట్టే స్థళంలేదుఅన్నీ బిగుతైనవే మా వాళ్ళకి” అంటూ పడేసేవారు రత్తాలుకి.
అప్పడప్పుడూ షెడ్మీద సొరతీగకి కాసిన సొరకాయలు,తొట్టిదగ్గర మల్లెచెట్టుకి పూసిన మల్లెలు ఆఇళ్ళవాళ్ళకి బహుమానంగా ఇచ్చి,వాళ్ళపనిమనిషి రాకపోతె బాసాన్లు తోమి ఆ ఇళ్ళవాళ్ళకి సన్నిహితురాలయిందిరత్తాలు.
సామాన్ల బదులు వచ్చిన చీరలన్నీ తీసి అందులో ఫాల్ ఊడినవి,జరీ చీరలు,కొంచెం చిరిగిన చీరలు విడి విడిగా చేసి బస్తీలో మిషను కుట్టే సీతమ్మ చేత రిపేరు చేయించి వాటిని ఉతికి ఇస్త్రీ చేయించేది.ఆ చీరలు అమ్మకానికి పెట్టేది రత్తాలు.పిల్లల బట్టలు బస్తీలో పిల్లలకి ఉచితంగా ఇచ్చేది. జీన్స్ ప్యాంట్లు కుర్రకారుకి చవకగా ఇచ్చేది.ఈ విధంగా రత్తమ్మ బస్తీలో మంచిపేరు తెచ్చుకుంది. చీరలమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకుని మిగిలిన దంతా స్టీలు సామాన్లు కని ఖర్చు పెట్టేది.
. ★★★
ఇలా రెండు సంవత్సరాలు కాలంలో కలసి పోయాయి.రత్తాలు కొడుకు సురేసు నాలుగేళ్ళ వాడయ్యాడు.రత్తమ్మకి అసలు కష్టం ఇప్పుడు మొదలైంది.పిల్లవాణ్ణి ఇంట్లో వదలలేదు తను ముందు లాగా పిల్లవాణ్ణి జోలెలో కూర్చోపెట్టుకొని నెత్తి మీద బుట్ట, బట్టల మూటతో మోయాలంటే చేతకావటంలేదు.పోచమ్మ గుడి ముందు కూర్చొని మౌనంగా కష్టం విన్నవించుకునేది.
ఒకరోజు ఒక పెద్ద. గేటుముందాగి “పాతబట్టలకి స్టీలు సామాన్లు ఇస్తా “అంటు గట్టిగా అరచింది రత్తాలు.
లోపలనించీ ఒక నడివయసు ఆయన వచ్చి.” ఇది అనాధాశ్రమం.మేమే వాళ్ళూవీళ్ళు ఇచ్చిన డబ్బు బట్టలు గిన్నెలు తీసుకుంటాం”అంటూ గేటు మూసేసాడు.
మరొకసారి రత్తాలు తిరిగి వస్తుంటే అదే గేటు నుండి చాలామంది పిల్లల సందడి వినిపించి నెమ్మదిగా గేటు తీసుకొని వెళ్ళింది.అక్కడ ఒక ఆజాను బాహుడయిన నలభై ఏళ్ళ వ్యక్తి ముప్పైఐదేళ్ళ స్త్రీ ఆరుబయట పిల్లలని చుట్టూర కూర్చోపెట్టుకునిచదువు చెప్పటం చూసింది.
“అమ్మా ‘అంటూ పిలిచిందిరత్తాలు నెత్తిమీద గంపనేలమీద పెడుతూ.
“ఎవరమ్మా!చెప్పు. ఏంకావాలి? అంటూ ఆప్యాయంగా అడిగింది ఆ స్త్రీ.
“అమ్మా ఈడ అమ్మా అయ్యా లేనోళ్ళేనా నాబోటోళ్ళ పిల్లలుకూడా ఉన్నారా?”అని అడిగింది రత్తాలు.
“నీకు భర్త ఉన్నాడా?ఉంటే ఏం చేస్తున్నాడు”అంటూ అడిగింది ఆస్త్రీ.
‘”లేడమ్మా!ఈ పిల్లగాడు రెండేళ్ళ సందె వదిలేసి ఏరే ఆమెను కట్టుకున్నాడు. ఈపిల్లగాని జోలెలో ఏసుకొని ఈ గంపనెత్తినెట్టుకొని గల్లీలంట తిరుగాడతూ స్టీలుసామాన్ల యాపారం సేసుకుంటున్నా.పోరడు నాలుగేండ్లు అయినాయి. ఎత్తుకోలేను.ఈడా నడసలేడు.మీరు దయెట్టి నా పోరడ్నికూడా ఈపిల్లగాళ్ళతో ఉంచుకుంటే నే సాయంమాపు పిల్లగాన్ని తోలుకు పోతా”అంటూ ఆశగా చూసింది రత్తాలు.
“రత్తాలు!నాపేరు శాంతి.ఈ సార్ నా భర్త.ఈ ఆశ్రమం కేవలం అనాధలకే కాదు. పిల్లలని పోషించుకోలేని ఆశ్రయం లేని మీలాంటి పేదలకి కూడా.ఇక్కడ రైల్వే స్టేషన్లలోనూ వీధుల్లో దిక్కులేక అడుక్కునే పిల్లలని పోలీసులు మాదగ్గర వదిలి పెడతారు.మేము వారికి భోజనం పెట్టి గవర్ననమెంటు స్కూలులో చదివిస్తాము. వాళ్ళు 12వక్లాసు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుని బయటకు వెళ్ళిపోవాల్సిందే”. అంటూ చెప్పింది శాంతి.
