ఉదయం 7 గంటలు అవుతోంది. ఫోను అదేపనిగా మోగుతున్నది. ఇండియా నుండి ఆంజనేయ శాస్త్రి కాల్.
“హలో మామయ్యా! బాగున్నారా? ఏంటి విషయాలు?” అడిగాడు అమెరికాలో ఉన్న ‘భారవ్’ అలియాస్ భార్గవరామ శర్మ.
“నాయనా! నిన్న గుడికి గర్భాలయం కట్టడం పూర్తి అయిందో లేదో! ఇవాళ పొద్దటి నుండి ఆగకుండా వాన పడుతోంది. ఇప్పుడు మాకు రాత్రయింది కదా! ఇంకా కురుస్తూనే ఉంది. వరస చూస్తుంటే తగ్గేటట్టు అనిపించడం లేదు. అంతా ఆ అమ్మవారి దయ. ఆనందంతో చెప్పుకుపోతున్నాడు ఆంజనేయ శాస్త్రి.
“వాట్! ఎంత శుభవార్త చెప్పారు. ఇక మన ఊరి కష్టాలు తీరినట్టే మామయ్యా! గుడి పనులు మొత్తం పూర్తి చేయించండి. ఇంకా ఎంత కావాలో చెప్పండి.
డబ్బులు వెంటనే పంపిస్తాను” అన్నాడు పొంగిపోతూ భార్గవరామశర్మ.
“ఇదంతా నీ వల్లే నాయనా! పుట్టిన ఊరి ఋణం తీర్చుకుంటున్నావు” అన్నాడు శాస్త్రి.
“ఇట్లాంటి మాటలతో నన్ను సిగ్గుపడేలా చేయకండి మామయ్యా! ఇప్పటికే నేను చేసిన దానికి కృంగిపోతున్నాను”
“ఆ అమ్మవారు నీ హృదయంలో ప్రవేశించి నిన్ను ఇంతటి పని చేయిస్తున్నది. ఇంతకంటే మనకేం కావాలి? పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు పూర్తయినట్టే. వార్షికోత్సవం సమయానికి ప్రతిష్ఠ జరగాల్సిందే. ఇప్పటికైనా మీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది. సరే నాయనా! ఉంటాను” అని ఫోను పెట్టేశాడు ఆంజనేయశాస్త్రి.
********* ********* *******
నేలపల్లి ఊరు. ఎప్పుడూ సస్యశ్యామలంగా ధాన్యాలు కుప్పబోసిన రాశిలా నిండుగా నవ్వుతూ ఉండేది. ఊరిప్రజలు అరమరికలు లేకుండా ఎదుటివారి
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు.
ఆ ఊళ్ళో పురోహితుడు నరసింహశర్మ. ఆయన ఆ
ఊళ్ళో శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని కట్టించాడు. పురోహితుడు అనే పదానికున్న అర్థాన్ని సార్థకం చేస్తూ ఊళ్లోని బాగోగులను పట్టించుకునేవాడు. ఊరి పెద్దలు కూడా ఏ చిన్న సమస్య అయినా ఆయనతో చర్చించేవారు.
గుడి చిన్నదే. కానీ చుట్టూ విశాలమైన ఆవరణ. రావి, వేప కలిసి ఉన్న నీడనిచ్చే పెద్ద చెట్టు ఉండేవి. శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిగేవి. వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేసేవారు. రైతులు తాము పండించిన పంటల్లో కొంతభాగాన్ని ఆలయానికి సమర్పించేవారు. పాడిసంపద ఉన్నవాళ్లు ఉత్సవాల సమయంలో పాలు, పెరుగు, నెయ్యి కావలసినంత ఇచ్చేవాళ్ళు.