అమ్మా శాంతమ్మా! నా బుడ్డోడిని జరంత పయోజకుణ్ణి సేయమ్మా బాంచను మీ కాళ్ళుమొక్కుతా” అంటూ ఎంతో దీనంగా శాంతి శాంతి భర్తకాళ్ళు పట్టుకుంది రత్తాలు.
“లే లే రత్తాలు మేమున్నది మీలాంటి వారిని ఆదుకోవటానికే.” అంటూ మేము గవర్నమెంటు వారి సహకారంతో పిల్లలని చదివిస్తాము.అందుకని కొన్ని వివరాలు నీ వేలి ముద్ర కావాలంటూ ఫారమ్ లు తెచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసింది శాంతి.
గుండెలమీద భారం తీరినట్టయింది రత్తాలుకి.
“రేపు తీసుకొచ్చి వదులుతానమ్మా!” అంటూ కాళ్ళకి మొక్కి బుట్టా, మూటా నెత్తిన పెట్టుకుని పిల్లాడిని నడిపించుకుంటూ ఇంటి బాట పట్టింది రత్తాలు. మధ్యలో పోచమ్మ గుడి దగ్గర కాస్సేపు కళ్ళనీళ్ళ”పోచమ్మ తల్లీ నీవే దిక్కు”అంటూ బాధ వెళ్ళపోసుకుంది.
“గేం రత్తాలు!ఇయాల గింత ఆలీసమైనాది?”అంటూ రావులమ్మ పలకరింపుతో ఆలోచనలతో నడుస్తున్న రత్తాలు కి ఇంటికి చేరువయ్యానని గ్రహించింది.
“గౌ అక్కా”అంటున్న రత్తలుని చూసి అమ్మా ఇద్దరొస్తోంందే,ఆకలౌతోందే అంటూ ఏడుపు లంకించుకున్నాడు.”సురేసు ఎక్కడ తల్లి రావులమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటుందో అని.
“ఉండయ్యా బుక్కెడు బువ్వతిని పండదుగాని” అంటూ వంట కుపక్రమించింది.
★★★
అమావాస్య చీకటిని పారద్రోలుతూ సూరీడు అరుణ కిరణాలు నీలిరంగు ప్లాస్టిక్ పరదాలగుండా రత్తాలు ముఖాన్ని తాకాయి.
“అమ్మో తెల్లారిందే!” అనుకుంటూ రాత్రి చద్ది పిల్లవానికి తినిపించి తానింతతిని బుట్ట సర్దుకొని పిల్లవాని చంకనవేసుకుని ఆశ్రమం బాట పట్టింది.
తోవలో కొడుకుని ప్రేమతో “సురేసా నీకు మంచి రోజులొచ్చినాయి పోచమ్మ తల్లి దయవల్ల.నిన్న పోయినాం సూడు ఆ ఆంటీ తావున ఉండు.నేను సామాన్లు అమ్ముకొని సందేళ వచ్చేటప్పుడు నిన్ను కొండుపోతా!”అంటూ రత్తమ్మ పిల్లవానికి సంజాయించింది.
వాడి చిన్న ప్రాణానికి వీధి వీధి ఎండనక వాననక తిరగాలంటే కాళ్ళు నొప్పులు.”అమ్మ అన్న తావున మస్తుమంది దోస్తులున్నారు.” అనుకున్నాడు సురేసు.
ఒక్కటే సురేసుకు అర్ధం అయింది.తల్లి తో నడవక్కరలేదు..
పెద్ద పేచీ లేకుండానే శాంతి దగ్గరున్నాడు సురేసు (సురేష్)
★★★
పిల్లవాడి భారం తగ్గటంతో రత్తాలుకి కొత్త కొత్త ఆలోచనలు ఉత్సాహం పెరిగింది.పక్కనే బండి మీద గాజులు, క్లిప్పులు అమ్ముకునే రాజయ్యని పిలిచింది ఒక చక్క మీద “చీరలు అమ్మబడును.”SAREES FoR SALE “అని రాయించిందితెల్ల పైంట్ మీద నల్లపైంట్ తో 7వక్లాసు వరకూ గవర్నమెంటు స్కూలులో చదివి చదువాపేసిన రాజయ్యతో.చాలా ఏళ్ళుగా రాయటం అలవాటు లేక బ్రష్ పెయింట్ తో రాయటం చాతకాక ఏదో కొక్కిరిగా రాసాడు.రత్తాలు తెలుగులో రాయమంటే తన ఆంగ్ల పాండిత్యం అంతా చూపించి పాపం sarees for sale అని కూడా రాసితన చదువు అక్కరకి వచ్చినందుకు తెగ మురిసి పోయాడు రాజయ్య.
రెండు కఱ్ఱలు పాతి ఆ కఱ్ఱలకు పెయింట్ చేసిన చక్కను మేకులతో కొట్టించింది. ఆ పని చేసినందుకు వద్దంటున్నా రాజయ్య చేతిలో 100 రూపాయలు పెట్టింది ఎవరి కష్టం ఉంచుకోవడం ఇష్టం లేని రత్తాలు.రాజయ్య పిల్లలకి తన దగ్గరున్న బట్టలు ఇచ్చింది.
శుక్రవారం నాడు ఆ కఱ్ఱలకు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరి కాయ కొట్టింది.
ఇంటిముందు తొట్టిలో నీళ్ళునింపింది.
గుడిసె లో మంచి చాప పరచింది.ఒక అట్టపెట్టెలో ఇస్త్రీ చేసిన మంచి చీరలుపెట్టింది.
పిల్లల బట్టలు ఉతికి మడత పెట్టింది.
అమ్ముకోవడానికి వేళ్ళేటప్పుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ బట్టలన్నీ శాంతికి ఇచ్చి”అమ్మా నేను పేదదానిని కానీ నాకూ మనసుండాది.అయ్య,,అమ్మ లేని ఈ పోరలని సూత్తాఉంటే మనసు. నొచ్చుకుంటోంది. మీరేమనుకోనంటే ఈ డెస్సులన్నీ వ ఓరికి సరిపోతే ఆరికివ్వండమ్మా!” అంటూ చక్కగా మడతపెట్టిన బట్టల అట్టపెట్టె ఇచ్చింది రత్తాలు.
అన్నీ మంచి రెడీమేడ్ డ్రెస్సులు. ఒక్కటీ చినగలేదు.అన్నీ బిగుతై రత్తాలుకి ఇచ్చి నటువంటివి..శాంతి అభ్యంతరం చెప్పకుండా తీసుకుంది.
బీదరికంలోకూడా సహాయం చేయాలనే మానవతా ధృక్పదానికి శాంతి కళ్ళు చెమరించాయి.
మానవత్వం శాంతి రత్తాలుని మంచి స్నేహితుల్ని చేసాయి.సురేష్ శాంతి పర్యవేక్షణలో మంచి భాష,నడవడిక,తెలుగు ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకుంటున్నాడు.
ఒక్కొక్క రోజు శాంతి “సురేష్ ఇవాళ ఇక్కడే పడుకుంటాడని”ఉంచేసేది.
రత్తాలుది పల్లెటూరి అందం.పెద్దపెద్ద కాటుక కళ్ళు సూటైన ముక్కుకి ముక్కెర.మొరటుగా ఉన్నా తీర్చి దిద్దినపెదాలు.మంచి ఎత్తు ఎత్తుకు దగ్గబలమైన శరీరసౌష్టవం.తిన్నా తినకపోయినా మనిషిలో నీరసం ఉండేదికాదు.తల్లి పోలికలు పుణికి పుచ్చుకున్నాడు సురేష్.
రత్తాలు బోర్డు పెట్టిన వేళా విశేషం పాతచీరల అమ్మకం జోరుగా సాగింది.తొట్టె దగ్గర కాళ్ళు కడుక్కుని గాని ఎవరూ లోనికి రాకూడదు.వచ్చిన వాళ్ళు కూర్చున్నాక అట్టపెట్టెలో చీరలు చూపించేది.
రఫ్చేసిన చీరలు మాత్రం బేరమాడనిచ్చేది.యాభై నించీ వంద వరకూ.
మంచి చీరలు రెండువందలు నించీ రెండువందలయాభై.అన్నీ గార్డెన్సిల్క్ లేకపోతే ఫాన్సీ జరీచీరలు.షాపులో పదిహేను రెండువేలు పలికేవి.నూటయాభైకి షాపులో కొత్తచీరదొరికినా పలచగా ఉండటం ఒకనాలుగు ఉతుకులకి జాలీలయ్యేవి.అందుకని బస్తీలో అందరూ రత్తాలు దగ్గిర చీరలు కొనటానికి ఇష్టపడేవారు.అదీకాక డబ్బులు రెండునెలల్లో తీరిస్తేచాలు.
సాయంత్రాలు పెందలాడే వచ్చి చీరల వ్యాపారం చేసేది.
నెమ్మది నెమ్మదిగా సురేష్ శాంతి దగ్గర మాలిమయ్యాడు.ఇప్పుడు టెంత్ కి వచ్చాడు.ఎయిత్ నించీ తల్లితో బస్తీలోకి వెళ్ళటం మానేసాడు ఎప్పుడో తప్పించి.చదువు వాడికి ప్రాణం.తనకు తల్లి ఉంది.అక్కడ తల్లీ తండ్రి లేని వారంటే వాడికి ఎనలేని ప్రేమ.చిన్న పిల్లలకి స్నానం చేయించటం,అన్నం తినిపించటంతోపాటు వాళ్ళచేత హోంవర్క్ చేయించటం లాంటి పనుల్లో శాంతికి శాంతి భర్త ప్రకాష్ కి తలలలో నాలుకయ్యాడు.
★★★
ఒకరోజు శాంతి రత్తాలు వ్యాపారం గురించి తెలుసుకుంది.
“రత్తాలు! ఎన్నాళ్ళిలా రోడ్లు పట్టుకు తిరుగుతావు ఎండనక వాననక ఇంటిదగ్గిరే ఉండి వ్యాపారం చూసుకోకూడదు.”అందిశాంతి.
శాంతి మాటలు వినంగానే రత్తాలు పడీపడీ నవ్వటం
నవ్వుఎంతకీ ఆపక పోయేసరికి ఉక్రోషంతో శాంతికి కోపం వచ్చింది.