ఇక గుడి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ల నుండి ఎంతోమంది
వచ్చేవారు. పూజా కార్యక్రమాలతో పాటు హరికథా శ్రవణం, ఒగ్గుకథలు, ఎడ్లబండ్ల పూజలు, అగ్నిగుండాలు, రథోత్సవం ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణలు. సంగీత, నాట్య కళా ప్రదర్శనలు కూడా రసజ్ఞులను అలరించేవి. ఆ సమయంలో వాటిని చూడడానికి జనం విరగబడేవారు. బొమ్మల షాపులు, తినుబండారాల బండ్లు, గారడీ ప్రదర్శనలు, కనికట్టు మాయాజాలాలు ఒకటేమిటి? విద్యుద్దీపాలతో రాత్రుళ్ళు కూడా పట్టపగళ్లయ్యేవి.
నరసింహ శర్మకు ఒక్కడే కొడుకు భార్గవరామశర్మ.
అందరిలాగే కొడుకును పెద్ద చదువులు చదివించి, విదేశాలకు పంపాలన్న కోరిక వేల కిలోమీటర్ల దూరంతో పాటు దగ్గరకు రాలేనంతగా మనసునూ దూరం చేసింది.
చదువుకొని ఉద్యోగరీత్యా వెళ్లినవాడు తండ్రి శ్రీరాముని మీద భక్తితో పెట్టిన పేరును కూడా ‘భారవ్’ అని స్టైల్ గా మార్చుకున్నాడు. అది తండ్రికి మరింత భారంగా తోచింది. తనతో చదువుకుంటున్న అమ్మాయి సౌమ్యను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు ‘భారవ్’. అప్పుడో ఇప్పుడో ఒక ఫోన్ కాల్ అంతే. తండ్రి ఫోన్ చేసినప్పుడు ముక్తసరి మాటలతో సరిపెట్టడం.
దిగులుతో మంచం పట్టిన ఆయన అకాల మరణానికి చేరువయ్యాడు. కర్మ కాండ జరిపించడానికి భార్యతో సహా వచ్చిన భార్గవరామశర్మ తప్పదన్నట్టు తల్లిని తమతో రమ్మన్నాడు. ఆత్మాభిమానం గల ఆ ఇల్లాలు ఇల్లు, ఊరును వదిలి రానన్నది. తన మాట వినలేదని కోపంతో వెళ్ళిపోయాడు భార్గవరామశర్మ.
ఇల్లు బోసిపోయింది. అదే ఇంట్లో ఆమె కొడుకు పంపించే డబ్బుతో, భర్త జ్ఞాపకాలతో, ఇరుగుపొరుగువారి ఆదరణతో బతుకును ఈడుస్తున్నది. పూజలు కరువయి, ఉత్సవాలు లేక గుడి మెల్లమెల్లగా శోభను కోల్పోసాగింది.
కారణం తెలియదు కానీ ఊరిపెద్దలు ఎంతగా ప్రయత్నించినా గుడిలో పూజారిగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఏడాది వర్షాలు కురవలేదు. ఏమో కాల మహిమ! అనుకున్నారు జనం. కష్టనష్టాలు భరిస్తూ కాలంతో రాజీ పడ్డారు. తరువాత మూడేళ్లు అదే పరిస్థితి. చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వర్షం విపరీతంగా పడేది. ఇక్కడ పడకపోయేది. మబ్బులు ఎంతగా కమ్ముకున్నా తేలిపోయేవి. చినుకు పడేది కాదు. బతుకును వెతుక్కుంటూ ఊరిజనం మెల్లగా వలసదారి పట్టారు.
****** ******** ********
ఆంజనేయ శాస్త్రి, నరసింహ శర్మ మంచి స్నేహితులు.
రెండూళ్ల అవతల నాగులపల్లి ఆయన ఊరు. ఆయన కూడా పౌరోహిత్యం చేసేవాడు. రెండు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా ఉండేవి. చిన్నప్పటి నుండీ భార్గవరామశర్మకు అతడిని ‘మామయ్యా’ అని పిలవడం అలవాటు. ఆ చనువుతో నరసింహ శర్మ చనిపోయినప్పుడే ఆంజనేయశాస్త్రి, భార్గవరామశర్మకు హితబోధ చేసే ప్రయత్నం చేశాడు కానీ భార్గవరామశర్మ పట్టించుకోకపోవడంతో వదిలేశాడు.