“ఎందుకు నవ్వుతావు? నేను నీవైపు ఆలోచిస్తుంటే.” అందికోపంగా శాంతి.
“అమ్మా!నేను చీరల వ్యాపారం చేయట్లేదు పాతబట్టలకి స్టీలు సామాన్ల వ్యాపారం. అలా అని స్టీలుసామాన్ల వ్యాపారం కాదు.స్టీలుసామాన్లు లేకపోతే బట్టలు రావు.బట్టలు అమ్మకపోతే పైసలు రావు.పైసలు రాకపోతే స్టీలుసామాన్లు గెట్లాకొనేది.ఇంట్లో కూర్చునే యాపారం కాదమ్మానాది.”అంటూ శాంతికి కోపం వచ్చిందని గ్రహించి విడమరచి చెప్పింది రత్తాలు.
ఇప్పుడు శాంతివంతైంది పడీపడీనవ్వటం. తలకొట్టుకుని”ఇంత చిన్న లాజిక్ తనేలా మిస్సయింది. అందుకేనేమో చదువుకున్నవానికంటే చాకలివాడు మేలంటారు”అనుకుందిశాంతి.
★★★
ఒకరోజు సాయంత్రం రెండు శుభవార్తలు వినిపించింది శాంతి రత్తాలుకి.
మొదటిది సురేష్ మంచి పర్సెంటేజ్ తో టెన్త్ పాసయ్యాడు.
రెండవది ఒక పెద్ద అట్టపెట్టె నిండా కొత్తచీరలు.అన్నీ 100,150 రూపాయలకి.హోల్సేల్ లో మంచి చీరలు అతి తక్కువ ధరలో శాంతి ఫ్రెండ్ సూరత్ నించీ తెప్పించుకుంటుంటే రత్తాలుకని శాంతి తెప్పించింది.
“రత్తాలు ఇక మీదట పాతబట్టలకు స్టీలు సామాన్లోయ్అంటూ గల్లీ గల్లీ తిరగద్దు.ఇందులో నాస్వార్ధం కొంచెం ఉంది.ప్రొద్దునే ఆశ్రమానికి వచ్చి బాసాన్లుతోమి ఆశ్రమం ఊడ్చి తుడిచి వాషింగ్ మషీన్లో పిల్లల బట్టలుతికి ఆరవేయి.మధ్యాహ్నం వెళ్ళి నీ వ్యాపారం చూసుకో.నీకు ఆరువేలు జీతం.” ఇప్పుడిచ్చిన బట్టలు ఎడ్వాన్స్ అనుకో”అంటూ ఆ బట్టల పెట్టె అందించింది.
“ఏమంటావు రత్తాలు?నీకు ఇష్టమేనా?అడిగింది శాంతి.
“ఏమంటానమ్మా! అడగకుండా వొరాలిస్తున్న దుర్గమ్మతల్లివి.”అంటూ కాళ్ళమీద పడింది.
★★★
బళ్ళు ఓడలు ఓడలు బళ్ళూ. అవుతాయన్నట్లు రత్తాలు రాత మారిపోయింది. పిల్లవాడు స్కాలర్షిప్ తో ఇంటర్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.ఆశ్రమానికే ఆదర్శం అయ్యాడు. శాంతి వాడి పర్శనాలిటీకి పోలీసు ఉఉద్యోగం అయితే బాగుంటుందని రత్తాలుని అడిగింది.
“నాబిడ్డ కాడు వాడు మీ బిడ్డ.వాడి కి ఏది మంచిదైతే అది చేయండి.”అంది రత్తాలు.
“ఏమంటావు సురేష్?”అంటూ ప్రకాష్ సురేష్ ని అడిగేడు.
“అది చాలా కష్టం కద అంకల్.” అన్నాడు సురేష్.
“నువ్వేమీ ఆలోచించకు.నిన్ను పోలీస్ రిక్రూట్మెంటుకి ప్రిపేర్ చేసే బాధ్యత నాది.నేను ఎక్స్ సర్వీస్ మెన్ ని ” గర్వంగా అన్నాడు ప్రకాష్.
పట్టుదల ,సాధన ఉంటే సాధించలేనిది లేదంటూ ప్రకాష్ గైడేన్స్ లో రిక్రూట్మెంటు లో సెలక్ట్ అయి ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని కానిస్టేబుల్ అయ్యాడు సురేష్.
తల్లి కి చీరల వ్యాపారమంటే ఇష్టమని సామాన్యులుండే చోట ముందుషాపు వెనుక ఒకగది కిచెన్ అద్దెకు తీసుకొని చీరల షాపు ఓపెన్ చేయించాడు.
“బోర్డ్ నేనే రాస్తా రత్తాలక్కా!”అన్నాడు రాజయ్య.
“మామా!నీకోదండం.నీబోర్డువంకరటింకర ఒ వానితమ్మడు సొ లా ఉంటుంది”అంటూ ఎక్కిరించాడు సురేష్.
“ఆఁ ! మా సెప్పొచ్చినావు.నేరాసిన బోర్డుతోనే అమ్మ సీరల యాపారం సేసింది.నువ్వుబుడ్డోడుగా ఉన్న సందెనించీ”అంటూ అలిగాడు రాజయ్య.
షాపు ఓపెనింగ్ కి శాంతి ప్రకాష్ దంపతులు వచ్చారు.
రత్తాలు వారికి సురేష్ చేత పూలదండ వేయించింది వారికి బట్టలు పెట్టి కొడుకును “మొక్కరా సురేసు”అంది.
“అమ్మా!సురేసు కాదే సురేష్ అను.గింతమంచి పేరెట్టి గట్ల పిలుస్తవేంటి?”అంటూ తల్లిని కసిరి ముద్దుపెట్టుకున్నాడు.
రత్తాలు షాపుకి
“పోచమ్మ టెక్స్టైల్స్POCHAMMA TEXTILES”
అని పేరు పెట్టింది.
బస్తీని వదిలి షాపులోనే కాపరం పెట్టింది రత్తమ్మ.
పూర్వం రాజుల వైభవ చిహ్నంగా మిగిలిన శిధిలావస్తలో ఉన్నకోటలులా
“చీరలు అమ్మబడును.”SAREES FOR SALE” బోర్డ్ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రత్తాలు ఘన విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.
ఏడాది కొకసారి. బస్తీకెళ్ళి మునుపు తన దగ్గిరకొనే దోస్తులకి పసుపు కుంకం కొత్తచీరలిచ్చి తృప్తి చెందుతుంది .బోనాలెత్తి నల్లపోచమ్మకి కొత్తచీర కట్టిస్తుంది.తను చేసేది పెద్దవ్యాపారం కాకపోయినా గొడ్డుఖారం ఉల్లిపాయ నంజుకుని సద్దన్నంతిన్నరోజులు మరువలేదు.ఈ నాడు ఉడుకుడుకు బువ్వతినగలుగుతోంది.కొడుకుని కొలువులో చూడగలగటం అన్నది పోచమ్మదీవెనని గట్టి నమ్మకం రత్తాలుకి.
“దశ మారినా దిశ మరువలేదు “రత్తాలు, సురేష్.వారిచేతనైనంత సేవ ఆశ్రమానికి అందిస్తూ ఆశ్రమం నడిపించడంలో వారూ సభ్యులయ్యారు.
ఓం శాంతి
దెవులపల్లి విజయలక్ష్మి.
అసహనంగా ఫోనులో వాట్సప్ ఓపెన్ చేసాడు రాజశేఖర్.
స్మార్ట్ ఫోను వచ్చినప్పటినించీ వాట్సాప్ ఓపెన్చేయ మెసెజెస్ డిలీట్ చేయా! దీనితో గంటల కొద్దీ సమయం వృధా అవుతోంది. పొరపాటున రెండు రోజులు చూడలేదంటే వార్నింగ్ ఇంటర్నల్ స్పేస్ నిండిపోయిందని. వద్దుమొర్రో అంటే అమ్మాయి రాజశేఖరానికి ,అబ్బాయి వాళ్ళమ్మకి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చారు.
“తెల్లారిందా! పిల్లలకంటే ఎక్కువైంది పొద్దూకులూ ఆ ఫోన్ పట్టుకుని.నాతోకాస్త మంచీచెడు మాట్లడదామనిలేదు. టిఫిన్ , భోజనం
ఆ ఫోన్ పట్టుకొని ఏం తింటున్నారో కూడా తెలియకుండా, ముగించేయడం. ఏమిటో బాబు మీ ధోరణి. కాస్త ఏ.గుడికో గోపురానికో అలా.నడుచుకొని వెళ్దామంటే.మోకాళ్ళ నొప్పులు మోక్షానికి అడ్డు..మీతో మాట్లాడుదామంటే మీకు ఆ వెధవ ఫోన్ తో సరిపోతుంది.” సరోజ సణుగుడు వాట్సప్ మెసేజెస్ కి మించి ఉంది.
నిజమే మరి రిటైర్ అయ్యేవరకు తన ఆలనా పాలనా చూసింది.పిల్లల్నిప్రయోజకుల్నిచేసింది.తను తన ఉద్యోగం సంపాదన,తప్పించి వేరే విషయాలు పట్టించుకోలేదు. ఇంటిపట్టునే ఉండి సంసారాన్ని దిద్దింది.యాంత్రికంగా బాధ్యతలతో జీవితం ఎలా గడిచిందో ఊహకి అందటంలేదు.స్వగతంగా అనుకున్నాడు రాజశేఖర్.
“సరూ! నీ సణుగుడు ఆపు. ఫోన్ చస్తున్నానని మొరపెట్టుఘకుంటోంది. డిలీట్ చేయలేదనుకో, వాట్సిప్ ఎగిరి పొయ్యిందంటే పిల్లలతో వీడియో. కాల్ మాట్లాడలేము”.
“సరే బాబు ఒక అరగంటలో ఆ పని కానీండి నేను ఈ లోగా వంటింట్లో పని పూర్తి చేసి వస్తా! యోగా మేట్స్ వేయండి.” అంటూ నిష్క్రమించింది.
పొద్దున్నే ఇద్దరూ కలసి శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తారు. రిటైర్ అయ్యిన తరువాత ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు.అందులో భాగమే ఈ వ్యాయామాలు.
★★★
రాజశేఖర్ రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇంకా రావలసిన డబ్బు చేతికి అందలేదు. వాట్సాప్ లో “రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫ్రెండ్స్” గ్రూప్ లో చేరాడు. ఊరికొకడు గా చెల్లా చెదరవుతున్న సహచరులతో అనుబంధం ఉండాలని విషయాలు తెలుస్తాయని.