నేలపల్లి ఊళ్ళో జరుగుతున్న పరిస్థితులు ఆంజనేయ శాస్త్రికి తెలుస్తూనే ఉన్నాయి. చూస్తూ ఊరుకోలేక పోయాడు. ఏదో ఒక పరిష్కారం చూడకపోతే తన వృత్తికి అర్థం లేదనుకున్నాడు. భార్గవరామశర్మకు ఫోను చేసి విషయమంతా వివరించాడు. అయినా అతని మనసు కరగలేదు. నాకు ఇంకెప్పుడూ ఈ విషయంలో ఫోను చేయొద్దని, అది నా సమస్య కాదని కోపగించుకున్నాడు. అట్లా రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆంజనేయ శాస్త్రి
భంగపడ్డాడు.
******* ******** ******
ఒకరోజు హఠాత్తుగా భార్గవరామశర్మ నుండి ఆంజనేయ శాస్త్రికి ఫోను వచ్చింది.
“మామయ్యా! గుడి పునర్నిర్మాణం జరగాలంటే ఎంత ఖర్చవుతుంది?” అని అడిగాడు. ఆ గొంతులో ఆర్తి, ఆవేదన స్పష్టంగా తెలుస్తున్నాయి.
“భార్గవరామా! ఏమైంది నాయనా?” అడిగాడు నెమ్మదిగా ఆంజనేయశాస్త్రి.
“నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు మామయ్యా! నాన్నను దూరం చేసుకున్నాను. బతికి ఉన్న అమ్మను ఆదరించడం లేదు. నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నా. నిన్న రాత్రి నాకు వచ్చిన కలను మర్చిపోలేక పోతున్నాను. కరువుతో అల్లాడుతున్న ఊరి జనం నా చుట్టూ దీనంగా నిలబడి ఉన్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. బీడుగా మారిన పంటపొలాలు. కళ్ళముందు ప్రత్యక్షమైనట్లు కనిపించాయి. ఆ దృశ్యం చూడలేకపోయాను. నాన్న
తరువాత ఆయన కొడుకుగా గుడి పాడువడకుండా చూసుకోవాల్సింది. మీరు ఎంత చెప్పినా నేను వినలేదు. ఆ పాపమే కావచ్చేమో! పెళ్లయి పదేళ్లు అయినా నాకు సంతానం లేదు. మామయ్యా! నన్ను మన్నించి నా కోరిక ఒక్కటి తీర్చండి. అన్నీ తెలిసినవారు. ఇప్పుడు నా ధ్యేయం ఒక్కటే. మన ఊరి ప్రజలను కాపాడాలి. ఎంత డబ్బు అయినా పంపిస్తాను. మీరు దగ్గరుండి గుడి నిర్మాణం మొదలుపెట్టండి. ఇంతకుముందు దానికంటే విశాలంగా కట్టించండి. ఊరి పెద్దలతో నేను మాట్లాడతాను”అని పూడుకు పోతున్న కంఠంతో చెప్పాడు.
“కొద్ది రోజులు అమ్మకు మీ ఇంట్లో ఆశ్రయమిచ్చి ఇల్లును కూడా బాగు చేయించండి. దయచేసి కాదనొద్దు మామయ్యా!” అంటూ బతిమిలాడాడు. ఆంజనేయశాస్త్రి ఆనందానికి అవధులు లేవు.