అందులో అతిఛాందసులు రోజూ ఏదో సూక్తి లేక దేముడి బొమ్మతో శుభోదయాలు, పండగల్లో శుభాకాంక్షలు పెడ్తూ ఉంటారు. కొందరైతే మరీ వాళ్ళ పిల్లలవి మనవలవి ఫోటోలు పెడ్తారు.ఎవరి గోల వారిదన్నట్లు ఉంటుంది గ్రూప్.
“అందరూ బాధ్యత గలిగిన ఉద్యాగాలు చేసి రిటైర్ అయ్యారు ఏంలాభం గ్రూప్ లో చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు.” స్వగతంగా అనుకోబోయి కొంచెం గట్టిగానే అన్నాడు.
“ఏమిటండీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?” చేయిచెంగుకి తుడుచుకుంటూ అడిగింది సరోజ.
“ఆఁ ! ఏముంది లేవంగానే నీకు ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకోవడం అన్నా అవుతుంది కాని ,నాకు దీన్ని శుభ్రం చేయటం కావటంలేదు.” అంటూ ఫోను చూపాడు.
“చక్రపాణి అయితే మరీను. వీడు గ్రూప్ లో చాలనట్లు పర్శనల్ గా శుభోదయం ,శుభాకాంక్షలు పంపుతాడు. ఎన్నోసార్లు చెప్పాను ఎక్కడో ఒకచోట పెట్ట రా! రెండుచోట్ల ఎందుకురా ?’అని.
దానికి వాడు, “ఒరేయ్ శేఖర్! అది మాస్ గ్రీటింగ్స్. ఇది నాప్రాణ స్నేహితుడికి పంపే స్పెషల్ కోట్స్. నీకో విషయం తెలుసా! నీకు పంపాలంటే గూగుల్ లో ఎంత సెర్చ్చేస్తానో !” అని.
ఏమిటో వాడి అభిమానానికి నవ్వాలో ఏడవాలోతెలియదు. అంటూ స్నేహితు జ్ఞాపకాల్లో హఠాత్తుగా వెన్ను చరచి నట్లయింది.
అవును దగ్గర దగ్గర నెల రోజుల్నించీ సరిగ్గా మెసేజెస్ డిలీట్ చేయడంగాని తిరుగు మెసేజ్ పెట్టటం చేయలేదు.తమ కంపెనీ రిటైర్మెంట్ గ్రూప్ వాళ్ళ కోర్ట్ కేస్ ఎంతవరకు వచ్చిందో చూడనేలేదు . దక్షిణ భారతదేశం తీర్ధయాత్రలకి వెళ్ళటం వచ్చాక కాస్త ప్రయాణం బడలికతో వళ్ళు వెచ్చపడటంతో .
మన గురువుగారివే చాలా ఉంటాయి అనుకుంటూ వాట్సప్ గ్రూప్ తెరిచాడు.
ఏ వేవో చవకబారు జోక్స్,ఫొటోలు తప్పించి శుభోదయం, శుభాకాంక్షలు లేవు.అలా అలా వెనక్కి వెళ్ళి చూస్తున్న నా మతిపోయింది. గత రెండు నెలలుగా చక్రపాణినించీ ఒక్క మెసేజ్ పంపలేదు.వాడి పర్సనల్ ఎక్కౌంటు చూసాను. రెండు నెలల క్రితం అంటే ఆగస్టు పదిహేనున ” స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు”అంటూ చక్రి మెసేజ్ .
దాని క్రింద తనతిట్లు.”ఒరేయ్ చక్రీ!ఒక్కసారి ఫోన్ చేయవచ్చు కదరా! నువ్వు చెయ్యవు,నేను చేస్తే ఎత్తవు”అని. దాని కింద వాడి వైపునించీ ఒక స్మైలీ.
మా చదువు ఉద్యోగం ఒకే చోటవడంతో మా ఇద్దరికీ చాలా అవినావభావ సంబంధం. రిటైర్మెంట్ కి రెండు సంవత్సరాల ముందే వాడి భార్య కేన్సర్ వ్యాధితో పోవడంతో ఆ రెండేళ్ళు ఒంటరిగా అతి కష్టం మీద వంటరిగా సమర్ధించుకున్నాడు.పెద్ద కొడుకు ఢిల్లీలో డిఫెన్స్ లో చేస్తున్నాడు. చిన్నవాడుఅమెరికాలో.తనే సలహా ఇచ్చాడు “పిల్లలు వాళ్ళ దగ్గిరకితీసికెళ్తానంటే వాళ్ళదగ్గరకి వెళ్ళిపోరా!రెండు సంవత్సరాలనించీ చేయికాల్చుకుని అవస్తపడుతున్నావు.” అని.
“ఒరేయ్! ఢిల్లీ వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదురా!కొడుకు కోడలు వారి ఉద్యోగాలలో వాళ్ళు బిజీ. మనవలు చదువులు.అందులో వాడికూతురు ఐ.ఏఎస్ కి ఎప్పియర్ అవుతోంది.తాత తాత అంటూ అదేకాస్త నాదగ్గరకి ఎక్కువ వచ్చేది” అన్నాడు.
“ఏది ఏమైనా నువ్విక్కడ వంటరిగా ఉండద్దు.
ఫోన్లో మాట్లాడుకుందాం!ఇండియా లోనే కదరా!నువ్వైనా రావచ్చు నేనైనా రావచ్చు.” అని కష్టం మీద ఫ్రెండ్సందరం కలిసి ఒప్పించారు.
గత రెండు నెలలుగా ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తటం లేదు.అలా అని ఫోన్ డెడ్ ఏమో అనుకోవటానికి యధావిధిగా శుభోదయాలు, శుభాకాంక్షలు వస్తున్నాయి. మెసేజెస్ కి ఎమోజీ లు.
ఏది ఏమైనా ఇవాళ వాడితో మాట్లడాలని నిర్ణయించుకున్నా. అదేమాట సరోజతో చెప్పాడు రాజశేఖర్.
“అలాగా అండీ! జ్రోత్స్న పోయినప్పటినించీ అన్నయ్యగారు చాలా వంటరి వారయ్యారు సుమా!”
“అవును సరోజా!జంటలో ఏ ఒక్కళ్ళు వంటరిగా మిగిలినా వారి బ్రతుకు దుర్భరం.సరే ఇవాళ వాడితో ఎలాఅయినా మాట్లాడాలి. వాడు కాంటాక్టు లోకి వస్తే నిన్ను పిలుస్తా పలకరిద్దుగాని అంటూ వాడికి అదేపనిగా కాల్ చేస్తునే ఉన్నాడు. అటునించీ స్పందన లేదు. రాజశేఖరానికి పట్టుదల ఎక్కువైంది. రాత్రి ఎనిమిది గంటలైంది. రాజశేఖర్ మొహం వివర్ణమైంది. దుఃఖం తన్నుకు వస్తోంది. “ఏమైంది వాడికి?” అదేమాట సరోజతో అన్నాడు.
“ఫోన్ పారేసుకున్నారేమో! లేదా కొత్తఫోన్లో కాంటాక్ట్స్ లోడ్చేసుకోలేదేమో ! లేదా కొత్త నంబరు తీసు కున్నారేమో! “
సరోజ ఇన్ని కారణాలు చెప్పినా రాజశేఖర్ మనసు రాజీ పడలేదు. అతని మీద అతనికే కోపం వచ్చింది.
ఇండియాలోనే గా అన్నాడు కానీ వాడి ఢిల్లీ ఎడ్రస్స్ గానీ వాడి కొడుకు ఫోన్ నంబరు కానీ తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు తనకి పిచ్చి వాడిలా?
నిజమైన స్నేహం అంటే ఇదేనేమో!స్వంత పిల్లల దగ్గరనుండి క్షేమసమాచారం తెలియక పోతే అల్లల్లాడినట్లు అల్లల్లాడిపోయింది మనసు.
“శేఖర్!కోవిడ్ తగ్గాక హైదరాబాద్ వచ్చి ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నా!ఎవరైనా ఉంటే చూడు.” అన్న వాడి మెసేజ్ గురించి ఆతృతగా వెదికా!
మెసేజ్ కనబడింది .ఆఁ ! ఆ మెసేజ్ ఆఖరి మెసేజ్ వాడు టైప్ చేసింది. తరువాత అన్నీ ఎమోజీలు స్మైలీ లు.
నా ఆలోచనలకి అంతరాయంకలిగిస్తూ ఫోన్ మ్రోగింది.చక్రపాణి దగ్గరనించీ.ఒక్కక్షణం సంతో్షం వెంటనే విపరీతమైన కోపం వచ్చింది.ఫోన్ ఎత్తుతూనే ఛడామడా తిట్లవర్షం మొదలుపెట్టా!”ఇడియట్! నన్నింత టెన్షన్ పెట్తావా” అంటూ.
“అంకుల్! నేను రాకేష్ ని.చక్రపాణిగారి పెద్దబ్బాయిని”
“అవునా బాబూ రాకేష్!బాగున్నావా!వాడికివ్వు ఫోన్.”
“అంకుల్ ! నాన్నగారు లేరండీ!”
“అమెరికా వెళ్ళాడా ఫోన్ మరచిపోయి.వాడికి కొంచెం మతిమరుపు ఎక్కువ బాబూ.”
“లేదండీ !నాన్నగారు పరమపదించి నెలైంది.
ఇవాళ మాసికం ఇక్కడ దగ్గర సంస్థ లో పెట్టివచ్చాం. నాన్నగారి ఫోన్ చాలా రోజులుగా కనపడలేదు. బాయ్ ఎక్కడోపెట్టి వెళ్ళిపోయాడు. నాన్నగారి గది శుభ్రం చేస్తుంటే కనపడింది. చార్జ్ లేకపోవటం తో చార్జికి పెట్టి ఇప్పుడే నాన్నగారి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెట్దామనుకుంటుంటే మీ మిస్డ్ కాల్స్ చూసా!
ఫారెన్ ఎంబసీస్ ని రిసీవ్ చేసుకోవటం వారి సెక్యూరిటీ ఎరేంజ్మైంట్స్ తో నాన్నగారు పోయాక కంటినిండా ఏడవలేదు అంకుల్ .”
రాకేష్ !గద్గద స్వరం విని రాజశేఖర్ తల తిరిగి పోయింది.
బలవంతంగా తెప్పరిల్లి ,”ఎలా జరిగింది బాబూ రాకేష్ ” .