********* ****** ********
భార్గవ రామశర్మ నిర్ణయానికి పెద్దలు హర్షించారు. ఊరు నిలబడితే చాలనుకున్నారు. ఆంజనేయశాస్త్రి ఆధ్వర్యంలో అన్నీ జరగడానికి ఒప్పుకున్నారు. డబ్బు
చేతిలో ఉంటే పనులు జరగడం ఎంతసేపు?ఎనిమిది నెలల్లో గుడి నిర్మాణం పూర్తయింది. గుడి పూజారిగా ఆంజనేయ శాస్త్రికి ఇల్లు ఏర్పాటయింది. నరసింహ శర్మ ఇల్లు కూడా బాగయింది
వార్షికోత్సవ సమయంలోనే శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠాపన చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ జనాలతో కళకళ లాడింది ఆ ఊరు. రెండు నెలల సెలవు తీసుకొని నాలుగు రోజుల ముందే భార్యతో పాటు ఊరికి వచ్చాడు భార్గవరామశర్మ.
తాను వచ్చినప్పటినుండీ ఊరి పెద్దలు, ప్రజలు ఆదరిస్తున్న విధానానికి ఆశ్చర్యపోయాడు. గుడి నిర్మాణం జరగుతుండడం వల్ల వాళ్ళకు కలుగుతున్న ఆనందాన్ని కళ్లారా చూశాడు. వాళ్లకు తండ్రి పట్ల ఉన్న అపార గౌరవాన్ని అర్థం చేసుకున్నాడు. ఇన్నిరోజులు తాను ఏం కోల్పోయాడో తెలిసి కన్నీరు ఉబికివచ్చింది.
ఆరోజు వార్షికోత్సవంలో నాలుగవ రోజు. రాత్రి ఒంటిగంట. డప్పుల మోత అంతకంతకూ తీవ్రమవుతున్నది. సాయంత్రం నుండి తగులబెట్టిన కర్రలు నిప్పు కణికలై రుద్రుని ఫాలనేత్రం వలె ఎర్రగా
మండుతున్నాయి. సమానంగా పేర్చిన ఆ నిప్పుల మీద నడవడానికి ఆ అగ్నిగుండం చుట్టూ దాదాపు పదిహేను మంది నిలబడి ఉన్నారు.
వీరశైవజంగాల, బలిజల భక్తిపారవశ్యం మిన్నంటుతున్నది. ఆ రోజంతా వారి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. ‘దండకాలు’ చదువుతున్నారు. ఒక్కసారి “అశ్శరభ శరభ శరభ, అశ్శరభ శరభ శరభ”
అని గట్టిగా అరుస్తూ ఒకరి తరువాత ఒకరు నిప్పులమీద నడుస్తున్నారు. వారిలో కొంతమంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. కోరికలు తీరాలనో, తీరిన కోర్కెల మొక్కులో? ఏది ఏమో కానీ వాళ్ళ పాదాలకు ఎటువంటి బాధ కలగడం లేదు. ఊపిరిబిగబట్టి చూస్తున్న వందలాది జనం ఆనందంతో, ఆశ్చర్యంతో, భయంతో తమను తాము మర్చిపోయారు. వారి ఆనందకేరింతలు గత వైభవాన్ని పునరావృతం చేస్తున్నాయి.
గుడి మెట్ల మీద కూర్చొని ఇదంతా గమనిస్తున్న భార్గవ రామశర్మకు తన బాల్యంలో జరిగే జాతర గుర్తొచ్చింది. తిరిగి అటువంటి అనుభూతిని పొందుతూ
తన పక్కన ఉన్న ఆంజనేయశాస్త్రి వైపు చూశాడు. ఒకేసారి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో అవ్యక్తమైన భావం. ఒకరి పట్ల ఒకరికి ఆరాధనా భావం కదలాడింది. కన్నీటి పొర కదలాడుతుండగా అమాంతం వంగి ఆంజనేయ శాస్త్రి పాదాలకు నమస్కరించాడు భార్గవరామశర్మ. అతడిని దగ్గరకు తీసుకొని లాలనగా తల నిమిరాడు ఆంజనేయ శాస్త్రి.