“నాన్నగారికి మూడునెలల క్రితం పరాలిటిక్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోయింది.ఒకచేయి.కాలు పడిపోయాయి. అప్పటినించీ మంచంలోనే ఉన్నారు. ఫిజియోథెరపీకి మెడిసిన్స్ కి రెస్పాండ్ కాలేదు.” ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం బ్రయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం ఇవ్వలేదు.అంతా క్షణాలమీద అయిపోయింది దుఃఖాన్ని అదిమి పెట్టుకొని వివరాలు అందించాడు రాకేష్.
“మరి ఆ మెసేజెస్……” రాజశేఖర్ మాట పూర్తి కాకుండానే….,.
“నాన్న గారికి ఒక బాయ్ ని కుదిర్చాము. ఆయన అవసరాలు తీర్చటానికి.వాడి కి ఫోన్ యూసేజ్ బాగా తెలుసు.ప్రతిరోజు ఆయన కాలకృత్యాలు తీర్చిన తరువాత ఆయన చూపెట్టిన వాళ్ళకి గుడ్ మాణింగ్ మెసేజెస్ పంపమనేవారు.మెసేజెస్ చదివి ఎమోజీలు పంపమనే వారు.పండగలకి నేనే గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసే వాడిని.అవి పంపేవారు. ఆయన ఫ్రెండ్స్ మెసేజెస్ చదువుతుంటే కళ్ళలో ఒక స్పార్క్ చూసేవాడిని. నాబిజీ లైఫ్ లో ఆయన పరిస్థితి మెసేజ్ చేద్దామన్న ఆలోచన రాలేదు . కాకపోయినా ఆయనకి సింపతీ ఇష్టం ఉండదని మీకు తెలుసుకదా అంకుల్ అందుకని.
అంకుల్ మీరెలా ఉన్నారు? మీతో మాట్లాడుతుంటే నాన్నతో మాట్లాడినట్లుంది.గుండె బరువు తగ్గినట్లుంది అంకుల్. వచ్చేనెలలో నేను హైదరాబాద్ వస్తాను. మీ ఇంట్లోనే దిగుదామనుకుంటున్నా! మీకు ఇన్కన్వీనియన్స్ అయితే తెలపండి అంకుల్. మాఇంటి గురించి డెసిషన్ తీసుకోవాలని దానికి మీ సలహా కోరుతున్నా!”
“అలాగేబాబూ!నాకెటువంటి ఇబ్బంది లేదు.చక్రపాణే వచ్చాడనుకుంటా. అమ్మాయిని పిల్లల్ని కూడా” తీసుకునిరా!మీపినతండ్రి పెదతండ్రి ఇల్లనుకో! నా! ఎడ్రస్ వాట్సప్ లో పెట్తా ఉంటా బాబూ రాకేష్!”
రాజశేఖర్ మెదడు మొద్దుబారిపోయింది వాడి సిన్సియారిటీకి.అంత సుస్తీలో కూడా ఒక్కరోజంటే ఒక్కరోజు వాడి దగ్గర నుండి శుభోదయం రాని రోజు లేదు.తను పెట్టిన మెసేజెస్ కి వాడెందుకు జవాబివ్వకుండా ఎమోజీలు పెట్టెవాడో తెలిసాక రాజశేఖర్ గుండె పగిలిపోయింది.
“ఒరేయ్!చక్రీ “నువ్వు చాలా ‘గ్రేట్’ రా!నీలాంటి స్నేహితుడు ఒక్కడు చాలురా జీవితానికి. నీచిరునవ్వు నీ స్మైలీ లో ఉందిరా! ఒరేయ్!ఎంత అన్యాయంరా!నీవు పోయి రెండు నెలలు, నీవు మంచంలో పడి ఆరునెలలు, వెరసి ఎనమిది నెలలు.
నిన్ను నాలో ఎప్పటిలాగే ఊహించుకునేటట్టు చేసావు. స్నేహానికి నిర్వచనం నువ్వేరా!నీదగ్గిరనించీ మెసేజెస్ రాకపోతే ఎందుకా అని కూడా ఆలోచించని దౌర్భాగ్యుడిని.నువ్వు పోయా వని తెలియక నీ శుభోదయాలు,శుభాకాంక్షలు డిలీట్ చేయాలని తిట్టుకున్నా! తనలో తను ఉన్మాదిలా గుండె పగిలే లాగా ఏడుస్తూ అనుకున్నాడు.
★★★
తెల్లవారింది. ఎప్పటిలా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రాజశేఖర్..యాంత్రికంగా గ్రూప్ ఓపెన్ చేసాడు.
అందులో మెసేజెస్,గ్రీటింగ్స్ అన్నీ చాలా అమూల్యమైనవిగా ఉన్నాయి.గబగబా అందరికీ శుభోదయాలు,శుభాకాంక్షలు, టైప్ చేసాడు! రెగ్యులర్ గా మెసెజ్ పెట్టే వాళ్ళ దగ్గిర నించీ మెసేజ్ లేకపోతే ఫోన్ చేసి వాళ్ళెలా ఉన్నారో కనుక్కున్నాడు! చాలా తృప్తిగా ఉంది నాకిప్పుడు. అనుకుంటూ వాలుకుర్చీలో వాలుతూ, ‘చక్రీ !నాకు మంచి గుణపాఠం చెప్పావురా! ‘అంటూ చమ్మగిల్లిన కళ్ళని పంచె అంచుతో తుడుచుకున్నాడు రాజశేఖర్.