అంతా సద్దుమణిగే సరికి 3 గంటలు అయింది. తెల్లవారి వార్షికోత్సవం ముగుస్తుంది. ఇంటికి వెళ్లి తల్లి మంచం దగ్గరకు వెళ్ళాడు. అలికిడికి నిద్రలేచిన తల్లి ఒడిలో పడుకున్నాడు. తల్లి కళ్ళు చెమర్చాయి. తండ్రి రూపం కళ్ళల్లో కదలాడి తనను ఆశీర్వదిస్తున్నట్టు తోచింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. తలుపు చప్పుడుకు రూములో నుండి బయటకు వచ్చిన సౌమ్య వాళ్ళిద్దరిని అట్లా చూసి చిన్నగా నవ్వుకుంది. వచ్చిన ఈ వారం రోజుల్లోనే ఆమె అత్తగారికి చాలా దగ్గరైంది.
చివరి రోజు పూర్ణాహుతి. ఉదయమే గుడికి వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో “అమ్మా! బాగున్నారా?” అంటూ ఒక వ్యక్తి వచ్చాడు. నరసింహశర్మ భార్య ఆయనను గుర్తు పట్టలేదు.
“అమ్మా! నేను చంద్రాన్ని. నేను బతికి ఉన్నానంటే మీరే కారణం. ఏడేళ్ల కింద ఉత్సవానికి వచ్చినప్పుడు నాకు గుండెపోటు వచ్చింది. మీరు ఎవరితోనో మాట్లాడి కారు ఏర్పాటు చేసి నాభార్యకు తోడుగా మీరూ బయలుదేరి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి తీసురావడం వల్ల బతికాడని డాక్టర్లు చెప్పారు. మీ మేలు జీవితంలో మరువలేను” అని కాళ్లకు దండం పెట్టాడు. “ఓ నువ్వా చంద్రం! ఇప్పుడు గుర్తుకు వచ్చింది” అంటూ కబుర్లు మొదలు పెట్టిన తల్లిని, చంద్రాన్ని చూస్తూ మైమరచిపోయాడు భార్గవరామశర్మ. తన తల్లిదండ్రులకు ఆ ఊరితో పెనవేసుకున్న జ్ఞాపకాలకు చలించిపోయాడు. అమ్మను తనతో రమ్మన్నప్పుడు ఆమె ఎందుకురాలేదో అర్థమై మనసు బాధతో మూల్గింది.
సెలవు పూర్తయిన భార్గవరామశర్మ తనతో పాటు కొంతకాలం తల్లిని తీసుకువెళ్లేందుకు ఒప్పించాడు. ప్రయాణానికి మూడు రోజుల ముందు షాపింగు కోసమని తల్లిని, భార్యను హైదరాబాద్ కు తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో షాపు మెట్లమీద కళ్ళు తిరిగి హఠాత్తుగా తనమీదకు ఒరిగిపోయిన సౌమ్యను హడావిడిగా ఆసుపత్రిలో
చేర్చాడు. ‘ఆమె గర్భవతి’ అని డాక్టర్లు చెప్పిన మాటకు అతని సంతోషం మిన్నంటింది. తల్లిని భుజాలు పట్టి కుదిపేశాడు. అమ్మవారికి మనసులో నమస్కరించుకున్నాడు. భార్య ఆరోగ్యదృష్ట్యా ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఊళ్ళోకి రావడంతోనే
ఆంజనేయశాస్త్రి చెవిలో తాను తండ్రి కాబోతున్న శుభవార్తను చెప్పాడు నవ్వుతూ. ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ “ఆహా! ఎంత కరుణామయివి తల్లీ! ఏమి నీ లీల?” అని రెండు చేతులు జోడించాడు
భక్తి పరవశతతో.
10 comments
https://shorturl.fm/xlGWd
https://shorturl.fm/MVjF1
https://shorturl.fm/DA3HU
https://shorturl.fm/Xect5
https://shorturl.fm/retLL
https://shorturl.fm/TDuGJ
https://shorturl.fm/PFOiP
https://shorturl.fm/TDuGJ
https://shorturl.fm/MVjF1
https://shorturl.fm/nqe5E